తిరుత్తణి: భార్యపై అనుమానంతో గొంతు నులిమి హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన బుధవారం తిరుత్తణి యూనియన్ కృష్ణసముద్రం దళితవాడలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నాగన్ కుమారుడు సురేష్(27)కు సింగరాజుపురం గ్రామానికి చెందిన రాజా కుమార్తె భువనేశ్వరి(24)తో నాలుగేళ్ల కిందట వివాహమైంది. వీరికి నకుళన్ (3) కుమారుడు ఉన్నాడు. సెంట్రింగ్ పనులు చేస్తున్న సురేష్ తరచూ మద్యం సేవించి భార్యతో గొడవ పడుతున్నాడు. వరకట్నంగా రూ.50 వేలు తీసుకురావాలని వేధించేవాడు.
అలాగే ఆమె ప్రవర్తనపై అనుమానం పడేవాడు. మంగళవారం రాత్రి భువనేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తండ్రి రాజాకు ఫోన్ చేసి చెప్పాడు. సమాచారం అందుకున్న తిరుత్తణి పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన కుమార్తి మృతిలో అనుమానం వుందని, ఆమెను భర్తే హత్య చేసినట్టు రాజా ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్ఐ రాఖీకుమారి కేసు నమోదు చేసి సురేష్ను అదుపులోకి తీసుకుని విచారించారు. భార్య ప్రవర్తనపై అనుమానంతోనే కర్రతో కొట్టి తాడుతో మెడకు బిగించి హత్య చేసి అంగీకరించాడు. తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్టు ఫ్యాన్కు ఉరివేసినట్టు పేర్కొన్నాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి చైన్నె పుళళ్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment