Babri Masjid case
-
CJI Chandrachud: అయోధ్య సమస్య పరిష్కారం కోసం దేవుడిని ప్రార్థించా
పుణే: రామ జన్మ భూ మి–బాబ్రీ మసీదు వి వాదం పరిష్కారం కోసం భగవంతుడిని ప్రార్థించానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. భగవంతుడి పట్ల విశ్వాసం ఉంటే ఆయన కచ్చితంగా పరిష్కార మార్గం చూపిస్తాడని అన్నారు. జస్టిస్ చంద్రచూడ్ వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని ఖేడ్ తాలూకా కన్హేర్సార్. ఈ గ్రామ ప్రజలు ఆదివారం ఆయనను సత్కరించారు. కేసుల విచారణ సమయంలో న్యాయమూర్తులకు కొన్నిసార్లు పరిష్కార మార్గాలు కనిపించవని ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. అయోధ్య వ్యవహారంపై విచారణ జరుగుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితి తనకు ఎదురైందన్నారు. అప్పుడు భగవంతుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థించానని, సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నానని తెలిపారు. తాను తరచుగా దేవుడిని ప్రార్థిస్తుంటానని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా 2019 నవంబర్ 9న అప్పటి సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్ కూడా ఒక సభ్యుడే. -
Indo-Islamic Cultural Foundation: అయోధ్యలో మసీదు నిర్మాణం.. మేలో ప్రారంభం
లక్నో: రామజన్మభూమి– బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యలో ప్రతిపాదిత మసీదు నిర్మాణ పనులు వచ్చే ఏడాది మేలో ప్రారంభం కానున్నాయి. అయోధ్యలోని ధన్నిపూర్లో మసీదు నిర్మాణ బాధ్యతలను ఇండో–ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ తీసుకుంది. మసీదు నిర్మాణానికి అవసరమై నిధుల సేకరణకు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి వివిధ రాష్ట్రాలకు ఇన్చార్జుల నియామకాలు చేపట్టాలని ట్రస్ట్ యోచిస్తోంది. ఫిబ్రవరిలో మసీదు తుది డిజైన్ను ఖరారు చేసి అధికారుల ఆమోదానికి పంపుతామని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్బోర్డ్ చైర్మన్, ఇండో–ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ చీఫ్ ట్రస్టీ జుఫర్ ఫరూకీ తెలిపారు. ‘15 వేల చదరపు అడుగులకు బదులు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మసీదు నిర్మాణం జరగనుంది. జవాబుదారీతనం, పారదర్శకత పాటిస్తూ నిధులు సేకరిస్తాం. ప్రభుత్వమిచ్చే భూమిలో మసీదుతో పాటు ఆస్పత్రి, లైబ్రరీ, కమ్యూనిటీ కిచెన్, మ్యూజియంలను కూడా నిర్మిస్తాం. నిర్మాణ పనుల కోసం ముంబైకి చెందిన సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం. నిధుల లభ్యతపైనే నిర్మాణ పనుల వేగం ఆధారపడి ఉంటుంది’’ అని ట్రస్ట్ సెక్రటరీ అథార్ హుస్సేన్ చెప్పారు. మధ్యప్రాచ్య మసీదుల శైలిలో రూపొందిన తొలి డిజైన్ తిరస్కరణకు గురవడం కూడా ఆలస్యానికి ఒక కారణమన్నారు. ప్రతిపాదిత మసీదు, ఇతర భవనాల డిజైన్ను మసీదు కమిటీ 2021లో అయోధ్య డెవలప్మెంట్ అథారిటీకి సమర్పించగా ఈ ఏడాది మార్చిలో అనుమతులు లభించాయి. కేంద్రం అయోధ్యలో ఐదెకరాలను యూపీ సున్ని సెంట్రల్ వక్ఫ్బోర్డ్కు అందజేయగా, బోర్డ్ మసీదు నిర్మాణ బాధ్యతలను ఇండో–ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్కు అప్పగించింది. -
Gyanvapi Masjid Case: కదిలిన తేనెతుట్టె!
చిన్నగా మొదలైన కొన్ని అంశాలే కాలగతిలో పెను పరిణామాలకు దారితీస్తాయి. ఇది చరిత్రలోని చిత్రమైన లక్షణం. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వ్యవహారానికి సంబంధించి అక్కడి జిల్లా న్యాయస్థానం సోమవారం ఇచ్చిన 26 పేజీల ఆదేశం సరిగ్గా అలాంటిదే. మసీదు ప్రాంగణంలోని హిందూ దేవతామూర్తులను పూజించేందుకు అనుమతించాలంటూ అయిదుగురు హిందూ మహిళలు వేసిన పిటిషన్ విచారణార్హమైనదే అని కోర్టు నిర్ణయించడం కీలక పరిణామం. 17వ శతాబ్దికి చెందిన ఈ మసీదులో పూజలకు అనుమతించడానికి ఇప్పుడున్న మూడు చట్టాల ప్రకారం కుదరదంటూ మసీదును నిర్వహిస్తున్న అంజుమన్ ఇంతెజామియా మస్జిద్ కమిటీ వాదించింది. ప్రార్థనా స్థలాల (ప్రత్యేక ఏర్పాట్ల) చట్టం – 1991, వక్ఫ్ చట్టం – 1995, యూపీ శ్రీకాశీ విశ్వనాథ్ ఆలయ చట్టం –1983... ఈ మూడింటినీ కమిటీ ప్రస్తావించింది. కానీ, జడ్జి విశ్వేశ ఆ వాదనను తోసిపుచ్చారు. ఈ 22న విచారణకు నిర్ణయించారు. జిల్లా కోర్ట్ ఆదేశంపై మస్జిద్ కమిటీ హైకోర్ట్ గుమ్మం తొక్కనుంది. వెరసి, సుదీర్ఘంగా సాగిన అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు – రామజన్మభూమి వ్యవహారంలా ఇక ఇప్పుడు కాశీలో జ్ఞానవాపి కథ మొదలు కానుంది. కొద్దినెలల విరామం తర్వాత జ్ఞానవాపి మసీదు వివాదంలో మొదలైన ఈ కొత్త అంకం అనేక పర్యవసానాలకు దారితీయడం ఖాయం. కొద్ది నెలల క్రితం మసీదు ప్రాంగణాన్ని సర్వే చేసి, వీడియో తీసినప్పుడు బయటపడ్డ శివలింగం తరహా నిర్మాణం గురించి కోర్టులో చర్చకు రానుంది. అయోధ్య, కాశీ, మథురల్లోని మసీదులు నిజానికి హిందువుల భూభూగాలేననే వాదన దీర్ఘకాలంగా ఉంది. చాలా ఏళ్ళుగా బీజేపీ, సంఘ్ పరివార్లు దాన్ని తమ రాజకీయ అజెండాగా మార్చుకున్నాయి. దీనిపై ఇటు వీధుల్లోనూ, అటు కోర్టుల్లోనూ పోరు సాగిస్తూనే ఉన్నాయి. రామజన్మభూమి ఉద్యమం తీవ్రంగా సాగుతున్న వేళ ఆ స్థాయి వివాదాలు ఇతర ప్రార్థనా స్థలాలపై తలెత్తకూడదనే ఉద్దేశంతో 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని అప్పటి కేంద్రప్రభుత్వం చేసింది. 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న స్థితినే కొనసాగించాలనీ, ఏ వివాదాస్పద ప్రార్థనా స్థల స్వరూప స్వభావాలనూ మార్చ రాదనీ సదరు చట్టం నిర్దేశిస్తోంది. తీరా 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతతో ప్రార్థనాస్థల రాజకీయాలు పతాకస్థాయికి చేరాయి. మళ్ళీ ఇప్పుడు జ్ఞానవాపిపై కోర్టు ఆదేశంతో ఒకప్పటి బాబ్రీ మసీదు వివాదంలా సమాజంలోని రెండు వర్గాల మధ్య సామరస్యం దెబ్బతిని, సుస్థిరత దెబ్బతినే ప్రమాదం ఉంది. 1991 నాటి చట్టం సైతం నిష్ప్రయోజనం కావచ్చని ముస్లిమ్ వర్గం ఆందోళన. అయితే, 1947కూ, 1993కూ మధ్య జ్ఞానవాపి ప్రాంగణంలో హిందువుల ప్రార్థనలను అనుమతించారు. 1993 తర్వాతా ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏటా ఒకసారి అక్కడ దేవతామూర్తుల ప్రార్థనకు వీలు కల్పిస్తున్నారు. హిందూ మహిళల పిటిషన్ను అనుమతించిన జిల్లా కోర్ట్ ఆ సంగతులే గుర్తు చేసింది. ప్రార్థనాస్థల ధార్మిక స్వరూప స్వభావాలను మార్చే ప్రయత్నమేదీ ఇందులో లేదనీ, అక్కడ పూజలు చేసుకొనే హక్కు మాత్రమే అడుగుతున్నారనీ వ్యాఖ్యానించింది. కానీ, కథ అంతటితో ఆగుతుందా అన్నది ప్రశ్న. నిజానికి, జ్ఞానవాపి ప్రాంగణంపై హక్కులకు సంబంధించి హైకోర్ట్లో ఇప్పటికే అనేక కేసులు విచారణలో ఉన్నాయి. ప్రాంగణంలో భారత సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ)తో సర్వేకు అనుమతిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశం పైనా హైకోర్ట్ విచారిస్తోంది. ఇలా జ్ఞానవాపిపై ఒక వర్గం ఒకే రకమైన పలు కేసులు దాఖలు చేయడం ఒక వ్యూహం ప్రకారం జరుగుతోందని రెండో వర్గం అనుమానం. పూజల కోసం భక్తులు వేసిన పిటిషన్ను ముందుగా జిల్లా కోర్టు వినాలని ఆ మధ్య సుప్రీం కోర్టే చెప్పింది. వారణాసి కోర్ట్ తాజా నిర్ణయంతో వివాదం పైకోర్టులకు పాకుతుంది. నిజానికి, దశాబ్దాల తరబడి సాగిన రామజన్మభూమి వివాదంపై 2019లో అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు నిచ్చింది. బాబ్రీ మసీదు ఒకప్పుడున్న స్థలంలో రామాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిస్తూనే, 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని భారత రాజ్యాంగ లౌకికవాద లక్షణాలను కాపాడేందుకు తీర్చి దిద్దిన చట్టపరమైన పరికరంగా అభివర్ణించింది. తీరా తాజా నిర్ణయంతో వారణాసి కోర్ట్ ఆ మాట లను ప్రశ్నార్థకం చేసి, వివాదాల తేనెతుట్టెను కదిలించింది. పైకి కోర్టు కేసులుగా కనిపిస్తున్నా, వీటిలో రాజకీయాలూ పుష్కలం. బాబ్రీ మసీదు వివాదంతో ఇప్పటికే దేశంలో ఒక వర్గాన్ని బయటి వ్యక్తులుగా చూసే ధోరణి ప్రబలింది. జాతీయవాదం, హైందవ ఆత్మగౌరవం లాంటి పదబంధా లకు ప్రాచుర్యం పెరిగింది. మరోపక్క మథుర, ఆగ్రాల్లోనూ ఇలాంటి కేసులే కోర్టుల్లో ఉన్నాయి. అసలు ‘ప్రార్థనాస్థలాల చట్టం–1991’ రాజ్యాంగబద్ధత పైనా సుప్రీమ్లో కేసు పెండింగ్లో ఉంది. ఆ అంశంపై సుప్రీమ్ తీర్పు కోసం నిరీక్షించకుండా, జిల్లా కోర్ట్ అత్యుత్సాహం చూపింది. ఈ పరిస్థితుల్లో ఈ వివాదాలన్నిటికీ కీలకం కానున్న 1991 నాటి చట్టానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఎంత త్వరగా తన తీర్పునిస్తే అంత మంచిది. కింది కోర్టులకు అది మార్గదర్శకమవుతుంది. సమస్యలు మరింత జటిలం కాకుండా అడ్డుకుంటుంది. ఎందుకంటే, ధార్మిక విశ్వాసాలు నిప్పు లాంటివి. వాటితో చెలగాటమాడితే చేతులు కాలక తప్పదు. ఏమరుపాటుగా ఉంటే సమాజాన్నీ, విభిన్న వర్గాల సామరస్యాన్నీ ఆ అగ్ని దహించకా తప్పదు. న్యాయస్థానాల మొదలు ప్రభుత్వాల దాకా అందరూ అప్రమత్తంగా ఉండాల్సింది అందుకే! -
మరోసారి తెరపైకి అయోధ్య కేసు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన అయోధ్యలోని బాబ్రీమసీదు కూల్చివేత కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మసీదు కూల్చివేత స్థలంలో నూతన రామమందిరం రూపుదిద్దుకుంటున్న తరుణంలో అలహాబాద్ హైకోర్టు ముందు దాఖలైన పిటిషన్ బీజేపీ సీనియర్ నేతల్లో గుబులు రేపుతోంది. మసీదు కూల్చివేతలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ (92), మురళీ మనోహార్ జోషీ (86), ఉమాభారతి, కళ్యాణ్ సింగ్, వీహెచ్పీ నేత వినయ్ కటియార్లతో పాటు మొత్తం 32 మంది నిర్ధోషులుగా తేల్చుతూ లక్నో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అయోధ్యకు చెందిన ఇద్దరు వ్యక్తులు సవాలు చేశారు. స్థానికులైన హాజీ మహ్మద్ అహ్మద్ (74), సయ్యద్ అల్కఖ్ అహ్మద్ (81) అనే ఇద్దరు ముస్లిం వ్యక్తులు సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ శుక్రవారం అలహాబాద్ హైకోర్టు ముందు ఓ పిటిషన్ దాఖలు చేశారు. తీర్పును పునఃసమీక్షించాలని పిటిషన్లో కోరారు. (వృద్ధ నేతను వెంటాడుతున్న బాబ్రీ విధ్వంసం) కాగా ఈ కేసుకు సంబంధించి మొత్తం 49 మందిపై సీబీఐ అభియోగాలు నమోదు చేయగా.. 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ సమయంలో 17 మంది చనిపోయారు. మిగిలిన 32 మందిని నిర్దోషులని సీబీఐ ప్రత్యేక కోర్టు తాజాగా తీర్పు ప్రకటించింది. మసీదు కూల్చివేతకు నిందితులు కుట్ర పన్నినట్లుగా ఎలాంటి స్పష్టమైన, విశ్వసనీయ సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. పైగా, అందులో రామ్లల్లా విగ్రహం ఉన్నందున, ఆ నిర్మాణాన్ని కాపాడేందుకు విశ్వహిందూ పరిషత్ నేత దివంగత అశోక్సింఘాల్ ప్రయత్నించారని దాదాపు 2,300 పేజీల తీర్పులో సీబీఐ న్యాయమూర్తి ఎస్కే యాదవ్ వెల్లడించారు. నిందితులంతా రూ. 50 వేల వ్యక్తిగత బాండ్ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. విచారణ సమయంలో కూల్చివేత ఘటన నాటి వార్తాకథనాలను కానీ, వీడియో క్యాసెట్లను న్యాయమూర్తి సాక్ష్యాలుగా పరిగణించలేదు. (ఎదురుదెబ్బ: ఎన్డీయేలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!) ఒరిజినల్ కాపీలు కానందున వాటిని సాక్ష్యాలుగా పరిగణించలేదన్నారు. కోర్టుకు సమర్పించిన వీడియోలు కూడా స్పష్టంగా లేవన్నారు. అలాగే, నెగెటివ్స్ సమర్పించనందున, ఘటనకు సంబంధించిన ఫొటోలను కూడా సాక్ష్యాలుగా పరిగణించలేమన్నారు. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామాలయ నిర్మాణం కోసం వినియోగించాలని సుప్రీంకోర్టు 2019 నవంబర్లో చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని మరో ప్రముఖ ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని నాటి సీజే రంజన్ గొగోయ్ తీర్పులో పేర్కొన్నారు. ఆ 32 మంది వీరే.. 1, ఎల్కే అడ్వాణీ, 2. మురళీ మనోహర్ జోషి, 3. కళ్యాణ్ సింగ్, 4. ఉమాభారతి, 5. వినయ్ కతియార్, 6. సాక్షి మహరాజ్, 7. సాధ్వి రితంబర, 8. మహంత్ నృత్య గోపాల్ దాస్, 9. రామ్విలాస్ వేదాంతి, 10. చంపత్ రాయ్, 11. సతీష్ ప్రధాన్, 12. ధరమ్ దాస్, 13. బ్రిజ్ భూషణ్ సింగ్, 14. పవన్ కుమార్ పాండే, 15. జై భగవాన్ గోయల్, 16. లల్లూ సింగ్, 17. జైభాన్ సింగ్ పావాయా, 18. ఆచార్య ధర్మేంద్ర దేవ్, 19. రాంజీ గుప్తా, 20. ప్రకాశ్ శర్మ, 21. ధర్మేంద్ర సింగ్ గుర్జార్, 22. ఆర్ఎం శ్రీవాస్తవ, 23. సతీష్ ప్రధాన్ కరసేవకులు: 24. రామ్ చంద్ర ఖత్రి, 25. సుధీర్ కక్కర్, 26. అమన్ నాథ్ గోయల్, 27. సంతోష్ దుబే, 28. వినయ్ కుమార్ రాయ్, 29. కమలేష్ త్రిపాఠి, 30. గంధి యాదవ్, 31, విజయ్ బహదూర్ సింగ్, 32. నవీన్ భాయ్ శుక్లా. -
బాబ్రీ విధ్వంసం వెనక పాక్ హస్తం!
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలోని బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ప్రత్యేక సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుకు అన్ని జాతీయ పత్రికలు, ప్రాంతీయ పత్రికలు తగిన ప్రాధాన్యతనిచ్చాయి. పాలకపక్ష బీజేపీ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, ఉమా భారతి సహా మొత్తం 32 మంది నిందితులు నిర్దోషులని, వారు బాబ్రీ విధ్వంసానికి ముందస్తు కుట్ర పన్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ ఇచ్చిన తీర్పుకు ఈ పత్రికలు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాయి. (బాబ్రీ తీర్పు.. బీజేపీకి నయా అస్త్రం) బాబ్రీ మసీదు విధ్వంసం వెనక పాకిస్థాన్ హస్తం ఉండవచ్చంటూ ప్రత్యేక సీబీఐ జడ్జీ ఎస్కే యాదవ్ చేసిన వ్యాఖ్యకు కొన్ని పత్రికలు తక్కువ ప్రాధాన్యతనివ్వగా మిగతా పత్రికలు అసలు పట్టించుకోలేదు. విధ్వంసం జరిగిన రోజున బాబ్రీ మసీదు వద్ద టెర్రరిస్టులు కూడా ఉండి ఉండవచ్చంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. బీజేపీ సీనియర్ నేతలు బాబ్రీ మసీదు విధ్వంసానికి కుట్ర పన్నారనడానికి ఫొటోలు, వీడియోల సాక్ష్యంగానీ, ఫోరెన్సిక్ నిపుణుల విశ్లేషణలుగానీ లేవంటూ కూడా జడ్జీ నొక్కి చెప్పడాన్ని కూడా పత్రికలు పట్టించుకోలేదు. (‘బాబ్రీ’ తీర్పు: అందరూ నిర్దోషులే) 1992, డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు విధ్వంసానికి పాల్పడిన వారు మాత్రం ‘కచ్చితంగా సంఘ విద్రోహ శక్తులే’ అంటూ కూడా జడ్జీ యాదవ్ వ్యాఖ్యానించారు. మసీదును కూల్చడం అక్రమమని, అది చట్టాన్ని ఉల్లంఘించటమేనంటూ అయోధ్య స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. పాలకపక్ష బీజేపీ తన పార్టీ వైఖరికి సానుకూలంగా తీర్పులిస్తోన్న వారిని రాజకీయ పదవులతో సముచితంగా సత్కరిస్తున్నాయంటూ ఒకటి, రెండు జాతీయ ఆంగ్ల పత్రికలు వ్యంగ్యోక్తులు విసిరాయి. (మసీదు దానికదే కూలిపోయిందా?) ‘బాబ్రీ విధ్వంసం కేసులో ఎవరూ దోషులు కాదు’ అనే శీర్షికతో వార్తను ప్రచురించిన ఆనందబజార్ పత్రిక, ఇంకా నయం ‘బాబ్రీని ఎవరు కూల్చలేదు’ అంటూ కోర్టు తీర్పు ఇవ్వలేదంటూ కొంతమంది సంబర పడుతున్నారని వ్యాఖ్యానించింది. ‘ఏక్ దక్కా ఔర్ దో, బాబ్రీ మసీద్ తోడ్ దో’ అంటూ బీజేపీ లేదా విశ్వహిందూ పరిషద్ నాయకులు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, అశోక్ సింఘాల్’ నినాదాలు ఇవ్వడం ఎవరూ వినలేదంటూ ఆ పత్రిక వ్యంగోక్తి విసిరింది. ‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు బాబ్రీ మసీదును విధ్వంసం చేయకుండా ప్రజలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు’ అంటూ సీబీఐ జడ్జీ యాదవ్ చేసిన వ్యాఖ్యకు తమిళ పత్రిక ‘దినమలార్’ ప్రాధాన్యతనిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టుకు వెళుతుందా? అంటూ కూడా ఆ పత్రిక సందేహం వ్యక్తం చేసింది. ‘1992, డిసెంబర్ 6వ తేదీన ఏం జరిగిందో, 2020, సెప్టెంబర్ 30వ తేదీన ఏం తీర్పు వెలువడిందో మనందరికి తెలుసు. బాబ్రీ విధ్వంసం తర్వాత చెలరేగిన అల్లర్లలో చిమ్మిన రక్తం ఎంతో మనలో కళ్లతో చూసిన వారు ఉన్నారు. ఇదంగా ఎవరు చేశారో మనకు తెలుసు. ఎందుకు చేశారో మనకు తెలుసు. దాని వల్ల జాతికెంత నష్టమో మనకు తెలుసా? వారికి న్యాయబద్ధత కల్పిస్తున్నాం. ఎన్నికల అనంతరం ఎన్నికల్లో గెలిపిస్తూ వస్తున్నాం. ఇప్పుడు నిరాశతో ఓండ్ర పెడితే లాభం ఏమిటీ?! ది టెలీగ్రాఫ్ పత్రిక వ్యాఖ్యానించింది. -
బాబ్రీ తీర్పు.. బీజేపీకి నయా అస్త్రం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపిన బాబ్రీ మసీదు విధ్వంసం చేసులో పాలక బీజేపీకి అనుకూలంగా తీర్పు రావడంతో కకమలనాథులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన మసీదును ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్, కరసేవకులు కూల్చివేశారనే ఆరోపణలు తొలినుంచీ వినిపిస్తున్నాయి. అయితే వీటన్నింటికీ తాజాగా లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం చెక్పెట్టింది. మసీదు కూల్చివేతలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులంతా నిర్దోషులేనని ఏకసభ్య ధర్మాసనం ప్రకటించింది. దీంతో 28 ఏళ్లుగా నిందను మోస్తున్న బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతీతో పాటు మరికొంత మందికి ఈ కేసు నుంచి ఊరట లభించింది. దేశంలో ఓ వైపు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ తీర్పు రావడం కమలనాథులకు కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. (తొలగిన మచ్చ.. దక్కిన ఊరట) కీలకమైన బిహార్ అసెంబ్లీతో పాటు దేశ వ్యాప్తంగా 56 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ను విడుదల చేసింది. వీటిలో మధ్యప్రదేశ్లోని 24 అసెంబ్లీ స్థానాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా రానున్న ఏడాదిన్నర కాలంలో పంజాబ్తో పాటు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే బాబ్రీ విధ్వంసానికి బీజేపీ నేతలు పాల్పడలేదని తాజాగా కోర్టు స్పష్టం చేయడంతో ఈ ఎన్నికల్లో వారికి కొంతమేర లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. మసీదు కూల్చివేత అనేది కుట్రపూరితంగా, ప్రణాళిక ప్రకారం జరగలేదని న్యాయస్థానం ప్రకటించడం బీజేపీ భవిష్యత్కు బాటలు వేయడంలాంటిదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజా తీర్పుతో మైనార్టీలో ఉన్న అపనింద కూడా తొలగిపోతుందని భావిస్తున్నారు. (కమలనాథుల్లో కొత్త ఉత్సాహం) ఈ తీర్పుతో రానున్న కాలంలో ఎన్నికలు జరుగనున్న బిహార్, బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో ఏమాత్రం పట్టులేని బీజేపీ ఏకంగా 18 స్థానాలను కైవసం చేసుకుంది. అనూహ్యంగా 40.64 శాతం ఓట్లు సాధించింది. 2014 ఎన్నికల్లో 34 ఎంపీ స్థానాలను గెలుచుకున్న పాలక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 22 స్థానాలకే పరిమితం అయ్యింది. కాంగ్రెస్, వామపక్షాలు ఘోర పరాజయం చవిచూడక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే చాపకింద నీరులా విస్తరిస్తున్న బీజేపీని చూసి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన చెందుతున్నారు. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన పట్టు సడలకుండా చూసుకోవడానికి ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను తన రాజకీయ సలహాదారుడిగా నియమించుకున్నారు. ఈ తరుణంలో బాబ్రీ మసీదు తీర్పు రావడంతో దానిని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కమలనాథులు రామ మందిర నిర్మాణాన్ని తమ ఖాతాలో వేసుకుంటూనే మసీదు కూల్చివేతతో అంటిన మట్టిని వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. గత ఏడాది మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడం, ఇప్పుడు మసీదు కూల్చివేతలో బీజేపీ ప్రమేయం లేదని కోర్టు తేల్చి చెప్పడంతో రాజకీయంగా తమకు బాగా లబ్ధి చేకూరుతుందని బీజేపీ వర్గాలు యోచిస్తున్నాయి. ఇక బీజేపీ ప్రయోగించిన ఈ అస్త్రాన్ని ఎదుర్కొవడం విపక్షాలకు పెను సవాలే. -
కొండను తవ్వి...
బాబ్రీ మసీదు విధ్వంసం కుట్ర కేసు కథ ఎట్టకేలకు ముగిసిపోయింది. ఈ కేసులో నిందితులుగా వున్న 32మంది నిర్దోషులని బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. వాస్తవానికి ఇందులో మొత్తం 49మంది నిందితులుకాగా... బాల్ ఠాక్రే, మహంత్ అవైద్యనాథ్, అశోక్ సింఘాల్తోసహా 17మంది మరణించారు. 1992 డిసెంబర్ 6న జరిగిన మసీదు కూల్చివేతలో ముందస్తు పథకం లేదని, ఈ విషయంలో సీబీఐ సమర్పించిన సాక్ష్యాధారాలు నిందితులను శిక్షించడానికి సరిపోవని కోర్టు తేల్చింది. ఆశ్చర్యకరమేమంటే ఈ ఉదంతంలో కుట్ర దాగుందని అప్పట్లో పీవీ నరసింహారావు ప్రభుత్వం నియమించిన న్యాయవిచారణ కమిషన్కు నేతృత్వంవహించిన జస్టిస్ మన్మోహన్సింగ్ లిబర్హాన్ 2009లో అభిప్రాయపడ్డారు. అసలు ఈ కేసు న్యాయస్థానాల్లో నడిచిన తీరు గమనిస్తే ఎవ రైనా ఆశ్చర్యపోతారు. రామజన్మ భూమి–బాబ్రీ మసీదు వివాదం గత ఏడాది నవంబర్లో అయి దుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పుతో ముగిసింది. వివాదా స్పదమైన 2.77 ఎకరాల స్థలాన్ని ధర్మాసనం రామమందిర నిర్మాణానికే అప్పగించింది. మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల భూమి చూడాలని, దాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే ఆ సివిల్ తగాదాతోపాటు బాబ్రీ మసీదు కూల్చివేత ఉదంతంపై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. అందులో ఒకటి ‘గుర్తు తెలియని’ కరసేవకు లపై పెట్టిన కేసు కాగా, రెండోది ఈ కుట్ర కేసు. జాతీయ సమగ్రతకు భంగం కలిగించారని, వదం తులు సృష్టించి శాంతిభద్రతలకు భంగం కలిగించారని, అందుకోసం కుట్రకు పాల్పడ్డారని ఈ కేసు లోని అభియోగం. ఇందులో మొదటి కేసు లక్నో సెషన్స్ కోర్టులో, రెండోది రాయ్బరేలీ కోర్టులో పాతికేళ్లపాటు కొనసాగాయి. మధ్యలో 2001లో కుట్ర కేసు అభియోగాలు చెల్లబోవని రాయ్బరేలీ కోర్టు తీర్పునిచ్చింది. దీన్ని 2010లో అలహాబాద్ హైకోర్టు కూడా ధ్రువీకరించింది. కానీ సుప్రీంకోర్టు 2017లో దీన్ని అంగీకరించలేదు. అసలు ఒకే స్వభావం వున్న రెండు వేర్వేరు కేసులను ఇలా రెండు చోట్ల విచారించడంలో అర్థమేముందని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించి, వాటిని విలీనం చేసి విచారించాలని చెప్పడంతో కుట్ర కేసు విచారణ మళ్లీ ప్రాణం పోసుకుంది. ఈ కేసును సీబీఐ ప్రత్యేక కోర్టులో రోజువారీ ప్రాతిపదికన విచారణ సాగించి రెండేళ్లలో తీర్పునివ్వాలని అప్పట్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాలుగా సమర్పించిన డాక్యుమెంట్లు దాదాపు 800 కాగా, వందలసంఖ్యలో ఆడియో, వీడియోలు, వేర్వేరు ఫైళ్లు వున్నాయి. 351మంది సాక్షులున్నారు. వివిధ పక్షాల న్యాయవాదుల వాదనలు సరేసరి. కనుక ఇంత విస్తృతమైన, సంక్లిష్టమైన కేసు గనుకే సర్వో న్నత న్యాయస్థానం ఆదేశించిన గడువులోగా తీర్పునివ్వడం సాధ్యపడలేదని దీన్ని విచారించిన ఎస్కే యాదవ్ చెప్పడంలో వాస్తవం ఉండొచ్చు. ఈ కేసులో ఆనాటి ఐపీఎస్ అధికారిణి అంజూ గుప్తా, అప్పట్లో ఈ ఉదంతాన్ని మీడియా ప్రతి నిధిగా దగ్గరుండి చూసిన రాధికా రామశేషన్ ఇచ్చిన సాక్ష్యాధారాలు నిందితుల ప్రమేయాన్ని రుజువు చేస్తాయని భావించినవారున్నారు. ఆరోజు మసీదు వద్దకు వచ్చిన కరసేవకుల చేతుల్లో దాన్ని కూల్చ డానికి కావలసిన ఉపకరణాలున్నాయని, ముందస్తు ప్రణాళిక లేనప్పుడు అదెలా సాధ్యమని రాధికా రామశేషన్ ప్రశ్నించారు. వారు ఆ పని కానిస్తుండగా ఉమాభారతి వారిని ఉత్సాహపరచడం కళ్లారా చూశానని, ఆమె మాటలు ఇప్పటికీ తన చెవుల్లో మార్మోగుతున్నాయని చెప్పారు. కూల్చివేత పనులు సాగుతుండగా, అది పూర్తియ్యేవరకూ కదలొద్దని నాయకులు వారిని ఆదేశించారన్నది ఐపీఎస్ అధి కారి అంజూగుప్తా మాట. అయితే న్యాయస్థానాలు కేవలం వారి మౌఖిక సాక్ష్యాధారాలపైనే ఆధార పడటం సాధ్యం కాదు. వాటిని నిర్ధారించే ఇతరత్రా సాక్ష్యాలు కూడా వుండాలి. అప్పుడు మాత్రమే నిందితుల ప్రమేయాన్ని విశ్వసిస్తాయి. సీబీఐ ఆ విషయంలో ఎంతవరకూ కృతకృత్యమైందో, అది సమర్పించిన సాక్ష్యాధారాలేమిటో ప్రత్యేక కోర్టు వెలువరించిన 3,000 పేజీల తీర్పు పూర్తి పాఠం బయటికొస్తే తప్ప తెలిసే అవకాశం లేదు. అలాగే లిబర్హాన్ కమిషన్ సేకరించిన సాక్ష్యాధారాలేమైనా ప్రత్యేక కోర్టు పరిశీలించిందా...ఆ విషయంలో సీబీఐని ఏమైనా నిలదీసిందా అన్నది కూడా చూడాలి. బాబ్రీ మసీదు కట్టడంపై వందేళ్లనుంచి వివాదం నడుస్తోంది. అయితే ఆ ప్రాంగణంలోకి ప్రైవేటు వ్యక్తులు చొరబడి, ఆ కట్టడాన్ని ధ్వంసం చేయడాన్ని ఏ చట్టమూ అంగీకరించదు. కనుక ఆ రోజున అక్కడ విధ్వంసానికి దిగినవారు చట్టం దృష్టిలో దోషులే. ఈ కేసు విచారణ జరపాల్సిందేనని 2017లో చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టిలో అయితే ఇలా కూల్చివేతకు పాల్పడటం ‘ఒక అసా ధారణమైన చట్ట ఉల్లంఘన’. ఇప్పుడు వెలువడిన తీర్పు గమనిస్తే సీబీఐ పకడ్బందీ సాక్ష్యాధారాలను సమర్పించలేకపోయిందన్న అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. న్యాయస్థానాలు తమముందున్న సాక్ష్యాధారాలు గమనిస్తాయి తప్ప వాస్తవంగా ఏం జరిగి వుండొచ్చునన్న ఊహాగానాలపై ఆధారపడవు. అయితే ఒకటి మాత్రం వాస్తవం. బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు తన జీవితంలో అత్యంత విషాకరమైన దినమని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ, మాజీ ప్రధాని వాజపేయి అనంతరకాలంలో వ్యాఖ్యానించారు. బహుశా బాబ్రీ విధ్వంసం తర్వాత జరిగిన పరిణామాలు వారికి ఆ అభిప్రాయం కలిగించివుండొచ్చు. బాబ్రీ వివాదం మొదల య్యాక దేశంలో ఏర్పడ్డ వైషమ్య భావాలు ఆ కట్టడం కూల్చివేతతో పరాకాష్టకు చేరాయి. దేశ వ్యాప్తంగా జరిగిన మత కల్లోలాల్లో 2,000మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పతాక శీర్షికల కెక్కిన ఈ మాదిరి కేసుల్లో సైతం సీబీఐ సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోవడం, కేసు విచార ణకు ఇరవైఎనిమిది సంవత్సరాలు పట్టడం, వందలమంది పాల్గొన్న విధ్వంస ఉదంతంలో చివరకు ఒక్కరినైనా శిక్షించలేకపోవడం సాధారణ పౌరులకు ఆశ్చర్యం కలిగించకమానదు. -
బాబ్రీ తీర్పుపై స్పందించిన బీజేపీ దిగ్గజ నేత
సాక్షి, న్యూఢిల్లీ : 1992 బాబ్రీ మసీదు విధ్వంసం కేసు నుంచి తనతో సహా నిందితులందరినీ నిర్ధోషులుగా ప్రత్యేక న్యాయస్ధానం బుధవారం వెలువరించిన తీర్పుపై బీజేపీ దిగ్గజనేత ఎల్కే అద్వానీ స్పందించారు. ఈ తీర్పు రామమందిర ఉద్యమం పట్ల బీజేపీతో పాటు తనకున్న విశ్వాసం, చిత్తశుద్ధిని ప్రతిబింబించిందని చెప్పారు. తీర్పు వెలువడిన అనంతరం తాను జై శ్రీరాం అంటూ నినదించానని, ఇది తమందరికీ సంతోషకర క్షణమని అభివర్ణించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ గత ఏడాది నవంబర్లో సుప్రీంకోర్టు వెల్లడించిన చారిత్రాత్మక తీర్పు అనంతరం తాజా తీర్పు వెలువడటం స్వాగతించదగిన పరిణామమని అద్వానీ చెప్పుకొచ్చారు. ఈ తీర్పును తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని 92 సంవత్సరాల అద్వానీ పేర్కొన్నారు. కాగా బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ దిగ్గజ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతి, కళ్యాణ్ సింగ్లపై కుట్ర ఆరోపణలు సహా 32 మంది నిందితులపై అభియోగాల నుంచి లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం విముక్తి కల్పించింది. 1992, డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత పథకం ప్రకారం జరిగింది కాదని న్యాయస్ధానం స్పష్టం చేసింది. సంఘ విద్రోహ శక్తులు కట్టడాన్ని కూల్చాయని, నిందితులు మసీదు కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించారని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం న్యాయమూర్తి ఎస్కే యాదవ్ పేర్కొన్నారు. సీబీఐ సమర్పించిన ఆడియో, వీడియో ఆధారాలు నేతలపై ఆరోపణలను బలపరిచేలా లేవని తేల్చిచెప్పారు. ఇక గత ఏడాది నవంబర్లో వివాదాస్పద స్థలాన్ని రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ స్ధలంలోనే ఈ ఏడాది ఆగస్ట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. చదవండి : న్యాయం గెలిచింది.. క్షమాపణ కోరండి: యోగి -
30న బాబ్రీ కేసుపై తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని మార్చివేసిన 28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై ఈనెల 30న తీర్పు వెలువడనుంది. బీజేపీ దిగ్గజ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి సహా నిందితులందరూ కోర్టుకు హాజరు కావాలని తీర్పును వెల్లడించనున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం జడ్జి ఎస్కే యాదవ్ కోరారు. 1992లో బాబ్రీ మసీదు ధ్వంసానికి దారితీసేలా కుట్రపూరితంగా వ్యవహరించారని బీజేపీ దిగ్గజ నేతలపై ఆరోపణలున్నాయి. రాముడి జన్మస్థలంలో మసీదు ఉందని నమ్మడంతో కరసేవకులు ఈ కట్టడాన్ని నేలమట్టం చేశారు. బాబ్రీ కూల్చివేతపై అద్వానీ (92) జులై 24న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ ప్రత్యేక న్యాయస్దానం ఎదుట స్టేట్మెంట్ రికార్డు చేశారు. అంతకుముందు రోజు మురళీ మనోహర్ జోషీ (86) తన స్టేట్మెంట్ రికార్డు చేశారు. తమపై నమోదైన అన్ని అభియోగాలను వారు తోసిపుచ్చారు. ఇక బాబ్రీ కేసులో న్యాయస్ధానం ఎలాంటి తీర్పు వెలువరించినా ఇబ్బంది లేదని బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి స్పష్టం చేశారు. చదవండి : బాబ్రీ మసీదు పరిమాణంలోనే కొత్త మసీదు! -
ఎల్.కె. అడ్వాణీ (బీజేపీ లీడర్) రాయని డైరీ
నెమ్మదిగా వెళ్లి వీడియో కాన్ఫరెన్సింగ్ రూమ్లో కూర్చున్నాను. అటువైపు సీబీఐ స్పెషల్ జడ్జి స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు. అతడు ఉన్నది లక్నోలో. నేను ఉన్నది ఢిల్లీలో. ‘‘మొదలు పెడదామా మిస్టర్ అడ్వాణీ..’’ అన్నాడు. జడ్జి వైపు చూశాను. ‘‘మిస్టర్ అడ్వాణీ, చెప్పండి.. ఆ రోజు కరసేవకుల్ని రెచ్చగొట్టి మీరే కదా అయోధ్యలోని బాబ్రీ మసీదు ధ్వంసం అవడానికి ప్రేరణ అయ్యారు?’’ అన్నాడు నేరుగా నన్ను గుచ్చి చూస్తూ! అతడెలా అడిగాడంటే.. నా కళ్లలో ఇప్పటికీ కరసేవకులు గునపాలతో ఆ కట్టడాన్ని కూలగొడుతున్న దృశ్యం కనిపిస్తున్నట్లుగా అడిగాడు. ‘‘మీరు ఏ కట్టడం గురించి అడుగుతున్నారో ఆ కట్టడం గురించి నాకసలు ఏమీ తెలీదు. అడ్వాణీకి తెలుసు అని మీతో ఎవరైనా చెప్పి ఉంటే, లేదా మీకై మీరు ఊహించి ఉంటే మీరు విన్నది నిజం కాదు. మీ ఊహా ఎటూ నిజం కాబోదు..’’ అని చెప్పాను. జడ్జి ఒక్క క్షణం ఆగాడు. ‘‘మిస్టర్ అడ్వాణీ.. మిమ్మల్ని నేను అడగవలసిన ప్రశ్నలు ఇంకా ఒక వెయ్యీ నలభై తొమ్మిది ఉన్నాయి. నా ప్రతి ప్రశ్నకూ మీరు ఒక వెయ్యీ యాభై సమాధానాలు ఇచ్చుకుంటూ పోతుంటే కొన్ని గంటల్లోనో, కొన్ని రోజుల్లోనో, కొన్ని సంవత్సరాల్లోనో మేము మీ నుంచి స్టేట్మెంట్ తీసుకోలేం. ఆగస్టు 31 లోపు మా విచారణ పూర్తవాలని సుప్రీంకోర్టు మమ్మల్ని ఆదేశించింది కనుక మేము మిమ్మల్ని అడిగే ప్రశ్నలకు మీరు మాకిచ్చే సమాధానాలను ఉప ప్రశ్నలు ఉత్పన్నం కాకుండా పరిమితం చేసుకోవడం వల్ల ఈ తొంభై రెండేళ్ల వయసులో మీరు మీ మధ్యాహ్న భోజనాన్ని వేళ తప్పకుండా తీసుకునేందుకు కూడా ఎలాంటి అంతరాయమూ ఏర్పడబోదని నేను భావిస్తున్నాను’’ అన్నాడు!! ‘‘ఢిల్లీలో నా భోజన వేళల గురించి లక్నోలో ఉండి ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు మిస్టర్ జస్టిస్. ప్రశ్నలూ సమాధానాలు అనేవి అడగడాన్ని బట్టి, చెప్పడాన్ని బట్టి తమ విస్తృతిని, సుదీర్ఘతను కలిగి ఉండవు. వాటిని కుదించుకోవడంలో ప్రావీణ్యం లేకపోవడం వల్లనే అవి విస్తరిస్తాయి. నన్ను అడిగేందుకు మీ దగ్గర సిద్ధంగా ఉన్న ఒక వెయ్యీ యాభై ప్రశ్నలన్నిటికీ నేను ఇవ్వవలసిన సమాధానాలను రెండంటే రెండే సమాధానాలుగా కుదించుకోగలను. నా రెండు సమాధానాలకు తగ్గట్లు మీరు మీ ఒక వెయ్యీ యాభై ప్రశ్నలను రెండంటే రెండే ప్రశ్నలుగా కుదించుకోగలరా? అప్పుడు లక్నోలో మీ భోజనం వేళల గురించి కూడా ఢిల్లీ నుంచి నేను ఆందోళన చెందవలసిన పని ఉండదు..’’ అన్నాను. జడ్జి ముఖం అప్రసన్నం అయింది. ‘‘మిస్టర్ అడ్వాణీ.. సులువుగా పని చేయడం ఒకటి ఉంటుంది. పద్ధతిగా పని చేయడం ఒకటి ఉంటుంది. సులువైన పద్ధతిలోకి వెళ్లామంటే సులువు అవడం కోసం పద్ధతి తప్పుతున్నామనే. సీబీఐ ఎప్పుడూ అలా చేయదు. చెప్పండి. నా రెండో ప్రశ్న.. మసీదు కూల్చివేతకు రెండేళ్ల ముందు మీరు అరెస్టు అయ్యారు. మిమ్మల్ని అరెస్ట్ చేసినందుకు కరసేవకులు భారత్ బంద్కు పిలుపు ఇచ్చారు. ఇవన్నీ కూల్చివేత కుట్రలో భాగమైన పరిణామాలే కదా..’’ అన్నాడు! ‘‘నేనే కుట్రా పన్నలేదు. నా మీదే కుట్రలు పన్నారు’’ అని చెప్పాను. ‘‘ఇవేనా.. రెండుగా కుదించుకున్న మీ సమాధానాలు?’’ అనేసి, లంచ్కేమో లేచాడు. డెబ్బై ఐదేళ్ల వయసులో డిప్యూటీ పీఎంగా ఉన్నప్పుడు నా దగ్గర ఎన్ని సమాధానాలైతే ఉన్నాయో.. ఈ తొంభై రెండేళ్ల వయసులోనూ అన్నే సమాధానాలు ఉన్నాయి. సీబీఐయ్యే అనవ సరంగా ప్రశ్నలు పెంచుకుంటూ వస్తోంది. -మాధవ్ శింగరాజు -
బాబ్రీ కేసును మూసివేయాలి : స్వామి
సాక్షి, న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీని ఆ పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి సమర్ధించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసేలా సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్లో తీర్పు వెలువరించిన బాబ్రీ కేసు మాత్రం అద్వానీ, మురళీమనోహర్ జోషీ వంటి బీజేపీ నేతలను వెంటాడుతోంది. 1992 మసీదు విధ్వంసం కేసుకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు తమ ఎదుట హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం 92 ఏళ్ల అద్వానీకి సమన్లు జారీ చేయడంపై సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం స్పందించారు. మూడు దశాబ్ధాల కిందట దేశవ్యాప్తంగా కలకలం రేపిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనను స్వామి సమర్ధిస్తూ ఈ కేసును మూసివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. బాబ్రీ ఘటనలో వారు పాలుపంచుకుంటే ఆ స్ధలంలో ఆలయ పునర్మిర్మాణానికి సాయపడతారని అన్నారు. అయోధ్య రామ జన్మభూమిలో మందిర నిర్మాణానికి శంకుస్ధాపన జరుగుతున్న నేపథ్యంలో వృద్ధ నేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషీలను అయోథ్యకు తీసుకువెళ్లేముందు వారిపై ఉన్న వెర్రి కేసును మూసివేసేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తర్వులు జారీ చేయాలని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. ఆగస్ట్ 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్ధాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. కాగా 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీమసీదును కరసేవకులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. మసీదు నిర్మించిన చోట ఆలయం ఉందనే వాదనతో మసీదును నేలమట్టం చేశారు. ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషీలు అప్పట్లో రామమందిర ఉద్యమానికి నేతృత్వం వహించారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో వీరితో పాటు బీజేపీ ప్రముఖ నేతలు అశోక్ సింఘాల్, ఉమాభారతి.. వంటివారి పేర్లు ఉన్నాయి. కరసేవకులను రెచ్చగొట్టి మసీదును కూల్చివేశారని వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చదవండి : అద్వానీ వాంగ్మూలం తీసుకోనున్న సీబీఐ కోర్టు -
రామమందిర భూమి పూజకు తేదీ ఖరారు
లక్నో : హిందువులు అత్యంత ప్రతిష్టాత్మంగా భావిస్తున్న అయోధ్య రామమందిర ఆలయ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ కార్యక్రమం జరగనుంది. ఆలయ అధికారులు, హిందుమత పెద్దలు సుదీర్ఘ చర్చల అనంతరం జూలై 29న భూమి పూజ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఒకవేళ అది సాధ్యం ఆగస్ట్ 5న దివ్యమైన ముహూర్తం ఉందని అదే రోజున శంకుస్థాపన చేసి తీరాల్సిందేనని సంకల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల ఈ కీలక ఘట్టాన్ని జరిపించాలని రామాలయ పెద్దలు నిర్ణయించారు. మోదీకి త్వరలోనే ఆహ్వానాన్ని సైతం పంపనున్నారు. (బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు) కాగా ఎన్నో ఏళ్లుగా కోర్టుల్లో నలుగుతున్న అయోధ్య రామమందిర భూ వివాదానికి గత ఏడాది సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ముగింపు పలికిన విషయం తెలిసిందే. వీలైనంత త్వరలోనే ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాలని ప్రయత్నించినా.. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి. అనంతరం కొంత వెసులుబాటు కల్పించడం నెల రోజులుగా భూమిని చదును చేసే పనులు చేపడుతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే మరో నెల రోజుల్లోనే కీలక ఘట్టం ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది. -
బాబ్రీ విధ్వంసం: విచారణ ఆపండి
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను మూసివేస్తే మంచిదని ‘రామ జన్మభూమి’ కేసులో ప్రధాన పిటిషనర్ అయిన ఇక్బాల్ అన్సారీ లక్నో సీబీఐ కోర్టుని కోరారు. అయోధ్య భూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే తుది తీర్పును వెలువరించిందని, ఈ సమయంలో మళ్లీ బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ చేపట్టడం అంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు. సున్నితమైన అంశం కాబట్టి సీబీఐ తీర్పు దేశంలో మరోసారి రాజకీయ వైరుధ్యాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా బాబ్రీ మసీదు విధ్వంసంపై బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతి, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ప్రధానంగా అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. (బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు) ఈ కేసుకు సంబంధించి ఆగస్ట్ 31లోపు పూర్తి చేయాలని విచారణ పూర్తి చేసి తుది తీర్పును వెలువరించాలని ఇటీవల దేశ అత్యుతున్న న్యాయస్థాం లక్నో సీబీఐ కోర్టుకు డెడ్లైన్ విధించింది. ఈ నేపథ్యంలో జూన్ 4న వీరంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకానున్నారు. దీనిపై శనివారం మీడియాతో మాట్లాడిన ఇక్బాల్ అన్సారీ.. వివాదం ఇప్పటికే సమసిపోయిన నేపథ్యంలో విచారణను ఆపేయాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పుపై అన్ని వర్గాల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని తెలిపారు. బాబ్రీ కూల్చివేత అంశం రాజకీయ అంశాలతో ముడిపడి ఉందని, ఇలాంటి సున్నితమైన కేసును సీబీఐ ఇక మూసివేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. కాగా అయోధ్య వివాదంపై తీర్పును వెలువరిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పును వెలువరిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘1992 డిసెంబర్ 6న కరసేవకులు వివాదాస్పద బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఇది ముమ్మాటికి చట్ట విరుద్ధం. మసీదును ధ్వసం చేసి ఇస్లామిక్ మూలాలను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ముస్లిం వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సింది’ అంటూ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో విచారణను ముగించాలని సుప్రీంకోర్టు సీబీఐ కోర్టును ఆదేశించింది. -
రామమందిరంపై అమిత్ షా బిగ్ అనౌన్స్మెంట్
పాకూర్: అయోధ్యలో రామమందిరం అంశంపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. నాలుగు నెలల్లో అయోధ్యలో రామమందిరం కడతామని ఆయన వెల్లడించారు. సోమవారం జార్ఖండ్ పాకూర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు ప్రదేశంలో రామమందిర నిర్మాణానికి వీలు కల్పిస్తూ సుప్రీంకోర్టు గత నెల 9న సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ‘సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక, నాలుగు నెలల్లో ఆకాశాన్ని తాకే రామమందిరాన్ని అయోధ్యలో నిర్మిస్తాం’ అని షా పేర్కొన్నారు. అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాస్పద భూవివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే. రివ్యూ పిటిషన్లకు సరైన ప్రాతిపదిక లేదని, రివ్యూ పిటిషన్లన్నింటినీ పరిశీలించిన తర్వాత వీటిని కొట్టివేయాలని నిర్ణయం తీసుకున్నామని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. -
బాబ్రీ ఎఫెక్ట్ ఫుల్ ఫోర్స్
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ పరిస్థితుల్లోనే బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజైనడిసెంబర్ 6వ తేదీ నగర పోలీసులుభారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంటారు. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలనేపథ్యంలో ఈసారి మరింత కట్టుద్టిమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గతానికి భిన్నంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలుచోటుచేసుకోకుండా మూడు కమిషనరేట్ల అధికారులు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. డిసెంబర్ 6ను కొన్ని సంస్థలుబ్లాక్ డేగా, మరికొన్ని విజయ్ దివాస్గా జరుపుకోవడం ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా శుక్రవారం నగరవ్యాప్తంగా 144 సెక్షన్ విధించనున్నట్లు ప్రకటించారు. సభలు, సమావేశాలు, నిరసనలు, ధర్నాలను నిషేధించడంతో పాటు ఒకేచోట నలుగురికి మించి గుమిగూడకూడదని స్పష్టం చేశారు. బుధవారం నుంచే అదనపు బలగాలను రంగంలోకి దించి పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. పాతబస్తీపై ప్రత్యేక దృష్టి పెట్టిన నగర కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం అక్కడ మకాం వేసి పరిస్థితిని సమీక్షించనున్నారు. అన్ని విభాగాలు... సీసీఎస్, సిట్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్ఫోర్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, సిటీ ఆర్ఏఎఫ్, టీఎస్ఎస్పీలతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాంటి కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. ఈ బందోబస్తు ఏర్పాట్ల నేపథ్యంలో నగర పోలీసు విభాగంలోని సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. వీరికి తోడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 300 మంది సివిల్, 70 ప్లటూన్ల సాయుధ బలగాలను రంగంలోకి దింపుతున్నారు. అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు. ‘డిసెంబర్ 6’ నేపథ్యంలో నగరానికి చెందిన ఓ సంస్థ ప్రతిఏటా ర్యాలీకి ప్రయత్నిస్తుంటుంది. ఈసారి కూడా పోలీసులు దీనికి అనుమతి ఇవ్వలేదు. సున్నిత, అనుమానిత ప్రాంతాలు, వ్యక్తులపై నిఘా పెట్టడానికి పెద్ద ఎత్తున పోలీసులను మఫ్టీలో మోహరించారు. గతంలో తీవ్ర పరిణామాలకు ఒడిగట్టిన వ్యక్తులను అనునిత్యం వెంటాడటానికి షాడో టీమ్లను ఏర్పాటు చేశారు. క్విక్ రియాక్షన్ టీమ్తో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రైకింగ్ ఫోర్స్ను అన్ని వేళలా అందుబాటులో ఉంచుతున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెకింగ్ పాయింట్ల ద్వారా వాహనాలను సోదా చేయనున్నారు. పాతబస్తీతో పాటు శివార్లలోని ప్రాంతాల్లో అణువణువూ నిఘాలో ఉంచారు. లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. పాతబస్తీతో పాటు పశ్చిమ మండలం, తూర్పు మండలాల్లోనూ అడుగడుగునా పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. నగర పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ప్రస్తు తం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎ లాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావులేకుండా పక్కా బందోబస్తు ఏర్పా టు చేస్తున్నాం. ఉన్నతాధికారులందరూ అన్ని వేళల్లోనూ అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నా రు. పోలీసు రికార్డుల్లో ఉన్న కమ్యూనల్, కరుడుగట్టిన రౌడీ షీటర్లలో చాలామంది ఇప్పటికే జైళ్లల్లో ఉన్నారు. బయట ఉన్న వారిలో అవసరమనుకున్న వారిని బైండోవర్ చేస్తున్నాం’ అని తెలిపారు. -
అయోధ్య తీర్పు : సోంపురా డిజైన్లోనే ఆలయం?
సాక్షి, న్యూఢిల్లీ: చంద్రకాంత్ సోంపురా.. అయోధ్య తీర్పు వెలువడిన కొద్ది గంటలకే ఈయన పేరు పతాక శీర్షికల్లో చేరిపోయింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితమే డిజైన్ రూపొందించిన శిల్పి ఈయనే. గుజరాత్ వాసి అయిన చంద్రకాంత్ సోంపురా(78) 1989లో నాటి విశ్వహిందూ పరిషత్ చీఫ్ అశోక్ సింఘాల్ వినతి మేరకు రామాలయ నిర్మాణానికి డిజైన్ గీశారు. 1990లో అలహాబాద్లో కుంభ మేళా సమయంలో సమావేశమైన సాధువులు ఈ ఆకృతికి సమ్మతించారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన రాతి స్తంభాలను మలిచేందుకు ప్రత్యేక కార్యశాల ఏర్పాటు చేశారు. ఈ డిజైన్లో పేర్కొన్న విధంగా శిల్పులు శిల్పాలు, స్తంభాల్లో 40 శాతం వరకు ఇప్పటికే చెక్కారు. నిర్మాణ పనులు పూర్తి చేయాలంటే కనీసం రెండున్నరేళ్లు పడుతుందని చంద్రకాంత్ వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ట్రస్ట్ ఏర్పాటు, వనరుల సమీకరణకు కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. రామ మందిర నిర్మాణ నినాదానికి తోడుగా ఈ నమూనానే ఇంటింటికీ చేరింది. అందుకే ఇదే డిజైన్తో ఆలయం రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో నమూనా రూపొందించి, మళ్లీ దానికి తగిన రీతిలో రాయి సమకూర్చుకోవడం వంటి అంశాలు ఇమిడి ఉన్నందున తగు సమయం పట్టే అవకాశం ఉంది. పైగా చంద్రకాంత్ సోంపురా కుటుంబమే దేశ విదేశాల్లోని వందలాది ఆలయాలకు నమూనాలను అందించింది. చంద్రకాంత్ సోంపురా తండ్రి ప్రభాకర్ సోంపురా గుజరాత్లోని సోమ్నాథ్ ఆలయానికి, మథురలోని శ్రీకృష్ణ ఆలయానికి డిజైన్ అందించారు. చంద్రకాంత్ సోంపురా స్వయంగా 100 ఆలయాలకు శిల్పిగా వ్యవహరించారు. ఇందులో గుజరాత్లోని స్వామి నారాయణ్ మందిర్ వంటి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. ఆలయ పనులు ప్రారంభమవుతాయని, వచ్చే శ్రీరామనవమికి ఆలయ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వీహెచ్పీ నేతలు అంటున్నారు. సోంపురా రూపొందించిన నమూనా ఇలా ► ఆలయ నిర్మాణానికి ఆరున్నర ఎకరాల స్థలం అవసరం. ► ఉత్తర భారతంలో ప్రఖ్యాతి గాంచిన ‘నగర’ శైలిలో ఆలయం ఉంటుంది. ► గర్భ గృహం, అంత్రల్, మహా మండపం, రంగ మండపం, ప్రవేశ మండపం.. ఇలా ఐదు భాగాలుగా ఉంటుంది. వీటి గుండానే రాముడి దర్శనం ఉంటుంది. ► గర్భ గృహానికి ఒక ద్వారం, మహా మండపానికి 7 ద్వారాలు ఉంటాయి. ► ఈ ఆకృతిలో ఆలయ నిర్మాణానికి 2.75 లక్షల ఘనపుటడుగుల రాయి అవసరం. ఇప్పటికే 1.25 లక్షల ఘనపుటడుగుల రాయిని చెక్కారు. ► ఈ నమూనా ప్రకారం 270 అడుగుల పొడవు, 126 అడుగుల వెడల్పు, 132 అడుగుల ఎత్తుతో ప్రధాన ఆలయ కట్టడం ఉంటుంది. ఇందులో 81 అడుగుల మేర గోపుర శిఖరం ఉంటుంది. ► 212 స్తంభాలతో నిర్మాణం ఉంటుంది. ► ప్రధాన ఆలయం రెండంతస్తుల్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో బాల రాముడి విగ్రహం, మొదటి అంతస్తులో రామ దర్బారు ఉంటుంది. ఆ పైన ఆలయ శిఖరం ఉంటుంది. ► ప్రధాన ఆలయానికి ఒకవైపు కథా కుంజ్ ఉంటుంది. ► రాజస్తాన్ రాష్ట్రంలోని భరత్పూర్ జిల్లా బన్సి పహార్పూర్ నుంచి తెచ్చిన గులాబీ రంగు రాయితో ఇప్పటికే దాదాపు 40 శాతం మేర శిల్పాల పనులు పూర్తయ్యాయి. ► ఆలయ నిర్మాణంలో స్టీలు అవసరం లేదు. -
రామమందిరానికి శంకుస్థాపన ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద స్థలం శ్రీరాముడిదేనన్న సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు నేపథ్యంలో రామమందిరం నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో రామమందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఆసక్తి రేపుతుండగా.. వచ్చే ఏడాది శ్రీరామనవమి సందర్భంగా లాంఛనంగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయవచ్చునని తెలుస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 2న ఉత్తరప్రదేశ్లోని అయోధ్య పట్టణంలో రామమందిర నిర్మాణం ప్రారంభమవుతుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. బాబ్రీ మసీదు-రామజన్మభూమి భూవివాదం కేసులో వివాదాస్పద 2.77 ఎకరాల భూమి బాలరాముడి (రామ్ లల్లా విరాజమాన్)కి చెందుతుందని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటయ్యాక వీహెచ్పీ.. రామ జన్మభూమి న్యాస్తో కలసి వీలైనంత వేగంగా నిర్మాణం ప్రారంభించే ఆలోచనలో ఉంది. వీహెచ్పీ అనేక ప్రణాళికలు సిద్ధం చేసినా.. అందులో అత్యధికుల మనోభావాలు, విశ్వాసాలకు అనుగుణంగా ఉండే నిర్మాణ బ్లూ ప్రింట్పైనే దృష్టి కేంద్రీకరించింది. రామ మందిరం నిర్మాణానికి కనిష్టంగా నాలుగేళ్లు ఆలయ నిర్మాణాన్ని మొత్తం రెండంతస్తుల్లో చేపట్టేలా ప్లాన్ సిద్ధంగా ఉంది. మొదటి అంతస్తులోనే శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇక ఆలయ పైభాగాన శిఖరం ఉండనుంది. గుడి ఎత్తు 128 అడుగులు, వెడల్పు 140 అడుగులు, పొడవు 270 అడుగులతో నిర్మించనున్నారు. రెండంతస్తుల్లో మొత్తం 212 స్తంభాలు ఉంటాయి. ప్రతీ అంతస్తులో 106 స్తంభాలుంటాయి. ఏళ్లుగా గుడి నిర్మాణానికి అవసరమైన స్తంభాలు, ద్వారాలను శిల్పులు చెక్కుతున్నారు. ఆలయ పునాదిలో ఎక్కడా స్టీల్ వినియోగం లేకుండా చేపట్టనున్నారు. మొత్తం ఆలయ నిర్మాణానికి 1.75 లక్షల ఘనపు అడుగుల ఇసుకరాతి అవసరమవుతుందని భావిస్తున్నారు. ఆలయానికి సింగ్ ద్వార్, నృత్య మండపం, రంగ మండపం, పూజా మండపం, గర్భగుడితో కలిపి మొత్తం ఐదు ప్రవేశ ద్వారాలు ఉండనున్నాయి. మొత్తం ఆలయ నిర్మాణానికి తక్కువలో తక్కువగా నాలుగేళ్లు పడుతుందని నిపుణులు అంటున్నారు. ‘ఇంత సమయంలోనే నిర్మాణం పూర్తవుతుందని నేను హామీ ఇవ్వలేను. కానీ న్యాయ సంబంధిత పనులన్నీ పూర్తవగానే నిర్మాణం ప్రారంభమవుతుందని భావిస్తున్నా’అని అంతర్జాతీయ వీహెచ్పీ(ఐవీహెచ్పీ) అధ్యక్షుడు అలోక్కుమార్ వెల్లడించారు. -
అయోధ్య ప్రశాంతం
లక్నో/అయోధ్య/న్యూఢిల్లీ: శతాబ్దాల నాటి మందిరం–మసీదు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు అనంతరం దేశవ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ హిందూ ముస్లిం నేతలతో సమావేశమై తీర్పు అనంతర పరిస్థితులపై చర్చించారు. కీలక తీర్పు వెలువరించిన ధర్మాసనంలోని జడ్జీల భద్రత కోసం అధికారులు ముందుజాగ్రత్తగా మరిన్ని చర్యలు తీసుకున్నారు. కాగా, కోర్టు తీర్పు ప్రకారం మసీదు కోసం ఐదెకరాల భూమిపై చర్చించేందుకు ఈ నెల 26న సున్నీ వక్ఫ్బోర్డు సమావేశం కానుంది. ఆలయ పట్టణం అయోధ్యలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పోలీసు బలగాల గస్తీ, తనిఖీలు కొనసాగుతున్నా పట్టణంలోని ప్రధాన ఆలయాల్లో ఆదివారం భక్తుల సందడి తిరిగి మొదలయింది. తీర్పు సందర్భంగా శనివారం నాటి ఉత్కంఠ, ఉద్రిక్త పరిస్థితులకు బదులుగా ఉత్సాహ పూరిత వాతావరణం కనిపించింది. హనుమాన్ గర్హి, నయాఘాట్ల వద్ద జరిగే శ్రీరామ, హనుమాన్ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సుప్రీం తీర్పు, తదనంతర పరిణామాలు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు రికాబ్గంజ్ తదితర ప్రాంతాల ప్రజలు వార్తా పత్రికలు చదివేందుకు ఆసక్తి చూపారు. ‘మాకిది చాలా అరుదైన, కొత్త శుభోదయం, ప్రత్యేకమైన ఆదివారం. అయోధ్య వివాదం శాశ్వతంగా పరిష్కారం కావడం ఎంతో ఊరట కలిగించింది’ అని అయోధ్యలోని ఓ హోటల్ మేనేజర్ సందీప్ సింగ్ అన్నారు. ‘రామ్లల్లాకు అనుకూలంగా తీర్పు రావడంతో పూలు, పూలదండలకు బాగా డిమాండ్ పెరుగుతుందని వారణాసి తదితర నగరాల నుంచి అదనంగా తెప్పిస్తున్నాం’ అని పూల దుకాణం యజమాని అనూప్ తెలిపారు. శనివారం హోం మంత్రి బిజీబిజీ తీర్పు వెలువడిన శనివారం హోం మంత్రి అమిత్ షా మిగతా కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకున్నారు. తీర్పు అనంతర పరిస్థితులపై వివిధ రాష్ట్రాల సీఎంలు, సీనియర్ పోలీసులు, నిఘా విభాగాల అధికారులతో ఆయన రోజంతా మాట్లాడారని అధికార వర్గాలు తెలిపాయి. తాజా పరిస్థితులపై చర్చించేందుకు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ ప్రముఖ హిందు, ముస్లిం నేతలతో సమావేశమయ్యారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మత పెద్దలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. యూపీలో 77 మంది అరెస్ట్ ఉత్తరప్రదేశ్లో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టి మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన 77 మందిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై 34 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా సామాజిక మాధ్యమాల్లోని 8,275 పోస్టింగ్లపై చర్యలు తీసుకోగా, అందులో 4,563 పోస్టులు ఆదివారం పోస్టు చేసినవిగా తెలిపారు. మధ్యప్రదేశ్లోనూ అభ్యంతరకర పోస్ట్లు పెట్టిన 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 26న సున్నీ వక్ఫ్ బోర్డు భేటీ మసీదు నిర్మాణానికి ఐదెకరాల భూమిని కేటాయించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించేందుకు సున్నీ సెంట్రల్ వక్ఫ్బోర్డు ఈనెల 26వ తేదీన సమావేశం కానుంది. ఆ ఐదెకరాల భూమిని తీసుకోవాలా వద్దా అనే విషయమై ఆ సమావేశంలో నిర్ణయిస్తామని యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జఫర్ ఫరూఖీ తెలిపారు. ‘కోర్టు తీర్పును సవాల్ చేసే ఉద్దేశం మాకు లేదు. అయితే, మసీదు కోసం ఆ స్థలాన్ని తీసుకోరాదని కొందరు.. ఆ స్థలంలో విద్యా సంస్థను ఏర్పాటు చేసి, పక్కనే మసీదు నిర్మిస్తే బాగుంటుందని మరికొందరు అంటున్నారు. దీనిపై వివరంగా చర్చిస్తాం’అని ఫరూఖీ వెల్లడించారు. జడ్జీలకు భద్రత పెంపు అయోధ్య కేసు తీర్పును ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో ఐదుగురు జడ్జీలకు భద్రతను ప్రభుత్వం మరింత పెంచింది. ‘ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, కాబోయే సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ల నివాసాల వద్ద అదనపు బలగాలను మోహరించాం. వీరి నివాసాలకు దారితీసే రోడ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశాం. ఈ జడ్జీల వాహనాల వెంట సాయుధ బలగాలతో ఎస్కార్ట్ వాహనం ఉంటుంది’అని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. 7 భాషలు, 533 డాక్యుమెంట్లు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అయోధ్య భూవివాదానికి సంబంధించిన తీర్పు కోసం సుప్రీంకోర్టు భారీ కసరత్తే చేసింది. సంస్కృతం, హిందీ, ఉర్దూ, పర్షియన్, టర్కిష్, ఫ్రెంచ్, ఇంగ్లిష్ భాషల్లోని చరిత్ర, సంస్కృతి, పురావస్తు, మత పుస్తకాలను తిరగేసింది. ఇవేకాక మత సంబంధిత కావ్యాలు, యాత్రా వర్ణనలు, పురావస్తు నివేదికలు, బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందరి చిత్రాలు, గెజిటీర్లు, స్థూపాలపై గల శాసనాల అనువాదాలు, ఇలా 533 డాక్యుమెంట్లను పరిశీలించింది. -
కూల్చివేతపై కేసు ఎందుకు..?: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: బాబ్రీ మసీదు చట్ట విరుద్ధమైతే కూల్చివేతపై కేసు ఎందుకు నడుస్తోంది, అద్వానీపై విచారణ ఎందుకు జరుగుతోందని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూటిగా ప్రశ్నించారు. మిలాద్–ఉన్–నబీ సందర్భంగా శనివారం అర్ధ రాత్రి హైదరాబాద్లోని దారుస్సలాం మైదానంలో జరిగిన రహమతుల్–లిల్–అలామీన్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బాబ్రీ మసీదు చట్టవిరుద్ధమైతే కూల్చివేతకు పాల్పడిన వారు భూమిని ఎలా పొందగలుగుతారని చెప్పారు. సాధారణంగా ఒకరి ఇంటిని కూల్చేసిన వ్యక్తికి అదే ఇల్లు మరలా ఎలా లభిస్తుందని దుయ్యబట్టారు. సుప్రీం కోర్టు తీర్పుపై రాజ్యాంగబద్ధంగా అభిప్రా యాన్ని వ్యక్తం చేసే హక్కు తమకు ఉందని గుర్తు చేశారు. బాబ్రీ మసీదుపై చట్టపరమైన హక్కు కోసం పోరాటం చేశామని, మసీదుకు ప్రత్యామ్నాయంగా 5ఎకరాల భూమి ఇవ్వ డం అవమానించడమేనన్నారు. సుప్రీంలో ముస్లింల పక్షాన ప్రాతినిధ్యం వహించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభలో మజ్లిస్ ఎమ్మెల్యేలు, ఇస్లామిక్ స్కా లర్స్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
విగ్రహాలు ‘ప్రత్యక్షం’.. గోరఖ్నాథ్ పరోక్షం!
1949లో తొమ్మిది రోజుల పాటు రామచరిత మానస్ను పారాయణం చేశారు. చివర్లో బాబ్రీ మసీదులో రాముడు, సీత విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి! ఫలితంగా బాబ్రీ మసీదుని మూసివేశారు. ఈ పారాయణం చేసింది, అప్పటి రామ జన్మభూమి ఉద్యమానికి నాయకత్వం వహించింది మహంత్ దిగ్విజయ్ నాథ్. ఈ సంఘటనే నాథ్ని హిందూమహాసభలో తిరుగులేని నాయకుడిని చేసింది. తరవాత హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శిగా ఎంపికై, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 1967లో గోరఖ్పూర్ ఎంపీగా గెలిచారు. నిజానికి 1921లోనే దిగ్విజయ్నాథ్ కాంగ్రెస్లో చేరి, చౌరీచౌరా సంఘటనలో కీలకపాత్ర పోషించారు. అదే ఘటనలో ఆరెస్టయ్యారు. తరవాత హిందుత్వ వాదులతో కలిసి పనిచేస్తూ హిందూ మహాసభలో చేరారు. హిందూ మహాసభ సభ్యుడు గాడ్సేని మహాత్మాగాంధీ హత్యకు ఉసిగొల్పారన్న నేరారోపణపై నాథ్ 9 నెలల పాటు జైల్లో గడిపారు. బయటికి వచ్చాకే రామజన్మభూమి ఉద్యమాన్ని ఆరంభించారు. మఠం నుంచి రాజకీయాల్లోకి... గోరఖ్నాథ్ మఠం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఉంది. 11వ శతాబ్దారంభంలో హిందూ యోగి, సాధువు యోగి గోరఖ్నాథ్ దీనికి బీజం వేశారు. దిగ్విజయ్నాథ్ తరవాత ఆయన వారసుడు మహంత్ అవైద్యనాథ్ 1962, 1967, 1969, 1974, 1977లో మణిరామ్ స్వతంత్ర ఎమ్మెల్యేగా, 1970, 1989లో గోరఖ్పూర్ ఎంపీగా ఎన్నికయ్యారు. సంఘ్ పరివార్ స్వయంగా రామజన్మభూమి ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో అవైద్యనాథ్ బీజేపీలో చేరి గోరఖ్పూర్ ఎంపీగా 1991, 1996లో ఎన్నికయ్యారు. ఇదే మఠం నుంచి వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 1998 నుంచి ఎంపీగా గెలిచారు. ఎంపీగా ఉంటూ∙ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా అయ్యారు. బాబ్రీ కూల్చివేతలోనూ యోగి ఆదిత్యనాథ్ పాత్ర కీలకమని చెబుతారు. మూలవిరాట్టునాయర్... రామ జన్మభూమి–బాబ్రీ మసీదు వివాదానికి మూలవిరాట్టు ఎవరైనా ఉన్నారంటే 1949 నాటి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కె.కె.కె.నాయర్ అనే యూపీ అధికారి. కృష్ణకుమార్ కరుణాకరన్ నాయర్ కేరళ వాస్తవ్యుడు. కేరళలోని అలెప్పీలో పుట్టి, మద్రాస్ యూనివర్సిటీలో బారాసెనీ కాలేజీలోనూ, అలీగఢ్ యూనివర్సిటీలోనూ, లండన్లోనూ ఉన్నత విద్యనభ్యసించారు. 1930లో ఇండియన్ సివిల్ సర్వీసెస్లో చేరారు. నాయర్ ఉత్తరప్రదేశ్లో వివిధ పదవుల్లో పనిచేశారు. 1949లో ఫైజాబాద్ జిల్లా మేజిస్ట్రేట్గా పనిచేశారు. 1949లో గోరఖ్నాథ్ మఠం సభ్యుల రామచరిత మానస్ పారాయణం సందర్భంగా బాబ్రీ మసీదులోని ప్రధాన గుమ్మటంలోపల హిందూ దేవతా విగ్రహాలు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాయి. దీనిపై విచారణ జరిపిన నాటి ప్రభుత్వం విగ్రహాలను మసీదులో పెట్టడంలో నాటి జిల్లా అధికారి నాయర్ కీలక సూత్రధారి అని నిర్ధారించింది. సంఘటన జరిగిన క్షణాల్లోనే నాయర్ అక్కడికి చేరుకున్నారని, విగ్రహాలు పెట్టి, వ్యవహారమంతా పూర్తయ్యాకే పై అధికారులకు సమాచారమిచ్చారని ఆరోపణలొచ్చాయి. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విగ్రహాలను అక్కడి నుంచి తరలించాలని, నాయర్ని పదవి నుంచి తొలగించాలని ఆదేశించారు. నాయర్ పదవిని వదిలి నేరుగా హిందూ మహాసభలో చేరారు. ఈ చర్యతో హిందూత్వ వాదుల్లో కె.కె.నాయర్ హీరోగా మారాడు. నాల్గవ లోక్సభలో భారతీయ జనసంఘ్ పార్టీ తరఫున పోటీ చేసి నాయర్ గెలిచారు కూడా. మందిరం.. మసీదు 1528 నుంచి 2019 వరకూ...డేట్ టు డేట్ 1528: మొఘల్ చక్రవర్తి బాబర్ కమాండర్ మిర్ బక్వి బాబ్రీ మసీదును నిర్మించారు. 1885: బాబ్రీ మసీదు ప్రాంతానికి పక్కనే దేవాలయ నిర్మాణానికి అనుమతివ్వాల్సిందిగా ఫైజాబాద్ కోర్టులో మహంత్ రఘుబీర్ దాస్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత. డిసెంబర్ 22–23, 1949: బాబ్రీ మసీదు లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షం. హిందువులు దీనిని స్వయంభూగా భావించారు. పూజలకు ప్రయత్నించడం ప్రారంభించారు. విగ్రహాలను తీసుకుని వచ్చి అక్కడ పెట్టారని కొందరి ఆరోపణ. 1950: విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతివ్వాలని ఫైజాబాద్ కోర్టును కోరిన గోపాల్ విశారద్, పరమహంస రామచంద్రదాస్. 1959: వివాదాస్పద స్థలాన్ని తమ అధీనం చేయాలని కేసు వేసిన నిర్మోహీ అఖాడా. 1961: బాబ్రీ మసీదులోని విగ్రహాలను తొలగించడంతోపాటు వివాదాస్పద స్థలం తమకు చెందినదిగా ప్రకటించాలని కోర్టును ఆశ్రయించిన యూపీ సెంట్రల్ సున్నీ వక్ఫ్ బోర్డు. 1984: రామ జన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభించిన విశ్వహిందూ పరిషత్. ఫిబ్రవరి 1, 1986: రామ్లల్లా విగ్రహాలకు పూజలు చేసేందుకు హిందువులకు అనుమతిస్తూ ఫైజాబాద్ సెషన్స్ కోర్టు తీర్పు. నిరసన తెలిపేందుకు బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ ఏర్పాటు. ఆగస్టు 14, 1989: అలహాబాద్ హైకోర్టుకు స్థల వివాదం. వివాదాస్పద స్థలానికి సంబంధించి యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశం. నవంబర్ 9, 1989: వివాదాస్పద రామ జన్మభూమి స్థలం సమీపంలో శిలాన్యాస్ నిర్వహించేందుకు విశ్వహిందూ పరిషత్కు అనుమతిస్తూ అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వ నిర్ణయం. సెప్టెంబర్ 1990: భవ్య రామమందిర నిర్మాణం లక్ష్యంగా గుజరాత్లోని సోమనాథ్ నుంచి భారతీయ జనతాపార్టీ నేత ఎల్.కె.అద్వానీ రథయాత్ర ప్రారంభం. డిసెంబర్ 6, 1992: కరసేవకుల చేతుల్లో నేలమట్టమైన బాబ్రీ మసీదు. చెలరేగిన హింస. డిసెంబర్ 16, 1992: బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన పరిస్థితులపై విచారణకు జస్టిస్ లిబర్హాన్ కమిషన్ ఏర్పాటు. 1993: రామజన్మభూమి తాలూకూ వివాదాస్పద స్థలంతోపాటు పరిసరాల్లోని సుమారు 67 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న పి.వి.నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వం. 1994 : స్థల స్వాధీనానికి సుప్రీంకోర్టు సమర్థింపు. ఇస్లామ్ మతంలో మసీదు ఒక భాగం కాదంటూ డాక్టర్ ఇస్మాయిల్ ఫారూఖీ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఏప్రిల్ 2002: వివాదాస్పద రామజన్మభూమి స్థల యాజమాన్య హక్కులపై అలహాబాద్ హైకోర్టులో విచారణ ప్రారంభం. మార్చి 2003: కేంద్రం స్వాధీనం చేసుకన్న భూమిలో మతపరమైన కార్యకలాపాలపై సుప్రీంకోర్టు నిషేధం. 2005: వివాదాస్పద స్థలంపై పేలుడు పదార్థాలు నిండిన జీపుతో ఉగ్రవాదుల దాడి. ఎదురు కాల్పుల్లో అందరూ హతం. 2009: ప్రభుత్వానికి జస్టిస్ లిబర్హాన్ కమిషన్ నివేదిక సెప్టెంబర్ 30, 2010: సున్నీ వక్ఫ్ బోర్డ్, రామ్లీలా, నిర్మోహీ అఖాడాకు సమానంగా స్థలాన్ని విభజించాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశం. మే 2011: హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ç14 పిటిషన్లు దాఖలు. హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీం. మార్చి 2017: అయోధ్య వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జె.ఎస్.ఖేహర్ సూచన. ఆగస్టు 2017: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్లతో కూడిన త్రిసభ్య బెంచ్ విచారణ ప్రారంభం. సెప్టెంబర్ 2018: 1994 నాటి ఇస్మాయిల్ ఫారూఖీ తీర్పును పునః పరిశీలించాలన్న పిటిషనర్ల అప్పీళ్లపై విచారించిన సుప్రీంకోర్టు. విషయాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించరాదంటూ 2:1 తేడాతో న్యాయమూర్తుల తీర్మానం. జనవరి 8, 2019: అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జస్టిస్. ఎస్.ఎ.బొబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్లతో ధర్మాసనం. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా సూచించిన చీఫ్ జస్టిస్. జనవరి 10, 2019: విచారణ బెంచ్లో తాను ఉండరాదని జస్టిస్ యు.యు. లలిత్ నిర్ణయం. దీంతో బెంచ్ పునర్వ్యవస్థీకరణ. జస్టిస్ ఎన్.వి. నారాయణ, జస్టిస్ యు.యు.లలిత్ స్థానంలోకి జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్. మార్చి 8, 2019: కోర్టు పర్యవేక్షణలో ఉండే మధ్యవర్తిత్వ కమిటీకి వివాదాస్పద అంశం. అక్టోబర్ 2019: సమస్య సామరస్య పరిష్కారంలో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్.ఎం.ఐ.ఖలీఫుల్లా నేతృత్వంలోని మధ్యవర్తిత్వ కమిటీ విఫలం. నివేదిక సమర్పణ. ఆగస్టు 6, 2019: రోజూవారీ విచారణకు చేపట్టిన ధర్మాసనం. అక్టోబర్ 16, 2019: తుదితీర్పు రిజర్వ్. నవంబర్ 9, 2019: వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం తీర్పు బాబర్ ఆదేశాల మేరకు మసీదు నిర్మాణం జరిగిందంటూ గోడలపై ఉన్న శాసనాలు చెబుతున్నాయి. రాముడు జన్మించిన ప్రాంతంలో దేవాలయాన్ని కూల్చివేసి ఆ శిథిలాలపై మసీదు కట్టారన్నది స్థానికులు చెప్పే మాట. 1717: మసీదు స్థలాన్ని కొనుగోలు చేసి రాముడికి దఖలు చేసిన రాజ్పూత్ వంశీకుడు జై సింగ్ –2. మసీదు బయట రాముడి విగ్రహాలకు పూజలు. 1768: బాబ్రీ మసీదును ఔరంగజేబు నిర్మించారని కొందరు, బాబర్ కట్టించాడని మరికొందరు స్థానికులు చెప్పినట్లు రికార్డు నమోదు చేసిన జెసూట్ పూజారి జోసెఫ్ టీఫెన్ట్హాలర్. 1853:బాబ్రీ–మందిర్ వివాదంపై దేశంలో తొలిసారి మతఘర్షణలు నమోదు. 1859: బాబ్రీ మసీదు ప్రాంతంలో హిందువులు, ముస్లింలు ప్రార్థనలు చేసేందుకు కంచె రూపంలో వేర్వేరు ప్రాంతాలను కేటాయించిన బ్రిటిష్ ప్రభుత్వం. సుమారు 90 ఏళ్లు ఈ పద్ధతి కొనసాగింపు. శనివారం అయోధ్యలోని ఓ ఆలయంలో సీతారాముల విగ్రహాలకు నమస్కరిస్తున్న ఓ భక్తురాలు బాబ్రీ మసీదులో పూజలు చేస్తున్న దృశ్యం (ఫైల్) -
5 శతాబ్దాల సమస్య!
2019 నవంబర్ 9న ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం లభించింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును దేశమంతా స్వాగతించింది. అయోధ్య వివాదం పూర్వాపరాలపై సమగ్ర కథనమిది. అయోధ్యలో 1528లో మొఘల్ సామ్రాజ్య సైనికాధికారి మిర్ బాకీ తాష్కేండీ బాబ్రీ మసీదును నిర్మించాడు. హిందువుల పవిత్రంగా భావించే ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఈ మసీదును నిర్మించారనేది వివాదం. 1853–55లో ఈ కట్టడం విషయంలో తొలిసారి ఘర్షణలు చెలరేగడంతో అప్పట్లోనే మసీదు బయటి ప్రాంగణంలో హిందువులు పూజలు చేసుకునేందుకు, లోపలి భాగంలో ముస్లింల ప్రార్థనలకు వీలు కల్పిస్తూ ఓ గోడ నిర్మించారు. తొలి కేసు 1885లో... బాబ్రీ మసీదు ప్రాంగణంలోని ఛబుత్రా జన్మస్థాన్లో దేవాలయ నిర్మాణానికి అనుమతివ్వాలంటూ, జన్మస్థాన్కు మహంత్గా ప్రకటించుకున్న రఘుబర్ దాస్ ఫైజాబాద్ సబ్ జడ్జి కోర్టులో సివిల్ కేసు వేశారు. అయోధ్య న్యాయపోరాటానికి అదే ఆద్యం. స్టేట్ ఆఫ్ ఇండియా కార్యదర్శిని ప్రతివాదిగా చేరుస్తూ దాఖలైన ఈ కేసులో... ఆలయ నిర్మాణాన్ని మసీదు సంరక్షకుడు అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని రఘుబర్ దాస్ కోరారు. 1885 డిసెంబర్ 24న ఫైజాబాద్ సబ్ జడ్జీ కోర్టు న్యాయమూర్తి పండిట్ హరికిషన్ సింగ్ ఈ కేసు కొట్టివేస్తూ... ఆలయ నిర్మాణానికి అనుమతిస్తే ఏదో ఒక రోజు క్రిమినల్ కేసులు దాఖలు కావడంతోపాటు వేల మంది హత్యకు గురయ్యే అవకాశముందని వ్యాఖ్యానించారు. ఆ తీర్పును సవాలు చేస్తూ రఘుబర్దాస్ జిల్లా కోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి కల్నల్ ఎఫ్.ఇ.ఎ.ఛామెయిర్ కేసు కొట్టేశారు. హిందువుల పవిత్ర స్థలంపై ఓ మసీదు నిర్మించడం దురదృష్టకరమని, ఈ ఘటన ఎప్పుడో 356 ఏళ్ల క్రితం జరిగింది కాబట్టి అప్పుడు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే సమయం మించిపోయిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. యథాతథ స్థితిని కొనసాగించాలని మాత్రమే ఇప్పుడు చెప్పగలమని స్పష్టం చేశారు. రఘుబర్ దాస్ దీన్ని అప్పటి ప్రావిన్స్ ప్రధాన కేంద్రమైన అవధ్ న్యాయస్థానంలోనూ సవాలు చేసినా ఫలితం లేకపోయింది. విభజనతో రాజుకున్న వివాదం... దేశ విభజనతో అయోధ్య వివాదం మరోసారి రాజుకుంది. 1949 డిసెంబర్ 22 రాత్రి బాబ్రీ మసీదులోని ప్రధాన గుమ్మటం లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. అఖిల భారతీయ రామాయణ్ మహాసభ తొమ్మిది రోజులపాటు అఖండ రామాయణ కీర్తన (రామచరిత మానస్ పఠనం) జరిపాక ఈ అద్భుతం చోటు చేసుకుందని, మసీదు లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయని చెబుతారు. కొందరు వీటిని రహస్యంగా లోపలపెట్టారని కూడా చెబుతారు. ఆ రోజు శుక్రవారం కావడంతో మసీదులో ప్రార్థనల కోసం భారీ సంఖ్యలో ముస్లింలు చేరడం యాదృచ్ఛికం. దీనిపై అయోధ్య అడిషనల్ సిటీ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ మొదలైంది. విగ్రహాలున్న కట్టడానికి తాళం వేయాలని జస్టిస్ మార్కండేయ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మసీదులోకి ప్రవేశించే హక్కును ముస్లింలు కోల్పోగా, పూజలు చేసుకునే అవకాశం హిందువులకు దక్కింది. కోర్టు నియమించిన నలుగురు పూజారుల ద్వారా పక్క గేటు నుంచి విగ్రహాలను సందర్శించేందుకు వీలు ఏర్పడింది. 1950లో సివిల్ వ్యాజ్యం... రాముడి విగ్రహాలను తొలగించకుండా అయోధ్యకు చెందిన ఐదుగురు ముస్లిం అధికారులను నిరోధించాలని, దర్శనానికి తనకు హక్కు ఉన్నట్లుగా ప్రకటించాలని గోపాల్ సింగ్ విశారద్ 1950లో సివిల్ వ్యాజ్యం వేయడంతో వివాదం మలుపు తిగింది. విచారణ జరిపిన న్యాయమూర్తి ఎన్.ఎన్.ఛద్దా ఇందుకు అనుమతించారు. పైకోర్టులూ ఈ తీర్పును సమర్థించాయి. 1955లో రాష్ట్ర హైకోర్టు కూడా కింది కోర్టుల తీర్పులను బలపరిచింది. ఈ దశలోనే నిర్మోహీ అఖాడా మసీదు ప్రాంతాన్ని తమకివ్వాలని కేసు వేయగా, 1961 డిసెంబరులో సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు స్థల యాజమాన్య హక్కులపై తొలి సివిల్ కేసు వేసింది. వీటిపై అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది. బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ ఏర్పాటు... 1950–51లో విగ్రçహాల పూజలపై ఆంక్షల్ని సడలించాలని స్థానిక న్యాయవాది ఒకరు 1986లో ఫైజాబాద్ మున్సిఫ్ కోర్టులో తాజా కేసు వేయడం బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ ఏర్పాటుకు కారణమైంది. మున్సిఫ్ కోర్టు ఈ కేసును కొట్టేయటంతో అప్పీల్ చేశారు. ఫైజాబాద్ జిల్లా జడ్జి కె.ఎం.పాండే తీర్పునిస్తూ తాళాలు, గేట్లు తొలగించడం వల్ల నష్టమేమీ లేదన్నారు. ఈ తీర్పు వెలువడిన గంట లోపే జిల్లా యంత్రాంగం తాళాలు తొలగించడం అవతలి వర్గాల్లో అనుమానాలు రేకెత్తించింది. మూడు భాగాలుగా విభజన... 1994లో మసీదు ప్రాంతాన్ని కేంద్రం స్వాధీనం చేసుకునేందుకు వీలు ఏర్పడింది. మసీదు కూల్చివేత నేపథ్యంలో ఆ స్థలాన్ని కేంద్రం ప్రత్యేక చట్టం ద్వారా స్వాధీనం చేసుకోవడం సబబేనని, సెక్యులరిజం భావనకిది వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో 2002 ఏప్రిల్లో అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమికి యజమాని ఎవరనేది తేల్చేందుకు అలహాబాద్ హైకోర్టు విచారణ ప్రారంభించింది. జస్టిస్ ఖాన్, జస్టిస్ సుధీర్ అగర్వాల్, జస్టిస్ ధరమ్వీర్ శర్మలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్బోర్డు, రామ్ లల్లా, నిర్మోహీ అఖాడాలకు మూడు సమాన భాగాలుగా చేస్తూ 2010లో తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పును మూడు వర్గాలు çసుప్రీం కోర్టులో సవాలు చేశాయి. ఈ ముగ్గురితోపాటు మరో 11 మంది వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కలిపి విచారించి తాజా తీర్పు వెలువరించింది. ప్రభుత్వంలో మార్పు.. రథయాత్ర మొదలైన కొద్ది నెలలకు యూపీలో, కేంద్రంలో ప్రభుత్వాలు మారాయి. యూపీలో బీజేపీ అధికారం చేపట్టగా, కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైంది. పర్యాటకాభివృద్ధి పేరుతో యూపీ ప్రభుత్వం వివాదాస్పద కట్టడం సమీపంలోని అనేక నిర్మాణాల్ని కూల్చేసింది. 1992 డిసెంబర్ 6న గంటల వ్యవధిలోనే కరసేవకుల చేతిలో బాబ్రీ మసీదు ధ్వంసమైంది. దీంతో యూపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 8న పారా మిలటరీ బలగాలు వివాదాస్పద స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. రాముడి విగ్రహాలకు పూజలు నిలిచిపోయాయి. కానీ.. ఆ రోజు సాయంత్రం పూజలు మళ్లీ మొదలయ్యాయి. అప్పటి నుంచి పూజలు కొనసాగుతున్నా భక్తులకు దర్శనాలు మాత్రం లేకుండా పోయాయి. -
ఒకరి గెలుపు... మరొకరి ఓటమి కానేకాదు!
న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును ఒకరి విజయంగా... మరొకరి పరాజయంగా చూడకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు దేశచరిత్రలో నూతనాధ్యాయమన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత బలమని మరోమారు నిరూపితమైందని, తీర్పును సమాజంలోని అన్నివర్గాలు సహృదయంతో ఆమోదించడమే ఇందుకు నిదర్శమని చెప్పారాయన. అయోధ్యపై సుప్రీం తీర్పు నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. నవంబర్ 9న బెర్లిన్ గోడ కూలిన ఘటనను ఆయన గుర్తు చేశారు. ఈ రోజే కర్తార్పూర్ కారిడార్ ప్రారంభమవుతోందని కూడా చెప్పారు. ఇది అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలనే సందేశం అందిన రోజని ఆయన చెప్పారు. అనవసర భయాలు, విద్వేషాలు, నెగిటివ్ ఆలోచనలు వదిలి జనమంతా సరికొత్త భారతావని నిర్మాణానికి కలిసిరావాలన్నారు. న్యాయ చరిత్రలో సువర్ణాధ్యాయం వందల ఏళ్లుగా నలుగుతున్న కీలక అంశంపై కోర్టు ఇచ్చిన తీర్పును మోదీ ప్రస్తుతించారు. ఈ విషయమై రోజూ విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని దేశమంతా కోరిందని, సుప్రీంకోర్టు ఈ కోరికను సమర్ధవంతంగా నెరవేర్చిందని తెలిపారు. ఈ రోజు భారత న్యాయచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిందన్నారు. అత్యున్నత న్యాయస్థానం అందరి వాదనలు ఓపికతో విని ఏకాభిప్రాయ తీర్పునిచ్చిందన్నారు. న్యాయవ్యవస్థకు, న్యాయమూర్తులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాదం తరాలుగా సాగుతూ వస్తోందని, కానీ తాజా తీర్పుతో కొత్త భారతావని నిర్మాణానికి పూనుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రోజు మన ప్రజాస్వామ్యం ఎంత బలమైందో, ఎంత గొప్పదో ప్రపంచమంతా మరోమారు గుర్తిస్తుందన్నారు. ఇకపై అంతటా శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. డ్రోన్లతో నిఘా.. అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసు శాఖ అప్రమత్తమయింది. ప్రత్యేక నిఘా కోసం డ్రోన్లను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రత పెంచినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. అలాగే ఢిల్లీ పౌరులు శాంతి, సామరస్యపూర్వకంగా మెలగాలని విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో కార్యకలాపాలను కూడా గమనిస్తామని, వాటిని వాడేటప్పుడు జాగ్రత్తగా వివేకంతో వాడాలని, ఎవరూ ఎటువంటి అసత్యాలు గానీ, విద్వేషపూరిత ప్రచారం గానీ చేయవద్దని సూచించారు. ► యావద్భారత విజయం అయోధ్యపై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇవ్వడం శుభపరిణామం. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం దొరికింది. ఇది ఏ ఒక్కరి విజయం కాదు. యావద్భారతం సాధించిన విజయం. కేసు విషయంలో గతాన్ని పక్కనపెట్టి ఐకమత్యంగా ముందుకెళ్తూ.. శాంతి, సామరస్యాలతో కూడిన భారత నిర్మాణంలో అందరం భాగస్వామ్యం కావాలి. మన సంస్కృతి, ఘనమైన వారసత్వాన్ని కాపాడుకొనేందుకు కృషి చేయాలి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ► సంయమనం పాటించాలి సాక్షి, అమరావతి: అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసిన తర్వాతే తుది తీర్పు వెలువడిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మత సామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ► ఈ తీర్పు ఓ మైలురాయి అయోధ్య వివాదంపై సుప్రీం తీర్పును స్వాగతి స్తున్నాం. ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలుస్తుంది. దేశ ఐక్యత, సమగ్రతను మరింత బలోపేతం చేస్తుంది. ఈ తీర్పును అన్ని వర్గాలు, మతాలు ప్రశాంత చిత్తంతో అంగీకరించాలి. ఒకే భారతదేశం– ప్రశస్త భారతదేశం నినాదానికి కట్టుబడి ఉండాలి. శ్రీరామ జన్మభూమి కోసం పోరాడిన సంస్థలకు, సాధు సమాజానికి, అసంఖ్యాక ప్రజలకు కృతజ్ఞతలు. హోంమంత్రి అమిత్ షా ► రాముడు అయోధ్యలో పుట్టాడని రుజువైంది ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో శ్రీరాముడు పుట్టాడన్నది నిర్వివా దాంశం. సుప్రీంకోర్టు తీర్పుతో అదే విషయం మరోసారి రుజువైంది. కోర్టు తీర్పు సంతోషం కలిగించింది. కంబోడియాలోని అంగ్కోర్వాట్ ఆలయం మాదిరిగా అయోధ్యలో రామాలయం విశాలంగా ఉండాలి. శ్రీరాముని ఆశీస్సులు యావత్ భారతావనికి ఉండాలని ఆకాంక్షిస్తున్నా. విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి ► అంతిమ విజయం ఈ తీర్పును ఆర్ఎస్ఎస్ స్వాగతిస్తోంది. ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యకు సరైన ముగింపు పలికింది. ఈ తీర్పు దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉంది. సత్యం, న్యాయం అంతిమంగా గెలుస్తాయని నిరూపించింది. విభేదాలను మరిచి రామాలయ నిర్మాణానికి పనిచేయాలి. అయోధ్యకు సంబంధించి చారిత్రక ఆధారాలున్నందునే ముందుండి పోరాడాం. మథుర, వారణాసిలోని ఆలయాలకు సంబంధించిన ఇలాంటి వివాదాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకోబోదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ► ఇరు వర్గాలకు ఊరట అయోధ్య విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో హిందూ ముస్లిం వర్గాలకు ఊరట, సంతోషం కలిగించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రక తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్య నుంచి హిందువులు, ముస్లింలకు సంతృప్తి కలిగించింది’అని ట్విట్టర్లో తెలిపారు. మసీదు నిర్మాణంలో ముస్లిం సోదరులకు హిందూ సోదరులు సాయం చేయడం ద్వారా ఐక్యతా భావం చూపాలి. అయోధ్య సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తిత్వ కమిటీలో రవి శంకర్ కూడా ఉన్న విషయం తెలిసిందే. శ్రీశ్రీ రవి శంకర్ -
ఉగ్రవాదానికీ ఊతమిచ్చిన బాబ్రీ ఘటన!
బాబ్రీ మసీదు కూల్చివేతకు పూర్వమూ కొన్ని మతఘర్షణల దాఖలాలున్నాయి. కానీ బాబ్రీ తరువాత కొన్ని ఉగ్రవాద ఘటనలూ చోటుచేసుకున్నాయి. దాయాది దేశం పాకిస్తాన్ తనదైన ఆజ్యం పోయడం పరిస్థితి విషమించడానికి దారితీసింది. ఈ సంఘటన తరువాత దాన్ని కారణంగా చూపిస్తూ ఉగ్రమూకలు తెగబడిన దాడులు తక్కువేమీ కాదు.. 1993 ముంబై దాడులు.. బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న లక్ష్యంతో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కుట్ర పన్ని అమలు చేసిన పేలుళ్లు 1993 మార్చి 12న 257 మందిని బలిగొన్నాయి. మధ్యాహ్నం 1.30 నుంచి 3.40 గంటల మధ్యకాలంలో ముంబైలోని 12 చోట్ల కార్లు, స్కూటర్లలో బాంబులుంచి పేల్చేశారు. బాంబు ధాటికి ఓ డబుల్ డెక్కర్ బస్సు పూర్తిగా ధ్వంసమైపోగా ఈ ఒక్క ఘటనలోనే దాదాపు 90 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. జస్టిస్ పి.డి.కోడే సుమారు 100 మందిని దోషులుగా నిర్దారించారు. 2006లో ప్రత్యేక టాడా కోర్టు... టైగర్ మెమన్తోపాటు అతడి కుటుంబ సభ్యులు ముగ్గురిని దోషులుగా తేల్చింది. ముంబై, కేరళ, హైదరాబాద్లలోనూ... పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా 2006 జూలై 11న ముంబైలోని ఓ రైల్లో బాంబు పేలుళ్లకు తెగబడటంతో 187 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వెనుక స్థానిక ముస్లింలున్నట్లు విచారణలో తేలింది. కేరళలో ఏర్పాటైన అల్ ఉమా అనే ఉగ్రవాద సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో పలు ఉగ్రవాద దాడులకు పాల్పడగా.. సంస్థ నాయకుడు సయ్యద్ అహ్మద్ భాషాకు జీవిత ఖైదు విధిస్తూ 2007లో కోర్టు తీర్పునిచ్చింది. అల్ ఉమాపై నిషేధం విధించారు కూడా. బాబ్రీ కూల్చివేత తరువాత ఉగ్రవాదం వైపు మళ్లిన మరో సంస్థ దీన్దార్ అంజుమన్. యూపీలో ఏర్పాటైన సిమీలో ఒకదశలో దేశవ్యాప్తంగా 400 మంది పూర్తిస్థాయి కార్యకర్తలు, ఇరవై వేల మంది సభ్యులు ఉండేవారని, 30 ఏళ్ల వయసులోపు వారైన వీరు పలు ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించి, కొన్నింటిని అమలు చేసినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. సిమీ అధ్యక్షుడైన మెకానికల్ ఇంజనీర్, జర్నలిస్టుగానూ పనిచేసిన సఫ్దర్ నాగోరీ 2008లో అరెస్ట్ కావడంతో సంస్థ కార్యకలాపాలు దాదాపుగా సమసిపోయాయి. 2006 నుంచి దేశంలో అత్యంత చురుకుగా పనిచేసిన ఉగ్రవాద సంస్థల్లో ఇండియన్ ముజాహిదీన్ ఒకటి. యూపీ న్యాయస్థానాల్లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడింది. 2008 నాటి ముంబై దాడుల కోసం లష్కరే తోయిబా తరఫున ఐఎం రెక్కీ కూడా నిర్వహించినట్లు వార్తలున్నాయి. -
న్యాయ పీఠంపై... ఆ ఐదుగురూ!!
అయోధ్య స్థల వివాదంపై తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తులు ఐదుగురు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ దీనికి సారథ్యం వహించగా... జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్ ఈ తీర్పును వెలువరించారు. వ్యవహారాన్ని ఒక స్థల వివాదంలా చూసిన ధర్మాసనం... స్థలం ఎవరికి చెందుతుందనే తీర్పునిచ్చింది. తీర్పుపై ఐదుగురూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తంచేయగా... ఒక జడ్జి మాత్రం... ఆ స్థలం శ్రీరాముడి జన్మస్థానమనే హిందువుల విశ్వాసానికి, నమ్మకానికి తగిన ఆధారాలున్నాయని పేర్కొనటం గమనార్హం. ఈ ఐదుగురి వివరాలూ చూస్తే... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ ధర్మాసనానికి నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్... 1954 నవంబర్ 18వ తేదీన జన్మించారు. 1978లో గౌహతి బార్ కౌన్సిల్లో చేరి గౌహతి హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 2001లో గౌహతి హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2010లో పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2011లో పంజాబ్–హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. 2012లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, 2018లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ శరత్ అరవింద్ బాబ్డే రాజ్యాంగ ధర్మాసనంలో రెండో న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే. 1978లో మహారాష్ట్ర బార్ కౌన్సిల్లో సభ్యుడిగా చేరిన ఈయన... బోంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్లో పని చేశారు. బోంబే హైకోర్టులోనే దాదాపు 21 ఏళ్లపాటు వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 1998లో సీనియర్ న్యాయవాది అయ్యారు. 2000లో బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2013లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఈ నెల 18వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యలు చేపడతారు. 2021 ఏప్రిల్ వరకూ ఈ పదవిలో కొనసాగుతారు. జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. జస్టిస్ చంద్రచూడ్ బోంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. 1998లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 1998 నుంచి దాదాపు రెండేళ్లపాటు భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్గా కూడా వ్యవహరించారు. 2000లో బోంబే హైకోర్టు న్యాయమూర్తిగా... 2013లో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో సుప్రీంకోర్టుకు వచ్చారు. ప్రపంచంలోని అనేక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉపన్యాసాలిచ్చారు. జస్టిస్ అశోక్ భూషణ్ ఉత్తరప్రదేశ్కు చెందిన జస్టిస్ అశోక్ భూషణ్ జాన్పూర్లో జన్మించారు. అలహాబాద్ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన అశోక్ భూషణ్... 1979లో యూ పీ బార్ కౌన్సిల్ సభ్యుడయ్యారు. అలహాబాద్ హైకోర్టులో వివిధ పోస్టులలో పనిచేసిన అశోక్ భూషణ్ 2001లో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014లో కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తిగా, 2015లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు జస్టిస్ అబ్దుల్ నజీర్ అయోధ్య కేసు ధర్మాసనంలో ఉన్న ఏకైక ముస్లిం జడ్జి జస్టిస్ అబ్దుల్ నజీర్. కర్ణాటకలోని కోస్తా ప్రాంతం బెళువాయికి చెందిన ఈయన 1983లో కర్ణాటక హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2004లో శాశ్వత జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించకుండానే నేరుగా సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన వారిలో ఈయన మూడో వ్యక్తి కావడం గమనార్హం. ట్రిపుల్ తలాక్ను శిక్షార్హంగా ప్రకటించిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ నజీర్ అప్పట్లో ఆ తీర్పును వ్యతిరేకించారు. -
కూల్చివేత... చీల్చింది కూడా!
6 డిసెంబర్ 1992... భారత సామాజిక, రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిందనే చెప్పాలి. ఎందుకంటే నాటి నుంచి బాబ్రీ కూల్చివేతకు ప్రతీకారమంటూ పలు ఉగ్రవాద దాడులు జరిగాయి. ఏటా డిసెంబర్ 6 వస్తోందంటేనే... ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన పరిస్థితి. సామాజికంగా చీలిక తెచ్చిన ఈ ఘటన... రాజకీయంగానూ కొత్త శక్తులు ఊపందుకోవటానికి తావిచ్చిందని చెప్పాలి. కాకపోతే అప్పట్లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఆరంభించిన ఆర్థిక సంస్కరణలు ఆ తరువాత ఊపందుకోవటంతో అభివృద్ధి కారణంగా పరిస్థితులు చాలావరకూ మారాయని చెప్పొచ్చు. రాజకీయంగా లాభపడ్డ బీజేపీ... డిసెంబర్ 6 ఘటన వెనుక పలు అంశాలున్నాయన్నది విశ్లేషకుల వాదన. అందులో మొదటిది... మండల్ కమిషన్ ప్రభావానికి దీటైన రాజకీయ నినాదం వెతకడం. రెండవది... పలు దండయాత్రలు, వలస పాలనల నేపథ్యంలో ఓటమి భారంతో, కులాల కుంపట్లతో చీలికలు పేలికలు అయిన హిందూ సమాజాన్ని తిరిగి ఒక తాటిపైకి తేవటం. దళిత బహుజనుల్లో హిందూ వాద పునరుత్తేజం చేసి, తద్వారా సామాజిక, కుల ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు మత ప్రాతిపదికన హిందూ ఓట్లను ఏకీకృతం చేసుకుని... అంతిమంగా అధికారాన్ని చేజిక్కించుకోవడం. ఇప్పటివరకూ జరిగిన పరిణామాలు చూస్తే... మిగిలిన అంశాలు ఎలాఉన్నా... నిర్దేశిత రాజకీయ లక్ష్యాల సాధనలో విజయం లభించిందనే చెప్పవచ్చు. 1984లో కేవలం 2 సీట్లున్న బీజేపీ 2014 నాటికి 282 సీట్లతో లోక్సభలో సంపూర్ణ మెజారిటీని సాధించింది. 2019 నాటికి మరింత బలపడి ఏకంగా 303 సీట్లు సాధించింది. మారుతున్న ‘తరం’ ప్రభావం... మత పరంగా చూసినా... 1992 బాబ్రీ ఘటన తర్వాత... దేశంలో మతం పేరుతో ఒకవైపు హింస కొనసాగుతూనే వస్తోంది. పేలుళ్లు... మత ఘర్షణలు ఇలా అనేక ప్రతికూల ఘటనలు సంభవిస్తూనే వచ్చాయి. సామాజిక భద్రత అనేది రెండు మతాల నుంచి రెండు దేశాల స్థాయికి చేరటంతో కుల, మత ప్రాంతాలతో సంబంధం లేకుండా జాతీయ ఐక్యత, అభివృద్ధిపైనే అన్ని వర్గాలూ దృష్టి సారించాయి. శాంతి సామరస్యాలకే పెద్దపీట వేస్తూ వచ్చాయి. అదే సమయంలో మారిన ‘తరం’ అంశాన్ని కూడా ఇక్క డ ప్రస్తావించుకోవాలి. ‘కొత్త తరానికి’ మత కుంపటి కాకుండా అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా కనబడింది. లిబర్హాన్ కమిషన్.. స్వతంత్ర భారత చరిత్రలో సుదీర్ఘకాలం కొనసాగిన కమిషన్ అది. బాగా కాస్ట్లీ కమిషన్ కూడా. ఎందుకంటే విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వటానికి రూ.8 కోట్లు ఖర్చయింది. ఇందులో అత్యధికం కమిషన్ సిబ్బంది జీతభత్యాలకే సరిపోయింది. అంతేకాదు!! విచారణ పూర్తి చేయడానికి కమిషన్కు ఏకంగా 399 సిట్టింగ్లు అవసరమయ్యాయి. ఈ పాటికే అందరికీ అర్థమయ్యే ఉంటుంది అది జస్టిస్ లిబర్హాన్ కమిషన్ అని. 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీమసీదు కూల్చివేత ఘటనపై విచారణకు అప్పటి కేంద్ర ప్రభుత్వం లిబర్హాన్ కమిషన్ను అదేనెల 16న ఏర్పాటు చేసింది. హర్యానా హైకోర్టులో సిట్టింగ్ జడ్జిగా పనిచేస్తున్న జస్టిస్ ఎంఎస్ లిబర్హాన్ సారథ్యంలో ఏర్పాటయిన ఈ కమిషన్ను... మసీదు కూల్చివేతకు దారితీసిన ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. మూడు నెలల్లో లేదా వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. కానీ ఆ తర్వాత 48 సార్లు గడువును పొడిగిస్తూ పోయారు. కమిషన్కు తుది నివేదిక ఇవ్వటానికి ఏకంగా 16 ఏళ్ల ఆరు నెలలు పట్టింది. చివరకు 2009 జూన్ 30న కమిషన్ తన 998 పేజీల నివేదికను కేంద్రానికి సమర్పించింది. విచారణలో భాగంగా కమిషన్ పలువురు అగ్రశ్రేణి రాజకీయ ప్రముఖులను విచారించింది. కమిషన్ ఏం చెప్పిందంటే... ఆర్ఎస్ఎస్, వీహెచ్పీతోపాటు బీజేపీకి, హిందూసంస్థలకు చెందిన దాదాపు 68 మందిని ఈ నివేదిక అభిశంసించింది. అప్పటి యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వమే ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని దుయ్యబట్టింది. ఇలా మత ఆధారిత రాజకీయాలు జరిపే ప్రభుత్వాలను బర్తరఫ్ చేయాలని కూడా కమిషన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాజ్పేయి, అద్వానీ లాంటి వాళ్లను మిధ్యా ఉదారవాదులుగా అభివర్ణించింది. వీరంతా మూకుమ్ముడిగా బాబ్రీ కూల్చివేతకు ప్రత్యక్ష, పరోక్ష బాధ్యులని స్పష్టంచేసింది. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. బాబ్రీ ఘటనలో అప్పటి కేంద్ర ప్రభుత్వానిది ఏమాత్రం దోషం లేదని కూడా కమిషన్ తెలిపింది. కరకు వ్యాఖ్యలు.. కరువైన చర్యలు ప్రభుత్వం ఏం చేసింది? కమిషన్ నివేదికపై 2009 నవంబర్ 8– 11 మధ్య కాలంలో ఉభయసభల్లో చర్చ ఆరంభమైంది. కానీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తరువాత నివేదికను అప్పటి ప్రభుత్వం సీబీఐకి అందించింది. అప్పటికే దీనిపై విచారణ జరుపుతున్న సీబీఐకి కొత్తగా ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో... పరిశీలించమంది. కానీ కమిషన్ నివేదికపై సీబీఐ పెద్దగా స్పందించలేదు. నివేదిక ఆధారంగా కొత్త కేసులేవీ నమోదు చేయడం లేదని సీబీఐ తేల్చిచెప్పింది. తర్వాత కోర్టులు కూడా ఈ నివేదికను పెద్దగా పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించలేదు. విమర్శల వెల్లువ నివేదిక పార్లమెంట్ ముందు ఉంచకముందే మీడియాకు లీకయిందని 2009 నవంబర్లో వార్తలొచ్చాయి. దీనికి తోడు బాబ్రీ ఘటనకు కేవలం హిందూ సంస్థలు, బీజేపీ నాయకులదే తప్పని, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు ఏమీ లేదని కమిషన్ పేర్కొనడంతో తీవ్ర విమర్శలొచ్చాయి. నివేదిక పూర్తి పక్షపాతంతో రూపొందించారని, కమిషన్కు సహకరించిన హర్ప్రీత్ సింగ్ జియాని ఈ నివేదిక రూపకల్పనకు ముఖ్య బాధ్యుడని బీజేపీ విమర్శించింది. కమిషన్ అభిప్రాయాలన్నీ ఊహాగానాలని దుయ్యబట్టింది. నివేదికలో మహాత్మా గాంధీ పుట్టినతేదీని తప్పుగా పేర్కొనటం, సాక్ష్యులుగా కొందరు చరిత్రకారుల పేర్లను పేర్కొనడం.., కమిషన్ నిర్లక్ష్య, అసంబద్ధ ధోరణికి నిదర్శనమని విమర్శించింది. కావాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా నివేదికలో కొన్ని అంశాలను లీక్ చేసిందని బీజేపీ ఆరోపించింది. చివరకు చూస్తే... కమిషన్ నివేదిక రాజకీయ విమర్శలకు తప్ప ఎలాంటి ప్రయోజనాన్ని సాధించలేకపోయిందనేది వాస్తవంగా కనిపిస్తుంది. -
ఉత్కంఠ క్షణాలు
సాక్షి, న్యూఢిల్లీ: తీర్పు నేపథ్యంలో శనివారం కోర్టు పరిసరాలైన తిలక్మార్గ్, మండిహౌస్ ప్రాంతాలు గంభీర వాతావరణాన్ని తలపించాయి. దాదాపు నలభై రోజుల పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్య వివాదంపై వాదనలు ఆలకించింది. తుది తీర్పు వెలువరించే ముందు సుప్రీంకోర్టులో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కోర్టు తీర్పు నేపథ్యంలో దేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉదయాన్నే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన నివాసంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. (చదవండి : ‘అయోధ్య’ రామయ్యదే..!) జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల్లో భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సుప్రీంకోర్టు వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకే న్యాయవాదులు భారీగా సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. సాధువులు, హిందూ, ముస్లిం మత పెద్దలు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకున్నారు. ఉదయం 10:25 గంటలకు పోలీసుల భారీ భద్రత నడుమ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. జైశ్రీరాం నినాదాలు.. ఉదయం 10:32కి జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పు చదవడం ప్రారంభించారు. 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా తీర్పు వెల్లడించారు. ఆ వెంటనే కోర్టు బయట జై శ్రీరాం నినాదాలు మిన్నంటాయి. కోర్టు తీర్పును గౌరవిస్తూ హిందూ, ముస్లింలు పలువురు ఆలింగనం చేసుకోవడం కనిపించింది. నవంబరు 15 జస్టిస్ రంజన్ గొగోయ్ అఖరి పనిదినం కావడంతో అయోధ్యపై తీర్పు 13, 14 తేదీల్లో రావచ్చని అంతా భావించారు. అయితే కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం వాద, ప్రతివాదుల్లో ఎవరికైనా రివ్యూ పిటిషన్ దాఖలు చేసే హక్కు ఉండడంతో అన్ని అంశాలను పరిశీలించి శనివారం తీర్పు వెలువరించినట్టు తెలుస్తోంది. (చదవండి : అయోధ్య తీర్పు రాసిందెవరు?) -
మూడు భాగాలు.. రాముడివే ఇపుడు!!
‘మసీదు నిర్మాణానికి ఆలయాన్ని కూల్చివేయలేదు. పురాతన గుడి శిథిలాలపైనే దాన్ని నిర్మించారు. ఆలయ శిథిలాల్లో కొన్నిటిని మసీదు నిర్మాణానికి వినియోగించారు. వివాదాస్పద ప్రాంతంలోని చిన్నభాగంలో రాముడి జన్మస్థలం ఉన్నట్లు హిందువులు విశ్వసిస్తూ వచ్చారు. 1855కి పూర్వమే రామ్ఛబుత్ర, సీతారసోయి అస్తిత్వంలో ఉండగా హిందువులు అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. దీనివల్లే భూమిపై కక్షిదారులకు ఉమ్మడిహక్కు కల్పిస్తున్నాం’’ అని జస్టిస్ ఎస్యూ ఖాన్ పేర్కొన్నారు. ‘‘ఏఎస్ఐ తవ్వకాల్లో దీనికి సంబంధించి 265 ఆధారాలు లభించాయి. ఏఎస్ఐ మాజీ డీజీ రాకేశ్ తివారీ నివేదికలోనూ పాత ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించినట్లు స్పష్టంచేశారు’’ అని జస్టిస్ శర్మ పేర్కొన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 14 పిటిషన్లు దాఖలయ్యాయి. న్యూఢిల్లీ: అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై హిందూ, ముస్లిం పక్షాల మధ్య దశాబ్దాలుగా వివాదం నెలకొంది. రామజన్మభూమి – బాబ్రీ మసీదు ప్రాంతం ఉన్న 2.77 ఎకరాల స్థలాన్ని నిర్మోహీ అఖాడా, రామ్లల్లా, సున్నీ వక్ఫ్బోర్డుకు మూడు సమాన భాగాలుగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. బాబ్రీ మసీదును కూల్చి విగ్రహాలు ఏర్పాటు చేసిన తాత్కాలిక మందిరాన్ని శ్రీరాముడి జన్మస్థలంగానే పరిగణించిన హైకోర్టు దీన్ని రామ్లల్లా విరాజ్మాన్కు అప్పగించాలని పేర్కొంది. రామ్ ఛబుత్ర, సీతారసోయిని నిర్మోహీ అఖాడాకు ఇవ్వాలని, మిగతా భాగాన్ని సున్నీ వక్ఫ్బోర్డుకు అప్పగించాలని సూచించింది. నిర్మోహి అఖాడా, రామ్లల్లా, సున్నీవక్ఫ్ బోర్డు తరఫున దాఖలైన పిటిషన్లపై జస్టిస్ డి.వి.శర్మ, జస్టిస్ సుధీర్ అగర్వాల్, జస్టిస్ ఎస్.యు.ఖాన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 2 – 1 మెజార్టీతో నాడు తీర్పు వెలువరించింది. బాల రాముడిదే భూమి... న్యాయసూత్రాల ప్రకారం హిందూ దేవుళ్లను చట్టబద్ధులైన వ్యక్తులుగా గుర్తించవచ్చు. దావా వేసే హక్కుతోపాటు వారిని దావా పరిధిలోకి చేర్చవచ్చు. ఆరాధించే భక్తుల దైవభక్తే దీనికి ప్రాతిపదిక. రామ్లల్లా (బాల రాముడు) విరాజ్మాన్ను దావా వేసిన వ్యక్తిగా భావిస్తూ సుప్రీం కోర్టు ఈ కేసు విచారణను చేపట్టింది. అయోధ్యలోని బాల రాముడిని చట్ట ప్రకారం శాశ్వత మైనర్గా గుర్తిస్తూ విచారణ ప్రారంభించింది. రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో బాలరాముడి తరపున ఆయన స్నేహితుడిగా భావించే వీహెచ్పీ నేత త్రిలోక్నాథ్ పాండే ప్రాతినిథ్యం వహించారు. 1989లో తొలిసారిగా బాల రాముడిని ఈ కేసులో దావాదారుడిగా చేర్చారు. రెండేళ్ల తరువాత ఈ వివాదం అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఈ కేసులో భగవంతుడి స్నేహితుడిగా తనను కూడా భాగస్వామిగా చేర్చాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి దేవకి నందన్ అగర్వాల్ కోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో ఆయన వీహెచ్పీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రామ్లల్లాకు వివాదాస్పద 2.77 ఎకరాల స్థలంపై యాజమాన్య హక్కులు అప్పగిస్తూ తీర్పునిచ్చింది. సంపన్న అఖాడా! నిర్మోహీ అఖాడాను స్వామి రామానంద స్థాపించారు. దేశవ్యాప్తంగా పలు ఆలయాలు, మఠాలున్న సంపన్న అఖాడా ఇది. యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, బిహార్లోనూ దీని విభాగాలున్నాయి. వివాహం, లైంగిక సంబంధాలకు దూరంగా సాధారణ జీవితాన్ని గడిపే నిర్మోహీ అఖాడా సాధువులు కఠిన నియమాలు పాటిస్తారు. రాముడిని పూజిస్తారు. యుక్త వయసులో ఉండగానే కొత్తవారిని అఖాడా సభ్యులుగా చేర్చుకుంటారు. వేదాలు, ఉపనిషత్తులను ఔపోసన పట్టడంతోపాటు కొన్ని రకాల యుద్ధ క్రీడలనూ అభ్యసిస్తారు. అయోధ్య వివాదం తెరపైకి రావడంతో నిర్మోహీæ అఖాడా ప్రాధా న్యం పెరిగింది. రామ జన్మభూమిని తమకు అప్పగించాలంటూ నిర్మోహీ అఖాడా తరఫున న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైంది. రామాలయం నిర్మాణాన్ని అడ్డుకోకుండా ఫైజాబాద్ యంత్రాంగాన్ని ఆదేశించాలని కోరుతూ అఖాడా మహంత్ రఘువర్దాస్ 1885లో కేసు వేశారు. కోర్టు దీన్ని కొట్టివేసింది. ప్రస్తుతం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన వ్యాజ్యాన్ని 1950 జనవరిలో హిందూ మహాసభ నేత జీఎస్ విశారద్ దాఖలు చేశారు. 1960 నాటికి అఖాడా కూడా ఈ కేసులో భాగస్వామిగా మారింది. అమీనాబాద్ టు సుప్రీం రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదానికి సంబం ధించి ముస్లిం పక్షాల తరపున న్యాయపోరాటం 1857లో మౌజం మౌల్వీ మహ్మద్ అస్ఘర్తో మొదలైంది. హనుమాన్గఢ్ మహంత్ ఈ కట్టడాన్ని బలవంతంగా తన అధీనంలోకి తీసుకున్నారని ఆయన మేజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు. బాబ్రీ మసీదు ప్రధాన గేటు తాళం తెరవాలని 1986 జనవరి 2న ఫైజాబాద్ జిల్లా జడ్జి ఆదేశించడంతో వివాదం రాజుకుంది. నాడు అత్యవసరంగా సమావేశమైన ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మసీదుకు అనుకూలంగా ప్రచారం నిర్వహించి మద్దతు కూడగట్టాలని నిర్ణ యించింది. న్యాయవాది అబ్దుల్ మన్నన్ నివాసంలో జనవరి 4న ముస్లిం నేతలు సమావేశమయ్యారు. యూపీ నేత అజంఖాన్ కూడా దీనికి హాజరయ్యారు. రెండు రోజుల తరువాత లక్నో అమీనాబాద్లోని ఓ ఇంట్లో 200 మందితో నిర్వహించిన సమావేశంలో బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. అజంఖాన్, జఫర్యాబ్ గిలానీలను కన్వీనర్లుగా, మౌలానా ముజఫర్ హుస్సేన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఏఐఎంపీఎల్బీ ఆధ్వర్యంలో బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ న్యాయపోరాటం ఆరంభించింది. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏఐఎంపీఎల్బీపై ఒత్తిడి పెరిగింది. పోరాడే బాధ్యతను బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీకి అప్పగించారు. సున్నీ సెంట్రల్ వక్ఫ్బోర్డు తదితర ముస్లిం పక్షాల తరపున దాదాపు రెండు దశాబ్దాలుగా బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ వివిధ కోర్టుల్లో న్యాయ పోరాటం చేసింది. పురాతన అవశేషాలు ఉన్నాయా? భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు 1976–77 సంవత్సరాల్లో తిరిగి 2003లో వివాదాస్పద ప్రాంతంలో తవ్వకాలు జరిపింది. మసీదు నిర్మాణం దెబ్బతినకుండా ఉండేందుకు ఈ తవ్వకాల సందర్భంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని (జీపీఆర్) వినియోగించుకుంది. ఇందుకోసం టోజో డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ అనే సంస్థ సాయం తీసుకుంది. తవ్వకాల్లో కనుగొన్న ఆధారాలపై 2003లో కోర్టుకు సమర్పించిన నివేదికలోని వివరాలివీ.. - తవ్వకాల్లో క్రీస్తుపూర్వం 13వ శతాబ్దం నాటి ఆధారాలూ లభ్యమయ్యాయి. - కుషాణులు, శుంగ వంశ పాలకులు, గుప్తుల కాలం, మధ్యయుగాల నాటి ఆనవాళ్లు కనిపించాయి. - ఇక్కడ బయటపడిన 15్ఠ15 కొలతలతో ఉన్న వేదికకు చాలా ప్రాముఖ్యం ఉంది. - ఇక్కడున్న వలయాకార ఆలయాన్ని 7– 10 శతాబ్దాల మధ్యలో నిర్మించారు. - ఇక్కడే ఉన్న మరో భవనం కూడా 11, 12వ శతాబ్దాల్లో రూపుదిద్దుకుంది. - దీంతోపాటు మరో భారీ నిర్మాణం ఫ్లోర్ మూడు దఫాలుగా పూర్తయింది. - వీటిపైనే 16వ శతాబ్దంలో వివాదాస్పద కట్టడం(మసీదు) నిర్మితమైంది. - సరిగ్గా మసీదు గోపురం ఉన్న చోటే దిగు వన 50 రాతి స్తంభాలు బయటపడ్డాయి. వీటితోపాటు బౌద్ధ, జైన ఆలయాల ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి. -
తీర్పు నేపథ్యంలో సంయమనం పాటించాలి
సాక్షి, కరీంనగర్: రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై తీర్పు రానున్న నేపథ్యంలో ప్రజలు సంయమనం పాటించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పును ప్రతిఒక్కరూ గౌరవించాలన్నారు. తీర్పుకు అనుకూలంగా, ప్రతికూలంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని చెప్పారు. ర్యాలీలు, ఊరేగింపులు, టపాసులు కాల్చడం, స్వీట్ల పంపిణీపై నిషేధం విధించినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో తీర్పుపై ఎలాంటి ప్రచారం చేసిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల్లోకి చేరే ఆర్టీసీ కార్మికులకు రక్షణ కల్పిస్తాం.. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలనుకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడైనా రిపోర్ట్ చేయవచ్చని పేర్కొన్నారు. విధుల్లో చేరాలనుకునే కార్మికులకు పోలీసులు రక్షణ కల్పిస్తారని తెలిపారు. విధుల్లో చేరే కార్మికులపై బెదిరింపులకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గుండెపోటుతో మృతి చెందిన డ్రైవర్ బాబు అంత్యక్రియల సమయంలో గొడవ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని పీసీ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. -
అయోధ్య కేసులో వాదనలు పూర్తి
-
బాబ్రీపై నివేదిక సాధారణం కాదు
న్యూఢిల్లీ/లక్నో: రామజన్మ భూమి –బాబ్రీ మసీదు కేసుకు సంబంధించి 2003లో భారత పురాతత్వ సర్వే (ఏఎస్ఐ) ఇచ్చిన నివేదిక సాధారణమైంది కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుపై వాదనలు 33వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సున్ని వక్ఫ్ బోర్డ్ తరఫున సీనియర్ లాయర్ మీనాక్షి అరోరా మాట్లాడుతూ.. ఏఎస్ఐ సర్వే కేవలం వారి అభిప్రాయమే అని, అది బలహీనమైందని అన్నారు. ఈ నివేదికను బలపరిచే ఆధారాలు లేవని పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం స్పందిస్తూ.. కోర్టు కమిషనర్ ఆధ్వ ర్యంలో ఆ నివేదిక రూపు దిద్దుకుం దని స్పష్టం చేసింది. వివాదాస్పద స్థలాన్ని నిపుణులు క్షుణ్నంగా పరిశీలించి నివేదిక తయారు చేశారని తెలిపింది. కోర్టులో కల్యాణ్ సింగ్.. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కల్యాణ్ సింగ్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు బీజేపీ నేతలను కోర్టు విచారిస్తోంది. కల్యాణ్ సింగ్ గతంలో రాజస్తాన్ గవర్నర్గా ఉండడంతో ఆయన విచారణను ఎదుర్కోలేదు. -
అయోధ్య వాదనలు 18కల్లా ముగించండి
న్యూఢిల్లీ: భారత రాజకీయాలను ప్రభావితం చేయగల ‘రామ జన్మభూమి, బాబ్రీ మసీదు స్థల వివాదం’ కేసు తీర్పు నవంబర్లో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థల వివాదానికి సంబంధించి కేసులో ఇరు పక్షాల తరఫున వాదనలను అక్టోబర్ 18కల్లా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఇరుపక్షాలను ఆదేశించింది. దీంతో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ కేసు తీర్పు మరో రెండు నెలల్లో వెలువడనుంది. మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా ఇరుపక్షాల వారు వివాదాన్ని పరిష్కరించుకోవాలనుకుంటే అందుకు తమకేమీ అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు సీజే జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం తేలి్చచెప్పింది. కీలక దశకు విచారణ అక్టోబరు 18కల్లా రోజువారీ వాదనలను ఇరుపక్షాల లాయర్లు ముగిస్తే తుదితీర్పును రాయడానికి జడ్జీలకు 4వారాల సమయం పడుతుందని కోర్టు తెలిపింది. అంటే నవంబర్ మధ్యలోగా తీర్పు వెలువడొచ్చు. ఈ కేసును విచారిస్తున్న బెంచ్కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ గొగోయ్ సీజేఐగా అదే నెలలో 17వ తేదీన రిటైర్ కానున్నారు. వాదనలు పూర్తి చేసేందుకు అవసరమైన షెడ్యూల్ను తమకు సమర్పించాలని కేసులోని ఇరు పక్షాలకు ధర్మాసనం మంగళవారం సూచించింది. కేసులో ఇరుపక్షాల రోజువారీ వాదనలు కొనసాగుతున్నాయని, విచారణ కీలకదశకు చేరుకుందని జడ్జీలు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్ల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. మధ్యవర్తిత్వ ప్రక్రియను మళ్లీ మొదలుపెట్టేందుకు కొంతమంది ఆసక్తి చూపారని, మధ్యవర్తిత్వం నెరిపిన త్రిసభ్య ప్యానెల్కు నేతృత్వం వహిస్తున్న మాజీ జడ్జీ జస్టిస్ ఎఫ్ఎంఐ ఖలీఫుల్లా తమకు ఒక లేఖ రాశారని, ఇది ఆ ప్యానెల్ ముందే జరగవచ్చునని కాకపోతే వివరాలు బహిర్గతం కారాదని బెంచ్ స్పష్టం చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు గత నెల 6 నుంచి రోజూ విచారిస్తోంది. -
రామజన్మభూమి యాజమాన్య పత్రాలు పోయాయ్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామజన్మభూమి వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోజువారీ వాదనల్లో భాగంగా బుధవారం రెండోరోజు వాదనలను సుప్రీంకోర్టు కొనసాగించింది. ఈ కేసులో ఒక వాదిగా ఉన్న నిర్మోహి అఖారా వాదనలు వినిపిస్తూ.. రామజన్మభూమి యాజమాన్యానికి సంబంధించి తమ వద్ద ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. రామజన్మభూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి పూర్వం మీ అధీనంలో ఉందని చెప్పడానికి మీ వద్ద మౌకిక లేదా పత్ర సంబంధమైన ఆధారాలు, రెవెన్యూ రికార్డులు ఏమైనా ఉన్నాయా? అని సుప్రీంకోర్టు నిర్మోహి అఖారా తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. 1982లో జరిగిన బందిపోటు దాడిలో రామజన్మభూమి యాజమాన్య పత్రాలను తాము కోల్పోయామని, తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని అఖారా న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. రామజన్మభూమి-బాబ్రి మసీదు కేసులో ఆగస్టు ఆరో తేదీ నుంచి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం రోజువారీ వాదనలు వింటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన మధ్యవర్తిత్వ కమిటీ ఓ పరిష్కారం చూపడంలో విఫలమవ్వడంతో ధర్మాసనం రోజువారీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో వాద, ప్రతివాదులుగా ఉన్న హిందూ-ముస్లిం సంఘాలు ఒక రాజీ పరిష్కారానికి రాకపోవడంతో మధ్యవర్తిత్వ కమిటీ నాలుగు నెలల పాటు జరిపిన సంప్రదింపుల ప్రక్రియ విఫలమైన సంగతి తెలిసిందే. -
6 నుంచి అయోధ్య విచారణ
న్యూఢిల్లీ: రాజకీయంగా సున్నితమైన అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదానికి మధ్యవర్తిత్వం పరిష్కారం చూపనందున ఇక ఈ కేసును తామే ప్రతి రోజూ విచారిస్తామని సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. ఆగస్టు 6 నుంచి ప్రారంభించి విచారణను రోజూ బహిరంగంగా చేపడతామంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎంఐ ఖలీఫుల్లా నేతృత్వంలోని త్రిసభ్య మధ్యవర్తిత్వ కమిటీ దాదాపు నాలుగు నెలలపాటు అయోధ్య కేసులో మధ్యవర్తిత్వానికి ప్రయత్నించినా ఫలితం రాలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికను తాము చదివామనీ, సమస్యకు ఈ కమిటీ తుది పరిష్కారం చూపలేకపోయిందని పేర్కొంది. కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున ఇక తామే ఈ కేసును విచారించాలని నిర్ణయించినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తెలిపింది. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్లు ఈ ధర్మాసనంలో ఇతర సభ్యులుగా ఉన్నారు. జూలై 31 నాటి వరకు మధ్యవర్తిత్వంలో ఎంత పురోగతి వచ్చిందో తెలిపే నివేదికను ఆగస్టు 1న తమకు సమర్పించాల్సిందిగా త్రిసభ్య మధ్యవర్తిత్వ కమిటీని కోర్టు జూలై 18నే ఆదేశించింది. కాగా, అయోధ్య కేసుపై ప్రతి రోజూ విచారణ జరుపుతామంటూ సుప్రీంకోర్టు చెప్పడాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) స్వాగతించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి న్యాయపరమైన చిక్కులు త్వరలోనే తొలగిపోతాయని తాము ఆశిస్తున్నామని ట్విట్టర్లో తెలిపింది. మధ్యవర్తిత్వంతో లాభం లేదు త్రిసభ్య కమిటీ నివేదికను పరిశీలించిన అనంతరం, మధ్యవర్తిత్వంతో లాభం లేదనీ, కేసును తామే విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఎఫ్ఎంఐ ఖలీఫుల్లా ఈ త్రిసభ్య కమిటీకి నేతృత్వం వహిస్తుండగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్తోపాటు సీనియర్ న్యాయవాది, మధ్యవర్తిత్వంలో పేరొందిన శ్రీరామ్ పంచు సభ్యులుగా ఉండటం తెలిసిందే. క్లిష్టమైన అయోధ్య సమస్యకు హిందూ, ముస్లిం వర్గాలకు అమోదయోగ్యమైన పరిష్కారం లభించడం లేదని త్రిసభ్య కమిటీ తన నివేదికలో పేర్కొంది. అయోధ్య కేసులో మధ్యవర్తిత్వానికి కోర్టు మార్చి 8న అనుమతినిచ్చింది. చర్చలను రహస్యంగా జరపాలనీ, 8 వారాల్లోగా పూర్తి చేయాలని అప్పట్లో గడువు విధించింది. అయితే సామరస్యక పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు ఆశాజనకంగా సాగుతున్నాయనీ, మరికొంత సమయం కావాలని కమిటీ కోరడంతో, ఆగస్టు 15 వరకు కోర్టు గడువిచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్లో కమిటీ ఈ చర్చలు జరిపింది. 16వ శతాబ్దంలో మీర్ బఖీ నిర్మించిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న కొందరు కూల్చేయడం తెలిసిందే. 20 రోజుల సమయం కావాలి... ఈ కేసులో ముస్లింల తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ శుక్రవారం కోర్టులో వాదిస్తూ పలు సాంకేతికాంశాలను ప్రస్తావించారు. కేసులోని వివిధ అంశాలను సంపూర్ణంగా వాదించాలంటే తనకు ముందుగా కనీసం 20 రోజుల సమయం కావాలని ఆయన కోరారు. కేసులోని వివిధ అంశాలు, అప్పీళ్లను ఎలా విచారించాలో రాజీవ్ కోర్టుకు చెబుతుండగా, న్యాయమూర్తులు కలగజేసుకుంటూ ‘మేము ఏం చేయాలో మీరు మాకు గుర్తుచేయాల్సిన అవసరం లేదు. కేసులో ఏయే అంశాలున్నాయో మాకు తెలుసు. వాటన్నింటిపై మేం విచారిస్తాం. ముందు విచారణ ప్రారంభం కానివ్వండి’ అని అన్నారు. మధ్యవర్తిత్వ కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలు రహస్యంగానే ఉంటాయని కూడా కోర్టు స్పష్టం చేసింది. -
నేడు సుప్రీంకోర్టులో ‘అయోధ్య’ వాదనలు
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిరం–బాబ్రీ మసీదు భూవివాదానికి సంబంధించిన కేసు వాదనలను శుక్రవారం విననున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఐదుగురు జడ్జీల ధర్మాసనం ఈ కేసుకు సంబంధించిన వాదనలు విననుంది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నాజీర్లు బెంచ్లో సభ్యులుగా ఉండనున్నారని పేర్కొంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో దశాబ్దాలుగా నలుగుతున్న రామ జన్మభూమి–బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు గానూ ఈ కేసులో మధ్యవర్తిత్వానికి అనుమతినిస్తూ గతంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
‘అయోధ్య’ కేసులో మధ్యవర్తిత్వం ప్రారంభం
ఫైజాబాద్(యూపీ): రామజన్మభూమి–బాబ్రీ మసీదు సమస్యను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తిత్వ కమిటీ సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్లో ఉన్న అవధ్ వర్సిటీలో కమిటీ బుధవారం నిర్వహించిన భేటీకి 25 మంది పిటిషనర్లు తమ న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు. కమిటీలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎఫ్.ఎం. ఖలీఫుల్లా, న్యాయవాది శ్రీరామ్ పంచు, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి రామజన్మభూమి పునరుద్ధరణ్ సమితికి చెందిన స్వామి అవిముక్తేశ్వరానంద్, మహంత్ దినేంద్రదాస్ (నిర్మోహీ అఖారా), త్రిలోకీనాథ్ పాండే(రామ్లల్లా విరాజ్మాన్), స్వామి చక్రపాణి, కమలేశ్ తివారీ (హిందూ మహాసభ)తో పాటు ఇక్బాల్ అన్సారీ, మొహమ్మద్ ఉమర్, హాజీ మహబూబ్, మౌలానా అష్హద్ రషీదీ జమాత్ ఉలేమా ఏ హింద్), వసీమ్ రిజర్వీ (ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు) తదితరులు హాజరయ్యారు. కాగా, మధ్యవర్తిత్వ కమిటీతో చర్చలు సహృద్భావ వాతావరణంలో సాగాయని స్వామి అవిముక్తేశ్వరానంద్ తెలిపారు. ఈ మధ్యవర్తిత్వ కమిటీ మూడు రోజుల పాటు పిటిషనర్లతో చర్చలు జరుపుతుంది. -
శ్రీశ్రీ రవి శంకర్ అందుకు సమర్థుడేనా?
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామాలయం–బాబ్రీ మసీదు వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం నాడు ప్రకటించిన ముగ్గురు మధ్యవర్తుల కమిటీలోకి ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవి శంకర్ను తీసుకోవడం ఏ మేరకు సమంజసం? కోర్టు బయట సెటిల్మెంట్ ద్వారా ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవచ్చో ఇదివరకే ఆయన తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. అవి ముస్లిం వర్గాలు ఆమోదించేలా ఉన్నాయా? అవి ఏమిటీ? వాటిని పరిగణలోకి తీసుకొనే ఇప్పుడు ఆయన్ని ముగ్గురు మధ్యవర్తుల కమిటీలోకి సుప్రీం కోర్టు తీసుకుందా? రవి శంకర్ అభిప్రాయాలు లేదా సూచనలను అమలు చేయడం వల్ల సుదీర్ఘకాలంగా నలుగుతున్న మందిర్–మసీదు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా? చదవండి...(‘అయోధ్య’పై మధ్యవర్తిత్వం) 2018లో ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశ్రీ రవి శంకర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు: ‘ సుప్రీం కోర్టు తీర్పు ఎవరికి విరుద్ధంగా వెలువడినా వారు తీవ్రవాదాన్ని ఆశ్రయిస్తారు. సిరియా లాంటి పరిస్థితి లేదా అంతర్యుద్ధం తప్పదు. అందుకని ఈ సమస్యను కోర్టు వెలుపలనే పరిష్కరించుకోవాలి. దానికి కూడా సుహద్భావ చర్యగా అయోధ్యపై ముస్లింలు తమ హక్కును వదులు కోవాలి. ఎందుకంటే రాముడు సంచరించిన అయోధ్య ముస్లిలకు ఆధ్యాత్మికమైనదేమీ కాదు’ అని చెప్పారు. ఇక ఇదే విశయమై గతేడాది ఆయన ‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు’కు రాసిన ఓ బహిరంగ లేఖలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు. 1. కోర్టు తీర్పు ప్రకారం హిందువులకే అయోధ్య స్థలం లభించి అక్కడ ఆలయాన్ని నిర్మిస్తే ముస్లింలు భారత చట్టంపై, న్యాయ వ్యవస్థపై పూర్తిగా విశ్వాసం కోల్పోతారు. పర్యవసానంగా ముస్లింలు, ముఖ్యంగా యువకులు హింసాకాండకు దిగుతారు. 2, బాబ్రీ మసీదు పునర్నిర్మాణం కోసం వివాదాస్పద స్థలాన్ని ముస్లింలకే అప్పగిస్తే దేశవ్యాప్తంగా మత కల్లోలాలు చెలరేగుతాయి. గ్రామస్థాయి నుంచి హిందువుల అందరి విశ్వాసాన్ని, మన్ననలను ముస్లింలు పూర్తిగా కోల్పోతారు. 3. టైటిల్పై హక్కులు కోరుతున్న ముగ్గురు పిటషనర్లకు వివాదాస్పద భూమిని పంచాలంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్లయితే 1992లో జరిగిన బాబీ మసీదు విధ్వంసం పునరావతం అవుతుంది. 4. కోర్టుతో సంబంధం లేకుండా ఆలయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నేరుగా ఉత్తర్వులు జారీచేసినా ముస్లిం గాయపడతారు. హింసాకాండకు పాల్పడతారు. నాలుగు సూచనల్లో ఏ సూచనను అమలు చేసిన ఇరువర్గాల మధ్య ఘర్షణలు, రక్తపాతం తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకనే ఆయన మధ్యేమార్గంగా మరో సూచన చేశారు. కోర్టు వెలుపల పరిష్కారం ‘కోర్టు వెలుపలే పరిష్కారం ఒక్కటే ఉత్తమమైన మార్గంగా నాకు కనిపిస్తోంది. హిందువుల పట్ల సుహద్భావంతో ముస్లింలు ముందుకు వచ్చి ఒక ఎకరం వివాదాస్పద స్థలాన్ని బహుమానంగా ఇవ్వాలి. అందుకు బదులుగా హిందువులు అక్కడికి సమీపంలోని ఐదు ఎకరాల స్థలాన్ని బహుమానంగా ఇస్తుంది. దీని వల్ల ముస్లింలు వంద కోట్ల హిందువుల మన్ననలను అందుకోవడంతోపాటు అయోధ్య వివాదానికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ముస్లిం తరాలు ప్రశాంతంగా జీవించవచ్చు’ అని రవి శంకర్ సూచించారు. ఆయన చేసిన ఈ సూచనతో పలువురు హిందూ సంస్థల నాయకులే అంగీకరించలేదు. విదేశాల నుంచి భారీ విరాళాలు అందుకున్న రవి శంకర్ ఆ విషయం నుంచి ప్రజల దష్టిని మళ్లించేందుకు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారని విశ్వహిందూ పరిషద్ నాయకులు విమర్శించారు. సంప్రతింపుల ద్వారా అయోధ్య పరిష్కారానికి గతంలోనే ప్రయత్నాలు జరగ్గా వాటిని అడ్డుకున్నదే రవి శంకర్ అంటూ అయోధ్యలోని హనుమాన్గఢీ ఆలయం అధిపతి మహంత్ జ్ఞాన్ దాస్ ఆరోపించారు. అన్ని వర్గాలు తమ ఈగోలను పక్కన పెట్టి సంప్రదింపుల ద్వారానే అయోధ్య సమస్యను పరిష్కరించుకోవాలంటూ సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులకు ఒక్క రోజు ముందే రవి శంకర్ ట్వీట్ చేశారు. రవి శంకర్ సూచించినట్లు బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలం ఒక ఎకరం కాదు. 2.77 ఎకరాల స్థలం. నాడు బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం ఇరువర్గాల మధ్య రాజీ కోసం నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా వివాదాస్పద స్థలానికి పక్కన దాదాపు 60 ఎకరాలను సేకరించింది. వాటిలో ఆలయంతోపాటు మ్యూజియం, యాత్రికుల వసతిశాలలు నిర్మించాలని ప్రతిపాదించింది. ఆ తర్వాత ఆర్డినెన్స్ స్థానంలో అయోధ్య పేరిట చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. వివాదాస్పద స్థలంలో అంగుళం కూడా వదులుకోమంటూ నాడు బీజేపీ ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు అదే బీజేపీ అధికారంలో ఉంది. ఇక రవి శంకర్ సూచించినట్లు ముస్లింలు వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగించినట్లయితే హిందూత్వ సంస్థలు ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశంలోని అన్ని వివాదాస్పద స్థలాలపై దాడులు చేసే అవకాశం ఉంటుందని సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. మధ్యవర్తుల కమిటీలో రవి శంకర్తోపాటు జస్టిస్ ఫక్కీర్ మొహమ్మద్ ఇబ్రహీం కాలిఫుల్లా, ప్రముఖ న్యాయవాది శ్రీరామ్ పాంచు ఉన్నారు కనుక ఎంత మేరకు వారి ప్రయత్నాలు ఫలిస్తాయో చూడాలి. -
సయోధ్యకు మధ్యవర్తిత్వం
రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం విషయంలో మధ్యవర్తిత్వం నెరపి, ‘శాశ్వత పరిష్కా రాన్ని’ సాధించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని నియమిస్తూ సర్వోన్నత న్యాయస్థానం శుక్ర వారం వెలువరించిన ఆదేశాలు ఏడు దశాబ్దాలుగా సాగుతున్న ఆ వివాదాన్ని కొత్త మలుపు తిప్పాయి. సంఘర్షణ కంటే సామరస్యత ఎప్పుడూ మంచిదే గనుక ఇది స్వాగతించదగ్గదే. మధ్య వర్తిత్వం కోసం నియమించిన బృందంలో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్తోపాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఫకీర్ మహమ్మద్ ఇబ్రహీం కలీఫుల్లా, మధ్యవర్తిత్వం కేసుల్లో నిపు ణుడిగా పేరున్న సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచు ఉన్నారు. వీరు అవసరమనుకుంటే మరికొం దరిని సభ్యులుగా చేర్చుకోవచ్చు. ఈ బృందం 8 వారాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. నాలుగు వారాల్లోగా తాత్కాలిక నివేదికను అందజేయాలని ధర్మాసనం కోరింది. అయితే సంబంధిత పక్షాలతో జరిపే సంప్రదింపుల వివరాలను వెల్లడించరాదని సుప్రీం కోర్టు నిర్దేశించింది. ఈ వివాదం విషయంలో ఇటీవల తీవ్ర స్వరాలు వినిపించాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు, సంఘ్ పరివార్కు చెందిన ఇతర నేతలు ఎన్నికల్లోగా రామమందిర నిర్మాణం ప్రారంభించాల్సిందేనని పట్టుబట్టారు. సుప్రీంకోర్టు దీన్ని ఇప్పటికప్పుడు తేల్చనిపక్షంలో ఆర్డినెన్స్ జారీకి కూడా వెనుకాడరాదని ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఒక దశలో పార్లమెంటు సమావేశాలు ముగిశాక ఆర్డి నెన్స్ వెలువడుతుందన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం ఆలోచన చేసి, అందుకోసం ఒక బృందాన్ని నియమిం చడం ఇదే మొదటిసారి. కానీఈ తరహా ప్రయత్నాలు లోగడ జరగకపోలేదు. 1990లో స్వల్పకాలం ప్రధానిగా ఉన్న చంద్రశేఖర్, 1992లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, 2003లో ప్రధానిగా వాజపేయి మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించారు. పీవీ హయాంలో ఆయన సలహాదారుగా పని చేసిన ఉన్నతాధికారి స్వర్గీయ పీవీఆర్కే ప్రసాద్, ఆయనతోపాటు చంద్రస్వామి పీఠాధిపతులతో, హిందూ మత పెద్దలతో, ముస్లిం సంఘాలతో మాట్లాడారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కా రానికి వారు చేరువగా వచ్చారన్న కథనాలు కూడా వెలువడ్డాయి. కానీ చివరికది మూలన పడింది. రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం మౌలికంగా మతపరమైన మనోభావాలతో, విశ్వా సాలతో ముడిపడి ఉన్న సమస్య. సమస్య ఆస్తుల పంపకానికి సంబంధించిందో, సరిహద్దు వివా దానికి సంబంధించిందో అయినప్పుడు మధ్యవర్తిత్వంపెద్ద కష్టం కాదు. అక్కడ ఇచ్చిపుచ్చుకోవ డాలుంటాయి. వివాదం సాగదీసేకొద్దీ నష్టపోతామన్న అవగాహన ఉంటుంది. కానీ ఇది అలాం టిది కాదు. 1949లో మహంత్ రామచంద్ర దాస్ పరమహంస రామమందిరం ఉన్న ప్రాంతంలో పూజ, దర్శనం కోసం అనుమతించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు అక్కడినుంచి రాముడి విగ్రహాన్ని తొలగించాలని హషీమ్ అన్సారీ అనే వ్యక్తి కూడా కోర్టుకెక్కారు. కానీ అది ఈ స్థాయిలో దేశమంతా తెలిసింది 80వ దశకంలో సంఘ్ పరివార్ సంస్థలు రామజన్మభూమి విముక్తి పేరిట సాగించిన ఉద్యమం, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ చేపట్టిన రథయాత్రల వల్లనే. 1992 నాటి బాబ్రీమసీదు కూల్చివేత దేశవ్యాప్తంగా మతకల్లోలాలకు దారితీసి 2,000మంది ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది గాయాలపాలయ్యారు. ఆపై జరిగిన పలు హింసాత్మక ఉదంతా లకూ, ఉగ్రవాద ఘటనలకూ బాబ్రీ మసీదు కూల్చివేతలోనే బీజాలున్నాయి. అయితే ఇప్పుడు 90వ దశకంనాటి ఉద్రిక్తతలు లేవు. తమ తమ విశ్వాసాల మాటెలా ఉన్నా వివాదం న్యాయస్థానం పరిధిలో ఉంది గనుక అదిచ్చే తీర్పు కోసం ఎదురు చూడాలన్న దృక్పథం ఇరు వర్గాల్లోనూ ఏర్ప డింది. విశ్వాసానికి సంబంధించిన వివాదంలో న్యాయస్థానాలు చెప్పేదేమిటని హిందుత్వ సంస్థ లకు చెందినవారు కొందరు వ్యాఖ్యానించినా మొత్తం మీద ఆగ్రహా వేశాలు కట్టుదాటలేదు. మధ్యవర్తిత్వం ద్వారా వైరి వర్గాలను ఒప్పించి సామరస్యపూర్వక పరిష్కారం సాధించాలను కోవడం ఆదర్శవంతమైనదే. ప్రజాస్వామ్యబద్ధమైనదే. కానీ ఈ వివాదం సాధారణమైనది కాదు. అత్యంత జటిలమైనది. భావోద్వేగాలతో, విశ్వాసాలతో ముడిపడి ఉండే ఒక వివాదంలో మధ్యవ ర్తిత్వం ద్వారా పరిష్కారం కనుగొనడం సాధ్యమేనా? అది సాధ్యం కావాలంటే ఇరుపక్షాలూ ఇచ్చి పుచ్చుకునే వైఖరిని ప్రదర్శించాలి. ఎవరి వరకో ఎందుకు... ప్రస్తుత బృందంలోని శ్రీశ్రీ రవిశంకరే అలాంటి వైఖరి ఈ వివాదంలో సాధ్యపడదని తేల్చిచెప్పారు. వివాదస్పద ఎకరం స్థలాన్ని హిందు వులకు బహుమతిగా ఇచ్చి దానికి బదులు సమీపంలో మరోచోట 5 ఎకరాలు తీసుకుని మసీదు నిర్మాణం చేపట్టడమే ఉత్తమ పరిష్కారమని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డుకు నిరుడు రాసిన లేఖలో ఆయన ప్రతిపాదించారు. ఈ వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏ పక్షానికి వ్యతిరేకంగా ఉన్నా తీవ్రవాదం పెరుగుతుందని, అంతిమంగా అది అంతర్యుద్ధానికి దారి తీస్తుం దని హెచ్చరించారు. కనుకనే శ్రీశ్రీ రవిశంకర్ను బృందంలో చేర్చడంపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు బృంద సభ్యుడుగా ఇరు వర్గాలకూ ఆయనేం ప్రతిపాదిస్తారన్నది ఆసక్తికరమైనదే. ఈ మొత్తం ప్రక్రియ సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే సాగుతుంది కనుక ఒవైసీలాంటివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికైతే ఈ వివాదం తాత్కా లికంగా సద్దుమణిగింది. మధ్యవర్తిత్వ బృందం తుది నివేదిక ఇచ్చేనాటికి ఎన్నికలు కూడా పూర్తవు తాయి. కానీ ఆ తర్వాతైనా పరిష్కారం సాధ్యమవుతుందా? అనుమానమే. ప్రజలెన్నుకునే ప్రభు త్వాలే చొరవ తీసుకుని సమాజంలో తలెత్తే వివాదాలకు అన్ని వర్గాలతో చర్చించి ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడం సరైంది. కానీ అందుకు చిత్తశుద్ధి, దృఢమైన సంకల్పం ఉండాలి. స్వీయ ప్రయోజనాలను పక్కనబెట్టగలిగే విశాల దృక్పథం ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమేనా? -
అయోధ్య రామ జన్మభూమిపై సుప్రీంలో పిటిషన్
-
అయోధ్య కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్ : వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయోధ్య రామ జన్మభూమిపై సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వివాదం లేని 67 ఎకరాల భూమిని రామజన్మభూమి ట్రస్ట్కు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొంది. రామ జన్మభూమి-మసీదు వివాదాస్పద ప్రాంతం 2.77ఎకరాలు కాగా 1991లో ప్రభుత్వం దాంతోపాటు వివాదాస్పద స్థలం చుట్టూ ఉన్న 67 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకుంది. ఈ 67 ఎకరాల భూమిలో తమ అనుమతి లేకుండా ఎలాంటి పనులు చేపట్టరాదని గతంలో సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తొలగించి యజమానులకు 67 ఎకరాల భూమిని అప్పగించాలని సుప్రీం కోర్టుకు కేంద్రం ప్రభుత్వం విన్నవించింది. -
‘బాబ్రీ’ స్థానంలో మందిరాన్ని ఒప్పుకోం
అయోధ్య/లక్నో: బాబ్రీమసీదు–రామమందిరం వివాద పరిష్కారానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ చేస్తున్న ప్రయత్నాలను ఈ కేసులో కక్షిదారైన హాజీ మహబూబ్ స్వాగతించారు. కోర్టు బయట వివాదం పరిష్కారమయితే శాంతి, సామరస్య పరిస్థితులు ఏర్పడతాయన్నారు. అయితే బాబ్రీ మసీదు స్థానంలో మరే కట్టడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. ‘అయోధ్య వివాదం ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా, శాంతియుతంగా పరిష్కారమయితే మంచింది. దీనివల్ల హిందూ–ముస్లిం మతస్తుల మధ్య దీర్ఘకాల శాంతి, సామరస్యం నెలకొంటుంది. ఇందుకోసం ప్రయత్నిస్తున్న శ్రీశ్రీ రవిశంకర్కు మేం సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. అయితే మసీదు ఎప్పటికీ మసీదుగానే ఉంటుంది. బాబ్రీమసీదుకు సంబంధంలేని స్థలంలో రామమందిరం కట్టుకుంటే మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం’ అని హాజీ తెలిపారు. -
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పదమైన బాబ్రీ మసీదు-రామజన్మభూమి కేసులో కక్షిదారులు రెండువారాల్లోగా తమ వద్ద ఉన్న ప్రతాల ఆంగ్ల అనువాదాన్ని తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదం కేసులో అప్పీళ్లపై మార్చి 14వ తేదీ నుంచి వాదనలు విననున్నట్టు తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్ లతో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు వ్యాఖ్యలు చేసింది. రామజన్మభూమి కేసులో రోజువారీ వాదనలు వినే ఉద్దేశంకు తమకు ఎప్పుడూ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. బాబ్రీ మసీదు-రామజన్మభూమి కేసును తాము పూర్తిగా ‘భూవివాదం’ (ప్యూర్ లాండ్ డిస్ప్యూట్)గా పరిగణిస్తామని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు ముందుకురాని అభ్యర్థనలు ఇప్పట్లో తాము వినబోమని, తాజాగా ఇంప్లీడ్ అయిన పార్టీల వాదనలు తర్వాత వింటామని న్యాయస్థానం సంకేతాలు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి స్థానిక భాషల్లో ఉన్న పుస్తకాల్లోని అంశాలను ఆంగ్లంలోకి అనువదించి.. రెండు వారాల్లో తమకు అందజేయాలని ధర్మాసనం తెలిపింది. -
బాబ్రీ మసీదుపై సున్నీ వక్ఫ్ బోర్డు కొత్త ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో సున్నీ వక్ఫ్ బోర్డు కొత్త ట్విస్ట్ ఇచ్చింది. బాబ్రీ మసీదు విచారణను వాయిదావేయాలన్న ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్తో సున్నీ వక్ఫ్ బోర్డు తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పటికే సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ వివాదానికి సత్వరమే ముగింపు పలకాలని సున్నీ వక్ప్ బోర్డు సభ్యుడు హాజీ మెహబూబ్ కోరారు. ఎన్నికల కారణంగా విచారణను 2018 ఫిబ్రవరికి వాయిదా వేయించడంపైనా ఆయన అసహనం వ్యక్తం చేశారు. మందిర్ - మసీదు కేసులో కపిల్ సిబల్ కాంగ్రెస్ నాయకుడిగానే సుప్రీంకోర్టులో వాదించారని, ఆయనతో వక్ఫ్ బోర్డుకు ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. మంగళవారం రామజన్మ భూమి-మసీదుపై సుప్రీంలో విచారణ జరగాల్సి ఉండగా.. సున్నితమైన అంశం అంటూ ఫిబ్రవరి వరకూ వాయిదా వేయాలని సిబల్ సుప్రీంలో వాదించారు. అంతేకాక 2019 లోక్సభ ఎన్నికల వరకూ ఈ విచారణ వాయిదా వేయాలని ఆయన సుప్రీంను కోరారు. అయోధ్య వివాదం పూర్తిగా రాజకీయం అయిందని.. ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. రాజకీయాలను పూర్తిగా ప్రభావితం చేస్తుందని కోర్టుకు సిబల్ తెలిపారు. బీజేపీ 2014 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని చేర్చిందని ఆయన కోర్టుకు తెలిపారు. -
‘ఆలయాన్ని కట్టి తీరుతాం’
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య విచారణ వాయిదా పడిన నేపథ్యంలో.. రామజన్మభూమి న్యాస్ మహంత్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చినా.. ఆలయ నిర్మాణం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగదని రామజన్మభూమి న్యాస్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో.. పార్లమెంట్ ద్వారా ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని నృత్య గోపాల్ దాస్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉండగానే అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుందని ఆయన చెప్పారు. దేశంలోని మెజారిటీ ప్రజలు అయోధ్యలో రామాలయాన్ని కోరుకుంటున్నారని.. కోర్టుకూడా మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరిస్తుందనే నమ్మకం ఉందని నృత్య గోపాల్ దాస్ అన్నారు. అయోధ్య స్థలమంతా రాముడికి సంబంధించనదని ఆయన పేర్కొన్నారు. -
‘అయోధ్యపై మీకు హక్కు లేదు’
సాక్షి, లక్నో: అయోధ్య వివాదం సున్నీ, షియా వర్గాల మధ్య మంటలు రేపుతోంది. బాబ్రీ మసీదు విషయంలో సున్నీ వక్ప్ బోర్డుకు ఎటువంటి హక్కులు లేవని షియా వక్ఫ్ బోర్డు ప్రకటించింది. బాబ్రీ మసీదు, వివాదాస్పద స్థలం గురించి తమ వద్ద తగిన డాక్యుమెంట్లు ఉన్నాయని షియా వక్ప్బోర్డు ఛైర్మన్ వాసిమ్ రిజ్వీ ప్రకటించారు. ఈ డాక్యుమెంట్లను ఇప్పటికే సుప్రీం కోర్టు ముందుంచినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సున్నీ వక్ఫ్ బోర్డు మధుర, కాశీలోని మందిర్-మసీదు వివాదాలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. అదే సమయంలో అయోధ్య వివాదంలో సున్నీ వక్ఫ్ బోర్డు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వాసిమ్ రిజ్వీ స్పష్టం చేశారు. వివాదాస్పద స్థలంపై కోర్టు షియా వక్ఫ్ బోర్డుకు అనులకూంగా తీర్పునిస్తే.. అందులో హిందువుల మనోభావాలకు అనుగుణంగా ఆలయం నిర్మించుకునేందుకు ఇచ్చేస్తామని ఆయన చెప్పారు. అదే సమయంలో లక్నోలో మరో మసీదు నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
బాబ్రీ కేసు: బీజేపీ నేతలకు ఊరట
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేతలు పలువురికి సీబీఐ కోర్టులో పెద్ద ఊరట లభించింది. కురువృద్ధ నేతలు ఎల్కే అడ్వాణీ (89), మురళీ మనోహర్ జోషి (83)లతో పాటు.. కేంద్రమంత్రి ఉమాభారతి(58)కి కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే ఈ కేసులో అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించిన వెంటనే బెయిల్ కూడా ఇచ్చిన కోర్టు.. తాజాగా వారు వ్యక్తిగతంగా సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపింది. దాంతో ప్రతిసారీ కేసు విచారణ సందర్భంగా వాయిదాలకు ఈ సీనియర్ నేతలు లక్నో వరకు రావాల్సిన అవసరం లేకుండా పోయింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ తదితరులపై ఇంతకుముందు నేరపూరిత కుట్ర అభియోగాలను నమోదుకు ఆదేశాలు జారీ చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. వారికి రూ. 50వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ను సైతం మంజూరు చేసింది. నిందితులపై ఇప్పటికే జాతీయ సమైక్యతకు హాని కలిగించడం, ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం, ఉద్దేశపూర్వకంగా మతపరమైన భావాలను దెబ్బతీయడం, బహిరంగ అల్లర్లకు దారితీసేలా ప్రకటనలు చేయడం, అల్లర్లు చేయడం తదితర అభియోగాలు ఉన్నాయి. వీటికి అదనంగా కోర్టు నేరపూరిత కుట్ర అభియోగాన్ని కూడా మోపింది. నేరం రుజువైతే నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని కోర్టులో ఈ కేసు విచారణను పరిశీలిస్తున్న ఓ న్యాయవాది పేర్కొన్నారు. -
అడ్వాణీకి బిగుసుకుంటున్న ఉచ్చు!
లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీపై లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం మరిన్ని అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉంది. అడ్వాణీతోపాటు బీజేపీ నేతలు మురళీ మనోహర్జోషి, ఉమా భారతి తదితరులపై కూడా కొత్త అభియోగాలు నమోదు కావొచ్చు. బాబ్రీ కూల్చివేత అంశంలో వీరిపై ఉన్న నేరపూరిత కుట్ర ఆరోపణలను 2011లో అలహాబాద్ హైకోర్టు కొట్టివేయగా, సుప్రీంకోర్టు గత నెలలో పునరుద్ధరించడం తెలిసిందే. ఏప్రిల్ 19న సీబీఐ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారిస్తూ... ఈ కేసులో వాదనలు ప్రతిరోజూ వినాలనీ, నెల రోజుల్లో విచారణ మొదలుపెట్టి, రెండేళ్లలోపు ముగించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 120–బి ప్రకారం అడ్వాణీ తదితరులపై కొత్తగా అభియోగాలు మోపొచ్చని సుప్రీంకోర్టు అప్పుడే చెప్పింది. మరోవైపు ఈ కేసులో ఆరో నిందితుడు, శివసేన మాజీ ఎంపీ సతీశ్ ప్రధాన్కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం బెయిలు మంజూరు చేసింది. -
బాబ్రీ విధ్వంసానికి బాధ్యతా కాంగ్రెస్దే: అక్బరుద్దీన్
కిషన్గంజ్: బాబ్రీ మసీదు విధ్వంసానికి కాంగ్రెస్దే బాధ్యతని.. దాని అసమర్థత వల్లే నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం బిహార్లోని కిషన్గంజ్ జిల్లా కొచ్చాదామన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సభలో మాట్లాడారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నపుడు 2002లో ఆ రాష్ట్రంలో జరిగిన అల్లర్లను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ వేగంగా స్పందించి, మోదీపై ఉక్కుపాదం మోపి చార్జిషీటు నమోదు చేసి ఉంటే.. ఆయన ప్రధాని అయ్యేవారు కాదన్నారు. అయోధ్యలో రామమందిరం తాళం తెరవటానికి, అనంతరం బాబ్రీ మసీదు విధ్వంసానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనన్నారు.