● రానున్న పదేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు
● శ్రీపీఠంలో నేటి నుంచి దసరా ఉత్సవాలు
● విలేకరులతో పరిపూర్ణానందస్వామి
కాకినాడ రూరల్: శ్రీపీఠంలో ఈ దసరా నుంచి రానున్న పదేళ్లలో వెయ్యికోట్ల కుంకుమార్చనలు నిర్వహించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు పరిపూర్ణానంద స్వామి వెల్లడించారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలోని శ్రీపీఠంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహాశక్తి యాగం పేరిట గురువారం నుంచి దేవీ శరన్నవరాత్ర ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది కార్తిక మాసంలో 30 రోజుల పాటు వంద కోట్ల మంది మహిళలతో కుంకుమార్చన నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతమవ్వడంతో దసరా ఉత్సవాల్లో కుంకుమార్చనలకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ పూజల కోసం ఇప్పటికే 54 వేల రిజిస్ట్రేషన్లు అయ్యాయని, రోజూ కనీసం 35 వేల నుంచి 40 వేల మంది మహిళలు హాజరవుతారని భావించి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉదయం పది గంటలకు కుంకుమార్చన ప్రారంభమవుతుందని, భక్తులు 9 గంటలకు హాజరవ్వాలన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా 9వ తేదీన మూలా నక్షత్రం సందర్భంగా 24 వేల మంది విద్యార్థులతో సరస్వతీ పూజ జరిపిస్తామన్నారు. 10న దుర్గాష్టమి రోజున 64 వేల మంది భక్తులు ఒకే రకమైన వస్త్రధారణతో కుంకుమార్చనలు నిర్వహిస్తామన్నారు. నవమి రోజు దాత సమకూర్చనున్న 15 వేల తులసి మొక్కలతో పూజలు చేసి 9 రోజులు పూజలో పాల్గొన్న వారికి అందజేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment