Ambarish
-
పులి ముందు ఎలుకలా నిల్చున్నది ఎవరు?
సాక్షి, బెంగళూరు: దివంగత నటుడు అంబరీశ్ ముందు జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి చేతులు కట్టుకుని నిలబడిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై కుమార గురువారం స్పందిస్తూ నేను ప్రజల ముందు కూడా చేతులు కట్టుకుని నిలబడతాను, ఈ విషయానికి అంత ప్రాధాన్యం అవసరం లేదు అన్నారు. ఆడపిల్లపై ప్రస్తుతం చర్చ వద్దని, ఎన్నికల సమయంలో మాట్లాడతానని ఎంపీ సుమలతను ఉద్దేశించి అన్నారు. కాగా ప్రముఖ నటి, మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీశ్ గురించి కుమారస్వామి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మండ్య జిల్లాలోని కేఆర్ఎస్ డ్యామ్ గేట్ల లీకేజ్ని అరికట్టడానికి ఎంపీని అడ్డుగా పడుకోబెడితే సరిపోతుందంటూ ఆయన వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఇందుకు సుమలత ఘాటుగానే స్పందించారు. ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి స్థాయికి దిగజారి మాట్లాడితే ఆయనకు, తనకూ తేడా ఉండదని చురకలు అంటించారు. అదే విధంగా కేఆర్ఎస్ డ్యామ్ విషయం గురించి మాట్లాడుతూ.. కుమారస్వామి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని, మండ్యా జిల్లాలోని శ్రీరంగ పట్టణ తాలుకాలో అక్రమ గనుల తవ్వకాలు తాను ఆపేయాలని ఆదేశించినట్లు సుమలత పేర్కొన్నారు. ఈ విషయంలో కుమారస్వామి అవినీతి వైపు నిలబడి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో కుమారస్వామి వర్సెస్ సుమలత అన్నట్లుగా అనుచర వర్గాలు సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి తెర తీశారు. ఈ నేపథ్యంలో సుమలత- అంబరీష్ ఫ్యాన్స్ కుమార- అంబి పాత ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘పులి ముందు ఎవరు ఎలుకలా నిలబడ్డది ఎవరు? ఇప్పుడు ఆయన మహిళల గురించి ఏం మాట్లాడుతున్నారు’’ అంటూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. -
తొలి పౌరాణిక 3డీ చిత్రం ‘కురుక్షేత్రం’
బాహుబలి సినిమా ఘనవిజయం సాధించటంతో ఇతర భాషల్లోనూ భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించేందుకు దర్మక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా జానపద పౌరాణిక చిత్రాలను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే బాటలో కన్నడ నాట తెరకెక్కిన భారీ పౌరాణిక గాథ కురుక్షేత్రం. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను వృషభాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై మునిరత్న నిర్మిస్తున్నారు. భారీ తారగణం, సెట్స్, గ్రాఫిక్స్ రూపొందుతున్న ఈ సినిమాకు నాగన్న దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ను బుధవారం రిలీజ్ చేశారు. కురుక్షేత్ర సంగ్రామానికి భీజం వేసిన ఘటనల నేపథ్యంలో ఈ ట్రైలర్ను రూపొందించారు. దివంగత నటుడు అంభరీష్ భీష్ముడిగా నటించిన ఈ సినిమాలో దర్షన్ దుర్యోధనుడిగా కనిపించాడు. కర్ణుడిగా అర్జున్, ధర్మరాజుగా శశి కుమార్, ద్రౌపదిగా స్నేహా, అర్జునుడిగా సోనూసూద్, అభిమన్యుడిగా నిఖిల్, శకునిగా రవికుమార్, కృష్ణుడిగా రవిచంద్రన్లు నటించారు. -
సుమలత కీలక వ్యాఖ్యలు..!
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి, దివంగత నటుడు అంబరీష్ భార్య సుమలత పొలిటికల్ ఎంట్రీ గురించి కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అంబరీష్ దూరమైన విషాదం నుంచి ఇంకా కోలుకోనప్పటికీ.. ప్రజల ఒత్తిడి మేరకు తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో తన భర్త అంబరీష్ ప్రాతినిథ్యం వహించిన మాండ్య పార్లమెంట్ స్థానం నుంచే ఎన్నికల బరిలో దిగాలని ఆమె భావిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ తరపున టికెట్ ఆశిస్తున్నారు. అయితే కర్ణాటకలో జేడీఎస్- కాంగ్రెస్ కూటమి అధికారం పంచుకుంటోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయమై మాండ్య స్థానాన్ని జేడీఎస్కు కేటాయించే అవకాశం ఉందని కాంగ్రెస్ కీలక నేత, మంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సుమలత పేర్కొన్నారు. ఈ క్రమంలో ‘మీకు పరోక్షంగా మద్దతు ఇస్తామ’ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సుమలతకు ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం.(సర్జికల్ స్ట్రైక్స్పై మాట్లాడను.. ఆమెకు టికెట్ కష్టమే!) కాగా సుమలత భర్త అంబరీష్ మాండ్య జిల్లాలోనే జన్మించారు. 1994లో రాజకీయాల్లో అడుగు పెట్టిన ఆయన సొంత నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలుపొందారు. 1998, 99, 2004లో మాండ్యకు ప్రాతినిథ్యం వహించారు. నటుడిగా, సమాజ సేవకుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన అంబరీష్కు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చరిష్మా ఉంది. ఈ నేపథ్యంలో మాండ్య నుంచి పోటీ చేస్తే సుమలత తప్పక గెలుస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి(కన్నడ నటుడు) రాజకీయ ప్రవేశం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కూడా మాండ్య నుంచే పోటీచేయాలని భావిస్తున్నారు. ఒకవేళ నిఖిల్ బరిలో దిగితే సుమలతకు టికెట్ రాదనే విషయం సుస్పష్టమే. ఈ నేపథ్యంలో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే మద్దతు ఇస్తామని బీజేపీ లీకులివ్వడంతో మాండ్యలో పోరు రసవత్తరంగా మారనుంది. (బరిలో మనవళ్లు.. ఢీ అంటే ఢీ?!) -
అంబరీష్కు కన్నీటి వీడ్కోలు
-
లాంఛనాలతో అంబరీష్ అంత్యక్రియలు
సాక్షి బెంగళూరు/ యశవంతపుర: కన్నడ రెబెల్ స్టార్, మాజీ మంత్రి అంబరీశ్కు అభిమానులు, సినీరంగ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. సోమవారం అంబరీశ్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో, అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. అభిమానుల ఒత్తిడి మేరకు ఆదివారం అంబరీశ్ పార్థివ దేహాన్ని ఆయన సొంత జిల్లా అయిన మండ్యకు తరలించారు. మండ్యలోని విశ్వేశ్వరయ్య క్రీడా మైదానంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆదివారం రాత్రంతా అభిమానులు ఆయనను కడసారి చూసుకున్నారు. అనంతరం సోమవారం ఉదయం 11.30 గంటలకు సైనిక హెలి కాప్టర్ ద్వారా బెంగళూరుకు తరలించారు. ఈ సంద ర్భంగా సతీమణి సుమలత, తనయుడు అభిషేక్ మండ్య మట్టిని తీసి అంబరీశ్ నుదుటన తిలకంగా దిద్దారు. తర్వాత బెంగళూరు కంఠీరవ స్టేడియంలో ఉంచగా సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వీఐపీలకు అంబరీశ్ కడచూపునకు అనుమతించారు. భారీగా తరలివచ్చిన అభిమానులు సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన అంబరీశ్ అంతిమయాత్రకు భారీగా అభిమానులు తరలివచ్చారు. కంఠీరవ స్టూడియాలో కన్నడ సూపర్స్టార్ రాజ్కుమార్ సమాధికి సమీపంలోనే అంబరీశ్ భౌతికకాయానికి చితిని పేర్చారు. అంబరీష్ పార్థివదేహంపై కప్పిన త్రివర్ణ పతాకాన్ని సీఎం కుమారస్వామి.. సుమలతకు అందజేశారు. తన యుడు అభిషేక్ తండ్రి చితికి నిప్పంటించారు. -
‘అర్ధాంతరంగా వదిలేసి వెళ్లిపోతావని అనుకోలేదు’
కన్నడ నటుడు అంబరీష్ మృతితో దక్షిణాది సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగు, తమిళ భాషల సీనియర్ నటులతో ఎంతో సన్నిహితంగా ఉండే అంబరీష్ మృతిపట్ల సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తమిళ హీరో రజనీకాంత్ ఇప్పటికే అంబరీష్ భౌతికకాయానికి నివాళి అర్పించారు. తెలుగు సీనియర్ హీరో మోహన్బాబు అంబరీష్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ భావోద్వేగ సందేశాన్ని విడుదల చేశారు. ‘35 ఏళ్ల స్నేహాన్ని ఇలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్లిపోతావని ఎప్పుడూ అనుకోలేదు.. నా ప్రతీ విజయంలో తోడుగా ఉన్న నువ్వు ఈ రోజు లేవు అంటే నమ్మడానికి మనసు కష్టంగా అనిపిస్తుంది.. నువ్వు లేవన్న నిజం తెలుసుకుని మనసు నమ్మనంటుంది.. మూడున్నర దశాబ్ధాల మన ఈ స్నేహంలో నాకు ఎన్నో తీపి జ్ఞాపకాలు మిగిల్చి ఈ రోజు నువ్వు వెళ్లిపోయావు. నీవు లేవని అంతా చెబుతున్నా నాకు మాత్రం ఎప్పుడూ నాలోనే ఉంటావని తెలుసు. స్నేహం అంటే ఎలా ఉంటుంది అని ఎవరైనా అడిగితే అది మనలాగే ఉంటుందని చూపిస్తాను.. అంత గొప్ప స్నేహాన్ని నువ్వు నాకు ఇచ్చావు. ప్రతీ చిన్న విషయంలోనూ తోడుగా ఉన్న నువ్వు.. ఈ రోజు ఇలా నన్ను ఒంటరి చేసి వెళ్లిపోవడం బాధగానే ఉన్నా.. నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. నీ ప్రాణ స్నేహితుడు’ అంటూ మోహన్ బాబు అంబరీష్తో తనకున్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. (కన్నడ నటుడు అంబరీశ్ ఇక లేరు) దక్షిణాది సినీ పరిశ్రమకు తీరని లోటు : కృష్ణం రాజు మరో సీనియర్ హీరో కృష్ణంరాజు కూడా అంబరీష్ మృతికి సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. ‘చిరకాల మిత్రుడు, కన్నడ రెబెల్ స్టార్ అంబరీష్ ఆకస్మిక మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది.అంబరీష్ మరణం దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. అంబరీష్ గొప్ప రాజకీయ నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన మృతిపట్ల వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా’నన్నారు కృష్ణంరాజు. -
ప్రముఖ నటుడు అంబరీష్ కన్నుమూత
సాక్షి, బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు, కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి అంబరీశ్ (66) మరణించారు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో శనివారం రాత్రి 10.45 గంటల సమయంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. అంబరీశ్కు గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేపట్టినా కోలుకోలేకపోవడంతో అంబరీశ్ ఇక లేరని వైద్యులు ప్రకటించారు. ప్రఖ్యాత నటుడిగా పేరుతెచ్చుకున్న అంబరీశ్ 200కు పైగా చిత్రాల్లో నటించారు. పలుమార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా, ఎంపీగానూ ఎన్నికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు కూడా చేపట్టారు. యూపీఏ–1 ప్రభుత్వ హయాంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కొన్ని నెలలపాటు సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కర్ణాటకలో సిద్ధరామయ్య మంత్రివర్గంలోనూ పనిచేసి ఈ ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల్లో అనారోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకున్నారు. అంబరీశ్ మరణవార్త తెలుసుకున్న వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, జలవనరుల శాఖ మంత్రి డీకే శివకుమార్, కన్నడ నటులు పునీత్ రాజ్కుమార్, యశ్లు ఆసుపత్రికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మండ్య జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంలో 30 మంది దుర్మరణం పాలై కన్నడనాట విషాదం తాండవిస్తున్న సమయంలో అదే జిల్లాకు చెందిన కన్నడిగుల ఆరాధ్య నటుడు కూడా మృత్యు ఒడికి చేరడంతో విషాదం రెట్టింపయ్యింది. మండ్యకు చెందిన అంబరీశ్ సినిమా, రాజకీయ రంగాల్లో రాణించారు. శాండల్వుడ్లో రెబెల్స్టార్గా ప్రసిద్ధి చెందారు. అంబరీశ్కు భార్య సుమలత, కొడుకు అభిషేక్ ఉన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి 1952 మే 29న మండ్య జిల్లా మద్దూరు తాలుకా దొడ్డరాసినకెరెలో అంబరీశ్ జన్మిం చారు. అసలు పేరు మలవల్లి హుచ్చేగౌడ అమర్నాథ్. తండ్రిపేరు హుచ్చేగౌడ, తల్లి పేరు పద్మమ్మ. వారికి అంబరీశ్ ఆరో సంతానంగా జన్మించారు. 1994లో రాజకీయాల్లో అడుగు పెట్టారు. 1998, 99, 2004లో మండ్య నుంచి ఎంపీగా గెలిచారు. 2012లో కేపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 2005లో ఎన్టీఆర్ ఫిల్మ్ ఫేర్ అవార్డు పొందారు. 2009లో ఫిల్మ్ఫేర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. కన్నడలో 205 చిత్రాల్లో నటించారు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో తెలుగు, కన్నడ, తమిళ, మలయాళంలో కలిపి మొత్తం 230 సినిమాల్లో నటించారు. 1972లో విడుదలైన తన తొలి చిత్రం నాగరహావు సినిమాకే అంబరీశ్ జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. 1981లో రాజకీయ నాయకులు, పోలీసుల అవినీతిపై వచ్చిన ‘అంత’ అనే సినిమాలో నటించి ప్రశంసలందుకున్నారు. 1992లో ప్రముఖ తెలుగు నటి సుమలతను అంబరీశ్ వివాహం చేసుకున్నారు. ఆయన చివరి చిత్రం ‘అంబి నింగ్ వయసాయ్’. అంబరీశ్ ఇక లేరనే విషయం తెలియగానే కన్నడ చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన అభిమానులు ఆస్పత్రి వద్దకు భారీ స్థాయిలో తరలివచ్చారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆత్మీయున్ని కోల్పోయా..! సూపర్ స్టార్ రజనీకాంత్ అంబరీష్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ‘మానవతావాది, నా ప్రాణ స్నేహితుడు అంబరీష్ను కోల్పోయాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అని రజనీ ట్వీట్ చేశారు. A wonderful human being ... my best friend ... I have lost you today and will miss you ... Rest In Peace #Ambrish — Rajinikanth (@rajinikanth) November 24, 2018 -
మళ్లీ రిలీజ్ కానున్న నాటి సంచలనం
బొమ్మనహళ్లి: అలనాటి సూపర్ హిట్ సినిమా ‘నాగరహావు’ నేటి డిజిటల్ ధ్వని, కొంగొత్త హంగులతో ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో శోభన్బాబు, లక్ష్మి నటించిన ‘కోడెనాగు’ చిత్రానికి మాతృక అయిన ఈ కన్నడ సినిమా సరిగ్గా 46 ఏళ్ల కిందట విడుదలై అనేక రికార్డులను తిరగ రాయడమే కాకుండా అవార్డుల పంట పండించింది. ఈ ఒక్క సినిమాతోనే హీరో విష్ణువర్ధన్ నటుడుగా భారీ బ్రేక్ సాధించి అగ్రనటుడు డాక్టర్ రాజ్ కుమార్ సరసన స్థానాన్ని సైతం సంపాదించాడు. చిత్ర నిర్మాత తనయుని తపనతో... ఈ చిత్ర నిర్మాత ఎన్.వీరాస్వామి కుమారుడు బాలాజీ ఆలోచనతో సినిమా మరోసారి రూపుదిద్దుకుంది. కొత్త టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తిరిగి రూపొందిస్తే ఎలాగుంటుందని తన సోదరుడైన నటుడు రవిచంద్రన్ను అడిగానని, ఆయన తనను ప్రోత్సహిస్తూ, వెంటనే పనిని ప్రారంభించమన్నారని బాలాజీ తెలిపారు. ఈ చిత్రానికి కొత్త హంగులను దిద్దాలనుకున్నప్పుడు ప్రింట్లు మాత్రమే దొరికాయని, చెప్పారు. వెతగ్గా వెతగ్గా చెన్నైలోని జెమిని ల్యాబ్స్లో నెగటివ్ లభ్యమైందని తెలిపారు. కొత్త హంగులను సమకూర్చడంలో 60 మంది సాంకేతిక నిపుణులు రెండేళ్ల పాటు శ్రమించారని చెప్పారు. మొత్తానికి ఈ నాగరహావు విభిన్న దృశ్య అనుభవాన్ని పంచుతుందని చెప్పారు. గత నెలలో యూట్యూబ్లో టీజర్ను విడుదల చేయగా ఇప్పటికి 11 లక్షల మందికి పైగా వీక్షించారు. అప్పట్లో నాగరహావును 35 ఎంఎంలో విడుదల చేయగా, ఇప్పుడు సినిమా స్కోప్లో విడుదల కానుంది. 1972లో సంచలనం 1972లో విడుదలైన ఈ చిత్రం విష్ణువర్ధన్కు సూపర్ స్టార్డమ్ను తెచ్చింది. అప్పటి వరకు రంగ స్థల, కళా చిత్రాల నటుడుగా మాత్రమే పరిచయమైన విష్ణువర్ధన్కు ఈ సినిమాలో హీరోగా అవకాశం లభించింది. ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు పుట్టన్న కనగాల్ అప్పట్లో కళా, వాణిజ్య చిత్రాల వారధిగా వ్యవహరిస్తున్నారు. విష్ణువర్ధన్నే కాదు ఈ చిత్రంలో ఆయన అంబరీశ్ను కూడా పరిచయం చేశారు. ఇక ఆ సినిమాలో చామయ్య మాస్టారుగా నటించిన కేఎస్. అశ్వత్ పేరు ప్రతి ఇంటా ప్రతి ధ్వనించేది. నటీమణులు ఆరతి, జయంతిలకు కూడా ఈ సినిమా ఎంతో పేరు ప్రతిష్టలను తెచ్చి పెట్టింది. ఈ చిత్రంలోని పాటలు ఈనాటికీ సూపర్ హిట్ అంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో ఈ సినిమాను హిందీలో జహ్రీలా ఇన్సాన్, తమిళంలో రాజ నాగం పేరిట రీమేక్ చేశారు. అభిమానులకు పండుగే నాగరహావు చిత్రం ఓ కళా ఖండం. దీనిని పునః సృష్టించారు. విష్ణువర్ధన్ అభిమానులకు కచ్చితంగా ఇది పండుగ సీజనే. ఈ సినిమా రజతోత్సవాన్ని జరుపుకుంటుందనే విశ్వాసం నాకుంది. – భారతి, అలనాటి హీరోయిన్, విష్ణువర్ధన్ సతీమణి ఓబవ్వ పాత్రను సవాల్గా తీసుకున్నా ఈ సినిమాలో ఓబవ్వ పాత్రను తొలుత కల్పనకు ఇవ్వజూపారు. చిన్న పాత్ర అనే కారణంతో ఆమె తిరస్కరించింది. అనంతరం పుట్టన్న నన్ను అడిగారు. దీనినో సవాలుగా భావించి నేను ఒప్పుకున్నాను. శత్రు సేనలను తుదముట్టించే వీర నారిగా ఓబవ్వను వర్ణిస్తూ రాసిన పాట పుట్టన్న ఊహల్లోంచి పుట్టింది. ఈ పాటను విన్నప్పుడల్లా నాకు కొత్త గీతంగానే అనిపిస్తూ ఉంటుంది. – జయంతి, అలనాటి నటి, ఓబవ్వ పాత్రధారి -
కాంగ్రెస్కు కుదుపు
నామినేషన్ల దాఖలుకు మరొక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ నేత, హీరో అంబరీష్ పోటీకి నో అంటున్నారు. ఆరోగ్య కారణాలను ఇందుకు చూపుతున్నా, ఆయనకు పార్టీ సీనియర్లతో తీవ్ర పొరపొచ్చాలే వచ్చినట్లున్నాయి. సాక్షి, బెంగళూరు:ప్రతిష్టాత్మక ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు పెద్ద సంకటం వచ్చిపడింది. మండ్య నుంచి పోటీ చేసే విషయం ఎటూ తేల్చకుండా కాంగ్రెస్పార్టీకి, ముఖ్యంగా సీఎం సిద్ధరామయ్యకు తలనొప్పిగా మారిన రెబల్స్టార్ అంబరీశ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని సిద్దరామయ్యకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదే విషయమై అంబరీశ్కు సన్నిహితుడైన సందేశ్ నాగరాజ్ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి అంబరీశ్ ఇష్టపడడం లేదని చెప్పారు. తనకు బదులుగా తాము సూచించిన వ్యక్తికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వస్తున్న వార్తల్లో కూడా ఎటువంటి వాస్తవం లేదని, అంబరీశ్అటువంటి డిమాండ్లు ఏవీ పార్టీ ముందు పెట్టలేదని చెప్పారు. ఈ విషయాలపై సోమవారం సాయంత్రానికి అంబరీశ్ స్వయంగా మీడియాకు వెల్లడించే అవకాశం ఉందన్నారు. భేటీకి సీఎం విఫలయత్నం కాగా మండ్య నుంచి పోటీ చేసే విషయమై అంబరీశ్తో మాట్లాడడానికి సీఎం సిద్ధరామయ్య అర్ధగంట పాటు ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. ఆదివారం మైసూరులో ఓ హోటల్లో బస చేసిన అంబరీశ్ ఆదివారం సీఎం సిద్ధరామయ్యను ఆయన ఇంట్లోనే కలుసుకోనున్నట్లు పార్టీ వర్గాలు భావించాయి. అంబరీశ్ నగరంలోనే ఉన్నట్లు తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్య హెచ్.డీ.కోటలో ప్రచార కార్యక్రమాలను త్వరగా ముగించి మైసూరుకు చేరుకొని అంబరీశ్ కోసం అర్ధగంట పాటు ఎదురు చూశారు. అయితే అంబరీశ్ మాత్రం బెంగళూరుకు వెళ్లిపోవడంతో సిద్ధరామయ్య ఉసూరంటూ ప్రచారానికి పయనమయ్యారు. -
మంత్రి పదవి హామీ ఇస్తేనే పోటీ : అంబరీష్
సాక్షి, కర్ణాటక(శివాజీనగర): మండ్య కాంగ్రెస్ అభ్యర్థి అంబరీష్ నేతలకు చుక్కలు చూపుతున్నారు. టికెట్ ప్రకటించినా ‘బీ ఫారం’ అందుకోని ఈయన పలు షరతులతో నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బీ ఫారం తీసుకోవాలంటే మండ్య జిల్లా ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలను అప్పగించాలని, పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇవ్వాలనే తదితర షరత్తులు విధించటంతో కాంగ్రెస్ నేతలకు దిక్కుతోచడం లేదు. ఈ క్రమంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ పరమేశ్వర్, ముఖ్యమంత్రి సిద్ధారామయ్యల సూచన మేరకు బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి కేజే జార్జ్ బుధవారం అంబరీష్ను కలిసి బీఫారం తీసుకునేలా ఒప్పించే ప్రయత్నం చేశారు. శుక్రవారం రాష్ట్ర ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ అంబరీష్ను కలిసి చర్చలు జరుపనున్నారు. అంబరీష్ డిమాండ్లను ఆమోదిస్తారో లేదో అనేది కుతూహలంగా మారింది. ఇదిలా ఉండగా అంబరీష్ ఇంటికి బీ ఫారం పంపుతామని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ పరమేశ్వర్ తెలిపారు. మరో వైపు నాయకులు, కార్యకర్తలు అంబరీష్ను కలిసి నియోజకవర్గానికి రావాలని, మీ వెంట మేం ఉంటామని, నామినేషన్ దాఖలు చేయాలని ఒత్తిడి చేశారు. -
అంబి అనాసక్తి, అర్ధాంగికి టికెట్ ఇస్తే చాలు
సాక్షి, బెంగళూరు: విధానసభ ఎన్నికల్లో మాజీ మంత్రి, నటుడు అంబరీశ్తో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన ప్రముఖ నేతలకు కాంగ్రెస్ టికెట్ దక్కే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యంగా మండ్య ఎమ్మెల్యే అంబరీశ్ గతకొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటుండడం, టికెట్కు సైతం దరఖాస్తు చేయకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వడానికి సుముఖంగా లేదని సమాచారం. ఈ నేపథ్యంలో తనకు బదులుగా అర్ధాంగి సుమలతకు టికెట్ ఇవ్వాలని అంబి కోరుతున్నట్లు వినికిడి. రాష్ట్రంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుసుకున్న అంబరీశ్ మండ్య నుంచి టికెట్ తమకే వస్తుందన్న ధీమాతో అర్జీ వేయలేదని సమాచారం. దీంతో కాంగ్రెస్ పెద్దలు కూడా రెబెల్స్టార్ను కరుణించేలా లేరు. అంబరీశ్కు టికెట్ వద్దా? అయితే నేరుగా టికెట్ ఇవ్వడం కుదరదనే ప్రకటన చేస్తే అంబరీశ్ తిరుగుబాటు బావుటా ఎగురవేసే ప్రమాదం ఉందని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం అంబరీశ్ అనారోగ్యాన్ని సాకుగా చూపి టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. సీఎం సిద్ధరామయ్య మాత్రం మండ్య నుంచి అంబరీశ్కే టికెట్ ఇప్పించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. మండ్య నుంచి ఆయన కాకుండా ఇంకెవరు పోటీ చేసినా ఓటమి తప్పదనే అనుమానం సిద్ధరామయ్యను పీడిస్తున్నట్లు తెలుస్తోంది. సుమలతకు అవకాశానికి వినతి అయితే అంబరీశ్ ఆలోచన మరోలా ఉన్నట్లు సమాచారం. మండ్యలో తనకు బదులు సతీమణి సుమలతకు టికెట్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నందువల్ల పోటీ చేయాలనుకోవడం లేదని, కాబట్టి భార్యకు అవకాశం కల్పించాలని అంబి కోరినట్లు సమాచారం. ఈ విషయంపై అంబరీశ్, సుమలతలు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. కాగా, అంబరీశ్తో పాటు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న బాదామి ఎమ్మెల్యే చిమ్మనకట్టి, హానగల్కు చెందిన నేత మనోహర్ తదితరులకు కూడా ఈసారి టికెట్ దక్కే అవకాశాలు దాదాపు లేనట్లేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. -
కాంగ్రెస్ వీడే ప్రసక్తే లేదు
బొమ్మనహళ్లి: గడచిన కొన్ని నెలలుగా సొంత పార్టీపై గుర్రుగా ఉన్న కన్నడ రెబల్స్టార్, మాజీ మంత్రి అంబరీష్ బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వందతులపై ఆయన ఆదివారం స్పష్టత ఇచ్చారు. మండ్య టికెట్ ఈసారి అంబరీష్కు ఇవ్వాలా వద్ద అనే విషయంపై అధిష్టానం తర్జన భర్జన పడుతుండటంతో ఆయనను బీజేపీలోకి లాక్కోవడానికి ఆ పార్టీ నాయకులు ప్రయత్నాలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలుగు రెబల్స్టార్, నటుడు కృష్ణం రాజును ఇటీవలె అంబరీష్ హైదరాబాద్లో కలిసిన నేపథ్యంలో ఆయన పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. అయితే అంబరీష్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆది వారం అంబి మీడియాతో మాట్లాడుతూ... తాను బీజేపీలోకి వెళ్లటం లేదని, కాంగ్రెస్ పార్టీని వీడేది లేదన్నారు. తన అనారోగ్య కారణాల వల్ల ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్ద అనే యోచనలో ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరితోనూ అభిప్రాయ భేదాలు లేవన్నారు. మరోవైపు అంబరీష్ తన అనుచరులకు నాలుగు సీట్లు ఇవ్వాలని పట్టుబపడుతున్నారు. దీనికి పార్టీ అధిష్టానం ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో అంబి పార్టీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
కర్ణుడిగా అర్జునుడు!
వెండితెర కర్ణుడిగా ఎన్టీఆర్, జెమినీ గణేశన్... ఇలా ఎందరో గొప్ప నటులు నటించారు. రీసెంట్గా హీరో విక్రమ్ కూడా ఈ క్లబ్లో చేరారు. ఇప్పుడు యాక్షన్ కింగ్ అర్జున్ ‘కురుక్షేత్ర’లో కర్ణుడి పాత్రలో కనిపించబోతున్నారు. నాగన్న దర్శకత్వంలో దర్శన్, అంబరీష్, వి. రవిచంద్రన్, అర్జున్, నిఖిల్ కుమార్, హరిప్రియ ముఖ్య తారలుగా మహాభారతం బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం రూపొందుతోంది. కన్నడ ప్రముఖ రచయిత రానా రాసిన ‘గదాయుధ’ బుక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా కౌరవరాజు దుర్యోధనుడి పాత్ర చుట్టూ సినిమా సాగుతుందని సమాచారం. భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
కురుక్షేత్ర టీజర్ : అభిమన్యుడిగా నిఖిల్
జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి తనయుడు నిఖిల్ కథానయకుడిగా భారీ బడ్జెట్తో రూపొందుతున్న ‘కురుక్షేత్ర’ టీజర్ను శనివారం చిత్ర నిర్వాహకులు విడుదల చేశారు. ఈ సినిమాలో పద్మవ్యూహాన్ని చేధించే అభిమన్యుడి పాత్రలో నిఖిల్ గౌడ అభిమానులను అలరించనున్నారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మునిరత్న రూ. 50 నుంచి 60 కోట్లు వ్యయం చేశారు. వృషభాద్రి ప్రొడక్షన్ బ్యానర్పై తీస్తున్న ఈ సినిమాకు దర్శకుడు నాగణ్ణ. కన్నడ రెబల్ స్టార్ అంబరీష్, క్రేజీస్టార్ రవిచంద్రన్, యాక్షన్కింగ్ అర్జున్, డైలాగ్ కింగ్ సాయికుమార్, కన్నడ నటుడు శశికుమార్, భారతీ విష్ణువర్ధన్ తదితరులు నటించారు. -
రాజకీయాల్లోకి నా భార్యా, బిడ్డలు రారు
సాక్షి, బెంగళూరు: ‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హైకమాండ్ మరోసారి టికెట్ ఇస్తే పోటీచేస్తా, అంతేకానీ నేను కాకుండా నా భార్యకానీ, కుమారుడు కానీ ఎన్నికల్లో పోటీ చేయరు’ అని ఎమ్మెల్యే, శాండల్వుడ్ రెబల్స్టార్ అంబరీష్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ అయ్యేందుకు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణాకు అంబరీష్ వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘నేను ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్న విషయాన్ని హైకమాండ్ నిర్ణయిస్తుంది. టికెట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయమంటే చేస్తాను. లేదంటే లేదు. ప్రజలు కోరుకుంటేనే రాజకీయాల్లో ఉండడం సాధ్యమవుతుంది.’ అని అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉండడం లేదు, పార్టీ మారే ఆలోచన ఉందా? ఏ పార్టీ నుంచి అయినా ఆహ్వానం అందిందా? అన్న ప్రశ్నకు అంబరీష్ సమాధానమిస్తూ...‘నాకు జేడీఎస్, బీజేపీ నేతలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రతిరోజూ వారితో కలిసి మాట్లాడుతుంటాను. భోజనం చేస్తుంటాను. ఇందులో రాజకీయాలకు చోటు లేదు’ అని అన్నారు. కాగా, నటి రమ్యా మండ్య నుంచి పోటీ చేస్తానంటే తాను స్వాగతిస్తానని అంబరీష్ పేర్కొన్నారు. ప్రస్తుతం రమ్యా స్టార్ క్యాంపెయినర్ అని, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ను జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారని అన్నారు. రమ్యాకు కాంగ్రెస్ హైకమాండ్ టికెట్ ఇస్తే ఆమె తరఫున ప్రచారం చేయాల్సి ఉంటుందని అంబరీష్ తెలిపారు. -
'పద్మావతి'కి రెబల్ స్టార్ మద్దతు
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన ఐదు రోజులకు బెళగావిలోని సువర్ణసౌధకు వచ్చిన రెబల్ స్టార్ అంబరీష్ బాలీవుడ్ సినిమా పద్మావతికి మద్దతు ప్రకటించారు. సువర్ణసౌధ వద్ద విలేకరులతో మాట్లాడుతూ...పద్మావతి చిత్రాన్ని విడుదల చేయడంలో ఎలాంటి తప్పు లేదు. పద్మావతి చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, నటి దీపికా పదుకొణేలను కొందరు బెదిరించడం ఎంత మాత్రం సరికాదని పేర్కొన్నారు. భారీ బడ్జెట్ తో చారిత్రాత్మక చిత్రంగా తెరకెక్కిన పద్మావతి సినిమాను డిసెంబర్ 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే పలు సంఘాల నుంచి విమర్శలు వస్తుండటంతో పాటు సెన్సార్ కార్యక్రమాలు కూడ ఆపూర్తి కాకపోవటంతో సినిమా వాయిదా పడనుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి సినిమా రిలీజ్ ఎప్పుడన్న విషయంలో క్లారిటీ లేకపోయినా.. రోజుకో వివాదంతో పద్మావతి వార్తల్లో వినబడుతూనే ఉంది. -
అసెంబ్లీ ఎగ్గొట్టి ఎమ్మెల్యే స్టెప్పులు.. వైరల్
సాక్షి, బెంగళూరు : ఓ వైపు డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసుపై బెళగావి సువర్ణసౌధ విధానసభ రెండోరోజూ వాద, ప్రతివాదాలతో ప్రతిధ్వనించగా.. మరోవైపు బాధ్యతాయుత అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబరీష్ మాత్రం డ్యాన్సులు చేస్తూ విమర్శల పాలయ్యారు. గణపతి కేసుపై సభలో చర్చ జరగాలని, సీబీఐ ఏ1 గా పేర్కొన్న మంత్రి కె.జె.జార్జ్ తక్షణమే రాజీనామా చేయాలంటూ వరుసగా మంగళవారం రెండో రోజు కూడా సభలో బీజేపీ పక్షనేత జగదీష్ శెట్టర్ సహా ఆ పార్టీ నేతలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబరీష్ వాడీవేడిగా జరుగుతున్నా.. బాధ్యతాయుతమైన వ్యక్తి అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి నవ్వుల పాలవుతున్నారు. ఓ వైపు సమావేశాలకు డుమ్మా కొట్టడమే అంబరీష్ చేసిన తప్పిదం కాగా, మ్యూజిక్ ఈవెంట్లలో పాల్గొని డ్యాన్సులు చేస్తున్నారని నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. బెంగళూరులో జరిగిన ఈవెంట్లో అంబరీష్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఆయన బాధ్యతారాహిత్యంపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. ప్రజల కష్టాలు పట్టించుకోకుండా, సామాజిక అంశాలపై నిర్లక్ష్యంతో పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఫంక్షన్లలో స్టెప్పులేస్తున్న వ్యక్తి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
మళ్లీ హీరోగా రెబల్ స్టార్..
బొమ్మనహళ్లి(కర్ణాటక): దశాబ్దాల తరువాత కన్నడ రెబల్ స్టార్, నటుడు అంబరీష్ పూర్తిస్థాయి హీరోగా మళ్లీ ముఖానికి రంగు వేసుకుంటున్నారు. అంబి నింగే మయసాయ్తె (అంబి నీకు మయస్సయింది) అనే సినిమా హీరోగా నటిస్తున్నాడు. మరో విశేషమేమంటే తెలుగులో ఈగ సినిమా ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమైన కిచ్చ సుదీప్ ఈ సినిమాకు నిర్మాతగా, నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె అంబరీష్ తన కుమారుడు అభిషేక్గౌడ్ను కన్నడ చిత్రరంగానికి పరిచయం చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ప్రస్తుతం అంబి నటిస్తున్న చిత్రంలో హీరోయిన్గా సుహాసినిని ఎంపిక చేశారు. ప్రస్తుతం అంబరీష్ భారీ బడ్జెట్ సినిమా కురుక్షేత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బీష్ముడిగా అభిమానుల ముందుకు రాబోతున్నారు. అభిషేక్ కోసం క్యూ కడుతున్న నిర్మాతలు అభిషేక్తో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. రాక్లైన్ వెంకటేశ్, కిచ్చ క్రియేషన్స్, ముగుళునగె సినిమా నిర్మాత సయ్యద్ సలాం అంబరీష్తో చర్చిస్తున్నారు. -
ఎంపీ తనయులకు బెయిల్, ఆందోళన
-
ఎంపీ తనయులకు బెయిల్, ఆందోళన
అనంతపురం: బాగేపల్లి టోల్ప్లాజాపై దాడి కేసులో హిందూపురం టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులను బెయిల్ పై విడుదల చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాగేపల్లి పోలీసుస్టేషన్లో లొంగిపోయిన నిమ్మల కిష్టప్ప కుమారులు అంబరీష్, శిరీష్లను స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. పోలీసుల వ్యవహరించిన తీరుపై బాగేపల్లి టోల్ప్లాజా సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫర్నీచర్ను ధ్వంసం చేసి మాపై దాడి చేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి విడిచిపెడతారా అని పోలీసులను ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిడుల కారణంగానే పోలీసులు మెతగ్గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొత్త ఫర్నీచర్ కొనిస్తామని ఎంపీ నిమ్మల కిష్టమ్మ ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతోంది. అంబరీష్, శిరీష్ సోమవారం ఆంధ్ర– కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్ప్లాజాలో వీరంగం సృష్టించారు. టోల్గేట్ వద్ద అంబరీష్ అనుచరుల కారును ఆపి గేట్ ఫీజు అడిగారన్న కోపంతో విధ్వంసానికి దిగారు. టోల్ప్లాజాపై దాడి చేసి.. కంప్యూటర్లు, అద్దాలు పగలగొట్టారు. తమతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని బాధితులను బెదిరించారు. దీంతో బాగేపల్లి పోలీసులు నిమ్మల అంబరీష్, నిమ్మల శిరీష్, పాపన్న, నరేష్, లక్ష్మీపతి, మునికుమార్, శ్రీకృష్ణపై 149, 143, 147, 323, 324, 504, 427, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
బీజేపీ గూటికి అంబరీష్!
సాక్షి, బెంగళూరు: ప్రముఖ నటుడు, కాంగ్రెస్ సీనియర్ నేత అంబరీష్.. త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని మండ్య ఎమ్మెల్యే అయిన అంబరీష్ సీఎం సిద్ధరామయ్య కేబినెట్లో కొంతకాలం మంత్రిగా పనిచేశారు. వివిధ కారణాలతో కొద్దినెలలకే ఉద్వాసనకు గురయ్యారు. అప్పటినుంచి పార్టీతో అంటీముట్టనట్టుగా ఉన్న ఆయన దుబాయ్ పర్యటనలో ఉండగా, కర్ణాటక బీజేపీ నాయకులు అశోక్, సతీష్రెడ్డిలు సమావేశమై బీజేపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బీజేపీలో మంచి స్థానంతో పాటు రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. -
ఆయనేమన్న హిట్లరా !
నేను కాలికి వేసుకునే చెప్పును కాదు సీఎం సిద్ధరామయ్యపై అంబి ఫైర్ రాజీనామా ఉపసంహరించుకునే ప్రసక్తే లేదన్న అంబరీష్ బెంగళూరు: ‘ఆయనకు (సీఎం సిద్ధరామయ్య) ఇష్టమొచ్చినట్లు మార్చేయడానికి నేను కాలికి వేసుకునే చెప్పును కాదు’ అంటూ రెబల్స్టార్, మాజీ మంత్రి అంబరీష్ సిద్ధరామయ్యపై మండిపడ్డారు. మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్లు తనతో ఒక్క మాట చెప్పి ఉంటే తానే పదవి నుంచి తప్పుకొని ఉండే వాడినని అన్నారు. మంత్రి పదవికి అసమర్థుడినైతే, ఎమ్మెల్యేగా కూడా అసమర్థుడినేనని, అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని తెలిపారు. మంగళవారమిక్కడి ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా స్నేహితులు ఉన్నారు. ఆత్మగౌరవానికి భంగం కలిగితే ఏ స్థానంలో కూడా ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. అందుకే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామాను వెనక్కు తీసుకోబోను’ అని అంబరీష్ స్పష్టం చేశారు. పరిషత్ సమావేశంలో అందరు మంత్రులను ఉద్దేశించి మాట్లాడారని, అంటే తామేమైనా హోల్సేల్లో కొనుగోలు చేసేందుకు ఉన్నవాళ్లమా? అని సిద్ధరామయ్యపై మండిపడ్డారు. ‘తనకు ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన (సిద్ధరామయ్య) హిట్లరో, డిక్టేటరో కాదు. సినీపరిశ్రమలో 40 ఏళ్లకు పైగా పనిచేశాను. మూడు సార్లు ఎంపీగా పనిచేశాను. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాను. నేను ఎప్పుడూ పదవుల కోసం లాబీయింగ్ జరపలేదు. అలాంటి పరిస్థితి నాకెప్పుడూ ఎదురుకాలేదు’ అని అంబరీష్ పేర్కొన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ హైకమాండ్తో కూడా తాను చర్చలు జరపబోనని అన్నారు. ఇక అంబరీష్ పదవిని కోల్పోవడం వెనక మాజీ ఎంపీ రమ్య హస్తం ఉందన్న వార్తలపై అంబరీష్ స్పందిస్తూ ‘పాపం ఆ అమ్మాయికి ఏం సంబంధం ఉంటుందయ్యా, తను కూడా నాలాగే సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చింది. ఈ విషయంలోకి ఆ అమ్మాయిని ఎందుకు లాగుతారు’ అంటూ సమాధానమిచ్చారు. ఇక అంబరీష్ను మంత్రి మండలి నుంచి తప్పించడంపై మండ్యలో నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ఆయన అభిమానులు మంగళవారమిక్కడి ఆయన నివాసంలో అంబరీష్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన మహిళా అభిమానులు కన్నీరు పెట్టడంతో అంబరీష్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. -
అంబరీష్ను తొలగించడం చారిత్రక తప్పిదం
హాస్య నటుడు జగ్గేష్ బొమ్మనహళ్లి (బెంగళూరు) : మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవిని కోల్పోయిన గృహనిర్మాణశాఖ మంత్రి అంబరీష్కు బీజేపీ నాయకుడు, శాండిల్వుడ్కే చెందిన హాస్యనటుడు జగ్గేష్ నుంచి మద్దతు లభించింది. ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించి కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడిందని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అందులో ఉన్న విషయాలు ‘రాజకీయనాయకులకు పదవులు ఉన్నప్పుడే గౌరవం ఉంటుంది. మంత్రిగా ఐదేళ్లు పని చేసి దిగిపోయిన తర్వాత ఎవరూ గౌరవించరు. అయితే అంబరీష్ రాజకీయ నాయకుడి కంటే కన్నడ నటుడిగా రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆయన చిన్న పిల్లాడి మన స్థత్వం కలిగిన వారు. ఎటువంటి తప్పులు చేయలేదు. అయినా మంత్రి పదవి నుంచి తొలగించారు. ఇది చారిత్రాత్మక తప్పిందం. దీని వల్ల కన్నడిగుల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ లోనయ్యింది.అందులో ఒక మహిళ చెప్పిన మాటలు విని ఆయన్ను తప్పించడం సరి కాదు’ అని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఎంపిగా ఎన్నికై మంత్రిగా ప్రజలకు సేవ చేస్తాను అని 1988లో అంబరీష్ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పుకొచ్చారన్నారు. చెప్పిన అన్ని పనులు చేశారు. 2018 నాటికి రాజకీయాల్లో బారీ మార్పులు చోటు చేసు కుంటాయని, అప్పడు ప్రజలు రాజకీయనాకులను మరిచిపోతారు. కాని అంబరీష్ను మరిచిపోరు.’ అని పేర్కొన్నారు. -
భార్య వేధిస్తోందని ...
ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు అభిమాన నటుడు అంబరీష్ రావాలని పట్టు అక్క మాటతో దిగి వచ్చిన వెంకటేష్ మైసూరు : ఆస్తి కోసం భార్య, ఆమె బంధువులు వేధించడంతో భర్త చెట్టెక్కాడు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తన సమస్య పరిస్కారం కావాలంటే తన అభిమాన నటుడు అంబరీష్ ఘటనా స్థలానికి రావాలని పట్టుబట్టాడు. తాను జోక్యం చేసుకొని సమస్య పరిష్కరిస్తానని అతని అక్క హామీ ఇవ్వడంతో చెట్టు దిగాడు. సంచలనం సృషించిన ఈ ఘటన శనివారం మైసూరు నగరంలోని సరస్వతిపురంలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు... సరస్వతిపురలో వెంకటేశ్,సుశీల దంపతులు నివాసం ఉంటున్నారు. ఈయనకు చెందిన ఆస్తిపాస్తులను భార్య, ఆమె బంధువులు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈక్రమంలో వెంకటేశ్ శనివారం ఉదయం 10 గంటలకు తన ఇంటి వద్ద ఉన్న కొబ్బరి చెట్టు ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కిందకు దిగాలని నచ్చజెప్పారు. అందుకు వెంకటేశ్ ససేమిరా అన్నాడు. తన భార్య, ఆమె బంధువులు తనను కొట్టి ఆస్తి పత్రాలు లాక్కున్నారని, ఆస్తి మొత్తం రాసివ్వకపోతే చంపివేస్తామని బెదిరిస్తున్నారని, వారిని వెంటనే ఇక్కడకు తీసుకొచ్చి తనకు న్యాయం చేయాలని, అంతవరకు కిందకు దిగేది లేదని భీష్మించుకు కూర్చున్నాడు. రాత్రి ఏ డుగంటలైనా కిందకు దిగకపోవడంతో పోలీసులు చెట్టుపైకి ఎక్కేందుకు యత్నించగా కిందకు దూకుతానని వెంకటేశ్ బెదిరించాడదు. అక్కడే ఉన్న భార్య మాట్లాడుతూ తన భర్తను తాను వేధించలేదని పేర్కొంది. భర్త కిందకు దిగితే సమస్య పరిష్కరించుకుందామని సూచించింది. అయినా వెంకటేశ్ స్పందించలేదు. రాత్రి 7.30గంటల సమయంలో అతని అక్క పుట్ట మహదేవమ్మ వచ్చి నేను మాట్లాడుతా అని చెప్పడంతో వెంకటేష్ రాత్రి 7.30 గంటల సమయంలో కిందికి దిగడంతో పొలిసులు ఊపిరి పిల్చుకున్నారు. చెట్టు దిగిన వెంకటేష్ను పొలీసులు స్టేషన్కు తరలించారు. ఇదిలా ఉండగా సినీ నటుడు, ఎంపీ అయిన అంబరీష్కు వీరాభిమాన అయిన వెంకటేశ్ 1993లో ఓసారి ఇలా చెట్టు ఎక్కాడు. అప్పట్లో మైసూరు సమీపంలో సినిమా షూటింగ్లోఉన్న నటుడు అంబరిష్ విషయం తెలుసుకోని అక్కడికి చేరుకోగా వెంకటేశ్ కిందకు దిగినట్లు స్థానికులు తెలిపారు. -
ఆరోగ్య మంత్రిగా సినీనటి రమ్య
బెంగళూరు: కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రిగా కన్నడ నటి రమ్యను తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్టుగా తెలిసింది. రాష్ట్ర పార్టీలో పెరిగిపోతున్న కుమ్ములాటలను పరిష్కరించేందుకు రాష్ట్ర కేబినెట్ను పునర్వవ్యస్థీకరించాలని సిద్ధరామయ్య గత కొంతకాలంగా భావిస్తున్నారు. ఈ దిశగా కసరత్తు చేయడంలో భాగంగానే ఆయన ఇప్పుడు ఢిల్లీలో మకాం వేశారు. ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రిగా పార్టీలో పలు విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ ప్రముఖ సినీ నటుడు అంబరీష్ను తొలగించి, ఆ స్థానంలో రమ్యను తీసుకోవాలని సిద్ధరామయ్యకు పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ఎం కృష్ణ ప్రతిపాదించినట్టు తెల్సింది. దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న అంబరీష్ ఆరోగ్యం హఠాత్తుగా దెబ్బతినడంతో గత ఏడాది ఆయన్ను సింగపూర్కు తరలించి వైద్య సేవలు అందించారు. అందుకైన కోటిన్నర రూపాయల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. అప్పటి నుంచి ఆయనను పదవి నుంచి తప్పించాల్సిందిగా పార్టీలో అంతర్గతంగా ఒత్తిడి పెరిగింది. ఇటీవలి కాలంలో అంబరీష్ను కూడా సిద్ధరామయ్య బహిరంగంగానే విమర్శిస్తూ వస్తున్నారు. 15వ లోక్సభకు మాంధ్య నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన సినీనటి రమ్య గత లోక్సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆమెకు రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభల్లో దేనీలోనూ సభ్యత్వం లేదు. మంత్రివర్గంలోకి తీసుకున్నాక, ఆమెకు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని కట్టబెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
కలిసి ఉందాం..
పార్టీ నాయకులకు సీఎం సిద్ధు దిశానిర్దేశం మంత్రులు కృష్ణభైరేగౌడ, ఆంజనేయపై సహచర నాయకుల ఆక్రోశం సీఎల్పీకు గైర్హాజరైన రెబెల్ స్టార్ అంబరీష్ బెంగళూరు : అవిశ్వాస తీర్మానాన్ని కలిసికట్టుగా ఎదుర్కొందామని ఇందుకు శాసనసభ సమావేశాలకు తప్పక హాజరు కావాలని కాంగ్రెస్పార్టీ శాసనసభ పక్ష సమావేశం (సీఎల్పీ)లో పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిశానిర్దేశం చేశారు. అంతేకాక అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్న విపక్ష జేడీఎస్ పార్టీ పై తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న నేపథ్యంలో విధానసౌధాలో బుధవారం సీఎల్పీ సమావేశం జరిగింది. సభ ప్రారంభమైన వెంటనే సిద్ధరామయ్య మాట్లాడారు. ‘ప్రభుత్వం పడిపోదని తెలిసినా రాజకీయ ప్రయోజనం ఆశించి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడానికి జేడీఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది. అక్రమాలు జరిగినట్లు ఆ పార్టీ నాయకులు భావిస్తే శాఖవారి చర్చల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. అలాకాక అవిశ్వాస తీర్మానానికి ముందుకు పడటం సరికాదు. ఆ పార్టీకు తగిన బుద్ధి చెప్పాలంటే అందరూ కలిసికట్టుగా ఉండాలి. శాఖ పరంగా గణాంకసహిత జవాబులు చెప్పడానికి మంత్రులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక ఎమ్మెల్యేలు తప్పక హాజరు కావాలి.’ అని పేర్కొన్నారు ఈ సమయంలో కలుగజేసుకున్న సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడు కే.బి కోళివాడ మేము మీవెంట ఉంటాం. అవిశ్వాస తీర్మానం తప్పక వీగిపోతుంది. అని భరోసాయిచ్చారు. ఇందుకు సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న చాలా మంది నాయకులు మద్దతు పలికారు. అయితే సభలో పాల్గొన్న నాయకుల్లో చాలా మంది వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణభైరేగౌడపై విమర్శల వర్షం కురిపించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందించడమే వ్యవసాయశాఖ పనికాదన్నారు. రైతులకు సరైన సమయంలో అవసరమైనంత మేర రుణాలు కూడా ఇప్పించాల్సిన బాధ్యత ఆ శాఖపై ఉందని గుర్తుచేశారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్క రైతు కుటుంబానైనా మంత్రి కృష్ణైభైరేగౌడ పరమార్శించారా? బలవన్మరణాలు తగ్గించడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అవాక్కయిన అయన మీ సలహాలు, సూచనలు పాటిస్తానంటూ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించారు. దీంతో శాంతించిన నాయకులు వ్యవసాయ, ఉద్యానశాఖ, పశుసంవర్ధకశాఖ మంత్రులతో సలహాసమితి రూపొందించి పరిహారం అందించే విషయమై రెవెన్యూ డివిజన్ల వారిగా పార్టీ ఎమ్మెల్యేలతో సంప్రదించాలని సూచించారు. ఇందుకు మంత్రి కృష్ణభైరేగౌడ సమ్మతించడంతో శాంతియుత వాతావరణం ఏర్పడింది. ఇదిలా ఉండగా రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖలో పరుపులు, తలగడ (దిండ్లు) కొనుగోలులో జరిగిన అక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రమేయం ఉందన్నట్లు బహిరంగ వాఖ్యలు చేసిన ఆ శాఖ మంత్రి ఆంజనేయ పై కూడా సహచరులు గరం అయ్యారు. ఈ సమయంలో సిద్ధరామయ్యతో సహా కొంతమంది సీనియర్ నాయకులు కలుగజేసుకుని పరిస్థితిని యథాస్థితికి తీసుకువచ్చారు. రైతుల ఆత్మహత్యల విషయంతోపాటు లోకాయుక్త పై అవినీతి ఆరోపణలు తదితర విషయాల పై చర్చించేందుకు వచ్చే బుధవారం మరోసారి సీఎల్పీ నిర్వహిస్తానని సిద్ధరామయ్య సమావేశంలో ప్రకటించారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తున్న ‘రెబెల్స్టార్’ గృహనిర్మాణశాఖ మంత్రి అంబరీష్ సీఎల్పీకు గైర్హాజరయ్యారు. -
రేసులో ఉన్నా: అంబరీష్
బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసులో తాను కూడా ఉన్నట్లు రాష్ర్ట గృహ నిర్మాణశాఖ మంత్రి అం బరీష్ ప్రకటించారు. ఆ పదవి చేపట్టడానికి అన్ని అర్హతలు తనకు ఉన్నాయన్నారు. బెంగళూరులోని కేపీసీసీ ప్రధాన కార్యాలయానికి మంగళవా రం వచ్చిన ఆయన కార్యకర్తలతో కొద్ది సేపు ముచ్చటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మంత్రుల పనితీరుపై నివేదిక ఇవ్వాలని హైకమాండ్ ప్రస్తుత కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ను ఆదేశించిన విషయమై తనకు సమాచారం లేదన్నారు. తాను మాత్రం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నానని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల కింద 3.17 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చామని ఆయన తెలిపారు. రాష్ట్ర గృహ మండలి ఇప్పటి వరకూ ప్రభుత్వానికి చెందిన భూములను ఆక్రమించిన ఘటన ఏదీ జరగలేదని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి అంబరీష్ సమాధానమిచ్చారు. -
మనోజ్ సంగీత్లో బడా హీరోల స్టెప్పులు..
హైదరాబాద్: మంచువారి ఇంట్లో చివరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. ఒకప్పుడు బాలీవుడ్కే పరిమితమైన సంగీత్ కార్యక్రమం ఇప్పడు టాలీవుడ్ సెలెబ్రిటీల వివాహ వేడుకల్లో కామన్ అయిపోయింది. గతంలో చిరంజీవి, బాలకృష్ణ ఫ్యామిలీలో జరిగిన సంగీత్ లో హీరోలు చిందేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మంచువారి ఇంట్లో సంగీత్ వేడుక కనులవిందుగా జరగనుంది. దాదాపు ఐదు రోజులపాటు జరిగే ఈ తంతులో ప్రముఖ తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, కన్నడ నటుడు అంబరీశ్ అదిరిపోయే స్టెప్పులతో అలరించనున్నారట. నటుడు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ వివాహం మే 20న జరగనున్న విషయం తెలిసిందే. దాంతో మోహన్ బాబుకు స్నేహితులు, సన్నిహితులైన రజనీకాంత్, అంబరీష్ ఈ వేడుకలో అలరించనున్నారు. ఇందుకోసం వారు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్ లోని మోహన్ బాబు నివాసంలో ఈ వేడుకకు వేదిక కానుంది. వరుసగా ఐదురోజులపాటు ధూమ్ ధామ్ గా కార్యక్రమాలు సిద్ధం చేశారు. వీటిలో ప్రతిరోజు సంగీత్ ఉంటుంది. మే 14 నుంచి వివాహ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలన్నింటికి మనోజ్ సోదరి మంచు లక్ష్మీ యాంకరింగ్ చేయనున్నారు. ఈ వివాహానికి చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులందరు వస్తున్న విషయం తెలిసిందే. -
అంబరీష్తో జాగ్రత్త
నటుడు అంబరీష్తో జాగ్రత్తగా ఉండాలని నటి సుహాసిని చెప్పినట్లు నటి సుమలత చెప్పారు. సినీ రంగంలో సహ నటీనటుల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి సంసార జీవితాల్లో చాలా మట్టుకు సమస్యలమయంగా సాగుతున్నది అనేది ఎవరూ కాదనలేని విషయం అలాగని సంతోషంగా జీవిస్తున్న వారు లేరని చెప్పలేం. అలా జీవితాన్ని అన్యోన్యంగా మలచుకునే నటి జంటల్లో కన్నడ నటుడు అంబరీష్, నటి సుమలత ఒకరు. సుమలత 1990 ప్రాంతంలో తమిళం, తెలుగు, కన్నడం చిత్ర పరిశ్రమల్లో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందారు. ఇక అంబరీష్ కన్నడ చిత్ర పరిశ్రమలో సూపర్స్టార్గా రాణించారు. ఈయన తమిళంలోనూ కొన్ని చిత్రాలు చేశారు. నటుడు రజనీకాంత్కు మంచి మిత్రుడు. అంబరీష్, సుమలత ఒకరి నొకరు ప్రేమించుకున్నారు. ఆ సమయంలో అంబరీష్తో జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించిన వారిలో నటి సుహాసిని కూడా ఉన్నారట. ఈ విషయాన్ని నటి సుమలత స్వయంగా చెప్పడం విశేషం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన గతాన్ని నెమరువేసుకున్న ఆమె తన సుదీర్ఘ వివాహ జీవితం గురించి చెబుతూ వివాహానికి ముందు తన భర్త అంబరీష్తో కలసి పలు చిత్రాల్లో నటించానన్నారు. ఆయనతో తన జీవితాన్ని పంచుకోవాలని భావించినప్పుడు నటి సుహాసినితో పాటు పలువురు అంబరీష్తో జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరించారన్నారు. తన మేకప్మన్ కూడా అంబరీష్కు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారన్నారు. అయినా అంబరీషే తనకు నచ్చడంతో ఆయన్నే ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, ఇప్పటి వరకు తమ దాంపత్య జీవితం హాయిగా సాగుతోందని చాలా సంతోషంగా జీవిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఆయనే నా భర్త అయితేబాగుండనుకున్నా!
రీల్ పైనా, రియల్ గానూ అంబరీష్ రెబల్స్టార్... కానీ, సుమలత అలా కాదు! ఆన్ స్క్రీన్ ఆమె చాలా ఫాస్ట్... ఆఫ్ స్క్రీన్ మాత్రం చాలా చాలా సాఫ్ట్.. అంబరీషేమో సోసోగా ఉంటారు... సుమలతేమో గొప్ప అందగత్తె... కానీ జోడీ కుదిరింది.. ఇద్దరూ ప్రేమలో పడ్డారు... పెళ్లి కూడా చేసుకున్నారు... భిన్న మనస్తత్వాలున్న ఈ ఇద్దరి కాపురం ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది... అసలు వీళ్ల ప్రేమకథ ఎలా మొదలైంది? రెబల్స్టార్ అంబరీష్ని సుమలత ఇష్టపడటానికి కారణం ఏంటి? తెలుగింటి గోంగూర రుచి తెలిసిన సుమలత, కన్నడ బిసిబేళా బాత్ను ఎలా ఇష్టపడగలిగారు? ఒకప్పుడు కథానాయికగా దక్షిణాదిన ఓ వెలుగు వెలిగిన సుమలత ఇప్పుడేం చేస్తున్నారు? తెలుగు సినీరంగానికి దూరమైన తర్వాత ఇంటర్వ్యూలకి కూడా దూరంగా ఉంటున్న సుమలత పుట్టిన రోజు ఈ నెల 27న. ఈ సందర్భంగా ఈ తెలుగింటి సుమపరిమళాలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... తెలుగింటి ఆడపడుచైన మీరు కన్నడ ఇంటి కోడలిగా సెటిలై పోయారు... జీవితం ఎలా ఉంది? సుమలత: చాలా బాగుందండి. కన్నడవాళ్లు నన్ను తమ అమ్మాయిగా అంగీకరించారు. నన్నెంతగా అభిమానిస్తున్నారంటే.. నా నేపథ్యం తెలియనివాళ్లు నేను కన్నడ అమ్మాయినే అనుకుంటున్నారు. ఒక రాష్ర్టంలో పుట్టి, పెరిగి మరో రాష్ట్రంలో ఇంతటి అభిమానం సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉంది. మన గోంగూర ఎంత రుచిగా ఉంటుందో కన్నడ బిసిబేళా బాత్ కూడా అంతే రుచిగా ఉంటుంది. కానీ, తెలుగు సినిమాలకు దూరం కావడం బాధగా లేదా? ఎందుకుండదు? అడపా దడపా నేను కన్నడ చిత్రాల్లో నటిస్తున్నాను. అప్పుడు మన మాతృభాషలో సినిమాలు చేయలేకపోతున్నామనే బాధ కలుగుతుంటుంది. తెలుగు పరిశ్రమ నుంచి నాకు అవకాశాలు వస్తున్నాయి. కానీ, తీరిక చిక్కడం లేదు. ఒకవేళ తీరిక చేసుకుని చేస్తే, ఆ పాత్ర ఎంతో విలువైనది అయ్యుండాలి. అప్పుడే అర్థం ఉంటుంది. ఈ మధ్యకాలంలో గొప్పగా అనిపించిన పాత్రలేవీ రాలేదు. పైగా, అప్పట్లో మాతో సినిమాలు చేసిన విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారి లాంటి దర్శకులు ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. ఒకవేళ చేస్తే ఆ సినిమాల్లో నటించవచ్చు. అంటే.. ఇప్పుడు వస్తున్న దర్శకులతో సినిమాలు చేయాలనుకోవడం లేదా? అలా ఏం లేదు. ఇప్పుడొస్తున్నవారిలో రాజమౌళి, శేఖర్ కమ్ముల లాంటి ప్రతిభావంతులైన దర్శకులు చాలామంది ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇప్పటి దర్శకులను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. కొత్త కొత్త కాన్సెప్ట్లతో సినిమాలు తీస్తున్నారు. టెక్నాలజీ మీద మంచి అవగాహన ఉంటోంది. కొత్త తరహా పాత్రలను సృష్టిస్తున్నారు. మా తరంలో ఇలాంటి దర్శకులు కూడా ఉండుంటే బాగుండేది కదా అనిపిస్తుంటుంది. ఆ మధ్య తెలుగులో ‘బతుకు జట్కా బండి’ షో చేశారు కదా! ఆ తర్వాత మళ్లీ బుల్లితెరపై కనిపించలేదు? బుల్లితెరపై నా మొదటి షో అది. ఆ కాన్సెప్ట్ నచ్చి చేశాను. ముందు నలభై ఎపిసోడ్స్ అనుకున్నాం.. స్పందన బాగుండటంతో 100 ఎపిసోడ్స్ చేశాం. దక్షిణాదిన అన్ని భాషల్లో కలిపి నేను రెండు వందల పైచిలుకు చిత్రాలు చేశాను. వాటి ద్వారా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ఈ షో తెచ్చిన గుర్తింపు అంతకు రెట్టింపు. ప్రపంచంలో ఏ మూలకెళ్లినా దీని గురించి మాట్లాడి, అభినందిస్తున్నారు. ఇప్పటికీ చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్లు, వ్యాపారస్థులు కూడా ఈ షో గురించి మాట్లాడుతున్నారు. ఓ సినిమా నటిగా ‘కామన్ మేన్’ జీవితంలో ఉండే ఒడుదొడుకుల గురించి చర్చించే వీలు నాకు దొరకలేదు. కానీ, ఈ షో ద్వారా ఎంతోమంది జీవితాలను తెలుసుకున్నాను. ‘ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయా’ అనిపించింది. ఇదే షోను కన్నడంలో చేయమన్నారు. కానీ, నా భర్త రాజకీయాల్లో ఉన్నారు కదా. స్వలాభం కోసం మేమిలాంటి షో చేస్తున్నామనే రంగు పులిమేస్తారని భయంతో ఒప్పుకోలేదు. మీ తరం వారిలో సీరియల్స్ నిర్మిస్తున్న, నటిస్తున్న తారలున్నారు... మరి మీరు సీరియల్స్ జోలికి వెళ్లకపోవడానికి కారణం? నాకంత ఓపిక, సమయం లేదు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా సీరియల్స్కి దూరంగానే ఉండాలనుకుంటున్నా. మరి... ఏం జరుగుతుందో? సమయం లేదంటున్నారు. అంత బిజీయా? నేను కాకపోయినా నా భర్త చాలా బిజీ. ఆయన కర్నాటక రాష్ట్ర మంత్రి అనే విషయం తెలిసిందే. అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తుంటారు. నిత్యం బిజీగా ఉంటారు. ఆయనకు నా సపోర్ట్ చాలా అవసరం. నేను కూడా బిజీ అయిపోతే ఎలా? ఎవరో ఒకరు ఖాళీగా ఉంటే.. ఇంకొకరికి సహాయంగా ఉండొచ్చు కదా! అందుకే నేనెక్కువ కమిట్మెంట్స్ పెట్టుకోవడం లేదు. అంబరీష్కు రీల్ జీవితంలోనే కాదు.. రియల్ జీవితంలోనూ ‘రెబల్ స్టార్’ అనే ఇమేజ్ ఉంది. ఎలా నెట్టుకొస్తున్నారు? (నవ్వుతూ...) జీవిత భాగస్వాముల్లో ఒకరు రెబల్గా ఉంటే ఒకరు సాఫ్ట్గా ఉండాలి. అంబరీష్ మొదటి రకం అయితే నేను రెండో రకం. అందుకని, మా జీవితం సాఫీగా సాగుతోంది. అంబరీష్ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. మంచి విలువలున్న వ్యక్తి. మీ ఇద్దరిదీ ప్రేమ వివాహం కదా!అసలు అంబరీష్పై ప్రేమ కలగడానికి కారణం? ఆయన మనస్తత్త్వమే. చాలా మంచి వ్యక్తి. దాన వీర శూర కర్ణ, కలియుగ కర్ణ, మానవతామూర్తి... ఇలా కన్నడ రంగంలో ఆయన మంచితనానికిబోల్డన్ని బిరుదులున్నాయి. ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ఆయన వెనకడుగు వేయలేదు. అవన్నీ స్వయంగా చూశాను. అందుకే... ఆయనే నా భర్త అయితే బాగుండనుకున్నాను. నాది సున్నితమైన మనస్తత్త్వం కాబట్టి, ఆయన ఇష్టపడ్డారు. మీ మధ్య ఎప్పుడు ప్రేమ మొదలైంది? మాది తొలి చూపులో ఏర్పడ్డ ప్రేమ కాదు. ఇద్దరం కలిసి చాలా సినిమాలు చేశాం. ముందు మంచి స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ మార్పు ఫలానా సమయంలో వచ్చిందని చెప్పలేను. మాకు తెలియకుండానే ప్రేమలో పడిపోయాం. అంబరీష్ మంచి స్నేహశీలి. ఆయనకు బోల్డంత మంది మంచి స్నేహితులున్నారు. దాంతో, ఎప్పుడూ బిజీయే. రజనీకాంత్ గారైతే.. ‘నాకు తెలిసి ఇండియాలో మీ ఆయనకు ఉన్నంత మంది స్నేహితులు వేరే ఎవరికీ ఉండరేమో’ అంటుంటారు. స్నేహితుల కోసం ఆయన ఏమైనా చేస్తుంటారు. మరి.. ఆ స్నేహం కారణంగామీరెప్పుడూ ఇబ్బంది పడలేదా? పెళ్లయిన కొత్తలో ప్రైవసీ కోరుకుంటాం కాబట్టి, కొంచెం ఇబ్బందిగా ఉండేది. స్నేహితుల గురించి మా మధ్య చిన్న చిన్న గొడవలు కూడా జరిగాయి. అయితే, అదృష్టవశాత్తూ ఆ గొడవలు ముదురు పాకాన పడి, విడిపోయేంత వరకూ రాలేదు. ఆయన పగలంతా స్నేహితులు, పనులతో బిజీగా ఉన్నా, సాయంత్రం మాత్రం పూర్తిగా కుటుంబానికే అంకితమైపోతారు. సహాయం చేసే విషయంలో అంబరీష్ వెనకాడరని చెప్పారు కదా! ఆ విషయంలో ఆయన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నించేవారా? లేదు. ఎందుకంటే, నేను ఆయనను ఎక్కువ ఇష్టపడానికి కారణం అదే. పెళ్లికి ముందు ఇష్టపడిన విషయం తీరా పెళ్లి అయిపోయాక ఎందుకు కష్టంగా ఉంటుంది. కాకపోతే, అర్హత లేనివాళ్లకు సహాయం చేసినప్పుడు మాత్రం వారిస్తుంటాను. అప్పుడాయన ‘నాకు సహాయం చేయాలనిపించింది.. చేశాను. ఒకవేళ వెన్నుపోటు పొడిచారనుకో.. అది వాళ్ల కర్మ’ అంటుంటారు. ఎవరికైనా సహాయం చేస్తే, వాళ్లు తిరిగి తనకేదో చేయాలనీ, జీవితాంతం ఋణపడి ఉండాలనీ కోరుకోరు. ఆయన అంత మంచి వ్యక్తి. అందుకే, ఆయనను జీవిత భాగస్వామిగా పొందడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ డిసెంబర్కి మా పెళ్లయ్యి 23 ఏళ్లు పూర్తవుతోంది. ఇన్నేళ్ల మా వైవాహిక జీవితం బోల్డన్ని మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ దేవుడు నాకు ఇచ్చిన మంచి బహుమతి ‘అంబరీష్’. మీకు కూడా స్నేహితులున్నారా? మా తరంలో నటించినవారిలో నాకు సుహాసిని క్లోజ్ ఫ్రెండ్. మేమిద్దరం తెలుగు, తమిళంలో ఏడెనిమిది సినిమాల్లో కలిసి నటించాం. ఆ సమయంలో మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరం తరచూ ఫోన్లో మాట్లాడుకోం కానీ, స్నేహితులమే. సుహాసిని బెంగళూరు వస్తే.. మా ఇంటికి రాకుండా వెళ్లదు. నేను చెన్నై వెళితే వాళ్లింటికి వెళ్లకుండా ఉండను. తెలుగు పరిశ్రమలో కూడా మీవారికి మంచి స్నేహితులన్నారనుకుంటా? అవును. మోహన్బాబు గారు, చిరంజీవి గారు, హిందీ రంగంలో శతృఘ్న సిన్హా గారు, తమిళంలో రజనీకాంత్ గారు.. ఇలా చాలామంది స్నేహితులున్నారు. ఆ మధ్య అంబరీష్కి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళందరూ పరామర్శించారు. మోహన్బాబు గారైతే బెంగళూరు వచ్చి, మా ఆయనను చూడగానే ఒక్కసారిగా కంట తడిపెట్టుకున్నారు. ఆ అభిమానం చూసి, చాలా సంతోషం అనిపించింది. బహుశా మీ జీవితంలో బాగా టెన్షన్ పడిన సందర్భం అంబరీష్కి ఆరోగ్యం బాగా లేనప్పుడేనేమో? వంద శాతం కరెక్ట్. ఆ సమయంలో నేను అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని తెలియగానే... అభిమానులు పూజలు చేశారు. హోమాలు నిర్వహించారు. పొర్లుదండాలు పెట్టారు. అలాంటివన్నీ విని కదిలిపోయాను. అసలు మమ్మల్ని కలుస్తారో లేదో తెలియదు. పోనీ మా ద్వారా ఏమైనా లాభం కలుగుతుందా? అంటే అదీ లేదు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్నవాళ్లు సైతం ఆయన ఆరోగ్యం కోసం పూజలు చేశారు. అసలే సినిమా పరిశ్రమ అంటే నాకు చాలా అభిమానం. ఈ సంఘటనతో ఆ అభిమానం మరింత పెరిగిపోయింది. ‘సినిమా పరిశ్రమ మీకు ఇంతమంది అభిమానులను ఇస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెస్తోంది’ అని ఆ దేవుడు ఇలాంటి సంఘటనల ద్వారా మా సినిమా పరిశ్రమవారికి చూపిస్తాడేమో అనిపించింది. ఇప్పుడు అంబరీష్ ఆరోగ్యం ఎలా ఉంది? చాలా బాగున్నారు. అంతా ఆ దేవుడి దయ. మీ పిల్లల గురించి? మాకు ఒకే ఒక్క బాబు. పేరు - అభిషేక్ గౌడ. లండన్లో ఎం.ఎస్. చేస్తున్నాడు. తన చదువు కూడా పూర్తయిపోతే నాకు పెద్ద బాధ్యత తీరిపోతుంది. మీ అబ్బాయిని సినిమాల్లోకి తీసుకు రావాలనుకుంటున్నారా? అభిషేక్కు ఏది నచ్చితే దానికి ఓకే చెప్పడానికి నేను, అంబరీష్ సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ సినిమాల్లోకి రావాలనుకున్నాడనుకోండి.. అప్పుడు గెడైన్స్ మాత్రమే ఇస్తాం. ‘మన అబ్బాయి కోసం నేను సినిమా తియ్యను. ఆర్టిస్ట్ కావాలనుకుంటే వాడే శిక్షణ తీసుకోవాలి. అన్ని రకాలుగా తయారైన తర్వాత నేను గెడైన్స్ ఇస్తా. అంతేకానీ రికమండేషన్ చేయను’ అని అంబరీష్ అంటుంటారు. నా అభిప్రాయం కూడా అదే. కష్టం, సుఖం.. ఏదైనా స్వయంగా తెలుసుకుంటేనే జీవితం బాగుంటుందన్నది మా ఇద్దరి అభిప్రాయం. మా వాడికి రాజకీయాలంటే ఆసక్తి ఉంది. ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నాడనుకోండి... అప్పుడు కింద స్థాయి నుంచి కృషి చేసి, పైకి రమ్మని చెబుతాం. అంతేకానీ ‘మా వారసుడు వస్తున్నాడు...’ అంటూ వాడికి రహదారి వేయాలని అనుకోం. ఓసారి ఫ్లాష్బ్యాక్లోకి వెళదాం.. అప్పట్లో హీరోయిన్ కావాలని మీకు ఉండేదా? లేదు. నేను బాగా చదువుకునేదాన్ని. స్కాలర్షిప్ కూడా వచ్చేది. నేను మిస్ ఆంధ్రప్రదేశ్ బిరుదు సంపాదించిన తర్వాత సినిమా అవకాశాలు రావడం మొదలైంది. అప్పుడు పదో తరగతి చదువుతున్నాను. పరీక్షలు పూర్తయిన తర్వాత సెలవుల్లో సినిమా చేశాను. అది తమిళ చిత్రం. పేరు - ‘దిశై మారియ పరవైగళ్’. ఒకవేళ ఆ సినిమా వర్కవుట్ కాకపోతే, హాయిగా చదువుకోవచ్చనుకున్నాను. కానీ, మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు రావడం, బిజీ కావడం జరిగిపోయాయి. 1979లో ఆ సినిమా చేశాను. అదే ఏడాది ‘సమాజానికి సవాల్’ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యాను. ఆ చిత్రం తర్వాత తెలుగులో కూడా బిజీ అయ్యాను. దాంతో చదువుకు ఫుల్స్టాప్ పెట్టక తప్పలేదు. పోనీ ప్రైవేట్గా చదువుకుందామన్నా కుదరలేదు. అదొక్కటే బాధ. సినిమా రంగం పరంగా పశ్చాత్తాపపడాల్సిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మంచి పాత్రలు చాలానే చేశాను. ఇంకా చేసి ఉంటే బాగుండేదనే ఫీలింగ్ తప్ప, వేరే రకంగా నాకెలాంటి పశ్చాత్తాపమూ లేదు. చాలామంది సినిమా రంగం గురించి తప్పుగా మాట్లాడతారు. కానీ, ఇది అద్భుతమైన పరిశ్రమ. పేరు, డబ్బుతో పాటు అభిమానులను ఇస్తుంది. ఈ అదృష్టం ఏ రంగంలో దక్కుతుంది. గత 34 ఏళ్లుగా సినిమా పరిశ్రమతో నా అనుబంధం కొనసాగుతోంది. ఈ పరిశ్రమలో ఉండడం ఆ దేవుడి ఆశీర్వాదం అనుకుంటున్నా. మీకో చెల్లెలున్నారు కదా.. ఆవిడ ఏం చేస్తున్నారు? నా చెల్లెలు ప్రియ హైదరాబాద్లో ఉంటోంది. ప్రసాద్ ల్యాబ్ సీజీ, త్రీడీ యానిమేషన్ శాఖకు హెడ్గా వ్యవహరిస్తోంది. కెమెరామేన్ అజయన్ విన్సెంట్ను వివాహం చేసుకుంది. {పతి ఏడాదీ ‘సౌత్ సూపర్ స్టార్స్ 1980 రీ యూనియన్’ పేరుతో మీ తరం నటీనటులు కలుసుకుంటున్నారు కదా! దాని గురించి చెబుతారా? నాకు తెలిసి మన భారతదేశంలో ఉత్తరాదిన ఇలాంటి రీ యూనియన్ లేదు. ఏడాదికోసారి కలుసుకోవాలని మేం ఐదేళ్ల క్రితం అనుకున్నాం. దానిని ఆచరిస్తున్నాం. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం, హాయిగా కబుర్లు చెప్పుకోవడం, ఆటపాటలతో మా రీ-యూనియన్ పార్టీ చాలా జోరుగా ఉంటుంది. గత ఐదేళ్లుగా కలుసుకుంటున్నాం.. రానున్న సంవత్సరాల్లో కూడా కలవాలనే అనుకుంటున్నాం. ఫైనల్గా వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం గురించి ఏం చెబుతారు? రెండూ సంతృప్తికరంగానే ఉన్నాయి. సినిమాలు చేసినా చేయకపోయినా అభిమానులు మాత్రం అలానే ఉంటారు. ఎక్కడైనా కనిపిస్తే.. ‘సినిమాలు చేయడం లేదేంటి’ అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు. అంతకన్నా ఏం కావాలి? (నవ్వుతూ..) ఇక, అంబరీష్ లాంటి భర్తను పొందిన ఏ భార్య జీవితం అయినా హాయిగా ఉంటుంది. - డి.జి. భవాని మా ఆయన కోసం నేను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాను కానీ, రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు. ఎంపీగా పోటీ చేయమని కొంతమంది ఒత్తిడి చేశారు. కానీ, ఆయనా రాజకీయాల్లో ఉండీ, నేను అక్కడే ఉంటే ఇక ఇంటిని చూసుకునేదెవరు? 100 శాతం కాకపోయినా 99 శాతం న్యాయం చేయగలం అనేంత తీరిక చిక్కితే అప్పుడు రాజకీయాల గురించి ఆలోచిస్తా. దర్శకత్వం అనేది అంత సులువైన పని కాదు. సినిమా మీద చాలా పట్టు ఉండాలి. అన్ని శాఖల మీద అవగాహన ఉండాలి. చాలా ఓపిక ఉండాలి. నాకు తెలిసి దర్శకత్వం నాకు సరిపడదు. -
ఆమె ఓటమికి అంబి కారణం కాదు
అంబరీష్ అభిమానుల సంఘం నేత బుల్లెట్ కృష్ణ మండ్య, న్యూస్లైన్ : స్థానిక లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన రమ్య ఓటమికి రాష్ర్ట మంత్రి అంబరీష్ కారణం కాదని అంబరీష్ అభిమానుల సంఘం మండ్య జిల్లా అధ్యక్షుడు బుల్లెట్ కృష్ణ ఖండించారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రమ్యకు వ్యతిరేకంగా శ్రీరంగపట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ఎల్ లింగరాజు, ఇండువాళ గ్రామానికి చెందిన సచ్చిదానంద పనిచేశారని, వారి చర్యల వల్లే ఆమె ఓటమి పాలైందని, ఈ నిందను అంబరీష్పై నెట్టివేసే కుట్ర సాగుతోందని మండిపడ్డారు. రమ్యకు ఓటు వేయవద్దంటూ ఓటర్లకు ఫోన్లు చేసిన వీరిద్దరిని తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తగిన ఆధారాలను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్కు అందజేసినట్లు తెలిపారు. అంబరీష్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏనాడు రమ్య ఓడిపోవాలని కోరుకోలేదని తేల్చి చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యంతో సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే రమ్య గురించి అంబరీష్ వాకాబు చేశారని గుర్తు చేశారు. ఆమె విజయానికి కృషి చేయాలని తమందరికీ ఆయన సూచించారని తెలిపారు. అనారోగ్యంతో ఉన్నా రమ్య గెలుపు కోసం మండ్యలో అంబరీష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారని, ఒక వేల నిజంగా ఆమె ఓటమిని కోరుకునే వ్యక్తే అయితే ఎన్నికల ప్రచారం చేయాల్సిన అవసరం అంబరీష్కు ఏముంటుందని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో అంబరీష్ అభిమానుల సంఘం నేతలు కమలారాజు, ప్రేమ, రష్మి, భాగ్య, గౌరమ్మ, రత్నమ్మ, కాంగ్రెస్ నేతలు తమ్మేగౌడ, రాజేగౌడ, శివణ్ణ, బసవరాజు, తిమ్మేగౌడ, మంజునాథ్, చంద్ర, రవి పాల్గొన్నారు. -
మైసూరులో సూపర్ స్టార్ లింగ
