ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ సునీత బిళ్ల
తెనాలి: ఆదాయపన్ను శాఖలో ఆన్లైన్లో రిటర్నులు అందుబాటులోకి వచ్చాక చెల్లింపుదారులు చక్కగా వినియోగించుకుంటున్నారని, వసూళ్లు పెరగటమే ఇందుకు నిదర్శనమని ఆదాయ పన్ను ప్రిన్సిపల్ కమిషనర్ సునీత బిళ్ల అన్నారు. ఆదాయానికి అనుగుణమైన పన్ను చెల్లింపులు సక్రమంగా ఉండాలని చెబుతూ, బోగస్ క్లెయిములుంటే తప్పనిసరిగా నోటీసులు వస్తాయని హెచ్చరించారు. ది తెనాలి చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్థానిక శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలోని కళ్యాణమండపంలో అవగాహన సదస్సు నిర్వహించారు. చాంబర్ ఉపాధ్యక్షుడు వుప్పల వరదరాజులు అధ్యక్షత వహించారు. ప్రిన్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. ఆదాయ పన్ను శాఖ ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్గానూ పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉందని గురు చేశారు. ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. పన్ను మినహాయింపులు లేకున్నా, బోగస్ క్లెయిములు చేయొద్దని సూచించారు. రూ.30 లక్షలకుపైగా ఆస్తి కొనుగోలు చేసినప్పుడు, బ్యాంకులో పరిమితికి మించి డిపాజట్ల లావాదేవీలపై తమ శాఖ నిఘా ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు తమ శాఖకు సమాచారం ఉంటుందని స్పష్టంగా చెప్పారు. అలాంటి సందర్భాల్లో పన్ను చెల్లింపుదారులు ఆడిటర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పన్ను రిటర్నుల విషయంలో ఆడిటర్లు, టాక్స్ ప్రాక్టీషనర్లపై గురుతర బాధ్యత ఉందన్నారు. పన్ను చెల్లింపుదారులకు అన్ని విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. ఆదాయ పన్ను గుంటూరు రేంజ్ అడిషనల్ కమిషనర్ డాక్టర్ ఓఎన్ సుప్రియారావు కూడా మాట్లాడారు. పన్ను చెల్లింపు రిటర్నులపై కొత్తగా వచ్చిన మార్గదర్శకాలపై తెనాలి ఆదాయ పన్ను అధికారి జేజీఎస్ కిషోర్కుమార్ వివరించారు. తొలుత చాంబర్ ఆఫ్ కామర్స్ తెనాలి కార్యదర్శి రావూరి సుబ్బారావు స్వాగతం పలికారు. మరో కార్యదర్శి గుండా రామకోటేశ్వరరావు, మాలేపాటి వేణు, మాలేపాటి తిరుమల, భాస్కరుని శ్రీనివాసరావు, కనపర్తి సూర్యనారాయణ, వ్యాపార ప్రముఖులు కొత్త సుబ్రహ్మణ్యం, కొత్తమాసు కుమార్, తోటకూర వెంకట రమణారావు, ఐఎంఏ తెనాలి అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ పావనీ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment