● 674 మంది హాజరు ● ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికై న వారి నుంచి డిక్లరేషన్
ఆదిలాబాద్టౌన్: ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భాగంగా డీఎస్సీ–2024 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శనివారం ముగిసింది. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసి ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఫలితాలను ప్రకటించి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. మెరిట్ లిస్టు ద్వారా 1:3 ప్రకారం అభ్యర్థుల సర్టిఫికెట్లను నాలుగు రోజుల పాటు పరిశీలించారు. ఈ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఈనెల 9న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు.
ముగిసిన ప్రక్రియ..
ఈనెల 2 నుంచి సర్టిఫికెట్ల పరిశీలనను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో చేపట్టారు. 1:3 పద్ధతిలో మొత్తం 760 మందిని కౌన్సెలింగ్కు పిలిచారు. 664 మంది హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 324 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎస్జీటీలో 228 భర్తీ చేయనుండగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం 439 మంది హాజరయ్యారు. స్కూల్ అసిస్టెంట్ 80 పోస్టులు ఉండగా 190 మంది, భాషా పండిత పోస్టులు 14 ఉండగా 32 మంది హాజరయ్యారు. అలాగే రెండు పీఈటీ పోస్టులకు ఇద్దరు హాజరయ్యారు.
40 మంది నుంచి డిక్లరేషన్..
ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు మెరిట్ సాధించిన అభ్యర్థుల నుంచి విద్యాశాఖ అధికారులు డిక్లరేషన్ తీసుకున్నారు. ఒక అభ్యర్థి నాలుగు పోస్టులకు, ఏడుగురు అభ్యర్థులు మూడు పోస్టులకు మెరిట్ సాధించారు. అలాగే రెండు పోస్టులకు 47 మంది మెరిట్ సాధించినట్లు డీఈవో ప్రణీత తెలిపారు. అయితే 40 మంది అభ్యర్థుల డిక్లరేషన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో మిగతా పోస్టులో ఉన్న తర్వాతి అభ్యర్థులకు మేలు జరగనుంది. పోస్టులు సైతం పూర్తిస్థాయిలో భర్తీ కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment