formar
-
Suresh Raina Marriage Anniversary: "మిస్టర్ ఐపీఎల్"కు పెళ్లి రోజు శుభాకాంక్షలు
-
విజయవాడ : తొలకరి తెచ్చిన కోలాహలం.. రైతన్న ముఖంలో చిరునవ్వు (ఫొటోలు)
-
రోడ్లపై నోట్లు ఇలా చల్లుతున్నాడేంటి?
-
ఎరువుల ధరలు పెంచి దేశ రైతాంగం నడ్డి విరిచారు: సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఎరువుల ధరల పెంపు అంశంలో కేంద్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎరువుల ధరల పెంపును నిరసిస్తూ ప్రధాని మోదీకి కేసీఆర్ బహిరంగలేఖ రాశారు. ఎరువుల ధరలు పెంచి దేశ రైతాంగం నడ్డి విరిచారని లేఖలో కేసీఆర్ విమర్శించారు. వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమని ఎద్దేవా చేశారు. కేంద్రం.. రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం.. ఉల్టా వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మరోసారి నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు. దేశ రైతాంగాన్ని బతకనిచ్చే పరిస్థితి లేదన్నారు. కరెంటు మోటార్లు బిగించి బిల్లులు వసూలు చేయడం... ఎన్ఆర్జీఈ నీ వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే చేయకుండా నాన్చడం దుర్మార్గమని మండిపడ్డారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు పూనుకోవడం ...వెనక కుట్ర దాగి వుందన్నారు. రైతులను వారి పొలాల్లో వారినే కూలీలుగా మార్చే కుట్రలను ఎదుర్కోవాలన్నారు. గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, అనుబంధ వృత్తులను నిర్వీర్యం చేసి, గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసి వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని విమర్శించారు. బీజేపీని కూకటివేళ్లతో పెకలించి వేయాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఎత్తివేసి రైతులను వ్యవసాయం చేయకుండా చేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై దేశ రైతాంగం తిరగబడాలన్నారు. నాగండ్లు ఎత్తి తిరగబడితే తప్ప వ్యవసాయాన్ని కాపాడుకొలేని పరిస్థితులు దాపురించాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కేంద్రానికి బుద్ధి వచ్చేదాకా ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే ఎరువుల ధరలను తగ్గించాలని.. లేని పక్షంలో దేశ వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కేంద్రం కుట్రలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకొని బీజేపీ ప్రభుత్వం పై ధరలు తగ్గించే దాకా సాగే పోరాటంలో కలిసిరావాలనీ పిలుపు నిచ్చారు. చదవండి: సజ్జనార్కు అర్ధరాత్రి యువతి ట్వీట్.. వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ -
ప్రజలెన్నుకున్న ప్రభుత్వ ఉసురు తీసే యత్నం: చన్నీ
టాండా (పంజాబ్): ప్రాణ హానిని ఎదుర్కొన్నానని ప్రధాని మోదీ అనడాన్ని పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ గిమ్మిక్కుగా అభివర్ణించారు. ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ప్రధాని గౌరవనీయ దేశ నాయకుడని, ఆ స్థాయి వ్యక్తి ఇలాంటి అల్ప నాటకానికి దిగడం ఆయన హోదాకు తగదని చన్నీ పేర్కొన్నారు. ‘రైతులు ఏడాది పొడవునా ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ప్రతికూలతల నడుమ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కొనసాగిస్తే పట్టలేదు కాని 15 నిమిషాలు ప్రధాని రోడ్డుపై వేచి ఉండాల్సి వస్తే ఇంత రాద్దాంతమా? ఇవెక్కడి ద్వంద్వ ప్రమాణాలు’ అని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవ్జోత్సింగ్ సిద్ధూ ధ్వజమెత్తారు. మోదీ పాల్గొనాల్సిన ఫిరోజ్పూర్ ర్యాలీకి కేవలం 500 మంది మాత్రమే వచ్చారన్నారు. -
పొలం తవ్వుతుండగా గుప్త నిధులు.. మహిళ పూనకంతో ఊగిపోయి
సాక్షి, రామన్నపేట(నల్లగొండ): మండలంలోని కుంకుడుపాముల గ్రామంలో ఓ రైతు పొలంలో గుప్తనిధులు లభ్యమైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కుంకుడుపాముల గ్రామానికి చెందిన కన్నెబోయిన మల్లయ్య సర్వే నంబర్లు 16, 17లోని తన పొలంలో వారం రోజుల క్రితం గట్లు తీస్తుండగా మట్టిపాత్ర(గురిగి), చిన్న ఇనుపపెట్టె కనిపించాయి. మట్టిపాత్రలో 38 వెండి నాణేలు, 5 వెండి పట్టీలు, 14 వెండి రింగులు(విరిగినవి) లభ్యమయ్యాయి. ఇనుప పెట్టెలో 19 బంగారు బిళ్లలు(పుస్తెలతాడుకు ఉండేవి) ఐదు బంగారు గుండ్లు ఉన్నాయి. వెండి నాణేలపై ఉర్దూ పదాలు ఉన్నాయి. కాగా మల్లయ్య తీసిన గట్టును ఆనుకొని అతడి సోదరుడు లింగయ్య పొలం ఉంటుంది. అందులో నాటు వేసేందుకు వచ్చిన కూలీలు వాటిని తలా ఒకటి తీసుకోవడానికి చేతిలో పట్టుకున్నారు. అదే సమయంలో ఒక మహిళ పూనకం వచ్చినట్టు ఊగి వాటిని ముట్టుకుంటే అరిష్టమని పలుకడంతో వారంతా నాణేలు, బంగారు ఆభరణాలను తిరిగి ఇచ్చారు. పొలంలో లభ్యమైన నిధిని మల్లయ్య ఇంటి వద్ద గల పెంటకుప్పలో దాచాడు. విషయం తెలుసుకున్న అతడి సోదరుడు లింగయ్య ఇద్దరి మధ్య ఉన్న పొలంగట్టులో దొరికింది కాబట్టి తనకు వాటా కావాలని డిమాండ్ చేశాడు. వరినాట్లు ముగిసిన రెండురోజుల అనంతరం సోదరులిద్దరు గ్రామంలోని ఓ పెద్దమనిషిని ఆశ్రయించారు. సమానంగా పంచుకోవాలని పెద్దమనిషి సలహా ఇచ్చాడు. వాటిని పంచుకునే విషయంలో అన్నదమ్ములిద్దరికీ తేడా వచ్చింది. దీంతో మల్లయ్య మంగళవారం తనకు పొలంలో దొరికిన గుప్తనిధిని రామన్నపేట పోలీసులకు అప్పజెప్పాడు. గుప్తనిధి వివరాలను రెవెన్యూ అధికారులకు అందించామని, గురువారం వారికి అందజేయనున్నట్లు సీఐ చింతా మోతీరాం తెలిపారు. చదవండి: మరో ఆసక్తికర పరిణామం.. జిరాక్స్ తీస్తే కొంపలు అంటుకుంటాయ్..!? -
మెరిసిన ‘తెల్ల బంగారం’.. కిలో ఎంతంటే
సాక్షి, జడ్చర్ల (మహబూబ్నగర్): బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో తెల్ల బంగారం ఒక్కసారిగా మెరిసిపోయింది. యార్డు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా బుధవారం రికార్డు స్థాయి ధర లభించింది. ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.6,025 మద్దతు ధర ప్రకటించగా.. ఏకంగా గరిష్టంగా రూ.8,829 పలికింది. కనిష్టంగా రూ.6,830 ధర లభించింది. కనిష్ట ధరలు కూడా మద్దతు ధర కంటే ఎక్కువగా ఉండడం విశేషం. బాలానగర్ మండలం చిన్నరేవల్లికి చెందిన రైతు శ్రీను తీసుకొచ్చిన పత్తికి అత్యధిక ధర వచ్చింది. ఇక మిగిలిన పంట ఉత్పత్తుల విషయానికి వస్తే.. ఆర్ఎన్ఆర్ ధాన్యానికి గరిష్టంగా రూ.2,009 ధర రాగా, కనిష్టంగా రూ.1,409 పలికింది. హంసకు గరిష్టంగా రూ.1,679, కనిష్టంగా రూ.1,409, మొక్కజొన్నకు గరిష్టంగా రూ.1,810, కనిష్టంగా రూ.1,552, రాగులకు రూ.2,562, కందులకు గరిష్టంగా రూ.5,829, కనిష్టంగా రూ.5,014, ఆముదాలకు గరిష్టంగా రూ.5,400, కనిష్టంగా రూ.5,249 ధరలు కేటాయించారు. కిటకిటలాడిన మార్కెట్ పంట దిగుబడుల క్రయవిక్రయాలతో బాదేపల్లి మార్కెట్ కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి 1,922 బస్తాల పత్తి యార్డుకు విక్రయానికి వచ్చింది. అదేవిధంగా 2,200 బస్తాల ధాన్యం, 881 బస్తాల మొక్కజొన్న, 365 బస్తాల వేరుశనగ, 271 బస్తాల కందులు విక్రయానికి వచ్చింది. మరోవైపు రైతులకు ఆశించిన ధరలు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గద్వాల యార్డుకు 1,180 క్వింటాళ్ల వేరుశనగ గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు బుధవారం 1180 క్వింటాళ్ల వేరుశనగ రాగ, క్వింటాలుకు గరిష్టం రూ. 8174, కనిష్టం రూ. 4866, సరాసరి రూ.7200 ధరలు వచ్చాయి. 3 క్వింటాళ్ల ఆముదం రాగా, క్వింటాలుకు గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 4510 ధరలు పలికాయి. 512 క్వింటాళ్ల వరి (సోన) రాగా, క్వింటాలుకు గరిష్టం రూ. 1929, కనిష్టం రూ. 1406, సరాసరి రూ. 1914 పలికింది. 41 క్వింటాళ్ల కంది రాగా, క్వింటాలుకు గరిష్టం రూ. 5266, కనిష్టం రూ. 4506, సరాసరి రూ. 5206 ధరలు లభించాయి. చదవండి: జిరాక్స్ తీస్తే కొంపలు అంటుకుంటాయ్..!? -
కనీస మద్దతు ధరపై జేపీసీ ఏర్పాటు చేయాలి: ఎంపీ విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: రైతులకు కనీసమద్దతు ధర కల్పించే విషయంలో సంబంధిత భాగస్వాములతో చర్చించడానికి సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని(జేపీసీ)ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మూడు సాగుచట్టాలను రద్దుచేయాడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం దేశంలో.. రైతు ప్రయోజనాల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయన్నారు. కనీస మద్దతు ధర కల్పించాలనే అంశం మరోసారి చర్చకు వచ్చిందన్నారు. కాగా, తమ ప్రభుత్వం ఏపీ రైతులకు కనీస మద్దతుధర ఆచరించి చూపిందని తెలిపారు. కేంద్రం 23 వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పిస్తే.. తమ ప్రభుత్వం మరో 24 వ్యవసాయ ఉత్పాదనలకు ఎంఎస్పీ ఇస్తుందన్నారు. ప్రస్తుతం ఏపీలో 47 పంటలు కనీస మద్దతుధర పరిధిలోకి వచ్చాయని పేర్కొన్నారు. దేశంలోని అన్నిరాష్ట్రాల కంటే అత్యధిక పంటలకు ఎంఎస్పీ ప్రకటించిన రాష్ట్రం ఏపీ అని విజయసాయిరెడ్డి తెలిపారు. జాతీయస్థాయిలో కూడా అత్యధిక పంటలకు ఎంఎస్పీ ఉండేలా చట్టబద్ధమైన హామీ కల్పించాల్సిన అవసరముందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించే విషయంలో ఆటంకంగా ఉన్న అన్ని అంశాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా పార్లమెంట్లో చట్టం చేయడానికి ఈ సంప్రదింపులు ఎంతగానే ఉపయోగపడతాయని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అందుకే సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)ని ఏర్పాటుచేసి, కనీస మద్దతు ధరపై ముడిపడిన వివిధ సమస్యలపై సంబంధిత భాగస్వామ్య పార్టీలతో సంప్రదింపులు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
రైతుల గోస పట్టని సీఎం కేసీఆర్: షర్మిల
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు యాసంగి రైతుల గోస పట్టడం లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. పంట వేసుకోవాల్సిన రైతు ఇంకా వానాకాలం పంట అమ్ముడుపోక, కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా కేసీఆర్ వైఖరిని ఎండగట్టారు. చివరిగింజ వరకు కొంటామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మరోవైపు తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. -
రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు: అరవింద్ కేజ్రివాల్
చంఢీఘడ్: రైతుల ఆత్మహత్యలను నివారించడానికి ఎలాంటి చర్యలనైనా తీసుకుంటామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ అన్నారు. పంజాబ్లోని మాన్సాలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడకుండా చూస్తామని కేజ్రివాల్ అన్నారు. స్వాత్రంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినప్పటికి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపోందిస్తున్నామని సీఎం అరవింద్ కేజ్రివాల్ అన్నారు. మీకు నేను.. వాగ్దానం చేసి చెబుతున్నాను.. ఒక నెల తర్వాత మళ్లి వచ్చాక దాని వివరాలు తెలియజేస్తామని తెలిపారు. పంజాబ్లో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 117 స్థానాల్లో అభ్యర్థులు పోటిచేస్తారని అన్నారు. కాగా, ఎన్నికలలో ఆమ్ ఆద్మీపార్టీ అఖండ విజయం సాధిస్తుందని తెలిపారు. అరవింద్ కేజ్రివాల్ రెండు రోజులపాటు పంజాబ్లో పర్యటిస్తున్నారు. ఆయన రేపు(శుక్రవారం) భటిండా వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు. చదవండి: ఏపీ గవర్నర్ను కలిసిన సీఎం వైఎస్ జగన్ దంపతులు -
మాజీ మంత్రి ఆస్తులపై ఏసీబీ దాడులు
సాక్షి, చెన్నై(తమిళనాడు): ఇటీవల కాలంలో మాజీ మంత్రుల ఆస్తులపై పంజా విసురుతూ వస్తున్న అవినీతి నిరోధకశాఖ మరోసారి జూలు విదిల్చింది. మాజీ మంత్రి సి.విజయభాస్కర్ ఆస్తులపై సోమవారం ఏకకాలంలో ఆరు జిల్లాల్లో (44 చోట్ల) మెరుపుదాడులు చేసింది. 2011–16, 2016–21 హయాంనాటి అన్నాడీఎంకే ప్రభుత్వంలోని మంత్రులు తమ పదవిని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆస్తులను కూడబెట్టినట్లు అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఆరోపణలు చేయడంతోపాటూ విచారణకు ఆదేశించాల్సిందిగా గవర్నర్కు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం డీఎంకే అధికారం చేపట్టిన నేపథ్యంలో అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న మాజీ మంత్రుల ఆస్తులపై ఏసీబీ దాడులు చేస్తూ వస్తోంది. మాజీ మంత్రులు ఎంఆర్ విజయభాస్కర్, ఎస్పీ వేలుమణి, కేసీ వీరమణి ఆస్తులపై ఏసీబీ వరుసగా దాడులు చేసి కేసులు పెట్టింది. ఇందుకు కొనసాగింపుగా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఉన్న మాజీ మంత్రి సి. విజయభాస్కర్ ఇళ్లు, కార్యాలయాలు, కాలేజీలు వంటి 44 చోట్ల సోమవారం ఉదయం మెరుపుదాడులు ప్రారంభించారు. మాజీ మంత్రి సొంతూరైన పుదుక్కోట్టై జిల్లా వీరాలిమలై సమీపం ఇలుపూరులోని ఇంటిలోకి సోమవారం ఉదయం 6 గంటలకు సుమారు సుమారు 50 మందికిపైగా ఏసీబీ అధికారులు ప్రవేశించి తనిఖీలు ప్రారంభించారు. ఆ తరువాత పలు బృందాలుగా విడిపోయి 6.30 గంటలకు ఏకకాలంలో పుదుక్కోట్టై జిల్లాలో 30 ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించారు. విజయభాస్కర్ సోదరుల, స్నేహితుల ఇళ్లు, కార్యాలయాలు, కాలేజీలపై దాడులు జరిపారు. మదర్ థెరిసా విద్యా చారిటబుల్ ట్రస్ట్ పేరున స్థాపించిన 14 విద్యాసంస్థల్లోనూ తనిఖీలు చేపట్టారు. కరోనా కాలంలో భారీగా అక్రమాలు కరోనా కాలంలో వైద్య చికిత్సకు సంబంధించి మందులు, ఉపకరణాల కొనుగోలులో భారీస్థాయిలో అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఆదాయానికి మించి రూ.27.22 కోట్లు కూడబెట్టినట్లు, చెన్నైలో రూ.14 కోట్లతో లగ్జరీ నివాసం, విదేశీ మోడల్ కారు కొనుగోలు చేసినట్లుగా ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ ఎఫ్ఐఆర్లో విజయభాస్కర్ భార్య రమ్య పేరును కూడా చేర్చారు. పుదుకోట్టైతో పాటూ చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చిరాపల్లి, కాంచీపురం, చెంగల్పట్టు..మొత్తం ఆరుజిల్లాల్లో జరిగిన తనిఖీల్లో సుమారు వందమందికి పైగా ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. పీపీఈ దుస్తులతో తనిఖీలు చెన్నై కీల్పాక్కంలోని విజయభాస్కర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేసిన సమయంలో అతని భార్య రమ్య, పెద్ద కుమార్తె కరోనాకు గురై హోం క్వారంటైన్లో ఉన్నారు. దాడుల్లో భాగంగా ఇంట్లోకి ప్రవేశించిన తరువాత ఏసీబీ అధికారులకు ఈ విషయం తెలిసింది. దీంతో పీపీఈ దుస్తులు, చేతికి గ్లౌజులు ధరించి భార్య, కుమార్తె ఉన్న గదితో సహా ఇల్లంతా తనిఖీలు సాగించారు. కాగా ఏసీబీ దాడులను నిరసిస్తూ అన్నాడీఎంకే శ్రేణులు మాజీ మంత్రి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కాగా ఈ సోదాల్లో రూ. 23 లక్షల నగదు, 4.87 కేజీల బంగారం, 136 భారీ వాహనాలకు సంబంధించి రికార్డులు బయటపడ్డాయి. అలాగే 19 హార్డ్ డిస్్కలను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ప్రియురాలు మరో యువకుడిని ప్రేమిస్తుందని తెలిసి.. -
నిరసన... ప్రాథమిక హక్కు కాదా?
భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన ‘నిరసన తెలిపే హక్కు’ తిరుగులేనిదా అనే అంశాన్నీ పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు ఇటీవల నొక్కి చెప్పింది. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడానికి గానీ, శాంతియుతంగా నిరసన తెలుపడానికి గానీ ఢిల్లీ పోలీసులు తమకు అనుమతి నిరాకరించడంపై కిసాన్ మహా పంచాయత్ ఒక పిటిషన్ వేసింది. కానీ, కోర్టు ముందు పిటిషన్ వాయిదాలో ఉండటం, లేక న్యాయస్థానం పరిధిలో ఉండటం అనే కారణాలు చూపి నిరసన తెలిపే హక్కుపై ఆంక్షలను విధించకూడదు. ఒక సమస్యపై న్యాయపరిష్కారం కోసం కోర్టులను సంప్రదించాక, ప్రజలు అదే సమస్యపై నిరసన తెలిపే హక్కును కోల్పోతారని న్యాయమూర్తులు పేర్కొనడం పరిహాసాస్పదమైన విషయం. అక్టోబర్ 4న, ఇద్దరు న్యాయమూర్తులతో (జస్టిస్ ఏఎమ్ ఖన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్) కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం మూడు పేజీల ఆదేశాన్ని జారీ చేసింది. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన ‘నిరసన తెలిపే హక్కు’ తిరుగులేనిదా అనే అంశాన్నీ పరిశీలించాల్సి ఉందని కోర్టు నొక్కి చెప్పింది. అలాగే కేంద్రప్రభుత్వం గత ఏడాది తీసుకొచ్చిన 3 వ్యవసాయ సంస్కరణ చట్టాల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ రైతు ప్రతినిధులు న్యాయస్థానం ముందుకు వచ్చిన తర్వాత కూడా, ఆ చట్టాలకు వ్యతిరేకంగా కిసాన్ మహాపంచాయత్ తన నిరసనలను బహిరంగంగా కొనసాగించవచ్చా అనే అంశాన్ని కూడా పరిశీలించదల్చుకున్నట్లు కోర్టు ఆదేశం పేర్కొంది. దీనిపై కోర్టు తన ఆదేశంలో పొందుపర్చిన రాతపూర్వకమైన విషయం కానీ, న్యాయమూర్తులు వాడిన పదాల తీరు కానీ అత్యంత విచారకరంగా ఉన్నాయని చెప్పాలి. జంతర్మంతర్ వద్ద కూర్చుని ధర్నా చేయడానికిగానీ, శాంతియుతంగా నిరసన తెలుపడానికిగానీ ఢిల్లీ పోలీసులు తమకు అనుమతి నిరాకరించడంపై కిసాన్ మహా పంచాయత్ ఒక పిటిషన్ వేసింది. తమకు అనుమతి నిరాకరించిన పోలీసులు, సంయుక్త కిసాన్ మోర్చా వంటి సంస్థలకు మాత్రం అనుమతి మంజూరు చేశారని పిటిషన్దారులు సుప్రీంకోర్టుకి విన్నవిం చారు. చట్టం ముందు సమానత్వానికి హామీ ఇస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 బట్టి చూస్తే, ఈ ప్రత్యేక సందర్భంలో ఢిల్లీ పోలీసుల నిరాకరణ వివక్షతో కూడి ఉందా లేదా ఆర్టికల్ 19 కింద నిరసన తెలిపే రాజ్యాంగ హక్కును ఇది ఉల్లంఘిస్తోందా అనే విషయాన్ని పరిశీలించడానికి న్యాయస్థానం ముందుగా ఢిల్లీ పోలీసుల ఆదేశాన్ని పరిశీలించాల్సి ఉంది. కానీ దీనికి బదులుగా, నిరసన హక్కు పరిమితులను విచారించేందుకు న్యాయస్థానం ముందుకు రావడం గమనార్హం. రాజ్యాంగ విధానం, స్ఫూర్తి ఏమిటి? నిరసన తెలిపే హక్కు అనేది... భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) కింద వాక్ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ– ఆర్టికల్ 19(1) (బి) కింద శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛకు చెందిన రెండు ప్రాథమిక హక్కులతో కూడి ఉంది. పైన పేర్కొన్న రెండు హక్కులూ భారత సార్వభౌమాధికారం, దేశ సమగ్రత, సామాజిక శాంతి వంటి అంశాల ప్రాతిపదికన ఆర్టికల్ 19(2), ఆర్టికల్ 19(3) కింద హేతుపూర్వకమైన పరిమితులకు లోబడి ఉంటాయి. కోర్టు ముందు వాయిదాలో ఉండటం, లేక న్యాయ స్థానం పరిధిలో ఉండటం అనే అంశాలకు రాజ్యాంగపరంగా విలువకానీ, అనుమతికానీ లేదు. ఈ కారణాలు చూపి నిరసన తెలిపే హక్కుపై ఆంక్షలను విధించకూడదు. మరీ ముఖ్యంగా, ఇంతకు ముందే పేర్కొన్నట్లుగా ప్రాథమిక హక్కులపై శాసన, కార్యనిర్వాహక వర్గం ఆంక్షలు విధించడాన్ని రాజ్యాంగం అనుమతిస్తుందా అనే అంశాన్ని పరిశీలించడమే న్యాయస్థానం విధి. అంతేకానీ అదనపు కారణాలను వెతకడానికి ప్రయత్నించి, వాటి ఆధారంగా ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించే విషయాన్ని పరిశీలించే పని న్యాయస్థానంది కాదు. శాసన, కార్యనిర్వాహక వర్గం పనితీరుపై తనిఖీ ఉంచడం అనే విధిని నిర్వర్తించడానికి బదులుగా, న్యాయస్థానం ప్రాథమిక హక్కుపై ఆంక్షలకు సంబంధించి ఇలాంటి వైఖరిని చేపట్టినప్పుడు, ఆ శాసన, కార్యనిర్వాహక వర్గం తరపున కోర్టు తనకుతానుగా సమర్థవంతంగా పనిచేసినట్లు అవుతుంది. మరోమాటలో చెప్పాలంటే, న్యాయస్థానం ప్రాథమిక హక్కుల ప్రాతిపదికను విచారించి, వాటిపై ఆంక్షలు విధించడంపై ఆత్రుత ప్రదర్శించినట్లు కనిపిస్తే ప్రభుత్వం చేసే పనిని కోర్టు స్వయంగా చేసినట్లు అవుతుంది. అదనంగా, రాజ్యాంగపరమైన సవాలు కోర్టుముందు అపరిష్కృతంగా ఉందన్న కారణంగా నిరసన తెలిపే హక్కును ఎవరికైనా లేకుండా చేయకూడదని 2020 సంవత్సరంలోనే సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొని ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంది. కాబట్టి అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన న్యాయాదేశానికి కట్టుబడాల్సిన న్యాయమూర్తులు ప్రస్తుత ఆదేశం విషయంలో కాస్త నిర్లక్ష్యం ప్రదర్శించారనే చెప్పాలి. నిరసన ఒక రాజకీయ కార్యాచరణ న్యాయపరమైన సవాలుకు, నిరసన తెలుపడానికి మధ్య లింకు పెట్టి రైతుల నిరసన హక్కుపై ఆంక్షలు విధించవచ్చని కోర్టు సూచించడం శుద్ధ అసంగతమైన విషయం అనే చెప్పాలి. ఇలాంటి వైఖరి పూర్తిగా హేతువిరుద్ధమైనదని చెప్పడానికి కనీసం మూడు స్పష్టమైన కారణాలను పేర్కొనవచ్చు. మొదటిది, కోర్టును సంప్రదించడం అనేది న్యాయపరమైన పరిష్కారాన్ని సూచిస్తుంది. ఇక నిరసన అనేది రాజ కీయ అన్వేషణకు సంబంధించింది. మొదటి అంశంలో, శాసన కార్యనిర్వాహక వర్గం చట్టబద్ధత లేదా రాజ్యాంగబద్ధతపై న్యాయస్థానం నిర్ణయం తెలపాలి. కాగా, రైతుల నిరసనకు కారణమైన ప్రభుత్వ తొలి నిర్ణయాన్ని రద్దు చేయడం లేదా సవరించడంపై నేరుగా విధాన నిర్ణేతపై ఒత్తిడి తేవాలని ప్రజలు చూస్తున్నారు. ఈ రెండు మార్గాలు ఒకదానికొకటి స్వతంత్రంగా ఉంటాయి. ఒక న్యాయపరమైన పరిష్కారాన్ని వెదుకుతున్నప్పుడు ఒక వ్యక్తి రాజకీయ పరిష్కారాన్ని కోల్పోవడానికి సముచితమైన కారణం లేదు. రెండోది, శాసనాలకు ఎదురయ్యే న్యాయపరమైన సవాళ్లు రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉంటాయి. కానీ ప్రజాస్వామిక సమాజంలో నిరసనలకు మరింత విస్తృత ప్రాతిపదిక ఉంది. శాసనం కూడా రాజ్యాంగ బద్ధమైనదే కావచ్చు కానీ ప్రజలు దాన్ని యథాతథంగా స్వీకరిస్తారని భావించకూడదు. రాజ్యాంగపరమైన ఆదేశాలు శాసన, కార్యనిర్వాహక వర్గం కార్యాచరణకు కనీసమాత్రంగానే చట్టబద్ధతను అందిస్తాయి. ప్రజలు ప్రతి సందర్భంలోనూ నిరసన తెలిపే హక్కును కలిగి ఉంటారు. మూడోది, న్యాయస్థానం నిర్ణయాలపై నిరసన తెలుపడానికి కూడా మన రాజ్యాంగం అనుమతిస్తోంది. నిజానికి, న్యాయ నిర్ణయాలకు వ్యతిరేకంగా సాగే ప్రజా నిరసనలు ఆ నిర్ణయం ప్రభావాన్ని తటస్థం చేయడానికి లేదా ఉపశమింపచేయడానికి రాజ్యాంగ, న్యాయపరమైన మార్పులను ప్రేరేపిస్తాయి. షెడ్యూల్డ్ కులాలు, తెగలపై అత్యాచారాల నివారణ చట్టం 1989 అమలును సుప్రీంకోర్టు 2018 నాటి తీర్పు ద్వారా పలుచబార్చినప్పుడు, చెలరేగిన తీవ్రమైన నిరసనల కారణంగా కోర్టు తీర్పును తటస్థం చేయడానికి ఆ చట్టానికి పార్లమెంటు సవరణ తీసుకొచ్చింది. ప్రాథమికంగా అప్రజాస్వామికం ప్రభుత్వ విధానంలో లేక నిర్ణయాల్లో తలెత్తిన వివాదాస్పద అంశాలను పరిష్కరించడానికి న్యాయపరమైన చర్యలను ప్రారంభించినప్పటికీ, అవి ఇతర ప్రజాస్వామిక చర్యలను నిరోధించలేవు. నిజానికి న్యాయపరమైన పరిష్కారాన్ని అన్వేషించడం అనేది ప్రజలు తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి అవలంబించే అనేక ప్రజాస్వామిక ఎంపికల్లో భాగంగానే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో, ఒక సమస్యపై న్యాయపరిష్కారం కోసం కోర్టులను సంప్రదించాక, ప్రజలు అదే సమస్యపై నిరసన తెలిపే హక్కును కోల్పోతారని న్యాయమూర్తులు పేర్కొనడం పరిహాసాస్పదమైన విషయం. ఈ సందర్భంగా న్యాయమూర్తుల ఆలోచనా ధోరణి ప్రాథమికంగానే అప్రజాస్వామికంగా ఉంది. కోర్టుల్లో విచారణ ప్రారంభించాక, నిరసన తెలిపే హక్కు ఉండదని జడ్జీలు పేర్కొన్నారని ఊహించుకుందాం. దాని పరిణామపూర్వకమైన ముగింపు ఎలా ఉంటుంది? సమస్య కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నిరసనలకు అనుమతి లేదనుకుంటే, కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించేందుకు కూడా అనుమతి ఉండదు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించినప్పుడు దాన్ని నిరోధించడానికి రాజ్యాంగ సంవి ధానానికి న్యాయవ్యవస్థ అవసరమవుతుంది. సుప్రీంకోర్టు అనవసరంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఊహకు అందని విషయమే. రంజిన్ పల్లవ్ త్రిపాఠి అధ్యాపకుడు, నేషనల్ లా యూనివర్సిటీ, ఒడిశా -
Lakhimpur Kheri Violence: నేడు రాష్ట్రపతిని కలవనున్న రాహుల్
న్యూఢిల్లీ/లఖీమ్పూర్ ఖేరి: రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం రాష్ట్రపతి కోవింద్ను కలిసి లఖీమ్పూర్ఖేరి ఘటనపై వినతిపత్రం అందజేయనున్నారు. ఈ బృందంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, గులామ్ నబీ ఆజాద్, లోక్సభ పార్టీ నేత అధిర్ రంజన్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ ఉంటారు. హింసాత్మక ఘటనలపై రాష్ట్రపతికి పూర్తి వివరాలను అందజేస్తామని పార్టీ నేత వేణుగోపాల్ తెలిపారు. మంత్రి కుమారుడు రైతులపైకి వాహనం నడిపిన ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. లఖీమ్పూర్ ఖేరి ఘటనలకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తక్షణమే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మృతి చెందిన ఈ ఘటనకు సంబంధించి మంత్రి కుమారుడు ఆశిష్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతిమ్ అర్దాస్లో పాల్గొన్న ప్రియాంక లఖీమ్పూర్ఖేరి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు అంతిమ ప్రార్థనలు జరిపేందుకు మంగళవారం టికోనియా గ్రామంలో జరిగిన కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, బీకేయూ నేతలు రాకేశ్ తికాయత్, దర్శన్సింగ్ పాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, ధర్మేంద్ర మాలిక్ తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా పాల్గొన్నారు. హింసాత్మక ఘటనలో అసువులు బాసిన రైతుల కుటుంబసభ్యులు కార్యక్రమ ంలో పాల్గొన్నారు. ప్రకటించిన విధంగానే, వేదికపై రాజకీయ పార్టీల నేతలెవరికీ చోటు కల్పించలేదు. కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలో పోలీసులు, పారా మిలటరీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ప్రధాని మోదీ జాతికి క్షమాపణ చెప్పాలి
సాక్షి, కవాడిగూడ (హైదరాబాద్): ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశానికి అన్నంపెట్టే రైతన్నలకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చిందని, తక్షణమే ఆ చట్టాలను ఉపసంహరించుకొని దేశ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్మిశ్రా కుమారుడు తన కాన్వాయ్తో రైతులను ఢీకొట్టి నలుగురి మృతికి కారణమైన ఘటనకు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్లో మౌనదీక్ష చేపట్టారు. దీక్ష అనంతరం రేవంత్ మాట్లాడుతూ 11 నెలలుగా రైతులు న్యాయం కోసం ఢిల్లీలో పోరాటం చేస్తుంటే సమస్య పరిష్కరించకుండా వారిపై దౌర్జన్యాలు, దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుతామని చెప్పిన మోదీ, దాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారని విమర్శిం చారు. సీఎం కేసీఆర్, మొదట్లో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి, ఢిల్లీ వెళ్లివచ్చిన తరువాత కేంద్రానికి అనుకూలంగా మారారని విమర్శించారు. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో.. న్యాయం అడిగితే ప్రజలను చంపుతున్నారని ఆరోపించారు. యూపీ రైతుల హత్యలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపించి, 30 రోజుల్లో తేల్చాలని డిమాండ్ చేశారు. వ్యవసాయాధారిత దేశంలో రైతులకు మేలు చేస్తా నని హామీ ఇచ్చిన మోదీ ఆచరణలో అమలు చేయటంలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. యూపీలో రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే సమస్యను పరిష్కరించకుండా హత్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. -
ఆ మృత్యుశకటానికి అహంకారమే ఇంధనం
అది ఆదివారం. రైతులు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి గారు వస్తున్నారని తెలిసింది. ఆయన కారుకు అడ్డం పడి నిరసన తెలియజెప్పాలనుకున్నారు. కానీ ఒక నల్ల కారు వెనుకనుంచి రైతుల మీదుగా దూసుకువచ్చింది. నలుగురి ప్రాణాలు పోయాయి. రైతులే దాడి చేశారనే ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహించారు. కారుపైన కూర్చుని నడపడం వారికి ఒప్పు. కారు కింద పడడం వీరికి తప్పు. మంత్రి గారి కుమారుడి కారో, తండ్రి గారి కాన్వాయ్ కారో తెలియదు. ఆ కారు శరీరాలను నుజ్జు చేస్తూపోయిన సంగతి మాత్రం తెలుసు. మరణాలు నిజం; కారణాలు, కారకులు, బతికున్న నేరగాళ్లు బయటపడరు. నిర్జీవ శవాలు మాత్రం దాక్కోలేవు, మరణించిన మానవత్వానికి క్షీణించిన సమపాలనకు సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. కానీ వారి సాక్ష్యం ఎవరూ వినరు. శవపరీక్షలు చేసిన డాక్టర్ల నిజాయితీ బతికి ఉంటే, నిజాయితీ ఉన్న డాక్టర్లు బతికి ఉంటే, న్యాయం బతికే అవకాశం. చివరకు మిగిలేవి ప్రాణం లేని నివేదికలు, బూడిద. సుప్రీంకోర్టు స్వయంగా ఎవరినైనా అరెస్టు చేస్తున్నారా ఇప్పడికైనా అని అడిగింది. నిజానికి ఆ ప్రశ్న మొత్తం భారతీయ జనులది. జనం తలలు శరీరాలు చిదిమేస్తూ ఏలినవారి అధికారిక వాహనాలు మరణ మృదంగం మోగించడం కన్నా ఘోరం ఏమంటే దాని తరవాత నిర్వహించవలసిన బాధ్యతలు వదిలేయడం. వీడియో ప్రసారాలు నిషేధించారు. రాజకీయ వికృత కల్లోలాలు. ఇంటర్నెట్ సేవల రద్దు, ప్రతిపక్ష నాయకుల రాకపోకలపై నిషేధం. నగర ప్రవేశంపై అనేకానేక నిర్బంధాలు. తప్పుడు కథనాలు, కావాలని çసృష్టించిన అనుమానాలు. నేరాలు దాచే ప్రయత్నాలు చేయడం, మీడియా నోరు నొక్కడం, తలలు చిదిమేయడమే కాదు తలపును కూడా చిదిమేసే ప్రయత్నాలు జరగడం. దేశ భద్రత కోసమే ఆ కఠిన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. పోతే పోయింది ఇంటర్నెట్. చట్టాలను ఆమోదించకపోతే ప్రాణాలకు ప్రమాదం అని నిరసనకారులకు ఇంకా ఎందుకు తెలియడం లేదో ప్రభువులకు అర్థం కాదు, మృత్యుశకటానికి అహంకారమే ఇంధనం కదా. అన్నిటికన్నా భయంకరమైనది నిస్సిగ్గు. బాహాటంగా తమ వీపు తామే తట్టి మెచ్చుకోవడం, వెంటనే విచారణకు ఆదేశించినందుకు ముఖ్యమంత్రి చురుకైన కార్యశీలతను ప్రశంసిస్తూ అభినందించడం, అందుకోసం లజ్జను త్యాగం చేసే మహాసంస్థలు, అతిరథులు, మహారథులు ఎందరో. కొందరు నోరు విప్పరు. కొందరు నోరువిప్పితే అన్నీ అబద్ధాలే. నలుగురు రైతులతో సహా ఎనిమిది మందిని నలిపేసిన ఈ క్రూర, అధికార, అహంకార దుర్మార్గాన్ని సంయుక్త కిసాన్ మోర్చా ఖండిస్తున్నది. సుప్రీంకోర్టు స్వయంగా విచారణకు స్వీకరించి ఏం జరిగిందో, ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పండి అని అడిగింది. ఈ పని చేయవలసింది డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి. వారంతా ప్రతిపక్షాలను ఎలా కట్టడి చేయాలా అని తమ రాజకీయ అనుభవాన్ని వాడుతూ ఆలోచిస్తుండటం వల్ల వారికి తీరిక లేదని గమనించి సుప్రీంకోర్టు దయతో ఆ బాధ్యతను స్వీకరించింది. రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత సుప్రీంకోర్టుదే కదా మరి. బ్రిటిష్ క్వీన్స్ కౌన్సిల్గా అత్యంత ప్రఖ్యాతుడైన హరీశ్ సాల్వేగారు ఉత్తర ప్రదేశ్ అధికార యంత్రాంగం తరఫున వాదిస్తున్నారు (ఫీజెంత అని అడక్కండి). తదుపరి చర్యలేవీ బాగా లేవని న్యాయమూర్తులు పెదవి విరుస్తున్నారు. ‘‘ప్రశ్నించడానికి రమ్మన్నాం. రాకపోతే మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రాకు చట్టం కాఠిన్యం ఏమిటో చూపిస్తాం’’ అని హరీశ్ సాల్వే హామీ ఇచ్చారు. మంత్రికొడుకు ఇంటి ముందు జాగ్రత్తగా నోటీసు అంటించి వచ్చారు. అవును. అరెస్టు చేసే ముందు అన్ని హక్కులూ అరెస్టు కాబోయే వారికి కల్పించాలి. ఎన్ని నిందలొస్తే మాత్రం ఆయన బీజేపీ నాయకుడే అవుతాడు గానీ నిందితుడని అనగలమా? మన రాజ్యాంగం వారికిచ్చిన చాలా హక్కులు వాడుకోవలసిందే. అధికార పక్షం కాని వారికి కూడా ఆ హక్కులు ఇస్తే బాగుండేదనే ఒక సూచన. ఎట్టకేలకు ఆయనను అరెస్టయితే చేశారు! దేశ హోంశాఖ సహాయ మంత్రిని డిస్మిస్ చేయాలని శిరోమణి అకాలీదళ్ డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఇంకా ఆయనను మంత్రి పదవిలో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. డిమాండ్ చేయగానే డిస్మిస్ చేస్తే అసలు మంత్రి వర్గాలేవీ ఉండవు. మంత్రులు లేకపోతే, అందులోనూ హోంశాఖ సహాయ మంత్రి లేకపోతే దేశ వ్యవహారాలన్నీ ఎవరు నడిపిస్తారు? బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఈ అధికార అహంకార కారు వీడియోను జనం ముందుకు తెచ్చారు. కావాలని రైతుల వెనుకనుంచి దూసుకొచ్చి ఓ నల్ల ఎస్యూవీ కారు వారి శరీరాల మీదుగా వేగంగా నడిచిపోతున్నట్టు స్పష్టంగా ఉంది. రైతులే మంత్రి కారు మీద దాడి చేశారన్నది ప్రచారం. ‘ఈ వీడియో స్పష్టంగా ఉంది. నిరసనదారుల నోళ్లను హత్యల ద్వారా మూయలేరు. రోడ్డుమీద చిందిన అమాయక రైతుల నెత్తురుకు ఎవరు బాద్యత వహిస్తారు. ఈ క్రూర దురహంకార చర్యలను ఆపలేరనే సందేశం చేరకముందే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలగజేయా’లని వరుణ్ గాంధీ ట్వీట్ వ్యాఖ్య చేశారు. మంత్రిగారిని మంత్రివర్గం నుంచి తొలగించలేదు; కానీ వరుణ్, మేనకాగాంధీలను బీజేపీ కార్యవర్గం నుంచి అక్టోబర్ 7న తొలగించేశారు. ఇక అంతర్ ‘గత’ ప్రజాస్వామ్యం గురించి చెప్పేదేముంది! మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
Dharani Portal: ధరణిలో కాగితాలే ప్రామాణికం
సాక్షి, హైదరాబాద్: సర్వే నంబర్ తప్పులు, గల్లంతు, భూముల వర్గీక రణ, సంక్రమించిన విధానంలో జరిగిన పొరపాట్లు, విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు, పేరు వివరాల్లో తప్పొప్పులు, ఆధార్ నమోదు, డిజిటల్ సంతకాలు, పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాలు, నిషేధిత భూముల జాబితాలో పట్టా భూములు.. ఇవి ఇప్పుడు ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని వ్యవ సాయ భూముల విషయంలో రైతులు ఎదుర్కొం టున్న ప్రధాన సమస్యలు. కాగా ధరణి పోర్టల్లో ఎదురవుతున్న సమస్యల విష యమై ఆర్థిక మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కీలకాంశాలపై దృష్టి సారించాల్సి ఉందని భూచట్టాల నిపుణులు అంటున్నారు. కంప్యూటర్ రికార్డు సరిగా ఉండాలంటే దాన్ని సరిచూసుకునే మాన్యువల్ రికార్డు (కాగిత రూపంలోని పత్రాలు) కూడా ఉం టేనే సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు. కంప్యూటర్ రికార్డుకు ప్రామాణికంగా మరో రికార్డు లేకుండా ఇది సాధ్యం కాదని, 2004లో భూరికార్డుల కంప్యూటరీకరణ మొదలయినప్పటి నుంచీ ఈ విషయంలోనే సమస్యలు వస్తున్నాయని వారు పేర్కొంటున్నారు. గ్రామ పహాణీలు మాన్యువల్గా రాయాల్సిందే ముఖ్యంగా పాత మాన్యువల్ పహాణీలు క్షేత్రస్థాయి సమాచారానికి సరిపోలేలా లేవని నిపుణులు చెబుతున్నారు. భూరికార్డుల ప్రక్షాళన చేయకముందు సీఎం కేసీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారని, ఒక్కసారయినా మన పహాణీని మనం రాసుకుంటేనే ఈ పీడ పోతుందని ఆయన చెప్పిన ఆ మాట అమల్లోకి రాకపోవడమే ప్రధాన సమస్యగా మారిందన్నది వారి వాదన. వారి సూచన ప్రకారం.. ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న మెజార్టీ సమస్యలను గ్రామస్థాయిలోనే గుర్తించి పరిష్కారం కూడా చూపవచ్చు. ఇందుకోసం గ్రామ పహాణీని మాన్యువల్గా రాసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న పహాణీలను గ్రామసభ ముందుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించి సవరించిన పహాణీ నకలును తయారు చేయాల్సి ఉంటుంది. ఈ నకలును కంప్యూటర్లో రికార్డు చేయాలి. అప్పుడే ఒక గ్రామంలో ఎదురయ్యే భూ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించవచ్చు. సర్వే నంబర్ల వారీగా జరిగిన తప్పులను గుర్తించవచ్చు. ప్రతి ఎంట్రీని పరిశీలించి ఆ తప్పులకు సంబంధించిన సాక్ష్యాలను కూడా గ్రామాల్లోనే సేకరించవచ్చు. అంటే ఒక్కసారయినా మాన్యువల్గా పహాణీ రికార్డులను రాయాల్సిందేనన్నమాట. భూ సర్వేతోనే వివాదాలకు పరిష్కారం అలాగే కాలానుగుణంగా భూరికార్డుల సవరణలను పరిశీలించి, పరిష్కరించే ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నది భూచట్టాల నిపుణుల అభిప్రాయంగా కనిపిస్తోంది. అంటే ప్రతి యేటా లేదా రెండేళ్లకోసారి గ్రామాలకు వెళ్లి భూరికార్డులను పరిశీలించి సవరించిన రికార్డులకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే మాన్యువల్ రికార్డు క్షేత్రస్థాయి కొలతలతో సరిపోలాల్సి ఉంటుంది. ఇది జరగాలంటే భూముల సర్వే ఖచ్చితంగా నిర్వహించాల్సిందేనని, భూముల సర్వేతోనే వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిపుణులంటున్నారు. కలెక్టర్ల టైటిళ్లకు చట్టబద్ధత ఎంత? ప్రస్తుత ధరణి వ్యవస్థ ప్రకారం సాదాబైనామాలతో సహా అన్ని రకాల భూ సంబంధిత ఫిర్యాదుల (గ్రీవెన్సులు) పరిష్కారం కలెక్టర్లే చేయాల్సి వస్తోంది. వీఆర్వో, ఎమ్మార్వో, ఆర్డీవో, జేసీలు చేసే పనులన్నింటినీ కలిపి కలెక్టర్లు చేస్తున్నారు. అయితే, ఒక్క నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూముల విషయంలో తప్ప కలెక్టర్లు ఇచ్చే టైటిళ్లకు చట్టబద్ధత ఉండదని నిపుణులు వాదిస్తున్నారు. చట్టంలో లేనప్పుడు ఏ అధికారంతో కలెక్టర్లు సమస్యలు పరిష్కరిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)–1971 ప్రకారం మ్యుటేషన్పై తహశీల్దార్లకు, రికార్డుల్లో తప్పుల సవరణపై ఆర్డీవోలకు, వాటిని సరిచూసేందుకు జేసీలకు అధికారముండేది. కానీ కొత్తగా తెచ్చిన రెవెన్యూ చట్టంలో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని మాత్రమే తహశీల్దార్లకు కట్టబెట్టారు. కానీ, ఇతర ఏ అంశంలోనూ రెవెన్యూ వర్గాలకు భూ సమస్యల పరిష్కారంపై అధికారం ఇవ్వలేదు. కలెక్టర్ల అధికారాలను ప్రస్తావించలేదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సందర్భాల్లో కలెక్టర్లు ఇచ్చే టైటిల్ గ్యారంటీ కోర్టుల్లో నిలబడదన్నది వారి వాదనగా ఉంది. కలగాపులగంతోనే సమస్యల తీవ్రత వాస్తవానికి ధరణి పోర్టల్లో నమోదు చేసిన రికార్డులు రెవెన్యూ వర్గాల వద్ద అందుబాటులో ఉన్న మాన్యువల్ పహాణీ ఆధారంగా చేసినవి కావు. వెబ్ల్యాండ్, భూరికార్డుల ప్రక్షాళన యాప్, మా భూమి పోర్టల్, రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న 22(ఏ) జాబితా, గ్రామాలకు వెళ్లినప్పుడు రెవెన్యూ వర్గాలు అరకొరగా ఇచ్చిన సమాచారాన్ని కలగాపులగం చేసి ధరణి పోర్టల్లో నమోదు చేయడంతో రోజురోజుకూ ఈ సమస్యల తీవ్రత పెరిగిపోతోంది. ధరణి వ్యవస్థ ఏర్పాటు మంచిదే అయినా, భూలావాదేవీలకు పారదర్శక నిర్వహణకు ఈ పోర్టల్ ఆస్కారమిచ్చేదే అయినా రోజులు గడిచే కొద్దీ సమస్యలు పెరిగిపోయేందుకు ఇదే కారణమవుతోందని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మళ్లీ గ్రామాలకు వెళ్లి మాన్యువల్ పహాణీలను తయారు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. నిపుణుల సూచనలివే. ► భూరికార్డుల ప్రక్షాళన పేరిట 2007 సెప్టెంబర్ నుంచి 100 రోజుల ప్రణాళికతో చేపట్టిన విధంగానే మరోమారు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని భూసమస్యల పరిష్కారం కోసం గ్రామాలకు వెళ్లాలి. అక్కడ గ్రామ పహాణీని పరిశీలించి సవరించిన రికార్డులను ఆరా తీసి అక్కడికక్కడే సమస్యలతో పాటు వాటి పరిష్కారాలను గుర్తించాలి. సవరించిన పహాణీకి గ్రామసభ ఆమోదం పొంది దాన్ని మాన్యువల్గా తయారు చేయాలి. ఆ మాన్యువల్ రికార్డు ఆధారంగానే ధరణి పోర్టల్లో వివరాలు నమోదు చేయాలి. ► భూవివాదాల పరిష్కారానికి డివిజనల్, జిల్లా స్థాయిలో ప్రత్యేక అథారిటీలుండాలి. రెవెన్యూ కోర్టులా లేక ఇంకేదైనా పేరు పెట్టినా కనీసం జిల్లా స్థాయిలో అయినా ఈ వ్యవస్థ ఉండాల్సిందే. ► భాగ పంపకాలు లేదా భూయాజమాన్య హక్కుల వివాదాలను మాత్రమే సివిల్ కోర్టులకు పంపాలి. మిగిలిన అన్ని అంశాలను రెవెన్యూ వర్గాలు లేదా రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసే కోర్టులే పరిష్కరించాలి. ► సాదాబైనామాల సమస్యల పరిష్కారానికి గాను కొత్త ఆర్వోఆర్ చట్టంలో సవరణలు తీసుకురావాలి. ఈ చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు చట్టబద్దత లేదు. 9లక్షలకు పైగా ఉన్న సాదాబైనామాలను క్రమబద్ధీకరించి ఈ సమస్యను పరిష్కరించాలంటే ఆ అధికారం తహశీల్దార్లకు ఇచ్చి ఆజమాయిషీని కలెక్టర్ల పర్యవేక్షణలో ఉంచేలా చట్టాన్ని సవరించాలి. ► ధరణి పోర్టల్లో కనిపించే నిషేధిత భూముల జాబితాలో వివరాలు సరిగా నమోదు కాలేదు. తహశీల్దార్ దగ్గర, సబ్రిజిస్ట్రార్, కలెక్టర్ల వద్ద ఉండే నిషేధిత జాబితాల్లో తేడాలున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి తుది జాబితాను మళ్లీ ప్రచురించాలి. కంప్యూటర్లే సరిచేస్తాయనుకోవడం తప్పు భూముల రికార్డులన్నింటినీ కంప్యూటర్లే సరిచేస్తాయనుకోవడం తప్పు. కంప్యూటర్ రికార్డులు సరిగా ఉండాలంటే మానవ ప్రమేయంతో కూడిన కాగితం రికార్డులు ఉండాల్సిందే. తప్పులున్న రికార్డులను కంప్యూటర్లో పెట్టి ఇప్పుడు సరిచేసుకుంటూ పోతామంటే ఎలా సాధ్యమవుతుంది? సరిచేసిన రికార్డులను కంప్యూటర్లో పెట్టకపోతే వాటిని అది సరిచేయదు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే సరిచేసిన మంచి భూరికార్డును కంప్యూటర్లో పెట్టాలి. భూసమస్యల పరిష్కారంలో పేదలకు న్యాయ సహాయం చేసేందుకు పారాలీగల్ వ్యవస్థను పునరుద్ధరించాలి. – ఎం.సునీల్కుమార్, భూచట్టాల నిపుణులు చదవండి: బతుకమ్మ వేడుల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై -
‘రైతులను నాశనం చేసినవాళ్లు .. రాజకీయంగా ఎదిగినట్లు చరిత్రలేదు’
హైదరాబాద్: రైతులను నాశనం చేసినవాళ్లు.. రాజకీయంగా ఎదిగినట్లు చరిత్రలో లేదని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికార దాహంతో నలుగురు రైతులను కేంద్రమంత్రి కొడుకు పొట్టన బెట్టుకున్నాడని విమర్శించారు. అజయ్ మిశ్రా మాటల వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్షా ఉన్నారని తెలిపారు. అజయ్ మిశ్రాను అరెస్టు చేయడంలో యోగి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. చనిపోయిన రైతు కుటుంబాల పక్షాన దేశమంతా నిలబడాల్సిన తరుణంలో.. యోగి సర్కారు దీనికి భిన్నంగా.. రైతులను పరామర్శించడానికి వెళ్లిన ప్రియాంక గాంధీపై కర్కశంగా వ్యవహరించిందని మండిపడ్డారు. అజయ్ మిశ్రాను మంత్రి వర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శాంతి యుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై మోడీ, అమిత్షాలు మరణ శాసనం చేస్తే.. అజయ్ మిశ్రా ఆయన కొడుకు అమలు చేశారని మండిపడ్డారు. యూపీ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. ఈ ఘటనకు సంబంధించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని అన్నారు. చనిపోయిన రైతు కుటుంబాల కుటుంబానికి లక్ష చోప్పున ఆర్థిక సహయం అందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. చదవండి: రాబోయే రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్లు: కేసీఆర్ -
ధరణి పోర్టల్ ఉపసంఘం చైర్మన్గా హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్లో వ్యవసాయ భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చైర్మన్గా, సభ్యులుగా మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, జగదీష్రెడ్డి, నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వ్యవహరించనున్నారు. ఈ ఉప సంఘం కన్వీనర్గా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం ఉత్త ర్వులు జారీ చేశారు. ధరణి పోర్టల్ సమస్యలపై కమిటీ అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు ఇవ్వాలి -
పందుల ఉచ్చు.. ప్రాణం తీసింది
సాక్షి, స్టేషన్ఘన్పూర్ (వరంగల్): అడవి పందుల నుంచి మొక్కజొన్న చేనును రక్షించుకునేందుకు విద్యుత్ తీగతో అమర్చిన కంచె ఓ రైతు ప్రాణం తీయడంతో పాటు మూడు మేకల మృతికి కారణమైంది. ఈ సంఘటన మండల పరిధి ఛాగల్లు శివారు కమ్మరిపేటలో గురువారం చోటుచేసుకుంది. కమ్మరిపేటకు చెందిన పెసరు సోమయ్య(50) చిన్నాన్న పెసరు మల్లయ్య.. గ్రామానికి చెందిన శ్యామ్సుందర్రెడ్డి వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్నాడు. మొక్కజొన్న పంట సాగుచేస్తున్న మల్లయ్య అడవి పందుల సమస్య నివారణకు చేనుచుట్టూ విద్యుత్ తీగను ఏర్పాటు చేసుకున్నాడు. గురువారం సాయంత్రం మేకలను తోలుకుని అటువైపు వచ్చిన పెసరు సోమయ్య చేను పక్కన ఉన్న విద్యుత్ తీగ కాలికి తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే మూడు మేకలు సైతం విద్యుదాఘాతంతో మృతిచెందాయి. ఎస్సై రమేష్నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య సోమలక్ష్మి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
యువకులకు ఉద్యోగాలు.. రైతులకు రుణాలు ఇప్పిస్తామని చెప్పి..
సాక్షి, నల్లగొండ క్రైం: నిరుద్యోగులకు ఆకర్శణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తామని, రైతులకు 40శాతం, 60శాతం సబ్సిడీతో ట్రాక్టర్, మోటార్సైకిల్లు, జేసీబీలు, ఇప్పిస్తామని కుచ్చుటోపీ పెట్టిన నేరస్తుడితోపాటు సహకరించిన మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక ప్రకటనలో డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి యాదాద్రి జిల్లా రామాజపురం గ్రామానికి చెందిన వీరవల్లి ప్రదీప్రెడ్డి చైర్మన్గా మరో 14మంది సభ్యులతో వీఎస్వీపీ ప్రైవేటు కంపెనీ నిర్వహిస్తున్నారు. వీరు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 100 మంది వద్ద నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. రంగారెడ్డి , ఖమ్మం, భూపాలపల్లి, కామారెడ్డి, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, జనగాం జిల్లాల నందు వీఎస్వీపీ ప్రైవేటు కంపెనీ పేరిట ఉద్యోగాలు, రైతులకు ట్రాక్టర్లు, జేసీబీలు , బైక్లు ఇప్పిస్తామని లక్షల్లో వసూలు చేసి వారికి కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. రూ. 3కోట్లకు పైగా వసూలు... 2019లో ఉద్యోగాలు, ట్రాక్టర్లు, జేసీబీలు ఇప్పిస్తామని రూ.1.8కోట్లు వసూలు చేయగా 2020లో 2కోట్లపైగా వసూలు చేశారు. సంస్థ పేరు మీద నమ్మదగిన ప్రకటనలు ఇస్తూ మాయ మాటలు చెప్పి నిరుద్యోగులు, రైతులను మోసగించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే 100 మంది నిరుద్యోగులు 5లక్షలోపు ఉద్యోగాల కోసం చెల్లించినట్లు , రైతులకు సబ్సిడీ పై జేసీబీలు, ట్రాక్టర్లు , బైక్లు ఇప్పిస్తామని ఈఎంఐలు కంపెనీ చెల్లిస్తుందని రైతులు తమ వాటాగా లక్షన్నర కడితే సరిపోతుందని నమ్మబలికి వసూలు చేశారు. ఇలా వెలుగులోకి .. పేపర్లో వీఎస్వీపీ కంపెనీ పేరిట ఉద్యోగాలు ఇస్తామని 2019లో ప్రకటన రావడంతో ఈఏడాది ఏప్రిల్19న నల్లగొండ మండలం మేళ్ల దుప్పలపల్లి గ్రామానికి చెందిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంకట్రెడ్డి వీఎస్వీపీ కంపెనీ నందు కాంట్రాక్టు ఉద్యోగం కోసం రూ.1.50లక్షలు చెల్లించాడు. బీఎస్ఎన్ఎల్లో కాంట్రాక్టు జాబ్ ఇప్పిస్తామని చెప్పి వీఎస్వీపీలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా ఎంపికైనట్లు జాయినింగ్ ఆర్డర్ను ఇచ్చారు. శిక్షణ పేరుతో కాలయాపన చేస్తూ జీతాలు ఇవ్వకుండా అనేక మంది నిరుద్యోగుల నుంచి డీడీల రూపంలో డబ్బులు తీసుకుని కంపెనీలోనే జాయిన్ చేసుకున్నారు. వందలాదిమందికి ఉద్యోగాలపై శిక్షణ ఇస్తున్నట్లుగా నమ్మబలికించారు. నిరుద్యోగులంతా సంస్థ చైర్మన్ వీరవల్లి ప్రదీప్రెడ్డిని ఇంకెంతకాలం అంటూ నిలదీయడంతో సంస్థకు అగ్రికల్చర్ ప్రాజెక్టు వచ్చిందని అందులో పనిచేస్తేనే జీతాలు ఇస్తామని నిరుద్యోగులను బెదిరించి సంస్థలో పని చేయించుకున్నారు. 13 మందికి ట్రాక్టర్లు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ద్వారా 13మందికి ట్రాక్టర్లు, ఇద్దరికి బైక్లు సంస్థ సబ్సిడీ ఇస్తుందని ఇప్పించారు. ఒకొక్క రైతు నుంచి 1లక్ష50వేలు వీఎస్వీపీ సంస్థకు చెల్లించారు. 60శాతం సబ్సిడీ వస్తుందని నమ్మబలికారు. ఈఎంఐలు తామే కడుతామని చెప్పారు. ఈఎంఐలు కట్టకుండా వీఎస్వీపీ సంస్థవారు తప్పించుకొని తిరుగుతున్నారు. ఇదే కేసులో కుశాయిగూడ కామారెడ్డి పోలీస్ స్టేషన్లో సంస్థ చైర్మన్ వీరవల్లి ప్రదీప్రెడ్డి, డైరెక్టర్ నవీన్రెడ్డిల పై గతంలో కేసులు నమోదయ్యాయి. ఇలా పట్టుకున్నారు నల్లగొండలోని రవీంద్రనగర్ కాలనీలో వీఎస్వీపీ కార్యాలయానికి వస్తుండగా సంస్థ చైర్మన్ ప్రదీప్రెడ్డి, నవీన్రెడ్డి , సంస్థలో పనిచేస్తున్న బిట్ల సాయి, జ్ఞానేశ్వర్, శ్రీనులను పట్టుకున్నట్లు తెలిపారు. పరారీలో మరి కొందరు.. బారీ ఎత్తున ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి కోట్లాదిరూపాయలు వసూలు చేసిన వారిలో కొందరు నేరస్తులు పరారీలో ఉన్నారు. కారుకొండ వరప్రసాద్ , వీరవల్లి స్వాతి, కలమతుల్ల సతీష్రెడ్డి, కోమట్ల నవీర్రెడ్డి, సంజయ్ , శరత్, జలజ, సాయిరాం, అనుపమ, దివ్వా, తదితరులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆంతర్యమేంటి..? నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు పత్రికా ప్రకటనలో పేర్కొన్న పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించకపోవడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. ఏ ఉద్యోగానికి ఎంత డబ్బులు తీసుకున్నారు ..? ఏఏ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికించారు...? ఉద్యోగాల జాయినింగ్ ఆర్డర్ ఇచ్చిన ఉత్తర్వుల కాపీ ఎక్కడ ప్రింట్ చేశారు. ...? ఇతర వివరాలేవీ వెల్లడించకపోవడంతోపాటు మీడియా ముందు ప్రవేశపెట్టకపోవడంపై అనేక చర్చలకు దారితీస్తుంది. -
మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తల్లి కన్నుమూత
సాక్షి, బోధన్,(నిజామాబాద్): కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మాతృమూర్తి రుక్మవ్వ (95) ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని మంత్రి సోదరుడు సురేందర్రెడ్డి స్వగృహంలో కన్నుమూశారు. సోమవారం హైదరాబాద్లోని జూబ్లిహిల్స్లోని మహాప్రస్తానంలో అంత్యక్రియలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మాజీ మంత్రి పీఎస్ఆర్ మాతృమూర్తి మృతి పట్ల ఆ పార్టీ నియోజక వర్గం, మండల నాయకులు పాషామోహినోద్దీన్, అబ్బగోని గంగాధర్ గౌడ్, దామోదర్ రెడ్డి పలువురు ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. నిరుపేద స్నేహితుడి కుమార్తె పేరిట రూ.20 వేల డిపాజిట్ భిక్కనూరు: స్నేహితుల దినోత్సవం రోజు వారు తమ మిత్రుడికి అండగా నిలిచారు. భిక్కనూరుకు చెందిన అక్కల సంతోష్ ఇల్లు ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కాలిపోయింది. ఇంట్లోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సంతోష్ సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నాడు. ఆయన ఇల్లు కాలిపోయిన విషయం తెలుసుకున్న బాల్య మిత్రులు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం చేయూత అందించారు. సంతోష్ కుమార్తె పేరిట రూ.20 వేలు బ్యాంకులో డిపాజిట్ చేసి, ఆ బాండును అందజేశారు. మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు దుస్తులు అందజేశారు. అలాగే కుమార్తె పెళ్లి కోసం బెంగ పెట్టుకోవద్దని సంపూర్ణంగా ఆదుకుంటామని తమ బాల్య మిత్రుడు సంతోష్కు భరోసా ఇచ్చారు. -
‘అవ్వా.. మీకు భూములిప్పిస్తా.. బువ్వ తినిపిస్తా’
సాక్షి, గూడూరు(వరంగల్): ‘ మీ పోడు భూములు ఇప్పిస్తా.. అండగా ఉంటా’ అని ఓదార్చి తనకోసం తెచ్చుకున్న భోజనాన్ని అక్కడున్న మహిళా రైతులకు తినిపించాడు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని బొల్లెపల్లి శివారు వాయిల్బంధం సమీపంలోని పోడు భూములను పరిశీలించడానికి ఎమ్మెల్యే శంకర్నాయక్ మంగళవారం అక్కడికి చేరుకున్నారు. ఆ సాగు భూముల వివరాలను నాయకులు, అక్కడి రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు.. అప్పటికే సమయం 10 గంటలు కావడంతో తన కారులోని టిఫిన్ బాక్సును తీసుకునిరా అని డ్రైవర్కు చెప్పాడు. అక్కడే ఉండి ఎమ్మెల్యే మాటలు వింటున్న మహిళా రైతులు కొందరు ‘అయ్యా..ఫారెస్టో ల్లు మా భూములు గుంజుకొని మాకు బువ్వ లేకుండా చేయాలని చూస్తుర్రు, మీకైతే ఎక్కడ బడితె అక్కడికి బువ్వొస్తుంది. మా గతేంటి’ అని వాపోయారు. ఆ మాటలను విన్న ఎమ్మెల్యే.. మహిళలను చూస్తూ ‘అవ్వా..ఓ తల్లులూ..మీ భూములు ఎటూ పోవు, ఇప్పించే బాధ్యత నాది. ఇగరాండి’...అంటూ పిలిచారు. ‘మీకు భూములప్పిస్తా...బువ్వ తినిపిస్తా’నంటూ ఎమ్మెల్యే తన టిఫిన్ బాక్సులోని అనాన్ని ముద్దలు కలిపి తినిపించారు. ఈ సంఘటను అక్కడున్న నాయకులు, అధికారులు ఆసక్తిగా గమనించారు. -
వార్డు మెంబర్ బాగోతం.. 72 గుంటల స్థలాన్ని ఆన్లైన్ చేయిస్తానని..
సాక్షి, కోరుట్ల(ఆదిలాబాద్): నమ్మితే.. వృద్ధుడిని మోసగించిన ఓ వార్డు మెంబర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కోరుట్ల సీఐ రాజశేఖర్రాజు కథనం ప్రకారం.. కోరుట్ల మండలం అయిలాపూర్కు చెందిన అగ్గ ఆశన్న(60)కు 3.24 ఎకరాల భూమి ఉంది. ఇందులో కేవలం 72 గుంటలకు మాత్రమే అతని పేరిట ధరణిలో ఆన్లైన్ అయ్యింది. దీంతో మిగతా భూమిని ఆన్లైన్ చేసేందుకు అదే గ్రామానికి చెందిన వార్డు మెంబర్ పాశం విజయ్కుమార్ను కలిశాడు. ధరణిపై ఆశన్నకు అవగాహన లేని విషయాన్ని గ్రహించిన అతను తాను సాదాబైనామా కింద 72 గుంటల స్థలాన్ని ఆన్లైన్ చేయిస్తానని నమ్మించాడు. ఆ తర్వాత రెవెన్యూ సిబ్బందికి, తహసీల్దార్కు లంచాలు ఇవ్వాలని పలు దఫాలుగా రూ.4.30 లక్షలు వసూలు చేశాడు. గత ఫిబ్రవరి 18న సాదాబైనామాతో 72 గుంటల భూమిని ఆన్లైన్ చేస్తారని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి సంతకాలు పెట్టాలని ఆశన్నకు చెప్పాడు. విజయ్కుమార్ మాటలు నమ్మిన ఆయన అడిగిన చోట సంతకాలు పెట్టి, అప్పటినుంచి తన భూమి ఆన్లైన్లో వస్తుందని ఎదురుచూశాడు. కానీ ఆన్లైన్లో భూమి వివరాలు రాకపోగా ఇదివరకే పట్టా ఉండి, ఆన్లైన్లో ఉన్న 72 గుంటల భూమిని ఆశన్న నుంచి పాశం విజయ్కుమార్ కొనుగోలు చేసినట్లుగా నమోదవడంతో ఆందోళనకు గురయ్యాడు. తనకు జరిగిన మోసాన్ని గుర్తించి, వెంటనే తహసీల్దార్ సత్యనారాయణకు, కోరుట్ల రాజశేఖర్రాజుకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ దర్యాప్తు చేయాలని ఎస్సై రాజప్రమీలకు ఆదేశించారు. పోలీసుల విచారణలో విజయ్కుమార్ రెవెన్యూ అధికారుల పేరిట డబ్బులు దండుకోవడమే కాకుండా ఆశన్న భూమిని తన పేరిట మార్చుకున్నట్లు తేలింది. విజయ్కుమార్ గతంలో పైడిమడుగులో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడని సీఐ తెలిపారు. ఆశన్న ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొంతమంది దళారులు భూములను ఆన్లైన్ చేయిస్తామని డబ్బులు దండుకుంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నిజమని తేలితే నిందితులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే కలెక్టర్ స్పందించి, భూమిని మళ్లీ తన పేరిట మార్పించి, ఆదుకోవాలని బాధితుడు ఆశన్న వేడుకుంటున్నాడు. -
నట్టేట ముంచిన నకిలీ విత్తనం..!
సాక్షి, మంచిర్యాల అగ్రికల్చర్: నిషేధిత, నకిలీ పత్తి విత్తనాలు ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే రైతులను నట్టేట ముంచాయి. మొలకెత్తకపోవడంతో వేలాది రూపాయలు మట్టిపాలయ్యాయి. అధికారులకు ఫిర్యాదు చేస్తే గుర్తింపు లేని విత్తనాలు కొనుగోలు చేసినందుకు కేసు నమోదు చేస్తారనే భయంతో ఆవేదనను దిగమింగుతున్నారు. సీజన్ ఆరంభానికి ముందే గుర్తింపు లేని, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసులు, అధికారులు ప్రయత్నిస్తున్నా రైతులను చేరాయి. లూజుగా దొరికే పత్తి విత్తనాలు కిలో రూ.2 వేల నుంచి రూ.2,200 చొప్పున కొనుగోలు చేసి విత్తుకున్నారు. ఎవరి వద్ద కొనుగోలు చేశారో వారిని నిలదీస్తే.. డబ్బు ఇవ్వడం కుదరదని, దాచిన విత్తనాలు ఏమైనా ఉంటే మళ్లీ వేసుకోవాలని, వచ్చే ఏడాది మంచి విత్తనాలు ఇస్తామని సముదాయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తప్పని పరిస్థితుల్లో మళ్లీ దుక్కి దున్ని విత్తనాలు వేసుకుంటున్నారు. సీజన్ ముందే అందడంతో.. నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు గుర్తింపు లేని, నకిలీ విత్తనాలు, గ్లైపొసెట్ గడ్డిమందు పట్టుకొని పీడీ యాక్టు వంటి కేసులు నమోదు చేస్తున్నారు. అక్రమార్కులను జైలుకు పంపించారు. గతంలో కంటే ఈ ఏడాది 70 శాతం రైతుల దరిచేరకుండా చూసినా మరో 20 నుంచి 30 శాతం వరకు ఫిబ్రవరి, మార్చి నెలలోనే గ్రామాల్లోకి విత్తనాలు చేరాయి. మారుమూల ప్రాంతాల్లో, చేన్లలో కవర్లతో భద్రపరిచారు. ఎవరికీ అనుమానం రాకుండా గుర్తింపు ఉన్న కంపెనీ పత్తి విత్తనాల ప్యాకెట్లలో కలిపి నకిలీ విత్తనాలు వేసుకున్నారు. జూన్ రెండో వారం నుంచి కురిసిన భారీ వర్షాల అనంతరం విత్తుకున్నారు. కొన్ని చోట్ల విత్తనం మొలక శాతం 90 శాతం ఉండగా భీమిని, కన్నెపెల్లి, నెన్నెల, బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట మండలాల్లో కొన్ని చొట్ల 10 నుంచి 30 శాతమే మొలక వచ్చిందని రైతులు వాపోతున్నారు. విత్తనం నాటిన వారం రోజుల్లో మొలక రావాల్సి ఉంటుంది. నేలలో తేమ శాతం బాగానే ఉన్నా 15 రోజుల నుంచి 20 రోజులు గడిచినా మొలక రాలేదని ఆందోళన చెందుతున్నారు. దుఃఖాన్ని దిగమింగి.. నెన్నెల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ రైతు 20 ఎకరాల్లో వేసేందుకు ఈ విత్తనాలు రూ.50 వేలకు కొనుగోలు చేశాడు. దుక్కి, విత్తన సాల్లకు రూ.10 వేలు, విత్తేందుకు కూలీలకు రూ.8 వేలతో వెచ్చించాడు. 10 నుంచి 20 శాతం మాత్రమే మొలక రావడంతో రూ.80 వేల వరకు నష్టపోయాడు. బయటకు చెప్పుకోలేక.. బయటకు వస్తే అధికారులకు తెలిసిపోతుందని దుఃఖాన్ని దిగమింగి మరోసారి విత్తనాలు వేసేందుకు దున్ని సిద్ధపడ్డాడు. చదవండి: జీఎస్టీతో తగ్గిన పన్నుల భారం -
6100 కోట్ల రైతు రుణ మాఫీ
రాయ్పూర్/గువాహటి/ భువనేశ్వర్: దాదాపు రూ.6,100 కోట్ల స్వల్పకాలిక పంట రుణాలను మాఫీ చేస్తామని ఛత్తీస్గఢ్ కొత్త ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ప్రకటించారు. బఘేల్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఏడాది నవంబర్ 30వ తేదీలోపు సహకార బ్యాంకులు, ఛత్తీస్గఢ్ గ్రామీణ బ్యాంకుల నుంచి 16.65 లక్షల మంది రైతులు తీసుకున్న రూ.6,100 కోట్ల మేర రుణాలను మాఫీ చేస్తామని వెల్లడించారు. రుణమాఫీతో పాటు వరి కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) క్వింటాలుకు రూ.2,500కు పెంచుతామన్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చే దిశగా అడుగు పడినట్లయింది. అదే బాటలో అసోం.. సుమారు 8 లక్షల మంది రైతులకు చెందిన రూ.600 కోట్ల రుణాలను రద్దు చేయనున్నట్లు అసోంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల రైతు రుణాల్లో 25 శాతం వరకు రద్దు అవుతాయి. దీంతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పంట రుణాలపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకున్న రుణాల్లో రూ.10వేల సబ్సిడీ ఇస్తామని తెలిపారు. మేమూ చేస్తాం ఒడిశా బీజేపీ తమకు అధికారమిస్తే రైతుల రుణాలన్నిటినీ రద్దు చేస్తామని ఒడిశా బీజేపీ వాగ్దానం చేసింది. రాష్ట్రంలో 2019లో ఎన్నికలు జరగనున్నాయి. ‘2019 ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణాలన్నీ రద్దు చేస్తాం. రైతులకు వడ్డీలేని రుణాలిస్తాం’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బసంత్ పాండా తెలిపారు. ఇదే హామీని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ ఇంతకుమునుపే ఇచ్చారు. -
పెథాయ్ ఎఫెక్ట్ భారీ నష్టం
-
విత్తన కష్టం తీరనుందా?
రైతు ఎదుర్కొంటున్న అనేకానేక కష్టాల్లో నాణ్యమైన విత్తనం దొరకడం ఒకటన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు పండిన పంట నుంచే మరుసటి పంటకు విత్తనాలను సేకరించేవారుగానీ.. దీనివల్ల దిగుబడులు క్రమేపీ తగ్గేవి. పైగా చీడపీడల బాధ కూడా ఎక్కుయ్యేది. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. మాత పంటకు అచ్చమైన నకలుగా విత్తనం కూడా ఉండేలా చేసేందుకు వీరు ఒక పద్ధతిని కనుక్కున్నారు. ఫలితంగా ఏటా హైబ్రిడ్ విత్తనాల కోసం రైతులు శ్రమపడాల్సిన అవసరం ఉండదన్నమాట. అధిక దిగుబడులనిచ్చే.. చీడపీడలను, వాతావరణ మార్పులను కూడా తట్టుకోగల వంగడాలను వేగంగా ప్రపంచం నలుమూలలకు విస్తరించేందుకు ఈ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త వెంకటేశన్ సుందరేశన్ తెలిపారు. ప్రస్తుతం తాము వరి మొక్కలోని ప్రత్యేక జన్యువును గుర్తించామని.. దీంట్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా కణ విభజన ప్రక్రియలో భాగంగానే విత్తనాలు కూడా ఏర్పడేలా చేశామని వివరించారు. ఫలితంగా ఫలదీకరణ అన్నది లేకుండానే విత్తనాలు పుట్టుకొస్తాయని తెలిపారు. వరితోపాటు పప్పు ధాన్యాల మొక్కల్లోనూ ఈ జన్యువు ఉంటుంది కాబట్టి.. వాటిల్లోనూ తల్లి మొక్కను పోలిన విత్తనాలు వృద్ధి చేసేందుకు అవకాశముందని సుందరేశన్ తెలిపారు. -
కొత్తకుంటకు జలకళ
గన్నేరువరం : మిడ్ మానేరు నీటితో మండలంలోని వివిధ గ్రామాల్లోని చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకుంటుంది. మండలంలోని మాధాపూర్ గ్రామం కొత్తకుంటకు మిడ్ మానేరు నీటిని డిస్ట్రిబ్యూటర్ 9 ఉపకాల్వ ద్వారా విడుదల చేశారు. ఆ నీటితో కుంట నిండుకోవడంతో జలకళ వచ్చింది. రాజన్న సిరిసిల్లా జిల్లా బోయినిపల్లి మండలంలోని కొదురుపాకలో నిర్మించిన మిడ్ మానేరు నుంచి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామం వరకు గతంలో 34 కిలోమీటర్ల వరదకాల్వను పూర్తి చేశారు. మండలంలోని చీమలకుంటపల్లె, గునుకుల కొండాపూర్, పీచుపల్లి గ్రామాల మీదుగా మిడ్ మానేరు కుడికాల్వ నిర్మాణం ఉంది. అలాగే ఈ ఏడాది తోటపల్లి గ్రామంలో తోటపల్లి రిజర్వాయర్ను పూర్తి చేసి గత నెల 11వ తేదీన దీనిలోకి మిడ్మానేరు కుడికాల్వ ద్వారా నీటి పారుదలశాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ రిజర్వాయర్ నిండుకుని కుడికాల్వలో బ్యాక్వాటర్ పెరిగింది. ఈ క్రమంలో ఈ నీటిని అక్టోబర్లో డిస్ట్రిబ్యూటర్ 4 ఉపకాల్వ ద్వారా గన్నరువరం గ్రామ చెరువుకు, పారువెల్ల గ్రామ పంట పొలాలకు నీటిని విడుదల చేశారు. బుధవారం ఖాసీంపేట గ్రామంలోని డిస్ట్రిబ్యూటర్ 8 ఉప కాల్వకు విడుదల చేశారు. తాజాగా మాధాపూర్ గ్రామానికి నీటిని విడుదల చేసి కొత్తకుంటను నింపడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బావుల్లో భూగర్భజలాలు పెరగడానికి దోహదపడుతుందని అంటున్నారు. కుడికాల్వలో నీటినిల్వతో దాని సమీపంలోని బావుల్లో, బోరుబావుల్లో భూగర్భజలాలు పెరిగినట్లు చీమలకుంటపల్లెకు చెందిన శ్రీనివాస్ తెలిపారు. రబీలో వరిసాగు చేయడానికి అనుకూలంగా మారిందని పేర్కొంటున్నారు. -
ఐదులక్షల మందితో పార్లమెంటు ముట్టడిస్తాం
తిరువొత్తియూరు: రైతు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయని పక్షంలో నవంబర్ 20న ఐదు లక్షల మంది రైతులతో కలిసి పార్లమెంటు ముట్టడి చేయనున్నట్టు రైతు సంఘాల అధ్యక్షుడు అయ్యాకన్ను తెలిపారు. నదులను అనుసంధానించాలని, రైతుల డిమాండ్లను నెరవేర్చాలని జాతీయ దక్షిణ భారత నదుల సంధానం రైతుల సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను నేతృత్వంలో తమిళనాడు రైతులు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుచ్చిలో జరిగిన ఓ కార్యక్రమానికి శుక్రవారం హాజరైన అయ్యాకన్ను పత్రికల వారితో మాట్లాడుతూ 41 రోజులుగా నిరవధిక ఆందోళన చేస్తున్నామని రెండవ ఘట్టంగా రోజూ ఒక్కో విధానంలో జంతర్మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నామని ఈ ఆందోళనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెవిన పడలేదని ఈ చర్య వలన దేశానికి వెన్నముకగా పిలవబడే రైతులు మోసపోయినట్టు తెలిపారు. ఈ కారణంగా తమిళనాడు రైతులు, ఉత్తర రాష్ట్రాలకు చెందిన రైతులతో కలిపి ఐదు లక్షల మందితో నవంబర్ 20వ తేదీన పార్లమెంటు శీతాకాల సమావేశం ప్రారంభం రోజున ముట్టడి చేయనున్నట్టు తెలిపారు. -
అన్నదాత ఆక్రోశం
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు ఎండిన వరి దుబ్బులతో నిరసన పెనుగొండ: సాగు నీటి ఎద్దడితో పంట చేలు ఎండిపోతున్నాయంటూ రైతులు రోడ్డెక్కారు. వంతుల వారీ విధానంలోనూ నీటిని అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందంటూ వందలాది మంది రైతులు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో పెనుగొండ మండలంలోని రామన్నపాలెం వద్ద రాస్తారోకోకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాదాపు రెండు గంటలకుపైగా రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ను స్తంభింపజేశారు. ప్రతి ఎకరాకు నీరందిస్తామంటూ అధికారులు దాళ్వా ప్రారంభంలో నమ్మించి నిండా ముంచేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగు మధ్యలో నీరు అందకపోవడంతో దిక్కుతోచని స్థిలిలో ఉన్నామన్నారు. ఆచంట కాలువ పరిధిలోని వడలి, రామన్నపాలెం, తామరాడ ప్రాంతాల్లో సుమారు మూడు వేల ఎకరాలు ఎండిపోతున్నాయన్నారు. ఎండిన వరి దుబ్బులను నెత్తిన పెట్టుకుని నిరసన తెలిపారు. పత్తాలేని నీటి సంఘ నాయకులు రైతులు మూకుమ్మడిగా రోడ్డెక్కి నిరసన తెలిపినా నీటి సంఘాల నాయకులు, నీటి పారుదల శాఖ ఇంజినీర్లు పత్తా లేకుండాపోయారు. కనీస సమాధానం చెప్పడానికి కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వచ్చేంత వరకూ కదిలేది లేదని భీష్మించారు. కొద్దిసేపటికి నీటిపారుదల శాఖ సూపర్వైజర్ అబ్బులు రావడంతో ఏఎస్సై బి.నాగిరెడ్డి సమక్షంలో కౌలు రైతు సంఘ నాయకడు గుర్రాల సత్యనారాయణ చర్చలు జరిపారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాగు నీరందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. రైతులు యర్రంశెట్టి భాస్కరరావు, ముద్రౌతు త్రిమూర్తులు, పేరాబత్తుల సత్యనారాయణ, పేరాబత్తుల రామలింగేశ్వరరావు, చిట్యాల వీరన్న, జక్కం కృష్ణారావు తదితరులు నాయకత్వం వహించారు. శాశ్వత ఎత్తిపోతల పథకం ప్రారంభించాలి సార్వా, దాళ్వా సాగులకు నీటి ఎద్దడి రాకుండా దొంగరావిపాలెం వద్ద శాశ్వత ఎత్తిపోతల పథకం ప్రారంభించాలని సీపీఎం మండల కార్యదర్శి సూర్నిడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. వంతుల వారీ విధానంతో రైతులను దగా చేస్తున్నారని విమర్శించారు. -
బడ్జెట్ అంతా అంకెల గారడి: రామకృష్ణ
కడప: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంతా అంకెల గారడిలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో రెండంకెల వృద్ధి జరిగితే.. వలసలు ఎందుకు ఆగడంలేదని, 950 మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లాలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన రామకృష్ణ.. గత ఏడాది ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను పూర్తిగా వాడలేదని అన్నారు. గత ఏడాది కేటాయింపులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
రైతు నెత్తిన కి’రాయి’
ధాన్యం రవాణా సొమ్ము మిల్లర్ల ఖాతాల్లోకి తేమ శాతం ఎక్కువగా చూపి మద్దతు ధరలోనూ కోత భీమవరం : ఓ వైపు పెద్దనోట్ల రద్దు ప్రభావం.. మరోవైపు ఇన్పుట్ సబ్సిడీ, బ్యాంకు రుణాలు అందక అవస్థ పడుతున్న రైతులు ధాన్యం అమ్మకం విషయంలోనూ నిలువునా దోపిడీకి గురవుతున్నారు. రైతులను ఆదుకోవాల్సిన సర్కారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కేవలం కమీషన్ల కోసమే పనిచేయడం.. అధికారులు పట్టించుకోకపోవడంతో అన్నదాతలు నష్టాల పాలవుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించిన రైతులకు అందాల్సిన రవాణా చార్జీ (కిరాయి)లను మిల్లర్లు తన్నుకుపోతున్నారు. మరోవైపు ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నట్టు చూపించి రైతులకు చెల్లించాల్సిన సొమ్ములో కోత విధించి దోపిడీ చేస్తున్నారు. సాగిపోతోంది నిబంధనల ప్రకారం ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసి ఆ తరువాత మిల్లర్లకు ఇవ్వాలి. ధాన్యం సొమ్ముతోపాటు బస్తాలను కొనుగోలు కేంద్రానికి తరలించినందుకు గాను రవాణా చార్జీలను ప్రభుత్వమే రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు అప్పగించిందుకు గాను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కమీషన్ చెల్లిస్తారు. కొన్ని సందర్భాల్లో రవాణా చార్జీలను ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే రైతులకు చెల్లించి.. అనంతరం ప్రభుత్వం నుంచి వారు పొందేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా భిన్నంగా నడుస్తోంది. కొందరు రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించగా, కొన్నిచోట్ల దళారుల సాయంతో మిల్లర్లే వ్యవసాయ క్షేత్రాల నుంచి నేరుగా ధాన్యం సేకరించారు. ఐకేపీ కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై.. ఆ ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలే రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు, అక్కడి నుంచి మిల్లులకు చేరవేసినట్టు రికార్డుల్లో నమోదు చేయిస్తున్నారు. ఆ ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తూ.. ఒక శాతానికి రూ.30 చొప్పున కోత వేస్తున్నారు. ఇలా ప్రతి రైతు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు నష్టపోతున్నారు. ఇలా చేయడం వల్ల ధాన్యం తరుగు రూపంలో రైతులకు నష్టం కలుగుతుండగా, ఆ మేరకు మిల్లర్లు లాభపడుతున్నారు. ఉదాహరణకు రైతు నుంచి 100 బస్తాల ధాన్యాన్ని మిల్లర్ నేరుగా తీసుకెళ్లి.. ఒక శాతం ఎక్కువ తేమ ఉన్నట్టు చూపిస్తే, ఆ ధాన్యం ఆరిన తరువాత సుమారు 50 కేజీల బరువు తగ్గిందనుకుంటే.. దానిని తరుగుగా నమోదు చేస్తారు. నిజానికి 17 శాతం తేమ శాతం ఉంటే ధాన్యం తరుగు ఉండదు. అంటే ఒక శాతం తేమ ఎక్కువ ఉన్నట్టు చూపిస్తే మిల్లర్కు 50 కేజీల ధాన్యం (అంచనా మాత్రమే) మిగులుతుంది. ఒక శాతం తేమ ఎక్కువ ఉన్నందుకు రైతు క్వింటాల్కు రూ.30 నష్టపోతాడు. మరోవైపు రైతుల నుంచి నేరుగా తాము ధాన్యం కొనుగోలు చేసి బస్తాకు రూ.60 చొప్పున ఎక్కువ ధర చెల్లిస్తున్నట్టు మిల్లర్లు చెబుతున్నప్పటికీ.. తేమ శాతం 17కంటే ఎక్కువ ఉన్నట్టు చూపించి ధరలో కోత వేస్తున్నారు. మరోవైపు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లలకు తరలించినందుకు తమకు రవాణా చార్జీలు చెల్లించాల్సి ఉందంటూ.. మొత్తం సొమ్మును మిల్లర్లే కాజేస్తున్నారు. దీనివల్ల కొనుగోలు కేంద్రాలకు నేరుగా ధాన్యం తరలించిన రైతులకు రవాణా చార్జీలు అందటం లేదు. ఆ మొత్తాన్ని కూడా మిల్లర్ల ఖాతాలోనే అధికారులు జమ చేస్తున్నారు. జిల్లాలో సార్వా సీజన్లో సుమారు 5.94 లక్షల ఎకరాల్లో రైతులు వరి పండించగా, సుమారు 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం 161 ఐకేపీ కేంద్రాలు, 96 వ్యవసాయ సహకార పరపతి సంఘాల వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు సుమారు 75వేల మంది రైతుల నుంచి సహకార సంఘాలు సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నులు, ఐకేపీ కేంద్రాలు సుమారు 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. తేమ పేరుతో రూ.30 వేలు నష్టపోయా నాకు 8 ఎకరాల సొంత భూమి ఉంది. వరి సాగు చేయగా ఎకరాకు 25 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. మొత్తం ధాన్యాన్ని మిల్లుకు తోలాను. తేమ శాతం ఎక్కువగా ఉందని బస్తాకు కేవలం రూ.950 మాత్రమే చెల్లించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర చేతికి అందకపోవడం వల్ల దాదాపు రూ.30 వేలు నష్టపోయాను. కాగిత దాననాగేశ్వరరావు, రైతు, రాయకుదురు -
10న జిల్లా స్థాయి రైతు సదస్సు
చింతలపూడి : చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతుల సమస్యలపై ఈనెల 10న స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో జిల్లాస్థాయి రైతుల సదస్సును ఏర్పాటు చేసినట్టు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత ఘంటా మురళీరామకృష్ణ సోమవారం తెలిపారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 2018లోగా పూర్తి చేయడంతో పాటు, రైతులకు నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరిపై మేధావులు, రైతు సంఘాల నాయకులు చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. రైతులు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు జిల్లాలోని రైతులు, రైతు సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు, రైతులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. -
రైతును ముంచేస్తారా..!
–ఆధునికీకరణపై అలసత్వం వీడండి –డెల్టాకు ఇబ్బంది వస్తే పట్టిసీమను కట్టేయండి –నీటిపారుదల సలహా మండలి సమావేశంలో నాయకుల ఆగ్రహం ఏలూరు (మెట్రో): జిల్లాలో రైతులు నాశనమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు, ఏళ్ల తరబడి ఆధునికీకరణ పనులు చేస్తూనే ఉన్నారు తప్ప పూర్తికావడం లేదు, డెల్టాకు సాగునీటి ఇబ్బంది ఏర్పడితే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తరలించే నీటిని నిలిపివేయండి అంటూ అధికారపక్ష నాయకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం బుధవారం సాయంత్రం కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు. నరసాపురం, భీమవరం, పాలకొల్లు, ఉండి నియోజవర్గాల పరిధిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. అధికారులు అలసత్వం వహిస్తున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరేమన్నారంటే.. –ఇరిగేషన్ శాఖ నిర్మాణాత్మకంగా విధులు నిర్వహించకపోవడం వల్ల గతేడాది నలుగురు వ్యక్తులు చనిపోయారనీ, కాలువల్లో నీటి సరఫరా ఏ మేర ఉంటుందో తెలియక నలుగురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. –గత డిసెంబరునాటికే ఆధునికీకరణ పనుల టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పిన అధికారులు ఎందుకు చేయలేకపోయారని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రశ్నించారు. యాంత్రీకరణకు పెద్దపీట అంటున్నా ఎక్కడ జరుగుతుందని నిలదీశారు. జిల్లా రైతులకు అన్యాయం జరుగుతుందని భావిస్తే పట్టిసీమ నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించవద్దన్నారు. –జిల్లాలో మెట్ట, డెల్టా అనే భేదాలు లేకుండా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఎంపీ మురళీమోహన్ కోరారు. –డిసెంబరునాటికి ఆధునికీకరణ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాల్సిందేనని ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అన్నారు. –వంతుల వారీ విధానానికి సహకరిస్తామని కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ చెప్పారు. –డిసెంబర్ నుంచే దొంగరావిపాలెం నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కోరారు. –రైతులకు సమయానికి నీరు అందించాలని ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకష్ణ, బండారు మాధవనాయుడు కోరారు. –పంట బోదెలు తవ్వించి నీటిని సజావుగా రైతులకు అందించాలని నీటి సంఘాల అధ్యక్షుడు రామరాజు కోరారు. –జిల్లా రైతులకు గతేడాది మాదిరిగా ఎక్కడా ఇబ్బంది లేకుండా సాగునీరు సరఫరా చేస్తామని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ అధికారులు సీఈ, ఎస్ఈ, డీఈ, ఈఈలు, వ్యవసాయశాఖాధికారులు, నీటి సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఆమోదించిన ఆయకట్టు, నీటి లభ్యత జిల్లాలో మొత్తం ఆయకట్టు: 5,29,962 ఎకరాలు నికరంగా వరిపంట : 4,60,000 వరదనీటి ప్రకారం గోదావరి నుంచి నీటి లభ్యత అంచనా (తూర్పు, పశ్చిమగోదావరి డెల్టాలకు కలిపి) : 60.29 టీఎంసీలు సీలేరు నుంచి నీటి లభ్యత అంచనా : 36.58 టీఎంసీలు మొత్తం అంచనా నీటి లభ్యత : 96.87 టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం : 7.22 టీఎంసీలు లభ్యత మేరకు పశ్చిమ డెల్టాకు సాగునీటి కోసం : 46 టీఎంసీలు మిగిలిన సాగునీరు తూర్పుడెల్టాకు ఉపయోగం ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయండి రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేయకుండా తాత్సారం చేస్తుందని, తక్షణమే జిల్లాలో రైతులకు రావాల్సిన రూ.90 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేయాలని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో రైతులకు నీరు ఇస్తామని చెబుతున్నా అందించడంలో ప్రభత్వుం విఫలమవుతుందన్నారు. క్రాస్బాండ్స్ విధానం ద్వారా డెల్టా ప్రాంతాల్లో ఉప్పు నీరు వస్తుందని, దీని వల్ల రైతులు పంటలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందన్నారు. డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో వరినాట్లు పూర్తి చేస్తామని చెబుతున్నారనీ, చెప్పడమే కాకుండా అ ప్రక్రియను పూర్తి చేసి తీరాలని అధికారులను కోరారు. గతంలో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో రైతులు నష్టపోయారని క్రాస్బాండ్స్ విషయంలో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉందని శేషుబాబు అన్నారు. స్పష్టత కరువు జిల్లాలో వరి నారుమళ్లు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని, ఈ మేరకు నీటి సరఫరాకు నిర్ణయించారు. వాస్తవానికి ఫిబ్రవరి నెలాఖరు వరకు కొన్నిచోట్ల నారుమళ్లు పూర్తికాని పరిస్థితి ఉంది. దీనిపై ఎవరూ మాట్లాడలేదు. జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో చేపల చెరువులు ఉన్నాయని, వీటికి కూడా 25 టీఎంసీల నీరు అవసరం అవుతుందన్నారు. ఈ నీటిని పూర్తిస్థాయిలో అందిస్తామన్నారు తప్ప ఎలా తీసుకువస్తారన్న విషయం చెప్పలేదు. -
పచ్చటి పొలాల్లో మృత్యు ఘోష
– అన్నదాతల అసువులు తీస్తున్న అప్పులు – కొంపముంచిన రుణమాఫీ – పట్టించుకోని ప్రభుత్వం – ఈ నెలలో ఇద్దరు ఆత్మహత్య – రెండేళ్లలో 8మంది బలవన్మరణం సాక్షి ప్రతినిధి, ఏలూరు : అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రై వేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ జిల్లాలో ఇద్దరు రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. నిడదవోలులోని లింగంపల్లికి చెందిన రైతు బూరుగుపల్లి నాగవిద్యాసాగర్ (34) అప్పులు తీర్చే దారిలేక ఈనెల 14న అర్ధరాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈనెల 18న సాయంత్రం కామవరపుకోట మండలం ఈస్ట్ యడవల్లికి చెందిన ఆకుల సత్యనారాయణ (34) తన పొలంలో చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. వీరిద్దరికీ కొద్దోగొప్పో భూమి ఉండగా, మరికొంత భూమిని కౌలుకు తీసుకుని పంటలు పండించిన వారే. ఇలాంటి చిన్న, సన్నకారు రైతులతోపాటు కౌలు రైతులు సైతం అప్పుల ఊబిలో కూరుకుపోయారు. బయటపడే మార్గం లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తుండగా.. పాలకులు కనికరించడం లేదు. జిల్లాలో 3.50 లక్షల మంది కౌలు రైతులు ఉండగా, 3.25 లక్షల మందికి రుణార్హత కార్డులు ఇచ్చామని అధికారులు ప్రకటించారు. వారిలో సగం మందికి కూడా కార్డులు అందలేదు. అధికారిక గణాంకాల ప్రకారం కేవలం 18 వేల మందికి రూ.100 కోట్లలోపే రుణాలిచ్చారు. ఈ ఏడాది జిల్లా రుణ ప్రణాళిక రూ.6,300 కోట్లు కాగా, ఇప్పటికే రూ.3,500 కోట్లను రుణాలుగా మంజూరు చేసినట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. అందులో కేవలం రూ.100 కోట్లలోపు మాత్రమే కౌలు రైతులకు దక్కాయి. బ్యాంకుల నుంచి అప్పు పుట్టక, మరోవైపు రుణమాఫీ ఫలాలు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండేళ్లలో 8మంది.. టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్నపూర్ణ వంటి జిల్లాలో రైతు ఆత్మహత్యలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడచిన రెండేళ్లలో జిల్లాలో 8మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిలో పొగాకు రైతులు కూడా ఉన్నారు. అప్పుల ఊబినుంచి బయటపడే మార్గంలేక దెందులూరు మండలం సోమవరప్పాడుకు చెందిన బులుసు కోటేశ్వరరావు, కొవ్వలికి చెందిన గుంజా చిన్న రంగారావు, కొయ్యలగూడెం మండలం సరిపల్లికి చెందిన పొగాకు రైతు పందిరిపల్లి సత్యనారాయణ (45), రాజవరం గ్రామానికి చెందిన మాధవరపు నరసింహమూర్తి (40), జంగారెడ్డిగూడెంకు చెందిన పారేపల్లి మంగరాజు, చింతలపూడి మండలం నరసింగపురానికి చెందిన తూము రాంబాబు ఆత్మహత్య చేసుకున్నారు. వీరంతా కౌలు రైతులే కాగా.. రెండు కుటుంబాలకు మాత్రమే రూ.3 లక్షల పరిహారం అందింది. మిగిలిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందలేదు. -
అసువులు తీసిన అప్పులు
– ఉరి కొయ్యను ఆశ్రయించిన రైతు – వరుస నష్టాలే కారణం – భూమి వివరాలు ఆన్లైన్ కాకపోవడంతో మంజూరు కాని బ్యాంక్ రుణం – ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లిలో ఘటన ద్వారకాతిరుమల : పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఓ రైతు అసువులు తీశాయి. వరుస నష్టాలు అతడిని నిలబడనివ్వలేదు. బ్యాంక్ నుంచి అప్పు తీసుకుని కాస్త ఉపశమనం పొందుదామంటే.. అతడి భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు కాలేదు. కుటుంబ సభ్యులకు గుప్పెడు మెతుకులు పెట్టే దారిలేక.. ఆయిల్పామ్ ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా చేరినా.. అప్పటికే చేసిన అప్పులు ఊపిరి సలపనివ్వలేదు. దిక్కులేని స్థితిలో ఆ రైతు ఉరికొయ్యను ఆశ్రయించి అసువులు తీసుకున్నాడు. ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ దుర్ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. కామవరపుకోట మండలం తూర్పు యడవల్లికి చెందిన ఆకుల సత్యనారాయణ (34) ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లిలోని తన పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికులను కలచివేసింది. రూ.లక్షలు పెట్టుబడి పెడితే చిల్లగవ్వ కూడా రాలేదు దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంకు చెందిన ఆకుల సత్యనారాయణకు కామవరపుకోట మండలం తూర్పు యడవల్లికి చెందిన హేమలతతో 15 సంవత్సరాలు క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. వివాహానంతరం సత్యనారాయణ తూర్పు యడవల్లిలో స్థిరపడ్డాడు. ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లిలో 75 సెంట్ల వ్యవసాయ భూమి భార్యద్వారా సంక్రమించగా.. ఆ పొలంతోపాటు పక్కనే ఉన్న మరో ఎకరం భూమిని సత్యనారాయణ కౌలుకు తీసుకుని మూడేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. మిరప, నిమ్మ, దొండ పంటలను సాగు చేస్తున్నాడు. దొండ సాగు అతడిని నష్టాల ఊబిలోకి నెట్టేసింది. ఐదు నెలల క్రితం నాటిన దొండపాదులు ఎండిపోవడంతో వెంటనే అప్పులు చేసి మళ్లీ అదే పంట వేశాడు. ఆ పాదులు కూడా ఎండిపోవడంతో నిరాశకు గురయ్యాడు. దాదాపు రూ.3 లక్షల మేర పెట్టుబడులు పెడితే చిల్లిగవ్వ కూడా రాకపోవడంతో కుటుంబ సభ్యులను పోషించుకోవడం కష్టమైంది. ఆర్థిక ఇబ్బందులను తాళలేక సీహెచ్.పోతేపల్లిలోని గోద్రేజ్ ఆయిల్పామ్ ఫ్యాక్టరీలో గెలల అన్లోడింగ్ చేసే పనిలో కూలీగా చేరాడు. వ్యవసాయంపై మక్కువ చావక తన పొలంలో మరోసిరొ మిరప పంట వేశాడు. భార్యద్వారా సంక్రమించిన భూమిపై బ్యాంకు రుణం తీసుకుని ప్రై వేట్ అప్పుల్లో కొంతైనా తీర్చి ఉపశమనం పొందాలనుకున్నాడు. భూమి రికార్డులు ఆన్లైన్ కాకపోవడంతో రుణం ఇవ్వడం కుదరదని బ్యాంక్ అధికారులు తేల్చిచెప్పారు. మూడేళ్లపాటు దఫదఫాలు చేసిన అప్పులు రూ.5 లక్షల వరకు చేరడంతో ఎలా తీర్చాలో తెలియక సత్యనారాయణ సతమతమయ్యేవాడు. ఇదే విషయాన్ని తమ వద్ద పదేపదే అంటుండేవాడని భార్య హేమలత, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చివరకు తన పొలంలోనే చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణం పొందాడు. సత్యనారాయణ, హేమలత దంపతులకు సురేష్కుమార్ (15), హరీష్ (13) అనే కుమారులున్నారు. ‘అమ్మను పొలానికి రావద్దను’ రోజులానే మంగళవారం ఉదయం ఇంటినుంచి బయల్దేరిన సత్యనారాయణ పొలానికి చేరుకున్నాడు. మిరప పంటకు తడిపెట్టే సమయంలో అతని చిన్న కుమారుడు హరీష్ టిఫిన్ తీసుకెళ్లాడు. టిఫిన్ చేసిన అనంతరం పొలం నుంచి ఇంటికి వెళుతున్న కుమారుణ్ణి వెనక్కి పిలిచిన సత్యనారాయణ ‘మధ్యాహ్నం మీ అమ్మ పొలానికి వస్తుందేమో.. రావద్దని చెప్పు. సాయంత్రం నేనే ఇంటికి వచ్చేస్తాను’ అని చెప్పి పంపాడు. అతని రాక కోసం రాత్రి వరకు ఎదురు చూసిన భార్య హేమలత ఆ తరువాత భర్తను వెదుక్కుంటూ పొలానికి బయలుదేరింది. సమీపంలోని పొలానికి చెందిన రైతు ఆమెకు ఎదురై నీ భర్త పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడని చెప్పడంతో నిర్ఘాంతపోయింది. భోరున విలపిస్తూ్త ఘటనా స్థలానికి చేరుకుంది. అప్పుల బాధలే తన భర్తను పొట్టన పెట్టుకున్నాయని భార్య హేమలత రోదిస్తోంది. అందరితో కలివిడిగా ఉండే సత్యనారాయణ మతిచెందాడన్న వార్త తెలుసుకున్న తోటి రైతులు, ఇంటి చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయాక పోలీసులకు సమాచారం అందగా, బుధవారం ఉదయం భీమడోలు ఎసై ్స బి.వెంకటేశ్వరరావు, ద్వారకాతిరుమల స్టేషన్ రైటర్ టి.వెంకటేశ్వరరావు, పోలీసు సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య హేమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కౌలు రైతును కాటేసిన రుణమాఫీ హామీ
– అప్పులు తీర్చలేక ఆత్మహత్య – రుణం మాఫీకాక పొలం అమ్మేసి కౌలు రైతుగా మారిన వైనం నిడదవోలు : రుణమాఫీ హామీ ఓ రైతును పొట్టనపెట్టుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని లింగంపల్లికి చెందిన బూరుగుపల్లి నాగవిద్యాసాగర్ (34) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. విద్యాసాగర్ తన తండ్రికి గల ఎకరం పొలంతోపాటు మరో 10 ఎకరాలను కౌలుకు తీసుకుని ఆరేళ్లుగా వరి సాగు చేస్తున్నాడు. పెట్టుబడుల కోసం మిల్లర్లు, తెలిసిన ఆసాముల వద్ద రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. తన తండ్రి వెంకట్రావు పేరిట ఉన్న ఎకరం పొలంపై 2012లో రూ.90 వేల వరకు పంట రుణం తీసుకున్నాడు. ఆ రుణం మాఫీ అవుతుందన్న ఉద్దేశంతో బ్యాంకుకు వాయిదాలు చెల్లించలేదు. ఆ మొత్తం మాఫీకాకపోగా వడ్డీలతో కలిపి తడిసిమోపెడైంది. దీంతో బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారు. బ్యాంక్ నుంచి ఒత్తిడి పెరగడంతో మూడు నెలల క్రితం తన తండ్రి పేరిట ఉన్న ఎకరం పొలాన్ని విక్రయించి బ్యాంకు అప్పుతోపాటు బయటి అప్పులను కూడా కొంతమేర తీర్చాడు. అయినా.. బయట తెచ్చిన అప్పులు తీరలేదు. ఈ నేపథ్యంలో బకాయిలు తీర్చే మార్గం లేక విద్యాసాగర్ వారం రోజులుగా బెంగతో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి 1గంట సమయంలో పొలంలోని పాక వద్దకు వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసి తండ్రి వెంకట్రావు స్పృహ కోల్పోయాడు. మృతుడు విద్యాసాగర్ అవివాహితుడు. -
రైతునైతే అధికారులను చెప్పుతో కొడతా
– కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఏలూరు (మెట్రో) జిల్లాలో రైతులు ఎంతో సహనం, ఓపికతో ఉంటారని వారి మంచితనాన్ని ఆసరా చేసుకుని సేద్యపునీటి ప్రాజెక్టు పనులు ఇష్టానుసారంగా తీవ్ర జాప్యం చేస్తున్నారనీ, అదే తాను రైతునైతే నిర్లక్ష్యం వహించే అధికారులను చెప్పుతో కొడతానంటూ జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ శెట్టిపేట ఇఇ శ్రీనివాస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శనివార సేద్యపునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనుల ప్రగతి తీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ రబీ పంట కాలంలో ప్రతి సంవత్సరం డెల్టాలో మురుగునీటిని పంట కాలువల్లోకి తాత్కాలిక పద్ధతిలో మోటార్ల ద్వారా నీరును తోడుతున్నారని ప్రతి ఏటా తాత్కాలిక పనులు చేపట్టి లక్షలాధి రూపాయలు వధా చేసే బదులు మూడేళ్లు ఖర్చుపెట్టే సొమ్ముతో శాశ్వత ప్రాతిపదికన మోటార్లు ఏర్పాటు చేయాలని రెండు నెలల కిత్రం చెప్పినప్పటికీ నేటికీ తగిన ప్రతిపాదనలు ఎందుకు సిద్ధం చేయలేదని ప్రశ్నించారు. రైతులంటే ఇంత నిర్లక్ష్యమా, అధికారులు చేసే నిర్లక్ష్యం వల్ల రైతులు బలవ్వాలా అంటే కలెక్టర్ ప్రశ్నించారు. రానున్న రబీ పంటకు శాశ్వత ప్రాతిపదికన ఇరవై నాలుగు ప్రాంతాల్లో నీటిని మళ్లించేందుకు ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి మోటార్లు బిగించకుంటే తగు చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. యనమదుర్రు డ్రై యిన్పై మూడేళ్ల నుండి బ్రిడ్జీలు నిర్మాణ పనులు పూర్తి చేయలేదని ఎప్పుడు చూసినా రెండు పిల్లర్స్ కొన్ని చోట్ల శ్లాబ్ పనులు మాత్రమే దర్శనమిస్తున్నాయన్నారు. ఈ సీజన్లో మాత్రం డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా ప్రాజెక్టుల డిజైన్లు మార్చే ప్రసక్తే లేదని కలెక్టర్ చెప్పారు. జాతీయ రహదారి నిర్మాణం చేయకుండానే కొవ్వూరులో తాత్కాలిక టోల్ప్లాజా పెట్టి ప్రజల నుండి టోల్పీజు వసూలు చేసే వారిపై కేసు నమోదు చేసి తక్షణమే తాత్కాలిక టోల్ప్లాజాను తొలగించాలని కలెక్టర్ కొవ్వూరు ఆర్డిఒను ఆదేశించారు. టోల్ప్లాజా ఏర్పాటుకు ఇంకా స్థలం నోటిఫై చేయకుండానే ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా టోల్ఫ్లాజా ఏర్పాటు చేసి ప్రజల నుండి డబ్బులు ఏ విధంగా వసూలు చేస్తున్నారని తక్షణమే టోల్ప్లాజాను తొలగించాలని ఆదేశించారు. నరసాపురం నుండి కోటిపల్లి వరకూ గోదావరిపై రైల్వేశాఖ నిర్మిస్తున్న బ్రిడ్జితో పాటు రోడ్డుకం రైల్బ్రిడ్జి నిర్మిస్తే వాహనాల రాకపోకలకు ఎంతో అనువుగా ఉంటుందని ఈ మేరకు ఆర్అండ్బి తగు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, స్పెషల్ కలెక్టర్ భానుప్రసాద్, ఐటిడిఎ పీఒ షాన్మోహన్, ఆర్డిఒలు దినేష్కుమార్, తేజ్భరత్, శ్రీనివాసరావు, ఎస్ఇ శ్రీనివాసయాదవ్, డ్వామా పీడీ వెంకటరమణ, ఇరిగేషన్ ఎస్ఇ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పచ్చగడ్డి కోస్తూ పరలోకానికి
తణుకు: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. 33కేవీ విద్యుత్ స్తంభానికి ఏర్పాటు చేసిన సపోర్టు తీగలు తెగి వేళాడుతున్న విషయాన్ని గమనించి కౌలు రైతు పచ్చగడ్డి కోస్తూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైన దుర్ఘటన ఇరగవరం మండలం ఆర్.ఖండ్రిక గ్రామంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్.ఖండ్రిక గ్రామానికి చెందిన గుద్దాటి వెంకటేశ్వరరావు (70) స్వగ్రామంలో ఆరెకరం పొలం కౌలుకు చేస్తూ ఆవును మేపుకుంటున్నాడు. దీంతో పాటు పెరవలి వై.జంక్షన్ వద్ద జాతీయ రహదారిని ఆనుకుని టింకరింగ్ దుకాణంలో రోజువారి కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రోజూ విధులు పూర్తయ్యాక సాయంత్రం ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న పచ్చగడ్డిని కోసుకుని తీసుకువెళుతుంటాడు. శనివారం సాయంత్రం వెంకటేశ్వరరావు పచ్చగడ్డి కోస్తుండగా సమీపంలోని 33 కేవీ విద్యుత్ లైను వెళుతున్న ప్రాంతంలో ఉన్న స్తంభం వద్ద సపోర్టు తీగలు కిందకు వేలాడుతున్నాయి. దీనిలో ఓ తీగ 33 కేవీ విద్యుత్ లైనును తాకుతూ వెళ్లింది. దీనిని గమనించని వెంకటేశ్వరరావు పచ్చగడ్డి కోస్తూ ప్రమాదవశాత్తు సపోర్టు తీగను పట్టుకున్నాడు. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మతిచెందాడు. చేతిలో కొడవలి విద్యుత్ షాక్తో వెంకటేశ్వరరావు మతిచెందిన తీరు చూపరులకు కంట తడి పెట్టించింది. ఒక చేతిలో కొడవలి మరో చేతిలో పచ్చగడ్డి పట్టుకున్న తీరు కలచి వేసింది. రోజూ అదే ప్రాంతంలో పచ్చగడ్డి కోసుకుంటూ ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. పేదకుటుంబానికి చెందిన వెంకటేశ్వరరావుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పట్టణ ఎసై ్స జి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రకృతి వ్యవసాయంపై రైతుల ఆసక్తి
దెందులూరు: రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు ఆసక్తి కనబరచడం అభినందనీయమని ఆత్మ జిల్లా ప్రాజెక్టు డైరెక్టరు వై.ఆనందమయి అన్నారు. శుక్రవారం దెందులూరు మండల పరిషత్ కార్యాలయంలో దెందులూరు ఏఎంసీ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి రైతులకు అవగాహన సమావేశం ఏలూరు ఏడీఏ కె.వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో పీడీ మాట్లాడుతూ రైతులు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం రైతుల బలోపేతం, సంక్షేమం, అధిక దిగుబడులు వ్యాధుల నిర్మూలన లక్ష్యంగా చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వరి సాగు చేస్తున్న ఒక్కొక్క ఎకరానికి రూ.2వేలు చొప్పున ఆరుగురికి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో డీపీడీ విజిఎస్ఈ హరి, ఏఈవో వై.నాయుడు, ఆత్మ ఏపీఎం టి.స్వర్ణలత, మూడు మండలాల రైతులు పాల్గొన్నారు. -
ఇదేం గోలయ్యా బాబూ...??
అనంత, చిత్తూరు జిల్లాలకు సాగునీటి సరఫరాకు హడావుడి 600 పైగా వాటర్ ట్యాంకర్లు కావాలంటూ రవాణా శాఖపై ఒత్తిడి గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి 200 ట్యాంకర్లు ఏర్పాటు తలలు పట్టుకుంటోన్న రవాణా శాఖ అధికారులు సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రంలోని రవాణా శాఖ అధికారులు వాటర్ ట్యాంకర్ల వేటలో పడ్డారు. ట్యాంకర్లు ఎక్కడ కనిపించినా వదిలి పెట్టడం లేదు. వాటిని అనంతపురం, చిత్తూరు జిల్లాలకు పంపుతున్నారు. మూడ్రోజుల పాటు సాగునీటి సరఫరా కోసం పురమాయిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నుంచి 200, నెల్లూరు జిల్లా నుంచి 50 ట్యాంకర్లు అనంత, చిత్తూరు జిల్లాల బాట పట్టాయి. మొత్తం 600 ట్యాంకర్లు అవసరమని ఆదేశాలు జారీ చేసిన ఉన్నతాధికారులకు సమాధానం చెప్పలేక కోస్తా జిల్లాల్లోని ఆర్టీవోలు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఖరీఫ్ సీజనులో అనంతపురం,చిత్తూరు జిల్లాల రైతులు అధిక విస్తీర్ణంలో వేరుశెనగ పంటను సాగు చేస్తున్నారు. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా అనంతలో 6 లక్షలు, చిత్తూరులో 1.20 లక్షల హెక్టార్ల పంట ఎండుముఖం పట్టింది. దీంతో ఈ రెండు జిల్లాల్లోని కరువు నియోజకవర్గాలకు పెద్ద మొత్తంలో రెయిన్గన్స్ పంపిణీ చేసిన ప్రభుత్వం వాటి ద్వారా పంటలను కాపాడతామనీ, ఒక్క ఎకరా కూడా ఎండనివ్వబోమని చెబుతోంది. రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు రోజులుగా ఈ రెండు జిల్లాల్లో పర్యటిస్తూ రైతులను పరామర్శిస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. రెండు జిల్లాల్లోని కరువు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సాగునీరు సరఫరా చేస్తే ఆయా నీటితో వేరుశెనగ పంటను కాపాడవచ్చని సర్కారు అభిప్రాయపడుతోంది. ఇందుకోసం కోస్తా జిల్లాల నుంచి వాటర్ ట్యాంకర్లు తెప్పించి నీళ్లు సరఫరా చేయించాలని సీఎం చంద్రబాబు రవాణా శాఖను ఆదేశించారు. దీంతో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల రవాణా శాఖ అధికారులు సోమవారం నుంచి నీళ్ల ట్యాంకర్ల వేటలో పడ్డారు. పట్టణాల్లో నీళ్లు సరఫరా చేసే ప్రయివేటు ట్యాంకర్లు, స్కూళ్లు, కాలేజీలు, ఇతరత్రా సంస్థలు, పరిశ్రమలకు చెందిన వాటర్ ట్యాంకర్ల వివరాలను తెప్పించుకుని ఆయా ట్యాంకర్ల యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఒక్కో ట్యాంకర్కు రోజువారీ బాడుగ కింద రూ.1200 ఇవ్వడమే కాకుండా లారీలకు డీజిల్ కొట్టించే బాధ్యతను ఇరిగేషన్, ఆర్డబ్లు్యఎస్, మైనర్ ఇరిగేషన్, ఉద్యాన వన శాఖలకు అప్పగించారు. బుధవారం సాయంత్రానికి 600 ట్యాంకర్లను సమకూర్చాలని రవాణా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేయడంతో వివిధ జిల్లాల్లోని ఆర్టీవోలు, ఎంవీఐలు ట్యాంకర్ల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. గురువారం నుంచి నీటి సరఫరా జరగాలన్నది ఆలోచన. అదృష్టం బాగుండి బుధవారం నుంచి రెండు జిల్లాల్లోనూ వర్షాలు పడితే రైతుల పాటు తామూ బతికిపోతామని రవాణా శాఖ అధికారులు అంటున్నారు. రెండు జిల్లాలకూ మంత్రులు ... ఇదిలా ఉండగా అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ప్రభుత్వం మంత్రులను ఇన్చార్జులుగా వేసింది. వేరుశెనగ పంట ఎండకుండా సకాలంలో సాగునీటి సరఫరా జరిగేలా పర్యవేక్షించాలని సీఎం సూచించారు. దీంతో చిత్తూరు జిల్లాకు మంత్రులు పల్లె ర ఘునాథరెడ్డి, నారాయణ, బొజ్జల, శిద్ధా రాఘవరావు, కేఈ కృష్ణమూర్తిలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. -
చెట్టుకు ఉరేసుకొని రైతు ఆత్మహత్య
కంభం: ప్రకాశం జిల్లా కంభం మండలం చిన్న కంభం గ్రామం సమీపంలో ఓ రైతు పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతుడిని పోలుకూరి ఆంజనేయులు(35)గా గుర్తించారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. -
అయ్యా.. మీరే దిక్కు
-
అయ్యా.. మీరే దిక్కు
సిద్దిపేట రూరల్: ‘అయ్యా, మాకు మీరే దిక్కు.. అకాల వర్షాృతో పంటలను పోగొట్టుకున్నాం... అప్పుల పాలయ్యాం... ప్రభుత్వం ఆదుకోకపోతే రోడ్డున పడతాం.. మా పరిస్థితిని అర్థం చేసుకొని పరిహారమిచ్చి ఆదుకోండి’ అంటూ రైతులు కేంద్ర బృందం సభ్యులతో మొరపెట్టుకున్నారు. కేంద్ర బృందం సభ్యులైన సెంట్రల్ జాయింట్ సెక్రటరీ ఉత్పాల్ కుమార్సింగ్, సెంట్రల్ ౄయింట్ డెరైక్టర్ దీనానాథ్, నీతి ఆయోగ్ డిప్యూటీ అడ్వైజర్ మానస్ చౌదరిలు మంగళవారం జిల్లాలోని సిద్దిపేట మండలం బక్రిచెప్యాల, నంగునూరు మండలం ముండ్రాయి, సిద్దన్నపేట గ్రామాల్లో పర్యటించారు. మే 3న కురిసిన వడగళ్ల వానతో నష్టపోయిన పంటల వివరాలను సేకరించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు. సిద్దిపేట మండలం బక్రిచెప్యాల రైతు ఐలు మల్లయ్య మాట్లాడుతూ... ఎకరం విస్తీర్ణంలో వరి వేయగా అకాల వర్షానికి రెండు క్వింటాళ్ల ధాన్యమే చేతికందిందని ఆవేదన వ్యక్తం చేశాడు. గోపాల్ అనే రైతు మాట్లాడుతూ మూడు ఎకరాలకు గాను ఎకరం విస్తీర్ణంలో వరి వేయగా 2 క్వింటాళ్లు మాత్రమే చేతికొచ్చిందన్నాడు. గతంలో ఎకరంలో 20 క్వింటాళ్ల ధాన్యం పండేదని తెలిపాడు. లింగయ్య అనే రైతు మాట్లాడుతూ.. ఐదు ఎకరాల్లో వరి పంట వేయగా మూడు క్వింటాళ్లు కూడా చేతికి రాలేదని వాపోయాడు. నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. పది ఎకరాల్లో మామిడి తోట సాగు చేయగా సుమారు లక్షకుపైగా నష్టం వాటిల్లిందని బోరుమన్నాడు. బక్రిచెప్యాల గ్రామ వాసి స్వప్న మాట్లాడుతూ ఇటీవల కురిసిన వడగళ్ల వానకు తన ఇళ్లు పూర్తిగా ధ్వంసమైందని తెలిపింది. అధికారులు నష్టం వివరాలు సేకరించలేదని ఆమె బృందం సభ్యుల ఎదుట వాపోయింది. వారివెంట కలెక్టర్ రాహుల్ బొజ్జా, డీఆర్ఓ దయానంద్, ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఎంపీపీ ఎర్ర యాదయ్య, జేడీఏ హుక్యానాయక్, వెటర్నరీ జేడీఏ లక్ష్మారెడ్డి, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఏడీఏహెచ్ అంజయ్య, ఎంపీడీఓ సమ్మిరెడ్డి, తహశీల్దార్ ఎన్వైగిరి, ఏఓ అనిల్కుమార్, సర్పంచ్ సూరం అనిత రవి తదితరులు ఉన్నారు. నంగునూరు మండలంలో.. నంగునూరు మండలం ముండ్రాయి, సిద్దన్నపేట గ్రామాల రైతులు సైతం తమ సమస్యలను కేంద్ర బృందానికి వివరించారు. ముండ్రాయికి చెందిన రైతు అంజిరెడ్డి, శనిగరం మల్లయ్య, సర్పంచ్లు బెదురు గిరిజ, చాట్లపల్లి రజిత మాట్లాడుతూ.. పంట చేతికొచ్చే దశలో వడగళ్లవాన కురవడంతో వరి గింజలు రాలి తీవ్ర నష్టం జరిగిందన్నారు. తమ ప్రాంతంలో కాలువలు లేనందున బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నామన్నారు. యూరియా, విత్తనాలు, కూలీ ఖర్చులు కలిపి మొత్తం ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టినట్టు చెప్పారు. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, ధాన్యం అమ్ముకుంటే రవాణ ఖర్చులతోపాటు పెట్టుబడులు పోనూ రూ.10 వేలు మిగిలేవని బాధిత రైతులు బృందం సభ్యులకు వివరించారు. అకాల వర్షాలతో వరి, మొక్కజొన్న, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఇళ్లు కూడా కూలిపోయాయని తమను ఆదుకోకుంటే అప్పుల్లో కూరుకుపోతామని వాపోయారు. కేంద్రం ఆదేశాల మేరకే పర్యటన.. అనంతరం సిద్దన్నపేటలో బృందం సభ్యుడు ఉత్పాల్ కుమార్సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటిస్తున్నట్టు తెలిపారు. నష్టం అంచనా వివరాలు సేకరించామని, త్వరలో ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని చెప్పారు. వారి వెంట జేడీఏ హుక్యానాయక్, ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఉద్యాన అధికారి రామలక్ష్మి, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఎంపీపీ శ్రీకాంత్రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, నాయకులు దువ్వల మల్లయ్య, బి.తిరుపతి, రాజయ్య, రాజిరెడ్డి, కనకారెడ్డి పాల్గొన్నారు.