చాముండేశ్వరి కొండపై సినిమా ముహూర్త కార్యక్రమం మైసూరు, న్యూస్లైన్ : అక్షయ తృతీయ రోజున బ్రహ్మీ ముహూర్త సమయంలో మైసూరులోని చాముండీకొండపై వెలిసిన చాముండేశ్వరీ మాతను సూపర్స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. ప్రముఖ నిర్మాత రాక్లైన్ వెంకటేష్ సారధ్యంలోని రాక్లైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రజనీకాంత్ హీరోగా నటించనున్న ‘లింగ’ సినిమా ముహూర్త కార్యక్రమాన్ని శుక్రవారం మైసూరులో నిర్వహించారు. ఈ ముహూర్త కార్యక్రమానికి ప్రముఖ నటుడు, రాష్ట్ర మంత్రి అంబరీష్, ఆయన సతీమణి సుమలత హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత రాక్లైన్ వెంకటేష్ మాట్లాడుతూ...మండ్య, మేలుకొటే, మైసూరు ప్రాంతాల్లో మే11 వరకు చిత్ర నిర్మాణం జరగనుందని తెలిపారు. సూపర్స్టార్ రజనీకాంత్తో పాటు హీరోయిన్లు సోనాక్షి సిన్హా, అనుష్కా శెట్టి ఈ షూటింగ్లో పాల్గొననున్నారని వెల్లడించారు. రజనీ సరికొత్త స్టైల్ : గురువారం రాత్రి మైసూరుకు చేరుకున్న రజనీకాంత్ శుక్రవారం తెల్లవారు ఝామున 3 గంటల సమయంలో చాముండేశ్వరీ కొండపైకి చేరుకున్నారు. ఎటువంటి మేకప్ లేకుండా ఓ సాధారణ వ్యక్తిలా కొండపైకి వచ్చిన రజనీకాంత్ను చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సమయంలో పోలీసుల సహాయంతో ఆయన చాముండేశ్వరీ మాత ఆలయంలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం తెల్లటి పంచ, చొక్కా వేసుకొని సన్నపాటి మీసాలు, విగ్తో సరికొత్త స్టైల్లో బయటికి వచ్చిన రజనీని చూసిన అభిమానులు ఇదో కొత్త స్టైల్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక సినిమా విజయవంతం అవ్వాలని ముహూర్త కార్యక్రమంలో పాల్గొన్న అంబరీష్, సుమలత ఆకాంక్షించారు. -
నేనొచ్చా....
సాక్షి, బెంగళూరు : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది అభిమానులే తన నిజమైన ఆస్తి అని, వారి ప్రేమ, ఆప్యాయతల ముందు వందల కోట్ల రూపాయలు కూడా తనకు గొప్పవిగా కనిపించవని ప్రముఖ శాండల్వుడ్ నటుడు, రాష్ట్ర మంత్రి అంబరీష్ పేర్కొన్నారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా సింగపూర్లో చికిత్స తీసుకొని, అనంతరం మలేషియాలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న అంబరీష్ శుక్రవారం నగరానికి తిరిగివచ్చారు. ఈ సందర్భంగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బెంగళూరు ప్రెస్క్లబ్, రిపోర్టర్స్ గిల్డ్ సంయుక్తంగా నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో తన భార్య సుమలతతో కలిసి అంబరీష్ మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదం, ప్రార్థనల కారణంగానే తాను మళ్లీ ఆరోగ్యవంతుడినై ప్రజా జీవితంలో రాగలిగానని పేర్కొన్నారు. తన కోసం ప్రార్థించిన అభిమానులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తాను సింగపూర్లో చికిత్స తీసుకుంటుండగా ఎంతో మంది తమ సొంత ఖర్చులతో చూసేందుకు వచ్చారని, వారందరి అభిమానాన్ని తానెప్పటికీ మరిచిపోలేనని అన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకమే తనను మంత్రిని చేసిందని, ప్రస్తుతం తాను గుడిసెలు లేని రాష్ట్రం కోసం కలలు కంటున్నానని అన్నారు. ఏడాది కాలంగా సిద్ధరామయ్య నేతృత్వంలోని తమ ప్రభుత్వం రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే ఈ పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీకి అపూర్వ విజయాన్ని అందిస్తాయని అన్నారు. దేశాభివృద్ధి గురించి ఒక ప్రణాళిక అంటూ లేని నరేంద్రమోడీ ప్రధాని ఎలా కాగలరని ప్రశ్నించారు. త్వరలోనే పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలిపారు. సుమలత మాట్లాడుతూ...తన భర్త అంబరీష్కు ఇది నిజంగానే పునర్జన్మ అని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థనలు జరిపిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
అంబరీష్ ఆరోగ్యంగా ఉన్నారు : సుమలత
* రాష్ట్రవ్యాప్తంగా అంబి అభిమానుల పూజలు *లండన్ నుంచి బయలుదేరిన కుమారుడు * అంబిని పరామర్శించిన దేవెగౌడ, యడ్యూరప్ప, దర్శన్, మోహన్ బాబు బెంగళూరు, న్యూస్లైన్ : శాండిల్వుడ్ రెబల్స్టార్, రాష్ట్ర మంత్రి అంబరీష్ ఆరోగ్యం కుదుటపడుతోందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సతీమణి, బహుభాష నటి సుమలత అన్నారు. ఆదివారం సుమలత విక్రమ్ ఆస్పత్రిలో వైద్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అంబరీష్ ఆరోగ్యం విషమించిందని వస్తున్న వదంతులు నమ్మరాదని విజ్ఞప్తి చేశారు. శ్వాసకోశ సమస్యతో అంబరీష్ చికిత్స పొందుతున్నాడని, విక్రమ్ ఆస్పత్రి వైద్యులు సతీష్, రంగనాథ్, విజయ్, రఘు తదితరులు చికిత్స చేస్తున్నట్లు ఆమె తెలిపారు. త్వరలో ఆయనను జనరల్ వార్డుకు మారుస్తామని వైద్యులు తెలిపారని సుమలత వివరించారు. అంబరీష్ ఐసీయులో వెంటిలేటర్తో ఉన్నందువల్ల మాట్లాడటానికి వీలు కావడం లేదని, ఆయన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, కన్నడ సినీనటుడు దర్శన్ తదితరులు ఆస్పత్రికి చేరుకుని అంబరీష్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే అంబరీష్ ఆరోగ్యం కుదుటపడాలని బెంగళూరు నగరంతో సహ రాష్ట్ర వ్యాప్తంగా హోమాలు, పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లండన్ నుంచి బయలుదేరిన కుమారుడు అంబరీష్, సుమలతల కుమారుడు అభిషేక్ లండన్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నాడు. తండ్రి అనారోగ్యం విషయం తెలుసుకున్న అతడు లండన్ నుంచి బెంగళూరు బయలుదేరాడు. సోమవారం అభిషేక్ బెంగళూరు చేరుకుంటారని అంబరీష్ సన్నిహితులు తెలిపారు. అంబిని పరామర్శించిన మోహన్ బాబు శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతూ విక్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంబరీష్ను ప్రముఖ తెలుగు చలన చిత్ర నటుడు మోహన్బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు పరామర్శించారు. ఆదివారం నగరానికి చేరుకున్న వీరు నేరుగా ఆస్పత్రికి చేరుకుని అంబరీష్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంబరీష్ను పరామర్శించిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. -
ఐసీయూలో అంబరీష్
ఆస్పత్రి ఎదుట అభిమానుల ధర్నా ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు : సిద్దరామయ్య బెంగళూరు, న్యూస్లైన్ : శ్యాండిల్వుడ్ రెబల్స్టార్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ అనారోగ్యంతో ఇక్కడి విక్రమ్ ఆస్పత్రి ఐసీయులో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురైన అంబరీష్ను వెంటనే ఆయన సతీమణి సుమలత పాటు కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విక్రమ్ ఆస్పత్రికి శ్వాసకోస వైద్య నిపుణుడు సతీష్ నాయక్, గుండె వైద్య నిపుణుడు డాక్టర్ రంగనాథ్, కిడ్ని వైద్య నిపుణుడు రవీష్లు అంబరీష్కు వైద్యం అందిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో సమస్య ఎదురవుతోందని వైద్యులు తెలిపారు. శనివారం సాయంత్రం వైద్యులు సతీష్ నాయక్, రంగనాథ్, రవీష్లు విలేకరులతో మాట్లాడారు. అంబరీష్ కోలుకుంటున్నారని చెప్పారు. అంబరీష్ ఐసీయూలో ఉండటం వల్ల ఎవ్వరూ ఆందోళన చెందన వసరం లేదని, ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని వారు అన్నారు. తరలి వచ్చిన నాయకులు.. నటులు ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హోం శాఖ మంత్రి కే.జే. జార్జ్ తదితరులు విక్రమ్ ఆస్పత్రికి వచ్చి అంబరీష్ ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిద్దు విలేకరులతో మాట్లాడుతూ... డాక్టర్ల సమాచారం మేరకు అంబరీష్ ఐసీయూలో ఆరోగ్యంగానే ఉన్నారని అన్నారు. అంబరీష్ను పరామర్శించడానికి హ్యాట్రిక్ హీరో శివరాజ్కుమార్, క్రేజీస్టార్ రవిచంద్రన్, భారతీ విష్ణువర్దన్తో సహ పలువురు నటినటులు ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. ఇదిలా ఉంటే అంబరీష్ ఆరోగ్య విషయంపై ఆందోళన చెందిన ఆయన అభిమానులు వందలాది మంది ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ అభిమాన నాయకుడిని చూడటానికి అవకాశం ఇవ్వాలని మండ్యకు చెందిన అభిమానులు ఆస్పత్రి వద్ద ధర్నా నిర్వహించారు.