మన్ననూర్: ప్రజా యుద్దనౌక గద్దర్ అంటే ఇక నిశబ్ద విప్లవమని.. పేద ప్రజల గొంతుక అని ప్రముఖ రచయిత ప్రొ. కంచె ఐలయ్య అన్నారు. మన్ననూర్లోని అంబేడ్కర్ కూడలిలో ఏర్పాటుచేసిన 15 అడుగుల గద్దర్ విగ్రహాన్ని శనివారం ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ, విమలక్కలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. గద్దర్ను ఎక్కడో బొందపెడితే శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిలో దేవుడై నిలిచాడని కొనియాడారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అయితే.. తెచ్చింది మాత్రం గద్దర్ అని అన్నారు. కేసీఆర్ నిరహారదీక్ష చేస్తే తెలంగాణ రాలేదని.. గద్దర్ లాంటి ఉద్యమకారులు, విద్యార్థుల త్యాగాలతోనే స్వరాష్ట్రం ఏర్పడిందన్నారు. సినీ పరిశ్రమలో ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులుగా రూపాంతరం చేయడంపై రేవంత్రెడ్డి ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో గద్దర్ విగ్రహాలు ఏర్పాటు చేసి రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కోరారు. వరంగల్ పట్టణంలో నిర్మించే కళా క్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. అంతకుముందు ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఆటపాటలు బతికున్నంత కాలం గద్దర్ ఈ భూమిపై బతికే ఉంటారన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో 25 వరకు అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గద్దర్ విగ్రహాలను కూడా ఏర్పాటు చేసేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. అనంతరం గద్దర్ కుమార్తె వెన్నెల మాట్లాడారు. ఏపూరి సోమన్న, నల్లమల మురళి, గోపాల్, లక్ష్మీనారాయణ కళాబృందం తమ ఆటపాటలతో ఉత్తేజం నింపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, విగ్రహ దాత కొల్లూరి సత్తన్న, అమృత, జేబీ రాజు, సుదర్శన్, వెన్నెల, పసునూరి రవీందర్, భరత్, ధనుంజయ్, నాసరయ్య, ఎల్లస్వామి, రామనాథం, బుచ్చయ్య, రహీం, హన్మంత్రెడ్డి, శ్రీనివాసులు, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment