Visakhapatnam Agency
-
చలి పంజా
సాక్షి, అమరావతి/సాక్షి, పాడేరు: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. నెలరోజుల నుంచి తగ్గుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఇంకా పడిపోతున్నాయి. ఈ ఏడాది గతం కంటే దారుణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి పెరిగిపోయింది. సాధారణంగా ఈ సమయంలో 22 నుంచి 26 డిగ్రీల వరకూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఏజెన్సీ ప్రాంతాల్లో 18 నుంచి 22 డిగ్రీల వరకూ కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండేవి. కానీ.. తాజాగా మైదాన ప్రాంతాల్లోనే 18 నుంచి 24 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖ ఏజెన్సీతోపాటు రాయలసీమ రీజియన్లోనూ చాలాచోట్ల 12 నుంచి 20 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గతం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీలకు మించడం లేదు.ఏజెన్సీలో చలి విజృంభణచలితో ఏజెన్సీలో ప్రజలు వణుకుతున్నారు. మళ్లీ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు శుక్రవారం పడిపోయాయి. సాయంత్రం నుంచే చలిగాలులు వీస్తున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తోంది. రాత్రి సమయంలో చలిప్రభావం మరింత అధికంగా ఉంటుంది. దీంతో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. అరకులోయలో 8.2 డిగ్రీలు, జి.మాడుగుల 9, డుంబ్రిగుడ 9.2, అనంతగిరి 9.5, జీకే వీధి 9.8, పాడేరు మండలం మినుములూరు 10, హుకుంపేట 10.5, చింతపల్లి 10.6, కొయ్యూరు 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు శుక్రవారం నమోదయ్యాయి.వణుకుతున్న ఏజెన్సీఅల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో డిసెంబర్ 16న అతి తక్కువగా 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడంతో అక్కడి ప్రజలు గజగజ వణికిపోయారు. ఈ నెల 4న అరకు సమీపంలోని కుంటలో 4.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, అనంతగిరి, డుంబ్రిగుడ తదితర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో 7 నుంచి 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే చాలాచోట్ల ఏజెన్సీలో 12 నుంచి 15 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. కానీ.. ఇప్పుడు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ అంతకంతకు పడిపోతున్నాయి. రాయలసీమలోని వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 15 నుంచి 23 డిగ్రీల వరకూ పడిపోయాయి.ఎల్నినో ప్రభావమే కారణంనైరుతి రుతుపవనాలు తిరోగమించే సమయంలో ఈసారి రాష్ట్రమంతటా వర్షాలు కురిశాయి. డిసెంబర్ చివరి వరకూ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లగా మారిపోయింది. ఎల్నినో ప్రభావంతో ఈ పరిస్థితి నెలకొన్నట్టు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారం వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వేకువజామున మంచు ఎక్కువగా కురుస్తుండటంతో వాహనాల రాకపోకలు స్తంభిస్తున్నాయి.దట్టమైన మంచులో వాహనాలు వెళ్లేందుకు దారులు కనిపించడంలేదు. చాలా ప్రాంతాల్లో ఉదయం 10 గంటలు దాటితే గానీ మంచు వీడటం లేదు. చలికి చల్లగాలులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు, చిన్నారులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఉద్యోగాలకు వెళ్లేవారు, రైతులు, కార్మికులు, ఇతర పనులు చేసుకునేవారు సైతం బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. -
ఇక లంబసింగి.. లెక్క పక్కా..!
సాక్షి, విశాఖపట్నం: లంబసింగి.. ఈ పేరు వింటే అందరికీ గుర్తుకొచ్చేది అందమైన, ఎత్తయిన కొండ ప్రాంతం. రాష్ట్రంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఓ కుగ్రామం. పర్వత శ్రేణుల్లో మంచు సోయగాలతో పర్యాటకులను అమితంగా ఆకర్షించే పర్యాటక ప్రదేశం. ఆంధ్రా కశీ్మరుగా ఖ్యాతి గడించింది. ‘0’(సున్నా) డిగ్రీల కనిష్ట (రాత్రి) ఉష్ణోగ్రతల నమోదుతో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అందుకే శీతాకాలం వచ్చిందంటే చాలు.. లంబసింగికి టూరిస్టులు క్యూ కడతారు. దేశ, విదేశాల నుంచి వచ్చి వాలతారు. అక్కడ ప్రకృతి అందాలను తనివి తీరా ఆస్వాదిస్తారు. శీతాకాలంలో లంబసింగిలో ‘జీరో’ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందట! అంటూ జనం తరచూ విశేషంగా చర్చించుకుంటారు. కానీ ఆ లెక్క పక్కా కాదని ఎంతమందికి తెలుసు? అక్కడ ఉష్ణోగ్రతలను గాని, వర్షపాతాన్ని గాని నమోదు చేసే యంత్రాంగం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో లంబసింగి ఉంది. ఇక్కడికి 19.7 కిలోమీటర్ల దూరంలోని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్ఏఆర్ఎస్)లో నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతల కంటే లంబసింగిలో రెండు డిగ్రీలు తక్కువగా రికార్డయినట్టు చెబుతున్నారు. ఉదాహరణకు చింతపల్లిలో 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైతే లంబసింగిలో ‘0’ డిగ్రీలు రికార్డయినట్టు అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్లూ దీనినే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లంబసింగిలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ (ఏడబ్ల్యూఎస్)ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. దీనిని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఏర్పాటు చేయాల్సి ఉంది. గతంలో దీనిపై కొంత కసరత్తు జరిగినా ఆ తర్వాత మరుగున పడింది. లంబసింగిలో ఏఆర్జీ.. తాజాగా భారత వాతావరణ విభాగం (ఐఎండీ) లంబసింగిలో ఆటోమేటిక్ రెయిన్ గేజ్ (ఏఆర్జీ) స్టేషన్ను మంజూరు చేసింది. లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) సమీపంలో దీనిని ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ ఏఆర్జీ ఏర్పాటయితే ఆ ప్రాంతంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు వర్షపాతం, గాలిలో తేమ శాతం రికార్డవుతాయి. దీని నిర్వహణను విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం (సీడబ్ల్యూసీ) చూస్తుంది. మరికొన్నాళ్లలో లంబసింగిలో ఏఆర్జీ సిస్టం అందుబాటులోకి వస్తుందని, అప్పటినుంచి అక్కడ కచ్చితమైన వాతావరణ సమాచారం రికార్డవుతుందని సీడబ్ల్యూసీ డైరెక్టర్ సునంద ‘సాక్షి’కి చెప్పారు. సముద్రమట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో.. లంబసింగి తూర్పు కనుమల పర్వత శ్రేణుల్లో ఎత్తయిన ప్రదేశంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. చుట్టూ కాఫీ తోటలు, యూకలిప్టస్ చెట్లతో నిండి ఉంటుంది. సముద్రమట్టానికి అరకు 2,700 అడుగులు, చింతపల్లి 2,800 అడుగుల ఎత్తులోనూ ఉంటే లంబసింగి 3,000 అడుగుల (వెయ్యి మీటర్ల) ఎత్తులో ఉంది. దీంతో లంబసింగి శీతాకాలంలో పొగమంచు దట్టంగా అలముకుని ఆహ్లాదం పంచుతుంది. మంచు ఐస్లా గడ్డ కట్టుకుపోతుంది. అంతేకాదు.. అత్యల్ప (0–3 డిగ్రీల) ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రత్యేకతను చాటుకుంటోంది. లంబసింగి అందాలను చూడడానికి వచ్చే పర్యాటకుల కోసం పర్యాటకశాఖ గుడారాలను కూడా ఏర్పాటు చేసింది. కొర్రబయలు నుంచి లంబసింగి.. లంబసింగికి కొర్రబయలు అనే పేరు కూడా ఉంది. కొర్ర అంటే కర్ర. బయలు అంటే బయట అని అర్థం. ఎవరైనా చలికాలంలో మంచు తీవ్రతకు ఇంటి బయట పడుకుంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారని, అందుకే కొర్రబయలు పేరు వచ్చిందని చరిత్ర కారులు చెబుతారు. -
‘ఔషధాల అడ్డా’కు
హుకుంపేట(అరకు): గిరిజన ప్రాంతంలో ఆరోగ్యపరంగా, వాణిజ్యపరంగా పేరు గాంచింది అడ్డ తీగ. ఫణెర వహ్లి అనే శాస్త్రీయ నామంతో పిలిచే ఈ అడ్డ చెట్లు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో అడవితో పాటు పలు చోట్ల సహజంగాను పెరుగుతాయి. ఈ అడ్డ ఆకులతో విస్తరాకులు, బెరడుతో తాళ్లు, అడ్డ గింజలు.. ఇలా చెట్టులోని అన్ని భాగాలు గిరిజనులకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ ఆకులను, గింజలను, అడవుల నుంచి సేకరించి వారపు సంతల్లో విక్రయిస్తుంటారు. సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్లు అడ్డ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన ఈ ఆకులను తింటే ఆరోగ్యానికి మేలు చేకూరటమే కాక, జీర్ణ సంబంధిత సమస్యలు కూడ తగ్గుతాయి. అడ్డ గింజల్లో ప్రోటీన్, కాల్షియం ఇంకా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది షుగర్ బారిన పడకుండా కాపాడుతుంది. ఏజెన్సీలో సంక్రాంతి రోజు గిరిజన సంప్రదాయ వంటకం పులగంలో ఈ అడ్డ గింజలు వేసి దేవతలకు నివేదిస్తారు. ఆ తర్వాత పులగాన్ని అడ్డాకులలో భుజిస్తారు. కొన్ని ప్రముఖ దేవాలయాల్లో అడ్డాకులను ప్రసాదం ప్యాకింగ్ కోసం నేటికీ వాడుతుండటం విశేషం. నేటి తరానికి వివరించాలి క్రమేపీ గిరిజనుల్లో అడ్డ ఆకుల సంప్రదాయపు అలవాట్లు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత తరానికి వీటి ప్రాముఖ్యత తెలియక వాటిని పట్టించుకోవటం లేదు. మరోవైపు అడ్డాకుతో తయారయ్యే విస్తరాకుల ఉత్పత్తి తగ్గటం వలన పేపర్ ప్లేట్ వాడటం పెరిగింది. పేపర్ ప్లేట్లు పర్యవరణానికి అంత అనుకూలమైనది కాదు కనుక ఈ అడ్డతీగ ప్రాముఖ్యత అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. సహజంగా దొరికే ఈ అడ్డాకులతో విస్తర్లుగా చేసి పేపర్ ప్లేట్లకు ప్రత్యామ్నయంగా వాడితే పర్యవరణానికి మేలు చేసినట్లేనని పలువురు మేధావులు, గిరిజనులు అభిప్రాయ పడుతున్నారు. అడ్డ ఆకు, తీగలతో ప్రయోజనాలు ► అడ్డాకులతో విస్తరాకుల తయారీ ► అడ్డ తీగలతో నారలు చేసి కంచెలు కట్టడం ► అడ్డ తీగలతో బుట్టలు అల్లుకోవటం ► అడ్డ గింజలను ఆహారం(స్నాక్స్) రూపంలో తీసుకోవటం అప్పట్లో అడ్డాకులే జీవనాధారం మా చిన్నతనంలో అడవిలోకి వెళ్లి అడ్డాకులు సేకరించే వాళ్లం. వాటిని ఎండబెట్టి, వారానికి ఒకసారి వారపు సంతల్లో విక్రయించి వచ్చిన డబ్బులతో జీవనం కొనసాగించాం. అడ్డ గింజలతో కూర వండుకునేవాళ్లం. ఇప్పుడు అడ్డాకులు సంతల్లో అమ్ముదామన్నా గిట్టుబాటు ధర ఉండట్లేదు. ప్రభుత్వ అధికారులు జీసీసీ ద్వారా అడ్డాకులు కొనుగోలు చేస్తే మాకు ఉపాధి కలుగుతుంది. –పాంగి కాసులమ్మ, కామయ్యపేట గ్రామం, హుకుంపేట మండలం ఆరోగ్యానికి మంచిది విశాఖ ఏజెన్సీ అడవుల్లో సహజంగా దొరికే ఈ అడ్డాకులు, అడ్డ గింజలు ఆరోగ్యపరంగా ఎంతో మంచివి. వీటిని వీడీవీకే కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తే గిరిజనులకు మంచి ఉపాధి లభిస్తుంది. వీటితో విస్తరాకులు తయారు చేసి ఉపయోగిస్తే పేపర్ ప్లేట్లు విక్రయాలు తగ్గించి, పర్యావరణాన్ని కాపాడవచ్చు. విస్తరాకుల ద్వారా మంచి ఉపాధితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. –డా.శ్రావణ్కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పర్యావరణ విభాగం, బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విశాఖ -
మన్యంలో చలి పులి
పాడేరు: విశాఖ ఏజెన్సీలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడుతుండడంతో పాటు పొగమంచు దట్టంగా కురుస్తున్నది. చింతపల్లిలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు దిగజారాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 7.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లి ప్రాంతంలో సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు వ్యాప్తి చెందుతుండడంతో మన్యం వాసులు చలిపులితో ఇబ్బందులు పడుతున్నారు. గురువారం పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 10 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డు వద్ద 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
Andhra Pradesh: రాష్ట్రంపై చలి పంజా
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: గతానికి భిన్నంగా రాష్ట్రంలో చలి ప్రభావం అనూహ్యంగా పెరిగిపోయింది. శీతాకాలంలో చలి వాతావరణం సాధారణమే అయినా ఈసారి దాని తీవ్రత ఎక్కువైంది. అన్ని ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేస్తోంది. విజయవాడ వంటి వెచ్చని ప్రదేశాలను కూడా ఈ శీతాకాలం వణికిస్తోంది. 50 ఏళ్ల తర్వాత విజయవాడలో రెండు రోజుల కిందట 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మామూలుగా విజయవాడ, పరిసర ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుంది. శీతాకాలం కూడా అంత తీవ్రమైన చలి వాతావరణం కనిపించదు. కానీ ఈ సంవత్సరం రాత్రి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోయాయి. ఈనెల 18వ తేదీ నుంచి వరుసగా 13.5 నుంచి 13.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండడంతో ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం 5.30 గంటల నుంచే చలి తీవ్రత పెరిగి ఉదయం 8 గంటల వరకు కొనసాగుతోంది. కృష్ణాజిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాగే ఉంది. 2 నుంచి 4 డిగ్రీలకు తగ్గిన కనిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సగటున రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర పడిపోయాయి. సాధారణంగా శీతాకాలంలో ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 22 డిగ్రీల వరకు నమోదవుతాయి. విశాఖ మన్యంలో 8 నుంచి 15 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలుంటాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చింతపల్లి, పెదబయలు, డుంబ్రిగూడ, అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో 5 నుంచి 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఆ ప్రాంతాలు చలికి గడ్డకడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లోను చలితీవ్రత పెరిగింది. చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్లో ఈ నెల 18న 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకులో 5.4 డిగ్రీలు గురువారం ఉదయం విశాఖ జిల్లా అరకులో కనిష్ట ఉష్ణోగ్రత 5.4 డిగ్రీలు నమోదైంది. పెదబయలు, డుంబ్రిగూడల్లో 5.7, జి.మాడుగులలో 5.9, జీకే వీధిలో 6.5, చింతపల్లి 7.7లో, హకుంపేటలో 7.8, పాడేరులో 8 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అదేరోజు కర్నూలు నగరంలో 14.2 డిగ్రీలు, విజయవాడలో 14.6, అనంతపురంలో 15.2, తిరుపతిలో 15.8, ఒంగోలు, ఏలూరుల్లో 15.9, శ్రీకాకుళం, కడపల్లో 16.2, గుంటూరులో 16.3, విశాఖపట్నంలో 18.2, కాకినాడలో 18.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికి కారణాలివే.. తక్కువ ఎత్తులో వీస్తున్న ఈశాన్య గాలులు, సముద్ర మట్టానికి 18 కిలోమీటర్ల ఎత్తులో వీస్తున్న ఉత్తర గాలుల వల్ల చలితీవ్రత పెరిగినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తూర్పు గాలులు ఉత్తర భారతదేశం నుంచి మన రాష్ట్రానికి నేరుగా వీస్తున్నాయి.తేమ తక్కువగా ఉండడం వల్ల చలిగాలులు పెరిగాయి. చలితీవ్రత మరో 2, 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత జనవరి 15వ తేదీ వరకు మామూలు చలి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చలిలో తిరగవద్దు చలి గాలుల వల్ల శ్వాసకోశ సమస్యలు, బ్రాంకైటిస్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. చలిలో బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చలిగాలి ముక్కు, చెవులకు తాకకుండా జాగ్రత్త వహించాలి. – డాక్టర్ గోపీచంద్, పల్మనాలజీ విభాగాధిపతి, విజయవాడ జీజీహెచ్ -
రాష్ట్రం గజగజ
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. విశాఖ ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్పంగా మంగళవారం విశాఖ జిల్లా జి.మాడుగులలో 3.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకు లోయలో 3.9, డుంబ్రిగూడ 4.4, జీకే వీధి 4.8, ముంచంగిపుట్టు 5.1, పెదబయలు 5.2, హుకుంపేట 5.9, పాడేరులో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్లో 7.1 డిగ్రీలు నమోదైంది. విజయవాడలోనూ చలి తీవ్రత పెరగడంతో మంగళవారం 13.8 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో 13.6 నమోదైంది. చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ ఇంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరులో 14.2, తిరుపతిలో 15.9, విశాఖలో 18.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర తీరం మీదుగా ఈశాన్య గాలులు, ఉత్తర భారతదేశం నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. ఈ కారణంగా కోస్తా, రాయలసీమల్లో మూడు రోజుల పాటు పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ముంచంగిపుట్టులో 12.63 డిగ్రీలు, జి.మాడుగులలో 13.64, డుంబ్రిగూడలో 13.74, అరకులో 13.91, పెదబయలులో 14.61, హుకుంపేటలో 14.80, పాడేరులో 15.16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు మరింత క్షీణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
80.8 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
పాడేరు: విశాఖ ఏజెన్సీలో నిర్వహిస్తున్న ఆపరేషన్ పరివర్తనలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీసు బృందాలు గురువారం మొత్తం 80.8 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశాయి. కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ అన్నవరం, గొర్లమెట్ట గ్రామాల్లో 70 ఎకరాలు, జి.కె.వీధి మండలం రింతాడ పంచాయతీ మర్రిపాలెం సమీపంలో 10.8 ఎకరాల గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేసి నిప్పంటించారు. ముందుగా ఆయా గ్రామాల్లో గిరిజనులకు గంజాయి నిర్మూలన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. పోలీసుల ప్రచారాలకు ప్రభావితమైన గిరిజనులు స్వచ్ఛందంగానే గంజాయి తోటల ధ్వంసానికి ముందుకొస్తున్నారు. జిల్లా రూరల్ ఎస్పీ బి.కృష్ణారావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జేడీ సతీష్కుమార్ పర్యవేక్షణలో గంజాయి తోటలపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కొయ్యూరు సీఐ స్వామినాయుడు, మంప ఎస్ఐ జె.లోకేష్కుమార్, జి.కె.వీధి ఎస్ఐ షేక్ షమీర్ తదితరులు పాల్గొన్నారు. 34 కిలోల గంజాయి పట్టివేత ముంచంగిపుట్టు: విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం లబ్బూరు జంక్షన్ వద్ద గురువారం పోలీసులు రూ.68 వేల విలువైన 34 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఒకరు పరారయ్యారు. గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించిన బొలెరో వాహనం, బైకు, స్కూటీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని మాకవరం పంచాయతీ అరబీరు గ్రామానికి చెందిన సీసా నాగేశ్వరరావు, ఒడిశా రాష్ట్రం కలహండి గ్రామానికి చెందిన పబిత్రా కటలుగా గుర్తించినట్లు ఎస్ఐ ఆర్.సంతోష్ చెప్పారు. -
288 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం
పాడేరు : ఆపరేషన్ పరివర్తనలో భాగంగా విశాఖ ఏజెన్సీలో గంజాయి నిర్మూలన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు శాఖతో పాటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగాలు రోజువారీ గంజాయి తోటలపై దాడులు చేపడుతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో భారీగా గంజాయి తోటలను ధ్వంసం చేశారు. చింతపల్లి, జి.మాడుగుల, డుంబ్రిగుడ మండలాల్లోని 288 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేసినట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ శంకర్రెడ్డి చెప్పారు. జి.మాడుగుల మండలంలోని బీరం పంచాయతీ బీరం, గడ్డిబందలు, అనర్భ, వెంకటపాలెం, చెలమరంగి గ్రామాల సమీపంలోని 211 ఎకరాలు, డుంబ్రిగుడ మండలం కొర్రాయి పంచాయతీ గంజిగుడ, కండ్రూం గ్రామాల సమీపంలోని 15 ఎకరాలు, చింతపల్లి మండలం అన్నవరం పోలీస్స్టేషన్ పరిధిలోని కోటగున్నల కాలనీ, చోడిరాయి, రామారావుపాలెం గ్రామాల్లోని 62 ఎకరాల్లోని గంజాయి తోటలన్నింటినీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీసుశాఖ బృందాలు ధ్వంసం చేశాయి. చింతపల్లి మండలం బెన్నవరం, లోతుగెడ్డ, అన్నవరం గ్రామాల్లో కళాజాత బృందాలు గంజాయి వలన జరిగే అనర్థాలపై గిరిజనులకు పాటలు, నృత్య రూపకాల ద్వారా అవగాహన కల్పించారు. -
గంజాయి తోటల నిర్మూలనే లక్ష్యం
పాడేరు/చింతపల్లి: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల నిర్మూలన లక్ష్యంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) బృందాలు పనిచేస్తున్నాయని ఆ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్ తెలిపారు. ఏజెన్సీలో గురువారం మొత్తం 190 ఎకరాల్లో గంజాయి తోటల్ని ధ్వంసం చేశారు. ఏజెన్సీలోని పెదబయలు మండలం మారుమూల మావోయిస్టు ప్రభావిత పూటూరు, పంగలం గ్రామాల పరిధిలోని గంజాయి తోటల ధ్వంసాన్ని ఆయన గురువారం పర్యవేక్షించారు. ఈ మారుమూల గ్రామాలకు కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్తో పాటు ఎస్ఈబీ విశాఖపట్నం జాయింట్ డైరెక్టర్ సతీష్కుమార్, పాడేరు ఏఎస్పీ జగదీష్, ఏడు ఎస్ఈబీ బృందాల సభ్యులు వెళ్లారు. ఇక్కడ సాగవుతున్న గంజాయి తోటలను కమిషనర్ పరిశీలించారు. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు 115 ఎకరాల విస్తీర్ణంలో గంజాయి తోటలను ధ్వంసం చేశాయి. సుమారు 5.75 లక్షల గంజాయి మొక్కలను నరికేసి నిప్పంటించారు. చింతపల్లి మండలం అన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలోని కొండపల్లి, వర్తనపల్లి గ్రామాల పరిధిలో సుమారు 75 ఎకరాల్లో సాగవుతున్న గంజాయిని గురువారం గిరిజనులతో కలిసి ఏఎస్పీ తుషార్ డూడి ధ్వంసం చేశారు. అన్నవరం ఎస్ఐ ప్రశాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 120 కిలోల గంజాయి పట్టివేత ముంచంగిపుట్టు: విశాఖ జిల్లా ముంచంగిపుట్టు పోలీసులు గురువారం రూ.2.4 లక్షల విలువైన 120 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. మండలంలోని జోలాపుట్టు నుంచి ముంచంగిపుట్టు మార్గంలో గుమ్మసీర్గంపుట్టు వద్ద వనుగుమ్మ నుంచి వస్తున్న ఎపి35టి9551 నంబరు జీపులో తనిఖీ చేసి 6 బస్తాల గంజాయిని పట్టుకున్నట్లు స్థానిక ఎస్ఐ ఆర్.సంతోష్ చెప్పారు. జీపులో ఉన్న నలుగురిని, జీపు వెనక బైకుపై పైలెటింగ్ చేస్తున్న ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గంజాయిని, జీపును, బైకును సీజ్చేశామన్నారు. నిందితుల వద్ద ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని ఎస్ఐ తెలిపారు. -
గిరిజన గర్భిణులకు కొండంత రక్షణ
సాక్షి,అమరావతి: మన్యంలోని గర్భిణులకు కొండంత రక్షణగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ప్రెగ్నెంట్ ఫ్రెండ్లీ’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మరింత సమన్వయంతో సమర్థవంతమెన ఆరోగ్య సేవలు అందించేలా ‘ట్రైబల్ హెల్త్ కొలాబరేటివ్ మానిటరింగ్ సిస్టం’ (గిరిజన ఆరోగ్య సమన్వయ పర్యవేక్షణ విధానం) పేరుతో ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ దీనిని నిర్వహించనుంది. గిరిజన గర్భిణులకు కొత్తగా అందించనున్న సేవలతోపాటు కొత్త యాప్ను కూడా సోమవారం ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. విశాఖ జిల్లా పాడేరులో నిర్వహించే ట్రయల్ రన్ను ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పర్యవేక్షిస్తారు. యాప్తో ప్రయోజనాలు ఇలా ఏజెన్సీ ప్రాంత గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ రూపొందించిన ఈ ప్రత్యేక యాప్తో ప్రయోజనం మెండుగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గిరిజనుల ఆరోగ్య సమాచారం సేకరించి ఈ యాప్లో పొందుపరుస్తారు. గర్భిణుల నుంచి చిన్నారుల వరకు అవసరమైన వైద్యసేవలు సకాలంలో అందించేలా ఈ యాప్ ఎప్పటికప్పుడు అధికారులను, సంబంధిత విభాగాల సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. సమాచార సేకరణ నుంచి వైద్య సేవలు అందించే వరకు గిరిజన సంక్షేమ, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ, విద్యా శాఖల సమన్వయంతో పనిచేసేలా దీనిని రూపొందించారు. యాప్లో పొందుపరిచిన సమాచారం మేరకు ప్రసవానికి 30 రోజుల ముందు నుంచే గర్భిణులకు వైద్యం అందించే వైద్యంపై ఆయా కుటుంబాల వారికి ఆశ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు అవగాహన కల్పిస్తారు. 20 రోజుల ముందు వారిని ఏ ఆస్పత్రికి తరలించేది గ్రామ సచివాలయాలకు సమాచారం అందిస్తారు. ప్రసవానికి 15 రోజుల ముందు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆస్పత్రికి సమాచారం అందిస్తారు. 10 రోజుల ముందు ఐటీడీఏ పీవోలకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తారు. ప్రసూతి వసతి గృహాలకు తరలింపు ఈ యాప్ ద్వారా ఒకవైపు అధికారులను అప్రమత్తం చేస్తూ మరోవైపు గర్భిణులకు అవగాహన, వారి బంధువులకు కౌన్సెలింగ్ ఇచ్చి ప్రసవానికి 30 నుంచి 10 రోజుల సమయం ఉండగానే ప్రసూతి వసతి గృహాలకు తరలిస్తారు. ఇందుకోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా 41 ప్రసూతి వసతి గృహాలను ఏర్పాటు చేశారు. వాటిలో 2,600 బెడ్లు సమకూర్చారు. ప్రసవానికి ముందు నుంచి గర్భిణులు ఆరోగ్యంగా, ఆనందంగా గడిపేలా ఆట పాటలతో కూడిన వాతావరణ కల్పిస్తారు. అంతేకాకుండా వారికి ఆరోగ్యం పట్ల అవగాహన తరగతులు నిర్వహించడంతోపాటు బలమైన ఆహారం అందిస్తారు. తల్లీబిడ్డల మరణాలు తగ్గించడమే లక్ష్యం గిరిజన ప్రాంతాల్లో తల్లీబిడ్డల మరణాలు లేకుండా చూసేందుకు ప్రభుత్వం అనేక విప్లవాత్మక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే డోలీతో మోసుకొచ్చే పద్ధతికి స్వస్తి పలుకుతూ బైక్ అంబులెన్సులు అందుబాటులోకి తెచ్చాం. ఈ యాప్లో గర్భిణుల వివరాలతోపాటు గురుకుల విద్యార్థుల వివరాలు, చిన్నారులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, వారికి అందించాల్సిన వైద్య సేవలు వంటి ఎన్నో వివరాలు ఉంటాయి. – పుష్ప శ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి -
రెండ్రోజులు కోస్తాంధ్రకు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం/పాడేరు: పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి సమీపంలో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.1 కి.మీ. ఎత్తు వరకు విస్తరించింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో స్వల్ప అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలహీనపడి నెల్లూరు, తమిళనాడు వైపుగా ప్రయాణించే సూచనలు కనిపిస్తున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో శని, ఆదివారాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వివరించారు. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 12న దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఈ నెల 13 నుంచి మొదలయ్యే సూచనలున్నాయని వెల్లడించారు. విజయవాడలో అత్యధిక వర్షపాతం 2021లో అత్యధిక వర్షపాతం నమోదైన నగరంగా విజయవాడ రికార్డు సృష్టించింది. తర్వాత స్థానంలో కడప ఉండటం విశేషం. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షపాత వివరాల్ని పరిశీలిస్తే.. విజయవాడలో అత్యధికంగా 1,548 మి.మీ. వర్షపాతం నమోదైంది. కడపలో 1,342, విజయనగరంలో 1,331 మి.మీ. వర్షం కురిసింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన నగరాల జాబితాలో అట్టడుగున నెల్లూరు 440 మి.మీ. వర్షపాతంతో ఉండగా, కర్నూలులో 461, కావలిలో 552, ఒంగోలులో 698 మి.మీ. వర్షపాతం నమోదైంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలు విశాఖ ఏజెన్సీలో చలిగాలులు ప్రారంభమయ్యాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తోంది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం సూర్యోదయం అయ్యే వరకు చలి తీవ్రత నెలకొంది. అతిశీతల ప్రాంతాలుగా గుర్తింపు పొందిన కాఫీ తోటల ఏరియాల్లో మాత్రం చలిగాలులు అధికంగా వీస్తున్నాయి. పాడేరుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అతిశీతల ప్రాంతం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు వద్ద ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ నెల 3న 17 డిగ్రీలు, 4వ తేదీన 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, శుక్రవారం ఉదయం 10 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శుక్రవారం 14.4, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డు కార్యాలయంలో 18.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
విశాఖ ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టివేత
గొలుగొండ/మాడుగుల: విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి బొలెరో జీపులో అక్రమంగా తరలిస్తున్న వంద కిలోల గంజాయిని గొలుగొండ ఎస్ఈబీ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో కొయ్యూరు మండలం ధర్మవరం వద్ద గంజాయి పట్టుకున్నట్లు ఎస్ఈబీ సీఐ రాజారావు, ఎస్ఐ గిరి తెలిపారు. దీని విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఎస్.సత్యనారాయణ, రామన్న, నారాయణరావు అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు. వారి నుంచి బైక్, బొలెరో జీపు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 60 కిలోల పట్టివేత విశాఖ జిల్లా మాడుగుల మండలం తాటిపర్తి జంక్షన్ వద్ద బుధవారం మాడుగుల ఎస్ఐ పి.రామారావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గంజాయి పట్టుకున్నారు. తాటిపర్తి జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా విశాఖ మన్యం నుంచి వస్తున్న మారుతీ కారులో 60 కిలోల గంజాయి బయటపడింది. కారు సీజ్ చేసి గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
గంజాయి నిర్మూలనకు గిరిజనుల ప్రతిన
జి.మాడుగుల/గూడెం కొత్తవీధి: గంజాయి పంటను ఇకపై సాగు చేయబోమని గిరిజనులు ప్రతిన బూనారు. గంజాయి సాగు, రవాణాను పూర్తిగా రూపుమాపేందుకు నడుం కట్టారు. విశాఖ ఏజెన్సీ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాల్లో గంజాయి తోటల్ని ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు, ఐటీడీఏ అధికారులు గంజాయి నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన ‘పరివర్తన’ కార్యక్రమంతో గిరిజనుల్లో చైతన్యం వచ్చింది. జి.మాడుగుల మండలం మారుమూల గ్రామాల్లో ఇప్పటికే గిరిజనులు గంజాయి సాగును నిషేధిస్తూ తీర్మానించుకుని తోటలను నరికి పారేస్తున్నారు. మండలంలోని నుర్మతి పంచాయతీ పినజాగేరు, వండ్రాంగుల, వాకపల్లి, డిప్పలగొంది, గాదిగుంట గ్రామాల సమీపంలోని కొండ ప్రాంతాల్లో 100 ఎకరాల్లో సాగవుతున్న గంజాయి తోటలను సోమవారం గిరిజనులు కత్తులు పట్టి నరికి ధ్వంసం చేశారు. గూడెం కొత్తవీధి మండలంలోని దామనాపల్లిలో సర్పంచ్ కుందరి రామకృష్ణ గ్రామపెద్దలు, యువకులను చైతన్యపరిచి సాగు చేస్తున్న గంజాయి తోటల్లో మొక్కలను ధ్వంసం చేశారు. కార్యక్రమంలో అటవీ శాఖ ఫీల్డ్మెన్ గోవింద్, గ్రామ వలంటీర్లు, యువకులు పాల్గొన్నారు. -
పూల సాగు.. గిరిజన రైతులకు వరం
సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్: గిరిజన ప్రాంతాల్లో పూల సాగును చేపట్టేలా వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంత వాతావరణ పరిస్థితులు, భూమి ఇందుకు అనువుగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతిన పూలు, కూరగాయల సాగు చేపడితే హార్టీకల్చర్ విభాగంతో పాటు.. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇతోధికంగా తోడ్పడుతుందని వీసీ డాక్టర్ విష్ణువర్ధన్రెడ్డి ప్రకటించారు. విశాఖ ఏజెన్సీ రైతులు తరతరాలుగా వరి, మొక్కజొన్న, వేరుశనగ, కంది, రాజ్మా, చిక్కుళ్లు, వలిశలు వంటి ఆహార పంటలను, అల్లం, మిరియాలు, కాఫీ వంటి ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. అధిక వర్షాలతో ఈ పంటలు ఆశించిన ఆదాయాన్ని ఇవ్వలేకపోతుండడంతో కొంతమంది రైతులు చట్ట విరుద్ధమైన పంటల్ని సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటలను నిషేధించినా అటువైపే మొగ్గు చూపుతుండటంతో.. రైతులను పూల సాగు వంటి వాణిజ్య పంటల వైపు మరల్చేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యాచరణను తయారు చేసినట్టు విష్ణువర్ధన్రెడ్డి చెప్పారు. పూలసాగుతో లంబసింగి, అరకు మరింత ఆకర్షణీయం ఇందులో భాగంగా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్నే ఓ ప్రయోగ క్షేత్రంగా మార్చాలని, పెద్ద ఎత్తున పూలసాగు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంత వాతావరణం పూల సాగుకు అనువైన స్థలంగా అభివర్ణించారు. రైతులకు ఈ మేరకు అవగాహన కల్పించేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 5 రకాల గ్లాడియోలస్, 3 రకాల ట్యూబారస్, రెండు రకాల చైనా ఆస్టర్, బంతి, చామంతి, తులిప్ వంటి పూల సాగును ప్రయోగాత్మకంగా చేపట్టినట్టు వివరించారు. ఈ పూల సాగును విజయవంతం చేసి.. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఆర్గానిక్ ఫార్మింగ్కు మారుపేరుగా నిలపాలని సూచించారు. పూల తోటల్ని విరివిగా పెంచితే లంబసింగితో పాటు, ఏపీ ఊటీ అయిన అరకు.. పర్యాటకుల్ని మరింత ఆకర్షిస్తాయని అభిప్రాయపడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు పాలీహౌస్ల అవసరం లేకుండానే పూలను సాగు చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూల సాగును ఇప్పటికిప్పుడు చేపడితే ఐదేళ్లలో గిరిజన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో పూల సాగు.. వివిధ రకాల పూలు, కూరగాయల పంటల సాగుపై శిక్షణ పొందుతున్న చింతపల్లి సేంద్రియ పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రయోగాత్మకంగా ఈ పంటల్ని సాగు చేసేందుకు నడుంకట్టారు. గ్లాడియోలస్, తులిప్, నేల సంపంగి, చైనా ఆస్టర్, బంతి, చేమంతి సాగు చేపట్టారు. వీటితో పాటు సేంద్రియ పద్ధతిన కూరగాయల పెంపకాన్ని కూడా చేపట్టి చదువుతో పాటు రోజు వారీ ఖర్చులకు డబ్బును సమకూర్చుకుంటున్నారని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రామారావు వివరించారు. -
మొదలకంటా ‘గంజాయి’ నరికివేత
సాక్షి, విశాఖపట్నం/జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీలో గంజాయి పంట నిర్మూలన కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది. గంజాయి ఎక్కడ సాగవుతుందో తెలుసుకొని.. ఆ ప్రాంతాల్లోని ప్రజలకు పోలీసులు అవగాహన కలిగిస్తున్నారు. స్థానికులు కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి గంజాయి నిర్మూలనలో పాల్గొంటున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, అటవీ, ఐటీడీఏ అధికారులతో కలిసి పోలీసులు గంజాయి నిర్మూలనకు ‘పరివర్తన’ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా జి.మాడుగుల మండలం ఏడుసావళ్లు, చీకుంబంద గ్రామాల సమీపంలో శనివారం ఒక్కరోజే దాదాపు 80 ఎకరాల్లోని గంజాయి తోటలను పోలీసులు, స్థానికులు ధ్వంసం చేశారు. విశాఖ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు, ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ సతీష్కుమార్, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది కత్తి చేతపట్టి గంజాయి మొక్కలను నరికేశారు. గూడెం కొత్తవీధి మండలం నేలజర్త, బొరుకుగొంది, కనుసుమెట్ట, కిల్లోగూడా, కాకునూరు, గుమ్మిరేవుల సమీప ప్రాంతాల్లో సుమారు 25 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను కూడా శనివారం ధ్వంసం చేశారు. -
2,000 కిలోల గంజాయి స్వాధీనం
చింతూరు: రాష్ట్రంలో గంజాయి రవాణాపై దాడులు కొనసాగుతున్నాయి. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తూ.. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఒడిశా నుంచి తెలంగాణకు తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన గంజాయిని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఏఎస్పీ కృష్ణకాంత్ బుధవారం మీడియాకు వెల్లడించారు. మోతుగూడెం పోలీస్స్టేషన్ పరిధిలోని సుకుమామిడి అటవీ ప్రాంతం మీదుగా గంజాయి రవాణా జరుగుతుందంటూ వచ్చిన సమాచారంతో సీఐ యువకుమార్, ఎస్ఐ సత్తిబాబు వాహన తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో కొబ్బరికాయల లోడ్తో వచ్చిన ఓ వ్యానును తనిఖీ చేయగా.. కొబ్బరికాయల కింద గంజాయి మూటలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి తెలంగాణకు చెందిన కడియం గురుసాగర్, పొగిడాల పర్వతాలు, ఒడిశాకు చెందిన నైని రామారావును అరెస్టు చేసి.. 2 వేల కిలోల గంజాయి, వ్యాన్ను, కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏజన్సీ వ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు విస్తృతంగా చేస్తున్నామని ఏఎస్పీ తెలిపారు. ఏజెన్సీలో ముమ్మరంగా గంజాయి తోటల ధ్వంసం సీలేరు: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల ధ్వంసం కొనసాగుతోంది. బుధవారం గుమ్మరేవుల పంచాయతీ పరిధిలోని రెండు గ్రామాల్లో గంజాయి మొక్కలను స్థానికులు నరికేశారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో గిరిజనులు స్వచ్ఛందంగా తమ గ్రామాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్నారు. సీలేరు ఎస్ఐ రంజిత్ చేపట్టిన చర్యలతో చింతగుప్ప, పొలుతురుకోట గ్రామాల ప్రజలు గంజాయి మొక్కలను నరికేసి.. ఇకపై గంజాయి సాగు చేయబోమని ప్రతిజ్ఞ చేశారు. చింతగుప్ప గ్రామంలో గంజాయి మొక్కలు నరికివేస్తున్న గిరిజనులు -
అడవికి రాచబాట!
► విశాఖ జిల్లా పెదబయలు మండలంలోని నివాసిత ప్రాంతం కొండ్రుకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రోడ్డు సౌకర్యం లేదు. కొండలు, గుట్టలు ఎక్కి వెళ్లాల్సిందే. ఇప్పుడు ఆ దుస్థితి తొలగనుంది. గుల్లేలు నుంచి కొండ్రుకు రూ.15.93 కోట్లతో 18.40 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ► డుంబ్రిగుడ మండలం సోవ్వ నుంచి చెమడపొడు వరకు 22 కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు ప్రభుత్వం రూ.11.42 కోట్లను వెచ్చిస్తోంది. ఇప్పటిదాకా అక్కడ రోడ్డు సదుపాయం లేదు. ► పెదబయలు మండలం రుద్రకోట నుంచి కుమడ పంచాయతీ కిందుగూడ మీదుగా ఒడిశా సరిహద్దు వరకు రహదారి పనులు జరుగుతున్నాయి. కిందుగూడకు ఇన్నేళ్లుగా కేవలం మట్టి రోడ్డు మాత్రమే ఉంది. వర్షాకాలం అక్కడకు వెళ్లాలంటే అసాధ్యమే. ఇప్పుడు అక్కడ 25.60 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.16 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. ► ముంచంగిపుట్టు మండలం బుంగపుట్ ఏజెన్సీ గ్రామానికి 25 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ.14 కోట్లు ఖర్చు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా మారుమూల గిరిజన ప్రాంతాలకు మౌలిక వసతులు కరువయ్యాయి. విశాఖ ఏజెన్సీలోని పలు నివాసిత ప్రాంతాలకు రహదారుల సదుపాయం లేక అడవి బిడ్డలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. తప్పనిసరైతే కొండకోనల్లో ప్రయాసలతో వెళ్లాల్సిందే. మట్టి రోడ్లున్నా వర్షాకాలంలో అడుగుతీసి అడుగు వేయలేని దుస్థితి. ఇక అనారోగ్య సమస్యలు తలెత్తితే దేవుడిపై భారం వేయాల్సిందే. ఈ దుస్థితిని తొలగించి ఏజెన్సీ గ్రామాలకు మట్టి రోడ్లు కాకుండా మెటల్, బీటీ రోడ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి చకచకా పనులు జరుగుతున్నాయి. విడతలవారీగా ఏజెన్సీ గ్రామాలకు రోడ్ల సదుపాయాన్ని కల్పిస్తున్నారు. తద్వారా రవాణా సదుపాయం పెరిగి రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. 548.91 కిలోమీటర్లు... రూ.308.98 కోట్లు విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం 11 మండలాలున్నాయి. ఇందులో 3,789 నివాసిత ప్రాంతాల్లో (ఆవాసాలు) 6,58,354 మంది జీవనం సాగిస్తున్నారు. వీటిల్లో 1,610 నివాసిత ప్రాంతాలు, గ్రామాలకు మాత్రమే రోడ్డు కనెక్టివిటీ ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏజెన్సీ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. రూ.308.98 కోట్లతో గత రెండేళ్లలో 340 నివాసిత ప్రాంతాలకు 548.91 కిలోమీటర్ల మేర రోడ్డు సదుపాయం కల్పించేలా చర్యలు చేపట్టడంతో మొత్తం 1,950 ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తోంది. ఇంకా 1,839 నివాసిత ప్రాంతాలకు రోడ్డు సదుపాయాన్ని కల్పించాల్సి ఉంది. ఇందుకోసం రూ.714 కోట్ల మేర నిధులు అవసరమని అంచనా వేశారు. సాగు హక్కులు.. పథకాల ప్రయోజనం ఇప్పటికే గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల ద్వారా భూ పంపిణీ చేపట్టి సాగు హక్కులు కల్పించి ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. గిరిజన గ్రామాల్లో కూడా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) సేవలతో పాటు హెల్త్ క్లినిక్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. గిరిజనులకు వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించింది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఏజెన్సీలోని అన్ని నివాసిత ప్రాంతాలకు రోడ్ల సదుపాయాన్ని కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏజెన్సీ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ ఏజెన్సీ గ్రామాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి సర్వే చేపట్టింది. ‘కనెక్ట్ పాడేరు’ పేరుతో అన్ని వివరాలను సేకరిస్తున్నాం. రోడ్డు సౌకర్యం లేక గర్భిణులు బాగా ఇబ్బంది పడుతున్నారు. గత రెండేళ్లుగా 340 నివాసిత ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించేలా పనులు జరుగుతున్నాయి. –ఆర్.గోపాలకృష్ణ, ఐటీడీఏ పీవో దశాబ్దాల కల సాకారం గుల్లేల గ్రామం నుంచి కొండ్రు వరకు దశాబ్దాల తర్వాత రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల మండలాలకు చెందిన గిరిజనుల రవాణా కష్టాలు తీరతాయి. రహదారి సమస్యను గతంలో ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇన్నాళ్లకు మా కల నెరవేరుతోంది. – వరద నాగేశ్వరరావు, ఇంజిరి పంచాయతీ, పెదబయలు మండలం డోలి కష్టాలకు తెర... సోవ్వ నుంచి ఒడిశా బోర్డర్ వరకు రహదారి నిర్మాణం జరుగుతుండడం శుభపరిణామం. సరైన రవాణా వ్యవస్థ లేక అత్యవసర పరిస్థితుల్లో మేం పడుతున్న కష్టాలు ఆ దేవుడికే తెలుసు. రోగులు, గర్భిణులను డోలిలో మోసుకుంటూ ఆస్పత్రులకు తరలించే కష్టాలు తీరనున్నాయి. ఈ రోడ్డు పూర్తయితే పలు గ్రామాలకు ఉపయోగం. ఒడిశా వాసులకు సైతం రవాణా సౌకర్యం కలుగుతుంది. – తిరుమలరావు, సోవ్వ గ్రామం, డుంబ్రిగుడ మండలం -
కాఫీ ఘుమఘుమ.. అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు..
ఈ ఏడాది కూడా కాఫీ పంట సిరులు కురిపించనుంది. ముందుగానే పండ్ల దశకు చేరుకోవడం రైతులకు ఆనందాన్నిస్తోంది. విశాఖ ఏజెన్సీలోని కాఫీ పంటకు వాతావరణ పరిస్థితులు కలిసొచ్చాయి. సాక్షి, పాడేరు: ప్రతి ఏడాది ఏజెన్సీలోని గిరిజన రైతులను ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు వారి జీవనోపాధికి కాఫీ పంట ప్రధానంగా మారింది. విశాఖ మన్యంలో గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న కాఫీ పంటకు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. నాణ్యమైన కాఫీ గింజల ఉత్పత్తికి కేరాఫ్ అడ్రస్గా విశాఖ ఏజెన్సీని అనేక దేశాలు గుర్తించాయి. ప్రతి ఏడాది గిరిజన రైతులకు ఆర్థిక అవసరాలు తీర్చే ప్రధాన వాణిజ్య పంటగా మారింది. ప్రపంచ స్థాయిలో కాఫీ నాణ్యతలో బ్రెజిల్ ప్రసిద్ధి. ఆ దేశం తర్వాత మన దేశంలో కర్ణాటక రాష్ట్రంతోపాటు విశాఖ ఏజెన్సీలోని కాఫీ పంటకు ఎంతో పేరుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీలోని కాఫీ పంటను ప్రోత్సహిస్తున్నాయి. కాఫీ సాగుకు విశాఖ ఏజెన్సీ ప్రాంతం అనుకూలంగా ఉండడంతో ప్రతి ఏడాది కాఫీ పంట సాగు విస్తరిస్తుంది. మేలు చేసిన వర్షాలు ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే విశాఖ ఏజెన్సీవ్యాప్తంగా వర్షాలు కురవడం కాఫీ తోటలకు ఎంతో మేలు చేసింది. కాఫీ మొక్కలకు పూల పూత కూడా ముందస్తుగానే ఏర్పడింది. తర్వాత కూడా వర్షాలు విస్తారంగా కురవడంతో కాఫీ గింజలు వేగంగానే ఏర్పడి ఆశాజనకంగా ఎదగడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా కాఫీ తోటలు విరగ్గాయడంతోపాటు ఇటీవల ముందస్తుగానే కాఫీ పండ్ల దశకు చేరుకోవడం గిరిజన రైతులను మరింత సంతోషపెడుతుంది. గత ఏడాది 12 వేల మెట్రిక్ టన్నుల వరకు క్లీన్ కాఫీ దిగుబడులు ఏర్పడగా, ఈ ఏడాది కూడా అదేస్థాయిలో దిగుబడులు అధికంగా ఉంటాయని కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏ కాఫీ విభాగం అధికారులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పాడేరు మండలం మోదాపల్లి ప్రాంతంలో పండ్ల దశకు చేరుకున్న కాఫీ మొక్కలు ఏజెన్సీలోని 11 మండలాల పరిధిలో 2 లక్షల 21 వేల ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలు ఉన్నాయి. 2 లక్షల 5 వేల 464 మంది గిరిజన రైతులు ప్రభుత్వాల సహకారంతో కాఫీ తోటలను సాగు చేస్తున్నారు. వీటిలో లక్షా 58 వేల 21 ఎకరాల కాఫీ తోటలు ఫలసాయాన్ని ఇస్తున్నాయి. ఈ తోటల్లో ప్రస్తుతం కాఫీ కాపు అధికంగా ఉంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గింజ దశలో ఉన్న కాఫీ పంట ముందస్తుగానే పండ్ల దశకు చేరుకుంటుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడంతో నవంబర్ రెండో వారం నాటికే గిరిజన రైతులు తమ సాగులో ఉన్న కాఫీ ఫలసాయాన్ని సేకరించే పరిస్థితులు ఉన్నాయి. అధిక దిగుబడులు ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే విస్తారంగా వర్షాలు కురవడంతో పూత విరగ్గాసింది. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడంతో కాఫీ తోటల్లో మొక్కలు గింజ దశకు వేగంగానే చేరుకున్నాయి. ప్రస్తుతం కాయలన్నీ పండ్ల దశకు చేరుకుంటుండడంతో ఈ ఏడాది నవంబర్ నుంచే గిరిజనులు ఫలసాయాన్ని సేకరించే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది కూడా సుమారు 12 వేల మెట్రిక్ టన్నుల క్లీన్ కాఫీ గింజలు దిగుబడికి వస్తాయని అంచనా వేస్తున్నాం. –భాస్కరరావు, ఇన్చార్జి కాఫీ ఏడీ, ఐటీడీఏ -
గొడ్డళ్లతో గంజాయి స్మగ్లర్ల దాడి
చింతపల్లి/నర్సీపట్నం/సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపింది. లంబసింగి సమీపంలో గంజాయి స్మగ్లర్లను తరలిస్తున్న తెలంగాణ పోలీసులపై అక్రమ రవాణా ముఠా దాడికి ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం వారు గాలిలోకి కాల్పులు జరిపినట్లు విశాఖ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు తెలిపారు. నల్లగొండ పోలీసుస్టేషన్లో నమోదైన గంజాయి కేసులో నిందితుల కోసం తెలంగాణ పోలీస్ ప్రత్యేక బృందం విశాఖకు వచ్చిందన్నారు. 15–20 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేస్తుండగా రోడ్డుకు అడ్డంగా టిప్పర్ను నిలిపి కత్తులు, గొడ్డళ్లు, రాళ్లతో దాడికి దిగి పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడంతో గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఓ గంజాయి స్మగ్లర్కి గాయాలయ్యాయని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. చింతపల్లి మండలం తురబాలగెడ్డ సమీపంలో లంబసింగి ఘాట్రోడ్డులో ఈ ఘటన జరిగింది. గాలిపాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు గత వారం అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ నల్లగొండ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో ఈ నెల 15వ తేదీన కిల్లో బాలకృష్ణ (30), కిల్లో భీమరాజు (26), నారా లోవ (30) అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
అక్రమ ఆపరేషన్లపై విచారణ వేగవంతం
పాడేరు: విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం ఈదులపాలెం గ్రామంలోని ఓ మెడికల్ షాపు వద్ద ఇటీవల అక్రమంగా నిర్వహించిన కుటుంబ సంక్షేమ ఆపరేషన్లపై సమగ్ర విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. కలెక్టర్, పాడేరు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవోల ఆదేశాల మేరకు పాడేరు తహసీల్దార్ ప్రకాష్రావు సోమవారం ఉదయాన్నే ఈదులపాలెం చేరుకుని విచారణ చేపట్టారు. గిరిజన మహిళలకు కుటుంబ సంక్షేమ ఆపరేషన్లు జరిగిన మెడికల్ షాపుతోపాటు సమీప వీధిని ఆయన పరిశీలించి అక్కడి గిరిజనులను విచారించారు. అనంతరం ఈదులపాలెం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బందిని విచారించారు. మెడికల్ షాపులో ఆపరేషన్లు చేసిన వైద్యబృందం వివరాలు సేకరించారు. స్థానిక ఆస్పత్రి సిబ్బంది పాత్రపై ఆరా తీశారు. ఆపరేషన్ చేయించుకున్న గిరిజన మహిళల కుటుంబసభ్యుల నుంచి కూడా వివరాలు తెలుసుకున్నారు. సలుగు, దేవాపురం, ఐనాడ పంచాయతీల వీఆర్వోలు కూడా తమ పరిధిలోని గ్రామాల్లో సంక్షేమ ఆపరేషన్లు చేయించుకున్న గిరిజన మహిళల వివరాలను సేకరిస్తున్నారు. -
అక్రమ కు.ని. ఆపరేషన్లపై విచారణ
పాడేరు: విశాఖ ఏజెన్సీలో అక్రమంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్న ప్రైవేటు వైద్య బృందంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. విశాఖ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవోలకు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘విశాఖ ఏజెన్సీలో ప్రైవేటు ముఠా’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. మారుమూల ఈదులపాలెం ఆరోగ్య కేంద్రానికి సమీపంలో ఓ మెడికల్ షాపులో అక్రమంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించి గిరిజనుల నుంచి భారీగా డబ్బు గుంజుతున్న వైనంపై ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ ఏడీఎంహెచ్వో, ఇతర వైద్య బృందాలను అప్రమత్తం చేశారు. మెడికల్ షాపులో ఇంతవరకు జరిగిన ఆపరేషన్ల వివరాలను సేకరించడంతో పాటు ఆపరేషన్ జరిగిన మహిళలందరితో మాట్లాడి పూర్తి నివేదికను తనకు అందజేయాలని ఏడీఎంహెచ్వో డాక్టర్ లీలా ప్రసాద్ను ఆదేశించారు. విచారణ అధికారిగా ఈదులపాలెం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ లకే శివప్రసాద్ పాత్రుడును నియమించారు. పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఈ వ్యవహారంపై కూపీ లాగుతున్నాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసింది అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రి గైనకాలజిస్టు, మరో ప్రభుత్వ స్టాఫ్ నర్సు అని గుర్తించారు. ఇందుకు ఈదులపాలెం ఆస్పత్రిలోని కొంతమంది వైద్య సిబ్బంది కూడా సహకరించినట్టు ఇంటెలిజెన్స్ విచారణలో తేలింది. ఇక్కడ రెండు విడతలుగా భారీ సంఖ్యలో కు.ని. ఆపరేషన్లు చేసినట్టు ఐటీడీఏ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లా కలెక్టర్కు ప్రాథమిక సమాచారాన్ని అందజేశారు. -
అరకు అందాలకు రాచబాట
సాక్షి, అమరావతి: చుట్టూ పచ్చని కొండలు.. ఆకాశాన్ని తాకుతున్నట్టుండే దట్టమైన వృక్షాలు.. వాటి మధ్య నల్లటి నాగులా మెలికలు తిరుగుతూ రహదారి.. ఓ వైపు లోయలు.. అక్కడక్కడా కనువిందు చేసే జలపాతాలు.. సేద తీరేందుకు వేసవి విడిదిలు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా తూర్పుగోదావరి–విశాఖ ఏజెన్సీలను కలుపుతూ మణిహారం వంటి రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచ బ్యాంకు నిధులతో విశాఖపట్నం ఏజెన్సీలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ముందుగా నిర్ణయించిన రహదారులను అనుసంధానిస్తూ ఈ రెండు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల మీదుగా కొత్త రహదారి నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించారు. 406 కి.మీ. మేర రూ.900 కోట్లతో ఈ రహదారి నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ ఆమోదం తెలిపింది. పర్యాటకానికి మణిపూసలా.. ఎన్హెచ్ఏఐ ప్రపంచ బ్యాంకు నిధులతో విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాన్ని విజయనగరం జిల్లాతో కలుపుతూ రెండు రహదారులను నిర్మిస్తోంది. బౌదర నుంచి విజయనగరం, పాడేరు నుంచి అరకు వరకు 76.31 కి.మీ. మేర రూ.493 కోట్లతో రహదారి నిర్మాణాన్ని చేపట్టింది. అదేవిధంగా కొయ్యూరు నుంచి పాడేరు వరకు రూ.785.72 కోట్లతో మరో రహదారి నిర్మిస్తోంది. ప్రస్తుతం అరకులోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు ఈ మార్గం నుంచే వెళ్తున్నారు. అటు విశాఖపట్నం నుంచి.. ఇటు విజయనగరం నుంచి బౌదర మీదుగా అరకు వెళ్తున్నారు. అంటే ఉత్తరాంధ్ర నుంచే ఆ మార్గం అరకుకు కనెక్టివిటీగా ఉంది. కాగా అరకు లోయకు రాష్ట్రంలోని మరో వైపు నుంచి కూడా కనెక్టివిటీ పెంచితే పర్యాటకులను మరింతగా ఆకర్షించ వచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. ప్రధానంగా రాజమహేంద్రవరం నుంచి నేరుగా అరకు లోయకు కనెక్టివిటీ మెరుగుపరిస్తే రాష్ట్రంలోని మిగిలిన 10 జిల్లాల వారికి కూడా అరకు పర్యటన మరింత సులభమవుతుంది. హైదరాబాద్, విజయవాడ వైపు నుంచి వచ్చేవారికి రాజమహేంద్రవరం మీదుగా అరకుకు అనుసంధానించేలా రహదారి నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మొత్తం 406 కి.మీ. మేర నిర్మించే ఈ రహదారులకు రూ.900 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన అధికారులు ప్రణాళికను ఖరారు చేశారు. దీనిపై సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)రూపొందిస్తున్నారు. డీపీఆర్ అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. -
సీతా'సోకు' చిలుకలు
సాక్షి, అమరావతి: సీతాకోక చిలుకకు చీరలెందుకు.. అంటూ సప్తవర్ణ శోభితమైన వాటి అందాన్ని ఓ సినీకవి ఎంతో రమణీయంగా వర్ణించినట్లే పచ్చదనం పర్చుకున్న ఈ ప్రకృతి కూడా ఎన్నో అందాలతో మనకు కనువిందు చేస్తుంది. ఇందులో రకరకాల వృక్ష సంపదే కాదు.. అనేక రకాల కీటకాలూ మనల్ని అలరిస్తాయి.. ఎంతో మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి. వీటిలో ముఖ్యమైనవి సీతాకోక చిలుకలు. ఓ పువ్వు మీద నుంచి ఇంకో పువ్వు మీదకు.. ఓ కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు.. వయ్యారంగా రెక్కలూపుకుంటూ ఎగిరే ఈ సీతాకోకలు సర్వమానవాళికీ ఆహార భద్రత కలిగిస్తాయి. పర్యావరణంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన ఈ జాతిలో ఇప్పుడు కొత్తగా నాలుగు రకాలు చేరాయి. అది కూడా ఎక్కడో కాదు.. మన ఏపీలోనే. ఆ వివరాలు.. రుతుపవనాలు పర్యావరణంలో కొన్ని అందమైన మార్పులు తీసుకొస్తాయి. పెరుగుతున్న పచ్చదనం, వికసిస్తున్న పువ్వులు, కొత్త వృక్ష సంపద.. వాటి చుట్టూ అనేక రకాల పురుగుల మనుగడ జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రకృతిలో జరిగే ఈ అందమైన మార్పులు, కీటకాల మనుగడను ప్రకృతి ప్రేమికులు నిశితంగా పరిశీలిస్తారు. వారి అన్వేషణలో (నేచర్ వాక్స్) ఇటీవల రాష్ట్రంలో నాలుగు కొత్త సీతాకోక చిలుక జాతులు రికార్డయ్యాయి. చిత్తూరు జిల్లా తిరుమలలో ఫ్లంబియస్ సిల్వర్లైన్, నారో బ్యాండెడ్ బ్లూ బాటిల్ జాతి సీతాకోక చిలుకలను కనుగొన్నారు. విశాఖపట్నం ఏజెన్సీలోని కొయ్యూరు ప్రాంతంలో లాంగ్ బ్యాండెడ్ సిల్వర్లైన్, డార్క్ పైరాట్ జాతులను గుర్తించారు. ఈ నాలుగు జాతుల సీతాకోక చిలుకలు ఇంతవరకు మన రాష్ట్రంలో రికార్డు కాలేదు. విజయవాడ నేచర్ క్లబ్కి నేతృత్వం వహిస్తున్న రాజేష్ వర్మ దాసి, రాజశేఖర్ బండి బృందం ఇటీవల నిర్వహించిన నేచర్ వాక్స్లో తొలిసారిగా వాటిని తమ కెమెరాల్లో బంధించారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో అరుదైన ఆర్కిడ్ టిట్ జాతి సీతాకోక చిలుక కూడా రికార్డయింది. ఇది గతంలో రికార్డయినా చాలా అరుదైనది. ప్రకృతి ప్రేమికుడు జిమ్మీ కార్టర్ దీన్ని రికార్డు చేశారు. ఈ ఆర్కిడ్ టిట్ సీతాకోక చిలుక 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం షెడ్యూల్–1 పరిధిలోకి వస్తుంది. దీని ప్రకారం.. పులులను సంరక్షిస్తున్నట్లే ఈ జాతి సీతాకోక చిలుకల్ని సంరక్షించాల్సి వుంది. అందుకే పర్యావరణంలో వీటికి అత్యంత ప్రాధాన్యత ఉన్నట్లు చెబుతున్నారు. 170 సీతాకోక చిలుక జాతులు, 200 చిమ్మట జాతులు సీతాకోక చిలుకలు, చిమ్మటలు (పురుగు సీతాకోక చిలుకలు), తేనెటీగలు, కందిరీగల వంటి కీటకాలు ముఖ్యమైన పరాగ సంపర్క జీవులు. ఇవి అనేక ఆహార పంటలను పరాగ సంపర్కం చేయడం ద్వారా మానవాళికి ఆహార భద్రతను కల్పిస్తున్నాయి. మన దేశంలో వెయ్యి కంటే ఎక్కువ జాతుల సీతాకోక చిలుకలు, 10 వేల జాతుల చిమ్మటలు ఉన్నట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 170కి పైగా సీతాకోకచిలుక జాతులు, 200కి పైగా చిమ్మటలు రికార్డయ్యాయి. వీటి జీవిత కాలం ఎంతంటే.. కొన్ని రకాలు కేవలం 15 రోజులు మాత్రమే జీవిస్తే.. మరికొన్ని 12 నెలల వరకూ బతుకుతాయి. నేచర్ వాక్స్తో కొత్త విషయాలు ఐఐఎస్ఈఆర్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్), తిరుపతి విభాగం తరచూ నేచర్ వాక్స్ నిర్వహిస్తుంది. ఈ వాక్స్లో అనేక కొత్త సీతాకోక చిలుకలు, ఇతర కీటకాలను రికార్డు చేస్తున్నాం. ప్రకృతి, జీవ వైవిధ్యానికి సంబంధించి ఎన్నో కొత్త విషయాలు వీటి ద్వారా తెలుస్తాయి. సెప్టెంబర్ నెలను బిగ్ బటర్ఫ్లై మంత్గా పిలుస్తారు. వలంటీర్లు వారి చుట్టూ ఉన్న సీతాకోక చిలుక జాతులను రికార్డ్ చేసి సిటిజన్ సైన్స్ పోర్టల్స్లో పంచుకుంటారు. మన దేశంలో ఈ సమాచారాన్ని ifoundbutterflies,indiabiodiversityportal, moths of india and inaturalist వంటి వెబ్సైట్లలో సమర్పిస్తారు. ప్రకృతి ప్రేమికులు ఎవరైనా జీవవైవిధ్య పరిరక్షణకు ఈ పనిచేయవచ్చు. – రాజశేఖర్ బండి, సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్, ఐఐఎస్ఈఆర్, తిరుపతి గొప్ప జీవ వైవిధ్యం ఏపీ సొంతం రాష్ట్రంలో చాలా గొప్ప జీవ వైవిధ్యం ఉంది. దురదృష్టవశాత్తు అది తగినంతగా నమోదుకాలేదు. దైనందిన జీవితంలో మన చుట్టూ కనిపించే జీవవైవిధ్యం, జీవులను రికార్డు చేసి డాక్యుమెంట్ చేయడం చాలా ముఖ్యం. వాటి ఆవాసాల విధ్వంసం, వాతావరణ మార్పులు, పురుగు మందులు అధిక వినియోగం వంటి అనేక అంశాలు కొన్ని పరాగ సంపర్క జాతుల్ని కనుమరుగయ్యేలా చేస్తున్నాయి. అందుకే వాటి సమాచారాన్ని నమోదు చేయడం ద్వారా జీవవైవిధ్యం పరిరక్షణ కోసం ప్రణాళికను రూపొందించే అవకాశం ఉంటుంది. ఇటీవల మేం చేపట్టిన నేచర్ వాక్స్లో నాలుగు సీతాకోక చిలుక జాతులను కొత్తగా మన దగ్గర రికార్డు చేశాం. – రాజేష్ వర్మ దాసి, విజయవాడ నేచర్ క్లబ్ నిర్వాహకుడు -
స్ట్రాబెర్రీ సాగుతో ఏజెన్సీలో పర్యాటక అభివృద్ధి
సాక్షి,అమరావతి: స్ట్రాబెర్రీ సాగుకు విశాఖ ఏజెన్సీ అనుకూలంగా ఉన్నందున సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎంకు ఆమె స్ట్రాబెర్రీ పండ్లను బహూకరించారు. చింతపల్లి మండలం లంబసింగి పరిసర గ్రామాల్లో గిరిజనులు ఎక్కువగా స్ట్రాబెర్రీ సాగుచేస్తున్నారని, దీనిని మరింత ప్రోత్సహిస్తే పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. -
విశాఖ ఏజెన్సీ ఘాట్ రోడ్డులో దుండగుల హల్చల్
సీలేరు (పాడేరు): విశాఖ ఏజెన్సీ సీలేరు పోలీస్స్టేషన్ పరిధి ధారాలమ్మ ఘాట్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి దుండగులు అరాచకం సృష్టించారు. ఆలయం సమీపంలోని రెండో మలుపు వద్ద దారి కాచి, అటుగా వచ్చిన కార్లపై దాడి చేసి బంగారం, నగదు, సెల్ ఫోన్లు దోచుకున్నారు. సీలేరు ఎస్ఐ రంజిత్ అందించిన వివరాలు.. మంగళవారం రాత్రి పంచాయతీరాజ్ జేఈ జ్యోతిబాబు సీలేరులో సచివాలయ భవన నిర్మాణాన్ని పరిశీలించి రాత్రి 9 గంటలకు తిరిగి చింతపల్లికి కారులో వెళుతున్నారు. ధారాపురం ఘాట్రోడ్డు వద్ద రాత్రి 11.30గంటల సమయంలో ముసుగు ధరించిన ఐదుగురు దుండగులు వచ్చి కారును అడ్డగించారు. అనుమానం వచ్చి వేగంగా వెనక్కి తిప్పేందుకు ప్రయత్నిస్తుంటే.. ఇనుపరాడ్లతో అద్దాలు ధ్వంసం చేశారు. అయితే ఆయన తప్పించుకుని వెళ్లిపోయారు. బుధవారం తెల్లవారు జామున 4.30 ప్రాంతంలో పాల్వంచ నుంచి సీలేరు మీదుగా లంబసింగికి కారులో ఐదుగురు వెళుతుండగా.. నాటు తుపాకులు, కత్తులతో బెదిరించి వారి వద్ద నుంచి రూ.35 వేల నగదు, నాలుగు సెల్ఫోన్లు దోచుకున్నారు. దుండగులు ధ్వంసం చేసిన కారు అద్దాలు అది జరిగిన మరో అరగంటలో సీలేరుకు చెందిన సత్యనారాయణ అనే వ్యాపారి.. భార్య ఈశ్వరమ్మతో కలిసి కారులో వెళ్తుండగా ఐదుగురు వచ్చి.. తాము పోలీసులమని, తనిఖీలు చేయాలని చెప్పారు. కారు అద్దాలు దించేలోగా ఇద్దరి మెడలోని ఐదు తులాల బంగారం గొలుసులను లాక్కుని పారిపోయారు. ఈ ఘటనలో మహిళ మెడకు గాయాలయ్యాయి. వెనుక నుంచి బస్సు వస్తుండటంతో దుండగులు పరారయ్యారు. దాడికి పాల్పడిన వారంతా ఒడిశాకి చెందిన వారుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
బలహీన పడిన అల్పపీడనం
మహారాణిపేట(విశాఖ దక్షిణ)/పాడేరు: గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం బలహీన పడింది. ఇది ఆగ్నేయ ఆరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో దానికి అనుకుని అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మినుములూరులో 8 డిగ్రీలు విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మినుములూరులో సోమవారం ఈ సీజన్లోనే అత్యల్పంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక్కడి కాఫీ బోర్డులో ఆదివారం 12 డిగ్రీలు నమోదు కాగా సోమవారానికి 8 డిగ్రీలకు పడిపోయింది. అరకులోయలో 12.7 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానంలో 11.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లంబసింగికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఏజెన్సీలో ఉదయం 9.30 గంటల వరకు మంచు కురుస్తోంది. -
గంజాయి.. ఇక సాగదోయి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు ఎక్సైజ్ శాఖ రంగం సిద్ధం చేసింది. ఇకపై మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ కేంద్రంగా గంజాయి సాగు.. అక్రమ రవాణా జరుగుతోంది. విశాఖ ఏజెన్సీలో స్మగ్లర్లు అక్కడి గిరిజనులతో గంజాయి సాగు చేయిస్తూ.. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. పాడేరు కేంద్రంగా ‘స్పెషల్ ఆపరేషన్’ ► నవంబర్ నుంచి గంజాయి సాగు సీజన్ ఆరంభం కానుంది. ఈ ఏడాది సాగును అడ్డుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం రాష్ట్ర నోడల్ అధికారిగా ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ కేఎల్ భాస్కర్ను ప్రభుత్వం నియమించింది. ► 2020–21లో సాగును పూర్తిగా నియంత్రించేందుకు అన్ని రాష్ట్రాలతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గురువారం సమావేశం నిర్వహించనుంది. ► స్పేస్ టెక్నాలజీ సమాచారంతో నవంబర్లో మొదలయ్యే గంజాయి సాగును నిర్మూలించేందుకు విశాఖ జిల్లా పాడేరు కేంద్రంగా ‘స్పెషల్ ఆపరేషన్’ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. గత ఏడాది 31,360 కేజీల గంజాయి సీజ్ 2019 సెప్టెంబర్ 1 నుంచి 2020 ఆగస్టు 31 వరకు గడచిన ఏడాది కాలంలో 31,360 కేజీల గంజాయిని సీజ్ చేసి.. 512 ఎకరాల్లో గంజాయి తోటలను ఎక్సైజ్ శాఖ ధ్వంసం చేసింది. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని 17 గ్రామాల్లో గంజాయి నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించి 25.62 లక్షల గంజాయి మొక్కల్ని తొలగించింది. అదే గ్రామాల్లో 358 కేజీల ఎండు గంజాయిని తగులబెట్టారు. పోలీసుల సహకారం తీసుకుంటాం విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలతోపాటు నల్లమల అటవీ ప్రాంత పరిధిలోని జిల్లాల్లోనూ గంజాయి సాగును గుర్తించాం. సాగును నిర్మూలించేందుకు, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కార్యాచరణ రూపొందించాం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచనలకు అనుగుణంగా చర్యలు చేపడతాం. ఈ విషయంలో పోలీసుల సహకారం తీసుకుంటాం. – కేఎల్ భాస్కర్, నోడల్ అధికారి, ఎక్సైజ్ అదనపు కమిషనర్ -
మన్యం జలమయం !
మన్యం మునిగింది. రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వానతో ఏజెన్సీ పూర్తిగా జలమయమైంది. అరకులోయ, అనంతగిరి డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో కుండపోతగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. పాడేరు, పెదబయలు, డుంబ్రిగుడ, హుకుంపేట, జి,కె.వీధి, కొయ్యూరు మండలాల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రంతా కుండపోతగా భారీ వర్షం కురవడంతో మారుమూల గ్రామాల గిరిజనులు బిక్కుబిక్కుమంటు కాలం గడిపారు. శుక్రవారం కూడా వర్షం తెరిపినివ్వకపోవడంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అరకులోయ, అనంతగిరి ఘాట్లో ఈదురుగాలులతో కూడిన వర్షంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పర్యాటక ప్రాంతాలు కళతప్పాయి. మత్స్యగెడ్డలో వరద నీరు పొటేత్తింది. కల్వర్టులు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సాక్షి, అరకులోయ: కుండపోతగా కురిసిన భారీవర్షంతో ఏజెన్సీలోని ప్రధాన గెడ్డలు, కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదనీరు పోటెత్తడంతో సమీప గ్రామాల గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. పొంగిన మత్స్యగెడ్డ.. పాడేరు, జి.మాడుగుల ప్రాంతాలలో కురిసిన భారీవర్షాలకు మత్స్యగెడ్డలో వరద నీరు పొటేత్తింది. మత్స్యగుండం వద్ద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. హుకుంపేట మండలంలోని మఠం, శోభకోట, మట్టుజోరు, తీగలవలస పంచాయతీల గిరిజనులంతా మత్స్యగెడ్డలో వరదనీరు పరవళ్లు తొక్కుతుండడంతో గెడ్డను దాటేందుకు గిరిజనులు సాహసించడం లేదు. పోటెత్తిన వరద నీరు.. పరదానిపుట్టు కాజ్వే మీదుగా మత్య్సగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పెదకోడాపల్లి–గుత్తులపుట్టు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.అలాగే పాడేరు నుంచి హుకుంపేట మీదుగా రాళ్లగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. హుకుంపేట సమీపంలోని చీడిపుట్టు కాజ్వే మీదుగా వరద నీరు పోటెత్తింది. రోడ్డుకు ఇరువైపులా రాకపోకలు నిలిచిపోవడంతో హుకుంపేట మండలంలోని అడ్డుమండ, బారామోసి, గడికించుమండ పంచాయతీల గ్రామాల గిరిజనులు రవాణాకు ఇబ్బందులు పడుతున్నారు. సంతారి, దిగుడుపుట్టు గెడ్డలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దెబ్బతిన్న రవాణా సౌకర్యాలు.. డుంబ్రిగుడ మండలంలోని అన్ని ప్రధాన గెడ్డలలో వరదనీరు అధికంగా ప్రవహిస్తుండడంతో మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. మారుమూల గోమంగి, గుల్లెలు, జామిగుడ ,బొంగరం, లింగేటి, కుమడ, లక్ష్మిపురం ప్రాంతాల్లో గెడ్డల వరద ప్రవాహం ప్రమాదకరంగా మారింది. జోలాపుట్టు రిజర్వాయర్ నిండు కుండలా మారడంతో గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు వదిలారు. ముంపులో వరి నాట్లు.. భారీవర్షాలు ఖరీఫ్ వ్యవసాయానికి కొంత నష్టాన్ని కలిగించాయి. లోతట్టు ప్రాంతాల్లో పొలాలు మునిగిపోయాయి.కొండవాగుల నుంచి వచ్చిన వరదనీరు పొలాల్లోకి వచ్చేయడంతో చాలాచోట్ల వరి నాట్లు కొట్టుకుపోయాయి. హుకుంపేట మండలంలోని రంగశీల,కొట్నాపల్లి,తడిగిరి,పాతకోట,సూకూరు,కొంతిలి.ములియాపుట్టు, పంచాయతీల్లో పంట భూములపై వరదనీరు పారింది. చెరువులను తలపిస్తున్న పొలాలు.. తడిగిరి పంచాయతీలోని ఉక్కుర్బ గ్రామ సమీపంలో కొండవాగు పంట పొలాలను ముంచేసింది. సుమారు 30 ఎకరాల వరి పొలాలల్లో ఇసుక, మట్టి మేటలు వేసింది. హుకుంపేట–అరకు రోడ్డులోని బలోర్డ, రంగశీల ప్రాంతాల్లోని కొండవాగుల నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో ఖరీఫ్ వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో కూడా ఖరీఫ్ పంట భూములను వరదనీరు ముంచెత్తింది. కొట్టుకుపోయిన మత్స్యపురం వంతెన.. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు హుకుంపేట మండలంలోని పెదగరువు సమీపంలో మత్స్యపురం వంతెన శుక్రవారం ఉదయం కొట్టుకుపోయింది. దీంతో సమీపంలోని కొట్నాపల్లి పంచాయతీ, బిసాయిపుట్టు, మత్స్యపురం, పందిమెట్ట తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద వంతెన కొట్టుకుపోవడంతో ఈ ప్రాంతంలోని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు.10 గ్రామాల గిరిజనులకు రవాణా స్తంభించింది. కొట్టుకుపోయిన లింగాపుట్టు కల్వర్టు.. పాడేరు రూరల్: అల్పపీడన ప్రభావంతో మన్యంలో నాలుగు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి మండలంలోని గొండెలి పంచాయతీ లింగాపుట్టు వద్ద కల్వర్టు కొట్టుకుపోయింది. శుక్రవారం ఉదయం నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కల్వర్టుకు అటువైపుగా ఉన్న గొండెలి, కించూరు, బడిమెల పంచాయతీల పరిధిలోని సుమారు 15 గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన వంతెన పనులు నేటికీ పూర్తికాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి వర్షానికి కాలువ పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని వారు వాపోతన్నారు. ఐటీడీఏ ఉన్నతాధికారులు స్పందించి వంతెన నిర్మాణ పనులు త్వరిగతిన పూర్తి చేయాలని పరిసర గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. బొక్కెళ్లు వద్ద రాయిగెడ్డ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. స్తంభించిన రాకపోకలు.. ముంచంగిపుట్టు/పెదబయలు (అరకు): మండలంలో వారం రోజుల నుంచి కురుసున్న వర్షాలకు గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మారుమూల గ్రామాల గిరిజనులు గెడ్డలుదాటి రావడానికి ఇబ్బందిగా మారింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షాలకు గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని బుంగాపుట్టు, లక్ష్మీపురం. రంగబయలు, బూషిపుట్టు గ్రామాలకు వెళ్లే మార్గంలో గెడ్డలు పొంగి ప్రవహించడంతో మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. బుంగాపుట్టుకు వెళ్లే మార్గంలో ముం త గుమ్మి, బిరిగూడ గెడ్డలు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. వనగుమ్మ పంచాయ తీ తర్లగుడ గ్రామానికి వెళ్లే కల్వర్టు ఇటీవల వర్షాలకు కొట్టుకుపోయింది. గ్రామస్తులు విద్యుత్ స్తంభాన్ని వారధిగా ఏర్పాటుచేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ముంచంగి పుట్టు నుంచి రూడకోట, కుమడ పంచాయతీలకు వెళ్లే మార్గంలో గెండిగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయా యి. ప్రధాన రోడ్లు జలమయం అయ్యాయి. వంద గ్రామాలకు స్తంభించిన రాకపోకలు.. జి.మాడుగుల (పాడేరు): మండలంలో గురువారం కురిసిన కుండపోత వర్షానికి జి.మాడుగుల– మద్దిగరువు ఆర్అండ్బి మార్గంలో సూరిమెట్ట వద్ద పైపు కల్వర్టు, అప్రోచ్ రోడ్డు కోతకు గురై కొట్టుకుపోవడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. జి.మాడుగుల, పెదబయలు మండలాలకు చెందిన సుమారు వంద గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది. సూరిమెట్ట పైపు కల్వర్టు, అప్రోచ్రోడ్లు ధ్వంసమవడంతో గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కల్వర్టు, అప్రోచ్రోడ్డు నిర్మించి రాకపోకలు పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. పెద్దేరుకు వరద నీరు.. మాడుగుల: ఎగువు ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు పెద్దేరు జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం తెల్లవారుజా మును నుంచి వర్షం కురుస్తూనే ఉంది. జలాశయం డ్యామ్ ప్రాంతంలో 60 ఎంఎం వర్షపాతం నమోదయింది. జలాశయం సా మర్థ్యం 320.05 ఎంసీఎఫ్టీ కాగా ప్రస్తుతం 218.25 ఎంసీఎఫ్టీల నీరు ఉంది. జలాశయంలోకి రోజుకు 80 క్యూసెక్కుల చొప్పున వరద నీరు చేరుతుండటంతో అదే మేర పంట పొలాలకు నీరు విడుదల చేస్తున్నారు. జలా శయం ఆయకట్టు పరిధిలో చేపట్టిన 4,600 ఎకరాల వరికి, చెరకు పంటకు సాగునీటికి ఢోకా లేదని ప్రాజెక్ట్ జేఈ సుధాకర్రెడ్డి తెలి పారు. ప్రాజెక్ట్ పరిధిలో ఖరీఫ్ సాగుకు వర్షాలతో పనిలేదన్నారు. జలాశయం గరిష్ట నీటి మ ట్టం 137 మీటర్లు కాగా ప్రస్తుతం 135 మీటర్ల మేర నీరు ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఉధృతంగా వాగులు, గెడ్డలు పెదబయలు (అరకు): పెదబయలు మండలంలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం 12 గంటల వరకు కుండపోత వర్షం కురిసింది. పెదబయలులో శుక్రవారం రికార్డు స్థాయిలో 108.2 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది. ప్రధాన గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గెడ్డలు దాటి రాకపోకలు సాగించేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముంచంగిపుట్టులో 76.8 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది. మత్స్యగెడ్డ నిండుకుండను తలపిస్తోంది. ఏడేళ్ల తరువాత మత్స్యగెడ్డ ఉధృతంగా ప్రవహించడం ఇదే మొదటిసారి అని గిరిజనులు తెలిపారు. గెడ్డలు పొంగి ప్రవహించడం వల్ల మారుమూల గిన్నెలకోట, జామిగుడ పంచాయతీలకు వెళ్లేందుకు గిరి జనులు ఇబ్బందులు పడుతున్నారు. పరదా నిపుట్టు వంతెనపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది. గెడ్డ ఉధృతంగా ప్రవహించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పెదబయలు రేవులో బోట్ల రవాణా నిలిపివేశారు. -
దశ తిరిగింది !
దశాబ్దాలుగా కనీస సౌకర్యాలకు నోచుకోని ఆ రెండు గ్రామాల దశ ఒక్క ఫోన్ కాల్తో మారబోతోంది. రావికమతం మండలం పశులబంద, జీలుగులోవ గిరిజన గ్రామాలకు రోడ్డు, విద్యుత్, మంచినీరు సౌకర్యాలు కల్పించాలని వచ్చిన వినతిపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఇటీవల సాక్షి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వినయ్చంద్తో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో కొంతమంది గిరిజనులు తమ సమస్యలను చెప్పుకున్నారు. స్పందించిన కలెక్టర్ ఆ రెండు గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ గ్రామాలను తహసీల్దార్ పి.కనకారావు, ఎంపీడీవో రామచంద్రరావు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు సందర్శించారు. విద్యుత్, తాగునీరు, రోడ్ల పనులకు శ్రీకారం చుట్టడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహారాణిపేట,(విశాఖ దక్షిణ): రావికమతం మండలం పశులబంద, జీలుగులోవ గిరిజన గ్రామాలు కొనేళ్ల వరకూ రెవెన్యూ రికార్డుల్లో లేవు. దీంతో అభివృద్ధి ఈ ఊర్లవైపు తొంగిచూలేదు. సుమారు మూడేళ్ల క్రితం రెవెన్యూ రికారుల్లో చేర్చినప్పటికీ పాలకులు పట్టించుకోలేదు. దీంతో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంత మంది పాలకులు వచ్చినా అభివృద్ధి ఆనవాళ్లు ఇక్కడ కనిపించలేదు. కళ్యాణపులోవకు ఆరు కిలో మీటర్ల దూరంలో సామాలమ్మ కొండల్లో పశులబంద, జీలుగులోవ గిరిజన గ్రామాలు ఉన్నాయి. విద్యుత్ సౌకర్యం లేదు. మంచినీరు దొరకదు. కనీసం రోడ్డు కూడా లేదు. ఈ గ్రామాల్లో 18 గిరిజన కుటుంబాలుండగా (కోందు తెగ).. 50 మందికి పైగా జీవిస్తున్నారు. అడవిలో పండే వాటినే తింటూ.. కొండకోనల్లో అడవి జంతువులు, క్రిమికీటకాల మధ్య జీవనం సాగిస్తున్నారు. ఓటు హక్కులేదు. రేషన్, ఆధార్కార్డులకు నోచుకోలేదు. వీరు ఏ మండలంలో ఉన్నారో..ఏ పంచాయతీకి చెందిన గుర్తింపు లేకుండా పోయింది. ఎలాంటి ప్రభుత్వపథకాలు అందడం లేదు. విద్యుత్ సరఫరా లేక చీకట్లో అవస్థలు పడుతున్నారు. కట్టెలను వెలిగించి వచ్చే వెలుతురులో రాత్రి భోజనం చేసి నిద్రలోకి జారుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న జీసీసీ గతంలో ఓ సారి రెండు గ్రామల గిరిజనులకు కిరోసిన్ సరఫరా చేసింది. తరువాత ఆ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఓ స్వచ్ఛంద సేవాసంస్థ సహకారంతో గ్రావిటీ పథకం ఏర్పాటు చేసి కుళాయి ద్వారా నీరు సరఫరా చేశారు. ప్రస్తుతం అది కూడా పాడైంది. దీంతో గెడ్డలో ఊరే నీటిని తెచ్చుకొని అవసరాలు తీర్చుకుంటున్నారు. రోడ్డు సదుపాయం లేకపోవడంతో అత్యవసర సమయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు కూడా జరగడం లేదు. జీసీసీ కూడా ఈ గ్రామాలవైపు పూర్తిస్థాయిలో కన్నెత్తి చూడలేదు. ఈ పరిస్థితిలో ఇటీవల కలెక్టర్ వినయ్చంద్తో సాక్షి నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమలో పాల్గొన్న కొంతమంది గిరిజన సంఘ నాయకులు ఈ గ్రామాల దుస్థితిని చెప్పారు. తక్షణమే స్పందించిన ఆయన గ్రామాలకు వెళ్లి పరిస్థితిని చూడమని ఆదేశించారు. దీంతో రావికమతం తహసీల్దార్ పి.కనకారావు, ఎంపీడీవో రామచంద్రరావు, విద్యుత్ శాఖ అధికారులు పశులబంద, జీలుగులోవ గ్రామాలను సందర్శించారు. విద్యుత్, రోడ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఆదుకోండి.. అడవిని నమ్ముకొని జీవిస్తున్నాం. కనీస సౌకర్యాలు లేవు. తాగడానికి నీరు లేదు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదు. తాగునీరు, విద్యుత్ సరఫరా చేయాలి. రోడ్డు వేయాలి. కొర్రగాసి, పశువులబంద ఏ మండలంలో ఉన్నాయో? పశులబండ, జీలుగులో గిరిజన గ్రామాలు ఏ మండలంలో ఉన్నాయో కూడా తెలియడం లేదు. రావికమతం అని చెబుతున్నా ఆ మండల అధికారులు మా వైపు చూడడం లేదు. ఏమైనా ఆధారం ఉందా అని అడుతున్నారు. సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్చంద్తో మాట్లాడే అవకాశం కలిగింది. తమకు ఎంతో ఆనందం కలిగింది. విద్యుత్, తాగునీరు, రహదారులు లేవని చెప్పాం. కలెక్టర్ స్పందించారు. సాక్షికి కృతజ్ఞతలు. – కె.గోవిందరావు, మైదాన ప్రాంత గిరిజన సంఘం జిల్లా కన్వీనర్ -
అగ్రనేతల కోసం జల్లెడ!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యం వణుకుతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. కూంబింగ్ దళాల బూటు చప్పుళ్ల శబ్ధాలతో దండకారణ్యం మరోసారి దద్దరిల్లుతోంది. ఒడిశా సరిహద్దుల్లోని పాడువా వద్ద జరిగిన ఎకౌంటర్లో ఐదుగురు కీలక నేతలు హతమయ్యారు. వీరిలో ముగ్గురు అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేర సోమలను హతమార్చిన మావోల బృందంలో కీలక పాత్ర పోషించినట్టుగా గుర్తించారు. మరో వైపు వీరి వద్ద లభ్యమైన కిట్ బ్యాగ్లలో అత్యంత కీలక సమాచారం పోలీసుల చేతికి చిక్కింది. ఏవోబీలో మావో అగ్రనేతలు గత కొంత కాలంగా షెల్టర్ తీసుకుంటున్నారన్న వార్త కలకలం రేపింది. ముఖ్యంగా మావోయిస్టుల అగ్రనేతలు చలపతి, అరుణ, నవీన్లు గిరిజనులతో కూడా భేటీఅవుతున్నారన్న సమాచారం పోలీసులను కలవరపెడుతోంది. పైగా మావోలకు సహకారం అందిస్తున్నది పోలీసులేనన్న వార్తలు పోలీస్ ఉన్నతా«ధికారులు జీర్ణించు కోలేకపోతున్నారు. ఈ ఆరోపణలతోనే సీలేరు జెన్కోలో పనిచేస్తున్న హోంగార్డులను సైతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మావో అగ్రనేతల కోసం మూడు కంపెనీల ప్రత్యేక బలగాలు గాలింపు సాగిస్తున్నారు. మరో వైపు ఆదివారం యాక్షన్ టీమ్స్ను కూడా రంగంలోకి దించారు. విశాఖ రేంజ్ డీఐజీ, ఎస్పీలు స్వయంగా పర్యవేక్షి స్తున్నారు. ఉత్తరాంధ్ర గిరిజనుల ఇలవేల్పు అయిన పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాలను లక్ష్యంగా చేసుకుని ప్రతి ఏటా మావోలు ఏదో ఒక అలజడి సృష్టిస్తుంటారు. గతంలో ఇదే ఉత్సవాల సమయంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్లు రవిశంకర్, సింహాచలంలను హతమార్చారు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఇదే సమయంలో పలువుర్ని ఇన్ఫార్మర్ల నెపంతో మట్టుబెట్టారు. ఈ నేపథ్యంలో ఈసారి జాతర మహోత్సవాల సందర్భంగా ఎలాంటి అలజడలు..అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ఓ పక్క భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో వైపు విశాఖ మన్యంలోనే మావో అగ్రనేతలున్నారని, ఏదో భారీ విధ్వంసానికి తెగపడేందుకు కుట్ర చేస్తున్నారన్న సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా యాక్షన్ టీమ్లను రంగంలోకి దింపడంతో దండకారణ్యాన్ని జల్లెడపడుతున్నారు. అగ్రనేతలు సంచరించినట్టుగా చెబుతున్న గ్రామాల్లో అణువణువు గాలిస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే ఓ ఆరడజను మంది గిరిజనుల విచారణ పేరుతో అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించారని, వార్ని విడిచిపెట్టాలంటూ వామపక్ష నేతలు ఎస్పీని కలిసి వినతిపత్రం కూడా సమర్పించారు. మరో వైపు అనుమానం వచ్చిన గిరిజనులకే కాదు..పోలీసుల్లో కూడా మావోయిస్టులకు సహకరిస్తున్న వారు ఉన్నారన్న వార్తలతో మరింత నిఘా పెంచారు. ఒక్క పోలీసులనే కాదు.. వివిధ శాఖల్లో పనిచేస్తున్న మావో సాను భూతిపరులపై కూడా నిఘా పెట్టారు.ఏపీ, ఒడిశా పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖ తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి ఏపీ పోలీసులు, ఒడిశా సరిహద్దు వైపు నుంచి ఆ రాష్ట్ర పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఏవోబీలో కూంబింగ్ పార్టీని లక్ష్యంగా చేసుకుని శనివారం మావోలు మందుపాతర పేల్చడం..ఈ ఘటనలో ముగ్గురు ఎస్పీజీ దళ సభ్యులు గాయపడడంతో బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. కచ్చితంగా ఏవోబీలో మావోయిస్టుల కదలికలు ఎక్కువయ్యాయని భావిస్తున్నారు. ఎన్నికలనంతరం పోలీసులు కాస్త విశ్రాంతి తీసుకుంటారని భావించిన మావోలు ఏవోబీలో ఏదో విధంగా అలజడి సృష్టించేందుకు తెగపడే సూచనలు ఉన్నట్టుగా నిర్ధారణకు వచ్చారు. ఏది ఏమైనా మరో సంఘటన జరగకుండా సాధ్యమైనంత త్వరగా ఏవోబీలో మకాం వేసిన పోలీసులు మావో అగ్రనేతలను పట్టుకోవాలని పకడ్బందీ వ్యూహంతో ముందుకు కదులుతున్నారు. -
పోలీసుల కాల్పుల్లో ఇద్దరు గిరిజనుల మృతి
అరకులోయ/పెదబయలు: విశాఖ ఏజెన్సీలో పోలీసు కూంబింగ్ పార్టీల కాల్పులకు ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. మరో ఇద్దరు పరుగులు తీసి తృటిలో ప్రాణాలను కాపాడుకున్నారు. మృతి చెందిన గిరిజనులు మావోయిస్టు పార్టీ పెదబయలు ఏరియా కమిటీ సభ్యులని పోలీసులు ప్రకటించారు. వేటకు వెళ్లిన ఇద్దరిని దారుణంగా తుపాకులతో కాల్చి చంపారని పెదకోడాపల్లి గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదబయలు మండలంలోని పెదకోడాపల్లి మెట్టవీధికి చెందిన బట్టి భూషణ్రావు (50), సిదేరి జమదరి (35) నాటు తుపాకులను వెంటబెట్టుకుని శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి అరనంబయలు కొండ, గంగోడిమెట్ట కొండలపైకి బయల్దేరారు. వారికి సహాయంగా కోడా బొంజుబాబు, సిదేరి రాంబాబు ఉన్నారు. కుందేళ్లు, ఇతర అడవీ జంతువుల వేట కోసం వెళ్లారు. అయితే వారి వేట సాగకపోవడంతో, అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో గ్రామానికి కాలినడకన బయల్దేరారు. నాటు తుపాకులు కలిగి ఉన్న భూషణ్రావు, జమదరి ముందు నడుస్తుండగా, వారి వెనుకన బొంజుబాబు, రాంబాబు వెళ్తున్నారు. పెదకోడాపల్లి గ్రామానికి సమీపంలోని బురదమామిడి పంట భూముల సమీపంలోకి రాగానే పోలీసు పార్టీలు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ముందు నడుస్తున్న బట్టి భూషణ్రావు, సిదేరి జమదరి అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక ఉన్న బొంజుబాబు, రాంబాబు తప్పించుకుని సురక్షితంగా గ్రామానికి చేరుకున్నారు. అయితే పోలీసులు మాత్రం ఎన్కౌంటర్ నిజమేనని, సుమారు 20 మంది మావోయిస్టులు సంచరిస్తుండడంతో వారిపై కాల్పులు జరిపామని ప్రకటించారు. భగ్గుమన్న గిరిజనులు కాల్పుల్లో మృతి చెందిన బట్టి భూషణ్రావు, సిదేరి జమదరి మావోయిస్టు సభ్యులని పోలీసులు చెప్పడంపై పెదకోడాపల్లి గిరిజనులంతా భగ్గుమన్నారు. దకోడాపల్లి పంచాయతీలోని గిరిజనులంతా శనివారం మధ్యాహ్నం పాడేరుకు చేరుకుని పోలీసుల తీరుపై నిరసన ప్రదర్శన చేశారు. పాడేరు సబ్కలెక్టర్ వెంకటేశ్వర్కు వినతిపత్రం అందజేశారు. పోలీసులు కాల్పులు జరపడంపై న్యాయ విచారణ చేసి, బాధిత గిరిజనుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి నుంచే పెదకోడాపల్లి అటవీ ప్రాంతంలో పోలీసు కూంబింగ్ పార్టీలు అధికంగా సంచరించాయి. నాటు తుపాకులు కలిగిన ఉన్నందున వారిని మావోయిస్టులు అనుకుని కాల్పులు జరిపి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాలను అంబులెన్స్ ద్వారా పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
అమ్మో ఆంత్రాక్స్!?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యంలో ఆంత్రాక్స్ కలకలం రేపుతోంది. వేసవి సీజన్ ముగిసి, వర్షాలు మొదలయ్యాక ఈ వ్యాధి బయటపడుతోంది. కుళ్లిన, నిల్వ ఉంచిన పశుమాంసం తిన్న వారికి ఆంత్రాక్స్ సోకుతుంది. ఏజెన్సీలో గత పన్నెండేళ్ల నుంచి ఆంత్రాక్స్ ఉనికిని చాటుకుంటూనే ఉంది. అప్పట్నుంచి ఏడాదికి, రెండేళ్లకోసారి ఈ వ్యాధి సోకుతోంది. తరచూ ఆయా ప్రాంతాల్లో గిరిజనులు ఈ వ్యాధిన బారిన పడుతూనే ఉన్నారు. కుళ్లిన పశుమాంసం తిన్న వారి చేతి వేళ్లకు పొక్కులు, బొబ్బలు మాదిరిగా ఏర్పడతాయి. వీరికి తక్షణమే తగిన వైద్యం అందకపోతే ప్రాణాంతకమవుతుంది. 2005లో మన్యంలో ఐదుగురికి ఆంత్రాక్స్ వ్యాధి నిర్ధారణ అయింది. అప్పట్నుంచి వ్యాధిగ్రస్తుల సంఖ్య నమోదవుతూనే ఉంది. 2007, 2009, 2010, 2011, 2013, 2016ల్లో ఆంత్రాక్స్ వ్యాధి ప్రభావం చూపింది. గత ఏడాది ఏప్రిల్లో హుకుంపేట మండలం పనసపుట్టులో 13 మందికి సోకగా ఇద్దరు మృత్యువాతపడ్డారు. గత మార్చిలో డుంబ్రిగుడ మండలం గత్తరజిల్లెడ గ్రామంలో నలుగురికి ఆంత్రాక్స్ సోకింది. తాజాగా అరకులోయ మండలం సిరగాం పంచాయతీ కోడిపుంజువలస గ్రామంలో ఐదుగురు గిరిజనుల్లో ఆంత్రాక్స్ లక్షణాలు కనిపించాయి. గ్రామానికి చెందిన కె.కృష్ణ, జె.సోమన్న, జి.మంగళయ్య, జి.గుండు, పి.గుండులకు శనివారం చేతి వేళ్లపై పొక్కులు ఏర్పడ్డాయి. దీంతో వీరిని తొలుత అరకు ఏరియా ఆస్పత్రికి, ఆ తర్వాత అక్కడ నుంచి కేజీహెచ్కు తీసుకొచ్చారు. కేజీహెచ్లోని చర్మవ్యాధుల వార్డులో చేర్చి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. ప్రాథమిక లక్షణాలను బట్టి వారికి ఆంత్రాక్స్ సోకినట్టుగా వైద్యులు అనుమానిస్తున్నారు. వారి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపారు. వీరికి సోకినది ఆంత్రాక్సా? కాదా? అన్నది సోమవారం వచ్చే నివేదికల ఆధారంగా నిర్ధారణ అవుతుందని డీఎంహెచ్వో ఉమాసుందరి ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుతం వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని, నివేదిక వచ్చాక అవసరమైన చికిత్సనందిస్తామని తెలిపారు. కోడిపుంజుల వలస, పరిసర గ్రామాల్లో పరిస్థితిని ఏజెన్సీలోని అదనపు జిల్లా వైద్యాధికారి గురునాథరావు సమీక్షిస్తున్నారన్నారు. మరోవైపు నిల్వ ఉంచిన మేక మాంసాన్ని తిన్నామని, ఆ తర్వాత చే తులకు బొబ్బలు వచ్చాయని బాధితులు చెబుతున్నారు. -
బాక్సైట్ దోపిడీని అడ్డుకుంటాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ స్పష్టీకరణ {పజా సమస్యలపై పార్టీ నిరంతర పోరాటం ఎంపీ గీత కు దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలి పాడేరు :విశాఖ ఏజెన్సీలో గిరిజనుల సంపదైన బాక్సైట్ను దోచుకుని రాజధాని నిర్మాణానికి ఉపయోగించాలనే ప్రభుత్వ కుట్రను ప్రాణాలు ఒడ్డైనా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలమంతా అడ్డుకుంటామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధ్యక్షతన ఇక్కడి ఆర్అండ్బీ అతిథి గృహం ఆవరణలో శనివారం సాయంత్రం ఏర్పాటైన పాడేరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. బాక్సైట్ ఖనిజాలు తవ్వాలని ప్రభుత్వం చేసే ప్రయత్నాలను తామంతా అడ్డుకుంటామన్నారు. వైఎస్సార్సీపీ అన్ని మండలాల్లో బాక్సైట్ వ్యతిరేక పోరాటాలను ఉధృతం చేస్తుందని, అవసరమైన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కూడా రప్పిస్తామన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు గిరిజనులందరికీ మేలు చేస్తానని హామీలు ఇచ్చి, ఇప్పుడు విస్మరించారని ఆరోపించారు. మంత్రి అయ్యన్నపాత్రుడు తన ప్రాంతంలో ఉన్న ఆన్రాక్ ఫ్యాక్టరీ పక్షాన నిలిచి బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు, ఆరు నెలల్లో తన నిజ స్వరూపం రుజువు చేసుకున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం, జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై ఉన్న అభిమానం, ఆదరణతో కొత్తపల్లి గీతను రికార్డు మెజార్టీతో ఎంపీగా గిరిజనులు గెలిపించారని అయితే ఆమె మాత్రం అధికారం, డబ్బు ఆశతో వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా పని చేస్తుండటం గిరిజనులను బాధిస్తుందన్నారు. బాక్సైట్కు కొత్తపల్లి గీత అనుకూలమో, వ్యతిరేకమో వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భిక్షతో గెలిచిన కొత్తపల్లి గీతకు దమ్ము, ధైర్యం ఉంటే వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అరకు పార్లమెంట్ వైఎస్సార్సీపీ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ గిరిజనుల పక్షాన వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుందన్నారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనుల అభివృద్ధిపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. హుద్హుద్ తుఫానుతో ఏజెన్సీలోని కాఫీ తోటలకు తీవ్ర నష్టం వాటిల్లినా వాటిని పరిశీలించకుండానే మొక్కుబడి సాయాన్ని ప్రకటించారన్నారు. ఈ సమావేశంలో పాడేరు, చింతపల్లి, జీకేవీధి జెడ్పీటీసీ సభ్యులు పి.నూకరత్నం, పద్మకుమారి, నళిని, మహిళా విభాగం జిల్లా నేత పీల వెంకటలక్ష్మి, పాడేరు, జీకేవీధి, జి.మాడుగుల ఎంపీపీలు వర్తన ముత్యాలమ్మ, సాగిన బాలరాజు, ఎం.వెంకట గంగరాజు, పాడేరు మాజీ ఎంపీపీ ఎస్.వి.వి.రమణమూర్తి, కొయ్యూరు, పాడేరు వైస్ ఎంపీపీలు వై.రాజేశ్వరి, ఎం.బొజ్జమ్మ, పలు మండలాల్లోని ఎంపీటీసీలు, సర్పంచులు కర్రి నాయుడు, వారం చిట్టిబాబునాయుడు, కె.చంద్రమోహన్కుమార్, పాడేరు కో-ఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్ జోగిరాజు, టి.ఎస్.రాందాసు, ఎ.బొంజునాయుడు, ఐసరం హనుమంతరావు, కె.చిన్నయ్య, చిట్టిబాబు, లకే రత్నాభాయి, సూరిబాబు, రామస్వామి, రఘునాథ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
సైక్లోన్ రిలీఫ్ వేషం!
భారీగా గంజాయి అక్రమ రవాణా రూ. 2.50 కోట్ల సరకు సీజ్ ఇద్దరు నిందితుల అరెస్ట్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ విశాఖపట్నం సిటీ/నర్సీపట్నం టౌన్: హుదూద్ తుపాను గాయాల నుంచి జనం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంటే కొందరు ప్రబుద్ధులు ఇదే అదనుగా గంజాయిని అక్రమంగా తరలించేస్తున్నారు. ‘సైక్లోన్ రిలీఫ్ వేన్’ పేరుతో గంజాయిని విశాఖ ఏజెన్సీ నుంచి అక్రమ రవాణా చేసేస్తున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం వీటిని పట్టుకున్నారు. సైక్లోన్ రిలీఫ్ వేన్ చిట్టడవిలో ఏం చేస్తుందోనని పరిశీలించిన ఈ బృందానికి క ళ్లు బైర్లు కమ్మేలా గంజాయి బస్తాలు కనిపించాయి. విశాఖ ఎక్సైజ్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడడం ఇదే తొలిసారని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎం. సత్యనారాయణ విశాఖలో శనివారం విలేకరులకు తెలిపారు. ఆయన క థనం ప్రకారం నర్సీపట్నం నుంచి లంబసింగికి వెళ్లే రోడ్డులో అంజలి పంచాయతీ పరిధిలో భారీఎత్తున గంజాయి తరలింపు జరుగుతోందన్న సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ విభాగం కాపు కాసింది. ఐషర్ వాహనంలో 60 బ స్తాల గంజాయిని తరలిస్తుండగా నెల్లిమెట్ట జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుపడింది. ఆ వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. వాహనం రాజమండ్రికి చెందిన ఎస్.సుందరి పేరున ఉందన్నారు. వాహనంలో వున్న కూలికి వచ్చిన ఈదులబయలు గ్రామానికి గెమ్మెలి భాస్కరరావు, చింతపల్లికి చెందిన కొర్రా సీతారాంలను పట్టుకున్నారు. మరో ఐదుగురు పరారయ్యారు. గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనుక సూత్రధారులు ఎవరు? అనే వివరాలను ఎక్సైజ్ పోలీసులు వీరి నుంచి రాబడుతున్నారు. 60 బస్తాల్లో 2,640 కిలోల గంజాయి వున్నట్టు గుర్తిం చారు. దీని విలువ దాదా పు రూ. 2.50 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ సహాయ కమిషనర్ తానికొండ శ్రీనివాసరావు నేతృత్వంలో నర్సీపట్నం ఇన్స్పెక్టర్ జగన్మోహన్రావు, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ జైభీం, అచ్యుతరావు, ఎస్సైలు శ్రీనివాసరెడ్డి, బసంతీ, సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. -
జీసీసీ తీరుపై భగ్గుమన్న మంత్రి సునీత
జీసీసీ తీరుపై భగ్గుమన్న మంత్రి సునీత అరకులోయ, అనంతగిరిల్లో డీఆర్డిపోల తనిఖీ కాశీపట్నం గోదాము రికార్డులు సీజ్ అవకతవకలపై దర్యాప్తునకు సబ్కలెక్టర్కు ఆదేశం అరకు రూరల్/అనంతగిరి: విశాఖ ఏజెన్సీలో జీసీసీ పనితీరు పట్ల రాష్ర్ట పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత అసంతృప్తి వ్యక్తం చేశారు. అరకులోయ, అనంతగిరి ప్రాంతాల్లో ఆదివారం పర్యటించారు. డీఆర్డిపోలు, వారపు సంతలను పరిశీలించారు. జీసీసీ గోదాములను తనిఖీ చేశారు. అనంతగిరి మండలం కాశీపట్నం జీసీసీ గోదామును పరిశీలించినప్పుడు రికార్డుల్లోని వివరాలకు నిల్వలకు ఏమాత్రంపొంతన లేకపోవడంతో ఆగ్రహం వ్వక్తం చేశారు. రికార్డులు సీజ్చేసి దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బియ్యం. పప్పు, పంచదార, ఇతర సరకులను పరిశీలించారు. గిరిజనులకు పంపిణీకి నిల్వ ఉంచిన బియ్యంలో నాణ్యత లోపాన్ని గమనించారు. గోదాము నుంచి డీఆర్డిపోలకు తరలిస్తున్న బియ్యం బస్తాలను తూకం వేసి చూశారు. తక్కువ ఉండడాన్ని గమనించి సిబ్బందిని నిలదీశారు. మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని పాఠశాలలకు సరఫరా చేయకపోవడంపై ప్రశ్నించారు. డీఆర్డిపో నిధులు పక్కదారి పట్టాయన్న వార్తలపై ఆరాతీశారు. వేలమామిడి సబ్డిపో పరిధిలోని పోడేల్తి గ్రామానికి చెందిన 40 మంది కార్డుదారులకు నాలుగు నెలల నుంచి ఎందుకు సరకులు పంపిణీ చేయలేదని మేనేజర్ను నిలదీశారు. పర్యవేక్షణలోపం వల్లే అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని అనంతగిరి ఎంపీపీ పైడితల్లి, సీపీఐ నాయకు వంజరపు శంకరావులు మంత్రి దృష్టికి తెచ్చారు. అనంతరం అరకులోయ మండలం సుంకరమెట్ట వారపు సంతలోని డీఆర్డిపోను పరిశీలించి, అందుతున్న సేవలపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కిలో, అరకిలోగా ప్యాక్చేసి ఉన్న పంచదార, మరికొన్ని సరకుల ప్యాకెట్లను తూకం వేసి చూశారు. అన్నింటా 50 గ్రాముల వరకు తక్కువ ఉండటంతో సేల్సుమేన్ని నిలదీశారు. పంచదార, కందిపప్పు ఇవ్వడంలేదని, కిరోసిన్ కేవలం లీటరు మాత్రమే ఇస్తున్నారని అక్కడి మహిళలు మంత్రికి ఫిర్యాదు చేశారు. బోసుబెడ డీఆర్డిపోలోనూ ఇదే పరిస్థితిని మంత్రి గమనించారు. పెన్షన్ మంజూరు చేయలేదని పెదలబుడులో వి. గంగమ్మ అనే మహిళ ఆమె దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం ఇస్తున్న తొమ్మిది రకాలతోపాటు ఇంకేమి సరకులు పంపిణీ చేస్తే బాగుంటుందని గిరిజన మహిళలను సునీత అడిగి తెలుసుకున్నారు. వీటన్నింటిపై స్పందించిన ఆమె దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సబ్కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ను ఆదేశించారు. కార్యాక్రమంలో అరకు ఎంపీ కొత్తపల్లి గీత, జీసీసీ డీఎం ప్రతాప్రెడ్డి,మేనేజర్ విజయ్కుమార్, జేడ్పీ వైస్చైర్మన్ కోట్యాడా అప్పారావు, మాజీ ఎమ్మేల్యే సివేరి సోమ. అరుకు వైస్ ఎంపీపీ పొద్దు అమ్మన్న, అనంతగిరి తహశీల్దార్ భాగ్యవతి,ఎంపీడీవో సాంబశివరావు పాల్గొన్నారు. ప్రభుత్యరాయితీలకు ఆధార్తో ముడి పెట్టొద్దు అనంతగిరి: ప్రభుత్వ రాయితీలను పొందేందుకు ఆధార్తో అనుసంధానం ఉండితీరాలని, అలాగని రాయితీల కల్పనకు ఆధారతో ముడిపెట్టరాదని పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. రాష్టంలో ఇప్పటి వరకు 60శాతం మాత్రమే ఆధార్ నమోదైందన్నారు. ఆధార్లేని విద్యార్థులు ప్రభుత్వ పథకాలు పొందలేకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా ఏజెన్సీలోని మారుమూల గూడేల్లోని వారు ఆధార్ నమోదుకు చర్యలు చేపట్టాలని సబ్కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ను ఆదేశించారు. ప్రతి నెలా మొదటివారంలోగా జీసీసీ డీఆర్డిపోలకు నిత్యావసర వస్తువులు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. బాక్సైట్ తవ్వకాల గురించి విలేకరులు ప్రశ్నించగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత కల్పించుకుని గిరిజనుల అభిప్రాయం మేరకే జరుగుతుందన్నారు. ఏజేన్సీలో రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. -
‘మావో’..రేవో!
బాక్సైట్పై మన్యంలో మళ్లీ అలజడి బహిరంగంగా మావోయిస్టుల సభలు భారీ విధ్వంసాలకు వ్యూహం? ఆంధ్రా-ఒడిశా సరిహద్దు, విశాఖ ఏజెన్సీలో మళ్లీ యుద్ధమేఘాలు అలముకున్నాయి. బాక్సైట్పై చావో రేవో అన్నట్లు మావోయిస్టులు ఉద్యమాన్ని ముందుకు నడపాలని భావిస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లూ కాస్త ప్రశాంతంగా ఉన్న మన్యంలో మళ్లీ అలజడి మొదలైంది. మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని, కేవలం మిలీషియా వ్యవస్థే కొద్దిపాటిగా పని చేస్తోందని పోలీసు యంత్రాంగం భావిస్తున్న తరుణంలో.. అగ్నికి ఆజ్యం పోసినట్లు బాక్సైట్ తవ్వకాలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రశాంతమైన మన్యంలో అశాంతికి కారణమైంది. పాడేరు: గిరిజనుల్లో తమ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే లక్ష్యంతో మావోయిస్టులంతా బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రధాన అజెండాగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీలో బాకై ్సట్ తవ్వకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఉండటంతో ఈ చర్యలను అడ్డుకునే ప్రయత్నంలో బాకై ్సట్ వ్యతిరేక ఉద్యమాన్ని మావోయిస్టులు ఉధృతం చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఉద్యమంతో మావోయిస్టు పార్టీ గిరిజనులతో మమేకమయ్యేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా మారుమూల పల్లెల్లో ప్రజాకోర్టుల నిర్వహణను వేగవంతం చేస్తోంది. ఏజెన్సీలోని అన్ని రాజకీయపక్షాలు, ప్రజా సంఘాలను కూడా బాకై ్సట్ ఉద్యమానికి సహకరించాలని మావోయిస్టు పార్టీ ప్రకటనలు చేస్తోంది. అలజడి మొదలైంది ఇలా..! కొద్దిరోజుల క్రితం జి.మాడుగుల మండలంలోని మారుమూల కిల్లంకోట ప్రాంతంలో పోలీసు ఇన్ఫార్మర్ పేరిట బాలకృష్ణ అనే గిరిజనుడిని మావోయిస్టులు హతమార్చి పోలీసులకు సవాల్ విసిరారు. ప్రజాకోర్టును నిర్వహించారు. తాజాగా శనివారం కొయ్యూరు, జీకేవీధి మండలాల సరిహద్దులో గాలికొండ దళ సభ్యుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాక్సైట్ వ్యతిరేక సదస్సును నిర్వహించిన విషయం విదితమే. ఈ సదస్సుకు ఆదివాసీలు అధిక సంఖ్యలో హాజరుకావడంతో మావోయిస్టు పార్టీలో నూతనోత్సాహం ఏర్పడింది. అలాగే ఒడిశాలోని మాచ్ఖండ్ ఏఎస్ఐ నివాస గృహంలో బాంబులు అమర్చి మరింత భయభ్రాంతులకు గురి చేశారు. ఇదే తరహాలో అన్ని మారుమూల గ్రామాల్లోనూ బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాల పేరిట సదస్సులు నిర్వహించేందుకు మావోయిస్టు పార్టీ నేతలు నిర్ణయించినట్లు సమాచారం. మావోయిస్టు పార్టీకి కొత్త క్యాడర్? ఏఓబీ, విశాఖ ఏజెన్సీలోని మావోయిస్టు కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసేందుకు కొత్తక్యాడర్ రూపుదిద్దుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మావోయిస్టు అగ్రనేతలు ఇటీవల ఏఓబీలో సంచరించి కీలకమైన సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే ఛతీస్ఘడ్ రాష్ట్రంలో పని చేసిన కొంత మంది మావోయిస్టు నేతలను ఏఓబీలోకి రప్పించినట్లు తెలుస్తుంది. గాలికొండ, కోరుకొండ దళాల్లో కూడా కొత్తక్యాడర్ నియమితులైనట్లు సమాచారం. మరికొన్ని ప్రాంతాలను వేదికగా చేసుకొని కొత్త దళాల ఏర్పాటు, యువతను భాగస్వామ్యం చేసి మావోయిస్టు ఉద్యమాన్ని మరింత ఉధతం చేసే ఆలోచనలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మారుమూల గ్రామాల్లో గ్రామస్థాయి పోరాట కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నట్లు వినికిడి. పోలీసుల్లో గుబులు! మావోయిస్టుల ఉనికి లేదంటున్న పోలీసు ఉన్నతాధికారులు ఇప్పుడు బాక్సైట్ ఉద్యమ నేపథ్యంలో మళ్లీ గట్టి నిఘా పెట్టాల్సివస్తోంది. ఇందుకు ఇన్ఫార్మర్ల వ్యవస్థపైనే వారు అధికంగా దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఉలిక్కిపడిన పోలీసులు సీలేరు : మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఒకే రోజు మావోయిస్టులకు సంబంధించిన సంఘటనలు చోటు చేసుకోవడంతో ఈ ప్రాంత పోలీసులు ఉలిక్కి పడ్డారు. కొయ్యూరు, జీకేవీధి సరిహద్దు ప్రాంతాల్లో బహిరంగ సభ పెట్టడం, ఛత్తీస్ఘడ్లో మావోయిస్టులకు, పోలీసులకు ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడం, ఒడిశా ఒనకఢిల్లీలో ఒక పోలీసు అధికారి ఇంటిలో మావోయిస్టులు బాంబు పెట్టారన్న అంశాలు కలకలం రేపడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమై ఆదివారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. సీలేరులో ఆదివారం జరిగిన వారపుసంతలో సీఆర్పీఎఫ్ బలగాలు అణువణువూ గాలింపు చేపట్టారు. అనుమానితులను ఆరాతీసి విడిచిపెట్టారు. బాక్సైట్కు వ్యతిరేకంగా ఎవరైనా చర్యలకు ఉపక్రమిస్తే బుద్ధి చెబుతామని ప్రకటించడంతో, అధికార పార్టీ కావడంతో టీడీపీ నాయకులకు గుబులు పట్టుకుంది. -
ఎర్రబడుతున్న ఏజెన్సీ
* బాక్సైట్ వ్యతిరేక ఉద్యమంలోకి మావోయిస్టులు * విశాఖ ఏజెన్సీలో బహిరంగ సభ నిర్వహణ * గ్రామస్థాయి కమిటీల ఏర్పాటుకు ప్రణాళిక * ‘బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్’అని అల్టిమేటం * ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలకూ హెచ్చరిక * చత్తీస్గఢ్ నుంచి మావోయిస్టు అగ్రనేతల పర్యవేక్షణ! * ప్రతివ్యూహానికి పోలీసుల సమాయత్తం * ఏదేమైనా సరే తవ్వుతామంటున్న అధికారపార్టీ నేతలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: బాక్సైట్ తవ్వకాల అంశం కేంద్ర బిందువుగా విశాఖ ఏజెన్సీ ‘ఎరుపెక్కుతోంది’. విశాఖ ఏజెన్సీలో అపారంగా ఉన్న బాక్సైట్ నిక్షేపాలను తవ్వాలన్న సీఎం చంద్రబాబు ప్రకటన ఏజెన్సీలో కొన్ని రోజులుగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే గిరిజనులు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గళమెత్తాయి. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఇప్పటికే స్పందించిన మావోయిస్టు పార్టీ తాజాగా ప్రత్యక్ష కార్యాచరణకు ఉపక్రమించింది. విశాఖ ఏజెన్సీలోని కొయ్యూరు-జీకే వీధి మధ్య ఓ ప్రదేశంలో మావోయిస్టు పార్టీ గిరిజనులతో శనివారం బహిరంగ సభ నిర్వహించింది. మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ, ఆదివాసీ విప్లవ రైతుకూలీ సంఘం సంయుక్తంగా నిర్వహించిన ఈ సమావేశానికి దాదాపు 600మందికిపైగా గిరిజనులు సంప్రదాయ ఆయుధాలు చేతబట్టి హాజరుకావడం గమనార్హం. ‘చంద్రబాబు డౌన్ డౌన్... బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటాం... మన్యాన్ని పరిరక్షించుకుంటాం’అని నినదించారు. ఈ సందర్భంగా మావోయిస్టు నేతలు మాట్లాడుతూ... ఐటీడీయే ముసుగులో ప్రైవేటు సంస్థలకు బాక్సైట్ నిల్వలను కట్టబెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించిన చంద్రబాబు ప్రస్తుతం సామ్రాజ్యవాద శక్తులకు తొత్తుగా మారారని దుయ్యబట్టారు. దంతేవాడ నుంచి అగ్రనేతల పర్యవేక్షణ! బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని ఆధారంగా చేసుకుని విశాఖ ఏజెన్సీలో మళ్లీ పాగా వేసేందుకు మావోయిస్టు పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కొన్నేళ్ల క్రితం ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) నుంచి చత్తీస్ఘడ్లోని దంతేవాడకు తరలివెళ్లిన మావోయిస్టు అగ్రనేతలు ఈ ఉద్యమ ప్రణాళికను పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. దంతేవాడలో గొప్ప ఫలితాలనిచ్చిన వ్యూహాన్నే బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి అన్వయించి మన్యంపై పట్టు సాధించాలన్నది పార్టీ వ్యూహం. ఇందులో భాగంగానే బాక్సైట్ తవ్వకాల ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటించింది. ‘మన్యం పితూరీ సైన్యం’పేరిట ఏజెన్సీలో గ్రామగ్రామాన ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. సామాన్య గిరిజనులందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. ఏజెన్సీలోని ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు తప్పనిసరిగా ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని అల్టిమేటం జారీ చేసింది. బాక్సైట్ తవ్వకాలను సమర్థించే ఏ ఒక్క ప్రజాప్రతినిధినీ మన్యంలో తిరగనీయమని తేల్చిచెప్పింది. మావోయిస్టు పార్టీ నిర్వహించిన ఈ సమావేశంలో గాలికొండ ఏరియా కమిటీ ఇన్చార్జ్ జాంబ్రీ పాల్గొన్నట్లు తెలుస్తోంది. గిరిజనులతో మావోయిస్టులు సమావేశం నిర్వహించారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టులు ప్రాబల్యం పెంచుకోకుండా కట్టడి చేయడంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు హైదరాబాద్లోని ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నట్లు సమాచా రం. దీనిపై నర్సీపట్నం ఏఎస్సీ సత్య ఏసుబాబును ‘సాక్షి’ సంప్రదించగా మన్యంలో మావోయిస్టులు బాక్సైట్ వ్యతిరేక బహిరంగ సభ నిర్వహించిన విషయం తమకు తెలిసిందన్నారు. దీని పూర్వాపరాలు తెలుసుకున్న తరువాత తగిన కార్యాచరణ ప్రణాళిక చేపడతామన్నారు. -
బాబోయ్.. బహ్రెయిన్!
పూండి: నాలుగు డబ్బులు సంపాదించాలన్న ఆశతో దేశం కాని దేశం వచ్చాం.. ఇక్కడి కంపెనీ. విశాఖపట్నంలోని ఏజెన్సీ మమ్మల్ని మోసం చేశాయి. వారం రోజులుగా తినడానికి తిండి లేదు. తాగేందుకు నీరు లేదు. వసతిగదుల నుంచి గెంటేసి.. పైగా తామే పరారైనట్లు కంపెనీ కేసులు పెట్టిం ది. మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇండియన్ ఎంబసీ పట్టించుకోవడం లేదు. బహ్రెయిన్ నుంచి మమ్మల్ని భారత్ రప్పించి రక్షించమని.. వనజనాభం అనే వలస కూలీ ‘సాక్షి’తో ఫోనులో ఆవేదన వెళ్లబోసుకున్నాడు. ఆయనచెప్పిన కథనం ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం రామక్రిష్ణాపురానికి చెందిన బత్తిని వనజనాభానికి నిరుపేద కుటుంబం. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో విశాఖ నగరానికి వెళ్లాడు. అక్కడి సాయి వెంకట్ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ వారిని కలవగా బహ్రెయిన్లో వెల్డర్, హెల్పర్ పోస్టులు ఉన్నాయని ఆశ చూపారు. దాంతో అప్పుడు చేసి ఇన్స్టిట్యూట్ నిర్వాహకులకు రూ. 60 వేలు చెల్లించాడు. వారి ద్వారా 2013 నవంబర్లో బహ్రెయిన్ వెళ్లి అక్కడి సిరి ఓడరేవులో సబ్ కాంట్రాక్టర్గా ఉన్న యూనికార్క్ ఏజెన్సీలో హెల్పర్గా చేరాడు. ఆయనతోపాటు జిల్లాలోని హుకుంపేటకు చెందిన సింహాచలం, పలాసకు చెందిన చిరంజీవులు, నరిసింహనాయుడు, ఇచ్ఛాపురానికి చెందిన లోకుదాస్తో పాటు విశాఖపట్నానికి చెందిన మరో 8 మంది యువకులు భారీగా అప్పులు చేసి వెళ్లి అక్కడ పనుల్లో చేరారు. కొద్ది నెలలు బాగానే చూసిన కంపెనీ నిర్వాహకులు ఆ తర్వాత ఇబ్బంది సృష్టించారు. గత మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదు. భోజనం పెట్టలేదు. చివరికి ఉండటానికి ఇచ్చిన గదుల నుంచి ఖాళీ చేయించి.. పైగా వీరే పరారైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా వీరంతా రోడ్డున పడ్డారు. పోలీసులు వెంట పడుతున్నారు. తిండీతిప్పల్లేక వీధుల పాలయ్యారు. గత కొన్నాళ్లుగా ఉడికీ ఉడకని ఆహారం ఇవ్వడంతో రోగాల బారిన పడ్డామని బాధితులు చెప్పారు. ఇండియన్ ఎంబసీకి వెళ్లి ఫిర్యాదు చేస్తే సానుభూతితో పరిశీలించాల్సింది పోయి.. మీరు పారిపోయినట్లు పోలీసులు మాకు చెప్పారని ఎంబసీ అధికారులు అసహనంతో చెప్పడంతో యువకులు కంగుతిన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా వారంతా ఆందోళనకు దిగారు. దీంతో ఎంబసీ అధికార్లు భోజనం పెట్టేందుకు అంగీకరించగా వసతి మాత్రం లేక ఫుట్పాత్లపైనే గడుపుతున్నారు. వేలకు వేలు చెల్లించి చిత్రహింసలకు గురవుతున్నామని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆందోళనలో కుటుంబాలు అక్కడ తమవారు ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో ఇక్కడి వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. తన భర్త క్షేమంగా ఇంటికి చేరేలా స్థానిక మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు సహకరించాలని బత్తిని వనజనాభం భార్య దేశమ్మ కోరుతోంది. యూఆర్కేపురం సర్పంచి చింత రజిని మాట్లాడుతూ ఈ విషయంలో భారత ప్రభుత్వం స్పందించి బాధితులను రక్షించాలని, జిల్లా ప్రజాప్రతినిధులు కేంద్రంతో మాట్లాడాలని కోరారు. -
పోరుబాట
ఉద్యమాలకు సిద్ధమవుతున్న గిరిజనం జర్రెలలో నేడు భారీ సభ 21న పాడేరు రానున్న రాఘవులు బాక్సైట్ తేనెతుట్టె కదులుతోంది. అటవీ సంపద జోలికొస్తే ఖబడ్దార్ అంటూ ఏజెన్సీవ్యాప్తంగా వ్యతిరేక ఉద్యమానికి గిరిజనం సిద్ధమవుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖనిజం తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమాలు చేయించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఏకంగా తవ్వకాలకు నిర్ణయించినట్టు ప్రకటించడాన్ని ఆదివాసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాణాలు ఎక్కుపెడుతున్నారు. సీఎం వైఖరిని నిరసిస్తూ జీకేవీధి మండలం జర్రెలలో ఆదివారం ఆందోళనకు నిర్ణయించారు. పాడేరు: బాక్సైట్ ఖనిజ నిల్వలకు విశాఖ ఏజెన్సీ పెట్టింది పేరు. ఇక్కడున్నంత విలువైన ఖనిజం మరెక్కడా లేదు. అరకులో 54.47మిలియన్ టన్నులు, సప్పర్లలో 210.25మిలియన్టన్నులు, జీకేవీధిలో 38.42, జెర్రెలలో 224.60 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నట్లు గతంలో నిపుణులు వెల్లడించారు. లక్షల కోట్ల విలువైన ఈ సంపదను వెలికితీస్తే ప్రభుత్వానికి కోట్ల ఆదాయం వస్తుందని తేల్చారు. వాస్తవాని కి వీటి తవ్వకాలతో జలాశయాలు దెబ్బతిని మైదానంలోని నదుల్లో నీటి ప్రవాహం తగ్గిపోతుంది. ప ర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఐటీడీఏలకు తవ్వకాల బాధ్యత అప్పగిస్తామని చెబుతున్న సీఎం అసలు దానికి తవ్వకాల నైపుణ్యమే లేనప్పుడు ఇదెలా సాధ్యమనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరోపక్క చంద్రబాబు ప్రకటనపై గిరిజన సంఘాలు,పర్యావరణ సంస్థలు మళ్లీ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. బాక్సైట్ జోలికి వస్తే ప్రాణాలైనా ఒడ్డి గిరిజనుల సంపదను కాపాడుతామని ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు హెచ్చరించారు. బాక్సైట్కు వ్యతిరేకంగా ఆదివారం జర్రెలలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నట్టు జర్రెల సర్పంచ్ అడపా విజయకుమారి, ఎంపీటీసీ సభ్యురాాలు ఉగ్రంగి జగ్గమ్మ తెలిపారు. పార్టీలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘా లు, గిరిజనులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. సీపీఎం, గిరిజన సంఘాల ఆధ్వర్యంలోనూ బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాలు ఇటీవల సాగాయి. ఆందోళనకు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఇప్పటికే పిలుపునిచ్చాయి. సీపీఎం కూడా ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఆపార్టీ రాష్ట్ర నేత బివి రాఘవులు ఈ నెల 21న పాడేరు వస్తున్నారు. ఉద్యమానికి ఆరోజు ప్రణాళికను రూపొందిస్తారు. బీజేపీ నాయకులు కురసా బొజ్జయ్య, కురసా రాజారావు తదితరులు బాక్సైట్కు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. -
బాబోయ్.. చలి!
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ పెరిగిపోతున్న చలితో రాష్ట్రం గజగజా వణుకుతోంది. గతంలో ఎన్నడూ లేనిరీతిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆదిలాబాద్, ఖమ్మం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది. బుధవారం విశాఖ ఏజెన్సీలోని పాడేరు ఘాట్లో 2 డిగ్రీలు, లంబ సింగిలో 4, మినుములూరులో 5, చింతపల్లిలో 7 డిగ్రీలు, ఆదిలాబాద్లో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజధాని హైదరాబాద్లోనూ గత ఏడాదికంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ ప్రాంతం లో గత ఏడాదితో పోల్చితే కనిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా పడిపోయాయి. పలు ప్రాంతాల్లో ఏకంగా నాలుగైదు డిగ్రీలు తక్కువగా నమోదవుతుండడం గమనార్హం. కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో గత ఏడాది డిసెంబరు 18న నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలకంటే ఈసారి అదే తేదీన నాలుగు డిగ్రీల వరకూ తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వరంగల్లో ఆరు డిగ్రీలు తక్కువగా నమోదైంది. డిసెంబర్ రెండో పక్షంలోనే చలి తీవ్రత జనవరిని తలపిస్తోంది. ఇక ఏజెన్సీల్లో మంచు దట్టంగా కప్పేస్తుండటంతో.. ఉదయం పది గంటలకుగానీ రోడ్లపైకి వచ్చే పరిస్థితి లేదు. -
మన్యంపై చలి పంజా, గిరిజనం గజగజ
=కనిష్ట ఉష్ణోగ్రతలతో గిరిజనం గజగజ =దైనందిన కార్యకలాపాలకు ఇబ్బంది =రమణీయ దృశ్యాలతో పర్యాటకులకు కనువిందు తొందరగా పొద్దు గుంకిపోతోంది.. ఉదయం 10 గంటలైతేనే గానీ సూరీడు దర్శనమీయడు.. పొగమంచు కమ్మేసి పగలు సైతం లైట్లు లేకుండా వాహనాలు కదలలేని పరిస్థితి.. చలి పులి పంజా విసరడంతో గిరిజనం అల్లాడుతున్నారు.. ఇదీ ప్రస్తుతం మన్యంలో నెలకొన్న వాతావరణ స్థితి.. శీతలంతో నిత్యం సావాసం చేసే ఏజెన్సీవాసులనే వణికిస్తోందంటే చలి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ మన్యంలోని పలు ప్రాంతాల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ రాష్ట్ర ప్రజలను అబ్బురపరుస్తున్నాయి. పాడేరు, అరకు, డుంబ్రిగుడ, న్యూస్లైన్: ‘వాహ్.. విశాఖ ఏజెన్సీ’ అంటారందరూ.. చలి చంపేస్తోంది బాబోయ్ అని వాపోతున్నారు మన మన్యవాసులు. కనిష్ట ఉష్ణోగ్రతల్లో లంబసింగి, మినుములూరు పోటీ పడుతున్నాయి. నా ప్రతాపం చూడండి.. అంటోంది పాడేరు ఘాట్లోని పాదాలు ప్రాంతం. ఈ ప్రదేశాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఈమధ్య కాలంలో ఒకటి, రెండు డిగ్రీలకు పడిపోతున్నాయి. దీంతో ఏజెన్సీవాసులు నరకయాతన పడుతున్నారు. పర్యాటక ప్రాంతాలైన అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో కూడా చలి అధికమైంది. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలుల తీవ్రతతో ప్రజలు వణుకుతున్నారు. మండల కేంద్రాల్లో జనసంచారం పలుచబడుతుంది. దట్టమైన మంచు కూడా కురుస్తుండడంతో సూర్యోదయం ఆలస్యమవుతోంది. చలిగాలులతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే గిరిజనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. అటవీ ఉత్పత్తులను కాలినడకన వారపు సంతలకు తీసుకువెళ్లే మన్యవాసుల పరిస్థితి దయనీయం. అరకు-విశాఖ ఘాట్ రోడ్డులో దగ్గరికొచ్చే వరకు వాహనాలు, వ్యక్తులు కనిపించలేనంతగా మబ్బు కమ్మడంతో వాహన చోదకులు సతమతమవుతున్నారు. చలి చంపేస్తోంది.. పాడేరు ప్రాంతంలోని మినుములూరు ఎస్టేట్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో మినుములూరు, వనుగుపల్లి, మోదాపల్లి పంచాయతీల్లోని గిరిజనులు నరకయాతన పడుతున్నారు. కాఫీ తోటల్లో పనులకు వెళ్లే వారంతా వణికించే చలిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల నుంచి కాఫీ పండ్ల సేకరణ సమస్యగా మారింది. బారెడు పొద్దెక్కి ఎండ ముదిరేవరకు పనుల జోలికి వెళ్లడం లేదు. వణికించే చలిలో పూర్తిస్థాయిలో పండ్లు ఏరలేక కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వేళకే చలిగాలులు వీస్తుండడంతో కాఫీ తోటల్లో కూడా మంట పెట్టుకుని చలికాచుకుంటున్నారు. అటవీ అభివృద్ధి సంస్థ కార్మికులకు ఉన్ని దుస్తులు సరఫరా చేయకపోవడంతో చలితో ఇబ్బందులు పడుతున్నారు. మంచు కురిసే వేళలో.. పర్యాటక కేంద్రమైన అరకులోయలో పొగమంచు కమ్ముకొని సందర్శకులకు కనువిందు చేస్తోంది. పైలీన్ తుపాను అనంతరం ఇప్పటి వరకూ ఇంతలా పొగమంచు ఆవరించలేదు. ఒక పక్క ఎముకలు కొరికే చలి.. మరో పక్క వర్షాన్ని తలపించే విధంగా కమ్ముకున్న పొగ మంచుతో గిరిజనం అల్లాడిపోతున్నారు. ఎండ ముదరకుండా బయటికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. అరకులోయలోని పర్యాటక సందర్శిత ప్రాంతాలైన గిరిజన మ్యూజియం, పద్మావతి ఉద్యాన వన కేంద్రం, పర్యాటక అతిథి గృహాలు మంచుతో కప్పి ఉండడంతో అందులో బస చేసిన పర్యాటకులు వెండి మబ్బును తలపించే పొగమంచును ఆస్వాదిస్తున్నారు. -
నంబర్ వన్గా విశాఖ మన్యం
=అటవీ హక్కుల కల్పనలో అగ్రస్థానం =రాష్ట్రంలోనే ముందంజలో ఉండాలి =రెవెన్యూ, అటవీ శాఖలదే బాధ్యత =ఐటీడీఏ పీవో వినయ్చంద్ పాడేరు, న్యూస్లైన్: అటవీహక్కుల చట్టం అమలులో విశాఖ ఏజెన్సీ రాష్ట్రం లోనే మొదటిస్థానంలో ఉండాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్చంద్ ఆకాంక్షించారు. ఏజెన్సీలోఅటవీ హక్కు ల చట్టం అమలులో భాగంగా రెండు విడతల భూ పట్టాల పంపిణీ, భూము ల సర్వేపై గురువారం తన కార్యాల యంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతుల సాగులో ఉన్న భూములకు పట్టాలు పంపిణీ చేసి గిరిజనులకు సామాజిక హోదా కల్పిం చాలని కోరారు. అటవీశాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సమన్వయంతో పనిచేసి అటవీ భూములపై సర్వే నిర్వహించి రికార్డులను వెంటనే సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. రెండు శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేయడం వలన అభ్యంతరాలు ఉత్పన్నం కావని చెప్పారు. సర్వే చేసిన భూముల వివరాలను జిల్లా స్థాయీ సంఘానికి పంపించి అనుమతులు పొందాలని కోరారు. ఇప్పటివరకు 7500 క్లెయిములకుగాను 7068 క్లెయిములకు సంబంధించి సర్వే పూర్తి చేశారని చెప్పారు. అటవీహక్కుల భూముల సర్వేపై ప్రతి వారం ప్రగతి నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. ప్రగతి నివేదికలు కచ్చితంగా ఉండాలని కోరారు. ఏజెన్సీలో రహదారుల నిర్మాణాలకు అటవీశాఖ అభ్యంతరాలు తెలియజేయవద్దని చెప్పారు. రహదారుల నిర్మాణంతోనే గిరిజనాభివృద్ధి ఆధారపడి ఉందని చెప్పారు. కించూరు రోడ్డు నిర్మాణానికి గల అభ్యంతరాల గురించి అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కించూరు రోడ్డు పూర్తయితే పాడేరు, పెదబయలు మండలాల్లోని 50 గ్రామాలకు రహదారి సౌకర్యం కలుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో డివిజనల్ అటవీశాఖ అధికారి ఎస్.శాంతారామ్, పాడేరు ఆర్డీవో ఎం.గణపతిరావు, ఐటీడీఏ ఎపీవో పీవీఎస్నాయుడు, 11 మండలాల తహశీల్దారులు, అటవీశాఖ అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు. -
సమస్యల్లో ఉన్నా.. బాధలు చెప్పొద్దు
సాక్షి,విశాఖపట్నం: ‘అసలే పీకల్లోతు బాధల్లో ఉన్నాను. ఇప్పుడున్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్నాను. మీరొచ్చి మీ బాధలు చెబుతున్నారు. నియోజకవర్గ సమస్యలు నాకేం చెప్పొద్దు. ఏదోలా మీరే పరిష్కరించుకోండి. నా వరకు తీసుకురావద్దు’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పార్టీ నేతలపై రుసరుసలాడారు. జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమీక్షలు జరుపుతున్న చంద్రబాబు విశాఖలోని 15 నియోజకవర్గ ఇన్చార్జిలు, కమిటీలతో శనివారం ఐదు గంటల పాటు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎక్కడికక్కడ ఆందోళనల్లో పాల్గొనాలని సూచించారు. జనం మనల్ని నమ్మడం లేద ని కొందరు అధినేత దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన సీమాంధ్రలో కాంగ్రెస్ నుంచి చాలామంది బయటకు రావాలని చూస్తున్నారని, అలాంటి వారిని పార్టీలో చేర్చుకోవాలని, ప్రజాబలం ఉన్నా లేకపోయినా పార్టీలోకి ఆహ్వానించాలని ఆదేశించినట్టు సమాచారం. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. విశాఖ ఏజెన్సీలో కొందరు గంజాయి, దొంగనోట్ల పంపిణీ కేసుల్లో చిక్కుకున్న వారికి వారికి పార్టీలోని కొందరు మద్దతుగా నిలుస్తున్నారని, ఇలాంటి విషయాలు జిల్లా నేతల వద్దే తేల్చుకోవాలని బాబు సలహా ఇచ్చినట్టు భోగట్టా. తమ నియోజకవర్గంలో ఇన్చార్జిని నియమించలేదని, దీనివల్ల పార్టీపరంగా కార్యక్రమాలకూ ఎవరూ ముందుకు రావడం లేదనగానే బాబు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. తనకు చాలా సమస్యలున్నాయని, విభజన విషయంలో తలెత్తే విమర్శలు, పార్టీని కాపాడుకోవడం వంటి అనేక బాధలున్నా యని, మీ సమస్యలు నాకు చెప్పొద్దంటూ అసహనం వ్యక్తం చేశారని సమాచారం. ఇప్పట్లో ఇన్చార్జిల నియామకం కూడా ఉండదని స్పష్టం చేశారు. సీమాంధ్రలో దెబ్బతిన్న పార్టీకి మళ్లీ ప్రజల్లో బలం పెరిగేలా త్వరలో అన్నిప్రాంతాలతోపాటు విశాఖలో పర్యటిస్తానని, జనాన్ని సమీకరించాలని చెప్పి సమావేశం ముగించారు.