భార్య, యువకున్ని హత్య చేసి, భర్త ఆత్మహత్య
బెంగళూరులో ఘోరం
మృతులు కట్టడ కార్మికులు
బనశంకరి: తప్పుదోవ పట్టిన భార్య, ఆమె ప్రియుని కథ విషాదాంతమైంది. ఆమె భర్త వారిద్దరినీ అక్కడికక్కడే హత్య చేసి తాను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు కోణణకుంటె పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాలు.. సోమేశ్వర లేఔట్లో నిర్మాణ దశలో ఉన్న కట్టడంలో బుధవారం రాత్రి కూలీ కార్మికురాలు లక్ష్మీ (33), ఆమె ప్రియుడు గణేశ్కుమార్ (20) ఏకాంతంగా ఉన్నారు. వారిని గమనించిన ఆమె భర్త గొల్లబాబు (41) తీవ్ర కోపోద్రిక్తుడై కట్టె తీసుకుని ఇద్దరిని చావబాదాడు. దెబ్బలకు వారు మృత్యువాత పడ్డారు. కొన్ని గంటల తరువాత అతడు అక్కడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నిఘా వేసి ప్రాణాలు తీసి..
ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన ముగ్గురూ కొన్ని సంవత్సరాల క్రితం ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చి గార పనులు చేసుకుంటూ జీవించేవారు. అవివాహితుడైన గణేష్కుమార్, గొల్లబాబు వద్దే ఉండేవాడు. ఈ సమయంలో అతని భార్యతో చనువు పెరిగి అనైతిక సంబంధానికి దారితీసినట్లుగా అనుమానాలున్నాయి. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై గొల్లబాబుకు అనుమానం పుట్టింది. దీంతో ఆమైపె నిఘా వేశాడు.
యువకునితో కలిసి ఉన్న సమయంలో దాడి చేసి హతమార్చాడని దక్షిణ విభాగ డీసీపీ లోకేశ్ భరమప్ప జగలాసర్ తెలిపారు. తరువాత అతడు బావమరిదికి ఫోన్ చేసి విషయం తెలియజేసి, నేను కూడా చనిపోతున్నానని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే కోణణకుంటె పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment