bilateral talks
-
రష్యాలో మోదీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నుంచి రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. 22వ ఇండో–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. పలు రంగాల్లో విస్తృతస్థాయి సహకారంపై వారు చర్చిస్తారు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు దిగాక మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. మూడేళ్ల విరామం తర్వాత భారత్–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమిట్లో చర్చించబోయే అంశాలు, తీసుకోబోయే ఉమ్మడి నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చివరిసారిగా 2021 డిసెంబర్లో ఢిల్లీలో ఈ సదస్సు జరిగింది. సోమవారం మధ్యాహ్నం రష్యాకు మోదీ చేరుకున్నాక పుతిన్ ఇచ్చే ప్రత్యేక విందు కార్యక్రమానికి మోదీ హాజరుకానున్నారు. తర్వాత శిఖరాగ్ర సదస్సు జరగనుంది. మరుసటి రోజు రష్యాలోని భారతీయసంతతి వ్యక్తులతో మోదీ మాట్లాడతారు. తర్వాత క్లెమ్లిన్లో అనామక సైనికుల స్మారకం వద్ద అంజలి ఘటిస్తారు. తర్వాత మాస్కోలో ఎగ్జిబిషన్ను సందర్శిస్తారు.ఆస్ట్రియాలోనూ పర్యటనరష్యా పర్యటన తర్వాత 9వ తేదీన మోదీ ఆస్ట్రియాకు వెళ్తారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డీర్ బెల్లాన్, చాన్స్లర్ కార్ల్ నెహామెర్లతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ‘ఆస్ట్రియా, భారత్ మైత్రీబంధానికి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ మోదీతో చర్చల కోసం సిద్ధంగా ఉన్నా’ అని నెహామెర్ శనివారం ‘ఎక్స్’లో చేసిన పోస్ట్కు మోదీ ఆదివారం స్పందించారు. ‘‘ ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు, సహకారంలో కొత్త పథాలను అన్వేషించేందుకు మీతో చర్చల కోసం ఎదురుచూస్తున్నా’’ అని మోదీ ఆదివారం ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. భారత ప్రధాని ఒకరు ఆస్ట్రియాలో పర్యటిస్తుండటం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారికావడం విశేషం. భారత్, ఆస్ట్రియాకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో మోదీ భేటీ కొనసాగుతుంది. మాస్కోతోపాటు వియన్నాలోని భారతీయ సంతతి ప్రజలతో ప్రధాని ముచ్చటించనున్నారు. -
భారత్, ఖతార్ బంధం సుదృఢం
దోహా: భారత్, ఖతార్ దేశాల బంధం మరింత బలోపేతం అవుతోందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఖతర్ పర్యటనలో ఉన్న మోదీ గురువారం ఖతార్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్–థానీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయి శిక్షలు పడిన ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులకు ఖతార్ ప్రభుత్వం విడిచిపెట్టిన నేపథ్యంలో ఖతార్ పాలకునితో మోదీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘ ఎమీర్ను కలవడం అద్భుతం. ఇరుదేశాల మధ్య భిన్నరంగాల్లో విస్తృతస్తాయి సహకారానికి ఈ భేటీ బాటలు పరుస్తోంది. పర్యావరణానికి ప్రయోజనం చేకూర్చే నూతన రంగాల్లో కలిసి పనిచేసేందుకు భారత్, ఖతార్ సిద్ధంగా ఉన్నాయి’’ అని భేటీ తర్వాత మోదీ ‘ఎక్స్’లో ట్వీట్చేశారు. నేవీ అధికారులను విడిచిపెట్టినందుకు థాంక్యూ ‘ఇరు నేతల చర్చలు ఫలవంతమయ్యాయి. ఖతార్లోని భారతీయుల సంక్షేమ బాధ్యతలు తీసుకున్న ఖతార్ ఎమీర్కు మోదీ ధన్యవాదాలు చెప్పారు. కఠిన శిక్షలు పడిన 8 మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులను వదిలిపెట్టినందుకు ఖతార్ ఎమీర్కు మోదీ థాంక్యూ చెప్పి మెచ్చుకున్నారు. భారత్లో పర్యటించాల్సిందిగా ఆయనను మోదీ ఆహా్వనించారు’’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా వెల్లడించారు. -
పనికొచ్చే చర్చలేనా?!
ఎటుచూసినా ఘర్షణలు, బెదిరింపులే రివాజుగా మారిన ప్రపంచంలో... ఏడాదిగా మాటా మంతీ లేని రెండు పెద్ద దేశాలు ఒకచోట కూర్చుని చర్చించుకున్నాయంటే కాస్త వింతగానే అనిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల మధ్య బుధవారం కాలిఫోర్నియాలో ద్వైపాక్షిక చర్చలు జరగటం, అందులో పురోగతి సాధించామని ఇద్దరూ చెప్పటం ఉపశమనం కలిగించే పరిణామమే. ఉపశమనం మాట అటుంచి ఇద్దరూ కలవటమే ఇప్పుడు పెద్ద వార్త. అంతకు మించి ఎవరూ పెద్దగా ఆశించలేదు. ఇరు దేశాల విభేదాలతో పోలిస్తే సాధించింది అతి స్వల్పం. వర్తమాన ఉద్రిక్త పరిస్థితుల్లో ఎంతోకొంత సాధించామని చెప్పుకోవటం బైడెన్, జిన్పింగ్లిద్దరికీ అవసరం. రష్యా–ఉక్రెయిన్ల మధ్య దాదాపు రెండేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. కనుచూపు మేరలో అది చల్లారేలా లేదు. ఈలోగా గత నెలలో హమాస్ సాగించిన నరమేథంతో గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇప్పటికి దాదాపు 12,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఏకపక్ష దాడులకు స్వస్తి చెప్పాలన్న వినతులను ఇజ్రాయెల్ బేఖాతరు చేస్తోంది. పర్యవ సానంగా పశ్చిమాసియా ఉద్రిక్తంగా మారింది. ఈ రెండుచోట్లా కీలకపాత్ర పోషిస్తున్న రష్యా, ఇరాన్లను ఎలా ఎదుర్కొనాలో తెలియని అయోమయంలో అమెరికా వుంది. జో బైడెన్కు వచ్చే ఏడాది దేశాధ్యక్ష ఎన్నికలు రాబోతున్నాయి. ఆయన మరోసారి అదృష్టం పరీక్షించుకోవాలన్న ఆరాటంలో వున్నారు. అటు జిన్పింగ్కు సమస్యలు తక్కువేం లేవు. అమెరికాతో ఉద్రిక్తతలు పెరిగాక విదేశీ పెట్టుబడులు తరిగిపోయాయి. దశాబ్దాలపాటు ఎడతెగకుండా సాగిన ఆర్థిక పురోగతి మందగించింది. మితిమీరిన రుణభారంతో, రియలెస్టేట్ కుప్పకూలడంతో, ఎగుమతులు దిగజారటంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నేలచూపులు చూస్తోంది. ఇప్పటికే అమెరికా విధించిన ఆంక్షలు మరింత పెరగకుండా చూడటం, సాంకేతికత విక్రయంపై ఆ దేశం మరిన్ని ఆంక్షలు పెట్టకుండా చూసు కోవటం చైనాకు తక్షణావసరం. వివాదాలకు ఎక్కడో ఒకచోట ముగింపు లేకపోతే చైనా మరింత గడ్డుస్థితిలో పడుతుంది. నిజానికి దాన్ని దృష్టిలో వుంచుకునే ‘దుందుడుకు దౌత్యం’లో సిద్ధహస్తులైన చైనా విదేశాంగమంత్రి కిన్ గాంగ్, రక్షణమంత్రి జనరల్ లీ షాంగ్ఫూలను హఠాత్తుగా తప్పించింది. వారిద్దరి ఆచూకీ ఇప్పటికైతే తెలియదు. ఆ దేశాల అంతర్గత సమస్యలు, ఆ రెండింటిమధ్యా వున్న వివాదాల మాటెలావున్నా ఇప్పుడున్న అనిశ్చితిలో అమెరికా, చైనా రెండూ ముఖాముఖి చర్చించుకోవటం ప్రపంచానికి చాలా అవసరం. ఎందుకంటే ఆ రెండింటి మధ్యా తలెత్తే యుద్ధం అన్ని దేశాలకూ పెనుముప్పుగా పరిణమిస్తుంది. ఆర్థిక వ్యవస్థలన్నీ తలకిందులవుతాయి. నాలుగు గంటలపాటు జరిగిన చర్చల అనంతరం బైడెన్, జిన్పింగ్లిద్దరూ సైనిక ఉద్రిక్తతలు తలెత్తిన పక్షంలో నేరుగా సంభాషించుకునే సదుపాయాన్ని పునరుద్ధరించుకోవటానికి అంగీకరించినట్టు ప్రకటించారు. అప్పటి ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ నిరుడు తైవాన్ పర్యటించటాన్ని ఖండిస్తూ చైనా దీనికి స్వస్తిపలికింది. ఇది చెప్పుకోదగ్గ పురోగతే. అలాగే పర్యావరణ పరిరక్షణకు కలిసి పనిచేయాలనుకోవటం, పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో సమష్టిగా కృషి చేయాలనుకోవటం కూడా మంచిదే. అమెరికా, చైనా రెండూ ప్రపంచాన్ని కాలుష్యం బారిన పడేస్తున్న దేశాల జాబితాలో ఒకటి, రెండు స్థానాల్లో వున్నాయి. కాలుష్యంలో ఇద్దరి వాటా 38 శాతంగా వుంది. పారిశ్రామికీకరణకు ముందున్న ఉష్ణోగ్రతలకన్నా 1.5 డిగ్రీల సెల్సియస్ మించకుండా చూడాలన్నది పారిస్ ఒప్పందం సారాంశం. మప్పు ముంచు కొస్తున్నా రెండు దేశాలూ అవతలి పక్షం అమలు చేశాకే ముందుకు కదులుతామని మొండికేయటంతో ఎలాంటి పురోగతీ లేకుండా పోయింది. ఇప్పటికే ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.2 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి. భూగోళం నలుమూలలా కార్చిచ్చులు, కరువులు, వరదలు వంటి వైపరీత్యాలు తలెత్తు తున్నాయి. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి సారిస్తామనటం మంచిదే. అయితే కొత్తగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు స్థాపించి మరో 366 గిగావాట్ల విద్యుదుత్పాదన కు చైనా వేసుకున్న ప్రణాళికల మాటేమిటి? దాన్ని రద్దు చేయటానికి ఆ దేశం అంగీకరించిందా? ఆ ఊసే లేనప్పుడు ఇలాంటి కంటితుడుపు ప్రకటనలవల్ల ఒరిగేదేమిటి? కృత్రిమ మేధకు సంబంధించిన సాంకేతికతల విషయంలో పారదర్శకంగా వుండాలని, పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాల అధినేతలూ నిర్ణయించారు. కృత్రిమ మేధను సైనిక ప్రయోజనాల కోసం వినియోగించటం మొదలు పెడితే దాని పర్యవసానాలు తీవ్రంగా వుంటాయి. దేశాలమధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడే ప్రమాదం వుంటుంది. అయితే ఈ అంశాలన్నిటిపైనా ఒప్పందాలేమీ లేవు. కేవలం నోటి మాటలే. వాటికి మున్ముందు రెండు దేశాలూ ఏపాటి విలువిస్తాయో తెలియదు. సమావేశానంతరం విడివిడి ప్రకటనలతో సరి పెట్టుకోవటం, కొన్ని గంటలు గడిచాక జిన్పింగ్ను ఉద్దేశించి ‘ఆయనొక నియంత’ అంటూ బైడెన్ వ్యాఖ్యానించటం, దానికి చైనా విదేశాంగ ప్రతినిధి అభ్యంతరం తెలపటం వాస్తవస్థితికి అద్దం పడు తోంది. తైవాన్, ఫిలిప్పీన్స్లతో చైనా లడాయి సరేసరి. తైవాన్కు 10,600 కోట్ల డాలర్ల సైనిక సాయం అందించటానికి సంబంధించిన తీర్మానం అమెరికన్ కాంగ్రెస్లో పెండింగ్లో వుంది. అది సాకారమైతే చైనాతో సంబంధాలు మొదటికొస్తాయి. ఇన్ని అవాంతరాలున్నా అధినేతలిద్దరూ ముఖా ముఖీ మాట్లాడుకోవటం మంచిదే. ఇది ఉద్రిక్తతల ఉపశమనానికి తోడ్పడాలని ఆశించాలి. -
G20 Summit: అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామి
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా దేశ రాజధానికి విచ్చేసిన సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్అజీజ్ అల్–సౌద్తో సోమవారం ప్రధాని మోదీ విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు ఉదయం ఆయనకు రాష్ట్రపతిభవన్లో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సాదర స్వాగతం పలికారు. తర్వాత ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో సల్మాన్ బిన్, మోదీ ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ మాట్లాడారు. ‘ ఈ ప్రాంతంతోపాటు ప్రపంచ సుస్థిరతకు, సంక్షేమానికి భారత్–సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో కీలకం. భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగిస్తున్న దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఒకటి. రెండు దేశాలు కాలానుగుణంగా సత్సంబంధాలను సుదృఢం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి’ అని మోదీ అన్నారు. సోమవారం ఇండియా–సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి తొలి భేటీలో ద్వైపాక్షిక బంధంపై ఇద్దరు అగ్రనేతలూ సమీక్ష జరిపారు. రక్షణ, ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజారోగ్యం, ఆహార భద్రత, సంస్కృతి, సంక్షేమం తదితర అంశాలు మండలి తొలి భేటీలో చర్చకొచ్చాయని విదేశాంగ శాఖ కార్యదర్శి అరీందర్ బాగ్చీ ‘ఎక్స్’లో ట్వీట్చేశారు. ‘దేశాల దగ్గరి బంధాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు అనువైన కొన్ని మార్గాలను అన్వేషించాం. ఇకపై మా భాగస్వామ్యం నూతనోత్సాహంతో కొత్త మలుపు తీసుకోనుంది. గ్రిడ్ల అనుసంధానం, పునరుత్పాదక ఇంధన వనరులు, సెమీ కండక్టర్లు, సరకు రవాణా గొలసు తదితర కీలక అంశాలపైనా చర్చలు జరిపాం. చర్చలు ఫలప్రదంగా సాగాయి.’ అని మోదీ వ్యాఖ్యానించారు. సంక్షిష్ట అంశాల్లో భాగస్వామ్యం పెంపుకోసం.. ఇరు దేశాల మధ్య సంక్లిష్టంగా మారిన కొన్ని అంశాల్లో సందిగ్ధతను తొలగించుకునేందుకు ఇండియా–సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని నెలకొల్పాలని 2019 ఏడాదిలో నిర్ణయించారు. జీ20 సదస్సు తర్వాత భారత్లో సల్మాన్ బిన్ అధికారిక పర్యటన కొనసాగిస్తున్నారు. ‘ భారత్కు రావడం ఆనందంగా ఉంది. జీ20 సదస్సుకు విజయవంతంగా నిర్వహించినందుకు భారత్కు నా అభినందనలు. విశ్వ శ్రేయస్సు కోసం జీ20 సదస్సులో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మోదీతో చర్చలు ఫలవంతంగా సాగాయి. మా రెండు దేశాల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇకమీదటా కలిసి పనిచేస్తాం’ అని సల్మాన్ వ్యాఖ్యానించారు. మధ్య ప్రాచ్యంలో భారత్కు సౌదీ అరేబియా దేశం అత్యంత కీలకమైంది. గత కొన్నేళ్లలో ఈ రెండు దేశాల మధ్య మరింత మెరుగైన సత్సంబంధాలు ఏర్పడ్డాయి. రక్షణ, భద్రత సంబంధ అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం జీవితకాల గరిష్టానికి చేరుకున్న వేళ సల్మాన్ బిన్ భారత్లో పర్యటించడం గమనార్హం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్–సౌదీ వాణిజ్య వ్యాపారం విలువ ఏకంగా 52.75 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం. భారత్కు సౌదీ నాలుగో అతిపెద్ద వాణిజ్యభాగస్వామిగా కొనసాగుతోంది. 13 లక్షల సైన్యానికి సారథి అయిన నాటి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎం నరవాణె 2020 డిసెంబర్లో సౌదీలో పర్యటించారు. భారత సైన్యాధ్యక్షుడు ఒకరు సౌదీలో పర్యటించడం ఇదే తొలిసారి. -
బిజీబిజీగా ద్వైపాక్షిక భేటీలు
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విచ్చేసిన సభ్యదేశాల అధినేతలతో ప్రధాని మోదీ విడివిడిగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చల్లో బిజీగా కనిపించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ చాన్స్లర్ ఓలాఫ్ స్కోల్జ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్, తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రెటే, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా, యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోండెర్ లెయిన్, నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబు, ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజలీ అసౌమనీ తదితరుల నాయకులతో మోదీ వేర్వేరుగా చర్చలు జరిపారు. ♦ మధ్యాహ్నం భోజనం వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్తో జరిపిన విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు ఫలవంతమయ్యాయి. ఇండియా–ఫ్రాన్స్ బంధం నూతన సమున్నత శిఖరాలకు చేరేందుకు ఇరువురం కృషిచేస్తాం’ అని మోదీ ట్వీట్చేశారు. ♦ జీ20 సారథ్య బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకు నేతలంతా మోదీని అభినందించారు. ఇంటర్గవర్నమెంటల్ కమిషన్ మరో దఫా చర్చల కోసం వచ్చే ఏడాది భారత్కు విచ్చేయాల్సిందిగా జర్మనీ చాన్స్లర్ ఓలాఫ్ స్కోల్జ్ను మోదీ ఆహా్వనించారు. ఫిబ్రవరిలో భారత్లో పర్యటించిన ఓలాఫ్కు ఇది రెండో అధికారిక పర్యటన. రక్షణ, హరిత, సుస్థిరాభివృద్ధి, అరుదైన ఖనిజాలు, నైపుణ్యమైన సిబ్బంది, విద్య తదితర రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై స్కోల్జ్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ♦ శుద్ధ ఇంధనం, సెమీ కండక్టర్లు, డిజిటల్ సాంకేతికత తదితరాలపై నెదర్లాండ్స్ ప్రధానితో మోదీ చర్చించారు. ♦ వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, చిరుధాన్యాలు, ఆర్థిక సాంకేతికతలపై నైజీరియా అధ్యక్షుడు తినుబుతో మోదీ చర్చలు జరిపారు. ♦ జీ20లో శాశ్వత సభ్యత్వానికి కృషిచేసినందుకు ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజలీ మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ♦ వాణిజ్యం, సాంస్కృతిక, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం, ఈవీ బ్యాటరీ సాంకేతికతల పరిపుష్టికి మరింతగా కృషిచేయాలని నిర్ణయించామని ద.కొరియా నేత ఇయోల్తో భేటీ తర్వాత ప్రధాని మోదీ వెల్లడించారు. ♦ డిసెంబర్ ఒకటో తేదీ నుంచి బ్రెజిల్ సారథ్యంలో జీ20 మరిన్ని విజయాలు సాధించాలని ఆ దేశ అధ్యక్షుడు డ సిల్వాతో మోదీ వ్యాఖ్యానించారు. ♦ వాణిజ్యం, సాంకేతికత, అనుసంధానం వంటి కీలకాంశాల్లో యూరప్తో భారత్ బంధం మరింత పటిష్టానికి సంబంధించి యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులాతో, ఐరోపా మండలి అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్తో మోదీ విడిగా చర్చలు కొనసాగించారు. భారత్ అతిపెద్ద వాణిజ్యభాగస్వామి: ఎర్డోగన్ దక్షిణాసియాలో భారత్ తమకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ పేర్కొన్నారు. భారత్–తుర్కియే పరస్పర సహకారం అవిచ్చిన్నంగా కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం జీ20 సదస్సు ముగిశాక ఎర్డోగన్ మీడియాతో మాట్లాడారు. ఆదివారం భారత ప్రధాని మోదీతో సమావేశమయ్యాయని, ఇరు దేశాలకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై చర్చించామని తెలిపారు. జీ20లో ఆఫ్రియన్ యూనియన్ భాగస్వామిగా మారడాన్ని ఎర్డోగాన్ స్వాగతించారు. -
G-20 Summit: బంగ్లా, మారిషస్ ప్రధానులతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: జీ20 నేపథ్యంలో ఢిల్లీకి మొదటగా వచ్చిన నేతల్లో మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ ఒకరు. ప్రధాని మోదీ మొట్టమొదటి సమావేశం మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్తోనే జరిగింది. గ్లోబల్ సౌత్ వాణిని వినిపించేందుకు కట్టుబడి ఉన్నామని ఈ భేటీ సందర్భంగా ఇద్దరు నేతలు ప్రకటించారు. ‘రెండు దేశాల నడుమ సంబంధాలు ఏర్పాటై 75 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ ఏడాదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఫిన్టెక్, సాంస్కృతిక తదితర రంగాల్లో సహకారంపై చర్చించాం’అని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘భారత్ దార్శనిక కార్యక్రమం ‘సాగర్’లో మారిషస్ వ్యూహాత్మక కీలక భాగస్వామి. ద్వైపాక్షిక సంబంధాలను విస్తృతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు’అని పీఎంవో తెలిపింది. ప్రధాని మోదీ అనంతరం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనాతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాల్లో సహకారం విస్తృతం చేసుకునేందుకు, రెండు దేశాల మధ్య కనెక్టివిటీతోపాటు వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించినట్లు అనంతరం ప్రధాని మోదీ తెలిపారు. ‘గత తొమ్మిదేళ్లలో బంగ్లాదేశ్తో సంబంధాలు ఎంతో బలోపేతమయ్యాయి. తాజాగా ప్రధాని హసీనాతో చర్చలు ఫలప్రదమయ్యాయని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కనెక్టివిటీ, సాంస్కృతిక రంగాలతోపాటు ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇద్దరు నేతలు అంగీకారానికి వచ్చారని పీఎంవో తెలిపింది. -
G20 Summit 2023: శిఖరాగ్ర భేటీకి శ్రీకారం
న్యూఢిల్లీ: అద్భుతమైన ప్రపంచ ఆర్థికాభివృద్ధి సాధనే పరమావధిగా సాగే జీ20 అగ్రరాజ్యాల కూటమి సమావేశానికి హస్తిన సర్వాంగ సుందరంగా ముస్తాబై సభ్య దేశాల అధినేతలకు సాదర స్వాగతం పలుకుతోంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితర ప్రపంచ దేశాల ఆగమనంతో జీ20 శిఖరాగ్ర సదస్సు హడావిడి మరింత పెరిగింది. శనివారం సైతం మరికొందరు నేతలు విచ్చేస్తున్నారు. శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టగానే బైడెన్తో మోదీ విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రపంచ శ్రేయస్సుకు పాటుపడతామని ప్రకటించారు. మానవ కేంద్రిత, సమ్మిళిత అభివృద్ధి దిశగా సదస్సు కొత్త బాటలుపరుస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం ప్రకటించారు. మరోవైపు ఢిల్లీ డిక్లరేషన్ దాదాపు సిద్ధమైందని, ఏకాభిప్రాయం సాధిస్తామని భారత్ ధీమా వ్యక్తంచేసింది. 9, 10 తేదీల్లో (శని, ఆదివారాల్లో) జరిగే సదస్సుకు హాజరయ్యే నేతల రాక, సాదర స్వాగతం, అతిథులకు ఆతిథ్యంతో ఢిల్లీలో కోలాహలం పెరిగింది. పసందైన వంటకాలు, భిన్న సంప్రదాయ వాయిద్యాలతో సంగీత విభావరి ఇలా పలు రకాల కార్యక్రమాలు, ప్రదర్శనలతో అధినేతలకు మరెప్పుడూ మరిచిపోలేని రీతిలో అద్భుతంగా అతిథ్యం ఇవ్వనున్నారు. వాతావరణ మార్పులు, ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఆర్థిక అనిశి్చతి, మాంద్యం భయాలు వంటి కీలక అంశాలతో చర్చలు శిఖరాగ్రానికి చేరుకోనున్నాయి. ఎలాగైనా సరే సదస్సు ముగిసేనాటికి అందరి ఏకాభిప్రాయంతో సంయుక్త ప్రకటన విడుదల చేసేందుకు భారత్ శాయశక్తులా కృషిచేస్తోంది. నేడు మొదలయ్యే ఈ చర్చా సమరంలో నేతలు చివరకు ఎలాంటి వాగ్దానాలు చేస్తారో, ఏమేం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూద్దాం..!! దుర్భేద్యమైన భద్రత ముఖ్యనేతలంతా ఢిల్లీకి వచ్చేస్తున్న నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీలో భద్రతా బలగాలను మొహరించారు. చర్చలకు ప్రధాన వేదిక అయిన ‘భారత్ మండపం’ కాంప్లెక్స్ వద్ద భద్రతను పోలీసులు, పారామిలటరీ, నిఘా వర్గాలతో కట్టుదిట్టం చేశారు. తొలిసారిగా ఇండియా ఈ సదస్సును నిర్వహిస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చేసేందుకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సదస్సు వివరాలను జీ20లో భారత షెర్పా అమితాబ్ కాంత్ శుక్రవారం ఢిల్లీలో వివరించారు. ‘ మన న్యూఢిల్లీ డిక్లరేషన్ దాదాపు సిద్ధం. దానిని ఇప్పుడు బహిర్గతం చేయలేం. ఎందుకంటే డిక్లరేషన్ తాలూకు ప్రతిపాదలను అధినేతలకు సమరి్పస్తాం. వారి సూచనలు, సవరణల తర్వాతే దానికి ఆమోదం లభిస్తుంది. ఆ తర్వాతే డిక్లరేషన్ ద్వారా సాధించబోయే విజయాలను వివరిస్తాం’ అని అమితాబ్ చెప్పారు. ‘ ఐక్యరాజ్యసమితి తర్వాత అత్యంత క్రియాశీలకమైన కూటమిగా ఉన్న ఆఫ్రికన్ యూనియన్ను జీ20లో చేర్చుకునేందుకు దాదాపు అందరినీ ఒప్పించడం భారతదేశ నిబద్ధతకు నిదర్శనం’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా చెప్పారు. ఆఫ్రికన్ యూనియన్ ఆగమనం మాకు సంతోషదాయకమే అని యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్ అన్నారు. ఆఫ్రికన్ యూనియన్లో మొత్తంగా 55 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. నేటి ప్రపంచానికి సరిపోయే నినాదమిది మహా ఉపనిషత్తు నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు ఇతివృత్తం’ నేటి ప్రపంచానికి సరిపోయే నినాదమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. కాగా, చర్చల్లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధానంగా ప్రస్తావించి చర్చించాలని బ్రిటన్ భావిస్తోంది. దీంతో ఈ చర్చలో భారత్ పాత్ర కీలకంగా మారనుంది. ‘ ఉక్రెయిన్లో రష్యా దురాక్రమణ, మానవ హక్కుల హననంపై ఇండియా తన నిర్ణయం వెలువరచాలని చర్చలో పట్టుబడతాం. మోదీతో, ఇతరులతో భేటీలను పుతిన్ దారుణ అకృత్యాలను ఆపేందుకు సాధనాలుగా వినియోగిస్తాం’ అని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికార ప్రతినిధి చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కూటమి సభ్య దేశాల మధ్య భేదాభిప్రాయాలున్నా ఏకాభిప్రాయానికి ప్రయతి్నస్తామని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ చెప్పారు. కాగా, భారత్ తమకు వ్యతిరేకంగా జీ20 వేదికగా ప్రకటన చేయాలని జీ7 దేశాలు ఒత్తిడి చేస్తున్నాయని రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ఆరోపించింది. డిజిటల్ మౌలిక వసతులు, వాతావరణ సంబంధ నిధులు, సుస్థిరాభివృద్ధి, శుద్ధ ఇంథనం వంటి అంశాల్లో జీ20 వేదికగా సానుకూల నిర్ణయాలు వెలువడతాయని అంతర్జాతీయ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ ఒకటో తేదీన కూటమి సారథ్య బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్న భారత్ అప్పట్నుంచీ దేశవ్యాప్తంగా భిన్న నగరాలు, వేదికలపై 200 సమావేశాలను నిర్వహించింది. ప్రపంచ జీడీపీలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల జనసంఖ్య జీ20 దేశాల్లోనే ఉంది. అందుకే ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలు పెను ప్రభావం చూపిస్తాయి. సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం జీ20 శిఖరాగ్రంలో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తదితరులు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. సంప్రదాయ నృత్యాల నడుమ వీరికి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జియెవా విమానాశ్రయంలో డ్యాన్స్ చేశారు. భారతీయ సంస్కృతిపై క్రిస్టలినా చూపిన మక్కువను ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రశంసించారు. వచ్చే రెండు రోజుల్లో వివిధ దేశాల నేతలతో ఫలప్రదమైన చర్చలు జరిపేందుకు ఆసక్తితో ఉన్నట్లు ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం భారత్కు వచ్చారు. ఆయన సతీమణి జిల్ బైడెన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బైడెన్కు చేసిన రెండు పరీక్షల్లోనూ నెగెటివ్గా రావడం పర్యటనను ఖరారు చేసుకున్నారు. ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలకు విమానాశ్రయంలో కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజే, దర్శనా జర్దోష్ స్వాగతం పలికారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే, అర్జెంటినా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్కు కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే స్వాగతం పలికారు. కొమరోస్ అధ్యక్షుడు, ఆఫ్రికన్ యూనియన్ చైర్ పర్సన్ కూడా అయిన అజలి అస్సౌమనీ, రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్, ఒమన్ డిప్యూటీ ప్రధాని సయ్యిద్ ఫహద్, ఈజిప్టు అధ్యక్షుడు ఫతా ఎల్–సిసి, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్, యూఏఈ ప్రెసిడెంట్ అల్ నహ్యాన్లకు కూడా ఘన స్వాగతం లభించింది. ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రస్కు అధికారులు స్వాగతం పలికారు. జీ20(గ్రూఫ్ ఆఫ్ 20)లో అర్జెంటినా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియే, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ)సభ్యులన్న విషయం తెలిసిందే. బ్రిటిష్ కౌన్సిల్ విద్యార్థులతో సునాక్ ముఖాముఖి శుక్రవారం యూకే ప్రధాని రిషి సునాక్ ఢిల్లీలోని బ్రిటిష్ కౌన్సిల్కు వెళ్లి సిబ్బంది, విద్యార్థులతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు. -
G20 summit: నేడే మోదీ– బైడెన్ చర్చలు
న్యూఢిల్లీ: జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల మధ్య ప్రపంచ, వ్యూహాత్మక స్థాయి భాగస్వామ్యాన్ని మరింతగా దృఢతరం చేసుకోవడమే చర్చల ప్రధాన అజెండా కానుంది. స్వచ్ఛ ఇంధనం, వర్తకం, హై టెక్నాలజీ, రక్షణ వంటి రంగాల్లో ప్రస్తుత పరస్పర సహకారాన్ని సమీక్షించి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సమస్యలను అధిగమించే మార్గాలపై నేతలు దృష్టి సారిస్తారు. బైడెన్ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ చేరుకుంటారు. ఆదివారం జీ 20 సదస్సు ముగియగానే వియత్నాం బయల్దేరతారు. మోదీ, ఇతర నేతలతో ఈ వారాంతంలో ఫలప్రదమైన చర్చల కోసం బైడెన్ ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారని వైట్ అండ్ హౌజ్ ప్రెస్స్ కార్యదర్శి కరిన్ జీన్ పియరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చివరిసారిగా 2020లో భారత్ను సందర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. -
బంధాన్ని భంగపరిస్తే సహించం
సిడ్నీ: ఖలిస్తాన్ వేర్పాటువాద మూకలు ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడులకు తెగబడటాన్ని భారత ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియా, భారత్ బంధానికి భంగం కల్గించేలా జరుగుతున్న ఇలాంటి కుట్రలను సహించేది లేదని కరాఖండిగా చెప్పేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మోదీ ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో విస్తృతస్తాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ తర్వాత అల్బనీస్ సమక్షంలోనే మీడియాతో మాట్లాడారు. ‘ భారత్, ఆస్ట్రేలియాల స్నేహపూర్వక సంబంధాలకు హాని తలపెట్టే ఎలాంటి శక్తులనైనా ఉపేక్షించేది లేదు. ఈ అంశంలో కఠినంగా వ్యవహరిస్తున్న అల్బనీస్కు నా కృతజ్ఞతలు. హిందూ ఆలయాలపై ఖలిస్తాన్ వేర్పాటువాదుల ఆగడాలను అణచేసేందుకు, ఖలిస్తాన్ మూకల కార్యకలాపాలపై ఇకమీదటా కఠిన చర్యలను కొనసాగిస్తానని అల్బనీస్ మరో సారి నాకు మాటిచ్చారు’ అని మోదీ ప్రకటించారు. టీ20 వేగంతో బంధం బలోపేతం భారత్, ఆస్ట్రేలియా సత్సంబంధాల బలోపేతాన్ని క్రికెట్ పరిభాషలో మోదీ సరదాగా చమత్కరించారు. ‘‘రెండు దేశాల మైత్రీ బంధం వేగంగా బలపడుతోంది. క్రికెట్కు వేగాన్ని తెచ్చిన టీ–20 మోడ్లోకి వచ్చేసింది. రెండేళ్లలో ఇక్కడికి రెండుసార్లు వచ్చా. ఏడాదిలో ఇది మా ఆరో భేటీ. ఇరుదేశాల బంధంలో పరిణతికి, సత్సంబంధాలకు ఇది నిదర్శనం. ఈసారి భారత్లో జరగబోయే క్రికెట్ ప్రపంచ కప్ పోటీలను వీక్షించేందుకు అల్బనీస్ను, ఆస్ట్రేలియాలోని క్రికెట్ వీరాభిమానులకు ఇదే నా ఆహ్వానం. ఇదే సమయంలో దీపావళి పర్వదిన వేడుకలు చూడొచ్చు. అల్బనీస్తో నిర్మాణాత్మక చర్చలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమున్నత శిఖరాలకు చేరుస్తాయి’’ అన్నారు. ఆస్ట్రేలియాలోని పలు వ్యాపారసంస్థల సీఈవోలతో కూడా మోదీ మాట్లాడారు. పలు రంగాల్లో భారత్లో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. భారత్లోని డిజిటల్ ఆర్థిక, నవకల్పనల వ్యవస్థను ఆస్ట్రేలియాలోని వ్యాపారాలతో అనుసంధానించాలని ఆల్బనీస్ ఆకాంక్షించారు. -
Bilateral Talks: జపాన్తో బంధం బలోపేతం
న్యూఢిల్లీ: భారత్–జపాన్ అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఇరు దేశాల ప్రధానులు ప్రతినబూనారు. ఈ మేరకు రెండు దేశాల అగ్రనేతలు ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని ప్యుమియో కిషిదాలు సోమవారం ఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 27 గంటల భారత పర్యటనలో భాగంగా కిషిదా ఢిల్లీకొచ్చిన విషయం తెల్సిందే. రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలతోపాటు ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిర, స్వేచ్ఛాయుత వాతావరణం పరిడవిల్లేలా చూసేందుకే ద్వైపాక్షిక చర్చలు సాగించినట్లు ఇరు దేశాధినేతలు ప్రకటించారు. ఇండో– పసిఫిక్ ప్రాంతాన్ని తన ఆధిపత్య నీడలోకి తెచ్చేందుకు సాహసిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు, ఉక్రెయిన్ యుద్ధంతో ఉద్రిక్తతలు నెలకొన్న అంతర్జాతీయ సమాజంలో శాంతి స్థాపనకు తమ వంతు కృషిచేసేందుకు జపాన్, భారత్లు ముందుకొచ్చినట్లు నేతలు తెలిపారు. ‘ జీ20 సదస్సుకు భారత్, జీ7 కూటమికి జపాన్ అధ్యక్షత వహిస్తున్న ఈ తరుణం ప్రపంచ శ్రేయస్సు కోసం చేసే కృషికి చక్కని అవకాశం. జీ20 అధ్యక్షతన భారత ప్రాధాన్యాలను కిషిదాకు వివరించా. భారత్–జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం అనేది ప్రజాస్వామ్య సూత్రాలు, ప్రపంచ చట్టాలను గౌరవిస్తూ ఏర్పడిందే. ఇండో–పసిఫిక్ ప్రాంతానికి ఇదెంతో ముఖ్యం. రక్షణ, డిజిటల్ సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, సెమీ కండక్టర్ల సరఫరా గొలుసు, సంక్షిష్ట సాంకేతికత తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలపేతంపై మేం సమీక్ష చేశాం’ అని తర్వాత పత్రికా ప్రకటనలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘ భారత్తో ఆర్థిక తోడ్పాటు గణనీయంగా పెరుగుతోంది. ఇది భవిష్యత్ వృద్ధికేకాదు జపాన్ ఆర్థిక అవకాశాలకు ఎంతగానో ఊతమిస్తుంది. స్వేచ్ఛాయుత ఇండో –పసిఫిక్ విధానాన్ని నేడు భారత గడ్డపై మోదీ సమక్షంలో ఆవిష్కరించా. మేలో జరిగే జీ7 సదస్సుకు మోదీని సాదరంగా ఆహ్వానించా’ అని ప్యుమియో కిషిదా చెప్పారు. పలు ఒప్పందాలపై సంతకాలు ఇరు దేశాలపై ఉక్రెయిన్ యుద్ధ విపరిణామాల ప్రభావం, ఇండో–పసిఫిక్ పరిస్థితి, సైనిక హార్డ్వేర్ను ఉమ్మడి అభివృద్ధి చేయడం వంటి కీలకాంశాలూ చర్చకొచ్చాయి. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కోసం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నుంచి నాలుగో విడత 300 బిలియన్ యెన్ల(రూ.18,800 కోట్ల) రుణానికి సంబంధించిన ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. -
25, 26 తేదీల్లో భారత్లో జర్మనీ అధ్యక్షుని పర్యటన
న్యూఢిల్లీ: జర్మనీ అధ్యక్షుడు ఒలాఫ్ షోల్జ్ ఈ నెల 25, 26వ తేదీల్లో భారత్లో పర్యటించనున్నారు. ఏడాది క్రితం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షోల్జ్ భారత్ రానుండటం ఇదే మొదటిసారి. సీనియర్ అధికారులు, ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి వర్గంతో 25న ఆయన ఢిల్లీకి చేరుకుంటారని విదేశాంగ శాఖ తెలిపింది. షోల్జ్, ప్రధాని మోదీ పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. 26న బెంగళూరులో జరిగే కార్యక్రమాల్లో జర్మనీ అధ్యక్షుడు షోల్జ్ పాల్గొంటారు. అదేవిధంగా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కూడా మార్చి 8వ తేదీన భారత్లో పర్యటనకు రానున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, కీలక ఖనిజాలు తదితర అంశాలపై ఆయన ప్రధాని మోదీతో విస్తృత చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు కలిసి అహ్మదాబాద్లో జరిగే భారత్–ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ను తిలకించనున్నారు. ఈ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
Xi meets Putin: ఇక మరింత సహకారం
కీవ్: రష్యా, చైనా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇరు దేశాల అధినేతలు పుతిన్, షీ జిన్పింగ్ నిర్ణయానికొచ్చారు. వారు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం మినహా పలు అంశాలపై చర్చించుకున్నారు. భేటీని టీవీల్లో ప్రసారం చేశారు. సంక్లిష్టమైన అంతర్జాతీయ పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా రష్యా, చైనా బంధం బలోపేతం అవుతుండడం పట్ల వారు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇరు దేశాల సైన్యాలు పరస్పరం సహకరించుకోవాలని పుతిన్ ఆకాంక్షించారు! రెండు దేశాల సంబంధాల్లో సైనిక సహకారానికి ‘ప్రత్యేక ప్రాధాన్యం’ ఉందని ఉద్ఘాటించారు. రష్యా, చైనా సైనిక దళాల నడుమ సహకారం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. రష్యాలో పర్యటించాలని జిన్పింగ్ను ఆహ్వానించారు. -
Bali G20 Summit: జీ 20 సదస్సుకు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ/బాలి: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జీ 20 కూటమి దేశాల సదస్సుకు హాజరవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇండొనేసియా బయల్దేరి వెళుతున్నారు. ఇండొనేసియాలోని బాలిలో 15, 16 తేదీల్లో జరిగే 17వ జీ 20 శిఖరాగ్రంలో మూడు ముఖ్యమైన సెషన్స్లో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్ స్కొల్జ్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లు కూడా హాజరవనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ రావడం లేదు. అధ్యక్ష బాధ్యతలు భారత్కు 20 దేశాల కూటమి అయిన జీ 20 18వ సదస్సుకు 2023లో భారత్ అధ్యక్షత వహించనుంది. బాలి సదస్సులో ఇండొనేసియా నుంచి సారథ్య బాధ్యతలను భారత్ అందుకోనుంది. సునాక్తో ప్రత్యేకంగా భేటీ! జీ 20 సదస్సుకు హాజరయ్యే దేశాధినేతలతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపే అవకాశాలున్నాయి. దీంతో అందరి దృష్టి భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో మోదీ భేటీపై ఆసక్తి నెలకొంది. అయితే వీరిద్దరి మధ్య భేటీ ఉంటుందో లేదో ఇరుపక్షాలు కూడా స్పష్టం చేయలేదు. -
జీ20 సదస్సుకు మోదీ
న్యూఢిల్లీ: జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇండోనేసియాలోని బాలీకి వెళ్లనున్నారు. నవంబర్ 14–16 తేదీల్లో సదస్సుకు హాజరవుతారు. అదే తేదీల్లో సదస్సుకు విచ్చేస్తున్న పలు దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బగ్చీ గురువారం ఢిల్లీలో మీడియాతో చెప్పారు. ‘‘ సమిష్టిగా కోలుకుందాం. మరింతగా బలీయమవుదాం.. అనే ఇతివృత్తంతో కొనసాగే ఈసారి జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ చాన్స్లర్ ఒలాఫ్ స్కోల్జ్, ప్రధాని మోదీ సహా భాగస్వామ్యదేశాల అగ్రనేతలు పాల్గొంటారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లతోపాటు ఆహారం, ఇంధన భద్రత, ఆరోగ్యంæ అంశాలపైనా చర్చిస్తారు. ఈ ఏడాది జీ20 సదస్సుకు నాయకత్వం వహిస్తున్న ఇండోనేసియా అధ్యక్షుడు జోకో సదస్సు చివరి రోజున తదుపరి నాయకత్వ పగ్గాలను మోదీకి లాంఛనంగా ఇవ్వనున్నారు’ అని బగ్చీ చెప్పారు. -
7న రష్యాకు జై శంకర్
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ ఈ నెల 7, 8వ తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో మాస్కోలో భేటీ అవుతారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం చెప్పారు. ఫిబ్రవరిలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక వీరిద్దరు నాలుగుసార్లు సమావేశమయ్యారు. అమెరికా, పశ్చిమదేశాలు రష్యాపై అన్ని రకాలుగా తీవ్ర ఆంక్షలు విధించాయి. ఆయా దేశాల అభ్యంతరాలను సైతం లెక్క చేయకుండా భారత్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను ఇటీవలి కాలంలో పెంచింది. -
రక్షణ రంగంలో సహకారం బలోపేతం
టోక్యో: రక్షణ రంగంలో సహకారాన్ని మరింత పెంచుకోవాలని భారత్, జపాన్లు నిర్ణయించుకున్నాయి. జపాన్ పర్యటనలో భాగంగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ ఆ దేశ రక్షణ మంత్రి యసుకజు హమదాతో చర్చలు జరిపారు. ఇరు దేశాల సైన్యాల సమన్వయం మరింతగా పెరిగేందుకు వీలుగా తొలిసారిగా రెండు దేశాల అధునాతన యుద్ధవిమానాలతో కూడిన సంయుక్త సైనిక విన్యాసాలకూ ఆమోదం తెలుపుతూ మంత్రులిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తమ స్వేచ్ఛాయుత, వ్యూహాత్మక ఒప్పందాలు చైనా దూకుడుకు అడ్డుకట్ట వేస్తాయని భారత్, జపాన్ భావిస్తున్న తరుణంలో ఇరు దేశాల రక్షణ మంత్రుల భేటీ జరగడం గమనార్హం. ‘రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు మొదలై 70 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి’ అని రాజ్నాథ్ ట్వీట్చేశారు. భారత రక్షణ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పరిశ్రమలను రాజ్నాథ్ కోరారు. మరోవైపు, భారత్–జపాన్ 2+2 మంత్రుల భేటీలో భాగంగా జపాన్ విదేశాంగ మంత్రి యొషిమస హయషితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చించారు.‘ ప్రపంచ దేశాలు అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఇతర దేశాలతో విభేదాలను పరిష్కరించుకోవాలని, బెదిరింపులకు, సైనిక చర్యలకు పాల్పడకూడదు. దేశాల మధ్య తగాదాలు, వాతావరణ మార్పులతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమౌతోంది. దీంతో ఇంథన, ఆహార భద్రత సంక్షోభంలో పడుతోంది’ అని జైశంకర్ అన్నారు. -
విచ్ఛిన్న శక్తులపై ఉమ్మడి పోరు
న్యూఢిల్లీ: పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే ఉగ్రవాద, ఛాందసవాద శక్తులను కలిసికట్టుగా ఎదుర్కోవాలని భారత్, బంగ్లాదేశ్ నిర్ణయించాయి. భారత్ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మంగళవారం ద్వైపాక్షిక చర్చల అనంతరం హైదరాబాద్ హౌస్లో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘ఉగ్రవాదం, ఛాందస వాదంపై పోరులో సహకరించుకోవాలని మేం నిర్ణయించాం. 1971 నాటి స్ఫూర్తిని సజీవంగా నిలుపుకునేందుకు రెండు దేశాల మధ్య కొనసాగుతున్న పరస్పర విశ్వాసానికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే శక్తులపై ఉమ్మడిగా పోరాడాలని అంగీకారానికి వచ్చాం’ అని అన్నారు. రెండు దేశాలను కలుపుతూ ప్రవహించే 54 నదులపై ఆధారపడి కోట్లాదిమంది రెండు దేశాల ప్రజలు శతాబ్దాలుగా జీవిస్తున్నారని మోదీ వివరించారు. ‘మైత్రి, సహకారభావం స్ఫూర్తితో రెండు దేశాలు ఎన్నో అంశాలను పరిష్కరించుకున్నాయి. తీస్తా నదీ జలాల పంపిణీ సహా అన్ని ప్రధాన సమస్యలపై త్వరలోనే అంగీకారం కుదురుతుందని ఆశిస్తున్నాను’ అని ప్రధాని మోదీ అన్నారు. బంగ్లాదేశ్తో సమగ్ర వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం(సెపా)పై త్వరలోనే చర్చలు మొదలవుతాయని వెల్లడించారు. బంగ్లాదేశ్పై చైనా పలుకుబడి పెరిగిపోవడంపైనా ఇద్దరు నేతలు పూర్తిస్థాయిలో చర్చించారని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాట్రా చెప్పారు. ఏడు ఒప్పందాలపై సంతకాలు మోదీ, హసీనాల చర్చల అనంతరం రెండు దేశాల అధికారులు రైల్వేలు, అంతరిక్ష పరిజ్ఞానం, నదీ జలాల పంపిణీ, అనుసంధానతకు సంబంధించిన 7 ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీటిలో కుషియారా నదీ జలాల ఒప్పందం కూడా ఉంది. దీనిద్వారా బంగ్లాదేశ్లోని సిల్హెట్, భారత్లో దక్షిణ అస్సాం లాభపడతాయి. 1996లో గంగా జలాల ఒప్పందం తర్వాత రెండు దేశాల మధ్య కుదిరిన నదీ జలాల ఒప్పందం ఇదే. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభ్యంతరాలతో 2011 నుంచి తీస్తా నదీ జలాల పంపిణీ వివాదం కొనసాగుతుండటంపై హసీనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుదిరిన ఎంవోయూలు.. బంగ్లాదేశ్ రైల్వే ఉద్యోగులకు వివిధ అంశాల్లో శిక్షణ, ఐటీ సొల్యూషన్స్ భారత్ సమకూర్చుతుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వ రోడ్లు, హైవేల శాఖకు భారత్ నిర్మాణ సామగ్రి, యంత్రాలను అందజేయనుంది. ఖుల్నా–దర్శన రైలు మార్గం ప్రాజెక్టులో ట్రాక్ డబ్లింగ్ పనుల్లోనూ, పర్బతీపూర్– కౌనియా రైలు మార్గాన్ని డబుల్ లైన్గా మార్చేందుకు భారత్ సాయం చేయనుంది. ఖుల్నాలోని రాంపాల్ వద్ద 1,320 మెగావాట్ల సూపర్ క్రిటికల్ బొగ్గు ఆధారిత ప్లాంట్ మైత్రి యూనిట్–1ను, ఖుల్నా–మోంగ్లా పోర్టు ప్రాజెక్టులోని 5.13 కిలోమీటర్ల రుప్షా రైలు వంతెనను ప్రారంభించారు. షేక్ హసీనాకు ఘన స్వాగతం బంగ్లా ప్రధాని షేక్ హసీనా నాలుగు రోజుల పర్యటనకు గాను సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి భవన్ వద్ద ప్రధాని మోదీ ఆమెకు స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య సంబంధాలకు సహకారం, పరస్పర విశ్వాసమే ప్రాతిపదిక అని ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ‘ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం, ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యం. మైత్రితో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చునని మా విశ్వాసం’అని హసీనా అన్నారు. అనంతరం హసీనా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్తో భేటీ అయ్యారు. రాజ్ఘాట్కు వెళ్లి మహాత్మునికి పుష్పాంజలి ఘటించారు. -
హైదరాబాద్ హౌస్లో భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు
న్యూఢిల్లీ: భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా.. శనివారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గతేడాది బాధ్యతలు చేపట్టిన జపాన్ ప్రధాని భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. జపాన్ అధికారుల ప్రధాని మోదీతో ఆయన భేటీ అనంతరం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ట్విట్టర్లో.. ఇరు ప్రధానులు న్యూఢిల్లీలో ఉత్పాదక చర్చలు జరిపారు. ఇరువురు నేతలు ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించే మార్గాలపై చర్చించారు. భారత్, జపాన్ మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు ఆకాంక్షించారు. అని పేర్కొంది. భారత్ పర్యటనకు రాకముందు జపాన్ ప్రధాని కిషిడా ఇలా అన్నారు... "నేను భారత్ పర్యటన తరువాత కంబోడియా పర్యటనకు వెళ్తున్నాను. ఉక్రెయిన్పై రష్యా దాడి సమయంలో ఈ పర్యటనల ద్వారా నేను అంతర్జాతీయ ఐక్యత, ప్రాముఖ్యతను నొక్కి చెప్పాలనుకుంటున్నాను. జపాన్ భారత్ వివిధ సమస్యలపై కలిసి పనిచేస్తాయని విశ్వసించండి. టోక్యోలో జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ నాయకుల మధ్య జరిగే క్వాడ్ సమ్మిట్ విజయవంతానికి కృషి చేయాలనే మా ఉద్దేశ్యాన్ని భారత ప్రధాని మోదీతో కలిసి ధృవీకరించాలనుకుంటున్నాను. అని చెప్పారు. ఉక్రెయిన్ పై దాడి చేస్తున్న రష్యా పై జపాన్ ఆంక్షలు విధించడమే కాక ఉక్రెనియన్ శరణార్థులను స్వీకరించింది. ఈ శిఖరాగ్ర సమావేశం చివరిసారిగా 2018 అక్టోబర్లో మోదీ, అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే మధ్య జరిగింది. కానీ ఆ తర్వాత ఏడాది 2019లో గౌహతిలో పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల కారణంగా సమ్మిట్ నిర్వహించలేకపోయింది. గత రెండేళ్లు కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020 నుంచి 2021 వరకు శిఖరాగ్రసమావేశన్ని నిర్వహించలేదు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ ఏడాది నిర్వహించిన శిఖరాగ్ర సమావేశం భారత్, జపాన్ల మధ్య దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. భారత్ జపాన్ రెండూ తమ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ జపాన్లు తమ 'ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్య పరిధిలో బహుముఖ సహకారాన్ని కలిగి ఉన్నాయని పేర్కొంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి సుస్థిరత శ్రేయస్సు కోసం తమ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే కాక విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించడానికి బలోపేతం చేయడానికి పరస్పర సహకరంతో ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఈ సదస్సు అవకాశం కల్పిస్తుందని వెల్లడించింది. (చదవండి: వాళ్లు అన్నదాంట్లో తప్పేముంది!: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు) -
ఈయూతో బంధం పదిలం
రోమ్: యూరోపియన్ యూనియన్(ఈయూ), భారత్ మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. జి–20 సదస్సులో పాల్గొనడానికి యూరప్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఇటలీలోని రోమ్లో ఈయూ అత్యున్నత అధికారులతో సమావేశమై చర్చలు జరిపారు. కోవిడ్–19 మహమ్మారి విసురుతున్న సవాళ్లు, ఈయూ–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం, అఫ్గానిస్తాన్, ఇండో–ఫసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిపారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్యం, వాణిజ్యం, సంస్కృతి, పర్యాటకం తదితర రంగాల్లో భారత్, ఈయూ మధ్య బంధాన్ని మరింత సుదృఢం చేసుకోవాలని నిర్ణయించారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిషెల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెర్ లెయన్తో లోతైన చర్చలు జరిగాయని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్వీట్ చేసింది. ఆర్థిక రంగంలో సహకారంతో పాటు, ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలను పెంచి, మెరుగైన సమాజాన్ని స్థాపించడానికి కృషి చేయాలని ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చినట్టుగా పేర్కొంది. మరోవైపు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ పచ్చదనం నెలకొల్పడంలో భారత్ కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. ఇండో–ఫసిఫిక్ ప్రాంతంలో పట్టు కోసం చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్ అభిప్రాయాలను గౌరవిస్తామని ఈయూ హామీ ఇచ్చింది. ప్రధాని మోదీ శనివారం నుంచి జి–20 భేటీకి రానున్నారు. మోదీకి ఈయూ అభినందనలు భారత్లో తక్కువ వ్యవధిలోనే 100 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినందుకు గాను ప్రధాని మోదీని ఈయూ అధికారులు అభినందించారు. ఆయనను కలుసుకోవడం ఆనందంగా ఉందని, ఇరుపక్షాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం సరైన పట్టాలు ఎక్కిందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు లెయెన్ పేర్కొన్నారు. జాతిపితకు ప్రధాని నివాళులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోమ్లో శుక్రవారం భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ‘‘ఎవరి ఆదర్శాలైతే ప్రజల్లో ధైర్య సాహసాలను నింపుతాయో, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తాయో అలాంటి మహాత్ముడికి రోమ్లో నివాళులర్పించే అరుదైన అవకాశం నాకు లభించింది’’ అని మోదీ అనంతరం ట్విట్టర్లో పేర్కొన్నారు. అనంతరం ప్రధాని రోమ్లో ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీతో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. అంతకుముందు మోదీకి డ్రాఘీ ఘన స్వాగతం పలికారు. సైనికులు గౌరవ వందనం సమర్పించారు. -
అల అగ్రరాజ్యంలో...
-
అమెరికాతో రక్షణ సహకారం బలోపేతం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్లో పర్యటిస్తున్న అమెరికా రక్షణ మంత్రి డాక్టర్ మార్క్ ఎస్పర్తో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం సమావేశమయ్యారు. పలు రంగాల్లో రక్షణ సహకారం మరింత పెరిగేలా తమ చర్చలు ఫలవంతంగా సాగాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇరు దేశాల రక్షణ సంబంధాలు, పరస్పర సహకారం మరింత బలోపేతమయ్యాలా సంప్రదింపులు జరిపామని స్పష్టం చేశారు. కాగా, ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి డాక్టర్ మార్క్ ఎస్పర్లు సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. వీరు ఇరువురూ మంగళవారం విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో సమావేశం కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తోనూ సమావేశమవుతారు. చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో అమెరికా మంత్రుల భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి : చైనా సరిహద్దులో ఆయుధ పూజ -
ఇమ్రాన్..జాగ్రత్తగా మాట్లాడండి!
వాషింగ్టన్: భారత్పై చేసే వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పాక్ ప్రధాని ఇమ్రాన్కు సూచించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రాంతంలో పరిస్థితి జఠిలంగానే ఉందని, ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు కలిసి పనిచేయాలని భారత్, పాక్లను ఆయన కోరారు. కశ్మీర్ విషయంలో తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్తో కలిసి పనిచేయాలని, సంయమనంతో వ్యవహరించాలని, అదే సమయంలో భారత్పై చేసే వ్యాఖ్యల విషయంలో నిగ్రహంతో వ్యవహరించాలని అధ్యక్షుడు ట్రంప్ ఇమ్రాన్ను కోరారని అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో పేర్కొంది. జమ్మూకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై పాక్ తీవ్ర అభ్యంతరం తెలపడం, రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాల ప్రధానులతో సోమవారం ఫోన్లో సంభాషించారు. అనంతరం ఆయన ట్విట్టర్లో ‘వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపుతో రెండు దేశాల ప్రధానులతో చర్చించా. ముఖ్యంగా కశ్మీర్ విషయంలో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, ఇమ్రాన్ఖాన్లకు సూచించా. అక్కడ పరిస్థితి జఠిలంగానే ఉన్నప్పటికీ, మా మధ్య సంభాషణలు ఫలప్రదంగా సాగాయి’అని ట్రంప్ ట్విట్టర్లో తెలిపారు. భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, ఆ ప్రాంతంలో శాంతి నెలకొనాల్సిన అవసరాన్ని అధ్యక్షుడు ట్రంప్ వారికి వివరించారు. ప్రాంతీయ పరిణామాలతోపాటు అమెరికా– భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యంపైనా భారత ప్రధాని మోదీతో చర్చించారని, త్వరలోనే మరోసారి సమావేశం కావాలని ఆకాంక్షించారని తెలిపింది. ఉగ్రవాదం, హింసకు తావులేని వాతావరణం నెలకొల్పాల్సిన అవసరాన్ని, సీమాంతర ఉగ్రవాదాన్ని పోషించడం పాక్ ఆపాలని ట్రంప్ను మోదీ కోరారని వెల్లడించింది. భారత ప్రభుత్వం జాత్యహంకార, ఫాసిస్టు ధోరణితో వ్యవహరిస్తోందని, దీని కారణంగా పాకిస్తాన్తోపాటు భారత్లోని మైనారిటీల సంక్షేమం ప్రమాదంలో పడిందని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ వద్ద ఉన్న అణ్వాయుధాల భద్రతపై అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలన్నారు. సోమవారం ట్రంప్తో దాదాపు అరగంటపాటు జరిగిన ఫోన్ సంభాషణల్లో ప్రధాని మోదీ ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. అనంతరం ట్రంప్ పాక్ ప్రధానితో మాట్లాడారు. అయితే, కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని అధ్యక్షుడు ట్రంప్ను ప్రధాని ఇమ్రాన్ కోరారని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషి పేర్కొన్నారు. కశ్మీర్లో ఆంక్షలను ఎత్తివేయాలని, మానవహక్కుల సంఘాలను కశ్మీర్లో పరిస్థితులపై అంచనా వేసేందుకు పంపించాలని కూడా ఇమ్రాన్ కోరారన్నారు. ఇలా ఉండగా, భారత రక్షణ మంత్రి రాజ్నాథ్æ మంగళవారం అమెరికా రక్షణ మంత్రి ఎస్పెర్తో ఫోన్లో సంభాషించారు. భారత్కు వ్యతిరేకంగా కొనసాగుతున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఆర్టికల్ 370 రద్దు, సంబంధిత అంశాలు తమ అంతర్గత విషయమని కూడా పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్కు సంబంధించి జరుగుతున్న పరిణామాలు భారత్ అంతరంగిక వ్యవహారమని, భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఎస్పెర్ ప్రశంసించారని అధికారులు తెలిపారు. భారత్, పాక్కు ఈ అంశాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని కూడా సూచించారన్నారు. -
పాక్ పరువుపోయింది
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్కు అంతర్జాతీయంగా మరోసారి భంగపాటు ఎదురైంది. కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేయడంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన 15 దేశాల రహస్య సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. సంయుక్త ప్రకటన విడుదల చేయాలన్న చైనా ఒత్తిడిని యూఎన్ బేఖాతర్ చేసింది. భారత్, పాక్ దేశాల మధ్య ద్వైపాక్షికంగా పరిష్కారం కావల్సిన కశ్మీర్ అంశానికి అంతర్జాతీయ రంగు అద్దడానికి చైనాతో కలిసి పాక్ చేసిన కుయుక్తులు బెడిసికొట్టాయి. ఈ సమావేశం జరగడానికి ముందు ఐక్యరాజ్యసమితిలో చైనా రాయబారి ఝాంగ్ జన్, పాక్ రాయబారి మలీహా లోథిలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కశ్మీర్ అంశంపై ఒకదాని తర్వాత ఒకటి చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. కానీ సమావేశం ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆగస్టు మాసానికి భద్రతా మండలి అధినేతగా పోలండ్ అధ్యక్షుడు కొనసాగుతున్నారు. అందుకే కశ్మీర్ అంశంలో ఐరాస తరఫున ఏదైనా ప్రకటన జారీ చేయాలని పోలండ్ అధ్యక్షుడిపై చైనా ఒత్తిడి తీసుకువచ్చింది. యూకే దానికి వంతపాడింది. ద్వైపాక్షిక సమస్యన్న మెజార్టీ దేశాలు.. నాలుగ్గోడల మధ్య జరిగిన ఆ సమావేశం వివరాలు తెలిసిన కొన్ని వర్గాలు మీడియాతో పలు విషయాలు పంచుకున్నాయి. ఈ సమావేశంలో పాల్గొన్న మెజార్టీ సభ్య దేశాలు కశ్మీర్ అంశం ద్వైపాక్షిక అంశమని అందులో ఐరాస జోక్యం అనవసరమని అభిప్రాయపడ్డాయి. ఈ అంశంపై సమావేశాన్ని నిర్వహించమని చైనా చెప్పడాన్ని కొన్ని దేశాలు తప్పుపట్టాయి. 370 రద్దుతో భౌగోళికంగా మార్పులు చోటు చేసుకుంటాయన్న చైనా వాదనని కొట్టిపారేశాయి. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్ (సీపీఈఎస్) ద్వారా మార్పులు వస్తున్నాయి కదాని దుయ్యబట్టాయి. చైనా తానేదైనా చేయదలచుకుంటే తమ దేశ అభిప్రాయంగా ప్రకటన అయినా ఇచ్చుకోవచ్చునని ఆ సమావేశంతో పాల్గొన్న ఇతర దేశాలు పేర్కొన్నాయి. కశ్మీర్ అంశంలో తలదూరిస్తే భారత్ వాదనలకు తమ దగ్గర సమాధానం లేదని యూఎన్ అభిప్రాయపడింది. Üమ్లా ఒప్పందానికి అనుగుణంగానే కశ్మీర్పై తాము నిర్ణయం తీసుకున్నామని భారత్ చెబుతోంది. అందుకే ఈ సమావేశానికి హాజరైన సభ్యదేశాలేవీ తమ వైఖరిని వెల్లడించడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. అందుకే ఈ సమావేశానికి సంబంధించి మినిట్స్ రికార్డు చేయలేదు. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దానినైనా పట్టించుకోవాలని సమావేశంలో చైనా వాదించింది. అయితే అమెరికా, ఫ్రాన్స్, రష్యా, డొమినికన్ రిపబ్లిక్, ఆఫ్రికా దేశాలన్నీ భారత్కు మద్దతుగా∙నిలిచాయి. ఫ్రాన్స్, రష్యాలు కశ్మీర్ సమస్య ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సూచించాయి. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు ఆసియాకు మంచివి కావని ఇండోనేసియా సూచించింది. ఉగ్రవాదాన్ని నిరోధిస్తేనే చర్చలు చైనా ఒత్తిడి మేరకు జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం ముగిశాక యూఎన్లో పాక్, చైనా రాయబారులు మీడియాను తప్పించుకొని వెళ్లిపోయారు. కానీ యూఎన్లో భారత్ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాత్రం పాకిస్తాన్ జర్నలిస్టుల దగ్గరకు స్వయంగా వచ్చి స్నేహపూర్వకంగా కరచాలనం చేశారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిచ్చారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ భయోత్పాతం సృష్టిస్తూ ఉంటే ఏ దేశం కూడా చర్చలకు ముందుకు రాదని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలు మానుకుంటేనే భారత్ చర్చలకు ముందుకు వస్తుందని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. సిమ్లా ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని భారత్ ఎప్పుడో ప్రకటించిందని, పాక్ ప్రతిస్పందన కోసం వేచి చూస్తున్నట్టుగా ఒక ప్రశ్నకు సమాధానంగా సయ్యద్ చెప్పారు. -
కశ్మీర్పై ఐరాసలో రహస్య చర్చలు
ఐక్యరాజ్య సమితి: జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని భారత్ తొలగించిన అంశంపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి శుక్రవారం రహస్య చర్చలు జరిపింది. పాకిస్తాన్ కోసం దాని మిత్రదేశం చైనా విజ్ఞప్తి మేరకు ఈ రహస్య చర్చలు జరిగాయి. అయితే ఇవి రహస్య చర్చలైనందున లోపల ఏ దేశం ఏం మాట్లాడిందనే విషయం బయటకు రాలేదు. భద్రతా మండలిలోని ఐదు శాశ్వత, పది తాత్కాలిక (మొత్తం 15) సభ్య దేశాలే ఈ చర్చల్లో పాల్గొంటున్నాయి. భారత్, పాక్లకు భద్రతా మండలిలో ఎలాంటి సభ్యత్వమూ లేనందున ఈ రెండు దేశాలు ఆ రహస్య చర్చల్లో పాల్గొన లేదు. తమ ప్రతినిధికి కూడా చర్చల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్ అభ్యర్థించినా భద్రతా మండలి అందుకు ఒప్పుకోలేదు. భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్లతోపాటు తాత్కాలిక సభ్యదేశాలైన జర్మనీ, బెల్జియం, కువైట్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియా, పోలాండ్, పెరూ, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెటోరియల్ గినియా, కోట్ డీఐవరీలు రహస్య చర్చల్లో పాల్గొన్నాయి. ఆర్టికల్ 370ని రద్దు చేయడం పూర్తిగా తమ అంతర్గత అంశమని భారత్ ఇప్పటికే ప్రపంచ దేశాలకు స్పష్టం చేయగా, పాక్ మాత్రం ఈ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో లేవనెత్తి వివాదాస్పదం చేస్తోంది. శాంతంగా పరిష్కరించుకోవాలి: రష్యా, చైనా చర్చల్లో పాల్గొనడానికి ముందు ఐరాసలో రష్యా ఉప శాశ్వత ప్రతినిధి దిమిత్రీ పోల్యాంస్కీ మాట్లాడుతూ కశ్మీర్ అంశం భారత్, పాక్ల మధ్య ద్వైపాక్షిక అంశంగానే రష్యా చూస్తోందని అన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే ప్రస్తుతం ఈ రహస్య చర్చ జరుగుతోందని ఆయన అన్నారు. రహస్య చర్చలు ముగిసిన తర్వాత ఐక్యరాజ్య సమితిలో చైనా రాయబారి ఝాంగ్ జున్ మాట్లాడుతూ భారత్, పాక్లు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరారు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే పద్ధతిని మానుకోవాలని సూచించారు. లదాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడంపై ఆయన స్పందిస్తూ, భారత చర్యలు చైనా సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసేలా ఉన్నాయనీ, సరిహద్దులపై ద్వైపాక్షిక ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించడం పట్ల చైనా కూడా ఆందోళనతో ఉందని అన్నారు. ఉగ్రవాదం ఆపితేనే చర్చలు: భారత్ ఉగ్రవాద చర్యలు, కార్యకలాపాలను పాకిస్తాన్ ఆపిన తర్వాతే ఆ దేశంతో చర్చలు జరుపుతామని ఐరాసలో భారత ప్రతినిధి అక్బరుద్దీన్ అన్నారు. రహస్య చర్చలు ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో భారత్ చెప్పినట్లుగానే కశ్మీర్లో 370వ అధికరణం రద్దు అంశం భారత అంతర్గత వ్యవహారమన్నారు. ఇతర దేశాలకు దీనితో పనిలేదన్నారు. పాక్పై ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ, కశ్మీర్లో ఏదో జరిగిపోతోందని భయపెట్టేలా పాక్ ప్రవర్తిస్తోందనీ, ఇది వాస్తవ దూరమని అన్నారు. కశ్మీర్ అంశంపై రెండు దేశాలు (పాక్, చైనా) తమ అభిప్రాయాలను అంతర్జాతీయ సమాజం అభిప్రాయంగా మార్చాలనుకున్నాయనీ, కానీ అది జరగలేదని పేర్కొన్నారు. -
భిన్నాభిప్రాయాలు ఘర్షణగా మారొద్దు
బీజింగ్/ఇస్లామాబాద్: భారత్, చైనా మధ్య ఉండే భిన్నాభిప్రాయాలు ఘర్షణగా మారకూడదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తెలిపారు. ఓ దేశపు సమస్యలపై మరో దేశం ఎలా స్పందిస్తుందన్న విషయంపైనే భవిష్యత్తులో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370ని భారత్ ఏకపక్షంగా రద్దుచేయడాన్ని ఖండిస్తున్నామని చైనా ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో జై శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. వుహాన్ సదస్సులో ఏర్పడిన సానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ భారత్–చైనాల సంబంధాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. మూడు రోజుల చైనా పర్యటనలో భాగంగా బీజింగ్ చేరుకున్న జై శంకర్, చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ క్విషన్, విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ చైనా పర్యటన ముగిసిన వెంటనే జై శంకర్ చైనాను సందర్శించడం గమనార్హం. వారు వాస్తవాన్ని గుర్తించారు: బీజింగ్లో సోమవారం జరిగిన భారత్–చైనా అత్యున్నత కమిటీ(సాంస్కృతిక, ప్రజా సంబంధాలు) సమావేశంలో జై శంకర్ మాట్లాడుతూ..‘అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్–చైనాల ద్వైపాక్షిక సంబంధాలు చాలా విశిష్టమైనవి. ఇండియా–చైనా రెండూ అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థికవ్యవస్థలు. రెండేళ్ల క్రితం భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ వాస్తవాన్ని గ్రహించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టం కావాల్సిన అవసరముందని అస్తానా(కజకిస్తాన్)లో జరిగిన భేటీలో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఇరుదేశాల మధ్య సత్సంబం ధాలకు ప్రజామద్దతును పొందాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇది సాధ్యం కావాలంటే ఇండియా–చైనాల మధ్య ఉన్న అభిప్రాయభేదాలు ఘర్షణలుగా మారకూడదు’ అని తెలిపారు. ఈ భేటీ వల్ల ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టమవుతాయి వాంగ్ చెప్పారు.