Seattle
-
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula) కేసులో విద్యార్థుల, ఎన్నారైల పోరాటం ఫలించింది. ఆమె మృతికి కారణమైన అధికారిని విధుల్లోంచి తొలగించినట్లు సియాటెల్ పోలీస్ శాఖ ప్రకటించింది. ఇంతకు ముందు.. ఇదే కేసులో ఆమె మరణం గురించి చులకనగా మాట్లాడిన అధికారిపై సైతం వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసులో న్యాయం జరిగినట్లైంది!.ఆంధ్రప్రదేశ్కు చెందిన జాహ్నవి కందుల(23).. 2023,జనవరి 23వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. కెవిన్ డేవ్ అనే పోలీస్ అధికారి అతివేగంగా పాట్రోలింగ్ వాహనం నడుపుతూ వచ్చి రోడ్డు దాటుతున్న ఆమెను ఢీ కొట్టాడు. దీంతో.. ఆమె చాలాదూరం ఎగిరిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది.అయితే విధి నిర్వహణలో భాగంగానే ఆయన అంత వేగంగా వెళ్లాల్సి వచ్చిందని.. కాబట్టి ఆయనపై ఎలాంటి చర్యలు అవసరం లేదని తొలుత పోలీస్ శాఖ భావించింది. అలాగే ఆమె మరణంపై చులకనగా మాట్లాడిన అధికారి విషయంలోనూ క్షమాగుణం ప్రదర్శించింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపించాయి. జస్టిస్ ఫర్ జాహ్నవి పేరుతో విద్యార్థులు ఫ్లకార్డులతో రోడ్డెక్కి నిరసనసలు చేపట్టారు. దీంతో సియాటెల్ పోలీస్ శాఖ దిగొచ్చింది. ఉన్నతస్థాయి దర్యాప్తుతో పాటు కోర్టు క్లియరెన్స్ కోసం ఎదురు చూసింది. చివరకు చర్యలకు ఉపక్రమించింది. ఇదీ చదవండి: జాహ్నవికి మరణానంతర డిగ్రీ‘‘ఘటనలో ఆయన ఉద్దేశపూర్వకంగా వ్యవహరించి ఉండకపోవచ్చు. డ్రగ్స్ ఓవర్డోస్ అయిన బాధితుడ్ని రక్షించాలని ఆయన తాపత్రయపడ్డారు. ఆ క్రమంలోనే తన వాహనంతో ఢీ కొట్టి ప్రాణం పోయేందుకు కారణం అయ్యారు. అయితే ఆయన తన వాహనాన్ని అత్యంత ప్రమాదకరంగా నడిపారు. సియాటెల్ పోలీస్ విభాగానికి చెడ్డ పేరు తెచ్చారు. డిపార్ట్మెంట్ పాలసీల్లో నాలుగింటిని ఆయన ఉల్లంఘించారు. అందుకే సియాటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డేవ్ను తొలగించాం’’ అని సియాటెల్ తాత్కాలిక పోలీస్ చీఫ్ సూ రెహర్ ప్రకటించారు. ఆమె ప్రకటనను సియాటెల్ టైమ్స్ సోమవారం ప్రచురించింది. అంతకు ముందు.. ఇదే కేసులో ఆమె మృతి పట్ల అనుచితంగా మాట్లాడిన అధికారి డేనియల్ అడెరెర్ను సైతం గతేడాది సెప్టెంబర్లో విధుల్లోంచి తొలగించారు.ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. పోలీస్ అధికారి నిర్లక్ష్యపు డ్రైవింగ్తో ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పైగా.. ఆమె ప్రాణం విలువ గురించి మరో అధికారి చులకనగా మాట్లాడారు. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి Just a regular person.. ఈ మరణానికి విలువలేదు. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉంది. కేవలం ఓ చెక్ ఇస్తే సరిపోతుందని.. 26 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది’ అని నవ్వుతూ మాట్లాడాడు. ఈ క్లిప్ బయటకు రావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నారైల నుంచి, విద్యార్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. అటు భారత్ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో దర్యాప్తు అనంతరం అతన్ని విధుల్లోంచి తొలగించింది. అయితే.. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని డేనియల్ అడెరె వివరణ ఇచ్చినప్పటికీ వేటు మాత్రం తప్పలేదు. -
శివగామినే మించిపోయిన సాహసమది!.. గుర్తుందా?
తన ప్రాణం పోతున్నా లెక్కచేయకుండా పసికందుగా ఉన్న మహేంద్రుడిని నీట మునగకుండా ఒక చేత్తో పైకెత్తి ముందుకెళ్తుంది రాజమాత శివగామి బాహుబలి(Bahubali)లో. కానీ, ఇక్కడో తల్లి తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ ఊపిరి కోసం.. ఏ తల్లి చేయని సాహసం చేసి చరిత్రకెక్కింది. అయితే ఆ సాహసమే ఆరేళ్ల తర్వాత.. అదే తల్లిని మళ్లీ వార్తల్లో నిలబెట్టింది.జే35 అనే ఓర్కా తిమింగలం.. మరో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 23వ తేదీన అది ఓ బిడ్డకు జన్మనిచ్చిందని సెంటర్ ఫర్ వేల్ రీసెర్చ్ అనే ఫేస్బుక్ పేజీ ప్రకటించింది. ఆ ఆడ ఓర్కా(Orca) పిల్లకు జే61గా నామకరణం చేశారు. సియాటెల్ నగరపు తీరాన ఉన్న రీసెర్చ్ సెంటర్ వద్దకు చేరుకుంటున్న అంతర్జాతీయ మీడియా సంస్థల ఫొటోగ్రాఫర్లు ఆ తల్లీబిడ్డలను క్లిక్మనిపిస్తున్నారు. ఇందులో అంత చెప్పుకోదగిన విషయం ఏముందని అంటారా?.. ఆరేళ్ల కిందట.. బ్రిటీష్ కొలంబియా విక్టోరియాలోని తీర ప్రాంతానికి ఓ ఓర్కా తిమింగలం ఈదుకుంటూ వచ్చింది. అయితే దాని వీపు మీద ఓ పిల్ల ఓర్కాను మోసుకుంటూ వచ్చిందది. ఆ ప్రయాణం వెనుక ఎంతో వ్యధ ఉందని తర్వాతే తేలింది. పుట్టిన గంటకే బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ తల్లి ఓర్కా బిడ్డకు వీడ్కోలు చెప్పాలని అనుకోలేదు. మళ్లీ ఊపిరి తీసుకుంటుందన్న ఆశతో తలపై మోసుకుంటూ నీటిలో పైకి, కిందకు ఈదటం(Swim) ప్రారంభించింది. అలా గంటలు గడిచాయి.. రోజులు దొర్లిపోయాయి. తలపై 400 పౌండ్ల(181 కేజీల) బరువుతో.. ఏకంగా 17 రోజులపాటు ఏకధాటిగా 1,600 కిలోమీటర్లు ప్రయాణించిందది!. చివరకు.. సాన్ జువాన్ ఐలాండ్ వద్ద ప్రముఖ వేల్ రీసెర్చర్ కెన్ బాల్కోమ్ ఆ అమ్మ ప్రేమను ఓ డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. జంతువుల్లో ఇలాంటి ప్రవర్తన సాధారణమే అయినా.. జే35 ప్రేమ మాత్రం అసాధారణమని కొనియాడారు. అలా ఆ దృశ్యాలు.. చూపరుల గుండెను బరువెక్కించాయి. చరిత్రకెక్కిన ఆ తల్లి ఓర్కానే ఈ జే35. సాధారణంగా.. ఓర్కాలు కిల్లర్ వేల్(Killer Whale)లు. సముద్రపు డాల్ఫిన్ జాతిలోనే అతి పెద్దవి. అయితే వాటి మనుగడ చాలా కష్టంగా ఉంటుంది. గుంపుగా బతికే సమూహంలో.. ఏడాది వయసున్న పిల్లలను రక్షించుకోవడానికి అవి సాహసాలే చేస్తుంటాయి. ఆ గండం దాటితే అవి బతికి బట్టకట్టినట్లే!. అయితే.. జే35 ఓర్కాకు జే61ను ఏడాదిపాటు కాపాడుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆ తల్లి మనుసు గతంలోనే ఓసారి గాయపడింది. అయినప్పటికీ ఈ ఆరేళ్ల గ్యాప్లో జే47, జే57 అనే రెండు ఓర్కాలకు అది జన్మనివ్వగా.. అవి సజీవంగానే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ఇరాన్లో తొలిసారి మహిళలతో.. -
Turkish Airlines: విమానం నడుపుతూ పైలట్ మృతి
న్యూయార్క్: సియాటెల్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న టర్కిష్ ఎయిర్లైన్స్ విమానంలో విషాదం చోటు చేసుకుంది. మార్గమధ్యంలోనే పైలట్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. న్యూయార్క్లో అత్యవసర ల్యాండింగ్ చేసేలోపే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. టర్కిష్ ఎయిర్లైన్స్కు చెందిన ఫ్లైట్ 204 సియాటెల్లో మంగళవారం రాత్రి టేకాఫ్ అయ్యింది. కెప్టెన్గా 59 ఏళ్ల ఇల్సిన్ పెహ్లివాన్ విధుల్లో ఉన్నారు. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కోపైలట్ విమానాన్ని తన అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అప్పటికే పెహ్లివాన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పైలట్ మృతికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఈ మేరకు టర్కిష్ ఎయిర్లైన్స్ ప్రతినిధి యాహ్యా ఉస్తున్ ఒక ప్రకటనలో వెల్లడించారు. తమ కెప్టెన్ను కోల్పోయినందుకు తీవ్రంగా చింతిస్తున్నామన్నారు. కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రయాణికులు న్యూయార్క్ నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, పెహ్లివాన్ 2007 నుంచి టర్కిష్ ఎయిర్లైన్స్లో పనిచేస్తున్నారు. సాధారణంగా పైలట్లు ప్రతి 12 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 40 ఏళ్లు పైబడిన వారు ప్రతి ఆరు నెలలకోసారి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. పెహ్లివాన్ మార్చి 8నే అన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. -
జాహ్నవిపై అనుచిత వ్యాఖ్యలు..ఆ పోలీసు తొలగింపు
న్యూయార్క్/సియాటెల్: అమెరికాలోని సియాటెల్లో గతేడాది తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి(23) పోలీసు వాహనం ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. ఆమెకు పెద్దగా విలువేమీ లేదనేలా డేనియల్ ఆడెరర్ అనే పోలీసు అధికారి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అవి జాహ్నవి కుటుంబానికి ఎంతో వేదన కలిగించి ఉంటాయని దీనిపై విచారణ చేపట్టిన అధికారి స్యూ రాహ్ర్ అన్నారు. అడెరర్ అమానవీయ వైఖరి పోలీసు వృత్తికే కళంకం తెచ్చిపెట్టిందన్నారు. ‘‘ఇలాంటి అధికారిని ఇంకా కొనసాగనీయడం మొత్తం పోలీసు విభాగానికే అవమానకరమవుతుంది. అందుకే ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పేందుకు అతడిని విధుల నుంచి తొలగిస్తున్నాం’ అని ప్రకటించారు. కారును వేగంగా నడిపిన మరో అధికారి కెవిన్ డేవ్పై నేరారోపణలను నమోదు చేయలేమంటూ కింగ్ కౌంటీ అధికారులు ఈ ఏడాది జనవరిలో స్పష్టం చేశారు. అయితే, ఈ నేరం కింద డేవ్కు 5 వేల డాలర్ల జరిమానా విధిస్తూ సియాటెల్ సిటీ అటార్నీ తీర్పు వెలువరించారు. -
అమెరికాలో మరో రెండు వీసా దరఖాస్తు కేంద్రాలు
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం సియాటెల్లో కొత్తగా రెండు వీసా, పాస్పోర్టు కేంద్రాలను భారత ప్రభుత్వం ప్రారంభించింది. పసిఫిక్ తీరంలోని 9 వాయవ్య రాష్ట్రాల్లో ఉండే సుమారు 5 లక్షల మంది భారత సంతతి ప్రజల అవసరాలను ఇవి తీరుస్తాయని సియాటెల్లోని భారత కాన్సుల్ జనరల్ ప్రకాశ్ గుప్తా చెప్పారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్, బెల్వ్యూల్లో శుక్రవారం వీసా, పాస్పోర్టు కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఇటీవలే సియాటెల్లో భారత కాన్సులేట్ ఏర్పాటైంది. అలాస్కా, ఇడహో, మొంటానా, నెబ్రాస్కా, నార్త్ డకోటా, ఒరెగాన్, సౌత్ డకోటా, వాషింగ్టన్, వ్యోమింగ్ రాష్ట్రాలు ఈ కాన్సులేట్ పరిధిలోకి వస్తాయి. న్యూయార్క్, అట్లాంటా, షికాగో, హూస్టన్, శాన్ఫ్రాన్సిస్కోల్లో ఐదు చోట్ల ఇప్పటికే భారత కాన్సులేట్లు నడుస్తున్నాయి. భారత ప్రభుత్వం తరఫున వీటిని వీఎఫ్ఎస్ గ్లోబల్ సంస్థ నిర్వహిస్తోంది. -
జాహ్నవి కేసు.. భారత్ కీలక ప్రకటన
సీటెల్: రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన అధికారికి అక్కడి కోర్టు ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. సరైన ఆధారాలు లేనందున ఆ అధికారిపై క్రిమినల్ అభియోగాలు మోపడం లేదని వాషింగ్టన్ స్టేట్లోని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకటించింది. అయితే జాహ్నవి కందుల కేసులో భారత్ కీలక ప్రకటన చేసింది. తీర్పును సమీక్షించాలని కోర్టును ఆశ్రయించింది. ఈ విషయాన్ని సీటెల్లోని భారత దౌత్య కార్యాలయం ధృవీకరించింది. ‘‘దురదృష్టకర రీతిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జాహ్నవి కందుల కేసులో.. ఇటీవలె కింగ్ కౌంటీ అటార్నీ ప్రాసిక్యూషన్ దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. అయితే ఈ విషయంలో బాధిత కుటుంబంతో టచ్లో ఉన్నాం. న్యాయం జరిగేంతవరకు అన్ని రకాలుగా సహకారం అందిస్తూనే ఉంటాం అని దౌత్య కార్యాలయం తెలిపింది. అంతేకాదు.. ఈ కేసులో తగిన పరిష్కారం కోసం సీటెల్ పోలీసులతో సహా స్థానిక అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. తీర్పుపై సమీక్ష కోసం ఇప్పటికే సీటెల్ సిటీ అటార్నీ కార్యాలయానికి సిఫార్సు చేశామని పేర్కొంది. సీటెల్ పోలీస్ విచారణ ముగింపు కోసం ఎదురు చూస్తున్నామని, అప్పటిదాకా కేసు పురోగతిని పరిశీలిస్తామని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. On the recently released investigation report of the King County Prosecution Attorney on the unfortunate death of Jaahnavi Kandula, Consulate has been in regular touch with the designated family representatives and will continue to extend all possible support in ensuring justice… — India In Seattle (@IndiainSeattle) February 23, 2024 ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. కిందటి ఏడాది జనవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల టైంలో ఇంటికి వెళ్లబోతూ రోడ్డు దాటుతున్న ఆమెను.. ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ వేగానికి వంద అడుగుల ఎత్తులో ఎగిరిపడి తీవ్రంగా గాయపడి జాహ్నవి మృతి చెందింది. ఆ టైంలో వాహనం నడుపుతున్న కెవిన్ డేవ్ అనే అధికారి నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణం పోయిందని ఆ తర్వాతే తేలింది. ఇంకోవైపు.. ఇదీ చదవండి: జాహ్నవికి అన్యాయం.. కేటీఆర్ ఆవేదన సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆర్డరర్ జాహ్నవి మృతిపై చులకనగా మాట్లాడాడు. ప్రమాదం గురించి పైఅధికారికి సమాచారం చేరవేస్తూ.. ఆర్డరర్ నవ్వులు చిందించాడు. అంతేకాదు.. ఆమె(జాహ్నవి) జీవితానికి పరిమితమైన విలువ ఉందని.. పరిహారంగా కేవలం చెక్ ఇస్తే సరిపోతుందని.. చిన్న వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని వెటకారంగా మాట్లాడాడు. ఈ వ్యవహారం వీడియోతో సహా బయటకు రావడంతో దుమారం రేగింది. అయితే తాను అవమానించేందుకు అలా మాట్లాడలేదంటూ తర్వాత వివరణ ఇచ్చుకున్నాడు ఆర్డరర్. అంతేకాదు.. జాహ్నవి మృతికి కారణమైన కెవిన్కు అనుకూలంగా.. తప్పంతా జాహ్నవిదే అన్నట్లు అధికారులకు నివేదిక ఇచ్చాడు కూడా. ఇక కెవిన్పై ఇప్పటికిప్పుడు క్రిమినల్ చర్యలు లేకపోయినా.. డిపార్ట్మెంట్ తరఫున చర్యలు ఉంటాయని అధికారులంటున్నారు. మార్చి 4వ తేదీన క్రమశిక్షణా కమిటీ ముందు కెవిన్ హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ అతని వివరణతో కమిటీ సంతృప్తి చెందకపోతే మాత్రం చర్యలు తప్పవు. -
కందుల జాహ్నవి కేసు.. ఇదెక్కడి న్యాయం?
కిందటేడాది తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23) అమెరికా సియాటెల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. రోడ్డు దాటుతున్న ఆమెను.. పోలీస్ పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత ఆమె మృతిపై అక్కడి పోలీసు అధికారి ఒకరు చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్.. ఆ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది కూడా. అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె మృతికి కారణమైన సదరు పోలీస్ అధికారిపై ఎలాంటి కేసు ఉండబోదని అక్కడి అధికార యంత్రాంగం ప్రకటించింది. బుధవారం వాషింగ్టన్ స్టేట్లోని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఈ మేరకు ప్రకటన చేసింది. కందుల జాహ్నవి మృతి ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసేదే అయినా.. ఆమె యాక్సిడెంట్ కేసులో సియాటెల్ పోలీస్ అధికారి కెవిన్ డేవ్కు వ్యతిరేకంగా సరిపడా ఆధారాలు లేవని, కాబట్టి.. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి క్రిమినల్ చర్యలు ఉండబోవు’’ అని ఉన్నతాధికారులు అంటున్నారు. మరోవైపు.. ఈ ప్రకటనపై జాహ్నవి బంధువులు, పలువురు భారతీయ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఆఫీసర్ కెవిన్ డేవ్ అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని తేలినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోరని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఆమె మృతిపై అవమానించేలా మాట్లాడిన అధికారి విషయంలోనూ చర్యలు ఏవని ప్రశ్నిస్తున్నారు. స్థానిక మీడియా వెల్లడించిన కథనాల ప్రకారం.. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఆ రోజు ప్రమాదం జరిగిన సమయంలో కెవిన్ విధి నిర్వహణలోనే ఉన్నారు. ఆ రూటులో స్పీడ్ లిమిట్ 40 మైళ్లు మాత్రమే. కానీ, కెవిన్ తన కారును 100 మైళ్లకు పైగా వేగంతో నడిపారు. ఎమర్జెన్సీ హారన్ ఇవ్వలేదుగానీ.. లైట్లను వెలిగించుకుంటూ వెళ్లారు. అదే సమయంలో రోడ్డు దాటుతున్న జాహ్నవి.. అత్యంత వేగంతో కారు దూసుకురావడాన్ని అంచనా వేయలేకపోయారు. కారు నడుపుతున్న కెవిన్ డేవ్ కూడా జాహ్నవిని ఢీకొట్టడానికి ఒక్క సెకను ముందు మాత్రమే బ్రేకులు వేశాడు. కారు బలంగా ఢీకొట్టడంతో జాహ్నవి ఎగిరి 100 మీటర్లకు పైగా దూరంలో పడిపోయారని సీటెల్ పోలీసులు తమ నివేదికలో రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయితే కెవిన్పై క్రిమినల్ చర్యలు లేకపోయినా.. డిపార్ట్మెంట్ తరఫున చర్యలు ఉంటాయని అధికారులంటున్నారు. మార్చి 4వ తేదీన క్రమశిక్షణా కమిటీ ముందు కెవిన్ హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ అతని వివరణతో కమిటీ సంతృప్తి చెందకపోతే మాత్రం చర్యలు ఉంటాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. కిందటి ఏడాది జనవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల టైంలో రోడ్డు దాటుతున్న ఆమెను.. ఓ పోలీసు వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టి మృతి చెందింది. కెవిన్ డేవ్ అనే అధికారి నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణం పోయిందని ఆ తర్వాతే తేలింది. అయితే.. ఈ ఘటన గురించి సమాచారం అందించిన తరుణంలో ఓ అధికారి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. Recent reports including in media of the handling of Ms Jaahnavi Kandula’s death in a road accident in Seattle in January are deeply troubling. We have taken up the matter strongly with local authorities in Seattle & Washington State as well as senior officials in Washington DC — India in SF (@CGISFO) September 13, 2023 సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆర్డరర్ ఆమె మృతిపై చులకనగా మాట్లాడాడు. గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ.. ఆర్డరర్ నవ్వులు చిందించినట్టు రికార్డయింది. అంతేకాదు.. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉందని.. కేవలం చెక్ ఇస్తే సరిపోతుందని.. చిన్న వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని వెటకారంగా మాట్లాడాడు. అంతేకాదు ఆ తర్వాత దర్యాప్తులోనూ కెవిన్కు అనుకూలంగా.. తప్పంతా జాహ్నవిదే అన్నట్లు అధికారులకు నివేదిక ఇచ్చాడు. డేనియల్ ఆర్డరర్ వ్యాఖ్యల వీడియోపై అధికారులు ఇప్పటికే విచారణ జరుపుతున్నారు. అయితే తాను అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని.. ప్రభుత్వ లాయర్లను ఉద్దేశించి చేశానని.. ఇలాంటి కేసులో బాధితులకు అందాల్సిన పరిహారం ఎలా కుదించేలా ప్రయత్నిస్తారో చెప్పే క్రమంలో అలా మాట్లాడాల్సి వచ్చిందని డేనియల్ ఆర్డరర్ గతంలో వివరణ ఇచ్చాడు. -
సీయాటెల్ సిద్ధం ఫర్ ‘యాత్ర 2’ ఈవెంట్
అమెరికాలోని సీయాటెల్లో యాత్ర2 మెగా ప్రీమియర్ షో రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. YSRCP USA, సోషల్ మీడియా, జగనన్న కనెక్ట్స్ ఆధ్వర్యంలో 'సీయాటెల్ సిద్ధం ఫర్ యాత్ర2 ఈవెంట్ని గ్రాండ్గా నిర్వహించారు. ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్టు APNRTS రీజినల్ కో ఆర్డినేటర్ దుష్యంత్ రెడ్డి తెలిపారు. మూవీని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మహి రాఘవ్, నిర్మాత శివ మేక, చిత్ర యూనిట్ కి ధన్యవాదాలు తెలిపారు. సీయాటెల్ నలుమూలల నుంచి వైఎస్సార్, సీఎం జగన్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి యాత్ర 2 సెలబ్రేషన్ లో పాలు పంచుకున్నారు. YSRCP USA , సోషల్ మీడియా కమిటీ సభ్యులు.. చిన్నారులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. అనంతరం వైఎస్సార్ పాలనని గుర్తు చేసుకున్నారు. వైస్సార్ అడుగు జాడల్లో నవరత్నాలతో పాటు విన్నూతన మైన పథకాలు AP ప్రజలకి అందించిన CM YS జగన్ పరిపాలన ని గుర్తు చేస్తూ , రాబోయే ఎలక్షన్ లో 140 పై చిలుకు స్థానాల లో విజయ దుందుభి మోగించడం ఖాయమని ఈ సందర్భం గా తెలియ జేశారు. ఈ ఈవెంట్ లో YSRCP USA సభ్యులు మునీశ్వర్ రెడ్డి నాగిరెడ్డి , వినయ్ రెడ్డి, అనిల్ బెల్లపు , JC రెడ్డి , వెంకట్ సుబ్బా రెడ్డి, ప్రకాష్ కొండూరు ,శంకర్ తిప్పల ,ప్రకాష్ మామిడి,జితేందర్ రెడ్డి ,శ్రీనివాస రెడ్డి మల్లంపాటి ,భాస్కర్ రెడ్డి , వినోద్ ,సునీల్ బలభద్ర ,నరేన్ రెడ్డి ,వెంకట్ రెడ్డి,రాజ శేఖర్ రెడ్డి ,ప్రదీప్, బాల ,కరుణాకార్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని సహాయ సహకారాలు అందజేశారు. కమ్యూనిటీ లీడర్స్ మనోజ్ చింతి రెడ్డి , సాయిరెడ్డి కంచరకుంట్ల ,సువీన్ రెడ్డి ఉప్పల ,నవీన్ గోలి ప్రసంగించి యాత్ర 2 మూవీ కి ధన్యవాదాలు తెలియజేశారు. -
సీటెల్లో ఘనంగా టీటీఏ బోర్డు సమావేశం!
తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ బోర్డ్ సమావేశం సీటెల్లో ఘనంగా జరిగింది. వ్యవస్థాపకులు, బోర్డ్ నాయకులు, సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల సీటెల్ పోలీసు అధికారి కారు ఢీకొని మరణించిన జాహ్నవి కందుల మృతికి బోర్డ్ సభ్యులు సంతాపం తెలియజేశారు. ఆమె మృతికి కారణమైన పోలీసు అధికారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రెసిడెంట్ వంశీ రెడ్డి అధ్యక్షతన 2024 మే 24 నుంచి 26 వరకు సియాటిల్ నగరంలో జరిగే టీటీఏ మెగా కన్వెన్షన్ 2024 గురించి చర్చించారు. ఈ బోర్డు సమావేశంలో టీటీఏ కన్వెన్షన్ వెబ్సైట్, సరికొత్త లోగోను ప్రారంభించింది. ఈ సమావేశానికి టీటీఏ వ్యవస్థాపకుడు డాక్టర్ పైళ్ళ మల్లా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ సలహా మండలి విజయపాల్ రెడ్డి, మోహన్ పటోళ్ల, భరత్ మాదాడి, అధ్యక్షుడు వంశీ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్, ప్రధాన కార్యదర్శి కవిత, EC, BoD, జాతీయ బృందం అంతా కలిసి వివిధ అంశాలఫై చర్చించారు. టిటిఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి బోర్డ్ ప్రారంభ సందేశం వివరించారు. సీటెల్ లో వచ్చే ఏడాది జరగనున్న 2024 మెగా కన్వెన్షన్ సక్సెస్ చేయాలని, అవసరమైన నిధుల సమీకరణకు బోర్డ్ సభ్యులు కృషి చేయాలని కోరారు. టిటిఏ 2024 మెగా కన్వెన్షన్ విజయవంతానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అడ్వైజరీ చైర్ డా. విజయపాల్ రెడ్డి తెలియజేశారు. అడ్వైజరీ కో-చైర్ మోహన్ పాటల్లోల, సభ్యుడు భరత్ మాదాడి 2023 డిసెంబర్లో తెలుగు రాష్ట్రాల్లో జరిగే సేవా దినోత్సవాలు, అలాగే కన్వెన్షన్ గురించి వివరాలను తెలియజేశారు. టిటిఏ 2024 మెగా కన్వెన్షన్ గురించి ప్రెసిడెంట్ వంశీ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. కన్వెన్షన్ను విజయవంతం చేయాలని బోర్డు సభ్యులందరినీ కోరారు. ఈ బోర్డ్ మీటింగ్లో దాదాపు 1 మిలియన్ డాలర్లు నిధుల సేకరణకు హామీలు వచ్చాయి. అలాగే టీటీఏ మెగా కన్వెన్షన్ కు వేదికైన సియాటిల్ కన్వెన్షన్ సెంటర్ ని బోర్డు సభ్యులు పరిశీలించారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మల్లిపెద్ది, సెక్రటరీ కవితా రెడ్డితో పాటు టీమ్ సభ్యులు, పులువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని.. కన్వెన్షన్ విజయవంతానికి అందరూ కృషి చేయాలని కోరారు. ప్రాంతీయ సభ్యులందరితో సాయంత్రం టీటీఏ కార్య నిర్వాహక వర్గం కలిసి సాంస్కృతిక కార్యక్రమములో పాల్గొన్నారు. విజ్ఞేశ్వర స్తుతితో మొదలైన ఈ కార్యక్రమము ఆద్యంతం ప్రేక్షకులకు స్వచ్చమైన తెలంగాణ సంప్రదాయముల మధ్య అంగ రంగ వైభవముగా జరిగింది. కార్యక్రమాన్ని ప్రారంభించిన వంశీ రెడ్డి గారు సియాటెల్ వచ్చిన టీటీఏ ప్రతినిధులకి సాదరంగా స్వాగతం పలికి ఆహ్వానిత అతిధులందరిని పేరు పేరునా వేదిక మీదకి ఆహ్వానించి శాలువాలతో సత్కరించినారు. అనంతరం టీటీఏ మెగా కన్వెన్షన్ కి సంబంధించి అద్భుతమైన నిధుల సేకరణ విందు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. టీటీఏ విరాళాల రూపంలో ఒకే రోజులో 2 మిలియన్ డాలర్లను విజయవంతంగా సేకరించింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు, సియాటిల్ నగరంలో ఇంత పెద్ద కన్వెన్షన్ జరుగుతున్నందుకు హర్షం వ్యక్తం చేసి, తమ మద్దతు ప్రకటించారు. ప్రముఖ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్ , APNRTS Regional Co ordinator దుష్యంత్ రెడ్డి, శ్రీనివాస్ అబ్బూరి , రామ్ పాలూరి, భాస్కర్ గంగిపాముల, తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ బోర్డ్ కృతజ్ఞతలు తెలిపింది. (చదవండి: భార్య సిజేరియన్ వల్లే..అనారోగ్యానికి గురయ్యానంటూ ఓ భర్త..) -
సీటెల్ లో TTA బోర్డ్ సమావేశం విజయవంతం
-
ఆ పోలీసును తొలగించాలి
వాషింగ్టన్: అమెరికాలో గత జనవరిలో పోలీసు వాహనపు అతి వేగానికి బలైన తెలుగమ్మాయి జాహ్నవి కందుల విషయంలో జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సియాటిల్ పోలీసు అధికారి డేనియల్ ఆడరర్పై ఆగ్రహ జ్వాలలు నానాటికీ పెరుగుతున్నాయి. ‘ఇదేమంత పెద్ద విషయం? ఏ 11 వేల డాలర్లకో చెక్కు రాస్తే సరి. ఆమెకు 26 ఏళ్లు. అలా చూస్తే ఆమె జీవితం అంత విలువైనదేమీ కాదు‘ అంటూ ఈ ఉదంతంపై అతను చేసిన వ్యాఖ్యలు గత సోమవారం బాడీకామ్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. అప్పటినుంచీ వాటిపై తీవ్ర దుమారం రేగుతోంది. రాజా కృష్ణమూర్తి వంటి భారత అమెరికన్ చట్ట సభ్యులతో పాటు అమెరికా చట్ట సభ్యులు కూడా వాటిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. డేనియల్ ప్రవర్తన మీద స్వతంత్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఆన్లైన్ పిటిషన్ దాఖలైంది. నిషిత రహేజా గోయల్ అనే భారత్ అమెరికన్ దాఖలు చేసిన ఈ పిటిషన్పై ఇప్పటికే వేలాది మంది సంతకాలు చేశారు. శుక్రవారం రాత్రికే సంతకాల సంఖ్య 6,700 దాటిపోయింది. ‘డేనియల్ ప్రవర్తనతో సియాటిల్ పోలీసు శాఖపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. అందుకే అతన్ని తక్షణం ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు ఇకపై కొత్తగా పోలీసు శాఖలో చేరే ప్రతి ఒక్కరికీ సున్నితత్వం తదితరాల విషయంలో విధిగా శిక్షణ ఇవ్వాలి. అప్పుడే జాహ్నవి, అలాంటి ఇతర బాధిత కుటుంబాలకు కాస్తయినా సాంత్వన చేకూరుతుంది‘ అని పిటిషన్ పేర్కొంది. మరోవైపు, డేనియల్ను సియాటిల్ పోలీసు అధికారుల గిల్డ్ సమర్థించింది! అతను ప్రైవేట్గా చేసిన వ్యాఖ్యలను అసంబద్ధంగా విడుదల చేసి అపార్థాలకు తావిచ్చారని ఆరోపించింది. ఈ మేరకు సుదీర్ఘ వివరణ విడుదల చేసింది. తన వ్యాఖ్యలను దురర్థం వచ్చేలా వక్రీకరించారని డేనియల్ కూడా ప్రకటన విడుదల చేశాడు. -
‘జాహ్నవిని ఉద్దేశించి నవ్వలేదు’
సియాటెల్లో రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని జాహ్నవి (Jaahnavi Kandula) మృతి చెందడంపై అక్కడి పోలీసు అధికారి ఒకరు చులకనగా మాట్లాడడం.. తెలిసిందే. ఆ అధికారి తీరుపై ఎన్నారైలు నిరసనలు వ్యక్తం చేస్తుండగా.. కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ సైతం అమెరికాను డిమాండ్ చేస్తోంది. అయితే, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ వ్యాఖ్యలు జాహ్నవిని కించపరిచే ఉద్దేశంతో చేసినవి కావంటూ అధికారి డేనియల్ ఆర్డరర్ పేరిట ఓ లేఖ బయటకు వచ్చింది. ఏపీ కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) ఈ ఏడాది జనవరి 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా.. పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందింది. అయితే.. సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ అడెరెర్.. చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయ్యింది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి Just a regular person.. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉంది. కేవలం ఓ చెక్ ఇస్తే సరిపోతుందని.. 26 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది’ అని నవ్వుతూ మాట్లాడాడు. ఈ క్లిప్ బయటకు రావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. అటు భారత్ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారి డేనియల్పై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులకు డేనియల్ అడెరెర్ రాసిన లేఖను సియాటెల్ పోలీసు అధికారుల గిల్డ్ విడుదల చేసింది. న్యాయవాదులను ఉద్దేశిస్తూనే ఆ వ్యాఖ్యలు చేశాను. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు న్యాయస్థానంలో వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వాను అంతే.. అని డేనియల్ లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు. ‘‘జనవరి 23న పెట్రోలింగ్ వాహనం వల్ల ప్రమాదం జరిగిందని తెలిసి సాయం చేసేందుకు నేను వెళ్లాను. తిరిగి ఇంటికి వస్తుండగా తోటి అధికారికి ఫోన్ చేసి ఘటన గురించి చెప్పాను. అప్పటికి నా విధులు పూర్తయ్యాయి. అయితే బాడీక్యామ్ కెమెరా ఆన్లో ఉన్న విషయం నాకు తెలియదు. నేను జరిపిన వ్యక్తిగత సంభాషణ అందులో రికార్డ్ అయ్యింది. అయితే, ఇలాంటి కేసుల్లో కేవలం న్యాయవాదులు జరిపే వాదనల గురించే నేను మాట్లాడాను. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనిషి ప్రాణం విలువ గురించి ఇరు పక్షాల లాయర్లు ఎలా వాదిస్తారో, బేరసారాలు ఎలా సాగిస్తారో గతంలో చాలా సార్లు చూశాను. అవి ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వుకున్నాను’’ అని డేనియల్ తన లేఖలో వివరించారు. అంతేగానీ.. బాధితురాలిని అవమానించేలా తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. పూర్తి వివరాలు తెలియకపోతే.. ఇలాంటి భయానక ఊహాగానాలే వైరల్ అవుతాయని అన్నారు. దీనిపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని, ఉన్నతాధికారులు ఏ శిక్ష విధించినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని తెలిపారు. ఈ వివాదంపై సియాటెల్ పోలీసు అధికారుల గిల్డ్, డేనియల్ అడెరెర్కు మద్దతుగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘వైరల్ అయిన దృశ్యాలు బాడీక్యామ్ వీడియో రికార్డ్ చేసినవి. అయితే, ఆ సంభాషణల్లో ఒకవైపు మాత్రమే బయటికొచ్చింది. అందులో ఇంకా చాలా వివరాలున్నాయి. అవి ప్రజలకు తెలియవు. పూర్తి వివరాలు తెలియకపోవడంతో అక్కడ అసలేం జరిగిందో చెప్పడంలో మీడియా విఫలమైంది’’ అంటూ డేనియల్కు మద్దతుగా గిల్డ్ వ్యాఖ్యానించింది. మరోవైపు డేనియల్ అడెరెర్ను ఉద్యోగం నుంచి తొలగించాలని అమెరికాలో ఆన్లైన్ పిటిషన్లు మొదలయ్యాయి. -
జాహ్నవికి న్యాయం జరగాల్సిందే
వాషింగ్టన్: అమెరికాలో పోలీసుల నిర్లక్ష్యంతో జరిగిన కారు ప్రమాదానికి బలైపోవడమే గాక మరణానంతరం కూడా వాళ్ల చేతుల్లో జాత్యహంకార హేళనకు గురైన తెలుగు యువతి జాహ్నవి కందుల ఉదంతాన్ని అక్కడి భారతీయ చట్ట సభ్యులు సీరియస్గా తీసుకున్నారు. వాషింగ్టన్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయిన 23 ఏళ్ల జాహ్నవి గత జనవరిలో సియాటిల్లో రోడ్డు దాటుతుండగా పోలీసు వాహనం ఢీ కొని మరణించడం తెలిసిందే. 25 మైళ్ల స్పీడ్ లిమిట్ ఉన్న చోట సదరు వాహనం ఏకంగా 74 మైళ్ల వేగంతో దూసుకురావడమే ప్రమాదానికి కారణమని తేలింది. కానీ డేనియల్ ఆడరర్ అనే సియాటెల్ పోలీసు అధికారి ఈ ఉదంతంపై చేసిన అత్యంత అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘అయితే ఏమయిందిప్పుడు?! ఆమెకు ఆల్రెడీ 26 ఏళ్లు. అంత విలువైనదేమీ కాదు. ఏ 11 వేల డాలర్లకో ఓ చెక్కు రాసి పారేయండి‘ అంటూ అతనన్న మాటలు బాడీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అతనిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యురాలు క్షమా సావంత్ తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా పోలీసుల్లో జాత్యహంకారం ఎంతగా జీరి్ణంచుకుపోయిందో చెప్పేందుకు ఈ ఉదంతం మరో నిదర్శనమని వారన్నారు. డేనియల్పై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం డిమాండ్ చేశారు. ‘జాహ్నవి దుర్మరణానికి కారకులైన పోలీసులే ఆమె జీవితం విలువే లేనిదంటూ అంత నీచంగా మాట్లాడటం వింటే చెప్పరానంత జుగుప్స కలుగుతోంది. జాతి విద్వేషం, జాత్యహంకారం అమెరికాలో ఆమోదనీయత పొందుతున్నాయనేందుకు ఇది సంకేతం. ఈ చెడు ధోరణికి తక్షణం అడ్డుకట్ట పడాలి‘ అని కృష్ణమూర్తి అన్నారు. ఈ ఉదంతం మీద పూర్తి అధికారాలతో కూడిన పౌర సంఘ సభ్యుల కమిటీ వేసి స్వతంత్రంగా విచారణ జరిపించాలని సావంత్ కోరారు. డేనియల్ మీద 2014 నుంచి కనీసం 18 విచారణలు జరిగితే అతన్ని ఒక్క దాంట్లోనూ శిక్షించకపోవడం దారుణమన్నారు. పోలీసులే ఇంతటి నోటి దురుసుతో జాత్యహంకార వ్యాఖ్యలకు పాల్పడ్డ ఇలాంటి హై ప్రొఫైల్ కేసులో కూడా విచారణను ఆర్నెల్లు సాగదీయడం, రివ్యూ పేరిట ఏడాది దాకా లాగడం క్షమించరానిదని సౌత్ సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యుడు టామీ జె.మోరల్స్ ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ అసోసియేషన్స్ కూడా ఒక ప్రకటనలో కోరింది. వందలాది మంది గురువారం సియాటిల్లో నిరసన ప్రదర్శన కూడా చేశారు. దోషులైన పోలీసులకు శిక్ష పడి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. జాహ్నవికి మరణానంతరం డిగ్రీ అమెరికాలో పోలీసు వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ ప్రకటించింది. మాస్టర్స్ డిగ్రీ పట్టాను జాహ్నవి కుటుంబ సభ్యులకు అందజేస్తామని వెల్లడించింది. జాహ్నవి మృతి పట్ల నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ చాన్సలర్ సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. -
Jaahnavi Kandula: జాహ్నవికి మరణానంతర డిగ్రీ
వాషింగ్టన్: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(23)కు మరణానంతర డిగ్రీ అందనుంది. ఈ విషయాన్ని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించింది. జాహ్నవి తరపున ఆమె కుటుంబ సభ్యులకు ఎంఎస్ పట్టా అందజేస్తామని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ వీసీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలువాసి అయిన జాహ్నవి.. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం కింద 2021లో అమెరికా వెళ్లింది. సౌత్ లేక్ యూనియన్లోని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ క్యాంపస్లో చేరిందామె. కెరీర్లో త్వరగా సెటిల్ అయ్యి.. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని ఆమె కల. ఈ ఏడాది డిసెంబర్లో జాహ్నవి డిగ్రీ పూర్తి కావాల్సి ఉంది. పాపం ఈలోపే ఆమెను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. ఈ ఏడాది జనవరి 23వ తేదీన రాత్రి ఆమె రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను బలిగొంది. ఈ ఘటనకు సంబంధించి..ప్రమాద సమయంలో సమాచారం అందుకున్న ఓ అధికారి.. ఆమె ప్రాణాలకు విలువే లేదన్నట్లు చులకనగా మాట్లాడిన మాటల్ని తాజాగా అక్కడి పోలీస్ శాఖనే బయటపెట్టింది. దీంతో భారతీయులు భగ్గుమన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్.. ఆ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది. ఇప్పుడు.. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నార్త్ఈస్ట్రన్ (Northeastern University) ఛాన్సలర్ ‘‘ఈ విషాద ఘటన, దాని అనంతరం జరిగిన పరిణామాలతో మా క్యాంపస్లోని భారత విద్యార్థులు తీవ్రంగా ప్రభావితులయ్యారు. ఈ సమయంలో వారికి మేం అండగా ఉంటాం. అలాగే ఈ ఘటనలో బాధ్యులకు తప్పకుండా శిక్ష పడుతుందని మేం ఆశిస్తున్నాం. ఇక జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయాలని మేం నిర్ణయించాం. ఆమె కుటుంబంసభ్యులకు దాన్ని అందజేస్తాం’’ అని తెలిపారు. -
జాహ్నవి మృతిపై అధికారి వెకిలి కామెంట్లు వైరల్
సియాటెల్: అమెరికాలో భారతీయ విద్యార్థి మృతి చెందిన ఘటనపై వెటకారం, వెకిలి వ్యాఖ్యలు చేసిన పోలీస్ అధికారి తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఘటనపై పైఅధికారి సమాచారం కోరితే.. ఆమె ప్రాణాలకు విలువే లేదన్నట్లు నవ్వుతూ మాట్లాడాడు సదరు అధికారి. ఆ క్లిప్ను సియాటెల్ పోలీసులే విడుదల చేయగా.. అది వైరల్ కావడంతో అధికారి చర్యలు తీసుకోవాలని అక్కడి భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. ఈ ఏడాది జనవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల టైంలో రోడ్డు దాటుతున్న ఆమెను.. ఓ పోలీసు వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టి మృతి చెందింది. కెవిన్ డేవ్ అనే అధికారి నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణం పోయిందని ఆ తర్వాతే తేలింది. అయితే.. ఈ ఘటన గురించి సమాచారం అందించిన తరుణంలో ఓ అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతూ.. భారతీయులకు ఆగ్రహావేశాలు తెప్పిస్తున్నాయి. జాహ్నవి యాక్సిడెంట్పై సమాచారం అందుకున్న.. సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆర్డరర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ.. ఆర్డరర్ నవ్వులు చిందించాడు. అంతేకాదు.. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉందని.. కేవలం చెక్ ఇస్తే సరిపోతుందని.. 26 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని వెటకారంగా మాట్లాడాడు. అయితే.. సోలన్ ఆ కాల్కు ఎలాంటి సమాధానం ఇచ్చారన్నది మాత్రం తెలియరాలేదు. సోమవారం అధికారులు ఈ వీడియో రిలీజ్ చేసి.. విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. వీళ్ల మాటలు వింటుంటే గుండె పగిలిపోతోందంటూ పోస్ట్ చేసింది. సియాటెల్ ప్రజలకు మరింత భద్రత కల్పించాల్సి ఉందని, ఇలాంటి వాటిని సహించేదే లేదని తేల్చి చెప్పింది. కేవలం తాము కచ్చితంగా విచారణ చేపడుతున్నామని ప్రజలకు తెలియజేసేందుకే ఈ వీడియో విడుదల చేసినట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోందని, అప్పటి వరకూ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని తెలిపింది. అయితే తాను అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని.. ప్రభుత్వ లాయర్లను ఉద్దేశించి చేశానని.. ఇలాంటి కేసులోలో బాధితులకు అందాల్సిన పరిహారం ఎలా కుదించేలా ప్రయత్నిస్తారో చెప్పే క్రమంలో అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై జాహ్నావి దగ్గరి బంధువు అశోక్(హౌస్టన్) స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్ల కూతుళ్లు, మనవరాళ్ల జీవితాలకు మాత్రమే విలువ ఉంటుందా? ప్రాణం ఏదైనా ప్రాణమే కదా అని అసహనం వ్యక్తం చేశారాయన. జాహ్నవి ఈ డిసెంబర్లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో డిగ్రీ తీసుకోవాల్సి ఉంది. ఇంతలోనే ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుంది. ఇదిలా ఉంటే జాహ్నవి ఘటనపై కింగ్ కౌంటీ అటార్నీ కార్యాలయం దర్యాప్తు జరుపుతోంది. -
డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఫైనల్లో సీటెల్ ఓర్కాస్
మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023) తొలి ఎడిషన్లో భాగంగా సీటెల్ ఓర్కాస్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) టెక్సస్ సూపర్కింగ్స్తో జరిగిన క్వాలిఫయర్-1లో సీటెల్ ఓర్కాస్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సీటెల్ ఆర్కాస్ ఓపెనర్ క్వింటన్ డికాక్(50 బంతుల్లో 88 నాటౌట్, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడడంతో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 127 పరుగుల లక్ష్యాన్ని సులువుగా చేధించింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సస్ సూపర్ కింగ్స్ సీటెల్ ఆర్కాస్ బౌలర్ల దాటికి పెద్దగా పరుగులు చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. సూపర్కింగ్స్ బ్యాటింగ్లో డేనియల్ సామ్స్ 26 నాటౌట్ టాప్ స్కోరర్ కాగా.. కోడి చెట్టి, డెవాన్ కాన్వేలు తలా 24 పరుగులు చేశారు. సీటెల్ బౌలర్లలో ఆండ్రూ టై మూడు వికెట్లు తీయగా.. ఇమాద్ వసీమ్ రెండు, గానన్, హర్మీత్ సింగ్ చెరొక వికెట్ తీశారు. అనంతరం 127 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సీటెల్ ఓర్కాస్ 15 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. నుమాన్ అన్వర్ రెండు పరుగులకే వెనుదిరిగినప్పటికి స్నేహన్ జయసూరియా(34 బంతుల్లో 31 నాటౌట్)తో కలిసి డికాక్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఎలిమినేటర్లో వాషింగ్టన్ను చిత్తు చేసిన ముంబై న్యూయార్క్ కాగా ముంబై న్యూయార్క్, వాషింగ్టన్ ఫ్రీడమ్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై న్యూయార్క్ 16 పరుగులతో విజయం సాధించి చాలెంజర్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసిది. అనంతరం బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. శనివారం తెల్లవారుజామున చాలెంజర్ మ్యాచ్లో ముంబై న్యూయార్క్.. టెక్సస్ సూపర్ కింగ్స్తో తలపడనుంది. చాలెంజర్లో నెగ్గిన జట్టు ఆదివారం జరగబోయే ఫైనల్లో సీటెల్ ఓర్కాస్ జట్టుతో టైటిల్ పోరులో తలపడనుంది. A TRUE QDK masterclass! @MLCSeattleOrcas clinch their spot in the inaugural #MajorLeagueCricket Championship Final! 💚 🐳 🏏 pic.twitter.com/3v71g4bn52 — Major League Cricket (@MLCricket) July 28, 2023 QDK GOES BIG WITH TWO SIXES! Quinton De Kock sends TWO SIXES over the LEG 🦵side boundaries to RAISE🖐️ his FIFTY and MORE! 7⃣9⃣/1⃣ (10.3) pic.twitter.com/hEjU1GIweU — Major League Cricket (@MLCricket) July 28, 2023 చదవండి: బ్యాటింగ్కు రాకపోయినా అరుదైన రికార్డుతో మెరిసిన కోహ్లి AB De Villiers: 'రొనాల్డో, ఫెదరర్లానే కోహ్లి కూడా చాలా గొప్పోడు' -
కులవివక్షను నిషేధించిన సియాటిల్
వాషింగ్టన్: కులవివక్షను నిషేధిస్తూ అమెరికాలోని సియాటిల్ నగరం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అగ్ర రాజ్యంలో ఈ చర్య తీసుకున్న తొలి నగరంగా నిలిచింది. ఈ మేరకు భారత సంతతికి చెందిన నేత, ఆర్థికవేత్త క్షమా సావంత్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్థానిక కౌన్సిల్ భారీ మెజారిటీతో ఆమోదించింది. నగర వివక్ష వ్యతిరేక విధానంలో కులాన్ని కూడా జోడిస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతరం సావంత్ మీడియాతో మాట్లాడారు. కులవివక్ష వ్యతిరేక తీర్మానం భారీ మద్దతుతో ఆమోదం పొందిందని హర్షాతిరేకాల నడుమ వెల్లడించారు. ‘‘అమెరికాలో కులవివక్షపై పోరాటంలో ఇదో కీలక ముందడుగు. ఇక దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించేలా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరముంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది చరిత్మాత్మక నిర్ణయమని సియాటిల్ టైమ్స్ వార్తా పత్రిక కొనియాడింది. ‘‘ఈ రోజు కోసం హత్య, అత్యాచార బెదిరింపులెన్నింటినో తట్టుకుంటూ ముందుకు సాగాం. అంతిమంగా ద్వేషంపై ప్రేమ గెలిచింది’’ అని తాజా నిర్ణయం వెనక కీలకంగా వ్యవహరించిన ఈక్వాలిటీ ల్యాబ్స్ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. భారత్లో కులవివక్షను 1948లో నిషేధించారు. 1950లో రాజ్యాంగంలో పొందుపరిచారు. పలు సంస్థల వ్యతిరేకత! సియాటిల్ కౌన్సిల్ నిర్ణయాన్ని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్) వంటి సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి! ‘‘ఈ విషయంలో కేవలం దక్షిణాసియావాసులను మాత్రమే లక్ష్యం చేసుకున్నారు. ఇలా వివక్ష వ్యతిరేక విధానంలో కులాన్ని జోడించడం అసంబద్ధం’’ అని హెచ్ఏఎఫ్ సహ వ్యవవస్థాపకుడు సుహాగ్ శుక్లా ఆరోపించారు. ‘‘ఈ ముసుగులో దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికావాసులతో మిగతా వారి కంటే భిన్నంగా వ్యవహరించనున్నారు. ఈ కుటిల యత్నాలకు ఈ ఓటింగ్ ద్వారా ఆమోదముద్ర పడింది’’ అంటూ దుయ్యబట్టారు. ఇదో ప్రమాదకరమైన తప్పుడు చర్య అని సంస్థ ఎండీ సమీర్ కల్రా అభిప్రాయపడ్డారు. ఈ చర్య సియాటిల్లోని దళిత బహుజనులకు కచ్చితంగా హాని చేసేదేనని అంబేడ్కర్–పూలే నెట్వర్క్ ఆఫ్ అమెరికన్ దళిత్స్ అండ్ బహుజన్స్కు చెందిన టి.మధు ఆరోపించారు. ఇలా కులాన్ని విధాన నిర్ణయంలో భాగం చేయడం స్థానికుల్లో హిందువుల పట్ల ఉన్న భయాన్ని (హిందూఫోబియా)ను మరింత పెంచుతుందని అమెరికాలోని భారత సంతతివారు ఆందోళన చెందుతున్నారు. హిందువులను భయభ్రాంతులను చేసే యత్నాల్లో భాగంగా అమెరికాలో గత మూడేళ్లలో పది హిందూ ఆలయాలు, గాంధీ, శివాజీ వంటి ఐదు విగ్రహాల విధ్వంస చర్యలు చోటుచేసుకున్నాయి. 2018 అమెరికన్ కమ్యూనిటీ సర్వే ప్రకారం అక్కడ ఉంటున్న భారత సంతతి వ్యక్తుల సంఖ్య 42 లక్షల పై చిలుకే. అమెరికా ఎప్పుడూ కులవ్యవస్థను అధికారికంగా గుర్తించకపోయినా అక్కడి దక్షిణాసియావాసులు ఉన్నత విద్యా సంస్థల్లో, పనిచేసే చోట కులవివక్షను ఎదుర్కొన్న ఉదంతాలెన్నో ఉన్నాయి. -
విషాదం.. అమెరికాలో పోలీస్ వాహనం ఢీకొని తెలుగు విద్యార్థిని మృతి..
ఆదోని అర్బన్ (కర్నూలు): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోనికి చెందిన విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన వివరాలను విద్యార్థిని తాత సూర్యబాబు, మామ శ్రీనివాసులు బుధవారం తెలియజేశారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని కుంబళ్లూరు క్యాంప్నకు చెందిన శ్రీకాంత్, విజయలక్షి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. శ్రీకాంత్ కానిస్టేబుల్ కాగా, విజయలక్షి ప్రయివేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. పిల్లల చదువు కోసం శ్రీకాంత్ దంపతులు ఆదోని వచ్చి స్థిర పడ్డారు. పెద్ద కుమార్తె జాహ్నవి (23) ఆదోనిలో డిగ్రీ వరకు చదివింది. ఆమె 2021లో అమెరికాలోని సీయాటిల్ నగరంలో ఉన్న నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో ఎంఎస్ కోర్సులో చేరింది. మరో నాలుగు నెలల్లో జాహ్నవి ఎంఎస్ కోర్సు పూర్తికానుంది. ఈ క్రమంలో ఆమె సోమవారం రాత్రి సియాటిల్లో కాలేజీ నుంచి రూమ్కు వస్తూ రోడ్డును దాటుతుండగా సీయాటిల్ పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొంది. వాహనం కింద చిక్కుకున్న జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలిసిన తల్లి విజయలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలింది. నాలుగు నెలల్లో ఎంఎస్ పూర్తి చేసుకుని అమెరికాలోనే మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో ఉన్నతంగా స్థిరపడతుందని ఆశించిన కుమార్తె అకాలమరణంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. జాహ్నవి మృతదేహాన్ని మరో మూడు రోజుల్లో స్వదేశానికి తీసుకువస్తారని తెలిసింది. -
Seattle Film Critics Society: ఆర్ఆర్ఆర్ ఫైట్స్కి అవార్డ్
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో మరో అవార్డు చేరింది. సియాటెల్ ఫిలిం క్రిటిక్స్ సొసైటీ అవార్డ్స్లో బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. ఈ విషయాన్ని సదరు సొసైటీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. విక్కీ ఆరోరా, ఇవాన్ కోస్టాడినోవ్, నిక్ పావెల్, రాయిచో వాసిలెవ్ స్టంట్స్ కో ఆర్డినేటర్లుగా చేయగా, ప్రేమ్ రక్షిత్, దినేశ్ కృష్ణన్ స్టంట్స్ కొరియోగ్రఫీ చేశారు. హాలీవుడ్ చిత్రాలు ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ ఒన్స్, ది నార్త్మేన్, టాప్ గప్: మ్యావరిక్’లతో పోటీపడి ‘ఆర్ఆర్ ఆర్’ అవార్డు దక్కించుకోవడం విశేషం. -
సియాటెల్ లో వైఎస్ఆర్ 73వ జయంతి వేడుకలు
-
సియాటెల్లో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలు: స్పెషల్ ఫుడ్ డ్రైవ్
వాషింగ్టన్: జులై 8న మహానేత డా.వైయస్సార్ 73వ జయంతి వేడుకలు నార్త్ వెస్ట్ అమెరికాలోని సియాటెల్ ప్రాంత వైయస్సార్ అభిమానులు ఫుడ్ డ్రైవ్ సేవాకార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజారంజక పాలనతో, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పరిపాలించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనదైన చెరగని ముద్రవేసి ప్రజలగుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న మహానేత డా. వైఎస్సార్ అని కొనియాడారు. ఈ జయంతి వేడుకలు నార్త్ వెస్ట్ అమెరికాలోని సియాటెల్ ప్రాంత వైఎస్సార్ అభిమానులు రెండు వేల డాలర్లతో ఫుడ్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సేవాకార్యక్రమాలలో పాల్గొని స్వయానా ఫుడ్ డ్రైవ్ డ్రాప్ బాక్సులు, ఫుడ్ డ్రైవ్ ప్యాకెట్లు తయారు చేసివాటిని ఆకలితో ఉన్నవారికి అందించి మహానేత జయంతిని ఘనంగా నిర్వహించారు. మహానేత సువర్ణపాలన, గొప్ప నాయకత్వ లక్షణాలు, ఔన్నత్యాన్ని స్మరించుకుంటూ పలువురు అభిమానులు వైఎస్సార్కు ఘన నివాళులర్పించారు. ఆయన గొప్పతనం తెలుసుకున్న స్థానిక అమెరికన్లు సైతం అబ్బురపోవడం విశేషం. అలాంటి నాయకులను పొందడం అదృష్టం అని పేర్కొన్నారు. ఆ మహానేత పేరుతో క్రమం తప్పకుండా తమ ప్రాంతాలలో ఫుడ్ డ్రైవ్లు, సేవా కార్యక్రామాలు ఏర్పాటు చేస్తున్న అభిమానులని అభినందించి కృతజ్ఞతలు తెలియజేసారు.. ఈ వేడుకలలో భాగంగా ఫుడ్ డ్రైవ్ & సేవాకార్యక్రమాలలో తమ సహాయసహకారాలు అందించిన విక్రమ్ రెడ్డి గార్లపాటి సువీన్ రెడ్డి గారికి, చెన్నా రెడ్డి మహీధర్ రెడ్డి రవి కిరణ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి కొల్లూరు జేసి రెడ్డిమునీశ్వర్ రెడ్డి , దామోదర్ అన్నకు, రామ్ , లోకనాథ్ , శేఖర్ గుప్త, విన్నకోట, భాస్కర్ రావికంటి , Dr వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ - USA అండ్ ఆళ్ళ రామిరెడ్డితోపాటు ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయసహకారాలు అందించిన అందరికీ వైఎస్సార్ అభిమాని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు -
సియాటెల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
-
సియాటెల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి డెబ్భై మూడవ జన్మదిన వేడుకలు సియాటెల్ నగరంలో వైఎస్సార్సీపీ యూఎస్ఏ సియాటెల్ అండ్ పోర్ట్లాండ్ రీజియన్ టీం , దుష్యంత్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైఎస్సార్ అభిమానులు, సీఎం జగన్ అభిమానులు, వైఎస్సార్సీపీ యూఎస్ఏ(సీటెల్ అండ్ పోర్ట్లాండ్) టీం మునీశ్వర్రెడ్డి, ప్రకాష్ కొండూరు, అనిల్రెడ్డి, పృథ్వీరాజ్, సువీన్రెడ్డి, జయంద్రారెడ్డి, అజయ్రెడ్డి రవీందర్రెడ్డి, చంద్రసేన, సునీల్ బలభద్ర, కృష్ణారెడ్డి, బాలరెడ్డి, మధురెడ్డి, శివ వెదురుపర్తి, సుమన్రెడ్డి, ప్రణీత్ మరియు వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి వైఎస్సార్ మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా దుష్యంత్రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ తన పరిపాలనలో ప్రవేశపెట్టిన పథకాలైన వైఎస్సార్ జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాలతో ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారని, ఆ మహానేత ఈరోజు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎప్పటికీ నిలిచిపోతాయని స్మరించుకున్నారు. ప్రకాశ్ కొండూరు మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్తో తనకున్న మొదటి పరిచయాన్ని నెమరువేసుకున్నారు. -
అమెరికాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు!
అమెరికాలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జయంతి సందర్భంగా వైఎస్సార్ అభిమానులు అన్నదాన కార్యక్రమాల్ని నిర్వహించారు నార్త్ వెస్ట్ అమెరికా సియాటెల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకల్ని ఆయన అభిమానులు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అభిమానులు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన వంటి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో విక్రమ్ రెడ్డి,సువీన్ రెడ్డి, చెన్నా రెడ్డి, మహీధర్ రెడ్డి, రవి కిరణ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి కొల్లూరు,జేసి రెడ్డి, మునీశ్వర్ రెడ్డి, దామోదర్, రామ్, లోకనాథ్, శేఖర్ గుప్త విన్నకోట, భాస్కర్ రావికంటి, ఆళ్ళ రామిరెడ్డిలు పాల్గొన్నారు. -
సియాటిల్లో ప్రవాస భారతీయుల వర్చువల్ భేటీ
శాన్ఫ్రాన్సిస్కో: సియాటిల్లో ఇటీవల ప్రవాస భారతీయుల వర్చువల్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వాషింగ్టన్ గవర్నర్ జే రాబర్డ్ ఇన్సీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీజీ విశ్వ ప్రసాద్, వారి సతీమణి వందన ప్రసాద్ నిర్వహించిన ఈ వర్చువల్ ఫండ్ రైజర్లో ప్రవాస భారతీయులతో గవర్నర్ సమావేశమయ్యారు. వాషింగ్టన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్మాణంతోపాటు రాష్ట్రానికి సాంస్కృతిక గుర్తింపును సుసంపన్నం చేయడంలో గవర్నర్ ఇన్సీ పాత్ర ప్రత్యేకమైనదని ప్రవాస భారతీయులు ప్రశంసించారు. దేశంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వాషింగ్టన్ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రగతిశీల నాయకుడిగా గవర్నర్ను ప్రశంసించారు. ఈ సమావేశంలో భారత పార్లమెంట్ ఇటీవల తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఆర్టికల్ 370ను గవర్నర్ ఇన్సీ చర్చలోకి తీసుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కంటే తమ పరిధిలో ఉన్న కమ్యూనిటీకి సేవలందించడంపై దృష్టి సారించాలని వ్యాఖ్యానించారు. ప్రతి దేశానికి సొంత సమస్యలున్నాయని, మన అంతర్గత సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు. అదే విధంగా 2021 సంవత్సరంలో 75 వసంతాల భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సియాటెల్లో భారీగా నిర్వహించబోతున్నట్లు టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. 20 వేల మందితో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని గవర్నర్ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. 2021 ఆగష్టు నాటికి కోవిడ్ పరిస్థితి తగ్గిపోతుందని, ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించవచ్చని ఆయన ఆశించారు. 2012లో విశ్వప్రసాద్ అప్పటి గవర్నర్ క్రస్టిన్ గ్రెగోయర్ వాణిజ్య ప్రతినిధి బృందాన్ని భారతదేశానికి సమన్వయపరిచారని, అలాగే 2021లో భారత దేశానికి ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేయాలని విశ్వ ప్రసాద్ గవర్నర్ ఇన్స్టీని కోరారు. గవర్నర్ ఈ విషయంపై స్పందించి తమ సానుకూలతతను తెలిపారు. -
నేను ఉండలేను
సియాటెల్ పోలిస్ చీఫ్ కార్మెన్ది పెద్ద వయసేమీ కాదు. కనీసం రిటైర్ అయ్యే వయసు కూడా కాదు. యూఎస్ పోలిస్ డిపార్ట్మెంట్లో 63 ఏళ్ల వరకు, ఫిట్గా ఉంటే ఆ పైన కూడా ఉద్యోగంలో వుండొచ్చు. కార్మెన్ వయసు 55. ఇంకా ఎనిమిదేళ్ల సర్వీస్ ఉండగానే ఆమె తన రిటైర్మెంట్కు బుధవారం నాడు నోటీసు ఇచ్చేశారు. పేరు, పొజిషన్ ఉన్న పోలిస్ ఆఫీసర్ రాజీనామా (హుందాగా ఆమె ‘రిటైర్మెంట్’ అని ఆ లేఖలో రాశారు) చేశారంటే తగిన కారణమే ఉంటుంది. సిటీ కౌన్సిల్ వాళ్లు ఈ ఏడాది కేటాయించిన 409 మిలియన్ డాలర్ల సియాటెల్ పోలిస్ శాఖ బడ్జెట్లో ఆకస్మాత్తుగా 3.5 మిలియన్ డాలర్ల కోత విధించారు! అది ఆమెకు ఆగ్రహం కలిగించింది. తగ్గించింది పెద్ద మొత్తంగా కనిపించక పోయినా, అసలు ‘తగ్గించడం’ అనేదే డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం లాంటిదని, అంటే.. అదొక నేరం వంటిదని కార్మెన్ తన రాజీనామా పత్రంతో నిరసన వ్యక్తం చేశారు. ‘వాళ్లు తగ్గించింది బడ్జెట్ను కాదు. పోలిస్ డిపార్ట్మెంట్ కాన్ఫిడెన్స్ని’ అంటున్నారు కార్మెన్. ఇప్పుడామె చేత తన ‘పదవీ విరమణ రాజీనామా’ నోటీసును వెనక్కు తీయించడానికి పైస్థాయిలో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ఏడాది మే 25న జరిగిన జార్జి ఫ్లాయిడ్ హత్యోదంతం తర్వాత అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో పోలీసుల ప్రవర్తనా నియమావళి కఠినతరం అయింది. పోలీసులకు ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలూ తగ్గిపోయాయి. -
సియాటిల్లో ఆందోళనలకు భారతీయురాలి సారథ్యం
వాషింగ్టన్/లండన్: అమెరికాలో మరోసారి జాతివివక్షకు నిరసగా ఆందోళనలు మొదలయ్యాయి. పోలీసుల దురుసు ప్రవర్తనతో చివరకు ఇద్దరు నల్లజాతీయులు జార్జ్ ఫ్లాయిడ్, రేషార్డ్ బ్రూక్స్ ప్రాణాలు కోల్పోయిన ఉదంతంలో నిరసనలు ఎక్కువయ్యాయి. సియాటిల్లో జరుగుతున్న ‘బ్లాక్లైవ్స్ మ్యాటర్’ ఆందోళనలకు 46 ఏళ్ల భారతీయ అమెరికన్ క్షమా సావంత్ నేతృత్వం వహిస్తున్నారు. సియాటెల్ డౌన్టౌన్ నుంచి పోలీసులను తొలగించాలన్న డిమాండ్పై ఆమె ఆందోళన చేస్తున్నారు. పుణేలో పుట్టి ముంబైలో చదువుకున్న క్షమా సావంత్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. సమాజంలోని ఆర్థిక అసమానతలను గమనించిన తాను ఆర్థిక శాస్త్రాన్ని చదివానని అందులోనే పీహెచ్డీ చేశానని ఆమె తెలిపారు. 2006లో సోషలిస్ట్ ఆల్టర్నేటివ్లో చేరి 2013లో సిటీ కౌన్సిల్ ఉమెన్గా ఎన్నికయ్యారు. బ్రిటన్లో జాతివివక్షపై కమిషన్.. బ్రిటన్లో జాతివివక్ష సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. జాతివివక్షకు ఫుల్స్టాప్ పెట్టే విషయంలో చేయాల్సింది ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు.. జార్జి ఫ్లాయిడ్ హత్యను నిరసిస్తూ అమెరికాలోని లాస్ఏంజెలెస్లోని హాలీవుడ్లో ‘ఆల్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ప్రదర్శనలో పాల్గొన్న వందలాది మంది ఆందోళనకారులు -
‘కరోనా’ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం!
వాషింగ్టన్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) నివారణకై కీలక ముందడుగు పడింది. ఈ మహమ్మారిని దీటుగా ఎదుర్కొనే క్రమంలో అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. సీటెల్లోని కైజర్ పర్మనెంటే వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(కేపీడబ్ల్యూహెచ్ఆర్ఐ) పరిశోధకులు రూపొందించిన వ్యాక్సిన్ను ఓ వ్యక్తిపై ప్రయోగించారు. భారత్, నార్వే సహాయ సహకారాలతో తొలి దశ ప్రయోగాన్ని ప్రారంభించారు. ఈ విషయం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ... ‘‘క్లినికల్ ట్రయల్స్లో భాగంగా తొలిసారిగా ఓ వ్యక్తికి వ్యాక్సిన్ ఇచ్చారని తెలియజేస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నా. అత్యంత తక్కువ సమయంలో ఇలా వ్యాక్సిన్ రూపొందించడం చరిత్రలో ఇదే తొలిసారి. దీని దరిదాపుల్లోకి మరెవరూ రాలేరు. వ్యాక్సిన్తో పాటు ఇతర యాంటీరైవల్ థెరపీలు, చికిత్సలు అభివృద్ధి చేస్తున్నాం’’అని సోమవారం పత్రికా సమావేశంలో పేర్కొన్నారు.(సీటెల్లో ‘కోవిడ్-19’ క్లినికల్ ట్రయల్స్!) కాగా కరోనాను ఎదుర్కొనేందుకు రూపొందించిన వ్యాక్సిన్ను 18 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యవంతులను ఎంచుకుని.. వారిపై ప్రయోగించనున్నట్లు కేపీడబ్ల్యూహెచ్ఆర్ఐ పరిశోధకులు వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తం 45 మందిని మూడు గ్రూపులుగా విభజించి.. సీటెల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయితే అందరికీ ఒకే డోసు ఇవ్వకుండా వారి రోగనిరోధక వ్యవస్థ పనితీరును పరిశీలిస్తామని వెల్లడించారు. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్చియస్ డిసీజెస్(ఎన్ఐఏఐడీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) సహాయంతో రూపొందించిన ఈ వ్యాక్సిన్కు ఎమ్ఆర్ఎన్ఏ-1273గా నామకరణం చేశారు. మసాచుసెట్స్లోని మెడెర్నాటీఎక్స్ బయోటెక్నాలజీ కంపెనీ భాగస్వామ్యంతో ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. ఇందుకు సంబంధించిన మొదటి దశ ట్రయల్స్కు ది కొలియేషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్(సీఈపీఐ) ఎంతగానో సహకరించిందని వెల్లడించారు.(కరోనా: వివాదం రేపిన ట్రంప్ ట్వీట్) చదవండి: కరోనా టీకా; అమెరికా కుయుక్తులు! కరోనా మరణాలు @ 7007 -
అలా కరోనా వైరస్ను జయించాను!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్) అగ్రరాజ్యం అమెరికాను కూడా వణికిస్తోంది. ఇప్పటికే వందల సంఖ్యలో కరోనా అనుమానితులు బయటపడగా.. పదుల సంఖ్యలో అక్కడ కరోనా మరణాలు సంభవించాయి. ఈ క్రమంలో ఓ మహిళ తాను కరోనాను జయించిన తీరు గురించి పంచుకున్నారు. ‘భయపడవద్దు... వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోండి. జాగ్రత్తలు పాటిస్తే ఈ ప్రాణాంతక వైరస్ను సులువుగా జయించవచ్చు’ అని ధైర్యం నింపారు. వివరాలు... సీటెల్కు చెందిన ఎలిజబెత్ స్కెదర్(37) ఓ బయోటెక్నాలజీ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఓ పార్టీకి వెళ్లి వచ్చిన అనంతరం ఫిబ్రవరి 25న ఆమెలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి.(‘కరోనా’పై ట్రంప్ కీలక నిర్ణయం) ఈ విషయం గురించి ఎలిజబెత్ చెబుతూ.. ‘‘ఆరోజు నిద్ర లేవగానే అలసటగా అనిపించింది. అయితే బిజీ లైఫ్లో ఇదంతా సహజమే కదా అనుకున్నాను. ఆఫీసుకు బయల్దేరాను. కానీ ఆ తర్వాత మెల్లగా తలనొప్పి మొదలైంది. దగ్గు మొదలైంది. ఒక్కసారిగా జ్వరం వచ్చింది. క్రమంగా 103 డిగ్రీలకు పెరిగింది. అప్పుడు నాకు కాస్త భయం వేసింది. ఫ్లూ భయం పట్టుకుంది. వెంటనే ఎమర్జెన్సీ రూంకు తీసుకువెళ్లారు. కొన్నాళ్ల తర్వాత దగ్గు, జ్వరం తగ్గిపోయింది. కాబట్టి నాకు కరోనా సోకే అవకాశమే లేదని అనుకున్నాను. అయితే ఎందుకైనా మంచిదే కదా అని డాక్టర్ను సంప్రదించాను. నాకు పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇంటికి వెళ్లమన్నారు. విశ్రాంతి తీసుకుంటూ.. ఫ్లూయిడ్స్ తీసుకోమని చెప్పారు. (కోవిడ్ ప్రపంచవ్యాప్త మహమ్మారి: డబ్ల్యూహెచ్ఓ) ఆ తర్వాత కొన్నిరోజుల తర్వాత నేను కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత మందులు వాడుతూ వర్క్ ఫ్రం హోం చేశాను. పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాను. బహిరంగ ప్రదేశాలకు వెళ్లడం మానేశాను. ఈ క్రమంలో 72 గంటల్లోనే కరోనా బలహీనపడటం మొదలుపెట్టింది. అలా కొన్నిరోజుల్లోనే కరోనాను జయించాను. కాబట్టి కరోనా గురించి ఎవరూ ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. నేను చెప్పేది ఒకటే భయపడవద్దు. ఒకవేళ కరోనా లక్షణాలు కనిపిస్తే ఇంట్లోనే ఉండండి. నీళ్లు ఎక్కువగా తాగండి. డాక్టర్ల సలహాలు తీసుకోండి. విశ్రాంతి తీసుకుంటూ మీకు నచ్చిన షోలు చూస్తూ ఎంజాయ్ చేయండి. ప్రశాంతంగా ఉండండి’’అని పేర్కొన్నారు. -
కోవిడ్-19: వ్యాక్సిన్ రెడీ.. క్లినికల్ ట్రయల్స్!
వాషింగ్టన్: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్)కు విరుగుడు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు శాయశక్తులా కృషి చేస్తున్నారు. పూర్తిస్థాయిలో వైరస్ను నాశనం చేయలేకపోయినా... దానిని ఎదుర్కొనేలా రోగనిరోధక శక్తి వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కైజర్ పర్మనెంటే వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు... తాము కనిపెట్టిన వ్యాక్సిన్తో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 18 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యవంతులను ఎంచుకుని.. వారిపై వ్యాక్సిన్ ప్రయోగించనున్నట్లు వెల్లడించారు. మొత్తం 45 మందిని మూడు గ్రూపులుగా విభజించి.. సీటెల్లో ఈ మేరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 14 నెలల్లో రెండు సార్లు వారికి వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేస్తామని.. అయితే అందరికీ ఒకే డోసు ఇవ్వకుండా వారి రోగనిరోధక వ్యవస్థ పనితీరును పరిశీలిస్తామని తెలిపారు. (కరోనా వైరస్తో మృతులు లక్షల్లో ఉండొచ్చు! ) కాగా మెడెర్నాటీఎక్స్ సంస్థ సహాయ సహకారాలతో తయారు చేసిన ఈ వ్యాక్సిన్కు.. కరోనా వైరస్ను బలహీనపరిచే లేదా అంతమొందించే శక్తి లేదని.. కేవలం అది దరిచేరకుండా తమ చుట్టూ ప్రోటీన్ను నిర్మించుకునేలా శరీరంలోని కణాలను ఉత్తేజితం చేసేందుకు ఉపయోగపడుతుందని వెల్లడించారు. తద్వారా రోగనిరోధ శక్తి పెరిగి కరోనాను ఎదుర్కో గల సామర్థ్యం పెంపొందుతుందని తెలిపారు. గతంలో వ్యాప్తిచెందిన జికా వైరస్, హ్యూమన్ మోటాప్నం వైరస్లను నిరోధించడానికి ఉపయోగించిన వ్యాక్సిన్ మాదిరే ఇది కూడా పనిచేస్తుందని.. క్లినికల్ ట్రయల్స్లో పాల్గొనాలకునేవారు తమను సంప్రదించవచ్చని పిలుపునిచ్చారు. దీని ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని పేర్కొన్నారు.(కరోనాను జయించి బయటకు వచ్చారు..) ఇక చైనాలోని వుహాన్ నగరంలో బయటపడిన కరోనా వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలపై పంజా విసురుతున్న విషయం తెలిసిందే. కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా గురువారం నాటికి 95,000 మంది ప్రజలకు వైరస్ సోకగా, 3,200 మంది మరణించారు. ఇప్పటి వరకు 80 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. చైనాలో తగ్గుముఖం పట్టిన వైరస్ వ్యాప్తి, చైనాలో కన్నా ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. భారత్లోనూ కరోనా భయం రోజురోజుకీ పెరిగిపోతోంది. (కరోనా అలర్ట్: కేంద్ర సిబ్బంది శాఖ కీలక నిర్ణయం!) కరోనా కల్లోలం.. అలర్ట్: వరుస కథనాల కోసం క్లిక్ చేయండి! -
సీఏఏకు వ్యతిరేకంగా సియాటెల్ తీర్మానం
వాషింగ్టన్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా భారత్లో పెద్ద ఎత్తున నిరసలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అమెరికాలోని కొన్ని నగరాల్లోని ఎన్ఆర్ఐలు సీఏఏకు మద్దతుగా ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ.. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తూ సియాటెల్ నగర కౌన్సిల్ తీర్మానం చేసింది. ఈ చట్టం ముస్లింలు, అణగారిన వర్గాలు, మహిళలు, ఎల్జీబీటీలపై వివక్ష చూపుతోందని పేర్కొంది. భారతీయ అమెరికన్ సిటీ కౌన్సిల్ సభ్యుడు క్షమా సావంత్ సీఏఏ రద్దు తీర్మానాన్ని కౌన్సిల్లో ప్రవేశపెట్టారు. భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సీఏఏను రద్దు చేయడం ద్వారా భారత రాజ్యాంగంపై నమ్మకం పెరుగుతుందని ఆయన అన్నారు. అదేవిధంగా జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ)ను నిలిపివేసి ఐక్యరాజ్యసమితి ఒప్పందాల ప్రకారం శరణార్థులకు సాయం చేయాడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ రద్దు చేయాలని సియాటెల్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ అధ్యక్షుడు అహ్సాన్ ఖాన్ సమర్ధించారు. ‘మత స్వేచ్చను అణగదొక్కాలని చూసేవారికి ఈ తీర్మానం ఓ సందేశంగా మారుతుంది. ప్రజల పట్ల ద్వేషం, మతోన్మాదంతో ప్రవర్తించకూడదు. కొన్ని చట్టాల విషయంలో అంతర్జాతీయ ఆమోదాన్ని కూడా పొందాలి’ అని ఆయన తెలిపారు. ఇటీవల పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ కూడా తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించాలనుకున్న విషయం తెలిసిందే. -
సియాటిల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
సీటెల్: బతుకమ్మ పండుగ వేడుకలను దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సియాటిల్లో నిర్వహించిన ఈ వేడుకలకు మహిళలు అందమైన పూలతో బతుకమ్మలను తయారు చేసి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సంబరాలకు సియాటిల్ నలుమూలల నుంచి 4000 మందికిపైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమానికి తెలుగు సినీపరిశ్రమకు చెందిన యాంకర్ అనసూయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన గాయని స్వాతి కూడా యూకే నుంచి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. వీరిద్దరు తమదైన శైలిలో అక్కడున్న వారితో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు. విదేశాల్లో స్థిరపడ్డా కానీ, తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది. బోథెల్ వాలంటీర్ల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏడడుగుల బతుకమ్మ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెడ్మండ్ జట్టు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధోల్ తాషా సాంస్కృతిక కార్యక్రమాలు హైలెట్గా నిలిచాయి. టాటా సియాటిల్ బృందం ఎగ్జిక్యూటివ్ వైస్ప్రెసిడెంట్ వంశీరెడ్డి, బోర్డు డైరెక్టర్లు నవీన్ గోలి, ప్రదీప్ మెట్టు, ఆర్వీపీ గణేష్, మనోహర్, నిక్షిప్త, అజయ్, ఆర్సీ శ్రీకాంత్, శివ అధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వేడుకలను ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన టాటా సియాటిల్ బృందం సభ్యులను భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని కోరుతూ, కార్యక్రమానికి హాజరైనవారందరూ వారిని ప్రత్యేకంగా అభినందించారు. టాటా సియాటిల్ బృందం ఈ కార్యక్రమాన్ని స్థానిక తెలంగాణ అసోసియేషన్స్ వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ (వాటా), తెలుగు అసోసియేషన్ వాట్స్ (వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్) తో కలిసి నిర్వహించింది. -
గూగుల్ క్యాంపస్లో కూలిన క్రేన్.. నలుగురి మృతి
సియాటెల్: గూగుల్ క్యాంపస్లో నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న క్రేన్ కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురికి గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని సియోటల్లో గూగుల్ నిర్మిస్తున్న నూతన క్యాంపస్కు సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో బిల్డింగ్పై నుంచి క్రేన్ భాగాలు రద్దీగా ఉండే రోడ్డుపై పడిపోయాయి. దీంతో దాదాపు ఆరు కార్లు ధ్వంసం అయ్యాయి. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో కార్లలోని ఇద్దరు వ్యక్తులతోపాటు, ఇద్దరు క్రేన్ ఆపరేటర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించారు. అయితే క్రేన్ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. -
‘ది సోఫియా వే’లొ టాటా ఫుడ్ డ్రైవ్
సియాటెల్: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్(టాటా) సియాటెల్ విభాగం ఆధ్వర్యంలో ‘ది సోఫియా వే’లో ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ది సోఫియా వే అనేది ఆవాసం లేని మహిళలకు షెల్టర్ కల్పిస్తుంది. ఈ కార్యక్రమానికి టాటా సియోటెల్ కమ్యూనిటీ నుంచి విశేష స్పందన వచ్చింది. మార్చి 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు ది సోఫియా వేకు వెళ్లిన టాటా వాలెంటీర్స్ అక్కడి మహిళలకు పలు రకాలు ఆహారాన్ని అందజేశారు. కాఫీ, టీ, షుగర్, సలాడ్, బ్రీడ్స్, కూరగాయలు, జూస్లు ఇచ్చారు.దాతలు, తెలంగాణ కమ్యూనిటీ సాయంతో భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని భావిస్తున్నట్టు టాటా సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాలెంటీర్స్ టాటా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
సియాటెల్లో దుండగుడి కాల్పులు, ఇద్దరు మృతి
వాషింగ్టన్: ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, పలువురు తీవ్ర గాయలపాలైన ఘటన బుధవారం వాషింగ్టన్లోని సియాటెల్ నగరంలో చోటుచేసుకుంది. ఘాతుకానికి పాల్పడ్డ దుండగుడు ముందుగా ఒక వాహనం దగ్గరికి వెళ్లి అందులోని మహిళపై కాల్పులు జరిపాడు. తర్వాత సమీపంలోని మెట్రో బస్సు మీద దాడికి తెగబడ్డాడు. ఆ కాల్పుల్లో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో కూడా సదరు డ్రైవర్ బస్సును ఆగంతకుడికి దూరంగా తీసుకెళ్లి, ప్రయాణికుల్ని రక్షించే ప్రయత్నం చేశాడు. కొద్ది క్షణాలకే ఆ డ్రైవర్ మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పోలీసులు నిందితుడ్ని పట్టుకునే ప్రయత్నం చేయగా.. వారి నుంచి తప్పించుకునే క్రమంలో అతడు కారులో వేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో సదరు కారు డ్రైవర్ కూడా మరణించాడని.. కొద్దిసేపటి తర్వాత కాల్పులు జరిపి, నిందితుడ్ని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. బస్పు దాడిలో గాయపడ్డ ప్రయాణికులను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. నిందితుడికి కూడా గాయాలవడంతో అతడిని హార్బోర్వ్యూ మెడికల్ సెంటర్లో చేర్పించి పోలీసుల గస్తీలో ఉంచారని తెలుస్తోంది. -
గర్భవతి అయిన తల్లిని తుపాకితో కాల్చిన చిన్నారి
వాషింగ్టన్ : గర్భవతి అయిన తల్లిని నాలుగేళ్ల చిన్నారి తుపాకీతో కాల్చిన షాకింగ్ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీటెల్కు చెందిన 8 నెలల గర్భిణి తన ప్రియుడితో కలిసి టీవీ చూస్తోంది. ఆ సమయంలో పక్క గదిలో ఆడుకుంటున్న వారి కొడుకుకు బెడ్ కింద తుపాకీ దొరికింది. ఆడుకుంటూ తల్లి వద్దకు వచ్చిన చిన్నారి వెనుక నుంచి ఆమె తలపై కాల్పులు జరిపాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ చిన్నారి తండ్రి ఆమెను ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, అయితే ఈ కేసులో చిన్నారి తండ్రి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని కింగ్స్ కంట్రీ షెరిఫ్ ఆఫీస్ ప్రతినిధి రియాన్ అబాట్ తెలిపారు. కాగా తమ వద్ద ఉన్న తుపాకీని భద్రపరచని పక్షంలో ఎవరైనా దానిని ఉపయోగించినట్లైతే.. తుపాకీ యజమానే శిక్ష అనుభవించాల్సి ఉంటుందనే తీర్మానంపై వాషింగ్టన్ ఓటర్లు సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా బాలుడి తండ్రి ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని రియాన్ తెలిపారు. అయితే ఆ గన్ తన స్నేహితుడిది అని అతడు చెప్పాడని.. ఈ క్రమంలో అతడిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. గన్కల్చర్ను రూపుమాపే క్రమంలో ఇటువంటి కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
సీటెల్లో ఘనంగా దసరా సంబరాలు
సీటెల్ : వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. సీటెల్లోని తెలుగు వారు బెల్లెవులే హై స్కూల్లో బతుకమ్మ ఉత్సవాలు వేడుకగా జరిగాయి. సీటెల్ ప్రాంతానికి చెందిన దాదాపు వేయి మంది తెలుగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడపడుచులు అందమైన పూలతో బతుకమ్మలను పేర్చి సాంప్రదాయ వస్త్రాధరణలో బతుకమ్మ పాటలు ఆడి పాడారు. ఈ కార్యకమంలో తెలంగాణ సింగర్ మధు ప్రియ, బాహుబలి సింగర్ సత్య యామిని తమ గాత్రంతో ఆకట్టుకున్నారు. ఈసారి సీటెల్ తెలుగు వాళ్లు అతి పెద్ద బతుకమ్మను పేర్చి ఉరేగింపుగా తీసుకువచ్చారు. ప్రతి ఏడాది సామాజిక సేవ చేసే తెలంగాణ మహిళలకు 'వుమెన్ అఫ్ ది ఇయర్' అవార్డును తెలంగాణ అసోసియేషన్ అందించింది. 2018 ఏడాదికి గానూ వుమెన్ ఆఫ్ది ఇయర్ అవార్డు అరవిందరెడ్డికి సీ2ఎస్ ఛైర్మన్ జగన్ చిట్టిప్రోలు చేతుల మీదుగా ఇచ్చారు. బోర్డు మెంబెర్స్ రాజ్, సూర్యప్రకాష్ రెడ్డి, సంగీతా రెడ్డి , శ్రీధర్, రాజా, రామ్, సాయి, శ్రీధర్ల ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ వేడుకలు జరిగాయి. -
వందల మంది ఉద్యోగులను తీసేస్తున్న అమెజాన్
సీటెల్ : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా తన ఉద్యోగులపై వేటు వేస్తోంది. వందల మంది ఉద్యోగులను అమెజాన్ తొలగిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఎక్కువ లేఆఫ్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం సీటెల్లో ఉన్నట్టు పేర్కొన్నాయి. గ్లోబల్ వ్యాపారాలలో కూడా వందల మందిని తొలగిస్తుందని తెలిపాయి. ఉద్యోగులను తొలగించే ప్రక్రియ కొన్ని వారాల క్రితమే ప్రారంభమైందని తెలిసింది. ఎక్కువగా వృద్ధి చెందుతున్న వ్యాపారాల్లో కొత్త ఉద్యోగులను నియమించుకుంటూ.. పాత రిటైల్ బిజినెస్ ఉద్యోగులపై అమెజాన్ వేటు వేస్తున్నట్టు వెల్లడవుతోంది. ''తమ వార్షిక ప్రణాళిక ప్రక్రియలో భాగంగా.. కంపెనీ అంతటా ఉద్యోగుల కార్యనిర్వాహక సర్దుబాట్లు చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగులను తగ్గించి, మరికొన్ని ప్రాంతాల్లో కొత్తవారిని నియమించుకుంటున్నాం'' అని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే మొత్తంగా మాత్రం కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం లేదని తెలిపింది. ఇటీవల కాలంలో కూడా అమెజాన్ ఉద్యోగ నియామకాలను బాగానే చేపట్టింది. గత ఏడాది కంపెనీ లక్షా 30వేల మందిని నియమించుకుంది. దీంతో 2017 చివరి నాటికి అమెజాన్ ఉద్యోగుల సంఖ్య 5 లక్షల 60వేలకు చేరింది. అంతేకాక కంపెనీ నార్త్ అమెరికాలో రెండో ప్రధాన కార్యాలయాన్ని తెరబోతుంది. దీనిలో 50వేల మంది ఫుల్-టైమ్ వర్కర్లను నియమించుకోబోతుంది. వీరిలో ఎక్కువ మంది అత్యధిక వేతనం అందుకునే వారనే తెలిసింది. ప్రస్తుతం కంపెనీ చేపడుతున్న ఈ లేఆఫ్స్ ప్రక్రియ, కొత్త ఉద్యోగస్తుల నియామకాలపై ప్రభావం చూపదని కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి. -
చెన్నై అమ్మాయికి అరుదైన గౌరవం
చెన్నై : అమెరికన్ రవాణా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న భారతీయ అమెరికన్ షెఫాలీ రంగనాథన్(38)కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రఖ్యాత నగరం సియాటెల్కు ఆమె డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. 2014-15 నుంచి సియాటెల్ రవాణా రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న ట్రాన్స్పోర్టేషన్ చాయిసెస్ కొలేషన్లో ఆమె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. షెఫాలీలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన సియాటెల్ మేయర్ జెన్నీ డెర్కన్ తన టీమ్లో చేర్చుకుని నగరానికి డిప్యూటీ మేయర్గా నియమించారు. చిన్నతనం నుంచి షెఫాలి చురుకైన వ్యక్తి అని, చదువులోనూ, ఎంచుకున్న వృత్తిలోనూ ముందుండేదని ఆమె తండ్రి ప్రదీప్ రంగనాథన్ తెలిపారు. ఆయన 2001లో కుటుంబంతో సహా అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. షెఫాలీ పాఠశాల విద్యాభ్యాసం అంతా చెన్నైలోని నూగంబాక్కంలో సాగింది. స్టెల్లా మేరీస్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం అన్నావర్సిటీ నుంచి పర్యావరణ శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించారు. -
ప్లాన్ చేసి.. క్యాబ్లో రైడ్కు తీసుకెళ్లి!
వాషింగ్టన్: భార్యతో తన వైవాహిక బంధంపై విసుగు చెందిన ఓ భర్త ప్లాన్ ప్రకారం ఆమెను హత్యచేశాడు. ఈ ఘటన ఆమెరికాలోని సీటెల్లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. నిందితుడిని అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో హాజరుపరచగా బెయిల్పై విడుదలయ్యాడు. ఆ వివరాలిలా ఉన్నాయి... కామెరాన్ జాన్ ఎస్పీటియా(31), జెన్నిఫర్ ఎస్పీటియా(29) భార్యాభర్తలు స్థానిక సీటెల్లో నివాసం ఉంటున్నారు. కామెరాన్ అమెరికా కోస్ట్ గార్డులో విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలం నుంచి భార్య జెన్నిఫర్తో ఆయనకు విభేదాలున్నాయి. ఆమెతో సంసార బంధం కొనసాగకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కామెరాన్ భార్యను అంతమొందించేందుకు ప్లాన్ చేశాడు. ప్లాన్ ప్రకారం.. రైడ్కు వెళ్దామని జెన్నిఫర్ను ఒప్పించి ఉబర్ క్యాబ్ బుక్ చేశాడు. మద్యం మత్తులో ఉన్న కామెరాన్ క్యాబ్ ఎక్కినప్పటినుంచి భార్యతో గొడవపడుతూనే ఉన్నాడు. కొంతసేపయ్యాక క్యాబ్ డ్రైవర్ ఓ పెద్ద శబ్దం విన్నాడు. కారు టైర్ పేలిందేమోనని కంగారుపడి వెనక్కి తిరిగి చూసి షాక్ తిన్నాడు. జెన్నిఫర్ ఆమె సీట్లో నిర్జీవంగా పడి ఉంది. కారు బాగానే ఉన్నా.. తన ప్రాణాలకు ముప్పు ఉందని గమనించిన డ్రైవర్.. ఎక్కడికి వెళ్లాలో చెప్పండి సార్ అని కామెరాన్ను అడిగాడు. అతడు చెప్పిన ప్రాంతంలో క్యాబ్ ఆపగా.. భార్య మృతదేహాన్ని దించి, డ్రైవర్కు డబ్బులు చెల్లించాడు. జరిగిన విషయాన్ని ఉబర్ డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. ఆ సమాచారంతో నిందితుడు కామెరాన్ ఇంటికి వెళ్లి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. జెన్నిఫర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆప్పత్రికి తరలించినట్లు చెప్పారు. భార్యతో శారీరక బంధం కొనసాగడం లేదని, అందువల్లే ఆమెను తుపాకీతో కాల్చి హత్యచేశానని కామెరాన్ అంగీకరించాడు. సోమవారం కామెరాన్ను కోర్టులో ప్రవేశపెట్టగా.. జడ్జి నిర్ణయం ప్రకారం మూడు మిలియన్ల అమెరికన్ డాలర్లు చెల్లించి బెయిల్పై విడుదలయ్యాడు. తదుపరి విచారణ జులై6కు వాయిదా వేశారు. సెకండ్ డిగ్రీ హత్య నేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అమెజాన్ బిల్డింగ్ పైనుంచి దూకేసిన ఉద్యోగి..
అమెజాన్ కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సీటిల్ లోని కంపెనీ కేంద్ర కార్యాలయంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు ఉద్యోగి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పారు. అంతకుముందు తోటి ఉద్యోగులకు, కంపెనీ సీఈవో జెఫ్ బెజోస్ కు ఆయన ఓ ఈ-మెయిల్ పంపారని తెలిపారు. సోమవారం ఉదయం 8.45 గంటల సమయంలో 12 అంతస్తుల అమెజాన్ అపోలో బిల్డింగ్ నుంచి ఉద్యోగి దూకినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయన్ను ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం తనను వేరే డిపార్ట్ మెంటుకు పంపాలని సదరు ఉద్యోగి కోరినట్లు తెలిసింది. కానీ అతన్ని ఇంప్రూవ్ మెంట్ ప్లాన్(పర్ఫార్మెన్స్ మెరుగుపర్చుకోకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తారు)లో వేసినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి చెప్పారు. ఈ-మెయిల్ సారాంశంలో డిపార్ట్ మెంటును మార్చాలనే అభ్యర్ధనను కంపెనీ తీసుకున్న తీరు తనను కలిచివేసిందని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నారని తెలిసింది. అమెజాన్ కేంద్ర కార్యాలయంలో 20వేల మంది పని చేస్తున్నారు. ఘటనపై స్పందించిన అమెజాన్ తమ ఉద్యోగి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఆ ఉద్యోగి వివరాలను కంపెనీ బయటకు వెల్లడించలేదు. -
ట్రంప్ వ్యతిరేక ర్యాలీలో కాల్పులు
సీటిల్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ఎన్నికకు వ్యతిరేకంగా సీటిల్ నగరంలో జరిగిన ర్యాలీలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు గాయపడగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంత మంది వ్యక్తుల మధ్య వాగ్వాదమే ఘటనకు కారణమని చెప్పారు. అయితే, ఆ వాగ్వాదం ట్రంప్ ఎన్నికపై కాదని తెలిపారు. ర్యాలీలో ఉన్న వ్యక్తితో గొడవ పడిన మరో వ్యక్తి జన సమూహం నుంచి బయటకు వచ్చి కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయినట్లు చెప్పారు. ర్యాలీ వద్దే ఉన్న పోలీసు, ఫైర్ డిపార్ట్ మెంట్ శాఖ అధికారులు వెంటనే ఘటనాస్ధలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. -
ప్రముఖ హాలీవుడ్ సింగర్ కన్నుమూత
సీటెల్: ప్రముఖ హాలీవుడ్ సింగర్, నాలుగుసార్లు గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన ఎర్నెస్టీన్ ఆండర్సన్ (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె తుదిశ్వాస విడిచారు. వయోభారంతో వచ్చే సమస్యల కారణంగా షోరెలైన్ లోని ది కింగ్ కౌంటీ మెడికల్ హాల్ లో చికిత్స పొందుతున్న ఆమె మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆండర్సన్ ప్రపంచ వ్యాప్తంగా తన గానామృతంతో ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నడీ సెంటర్, కార్నిజీ హాల్లో ఎక్కువ ప్రదర్శనలు, జపాన్, యూరప్ తదితర దేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందారు. ఒకసారి అధ్యక్ష పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంలో కూడా ఆమె ప్రోగ్రాం నిర్వహించారు. గాయనిగా మొత్తం 60 ఏళ్ల జీవిత కాలంలో నాలుగుసార్లు గ్రామీ అవార్డుకు నామినేట్ అయ్యి రికార్డు సృష్టించారు. -
ఆరోరా బ్రిడ్జిపై యాక్సిడెంట్
-
అతిథిగా వచ్చిఅత్యాచారం చేసిన మహిళ!
సియాటిల్: పిలవకుండానే అతిథిగా వచ్చిన ఓ మహిళ మగాడిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన అమెరికాలోని సియాటిల్ పట్టణంలో ఆలస్యంగా వెలుగుచూసింది. గత జూన్ నెలలో చంటాయ్ గిల్మాన్ (26) అనే మహిళ ఓ ఇంటికి కాని సమయంలో వచ్చి ఓ వ్యక్తిపై అత్యాచారానికి పాల్పడినట్లు రుజువైంది. జూన్ 17 వ తేదీన 5.7 అంగుళాలు ఉన్న గిల్మాన్ అనే మహిళ ఓ వ్యక్తి ఇంట్లో నిద్రిస్తున్నసమయంలోఅతని వద్దకు వచ్చి లైంగిక చర్యలకు దిగింది. దీంతో మేల్కొన్న ఆ వ్యక్తి ఆమెను బలవంతంగా బయటకు నెట్టేశాడు. అనంతరం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా విడుదల చేసిన డీఎన్ఏ పరీక్షలో ఆమె అత్యాచారం చేసినట్లు తేలడంతో పోలీసులు గిల్మాన్ పై రెండో డిగ్రీ అత్యాచారం కేసు నమోదు చేశారు. అయితే అత్యాచారం చేసిన ఆరోపణలపై మాట్లాడటానికి ఆమె నిరాకరించింది. కాగా, ఆమె గత కొంతకాలంగా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఆమె తమ బంధువుల్లో వ్యక్తేనని బాధితుడు పేర్కొన్నాడు. -
దాతృత్వంలో ‘ఫేస్బుక్’ ముందంజ
సియాటెల్: గతేడాది అత్యధిక మొత్తాన్ని సామాజిక కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చిన దాతలుగా ‘ఫేస్బుక్’ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బెర్గ్, ఆయన భార్య ప్రిస్కిల్లా చాన్ నిలిచారు. ఈ దంపతులు 2013 డిసెంబర్లో ఒక స్వచ్ఛంద సంస్థకు దాదాపు రూ. 6,000 కోట్ల విలువైన 1.8 కోట్ల ఫేస్బుక్ షేర్లను విరాళంగా ఇచ్చారు. ప్రతీ ఏటా అమెరికాలోని దాతృత్వ కార్యక్రమాల కోసం విరాళాలు ఇచ్చే 50 మంది పేర్లను ‘క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రపీ’ మేగజైన్ ప్రకటిస్తుంటుంది. తాజాగా 2013కు గాను అత్యంత దాతృత్వం గల వ్యక్తుల జాబితాను ప్రకటించింది. వీరు దాదాపు రూ. 50,000 కోట్లను ఈ ఏడాది వివిధ విద్యాలయాలు, స్వచ్ఛంద, సామాజిక సంస్థలకు విరాళంగా ఇవ్వగా, మరి కొందరు మరో రూ. 25 వేల కోట్ల వరకు విరాళాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా ఈ సారి ఎక్కువ శాతం విరాళాలు శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు, కళాశాలలకే వచ్చినట్లు మేగజైన్ ఎడిటర్ స్టేసీ పాల్మర్ పేర్కొన్నారు. -
సియాటిల్లో ఘనంగా చవితి వేడుకలు
సియాటిల్ నగరంలో ఇస్సాక్వాలోని ఉన్నత పాఠశాలలో వినాయక చవితి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయని నిర్వాహాకులు మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆ వేడుకలకు ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని తెలిపారు. ప్రమద గణాలకు అది నాయకుడైన వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు భారతి సంస్థను ప్రారంభించినట్లు వెల్లడించారు. 'నిలుపు తెలుగు వెలుగు, నేర్పు తెలుగు పలుకు' అంటూ తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని ముందు తరాల వారికి అందించడమే ధేయ్యంగా ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సుమారు ఆరుగంటల పాటు సాగిన ఆ కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందులోభాగంగా నృత్యాలు, నృత్య నాటికలు, హాస్య నాటికలు ప్రవాసాంధ్రులను రంజిపంచేశాయి. అసంఖ్యాకంగా ప్రవాసాంధ్రులు ఆ కార్యక్రమానికి విచ్చేశారని తెలిపారు. అలాగే చిన్నలు నుంచి పెద్దల వరకు సుమారు 60 మంది ప్రవాసాంధ్రులు ఆ రంగస్థలంపై తమ నటనా కౌశలాని ప్రదర్శించారని పేర్కొన్నారు. నాట్య కళారత్న శ్రీపసుమర్తి వేంకటేశ్వర శర్మ దర్శకత్వంలో రూపొందిన సీతాస్వయంవరం కూచిపూడి నృత్యరూపకం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు భారతి నిర్వహించే తరగతులకు హాజరయ్యేందుకు పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ చేసి పుస్తకాలు అందించారు. ఆ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సహకరించిన ప్రతిఒక్కరికి ఈ సందర్భంగా నిర్వాహాకులు కృతజ్ఞతలు తెలిపారు.