సీతానగరం: అధికారుల పర్యవేక్షణ లోపం రైతులకు శాపంగా మారింది. వెదుళ్లపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో రైతులకు సంబంధించిన రుణ చెల్లింపులు, షేర్ క్యాపిటల్ రూ.56 లక్షలు గల్లంతైన విషయం తెలిసిందే. వెదుళ్లపల్లి పీఏసీఎస్పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం నగదు గల్లంతైందని వెలుగులోకి వచ్చినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఆ సొమ్మును రికవరీ చేయలేకపోయారు. దీనికి ముందు సంఘంలో సేల్స్మన్ను ఏర్పాటు చేసి ఎరువుల అమ్మకాలు జరిపారు. వాటిలో సుమారు రూ.7 లక్షలు గోల్మాల్ జరిగినట్టు గుర్తించిన అధికారులు సంఘంలో ఆ నగదు జమ చేయాలని నామమాత్రంగా చెప్పి వదిలేశారు. ఎరువుల నగదు గల్లంతైందని గుర్తించిన నెల రోజులకు పీఏసీఎస్ రికార్డుల తనిఖీలో రూ.56 లక్షలు మాయమైనట్టు వెలుగులోకి వచ్చింది. ఈ సొమ్ములు కట్టాలని సంఘం సీఈవో సురేంద్రకు ఆదేశించి రెండు నెలలైనా అతడు పట్టించుకోలేదు. అలాగే కోరుకొండ మండలం శ్రీరంగపట్నం పీఏసీఎస్లో ఏడాది క్రితం రూ 2.కోట్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి వెదుళ్లపల్లి పీఏసీఎస్లో గుమస్తా ఉద్యోగం ఇచ్చారు. గత నెల కోరుకొండ మండలం బుచ్చింపేటలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఆ శిబిరంలో సంఘం సీఈవో సురేంద్ర ఉన్నట్లు సమాచారం. ఎరువుల నగదు గల్లంతైన సమయంలోనే అధికారులు కఠినంగా వ్యవహరించి ఉంటే ఇప్పుడు ఇన్ని లక్షల పోయేవి కాదని రైతులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment