devarakadra
-
సీఎంను విమర్శించే స్థాయి డీకే అరుణకు లేదు : ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి
మహబూబ్నగర్: రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్న సీఎం రేవంత్రెడ్డిని విమర్శించే స్థాయి డీకే అరుణకు లేదని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కుటుంబ అవసరాల కోసమే రాజకీయాల్లో ఉన్న డీకే అరుణ సీఎం రేవంత్రెడ్డిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం తగదన్నారు. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిందని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలుచేస్తున్నామని, పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సీఎం కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. డీకే అరుణ పాలమూరుకు చేసిందేమిలేదని, ఆమె మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కేంద్రంలో మోదీ, పాలమూరులో డీకే అరుణ ఓడిపోనున్నారని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రాహుల్ ప్రధాని అవుతారన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి 2 లక్షల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందా అని విలేకరి అడిగిన ప్రశ్నకు అలాంటి వ్యక్తులను పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, అధికార ప్రతినిధి హర్షవర్ధన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్, మాజీ చైర్మన్ రాధ, నాయకులు బెనహర్, బెక్కరి అనిత, సిరాజ్ ఖాద్రీ, సాయిబాబా, లక్ష్మణ్యాదవ్, ఫయాజ్, అజ్మత్అలీ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: బీజేపీ, బీఆర్ఎస్లు ప్రజలకు చేసిందేమీలేదు : మంత్రి సీతక్క -
అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ విధానం చూసి ఓటు వేయాలి
-
దేవరకద్ర మార్గంలో ఎలక్ట్రిక్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: పాత లైన్ల విద్యుదీకరణ పూర్తి చేసిన రైల్వే శాఖ ఇప్పుడు కొత్త లైన్లను వేగంగా విద్యుదీకరిస్తోంది. మహబూబ్నగర్–కర్నాటకలోని మునీరాబాద్ మధ్య రైల్వే లైన్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణ సరిహద్దు పరిధిలో దేవరకద్ర– కృష్ణా స్టేషన్ల మధ్య ఇటీవలే లైన్ అందుబాటులోకి వచ్చింది. 64 కి.మీ. ఈ నిడివిలో ప్రయాణికుల రైళ్లను ఇటీవలే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు దేవరకద్ర–కృష్ణా స్టేషన్ల మధ్య మార్గాన్ని కూడా విద్యుదీకరించారు. పనులు పూర్తి కావటంతో డీజిల్ లోకోమోటివ్ల బదులు ఎలక్ట్రిక్ లోకో మోటివ్లతో రైళ్లను తిప్పనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. ఉపయోగాలెన్నో.. ప్రస్తుతం కాచిగూడ నుంచి బెంగుళూరు, రాయచూరు తదితర ప్రాంతాలకు గద్వాల మీదు గా ఎలక్ట్రిక్ లోకోమోటివ్ రైళ్లు నడుస్తున్నాయి. వాస్తవానికి రాయచూరుకు గద్వాల మీదుగా కాకుండా కృష్ణా మీదుగా వెళ్లేది దగ్గరి దారి. ఇన్నాళ్లూ విద్యుదీకరణ పూర్తి కాకపోవటంతో రైళ్లను నడపటం సాధ్యం కాలేదు. ఇప్పుడు దేవరకద్ర– కృష్ణా స్టేషన్ల మధ్య విద్యుత్ లైన్ అందుబాటులోకి రావటంతో ఇక రాయచూరు సహా కొన్ని ఇతర రైళ్లను ఈ మార్గం మీదుగా మళ్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనివల్ల గద్వాల మార్గంపై ఒత్తిడి తగ్గుతుంది. ఎలక్ట్రిక్ ఇంజన్లతో పోలిస్తే డీజిల్ లోకోమోటివ్ల వినియోగం ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు ఆ ఇంధన భారం కూడా తగ్గనుంది. వేగంలో పెద్దగా తేడా రాకున్నా, ఇంజన్ పికప్ బాగా మెరుగుపడుతుంది. ఇది ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. సరుకు రవాణా రైళ్లకు ఒకటికి మించి ఇంజన్లను వాడుతుంటారు. మూడు డీజిల్ ఇంజన్ల బదులు రెండు ఎలక్ట్రిక్ ఇంజన్లు ఎక్కువ వ్యాగన్లు ఉన్న రైలును సులభంగా లాగుతాయి. కొన్ని రకాల సరుకును తరలించే సందర్భంలో.. రెండు డీజిల్ ఇంజిన్ల బదులు ఒక్క ఎలక్ట్రిక్ ఇంజన్ సరిపోతుంది. ఇక విద్యుదీకరించాల్సింది ఆ రెండు మార్గాలే ఇక మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైన్ (పనులు జరుగుతున్నాయి), ఇటీవలే అందుబాటులోకి వచ్చిన మెదక్–అక్కన్నపేట మార్గాలను మాత్రమే విద్యుదీకరించాల్సి ఉంది. మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా, సిద్దిపేట వరకు లైన్ అందుబాటులోకి రావటంతో ఇటీవలే ప్రయాణికుల రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. మనోహరాబాద్–సిద్దిపేట మధ్య విద్యుదీకరణ ప్రాజెక్టు మంజూరు కావటంతో వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పనులు ప్రారంభమైన ఏడాదిలో అది కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. -
పూర్తి కాకుండానే ’పాలమూరు’ను ప్రారంభిస్తారా?
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పాలనలో పాలమూరు వలసలు ఆగలేదని, అభివృద్ధి జరగలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. పనులు పూర్తి కాకుండానే ఈనెల 16న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, ఈ ప్రాజెక్టులో మొత్తం 31 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కేవలం ఒక్క పంపును ప్రారంభిస్తే ప్రాజెక్టు పూర్తవుతుందా అని ఎద్దేవా చేశారు. సోమవారం గాందీభవన్లో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్రెడ్డి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆమెను ఆహ్వనించిన అనంతరం రేవంత్ మాట్లాడుతూ గతంలో సీతా దయాకర్రెడ్డి జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు దేవరకద్రను ఎంతో అభివృద్ధి చేశారని, తొమ్మిదిన్నరేళ్లలో పాలమూరుకు కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగితే, ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోపిడీ దొంగలకంటే దారుణంగా తయారయ్యారని ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా నేతలకు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యత కలి్పస్తోందని, సీతాదయాకర్రెడ్డికి రాజకీయంగా అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్లో చేరిన తిమ్మాపూర్ నేతలు మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలానికి చెందిన పలువురు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు కాలువ మల్లేశం, శ్రీనివాస్తో సహా పలువురు కార్యకర్తలను జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కండువాకప్పి రేవంత్ పార్టీలోకి ఆహ్వనించారు. -
దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం విజేత ఎవరు..!
దేవరకద్ర నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో అమరచింత నియోజకవర్గం రద్దై దేవరకద్ర నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది దేవరకద్ర నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ ఐ అభ్యర్ధి పవన్ కుమార్ రెడ్డిపై 34385 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. వెంకటేశ్వరరెడ్డి కి 93358 ఓట్లు రాగా, పవన్ కుమార్ రెడ్డికి 58973 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన నర సింహులుకు 5300 పైగా ఓట్లు వచ్చాయి. 2009శాసనసభ ఎన్నికలలో దంపతులైన టిడిపి నేతలు దయాకరరెడ్డి, సీత ఇద్దరూ రెండు నియోజకవర్గాల నుంచి శాసనసభకు ఎన్నికై రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తే, 2014లో ఇద్దరూ పరాజితులు అయ్యారు. దేవరకద్రలో సీతా దయాకరరెడ్డి టిడిపి పక్షాన పోటీచేసి రెండోస్థానంలో కూడా ఉండలేకపోయారు. ఇక్కడ2014లో టిఆర్ఎస్ నేత వెంకటేశ్వరరెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి పవన్ కుమార్ రెడ్డిపై 14642 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. సీత భర్త దయాకరరెడ్డి ఒకసారి మక్తల్ నుంచి రెండుసార్లు అమరచింత నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దేవరకద్ర, అమరచింత ల నుంచి తొమ్మిది సార్లు రెడ్డి నేతలు గెలుపొందగా,రెండుసార్లు ముస్లింలు, మూడుసార్లు ఇతరులు గెలుపొందారు. అమరచింత (2009లో రద్దు) గతంలో ఉన్న అమరచింత నియోజకవర్గం 2009లో రద్దు అయింది. 1962 వరకు ఆత్మకూరు నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతంలో సోంభూపాల్ ఈ రెండుచోట్ల ఇండిపెండెంటుగా గెలిస్తే, 1972లో అమరచింతలో కాంగ్రెస్ పక్షాన ఏకగ్రీవంగా గెలవడం విశేషం. కాంగ్రెస్ ఐ తరుపున కె.వీరారెడ్డి రెండుసార్లు గెలవగా, అమరచింతలో రెండుసార్లు గెలిచిన కె.దయాకరరెడ్డి 2014లో మక్తల్లో పోటీ చేసి గెలవడంతో మూడోసార్లు విజయం సాధించినట్లయింది. దేవరకద్ర నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కాంగ్రెస్లోకి కొత్తకోట దంపతులు?
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తెలుగుదేశం సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్రెడ్డి, సీతా దయాకర్రెడ్డి దంపతులు ఆ పార్టీని వీడుతున్నారు. దయాకర్రెడ్డి గురువారం ఈ విషయం వెల్లడించారు. వారిద్దరూ త్వరలో కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయాల్లో వీరు కీలకంగా వ్యవహరించారు. దయాకర్రెడ్డి అమరచింత నియోజకవర్గం నుంచి 1994, 1999లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజక వర్గాల పునర్విభజనతో 2009లో మక్తల్ నుంచి గెలుపొందారు. సీతమ్మ 2002లో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో కొత్తగా ఏర్పాటైన దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో దంపతులిద్దరూ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి రికార్డు సృష్టించారు. ప్రజాభీష్టం మేరకే నిర్ణయం తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొంతకాలం టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నా ఆ తర్వాత దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల కొంతకాలంగా మక్తల్, దేవరకద్ర నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరికి మూడు ప్రధాన పార్టీల నుంచి ఆహ్వానం అందినట్లు తెలిసింది. (క్లిక్: అవినీతి నిరూపిస్తే మంథని చౌరస్తాలో ఉరేసుకుంటా) ఈ క్రమంలో దేవరకద్రలో జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో టీడీపీని వీడుతున్న విషయం వెల్లడిస్తూ దయాకర్రెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. టీడీపీతో 30 ఏళ్ల అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. మూడు నెలల పాటు దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల్లో పర్యటించి, ప్రజల అభీష్టం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటామని కొత్తకోట దంపతులు చెప్పారు. అయితే టీడీపీలో ఉన్న సమయంలో రేవంత్రెడ్డితో ఉన్న సంబంధాల నేపథ్యంలో హస్తం గూటికి చేరే అవకాశమే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. (క్లిక్: అన్ని పార్టీల్లోనూ అదే సీన్ అలక.. అసంతృప్తి) -
పాలమూరు వరప్రదాయిని.. 67వ వసంతంలోకి..
దేవరకద్ర: మహబూబ్నగర్ జిల్లాలో భారీ నీటి పారుదల ప్రాజెక్టుగా ఉన్న కోయిల్సాగర్ 67వ వసంతంలోకి అడుగిడింది. దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్న కోయిల్సాగర్ ప్రాజెక్టును 1947లో నిజాం పాలనలో నిర్మాణ పనులు ప్రారంభించి 1955 సంవత్సరంలో పూర్తిచేశారు. ఆనాడు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేసింది కేవలం రూ.85 లక్షలే. ప్రాజెక్టు అలుగు స్థాయి ఎత్తు 26.6 అడుగులుగా నిర్మించారు. ఆనాటి ఆయకట్టు కింద 8 వేల ఎకరాలు ఉండగా.. కుడి, ఎడమ కాల్వల ద్వారా మొదటిసారి 1955లో జూలై 7న నీటిని వదిలారు. సిమెంట్ స్టీల్ ఉపయోగించని ఆనాడు అందుబాటులో ఉన్న సున్నం గచ్చు కలిపి రాతి కట్టడంతో ప్రాజెక్టును నిర్మించారు. ప్రస్తుతం 67వ వసంతంలోకి చేరుకున్న ప్రాజెక్టు నిర్మాణం నేటికీ చెక్కు చెదరలేదు. 1981లో క్రస్టుగేట్ల ఏర్పాటు కోయిల్సాగర్ ప్రాజెక్టును ఆధునీకరించే పనులు 1981లో కాంగ్రెస్ హయాంలో చేపట్టారు. అలుగుపై 13 గేట్లను నిర్మాణం చేసి ప్రాజెక్టు కట్టను రెండు వైపులా ఆరు అడుగుల వరకు పెంచి బలోపేతం చేశారు. దీనికి గాను రూ.92 లక్షల వ్యయం అయింది. గేట్ల నిర్మాణంతో ప్రాజెక్టులో 32.6 అడుగుల మేర నీటిమట్టం పెరగడానికి అవకాశం ఏర్పడింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.27 టీఎంసీలకు చేరింది. ఆయకట్టు కింద 8 వేల నుంచి 12 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి అవకాశం లభించింది. -
కారు అతి వేగం.. తుఫాన్ డ్రైవర్ మృతి
సాక్షి, అడ్డాకుల (దేవరకద్ర): అతివేగంగా వచ్చిన ఓ కారు డివైడర్ను దాటుకుని పక్క రోడ్డుపై వెళ్తున్న తుఫాన్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తుఫాన్ ముందు భాగంలో కూర్చున్న వారంతా అందులోనే ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించారు. దాదాపు 30నిమిషాలపాటు పోలీసులు, స్థానికులు శ్రమించి వారిని బయటికి తీయగలిగారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా.. తీవ్రగాయాలైన డ్రైవర్ మృతిచెందాడు. మరో 13మందికి గాయాలుకాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన అడ్డాకుల శివారులోని జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళ్తుంటే ప్రమాదం మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన వెంకటయ్య కుటుంబ సభ్యులు శుభకార్యం నిమిత్తం తుఫాన్ వాహనంలో కొత్తకోటకు బయలు దేరారు. కర్నూల్కు చెందిన లక్ష్మిదేవి కారులో హైదరాబాద్కు వెళ్తోంది. అడ్డాకుల శివారులోకి వచ్చే సరికి కారు అదుపు తప్పి డివైడర్ మీదుగా దూసుకెళ్లి పక్క రోడ్డులో వెళ్తున్న తుఫాన్పై పడింది. దీంతో తుఫాన్ డ్రైవర్తో పాటు ముందు సీటులో కూర్చున్న వారు అందులో ఇరుక్కు పోయారు. వీరిని అడ్డాకుల ఎస్ నరేష్తో పాటు స్థానికులు అరగంట పాటు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. తుఫాన్ డ్రైవర్ శ్రీనివాసులు(23) తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ముందు సీట్లో కూర్చున్న శంకరయ్య, యుగేందర్ తీవ్రంగా గాయపడ్డారు. అదే వాహనంలో ఉన్న లలితకు తీవ్ర గాయాలయ్యాయి. సరోజ, నారాయణ, నాగప్ప, జ్యోతి, నర్సిములు, రాజు, వెంకటయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారులో ఉన్న లక్ష్మిదేవి, కుమారుడు అనువంశ్, ఆమె తల్లి రుక్మినమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మూడు అంబులెన్స్లలో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు తరలించారు. మృతుడు శ్రీనివాసులు భూత్పూర్ మండలం హస్నాపూర్ వాసి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. కారు వేగం వందకుపైనే.. ప్రమాద సమయంలో కారు వందకు పైగా వేగంతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అతివేగంగా వెళ్తూ అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొట్టిన తర్వాత పక్క రోడ్డుపైకి దూసుకెళ్లింది. తుఫాన్ను కారు నేరుగా ఢీకొట్టకుండా గాలిలోకి ఎగిరి దానిపై పడినట్లు ప్రత్యక్ష సాక్షి శివనారాయణ తెలిపారు. కారు ఎగిరి తుఫాన్పై పడగానే ముందు సీట్లో ఉన్న వారు అందులో ఇరుక్కోవడంతో తీవ్రగాయాలై డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదానికి గురైన రెండు వాహనాలు డివైడర్ పైనే పడ్డాయి. -
ఇద్దరిని బలి తీసుకున్న అతివేగం
సాక్షి, దేవరకద్ర(మహబూబ్నగర్): తక్కువ సమయంలో గమ్యం చేరుకోవాలని.. అతివేగంతో వాహనం నడుపుతూ వచ్చాడు డ్రైవర్. స్పీడ్ పెరుగుతున్న కొద్దీ వాహనం అదుపు చేయలేకపోయాడు.. ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తోపాటు మరో మహిళ మృతిచెందగా.. 10మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం దాదాపు 100పైగా స్పీడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన భూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ భాస్కర్రెడ్డి కథనం ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ట్యాక్సీతుఫాన్ వాహనం సోమవారం మధ్యాహ్నం ప్రయాణికులను ఎక్కించుకొని హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు బయల్దేరింది. ఈ క్రమంలో భూత్పూర్ మండలం అన్నాసాగర్ దగ్గరకు రావడంతో వేగంగా ఉన్న వాహనం అదుపు తప్పి రోడ్డుకు దాదాపు 20 మీటర్ల దూరం పల్టీలు కొడుతూ చివరకు చెట్టును ఢీకొని బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న 12మందికి గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ ఇరువురి మృతి విషయం తెలుసుకున్న పోలీసులు, ఎల్అండ్టీ సిబ్బంది వెంటనే క్షతగాత్రులను 108వాహనంలో జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆస్పత్రికి తీసుకువచ్చిన అనంతరం తీవ్రంగా గాయపడిన హైదరాబాద్కు చెందిన డ్రైవర్ శేఖర్(27) మృతిచెందాడు. అలాగే, కోమాలోకి వెళ్లిన కర్నూల్ జిల్లా డోన్కు చెందిన మరో ప్రయాణికురాలు జయంతి(35)రాత్రి 7గంటల ప్రాంతంలో మృతి చెందారు. గాయపడ్డ వారి వివరాలు.. వాహనం బోల్తా పడిన ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిలో మానవపాడు మండలానికి చెందిన భార్య భర్తలు సంధ్య, మునిస్వామి, రాజస్థాన్కు చెందిన గజేందర్, గోవర్ధన్ ఉన్నారు. వీరితోపాటు కర్నూల్ జిల్లా కల్లూర్కు చెందిన భార్యభర్తలు సఫియా, బడేసాహెబ్, బిహార్కు చెందిన అల్లావుద్దీన్, కర్నూల్ జిల్లా బుద్వేల్కు చెందిన పద్మావతి, నర్దానా, కర్నూల్కు చెందిన వినయ్కుమార్తో మరో మహిళకు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
పేదల 'తిరుపతి' కురుమూర్తి కొండలో బ్రహ్మోత్సవాలు
సాక్షి, దేవరకద్ర: పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న అమ్మాపురం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్ట నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు ఎడ్లబండ్లపై, ప్రవేటు వాహనాలు, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆర్టీసీ బస్సులలో తరలివస్తున్నారు. గంటల తరబడి లైన్లలో నిల్చొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి సుప్రభాతసేవ నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్గించారు. భక్తులు మెట్లపై గోవింద నమస్మరణ చేస్తు శరణ గోశ వినిపించారు. జాతర మైదానంలో భక్తులు దాసంగాలు, గండదీపాలు మోసి మొక్కు చెల్లించుకున్నారు. భక్తుల సందడితో దుకాణ సముదాయాలు, గాజుల దుకాణాలు, హోటళ్లు కిటకిటలాడాయి. ఇదిలాఉండగా, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు నిర్వాహకులు నాణ్యమైన లడ్డు ప్రసాదాన్ని అందిస్తున్నారు. స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూను తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు. జాతర మైదానంలో దాసంగాలు పెట్టేందుకు అమ్మకానికి సిద్ధంగా ఉంచిన కుండలు; ఎడ్లబండ్లపై వస్తున్న భక్తులు; కర్ణాటక రాష్ట్రం నుంచి కురుమూర్తిస్వామి మాలధారణతో పాదయాత్రగా వస్తున్న భక్తులు పాదయాత్రగా కురుమూర్తి కొండలకు.. కొందరు భక్తులు కురుమూర్తిస్వామి మాలధారణను ధరించి పాదయాత్రలతో స్వామివారి చెంతకు చేరుకోని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కర్ణాటక రాష్టానికి చెందిన యాదగిరి నుంచి భక్తులు కురుమూర్తి స్వామి మాలను ధరించి పాదయాత్ర చేస్తు మంగళవారం కురుమూర్తి కొండకు చేరుకున్నారు. నియమ నిష్టలతో వారంరోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి పాదయాత్రను చేపట్టినట్టు భక్తుల తెలిపారు. ప్రతి సంవత్సరం కురుమూర్తి మాలధారణ ధరించే భక్తుల సంఖ్య పెరుగుతుంది. -
ఎనిమిదేళ్ల బాలికపై దాడి!
అభంశుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ కామాందుడు కన్నేశాడు.. గణేష్ నిమజ్జనాన్ని తిలకించడానికి రాత్రి ఇంటి నుంచి బయటికి రావడం గమనించాడు.. తానే దగ్గరుండి ఇంటికి తీసుకొస్తానని బాలిక అమ్మమ్మకు నమ్మబలికాడు.. అతని మాయమాటలు నమ్మిన ఆ వృద్ధురాలికి ఏం తెలుసు ఆ కామాందుడు లైంగిక దాడి చేసి చిన్నారిని జీవితాన్ని నాశనం చేస్తాడని.. రాత్రంతా బిడ్డ ఇంటికి రాకపోవడంతో గ్రామస్తులందరు వెతుకగా గ్రామశివారులో పడి ఉండటాన్ని గమనించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. సాక్షి, దేవరకద్ర(మహబూబ్నగర్) : అభం శుభం తెలియని బాలికలపై మానవ మృగాలు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. జడ్చర్లలో పదో తరగతి బాలికపై జరిగిన సంఘటన మరువకముందే.. చిన్నచింతకుంట మండలం లాల్కోటలో ఎనిమిదేళ్ల బాలికపై ఆదివారం రాత్రి ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎస్ఐ చల్లా జ్యోతి కథనం ప్రకారం.. లాల్కోటకు చెందిన మైనర్ బాలిక అమ్మమ్మతో కలిసి బస్టాండ్ కూడలిలో ఏర్పాటుచేసిన వినాయక నిమజ్జనోత్సవాలను తిలకించేందుకు వెళ్లింది. అనంతరం తిరిగి వెళ్తుండగా మార్గమధ్యంలో 22 ఏళ్ల పోగుల రాజు ఇంటి వద్ద వదులుతానని నమ్మించి బాలికను బైకుపై ఎక్కించుకున్నాడు. సమీపంలోని కోయిల్సాగర్ కాల్వ వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అప్పటికే అమ్మమ్మ ఇంటికి చేరుకోగా.. ఎంతకూ బాలిక రాకపోవడంతో చుట్టుపక్కల వారితో కలిసి వెతికారు. కాల్వ సమీపంలో బైకు కనిపించడంతో అక్కడికి చేరుకునేలోపు నిందితుడు పారిపోయాడు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై సోమవారం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జల్సాలకు అలవాటుపడి.. చదువు సంధ్యలేని పోగురాజు చిన్నతనం నుంచి తన తండ్రితో పాటు మేకలను కాసేవాడు. మూడేళ్ల క్రితం ట్రాక్టర్ నడుపుతూ విలాసాలతో గడిపేవాడు. తాజాగా ఆదివారం రాత్రి వినాయక ఉత్సవాల సందర్భంగా మద్యం తాగి ఈ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి పారిపోయి పెద్దచింతకుంట శివారులోని వెంటేశ్వరెడ్డిబావి వద్ద ఉండగా సోమవారం సాయంత్రం లాల్కోట గ్రామస్తులు కొందరు గమనించారు. వెంటనే అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం ఈ సంఘటనపై లాల్కోటలో సీఐ పాండురంగారెడ్డి విచారించారు. బాలిక కుటుంబ నేపథ్యం కాగా, ఈ బాలిక తల్లికి ఆత్మకూర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే మూడేళ్ల క్రితం భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చింది. తన కూతురిని అమ్మమ్మ వద్ద వదిలి హైదరాబాద్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. దీంతో ఈ బాలికను అమ్మమ్మనే చదివిస్తోంది. -
పాండు ఆశయం.. ఫలించిన వేళ
సాక్షి, దేవరకద్ర(మహబూబ్నగర్): తమ స్నేహితుడి కోరికను తోటి మిత్రులు నెరవేర్చారు. దీంతో మృతిచెందిన ఆ యువకుడి ఆశయం నెరవేరింది. మండలంలోని డోకూర్లో గురువారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన వాకిటి గోవిందు, తిరుపతమ్మ దంపతులది రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం. ఈ దంపతులకు పాండు(22) ఒక్కగానొక్క కుమారుడు. దీంతో తల్లిదండ్రులు ఆశలన్ని కొడుకుపైనే పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుతూ చదివించారు. పాండు ఐటీఐ పూర్తిచేశాడు. అయితే అప్పుచేసి ఓ ఇల్లు కట్టుకున్నారు. పొలాలు కూడా అంతగా లేకపోవడంతో ఆ కుటుంబానికి కుటుంబ పోషణ భారమైంది. దీంతో చేసిన అప్పులు తీర్చే మార్గం లేక కుటుంబం సతమతమైంది. ఇది పాండును బాగా ప్రభావితం చేసింది. తల్లిదండ్రులకు అండగా ఉండటానికి చేసిన అప్పులు ఎలాగైన తీర్చాలన్న ఉద్దేశంతో బతుకుదెరువు కోసం ఏదైన ఉద్యోగం చేయాలని గతేడాది సెప్టెంబర్లో హైదరాబాద్కు వెళ్లాడు. అక్కడ ఉద్యోగం కోసం వెతుకుతూ కూలీ పనికి వెళ్లాడు. అయితే అదే నెల 17న అక్కడ ఓ బిల్డింగ్పై కూలి పనిచేస్తూ 4 అంతస్తుల భవనం నుంచి కిందపడి మృతిచెందాడు. చందాలు వేసుకొని.. డోకూర్ పాఠశాలలో సరస్వతీ విగ్రహం ఏర్పాటు చేయాలని పాండు నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తోటి స్నేహితులతో తరచూ చెబుతుండేవాడు. ఇలాంటి మంచిపని చేయాలని పట్టుదలతో ప్రయత్నాన్ని ప్రారంభించాడు. ఆ కోరిక నెరవేరక ముందే పాండు మృతిచెందాడు. దీంతో తన స్నేహితుడు పాండు కోరిక మేరకు పాఠశాలలో సరస్వతీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. స్నేహితులంతా చందాలు వసూలు చేసి పాఠశాలలో సరస్వతీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఘన సన్మానం.. డోకూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సరస్వతీ విగ్రహాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి బీజేపీ నాయకుడు డోకూర్ పవన్కుమార్రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు యజ్ఞభూపాల్రెడ్డి, సర్పంచ్ రామకృష్ణారెడ్డి, సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి, పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం నాగేందర్రెడ్డి తదితరులు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సరస్వతీ విగ్రహం ఏర్పాటు చేసి స్నేహితుడి ఆశయాన్ని నెరవేర్చిన మిత్రులు, రాక్స్టార్ యూత్ అసోసియేషన్ సభ్యులు శేఖర్, సురేష్, నరేష్, వెంకటేష్, శ్రీనివాసులు, అశోక్, వెంకటేష్లతోపాటు పాండు తల్లిదండ్రులను పాఠశాల తరఫున ఘనంగా సన్మానించారు. -
రైతుల అభ్యున్నతికి సీఎం కృషి
సాక్షి, భూత్పూర్ (దేవరకద్ర): రైతుల అభ్యున్నతి కోసం దేశంలో ఏ సీఎం చేపట్టని అభివృద్ధి పథకాలను కేసీఆర్ చేపట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం భూత్పూర్లోని కేఎంఆర్ ఫంక్షన్హాల్లో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి అందజేసి మాట్లాడారు. గత ప్రభుత్వాలు రైతులు భూమి కొనుగోలు చేస్తే పట్టా చేసే వారికి ఇతరులకు తెలియకుండా ఉండేదని, ఇష్టానుసారంగా సాదాబైనామ అమలు చేసేవారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక సీఎం కేసీఆర్ భూప్రక్షాళన చేపట్టడం, కుటుంబంలో రైతు మృతిచెందితే వీలైనంత త్వరగా కుటుంబ సభ్యులకు పట్టా అమలు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 500 పాసు çపుస్తకాలు అందిస్తున్నామని, మరో 600 పాసుపుస్తకాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేసి రైతులకు అందించాలని తహసీల్దార్ను ఆదేశించారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ అన్ని మున్సిపాలిటీల్లో పార్టీ గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణమ్మ, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ బస్వరాజ్గౌడ్, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ఎంపీపీ శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూత్పూర్ (దేవరకద్ర): రైతుల అభ్యున్నతి కోసం దేశంలో ఏ సీఎం చేపట్టని అభివృద్ధి పథకాలను కేసీఆర్ చేపట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం భూత్పూర్లోని కేఎంఆర్ ఫంక్షన్హాల్లో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి అందజేసి మాట్లాడారు. గత ప్రభుత్వాలు రైతులు భూమి కొనుగోలు చేస్తే పట్టా చేసే వారికి ఇతరులకు తెలియకుండా ఉండేదని, ఇష్టానుసారంగా సాదాబైనామ అమలు చేసేవారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక సీఎం కేసీఆర్ భూప్రక్షాళన చేపట్టడం, కుటుంబంలో రైతు మృతిచెందితే వీలైనంత త్వరగా కుటుంబ సభ్యులకు పట్టా అమలు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 500 పాసు పుస్తకాలు అందిస్తున్నామని, మరో 600 పాసుపుస్తకాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేసి రైతులకు అందించాలని తహసీల్దార్ను ఆదేశించారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ అన్ని మున్సిపాలిటీల్లో పార్టీ గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణమ్మ, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ బస్వరాజ్గౌడ్, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ఎంపీపీ శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వలస కార్మికులు తిరిగొస్తారు బిజినేపల్లి (నాగర్కర్నూల్): అప్పట్లో పాలమూరు పేరు చెబితేనే వలసలు, కరువు కాటకాలకు నిలయంగా ఉన్న పాలమూరు జిల్లా రాబోయే రోజుల్లో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ప్రతి ఎకరా మాగాణిగా మారి పచ్చదనంతో శోభిల్లుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. నాడు బీళ్లుగా ఉన్న పొలాలు సీఎం చలువతో రేపు పచ్చదనం సంతరించుకోనున్నాయని దాంతో పట్నం వలస పోయిన రైతన్న తిరిగి పాలమూరు బాట పట్టే రోజులు ముందరనే ఉన్నాయన్నారు. ఇప్పటికే మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరందిస్తూ సాగు పండగ జరుగుతుందన్నారు. మత్స్యకారులు, రైతుల జీవితాల్లో ఈ ప్రాజెక్టులు వెలుగులు నింపనున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పాలమూరు ప్రాజెక్టుకు ఊపిరిపోసి పెండింగ్లో ఉన్న పనులకు బకాయిలు చెల్లించి వేగవంతం చేయనున్నారన్నారు. వచ్చే వేసవి నాటికి పనులను పూర్తి చేసి 2020 ఖరీఫ్లో సాగునీటిని అందించాలనే లక్ష్యంలో ముందుకు సాగుతున్నారన్నారు. వట్టెంలోని వెంకటాద్రి రిజర్వాయర్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, నాయకులు రఘునందర్రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు విజయ్, అమృత్రెడ్డి, తిరుపతిరెడ్డి, పులేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూటు మారిన విమానాశ్రయం
సాక్షి, దేవరకద్ర : మహబూబ్నగర్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు కోసం అధికారులు చేపట్టిన స్థలాల అన్వేషణ ఇంకా కొలిక్కి రావడం లేదు. దేవరకద్ర నియోజకవర్గంలోనే ఎయిర్పోర్టు నెలకొల్పే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు ప్రకటించినా ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న అంశం మాత్రం తేలడం లేదు. గతంలో అడ్డాకుల మండలం గుడిబండ వద్ద ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. తాజాగా మంగళవారం దేవరకద్ర మండలం చౌదర్పల్లి, హజిలాపూర్ శివారులో ఉన్న ప్రభుత్వ భూములను జిల్లా రెవెన్యూ సర్వేయర్ అధికారులు పరిశీలించడంతో ఎయిర్ పోర్టు రూటు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కాకుండా నియోజకవర్గంలోని మూసాపేట వద్ద విభా సీడ్స్ కంపెనీ సమీపంలో, భూత్పూర్ మండలంలోని హెచ్బీఎల్ కంపెనీ సమీపంలో కొన్ని స్థలాలను పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దేవరకద్ర నియోజకవర్గంలో ఎక్కడో ఒకచోట విమానాశ్రయం ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారికి దగ్గరే.. ఎయిర్పోర్టు ఏర్పాటుకు స్థల ఎంపిక కొనసాగుతున్న నేపథ్యంలో దానికి రోడ్డు మార్గం కూడా కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. ఎయిర్పోర్టుకు జాతీయ రహదారి దగ్గరగా ఉండాలని ఏవియేషన్ అధికారులు కూడా భావిస్తున్నారు. దేవరకద్ర మండలంలోని చౌదర్పల్లి, హజిలాపూర్లు 44వ జాతీయ రహదారికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నారు. గతంలో అడ్డాకుల మండలం గుడిబండ జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ స్థలంలో హైటెన్షన్ విద్యుత్ లైన్ సమస్యగా ఉన్నందున విమానాశ్రయం దేవరకద్ర మండలం వైపు మళ్లించినట్లు తెలుస్తుంది. ఏఏఐ బృందం పర్యటన ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి ప్రాంతాల్లో ఈ నెల 21 నుంచి 22 వరకు పర్యటిస్తున్నారు. ఇదే క్రమంలో 23న హైదరాబాద్కు తిరిగి వచ్చే బృందం మహబూబ్నగర్ జిల్లాకు మరోసారి వచ్చే అవకాశం ఉంది. అయితే వారి రాక అధికారికంగా ఖరారు కాకపోయినా తాజాగా దేవరకద్ర మండలంలోని భూములను పరిశీలించినట్లు తెలుస్తుంది. చౌదర్పల్లి, హజిలాపూర్ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఉండడం, విమానాశ్రయానికి అనువుగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని పరిశీలించే అవకాశం ఉంది. -
‘ల్యాండ్’ కాని ఎయిర్పోర్టు
సాక్షి, దేవరకద్ర/ అడ్డాకుల : పాలమూరు జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటు కోసం అధికారులు చేపట్టిన స్థలాల అన్వేషణ ఇంకా కొలిక్కి రావడం లేదు. దేవరకద్ర నియోజకవర్గంలోనే ఎయిర్పోర్టు నెలకొల్పే అవకాశం ఉందని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రకటించినా ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న అంశం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. తాజాగా అడ్డాకుల మండలం గుడిబండ వద్ద ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి స్థలాన్ని పరిశీలించినా మరో రెండు, మూడు స్థలాలను ఎంపిక చేసి పరిశీలించాలని నిర్ణయించడంతో స్థల ఎంపికపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. గుడిబండ వద్ద స్థలాన్ని పరిశీలించిన తర్వాత దేవరకద్ర, మూసాపేట, భూత్పూర్ మండలాల్లో కొన్ని ప్రదేశాలను అధికారులు స్థల పరిశీలన నిమిత్తం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దేవరకద్ర మండలంలోని చౌదర్పల్లి, మూసాపేట విభా సీడ్స్ కంపెనీ సమీపంలో, భూత్పూర్ మండలంలోని హెచ్బీఎల్ కంపెనీ సమీపంలో కొన్ని స్థలాలను పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దేవరకద్ర, మూసాపేట, భూత్పూర్ మండలాల్లో ఏదో ఒకచోట ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గుడిబండ ఆశలు ఆవిరేనా..? గుడిబండ వద్ద ఎయిర్పోర్టు కోసం అధికారులు పరిశీలించిన స్థలంలో రెండు ప్రధాన విద్యుత్ లైన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవే ప్రతిబంధకాలుగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ స్థలాన్ని పరిశీలించిన సందర్భంలో విద్యుత్ లైన్పై చాలాసేపు అధికారులు చర్చ చేశారు. లైన్ మార్పు చేయడానికి ఉన్న అవకాశాలపై చర్చించిన తర్వాత ఇతర ప్రాంతాల్లో స్థలాలను చూడాలని నిర్ణయించారు. దేవరకద్ర సమీపంలో ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో గుడిబండ వద్ద ఎయిర్పోర్టు ఏర్పాటు ఆశలు ఆవిరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి ప్రకటన తర్వాత.. 2018 మార్చి 27న జరిగిన శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన రెండు రోజుల్లోనే మొదట అధికారులు గుడిబండ వద్ద స్థల పరిశీలన చేశారు. తర్వాత మూసాపేట మండలంలోని తుంకినిపూర్, వేముల, దాసర్పల్లి గ్రామాల వద్ద స్థలాలను చూశారు. ఆ తర్వాత భూత్పూర్ మండలంలోని రావులపల్లి వద్ద కూడా స్థలాలను పరిశీలించారు. స్థలాలకు సంబంధించిన మ్యాపులు, ఇతర వివరాలను ఉన్నతాధికారులకు పంపించారు. అయితే ఎయిర్పోర్టు అధికారులు అప్పట్లో స్థల పరిశీలనకు రాకపోవడంతో ఎయిర్పోర్టు అంశం మూలకు పడింది. తాజాగా మళ్లీ ఎయిర్పోర్టు ఏర్పాటుపై అధికారులు స్థలాలను పరిశీలిస్తుండటంతో ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. జాతీయ రహదారికి సమీపంలో.. విమానాశ్రయం ఏర్పాటుకు స్థల ఎంపిక కొనసాగుతున్న నేపథ్యంలో దానికి రోడ్డు మార్గం కూడా కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. ఎయిర్ పోర్టుకు జాతీయ రహదారి దగ్గరగా ఉండాలని ఏవియేషన్ అధికారులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మండలాలు మాత్రమే హైవేకు దగ్గరగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మూడు మండలాలనే పరిగణలోకి తీసుకుంటే గుడిబండనే అన్నింటికీ అనుకూలంగా ఉండనుంది. ఒకవేళ రవాణా మార్గాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోకుంటే దేవరకద్ర మండలం వైపు అధికారులు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్అండ్బీ అధికారులు ఇటీవల పరిశీలించిన స్థలాల వివరాలను ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. -
సారూ.. చదువుకుంటా!
దేవరకద్ర : తాను పనికి పోనని.. చదువుకుంటానని ఓ బాలుడు మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో చోటుచేసుకుంది. దేవరకద్ర మండలం బల్సుపల్లికి చెందిన మధు (12) తల్లి మృతి చెందగా తండ్రి కృష్ణయ్య ఉన్నాడు. కూలీ అయిన కృష్ణయ్య మూడో తరగతి చదువుతున్న తన కుమారుడు మధును మూడేళ్ల క్రితం చదువు మాన్పించి మిర్యాలగూడ ప్రాంతంలో కూలీ పనులకు పంపించాడు. అయితే మధు ఇటీవల తిరిగి ఇంటికి రావడంతో తండ్రి కృష్ణయ్య మళ్లీ పనికి పోవాలని బాలుడిపై ఒత్తిడి తెచ్చాడు. అయితే తాను చదువుకుంటానని, పనికి వెళ్లనని మధు మొండికేయడంతో కృష్ణయ్య కోపంతో చితకబాది ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దిక్కు తోచని మధు మంగళవారం పోలీస్స్టేషన్కు వెళ్లి తనకు ఎవరూ లేరని, చదువుకుంటానని చెప్పాడు. స్పందించిన పోలీసులు వెంటనే ఈ విషయం ఎంఈఓ నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మధును తీసుకువెళ్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో 5వ తరగతిలో చేర్పించారు. చదువుకోవాలనే తన కోరిక నెరవేరడంతో మధు ఆనందం వ్యక్తం చేశాడు. -
మహిళ దారుణ హత్య
దేవరకద్ర: ఓ గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన మండలంలోని గోప్లాపూర్ శివారులో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. గోప్లాపూర్ శివారులోని సామ్రాట్ శ్రీనివాసులు వ్యవసాయ పొలంలో ఓ గుర్తుతెలియని మహిళ శవం కుళ్లిన స్థితిలో ఉన్నట్లు సోమవారం పోలీసులకు అక్కడి రైతులు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి వెళ్లిన ఎస్ఐ వెంకటేశ్వర్లు మహిళ శవాన్ని పరిశీలించారు. అనంతరం సమాచారం అందిన సీఐ పాండురంగారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దాదాపు వారం క్రితమే మహిళ మృతిచెంది ఉండవచ్చని సీఐ తెలిపారు. కిరోసిన్ పోసి తగులబెట్టి హత్య ? ఇదిలాఉండగా, శవాన్ని కిరోసిన్ పోసి తగుల బెట్టి హత్య చేసినట్లు కనిపిస్తున్నదని తెలిపారు. శవం బాగా నల్లగా మారి కుళ్లిన స్థితికి చేరుకోవడం వల్ల గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉందని తెలిపారు. అయితే కొన్ని ఆనవాళ్లు దొరికాయని దీంతో గుర్తించడానికి అవకాశం ఉందని తెలిపారు. మృతురాలికి దాదాపు 35 సంవత్సరాల వయస్సు ఉండవచ్చని, ఎడమ చేతిపై చంద్రుని ఆకారంతో పాటు పువ్వు గుర్తు ఉన్న పచ్చబొట్లు ఉందని, కాళ్లకు మెట్టెలు ఉన్నాయని తెలిపారు. చుట్టు పక్కల పీఎస్లలో మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నామని, ఎవరైనది త్వరలో తెలిసే అవకాశం ఉందని సీఎ తెలిపారు. అలాగే ఎలా మృతి చెందింది అనే విషయం కూడా బయట పడుతుందని తెలిపారు. దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలానికి చేరుకుని ఆనవాళ్లను సేకరించారు. అనంతరం శవాన్ని జిల్లా కేంద్రంలోని మార్చురీకి తరలించారు. -
టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిపై దాడి
దేవరకద్ర: దేవరకద్ర టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్యాదవ్పై సోమవారం ఉదయం మరో సారి దాడి జరిగింది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సీఐ పాండురంగారెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. దేవరకద్రలో నివాసం ఉండే శ్రీకాంత్యాదవ్ ప్రతి సోమవారం పశువుల సంత సమీపంలో ఉన్న ఈశ్వర వీరప్పయ్యస్వామి దేవాలయాలను దర్శించుకోవడం అలవాటు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో దేవాలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తుండగా అక్కడ పని చేసే వరుసకు బావ అయిన కుర్వ ఆంజనేయులుతో గొడవ జరిగింది. ఉద్యోగానికి అడ్డుపడుతున్నావంటూ.. 40ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్నా తన ఉద్యోగం పర్మినెంట్ కాకపోవడానికి కారణం నువ్వే అంటూ శ్రీకాంత్యాదవ్ను ఆంజనేయులు దూషించాడు. దీంతో మాట మాట పెరిగి ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇంతలో ఆంజనేయులు భార్య జయమ్మ, కుమారులు అనిల్ కొడవళి చేత పట్టుకుని రాగా మరో ఇద్దరు సోదరులు అక్కడికి వచ్చి శ్రీకాంత్యాదవ్పై దాడికి ప్రయత్నించారు. దీంతో దేవాలయానికి వచ్చిన అన్న కుమారుడు తోడు కావడంతో శ్రీకాంత్యాదవ్ తప్పించుకుని దేవాలయంలోకి వెళ్లాడు. అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ శ్రీకాంత్యాదవ్కు రక్షణగా నిలిచాడు. ఇంతలో సమాచారం అందిన పోలీసులు అక్కడికి చేరుకోవడంతో కొడవళి పట్టుకొని వచ్చిన అనిల్ పారిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించి శ్రీకాంత్యాదవ్ పోలీసులకు పిర్యాదు చేశాడు. గతంలో జీపుతో ఢీకొట్టి.. కొన్ని నెలల క్రితం శ్రీకాంత్యాదవ్ను జీపుతో ఢీకొట్టి హత్య చేయడానికి చేసిన ప్రయత్నం విఫలం కాగా ప్రస్తుతం తన బంధువుల నుంచే మరో సారి దాడి జరిగింది. తనను హత్య చేయడానికి జరిపిన దాడి అని శ్రీకాంత్ యాదవ్ విలేకర్లకు తెలిపారు. గతంలో జరిగిన దాడితో సంబంధాలు ఉన్న వారికి ఈ దాడికి సంబంధం ఉందని తెలిపారు. చట్టపరంగా వారిపై చర్య తీసుకోవాలని కోరారు. కాగా జరిగిన సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పాండురంగారెడ్డి తెలిపారు. -
బర్రెనమ్మారని.. గుండు గీశారు
చిన్నచింతకుంట (దేవరకద్ర): జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు తమ సొంత బర్రె (గేదె)తోపాటు దూడను స్నేహితుడి సహాయంతో విక్రయించాడు. వచ్చిన డబ్బుతో హైదరాబాద్కు వెళ్లి జల్సా చేద్దామనుకున్నాడు. ఇంతలో విషయం గ్రామంలో తెలియడంతో సర్పంచ్తోపాటు అధికార పార్టీ నాయకుడి ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాయతీలో ఇద్దరు యువకులకు గుండు గీయించారు. అయితే అవమానంగా భావించిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ముచ్చింతలలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాలిలా.. గ్రామానికి చెందిన సురేందర్రెడ్డి కుమారుడు మహేశ్వర్రెడ్డి అదే గ్రామానికి చెందిన రాఘవేంద్ర స్నేహితులు. ఇంటర్ వరకు చదివిన వీరు కుటుంబసభ్యులకు వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉంటున్నారు. అయితే మహేశ్వర్రెడ్డి జల్సాలకు అలవాటుపడి తరచూ తండ్రిని డబ్బులు ఇవ్వమని అడిగేవాడు. తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో స్నేహితుడు రాఘవేంద్ర సహాయంతో మహేశ్వర్రెడ్డి తాను మేపుతున్న పశువుల నుంచి ఓ బర్రె, దూడను తల్లిదండ్రులకు తెలియకుండా దేవరకద్ర సంతకు వెళ్లి రూ.33వేలకు విక్రయించారు. అనంతరం మహేశ్వర్రెడ్డి హైదరాబాద్ వెళ్లిపోయాడు. గ్రామానికి చేరుకున్న రాఘవేంద్రను మహేశ్వర్రెడ్డి తండ్రి సురేందర్రెడ్డి తన కొడుకు ఎక్కడ ఉన్నాడని అడగడంతో జరిగిన విషయం చెప్పాడు. ఈ విషయం గ్రామసర్పంచ్ హరిత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వారు మహేశ్వర్రెడ్డిని పిలిపించా రు. గురువారం రాఘవేంద్రను వెంట పెట్టుకుని వెళ్లి అమ్మిన బర్రె, దూడను గ్రామానికి తీసుకువచ్చారు. రాఘవేంద్ర తండ్రి వద్దంటున్నా.. శుక్రవారం గ్రామపెద్దలు, గ్రామస్తుల ఎదుట పంచా యతీ నిర్వహించి యువకులకు గుండు గీయించారు. దీంతో అవమానం భరించలేని రాఘవేంద్ర సూసైడ్ నోట్ రాసి వ్యవసాయ పొలంలోని విద్యు త్ ట్రాన్స్ఫార్మర్ పట్టుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పర్వతాలు తెలిపారు. -
పుస్తకం.. సమస్త ప్రపంచం
వెలుగు చూసిన.. అపూర్వ సాహిత్య సంపద దేవరకద్ర రూరల్ : ఆధునిక ముద్రణా పరిజ్ఞానం అందుబాటులోకి రాకముందే రచయితలు, కవులు, జానపదకళలను ప్రదర్శించే కళాకారులు, శాస్త్రకారులు తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. తాళపత్రాలు (తాటి ఆకులు) విరివిగా వినియోగించి తమ రచనలను భద్రపరిచారు. వీటితోపాటు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బంగారు, వెండి, రాగి రేకులు, వస్త్రాలపై అమూల్యమైన సమాచారాన్ని లిఖించి ప్రాచీన భాషకు పట్టం కట్టారు. శిలాశాసనాలకు కొదవేలేదు. అరుదైన చర్మలిఖిత ప్రతి పెబ్బేరు ప్రాంతంలో లభించింది. దేవరకద్ర మండలం కౌకుంట్లకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు, యువకవి గుముడాల చక్రవర్తిగౌడ్ జిల్లాలోని రాతప్రతులను సేకరించారు. 700 ఏళ్లనాటి రాతప్రతులు జాతీయ రాతప్రతుల సంస్థ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రాచీన రాతప్రతుల గ్రంథాలయం పర్యవేక్షణలో ఉమ్మడి మహబూబ్నగర్లో ప్రాచీన రాతప్రతుల సర్వే చేపట్టింది. ఈ క్రమంలోనే నారాయణపేటలో 700 ఏళ్ల క్రితం రాసిన ప్రాచీన రాతప్రతులను ఆ ప్రాంత సమన్వయకర్తగా వ్యవహరించిన కవి చందోజీరావు వెలుగులోకి తెచ్చారు. పేటలోని ధనుంజయ దీక్షితుల ఇంట్లో ఈ ప్రతులు లభించాయి. వీటితోపాటు యాగమంత్రాలు, వేదసంహిత రుగ్వేద సహిత వంటి ఎన్నో విలువైన రాతప్రతులు వెలుగుచూశాయి. అలాగే పాలమూరులో కృష్ణశర్మ నివాసంలో 200లకుపైగా తాళపత్ర గ్రంథాలను సమన్వయకర్త గుముడాల చక్రవర్తిగౌడ్ వెలుగులోకి తెచ్చారు. సారస్వత క్షేత్రం పాలమూరు సాహిత్య రంగానికి పెట్టింది పేరు పాలమూరు జిల్లా. తెలుగు సాహిత్యంలో అనేక లబ్ధప్రతిష్టమైన రచనలు ఇక్కడి నుంచి వెలువడ్డాయి. తెలుగులో మొట్టమొదటి రామాయణమైన రంగనాథ రామాయణం వెలువడింది పాలమూరు నుంచే. గోన బుద్దారెడ్డి, కుప్పాంబిక, అప్పకవి, సురభి మాధవరాయులు, ఏలకూచి బాలసరస్వతి, రాసురాట్క్ రవి, బాలసరస్వతి, బుక్కపట్నం శ్రీనివాసాచార్యులు, కేశవ పంతుల నరసింహశాస్త్రితోపాటు గడియారం రామకృష్ణశర్మ, సురవరం ప్రతాప్రెడ్డి, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, బూర్గుల రామకృష్ణారావు, రుక్పానుపేట రత్నమ్మ, కపిలవాయి లింగమూర్తి వంటి మొదలైన సాహిత్యమూర్తులు ఈ గడ్డకు చెందినవారే. వారంతా అద్భుతమైన కావ్యాలను రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. నాటి సంస్థాన కాలం నుంచి నేటి ఆధునిక సాహిత్యం వరకు ఎంతో మంది కవులు, రచయితలు ఆణిముత్యాల్లాంటి పుస్తకాలను వెలువరించారు. జిల్లాలో నెలకోసారి పుస్తకం వెలువరించడం సంప్రదాయంగా వస్తుంది. ఇప్పటికీ వేల సంఖ్యలో పుస్తకాలు వెలువడుతూనే ఉన్నాయి. పుస్తకం.. ఆత్మీయ నేస్తం పుస్తకం మనకో ఆత్మీయ నేస్తం. అదే తోడుంటే ఎంతో మానసిక ధైర్యం ఉన్నట్లే. పుస్తకం మనకో మిత్రుడు, ఒక మార్గదర్శి. పుస్తకాలను నేటితరం యువత చదవడం అలవాటు చేసుకుంటే గొప్ప గొప్ప ఆలోచనలకు పదునుపెట్టి అనేక ఆవిష్కరణలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎంతోమంది ప్రముఖులు పుస్తక జ్ఞానాన్ని సముపార్జించి లబ్ధప్రతిష్టులయ్యారు. పుస్తకమే ఒక విజ్ఞాన సంపద. అందులోని జ్ఞానాన్ని ఆస్వాదిస్తే గొప్ప వ్యక్తులుగా మారే అవకాశం ఉంటుంది. అలాంటి పుస్తకాలను నేటితరం చదివితేనే భవిష్యత్కు బంగారు బాట వేసుకోవచ్చు. అందుకే కందుకూరి ‘చినిగిన చొక్కైనా వేసుకో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అనే సందేశాన్ని నేటితరం ఆచరిస్తే పుస్తకానికి గౌరవం. సాహిత్య రంగానికి ప్రోత్సాహమేదీ? ప్రస్తుతం సాహిత్య రంగానికి ప్రోత్సాహం కరువైంది. కవి పండితులే తమ రచనలను ముద్రించుకొనేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. సెల్ఫోన్, యాంత్రికమైన జీవితానికి అలవాటుపడిన ఈ తరం పుస్తక పఠనంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పిల్లల్లో పుస్తక పఠనాభిలాషను బాల్యం నుంచే అలవర్చాలి. విజ్ఞానం ఎంత ఎదిగినా మన ప్రాచీన సాహిత్య సంపద కాలగర్భంలో కలిసిపోకుండా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. భాషాభిమానుల సహకారంతో పరిరక్షణకు ముందుకు సాగితే సాంస్కృతిక సాహిత్య సంపదను భావితరాలకు అందించవచ్చు. – గుముడాల చక్రవర్తిగౌడ్, తెలుగు ఉపాధ్యాయుడు, యువకవి, దేవరకద్ర అభిరుచిని పెంపొందించుకోవాలి నేటి ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఊపేస్తుంది. ఇంటర్నెట్ ప్రవేశించాక సామాజిక మాధ్యమాల్లో రచనలు విరివిగా వస్తున్నాయి. కానీ, నేటితరం పుస్తకాలకు దూరమవుతున్నారు. మనిషి మానసిక పరిపక్వత చెందాలంటే పుస్తక జ్ఞానం తప్పనిసరి. పుస్తకాలను చదవడం వల్లనే మనిషి అనంతమైన జ్ఞానాన్ని సంపాదించి తన భవిష్యత్ను చక్కగా తీర్చిదిద్దుకుంటాడు. నేటితరం పుస్తక ఆవశ్యకతను గుర్తించి పుస్తక అభిరుచి పెంపొందించుకోవాలి. – డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితీ అధ్యక్షుడు -
పంచాయతీల్లో కో ఆప్షన్ మెంబర్
సాక్షి, మూసాపేట: ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం గ్రామ పంచాయతీలో కో ఆప్షన్ సభ్యులకు చోటు కల్పించనున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో నూతనంగా కో ఆప్షన్ సభ్యులకు అవకాశం కల్పించనున్నారు. గ్రామ పాలనను బలోపేతం చేయడమే లక్ష్యంగా కో ఆప్షన్ సభ్యులను భాగస్వామ్యం చేయనున్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 500 జనాభా కలిగి ఉన్న శివారు గ్రామాలు, గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పాలన వికేంద్రీకరణలో భాగంగా మూసాపేటను నూతనంగా ఏర్పాటు చేయగా అందులో 12 గ్రామ పంచాయతీల నుంచి 15 గ్రామ పంచాయతీలుగా మూసాపేట మండలాన్ని ఏర్పాటు చేశారు. ఈ 15 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కో గ్రామ పంచాయతీలో ముగ్గురి చొప్పున 45 మందిని కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోనున్నారు. వారికి వార్డు సభ్యులతో సమానంగా కో ఆప్షన్ సభ్యులకు కూడా హోదా వస్తుంది. మూడు విభాగాల్లో సభ్యుల ఎన్నిక.. గ్రామ పంచాయతీ పాలక వర్గంలో కో ఆప్షన్ సభ్యులను మూడు విభాగాల్లో ఎన్నుకుంటారు.ఆ గ్రామంలో రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ,గ్రామ పంచాయతీకి ఆర్థికంగా సాయం చేసిన దాతకు కో ఆప్షన్ సభ్యుల కోటాలో అవకాశం కల్పిస్తారు. గ్రామ అభివృద్ధిలో కో ఆప్షన్ సభ్యుల సలహాలు, సూచనలు చేయవచ్చు. గ్రామాల్లో పోటా పోటీ.. మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీల్లో కో ఆప్షన్ సభ్యుల కోసం పోటీ తీవ్రంగా ఉంది. రిజర్వేషన్, సామాజిక వర్గం కలిసి రాక కొందరు, ఖర్చు చేయలేక మరికొందరు పోటీకి దూరంగా ఉన్న వాళ్లు కో ఆప్షన్ పదవులను దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
మార్కెట్ పీఠం దక్కేదెవరికో?
సాక్షి, మదనాపురం: మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందోననే చర్చ సాగుతోంది. వర్తక, వ్యాపార కేంద్రంగా ఉన్న మదనాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ పదివికి అధికార పార్టీలో పలువురు పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోనే మొదటిసారిగా 1946 అక్టోబర్ 1న ఇక్కడ మార్కెట్యార్డ్ ఏర్పడింది. మొదట్లో తహసీల్దార్కు బాధ్యతలు అప్పగించి ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ఈ యార్డుకు ఓ ప్రత్యేతక ఉంది. ఏడు నెలల కిందట ముగిసిన పదవీకాలం చెర్మెన్ పదవీకాలం 2018 ఆగస్టు 8న ముగిసింది. బీసీలకు రిజర్వేషన్ కావడంతో చాలామంది ఆశావహులు మార్కెట్ కమిటీ చెర్మెన్ పదవి కోసం పోటీపడుతున్నారు. కొత్తకోట మండలం నుంచి ముగ్గురు నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. స్వంత మండలానికే ఇవ్వాలనీ మదనాపురం అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డికి సూచించినట్లు ఓ సీనియర్ కార్యకర్త తెలిపారు. వ్యాపార పరంగా అభివృద్ధి చెందడంతో చాలా మంది ఆశావాహులు పోటిలో ఉన్నారు. మదనాపురం నుంచి ఐదుగురు పదవిని ఆశిస్తున్నవారిలో ఉన్నారు. ఏడాదికి రూ.కోటి ఆదాయం ప్రతి ఏటా మార్కెట్ కమిటీ ద్వార ప్రభుత్వానికి కోటి రుపాయాల ఆదాయం వస్తోంది. వరిధాన్యం కొనుగోలు, కందులు, పల్లీల ద్వార ఈ ఆదాయం వస్తుంది. మదనాపురం, కొత్తకోట, అడ్డాకల్, మూసాపేట మండలాలకు చెందిన రైతులు ఇక్కడికి వస్తారు. రూ. 9 కోట్ల నాబార్డు నిధులతో కొత్తకోటలో 5వేల మెట్రికల్ టన్నుల బియ్యం నిల్వ చేసే గోదాం, మదనాపురంలో 10వేల మెట్రిక్ టన్నుల బియ్యం గోదాం నిర్మించారు. 305 ఎకరాల భూమి జిల్లాలో ఎక్కడ లేని విధంగా మదనాపురం, దంతనూరు, తిర్మాలయపల్లి శివార్లను కలుపుతూ మార్కెట్కు 305 ఎకరాల భూమిని అప్పట్లో కేటాయించారు. అయితే 50 ఎకరాలు కృషి విజ్ఞాన కేంద్రానికి, బీసీల నివాసా లకు 14 ఎకరాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 2 ఎకరాలు, పశువైద్యం కేంద్రం ఒక్క ఎకరం, విద్యుత్ సబ్ స్టేషన్ ఎకరన్నర, జిల్లా పరిషత్ పాఠశాల రెండు ఎకరాలు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లకూ మార్కెట్ స్థలం కేటాయించారు. మొత్తంగా ఆదాయం, ఆస్తులు కలిగిన ఈ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిశాకే తేలే పరిస్థితి కనిపిస్తోంది. -
దేవరకద్రలో ఎక్కువ.. పాలమూరులో తక్కువ!
మహబూబ్నగర్ న్యూటౌన్ / దేవరకద్ర : జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పోలిస్తే దేవరకద్రలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గంలో 84.6 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఐదు నియోజకకవర్గాల్లో పోలిస్తే అతి తక్కువగా మహబూబ్నగర్లో 73.5 శాతం నమోదైంది. కాగా, రెండో స్థానంలో జడ్చర్ల నియోజకవర్గంలో 82 శాతం, నారాయణపేటలో 80.7 శాతం పోలింగ్ నమోదు కాగా.. మక్తల్ 77.7 శాతం పోలింగ్తో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక దేవరకద్ర నియోజకవర్గంలోని పలు కేంద్రాల్లో రాత్రి 8.10 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు 76 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అప్పటికే పలు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుని ఉండడంతో టోకెన్లు జారీ చేశారు. భూత్పూర్ మండలంలోని 28, 36 కేంద్రాలకు చివరి నిముషాల్లో ఇతర ప్రాంతాల ఉండే ఓటర్లు రావడంతో పోలింగ్ రాత్రి వరకు కొనసాగింది. ఈ మండలంలోని 28వ పోలింగ్ కేంద్రంలో 82 శాతం, 36వ కేంద్రంలో 86 శాతం పోలింగ్ నమోదైంది. ఇక చిన్నచింతకుంట మండలంలోని 160, 191 పోలింగ్ కేంద్రాల్లో కూడా రాత్రి వరకు పోలింగ్ జరిగింది. తద్వారా చివరకు ఈ నియోజకవర్గం 84.6 శాతం పోలింగ్తో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని పలు కేంద్రాల్లో కూడా 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. కాగా, పోలింగ్ ఆలస్యం కావడానికి ఓటర్లు చివరి సమయంలో ఎక్కువగా రావడం ఓ కారణమైతే.. మరికొన్ని కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడం ఇంకో కారణంగా చెబుతున్నారు. పట్టణ ప్రాంతమైనా.. మహబూబ్నగర్ నియోజకవర్గ కేంద్రం జిల్లా కేంద్రంగా కూడా ఉంది. ఇక్కడ విద్యావంతులు, ఉద్యోగులే ఎక్కువ. అయినప్పటికీ జిల్లాలోనే తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడం గమనార్హం. ఈసారి ఎలాగైనా పోలింగ్ శాతం పెంచాలన్న లక్ష్యంతో అధికారులు అనేక చర్యలు చేపట్టారు. అవగాహన సదస్సులు, చైతన్య ర్యాలీలు చేయించడంతో పాటు ఫ్లెక్సీలు, వీడియోల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలోనే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలిస్తే తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడం విస్మయాన్ని కలిగిస్తోంది. -
పట్టరపట్టు..! టీఆర్ఎస్, మహాకూటమి బాహాబాహీ
సాక్షి, దేవరకద్ర: మండలంలోని నాగారం గ్రామంలో మంగళవారం టీఆర్ఎస్, మహాకూటమి కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహాకూటమి అభ్యర్థి డోకూర్ పవన్కుమార్ నాగారం దేవాలయం వద్ద ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా అదే దారిలో టీఆర్ఎస్ ప్రచార వాహనం వచ్చింది. దీంతో ప్రసంగానికి అడ్డుగా టీఆర్ఎస్ పాటలు వినిపించడంతో వాహనాన్ని వెనక్కి పంపించారు. కొసేపు తరువాత మళ్లీ వచ్చిన టీఆర్ఎస్ వాహనాన్ని మహాకూటమి కార్యకర్తలు అడ్డుకుని నిలిపి వేశారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొని ఉద్రిక్తతకు దారి తీసింది. అనంతరం మహాకూటమి కార్యకర్తలు ప్రచారాన్ని ముగించుకుని వెలుతుండగా దేవరకద్ర నుంచి వచ్చిన టీఆర్ఎస్ నాయకులు అడ్డుగా వచ్చారు. దీంతో మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు తోపులాడుకోవడంతో కొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఇంతలో టీఆర్ఎస్ ప్రచారపు వాహనం అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు పగుల గొట్టారు. దీనికి కారణం మహాకూటమి కార్యకర్తలే అంటూ టీఆర్ఎస్ నాయకులు వాగ్వివాదానికి దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమైన బందోబస్తును పెంచేశారు. ఇదిలా ఉండగా దేవరకద్ర పోలీస్స్టేషన్లో ఇరు వర్గాలు వచ్చి వేర్వేరుగా ఫిర్యాదు చేసినట్టు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
‘పతి’ గెలుపు కోసం ‘సతి’ ప్రచారం
సాక్షి, కొత్తకోట: ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల గెలుపు కొరకు కుటుంబ సభ్యులు ప్రచారం ముమ్మరం చేశారు. దేవరకద్ర టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆల వెంకటేశ్వర్రెడ్డి తరపున ఆయన సతీమణి ఆల మంజుల అదివారం సాయంత్రం పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా ఓటర్లతో ఆమె మాట్లాడుతూ గడిచిన నాలుగున్నరేళ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ది చేశారని, మరోసారి అవకాశం ఇస్తే ఇంకెంతో అభివృద్ది చే స్తారన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్దిని చూసి కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో ఎంపీపీ గుంతమౌనిక, మాజీ సర్పంచ్లు భీసం చెన్నకేశవరెడ్డి, సాక బాలనారాయణ, గాడీల ప్రశాంత్, అమ్మపల్లి బాలకృష్ణ, సత్యంయాదవ్, కో ఆఫ్షన్ సభ్యులు ఘని, బాబురెడ్డి, లతీఫ్, హన్మంత్యాదవ్ పాల్గొన్నారు. -
మిగిలింది 2రోజులే.. కొల్లాపూర్, దేవరకద్ర స్థానాలు.?
సాక్షి, వనపర్తి: నామినేషన్ మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. గంటలు గడుస్తున్నా కొద్దీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. క్షణక్షణాన్ని లెక్కించుకుంటూ అధిష్టానం పిలుపు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తున్న మహాకూటమి తరఫున కొల్లాపూర్, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాల నుంచి పోటీచేసే అభ్యర్థులు ఎవరనే విషయం ఇంకా తేలకపోవడంతో కాంగ్రెస్, టీడీపీ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారితో పాటు ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. నామినేషన్లు దాఖలుచేసేందుకు చివరి గడువు ఈనెల 19వ తేదీతో ముగియనుంది. ప్రచారానికి పట్టుమని 15రోజు సమయం కూడా లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆశావహులు ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్తో పొత్తు, సీట్ల విషయం కొలిక్కి వచ్చాక కూడా అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఖరారు చేయకపోవడంతో టికెట్లను ఆశిస్తున్న వారు లోలోపల రగిలిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత65 మందికి, రెండో విడత 10 మందికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా కూటమిలోని టీడీపీ ఇప్పటివరకు 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయినా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్, దేవరకద్ర నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇద్దరి మధ్యే తీవ్రపోటీ కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం స్థానం నుంచి మహాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి టికెట్ కేటాయించనున్నారు. 2014ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన బీరం హర్షవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్ధన్రెడ్డి వెంట పార్టీలో చేరిన జగదీశ్వర్రావు టికెట్ను ఆశిస్తున్నారు. హర్షవర్ధన్రెడ్డి గత ఎన్నికల్లో మంత్రి జూపల్లి కృష్ణారావుకు గట్టిపోటీ ఇచ్చారు. ఇద్దరి మధ్య కేవలం 6శాతం మాత్రమే తేడా ఉంది. ఈసారి టికెట్ వస్తుందని నాలుగేళ్లుగా అనుకుంటూ పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన హర్షవర్ధన్రెడ్డికి కొన్నినెలల క్రితం కాంగ్రెస్లో చేరిన జగదీశ్వర్రావు మధ్య నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్రెడ్డి జగదీశ్వర్రావుకు మద్దతి ఇస్తుండగా, హర్షవర్ధన్రెడ్డికి మాజీమంత్రి డీకే అరుణ టికెట్ ఇప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సిద్ధమైన జాబితాలో హర్షవర్ధన్రెడ్డి పేరు ఖరారైందని వస్తున్న వార్తలో ఏమేర నిజం ఉందో అభ్యర్థులే తేల్చుకోవాల్సి ఉంది. బీసీలకు దక్కేనా..? దేవరకద్ర నియోజకవర్గం సీటును నిన్న మొన్నటి వరకు పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయిస్తారని వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకే ఈ స్థానాన్ని కేటాయిస్తారని అంతా అనుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన డోకూరి పవన్కుమార్రెడ్డి ఈ సారి కూడా తనకే టికెట్ వస్తుందని భావిస్తున్నారు. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ నుంచి బీసీలకు ఒక్క స్థానమైనా కేటాయించలేదనే అపవాదు నెలకొనే అవకాశం ఉందని భావించి బీసీ అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీసీ సామాజికవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కాటం ప్రదీప్కుమార్గౌడ్, రామేశ్వర రావు ఉన్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల పెద్దగా సమయం లేకపోవడంతో నేడో రేపో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రగిలిపోతున్న కేడర్ కొల్లాపూర్, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాలకు మహాకూటమి అభ్యర్థులను ఇప్పటికీ ప్రకటించకపోవడంతో డోకూరి పవన్కుమార్, హర్షవర్ధన్రెడ్డి అనుచరులు లోలోపల రగిలిపోతున్నారు. పవన్కుమార్రెడ్డికి శనివారంలోగా టికెట్ ప్రకటించకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ఆయన అనుచరులు ఇప్పటికే ప్రకటించారు. ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొల్లాపూర్లోనూ హర్షవర్ధన్రెడ్డి అనుచరులు పార్టీ అధిష్టానం తీరుపై కోపంతో రగిలిపోతున్నారు. ఇదిలాఉండగా, టీఆర్ఎస్ రెండు నెలల క్రితమే అభ్యర్థులను ప్రకటించడంతో నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే అన్ని గ్రామాలు, మండలాలను చుట్టేశారు. ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు. కానీ కూటమి అభ్యర్థులు ఎవరనే విషయం తేలకపోవడంతో కిందిస్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తల్లోనూ నైరాశ్యం నెలకొంది. ఏదేమైనా నామినేషన్లకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో నేడోరేపో అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇన్ని రోజుల పాటు టికెట్లను ఆశించి ఎదురుచూసిన అభ్యర్థులకు టికెట్లు రాకపోతే పరిస్థితి ఏమిటన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. -
పేదల బతుకుల్లో వెలుగులు నింపుతాం
సాక్షి, చిన్నచింతకుంట: పేదల స్థితిగతులను అధ్యయనం చేసిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని, ఆ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే పేదల బతుకుల్లో వెలుగులు నింపుతామని కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు గోవర్ధన్రెడ్డి, ధనుంజయ్ అన్నారు. సోమవారం మండలంలోని తిర్మలాపూర్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కరపత్రాలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రెట్టింపు పింఛన్లుతో పాటు రైతులకు పంట పెట్టుబడి సాయం, ఒకే దఫాలో రూ.2లక్షల రుణమాఫీ అందిస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ దేవరకద్ర నియోజకవర్గ యూత్ కన్వీనర్ మహిపాల్రెడ్డి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శి అక్బర్, తిర్మలాపూర్ గ్రామ ఎంపీటీసీ. సత్యం, కతలప్ప, మాసిరెడ్డి, మధుసూధన్రెడ్డి, మహేష్, శ్రీను పాల్గొన్నారు. అమిస్తాపూర్లో రెండో రోజు ప్రచారం భూత్పూర్: మున్సిపాలిటీ పరిదిలోని అమిస్తాపూర్లో సోమవారం కాంగ్రెస్ నాయకులు ఇంటింటా ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన హామీలు అమలు గురించి వివరించారు. చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారం ఇవ్వాలని వారు కోరారు. రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామని గ్రామాల్లో ఓటర్లకు వివరిస్తున్నారు. పెన్షన్ల పెంపు, తిదితర విషయాలను వివరించారు. కార్యక్రమంలో మండల కాంగ్రె‹స్ పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి నాయకులు శ్రీకాంత్రెడ్డి, సాధిక్, ఫసియోద్దీన్, ఫారుక్, ఆనంద్ ,నరేందర్,,తిరుపతి రెడ్డి,యాదిరెడ్డి,గాల్రెడ్డి ,ఆగిరి రవి, హతిరాం పాల్గొన్నారు. నేటి నుంచి ముమ్మర ప్రచారం మూసాపేట: నేటి నుంచి మండలంలో సభలు సమావేశాలు నిర్వహించి ప్రచారాన్ని ముమ్మరం చేద్దామని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల నర్సింహులు, అజయకుమార్రెడ్డి అన్నారు. సోమవారం దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ డోకూర్ పవన్కుమార్రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ మండల ముఖ్యనాయకులంతా సమావేశమయ్యారు. నియోజకవర్గం నుంచి తనకే పోటీ చేసే అవకాశం వచ్చిందని ఢిల్లీలో ఉన్న పవన్కుమార్ ఫోన్లో తెలిపారని, దీంతో నేటి నుంచి ప్రచారం ముమ్మరం చేయాలని నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో శెట్టి శేఖర్, సీఎచ్ వెంకటయ్య, సుధాకర్రెడ్డి యాదయ్య, వెంకటేష్, సమరసింహారెడ్డి, శ్రీనివాసులు, రవి సాగర్, రాజేందర్రెడ్డి, రాంకుమార్యాదవ్, నర్సింహారెడ్డి, మహేష్, రాజు, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిపేదెప్పుడో!
