దళిత నేతపై టీడీపీ దాష్టీకం | - | Sakshi
Sakshi News home page

దళిత నేతపై టీడీపీ దాష్టీకం

Published Sat, Aug 24 2024 12:38 PM | Last Updated on Sat, Aug 24 2024 12:38 PM

దళిత నేతపై టీడీపీ దాష్టీకం

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: దళిత నేతపై సాక్షాత్తూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో టీడీపీ నేత దాడి చేసి గాయపరచిన ఘటన శుక్రవారం జరిగింది. స్టంట్‌ వేయించుకున్నానని చెప్పినా కూడా మెడ వంచి పొట్టలో గుద్దడం గమనార్హం. పెదవేగి మండలం ముండూరులో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ముండూరులో శుక్రవారం ఉపాధి గ్రామ సభ జరిగింది. గ్రామ సభ అనంతరం వైఎస్సార్‌సీపీకి చెందిన సర్పంచ్‌ రాచూరి దేవి, ఆమె భర్త, దళిత నేత, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత రాచూరి బాలస్వామి పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడికి టీడీపీ నేత అన్నపనేని సురేష్‌ వచ్చి చేసిన పనులకు సంతకం పెట్టాలని సర్పంచ్‌ రాచూరి దేవికి చెప్పారు. దీనిపై ఆమె మాట్లాడుతూ ఉద్యోగుల జీతాలకు సంతకం పెడతానని, డ్రెయిన్‌ పనులకు ఎం–బుక్‌ చేయించిన తరువాత పెడతానని తెలిపారు. ఎం–బుక్‌ చేయించిన తర్వాత సంతకం పెడతారని అక్కడే ఉన్న బాలస్వామి కూడా చెప్పడంతో వెంటనే ఆగ్రహించిన సురేష్‌.. మీకు రూ.50 లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్‌గా గెలిపించాను. నా మాటకే ఎదురు చెబుతావా.. అంటూ వాదనకు ది గారు. పార్టీ మారమంటే తనతోపాటు మారలేదంటూ ఆగ్రహంతో బాలస్వామిని మెడ వంచి పిడిగుద్దులు గుద్దాడు. దీంతో బాలస్వామి, రాచూరి దేవి.. ముండూరు రహదారిపై నిరసనకు దిగారు. దళితులు, గ్రామస్తులతో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. సురేష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ట్రాఫిక్‌ స్తంభించడంతో ఎస్సై వచ్చి బాలస్వామి తదితరులను రోడ్డు పక్కకు తొలగించి వైద్య చికిత్స నిమిత్తం ఏలూరు తరలించారు. అనంతరం దాడి ఘటనపై దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగకు సర్పంచ్‌ రాచూరి దేవి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు.

పార్టీ మారలేదని అక్కసుతో దాడి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement