నిఘా నీడలో ఇంటర్ ప్రాక్టికల్స్
● మాస్ కాపీయింగ్కు చెక్ ● ఈ నెల 3 నుంచి 22 వరకు పరీక్షలు ● నాలుగు విడతలు.. రెండు సెషన్లు
ఆదిలాబాద్టౌన్/బోథ్: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ను నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ ఏడాది నిఘా నీడలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్మీడియెట్ అధి కారులు తెలిపారు. ఇదివరకు ప్రాక్టికల్ పరీక్షల్లో ప్రైవేట్ కళాశాలలకు చెందిన విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తాయనే ఆరోపణలున్నాయి. ప్రభు త్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు తక్కువ మా ర్కులు రావడం, ప్రాక్టికల్ చేయకపోయినా అధిక మార్కులు వేసేవారనే అపవాదు ఉంది. వీటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సీసీ నిఘా నీడలో ఈనెల 3 నుంచి షురూ కానున్నాయి. ఈనెల 22వరకు నాలుగు విడతల్లో ఉదయం, మధ్యాహ్న వేళలో నిర్వహించనున్నారు.
66 కేంద్రాల్లో..
ఈ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. మొత్తం నాలుగు విడతల్లో కొనసాగనున్నాయి. మొదటి వి డత ఈనెల 3నుంచి 7వరకు, రెండో విడత 8 నుంచి 12 వరకు, మూడో విడత 13 నుంచి 17 వరకు, నాలుగో విడత 18 నుంచి 22వరకు నిర్వహించన్నారు. జనరల్ విద్యార్థులు 6,744 మంది హాజరు కానున్నారు. వీరిలో ఎంపీసీ విద్యార్థులు 2,826 మంది, బైపీసీ విద్యార్థులు 3,918 మంది ఉన్నారు. ఒకేషనల్ విద్యార్థులు 2,041 మంది ఉండగా, వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 1012 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1029 మంది ఉన్నారు. ఇదిలా ఉండగా 13 ప్రభుత్వ, 15 ప్రైవేట్, 38 ప్రభుత్వ సెక్టార్ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
ఆన్లైన్లో ప్రశ్న పత్రం..
ప్రాక్టికల్స్కు సంబంధించిన ప్రశ్నపత్రం ఇంటర్బో ర్డు ఆన్లైన్లో పొందుపర్చనుంది. అరగంట ముందుగా సంబంధిత కళాశాలకు ఓటీపీని పంపిస్తుంది. ఆ ప్రకారం ప్రశ్న పత్రాన్ని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష నిర్వహణ కోసం డీఈసీని ఏర్పాటు చేశారు. కన్వీనర్గా డీఐఈఓ, సభ్యులుగా ఇద్దరు ప్రిన్సిపాళ్లు, ఒక లెక్చరర్ను నియమించారు. కాగా సీసీ కెమెరాలను సంబంధిత కళాశాలల్లోని ల్యాబ్లో ఏర్పాటు చేస్తారు. వాటిని ఎగ్జామ్ బోర్డుకు అనుసంధానం చేయనున్నారు. పరీక్షలు నిర్వహించే తీరును అక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు. ఏవైనా అక్రమాలు జరిగినట్లు వారి దృష్టికి వస్తే సంబంధిత కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోనున్నారు.
జిల్లాలో..
పరీక్ష కేంద్రాలు 66
హాజరుకానున్న విద్యార్థులు 8,785
జనరల్ 6,744 ఒకేషనల్ 2,041
ఒత్తిడికి గురి కావొద్దు..
విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ప్రాక్టికల్స్ చేయాలి. ఎలాంటి ఒత్తిడికి గురి కావొద్దు. ఏవైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ 08732– 297115, 9848781808 నంబర్లపై సంప్రదించాలి. ప్రైవేట్ కళాశాలలకు చెందిన యాజమాన్యాలు కళాశాల ఫీజు చెల్లించలేదని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయవద్దు. ప్రతి విద్యార్థి ప్రాక్టికల్స్కు హాజరయ్యేలా చూడాలి. ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రాక్టికల్స్ కోసం ల్యాబ్లలో అన్ని సౌకర్యాలు కల్పించాం. ప్రతీ కళాశాలకు రూ.25వేల విలువ గల సామగ్రి పంపిణీ చేశాం. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం.
– రవీంద్ర కుమార్, డీఐఈవో
Comments
Please login to add a commentAdd a comment