సాక్షి, దేవరకద్ర రూరల్ : దేవరకద్ర రైల్వేస్టేషన్లో ఎక్స్ప్రెస్ రైలు ఆగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బం దిపడుతున్నారు. ఇక్కడ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపాలని ప్రయాణికులు కొన్నేళ్లుగా రైల్వే అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. అలాగే వివిధ సందర్భాలలో ఉన్నత స్థాయి అధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు విన్నవిస్తున్నా వారు పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు, స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ స్టేషన్ నుంచి ఇటు హైదరాబాద్ వైపు, అటు కర్నూల్ వైపు దాదాపు 25కు పైగా ఎక్స్ప్రెస్ రైళ్లు వెళ్తుంటాయి. కానీ ఏ ఒక్కటీ రైల్వేస్టేషన్లో నిలుపడం లేదు. 40గ్రామాలకు కూడలి దేవరకద్రలో వ్యవసాయ మార్కెట్యార్డుతో పాటు మూడు మండలాలు 40కి పైగా గ్రామాలకు దేవరకద్ర కూడలిగా ఉంది. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం, స్విట్స్ ఇంజనీరింగ్ కళాశాల దేవరకద్రకు 6కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రం కావడం వల్ల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపడం వల్ల రోజురోజుకూ దూరప్రాంతాలకు ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ అవకాశం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. మహబూబ్నగర్ వెళ్లి అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రతిరోజు దేవరకద్ర రైల్వేస్టేషన్ మీదుగా మూడు ప్యాసింజర్ రైళ్లు హైదరాబాద్ వైపు, మూడు ప్యాసింజర్ రైళ్లు కర్నూలు వైపు వెళ్తున్నాయి. ఇవి మాత్రమే ఇక్కడ ఆపుతున్నారు. రద్దీకి తగ్గట్టుగా రైల్వేస్టేషన్ను తీర్చిదిద్దినా, తమ అభిప్రాయాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో నాయకులు, పాలకులు హామీలు ఇచ్చి తర్వాత పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, రైల్వే అధికారులు స్పందించాలని, దేవరకద్ర రైల్వేస్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపేలా కృషి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇబ్బందిగా ఉంది ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది. కొన్నేళ్లుగా ఈ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనిగురించి చాలా సార్లు రైల్వే ఉన్నతాధికారులకు విన్నవించాం. అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే అవకాశం ఉంటేనే ఇక్కడి స్టేషన్ నుంచి ప్రయాణికుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుందనే విషయం రైల్వే అధికారులు గుర్తించాలి. – కల్వ నరేశ్, దేవరకద్ర -
బతికి ఉండగానే చంపేశారు!
భూత్పూర్(దేవరకద్ర): పెన్షన్లు మంజూరు చేయాలని ప్రతీ సోమవారం అధికారులకు దరఖాస్తు చేసుకున్నా పలువురికి మంజూరు కావడం లేదు.. ఇక వస్తున్న పింఛన్లు ఆగడంతో పలువురు ఆవేదన చెందుతున్నారు. ఈ మేరకు అమిస్తాపూర్ గ్రామానికి చెందిన ఈరమ్మ సోమవారం భూత్పూర్లో ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. తనకు అభయ హస్తం పింఛన్ ఆగిపోయి మూడు నెలలైందని.. చనిపోయినట్లు చెబుతూ పేరు తొలగించాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. దీంతో ఎంపీడీఓ గోపాల్నాయక్.. మహిళా సమాఖ్య సీసీపై మండిపడ్డారు. ఈరమ్మ పింఛన్ తొలగించడానికి కారణాలను తెలియజేయాలని ఆదేశించారు. -
పద బడికి....
సాక్షి, దేవరకద్ర : మహబూబ్నగర్ కలెక్టర్ రొనాల్డ్ రోస్ జిల్లా కేంద్రం నుంచి దేవరకద్రలోని కందుల కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు నిన్న (గురువారం) ఉదయం బయలుదేరారు. మార్గమధ్యలో కోయిల్కొండ పోతన్పల్లి వద్ద వద్ద కొందరు పిల్లలు మేకలను కాస్తూ కనిపించారు. ఇది చూసిన ఆయన వాహనం ఆపి వారితో మాట్లాడారు. చదువుకోవాల్సిన వయస్సులో ఈ పని ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తన వాహనంలో ఎక్కించుకుని దేవరకద్ర ఉర్దూ మీడియం పాఠశాలకు తీసుకొచ్చారు. ఆ పిల్లల్లో ఒకరు ఖాజా కాగా, మరొకరు మౌలానా. వారి తండ్రి చనిపోవడంతో 3వ తరగతి, 9వ తరగతి చదువుతూ మానేశారని ఉపాధ్యాయులు తెలిపారు. వారిద్దరిని పాఠశాలలో చేర్పించి సక్రమంగా వచ్చేలా చూడాలని, డ్రాపౌట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కాగా, విద్యార్థులపై కలెక్టర్ చూపిన ప్రత్యేక శ్రద్ధపై పలువురు అభినందించారు. -
తెలంగాణలో నిరంకుశ పాలన
దేవరకద్ర : తెలంగాణలో సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆరోపించారు. ప్రజలు ఆందోళన చేయడానికి కూడా వీలులేని పరిస్థితులను కల్పిస్తూ అణచివేసే ధోరణికి పాల్పడుతున్నారని విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక తెలంగాణ పోరుబాట బస్సుయాత్ర మంగళవారం దేవరకద్రకు చేరింది. ఈ సందర్బంగా కొత్తబస్టాండ్ చౌరస్తాలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తన ఒక్కడి వల్లనే తెలంగాణ వచ్చిందనే అహంభావంతో కేసీఆర్ మాట్లాడు తున్నారని అన్నారు. వాస్తవానికి 1200మంది విద్యార్థులు, నిరుద్యోగులు ప్రాణత్యాగాలు చేశారని, నాలుగున్నర కోట్ల ప్రజలు పోరాడారని అన్నారు. తెలంగాణలో దొరల పాలన, కుటుంబ పాలన సాగుతున్నదని ఆరోపించారు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తా నని ఎన్నికలకు ముందు చెప్పిన కేసీఆర్ మాటతప్పాడ ని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. పీసీసీ సభ్యులు కాంగ్రెస్ ఇన్చార్జ్ డోకూర్ పవన్కుమార్రెడ్డి, సీపీఐ డివిజన్ కార్యదర్శి దేవదాసు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజ్కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాందాసు, సీపీఐ రాష్ట్ర నాయకులు బాలమల్లేశ్, పద్మ, మహ్మద్యూసఫ్, పాండురంగాచారి, సృజన, రాములు, రమావత్ అంజ య్య, లక్ష్మీనారాయణ పల్లె నరసింహా, నల్లా శ్రావణి పాల్గొన్నారు. అభివృద్దికి నోచుకోని తెలంగాణ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధికి నోచుకోవడంలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్లోని అల్మాస్ ఫంక్షన్హాల్లో ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పద్మ, నర్సింçహ, ఆదిరెడ్డి,బాల్మల్లేష్, రామకృష్ణ, సురేష్ పాల్గొన్నారు. సామాజిక తెలంగాణ కోసమే... మరికల్: సామాజిక తెలంగాణ కోసమే సీపీఐ ఆధ్వర్యం లో పోరుబాట చేపడుతున్నామని జరిగిందని చాడ వెం కట్రెడ్డి అన్నారు. యాత్ర మరికల్కు చేరుకున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, భవన నిర్మాణ కార్మికులు ఘనంగా స్వాగతం పలికారు. కాంగ్రెస్ మండల అధ్యక్షు డు వీరబసంత్, కృష్ణయ్య, బాలకిష్ణ, టంకరశ్రీను, కృష్ణ య్య, గోపి, సీపీఐ నాయకులు పాల్గొన్నారు. ‘ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్’ మక్తల్: మక్తల్లోని అంబేద్కర్చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చాడ మాట్లాడారు. పోరుబాట కార్యక్రమానికి ప్రజల నుంచి మంచిస్పందన వస్తోందని అన్నారు. అన్నిపక్షాల నాయకులు సహకరిస్తున్నారని అన్నారు. ఏఐటీయూసీ నాయకుడు కొండ న్న అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు నారాయణపేట క్రాసింగ్ వద్ద మక్తల్ అఖిలపక్షం నాయకులు స్వాగతం పలికి అంబేద్కర్ చౌర స్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వెంకట్రెడ్డిని పలువురు సన్మానించారు. కార్యక్రమంలో మక్తల్ పీసీసీ సభ్యులు శ్రీనివాస్గుప్తా, సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు బాలమల్లేష్, పశ్యపద్మ, మహ్మద్యూసుఫ్, సాయిలు, సృజన, పండురంగాచారీ, బి.రాములు, అంజయ్యనాయక్, లక్ష్మీనారాయణ, పల్లె నర్సింహ, నల్ల శ్రావణి, రామక్రిష్ణ, ఏఐటీయూసీ నాయకులు కొండన్న,శాంతప్ప, ఈశ్వర్, తాయప్ప, దత్తాత్రేయ, ఎం.నర్సిములు పాల్గొన్నారు. -
సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో పొగలు
మహబూబ్నగర్ : దేవరకద్ర రైల్వేస్టేషన్ దాటుతున్న క్రమంలో ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన కొంత సేపు నిలిపేశారు. రైలు ఆపేసిన వెంటనే జనం కిందకు పరుగులు పెట్టారు. రైలును ఆపి పరిశీలించగా బ్రేకులు పట్టి వేయడంతో పొగలు వచ్చినట్లుగా గుర్తించారు. కొద్ది సేపటి తర్వాత రైలు మళ్లీ కదిలింది. రైలు తిరుపతి నుంచి కాచిగూడ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. -
నష్టం మిగిల్చిన భారీ వర్షం
జిల్లా వ్యాప్తంగా 30.6మిల్లీమీటర్ల నమోదు అత్యధికంగా దేవరకద్ర మండలంలో 84 మి.మీ వరుస వర్షపాతంతో పంటలకు చేటు 1500హెక్టార్లలో జొన్నకు నష్టం, నలుపురంగులోకి గింజ తడిసిన ఉల్లి, మునిగిపోయిన పత్తి, వరి పొంగుతున్న వాగులు, వంకలు పలుచోట్ల తెగిపోయిన లింక్రోడ్లు కూలిపోయిన మట్టిమిద్దెలు సాక్షి ప్రతినిధి మహబూబ్నగర్ : వరుణుడు ఆగ్రహించాడు. ఇన్ని రోజులు వర్షం లేక అల్లాడిన రైతుకు ఇన్ని రోజులు వరుణుడి కోసం ఎదురుచూసిన జిల్లాలో వర్షం జోరు కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఒక్కరోజే 30.6మి.మీ వర్షపాతం నమోదైంది. దేవరకద్ర మండలంలో అత్యధికంగా 84మి.మీ వర్షపాతం న మోదైంది. ఖరీఫ్ సీజన్ సగటు వర్షపాతం 446.8 మి.మీ కాగా, శుక్రవారంతో సగటు వర్షపాతంను దాటి 448.1మి.మీ వర్షపాతం నమోదైంది. శుక్రవారం 48 మండలాల్లో అత్యధిక, 6 మండలాల్లో మోస్తరు, మరో ఆరు మండలాల్లో సగటు వర్షపాతం నమోదైంది. మరో 4 మండలాల్లో అసలు వర్షం పడలేదు. శుక్రవారం కురిసిన వర్షపాతంలో అత్యధికంగా కొల్లాపూర్ మండలంలో 82.2మి.మీ, మహబూబ్నగర్లో 75.2మి.మీ, మల్దకల్లో 71.4మి.మీ, హన్వాడలో 69.4మి.మీ, పెబ్బేరులో 69.2మి.మీ, అలంపూర్ మండలంలో 67.2మి.మీ, మక్తల్, మాగనూర్ మండల్లాలో 60మి.మీ నమోదైంది. వేల ఎకరాల్లో పంటలకు చేటు నాలగైదు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాలతో జిల్లాలో సాగుచేసిన పంటలకు నష్టం వాటì ల్లే ప్రమాదం ఏర్పడింది. కొడంగల్ నియోజకవర్గం పరిధిలో 1500 హెక్టార్లలో జొన్న పంటకు బూజు లె గులు సోకడంతో పాటు గింజనలుపుగా మారిందని, దీంతో రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొల్లాపూర్ నియోజకవర్గాన్ని వర్షం అతలాకుతలం చేసింది. వీపనగండ్ల మండల పరిధిలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి జూరాల కాలువ నీళ్లు తోడవడంతో లోతట్టు ప్రాంతంలో ఉన్న చిన్నమారూర్ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. 900 ఎకరాల పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. కొల్లాపూర్లో 82.22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరిదేల చెరువు, నల్లపురాతి కుంట, చుక్కాయిపల్లి చెరువులు నిండిపోయాయి. చెరువులన్నీ అలుగులు పారాయి. రామాపురం వద్ద వాగు ఉప్పొంగడంతో రహదారి మరోసారి కోతకు గురైంది. దీంతో రోజంతా వాహనాల రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. కేఎల్ఐ కాలువ కట్ట రెండు చోట్ల కోతలకు గురైంది. కోడేరులో ఓ మట్టి మిద్దె గురువారం అర్థరాత్రి ఆకస్మికంగా కూలడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. పానగల్ మండలం బుసిరెడ్డిపల్లి, మల్లాయిపల్లి గ్రామాలల్లో పలువురి ఇళ్లు కూలిపోయాయి. అడ్డాకుల మండలంలో 20 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దేవరకద్ర మండలంలోని పెద్దరాజమూర్ గ్రామంలోకి వరద నీరు ప్రవహిస్తోంది. కోయిల్సాగర్ ప్రాజెక్టులో శుక్రవారం సాయంత్రం నాటికి నీటి మట్టం 20 ఫీట్లకు చేరింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురువడంతో ప్రాజెక్టులోకి వచ్చి చేరే ఆంకిళ్ల, కోయిలకొండ వాగులు ఉధృతంగా ప్రవహించి కోయిల్సాగర్లోకి వచ్చి చేరుతున్నాయి. దేవరకద్ర – చిన్నచింతకుంట మండల పరిధిలో ఉన్న బండర్పల్లి వాగునీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. చిన్నచింతకుంట మండలంలోని దుప్పల్లి, చిన్నచింతకుంట, అల్లీపురం, తదితర గ్రామాల్లో కంది పత్తి పంటల్లో నీరు వచ్చి చేరింది. దౌల్తాబాద్ మండలంలో పత్తి పంట బూజు పట్టింది. మాటూరు గ్రామంలో మూడు ఇళ్లు కూలిపోయాయి. కోస్గి మండలంలో 27మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. కొడంగల్ శివారులో భారీ వర్షానికి కొట్టుకుపోయిన కాగ్నా వాగు బ్రిడ్జి మరమ్మతు పనులను ఆర్అండ్బీ అధికారులు శుక్రవారం ప్రారంభించారు. ధన్వాడ మండలంలోని పూసల్పహాడ్ గ్రామంలోనే 50 ఎకరాలు వరిపంట నీట మునిగింది. గోటూర్ పెద్ద చెరువు, పెద్దచింతకుంట ఎర్రకుంట, రాంకిష్టయ్యపల్లి ఊరచెరువులు అలుగు పారాయి. ధరూరు మండలంలో మన్నాపురం – సోంపురానికి వెళ్లే రోడ్డు పూర్తిగా తెగిపోయింది. మల్దకల్ మండలంలోని బిజ్వారం, దాసరిపల్లి, మేకలసోంపల్లి, ఉలిగేపల్లి, అమరవాయి, నీలిపల్లి, సద్దలోనిపల్లి, పాలవాయి గ్రామాల్లో రైతులు సాగు చేసిన పత్తి, వరి, ఆముదం, మిరప, కంది పంటలు వర్షాలకు నేలకొరిగాయి. 100 ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయని రైతులు వాపోయారు. గట్టు మండలంలోని ఆరగిద్దలో మట్టిమిద్దె కూలింది. అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్, మానవపాడు, వడ్డేపల్లి మండలాల్లో పప్పుశనగ పంటకు జీవం పోసినట్లయ్యింది. మానవపాడు పరిధిలోని అమరవాయి–మానవపాడుకు వెల్లేదారిలో బ్రిడ్జిపైకి భారీగా నీరు చేరింది. అయిజ మండలంలో గుడిసెలు, మట్టి మిద్దెలు కలిపి మొత్తం 52 ఇళ్లు కూలినట్లు అధికారులు గుర్తించారు. శాంతినగర్ మండలంలో కల్లాల్లో ఉంచిన ఉల్లి తడిసిపోయింది. రాజోలి కొత్త వీవర్స్కాలనీ, శ్రీరాంగనర్లలో ఏర్పాటుచేసుకున్న చేనేత మగ్గాల్లోకి వర్షపునీరు చేరింది. రాజోలి సమీపంలోని పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నవాబుపేట మండలంలో గాలివానకు నాలుగు ఇళ్లు కూలిపోయాయి. పెబ్బేరు మండలంలో బీమా, జూరాల కాలువల ద్వారా నీళ్లు వస్తుండడంతో తాటిపాముల, సూగూరు తదితర గ్రామాల చెరువులు అలుగు పారుతున్నాయి. 280 ఎకరాలలో పంటలను నీటమునిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. -
దొంగ పట్టివేత
దేవరకద్ర : తరచూ దొంగతానికి పాల్పడుతున్న ఓ నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను బుధవారం దేవరకద్ర పోలీస్స్టేషన్లో ఆత్మకూర్ సీఐ ప్రభాకర్రెడ్డి వెల్లడించారు. మహబూబ్నగర్ పట్టణంలోని పాతతోటకు చెందిన మొండి అంజి జులాయిగా తిరుగుతూ దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలోనే దేవరకద్ర పట్టణంలో నాలుగు చోట్ల, గద్వాలలో మరోచోట చోరీకి పాల్పడ్డాడు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చివరకు బుధవారం నిందితుడిని అరెస్టు చేసి ఏడు తులాల బంగారం, 50తులాల వెండి నగలను స్వాధీనపరుచుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ సమావేశంలో ఎస్ఐలు వినయ్కుమార్రెడ్డి, రాజు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆటోను ఢీకొట్టిన కారు
దేవరకద్ర: మహబూబ్నగర్ జిల్లా లోని దేవరకద్ర మండలంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆటోను కారు ఢీకొట్టింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులంతా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. శబరిమల వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
ఉద్యోగం కోసం వెళ్లి.. రైలు పట్టాలపై నిర్జీవంగా..
దేవరకద్ర రూరల్ (మహబూబ్నగర్) : పీజీ చదువుతూ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు ఉద్యోగం చేయాలనుకున్న ఓ వ్యక్తి రైలు పట్టాలపై శవమై కనిపించాడు. మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామానికి చెందిన వడ్ల రామకృష్ణ (23) డిగ్రీ పూర్తి చేశాడు. మహబూబ్నగర్లో పీజీ చదువుతున్నాడు. ఉద్యోగం కోసమని సర్టిఫికెట్లు జిరాక్స్లు తీసుకుని ఈ నెల 3న ఇంటి నుంచి బయల్దేరాడు. కాగా శనివారం దేవరకద్ర సమీపంలో రైలు పట్టాలపై మృతి చెంది ఉండగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
5 నెలల పసికందు సహా తల్లి ఆత్మహత్య
దేవరకద్ర: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన వివాహిత తన ఐదు నెలల చిన్నారితో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మల్లమ్మకు (22) మణికొండకు చెందిన వ్యక్తితో మూడేళ్ల క్రితం పెళైంది. వీరికి ఐదునెలల పాప ఉంది. పండుగ కోసం తల్లి గారింటికి వచ్చిన మల్లమ్మ తిరిగి భర్త దగ్గరకు వెళ్లకపోవడంతో కుటుంబంలో తగాదాలు తలెత్తాయి. దీంతో మనస్తాపం చెందిన మల్లమ్మ తన పాపతో సహా ఆదివారం రాత్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. -
ముంచెత్తిన సోనా మసూరి
దేవరకద్ర, న్యూస్లైన్: దేవరకద్ర మార్కెట్కు ధాన్యం కళ సంతరించుకుంది. సోమవారం రైతులు పెద్దఎత్తున సోనామసూరి ధాన్యాన్ని అమ్మకానికి తెచ్చారు. గత రెండు రోజులుగా మార్కెట్యార్డుకు సెల వు ఇవ్వడం వల్ల ఒకేరోజు వివిధ ప్రాం తాల నుంచి రైతులు వేలబస్తాల ధాన్యాన్ని తీసుకొచ్చారు. దేవరకద్ర, ధన్వాడ, చిన్నచింతకుంట, కోయిల్కొండ, అడ్డాకుల, నర్వ, మండలాల నుంచి రైతులు ఇక్కడి మార్కెట్కు ధాన్యం పెద్దఎత్తున తెస్తున్నారు. మార్కెట్యార్డులోని పాత దుకాణ సముదాయాల ఆవరణతో పాటు కొత్త దుకాణాల ఆవరణమంతా ధాన్యం రాసులతో నిండిపోయింది. మార్కెట్లో ఉన్న షెడ్లుకూడా ధాన్యంతోనే నిండిపోగా కొంద రు రైతులు ధాన్యం తీసుకురావడానికి వ్యాపారులతో అనుమతి తీసుకుంటున్నా రు. గత నెల రోజులుగా ఎక్కువగా హంస ధాన్యం మార్కెట్ రాగా, ఇప్పుడు కోతలు పెరగడంతో సోనామసూరి ఎక్కువగా వస్తోంది. మార్కెట్కు దాదాపు పదివేల బస్తాల ధాన్యం మార్కెట్కు వచ్చినట్లు అంచనా. కానీ అధికారులు అంచనా ప్రకా రం దాదాపు నాలుగువేల బస్తాల ధాన్యం వచ్చినట్లు టెండర్లలో చూపించారు. పెరగని ధాన్యం ధరలు రైతులు పండించిన ధాన్యం ఎక్కువగా మా ర్కెట్ రావడం వల్ల ధరలు తగ్గి పోతున్నా యి. సోనామసూరి ధాన్యానికి ధరలు మా త్రం తక్కువగానే వస్తున్నది. క్వింటాలుకు ధర రూ.1500దాటడంలేదు. కొంత నాణ్య త లేని ధాన్యానికి ఏకంగా రూ.1300 వ్యా పారులు టెండర్లు వేస్తున్నారు. సోమవారం వచ్చిన ధరలు ఇలా ఉన్నాయి. సోనామసూరికి గరిష్ట ధర క్వింటాలుకు రూ.1582, తక్కువ ధర రూ. 1301 ఉండగా, హంస ధాన్యం గరిష్టధర రూ.1424, కనిష్టధర రూ.1310గా టెండర్లు ఖరారయ్యాయి. తగ్గిన బియ్యం ధరలు పాత సోనామసూరి బియ్యం రూ.నాలుగువేలకు క్వింటాలుకు ఉండగా, ప్రస్తుతం ఖ రీఫ్ సీజన్లో పండించిన సోనామసూరి కొ త్త బియ్యానికి క్వింటాలుకు రూ.2600 నుం చి రూ. 2700 వరకు ధరలు పలుకుతున్నాయి. ధాన్యం ధరలు తక్కువగా ఉండ టం వల్ల బియ్యం ధరలు కూడా తగ్గిపోయాయి. ధరలు తక్కువగా ఉన్నప్పుడే బియ్యం కొనాలనే ఉద్దేశంతో పలువురు రైస్మిల్లుల నుంచి నేరుగా బియ్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో మిల్లుల వద్ద వ్యాపారం జోరందుకుంది. -
గద్దెగూడెంలో మూడు చిరుతల సంచారం
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లాలో చిరుతల సంచారం ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేవరకద్ర మండలం గద్దెగూడెంలో మూడు చిరుత పులులు సంచరిస్తున్నారు. గ్రామంలోని ఓ ఆవుపై చిరుత దాడి చేయటంతో ఆవు మృతి చెందింది. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.