World Gold Council
-
’గోల్డెన్ డేస్’ ఆగని రేస్!
సాక్షి, స్పెషల్ డెస్క్: పుత్తడి సరికొత్త రికార్డులు నమోదు చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ‘గోల్డెన్ డేస్’ నడుస్తున్నాయి. తొలిసారిగా ఔన్స్ (31.1 గ్రాములు) బంగారం రేటు 3,000 డాలర్లు దాటింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఔన్స్ పసిడి ధర 2,500 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు చేరుకోవడానికి కేవలం 210 రోజులు.. అంటే కేవలం 7 నెలలు మాత్రమే పట్టడం. గత రికార్డులు చూస్తే బంగారం ధర 500 డాలర్లు పెరగడానికి సగటున 1,708 రోజుల సమయం తీసుకుంది. అంటే దాదాపు 4 సంవత్సరాల 8 నెలలు. దీనినిబట్టి పుత్తడి పరుగు ఏ స్థాయిలో వేగం అందుకుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే తదుపరి రికార్డు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. 2025లోనే ఔన్స్ ధర 4,000 డాలర్లను తాకే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర (Gold Price) గురువారం రూ.91,650 పలికింది. ఈ నెల 19న రూ.91,950కి చేరి సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. రికార్డులే రికార్డులు.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజా గణాంకాల ప్రకారం.. 2024లో బంగారం 40 కంటే ఎక్కువసార్లు సరికొత్త ఆల్–టైమ్ గరిష్టాలను నమోదు చేసింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు మరో 16 కొత్త గరిష్టాలను చేరుకుంది. అంతర్జాతీయంగా 2005 డిసెంబర్లో పసిడి ఔన్స్ ధర తొలిసారిగా 500 డాలర్ల మార్కును తాకింది. ఆ తదుపరి 500 డాలర్లకు.. అంటే 1,000 డాలర్ల స్థాయిని 2008 మార్చిలో చేరుకుంది. 2011 ఏప్రిల్లో 1,500 డాలర్లకు, 2020 ఆగస్టులో 2,000 డాలర్లు, 2024 ఆగస్టులో 2,500 డాలర్ల మార్కును తాకింది. 500 నుంచి 1,000 డాలర్లను చేరుకోవడానికి 834 రోజులు పట్టింది. అక్కడి నుంచి 1,500 డాలర్లకు 1,132 రోజులు, 1,500 నుంచి 2,000 డాలర్లకు 3,394 రోజుల సమయం తీసుకుంది. 2,000 నుంచి 2,500 డాలర్లను అందుకోవడానికి 1,473 రోజులు పట్టింది. సురక్షితమైన ఆస్తిగా బంగారం పుత్తడి 3,000 డాలర్ల కంటే అధిక ధర వద్ధ స్థిరంగా ఉంటే అదనపు కొనుగోళ్లు ధరను మరింత ప్రేరేపించవచ్చని డబ్ల్యూజీసీ జోస్యం చెబుతోంది.కన్సాలిడేషన్కూ అవకాశం ఉందని మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారని వివరించింది. గతంలో ప్రతి అదనపు 500 డాలర్ల మార్కును చేరుకున్న తరువాత సగటున తొమ్మిది రోజుల తరువాతే పుత్తడి ధర వెనక్కి వచ్చిందని, అయితే అయిదింటిలో నాలుగు సందర్భాల్లో కొన్ని రోజుల్లోనే బంగారం అదే స్థాయి కంటే పైకి పుంజుకుందని తెలిపింది. భౌగోళిక రాజకీయ, భౌగోళిక ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లు, బలహీనమైన యూఎస్ డాలర్.. వెరసి పుత్తడిలో పెట్టుబడి డిమాండ్కు బలమైన ప్రోత్సాహకాలను అందిస్తూనే ఉందని డబ్ల్యూజీసీ అభిప్రాయపడింది. ధర ఎగసినా డిమాండ్ తగ్గలేదు అధిక పసిడి ధరలు ఆభరణాల డిమాండ్కు ప్రతికూలతలను సృష్టించవచ్చని డబ్ల్యూజీసీ అంటోంది. ‘ఆభరణాల రీసైక్లింగ్ స్థాయిలను పెంచవచ్చు. పెట్టుబడిదారులలో కొంత లాభాల స్వీకరణకు దారితీయవచ్చు. ఈ అంశాలు బంగారం దీర్ఘకాలిక వృద్ధికి మద్దతు ఇచ్చే విస్తృత ఆర్థిక, ఆర్థిక చోదకాలను అధిగమించే అవకాశం లేదు’ అని వివరించింది. 2024లో పుత్తడి ధర 27 శాతం ఎగిసినా డిమాండ్ తగ్గలేదు. భారత్లో 808.8 టన్నుల పసిడి కొనుగోళ్లు జరిగాయి. -
బంగారం డిమాండ్ @ రూ.5.15 లక్షల కోట్లు
ముంబై: పసిడి కొనుగోళ్లు, పెట్టుబడులు 2024లో పండుగలా సాగాయి. గత ఏడాది మొత్తం మీద బంగారం డిమాండ్ 802.8 టన్నులకు చేరుకుంది. పరిమాణం పరంగా 2023 సంవత్సంతో పోల్చి చూసినప్పుడు 5 శాతం పెరగ్గా, విలువ పరంగా చూస్తే ఏకంగా 31 శాతం వృద్ధి కనిపించింది. 2023లో 761 టన్నుల బంగారం కోసం భారతీయులు రూ.3,92,000 కోట్లను ఖర్చు చేయగా, 2024లో 802.8 టన్నుల కోసం ఏకంగా రూ.5,15,390 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఈ గణాంకాలతో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్లూజీసీ) తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘2025లో బంగారం డిమాండ్ భారత్లో 700–800 టన్నుల మధ్య ఉండొచ్చు. వివాహ సంబంధిత కొనుగోళ్లతో బంగారం ఆభరణాలకు డిమాండ్ కొనసాగుతుంది. దీంతో ధరల పరంగా కొంత స్థిరత్వం ఉండొచ్చు’’అని డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈవో సచిన్ జైన్ తెలిపారు. తగ్గిన ఆభరణాల డిమాండ్ → 2024లో బంగారం ఆభరణాల డిమాండ్ 2 శాతం తక్కువగా 563.4 టన్నులకు పరిమితమైంది. 2023లో ఆభరణాల డిమాండ్ 575.8 టన్నులుగా ఉంది. → గతేడాది జూలైలో బంగారం దిగుమతుల సుంకాన్ని తగ్గించడంతోపాటు, ఇతర మార్కెట్లతో పోలి్చతే భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని నమోదు చేయడం సానుకూలించినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. → పండుగల సీజన్కు కీలకమైన 2024 చివరి మూడు నెలల కాలంలో పసిడి డిమాండ్ 265.8 టన్నులుగా ఉంది. 2023 ఇదే త్రైమాసికంలో డిమాండ్ 266.2 టన్నులతో పోల్చితే మార్పు అతి స్వల్పమే. పెట్టుబడులకు ఆకర్షణీయం → అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా పేరొందిన పసిడి.. 2024లో పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారింది. 2024లో బంగారంపై పెట్టుబడులు 29 శాతం పెరిగి 239.4 టన్నులకు చేరాయి. 2013 తర్వాత తిరిగి ఇదే గరిష్ట స్థాయి. → 2023లో బంగారం పెట్టుబడుల డిమాండ్ 185.2 టన్నులుగా ఉంది. → బంగారం ఈటీఎఫ్ల పట్ల రిటైల్ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. దీంతో పెట్టుబడి పరంగా పసిడికి డిమాండ్ ఇక ముందూ బలంగానే కొనసాగనుంది.జోరుగా ఆర్బీఐ కొనుగోళ్లు → 2024లో ఆర్బీఐ 73 టన్నుల బంగారాన్ని అదనంగా సమకూర్చుకుంది. 2023లో 16 టన్నుల కొనుగోలుతో పోలి్చతే నాలుగు రెట్లు అధికంగా గతేడాది సొంతం చేసుకుంది. → బంగారం రీసైక్లింగ్ పరిమాణం 2% తక్కువగా 114.3 టన్నులుగా నమోదైంది. 2023లో రీసైక్లింగ్ పరిమాణం 117.1 టన్నులుగా ఉంది. → బంగారం దిగుమతులు గతేడాది 4 శాతం తక్కువగా 712.1 టన్నులకు పరిమితమయ్యాయి. 2023లో దిగుమతుల పరిమాణం 744 టన్నులుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన డిమాండ్ → 2024లో ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ 4,974 టన్నులుగా నమోదైంది. 2023లో డిమాండ్ 4,945.9 టన్నులతో పోల్చితే ఒక శాతం పెరిగింది. → మూడు, నాలుగో త్రైమాసికాల్లో ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఈటీఎఫ్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. సెంట్రల్ బ్యాంక్లు రేట్ల కోత ఆరంభించడం, అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇందుకు కారణాలుగా ఉన్నాయి. → సెంట్రల్ బ్యాంక్లు 1,044.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. 2023లో కొనుగోళ్లు 1,050.8 టన్నులుగా ఉన్నా యి. → పెట్టుబడులకు డిమాండ్ 25% పెరిగి 1,179.5 టన్నులకు చేరింది. 2023లో పసిడి పెట్టుబడుల డిమాండ్ 945.5 టన్నులుగా ఉంది. → బంగారం కాయిన్లు, బార్లకు డిమాండ్ 2023 స్థాయిలోనే 1,186 టన్నులుగా నమోదైంది. → 2024 మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఆభరణాల డిమాండ్ 11 శాతం క్షీణించి 1,877.1 టన్నులకు పరిమితమైంది. 2023లో ఇది 2,110.3 టన్నులుగా ఉంది. → 2025లోనూ సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, గోల్డ్ ఈటీఎఫ్ల డిమాండ్ బలంగానే కొనసాగొచ్చని డబ్ల్యూజీసీ అంచనా. -
పెట్టుబడి బంగారమే!
తరతరాలుగా ప్రపంచ దేశాల ప్రజలను, కేంద్ర బ్యాంకులను ఆకర్షిస్తున్న అయస్కాంతం పసిడి! గత ఐదు దశాబ్దాలకుపైగా చరిత్రను తీసుకుంటే పసిడి తళతళలు అర్థమవుతాయ్. 1971 నుంచి చూస్తే బంగారం ప్రతీ ఏటా ఈక్విటీలతో సమానంగా సగటున 8 శాతం రిటర్నులు అందించింది!! ఈ బాటలో ఇతర కమోడిటీలతో పోల్చితే నిలకడను చూపుతూ బలాన్ని ప్రదర్శించడం విశేషం.గత ఐదు దశాబ్దాలలో బంగారం ధరలు వార్షిక పద్ధతిన 8 శాతం చొప్పున పుంజుకున్నాయి. అంటే ఇటీవల అత్యంత ఆకర్షణీయంగా మారిన ఈక్విటీలతో సమానంగా లాభపడ్డాయి. ఇదే సమయంలో బాండ్లతో పోలిస్తే అధిక రాబడి అందించాయి. ఈ బాటలో గత రెండు దశాబ్దాలను పరిగణిస్తే అంటే గత 5, 10, 15, 20 ఏళ్లలో సైతం వీటి ధరలు పలు ఇతర ఆస్తులకంటే మెరుగ్గా రాణించాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) మదింపు ప్రకారం బంగారం ఒక వ్యూహాత్మక ఆస్తి! యూఎస్ డాలర్– గోల్డ్ కన్వరి్టబిలిటీని రద్దు చేసిన 1971 నుంచి చూస్తే యూఎస్తోపాటు ప్రపంచ వినియోగ ధరల ద్రవ్యోల్బణ ఇండెక్సు(సీపీఐ)లను సైతం బంగారం అధిగమించింది. మూలధన వృద్ధి ద్రవ్యోల్బణం 2–5 శాతం మధ్య నమోదైన గత కాలాన్ని లెక్కలోకి తీసుకుంటే సగటున పసిడి 8 శాతం చొప్పున దౌడు తీసింది. వెరసి దీర్ఘకాలానికి ఈ విలువైన లోహం మూలధనాన్ని పరిరక్షించడమేకాకుండా పెట్టుబడి వృద్ధికీ దోహదం చేసింది. అంటే అటు పెట్టుబడి సాధనంగా.. ఇటు విలాసవంత వస్తువుగా కూడా మెరిసింది! వివిధ ఈక్విటీ ఇండెక్సులు, కమోడిటీలు, ఇతర ప్రత్యామ్నాయ ఆస్తులతో పోలిస్తే వివిధ మార్గాలలో బంగారానికి పుడుతున్న డిమాండ్ కారణంగా కొన్ని దశాబ్దాలుగా నిలకడను ప్రదర్శిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని ప్రధాన కరెన్సీలు, కమోడిటీలతో మారకాన్ని పరిగణించినా పసిడిది పైచేయే! ఈ బాటలో ఇటీవల చాలా ప్రధాన కరెన్సీలతో పోలిస్తే మెరుగైన వృద్ధిని అందుకుంది. కారణాలున్నాయ్.. నిజానికి బంగారాన్ని గనుల నుంచి వెలికి తీస్తారు. అయితే గత రెండు దశాబ్దాలలో గోల్డ్ మైనింగ్ వార్షికంగా సగటున 1.7 శాతమే పెరగడం ధరలకు రెక్కలిస్తోంది. కాగా.. డబ్ల్యూజీసీ రీసెర్చ్ ప్రకారం ప్రతిద్రవ్యోల్బణ(డిఫ్లేషన్) పరిస్థితుల్లోనూ పసిడి మెరుగ్గానే రాణించింది. చౌక వడ్డీ రేట్లు, నీరసించిన వినియోగం, బలహీనపడిన పెట్టుబడులు, ఆర్థిక ఒత్తిళ్లు సైతం యెల్లో మెటల్కు డిమాండును పెంచడం గమనార్హం! 2008లో తలెత్తిన ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం, తిరిగి 2020లో కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా పలు దేశాలు సరళతర పరపతి విధానాలను అవలంబించాయి. ద్రవ్య లభ్యత(లిక్విడిటీ)ను భారీగా పెంచాయి. ఓవైపు కరెన్సీలు పతనంకావడం, కొనుగోలు శక్తి క్షీణించడం వంటి పరిస్థితుల్లో రక్షణ(హెడ్జింగ్)గా కేంద్ర బ్యాంకులు, ఇతర ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ బంగారంలో మదుపు చేశాయి. ఒకే ఒక్కటిప్రపంచ దేశాలను కుదిపేసిన సబ్ప్రైమ్ సంక్షోభ కాలంలో ఈక్విటీలు, హెడ్జ్ ఫండ్స్, రియల్టీ, పలు కమోడిటీలు, ఇతర రిస్క్ ఆస్తులు విలువలో పతనమయ్యాయి. అయితే బంగారం మేలిమిగా నిలిచింది. 2007 డిసెంబర్ నుంచి 2009 ఫిబ్రవరి మధ్యకాలంలో పసిడి ధరలు 21 శాతం ఎగశాయి. ఇటీవల ఈక్విటీ మార్కెట్లు పతనబాటలో సాగిన 2020, 2022లోనూ బంగారం ధరలు సానుకూల ధోరణిలోనే సాగాయి. గత కొన్నేళ్లలో ఈక్విటీ మార్కెట్లు బుల్ పరుగు తీస్తున్న నేపథ్యంలోనూ పసిడి పోటీ పడుతోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
పసిడి కాంతుల్లో సెంట్రల్ బ్యాంకులు
ముంబై: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ధోరణులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాల వంటి అంశాలతో ప్రపంచ బ్యాంకులు తమ పసిడి నిల్వలను పెంచుకోవడంపై దృష్టి సారించాయి. 2024 నవంబర్లో ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల 53 టన్నుల పసిడి నిల్వలను పెంచుకోగా, ఇందులో భారత్ రిజర్వ్ బ్యాంక్ వాటా 8 టన్నులు. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. → 2024లో ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని స్థిరమైన, భద్రమైన అసెట్గా భావించి, కొనుగోళ్లకు ఆసక్తి ప్రదర్శించాయి. ముఖ్యంగా 2024 చివరి భాగాన్ని పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపాయి. → అమెరికా ఎన్నికల అనంతరం నవంబర్లో బంగారం ధరలు తగ్గాయి. దీనిని కొనుగోళ్లకు ఒక మంచి అవకాశంగా సెంట్రల్ బ్యాంకుల భావించాయి. → నవంబర్లో జరిగిన కొనుగోళ్లతో 2024లో ఆర్బీఐ 73 టన్నుల బంగారం కొనుగోలు చేసినట్లు అయ్యింది. దీనితో భారత్ సెంట్రల్ బ్యాంక్ వద్ద మొత్తం బంగారం నిల్వలు 876 టన్నులకు చేరాయి. → 2024లో రెండవ అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ కొనసాగింది. మొదటి స్థానంలో పోలాండ్ ఉంది. పోలాండ్ నేషనల్ బ్యాంకు నవంబర్లో 21 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, 2024లో మొత్తం 90 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. → ఉజ్బెకిస్తాన్ కేంద్ర బ్యాంకు 9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, 2024లో మొత్తం 11 టన్నుల బంగారం కొనుగోలు చేసింది.దీనితో ఈ దేశం వద్ద మొత్తం పసిడి నిల్వలు 382 టన్నులకు చేరాయి. → కజికిస్గాన్ నేషనల్ బ్యాంక్ నవంబర్లో 5 టన్నుల పసిడిని కొనుగోలు చేయగా, మొత్తం దేశ బంగారం నిల్వలు 295 టన్నులకు చేరాయి. → చైనా పీపుల్స్ బ్యాంక్ (పీబీఓసీ) ఆరు నెలల విరామం తర్వాత బంగారం కొనుగోళ్లను పునఃప్రారంభించి, నవంబర్లో 5 టన్నులు కొనుగోళ్లు జరిగింది. వార్షికంగా నికర కొనుగోళ్లు 34 టన్నులు. మొత్తం పసిడి నిల్వలు 2,264 టన్నులకు (మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వలో 5 శాతం) చేరాయి. → జోర్డాన్ నవంబర్లో 4 టన్నుల పసిడి కొనుగోళ్లు జరిగింది. జూలై తర్వాత దేశం పసిడి కొనుగోళ్లు జరిపింది నవంబర్లోనే కావడం గమనార్హం. దేశం మొత్తం పసిడి నిల్వలు 73 టన్నులకు ఎగశాయి. → టర్కీ నవంబర్లో జరిపిన కొనుగోళ్ల పరిమాణం 3 టన్నులు. → చెక్ నేషనల్ బ్యాంక్ వరుసగా 21 నెలలుగా కొనుగోళ్లు జరుపుతోంది. నవంబర్లో జరిపిన కొనుగోళ్లు 2 టన్నులు. వార్షికంగా కొనుగోళ్లు 20 టన్నులు. దీనితో బ్యాంకు వద్ద మొత్తం నిల్వలు 50 టన్నులపైకి ఎగశాయి. → ఘనా నేషనల్ బ్యాంక్ నవంబర్లో టన్నుల కొనుగోళు చేయగా, వార్షికంగా చేసిన కొనుగోళ్లు 10 టన్నులు. దీనితో దేశం వద్ద మొత్తం పసిడి నిల్వలు 29 టన్నులకు చేయాయి. ఎకానమీ స్థిరత్వానికి పసిడి నిల్వలు కీలకమని ఘనా భావిస్తోంది.సింగపూర్ అమ్మకాలు.. కాగా, సింగపూర్ మానిటరీ అథారిటీ నవంబర్లో 5 టన్నుల బంగారాన్ని విక్రయించింది. 2024లో ఇప్పటి వరకు 7 టన్నుల నికర అమ్మకాలు జరిపింది. దీనితో మొత్తం నిల్వలు 223 టన్నులకు తగ్గాయి. -
బంగారు ఆభరణాలే ఎక్కువ..
భారతీయులు బంగారు ప్రియులు. బంగారాన్ని వివిధ రకాల ఆభరణాల రూపంలో కూడా అత్యధికంగా వాడేది మనమే. అలాగని మనదగ్గరే ప్రపంచంలోకెల్లా ఎక్కువ బంగారు నిల్వలు ఉన్నాయనుకుంటే పొరపాటే.ఈ విషయంలో పెద్దన్న అమెరికాదే అగ్రస్థానం అక్కడ 8133 టన్నుల నిల్వలు ఉన్నాయి. ఆ తరవాతి స్థానాల్లో ఉన్న మూడు దేశాలు.. జర్మనీ, ఇటలీ ఫ్రాన్స్. ఈదేశాల్లోని మొత్తం నిల్వలతో సమానంగా అమెరికా దగ్గర ఉండటం విశేషం. ఈ విషయంలో మనది 8వ స్థానం. 2023 చివరినాటికి ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారం ఏయే రూపాల్లో ఎక్కడ ఉందంటే.. -
2024లో బంగారం డిమాండ్ మరింత పైపైకి - కారణం ఇదే..
భారతదేశంలో ఇప్పటికే బంగారం ధరలు చుక్కలు తాకుతున్నాయి. రానున్న రోజుల్లో (2024) పసిడికి మరింత డిమాండ్ ఏర్పడుతుందని, కొనుగోలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని 'వరల్డ్ గోల్డ్ కౌన్సిల్' (WGC) వెల్లడించింది. 2024లో గోల్డ్ రేటు పెరగటానికి కారణం ఏంటి? భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) ప్రకారం, భారతదేశంలో వేతనాలు పెరగడం, యువ జనాభా సంఖ్య, పట్టణీకరణ కారణంగానే బంగారానికి డిమాండ్ భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎక్కువమంది బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపుతుండంతో తులం బంగారం ధరలు రూ. 60వేలు దాటేసింది. రాబోయే రోజుల్లో ఇది రూ. 70వేలుకి చేరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బంగారం మీద భారతీయులకు ఉన్న మక్కువ కారణంగానే.. చాలా మంది ఎప్పటికప్పుడు గోల్డ్ కొనేస్తూ ఉన్నారు, దీంతో బంగారానికి డిమాండ్ పెరిగిందని, రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్పష్టం చేసింది. పెరగనున్న పనిచేసే వారి సంఖ్య ప్రస్తుతం ఇతరులపై ఆధారపడి జీవించే వారి కంటే.. పనిచేసుకుంటూ ఎదుగుతున్న జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ కేటగిరిలో 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్కులు ఉన్నారు. దీంతో భారత్ ఆర్ధిక వ్యవస్థ బలంగా పుంజుకుంటుందని, ఇది 2040 వరకు కొనసాగే అవకాశం ఉందని కూడా నిపుణులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: అనుకున్నది సాధించడమంటే ఇదే.. వీడియో వైరల్ 2000 నుంచి 2010 మధ్య కాలంలో బంగారానికి ఉన్న డిమాండ్ సుమారు 40 శాతానికి పైగా పెరిగింది. అంటే బంగారం అమ్మకాలు భారీగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు, పేరంటాలు ఇలా అన్ని కార్యక్రమాలకు బంగారు ఆభరణాలను వేసుకోవడం అలవాటు అయిపోవడంతో నగలు ఎక్కువగా కొంటున్నారు. సిటీలో ఉండేవారు గోల్డ్ కాయిన్స్ రూపంలో లేదా బంగారు కడ్డీల (గోల్డ్ బార్) రూపంలో కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
పసిడి.. పరుగో పరుగు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బంగారం ధరల రికార్డు పరుగు ప్రభావం భారత్ బులియన్ మార్కెట్లో కనబడింది. దేశ రాజధానిలో పసిడి 10 గ్రాముల ధర సోమవారం అంతక్రితం ముగింపుతో పోలి్చతే రూ.450 పెరిగి రూ.64,300 రికార్డు స్థాయికి చేరినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇక ముంబైలో ధర సోమవారం క్రితం (శుక్రవారం ముగింపు)తో పోలి్చతే 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.553 పెరిగి రూ.63,281కి ఎగసింది. 99.5 స్వచ్ఛత ధర రూ.551 ఎగసి రూ.63,028ని చూసింది. ఇక వెండి విషయానికి వస్తే, రెండు నగరాల్లో దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో వెండి కేజీ ధర రూ.80,200 పలికితే, ముంబైలో ఈ విలువ రూ.76,430గా ఉంది. విజయవాడ మార్కెట్లో తీరిది... గడిచిన రెండు రోజుల్లో విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,250 పెరిగి రూ.64,200కు చేరింది. డిసెంబర్1న రూ.62,950 గా ఉన్న బంగారం ధర ఒకేరోజు రూ.810 పెరిగి రూ.63,760కు చేరగా, తాజాగా సోమవారం మరో రూ.440 పెరిగి రూ.64,200కు చేరింది. ఇదే సమయంలో 22 క్యారట్ల ఆభరణాల పది గ్రాముల బంగారం ధర రూ.1,150 పెరిగి రూ.57,700 నుంచి రూ.58,850కు పెరిగింది. అంతర్జాతీయ ప్రభావం... అంతర్జాతీయ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లో ఫిబ్రవరికి సంబంధించి క్రియాశీలంగా ట్రేడ్ అవుతున్న పసిడి ఔన్స్ (31.1 గ్రాములు) ధర తాజాగా రికార్డు స్థాయిలో 2,151 డాలర్లను తాకింది. అయితే లాభాల స్వీకరణ నేపథ్యంలో ఈ వార్త రాసే రాత్రి 11 గంటల సమయానికి 2.3 శాతం క్షీణించి 2,040 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక ఆసియన్ ట్రేడింగ్లో కూడా ఇంట్రాడేలో ధర ఆల్టైమ్ కొత్త రికార్డు స్థాయి 2,135 డాలర్లను చూసింది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాలు, డాలర్ బలహీనత, పశి్చమాసియా సంక్షోభ పరిస్థితులు పసిడి పరుగుకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఇటీవలి సర్వే విడుదలచేస్తూ, ప్రపంచవ్యాప్తంగా 24 శాతం సెంట్రల్ బ్యాంక్లు రాబోయే 12 నెలల్లో తమ బంగారం నిల్వలను పెంచుకోవాలని భావిస్తున్నాయని వెల్లడించింది. రిజర్వ్ అసెట్గా డాలర్ కంటే బంగారమే సరైనదన్న అభిప్రాయం దీనికి కారణమని పేర్కొంది. ఈ అంశం కూడా తాజా బంగారం ధర జోరుకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
బంగారాన్ని కొనడమే మానేశారు.. అందుకు ఇదే కారణం!
న్యూఢిల్లీ: భారత్ పసిడి డిమాండ్పై ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) రికార్డు స్థాయి ధరల ప్రతికూల ప్రభావం పడింది. సమీక్షా కాలంలో దేశ పసిడి డిమాండ్ 7 శాతంపైగా పతనమై(2022 ఇదే కాలంతో పోల్చి) 158.1 టన్నులకు తగ్గినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) పేర్కొంది. పసిడికి సంబంధించి భారత్ రెండవ అతిపెద్ద వినియోగ దేశంగా ఉన్న సంగతి తెలిసిందే. డిమాండ్ తగ్గినప్పటికీ, దిగుమతులు మాత్రం 16 శాతం పెరిగి 209 టన్నులుగా నమోదయినట్లు మండలి పేర్కొంది. 2023 మొదటి ఆరు నెలలూ చూస్తే, భారత్ పసిడి డిమాండ్ 271 టన్నులు. క్యాలెండర్ ఇయర్లో 650 టన్నుల నుంచి 750 టన్నుల వరకూ ఉంటుందని అంచనా. మండలి భారత్ ప్రాంతీయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సోమసుందరం పీఆర్ వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే.. ► సమీక్షాకాలంలో 10 గ్రాముల పసిడి ధర భారీగా రూ.64,000కు చేరింది. పన్నుల ప్రభావం కూడా దీనికి తోడయ్యింది. వెరసి డిమాండ్ భారీగా పడిపోయింది. ► డిమాండ్ 7 శాతం పతనం ఎలా అంటే... 2022 ఏప్రిల్–జూన్ మధ్య దేశ పసిడి డిమాండ్ 170.7 టన్నులు. 2023 ఇదే కాలంలో ఈ పరిమాణం 158.1 టన్నులకు పడిపోయింది. ► ధరల పెరుగుదల వల్ల విలువల్లో చూస్తే మాత్రం క్యూ2లో పసిడి డిమాండ్ పెరిగింది. గత ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య పసిడి దిగుమతుల విలువ రూ.79,270 కోట్లయితే, 2023 ఇదే కాలంలో ఈ విలువ రూ.82,530 కోట్లకు చేరింది. ► ఒక్క ఆభరణాల విషయానికి వస్తే, పసిడి డిమాండ్ 8 శాతం పడిపోయి 140.3 టన్నుల నుంచి 128.6 టన్నులకు తగ్గింది. ► 18 క్యారెట్ల పసిడి ఆభరణాలకు మాత్రం డిమాండ్ పెరగడం గమనార్హం. ధరలు కొంత అందుబాటులో ఉండడం దీనికి కారణం. ► కడ్డీలు, నాణేల డిమాండ్ 3 శాతం పడిపోయి 30.4 టన్నుల నుంచి 29.5 టన్నులకు తగ్గింది. ► పసిడి డిమాండ్లో రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రభావం కూడా కొంత కనబడింది. ► పసిడి డిమాండ్ భారీగా పెరగడంతో రీసైక్లింగ్ డిమాండ్ ఏకంగా 61 శాతం పెరిగి 37.6 టన్నులకు ఎగసింది. ► పసిడి ధర భారీ పెరుగుదల నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించి చరిత్రాత్మక ధర వద్ద ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆశావహ ధోరణి! ఓవర్–ది–కౌంటర్ లావాదేవీలు (ఓటీసీ– ఎక్సే్చంజీల్లో లిస్టెడ్కు సంబంధించిన కొనుగోళ్లు కాకుండా) మినహా గ్లోబల్ గోల్డ్ డిమాండ్ జూన్ త్రైమాసికంలో 2 శాతం పడిపోయి 921 టన్నులకు చేరింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో సగటు కొనుగోళ్లతో పోలిస్తే సెంట్రల్ బ్యాంక్ల కొనుగోళ్లు సైతం తగ్గినట్లు మండలి పేర్కొంది. ఓటీసీ, స్టాక్ ఫ్లోలతో సహా, క్యూ2లో మొత్తం గ్లోబల్ డిమాండ్ మాత్రం 7 శాతం బలపడి 1,255 టన్నులకు చేరుకుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పటిష్టమైన బంగారం మార్కెట్ను సూచిస్తోందని మండలి వివరించింది. సెంట్రల్ బ్యాంకుల డిమాండ్ 103 టన్నులు తగ్గినట్లు గణాంకాలు వెల్లడించాయి. టర్కీలో కొన్ని కీలక ఆర్థిక, రాజకీయ పరిమాణల నేపథ్యంలో జరిగిన అమ్మకాలు దీనికి ప్రధాన కారణం. అయితే మొదటి ఆరు నెలల కాలాన్నీ చూస్తే మాత్రం సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో 387 టన్నుల పసిడిని కొనుగోలు చేశాయి. దీర్ఘకాల సానుకూల ధోరణిని ఇది సూచిస్తోందని మండలి సీనియర్ మార్కెట్స్ విశ్లేషకులు లూయీస్ స్ట్రీట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా, టక్కీలుసహా కీలక మార్కెట్లలో వృద్ధి కారణంగా కడ్డీలు, నాణేల డిమాండ్ క్యూ2లో 6 శాతం పెరిగి 277 టన్నులుగా ఉంటే, మొదటి ఆరు నెలలోల 582 టన్నులుగా ఉంది. గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) అవుట్ఫ్లోస్ క్యూ2లో 21 టన్నులయితే, మొదటి ఆరు నెలల్లో 50 టన్నులు. ఆభరణాల వినియోగ డిమాండ్ క్యూ2లో 3 శాతం పెరిగింది. ఆరు నెలల్లో ఈ పరిమాణం 951 టన్నులు. పసిడి సరఫరా క్యూ2లో 7 శాతం పెరిగి 1,255 టన్నులుగా ఉంది. గోల్డ్ మైన్స్ ఉత్పత్తి మొదటి ఆరు నెలల్లో 1,781 టన్నుల రికార్డు స్థాయికి చేరింది. అటు–ఇటు అంచనాలు... పెరిగిన స్థానిక ధరలు, విచక్షణతో కూడిన వ్యయంలో మందగమనం కారణంగా బంగారం అనిశి్చతిని ఎదుర్కొంటున్నందున, మేము బంగారం 2023 డిమాండ్ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. ప్రస్తుతం పరిస్థితి కొంత నిరాశగా ఉన్నప్పటికీ తగిన వర్షపాతంతో పంటలు, గ్రామీణ డిమాండ్ పటిష్టంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. దీపావళి సీజన్లో సెంటిమెంట్ మెరుగుపడుతుందని, సానుకూల ఆశ్చర్య ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నాం. ప్రస్తుత స్థాయిలోనే ధరలు కొనసాగితే 2023లో భారత్లో మొత్తం బంగారం డిమాండ్ 650–750 టన్నుల శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. – సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ సీఈఓ -
బంగారం డిమాండ్కు ధర సెగ
ముంబై: దేశంలో బంగారం ధరలు తీవ్ర స్థాయికి చేరడంతో, జనవరి–మార్చి త్రైమాసికంలో డిమాండ్ భారీగా 17 శాతం పడిపోయింది. వినియోగదారులు తీవ్ర ధరల కారణంగా కొనుగోళ్లను వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొంది. ‘మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ ట్రెండ్స్’ పేరుతో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన ఒక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ► ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారత్ పసిడి డిమండ్ 112.5 టన్నులు. 2022 ఇదే కాలంలో ఈ విలువ 135.5 టన్నులు. ► పసిడి ఆభరణాల డిమాండ్ ఇదే కాలంలో 94.2 టన్నుల నుంచి 78 టన్నులకు పడిపోయింది. 2010 నుంచి ఒక్క మహమ్మారి కరోనా కాలాన్ని మినహాయిస్తే పసిడి ఆభరణాల డిమాండ్ మొదటి త్రైమాసికంలో 100 టన్నుల దిగువకు పడిపోవడం ఇది నాల్గవసారి. ► విలువల రూపంలో చూస్తే, మొత్తంగా పసిడి కొనుగోళ్లు 9 శాతం క్షీణించి రూ.61,540 కోట్ల నుంచి రూ.56,220 కోట్లకు పడిపోయాయి. ► ఒక్క ఆభరణాల డిమాండ్ విలువల్లో చూస్తే, 9 శాతం పడిపోయి రూ.42,800 కోట్ల నుంచి రూ.39,000 కోట్లకు పడిపోయాయి. ► పెట్టుబడుల పరిమాణం పరంగా డిమాండ్ (కడ్డీలు, నాణేలు) 17 శాతం తగ్గి 41.3 టన్నుల నుంచి 34.4 టన్నులకు క్షీణించింది. ప్రపంచ పసిడి డిమాండ్ కూడా మైనస్సే.. ఇదిలావుండగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా పసిడి డిమాండ్ మొదటి త్రైమాసికంలో బలహీనంగానే నమోదయ్యింది. 13 శాతం క్షీణతతో ఈ పరిమాణం 1,080.8 టన్నులుగా ఉంది. రూపాయి ఎఫెక్ట్... పసిడి ధరలు పెరడానికి అంతర్జాతీయ అంశాలు ప్రధాన కారణంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు పెరుగుదలను ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. డాలర్ బలోపేతం, రూపాయి బలహీనత వంటి కారణాలతో గత ఏడాదితో పోల్చితే పసిడి ధర 19 శాతం పెరిగింది. పసిడి 10 గ్రాముల (స్వచ్ఛత) ధర రూ.60,000 పైన నిలకడగా కొనసాగుతోంది. ధర తీవ్రతతో తప్పనిసరి పసిడి అవసరాలకు వినియోగదారులు తమ పాత ఆభరణాల రీసైక్లింగ్, తద్వారా కొత్త కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్ను ఆశ్రయిస్తున్నారు. ఈ విభాగంలో కొనుగోళ్ల పరిమాణాలు కొంత మెరుగుపడుతున్నాయి. డిమాండ్ వార్షికంగా 750 నుంచి 800 టన్నలు శ్రేణిలో నమోదుకావచ్చు. – సోమసుందరం, డబ్ల్యూజీసీ భారత్ రీజినల్ సీఈఓ -
కొత్త బంగారు లోకం
సాక్షి, అమరావతి: నిన్నా మొన్నటి వరకు 22 క్యారెట్ల బంగారు ఆభరణాల కొనుగోలుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రజల అభిరుచిలో గణనీయమైన మార్పు వచ్చింది. ప్రస్తుతం 14 –18 క్యారెట్ల బంగారంతో చేసిన ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం వల్లే ప్రజలు ఇలా నిర్ణయం మార్చుకున్నారని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వారి బడ్జెట్కు తగినట్టుగా తక్కువ క్యారెట్లతోనే ఆభరణాలు తయారు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. 2021లో దేశ వ్యాప్తంగా 611 టన్నుల బంగారు ఆభరణాలు అమ్ముడైనట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా అమ్ముడవుతున్న బంగారు ఆభరణాల్లో 25 శాతం భారతీయ పెళ్లి కూతుళ్ల కోసమే కొంటున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు యువత మోడ్రన్ దుస్తులు ఎక్కువగా ధరిస్తుండటంతో వాటికి అనుగుణంగా ఆభరణాలను తయారు చేస్తున్నట్టు దేశీయ బంగారం వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికీ బంగారం అమ్మకాల్లో 80 శాతం 22 క్యారెట్ల ఆభరణాలే ఉన్నప్పటికీ.. తక్కువ క్యారెట్ల ఆభరణాలకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్నట్టు పేర్కొంటున్నారు. గాజులు హారాలదే హవా దేశంలో అమ్ముడవుతున్న బంగారు ఆభరణాల్లో గాజులు, హారాల వాటాయే అత్యధికం. మొత్తం అమ్మకాల్లో 30–40 శాతం వాటా గాజులు ఆక్రమించగా.. హారాల వాటా 30–40 శాతం ఉంటోంది. ఆ తర్వాత స్థానంలో నెక్లెస్లు 15–20 శాతం వాటా ఉంటే.. చెవిదిద్దులు, చేతి ఉంగరాల అమ్మకాలు 5–15 శాతం చొప్పున ఉంటున్నాయి. ఒక్కొక్క నెక్లెస్ కోసం సగటున 30 నుంచి 60 గ్రాములను వినియోగిస్తుంటే.. గాజుల కోసం 10 నుంచి 15 గ్రాములు, చెయిన్ల కోసం 10 నుంచి 20 గ్రాములు, ఉంగరాలు, చెవిదిద్దుల కోసం 3నుంచి 8 గ్రాముల వరకు బంగారాన్ని వినియోగిస్తున్నారు. పెళ్లి ఆభరణాల వాటా 55 శాతం దేశీయ ఆభరణాల అమ్మకాల్లో వివాహాల సందర్భంగా వినియోగించే ఆభరణాల వాటా 55 శాతం వరకు ఉంది. దేశంలో ఏటా సగటున 1.10 కోట్ల నుంచి 1.30 కోట్ల పెళ్లిళ్లు జరుగుతున్నట్టు అంచనా. ఆ తర్వాత పంటలు చేతికి వచ్చినప్పుడు, అక్షయ తృతీయ, ధన్తేరాస్ వంటి పర్వదినాల్లో బంగారం అమ్మకాలు అధికంగా జరుగుతున్నాయి. ఆ రోజుల్లో 60 టన్నుల బంగారం అమ్ముడవుతోంది. కాగా.. పట్టణ ప్రజలతో పోలిస్తే.. గ్రామీణులే అత్యధికంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారని వెల్లడైంది. మొత్తం బంగారం అమ్మకాల్లో 58 శాతం గ్రామీణ మధ్యతరగతి ప్రజలే కొంటున్నారు. రోజువారీ ధరించే నగల కొనుగోళ్ల వాటా 35 నుంచి 40 శాతం ఉండగా.. ఫ్యాషన్ జ్యూవెలరీ వాటా 5–10 శాతం వరకు ఉంది. దక్షిణాది ప్రజలు అత్యధికంగా ఇష్టపడే టెంపుల్ జ్యూవెలరీ, కుందన్ వంటి భారీ మోడల్స్ను ఇప్పుడు ఉత్తరాది వారు కూడా ధరించడానికి ఇష్టపడుతున్నట్టు సర్వే వెల్లడించింది. పెళ్లిలకు సగటున 35 నుంచి 250 గ్రాముల బరువుండే ఆభరణాలు కొనుగోలు చేస్తుంటే.. రోజువారీ ధరించేందుకు 5 నుంచి 30 గ్రాముల బరువుండే ఆభరణాలను కొంటున్నారు. ఫ్యాషన్ జ్యూవెలరీ అయితే.. 5 నుంచి 20 గ్రాములలోపు వినియోగిస్తున్నారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. -
World Gold Council: కరోనా పూర్వపు స్థాయికి బంగారం డిమాండ్
ముంబై: బంగారం డిమాండ్ భారత్లో కరోనా ముందు నాటి స్థాయికి చేరుకుందుని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో డిమాండ్, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం పెరిగి 191.7 టన్నులుగా నమోదైనట్టు ప్రకటించింది. ‘బంగారం డిమాండ్ తీరు క్యూ3, 2022’ పేరుతో మంగళవారం ఓ నివేదిక విడుదల చేసింది. క్రితం ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 168 టన్నులుగా ఉంది. విలువ పరంగా చూస్తే ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో బంగారం డిమాండ్ 19 శాతం పెరిగి రూ.85,010 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.71,630 కోట్లు కావడం గమనార్హం. ఆభరణాల డిమాండ్ తీరు.. బంగారం ఆభరణాల డిమాండ్ మూడో క్వార్టర్లో 17 శాతం పెరిగి 146.2 టన్నులుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 125 టన్నులుగా ఉంది. విలువ పరంగా క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.53,300 కోట్ల డిమాండ్తో పోలిస్తే 22 శాతం పెరిగి రూ.64,800 కోట్లుగా ఉంది. ‘‘రుణ సదుపాయాలు విస్తరించడం ఈ డిమాండ్కు ప్రేరణనిస్తోంది. బ్యాంకు రుణ వితరణలో వృద్ధి తొమ్మిదేళ్ల గరిష్టానికి చేరింది. ముఖ్యంగా దక్షిణ భారత్లో వృద్ధి బలంగా ఉంది. దీంతో ఆభరణాలకు డిమాండ్ 17 శాతం పెరిగింది’’అని డబ్ల్యూజీసీ భారత్ హెడ్ పీఆర్ సోమసుందరం తెలిపారు. వర్షాలు, ద్రవ్యోల్బణం తదితర అంశాలతో గ్రామీణ ప్రాంతాల్లో బంగారం డిమాండ్పై ప్రభావం ఉన్నట్టు చెప్పారు. పెరిగిన పెట్టుబడులు.. ఇక బార్, కాయిన్ల డిమాండ్ సెప్టెంబర్ క్వార్టర్లో 6 శాతం పెరిగి 45.4 టన్నులుగా (విలువ పరంగా రూ.20,150 కోట్లు) ఉంది. ‘‘బంగారం ధరలు తగ్గడం, బలహీన ఈక్విటీ మార్కెట్లు, పండుగలతో ఇన్వెస్టర్లు బంగారంపై ఇన్వెస్ట్మెంట్కు ఆసక్తి చూపించారు. పెరుగుతున్న వడ్డీ రేట్ల వాతావరణం, రూపాయి బలహీనత వంటి అంశాలతో సురక్షిత సాధనమైన బంగారంలో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతాయి. ఈ ఏడాది మిగిలిన కాలంపై ఆశావహ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే వివాహాలు, దీపావళి డిమాండ్ నాలుగో త్రైమాసికం గణాంకాల్లో ప్రతిఫలిస్తుంది. అయితే గతేడాది ఇదే కాలంలో కనిపించిన రికార్డు స్థాయి పనితీరు సాధ్యపడకపోవచ్చు. ఈ ఏడాది మొత్తం మీద బంగారం డిమాండ్ 750–800 టన్నులుగా ఉంటుంది’’అని సోమసుందరం వివరించారు. 2021లో బంగారం దిగుమతులు 1,003 టన్నులుగా ఉండగా, ప్రస్తుత మార్కెట్ సెంటిమెంట్ను పరిశీలిస్తే గతేడాది గణాంకాలను మించదని ఆయన అంచనా వేశారు. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో (సెప్టెంబర్ వరకు) 559 టన్నుల బంగారం దిగుమతి అయినట్టు చెప్పారు. రెండు, మూడో త్రైమాసికంలో బంగారం ధరలు 4 శాతం తగ్గినట్టు.. సెప్టెంబర్ క్వార్టర్లో 10 గ్రాముల బంగారం సగటు ధర రూ.44,351గా ఉన్నట్టు చెప్పారు. -
World Gold Council: గొలుసుకట్టు ఆభరణాల సంస్థలకు మంచి రోజులు
న్యూఢిల్లీ: భారత రిటైల్ ఆభరణాల మార్కెట్లో గొలుసుకట్టు ఆభరణ విక్రయ సంస్థల వాటా వచ్చే ఐదేళ్లలో 40 శాతానికి వృద్ధి చెందుతుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. 2021 చివరికే చైన్ స్టోర్లు రిటైల్ మార్కెట్లో 35 శాతం వాటాను సొంతం చేసుకున్నట్టు తెలిపింది. అంటే ఐదేళ్లలో మరో 5 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. అగ్రగామి ఐదు రిటైల్ సంస్థలు వచ్చే ఐదేళ్లలో 800 నుంచి 1,000 వరకు ఆభరణాల విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తాయని డబ్ల్యూజీసీ తెలిపింది. భారత్లో జ్యుయలరీ మార్కెట్ నిర్మాణంపై ఓ నివేదికను బుధవారం విడుదల చేసింది. చిన్న, చిన్న విభాగాలుగా ఈ మార్కెట్ విస్తరించి ఉన్నందున, మొత్తం జ్యుయలరీ సంస్థలు ఎన్ని ఉన్నాయో కచ్చితంగా అంచనా వేయడం కష్టమని అభిప్రాయపడింది. పలు వాణిజ్య సంఘాల అంచనాల ప్రకారం భారత్లో 5–6 లక్షల వరకు జ్యుయలరీ విక్రేతలు ఉండొచ్చని పేర్కొంది. సానుకూలతలు.. వినియోగదారుల అనుభవం, వినూత్నమైన డిజైన్లు, హాల్ మార్కింగ్ పట్ల అవగాహన పెరగడం, మెరుగైన ధరల విధానం, సులభతర వెనక్కిచ్చేసే విధానాలు, జీఎస్టీ, డీమోనిటైజేషన్ ఇవన్నీ కూడా భారత్లో చైన్ జ్యుయలరీ స్టోర్ల వైపు కస్టమర్లు మొగ్గు చూపేలా చేసినట్టు డబ్ల్యూజీసీ వివరించింది. పెద్ద సంఖ్యలో విస్తరించి ఉన్న చిన్న ఆభరణాల విక్రేతలే ఇప్పటికీ మార్కెట్ను శాసిస్తున్నట్టు తెలిపింది. అయితే, గొలుసుకట్టు సంస్థల మార్కెట్ వాటా గత దశాబ్ద కాలంలో క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు వెల్లడించింది. ఈ పరిశ్రమలో సంఘటిత రంగం వాటా మరింత పెరిగేందుకు అవకాశాలున్నట్టు తెలిపింది. నిర్మాణాత్మక మార్పులు ‘‘భారత రిటైల్ జ్యుయలరీ మార్కెట్ గత దశాబ్ద కాలంలో ఎన్నో నిర్మాణాత్మక మార్పులను చూసింది. విధానపరమైన ప్రోత్సాహకాలు, కస్టమర్ల ధోరణిలో మార్పు దీనికి దారితీసింది. తప్పనిసరి హాల్ మార్కింగ్ ఈ రంగంలో అన్ని సంస్థలు సమాన అవకాశాలు పొందేలా వీలు కల్పించింది. పెద్ద మొత్తంలో రుణ సదుపాయాలు, పెద్ద సంఖ్యలో ఆభరణాల నిల్వలను కలిగి ఉంటే సానుకూలతలు జాతీయ, ప్రాంతీయ చైన్ స్టోర్లు మరింత మార్కెట్ వాటా పెంచుకునేందుకు మద్దతుగా నిలుస్తాయి’’అని డబ్ల్యూజీసీ రీజినల్ సీఈవో సోమసుందరం పీఆర్ తెలిపారు. చిన్న సంస్థలు మరింత పారదర్శకమైన విధానాలు అనుసరించడం, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా పెద్ద సంస్థలతో సమానంగా పోటీ పడడమే కాకుండా, తమ మార్కెట్ వాటాను కాపాడుకోవచ్చని సూచించారు. ఆన్లైన్లోనూ ఆభరణాల విక్రయాలు పెరుగుతున్నాయని, 5–10 గ్రాముల పరిమాణంలో ఉన్నవి, లైట్ వెయిట్, రోజువారీ ధారణకు వీలైన 18 క్యారట్ల ఆభరణాల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది. -
పసిడి డిమాండ్ మామూలుగా లేదుగా, ఆభరణాలు తెగ కొనేశారట..!
న్యూఢిల్లీ: పసిడికి డిమాండ్ ఏమాత్రం తగ్గట్లేదు. 2022 ఏప్రిల్-జూన్ కాలంలో భారతీయులు 170.7 టన్నుల బంగారం కొనుగోలు చేశారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. జూన్తో ముగిసిన మూడు నెలల్లో పుత్తడి కొనుగోలుకు కస్టమర్లు చేసిన వ్యయం 54 శాతం పెరిగి రూ.79,270 కోట్లకు చేరుకుంది. 2022లో మొత్తం 800-850 టన్నుల బంగారానికి డిమాండ్ ఉండవచ్చు. 2021లో భారత్లో 797 టన్నుల మేర పుత్తడి అమ్మకాలు నమోదయ్యాయి. అభరణాలే అధికం.. అక్షయ తృతీయ, సంప్రదాయ వివాహ వేడుకల కారణంగా జూన్ త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ 49 శాతం దూసుకెళ్లి 140.3 టన్నులుగా ఉంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 94 టన్నులు మాత్రమే. వినియోగదార్లు కొనుగోలు చేసిన ఆభరణాల విలువ క్రితం ఏడాదితో పోలిస్తే జూన్ త్రైమాసికంలో రూ.40,610 కోట్ల నుంచి రూ.65,140 కోట్లకు ఎగసింది. పెట్టుబడి కోసం కొనుగోలు చేసిన బంగారం 20 శాతం వృద్ధి చెంది 30.4 టన్నులుగా ఉంది. వీటి కోసం చేసిన వ్యయం 29 శాతం పెరిగి రూ.14,140 కోట్లకు చేరుకుంది. పునర్వినియోగమైన (రీసైకిల్డ్) బంగారం 18 శాతం అధికమై 23.3 టన్నులకు దూసుకెళ్లింది. గడిచిన త్రైమాసికంలో 170 టన్నుల దిగుమతి అయింది. 2021 ఏప్రిల్-జూన్లో ఇది 131.6 టన్నులు. సెంటిమెంట్పై ప్రభావం.. ద్రవ్యోల్బణం, పసిడి ధర, రూపాయి-డాలర్ మారకం, విధాన చర్యలు వినియోగదార్ల సెంటిమెంట్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. రూపాయి, డాలర్ మారకంపై దృష్టి సారించినప్పటికీ ఆర్థిక దృక్పథంపై అనిశ్చితి, అధిక దిగుమతి సుంకం, తాత్కాలిక, వ్యూహాత్మక కారణాల వల్ల బంగారం కొనుగోలుపై అదనపు ఆంక్షలు విధించే అవకాశం కారణంగా ఈఏడాది రెండో అర్ధభాగంలో దేశీయంగా ఆభరణాల డిమాండ్ ప్రతికూల ముప్పును ఎదుర్కొంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇలా.. అంతర్జాతీయంగా పుత్తడి డిమాండ్ ఏప్రిల్-జూన్లో 8 శాతం పడిపోయి 948.4 టన్నులకు వచ్చి చేరింది. గోల్డ్ ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి ఉపసంహరణలు పెరగడం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లలో క్షీణత, టెక్నాలజీ విభాగం నుండి డిమాండ్ తగ్గడం వంటి కారణాలు ఇందుకు కారణమని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. పెట్టుబడి కోసం కొనుగోలు చేసిన బంగారం 28 శాతం తగ్గి 205.8 టన్నులుగా ఉంది. భారత మార్కెట్ తోడుగా నిలవడంతో ఆభరణాల డిమాండ్ 6.15 శాతం పెరిగి 484.3 టన్నులకు చేరుకుంది. చైనాలో ఆభరణాల అమ్మకాలు 28 శాతం పడిపోయాయి. 2022 జనవరి-జూన్లో గోల్డ్ డిమాండ్ 12 శాతం అధికమై 2,189 టన్నులకు ఎగసింది. -
భారత్లో గోల్డ్ మైనింగ్ బంగారమవుతుంది.. కానీ!
న్యూఢిల్లీ: బంగారం వినియోగంలో భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో నిలుస్తున్నప్పటికీ ఈ మెటల్ ఉత్పత్తిలో వెనుకబడి ఉందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) పేర్కొంది. భారత్ బంగారం గనుల ఉత్పత్తి 2020లో 1.6 టన్నులని వెల్లడించింది. అయితే దీర్ఘకాలంలో దేశీయ ఉత్పత్తి వార్షికంగా 20 టన్నులకు పెరిగే అవకాశం ఉందని కూడా అంచనావేసింది. ఇందుకు పలు చర్యలు అవసరమని సూచించింది. భారత్లో బంగారం మార్కెట్పై జరుపుతున్న అధ్యయనంలో భాగంగా ‘గోల్డ్ మైనింగ్ ఇన్ ఇండియా’ అన్న శీర్షికన మండలి ఒక నివేదికను ఆవిష్కరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► భారతదేశానికి బంగారం తవ్వకాలలో గొప్ప వారసత్వం ఉంది. అయితే తక్కువ పెట్టుబడుల కారణంగా దేశీయంగా పరిశ్రమ వృద్ధికి ఆటంకం ఏర్పడింది. భారత్ పసిడి మైనింగ్ మార్కెట్ ఒక చిన్న స్థాయిలో పనిచేస్తుంది. ఈ పరిస్థితుల్లో భారీ పెట్టుబడులతో ప్రవేశించడం అంత సులభం కాదు. ► భారతదేశం ప్రస్తుత వనరులు, ఇతర దేశాలలో ఉత్పత్తి– వనరుల స్థాయిలతో పోల్చితే దీర్ఘకాలంలో సంవత్సరానికి దాదాపు 20 టన్నుల వార్షిక ఉత్పత్తికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ► నియంత్రణ సవాళ్లు, పన్నుల విధానాలు, మౌలిక సదుపాయాలు దేశంలో పసిడి మైనింగ్కు ప్రధాన సవాళ్లుగా నిలుస్తున్నాయి. ► బంగారు తవ్వకం భారతదేశానికి గణనీయమైన స్థిరమైన సామాజిక–ఆర్థిక అభివృద్ధిని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కేవలం బంగారం కోసం అన్వేషణ, మైనింగ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడే అంశంగా చెప్పడంలేదు. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన శ్రామికశక్తికి శిక్షణ ఇచ్చే వారసత్వం సంపద భారత్ సొంతం. ► మైనింగ్ విస్తృతి... ఒక ప్రాంతానికి మౌలిక సదుపాయాల కల్పన, సంబంధిత పెట్టుబడిని తీసుకురావడానికి సహాయపడుతుంది. అనుబంధ సేవా పరిశ్రమలు ప్రారంభమవుతాయి. ఇలా ఏర్పాటయ్యే పరిశ్రమలు సంబంధిత గని కార్యకలాపాల కాలపరిమితికి మించి ఎక్కువ కాలం కొనసాగుతాయి. ► భారతదేశం తన బంగారు మైనింగ్ ఆస్తులను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తుందనే బలమైన విశ్వాస్వాన్ని పెట్టుబడిదారుకు కల్పించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మాత్రమే ఈ విభాగంలోకి భారీ పెట్టుబడులు వస్తాయి. ఇదే జరిగితే దేశం బంగారు మైనింగ్ రంగానికి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ► ప్రస్తుతం మైనింగ్ రంగం మూడు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోంది. మైనింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియ సుదీర్ఘంగా ఉంది. ఇందులో బహుళ ఏజెన్సీల పాత్ర ఉంటోంది. ఒక్క లైసెన్స్ కోసం 10 నుంచి 15 ఆమోదాలు పొందాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీనికితోడు ఆయా ఆమోదాల కోసం తీవ్ర జాప్యం పెట్టుబడులకు ప్రధాన అవరోధంగా తయారయ్యింది. ప్రధానంగా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే బహుళజాతి కంపెనీలు దేశంలో పెట్టుబడులకు దూరంగా ఉంటాయి. ఇక మూడవ సమస్య విషయానికి వస్తే, మైనింగ్ పరికరాలపై దిగుమతి పన్ను, ఇతర ప్రత్యక్ష, పరోక్ష పన్నులు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి. ► ప్రత్యామ్నాయాలు లేని పరిస్థితుల్లో మైనింగ్ పరికరాలను దిగుమతి చేసుకోడానికి ప్రాజెక్ట్ డెవలపర్లు మొగ్గు చూపుతారు. అధిక దిగుమతి పన్నులు మూలధన వ్యయాన్ని పెంచుతాయి. ఈ రంగంలో అభివృద్ధిని నిరోధిస్తాయి. ► అనేక కీలకమైన బంగారు మైనింగ్ ప్రాంతాలు మౌలిక సదుపాయాలు పేలవంగా ఉన్న రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉండడం మరో ప్రతికూల అంశం. ప్రత్యేకించి రహదారి, రైలు లింక్లు అంతంతమాత్రంగా ఉన్న ప్రాంతాలకు మైనింగ్ పరికరాలు, సంబంధిత సామాగ్రి తరలించడం కష్టతరం, వ్యయ భరితం అవుతుంది. ఫలితంగా, గత 15 సంవత్సరాలుగా బంగారం అన్వేషణలో పరిమిత పెట్టుబడుల పరిస్థితిని దేశం ఎదుర్కొంటోంది. ► అయితే, ఇటీవలి సంవత్సరాలలో భారత ప్రభుత్వం అత్యంత సమస్యాత్మకమైన సవాళ్లను పరిష్కరించడం ద్వారా భారతదేశ బంగారు గనుల రంగాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తోంది. పలు విధాన మార్పులను ప్రతిపాదించి అమలు చేస్తోంది. ► గనులు– ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957 (ఎంఎండీఆర్) సవరణకు 2015 మార్చిలో పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. వేలం ప్రక్రియ ద్వారా మైనింగ్ లీజుల కోసం ప్రైవేట్ కంపెనీలు ముందుకు రావడానికి ఇది దోహదపడింది. ప్రధాన మైనింగ్ లీజుల వ్యవధిని 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పొడిగించింది. ► మైనింగ్ అన్వేషణను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా 2016 జూన్లో ప్రభుత్వం జాతీయ ఖనిజ అన్వేషణా విధానం (ఎన్ఎంఈపీ)న్ని ఆమోదించింది. మైనింగ్ రంగంలో అడ్డంకులను తొలగించి, అభివృద్దిని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని (ఎన్ఎంపీ 2019) అమలు చేస్తున్నట్లు 2019 మార్చిలో ప్రకటించింది. ఈ విధానం బొగ్గు, ఇతర ఇంధనేతర ఖనిజాలకు వర్తిస్తుందని తెలిపింది. తద్వారా ఏడేళ్ల కాలంలో భారత్ ఖనిజ ఉత్పత్తి విలువలను 200 శాతం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చే అంశం ఇది. సానుకూల మార్పులు ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాలలో భారతదేశం ఒకటి. కాబట్టి, మైనింగ్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం సమంజసమే. అయితే ఇది జరగడానికి సంబంధిత వ్యవస్థలో ఎన్నో మార్పులు అవసరం. నియంత్రణా పరమైన అడ్డంకులు తొలగాలి. పెట్టుబడులను ప్రోత్సహించాలి. అయితే ఇటీవలి సంవత్సరాల్లో ఆశాజనక సంకేతాలు కనిపిస్తున్నాయి. గనులు, ఖనిజాల (అభివృద్ధి–నియంత్రణ) చట్టంలో మార్పులు, జాతీయ మినరల్ పాలసీ, జాతీయ ఖనిజాల అన్వేషణ విధానం ఆవిష్కరణ వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఇదే ధోరణి కొనసాగితే, రాబోయే సంవత్సరాల్లో భారతదేశ బంగారం గని ఉత్పత్తి పెరుగుతుందని అంచనా. అయితే కొత్త విధానాల అమలు, వాటి విజయవంతం, నూతన పెట్టుబడులు రాక వంటి అంశాలు ఇక్కడ ముడివడి ఉన్నాయి. – సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ (ఇండియా) రీజినల్ సీఈఓ -
భారత్ బంగారం డిమాండ్ పటిష్టం
ముంబై: భారత్ పసిడి డిమాండ్ తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో వార్షికంగా 19 శాతం పెరిగి 76 టన్నులుగా నమోదయినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక తెలిపింది. అయితే శాతాల్లో భారీ పెరుగుదలకు గత ఏడాది ఇదే కాలంలో తక్కువ డిమాండ్ నమోదు (లో బేస్) ప్రధాన కారణం. 2020 ఏప్రిల్–జూన్ మధ్య పసిడి డిమాండ్ 63.8 టన్నులుగా ఉంది. కరోనా ప్రభావంతో అప్పట్లో కఠిన లాక్డౌన్ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. 2021 క్యూ2 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్పై డబ్ల్యూజీసీ విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► ఏప్రిల్–జూన్ మధ్య పసిడి డిమాండ్ విలవ రూపంలో 23 శాతం పెరిగి రూ.26,600 కోట్ల నుంచి రూ.32,810 కోట్లకు చేరింది. ► ఇక మొత్తం ఆభరణాల డిమాండ్ రెండవ త్రైమాసికంలో వార్షికంగా 25 శాతం పెరిగి 44 టన్నుల నుంచి 55.1 టన్నులకు చేరింది. విలువలో 29 శాతం ఎగసి రూ.18,350 కోట్ల నుంచి రూ.23,750 కోట్లకు ఎగసింది. ► పెట్టుబడుల డిమాండ్ 6 శాతం పెరిగి 19.8 టన్నుల నుంచి 21 టన్నులకు ఎగసింది. విలువలో ఈ విలువ 10 శాతం పెరిగి రూ.8,250 కోట్ల నుంచి రూ.9,060 కోట్లకు ఎగసింది. ► గోల్డ్ రీసైక్లింగ్ 43 శాతం ఎగసి 13.8 టన్నుల నుంచి 19.7 టన్నులకు చేరింది. ► పసిడి దిగుమతులు 10.9 టన్నుల నుంచి భారీగా 120.4 టన్నులకు పెరిగాయి. ఆరు నెలల్లో ఇలా... త్రైమాసికం పరంగా చూస్తే, (2021 జనవరి–మార్చితో పోల్చి) పసిడి డిమాండ్ 46 శాతం పడిపోవడం గమనార్హం. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో దేశ పసిడి డిమాండ్ 140 టన్నులు. కోవిడ్–19 సెకండ్వేవ్ ప్రభావం ఏప్రిల్–జూన్ త్రైమాసికం డిమాండ్పై కనబడింది. సెకండ్ వేవ్ కారణంగా అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్లో పసిడికి అంత డిమాండ్ రాలేదని డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈఓ (ఇండియా) సోమసుందరం తెలిపారు. 2021 తొలి ఆరు నెలల్లో పసిడి డిమాండ్ 30 శాతం పెరిగి 216.1 టన్నులకు ఎగసింది. పెరిగిన సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు... డబ్ల్యూజీసీ నివేదిక ప్రకారం, ప్రపంచ పసిడి డిమాండ్ 2021 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో దాదాపు స్థిరంగా 955.1 టన్నులుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ డిమాండ్ 960.5 టన్నులు. ఆభరణాలకు సంబంధించి వినియోగదారు పసిడి డిమాండ్ 60 శాతం పెరిగి 244.5 టన్నుల నుంచి 390.7 టన్నులకు చేరింది. కడ్డీలు, నాణేల కొనుగోళ్లు వరుసగా నాల్గవ త్రైమాసికంలోనూ పెరిగాయి. వార్షికంగా 157 టన్నుల నుంచి 244 టన్నులకు చేరాయి. కాగా ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ సంబంధిత ఇన్వెస్ట్మెంట్ల పరిమాణం నుంచి 90 శాతం పడిపోయి 427.5 టన్నుల నుంచి 40.7 టన్నులకు చేరింది. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగాయి. ఈ పరిమాణం 63.7 టన్నుల నుంచి భారీగా 199.9 టన్నులకు ఎగసింది. థాయ్లాండ్, హంగరీ, బ్రె జిల్ సెంట్రల్ బ్యాంకులు భారీగా కొనుగోలు చేశాయి. సంవత్సరం మొత్తంగా డిమాండ్ 1,600 టన్నుల నుంచి 1,800 టన్నుల శ్రేణిలో ఉంటుందని డబ్ల్యూజీసీ అంచనా. ఒక్క ఇన్వెస్ట్మెండ్ డిమాండ్ 1,250 నుంచి 1,400 టన్నుల శ్రేణిలో ఉంటుందని భావిస్తోంది. అలాగే సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లూ కొనసాగుతాయని విశ్వసిస్తోంది. -
24 జిల్లాలతో మొదటిస్థానంలో తమిళనాడు
న్యూఢిల్లీ: పసిడి ఆభరణాలు, కళాఖండాలకు తప్పనిసరిగా హాల్మార్కింగ్ అమలు జరుగుతున్న దేశంలోని మొత్తం 256 జిల్లాల్లో 24 జిల్లాలతో తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. వరుసలో తరువాత గుజరాత్ (23 జిల్లాలు) మహారాష్ట్ర (22 జిల్లాలు) ఉన్నాయి. 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 256 జిల్లాలను హాల్ మార్కింగ్కు ఎంపిక జరిగింది. జూన్ 16 నుంచి తొలి దశ అమలు ప్రారంభమైంది. పసిడి స్వచ్ఛతకు సంబంధించి గోల్డ్ హాల్ మార్కింగ్ విధానం ఇప్పటి వరకూ స్వచ్చందంగా అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి వినియోగ మంత్రిత్వశాఖ ఈ మేరకు విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ల్లో 19 జిల్లాల చొప్పున హాల్ మార్కింగ్ అమలవుతోంది. ► ఆంధ్రప్రదేశ్, పంజాబ్లలో పన్నెండు చొప్పున మొత్తం 24 జిల్లాల్లో ఈ విధానం అమలు. ► కేరళ (13 జిల్లాల్లో), కర్ణాటక (14 జిల్లాల్లో), హర్యానా (15 జిల్లాల్లో) అమల్లోకి వచ్చింది. ► ఢిల్లీ, తెలంగాణాల్లో ఏడు జిల్లాల్లో అమలు. ► ఆయా జిల్లాల్లోని వర్తకులు హాల్మార్కింగ్తో 14, 18, 22 క్యారెట్ల పసిడి ఆభరణాలనే విక్రయిస్తున్నారు. ► విజ్ఞప్తులు, విస్తృత స్థాయి సంప్రతింపుల నేపథ్యంలో కొన్ని వర్గాలను మాత్రం హాల్ మార్కింగ్ నుంచి కేంద్రం మినహాయించింది. ఉదాహరణకు రూ.40 లక్షలలోపు టర్నోవర్ ఉన్న వర్తకులు ఈ పరిధిలోకి రారు. ప్రభుత్వ వాణిజ్య విధానం ప్రకారం ఆభరణాల ప్రదర్శనలకు సంబంధించి ఎగుమతి, ఎగుమతులకూ ఈ నిబంధన వర్తించదు. ► నిజానికి 2000 ఏప్రిల్ నుంచీ పసిడి ఆభరణాలకు హాల్ మార్కింగ్ స్కీమ్ను బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియాన్ స్టాండెర్డ్స్) అమలు చేస్తోంది. పసిడి ఆభరాల్లో దాదాపు 40 శాతానికి మాత్రమే ప్రస్తుతం హాల్మార్కింగ్ అమలు జరుగుతోంది. ► భారత్లో మొత్తం నాలుగు లక్షల మంది ఆభరణాల వర్తకులు ఉన ఉన్నారు. వీరిలో కేవలం 35,879కి మాత్రమే బీఐఎస్ సర్టిఫై చేసినవారు. ► భారత్ దేశంలోకి సగటున 700 నుంచి 800 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది. ► అయితే కరోనా సవాళ్ల నేపథ్యంలో మార్చితో ముగిసిన 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి పసిడి దిగుమతులు పరిమాణంలో 2019–20తో పోల్చితే 12 శాతం పడిపోయి 633 టన్నులుగా నమోదయ్యింది. అయితే విలు వ రూపంలో చూస్తే, డిమాండ్ భారీగా 22.58 శాతం పెరిగింది. అంటే 2019–20తో పోల్చి 2020–21 విలువలో పసిడి దిగుమతుల విలువ 28.23 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు) నుంచి 34.6 బిలియన్ డాలర్ల (దాదాపు 2.54 లక్షల కోట్లు)కు చేరాయి. ► ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో బంగారం దిగుమతులు భారీగా పెరిగి 6.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దేశీయ కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.51,439 కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో బంగారం దిగుమతులు భారీగా క్షీణించి 79.14 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. విలువలో ఇది కేవలం 599 కోట్లు. ► పసిడి దిగుమతులు భారీగా పెరగడం దేశ ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం– వాణిజ్యలోటు పెరగడానికి దారితీయడం గమనార్హం. ఏప్రిల్, మేలలో ఈ వాణిజ్యలోటు 9.91 బిలియన్ డాలర్ల (2020 ఇదే నెలలతో పోల్చి) నుంచి 21.31 బిలియన్ డాలర్లకు చేరింది. -
బంగారం స్మగ్లింగ్కు ఇలా చెక్ పెట్టొచ్చు!
ముంబై: బడ్జెట్లో పసిడిపై కస్టమ్స్ డ్యూటీని 7.5 శాతానికి పరిమితం చేయడంతో అనధికార దిగుమతులు(గ్రే మార్కెట్) తగ్గే వీలున్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. కస్టమ్స్ తగ్గింపునకు తోడు డిమాండ్ బలపడుతుండటంతో స్మగ్లింగ్కు కొంతమేర చెక్ పడవచ్చని అభిప్రాయపడింది. 2021–22 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పసిడిపై కస్టమ్స్ డ్యూటీని నికరంగా 2.2 శాతం స్థాయిలో తగ్గించిన విషయం విదితమే. బడ్జెట్లో చేసిన తాజా ప్రతిపాదనల ప్రకారం గోల్డ్ బార్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీతోపాటు, వ్యవసాయ, ఇన్ఫ్రా సెస్, సామాజిక సంక్షేమ సర్చార్జీ కలగలిసి 10.75 శాతానికి చేరాయి. ఇవి బడ్జెట్కు ముందు 12.87 శాతంగా అమలయ్యేవి. వీటికి 3 శాతం జీఎస్టీ జత కలవనుంది. దీంతో 14.07 శాతానికి చేరే వీలుంది. అంతక్రితం 16.26 శాతంగా అమలయ్యేది. దేశీ గోల్డ్ మార్కెట్పై బడ్జెట్ ప్రభావం పేరుతో డబ్ల్యూజీసీ ప్రకటించిన నివేదిక ఇంకా ఇలా పేర్కొంది.. 80 శాతం డౌన్ 2020లో పసిడి అనధికార దిగుమతులు 80 శాతం పడిపోయి 20–25 టన్నులకు పరిమితమయ్యాయి. ఇందుకు కోవిడ్–19 కారణంగా లాజిస్టిక్స్ తదితర అవాంతరాలు ఎదురుకావడం ప్రభావం చూపింది. ఈ ఏడాది(2021)లోనూ విమానయానంపై ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలు, కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు దీనికి జత కలవనున్నాయి. వెరసి పసిడిలో అధికారిక దిగుమతులు పుంజుకునే వీలుంది. కాగా.. పసిడిపై దిగుమతి సుంకాలను క్రమబద్ధీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో చర్యలు తీసుకున్నట్లు డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చదవండి: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు కొత్తగా ముస్తాబైన మారుతి స్విఫ్ట్: ధర ఎంతంటే.. -
అక్షయ తృతీయ @ ఆన్లైన్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అక్షయ తృతీయ అనగానే బంగారం షాపుల ముందు క్యూ కట్టిన కస్టమర్ల దృశ్యాలు కళ్ల ముందు మెదులుతాయి. హిందువులు పవిత్ర దినంగా భావించే అక్షయ నాడు జువెల్లరీ దుకాణాల్లో హడావుడి అంతా ఇంతా కాదు. సెంటిమెంటుగా భావించి చిన్న మొత్తంలో అయినా సరే బంగారం కొనేందుకు షాపులకు వచ్చే కస్టమర్లుంటారు. అయితే కోవిడ్–19 పుణ్యమాని ఈసారి మాత్రం అక్షయ లాక్డౌన్లో చిక్కుకుంది. దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల దుకాణాలు మాత్రమే తెరిచిన సంగతి తెలిసిందే. బంగారం కొనాలంటే ఆన్లైన్ మినహా ప్రస్తుతం మరో మార్గం లేదు. పలు జువెల్లరీ సంస్థలు, పేమెంట్ యాప్స్ ద్వారా ఆభరణాలు, ముడి బంగారాన్ని కొనుక్కోవచ్చు. లాక్డౌన్ ముగిశాక ఈ పుత్తడిని కస్టమర్లు అందుకోవచ్చు. ఏప్రిల్ 26న అక్షయ తృతీయ. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47 వేలు దాటింది. సిద్ధమైన కంపెనీలు.. ఆభరణాలను, ముడి బంగారాన్ని అమ్మేందుకు జువెల్లరీ సంస్థలు, పేమెంట్ యాప్స్ సిద్ధమయ్యాయి. వ స్త్రాలతోపాటు బంగారాన్ని అమ్మే సంప్రదాయ రిటైల్ కంపెనీలు ఈసారి పుత్తడి అమ్మకాల నుంచి దూరమైనట్టే. ఇప్పటికే ఆన్లైన్లో విక్రయాలు సాగిస్తున్న కంపెనీలకే అక్షయ కలిసిరానుంది. కల్యాణ్ జువెల్లర్స్, లలితా జువెల్లర్స్, జోయాలుక్కాస్, జోస్ ఆలుక్కాస్, మలబార్, ఖజానా, తనిష్క్, బ్లూస్టోన్ వంటి కంపెనీలు అక్షయకు పోటీపడుతున్నాయి. డిస్కౌంట్లను సైతం ఇవి ఆఫర్ చేస్తున్నాయి. కస్టమర్లు ఈ కంపెనీల వెబ్సైట్లో తమకు కావాల్సిన నగలు, కాయిన్స్ను ఆన్లైన్లో డబ్బులు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. లాక్డౌన్ ముగిశాక నిర్దేశిత రోజుల్లో సమీపంలోని దుకాణానికి వెళ్లి కొనుగోలు చేసిన వస్తువును తెచ్చుకోవచ్చు. కస్టమర్ కోరితే ఇంటికే డెలివరీ చేస్తారు. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి పేమెంట్ యాప్స్ ద్వారా కూడా బంగారాన్ని బుక్ చేసుకోవచ్చు. అక్షయ వాటా 30–40 శాతం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 2019లో భారత్లో 690.4 టన్నుల పుత్తడి అమ్ముడైంది. ప్రస్తుత సంవత్సరం డిమాండ్ 700–800 టన్నులు ఉండొచ్చని కౌన్సిల్ గతంలో అంచనా వేసింది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో అంచనాలకు తగ్గట్టుగా అమ్మకాలు ఉండకపోవచ్చన్నది నిపుణుల మాట. 350–400 టన్నులకే పరిమితం అవొచ్చని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఎన్.అనంత పద్మనాభన్ తెలిపారు. సాధారణంగా మొత్తం విక్రయాల్లో అక్షయ వాటా 30–40% ఉంటుందని శారీనికేతన్ జువెల్లరీ విభాగం మేనేజర్ గుల్లపూడి నాగకిరణ్ కుమార్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కస్టమర్లలో కోవిడ్–19 తద నంతర పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఆందోళన ఉంది కాబట్టి కొనుగోళ్లకు మొగ్గు చూపరని అన్నారు. వినియోగదార్లలో 20–30% మంది ఆన్లైన్లో కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇక బంగారం కొనేద్దాం.. కొత్త రిటైల్ ఇన్వెస్టర్ల అభిప్రాయం: డబ్ల్యూజీసీ న్యూఢిల్లీ: అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి, ఫిన్టెక్ ఊతం, ఆర్థి కాంశాలపై పెరుగుతున్న అవగాహన తదితర అంశాల కారణంగా గతంలో ఎన్నడూ బంగారాన్ని కొనని వారు కూడా ప్రస్తుతం పసిడి కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. పుత్తడి పెట్టుబడుల్లో ఆభరణాలు, నాణేలదే అగ్రస్థానంగా ఉంటోంది. దేశీయంగా రిటైల్ ఇన్వెస్టర్ల అభిప్రాయాలపై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం సుమారు 29 శాతం మంది రిటైల్ ఇన్వెస్టర్లు భవిష్యత్లో పసిడిని కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 52 శాతం ఇన్వెస్టర్ల దగ్గర ఏదో ఒక రూపంలో బంగారం ఉండగా, 48 శాతం మంది గడిచిన 12 నెలల్లో పసిడిలో పెట్టుబడులు పెట్టారు. ‘భారత్లో రిటైల్ పెట్టుబడుల ధోరణులు మారుతున్నాయి. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఫైనాన్షియల్ టెక్నాలజీ విస్తృతి చెందుతుండటం, ఆర్థిక సాధనాలపై ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతుండటం ఇందుకు కారణం‘ అని డబ్ల్యూజీసీ భారత విభాగం ఎండీ సోమసుందరం పీఆర్ తెలిపారు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ధోరణులు.. సర్వే ప్రకారం.. పట్టణ ప్రాంత ఇన్వెస్టర్లలో సుమారు 76 శాతం మంది ఇప్పటికే బంగారంపై ఇన్వెస్ట్ చేయగా, 21 శాతం మంది గతంలో ఎన్నడూ కొనుగోలు చేయనప్పటికీ భవిష్యత్లో కొనాలని భావిస్తున్నారు. అటు గ్రామీణ ఇన్వెస్టర్లలో కొత్తగా కొనుగోలు చేయాలనుకుంటున్న వారి సంఖ్య 37 శాతంగా ఉంది. కొనుగోలు చేయడంలో సౌలభ్యం, పెట్టుబడికి భరోసా వంటి అంశాల కారణంగానే పసిడివైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. -
దేశీయంగా తగ్గనున్న డిమాండ్
ముంబై : పసిడిపై దిగుమతి సుంకాలను 10 శాతం స్థాయి నుంచి 12.5 శాతానికి పెంచిన నేపథ్యంలో దేశీయంగా బంగారానికి డిమాండ్ తగ్గే అవకాశాలు ఉన్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) పేర్కొంది. ఇది 2.4 శాతం దాకా తగ్గొచ్చని ఒక నివేదికలో వివరించింది. ఒకవేళ అధిక స్థాయి సుంకాలను శాశ్వత ప్రాతిపదికన కొనసాగించిన పక్షంలో దీర్ఘకాలికంగా వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గుదల ఒక మోస్తరుగా 1% స్థాయిలో వివరించింది. 2018లో భారత్లో పసిడి డిమాండ్ 760.4 టన్నులుగా ఉండగా... చైనాలో 994.3 టన్నులు. ఇక ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో చైనాలో డిమాండ్ 255.3 టన్నులుగా ఉండగా.. భారత్లో 159 టన్నులుగా ఉంది. మరోవైపు, భారత్, చైనా దేశాలు విస్తృతంగా వ్యవస్థాగత ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తుండటం దీర్ఘకాలికంగా పసిడి డిమాండ్కు ఊతమివ్వగలవని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వివరించింది. ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితి, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహా వివిధ సెంట్రల్ బ్యాంకుల ఉదార ఆర్థిక విధానాలతో వచ్చే ఆరు నుంచి పన్నెండు నెలల కాలంలో పసిడిలో పెట్టుబడులకు కొంత మద్దతు లభించగలదని గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. ఈ ఏడాది జూన్ 30 దాకా గణాంకాలను పరిశీలిస్తే పసిడిపై రాబడులు 10.2 శాతం మేర ఉన్నాయని వెల్లడించింది, అమెరికన్ బాండ్లు (5.2 శాతం), అంతర్జాతీయ బాండ్లు (5 శాతం), వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్లపై (9.2 శాతం) రాబడులతో పోలిస్తే ఇదే అత్యధికమని డబ్ల్యూజీసీ పేర్కొంది. -
సమీపకాలం ‘బంగారమే’!
ముంబై: బంగారం డిమాండ్ సమీప కాలంలో పటిష్టంగా ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక సూచిస్తోంది. ఈ ఏడాది (2019) డిమాండ్ పెరుగుదలకు పలు కారణాలు ఉంటాయని డబ్ల్యూజీసీ గురువారం విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. ఫైనాన్స్ మార్కెట్ల పనితీరు, భారత్సహా పలు దేశాల ద్రవ్య పరపతి విధానాలు, డాలర్ కదలికల వంటి అంశాలు పసిడి డిమాండ్ను నిర్ణయిస్తాయని వివరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► ఒడిదుడుకుల ఫైనాన్షియల్ మార్కెట్ల సమయంలో సహజంగా పసిడి పెట్టుబడులకు సురక్షితమైన మెటల్గా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రపంచం మొత్తంగా పసిడి డిమాండ్ చూస్తే, చైనా, భారత్సహా పలు వర్థమాన దేశాల వాటా 70 శాతంగా ఉంది. ► గత రెండేళ్లలో ప్రపంచంలో నెలకొన్న పలు అనిశ్చితి ఆర్థిక అంశాల ప్రభావం 2018 చివర్లో స్పష్టంగా కనిపించింది. ఇదే పరిస్థితితో 2019 సంవత్సరం కూడా ప్రారంభమైంది. ఆయా అంశాలు పసిడి డిమాండ్ను నిర్ణయిస్తాయి. ముఖ్యంగా సమీప భవిష్యత్లో పసిడి డిమాండ్ పెరుగుదలకే కొంత మొగ్గు ఉంది. ► మార్కెట్ అనిశ్చితి కొనసాగే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి. పలు దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక ఆర్థిక విధానాలను ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ఇది పసిడికి సానుకూల అంశమే. ► ఈ సందర్భంగా పసిడికి ప్రతికూలమైన వడ్డీరేట్ల పెరుగుదల, డాలర్ పటిష్టతను కూడా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. అయితే ఫెడ్ వడ్డీరేటు (ప్రస్తుతం 2.25–2.50 శాతం శ్రేణి) పెంపు స్పీడ్ తగ్గే అవకాశాలే కనిపిస్తుండటం పసిడికి సానుకూల అంశమే. ► వృద్ధి పెరిగినా, ఆ ఫలాలు అందరికీ అందుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇది పసిడి సెంటిమెంట్ను బలపరిచే అంశమే. ► ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు ఇదేరీతిన కొనసాగితే, 2019లో పసిడి ఆభరణాలకూ డిమాండ్ పటిష్టమవుతుందని కౌన్సిల్ భావిస్తోంది. ► పశ్చిమ దేశాల్లో వృద్ధి ధోరణి... వినియోగ సెంటిమెంట్ను బలపరిచే అంశం. -
భారత్లో పసిడి ధగధగలు..!
ముంబై: దేశంలో సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలంలో బంగారానికి పటిష్ట డిమాండ్ నమోదయ్యింది. ఈ కాలంలో 10 శాతం వృద్ధి నమోదయినట్లు (2017 ఇదే కాలంతో పోల్చితే) వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక తెలిపింది. పరిమాణం రూపంలో 183.2 టన్నులు. అయితే ప్రస్తుత పండుగల సీజన్లో మాత్రం బంగారం డిమాండ్ అంతంతే ఉండవచ్చని డబ్ల్యూజీసీ అంచనావేసింది. డాలర్ మారకంలో రూపాయి పతనం, అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతుండటం దీనికి ప్రధాన కారణమని విశ్లేషించింది. దీనితోపాటు దేశంలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సంబంధ సమస్యలూ ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. కౌన్సిల్ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) సోమసుందరం తెలిపిన ప్రధాన అంశాల్లో కొన్ని... ►విలువ రూపంలో చూస్తే, సెప్టెంబర్ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 14 శాతం పెరిగి రూ.50,090 కోట్లకు చేరింది. 2017 ఇదే త్రైమాసికంలో ఈ విలువ రూ.43,800 కోట్లు. త్రైమాసికంలో ప్రారంభంలో పసిడి ధరలు పన్నులతో కలసి 10గ్రాములు దాదాపు 29,000 కు పడిపోయింది. డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణమిది. ►ఇక రూపాయి పతనంతో ప్రస్తుతం ధరలు ఆరేళ్ల గరిష్ట స్థాయిలకు చేరాయి. 10 గ్రాములు పన్నుల కూడా లేకుండా ధర రూ.32,000–33,000 శ్రేణిలో తిరుగుతోంది. దీనితో మున్ముందు డిమాండ్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక డిమాండ్ పరంగా చూస్తే, ప్రధాన కొనుగోళ్ల రాష్ట్రమైన కేరళ వరదలుసహా పలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుండటం ఇక్కడ గమనార్హం. ►ఇక సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం ఆభరణాల డిమాండ్ 10 శాతం వృద్ధితో 134.8 టన్నుల నుంచి 148.8 టన్నులకు ఎగసింది. విలువ రూపంలో చూస్తే, 14 శాతం వృద్ధితో రూ.35,610 కోట్ల నుంచి రూ.40,690 కోట్లకు చేరింది. ► ఇక సెప్టెంబర్ త్రైమాసికంలో పెట్టుబడుల డిమాండ్ చూస్తే, 11 శాతం వృద్ధితో 31 టన్నుల నుంచి 34.4 టన్నులకు ఎగసింది. దీని విలువ మొత్తం రూ.8,200 కోట్ల నుంచి రూ.9,400 కోట్లకు చేరింది. ► కాగా పసిడి రీసైక్లింగ్ ప్రక్రియ పరిమాణం 13.85 శాతం తగ్గింది. 26.7 టన్నుల నుంచి 23 టన్నులకు చేరింది. ► త్రైమాసికంలో పసిడి దిగుమతులు 55 శాతం పెరిగాయి. 173 టన్నుల నుంచి 269 టన్నులకు ఎగశాయి. త్రైమాసికం ప్రారంభంలో పసిడి ధర తగ్గడం దీనికి కారణం. ► బంగారం దిగుమతులు ప్రస్తుత ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) 4 శాతం పెరిగాయి. విలువ రూపంలో 17.63 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2017 ఇదే కాలంలో ఈ విలువ 16.96 బిలియన్ డాలర్లు. ఆభరణాల పరిశ్రమ డిమాండ్ దీనికి నేపథ్యం. ► ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కొంత పసిడి కొనుగోలు చేసింది. తాజా గణాంకాల ప్రకారం భారత్ విదేశీ మారకపు నిల్వల్లో దాదాపు 20.23 బిలియన్ డాలర్ల పసిడి నిల్వలు ఉన్నాయి. తొమ్మిదేళ్లలో ఆర్బీఐ పసిడిని కొనుగోలు చేయడం మొదటిసారి. ► ఈ ఏడాది మొత్తంలో చూస్తే భారత్ పసిడి డిమాండ్ 700 నుంచి 800 టన్నుల శ్రేణిలో ఉంటుందని భావిస్తున్నాం. అంతర్జాతీయంగా స్థిరం... కాగా అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ సెప్టెంబర్ త్రైమాసికంలో స్థిరంగా ఉంది. కేవలం ఒక శాతం పెరుగుదలతో 958 టన్నుల నుంచి 964 టన్నులకు చేరింది. ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ల అవుట్ఫ్లోస్ దీనికి ప్రధాన కారణం. -
పసిడి కొనుగోళ్లకు తగిన సమయం!
ముంబై: ప్రస్తుత పరిస్థితులు పసిడి కొనుగోళ్లకు సరై న సమయంగానే కనిపిస్తోంది. విశ్లేషణలోకి వెళితే... పసిడికి పలు దేశాల కేంద్ర బ్యాంకుల నుంచి డిమాం డ్ పటిష్టంగా ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక ఒకటి తాజాగా పేర్కొంది. ఈ డిమాం డ్ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఈ మేరకు విడుదలైన ఒక నివేదికను చూస్తే... ♦ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో దేశీ మారక ద్రవ్య నిల్వల్లో పసిడి వాటా పెంచుకోవడంపై కేంద్ర బ్యాంకులు దృష్టి పెట్టాయి. ఇందులో ఎక్కువశాతం పసిడి రూపంలో ఉండాలనే విషయంపై దృష్టి పెట్టడం గమనార్హం. ♦ 2018 మొదటి ఆరు నెలల కాలంలో సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం పసిడికి 193.3 టన్నుల బంగారం అదనంగా చేరింది. 2017 ఇదే కాలంతో పోల్చిచూస్తే (178.6 టన్నులు) ఇది 8 శాతం అధికం. ♦ ఇప్పటికే పలు సెంట్రల్ బ్యాంకుల విదేశీ మారకపు నిల్వల్లో అమెరికా డాలర్లు భారీగా ఉన్నాయి. వీటికి పసిడితో కొంత రక్షణ కల్పించాలని కేంద్ర బ్యాంకులు భావిస్తున్నాయి. రష్యా, టర్కీ, కజికిస్తాన్ వంటి దేశాల సెంట్రల్ బ్యాంకుల ఇటీవలి చర్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ♦ 2015 తర్వాత ఈ స్థాయిలో పసిడికి కేంద్ర బ్యాం కుల నుంచి డిమాండ్ రావడం ఇదే తొలిసారి. ♦ ఈజిప్టు 1978 తరువాత మొట్టమొదటిసారి ఇటీవలే పసిడిని కొనుగోలు చేసింది. ఇండియా, ఇండోనేషియా, థాయ్లాండ్, ఫిలిప్పైన్స్ కూడా పలు సంవత్సరాల తర్వాత మళ్లీ పసిడి మార్కెట్లోకి పునఃప్రవేశిస్తున్నాయి. తొమ్మిదేళ్ల తర్వాత బంగారాన్ని కొన్న ఆర్బీఐ... రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) 2017–18 ఆర్థిక సంవత్సరంలో 8.46 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. తొమ్మిదేళ్లలో ఆర్బీఐ పసిడిని కొనుగోలు చేయడం మొదటి సారి. 2018 జూన్ 30 నాటికి ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు 566.23 టన్నులకు చేరాయి. 2017 జూన్ నాటికి ఉన్న నిల్వలు 557.77 టన్నులు మాత్రమే. చివరి సారిగా 2009లో 200 టన్నుల పసిడిని ఐఎంఎఫ్ నుంచి కొంది. కాగా దేశీయంగా రూపాయి బలహీన ధోరణి భారత్లో బంగారం తగ్గడానికి దోహదపడదని విశ్లేషణ. 400 బిలియన్ డాలర్లకు పెరిగిన ఫారెక్స్ నిల్వలు బంగారం నిల్వలు సైతం పెరుగుదల విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) సెప్టెంబర్ 14తో అంతమైన వారానికి 1.207 బిలియన్ డాలర్లు పెరిగి 400.489 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకుముందు వారంలో ఫారెక్స్ నిల్వలు 819 మిలియన్ డాలర్ల క్షీణతతో 399.282 బిలియన్ డాలర్లకు తగ్గిన విషయం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ 13తో ముగిసిన వారంలో నమోదైన 426 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు రికార్డు స్థాయి కాగా, ఆ తర్వాత నుంచి క్షీణత మొదలైంది. ఇక బంగారం నిల్వలు సైతం సెప్టెంబర్ 14తో ముగిసిన వారంలో 144 మిలియన్ డాలర్లు పెరిగి 20.378 బిలియన్ డాలర్ల విలువకు చేరినట్టు ఆర్బీఐ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. 1,200 డాలర్లు పటిష్టస్థాయి అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర గడిచిన నెల రోజులుగా 1,200 డాలర్ల వద్ద కదలాడుతోంది. పసిడికి ప్రస్తుత ధర అంతర్జాతీయంగా పటిష్ట మద్దతు స్థాయని అభిప్రాయం. రూపాయి బలహీనతల వల్ల ఇక భారత్లోనూ భారీగా తగ్గే అవకాశాలు ఏవీ కనిపించడం లేదు. విశ్లేషకుల అంచనాల ప్రకారం– 1,200 డాలర్ల ధర పసిడి ఉత్పత్తిదారులకు కొంత లాభదాయకమైనదే. అయితే ఈ స్థాయికన్నా కిందకు పడితే, ఉత్పత్తి... అందుకు అనుగుణంగా సరఫరాలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఇదే జరిగితే పసిడికి డిమాండ్ కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రస్తుత శ్రేణిలో మరో ఐదారు నెలలు 40 డాలర్ల అటు– ఇటుగా పసిడి కదలికలు జరిగే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. టెక్నికల్గా చూసినా, ఫండమెంటల్గా చూసినా, నిర్వహణా పరంగా అలోచించినా పసిడి ప్రస్తుతం ‘‘స్వీట్ స్టాప్’’అన్నది వాదన. గోల్డ్ ఈటీఎఫ్లలో చైనా పెట్టుబడిదారులు ఇటీవలి కాలంలో 68 డాలర్లు పెట్టుబడులు పెట్టారు. ఇది మూడు నెలల గరిష్ట స్థాయి కావడం ఇక్కడ గమనార్హం. ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ను చూస్తే, 89కి పడిన తర్వాత మళ్లీ 96ను చూసిన ఇండెక్స్ మళ్లీ ఆస్థాయిలో నిలదొక్కుకోలేక ప్రస్తుతం 93ను చూస్తుండడం ఇక్కడ గమనార్హం. -
పడిన పసిడి డిమాండ్
ముంబై: భారత పసిడి డిమాండ్ 2017–18 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 8 శాతం పడిపోయింది. డిమాండ్ 187.2 టన్నులుగా నమోదయ్యింది. 2016–17 ఇదే కాలంలో దేశీయ పసిడి డిమాండ్ 202.6 టన్నులు. ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సంబంధించి ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ (జీడీటీ) నివేదికలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఈ వివరాలను తెలిపింది. ధరలు అధికంగా ఉండటం, సీజనల్ అంశాలు దీనికి కారణం. ముఖ్యాంశాలు చూస్తే... ►ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో విలువ రూపంలో పసిడి డిమాండ్ రూ.52,692 కోట్లు. 2017 ఇదే త్రైమాసికంలో ఈ విలువ రూ. 52,750 కోట్లు. ►ఆభరణాలకు సంబంధించి పరిమాణ డిమాండ్ 8 శాతం తగ్గింది. 161 టన్నుల నుంచి 147.9 టన్నులకు పడిపోయింది. విలువలో ఒకశాతం తగ్గి రూ.41,925 కోట్ల నుంచి రూ.41,631 కోట్లకు తగ్గింది. ►పెట్టుబడుల డిమాండ్ పరిమాణంలో 5 శాతం తగ్గి 41.6 టన్నుల నుంచి 39.3 టన్నులకు పడింది. అయితే విలువలో మాత్రం 2 శాతం పెరిగి రూ.10,825 కోట్ల నుంచి రూ.11,061 కోట్లకు చేరింది. ► దేశంలో రీసైకిల్డ్ గోల్డ్ 8 శాతం పెరిగి 29.6 టన్నుల నుంచి 32 టన్నులకు ఎగసింది. ►పసిడి దిగుమతులు త్రైమాసికంలో 38 శాతం పడిపోయి 274 టన్నుల నుంచి 170 టన్నులకు పడిపోయింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో (జనవరి–జూన్)లో దిగుమతులు 13.51 శాతం తగ్గి 555 టన్నుల నుంచి 480 టన్నులకు పడ్డాయి. ► ఏడాది మొత్తంమీద దేశ పసిడి డిమాండ్ 700 నుంచి 800 టన్నుల శ్రేణిలో ఉంటుందని భావిస్తున్నట్లు డబ్ల్యూజీసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. దేశంలో పసిడి పరిశ్రమ స్థిరీకరణ దశలో ఉందనీ, దీర్ఘకాలంలో పరిశ్రమకు ఇది లాభిస్తుందన్నారు. అంతర్జాతీయంగా 4 శాతం పతనం కాగా అంతర్జాతీయంగా ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 4 శాతం పడింది. 964.3 టన్నులుగా నమోదయ్యింది. 2017 ఇదే కాలంలో ఈ డిమాండ్ 1,007.5 టన్నులు. -
వచ్చే మూడు దశాబ్దాలూ బంగారమే
ముంబై: వచ్చే మూడు దశాబ్దాలూ బంగారం మార్కెట్ సానుకూలంగానే ఉంటుందని ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) పేర్కొంది. 2048 నాటికి చైనా ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, భారత్ కూడా దాని అడుగుజాడల్లోనే అభివృద్ధి చెందనుండడంతో బంగారం వెలుగులు కొనసాగుతాయని అంచనా వేసింది. ప్రపంచంలో బంగారం వినియోగం అత్యధికంగా చైనా, భారత్లోనే ఉన్న విషయం తెలిసిందే. బంగారం డిమాండ్లో సగం ఆభరణాల రూపంలోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో నిరంతర అభివృద్ధి, చైనా, భారత్ తదితర వర్ధమాన దేశాల్లో మధ్య తరగతి వినియోగదారుల ప్రాతినిధ్యం పెరగడం బంగారం మార్కెట్కు సానుకూలతలుగా తన నివేదికలో పేర్కొంది. అయితే, బంగారం వెలుగులకు భౌగోళిక రాజకీయ పరంగా సవాళ్లు పొంచి ఉన్నాయని అభిప్రాయపడింది. అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలనూ ప్రస్తావించింది. అలాగే, యూరోప్లో దీర్ఘకాలం పాటు ఘర్షణ, పెరిగిపోతున్న వృద్ధ జనాభా అంశాలనూ ప్రతికూలతలుగా పేర్కొంది. పెరిగే ఆదాయాలే బంగారంపై పెట్టుబడుల డిమాండ్ను నడిపిస్తాయని, హెచ్చు, తగ్గులున్నప్పటికీ ఇది సానుకూలంగానే ఉంటుందని వివరించింది. టెక్నాలజీలోనూ బంగారం వినియోగం పెరుగుతుందని అంచనా వేసింది. బంగారానికి డిమాండ్ పెరిగినా, గతంతో పోలిస్తే సరఫరాలో పెరుగుదల నిదానంగానే ఉంటుందని అంచనా వేసింది. డాలర్ బలోపేతం... రూపాయి బలహీనత వంటి పరిణామాలు కొనసాగితే దేశంలో బంగారం ధరలు 11 గ్రాముల ధర రూ.34,000కు దీపావళి నాటికి చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 1,260–1,400 డాలర్ల మధ్య ట్రేడ్ కావొచ్చన్నారు. ద్రవ్యోల్బణంతో హెడ్జింగ్ కోసం బులియన్కు డిమాండ్ పెరగవచ్చని కూడా అంచనాలు ఉన్నాయి. -
భారత్లో ఆభరణాల డిమాండ్ బాగుంటుంది
ముంబై: ప్రస్తుతానికి కొంత మందగమనం ఉన్నప్పటికీ, భవిష్యత్తులో బంగారం ఆభరణాలకు భారత్లో డిమాండ్ పెరుగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనావేసింది. దేశంలో ప్రజల అభిరుచులు బంగారానికి డిమాండ్ పెంచుతుందని పేర్కొంది. ‘‘బంగారం 2049: వచ్చే 30 సంవత్సరాల్లో పసిడి ధోరణి’’ అన్న అంశంపై డబ్ల్యూజీసీ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. చైనాలో కూడా పసిడికి డిమాండ్ దీర్ఘకాలంలో బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఈ నివేదిక వ్యక్తం చేసింది. ముఖ్యాంశాలు చూస్తే... చైనాలో ఆదాయాలు పెరుగుతున్నాయి. వినియోగ ఆధారిత ఎకానమీగా చైనా రూపుదాల్చుతోంది. ఇక భారత్ విషయంలో పసిడి ప్రజల అభిరుచుల్లో ఒక భాగం. ఆయా అంశాలు ఇక్కడ పసిడికి డిమాండ్కు దోహదపడతాయి. భారత్లో గ్రామీణ ఆదాయాలు పెరగడానికి ప్రభుత్వ చర్యలు పసిడికి డిమాండ్ పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. భారత్ విషయంలో 25,000 టన్నుల పసిడి స్టాక్ను రీసైక్లింగ్ చేసే కార్యకలాపాలు చురుగ్గా సానుతున్నాయి. ఇది పసిడి దిగుమతులు తగ్గడానికి వీలుకల్పిస్తుంది. -
బంగారం మన దగ్గర మెరిసింది
ముంబై: భారతీయులకు బంగారం పట్ల ఉన్న మక్కువ అంతకంతకూ పెరిగిపోతోంది. 2017లో దేశీయంగా వినియోగం 9 శాతం పెరిగి 727 టన్నులుగా నమోదైంది. కానీ, అంతర్జాతీయంగా మాత్రం డిమాండ్ 7 శాతం పడిపోయింది. ఈ గణాంకాలను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) మంగళవారం విడుదల చేసింది. 2016లో దేశీయ బంగారం డిమాండ్ 666.1 టన్నులుగానే ఉంది. ‘‘2017లో డిమాండ్ ప్రధానంగా ఆభరణాల వల్లే పెరిగింది. నూతన పన్ను చట్టం జీఎస్టీ స్థిరపడటం, స్టాక్ మార్కెట్ల ర్యాలీ, జీడీపీ వృద్ధి ఇవన్నీ కలసి వినియోగదారుల సెంటిమెంట్ను మెరుగు పరిచాయి’’అని డబ్ల్యూజీసీ ఎండీ (భారత విభాగం) సోమసుందరం పీఆర్ తెలిపారు. ఆభరణాల కొనుగోళ్లకు యాంటీమనీ లాండరింగ్ చట్టాన్ని తొలగించడం కూడా డిమాండ్ పెరగడానికి దోహదపడినట్టు చెప్పారు. 2016లో ఆభరణాల డిమాండ్ 504.5 టన్నులుగా ఉండగా, 2017లో ఇది 12 శాతం పెరిగి 562.7 టన్నులకు చేరింది. విలువ పరంగా చూస్తే గతేడాది ఆభరణాల డిమాండ్ 9 శాతం వృద్ధితో రూ.1,48,100 కోట్లకు చేరింది. పెట్టుబడుల డిమాండ్ మాత్రం 2016లో 161.6 టన్నులు కాగా, 2017లో ఇది 164.2 టన్నులుగా నమోదైంది. రానున్న రెండేళ్ల కాలంలో కాయిన్ల వృద్ధి అధికంగా ఉంటుందని సోమసుందరం పేర్కొన్నారు. 2018లో డిమాండ్ విషయంలో తాము ఆశాభావంతో ఉన్నామని, 700–800 టన్నుల మధ్య ఉండొచ్చన్నారు. ఇక దిగుమతుల పరంగా చూస్తే 2017లో 888 టన్నుల బంగారం దిగుమతి అయింది. 2016లో ఉన్న 558 టన్నుల కంటే ఇది 59 శాతం అధికం. అంతర్జాతీయంగా ప్రతికూలత అంతర్జాతీయంగా చూస్తే 2017లో బంగారం వినియోగం గతేడాది 7 శాతం క్షీణతతో 4,071.7 టన్నులకు పరిమితమైంది. ఈటీఎఫ్ల్లోకి తక్కువ పెట్టుబడులు రావడమే కారణంగా డబ్ల్యూజీసీ తన నివేదికలో పేర్కొంది. 2016లో డిమాండ్ 4,362 టన్నులుగా ఉండటం గమనార్హం. పూర్తి సంవత్సరాన్ని గమనిస్తే ఏడాది అంతటా ఈటీఎఫ్లలోకి పెట్టుబడులు వచ్చినప్పటికీ 2016లో వచ్చిన నిధులతో పోలిస్తే మూడింట ఒక వంతుగానే ఉన్నాయని డబ్ల్యూజీసీ తెలిపింది. బంగారం కాయిన్లు, బార్ల డిమాండ్ సైతం 2% తగ్గింది. -
బిట్ కాయిన్లు పసిడికి పోటీ కాదు
న్యూఢిల్లీ: బిట్ కాయిన్ల వంటి క్రిప్టో కరెన్సీలు పసిడికి ప్రత్యామ్నాయం కాబోవని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) పేర్కొంది. సమర్థమైన పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలో వేల సంవత్సరాలుగా బంగారం కొనసాగుతోందని వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థలో క్రిప్టోకరెన్సీలు చోటు దక్కించుకున్నప్పటికీ... ఈ డిజిటల్ ప్రపంచం లోనూ ప్రధానమైన ఆర్థిక అసెట్గా బంగారం కొనసాగుతూనే ఉండగలదని తెలిపింది. డబ్ల్యూజీసీ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ విలువ ప్రస్తుతం 800 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని, 2017లో బిట్కాయిన్ విలువ ఏకంగా 13 రెట్లు పెరిగిందని డబ్ల్యూజీసీ పేర్కొంది. ‘‘ఇది చూసి ఇక రాబోయే రోజుల్లో బంగారం స్థానాన్ని క్రిప్టో కరెన్సీలు ఆక్రమించేస్తాయని కొందరు భావిస్తున్నారు. కానీ బంగారం, క్రిప్టోకరెన్సీలు రెండూ వేర్వేరు సాధనాలే తప్ప ఒకదానికి మరొకటి ప్రత్యామ్నాయం కాదన్నది మా అభిప్రాయం. పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో అర్థవంతమైన స్థానం ఉండటం, రేట్లు భారీ హెచ్చుతగ్గులకు లోనుకాకపోవడం, తక్షణం నగదు కింద మార్చుకునే వెసులుబాటు, నియంత్రణ వ్యవస్థల పరిధికి లోబడే ఉండటం వంటివన్నీ బంగారానికి సానుకూలాంశాలు. కానీ క్రిప్టో కరెన్సీలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. క్రిప్టోకరెన్సీల మార్కెట్ భారీగా ఉన్నప్పటికీ.. బంగారం, ఇతర కరెన్సీలతో పోలిస్తే లావాదేవీల పరిమాణం చాలా తక్కువ’’ అని డబ్ల్యూజీసీ వివరించింది. బంగారం మార్కెట్లో రోజూ 250 బిలియన్ డాలర్ల మేర ట్రేడింగ్ జరుగుతుండగా.. బిట్కాయిన్ లావాదేవీలు మాత్రం సగటున 2 బిలియన్ డాలర్ల స్థాయిలోనే ఉంటున్నాయని తెలియజేసింది. -
బంగారం ఎక్కువగా కొనేది వీరేనట!
బంగారానికి భారత్ లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. పట్టణ, గ్రామీణ ప్రాంతం వారు అనే తేడా లేకుండా బంగారం కొనుగోళ్లను భారీగా చేపడతారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్టు ప్రకారం 2017 తొలి క్వార్టర్ లో ప్రపంచవ్యాప్తంగా బంగారానికున్న డిమాండ్ కు, భారత్ గోల్డ్ డిమాండే మద్దతిచ్చిందని తెలిసింది. భారతీయుల బంగార ఆభరణాల కొనుగోళ్లు ప్రపంచ జువెల్లరీ డిమాండ్ లో ఐదవ స్థానంలో ఉన్నట్టు తేలింది. 2017 తొలి త్రైమాసికంలో భారత్ లో బంగారు జువెల్లరీ డిమాండ్ 92.3 టన్నులు కాగ, అమెరికాలో ఈ డిమాండ్ 22.9 టన్నులుగానే ఉంది. బంగారంలో పెట్టుబడులు కూడా భారీగానే పెరుగుతున్నాయి. కానీ ఏ రాష్ట్రంలో బంగారాన్ని ఎక్కువగా కొనుగోలుచేస్తున్నారో తెలుసుకోవాలని ఉందా? అక్షరాస్యతలో అన్ని రాష్ట్రాల కంటే ఎంతో ముందున్న కేరళ, బంగారం కొనుగోళ్లలోనూ ముందంజలో ఉందట. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీసు డేటా ఆధారంగా నెలవారీ తలసరి వ్యయంలో బంగారు ఆభరణాలపై కేరళ ఎక్కువగా వెచ్చిస్తుందని తేలింది. 2011-12లో వివిధ రాష్ట్రాలు వస్తువులు, సర్వీసులపై ఏ మేరకు గృహ వినియోగం చేపడుతున్నారో తెలుసుకునేందుకు ఈ సర్వే చేపట్టారు. కేవలం రాష్ట్రాల ఆధారితంగానే ఈ డేటాను రూపొందించారు. రూరల్ కేరళ కేవలం బంగారం కొనుగోళ్లపై ఎక్కువగా వెచ్చించడమే కాకుండా.. తలసరి వ్యయాన్ని కూడా ఆరు రెట్లు పెంచుకుంది. ఈ ర్యాంకింగ్స్ లో గోవా రెండో స్థానంలో నిలిచింది. నేషనల్ శాంపుల్ సర్వే నివేదించిన ఆరు రాష్ట్రాల డేటాలో కూడా కేరళ చాలా ఎక్కువగా బంగారం కొనుగోళ్లను చేపట్టింది. అర్బన్ ఇండియాలో మాత్రమే ఎక్కువగా బంగారు ఆభరణాలు కొనుగోళ్లు చేపడుతున్నారనే డేటాలకు విభిన్నంగా కేరళలో బంగారు కొనుగోళ్లు జరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల వారి కంటే కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వారే కేరళలో బంగారు ఆభరణాలు కొనుగోళ్లు చేపడుతున్నారు. మిగతా రాష్ట్రాల్లో మాత్రం అర్బన్ ప్రాంతం వారు ఎక్కువగా ఈ కొనుగోళ్లు చేశారు. ఈ నేపథ్యంలో బంగారంపై జీఎస్టీ రేటు తక్కువగా ఉండాలని కేరళ ముఖ్యమంత్రి కోరడంలో ఎలాంటి ఆశ్చర్యం అవసరం లేదని పలువురంటున్నారు. బంగారంపై ఇంకా జీఎస్టీ రేటును నిర్ణయించలేదు. అయితే బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో తక్కువ తలసరి బంగారం వినియోగం నమోదైంది. -
అక్షయ తృతీయపై వ్యాపారుల దృష్టి
బంగారం అమ్మకాలు 30 శాతం పెరుగుతాయని అంచనా ముంబై: అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 28వ తేదీన (శుక్రవారం) బంగారం అమ్మకాలు 30 శాతం పెరుగుతాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. శుభ దినంగా భావించే అక్షయ తృతీయనాడు గత ఏడాది ఇదే రోజుతో పోలిస్తే పసిడి అమ్మకాలు 20 నుంచి 30 శాతం మేర పెరుగుతాయని భావిస్తున్నట్లు అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య చైర్మన్ నితిన్ ఖండేల్వాల్ తెలిపారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) పీఆర్ సోమసుందరం కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. పెళ్లిళ్ల సీజన్, వీకెండ్లో రావడం కొనుగోళ్లకు మరీ కలిసి వస్తున్న అంశంగా పీఎన్ గాడ్జిల్ జ్యూయెలర్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ పేర్కొన్నారు. డీమోనిటైజేషన్ నుంచి వినియోగదారుల్లో పసిడి పట్ల మరింత సానుకూల ధోరణి ఏర్పడినట్లు భావిస్తున్నట్లు డబ్ల్యూహెచ్పీ జ్యూయెలర్స్ డైరెక్టర్ ఆదిత్య పాథే వివరించారు. ప్రస్తుత ధరలు ఇలా... ఇదిలావుండగా, అంతర్జాతీయ మార్కెట్– నైమెక్స్ ఫ్యూచర్స్లో కడపటి సమాచారం అందే సరికి ఔన్స్ (31.1గ్రా) ధర స్వల్ప నష్టంతో 1,264 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో రూ. 90 నష్టంతో రూ. 28,725 వద్ద ట్రేడవుతోంది. ఇక ముంబై స్పాట్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత పసిడి 10 గ్రాముల ధర బుధవారం కిత్రం రోజుతో పోల్చితే, రూ.205 తగ్గి రూ. 28,950 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర సైతం అంతే స్థాయిలో తగ్గి రూ.28,800 వద్దకు చేరింది. ఇక వెండి కేజీ ధర రూ. 555 తగ్గి రూ.40,980కి దిగింది. -
బంగారం డిమాండ్ పడిపోయింది!
న్యూఢిల్లీ : దేశీయంగా బంగారం డిమాండ్ పడిపోయిందట. 2016లో బంగారం డిమాండ్ 21 శాతం మేర పడిపోయి 675.5 టన్నులుగా నమోదైందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) వెల్లడించింది. భారత్లో బంగారం డిమాండ్ పడిపోవడానికి ప్రధాన కారణాలు జువెలరీ సమ్మె, పాన్ కార్డు అవసరాలు, డీమానిటైజేషనేనని డబ్ల్యూజీసీ పేర్కొంది. 2015లో బంగారం డిమాండ్ 857.2 టన్నులుగా ఉందని గోల్డ్ కౌన్సిల్ రివీల్ చేసింది. ఆభరణాల డిమాండ్ కూడా దేశంలో 22.4 శాతం క్షీణించిందని పేర్కొంది. 2015లో ఆభరణాల డిమాండ్ 662.3 టన్నులుగా ఉంటే, 2016కు వచ్చే సరికి ఈ డిమాండ్ 514 టన్నులుగా నమోదైందని తెలిపింది. ఆభరణాల పరిశ్రమ చాలా సవాళ్లను ఎదుర్కొంటుందని, ఇది డిమాండ్పై ప్రభావం చూపుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరమ్ పీఆర్ పేర్కొన్నారు. పాన్ కార్డు నిబంధన, జువెలరీపై ఎక్స్చేంజ్ డ్యూటీ, డీమానిటైజేషన్, ఆదాయపు పన్ను వెల్లడి పథకం డిమాండ్ను దెబ్బతీస్తుందన్నారు. కానీ ఇవన్నీ ఆర్థికవ్యవస్థను మరింత బలపర్చేలా చేస్తాయన్నారు. గోల్డ్ ఇండస్ట్రిలో పారదర్శకతను కూడా తీసుకొస్తాయన్నారు. నగదు కొరత గ్రామీణ ప్రాంతాన్ని ఎక్కువగా దెబ్బతీసిందని, కానీ ఈ ప్రభావం తాత్కాలికమేనని, మంచి రుతుపవనాలు బంగారం డిమాండ్కు మద్దతిస్తాయని వివరించారు. 2017లో బంగారం డిమాండ్ 650-750 టన్నుల వరకు ఉంటుందని సోమసుందరమ్ అంచనావేశారు. -
పండుగ సీజన్లో పసిడి వెలవెల..
డిసెంబర్ త్రైమాసికంలో 8 ఏళ్ల కనిష్టానికి డిమాండ్ వర్షాభావ పరిస్థితులతో తగ్గిన రైతుల ఆదాయాలు గ్రామీణ ప్రాంతాల్లో తగ్గిన కొనుగోళ్లు ముంబై: పెట్టుబడులపరమైన డిమాండ్ లేకపోవడం, వర్షాభావం వల్ల కరువుతో రైతుల ఆదాయాలు తగ్గిపోవడం తదితర అంశాల కారణంగా ఈసారి పండుగ సీజన్లో పసిడి అమ్మకాలు గణనీయంగా తగ్గనున్నాయి. డిసెంబర్ త్రైమాసికంలో పుత్తడి డిమాండ్ ఏకంగా 8 ఏళ్ల కనిష్టానికి పడిపోవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం సాధారణంగా ఈ త్రైమాసికంలో అయిదేళ్ల సగటు చూస్తే డిమాండ్ 231 టన్నులు ఉండగా, గతేడాది 201.6 టన్నులుగా ఉంది. అయితే, ఈసారి మాత్రం 150-175 టన్నులు మాత్రమే ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ ట్రేడ్ ఫెడరేషన్ డెరైక్టర్ బచ్రాజ్ బమల్వా తెలిపారు. వివాహాది శుభకార్యాలతో పాటు ధన్తేరస్, దీపావళి తదితర పండుగల సమయం కావడంతో దేశీయంగా పసిడి అమ్మకాల్లో మూడో వంతు విక్రయాలు డిసెంబర్ త్రైమాసికంలోనే జరుగుతుంటాయి. ఇక మూడింట రెండొంతుల డిమాండ్ గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంటుంది. అయితే, వాతావరణ మార్పులతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం రైతుల ఆదాయాలను తత్ఫలితంగా వారి కొనుగోలు సామర్థ్యాన్ని దెబ్బతీసింది. దీంతో పండుగ సీజన్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో పసిడికి డిమాండ్ అంతంతమాత్రంగానే నమోదైంది. ఈ పరిస్థితుల్లో డిసెంబర్ త్రైమాసికంలో పసిడి దిగుమతుల విలువ 5.7 బిలియన్ డాలర్ల స్థాయికి తగ్గొచ్చని పేర్కొన్నాయి. రూపాయి ఎఫెక్ట్ ..: అంతర్జాతీయంగా డాలర్ మారకంలో బంగారం రేట్లు అయిదేళ్ల కనిష్టానికి 9.3 శాతం మేర తగ్గినా.. ఇటు రూపాయి విలువా దాదాపు అయిదు శాతం క్షీణించడంతో భారత్లో పసిడి ధర తగ్గుదల 5.5 శాతానికి మాత్రమే పరిమితం అయ్యింది. ఇలా రేటు తగ్గాల్సిన స్థాయిలో తగ్గకపోవడం కూడా డిమాండ్పై ప్రభావం చూపినట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. ధర ఇంకా పెరుగుతుందన్న ఆశలు లేకపోవడం వల్ల పెట్టుబడుల కోసం చేసే కొనుగోళ్లు కూడా పెద్దగా జరగలేదని వివరించాయి. వెయ్యి టన్నులు దాటనున్న దిగుమతులు.. అంతర్జాతీయంగా రేట్ల తగ్గుదల ఊతంతో భారత్ దిగుమతులు ఈ ఏడాది ఆల్ టైమ్ గరిష్టం 1,000 టన్నుల స్థాయిని మించగలదని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ ట్రేడ్ ఫెడరేషన్ అంచనా వేసింది. 2014లో భారత్ 900 టన్నులు దిగుమతి చేసుకుంది. ధర తగ్గుదల ప్రయోజనాలు పొందేందుకు ఈ ఏడాది మరిన్ని దిగుమతులు జరుగుతున్నాయని ఫెడరేషన్ డెరైక్టర్ బచ్రాజ్ బమల్వా పేర్కొన్నారు. ఫెడరేషన్ గణాంకాల ప్రకారం జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో భారత్ 850 టన్నులు దిగుమతి చేసుకుంది. -
భారత్లో పసిడి డిమాండ్ కళకళ!
సెప్టెంబర్ క్వార్టర్లో 13% అప్ * 268 టన్నులుగా పేర్కొన్న డబ్ల్యూజీసీ నివేదిక * ప్రపంచ వ్యాప్తంగా 8 శాతం పెరుగుదల ముంబై: భారత్లో పసిడి డిమాండ్ ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) వార్షిక ప్రాతిపదికన 13 శాతం పెరిగింది. ఈ పరిమాణాన్ని 268 టన్నులుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) పేర్కొంది. త్రైమాసికం ప్రారంభంలో ధరలు తక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణమని గోల్డ్ డిమాండ్ ధోరణులపై విడుదల చేసిన ఒక నివేదికలో డబ్ల్యూజీసీ పేర్కొంది. పెళ్లిళ్లు, పండుగల సీజన్ కూడా డిమాండ్ పెరగడానికి కారణం. గత ఏడాది క్యూ3లో భారత్ పసిడి డిమాండ్ 238 టన్నులు. కాగా ప్రపంచ వ్యాప్తంగా పసిడి డిమాండ్ మూడవ త్రైమాసికంలో 7.3 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. పరిమాణంలో చూస్తే... ఇది 1,121 టన్నులు. గత ఏడాది 1,042 టన్నులు. డబ్ల్యూజీసీ భారత్ విభాగం మేనేజింగ్ డెరైక్టర్ సోమసుందరం తెలిపిన నివేదిక అంశాల్లో ముఖ్యమైనవి... * గతేడాది ఇదే కాలంలో భారత్ పసిడి డిమాండ్ 238 టన్నులు. విలువ రూపంలో.. డిమాండ్ 5.8% వృద్ధితోరూ.59,480 కోట్ల నుంచి రూ. 62,939 కోట్లకు ఎగసింది. * ఒక్క ఆభరణాల విషయంలో డిమాండ్ 15 శాతం పెరిగి 211 టన్నులుగా నమోదయ్యింది. విలువ 7.7% పెరిగి రూ.49,558 కోట్లుగా నమోదయ్యింది. ఒక్క త్రైమాసికాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే... ఆభరణాలకు భారీ డిమాండ్ 2008 క్యూ3లో చోటుచేసుకుంది. అప్పట్లో ఈ డిమాండ్ 213 టన్నులు. అటు తర్వాత ఈ స్థాయి డిమాండ్ ఇదే తొలిసారి. ఆభరణాలకు పసిడి డిమాండ్ భారీగానే ఉన్న విషయాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. * సెప్టెంబర్ త్రైమాసికంలో పెట్టుబడుల డిమాండ్ 6 శాతం వృద్ధితో 57 టన్నులుగా ఉంది. అయితే విలువల్లో మాత్రం అసలు వృద్ధి నమోదుకాకపోగా - 0.8 శాతం క్షీణించింది. రూ.13,484 కోట్ల నుంచి రూ.13,381 కోట్లకు పడింది. * ఇక సెప్టెంబర్ త్రైమాసికంలో దిగుమతులు 24 శాతం వృద్ధితో 243 టన్నుల నుంచి 301 టన్నులకు పెరిగింది. * దసరా, ధన్తెరాస్, దీపావళి పండుగల నేపథ్యంలో నాల్గవ త్రైమాసికంలోనూ డిమాండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పూర్తి ఏడాదికి డిమాండ్ 850-950 టన్నులు ఉండొచ్చు. గత ఏడాది డిమాండ్ 811 టన్నులు. మనదే మొదటి స్థానం... డిమాండ్ విషయంలో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. చైనా రెండవ స్థానంలో ఉంది. ముగిసిన త్రైమాసికంలో ఈ దేశంలో డిమాండ్ 212 టన్నుల నుంచి 239 టన్నులకు ఎగసింది. మూడవ స్థానంలో ఉన్న అమెరికాలో డిమాండ్ 36 టన్నుల నుంచి 59 టన్నులు ఎగసింది. జర్మనీ (25 టన్నుల నుంచి 33 టన్నులకు), థాయ్లాండ్ (23 టన్నులు) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ వ్యాప్త 1,121 టన్నుల డిమాండ్లో ఆభరణాలు, నాణేలు, కడ్డీలుసహా వినియోగ డిమాండ్ మొత్తం 14 శాతం పెరుగుదలతో 816 టన్నుల నుంచి 927 టన్నులకు ఎగసింది. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వరుసగా 19వ త్రైమాసికంలో నికర కొనుగోలుదారులుగా ఉన్నాయి. వీటి నుంచి ఈ త్రైమాసికంలో డిమాండ్ 175 టన్నులుగా ఉంది. -
మళ్లీ పసిడికి డిమాండ్!
ధర తగ్గుదలతో కొనుగోళ్లు పెరుగుతాయ్ ♦ పెళ్లిళ్లు, పండుగల సీజన్ ఊతం ♦ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక న్యూఢిల్లీ :ప్రతికూల వాతావరణ పరిస్థితులు గ్రామీణ ప్రాంతాలవారి ఆదాయాలపై ప్రభావం చూపడంతో ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్లో పసిడికి డిమాండ్ 25 శాతం తగ్గినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తెలిపింది. అయితే, ఇటీవలి కాలంలో ధరలు కూడా గణనీయంగా తగ్గడంతో ఈ ఏడాది ద్వితీయార్థంలో పసిడికి మళ్లీ డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయని గురువారం ఒక నివేదికలో వివరించింది. బంగారం వినియోగంలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారత్లో.. గతేడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్లో పసిడికి డిమాండ్ 204.9 టన్నులు ఉండగా ఈసారి మాత్రం 154.5 టన్నులకు పడిపోయింది. దిగుమతులు స్వల్పంగా తగ్గి 206.2 టన్నుల నుంచి 205 టన్నులకు క్షీణించాయి. గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే (372 టన్నులు) ఈ ఏడాది ప్రథమార్ధంలో పసిడి డిమాండ్ 7 శాతమే క్షీణించి 346.2 టన్నులుగా నమోదయ్యింది. ప్రస్తుత సంవత్సరం ప్రథమార్ధం ఎలా గడిచినప్పటికీ జూలై- డిసెంబర్ మధ్య కాలంలో మాత్రం పసిడికి డిమాండ్ మెరుగుపడగలదని భావిస్తున్నట్లు డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం తెలిపారు. గడిచిన కొన్ని వారాలుగా పసిడి రేట్లు తగ్గినందున కొనుగోలుదారులు మళ్లీ కొనడం మొదలుపెట్టడంతో సానుకూల డిమాండ్ నెలకొంటోందని ఆయన వివరించారు. సాధారణంగా ధరలపై ఎక్కువగా దృష్టి పెట్టే మార్కెట్లలో.. రేట్లు తగ్గడమనేది కొనుగోళ్లకు సరైన సమయంగా పరిగణించవచ్చని సోమసుందరం పేర్కొన్నారు. ఆసియా, మధ్యప్రాచ్య మార్కెట్లలో ధరల తగ్గుదలతో కొనుగోళ్లు పెరుగుతుంటాయని, ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇది కనిపిస్తోందని ఆయన వివరించారు. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో పెళ్లిళ్లు, పండుగలు ఉండనున్న నేపథ్యంలో ఆభరణాలకు డిమాండ్ ఉండగలదని డబ్ల్యూజీసీ తెలిపింది. డిమాండ్ మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ.. ఇదంతా వర్షపాతం సాధారణ స్థాయిలో ఉన్న పక్షంలోనే సాధ్యమని డబ్ల్యూజీసీ పేర్కొంది. ఆసియాలో 12% తగ్గిన పసిడి డిమాండ్ ఈ ఏడాది రెండో త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ క్యూ2) ఆసియాలో పసిడి డిమాండ్ 12 శాతం మేర క్షీణించి ఆరేళ్ల కనిష్టం 914.9 టన్నులకు పడిపోయిందని డబ్ల్యూజీసీ తెలిపింది. ప్రధాన మార్కెట్లయిన భారత్, చైనాలో డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణమని వివరించింది. గతేడాది క్యూ2లో 1,038 టన్నులకు డిమాండ్ నమోదైనట్లు డబ్ల్యూజీసీ నివేదికలో వెల్లడించింది. బంగారం... నెల గరిష్ట స్థాయి ముంబై: పసిడి జోరు వరుసగా ఆరవ రోజూ కొనసాగింది. ముంబై బులియన్ మార్కెట్లో ధర నెల గరిష్ట స్థాయికి చేరింది. అంతర్జాతీయంగా పలు దేశాల కరెన్సీ ప్రతికూలాంశాలు, పండుగ సీజన్లో ఆభరణ వర్తకుల డిమాండ్ దీనికి ప్రధాన కారణం. ఇక్కడి స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ.125 పెరిగి, రూ.25,875కు చేరింది. 22 క్యారెట్ల ధర కూడా అంతే మొత్తం పెరిగి రూ.25,725కు ఎగసింది. కాగా వెండి కూడా కేజీకి రూ.195 పెరిగి రూ.36,435కు చేరింది. -
హాల్మార్క్ ఉన్నా స్వచ్ఛతలో తేడాలు..
పసిడి సర్టిఫికేషన్పై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక న్యూఢిల్లీ : భారత్లో హాల్మార్క్ సర్టిఫికేషన్ ఉన్న పసిడి ఆభరణాల్లో సైతం నాణ్యతకు సంబంధించి వ్యత్యాసాలు ఉంటున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) వెల్లడించింది. ప్రస్తుతం 8 బిలియన్ డాలర్లుగా ఉన్న పసిడి ఆభరణాల ఎగుమతులను వచ్చే ఐదేళ్లలో 40 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలంటే హాల్మార్కింగ్ వ్యవస్థను మరింత మెరుగుపర్చుకోక తప్పదని పేర్కొంది. గోల్డ్ డిపాజిట్ స్కీము విజయవంతం కావాలన్నా కూడా ఇది కీలకమని ఒక నివేదికలో తెలిపింది. బంగారం స్వచ్ఛత ప్రమాణాలను తెలిపే హాల్మార్క్ సర్టిఫికేషన్ను వినియోగదారుల వ్యవహారాల శాఖలో భాగమైన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పర్యవేక్షిస్తోంది. హాల్మార్కింగ్ అన్నది ప్రస్తుతం తప్పనిసరి కాకుం డా స్వచ్ఛందంగానే ఉంటోంది. దేశీయంగా 30% ఆభరణాలకు హాల్మార్కింగ్ ఉంటున్నప్పటికీ.. వాటి నాణ్యత, కొన్ని హాల్మార్కింగ్ సంస్థల విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా ఉంటున్నాయని డబ్ల్యూజీసీ పేర్కొంది. ఫలితంగా కచ్చితమైన ప్రమాణాలున్న ఆభరణాలు 30 శాతం కన్నా ఇంకా తక్కువే ఉండొచ్చని వివరించింది. బీఐఎస్ వద్ద చాలినన్ని వనరులు లేకపోవడం వల్ల కూడా నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా అమలయ్యేలా చూడటంలో సమస్యలు ఎదురవుతున్నాయని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్ చెప్పారు. ఇక హాల్మార్కింగ్ సెం టర్లు సైతం మౌలిక సదుపాయాల కొరత, తక్కువ లాభదాయకత త దితర సమస్యలు ఎదుర్కొంటున్నాయని వివరించారు. దేశీయంగా బీఐఎస్ గుర్తింపు పొందిన హాల్మార్కింగ్ కేంద్రాలు 220 ఉన్నాయి. తీసుకోతగిన చర్యలు.. చాలా మంది కొనుగోలుదారులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి హాల్మార్కింగ్పై పెద్దగా అవగాహన ఉండటం లేదని డబ్ల్యూజీసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారుల్లో బంగారం హాల్మార్కింగ్ వల్ల ప్రయోజనాల గురించి అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని డబ్ల్యూజీసీ పేర్కొంది. బ్రిటన్ తరహాలో వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో హాల్మార్కింగ్ తప్పనిసరి చేయాలని డబ్ల్యూజీసీ తెలిపింది. -
బంగారం డిమాండ్లో భారత్దే పైచేయి
2015లో చైనాను అధిగమించవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా - జనవరి-మార్చి డిమాండ్ 15 శాతం వృద్ధి - అంతర్జాతీయంగా 7 శాతం క్షీణత ముంబై: మంచి వృద్ధి అంచనాల నేపథ్యంలో భారత్ బంగారం డిమాండ్ 2015లో చైనాకన్నా అధికంగా ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) పేర్కొంటోంది. రెండు దేశాల బంగారం డిమాండ్ 2015లో 900 నుంచి 1,000 టన్నుల శ్రేణిలో ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (క్యూ1-జనవరి నుంచి మార్చి) భారత్ బంగారం డిమాండ్లో 15 వృద్ధి నమోదయ్యిందని వివరించింది. 2014 ఇదే కాలంతో పోల్చితే డిమాండ్ పరిమాణం 167.1 టన్నుల నుంచి 191.7 టన్నులకు పెరిగిందని వివరించింది. ఇక అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ క్యూ1లో 7 శాతం క్షీణించిందనీ, విలువ 45 బిలియన్ డాలర్ల నుంచి 42 బిలియన్ డాలర్లకు తగ్గిందని వివరించింది. చైనా, టర్కీ, రష్యా వంటి దేశాల్లో డిమాండ్ భారీగా లేకపోవడం దీనికి కారణం. డబ్ల్యూజీసీ మేనేజింగ్ డెరైక్టర్ (ఇండియా) సోమసుందరం ఈ అంశాలను తెలిపారు. ముఖ్యాంశాలు... - విలువ రూపంలో భారత్ బంగారం డిమాండ్ క్యూ1లో 9 శాతం ఎగసి రూ.42.899 కోట్ల నుంచి రూ.46,731 కోట్లకు పెరిగింది. - 2015 మొదటి క్వార్టర్లో భారత్కన్నా చైనాలో బంగారం డిమాండ్ అధికంగానే ఉంది. ఇది 272.9 టన్నులుగా ఉంది. అయితే ప్రస్తుత, రాను న్న త్రైమాసికాల్లో భారత్ డిమాండ్ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. 2014 మొదటి క్వార్టర్లో చైనా బంగారం డిమాండ్ 293.8 టన్నులు. దీనితో పోల్చితే 2015 క్యూ1లో 7% క్షీణత. - క్యూ1లో భారత్ ఆభరణాల డిమాండ్ 22 శాతం వృద్ధితో 151 టన్నులకు చేరింది. అయితే ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ 6 శాతం క్షీణించి 41 టన్నులుగా ఉంది. విలువ రూపంలో చూస్తే, ఆభరణాలకు డిమాండ్ 16 శాతం వృద్ధితో రూ.36,761 కోట్లకు చేరింది. పెట్టుబడుల విలువ 11% తగ్గి రూ. 9,969 కోట్లకు చేరింది. -
26 వేలకు పసిడి ధర
ముంబై: ముంబైలో శనివారం పసిడి ధర రెండు వారాల కనిష్ట స్థాయికి చేరింది. 24 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.165 తగ్గి, రూ. 26,150కు వచ్చింది. ఇక 22 క్యారెట్ల ధర కూడా ఇదే పరిమాణంలో కిందకు దిగి, రూ. 26,000కు చేరింది. వెండి ధర కూడా కేజీకి రూ.580 తగ్గి, రూ.35,990కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ధోరణి దీనికితోడు దేశంలో 80:20 పథకం రద్దు పసిడి దర దిగిరావడానికి కారణం. దిగుమతి ఆంక్షలు సడలింపు వల్ల దేశంలో అధికారికంగా బంగారం సరఫరాలు మెరుగుపడతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ శనివారం పేర్కొంది. కాగా శుక్రవారం ట్రేడింగ్లో నెమైక్స్ క్రూడ్ బ్యారల్కు 66 డాలర్ల స్థాయి వద్ద ముగిసింది. -
డిమాండ్ బంగారమే..!
ముంబై: భారత్లో బంగారానికి డిమాండ్ తగ్గడం లేదు. దిగుమతి సుంకాలు తగ్గించకపోయినా, పుత్తడి డిమాండ్ తగ్గడం లేదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక పేర్కొంది. అయితే పెట్టుబడి పరంగా పుత్తడి ఆకర్షణ తగ్గుతోందని వివరించింది. భారత్లో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ కాలానికి బంగారం డిమాండ్ 39 శాతం వృద్ధి చెందిందని తెలిపింది. గత ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్కు 161.6 టన్నులుగా ఉన్న భారత్లో పుత్తడి డిమాండ్ ఆభరణాల అమ్మకాలు పెరగడం వల్ల ఈ ఏడాది ఇదే క్వార్టర్కు 39 శాతం వృద్ధితో 225.1 టన్నులకు పెరిగిందని వివరించింది. విలువ పరంగా చూస్తే ఈ డిమాండ్ 31 శాతం వృద్ధితో 42,830 కోట్ల నుంచి రూ.56,219 కోట్లకు పెరిగిందని పేర్కొంది. డబ్ల్యూజీసీ గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ పేరుతో వెలువడిన ఈ నివేదిక ప్రకారం..., ఆభరణాలకు డిమాండ్ 115 టన్నుల నుంచి 60 శాతం వృద్ధితో 183 టన్నులకు పెరిగింది. విలువ పరంగా చూస్తే రూ.30,347 కోట్ల నుంచి 51 శాతం వృద్ధితో రూ.45,682 కోట్లకు చేరింది. అయితే పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ మాత్రం 10% తగ్గింది. ఈ డిమాండ్ 47 టన్నుల నుంచి 42 టన్నులకు తగ్గింది. విలువ పరంగా చూస్తే ఇది రూ.12,483 కోట్ల నుంచి రూ.10,538 కోట్లకు తగ్గింది. పుత్తడి దిగుమతులపై ఆంక్షలు, సుంకాల పెంపు వంటి అంశాల కారణంగా గత ఏడాది జూలై-సెప్టెంబర్ కాలానికి బంగారం ఆభరణాలకు డిమాండ్ బాగా తగ్గింది. దీపావళి పండుగ సందర్భంగా డిమాండ్ పెరగడం, దేశంలో బంగారంపై ఉన్న సాధారణ మమకారాన్ని ప్రతిఫలిస్తోంది. కొత్త ప్రభుత్వం సుంకాలను తగ్గిస్తుందని, విధానాలను సరళీకరిస్తుందని అందరూ భావించారు. కానీ అలా జరగకపోయినప్పటికీ పుత్తడి డిమాండ్ పెరిగింది. పుత్తడి డిమాండ్పై దిగుమతి ఆంక్షల ప్రభావం స్వల్పమేనని పెరుగుతున్న ఈ డిమాండ్ సూచిస్తోంది. పైగా ఈ ఆంక్షల కారణంగా అక్రమ పద్ధతుల్లో బంగారం దేశంలోకి రావడం అధికమైంది. ఈ పూర్తి ఏడాదికి భారత్లో పుత్తడి డిమాండ్ 850-950 టన్నుల రేంజ్లో ఉండొచ్చు. సాధారణంగా అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్ సంప్రదాయకంగా పుత్తడికి కీలకమైన క్వార్టర్ అని చెప్పవచ్చు. దీంతో క్యూ3లో కంటే క్యూ4లో డిమాండ్ మరింతగా పెరగవచ్చు. దాదాపు సంవత్సర కాలం నుంచి తగ్గుతున్న ధరల కారణంగా డిమాండ్ మరింతగా పెరగవచ్చు. ధరల తగ్గుల ఇలాగే కొనసాగితే, పుత్తడి పెట్టుబడులు కూడా మరింతగా పెరుగుతాయి. క్యూ3లో అంతర్జాతీయంగా మాత్రం పుత్తడికి డిమాండ్ 953 కోట్ల టన్నుల నుంచి 2 శాతం క్షీణతతో 929 టన్నులకు తగ్గింది. చైనాలో ఆభరణాలకు డిమాండ్ తగ్గడమే దీనికి కారణం. ఆభరణాలకు డిమాండ్ 556 టన్నుల నుంచి 4 శాతం తగ్గి 534 టన్నులకు చేరింది. ఆర్థిక రికవరీ కారణంగా అమెరికా, ఇంగ్లాండ్ల్లో డిమాండ్ పటిష్టంగా ఉంది. చైనాలో ఈ డిమాండ్ 39 శాతం తగ్గింది. గత క్యూ3లో 102 టన్నులుగా ఉన్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల పుత్తడి కొనుగోళ్లు ఈ క్యూ3లో 93 టన్నులకు తగ్గాయి. కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం ఇది వరుసగా 15వ క్వార్టర్ కావడం విశేషం. బంగారం రీసైక్లింగ్ ఏడేళ్ల కనిష్టానికి చేరింది. -
ఆర్థిక వృద్ధికి పుత్తడి..
భారత్కు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సూచన ముంబై/న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని మెరుగుపర్చేందుకు పుత్తడిని వినియోగించాలని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) సూచించింది. ఉద్యోగాల కల్పనకు, నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు, ఎగుమతులు..ఆదాయాలను పెంచుకునేందుకు దీన్ని ఉపయోగించాలని పేర్కొంది. ముంబైలో రెండో అంతర్జాతీయ బులియన్ సదస్సు సందర్భంగా పరిశ్రమపై ఆవిష్కరించిన విజన్ 2020 నివేదికలో డబ్ల్యూజీసీ ఈ విషయాలు ప్రస్తావించింది. ప్రస్తుతం దేశీయంగా ఇళ్లల్లో, గుళ్లల్లో దాదాపు 22,000 టన్నుల మేర బంగారం ఉందని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం తెలిపారు. పసిడి ఎగుమతులు అయిదు రెట్లు పెంచడం, ఉపాధి అవకాశాలను రెట్టింపు చేయడం ద్వారా భారత్ను ప్రపంచ జ్యువెలర్గా తీర్చిదిద్దడం విజన్ 2020 లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సుమారు 8 బిలియన్ డాలర్లుగా ఉన్న బంగారు ఆభరణాల ఎగుమతులు అప్పటికల్లా 40 బిలియన్ డాలర్లకు చేర్చేలా భారత్ లక్ష్యం నిర్దేశించుకోవాలని డబ్ల్యూజీసీ నివేదిక పేర్కొంది. నిర్దిష్ట ధరకు మించిన ఆభరణాలకు హాల్మార్కింగ్ తప్పనిసరి చేయాలని సూచించింది. అలాగే, ఈ రంగంలోని వారికి శిక్షణ కల్పించేందుకు ‘కారీగర్ సంక్షేమ పథకం’ ఏర్పాటు చేయాలని తెలిపింది. గోల్డ్ టూరిజం సర్క్యూట్ను కూడా ప్రారంభించే అవకాశాలు పరిశీలించాలని పేర్కొంది. -
ద్వితీయార్థంలో పసిడి
న్యూఢిల్లీ: బలహీనమైన రుతుపవనాలు గ్రామీణ ప్రాంతాల్లో బంగారానికి డిమాండ్పై ప్రభావం చూపినప్పటికీ మొత్తమ్మీద మెరుగైన సెంటిమెంట్ కారణంగా ఈ ఏడాది ద్వితీయార్థం(జూలై - డిసెంబరు)లో పసిడికి పూర్వవైభవం వస్తుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) తెలిపింది. ‘ఈ ఏడాది ప్రథమార్థంలో 80:20 ఫార్ములా (దిగుమతుల్లో 20 శాతాన్ని ఎగుమతి చేయాలనే నిబంధన) పుత్తడి డిమాండ్పై ప్రభావం చూపింది. దిగుమతి సుంకాన్ని తగ్గిస్తారనీ, 10 గ్రాముల ధర మళ్లీ రూ.25 వేల స్థాయికి వస్తుందనీ ప్రజలు భావించారు. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికల ప్రభావం కూడా డిమాండ్పై పడింది...’ అని డబ్యూజీసీ ఎండీ పి.ఆర్.సోమసుందరం చెప్పారు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.28 వేల శ్రేణిలో ఉంది. గతేడాది ఏప్రిల్లో రూ.26,440గా ఉన్న ధర ఆగస్టులో రూ.34,600కు చేరింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం అయిపోయింది కాబట్టి దిగుమతి సుంకం తగ్గింపు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని సోమసుందరం తెలిపారు. -
గ్రామీణ భారతంలో పసిడికి తగ్గనున్న డిమాండ్
న్యూఢిల్లీ: గ్రామీణ భారతంలో ఈ ఏడాది పసిడికి డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండనుంది. వర్షపాతం అంతంత మాత్రంగానే ఉండటం.. పొదుపుపై ప్రతికూల ప్రభావం చూపనుండటమే ఇందుకు కారణం. అయితే, దీపావళి పండుగ సమయంలో మాత్రం బంగారానికి డిమాండ్ కాస్త మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ప్రభుత్వం పుత్తడి దిగుమతులపై ఆంక్షలెన్ని పెట్టినప్పటికీ దీర్ఘకాలిక డిమాండ్ స్థిరంగానే ఉండనుంది. గురువారం అసోచాం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) భారత విభాగం ఎండీ సోమసుందరం ఈ విషయాలు తెలిపారు. పసిడికి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు, అక్కడి రైతు కుటుంబాల నుంచే డిమాం డ్ ఉంటోంది. సాధారణంగా గ్రామీణ కుటుంబాలు తాము చేసే పొదుపులో సుమారు 7-8% మొత్తాన్ని బంగారం కొనేందుకు ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం వర్షపాతం మళ్లీ మెరుగయ్యేలా ఉన్నప్పటికీ.. గ్రామీణ కుటుంబాల పొదుపు మొత్తాలు తగ్గిపోతున్నాయి. ఈ ప్రభావం .. బంగారం డిమాండ్పై కూడా పడే అవకాశాలు ఉన్నాయని సోమసుందరం తెలిపారు. గతేడాది దేశీయంగా 974 టన్నులుగా ఉన్న పసిడి డిమాండ్ ఈ ఏడాది 850-950 టన్నులకు తగ్గొచ్చని పేర్కొన్నారు. పసిడి దిగుమతులపై ఆంక్షలను సడలించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన సూచించారు. మరోవైపు, హాల్మార్క్ ఆభరణాలకు విశిష్ట గుర్తింపు సంఖ్య(యూఐఎన్) జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) డెరైక్టర్ జనరల్ సునీల్ సోని తెలిపారు. కొనుగోలుదారు మోసపోయిన పక్షంలో సదరు ఆభరణాన్ని తయారుచేసినవారిని, హాల్మార్కింగ్ చేసిన వారిని పట్టుకునేందుకు దీనివల్ల వీలవుతుందన్నారు. -
మన దగ్గర 20,000 టన్నులు
చిన్నా చితకా వర్గాలను కష్టకాలంలో ఆదుకోవడమే కాకుండా..ఏకంగా దేశాన్ని కూడా బకాయిల చెల్లింపుల సంక్షోభం నుంచి గట్టెక్కించిన మహత్తర సాధనం బంగారం. ఇంతటి ఘనత కలిగిన పసిడి విషయంలో మన దేశ పరిస్థితి ఏమిటంటే.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం.. భారత్లో ఇళ్లల్లో కావొచ్చు, గుళ్లల్లో కావొచ్చు మొత్తం మీద అధికారికంగా, అనధికారికంగా 20,000 టన్నుల దాకా పసిడి ఉన్నట్లు అంచనా. దీని విలువ సుమారు 980-1,000 బిలియన్ డాలర్ల దాకా ఉంటుంది. ఇందులో కేవలం 2.79 శాతం అంటే సుమారు 558 టన్నులు మాత్రమే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఈ విషయంలో మన ఆర్బీఐ ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది. చైనాను దాటేసేవాళ్లం.. కొన్నాళ్ల క్రితం ఓ సాధువు (శోభన్ సర్కార్) కలగన్నట్లు ఉత్తర ప్రదేశ్లో 1,000 టన్నుల బంగారం బైటపడి ఉంటే.. అధికారికంగా పసిడి నిల్వల్లో మనం చైనాను కూడా దాటేసి ఉండేవాళ్లం. ఐఎంఎఫ్ని పక్కన పెట్టి దేశాల వారీగా లెక్కిస్తే ప్రస్తుతం 1,054 టన్నుల బంగారంతో చైనా అయిదో స్థానంలో ఉంది. భారత్లో ఇప్పటికే ఆర్బీఐ దగ్గరున్న 558 టన్నుల బంగారానికి వెయ్యి టన్నులు కూడా తోడై ఉంటే అధికారికంగా 1,558 టన్నుల పసిడి ఉంటుంది. తద్వారా 11వ స్థానం నుంచి చైనాని దాటి హైజంప్ చేసి ఉండే వాళ్లం. భారతీయులు సగటున రోజుకు 2.3 టన్నుల బంగారం (దాదాపు ఒక చిన్న ఏనుగు బరువంత) కొంటారని అంచనా. 2013 మార్చ్తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ సుమారు 830 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంది. పసిడి దిగుమతులను కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యలతో గత ఆర్థిక సంవత్సరంలో ఇది సుమారు 11% తగ్గి 750 టన్నుల మేర ఉండొచ్చని ప్రభుత్వం ఆశిస్తోంది. భారీగా పసిడిని దిగుమతులు చేసుకుంటున్నప్పటికీ.. ఎగుమతులు మాత్రం ఏటా 60-70 టన్నులు మాత్రమే ఉంటున్నాయి. దేవాలయాల్లో పసిడి.. దేవాలయాలు తమకి వచ్చే బంగారాన్ని పూర్తిగా దాచి పెట్టేయడం లేదు. కొన్ని ఆలయాలు.. కొంత భాగాన్ని లాకెట్లు వంటివి తయారు చేయించి కూడా విక్రయిస్తున్నాయి. గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం.. ఈ ఆలయానికి ఏటా రూ. 50 కోట్ల మేర ఆదాయం వస్తుండగా.. ఇందులో కొంత భా గం పసిడి రూపంలో ఉంటుంది. ఆలయం వద్ద 600 కేజీల బంగారం ఉండగా.. ఇందులో 500 కేజీలను కడ్డీల రూపంలో బ్యాంకులో డిపాజిట్ చేసి ఉంచింది. అయ్యప్ప.. శబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయానికి ఏటా భక్తుల కానుకల రూపంలో రూ. 105 కోట్ల ఆదాయం.. 15 కేజీల బంగారం వస్తుంది. కానుకగా వచ్చిన బంగారాన్ని ఆలయ ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. పసిడి పద్మనాభస్వామి.. కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో బయల్పడిన సంపద విలువ (పసిడి, వజ్రాభరణాలు మొదలైన వాటన్నింటితో పాటు) సుమారు రూ. 1 లక్ష కోట్ల పైగా ఉంటుందని లెక్కేశారు. ఈ సంపదతో ప్రపంచ దృష్టి ఒక్కసారిగా పద్మనాభస్వామి వైపు మళ్లింది. తిరుమల తిరుపతి.. తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి నెలా 80-100 కేజీల బంగారం, 100-120 కేజీల వెండి కానుకలుగా వస్తాయని అంచనా. బంగారు కడ్డీలు, నాణేలు, ఆభరణాల రూపంలో వెంకన్న సంపద సుమారు రూ. 70,000 కోట్ల పైచిలుకు పైనే ఉండొచ్చని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి వర్గాల కథనం. టీటీడీ ఎస్బీఐలో 2,250 కేజీల బంగారాన్ని డిపాజిట్ చేసింది. దీనిపై టీటీడీకి వడ్డీ కూడా వస్తోంది. -
భారీగా పడిన బంగారం డిమాండ్
ముంబై: బంగారం డిమాండ్ ప్రపంచ వ్యాప్తంగా 2013 సెప్టెంబర్తో ముగిసిన మూడవ క్వార్టర్లో భారీగా 21 శాతం పడిపోయింది. ఈ డిమాండ్ 860 టన్నులకు పరిమితం అయ్యింది. భారత్లో 32 శాతం పడిపోయి 148 టన్నులుగా (2012 మూడవ క్వార్టర్ డిమాండ్ 219 టన్నులు) నమోదయ్యింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజా గణాంకాలు ఈ అంశాలను వెల్లడించాయి. డబ్ల్యూజీసీ ఎండీ (ఇన్వెస్ట్మెంట్) మార్కస్ గ్రాబ్ వెల్లడించిన వివరాలు... కరెంట్ అకౌంట్ లోటు కట్టడి దిశలో భారత్ ప్రభుత్వం బంగారం దిగుమతుల కట్టడికి తీసుకున్న పలు చర్యలు మొత్తంగా డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణం. భారత్ బంగారం డిమాండ్ రెండవ క్వార్టర్లో 310 టన్నులుకాగా, ఇది మూడవ క్వార్టర్లో 52% పడిపోయి 148 టన్నులుగా నమోదయ్యింది. ఈటీఎఫ్ల అవుట్ఫ్లోస్ తక్కువగా ఉండడం పరిశ్రమలకు కొంత ఊరట కలిగించే అంశం. 2013 రెండవ క్వార్టర్లో ఈ అవుట్ఫ్లోస్ 402 టన్నులు కాగా, మూడవ క్వార్టర్లో ఇవి 119 టన్నులు మాత్రమే. గ్లోబల్ రీసైక్లింగ్ విభాగం సైతం 3వ క్వార్టర్లో 2012 ఇదే క్వార్టర్తో పోల్చితే 11 శాతం పడిపోయింది. అయితే భారత్లో ఇదే విభాగం ఐదు రెట్లు పెరిగి 61 టన్నులకు చేరింది. 2012 చివరి క్వార్టర్తో పోల్చితే 2013 చివరి క్వార్టర్లోనూ బంగారం డిమాండ్ తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే మూడవ క్వార్టర్ (జూలై-సెప్టెంబర్)తో పోల్చితే ‘సీజనల్ కారణాల రీత్యా’ డిమాండ్ కొంత మెరుగుపడవచ్చు. 2012 మూడవ క్వార్టర్తో పోల్చితే 2013 మూడవ క్వార్టర్లో భారత్లో మొత్తం ఆభరణాల డిమాండ్ 23 శాతం తగ్గి 136.1 టన్నుల నుంచి 104.7 టన్నులకు పడింది. విలువ రూపంలో ఇది రూ.39,880 కోట్ల నుంచి రూ.27,749 కోట్లకు తగ్గింది. పెట్టుబడుల విభాగం డిమాండ్ 48 శాతం తగ్గి 83 టన్నుల నుంచి 43.5 టన్నులకు పడిపోయింది. విలువ రూపంలో ఇది రూ.24,320 కోట్ల నుంచి రూ. 11,529 కోట్లకు పడింది. దిగుమతుల సుంకం మరింత తగ్గింపు... దేశంలో 10 శాతం కస్టమ్స్ సుంకాల విధింపునకు ప్రాతిపదిక అయిన పసిడి దిగుమతుల టారిఫ్ విలువను వరుసగా రెండవరోజు గురువారం కూడా ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ స్వల్పంగా తగ్గించింది. ఈ విలువను 10 గ్రాములకు 417 డాలర్ల నుంచి 414 డాలర్లకు కుదించింది. వెండికి సంబంధించి కూడా ఈ విలువను కేజీకి 738 డాలర్ల నుంచి 672 డాలర్లకు తగ్గించింది. అంతర్జాతీయంగా ధర దిగువముఖ ధోరణి నేపథ్యంలో బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. -
బంగారం ధర మరింత దిగొచ్చే చాన్స్
న్యూఢిల్లీ: బంగారం, వెండి దిగుమతి టారిఫ్ విలువలను ప్రభుత్వం తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్లలో వీటి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత వారం వరకూ 458 డాలర్లుగా ఉన్న 10 గ్రాముల బంగారం దిగుమతి టారిఫ్ విలువను తాజాగా 432 డాలర్లకు(26 డాలర్లు) తగ్గించింది. ప్రతీ పదిహేను రోజులకొకసారి ప్రభుత్వం దిగుమతి టారిఫ్ విలువను నిర్ణయిస్తుంది. దీని ఆధారంగా కస్టమ్స్ సుంకాన్ని (ప్రస్తుతం 10 శాతం) వసూలు చేస్తారు. ఇక వెండి దిగుమతి టారిఫ్ విలువను కేజీకి 783 డాలర్ల నుంచి 736 డాలర్లకు తగ్గించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ రెండింటితో పాటు మరికొన్ని వస్తువుల దిగుమతి టారిఫ్లను కూడా సీఈబీసీ తగ్గించింది. ముడి పామాయిల్ దిగుమతి టారిఫ్ విలువను టన్నుకు 833 డాలర్ల నుంచి 827 డాలర్లకు, బ్రాస్ స్క్రాప్కు టన్నుకు 3,748 డాలర్ల నుంచి 3,717 డాలర్లకు తగ్గించింది. ఇక ముడి సోయాబిన్ ఆయిల్ దిగుమతి టారిఫ్ విలువను టన్నుకు 951 డాలర్ల నుంచి 963 డాలర్లకు, ఆర్బీడీ పామోలిన్ విలువను టన్నుకు 882 డాలర్ల నుంచి 883 డాలర్లకు పెంచింది. గత వారంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1.7 శాతం తగ్గి 1,308.6 డాలర్ల వద్ద ముగిసింది. న్యూఢిల్లీలో కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి రూ.30,300కు చేరింది. తాజాగా బంగారం దిగుమతి టారిఫ్ విలువ తగ్గింపు ఫలితంగా పుత్తడి ధర సుమారుగా రూ.165 తగ్గవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే ధర రూ. 300 తగ్గింది. దీంతో నేడు 10 గ్రాముల బంగారం ధర కనీసం రూ. 460 తగ్గొచ్చని అంచనా. -
డిమాండ్ బంగారమే!
న్యూఢిల్లీ: భారత్ బంగారం వినియోగం 2013 రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) 310 టన్నులు. గడచిన పదేళ్ల కాలంలో ఒక క్వార్టర్లో ఎప్పుడూ భారత్లో ఇంతస్థాయిలో బంగారం వినియోగం లేదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) గురువారం విడుదల చేసిన ఒక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. బంగారం దిగుమతులను నియంత్రించి తద్వారా కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ-క్యాడ్) తీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వం, ఆర్బీఐలు పలు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. క్యాపిటల్ ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిధుల మధ్య వ్యత్యాసాన్ని క్యాడ్గా పరిగణిస్తారు. ఏప్రిల్లో ధరలు భారీగా పడ్డాన్ని ప్రజలు కొనుగోళ్లకు అవకాశంగా భావించడం, దీనితోపాటు పెళ్లిళ్ల సీజన్ వంటి కారణాలు ఈ క్వార్టర్లో పసిడి వినియోగం పెరగడానికి ప్రధాన కారణం. 2012 ఇదే క్వార్టర్లో బంగారం కొనుగోళ్లు 181.1 టన్నులు. అంటే 2013 ఇదే క్వార్టర్లో దాదాపు 71 శాతం వినియోగ డిమాండ్ పెరిగిందని డబ్ల్యూజీసీ తాజా నివేదిక తెలిపింది. గడచిన పదేళ్ల కాలంలో బంగారం డిమాండ్లో రెండవ క్వార్టర్ రికార్డును నమోదు చేసినట్లు డబ్ల్యూజీసీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. దిగుమతులు 338 టన్నులు...: రెండవ క్వార్టర్లో దిగుమతులు రెట్టింపై 338 టన్నులుగా నమోదయ్యాయి. ఇదే కాలంలో ఆభరణాలకు సంబంధించి డిమాండ్ 50% పెరిగి 188 టన్నులుగా నమోదయ్యింది. 2012 ఇదే క్వార్టర్లో ఈ పరిమాణం 124 టన్నులు. కడ్డీలు, నాణేల వినియోగం 56.5 టన్నుల నుంచి 122 టన్నులకు ఎగసింది. క్యాడ్ కట్టడికి ఇతర మార్గాలూ ఉన్నాయ్ కాగా క్యాడ్ కట్టడికి బంగారం దిగుమతులపై నియంత్రణలే మార్గం కాదని సోమసుందరం పేర్కొన్నారు. ‘క్యాడ్ను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇతర మార్గాల ద్వారా కూడా దీనిని నియంత్రించవచ్చని మేము విశ్వసిస్తున్నాం’’ అని ఆయన అన్నారు. వ్యవస్థాగతంగా, అధికారిక మార్గాల ద్వారా గోల్డ్ లిక్విడిటీని (పసిడి బీరువాలకే పరిమితం కాకుండా, దేశీయంగా సరఫరాలు పెరిగేలా చూడ్డం)మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ, ఇది దీర్ఘకాలిక లక్ష్యంగా ఉండాలని సూచిం చారు. తద్వారా ఆర్థికాభివృద్ధికి బంగారాన్ని సైతం సమర్థవంతంగా వినియోగించుకోడానికి వీలవుతుందని సూచించారు. ఈ దిశలో విధానపరమైన నిర్ణయం ఉండాలని సూచించారు. దేశంలో కోట్లాదిమంది గృహస్తుల వద్ద దాదాపు 20,000 టన్నులకు పైగా బంగారం నిల్వలు ఉన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ... దీనిని వారు వ్యూహాత్మక అసెట్గా పరిగణిస్తున్నారని అన్నారు. వర్తమానం, భవిష్యత్పై అంచనా...: భారత్ బంగారం డిమాండ్ ప్రస్తుత క్వార్టర్లో (జూలై-సెప్టెంబర్) కొంత మందగించే అవకాశం ఉందని సోమసుందరం విశ్లేషించారు. బంగారం దిగుమతుల కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ విధానపరమైన నిర్ణయాలు దీనికి కారణమని తెలిపారు. అయితే పెళ్లిళ్లు, పండుగల సీజన్ నేపథ్యంలో నాల్గవ క్వార్టర్లో మాత్రం (అక్టోబర్-డిసెంబర్) డిమాండ్ పరిస్థితి సానుకూలంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. తగిన వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపించడం కూడా నాల్గవ క్వార్టర్లో బంగారం డిమాండ్ పెరగడానికి దోహదపడవచ్చని నివేదిక అభిప్రాయపడింది. మొత్తంమీద 2013 క్యాలెండర్ ఇయర్లో బంగారం దిగుమతులు 900 నుంచి 1000 టన్నుల శ్రేణిలో నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషించింది. భారత్ను అధిగమించనున్న చైనా.. ఈ ఏడాది బంగారం డిమాండ్లో భారత్ను చైనా అధిగమించే అవకాశం ఉందని డబ్ల్యూజీసీ అంచనావేసింది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరం తొలి 6 నెలల్లో చైనాలో బంగారం వినియోగం 570 టన్నులని తెలిపింది. భారత్ వినియోగం(566.6 టన్నులు)తో పోల్చితే ఇప్పటికే ఇది కొంత అధికంగా ఉందని వివరించింది. గత కొన్నేళ్లుగా చైనా పసిడికి అనుకూలమైన విధానాన్ని అనుసరించడం దీనికి కారణమని తెలిపింది. బంగారం ధరలు భవిష్యత్తులో స్థిరంగా, కొంత ఎగువముఖ ధోరణిలోనే కొనసాగే అవకాశం ఉందని రెండు దేశాల వినియోగదారులూ భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. భారత్ తరహాలోనే చైనాలో కూడా పటిష్ట రిటైల్ వినియోగ ధోరణి ఉండడం వల్ల ఆ దేశంలో కూడా ఈ ఏడాది పసిడి డిమాండ్ 900 నుంచి 1,000 టన్నుల శ్రేణిలో ఉంటుందని డబ్ల్యూజీసీ నివేదిక అంచనా వేస్తున్నట్లు సోమసుందరం తెలిపారు. 2012లో చైనాలో బంగారం వినియోగం 832 టన్నులుకాగా, భారత్లో ఈ పరిమాణం 864 టన్నులు. చైనా తన డిమాండ్ అవసరాల్లో సగం దేశీయ సరఫరాల ద్వారానే నెరవేర్చుకుంటోందని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా భారత్ తన పసిడి డిమాండ్కు ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోందని వివరించారు. ప్రపంచ ఆభరణాల మార్కెట్లో 60%పైగా వాటా ఈ రెండు దేశాలదేనన్నారు. కడ్డీలు, నాణేల డిమాండ్ విషయంలో ప్రపంచ మార్కెట్లో వాటా దాదాపు 50 శాతమని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ల నుంచి రిటర్న్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం, ప్రత్యామ్నాయ పొదుపు పథకాలు లేకపోవడంతో ప్రజలు బంగారం కొనుగోళ్లవైపు మొగ్గుచూపుతున్నట్లు విశ్లేషించారు. స్మగ్లింగ్పై పటిష్ట నిఘా! బంగారం దిగుమతుల కట్టడికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో- పుత్తడి స్మగ్లింగ్ పెరగకుండా కేంద్ర ఆర్థిక నిఘా సంస్థలు, కస్టమ్స్ శాఖలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. సంబంధిత వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం- పాసింజర్లు, వాణిజ్య రవాణాలపై నిఘా మరింత పెరగనుంది. ఎయిర్పోర్టులు, అంతర్జాతీయ సరిహద్దుల్లో సంబంధిత అన్ని సంస్థల సిబ్బంది సమన్వయంతో అక్రమరవాణా అప్రమత్త వ్యవస్థను పటిష్టం చేయనున్నట్లు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు తెలిపాయి.