● నేడు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ● ‘నిర్మలమ్మ’ కరుణపై జి
ఆదిలాబాద్లోని విమానాశ్రయ మైదానం
ఆదిలాబాద్ రైల్వే స్టేషన్
సాక్షి,ఆదిలాబాద్: కేంద్రంలో మూడోసారి కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం నేడు తొలి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2025–26 సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాపై వరాలు కు రిపిస్తారా.. నిధులు కేటాయించి మురిపిస్తారా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతేడాది పార్లమెంట్ ఎన్నికలు ముందుండడంతో అప్పట్లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఆ బడ్జెట్లో జిల్లాకు ఎలాంటి స్వాంతన చేకూరలేదు. ఈ నేపథ్యంలో రానున్న సంవత్సరానికి సంబంధించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేటాయింపులు చేస్తారా లేదా అనేదానిపై ఆసక్తిగా గమనిస్తున్నారు. అంతే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేస్తున్న పథకాలకు ప్రాధాన్యత కల్పిస్తారా లేదా అనేది కూడా చూడాల్సిందే. మొత్తంగా జిల్లా సమగ్ర అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ తోడ్పాటునందిస్తుందా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. జిల్లా వాసులు ఆశిస్తున్న వాటిలో కొన్ని..
● ఆదిలాబాద్ వయా నిర్మల్ మీదుగా ఆర్మూర్ రైల్వేలైన్ నిర్మించాలనేది ఈ ప్రాంతవాసులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. ఆర్మూర్ మీదుగా పటాన్చెరు వరకు ఈ రైల్వేలైన్కు సంబంధించి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఫైనల్ లొకేషన్ సర్వే కూడా ఈ ప్రాజెక్ట్కు సంబంధించి పూర్తయింది. డీపీఆర్ కూడా సిద్ధం చేశారు. అంచనా వ్యయం రూపొందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్లో రైల్వే లైన్కు సంబంధించి కేటాయింపులు ఉంటాయా లేదా అనేది చూడాల్సిందే.
● ఆదిలాబాద్–గడ్చందూర్కు రైల్వే లైన్ ఏర్పాటు కోసం గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అయితే దీనికి సంబంధించి నిధులు మంజూరు కాలేదు. ఈ రైల్వే లైన్ బేల మీదుగా వెళ్తుంది. ఒకవేళ ఈ లైన్ పూర్తయితే వ్యాపార, వాణిజ్య పరంగా జిల్లాకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది.
● ఆదిలాబాద్ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్, మహారాష్ట్రలోని ముంబాయి, ఢిల్లీ, బెంగళూర్ వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. పూర్తి స్థాయిలో రైళ్లు లేకపోవడంతో రవాణాపరంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో నాందేడ్ వరకు నడుస్తున్న వివిధ రైళ్లను ఆదిలాబాద్ వరకు పొడిగించాలనే డిమాండ్ ఉంది. ప్రధానంగా నాందేడ్ రైల్వే డివిజన్ పరిధిలోకే ఆదిలాబాద్ స్టేషన్ వస్తుంది. నాందేడ్ జంక్షన్ వరకు వస్తున్న రైళ్ల సంఖ్య పెరిగిపోవడంతో అక్కడ ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్లో పిట్లైన్ నిర్మించడం ద్వారా ఇక్కడి నుంచే అనేక రైళ్లను నడపాలనేది ప్రణాళిక. పిట్లైన్ పూర్తయితే నాందేడ్ వరకు వస్తున్న అనేక రైళ్లను ఆదిలాబాద్ వరకు పొడిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ బడ్జెట్లో దానికి సంబంధించి ఏదైన ప్రస్తావన వస్తుందా అనేది చూడాల్సిందే.
● ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే ఓవర్బ్రిడ్జి, అండర్బ్రిడ్జ్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో ఈ పనులు చేపడుతున్నారు. కాగా కేంద్రం కేటాయింపులకు అనుగుణంగా నిర్మాణ పనులు ఆ పోర్షన్లో పూర్తయినట్టు బీజేపీ నా యకులు పేర్కొంటున్నారు. రాష్ట్రం నిధులు కేటాయించి పూర్తి చేయాల్సిన పనులు మాత్ర మే పెండింగ్లో ఉన్నట్లు వివరిస్తున్నారు.రాష్ట్రం డబ్బులు కేటాయించే పరిస్థితి లేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో రైల్వే బోర్డు కేంద్ర నిధు లే కేటాయించి మిగిలిన పోర్షన్ను కూడా పూర్తి చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తర్వాత అయిన ఆ డబ్బులను కేంద్రానికి చెల్లించాలని పేర్కొంటున్నారు. ఈ విషయంలో ముందడుగు పడి కేంద్రం నుంచే ఆ గ్రాంట్ మంజూరై పనులు సాగుతాయా అనేది వేచి చూడాల్సిందే.
● ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రక్షణ శాఖకు సంబంధించి 369 ఎకరాల భూమి విస్తరించి ఉంది. ఇక్కడ ఏయిర్పోర్టు గాని, ఏయిర్ఫోర్స్ గాని ఏర్పాటు చేయాలని ఏళ్లుగా డిమాండ్ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడటం లేదు. తాజాగా పౌర విమానాయ శాఖ మంత్రి రాంమోహన్ నాయుడు ఆదిలాబాద్లో ఏయిర్పోర్టు ఏర్పాటు చేసే విషయంలో ప్రస్తావించినప్పటికీ ఆ తర్వాత ముందడుగు పడలేదు. ఇదిలా ఉంటే ఇక్కడ ఏయిర్స్ట్రిప్ ఏర్పాటు చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే ఆ ప్రస్తావన ముందుకు సాగడం లేదు.
● జిల్లాకు జవహర్ నవోదయ విద్యాలయం, సైనిక్ పాఠశాలలు మంజూరు చేయాలని ఏళ్లుగా డిమాండ్ వినిపిస్తుంది. ప్రజాప్రతినిధులు ఈ విషయంలో కేంద్ర మంత్రులను కలిసి వీటి విషయంలో ప్రస్తావిస్తున్నప్పటికీ ముందుకు పడటం లేదు. ఈ బడ్జెట్లో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు ఏదైన మంజూరు లభిస్తుందా అనేది చూడాల్సిందే. అంతే కాకుండా గతంలో ఇక్కడ గిరిజన యూనివర్సిటీ వచ్చినట్టే వచ్చి చేజారింది. ఈ నేపథ్యంలో ఇతర యూనివర్సిటీల మంజూరుకు ఏదైన మోక్షం లభిస్తుందా అనేది చూడాల్సిందే.
● ఆదిలాబాద్లోని సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ దశాబ్దాల క్రితం ఉత్పత్తి నిలిచిపోయి మూతపడింది. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్రం ఇప్పటికే ఈ ఫ్యాక్టరీ పూర్తిగా మూసివేసే దిశగా నోటిఫికేషన్ ఇచ్చారనే ప్రచారం ఉంది. అయినప్పటికీ ఈ ఫ్యాక్టరీని తెరిపించే విషయంలో ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇటు కాంగ్రెస్ నేతలు, అటు స్థానిక బీజేపీ నేతలు పేర్కొనడం గమనార్హం. ఈ ఫ్యాక్టరీ విషయంలో ఎలాంటి ముందడుగు ఉంటుందో చూడాల్సిందే.
రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతోనే..
రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతోనే రైల్వే పథకాలకు సంబంధించి నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆదిలాబాద్లో నిర్మిస్తున్న ఓవర్ బ్రిడ్జి, అండర్ బ్రిడ్జిలో సెంట్రల్ పోర్షన్ పనులు నిర్మాణం పూర్తయింది. రాష్ట్ర నిధులతో నిర్మించాల్సిన పనులు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్కు సంబంధించి అంచనా వ్యయం రూపొందించాల్సి ఉంది.
– గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment