పేట మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని, కోయిల్సాగర్ బ్యాక్వాటర్ నుంచి కోయిలకొండ మండలం గణపతిరాయ చెరువు నింపాలని సీఎం రేవంత్రెడ్డిని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కోరారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో తనకిచ్చిన మెజార్టీ కంటే రెండింతలు ఎక్కువ వంశీచంద్రెడ్డికి ఇచ్చి గెలిపించాలి.
● దమ్మున్న నాయకుడు రేవంత్రెడ్డి ప్రచారం ఇక్కడి నుంచి ప్రారంభించడం కాంగ్రెస్ విజయానికి నాంది పలుకుతుందని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకాధికార ప్రతినిధి, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి పేర్కొన్నారు. చేనేత పరిశ్రమల ఏర్పాటును, సైనిక్ స్కూల్ను గత ప్రభుత్వం రద్దు చేసిందని, వంశీ గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి సైనిక్ స్కూల్ మంజూరు చేయిస్తామన్నారు.
● ముదిరాజ్ల చిరకాల కోరిక అయిన బీసీ–డీ నుంచి బీసీ–ఏ మార్చేందుకు సీఎం రేవంత్రెడ్డి హామీ ఇవ్వడంపై ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఎస్సీ వర్గీకరణ ఎక్కడ?
మాయమాటలతో మందకృష్ణను బుట్టలో వేసుకొని.. ఎస్సీ వర్గీకరణ చేస్తామంటున్న బీజేపీ మేనిఫెస్టోలో ఈ విషయం ఎక్కడ ఉందో చెప్పాలని, ఏఐసీసీ కార్యదర్వి సంపత్కుమార్ పేర్కొన్నారు. ఇంకో పార్టీ బీఆర్ఎస్ పాతాళానికి పోయిందన్నారు. రేవంత్ చేసే పనులు చూసి దేశ ప్రజలు మెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు.
పాలమూరుకు జాతీయ హోదా తెచ్చారా?
మోదీని ప్రధాని చేయాలని.. రేవంత్రెడ్డిని ఓడగొట్టాలని ఇక్కడ బీజేపీ అభ్యర్థి అనుకుంటున్నారు. పదేళ్ల నుంచి మోదీ ప్రధానిగా ఉన్నారు కదా.. ఏ రోజైనా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్కు జాతీయ హోదా అడిగారా.. నిధులు తెచ్చారా అని రేవంత్ ప్రశ్నించారు. ముదిరాజ్లను బీసీ–డీ నుంచి ఏ గ్రూప్లో మార్చడానికి, మాదిగ బిడ్డల ఏబీసీడీ వర్గీకరణ గురించి అడిగారా.. మహబూబ్నగర్–రాయచూర్ రోడ్డు ఎందుకు పడావ్ పడింది.. మక్తల్–నారాయణపేట ఎత్తిపోతల పథకానికి జాతీయ నిధులు ఏమైనా తెచ్చారా అని మండిపడ్డారు. పాలమూరును ఎండబెట్టి.. లక్షలాదిగా వలసలు పోతుంటే ఒక్క రోజు పట్టించుకోలేదని.. అయినా బీజేపీకి ఓటు వేయాలి.. రేవంత్ను ఓడగొట్టాలని అంటున్నారని ధ్వజమెత్తారు.
బలహీనపర్చాలనే ఉద్దేశంతోనే..
కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాం.. 30వేల ఉద్యోగాలు ఇచ్చాం.. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇంటికి ఉచిత కరెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చాం.. ఇందిరమ్మ ఇళ్ల ఇస్తున్నాం.. ఇందుకు రేవంత్ను ఓడగొట్టాలా అని ప్రశ్నించారు. తనతో పాటు మంత్రివర్గ సహచరులు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని. రాత్రి, పగలు కష్టపడుతున్నామని వివరించారు. బూర్గుల రామకృష్ణారావు తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ పాలమూరు నుంచి మీ బిడ్డ సీఎం అయితే ఎందుకు ఓర్వడం లేదని.. మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డిని బలహీనపరచాలనే ఉద్దేశంతో అరుణమ్మ బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారని విమర్శలు గుప్పించారు. మహబూబ్నగర్ బీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి ఐదేళ్లు ఎక్కడిపోయారని ప్రశ్నించారు. అమరచింత బీఆర్ఎస్ జెడ్పీటీసీ సరోజ, నర్వ జెడ్పీటీసీ జ్యోతిలు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేశారు. సభలో ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, అనిరుధ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వీర్లపల్లి శంకర్, జెడ్పీచైర్పర్సన్లు వనజ, స్వర్ణసుధాకర్, సరిత, మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి, టీపీసీసీ కల్లుగీత కార్మిక రాష్ట్ర చైర్మన్ కేశంనాగరాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.