ద్వారకాతిరుమల: మండలంలోని ఎం.నాగులపల్లి పంచాయతీ ద్వారకా నగర్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది చిరుత పులా... లేక బావురు పిల్లా అనే అనుమానాలు కలుగుతున్నాయి. శనివారం రాత్రి స్థానిక వీరాంజనేయ దాబా సమీపంలో చిరుత పులి సంచరించినట్లు అందిన సమాచారంపై పోలీస్, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి జంతువు పాదముద్రలను సేకరించారు.
అవి ఉన్న తీరును బట్టి జాడలు చిరుత పులివేనని అధికారులు ప్రాథమికంగా అంచనాకి వచ్చారు. ఈ నేపథ్యంలో ద్వారకా నగర్, భీమడోలు, పొలసానిపల్లి తదితర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, టాంటాం ద్వారా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటవీశాఖ, పోలీస్ అధికారులు ఆదివారం సైతం పులి జాడను కనుగొనేందుకు వేటను కొనసాగించారు. ద్వారకానగర్ శ్రీకార్తీకేయ ఫ్లైయాష్ బ్రిక్స్ ఫ్యాక్టరీ ప్రాంతంలో జంతువు పాదముద్రలను సేకరించారు. పరీక్షల నిమిత్తం వాటిని రాజమండ్రిలోని ల్యాబ్కి పంపారు. సమీప రైతు కరణం శ్రీనివాసరావు ఈ ప్రాంతంలో సంచరిస్తుంది చిరుత పులి కాదని, బావురు పిల్లి అని చెబుతున్నారు.
తమ కోళ్ల మకాం వద్ద రాత్రి సమయాల్లో ఎక్కువగా ఆ పిల్లి సంచరిస్తుందని, పదేళ్లుగా ఇక్కడే ఉంటుందని తెలిపారు. శనివారం సాయంత్రం కూడా బావురుపిల్లి కనిపించిందని, చిరుతను పోలి ఉన్న ఆ పిల్లిని చూసి అంతా భయాందోళన చెందారని అన్నారు. అటవీశాఖ అధికారులను తన కోళ్ల మకాం వద్దకు తీసుకెళ్లి ఆ పిల్లి జాడలను కూడా శ్రీనివాసరావు చూపాడు. దాంతో అక్కడ ఉన్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే రాజమండ్రి ల్యాబ్కి పరీక్షల నిమిత్తం పంపిన పాదముద్రల ఫలితాలు వచ్చే వరకు తామేమి చెప్పలేమని అటవీశాఖ అధికారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment