govt hospitals
-
ఆస్పత్రుల్లో ఔషధ కొరత ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సర్కారు ఆస్పత్రుల కోసం కొనుగోలు చేసే మెడిసిన్ ఇండెంట్ నుంచి అవి రోగి కి చేరేవరకు పూర్తి సమాచారం ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. సప్లై చైన్ మేనేజ్మెంట్ను మూడు దశలుగా విభజించి, ప్రతి దశకు ఒక అధికారిని బాధ్యులుగా నియమించాలని తెలిపారు. సెంట్రల్ మెడికల్ స్టోర్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫార్మసీల బలోపేతం, ఫుడ్ సేఫ్టీ అంశాలపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో శుక్ర వారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేస్తు న్న 22 సెంట్రల్ మెడిసిన్ స్టోర్ల పనులను వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘ఈ ఔషధి’పోర్టల్ వినియోగంపై ఫార్మసిస్టులకు వర్క్షాపు నిర్వహించాలని సూచించారు. అవసరమై న ఔషధాల కోసం టీజీఎంఎస్ఐడీసీకి సకాలంలో ఇండెంట్ పెట్టాలని ఆదేశించారు. ఆస్పత్రు ల్లోని ఫార్మసీల్లో ఏయే ఔషధాలు అందుబాటు లో ఉన్నాయనేది ప్రజలు తెలుసుకొనేలా అక్కడ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా ల్లో మందుల సరఫరాకు డిప్యూటీ డీఎంహెచ్వోలను ఇన్చార్జీలుగా నియమించాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి ఫుడ్సేఫ్టీలో హైదరాబాద్ నగరం దేశంలోనే చిట్టచి వరి స్థానంలో ఉందని జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. 2022 నాటి డేటా తో కొందరు ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నా రని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలపటంతో.. ఫుడ్ సేఫ్టీ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. నెల రోజుల్లో 5 కొత్త మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.ఈ ఏడాది ఇప్పటివరకు 4,366 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్ఫుడ్ స్టాల్స్ను అధికారులు తనిఖీ చేశారని, నిబంధనలు పాటించని 566 సంస్థలపై కేసులు నమోదు చేయడంతో పాటు, రూ.66 లక్షల జరిమానా విధించామ ని తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్య దర్శి క్రిస్టినా, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్, పబ్లిక్ హెల్త్ విభాగం అడిషనల్ డైరెక్టర్ అమర్సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యరంగంలో ఏపీ నంబర్ వన్
-
అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే సీఎం ధ్యేయం
జగ్గయ్యపేట: రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో నాబార్డు నిధులు రూ.3 కోట్లతో నిర్మించిన 50 పడకల నూతన ఆస్పత్రి భవనం, తొర్రగుంటపాలెంలో రూ.90 లక్షలతో నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రం, బలుసుపాడు రోడ్డులోని జగనన్న లేఅవుట్లో రూ.90 లక్షలతో నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుతో కలిసి మంత్రి రజిని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ వైద్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.16,822 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 104, 108 వాహనాలు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయడంతోపాటు వైఎస్సార్ ఫ్యామిలీ డాక్టర్ పథకం పేరుతో గ్రామాల్లో ఇళ్ల వద్దే రోగులకు వైద్యం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 17 కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 150 పీహెచ్సీలు, 992 సీహెచ్సీలు ఆధునికీకరించామని తెలిపారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మార్చేందుకు వైద్యరంగానికి సీఎం వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని చెప్పారు. జగ్గయ్యపేట ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పట్టణానికి రెండు వైపులా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డిల్లీరావు, డీఎంహెచ్వో డాక్టర్ సుహాసిని, వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ పి.సరళమ్మ, డీసీహెచ్ఎస్ స్వప్న, కేడీసీసీబీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
సారూ.. ఇదేం తీరు
సాక్షి నాగర్ కర్నూల్/అచ్చంపేట రూరల్: ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది తీరు మారడం లేదు. ఎన్నిసార్లు సస్పెండ్లు చేసినా.. శాఖాపరమైన చర్యలు తీసుకున్నా.. తమ పద్ధతి మాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా గురువారం అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలోని సురక్షిత మాతృత్వ ఆశ్వాసన్ సెంటర్లోకి ఓ ప్రైవేటు ల్యాబ్ నిర్వాహకుడు శిశువుల రక్త నమూనాలు తీసుకెళ్లడానికి వచ్చాడు. శిశువుల నుంచి రక్త నమూనాలు తీసుకుని వారి బంధువుల వద్ద ఒక్కొక్కరి దగ్గర రూ.500 చొప్పున వసూలు చేశాడు. ఆస్పత్రిలోని ఓ నర్సు టీఎస్బీ, సీపీపీ, బీజీఎఫ్ పరీక్షల కోసం ఆస్పత్రి పేరు మీద ఉన్న చీటీలు రాసిచ్చారు. ఆస్పత్రిలో ఈ పరీక్షలు చేయడానికి వీల్లేదని, ఓ ల్యాబ్ నుంచి వ్యక్తి వచ్చి పరీక్షలు చేస్తారని చెప్పారని బల్మూర్ మండలం చెన్నారం గ్రామానికి చెందిన బాలింత జ్యోతి భర్త సాయిబాబు తెలిపారు. ప్రైవేటు ల్యాబ్ నిర్వాహకుడు దర్జాగా ఆస్పత్రిలోకి వచ్చి శిశువుల వద్ద రక్తం సేకరించాడు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న సెక్యూరిటీ గార్డు గమనించి ఫార్మాసిస్టు రాజేష్కు విషయం చెప్పడంతో వెంటనే ఆయన వచ్చి నిలదీశాడు. ఆస్పత్రి లోపలికి వచ్చి శిశువుల వద్ద రక్తం తీసుకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారని, ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని రాజేష్ తెలిపారు. కాగా ఓ బాలింతకు చెందిన బంధువులు ఆస్పత్రిలోని ఓ నర్సు చెప్పడంతో తామంతా రక్త పరీక్షలు చేసుకోవడానికి ముందుకొచ్చామని, రూ.500 ఇచ్చామని ఆరోపించారు. ఆస్పత్రిలో అన్ని వసతులు సమకూర్చుతున్నామని, అన్ని రకాల పరీక్షలు చేస్తున్నామని ఫార్మాసిస్టు చెప్పారు. ఇటీవలి కాలంలోనే ఉన్నతాధికారులు పరీక్షల నిమిత్తం ఓ నూతన యంత్రాన్ని పంపించారని వివరించారు. కాగా బయటి నుంచి ప్రైవేటు ల్యాబ్ వ్యక్తులు ఆస్పత్రిలోకి వచ్చి శిశువుల వద్ద రక్తం తీసుకెళ్తున్నా పర్యవేక్షణ కరువైందని, శిశువులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. కొందరు నర్సులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, డిమాండ్గా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బయటకు పంపడం సరికాదు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నిరకాల వసతులు సమకూరుతున్నా కొందరు సిబ్బంది తీరు మారడం లేదు. పరీక్షల కోసం రోగులు, బాలింతలు, చిన్నారులను బయటకు పంపడం సరికాదు. ప్రైవేటు వ్యక్తి వచ్చి ఆస్పత్రిలో చిన్నారుల వద్ద రక్త నమూనాలు తీసుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. – మల్లేష్, సీపీఎం నాయకుడు, అచ్చంపేట సొంత క్లినిక్లకు రెఫర్ స్థానికులుగా ఉన్న వైద్యులే తరుచుగా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారని, వారే స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహిస్తూ ఇక్కడి రోగులపై నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులను తమ క్లినిక్లకు రెఫర్ చేసుకుంటున్నారని, ఈ మేరకు ఆస్పత్రిలోని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించిన వైద్యులు, సిబ్బందిపై పలుమార్లు చర్యలు తీసుకున్నా.. సస్పెండ్ అయినా కొన్ని రోజులకే మళ్లీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించడంతో వైద్యశాఖ ఉన్నతాధికారుల పనితీరు బహిర్గతమవుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఆస్పత్రిలో వైద్యుడు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందడం, అంతకు ముందు కరోనా సమయంలో ఓ చెంచు మహిళకు కరోనా ఉందని కాన్పు చేయకపోవడంతో వైద్యులను, సిబ్బందిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణను వివరణ కోరడానికి ప్రయత్నం చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. (చదవండి: పంటలకు ‘కట్’కట!) -
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాజ్యమేలుతోన్న నిర్లక్ష్యం
-
పేదలకు సకాలంలో అందని వైద్యం
-
‘కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై నివేదిక రావాల్సి ఉంది’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాస్పత్రుల్లో రెమ్డెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. రాష్ట్రంలో రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో 23,685.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 18,094 రెమిడెసివిర్స్ అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే అన్ని జిల్లాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 918 ఐసీయూ బెడ్స్ ఖాళీగా ఉన్నాయని ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో కొత్తగా 18,767 కరోనా కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 20,109 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా, రాబోయే మూడురోజులు ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు సింఘాల్ తెలిపారు. అలాగే కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్కు అవసరమైన మందులను జిల్లాలకు సరఫరా చేస్తున్నామన్నారు. కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై నివేదిక రావాల్సి ఉందని పేర్కొన్నారు. -
ఆక్సిజన్ అందక 13 మంది మృతి
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆక్సిజన్ కొరత ఎందరి ప్రాణాలనో బలితీసుకుంటోంది. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా ప్రభుత్వాస్పత్రి కరోనా వార్డులో ఆక్సిజన్ కొరతతో ముగ్గురు మహిళలు సహా 13 మంది రోగులు మంగళవారం అర్ధరాత్రి మరణించారు. ఆస్పత్రి నిర్వహణ తీరును నిరసిస్తూ బుధవారం వైద్యసిబ్బంది ఆందోళనకు దిగారు. చెంగల్పట్టు జిల్లాలో 500 పడకలతో కరోనా ప్రత్యేకవార్డును ప్రారంభించి చికిత్స అందిస్తున్నారు. వీటిల్లో ఆక్సిజన్ వసతి ఉన్న 380 పడకలున్నాయి. మంగళవారం రాత్రి పదిన్నర తర్వాత అకస్మాత్తుగా ఆక్సిజన్ సరఫరా మందగించడంతో రోగులు ఊపిరాడక విలవిలలాడటం మొదలైంది. ఆక్సిజన్పై ఆధారపడి చికిత్స పొందుతున్న రోగుల్లో గంటలోగా ఐదు మంది ప్రాణాలు వదిలారు. మరికొందరు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో ఆందోళన చెందిన వైద్య సిబ్బంది సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రి, మరైమలైనగర్లోని ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలోగా అర్దరాత్రి సమయానికి ఊపిరాడక మొత్తం 13 మంది ప్రాణాలు విడిచారు. వీరిలో 12 మంది కరోనా నుంచి కోలుకున్నవారు, ఒకరు పాజిటీవ్ నిర్దారణైన వ్యక్తిగా తెలుస్తోంది. కర్ణాటకలో నలుగురు మృతి సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఆక్సిజన్ అందక కరోనా రోగుల మరణాలు పెరిగిపోతున్నాయి. కొత్తగా మరో నలుగురు కరోనా రోగులు మృతి చెందారు. బెళగావి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బిమ్స్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో మూడు గంటల వ్యవధిలోనే నలుగురు చనిపోయారు. ఇటీవల చామరాజనగర జిల్లా ఆస్పత్రిలో 24 మంది కరోనా బాధితులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వెంటిలేటర్లు, బెడ్లు లభించక ప్రాణాలు కోల్పోయారని మృతుల బంధువులు ఆస్పత్రి ముందు కన్నీరు మున్నీరయ్యారు. రోగులకు సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. టోకెన్ల ప్రకారం ఆక్సిజన్ ఇస్తామని చెప్పారని, దీంతో సీరియస్గా ఉన్న రోగులకు తక్షణం ఆక్సిజన్ అందక ప్రాణపాయం వస్తోందని తెలిపారు. ఉత్తరాఖండ్లో ఐదుగురు కరోనా బాధితులు మృతి డెహ్రాడూన్/హరిద్వార్: ఆక్సిజన్ కొరత కారణంగానే కాదు, సరఫరాలో అంతరాయం వల్ల కూడా కోవిడ్–19 బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ జిల్లా రూర్కీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం వల్ల ఐదుగురు బాధితులు కన్నుమూశారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 30 నిమిషాల పాటు ప్రాణవాయువు సరఫరా నిలిచిపోవడం వల్లే వారు మృతి చెందినట్లు తెలిసింది. తెల్లవారుజామున 1.30 గంటల నుంచి 2 గంటల దాకా ఆక్సిజన్ సరఫరా కాలేదని సదరు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడొకరు చెప్పారు. చనిపోయిన ఐదుగురు కరోనా బాధితుల్లో ఒకరు వెంటలేటర్పై, నలుగురు ఆక్సిజన్ పడకలపై ఉన్నట్లు తెలిపారు. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి ఐదుగురు కరోనా బాధితులు మరణించడం పట్ల హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ సి.రవిశంకర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
వైద్య వసతుల్లో ఆంధ్రప్రదేశ్ భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆస్పత్రులకు స్వర్ణ యుగం వచ్చింది. రెండేళ్ల క్రితం వరకు ప్రాథమిక ఆరోగ్యం విషయంలో ఎక్కడో అట్టడుగున ఉన్న ఏపీ.. నేడు కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకునే స్థాయికి ఎదిగిందంటే సామాన్య విషయం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం ఆరోగ్య రంగంపై చేస్తున్న కృషే దీనికి కారణమని పలువురు కొనియాడుతున్నారు. తాజాగా ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన అద్భుతంగా ఉందంటూ కేంద్రం కొనియాడటం గమనార్హం. ఇప్పటి వరకు కేరళ, తమిళనాడులోనే ప్రాథమిక ఆరోగ్య (పబ్లిక్ హెల్త్) రంగం బావుంటుందని పలువురు చెబుతుంటారు. ఇప్పుడు అలాంటి వారి దృష్టిని ఏపీ ఆకర్షిస్తోంది. ఎన్క్వాస్తో నాణ్యతకు భరోసా తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఆస్పత్రులను నాణ్యత మదింపు ప్రక్రియలోకి తీసుకొచ్చింది. ఇలా చేయాలంటే ఎన్క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ – జాతీయ నాణ్యత మదింపు సంస్థ) గుర్తింపు పొందాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు ఎన్క్వాస్ కిందకు తీసుకొచ్చింది. ఈ సంస్థ సంతృప్తి చెందాలంటే ఔట్ పేషెంట్ సేవలు మొదలు.. ఇన్ పేషెంట్, పారిశుధ్యం, మందులు, బెడ్లు ఇలా పలు వసతులు సంతృప్తికరంగా ఉండాలి. ఈ విషయంలో ఏపీ అద్భుతంగా నిర్వహణ చేసినట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్హెచ్ఎస్ఆర్సీ (నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రీసోర్స్ సెంటర్) ప్రశంసించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మెయిల్ ద్వారా లేఖ పంపించింది. పబ్లిక్ హెల్త్లో వసతులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రతిభ కనబరిచిందని కొనియాడింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో గణనీయంగా వసతులు మెరుగు పడినట్టు ఈ లేఖలో పేర్కొంది. నాడు–నేడు కింద పనులు పూర్తయితే మరిన్ని వసతులు వస్తాయని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. ఎన్క్వాస్ ప్రతినిధులు స్వయంగా పరిశీలించాకే.. సాధారణంగా దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలు దశల వారీగా ఆస్పత్రులను నాణ్యతా మదింపు ప్రక్రియలోకి చేరుస్తుంటాయి. ఒక్కో దఫా 50 నుంచి 100 ఆస్పత్రుల్లో నాణ్యత ప్రమాణాలకు వెళతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకేసారి 1,135 ఆస్పత్రులను ఎన్క్వాస్ పరిధిలోకి తీసుకొచ్చింది. కొత్తగా కల్పించిన వసతులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను మదింపు సంస్థకు సమర్పించింది. ఈ డాక్యుమెంట్లను పరిశీలించడమే కాకుండా, స్వయానా ఎన్క్వాస్ ప్రతినిధులు ఆస్పత్రులకు వచ్చి పర్యవేక్షించారు. 953 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 182 ఏరియా, సామాజిక, జిల్లా ఆస్పత్రులు.. మొత్తం 1,135 ఆస్పత్రులను పరిశీలించాకే వసతులు భేష్ అని గుర్తింపునిచ్చారు. దీని వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులు పేర్కొన్నారు. 1,400 చెక్ పాయింట్స్ ఎన్క్వాస్ నిబంధనల ప్రకారం మొత్తం 1,400 వసతులకు సమాధానం ఇవ్వాలి. ఒక్కో ఫెసిలిటీ పూర్తి చేస్తే 2 మార్కులు ఇస్తారు. చెయ్యకపోతే సున్నా. పాక్షికంగా చేస్తే ఒక మార్కు ఇస్తారు. వసతులకు సంబంధించి ముందుగా జిల్లా కమిటీ పరిశీలన చేస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర కమిటీ పర్యవేక్షణ చేసి.. ధ్రువీకరణ పత్రాలు కేంద్రానికి పంపిస్తుంది. అప్పుడు కేంద్ర బృందం పరిశీలన చేస్తుంది. ఇలా మన రాష్ట్రంలోని 1,135 ఆస్పత్రులకు 70 శాతానికి పైగానే మార్కులు వచ్చాయి. నాణ్యత మదింపులో గుర్తించిన అంశాలు ► ప్రతి ఆస్పత్రిలో సిటిజన్ చార్టర్ విధిగా అమలవుతోంది. దీని ప్రకారం ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వైద్య సేవలు సమయానికి అందుతున్నాయి. ► ఆస్పత్రిలో వసతులు లేదా గదులకు సంబంధించి బాణపు గుర్తులతో సూచికలు ఉన్నాయి. ► నిబంధనల మేరకు అగ్నిమాపక ధ్రువీకరణ పత్రాలు, కాలుష్య నియంత్రణ మండలి సరి్టఫికెట్లు ఉన్నాయి. ► రక్త పరీక్షలన్నీ అక్కడే జరిగేలా అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులతో కూడిన ల్యాబ్లు ఉన్నాయి. ► అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి 3 గంటలకు ఒకసారి పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. వృద్ధులకు, వైకల్యంతో ఉన్న వారి కోసం అన్ని ఆస్పత్రుల్లో వీల్ చైర్లు ఉన్నాయి. ► అన్ని ఆస్పత్రుల్లోనూ ఆయా విభాగాల సిబ్బంది వృత్తి రీత్యా శిక్షణ పొందిన వారే ఉన్నారు. నాణ్యతతో కూడిన సదుపాయాల కల్పన ఒకే దఫా ఇంత పెద్ద స్థాయిలో పనులు చేపట్టడం చిన్న విషయం కాదు. 1,135 ఆస్పత్రులకు మనం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వగా వీటిపై ఎన్క్వాస్ సంతృప్తి చెందింది. త్వరలోనే మిగతా ఆస్పత్రుల్లోనూ నాణ్యతకు సంబంధిన పనులు చేపడతాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ -
కరోనా ఉధృతి.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం!
హైదరాబాద్: వివిధ వ్యాధులకు చికిత్స కోసం వచ్చేవారిలో అవసరమైన అందరికీ ఆర్టీపీసీఆర్ పద్ధతిలో కరోనా పరీక్ష తప్పనిసరిగా చేయాలని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులను వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్టు తెలిపారు. తీవ్ర శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి, కరోనా లక్షణాలు లేకుండా ఆస్పత్రిలో చేరే హైరిస్క్ రోగులకు, వివిధ రకాల శస్త్రచికిత్సలు, సాధారణ వైద్యం కోసం వచ్చే లక్షణాలు లేని రోగులకు, ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15 శాతంగానే ఉన్న ఆర్టీపీసీఆర్ పరీక్షలను 40 శాతానికిపైగా పెంచేలా ప్రణాళిక రచించినట్టు తెలిపారు. నేడు మంత్రి ఈటల మీటింగ్ కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. కరోనా చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, నోడల్ ఆఫీసర్లతో సమావేశం కానున్నారు. ఈ మేరకు మంత్రి బుధవారం వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. కరోనా కేసుల పెరుగుదల, చికిత్సలపై సమీక్షిం చారు. కరోనా పరీక్షలను సంఖ్య మరింత పెంచడంతోపాటు.. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ పద్ధతిని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. కేసుల సంఖ్య పెరుగుతున్నా తీవ్రత తక్కువగా ఉందని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. వ్యాక్సినేషన్ కూడా వేగవంతంగా జరుగుతోందన్నారు. అయితే అందరికీ వ్యాక్సిన్ అందించడానికి అవసరమైన కరోనా వ్యాక్సిన్ డోసులు పంపించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని చెప్పా రు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. -
వైద్యులు సూచించే మందులు ఇక డోర్ డెలివరీ
-
ఇక ఆస్పత్రుల్లో ‘అమృత్’ ఫార్మసీలు
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రులకు వస్తున్న నిరుపేద రోగులకు బహిరంగ మార్కెట్తో పోలిస్తే చాలా తక్కువ ధరకే మందులు, సర్జికల్స్, ఇంప్లాట్స్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కేంద్రం దేశవ్యాప్తంగా ఆలిండియా మెడికల్ సైన్స్(ఎయిమ్స్)ల్లో ప్రారంభించి, విజయవంతమైన దీన్దయాళ్ ‘అమృత్’ మెడికల్ స్టోర్స్ను ఇకపై తెలంగాణ వ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రుల్లో కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ దుకాణాల్లో జనరిక్ మందులతో పాటు బ్రాండెడ్ మందులు, సర్జికల్స్, ఇంప్లాంట్స్ను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ప్రైవేటు మెడికల్ స్టోర్స్లోని బ్రాండెడ్ మందులు, సర్జికల్స్, ఇంప్లాంట్స్ ధరలతో పోలిస్తే ఈ అమృత్ మెడికల్ స్టోర్స్లో 30 నుంచి 40 శాతం తక్కువ ధరకే లభించనున్నాయి. ఉస్మానియా ఆస్పత్రిలో హెచ్ఎల్ఎల్కు షాపును కేటాయించారు. రెండు మూడు రోజుల్లో ఇక్కడ ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. నిలోఫర్ సహా ఇతర ఆస్పత్రుల్లో సాధ్యమైనంత త్వరలోనే ఈ దుకాణాలు అందుబాటులోకి తేవాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. బ్రాండెడ్ బాదుడుకు ఇక చెల్లుచీటీ.. ఉస్మానియా మెడికల్ కాలేజీ పరిధిలో ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సహా నిలోఫర్, ఈఎన్టీ, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, ఫీవర్, ఛాతి ఆస్పత్రి, మానసిక చికిత్సాలయం, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి, నయూపూల్ ప్రసూతి ఆస్పత్రులు ఉన్నాయి. ఇక గాంధీ మెడికల్ కాలేజీ పరిధిలో గాంధీ ఆస్పత్రి కొనసాగుతోంది. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల ఓపీకి రోజుకు సగటున 2500 నుంచి 3000 మంది రోగులు వస్తుంటారు. మిగిలిన ఆస్పత్రుల ఓపీలకు రోజుకు సగటున 500 నుంచి 1200 మంది వస్తుంటారు. ప్రభుత్వ ఆస్పత్రులకు టీఎస్ఎంఐడీసీ మందులు సరఫరా చేస్తుంది. వైద్యులు రాసిన వాటిలో చాలా మందులు ప్రభుత్వ ఫార్మసీలో దొరకడం లేదు. దీంతో ఆ మందులను రోగులే స్వయంగా సమకూర్చుకోవాలి. ఇందుకు సమీపంలో ఉన్న ప్రైవేటు మెడికల్ షాపులను ఆశ్రయిస్తుంటే.. దుకాణదారులు బ్రాండెడ్ పేరుతో అధిక ధరల మందులు ఇస్తున్నారు. దీంతో నిరుపేద రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కేవలం అవుట్ పేషంట్లకు మాత్రమే గాక.. ఇన్పేషంట్లుగా చికిత్స పొందుతున్న రోగులు కూడా చాలా రకాల మందులను బయటే కొంటున్నారు. అమృత్ స్టోర్స్ ఏర్పాటుతో ఖరీదైన మందులు, సర్జికల్స్, ఇంప్లాంట్స్ సైతం తక్కువ ధరకే పొందే అవకాశం ఉండడంతో పేద రోగులకు మేలు జరగనుంది. ఏళ్ల నుంచి ప్రైవేటు షాపుల దందా గతంలో నిమ్స్ సహా ఉస్మానియా, గాంధీలోనూ జీవన్ధార పేరుతో జనఔషధి మెడికల్ స్టోర్స్ను ఏర్పాటు చేశారు. రోగుల నుంచి వీటికి మంచి ఆధరణ కూడా లభించింది. అప్పటికే ఆయా ఆస్పత్రుల్లో లీజుపై కొనసాగుతున్న ప్రైవేటు మెడికల్ షాపుల నిర్వహకులు స్థానిక వైద్యులతో కుమ్మక్కై వాటిని సంక్షోభంలోకి నెట్టేశారు. ప్రస్తుతం ఒక్క ఉస్మానియాలోనే విజయవంతంగా కొనసాగుతోంది. గాంధీలో దాదాపు మూతపడే స్థితికి చేర్చారు. ఇక నిమ్స్లో మూడేళ్ల క్రితమే దుకాణం ఏత్తేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గాంధీలో మూడు, ఉస్మానియాలో రెండు, నిలోఫర్లో ఒక ప్రైవేటు మెడికల్ స్టోర్లు కొనసాగుతున్నాయి. ఒక్కో స్టోర్లో రోజుకు సగటున రూ.2 లక్షల విలువ చేసే మందుల విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. ఇప్పటికే ఆయా దుకానాల లీజు గడువు కూడా ముగిసింది. ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ప్రైవేటు మెడికల్ షాపులకు అనుమతి ఇవ్వరాదనే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాల నేపథ్యంలో.. అధికారులు ఇప్పటికే ఆయా దుకాణాల నిర్వహకులకు నోటీసులు జారీ చేశారు. కొంత మంది అధికారులు ఆయా షాపుల నిర్వహాకులతో కుమ్మక్కై.. కోర్టుల నుంచి స్టే ఆర్డర్లు ఇప్పించడం వివాదాస్పదంగా మారింది. -
‘జిల్లా ఆస్పత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చండి’
సాక్షి, హైదరాబాద్: జిల్లా ఆస్పత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చాలని మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ను కలిసి విన్నవించారు. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా ఆధునీకరించాలని విన్నవించారు. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద కొత్త బ్లాక్స్ ఏర్పాటుపై కేంద్ర మంత్రితో ఈటల చర్చించారు. మాతాశిశు ఆరోగ్య కేంద్రాలు, కొత్త వైద్య కళాశాలలు మంజూరు చేయాలని కోరారు. మరోవైపు ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటుపై ఈటల చర్చించారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే కేంద్రమంత్రితో ఈటల సమగ్రంగా ఏమేం చర్చించారన్న విషయాన్ని కార్యాలయ వర్గాలు పూర్తిస్థాయిలో వెల్లడించకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఇదిలాఉండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ‘అందరికీ అందుబాటులోకి ఆధునిక వైద్య పరికరాలు’అనే లక్ష్యంతో ‘వైద్య పరికరాలు–సేవలు’పేరుతో మంగళవారం ఢిల్లీలో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యేందుకు ఈటల ఢిల్లీ వెళ్లారు. కాగా, మన శాస్త్ర విజ్ఞానం రోగులకు అతి తక్కువ ధరకు వైద్యం అం దించేందుకు ఉపయోగపడాలని ఈటల కోరారు. సోమవారం హైదరాబాద్లో హెల్త్ అండ్ ఫార్మా సదస్సు జరిగింది. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ 70శాతం సిజేరియన్లే..
సాక్షి, యాదాద్రి: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2018 ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు 13,383 ప్రసవాలు జరిగాయి. ఇందులో సాధారణ ప్రసవాలు 3,623 కాగా సిజేరియన్ ద్వారా 9,760 కాన్పులు చేశారు. జిల్లాలో సాధారణ కాన్పుల కంటే శస్త్ర చికిత్సల ద్వారా అధికంగా జరుగుతున్నాయని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు వైద్యారోగ్యశాఖ చేస్తున్న ప్రయత్నాలు జిల్లాలో ఫలించడం లేదు. ఇందుకు వైద్యులు, సిబ్బంది పనితీరే కారణమన్న విమర్శలు లేకపోలేదు. ఇదే విషయాన్ని వైద్యారోగ్యశాఖ కమిషనర్ యోగితారాణి స్వయంగా ప్రస్తావించడం జిల్లాలోని ఆస్పత్రుల్లో పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ‘‘స్థానికంగా ఉండరు.. సమయానికి రారు.. వైద్యం కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండరు.. సాధారణ ప్రసవాలు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరు.. రాష్ట్రంలోనే అత్యధిక ఆపరేషన్లు ఈ జిల్లాలో జరుగుతున్నాయి.. అందులో సిజేరియన్లే అధికంగా ఉంటున్నాయి.. ఈ పద్ధతి మారాలి.. లేకుంటే చర్యలు తప్పవు’’ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ యోగితారాణా ఇటీవల జిల్లా ఆస్పత్రులను సందర్శించి వైద్యాధికారులను ఘాటుగా హెచ్చరించడం వారి పనితీరును ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఆశించినస్థాయిలో ఫలితాలు రావడం లేదు. ప్రధానంగా కాన్పుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సాధారణ కాన్పులు జరిగేలా చూడాలని అందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. అయినా ప్రజలు తమ చేతినుంచి విదుల్చుకోక తప్పడం లేదు. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నా ప్రసూతి కోసం మెజార్టీ ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రసూతి కోసం వెళ్తే సుమారుగా రూ.25వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చవుతుంది. మండల కేంద్రాలు, మినీ పట్టణ కేంద్రాల్లో తక్కువలో తక్కువ రూ.15 వేల నుంచి రూ.30 వేలకు తగ్గడం లేదు. అందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆశించిన స్థాయిలో సేవలందకపోవడమే కారణమని తెలుస్తోంది. మొదటి కాన్పులోనే సాధారణంగా చేయాలన్నది లక్ష్యం మొదటి కాన్పులోనే సాధారణ ప్రసవం చేయాలన్నది వైద్యారోగ్య శాఖ లక్ష్యం. కానీ ప్రసవాలు అలా జరగడం లేదు. పీహెచ్సీల్లో డాక్టర్తోపాటు ఏఎన్ఎం, ఆశ వర్కర్, స్టాప్నర్సు, ఫార్మాసిస్టు అందుబాటులో ఉండాలి. చాలా పీహెచ్సీల్లో వీరెవరూ అందుబాటులో ఉండటం లేదు. 24గంటల ఆస్పత్రుల పనితీరు కూడా అధ్వాన్నంగా ఉంది. ఇదే విషయాన్ని కలెక్టర్ సైతం పలుమార్లు హెచ్చరించారు. అయితే ప్రసవం కోసం వచ్చిన గర్భిణిలను సాధారణ కాన్పు చేయడానికి 24గంటల వరకు వేచి చూడాల్సి ఉండగా అలా జరగడం లేదు. దీంతో సిజేరియన్లు అధిక మొత్తంలో జరుగుతున్నాయి. జిల్లాలో ఆస్పత్రులు ఇలా.. జిల్లాలో 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నా యి. ఇందులో 24గంటలు పని చేసే పీహెచ్సీలు 10 ఉన్నాయి. వీటిలో రాజాపేట, బీబీనగర్, మో త్కూర్, ఆత్మకూరు, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, భూదాన్పోచంపల్లి, తుర్కపల్లి, వలిగొండ, నారాయణపురంలో ఉన్నాయి. అలాగే 12గంటలు పని చేసే పీహెచ్సీలు 9 అడ్డగూడూరు, కొండమడుగు, వర్కట్పల్లి, తంగడపల్లి, మోటకొండూర్, శారాజీపేట, వేములకొండ, బొల్లేపల్లి, మునిపంపులలో పని చేస్తున్నాయి. ఆలేరు, రామన్నపేట, చౌటుప్పల్లో కమ్యూనిటీ హెల్త్సెంటర్లు ఉండగా భువనగిరిలో జిల్లా కేంద్ర ఆస్పత్రి ఉంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజులు పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చే గర్భిణులను పరీక్షిస్తున్న కొందరు వైద్యులు శస్త్రచికిత్స తప్పనిసరి చేస్తున్నారు. లాభార్జనే ధ్యేయంగా ప్రసూతి కోసం వచ్చే వారిని అబ్జర్వేషన్ పేరుతో ఒకటికి రెండు రోజులు ఆస్పత్రిలో ఉంచి శస్త్రచికిత్స తప్పనిసరి అని చెబుతున్నారు. ఇందుకోసం తల్లీ, బిడ్డల ఆరోగ్యాన్ని ప్రమాదంగా చూపుతూ శస్త్రచికిత్స చేయాలని కుటుంబ సభ్యులపై వత్తిడి తెస్తూ వారిని ఒప్పిస్తున్నారు. ఇందుకోసం ప్రైవేటు ఆస్పత్రులు వేసే అన్ని రకాల ఫీజులను తప్పకుండా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. వసతుల లేమి! ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి కోసం వచ్చే వారికి వసతులు, వైద్యుల గైర్హాజరు, నిర్లక్ష్యం, మత్తు డాక్టర్లు లేకపోవడం, సరైన వైద్య పరికరాలు లేకపోవడంతో పాటు సిబ్బంది, విద్యుత్, మంచినీరు కొరత ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు చేయడానికి ప్రధాన అవరోధంగా మారింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మౌళిక సదుపాయాలు ఉన్నప్పటికీ వాటిలో ప్రసూతి సమయంలో అవసరమైన సౌకర్యాలు లేవు. కొన్ని చోట్ల ఉన్నా వాటిని వినియోగించే నాథుడే లేడు. ఒక వేళ ఆస్పత్రిలో అన్ని పరికరాలు ఉన్నా వైద్యులు, సిబ్బంది స్థానికంగా ఉండకపోవడం ప్రధాన సమస్య. రోజుల తరబడి ప్రాథమిక కేంద్రాలకు రాని వైద్యలు ఉన్నారంటే అతిశయోక్తికాదు. సరైన పర్యవేక్షణ లేకుండా పోయింది. ఒకవేళ అన్ని సవ్యంగా ఉండి డాక్టర్ ఉన్నా సరైన వసతులు లేవని మండల కేంద్రాల నుంచి డివిజన్ కేంద్రాలకు, అక్కడి నుంచి ప్రైవేటు ఆస్పత్రులకు పంపించడం జరుగుతుంది. దీంతో ప్రసూతి సమయంలో ఆస్పత్రుల చుట్టూ తిరగలేక ప్రజలు నాలుగు డబ్బులు ఖర్చైనా పర్వాలేదంటూ అప్పులు చేసి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. శస్త్రచికిత్స లేని ప్రసవాలేవీ..? ఆపరేషన్తో సంబంధం లేకుండా ప్రసవాలు చేయాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా యి. తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని ఎంతగానో చెబుతు న్నా ఆచరణలో అమలు కావడంలేదు. వైద్యారోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో అమలు కావడం లేదు. జిల్లాలో ప్రసవాలను పెద్ద ఎత్తున శస్త్ర చికిత్సల ద్వారా చేయడం పట్ల కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితారాణా, కలెక్టర్ అనితారామచంద్రన్ వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో శస్త్ర చికిత్సల ద్వారా 70.8శాతం ప్రసవాలు జరుగుతండగా సాధారణ ప్రసవాలు 29.2శాతం ఉంటున్నాయి. ఇదే విషయమై తీవ్రస్థాయిలో పోస్ట్మార్టం జరుగుతోంది. కేసీఆర్ కిట్, నగదు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వీటిలో కూడా శస్త్ర చికిత్సలే అధికంగా జరగడాన్ని తప్పుపడుతున్నారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా శస్త్ర చికిత్సలే పెరగడం పట్ల అధికారులు అసహనం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏప్రిల్ 2018 ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు 13,383 కాన్పులు జరిగాయి. ఇందులో సాధారణ కాన్పులు కేవలం 3, 623 కాగా 9,760 ప్రసవాలను సిజేరియన్ ద్వారా నిర్వహించడం పరిస్థితికి అద్దం పడుతోంది. మరో వైపు పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఇతర జిల్లాల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రసవాలు.. సాధారణ సిజేరియన్ మొత్తం 3,623 9,760 13,383 -
ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ ఇక పక్కాగా..
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఇంజనీరింగ్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాస్పత్రులను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వివిధ వర్గాల నుంచి ఈ వ్యవస్థ ఏర్పాటుచేయాలని వినతులు వస్తుండడంతో అధికారులు ఈవైపు అడుగులు వేస్తున్నారు. ఆస్పత్రులు నిర్మించడం.. ఆ తర్వాత వాటి నిర్వహణ గురించి పట్టించుకోకపోవడంతో చాలా ఆస్పత్రులు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. చిన్న బల్బు వెలగకపోయినా వాటిని తిరిగి పునరుద్ధరించే వ్యవస్థలేదు. చిన్నచిన్న డ్రైనేజీ పనులుగానీ, శ్లాబ్ లీకేజీలుగానీ, రంగులు వేయించడంగానీ ఇలా చాలా పనులు చేయించేందుకు ఓ వ్యవస్థలేదు. దీంతో భవనం నిర్మించిన నాలుగైదేళ్లకే నిర్మాణాలు దారుణ స్థితికి చేరుకుంటున్నాయి. దీనివల్ల రోగులు ఆస్పత్రులకు రావాలన్నా, సిబ్బంది పనిచేయాలన్నా వీటిని చూసి భయపడే పరిస్థితి ఏర్పడుతోంది. జోన్ల వారీగా ఇంజనీర్ల కేటాయింపు గతంలో వైద్యవిధాన పరిషత్ పరిధిలో ఉన్న కొద్దిపాటి ఇంజనీర్లు రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థలోకి వెళ్లారు. అక్కడ కూడా కేవలం కొత్త నిర్మాణాలు చూస్తున్నారుగానీ, ఆస్పత్రుల నిర్వహణ చూడటంలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న ఇంజనీరింగ్ విభాగంతో సంబంధం లేకుండా జేఈల నుంచి ఎస్ఈల వరకూ జిల్లాలను జోన్లు వారీగా విభజించి ఇంజనీర్లను కేటాయిస్తే ఆస్పత్రులు కళకళలాడే అవకాశం ఉంటుందని కొంతమంది ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇటీవల జిల్లాల్లో పర్యటించిన సుజాతారావు కమిటీ దృష్టికి కూడా ఈ విషయాలను తీసుకువచ్చారు. అంతేకాక.. మౌలిక వసతులుకు బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించారు. ఈ నిధులను సక్రమంగా వినియోగించుకుని ఆస్పత్రుల నిర్వహణకు ప్రత్యేక ఇంజినీరింగ్ వ్యవస్థను ఏర్పాటుచేస్తే ప్రైవేట్ ఆస్పత్రులను తలదన్నే రీతిలో ప్రభుత్వాస్పత్రులను తీర్చిదిద్దవచ్చని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. టీడీపీ హయాంలో మొక్కుబడిగా నిర్వహణ కాగా, రాష్ట్రంలో ఆరోగ్య ఉప కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ అన్ని ఆస్పత్రులు కలుపుకుంటే 2 కోట్లకు పైగా చదరపు అడుగుల్లో నిర్మాణాలున్నాయి. కానీ, వీటి నిర్వహణకు గత టీడీపీ సర్కారు ఏటా కేవలం రూ.5 కోట్లు మాత్రమే కేటాయిస్తూ వచ్చింది. అందులో 50 శాతం కూడా ఖర్చుచేయలేదు. చదరపు అడుగుకు కనీసం రూ.200 కేటాయిస్తే అద్భుతంగా నిర్వహించవచ్చని, ప్రస్తుత నిర్మాణాలకు రూ.540 కోట్లు ఖర్చుచేస్తే మూడేళ్ల పాటు వాటి నిర్వహణకు ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు. -
సురక్షిత ప్రసవాలే లక్ష్యంగా ‘దక్షత’..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పూర్తిస్థాయిలో మాతా శిశు మరణాలను తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు చేసింది. ప్రస్తుతం ప్రతి లక్ష ప్రసవాల్లో 81 మంది తల్లులు, ప్రతి వెయ్యి జననాల్లో 28 మంది శిశువులు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో సురక్షిత ప్రసవాలే లక్ష్యంగా ‘దక్షత’అనే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రసవాల సందర్భంగా లేబర్ రూం (ప్రసవ గది)లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హైరిస్క్ కేసులను ఎలా డీల్ చేయాలన్న దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను, ఏకరూప కార్యక్రమాన్ని తయారు చేసింది. దానికి అనుగుణంగా లేబర్ రూంలలో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మాతా శిశు మరణాలను తగ్గించేలా చేయాలన్నదే సర్కారు ఉద్దేశం. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు లేబర్ రూంలలో ప్రసవాలు చేయకుండా అత్యంత సురక్షిత పద్ధతిలో కీలకాంశాలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే సిజేరియన్లు కాకుండా సాధారణ ప్రసవాలు జరిగేలా శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు పది జిల్లాల్లో ‘దక్షత’ను వైద్య ఆరోగ్యశాఖ పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటివరకు పది జిల్లాల్లో 2 వేల మంది డాక్టర్లు, నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. వారు కిందిస్థాయిలో మరికొందరికి ఇచ్చేలా కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో మిగిలిన జిల్లాల్లోనూ ‘దక్షత’కార్యక్రమాన్ని నిర్వహించి శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ వరప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలుకు పూనుకోవడం విశేషం. ఆ 72 గంటలే కీలకం... మాతాశిశు మరణాలు ప్రసవ సమయం నుంచి 72 గంటల మధ్య ఎక్కువగా సంభవిస్తుంటాయి. రక్తస్రావం జరగడం, బీపీలో హెచ్చుతగ్గులు, ఇన్ఫెక్షన్ సోకడం, శిశువు బయటకు రాకపోవడం తదితర కారణాల వల్ల గర్భిణులు చనిపోయే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అలాగే శిశువులైతే ఉమ్మనీరు మింగేయడంతో ఊపిరి తీసుకోలేని పరిస్థితుల్లో చనిపోతుంటారు. గర్భిణులు ప్రసవం కోసం వచ్చిన దగ్గరి నుంచి ప్రసవం జరిగే వరకు మధ్యగల 72 గంటలే అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది తీసుకునే ప్రత్యేక జాగ్రత్తల మీదే మాతా శిశువుల ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో లేబర్రూంలు ఎంత గొప్పగా ఉన్నా హైరిస్క్ కేసుల్లో చేపట్టాల్సిన ప్రొటోకాల్ చికిత్సను పాటించకపోవడం వల్ల మరణాలు సంభవిస్తుంటాయి. ఒక్కొక్కరు ఒక్కో రకమైన చికిత్సా పద్ధతులు పాటించడం వల్ల మరణాలు సంభవిస్తుంటాయని, అలాంటి వాటికి చెక్ పెట్టడమే దక్షత కార్యక్రమం ఉద్దేశమని డాక్టర్ వరప్రసాద్ తెలిపారు. చాలావరకు సంభవించే మరణాలన్నీ కూడా లేబర్ రూంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లేనని ఆయన విశ్లేషించారు. దక్షత ద్వారా శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రసవాల సందర్భంగా పర్యవేక్షణ, జవాబుదారీతనాన్ని పెంచుతారు. ప్రసవాల సందర్భంగా పాటించాల్సిన పద్ధతులను చెబుతారు. అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను శిక్షణలో భాగంగా నేర్పిస్తారు. సిజేరియన్ల తగ్గింపూ లక్ష్యమే... హైరిస్క్ సందర్భాల్లో అనేక మంది వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ల వైపు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 1,03,827 ప్రసవాలు జరగ్గా అందులో 62,591 మంది అంటే 60 శాతం సిజేరియన్ ద్వారానే జరిగినట్లు సర్కారు నివేదిక తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 28,790, ప్రైవేటు ఆసుపత్రుల్లో 33,801 ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరిగినట్లు నిర్ధారించారు. దేశంలోకెల్లా తెలంగాణలో అత్యధికంగా సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎలాగైనా మాతాశిశు మరణాలను తగ్గించడం, సిజేరియన్లను వీలైనంత వరకు నివారించడమే లక్ష్యంగా దక్షత కార్యక్రమం ద్వారా ముందుకు సాగాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రసవాలను సురక్షితంగా ఎలా చేయాలి? హైరిస్క్ సమయాల్లో ఎలా వ్యవహరించాలి అనే అంశాల గురించి వైద్యులు, సిబ్బందికి ప్రయోగాత్మకంగా చూపేందుకు ఉన్నతాధికారులు ఒక పరికరాన్ని కొనుగోలు చేశారు. ఇదొకరకంగా మాక్ డ్రిల్ లాంటిది. ఆ పరికరం ధర లక్ష రూపాయలు ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
తెలంగాణ నాడి బాగుంది!
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య రంగంలో పురోభివృద్ధి సాధిస్తున్న పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ‘ఆరోగ్య రంగంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పురోభివృద్దిపై’మంగళవారం ఓ నివేదిక విడుదల చేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2017–18లో ఆరోగ్య రంగంలో జరిగిన అభివృద్ధిని ఇందులో అంచనా వేసింది. ఆరోగ్యరంగంలో 23 అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ఆయా రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించింది. ఆ రెండు సంవత్సరాల మధ్య జరిగిన పురోగతిని, వెనుకబాటును విశ్లేషించింది. దీని ప్రకారం దేశంలో 21 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని పేర్కొంది. నవజాత శిశు మరణాల రేటును తగ్గించడంలో మన రాష్ట్రం అత్యధిక పురోభివృద్ధి సాధించిందని తెలిపింది. 2016–17లో ప్రతి వెయ్యి మందిలో 23 మంది మరణించగా.. 2017–18లో ఆ సంఖ్య 21కి తగ్గిందని వివరించింది. టీబీ కేసులకు అవసరమైన వైద్యం అందించడంలో పెద్ద ఎత్తున పురోగతి సాధించినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్లు వేయడం, ఇమ్యునైజేషన్లో భారీ మెరుగుదల ఉన్నట్లు తెలిపింది. అయితే ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటులో మాత్రం మెరుగుదల లేదని, రెండేళ్లలో పరిస్థితి అలాగే ఉందని పేర్కొంది. తక్కువ బరువుతో పిల్లలు పుడుతున్నా చర్యలు తీసుకోవడంలో పెద్దగా పురోగతి లేదని వెల్లడించింది. 2016–17లో వెయ్యి మంది మగ శిశువులకు 918 మంది ఆడ శిశువులు జన్మిస్తే, 2017–18లో అది 901కు తగ్గిందని వివరించింది. కొరతను అధిగమించి... పీహెచ్సీలు, సీహెచ్సీలలో స్టాఫ్నర్సుల కొరత కూడా పెద్దగా లేదని నీతి ఆయోగ్ పేర్కొంది. అంతకుముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్ల కొరత ఉండేది. కానీ ఆ తర్వాత సంవత్సరంలో పరిస్థితి మెరుగుపడింది. రాష్ట్ర ప్రభుత్వం అనేక పీహెచ్సీల్లో వైద్యుల పోస్టులను భర్తీ చేసింది. ఇక జిల్లా ఆసుపత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత నుంచి కూడా రాష్ట్రం బయటపడింది. ఈ విషయంలో మంచి పురోగతి ఉందని నీతి ఆయోగ్ వెల్లడించింది. వైద్యులు, ఇతర సిబ్బంది మొత్తంలో కూడా ఆ రెండేళ్లలో మెరుగుదల కనిపించింది. అయితే, జిల్లాల్లో గుండె సంబంధిత యూనిట్ల నిర్వహణలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. శిశు జననాల నమోదు ప్రక్రియలో భారీ మెరుగుదల ఉందని తెలిపింది. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ద్వారా వచ్చే నిధులు ఖర్చు చేయడంలో కూడా తెలంగాణ పురోభివృద్ధి సాధించినట్లు నీతి అయోగ్ వివరించింది. కేసీఆర్ కిట్ భారీ హిట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయించుకునే మహిళల కోసం తెలంగాణ సర్కారు అనేక ప్రోత్సాహకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు ప్రభుత్వం అందజేస్తోంది. దీంతోపాటు కేసీఆర్ కిట్ కింద మాతా శిశువుల కోసం వివిధ వస్తువులను ఇస్తున్నారు. దీంతో గ్రామాల్లో కేసీఆర్ కిట్కు ఆదరణ భారీగా పెరిగింది. ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. 2016–17లో ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం 85.35 శాతముంటే, 2017–18లో అవి 91.68 శాతానికి చేరాయి. మరోవైపు ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఏఎన్ఎంల కొరత తీర్చడంలోనూ ప్రభుత్వం విజయం సాధించింది. 200 కోట్లతో మౌలిక సదుపాయాలు పీహెచ్సీలు మొదలు బోధనాసుప్రతుల్లో కల్పన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు రూ. 200 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిం చాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళికలు రచిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్సీ), ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులన్నింటిలోనూ మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. తద్వారా రోగులకు, వైద్య సిబ్బందికి అవసరమైన వసతులు కల్పించాలని భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు విడతలుగా వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చర్చించాయి. అన్ని రకాల వసతులు కల్పిస్తే ఏమేరకు ఖర్చు అవుతుందో అంచనా వేశాయి. సంబంధిత నివేదికను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్కు ఇచ్చినట్లు సమాచారం. దీనిపై ఆర్థిక శాఖ వద్ద అనుమతి తీసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిసింది. కునారిల్లుతున్న ప్రభుత్వ ఆసుపత్రులు.. రాష్ట్రంలో 950కు పైగా పీహెచ్సీలున్నాయి. ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా ఆసుపత్రులున్నాయి. ముఖ్యమైన ప్రాంతాల్లో ఏరియా ఆసుపత్రులున్నాయి. వీటిల్లో వేలాది మంది వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నారు. కానీ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేని దుస్థితి నెలకొంది. చాలా ఆసుపత్రుల్లో కుర్చీలు కూడా ఉండటం లేదు. ఆసుపత్రుల్లో పడకలు లేక రోగులను ఆరుబయట లేదా నేల మీద పడుకోబెడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు.అనేక ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు ఉండటం లేదు. ఈ పరిస్థితిని అధిగమించాలనేది సర్కారు ఉద్దేశం. పలు చోట్ల ఖాళీలు.. రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత వేదిస్తోంది. పీహెచ్సీలు మొదలు బోధనాసుపత్రుల వరకు వైద్యులు, నర్సులు, ఇతర టెక్నీషియన్ల కొరత వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఖాళీలను భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ బోర్డును నియమించారు. దీని ద్వారా వీలైనంత త్వరలో భర్తీలు చేపట్టాలని యోచిస్తున్నారు. జిల్లా ఆసుపత్రుల్లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్ తదితర విభాగాలు తప్పనిసరిగా ఉండాలి. కొన్ని ఆసుపత్రుల్లో ఆ స్పెషలిస్టు వైద్యులు లేరు. అందుకోసం వైద్యుల భర్తీ ప్రక్రియ కూడా జరగనుంది. -
65కు పెంచుతూ ఆర్డినెన్స్ జారీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రుల్లోని వైద్యులు, ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతూ గవర్నర్ నరసింహన్ ఆర్డినెన్స్ జారీచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే విరమణ వయసును పెంచాలని అప్పట్లో మంత్రి మండలి తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు రావడం, తర్వాత మళ్లీ సాధారణ ఎన్నికలు, అనంతరం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు... ఇలా ఎలక్షన్ కోడ్తో ఇప్పటివరకు అది ఆచరణలోకి రాలేదు. దీంతో ప్రభుత్వం అత్యవసరంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ప్రభుత్వ దంత వైద్య కళాశాలల అధ్యాపకులు, వైద్యులకు కూడా విరమణ వయస్సు 65ను అమలుచేస్తారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని గవర్నర్ విడుదల చేసిన రాజపత్రంలో పేర్కొన్నారు. బోధనాసుపత్రుల్లో పలువురి ఉద్యోగ విరమణ వల్ల అనేక ఖాళీలు ఏర్పడటం, వాటిని భర్తీ చేయకపోవడంతో వైద్య విద్య ఇబ్బందుల్లో పడుతుందని ఆర్డినెన్స్లో పేర్కొన్నారు. అంతేకాదు సకాలంలో పదోన్నతులు జరపకపోవడం వల్ల కూడా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కేడర్లోని సీనియర్ బోధనా సిబ్బందిలో భారీగా తగ్గుదల కనిపిస్తుందని ఆర్డినెన్స్లో వివరించారు. అంతేకాదు సూపర్ స్పెషాలిటీల్లోని కొన్ని యూనిట్లలో బోధనా సిబ్బంది కొరత అత్యంత తీవ్రంగా ఉందని, ఫలితంగా కొన్ని విభాగాలు దాదాపు మూసివేత అంచునకు చేరిన పరిస్థితి నెలకొందని ఆర్డినెన్స్లో పేర్కొన్నారు. బోధనా సిబ్బంది కొరతతో భారతీయ వైద్య మండలి, భారతీయ దంత వైద్య మండలీలు తనిఖీలకు వచ్చినప్పుడు పీజీ సీట్లతో సహా కొన్ని మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతమున్న సీట్ల గుర్తింపునూ కోల్పోయే పరిస్థితి ఉందని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచామని వివరించారు. రాష్ట్ర శాసనమండలి ఇప్పుడు సమావేశంలో లేనందువల్ల వెంటనే చర్య తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నందున ఆర్డినెన్స్ జారీచేస్తున్నట్లు వివరించారు. జూడాల సమ్మె విరమణ... బోధనాసుపత్రుల్లో విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల (జూడా)తో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం సచివాలయంలో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో జూడాల నేతలు డాక్టర్ విజయేందర్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మహేశ్, నరేష్, లోహిత్ తదితరులున్నారు. మంత్రి హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు వారు తెలిపారు. అన్ని బోధనాసుపత్రుల్లోని ఖాళీలను ఆరు నెలల నుంచి ఏడాదిలోగా భర్తీ చేస్తామని, నల్లగొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్టు పద్ధతిలో భర్తీని నిలిపివేసి రెగ్యులర్గా నియమిస్తామని తమకు మంత్రి హామీ ఇచ్చినట్లు వారు వివరించారు. ఖాళీలను మెడికల్ బోర్డు నేతృత్వంలో భర్తీ చేస్తామన్నారని తెలిపారు. విరమణ వయసు పెంపుపై ఆర్డినెన్స్ రావడంతో దానిపై సమ్మె కొనసాగించినా సర్కారు వెనక్కు తగ్గే పరిస్థితి లేకపోవడంతో జూడాలు సమ్మె విరమించారు. ఇదిలావుండగా విరమణ వయసును ఏకంగా ఏడేళ్లు పెంచడంతో బోధనాసుపత్రుల్లోని అనేక మంది వైద్యులు హర్షం వ్యక్తంచేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (ప్రజారోగ్యం) ప్రధాన కార్యదర్శి లాలూప్రసాద్ సహా పలువురు నేతలు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ను కలిసి హర్షం వెలిబుచ్చారు. ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులకు కూడా విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచాలని కోరారు. అలాగే నిర్ణీతకాల పదోన్నతులు తమకు కూడా కల్పించాలని విన్నవించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
వైద్యశాఖకు డిప్యూటేషన్ల జబ్బు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఇష్టారాజ్యపు పాలన సాగుతోంది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సరిపడా వైద్యులు, నర్సులను ప్రభుత్వమే మంజూరు చేయకపోగా, ఉన్నవారిని కోరుకున్న చోటుకు పంపించే బృహత్తర కార్యక్రమం ఇక్కడ యథేచ్ఛగా సాగుతోంది. ఇక్కడ వైద్యాధికారికి క్యాంప్ క్లర్క్గా పనిచేసే ఓ కాంట్రాక్టు ఉద్యోగి డాక్టర్లు, స్టాఫ్నర్సుల తలరాతలు రాసే పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ డాక్టరు లేదా నర్సు, ఇతర స్టాఫ్లో ఎక్కడికి డిప్యూటేషన్ మీద వెళ్తారో తెలియని పరిస్థితి పెద్దపల్లి డీఎంహెచ్వో పరిధిలో నెలకొంది. ఇటీవలి కాలంలో డిప్యూటేషన్ల పేరిట స్టాఫ్నర్సులు, ఇతర స్టాఫ్ కోరుకున్న చోటుకు వెళ్లిపోతుండడంతో డాక్టర్లకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో డాక్టర్ల సంఘం ఏకంగా జిల్లా కలెక్టర్కే ఫిర్యాదు చేయడంతో తంతు వెలుగులోకి వచ్చింది. బేరాలు మాట్లాడుకొని స్టాఫ్నర్సులను కోరుకున్న చోటకు పంపేలా వైద్యాధికారి సీసీ కీలక పాత్ర పోషిస్తున్న తీరును వారు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సీనియర్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్ వంటి మినిస్టీరియల్ స్టాఫ్ను మాత్రమే వైద్యాధికారికి సీసీగా కొనసాగాలనే నిబంధనలను కూడా పక్కనబెట్టి కొత్త జిల్లాలు ఏర్పాటైన నాటినుంచి కమాన్పూర్లో హెల్త్ అసిస్టెంట్గా పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగిని సీసీగా కొనసాగిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. కాగా వైద్యులు, ఉద్యోగుల ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ యోగితా రాణా పెద్దపల్లికి రానుండడం గమనార్హం. ఇదీ అడ్డగోలు డిప్యూటేషన్ల తీరు.. పెద్దపల్లి జిల్లాలో 15 పీహెచ్సీలు, 6 అర్బన్ హెల్త్ సెంటర్లతోపాటు సుల్తానాబాద్లోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నేతృత్వంలో కొనసాగుతాయి. జిల్లాలోని వైద్య అవసరాలను బట్టి స్టాఫ్నర్సులను, ఇతర సిబ్బందిని డిప్యూటేషన్ మీద మార్పులు, చేర్పులు చేసే అధికారం వైద్యాధికారికి ఉంటుంది. వైద్యాధికారి వద్ద పనిచేసే సీసీ సిఫారసులు పెరగడం, ఇతరత్రా కారణాలతో ఇటీవలి కాలంలో అవసరం ఉన్నా, లేకపోయినా ఇష్టారాజ్యంగా డిప్యూటేషన్లు జరిగినట్లు వైద్యులు వాపోతున్నారు. సుల్తానాబాద్ సివిల్ ఆసుపత్రిలో పని చేస్తున్న నలుగురు స్టాఫ్నర్సులను బేగంపేట్–2, రాఘవపూర్–1, రాగినేడు–1, ఎలిగేడు–1 పీహెచ్సీలకు పంపించారు. జూలపల్లి–1 స్టాఫ్నర్సును ఏకంగా కరీంనగర్ నర్సింగ్ కళాశాలకు డిప్యూటేషన్ మీద పంపించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని సమాచారం. జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు స్టాఫ్నర్సులను కరీంనగర్ నర్సింగ్ కళాశాలకు పంపించడం వెనుక భారీగా చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. అలాగే జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సూపర్వైజర్లను రామగుండం కార్పొరేషన్కు డిప్యూటేషన్కు లక్షల రూపాయల లావాదేవీలు నడిచినట్లు సమాచారం. వారి స్థానంలో వివిధ పీహెచ్సీల నుంచి సిబ్బందిని డిప్యూటేషన్పై జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. కూనారం, బేగంపేట కొత్త పీహెచ్సీలు కాగా, ఇక్కడ ఏఎన్ఎంలతో సేవలు అందిస్తే సరిపోతుంది. కానీ స్టాఫ్నర్సులను అక్కడికి పంపించడం వల్ల సుల్తానాబాద్ వంటి చోట ఇబ్బంది ఎదురవుతోంది. ఎలిగేడు, రాగినేడుకు స్టాఫ్నర్సుల మంజూరు లేకపోయినా, అక్కడికి పంపించారు. టీబీ హాస్పిటల్లో పనిచేసే ఓ నర్సును కూడా కరీంనగర్ నర్సింగ్ కాలేజీకి పంపడం వెనుక కూడా అక్రమాలు చోటు చేసుకున్నట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు. డాక్టర్లకు సైతం డిప్యూటేషనే స్టాఫ్నర్సులనే కాకుండా డాక్టర్లను సైతం డిప్యూటేషన్ మీద జిల్లాలో ఇష్టమున్న చోటికి పంపిస్తుండడం జరుగుతోంది. బసంత్నగర్లో పనిచేసే ఇద్దరు డాక్టర్లను పెద్దపల్లికి, గర్రెపల్లి పీహెచ్సీ నుంచి బసంత్నగర్కు, గర్రెపల్లి లేడీ డాక్టర్లు ఇద్దరిని డిప్యూటేషన్పై బేగంపేట్కు, బేగంపేట్లో పనిచేస్తున్న ఓ డాక్టర్ను గర్రెపల్లికి డిప్యూటేషన్ వేశారు. అంతతో ఆగకుండా 104 సిబ్బందిని జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి డిప్యూటేషన్ మీద రప్పించుకొని, అందులో పనిచేస్తున్న 4వ తరగతి సిబ్బందిని వివిధ పీహెచ్సీలు, యూపిహెచ్సి, వివిధ శాఖలకు పంపించినట్లు ఆరోపణ వెల్లువెత్తుతున్నాయి. నేడు పెద్దపల్లి జిల్లాకు కమిషనర్ రాక ఈ నెల 3న వైద్యారోగ్య శాఖ కమిషనర్ యోగితారాణా పెద్దపల్లి జిల్లాకు రానున్నారు. జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖ పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలకు సంబంధించి ఆమె ఫీల్డ్ విజిట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లాలో చోటు చేసుకున్న డిప్యూటేషన్లు, అవినీతి అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు తదితర అంశాలను ఉద్యోగులు ఆమె దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు తెలిసింది. -
రక్త కన్నీరు!
కంటి చూపు మందగిస్తే అద్దాలు వాడొచ్చు. కాళ్లు, చేతులు పనిచేయకపోతే కృత్రిమ పరికరాలు పెట్టుకోవచ్చు. కానీ రక్తానికి ప్రత్యామ్నాయంగా ఏ ద్రవాన్ని వాడే పరిస్థితి లేదు. కేవలం ఒక వ్యక్తి చేసే రక్తదానమే మరొకరిని ప్రాణాపాయం నుంచి కాపాడుతుంది. అందుకే అన్ని దానాల్లోకన్నా రక్తదానం మిన్న అనే నానుడి ప్రాచుర్యం పొందుతోంది. కానీ జిల్లాలో ప్రస్తుతం రక్తనిల్వలు నిండుకోవడం ఆందోళన కలిగిస్తోంది. చిత్తూరు అర్బన్: జిల్లాలో ఒక నెలకు 800 యూనిట్ల వరకు రక్తం అవసరమవుతోంది. కానీ ఇందులో సగం యూనిట్లు కూడా ప్రభు త్వ వైద్యశాలల్లో, ఇతర స్వచ్ఛంద సంస్థల్లో అందుబాటులో లేవు. కారణం.. వేసవి సెలవులు కావడం. నిజం.. వేసవి సెలవులు కావడంతో ఇంటర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఊర్ల కు వెళ్లిపోయారు. దాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో జిల్లాలో రక్తనిధి కేంద్రాల్లో రక్తం నిండుకుంది. ఫలితంగా గర్భిణులు, ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సకాలంలో రక్తం అందే పరిస్థితి కనిపించడం లేదు. నెగటివ్ గ్రూపులకు ఇబ్బందే చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిత్యం వందకు పైగా యూనిట్ల రక్తం ఎప్పుడూ నిల్వ ఉంటుంది. కానీ ఇప్పుడు 40 యూనిట్లు మాత్రమే నిల్వ ఉంది. ఇందులోనూ స్క్రీనింగ్ చేసిన పాజిటివ్ గ్రూపులు 30 వరకు ఉంటే నెగటివ్ గ్రూపులన్నీ కలిపి ఎనిమిదే ఉన్నాయి. బీ–నెగటివ్ అయితే ఒక్కటే యూనిట్ ఉంది. ఈ రక్త గ్రూపు ఉన్న గర్భిణి ఎవరైనా కాన్పుకోసం ఆస్పత్రికి వచ్చి తప్పనిసరి శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి వస్తే ప్రాణాలపై వచ్చే పరిస్థితి నెలకొంది. శస్త్ర చికిత్స సమయంలో కనీసం మూడు యూనిట్ల రక్తం కావాలి. ఇక్కడంతలేదు. చిత్తూరు రక్తనిధిలోనే రక్తం లేకపోవడంతో జిల్లాలోని కుప్పం, పలమనేరు, పుత్తూరు, పీలేరు ప్రాంతాల్లో ఉన్న ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలకు చిత్తూరు నుంచి సరఫరా అయ్యే రక్తనిల్వలు ఆగిపోయాయి. రక్తదానం ఎవరు చేయవచ్చంటే.. వయసు 18–60 ఏళ్ల లోపు ఉండి సంపూర్ణ ఆరోగ్యవంతులైతే నిర్భయంగా రక్తదానం చేయవచ్చు. సన్నగా ఉన్నవారు రక్తదానం చేయకూడదని చాలామందిలో అపోహ ఉంది. ఇది తప్పు. 45 కిలోల కంటే ఎక్కువ బరువున్న వారు రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేశాక కొన్ని రోజుల పాటు పనులన్నీ మానుకోవాలనే అపోహ వద్దు. రక్తం ఇచ్చాక కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని పళ్ల రసం, పాలు వంటి స్వల్ప ఆహారం తీసుకున్నాక మళ్లీ పనులు చేసుకోవచ్చు. డబ్బులిచ్చినా దొరకడం లేదు జిల్లాలోని 15 ప్రాంతాల్లో రక్తనిధి కేంద్రాలున్నాయి. 250మి.లీ రక్తాన్ని ఓ యూనిట్గా పరిగణిస్తారు. ప్రభుత్వ వైద్యశాలలకు అనీమియా, రోడ్డు ప్రమాద బాధితులు వచ్చినప్పుడు కనీసం మూడు యూనిట్ల రక్తం అవసరం ఉంటుంది. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో రక్తనిధి కేంద్రాలు ఉండవు. వీళ్లు ఓ వ్యక్తి ద్వారా రక్తాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి దానం చేయించి, రూ.800 చెల్లించి ఒక్క యూనిట్ రక్తాన్ని వారి ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు తీసుకుంటుంటారు. కానీ ప్రస్తుతం డబ్బులు చెల్లించినా కూడా జిల్లాలో ఎక్కడా రక్తం దొరకడంలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు పక్క రాష్ట్రాల నుంచి కూడా రక్తం తెప్పించుకుంటున్నారు. -
సంజీవనిపై ప్రైవేటు!
అసలే పెద్దాసుపత్రి. ఆరేడు జిల్లాలకు పెద్దదిక్కు. నిత్యం వేలాదిమంది రోగులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ ఏ వ్యాపారం పెట్టినా డబ్బే డబ్బు. అదీ మందుల వ్యాపారమైతే లాభాలకు హద్దే ఉండదు. ఇదే ఆలోచన మంత్రి అనుచరుడికి వచ్చింది. పైగా ఆ మంత్రికి సొంత శాఖ. చెబితే కాదనే సాహసం ఎవరూ చేయరు. అనుకున్నదే తడువు ఆసుపత్రి ‘పెద్ద’పై ఒత్తిడి తెచ్చారు. అసలే అక్రమాల్లో కూరుకుపోయిన ఆ ‘పెద్ద’ కూడా మంత్రి ప్రాపకం కోసం జీహుజూర్ అంటున్నారు. ప్రైవేటు మెడికల్ షాపు ఏర్పాటయితే ప్రస్తుతం పేదలకు కాస్తోకూస్తో ఊరటనిస్తున్న చౌక మందుల (జనరిక్) దుకాణాలు మూతపడడం ఖాయంగా కన్పిస్తోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు సర్వజన ఆసుపత్రిలో ఇప్పటికే పలు సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. తాజాగా ప్రైవేటు మెడికల్ షాపు ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న జనరిక్ మందుల దుకాణాల (అన్న సంజీవని)ను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు. ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో మంత్రి అనుచరుడు ప్రైవేటు మెడికల్ షాపు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందుకోసం ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేటు వ్యక్తులకు షాపులు ఇవ్వొద్దంటూ గతంలో జారీచేసిన ఉత్తర్వులకు సైతం తూట్లు పొడిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన అనుచరుడు షాపు పెట్టుకునేందుకు వీలుగా నిర్ణయం తీసుకోవాలంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్పై మంత్రి ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం. అయితే, ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పే సాహసం కూడా సూపరింటెండెంట్ చేయడం లేదు. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. మంత్రి ఆదేశాలను ఆచరణలోకి తెచ్చేందుకు వీలుగా ఏం చేయాలనే విషయంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ఉన్న తరుణంలో ప్రధాన నిర్ణయాలు తీసుకోకూడదనే నిబంధనను సైతం అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే టెండరు లేకుండానే డైట్ కాంట్రాక్టును మరో ఏడాది పాటు కొనసాగించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ద్వారా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మెడికల్ షాపు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. మొత్తమ్మీద ఆసుపత్రి కేంద్రంగా దందా కొనసాగించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. జనరిక్ షాపులపై దొంగ దెబ్బ! గతంలో కర్నూలు సర్వజనాసుపత్రిలో ప్రైవేటు మెడికల్ షాపులు ఉండేవి. అతి తక్కువ బాడుగకే షాపులు ఇచ్చేవారు. అయితే, డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో జనరిక్ మందుల షాపులను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి అనుగుణంగా ఆసుపత్రి ప్రాంగణంలోని ప్రైవేటు మెడికల్ షాపులను రద్దు చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఇక మీదట ఎలాంటి ప్రైవేటు మెడికల్ షాపులనూ అనుమతించవద్దని ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం జనరిక్ మందుల షాపులు మాత్రమే నడుస్తున్నాయి. ఇప్పుడు వీటికి ఎసరు పెట్టేందుకు అధికార పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ప్రైవేటు మెడికల్ షాపు ఏర్పాటు చేసేందుకు మంత్రి అనుచరుడికి అనుమతి ఇవ్వాలనే ఒత్తిళ్లు వస్తున్నాయి. తలూపుతున్న సూపరింటెండెంట్! పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ ఏళ్లుగా అద్దె చెల్లించకుండా, నిబంధనలకు విరుద్ధంగా నగరంలోని ఆర్అండ్బీ క్వార్టర్స్లో ‘హార్ట్ ఫౌండేషన్’ కొనసాగించారు. దీనిపై విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి మాటలకు అనుగుణంగా నడుచుకోకపోతే ఇబ్బందులు వస్తాయనే ఆందోళనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనరిక్ ఔషధశాలలను దెబ్బతీసే విధంగా, ప్రైవేటు మెడికల్ షాపు ఏర్పాటుకు అనుగుణంగా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం. కాంట్రాక్టర్లతో మంతనాలు కర్నూలు సర్వజన ఆసుపత్రిలో పలు సంస్థలు కాంట్రాక్టు పనులు చేపడుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పనీ ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. రోగులకు ఆహార పంపిణీ మొదలుకుని.. సెక్యూరిటీ, స్కావెంజర్ పనులు, వివిధ పరికరాల కొనుగోళ్లు, మందుల సరఫరా వంటి అనేక కాంట్రాక్టులను ప్రైవేటు సంస్థలు చేపడుతున్నాయి. ఇందులో కొన్ని కాంట్రాక్ట్ల కాలపరిమితి ముగిసినప్పటికీ.. వాటిని టెండర్లు పిలవకుండానే కొనసాగించారు. అయితే, ఈ ప్రక్రియ అనంతరం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఫరూక్ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటికే ఆసుపత్రిలో కాంట్రాక్టు పనులు చేస్తున్న వారందరికీ మంత్రి పీఏ నేరుగా ఫోన్లు చేసి.. వ్యక్తిగతంగా కలవాలంటూ కబురు పంపారు. ఏయే కాంట్రాక్టు సంస్థ ఏ విధంగా పనులు చేస్తోందనే విషయాలను కూడా ఆసుపత్రిలోని కొద్ది మంది సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా ఆయా కాంట్రాక్టు సంస్థలను ఇబ్బందులకు గురిచేయడంతో పాటు అనేక డిమాండ్లు పెట్టి నెరవేర్చుకున్నారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఇప్పుడు ఏకంగా తన అనుచరుడికి మెడికల్ షాపు అప్పగించేలా మంత్రి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
పంజా విసురుతోన్న డెంగీ
సాక్షి, హైదరాబాద్: కాలం కాని కాలంలో డెంగీ పంజా విసురుతోంది. మలేరియా పడగ విప్పుతోంది. ఆస్పత్రుల్లో డెంగీ, మలేరియా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క నిలోఫర్లోనే ప్రతీ రోజూ రెండు మూడు డెంగీ కేసులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రతీ రోజూ పదుల సంఖ్యలో డెంగీ, మలేరియా బాధితులు వస్తున్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. గిరిజన ప్రాంతాల్లోనైతే మలేరియా వ్యాప్తి పెరిగింది. ఎన్నికల కోడ్తో ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి లేకపోగా, దీన్నే సాకుగా తీసుకొని వైద్య ఆరోగ్యశాఖ పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే రెట్టింపు కేసులు... మూడు నాలుగేళ్ల క్రితం వరకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఈ జ్వరాలు వచ్చేవి. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎండలు కొడుతున్నా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రెండేళ్ల డెంగీ కేసులను పరిశీలిస్తే సగం వరకు అన్సీజన్లోనే నమోదయ్యాయి. గతేడాది జనవరి–ఏప్రిల్ల్లో 237 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 457 కేసులు నమోదయ్యాయి. 2018లో అదే 4 నెలల కాలంలో 289 మలేరియా కేసులు నమోదైతే, ఈ ఏడాది 437 కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలానికి చికున్ గున్యా కేసులు 21 నమోదు కాగా, ఈ ఏడాది 52 కేసులు నమోదయ్యాయి. డెంగీకి కారణమైన దోమ పగలే కుడుతుంది. కానీ నగరాలు, పట్టణాల్లో రాత్రిళ్లు అదిరిపోయే కాంతులు ఉంటుండటంతో దోమ కూడా రూటు మార్చింద ని డాక్టర్ కమల్నాథ్ అంటున్నారు. డెంగీ కేసులు పెరగడానికి ఇదీ ఓ కారణమే అని ఆయన అభిప్రాయపడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ: గత అంచనాల ప్రకారం మలేరియా పీడిత గ్రామాలు 2,067 కాగా.. డెంగీ ప్రమాదం పొంచి ఉన్న గ్రామాలు 1,414గా వైద్యఆరోగ్యశాఖ గుర్తించింది. మన దేశంలో గతేడాది జికా వ్యాధిగ్రస్థులను గుర్తించారు. ఈ వ్యాధి కారక దోమ, డెంగీ కారక దోమ ఒక్కటే కావడం గమనార్హం. డెంగీ బాధితుల్లో ప్లేట్లెట్ల సంఖ్య సాధారణమే ఉన్నా ప్రైవేట్ ఆస్పత్రులు చికిత్స పేరు తో వేల వేలకు గుంజుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల్లేక ‘ప్రైవేట్’ను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్లేట్లెట్లు పడిపోయిన తీవ్రతను బట్టి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. -
దూది, సూది మందుల్లేవు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రికి వెళితే.. రోగికి ఇంజెక్షన్ వేయాలంటే సిరంజీని బంధువులే కొని తేవాలి. అప్పుడే ఇంజెక్షన్ ఇస్తారు. కాలికి గాయమైతే దూది, మందు రోగులే కొనుక్కోవాలి. లేకుంటే ఏదైనా మందు రాసి పంపుతారు. సెలైన్ పెట్టాల్సి వస్తే రోగులు వాటిని కొనుక్కొచ్చి ఇవ్వాలి. జ్వరం వస్తే కనీసం ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉండవు. ఇదీ అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి. అందుకే ఆయా ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ఏదో గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణాల్లో ఉండే ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లోనే కాదు, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ వంటి ప్రధాన బోధనాసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అందుకే వైద్యులపై రోగుల బంధువులు దాడులు చేసే పరిస్థితి నెలకొంటుందన్న విమర్శలు ఉన్నాయి. ఆసుపత్రులకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తున్నా అధికారులు మాత్రం వాటిని ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కేటాయింపులే ఘనం.. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు, ప్రజారోగ్య ఆసుపత్రులు, బోధనాసుపత్రులకు అవసరమైన మందులు, సర్జికల్ ఐటమ్స్ కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. సిరంజీలు, గ్లౌవ్స్, దూది, బ్లేడ్లు, బ్యాండేజీ, కత్తెరలు ఇలా వందలాది సర్జికల్ ఐటమ్స్ ఆసుపత్రులకు చాలా అవసరం. ఇవి లేకుండా కనీస ప్రాథమిక వైద్యం చేయడం కష్టం. ఇలాంటి వాటిని కూడా కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వాసుపత్రులు ఇచ్చే ఇండెంట్ ప్రకారం రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) వాటిని సరఫరా చేయాలి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో మందుల కోసం ప్రభుత్వం రూ.175 కోట్లు కేటాయించింది. సర్జికల్ ఐటమ్స్ కోసం రూ.75 కోట్లు కేటాయించింది. ఆ ఏడాది మొత్తం నిధులను ఖర్చు చేశారు. ఆ ప్రకారం ఆసుపత్రులకు మందులు, సర్జికల్ ఐటమ్స్ సరఫరా జరిగాయి. అయినా అక్కడక్కడ కొరత ఉండనే ఉంది. ఇక 2018–19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మందులు, సర్జికల్ ఐటమ్స్ కోసం బడెట్లో నిధులు భారీగానే కేటాయించింది. మందుల కోసం రూ.320 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు రూ.210 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. సర్జికల్ ఐటమ్స్ కోసం ప్రభుత్వం రూ.185 కోట్లు కేటాయిస్తే రూ.55 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందులో రూ.90 కోట్లకు ఇండెంట్ పిలిచారు. బోధనాసుపత్రుల నుంచి రూ.45 కోట్లకు ఇండెంట్ వచ్చింది. మిగిలిన ఆసుపత్రుల నుంచి కూడా ఇండెంట్ పంపుతున్నారు. కానీ అధికారులు ఈ ఇండెంట్ ప్రకారం సర్జికల్ ఐటమ్స్ సరఫరా చేసేందుకు ససేమిరా అంటున్నారని కొందరు వైద్యాధికారులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చు కన్నా ఈసారి ఎందుకు ఎక్కువ అవసరమన్న వింత వాదనను టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు తెస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. పాత వాడకం ప్రకారమే ఈసారి కూడా నిధులు ఇస్తామన్న వైఖరి సమంజసం కాదంటున్నారు. ప్రభుత్వం బడ్జెట్ పెంచడమే నేరమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే వీరికి వచ్చిన నష్టమేంటని నిలదీస్తున్నారు. అవసరం మేరకు కేటాయింపులు సర్జికల్ ఐటమ్స్ కోసం అవసరమైన కేటాయింపులు చేస్తూనే ఉన్నాం. ఎక్కడా ఇబ్బంది లేదు. ఎక్కడెక్కడ కొరత ఉన్నాయో ఆన్లైన్ ద్వారా తెలుస్తుంది. ఆ ప్రకారం కేటాయింపులు చేసి కొనుగోలు చేస్తాం. అనవసరంగా ఎవరి కోసమో కొనుగోలు చేయబోం. ప్రస్తుతం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఏమేరకు ఇండెంట్లు కావాలన్న దానిపై చర్చిస్తున్నాం. – చంద్రశేఖర్రెడ్డి, ఎండీ, టీఎస్ఎంఎస్ఐడీసీ -
తల్లీబిడ్డలకు భరోసా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్, ఆప్తమాలజీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్ సేవలు అందుతున్నాయి. ఈ విభాగాలన్నింటికీ రెండు ఆపరేషన్ థియేటర్లు మాత్రమే ఉన్నాయి. సిజేరియన్లు కూడా ఈ థియేటర్లోనే చేస్తున్నారు. ఇకపై ఈ పరిస్థితి మారనుంది. మాతాశిశు సంరక్షణ కేంద్రం మంజూరుతో.. తల్లీబిడ్డలకు వైద్య సేవల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ విభాగానికి విడిగా రెండు ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేస్తారు. శుభపరిణామం.. కొండాపూర్లోని ఏరియా ఆస్పత్రిని ఇటీవల జిల్లా ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈక్రమంలో వంద నుంచి 250 పడకలకు ఆస్పత్రి సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంది. ఇది ఇంతవరకు అమలు కాలేదు. వంద పడకల్లోనే గైనకాలజీ, పీడియాట్రిక్ విభాగాలకు 25– 30 బెడ్లను వినియోగిస్తున్నారు. మిగిలిన పడకలను ఇతర విభాగాల పేషెంట్లకు కేటాయిస్తున్నారు. గైనిక్, పీడియాట్రిక్ విభాగాలకు ఆ పడకలు ఏమాత్రం చాలడం లేవు. కేసీఆర్ కిట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పటి నుంచి జిల్లా ఆస్పత్రికి గైనిక్ పేషెంట్లు రాక పెరిగింది. నెలకు సగటున 200లకుపైగా సాధారణ కాన్పులు, సిజేరియన్లు జరుగుతున్నాయి. నిత్యం ఓపీ సంఖ్య 250కి తగ్గడం లేదు. రోజు పది మంది ఇన్పేషంట్లు డిశ్చార్జ్ అవుతుండగా.. అంతే మొత్తంలో ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఆస్పత్రిలో మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు కానుండడం శుభపరిణామం. ఫలితంగా విస్తృత స్థాయిలో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు వైద్య సేవలు అందనున్నాయి. మరిన్ని పోస్టులు మంజూరు పీడియాట్రిక్, గైనిక్ విభాగాల్లో రోగుల తాకిడికి అనుగుణంగా వైద్యులు, సిబ్బంది లేరు. ప్రస్తుతం ఆరుగురు రెగ్యులర్ గైనిక్ వైద్యులు, మరో ఇద్దరు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. అలాగే చిన్నపిల్లల వైద్య నిపుణులు నలుగురు ఉన్నారు. మాతాశిశు సంరక్షణ కేంద్రం రాకతో మరిన్ని పోస్టులు వచ్చే వీలుంది. అదనంగా గైనిక్ వైద్యులు, సిజేరియన్లలో కీలకమైన అనస్థిషియన్, చిన్న పిల్లల వైద్య నిపుణులు నాలుగు చొప్పున మంజూరయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వీటితోపాటు నర్సు ఇతర పారామెడికల్ పోస్టులు కూడా వచ్చే వీలుందని పేర్కొంటున్నాయి. స్థలం ఎక్కడ? ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి జీ+2 అంతస్తుల్లో కొనసాగుతోంది. ఇదే భవనంపై మరో అంతస్తు నిర్మించి అక్కడ మాతాశిశు సంరక్షణ కేంద్ర ఏర్పాటు చేస్తే బాగుంటుందని జిల్లా ఆస్పత్రి అధికార వర్గాలు భావిస్తున్నాయి. అన్ని రకాల వైద్య సేవలు ఒకే ప్రాంగణంలో లభిస్తాయని, తద్వారా రోగులకు వ్యయప్రయాసాలకు తప్పుతాయని చెబుతున్నారు. అయితే, మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు కనీసం అర ఎకరం స్థలం కావాలని వైద్యవిధాన పరిషత్ డైరెక్టరేట్ పేర్కొంటోంది. భూముల ధరలు చుక్కలనంటుతున్న శేరిలింగంపల్లిలో ఆమేరకు భూమి అందుబాటులో లేదని అధికారులు పేర్కొంటున్నారు. స్థలం విషయమై త్వరలో కలెక్టర్ను సంప్రదించనున్నట్లు సమాచారం. ఒకవేళ స్థలం లభిస్తే మాతా శిశు సంరక్షణ కేంద్రం భవనాన్ని ప్రత్యేకంగా నిర్మిస్తారు. స్థల లభ్యత లేకుంటే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి భవనంపైనే ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు. -
‘అర్బన్’లో కాన్పులేవి?
కరీంనగర్హెల్త్: జిల్లా కేంద్రంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటివరకు ఒక ప్రసవం కూడా నిర్వహించలేదు. జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో రోగుల తాకిడి తగ్గించి స్థానికంగా మెరుగైన చికిత్స అందుబాటులోకి తేవాలనే ఉద్ధేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో ఆరు యూపీహెచ్సీలు ఏర్పాటు చేశారు. మాతా శిశు మరణాలు తగ్గించాలనే సంకల్పంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిపించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే నగరంలోని మూడు పాత అర్బన్ పీహెచ్సీలకు ప్రత్యేక నిధులు కేటాయించి వాటిని అభివృద్ధి చేసింది. ఆస్పత్రుల్లో ప్రాథమిక చికిత్స మాత్రమే కాకుండా అన్ని రకాల చికిత్స అందించేందుకు 10 పడకలతో సౌకర్యాలు కల్పించింది. అర్బన్ పీహెచ్సీ పరిధిలో నమోదైన గర్భిణులకు అక్కడే సాధారణ ప్రసవాలు జరిపించాలని లేబర్ రూంలను సైతం ఏర్పాటు చేసి సామగ్రి, సౌకర్యాలు కల్పించింది. అదేస్థాయిలో అవసరమైన వైద్యులు, సిబ్బందిని కూడా నియమించింది. అయినా ఇప్పటివరకు ఒక సాధారణ ప్రసవం కూడా జరగలేదు. ఎంసీహెచ్సీపై ప్రభావం పీహెచ్సీల మాదిరిగానే నగరంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు నిర్వహించకపోవడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రంపై విపరీతమైన ప్రభావం పడుతోంది. ఎక్కడి వారికి అక్కడే ప్రసవాలు జరిపించాలని, ప్రసవం ప్రమాదకరంగా మారిన గర్భిణులు, హైరిస్క్ కేసులను మాత్రమే ఇక్కడకు తీసుకురావాల్సి ఉంది. అయితే సాధారణ ప్రసవాలు కూడా జరుపకుండా ఎసీహెచ్సీకి రెఫర్ చేయడంతో వైద్యసేవలు అందించడం ఇబ్బందికరంగా మారుతోందని, రిస్కు కేసులపై దృష్టి సారించలేక పోతున్నామని వైద్యులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీహెచ్సీల్లో పెరుగుతున్న కేసులు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 2018 ఏప్రిల్ నుంచి 2019 జనవరి వరకు 8554 ప్రసవాలు నిర్వహించారు. 2019 జనవరిలోనే 762 ప్రసవాలు జరిగాయి. మాతా శిశు మరణాలు తగ్గించాలనే ఉద్దేశ్యంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిపించేందుకు చర్యలు చేపట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇంటింటికీ సర్వేలు నిర్వహించి గర్భిణుల పేరు నమోదు చేసుకొని ప్రత్యేక వైద్య సేవలు అందిస్తోంది. గర్బం దాల్చి పేరు నమోదు అయినప్పటి నుంచి ప్రసూతి జరిపించి తల్లితోపాటు శిశువును కూడా ఆరోగ్యంగా ఇంటికి చేర్చుతున్నారు. ఇంటికి చేరిన శిశువుకు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతినెలా వ్యాధి నిరోధక టీకాలు వేయడం వంటివి పకడ్బందీగా చేపడుతోంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ వంటి ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెట్టడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య రెట్టింపయింది. 2018లో 9185 ప్రసవాలు జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులతోపాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో 2018లో జనవరి నుంచి డిసెంబర్ వరకు 9185 ప్రసవాలు నిర్వహించారు. 2016లో 3762 ప్రసవాలు నిర్వహించగా, 2017లో దాదాపు సంఖ్య రెట్టింపై 6945కు చేరింది. 2019 జనవరిలో 762 ప్రసవాలు నిర్వహించారు. వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ప్రసవాలు నిర్వహించాలనే ఉద్దేశ్యంతో డాక్టర్లు, సిబ్బందికి వైద్య సేవలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆయా కేంద్రాల్లో జరుగుతున్న గర్భిణులు, బాలింతలు, శిశువులకు అందుతున్న వైద్యసేవలపై ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తున్నారు. గర్భిణుల పేరు నమోదు, వారికి అందుతున్న వైద్య సేవలపై దృష్టి సారిస్తోంది. పేరు నమోదు నుంచి డెలివరీ అయ్యే వరకు ప్రతీవారం ఆరోగ్య పరీక్షలు చేయడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. తొమ్మిది నెలలు నిండే సమయానికి ముందుగానే పరీక్షలు చేసి సుఖప్రసవం కావడానికి చర్యలు చేపడుతుండంతో ప్రసవాలసంఖ్య రెట్టింపు అవుతోంది. -
ఆసుపత్రి ఇలాగేనా..!
హుజూరాబాద్రూరల్: ‘ఆసుపత్రి ఇలాగే ఉంటుందా..? ఎటు చూసినా అపరిశుభ్రం.. మురికికూపాలుగా వార్డులు.. దుర్వాసన వస్తున్న మరుగుదొడ్లు.. ఇలాగైతే ఎలా..? విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు..’ అంటూ జిల్లా వైద్యాధికారి రామ్మనోహర్ రావు హెచ్చరించారు. ‘పేరుకే పెద్దాసుపత్రి’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ స్పందించారు. హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని పరిస్థితిని తెలుసుకుని నివేదిక అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి సూచించారు. ఈ మేరకు రామ్మనోహర్రావు ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని ప్రతివార్డులోని రోగుల వద్దకు వెళ్లి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పారిశుధ్యం లోపించడంతో సిబ్బందిని పిలిపించి తీవ్ర స్థాయిలో మందలించారు. మరుగుదొడ్లను సరిగ్గా శుభ్రం చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణలో పందులు స్వైరవిహారం చేయడాన్ని గమనించి.. వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పారిశుధ్యలోపంపై డిప్యూటీ డీఎంహెచ్వో రాజమౌళిని ప్రశ్నించారు. పర్యవేక్షణ ఇదేనా..? అంటూ మండిపడ్డారు. ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసిన రూ.5 లక్షలతో కాంటిజెంట్ వర్కర్లకు వేతనాలు ఇవ్వాలన్నారు. పారిశుధ్య సమస్య పునరావృతమైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓపీ (ఔట్పేషెంట్) రికార్డును పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇద్దరు వైద్యులు తప్పనిసరిగా ఓపీ చూడాలని సూచించారు. వైద్యులు ఎల్లప్పుడు రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. జమ్మికుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన బుర్ర సాత్విక రెండోకాన్పు చేయించుకోగా.. ఆడబిడ్డ జన్మించిందని, ఆ బిడ్డ తల్లిదండ్రులు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయమంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. శంకరటపట్నం మండలం ఆముదాలపల్లికి చెందిన రాధారపు నిఖిత గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా పరీక్షించారు. ప్రభుత్వ హాస్టల్లో ఆర్బీఎస్కే వైద్య బృందం పరీక్షలు జరిపారా..? అని ఆరా తీశారు. లేదనడంతో వెంటనే రాష్ట్రీయ బాల్ స్వస్త ఆరోగ్య కార్యక్రమం వైద్యుడికి ఫోన్ చేసి మాట్లాడాలని డిప్యూటీ డీఎంహెచ్వోను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని ప్రతిమ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణరావు, వైద్య సిబ్బంది ఉన్నారు. స్పందించిన సూపరింటెండెంట్ మరోవైపు సాక్షిలో వచ్చిన కథనానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణరావు స్పందించారు. సిబ్బందితో ఆసుపత్రి పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని తొలగించారు. మురికి నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో మట్టి పోయించారు. -
‘కేటీఆర్ సర్.. నా స్నేహితుడు చనిపోయాడు.. ఏం చేయమంటారు’
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల తీరుపై సినీదర్శకుడు మహానటి ఫేం నాగ్ అశ్విన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యానికి తన స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కెమెరామెన్ గా పని చేస్తున్నా అశ్విన్ స్నేహితుడు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయనను సికింద్రాబాద్ గాంధీ ఆసుప్రతికి తరలించారు. అయితే, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అతను మరణించాడు. ఈ అంశంపై ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ను ప్రశ్నిస్తూ.. జరిగిన దారుణాన్ని వివరించారు. ‘ఆదివారం రోజు నా స్నేహితుడు గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. ప్రమాదం జరిగిన అనంతరం అతను మూడుగంటల పాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. ఆదివారం కావడంతో డాక్టర్లు అందుబాటులో లేరు. అతని తల్లిదండ్రులే అతన్ని స్ట్రెచర్ పై పడుకోబెట్టి... అటు, ఇటు తిరిగారు. మరే ఆసుపత్రికి తీసుకెళ్లినా అతను బతికేవాడు. గాంధీ ఆసుపత్రిలో పనిచేసే నా సోదరి ఆదివారం రాత్రి ఉండే పరిస్థితిని వివరించింది. ఆసమయంలో డాక్టర్లు ఎందుకు ఉండరు? రాజధాని నగరమైన హైదరాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రిలో మనుషులు ప్రాణాలను ఎందుకు కాపాడుకోలేక పోతున్నాం? కేటీఆర్ సార్.. ప్రభుత్వాసుపత్రి చావులకు, నిర్లక్ష్యానికి పర్యాయపదం కాదని చెప్పడానికి ఏం చేయమంటారు? వైద్యం అందక చనిపోయిన నా స్నేహితుడు రాష్ట్రంలోనే గొప్ప కెమెరామెన్. దీనిపై ఎవరిని ప్రశ్నించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. వైద్యం అందక ఎవరూ చనిపోరాదు' అంటూ వరుస ట్వీట్లతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. what can we do @KTRTRS sir to make sure that the word 'government hospital' need not be synonymous with carelessness and death. my friend was easily one of the best cameramen we have in the state. i don't know whom else to ask sir. nobody should die needlessly — Nag Ashwin (@nagashwin7) November 27, 2018 -
ప్రైవేట్ ‘సేవ’లో
ఈ ఫొటోలో కనిపిస్తున్నది జిల్లాకేంద్ర ఆసుపత్రి.. ఆవరణలో నిలిచి ఉన్న వాహనాలు ప్రైవేటు ఆసుపత్రుల అంబులెన్స్లు. ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో ఈ వాహనాలేంటి..? అనుకుంటున్నా రా.. ప్రమాదంబారిన పడిన రోగులను తీసుకొచ్చే 108 సిబ్బంది కోసం.. ప్రభుత్వ వైద్యులు రెఫర్ చేసే కేసుల కోసం ఇలాంటి వాహనాలు ఇక్కడ నిలిపి ఉండడం ఆసుపత్రి వద్ద నిత్యకృత్యం. కరీంనగర్హెల్త్: పెద్దపల్లి బ్రిడ్జి సమీపంలో ఇటీవల ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. మంథని రోడ్డువైపు ప్యాసింజర్లతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రైవేటు ఉద్యోగి కటుకూరి చందుకు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన సిబ్బంది మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు రెఫర్ చేశారు. అదే వాహనంలో కరీంనగర్కు బయలుదేరారు. దారి మధ్యలో.. ముఖానికి చాలావరకు గాయాలయ్యాయని.. రక్తంకూడా ఎక్కువగా పోయిందని.. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే అంతంత మాత్రంగానే వైద్యసేవలు అందుతాయని సదరు అంబులెన్స్ సిబ్బంది రోగి బంధువులను భయపెట్టారు. దీంతో హైరానాపడిన బంధువులు ఏదైనా మంచి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోరారు. ‘మనకు తక్కువ ఖర్చులో వైద్యంచేసే మంచి హాస్పిటల్ ఉంది. కానీ.. 108లో ప్రభుత్వ ఆస్పత్రికే తీసుకెళ్లాలి. అక్కడినుంచి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేస్తాం. అంతా మేం చూసుకుంటాం..’ అని ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చారు. అక్కడికి చేరుకోగానే అప్పటికే ఓ ప్రైవేటు ఆస్పత్రి అంబులెన్స్ సిద్ధంగా ఉంచారు. వెంటనే అక్కడి నుంచి వారిని తీసుకెళ్లి ప్రైవేటులో చేర్పించారు. విచిత్రం ఏంటంటే.. ఆ ప్రైవేటు ఆస్పత్రికి తరలించేందుకు స్వయంగా 108 సిబ్బంది ఒకరు సాయం అందించడం. క్షతగాత్రుడిని ఎమర్జెన్సీలోకి తరలించిన వెంటనే ఆస్పత్రి యాజమాన్యం అందించిన రూ.5వేల కవర్ను తీసుకుని అక్కడినుంచి జారుకున్నట్లు సమాచారం. ఈ ఒక్క సంఘటన చాలు 108 సిబ్బంది అత్యవసర సమయంలో ఉన్నవారిని ప్రైవేటు ఆస్పత్రులకు ఎలా తరలిస్తున్నారో చెప్పడానికి. వైద్యసేవల ముసుగులో జిల్లాలో దళారీ రాకెట్ వ్యవస్థ నడుస్తోంది. దళారీ వైద్య వ్యవస్థలో అంబులెన్స్ నిర్వాహకులే ప్రధానపాత్ర పోషిస్తూ ప్రజలను దోపిడీకి గురిచేస్తున్నారు. ఈ దళారీ వ్యవస్థను జిల్లాకేంద్రంలోని సూపర్స్పెషాలిటీ, మల్టీస్పెషాల్టీ ఆసుపత్రులుగా చెప్పుకునే నిర్వాహకులే పెంచిపోషిస్తున్నారంటే అతిశయోక్తి కలగక మానదు. ఈ దందా ఒకటికాదు.. రెండుకాదు.. ఏకంగా పదేళ్లుగా కొనసాగుతుండడంతో అంబులెన్స్ నిర్వాహకులు తమను ఎవరూ ఏమిచేయలేరు.. అన్నట్లు మారింది. వీరితోపాటు ప్రైవేటు హాస్పిటల్ నిర్వాహకులూ వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే వైద్యాధికారులను సైతం తమ కనుసన్నల్లోకి తిప్పుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పదేళ్లుగా వేళ్లూనుకుపోయిన ఈ దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చికిత్స పేరుతో ప్రజల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు. అంబులెన్స్లే దళారీలు.. జిల్లా కేంద్రంలో హంగుఆర్భాటాలతో నడిపిస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలకు అంబులెన్స్ నిర్వాహకులు దళారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవస్థలో రెండు రకాలు. మొదటిది రోగాలబారిన పడిన వారిని నమ్మించి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించడం. రెండోది ప్రమాదంలో గాయపడి.. ఆపదలో ఉన్నవారికి మాయమాటలు చెప్పి భారీగా కమీషన్లు ఇచ్చే ఆస్పత్రుల్లో చేర్పించడం. ఉన్నట్టుండి తీవ్ర కడుపునొప్పి రావడం, గుండెపోటు, విషం తాగిన వంటి కేసులు స్థానిక అంబులెన్స్లను ఆశ్రయిస్తుంటారు. వీరి ఆపద, ప్రమాదస్థాయిని ఆసరాగా చేసుకుని ఆ స్థాయి ఆస్పత్రికి తరలిస్తుంటారు. మంచి డాక్టర్ ఉన్న ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తానని చెప్పి ‘మీ ప్రాణాలకు ఢోకాలేదు..’ అని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా ప్రజలను నమ్మించి ఎక్కువ కమీషన్లు వచ్చే హాస్పిటల్లో చేర్పిస్తారు. బాధితులతో అంబులెన్స్ అక్కడికి చేరుకోగానే హాస్పిటల్ వద్ద డాక్టర్, నర్సు, బాయ్స్తో కలిసి హంగామా చేస్తుంటాడు. వాహనం ఆగడంతోనే బాధితులను స్ట్రచ్చర్పై వేసి లోనికి పంపించి ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న ప్రకారం కమీషన్ జేబులో వేసుకుని కనిపించకుండా వెళ్లిపోతారు. అంబులెన్స్ల హవా.. ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య పెరగడంతోపాటు వారిలో పోటీ నెలకొనడంతో ఈ మధ్యకాలంలో అంబులెన్స్ల దళారీ వ్యవస్థ మొదలైంది. గ్రామీణ ప్రాంతాల నుంచి కేసులను తీసుకువచ్చిన అంబులెన్స్ నిర్వాహకులకు కమీషన్లు ఇచ్చేవారు. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులకు మాత్రమే సొంత అంబులెన్స్లు ఉండేవి. ఇవి కూడా అనుబంధంగా మాత్రమే నడిచేవి. ఇపుడు ప్రతి హాస్పిటల్కు ఒకటి, పెద్ద ఆస్పత్రులకు నాలుగైదు అంబులెన్స్లు ఉంటున్నాయి. వీటితోపాటు మండల హెడ్క్వార్టర్స్లో కూడా అంబులెన్స్లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. ఎక్కువ కేసులు తమ హాస్పిటల్కే పంపించాలని అంబులెన్స్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎక్కువ సంఖ్యలో కేసులు తీసుకువస్తే ఒక కొత్త అంబులెన్స్ వాహనం గిఫ్టుగా ఇస్తామని ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ ఒప్పందం కారణంగానే డ్రైవర్లుగా ఉన్న వారు అంబులెన్స్ ఓనర్లు అయ్యారు. జిల్లాలో మూడు వందలకుపైగా ప్రైవేటు అంబులెన్స్లు ఉన్నాయి. వీటిలో సగం కంటే ఎక్కువ జిల్లా కేంద్రంలో ఆయా ఆస్పత్రుల పేర్లతో కనిపిస్తుంటాయి. ప్రభుత్వాస్పత్రి చుట్టూ.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రి చుట్టు ప్రజలను భయాందోళనకు గురిచేసేలా ప్రైవేటు అంబులెన్స్లు మోహరిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి ప్రహారీ గోడ చుట్టు కనీసం 50వరకు ప్రైవేటు అంబులెన్స్లు ఏర్పాటు చేసుకుని నిర్వాహకులు రోగులకోసం వార్డుల్లో తిష్టవేసి తిరుగుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి ఏదైనా సీరియన్ కేస్ వచ్చిందంటే చాలు వారిని ప్రైవేటుకు తరలించుకుపోయే చర్యలు చేపడుతున్నారు. అందుబాటులోనే మంచి డాక్టర్ ఉన్నాడని, తక్కువ ఖర్చులో చేపిస్తామంటూ కమీషన్ల కోసం మాయమాటలతో వారిని ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్చుతున్నారు. ఫిర్యాదులు అందితే చర్యలు: బాలక్రిష్ణ, 108 ఐదు జిల్లాల ఇన్చార్జి, ప్రోగ్రాం మేనేజర్ 108 సిబ్బంది క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లినట్లు ఫిర్యాదులు అందితే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. తప్పనిసరిగా అందుబాటులో ఉన్న ప్రభు త్వ ఆస్పత్రికి మాత్రమే తీసుకువెళ్లాలి. బా ధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండి బంధువులు ప్రైవేటుకు తీసుకువెళ్లాలని కోరితే ఉన్నతాధికారుల అనుమతితోనే ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకుపోతుంటారు. ప్రైవేటుకు వెళ్లాలని సూచించడం.. ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులు ఏమీ అందలేదు. -
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
ఖమ్మం వైద్యవిభాగం: మారుమూల ప్రాంతాల్లో గర్భిణులు అవస్థలు పడొద్దని.. సుఖ ప్రసవం జరగాలని.. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2017, జూన్ 2న అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెంచేలా కార్యాచరణ రూపొందించి.. అమలు చేస్తోంది. కేసీఆర్ కిట్ అందజేయడంతోపాటు ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగపిల్లాడు పుడితే రూ.12వేల చొప్పున అమ్మ ఒడి పథకం ద్వారా అందించేందుకు శ్రీకారం చుట్టింది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 15 నెలల కాలంలోనే రెట్టింపు అయింది. పథకానికి ముందు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏడాదికి 22వేలకు పైగా ప్రసవాలు జరగగా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాటి సంఖ్య 5వేలకు మించని పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నా.. పీహెచ్సీలలో ఆశించిన మేర జరగకపోవడంతో పథకం లక్ష్యం నెరవేరకుండా పోతోంది. పీహెచ్సీల్లో 8 శాతం మాత్రమే.. జిల్లాలో 22 పీహెచ్సీలు ఉండగా.. పథకం ప్రారంభమైన 15 నెలల కాలంలో కేవలం 8 శాతం మాత్రమే ప్రసవాలు జరగడం గమనార్హం. కల్లూరు పీహెచ్సీలో మాత్రమే 182 ప్రసవాలు జరిగాయి. వైరా 101, బోనకల్ 98 ప్రసవాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కొన్ని పీహెచ్సీలలో రెండు అంకెలు కూడా దాటకపోవడం శోచనీయం. మంచుకొండ 2, సుబ్లేడు 3, కూసుమంచి 5, పెద్దగోపతి 6, కామేపల్లి పీహెచ్సీలలో 9 డెలివరీలు మాత్రమే చేయడంతో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 12,606 ప్రసవాలు చేయగా.. పీహెచ్సీలలో 1,019 మాత్రమే చేశారు. ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ పీహెచ్సీల్లో మాత్రం 8 శాతం మాత్రమే కావడం వల్ల ఆ శాఖ పనితీరు అర్థమవుతోంది. 92 శాతం వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లోనే.. జిల్లాలోని పెద్దాస్పత్రితోపాటు సత్తుపల్లి, పెనుబల్లి, మధిరలో వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులున్నాయి. అయితే పీహెచ్సీలకన్నా వీటిలోనే అధికంగా ప్రసవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు కావడంతో ఎక్కువ మంది గర్భిణులు ఆయా ప్రాంతాల్లో ప్రసవాలు చేయించుకునేందుకు వస్తున్నారు. ఇక్కడైతే మంచి సౌకర్యాలు ఉంటాయనే ఉద్దేశంతో వ్యయ ప్రయాసలకోర్చి వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. 15 నెలల కాలంలో 92 శాతం డెలివరీలు ఈ ఆస్పత్రుల్లోనే జరిగాయి. పెద్దాస్పత్రిలో రికార్డు స్థాయిలో.. రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రసవాలు హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 15 నెలల కాలంలో జిల్లావ్యాప్తంగా 12,606 ప్రసవాలు జరగగా.. ఒక్క పెద్దాస్పత్రిలోనే 10,082 ప్రసవాలు జరగడం గమనార్హం. ముఖ్యంగా మాతా, శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడంతో ఇక్కడ ప్రసవాలు చేయించుకునేందుకు గర్భిణులు ఆసక్తి చూపుతున్నారు. పెద్దాస్పత్రిలో ప్రతి రోజు 20 నుంచి 30 వరకు ప్రసవాలు చేస్తున్నారు. 90 శాతం వరకు ఇక్కడే ప్రసవాలు జరుగుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ లెక్కలు చెపుతున్నాయి. అయితే ఎక్కువ సంఖ్యలో గర్భిణులు పెద్దాస్పత్రికి వస్తుండడంతో ఇక్కడి వైద్యులపై మరింత భారం పడుతోంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యధికంగా ప్రసవాలు జరుగుతుండగా.. పీహెచ్సీల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పీహెచ్సీల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, మారుమూల ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించకపోవడం వంటి కారణాల వల్ల అక్కడ ప్రసవాలు చేయించుకునేందుకు గర్భిణులు ఇష్టపడట్లేదని తెలుస్తోంది. సబ్సెంటర్ స్థాయిలో అవగాహన పెంచాలి.. పీహెచ్సీల్లో ప్రసవాలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతను సబ్సెంటర్ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తే మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. పీహెచ్సీల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, ఆర్థికంగా వచ్చే ప్రయోజనం ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల ద్వారా గర్భిణులకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్ కిట్ల పథకం వచ్చాక ఎక్కువ మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కేసీఆర్ కిట్తోపాటు ప్రోత్సాహకం కూడా ఇస్తుండడంతో గర్భం దాల్చిన వెంటనే పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 12,606 ప్రసవాలు జరగగా.. 11,225 మందికి కేసీఆర్ కిట్లు అందించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పీహెచ్సీలకు వచ్చేందుకు మాత్రం గర్భిణులు ఇష్టపడటం లేదు. ఆ విధానం మారాలంటే వైద్య, ఆరోగ్య శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు పీహెచ్సీల్లో ప్రసవాలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతపై వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పీహెచ్సీల్లో పెంచేందుకు ప్రణాళికలు పీహెచ్సీల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. సబ్సెంటర్లలోని ఆశ, ఏఎన్ఎం, సూపర్వైజర్ల ద్వారా గర్భిణులను గుర్తించి.. వారికి అవగాహన కల్పిస్తున్నాం. దగ్గర్లోని పీహెచ్సీల్లో ప్రసవాలు చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై వివరిస్తున్నాం. అలాగే తొలిసారి సాధారణ కాన్పు చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా పీహెచ్సీల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. - కళావతిబాయి, డీఎంహెచ్ఓ -
కంటి వెలుగు ముమ్మరం
నల్లగొండ టౌన్ : ప్రజలను దృష్టి లోపం నుంచి గట్టెక్కించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. ఆగస్టు 15న లాంఛనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ నిరంతరాయంగా కొనసాగిస్తోంది. పండుగలు, సెలవు దినాలు మినహా అన్ని రోజుల్లోనూ కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తోంది. ఈ శిబిరాలను జనవరి 26 వరకు కొనసాగించడానికి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పక్కా ప్రణాళికతోముం దుకు సాగుతోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక్కో శిబిరంలో రోజూ 250 నుంచి 300 మంది వరకు కంటి పరీక్షలను నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు. కంటి అద్దాల అందజేత.. కంటి పరీక్షలకు జిల్లా వ్యాస్తంగా 37 వైద్య బృందాలను ఏర్పాటు చేసి అందులో 37 మంది వైద్యాధికారులతో కలిసి ఒక్కో బృందంలో 12 మంది సిబ్బందిని నియమించారు. జిల్లాలోని ఆయా మండలాల్లోని 57 గ్రామాలు, పట్టణాల్లోని 13 వార్డుల్లో ఇప్పటికే కంటి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఇప్పటి వరకు లక్షా 36 వేల 202 మందికి కంటి పరీక్షలను నిర్వహించారు. అందులో పురుషులు 59,553 మంది కాగా మహిళలు 76,634, థర్డ్జెండర్ 15 మంది ఉన్నారు. పరీక్షలు పూర్తయిన వారిలో ఎస్సీలు 25,941, ఎస్టీలు 11,213, బీసీలు 77,913, ఇతరులు 16,219, మైనార్టీలు 4,916 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 29,657 మంది రీడింగ్ కంటి అద్దాలను ఉచితంగా అందజేశారు. కంటి అద్దాలను అందించిన వారిలో నలబై సంవత్సరాల్లోపు వారు 5,709 మంది, నలబై సంవత్సరాలు దాటిన వారు 23,948 మంది ఉన్నారు. ఇతర కంటి అద్దాలను పంపిణీ చేయడానికి గాను 33,660 మందిని గుర్తించి వారికి తరువాత అద్దాలను అందజేయనున్నారు. 13,705 మందిని శస్త్ర చికిత్సలకు రెఫర్ చేశారు. అందులో 10,198 మందిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితో పాటు ఇతర ఏరియా ఆస్పత్రులకు, 3,507 మందిని హైదరాబాద్లోని సరోజిని, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ఉదయం నుంచే బారులు.. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించే తేదీలకు ముందుగానే ఆయా గ్రామాలు, వార్డుల్లో ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి తెలియజేయడంతోపాటు.. డప్పు చాటింపులను వేయిస్తున్నారు. దీంతో ప్రజలు ఉదయం 9 గంటలకు ముం దే ఆయా శిబిరాల వద్ద బారులుదీరుతున్నారు. స్వచ్ఛం దంగా కంటివెలుగు కార్యక్రమంలో భాగస్వాములు అవుతుండడంతో సిబ్బంది ఉత్సాహంతో సేవలు అంది స్తున్నారు. కంటివెలుగు కార్యక్రమంలో నాణ్యమైన కంటి అద్దాలను ఉచితంగా అందిస్తుండడంతో ప్రజలు వాటిని తీసుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా తమ ఆధార్ కార్డును తప్పక తీసుకురావాలని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రజల నుంచి విశేష స్పందన కంటి వైద్య శిబిరాలకు ప్రజల నుం చి విశేష స్పందన వస్తోంది. ప్రజ లు స్వచ్ఛందంగా ఉదయం నుంచే క్యాంపు వద్ద బారులుదీరుతున్నా రు. నాణ్యమైన అద్దాలను అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అ మలు చే స్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. జనవరి 26 వరకు నిరంతరం శిబిరాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం. కె.భానుప్రసాద్నాయక్, డీఎంహెచ్ఓ -
డెంగీ పంజా
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో డెంగీ పంజా విసురుతోంది. ఏ ఊరిలో చూసినా జ్వరపీడితులే మంచంపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. చిన్నా పెద్ద, వృద్ధులు అనే తేడా లేకుండా డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాలు, చికున్గున్యా, ఇతర జ్వరాలతో వణికిపోతున్నారు. వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఏజెన్సీ ప్రాంతంలోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆదిలాబాద్ పట్టణంతోపాటు ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, తదితర మండలాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వైరల్ జ్వరాలు సోకడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. రిమ్స్ ఆస్పత్రిలో పడకలన్ని నిండిపోయాయి. ఒక్కో బెడ్పై ఇద్దరు ముగ్గురేసి రోగులకు వైద్య చికిత్సలు అందించాల్సిన దుస్థితి నెలకొంది. వైద్య, ఆరోగ్య శాఖ వ్యాధులను అరికట్టాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో జ్వరాలు అదుపులోకి రావడం లేదు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం లేదని, దోమల నివారణకు చర్యలు చేపట్టడం లేదని పలువురు పేర్కొంటున్నారు. వణికిస్తున్న జ్వరాలు జిల్లాను జ్వరాలు వణికిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 20,289 మందికి వైరల్, ఇతర జ్వరాలు, ఐదుగురికి మలేరియా జ్వరాలు, 140 మందికి డెంగీ జ్వరాలు సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖాధికారులు లెక్కలు చూపుతున్నారు. అధికారుల లెక్కలకు రెట్టింపుగా జ్వరపీడితుల సంఖ్య ఉందని తెలుస్తోంది. రిమ్స్ ఆస్పత్రిలోని పిల్లల వార్డులో దాదాపు వంద మందికి పైగా డెంగీ జ్వరంతో చేరారు. ఇతర జ్వరాలతో కూడా పిల్లల వార్డు కిక్కిరిసిపోయింది. దీంతోపాటు రిమ్స్ జనరల్ వార్డులో మహిళలు, పురుషుల రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. రోగులకు సరిపడా పడకలు లేకపోవడంతో ఒక్కో బెడ్పై ఇద్దరికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. మలేరియా కేసులు బజార్హత్నూర్లో 1, సైద్పూర్లో 1, హస్నాపూర్లో 2, ఆదిలాబాద్ పట్టణంలోని న్యూహౌజింగ్బోర్డులో ఒకరికి మలేరియా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. పారిశుధ్యమే కారణం.. ఆదిలాబాద్ పట్టణంలో డెంగీ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మిషన్ భగీరథ గుంతల్లో ఇటీవల కురిసిన వర్షపునీరు చేరడం, దోమలు వృద్ధి కావడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. మొదటి కేసు జిల్లాలో ఇంద్రవెల్లి మండలం సుక్యనాయక్తండా, ఉట్నూర్ మండలం అందునాయక్తండాల్లో నమోదైనట్లు వైద్యారోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. ఇంద్రవెల్లి, ఉట్నూర్లో డెంగీ బాధితులు అధికంగా ఉన్నారు. ముఖ్యంగా పారిశుధ్య సమస్యతోనే జ్వరాలు సోకుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆస్పత్రులు కిటకిట.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. రోజురోజుకు జ్వర బాధితుల సంఖ్య పెరుగుతుండడమే దీనికి కారణం. రిమ్స్లో రోగులకు సరిపడా బెడ్లు లేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రజలు వైద్య సేవలు పొందుతున్నారు. ఇదే అదునుగా తీసుకొని ప్రైవేట్ ఆస్పత్రుల వారు అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. అవసరం లేకున్నా అన్ని పరీక్షలు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని రోగుల బంధువులు లబోదిబోమంటున్నారు. సరైన వైద్యం అందడంలేదనే కారణంతో ఎక్కువమంది వైద్య చికిత్సల కోసం మహారాష్ట్రలోని యావత్మాల్, నాగ్పూర్, తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. డెంగీతో ఒక్కరూ చనిపోలేదు జిల్లాలో డెంగీ కేసులు ఉన్న మాట వాస్తవమే. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా డెంగీతో చనిపోయినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడి కాలేదు. జైనథ్ మండలంలో ఒక బాలుడు చనిపోయినట్లు తెలిసింది. వారిక్కడ వైద్య సేవలు పొందలేదు. వాటికి సంబంధించి రిపోర్టులు పరిశీలిస్తున్నాం. ముఖ్యంగా డెంగీ జ్వరం రావడానికి సానిటేషనే కారణం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కొబ్బరిచిప్పలు, పాత టైర్లు, వర్షపు నీరు నిల్వ ఉండే వాటిని తొలగించారు. వాటితోనే డెంగీ దోమలు వృద్ధి చెందుతాయి. దోమల నివారణ కోసం ఫాగింగ్ స్ప్రే చేయిస్తున్నాం. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. తీవ్ర జ్వరం వస్తే ఆర్ఎంపీలను సంప్రదించవద్దు. సమీప ఆస్పత్రిలో వైద్య చికిత్సలు తీసుకోవాలి. డెంగీ జ్వరం కోసం రిమ్స్లో ఎన్ఎస్–1 పరీక్షలు చేయడం జరుగుతుంది. నాలుగు రోజులపాటు తగ్గకుంటే ఐజీఎం పరీక్ష కూడా చేయడం జరుగుతుంది. – డాక్టర్ రాజీవ్రాజ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఆదిలాబాద్ -
నరకం చూపించారు సార్!
ప్రసవం కోసం వస్తున్న గర్భిణుల పట్ల జిల్లాకేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పురిటినొప్పులు వచ్చినా.. వైద్యులతోపాటు సిబ్బంది కూడా పట్టించుకోవడంలేదు. సాధారణ కాన్పు అవుతుదంటూ గర్భిణుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. సోమవారం కూడా ఓ గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతున్నా.. కాన్పు చేయలేదు. దీంతో ఆ గర్భిణికి ఫిట్స్ వచ్చింది. వైద్యసిబ్బంది నిర్లక్ష్యాన్ని గమనించిన ఆమె బంధువులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ 10 నిమిషాల్లోనే సాధారణ ప్రసవం చేసి.. మగశిశువుకు పురుడుపోశారు. కరీంనగర్హెల్త్: జిల్లాకేంద్రంలోని విజయపురికాలనీకి చెందిన అఫ్రీన్ పురిటినొప్పులతో బాధపడుతూ జిల్లాకేంద్ర ఆస్పత్రి ఆవరణలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో శనివారం చేరింది. పరీక్షలు చేసిన వైద్యులు.. ప్రసవానికి ఇంకా సమయం ఉందన్నారు. మధ్యాహ్నంవరకు నొప్పులు తీవ్రమైనా.. ఇంకా సమయం ఉందంటూ పట్టించుకోలేదు. నొప్పులు తీవ్రమై కాళ్లు, చేతులు మెలికలు తిరుగుతూ ఫిట్స్వచ్చి బాధితురాలు కొట్టుకుంది. పరిస్థితిని గమనించిన బంధువులు నగరంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంకు తరలించారు. వెయ్యి కాన్పులు లక్ష్యం అంటూ గొప్పలు.. పేదలకు సత్వర వైద్యం అందించి వెయ్యి కాన్పులు చేయడమే లక్ష్యమని గొప్పలు చెబుతున్న మాతాశిశు ఆరోగ్య కేంద్రం వైద్యులు ఆదిశగా సేవలు అందించడం లేదు. ఆస్పత్రిలో గర్భిణుల పట్ల సిబ్బంది అనుసరిస్తున్న తీరు పరాకాష్ఠకు చేరుతోంది. మాతా, శిశు మరణాలు తగ్గించాలనే సంకల్పంతో రూ.16కోట్లతో ఏర్పాటుచేసిన ఈ కేంద్రంలో సత్వర సేవలు కాదుగదా.. కనీస సేవలు అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలు నిండిన తర్వాత ఆస్పత్రిలో చేర్చుకుంటున్నా.. తర్వాత పట్టింపు కరువైందని, అసలు ఆసుపత్రికి ఎందుకు వస్తున్నారన్నట్లు సిబ్బంది వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వం చెబుతున్న ప్రకటనలకు.. ఆసుపత్రిలో గర్భిణులకు అందుతున్న సేవలకు పొంతన లేకుండాపోతోందని విమర్శిస్తున్నారు. నరకం చూపించారు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి సాధారణ కాన్పు అవుతుందని కాలయాసన చేశారు. మేం కూడా వారికి సహకరించాం. నొప్పులతో తల్లడిల్లుతున్నా.. వైద్యులు పట్టించుకోలేదు. పూటకోడాక్టర్.. గంటకోనర్సువచ్చి వెళ్లారు తప్పితే.. వైద్యానికి ఎవరూ ముందుకురాలేదు. ఇంకా టైం ఉందని, తమకు తెల్వదా.. ? అంటూ నరకం చూపించారు. అప్పటికే కాళ్లు, చేతులు వంకరలు పోయి కొట్టుకుంది. ప్రైవేటుకు తీసుకుపోతామంటే సంతకం చేయాలని వేధించారు. వారి నిర్లక్ష్యాన్ని గమనించి ప్రైవేటు ఆసుపత్రికి తరలించాం. ఆలస్యమై ఉంటే ప్రాణాలకు ముప్పు ఉండేది. ప్రభు త్వ ఆస్పత్రి సిబ్బంది తీరు చాలా దారుణం. పేదలకు సేవలందించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. – సయ్యద్ ఖలీం, బాధితురాలి భర్త -
గ్రామీణ వైద్యం.. గాలిలో దీపం
దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు. గ్రామీణ ప్రాంతాలు సుభిక్షంగా ఉంటేనే దేశం బాగుంటుంది. అక్కడి ప్రజలే అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతుంటే..వారికి ప్రాథమిక వైద్యం కూడా అందని ద్రాక్షగా మారితే అది సమాజాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జిల్లాలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో గ్రామీణ వైద్యం పడకేసింది. నిపుణులైన వైద్యులు లేకపోవడం, ఉన్న వైద్యుల్లోనూ కొందరు విధులకు సరిగా రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా సాధారణ వ్యాధులకు సైతం పల్లెజనం పట్టణ బాట పడుతున్నారు. కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా ఇందులో 24 గంటలు పనిచేసే పీహెచ్సీలు 40 దాకా ఉన్నాయి. వీటితోపాటు వైద్య విధాన పరిషత్ పరిధిలో 20 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సామాజిక ఆరోగ్య కేంద్రాలు) పనిచేస్తున్నాయి. ఆయా కేంద్రాల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో కలిసి 2,125 మంది దాకా పనిచేస్తున్నారు. పీహెచ్సీల్లో ప్రాథమిక వైద్యం, సీహెచ్సీల్లో సాధారణ వ్యాధులతోపాటు ప్రసవాలు, చిన్నపిల్లలకు వచ్చే వ్యాధులకు వైద్యమూ అందించాల్సి ఉంది. గ్రామీణ ప్రజలు ముందుగా ఏదైనా జ్వరం వస్తే సమీపంలోని సబ్సెంటర్ను ఆశ్రయిస్తున్నారు. అక్కడ నర్సులు ఇచ్చే చికిత్సకు వ్యాధి స్పందించకపోతే పీహెచ్సీలకు వెళ్తారు. అక్కడ కూడా ఆరోగ్యం బాగు పడకపోతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు రెఫర్ చేస్తారు. ఇక్కడ కూడా బాగు కాకపోతే జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రులకు రోగులను వైద్యులు రెఫర్ చేస్తారు. సమయపాలన పాటించని వైద్యులు సీహెచ్సీలు, పీహెచ్సీల్లో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు ఉండి చికిత్స అందించాలి. 24 గంటలు పనిచేసే ఆసుపత్రులు, కొన్ని సీహెచ్సీల్లో నిరంతరం వైద్య సిబ్బంది ఉండి ఏ సమయంలోనైనా వచ్చే రోగులకు చికిత్స చేయాలి. ఈ మేరకు ఆయా ఆసుపత్రుల్లో అధికారులు బయోమెట్రిక్ మిషన్ను ఏర్పాటు చేసి హాజరు పరిశీలిస్తున్నారు. దీనిని సీఎం డ్యాష్బోర్డుకు అనుసంధానం చేసి, ఏ రోజు, ఏ సమయంలో ఎంత మంది హాజరయ్యారో రికార్డు చేస్తారు. కానీ జిల్లాలో అ«ధికశాతం ఆసుపత్రుల్లో వైద్యులు సమయపాలన పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లా కేంద్రం, డివిజన్ కేంద్రాలకు దూరంగా ఉండే పీహెచ్సీలు, సీహెచ్సీల్లో ఈ పరిస్థితి మరీ అధికంగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆసుపత్రికి వెళితే అధికశాతం వైద్యులు కనిపించడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిపుణులైన వైద్యులు కరువు జిల్లాలోని 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 159 మెడికల్ ఆఫీసర్ పోస్టులుండగా అందులో 76 రెగ్యులర్, 59 కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న వారిలోనూ 8 మంది పీజీ వైద్యవిద్య కోసం వెళ్లగా, వారి స్థానంలో పక్క పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యులను డిప్యుటేషన్పై వేస్తున్నారు. ఈ కారణంగా రెండుచోట్లా రోగులకు వైద్యం జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 8 డిప్యూటీ సివిల్ సర్జన్, 50 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 8 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ 3, డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు ఒకటి మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం నాటి జనాభాకు అనుగుణంగా ఉన్న పోస్టులే ఇప్పటికీ ఉండటం, జనాభా పెరగడంతో పాటు ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్యా పెరగడం వల్ల ఉన్న వైద్యులపై అదనపు భారం పడుతోంది. కొన్ని కేంద్రాల్లో వైద్యులు సమయపాలనపాటించకపోవడంతో రోగులు వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. పెద్దాసుపత్రిపైనే పెద్దభారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను బోధనాసుపత్రిగా పరిగణిస్తారు. పీహెచ్సీలు, సీహెచ్సీలు, జిల్లా ఆసుపత్రుల్లో నయం కాని కేసులను మాత్రమే అక్కడి వైద్యులు ఈ ఆసుపత్రికి రెఫర్ చేయాలి. కానీ పలు రకాల కారణాల వల్ల అధిక శాతం రోగులు సాధారణ వ్యాధులకూ ఇదే ఆసుపత్రికి చికిత్స కోసం వస్తున్నారు. ఫలితంగా ఈ ఆసుపత్రిలో ప్రతిరోజూ ఓపీ రోగుల సంఖ్య 2,500ల నుంచి 3 వేలు దాటుతోంది. 1,050 పడకలు మంజూరైతే 1,500లకు పైగా రోగులు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ కారణంగా అదనంగా, అనధికారికంగా 700లకు పైగా పడకలను రోగుల కోసం అధికారులు వేయాల్సి వస్తోంది. మూడింతలు అధికంగా రోగులు వస్తున్నా దానికి అనుగుణంగా ఇక్కడి వైద్యులు, ఉద్యోగులు, పారామెడికల్ సిబ్బంది సంఖ్యను ప్రభుత్వం పెంచడం లేదు. లద్దగిరిలో డాక్టర్లుండరు మా ఊరికి లద్దగిరి ఆసుపత్రి దగ్గరే. అయితే మా ఊరు ఆసుపత్రి పరిధిలోకి రాదని అక్కడి వైద్యులు చెబుతున్నారు. చికిత్స కోసం వెళితే సరిగ్గా చూడరు. ఈ కారణంగా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నాం. ఊళ్లోనే బాగా చూస్తే మాకు ఇంత దూరం వచ్చి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం లేదు. –సురేష్, రేమడూరు మా ఆసుపత్రిలో సరిగ్గా చూడరు మా ఊళ్లో ఉన్న ధర్మాసుపత్రిలో సమయానికి డాక్టర్లుండరు. ఉన్నా మమ్ముల్ని సరిగ్గా చూడరు. నాకు కాళ్లనొప్పులు, ఆయాసం ఉంది. మా ఊళ్లో ఆసుపత్రికి వెళితే మందులు తక్కువగా ఇస్తారు. అందుకే దూరమైనా ఈ పెద్దాసుపత్రికి వస్తున్నా. నెలకోసారి వచ్చి డాక్టర్లకు చూపించుకుంటా. ఇక్కడి డాక్టర్లు నాకు నెలరోజులకు మందులు ఇస్తారు. ఊరి నుంచి ఆసుపత్రికి వచ్చిపోవాలంటే రూ.80 అవుతుంది. – పక్కీరమ్మ, సి.బెళగల్ -
భూత వైద్యులే డాక్టర్లు
పట్నా : బిహార్లోని ముజఫర్పూర్ బాలికల వసతి గృహంలో మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బిహార్లో ప్రభుత్వం అసుపత్రిలో వైద్యులకు బదులుగా తాంత్రికులు, భూతవైద్యులు రోగులకు క్షుద్ర పూజలతో వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటన వైశాలి జిల్లాలోని హజీపూర్లో శనివారం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్యుల చికిత్స అందించకుండా భూతవైద్యులతో చట్ట విరుద్ద కార్యాకలపాలకు పాల్పడుతున్నారు. రోగులను బెడ్లపై పడుకోపెట్టి చీపుర్లతో తీవ్రంగా కొడుతూ.. మంత్రాలు, క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఓ రోగి చప్పిన సమాచారం ప్రకారం పాము కాటుకు గురైన తనని వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే అక్కడున్న వైద్యులు తాంత్రికుల వద్దకు వెళ్లమని సలహా ఇచ్చారని ఆమె తెలిపారు. ఇప్పటికే షల్టర్ హోమ్ ఘటనతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నితీష్ కుమార్కు ఈ ఘటనతో మరోసారి ఆరోపణలు ఎదుర్కొక తప్పదు. -
సీజనల్ వ్యాధుల పట్ల ఇంత నిర్లక్ష్యమా?
తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అనేక జిల్లాల్లో చెరువులు, కుంటలు, నీటితో నిండి కనువిందు చేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లడంతో వివిధ గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు సీజనల్ వ్యాధులవల్ల అనారోగ్యం పాలవుతున్నారు. విషజ్వరాలు సైతం ప్రబలి మంచాలకే పరిమితమవుతున్నారు. జ్వరం, దగ్గు, నీళ్ల విరేచనాలతో ప్రజలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులవైపు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యుల కొరతతో పాటు సరైన మందులు లేకపోవడంతో ప్రైవేట్ దవాఖానాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటూ ఆర్థికంగా ఇబ్బం దుల పాలవుతున్నారు. ఇదే అదనుగా భావిం చిన ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు తమ దగ్గరకు వచ్చే రోగులకు వివిధ రకాల పరీక్షలు, మందుల పేరిట అందినకాడికి డబ్బులు గుంజుకుంటున్నారు. గ్రామాల్లో ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలమైంది. వర్షాకాలంలో ప్రబలేవ్యాధులు, నివారణోపాయాలపై గ్రామాలవా రీగా సమావేశాలు పెట్టి అవగాహన కల్పిస్తూ వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయించాల్సిన బాధ్యత వైద్యశాఖపై ఉన్నప్పటికీ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఏజెన్సీ వాసులు నిరక్షరాస్యులు కావడం, సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో వ్యాధులతో బాధపడేవారికి సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. విషజ్వరాలే కాకుండా వివిధ రకాల ప్రాణాంతక వ్యాధులకు ప్రజలు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వైద్య, ఆరోగ్య శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండి ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులను అరికట్టడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ప్రభుత్వ దవాఖానా పట్ల నమ్మకం పెంచాలి. వైద్య వృత్తి పవిత్రతను కాపాడాలి. -కామిడి సతీష్ రెడ్డి, జెడలపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ‘ 98484 45134 -
ఏపీలో వైద్య పరీక్షల పేరుతో కోట్లరూపాయలు దోపిడీ
-
ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణాలు!
సాక్షి, నెల్లూరు: ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వరుస దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలవుతున్నాయి. నిన్నటికి నిన్న చిత్తూరు జిల్లా పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యం అందక బాలింత ప్రాణాలు విడిచారు. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలోనూ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు గర్భిణికి వైద్యం అందలేదు. ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మూడురోజులుగా వైద్యులు అందుబాటులో లేరు. దీంతో గర్భిణీకి వైద్యం అందక.. కడుపులోనే శిశువు మృతిచెందింది. బిడ్డ దక్కకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై భగ్గుమంటున్నారు. పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలోనూ.. ఇక పుత్తూరు పట్టణం ఆచారి వీధికి చెందిన నిఖిలను డెలివరీ కోసం శనివారం పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ప్రసవం అనంతరం అధిక రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో ఆదివారం రాత్రి ఆమె మరణించింది. ప్రసవానంతరం సరైన చికిత్స చేయకుండా నిఖిల మరణానికి కారణమయ్యారంటూ ఆస్పత్రి సిబ్బందిపై మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి తీరుకు నిరసనగా రోడ్డుపై ధర్నాకు దిగి ఆందోళన చేపట్టారు. -
పెద్దాసుపత్రుల్లో ‘ఎమర్జెన్సీ’
సాక్షి, అమరావతి: ఎమర్జెన్సీ కేసులు పెద్దాసుపత్రులను గుక్కతిప్పుకోనివ్వడం లేదు. ఏ ఆస్పత్రిలో చూసినా ఎమర్జెన్సీ వార్డులు కిటకిటలాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కేసులు నమోదు కావడం వైద్య వర్గాలనే విస్మయపరుస్తోంది. నెల తిరిగే సరికి ఒక్కో ఆస్పత్రిలో వేలల్లో ఎమర్జెన్సీ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలోని పదకొండు బోధనాస్పత్రుల్లో సగటున గంటకు 140 మంది వరకూ అత్యవసర చికిత్సకు వస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అత్యవసర చికిత్సకు చేర్చిన పేషెంటుకు వైద్యం అందించక మునుపే మరో పేషెంటు వస్తుండటంతో వైద్యులు బెంబేలెత్తుతున్నారు. హెల్త్ ఎమర్జెన్సీని తలపిస్తున్న ఈ ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య పరికరాల కొరత తీవ్రంగా ఉంది. ఐసీయూ వార్డుల్లో పడకల సంఖ్య తక్కువగా ఉండడంతో బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు వెంటలేటర్ల కొరత కూడా తీవ్రంగా ఉంది. గుండెజబ్బుల బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతుండగా, కార్డియాలజీ స్పెషలిస్టుల కొరత బాధితులను కలవరపెడుతోంది. ఎక్కువగా ప్రమాద కేసులే..: ఎమర్జెన్సీ కేసుల్లో ఎక్కువగా ప్రమాద కేసులే ఉంటున్నాయని వైద్యులు వెల్లడించారు. ఒక్క అనంతపురం జనరల్ ఆస్పత్రికి గత జనవరి నుంచి ఏప్రిల్ వరకు 850 మందికి పైగా వచ్చారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో నాలుగు మాసాల్లో 130 మందికి పైనే నమోదయ్యారు. మరోవైపు గుండె సంబంధిత వ్యాధులతో వస్తున్న వారు అధిక సంఖ్యలో ఉంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రమాద బాధితుల నమోదులో తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉండగా, గుండె జబ్బుల బాధితుల నమోదులో అనంతపురం జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. పురుగుల మందు లేదా మరేదైనా విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఎమర్జెన్సీ వార్డులకు వస్తున్న వారి సంఖ్య కూడా ఇటీవలి కాలంలో బాగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. వెంటిలేటర్లు పెంచాం.. పెద్దాసుపత్రుల్లో ఎమర్జెన్సీ కేసులు పెరగడం వాస్తవమే. సాధారణంగా మధ్య తరగతి, దిగువ తరగతి వారు పెద్దాస్పత్రులకు ఎక్కువగా వస్తుంటారు. పలు ఎమర్జెన్సీ కేసులకు ఆరోగ్య శ్రీ వర్తించకపోవడం కూడా ప్రభుత్వాస్పత్రుల్లో అత్యవసర కేసులు పెరగడానికి ఓ కారణం. ఆస్పత్రుల్లో ఐసీయూ, వెంటిలేటర్లు పెంచాం. – డాక్టర్ కే.బాబ్జి, వైద్య విద్య సంచాలకులు 108 అంబులెన్సులలో ఆక్సిజన్ కొరత క్షణాల్లో ప్రమాద స్థలానికి చేరుకుని బాధితుల ప్రాణాలను నిలిపే 108 అంబులెన్సులను ప్రస్తుతం ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో అత్యవసర సమయాల్లో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం కూడా చోటుచేసుకుంటోంది. రాష్ట్రంలో 108 అంబులెన్సులు 438 ఉండగా, అందులో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టు(ఏఎల్ఎస్) వాహనాలు 120 మాత్రమే. మిగిలినవన్నీ బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్ఎస్) వాహనాలే. వీటిల్లో డీఫ్రిబులేటర్, వెంటిలేటర్, ఆక్సిజన్ సిలిండర్ వంటి సదుపాయాలు ఉండవు. -
సర్కారీ డాక్టర్ల డబుల్ దందా!
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ పథకంలో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. పేదల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోన్న సొ మ్మును కొందరు వైద్యులు అప్పనంగా నొక్కేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కోసం ప్రభుత్వం మం జూరు చేసే నిధుల్లో ప్రభుత్వ వైద్యులకు కేటాయింపులు ఉంటాయి. ఈ చెల్లింపులలో భారీగా అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. కొందరు ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. రెండు చోట్లా అధికారికంగా వైద్యులకు ఇచ్చే నిధులను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉన్నతాధికారులు, పర్యవేక్షణ అధికారులు ప్రైవేటు ఆస్పత్రులతో సంబంధమున్న వారే కావడంతో ఈ అక్రమాలకు అడ్డులేకుండా పోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా అంకితభావంతో కేవలం ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే పని చేసే వైద్యులు నష్టపోతున్నారు. 35 శాతం ప్రభుత్వ వైద్యులకు.. ఆరోగ్యశ్రీ కింద పేదల వైద్యం కోసం ఏటా రూ.500 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో 85 లక్షల పేద కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల్లోని 2.75 కోట్ల మందికి ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. వీరికి వైద్యం అందించిన ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుపుతోంది. ప్రైవేటు ఆస్పత్రిలో అయితే శస్త్ర చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును ఆయా ఆస్పత్రి యాజమాన్యాలకు చెల్లిస్తుంది. ప్రభుత్వాసుపత్రుల్లో శస్త్రచికిత్స జరిగితే.. దీనికయ్యే ఖర్చులో 20 శాతం మొత్తాన్ని రివాల్వింగ్ ఫండ్గా పక్కనబెడతారు. మిగిలిన 80 శాతం మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు సదరు ఆస్పత్రికి విడుదల చేస్తుంది. ఈ 80 శాతంలో 35 శాతం శస్త్ర చికిత్సలో పాల్గొన్న వైద్యులకు, వైద్య సహాయ సిబ్బందికి ఇస్తారు. మిగిలిన 45 శాతాన్ని ఆస్పత్రి అభివృద్ధి నిధి కింద జమ చేస్తారు. శస్త్రచికిత్సల్లో పాల్గొనకున్నా వైద్య సిబ్బందికి చెల్లించే ఈ 35 శాతం నిధుల విషయంలోనే అవకతవకలు జరుగుతున్నాయి. ప్రభుత్వాసుపత్రులలోని చాలా మంది వైద్యులు ప్రైవేటు ఆస్పత్రులలో భాగస్వాములుగా ఉంటున్నారు. వీరు డ్యూటీ సమయంలో ప్రభుత్వాసుపత్రులలో లేకున్నా... కొందరి చలవతో శస్త్ర చికిత్స చేసిన వైద్య సిబ్బంది బృందంలో సభ్యులుగా నమోదవుతున్నారు. ఆరోగ్యశ్రీ నిధులలో వాటా తీసుకుంటున్నారు. ఆయా ఆస్పత్రులలోని తమ విభాగం పరిధిలోని ఇతర వైద్యుడు చేసే శస్త్ర చికిత్సకు, రెసిడెంట్ వైద్యులు చేసే చికిత్సలకు సైతం విధి నిర్వహణలో లేని వారి ఖాతాల్లో సైతం డబ్బులు జమ అవుతున్నాయి. ఇలా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేసేది ఎవరు, గైర్హాజరయ్యేది ఎవరు అనే విషయంతో సంబంధం లేకుండా చెల్లింపులు జరుగుతుండటం విమర్శలకు తావిస్తోంది. పర్యవేక్షణ లేమి, చెల్లింపులపై సరైన సాంకేతిక వ్యవస్థ లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని ఉన్నతాధికారులు గుర్తించినా చర్యలు తీసుకోవడం లేదు. -
ఉల్టా.. పల్టా
నల్లగొండ టౌన్ : కేసీఆర్ కిట్ దెబ్బకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య ఉల్టా, పల్టా అయ్యింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ను అమలు చేయడంతోపాటు ఆడపిల్లపుడితే రూ.13 వేలు, మగపిల్లాడు పుడితే రూ.12 వేలు అమ్మఒడి పథకం కింద తల్లులకు అందజేస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రులలో మౌలిక సదుపాయాల కల్పన పెంచడం, ప్రభుత్వ వైద్యులు, సిబ్బందిలో సేవాదృక్పథం పెరిగి బాధ్యతాయుతంగా సేవలను అందిస్తుండడంతో సర్కారు దవాఖానాల్లో కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలతో పాటు ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కాన్పుల కోసం చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. మే నెల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏరియా ఆస్పత్రులలో ఇప్పటివరకు మొత్తం 7,103 కాన్పులు జరగగా, ఒక్క జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోనే సగానికి ఎక్కువ 4,139 కాన్పులు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదల నుంచి ఉద్యోగులు, ఆర్థికంగా బలంగా ఉన్నవారు సైతం కాన్పుల కోసం ప్రభుత్వ ఆస్పత్రులవైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో జిల్లాలోన్ని ప్రైవేటు ఆస్పత్రులలో చేరుతున్న వారి సంఖ్య పడిపోతోంది. గర్భం దాల్చిన దగ్గర నుంచి అన్ని రకాల పరీక్షలు, నెలనెలా వైద్యచికిత్సను ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా చేస్తున్నారు. కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టడానికి ముందు మే నెలలో ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పుల సంఖ్య 44శాతం ఉండగా, ప్రైవేటు ఆస్పత్రులలో 56శాతంగా ఉంది. అదే విధంగా కేసీఆర్ కిట్ అమలు తరువాత డిసెంబర్ నాటికి ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పుల సంఖ్య 56 శాతంకాగా, ప్రైవేటు ఆస్పత్రులలో 44శాతానికి పడిపోవడం గమనార్హం. కిటకిటలాడుతున్న ఎంసీహెచ్ జిల్లా కేంద్రంలో రూ.20 కోట్ల వ్యయంతో జాతీయ ఆరోగ్యమిషన్ ని ర్మించిన 150 పడకల మాతాశిశు ఆ రోగ్య కేంద్రం (ఎంసీహెచ్) గర్భిణులు, బాలింతలు, చిన్నారులతో కిటకిట లాడుతోంది. ఇన్పేషంట్లు నిత్యం 200 నుంచి 300 మంది నమోదవుతోంది. గర్భిణులు వైద్యపరీక్షలకు, కాన్పుల కో సం రోజూ 50 నుంచి 70 వరకు చేరుతున్నారు. ఎంసీహెచ్లో ఇన్పేషంట్లు రోజూ 200 వరకు ఉంటున్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పులు జరిగితే కేసీఆర్ కిట్తోపాటు అమ్మ ఒడి ద్వారా ఆడపిల్లపుడితే రూ.13 వేలు, మగపిల్లాడు పుడితే రూ.12 వేలు తల్లి ఖాతాలో వేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజలకు నమ్మకం పెరిగింది. ఆస్పత్రులలో కాన్పుల సంఖ్య నెలనెల పెరగడం శుభసూచకం, ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది ఎంతో బాధ్యతాయుతంగా సేవలు అందిస్తున్నారు. –డాక్టర్ కె.భానుప్రసాద్నాయక్, డీఎంహెచ్ఓ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగిన కాన్పులు ఇలా.. నెల ప్రభుత్వ శాతం ప్రైవేటులో శాతం మే 781 44 975 56 జూన్ 720 40 1100 60 జూలై 842 49 883 51 ఆగస్టు 925 49 960 51 సెప్టెంబర్ 929 48 1004 52 అక్టోబర్ 997 49 1048 51 నవంబర్ 942 49 980 51 డిసెంబర్ 967 56 770 44 -
సిటీలో బస్తీ దవాఖానాలు
-
సిటీలో బస్తీ దవాఖానాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధానిలో కొత్తగా బస్తీ దవాఖానాలు రానున్నాయి. ప్రయోగాత్మకంగా తొలుత 50 దవాఖానాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సంక్రాంతి లోపు ఐదింటిని ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మిగిలిన 45 ఆసుపత్రులను ఉగాదిలోపు ప్రారంభిస్తారు. నగరాల్లోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాయి. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్లో వెయ్యి బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అలాగే నగరంలో మూడంచెల విధానంలో వైద్య సేవలు అందించనున్నారు. నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో ‘ఆరోగ్య హైదరాబాద్’లక్ష్యంగా సిటీలో మెరుగైన వైద్య సేవల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు వైద్య ఆరోగ్య, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సబ్ సెంటర్లు, పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల పద్ధతిన వైద్య వ్యవస్థ కొనసాగుతోంది. కానీ హైదరాబాద్లో వైద్య సేవల నిర్వహణపై కొంత గందరగోళం ఉంది. అందుకే ప్రజలు, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మూ డంచెల పద్ధతిని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. సబ్ సెంటర్ల తరహాలో బస్తీ దవాఖానాలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు ఉండాలని నిర్ణయించారు. సీహెచ్సీలు రెఫరల్ దవాఖానాలుగా పనిచేయనున్నాయి. ఒక డాక్టర్.. ఇద్దరు నర్సులు రాష్ట్ర జనాభాలో మూడో వంతు గ్రేటర్ హైదరాబాద్లోనే ఉంది. దీంతో ఆరోగ్య పరిరక్షణ, పర్యవేక్షణ కష్టంగా మారుతోంది. ముఖ్యంగా బస్తీవాసులు సరైన వైద్య సదుపాయాలకు నోచుకోవడం లేదు. అలాంటి 1,400 మురికివాడలను అధికార యంత్రాంగం గుర్తించింది. వీటిలో ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక్క వైద్యశాల లేని బస్తీలు 50 దాకా ఉన్నాయి. తొలుత వీటిలోనే పైలట్ ప్రాజెక్టుగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఆస్పత్రులలో డాక్టర్, స్టాఫ్ నర్సు, నర్సు అందుబాటులో ఉంటారు. రోగ నిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన మందులను ఇస్తారు. అంతకు మించిన వైద్య సమస్యలు ఉన్న వారిని సమీపంలోని సీహెచ్సీలకు, ఏరియా ఆస్పత్రులకు వెళ్లాలని సూచిస్తారు. ఈ ఆసుపత్రులను 50 బస్తీల్లో విజయవంతంగా నిర్వహించిన తర్వాత నగరవ్యాప్తంగా మరో వెయ్యి దవా ఖానాలను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం 145 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్సీ)లు ఉన్నాయి. వీటికితోడు 30 సర్కిళ్లకు ఒక్కోటి చొప్పున కొత్తగా మరో 30 సీహెచ్సీలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఐదు జోన్లకు ఒక్కోటి చొప్పున ఐదు ప్రాంతాల్లో 100 పడకల స్థాయిలో ఏరియా ఆస్పత్రులను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ సమన్వయంతో కొత్తగా ‘హైదరాబాద్ హెల్త్ సొసైటీ’ఏర్పాటు చేయనున్నారు. -
సర్కారు ఆస్పత్రుల్లో... ప్రాణాలు హరీ!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ బోధనాసుపత్రులకు వచ్చే రోగుల్లో అత్యధికులు అత్యవసర వైద్యం కోసం వచ్చేవారే. వీరిలో చాలా మందికి ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమత ఉండదు. ఇలాంటి వారికి సకాలంలో సరైన వైద్యం ఎంత వరకు అందిస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. అర్ధరాత్రో, అపరాత్రో ఏ ప్రమాదమో జరిగి రక్తమోడుతూ వచ్చిన బాధితులను సైతం ప్రభుత్వాసుపత్రుల్లో పట్టించుకునే దిక్కు లేదు. పెద్దాసుపత్రుల్లో చేరిన వారిలో ఒక్కో ఆసుపత్రిలో రోజూ పదుల సంఖ్యలో రోగులు మృత్యువాత పడుతున్నారంటే తప్పు ముమ్మాటికీ ప్రభుత్వానిదే. ఆయా ఆసుపత్రుల్లోని అత్యవసర వార్డుల్లో రోగుల సంఖ్యకు తగినన్ని వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు.. ఇతర పరికరాలు సమకూర్చాలి. ముఖ్యంగా నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించాలి. ఆపరేషన్ థియేటర్ల సంఖ్యను పెంచాలి. సర్కారు మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రధానంగా వెంటిలేటర్ వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది. ఒక్కో వెంటిలేటర్కు 30 మంది రోగులు రోజూ వేచి చూస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. అక్యూట్ మెడికల్ కేర్, రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్, న్యూరో ఇన్సెంటివ్ కేర్, కార్డియో థొరాసిక్ రికవరీ కేర్, పోస్ట్ ఆపరేటివ్ ఇంటెన్సివ్ కేర్ లాంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన వెంటిలేటర్ చికిత్స బోధనాసుపత్రుల్లో బ్రహ్మ పదార్థమైంది. రోగుల రద్దీని తట్టుకోలేక కొన్ని ఆస్పత్రులు రోగి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా సరే డిస్చార్జి చేసి మరో రోగికి వెంటిలేటర్ అమర్చుతున్న దుస్థితి నెలకొంది. సాధారణంగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం సకాలంలో జరిగితే మొత్తం ఇన్ పేషెంట్లలో 4 శాతానికి మించి మృతులు ఉండకూడదు. కానీ ప్రస్తుతం బోధనాసుపత్రుల్లో ఆ సంఖ్య 10 శాతానికి మించి పోయింది. రోజుకు సగటున బోధనాసుపత్రుల్లోనే 108 మందికి పైగా మృతి చెందుతున్నట్టు వైద్య విద్యా శాఖ అంచనా వేసింది. ఈ లెక్కన ఏడాదికి దాదాపు 39 వేల మంది వరకు మృతి చెందుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రోగులు పెరుగుతున్నా.. సౌకర్యాలు అంతంతే రాష్ట్రంలో జనాభా పెరిగే కొద్దీ అందుకు అనుగుణంగా రోగుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. మూడేళ్లలో సుమారు 22 శాతం మంది రోగులు పెరిగినట్టు అంచనా. కానీ వెంటిలేటర్ల సంఖ్య మాత్రం పెరగలేదు. ఉన్న వెంటిలేటర్లలో కూడా 40 శాతం పని చేయడం లేదు. శ్వాస తీసుకోలేని సమయంలో కృత్రిమ శ్వాసను అమర్చాల్సి వచ్చే రోగులకు నాలుగు గంటలు కూడా వెంటిలేటర్ దక్కని పరిస్థితి. రాష్ట్రంలో రోడ్డు ప్రమాద బాధితులకూ వెంటిలేటర్ దక్కడం లేదు. బోధనాసుపత్రుల్లో 14 వేల వరకు పడకలుంటే రోజూ 20 వేల మందికి పైగా పడకల కోసం వస్తున్నట్టు అంచనా. దీంతో అత్యవసర వైద్యం కోసం వస్తున్న వారికి వైద్యం దక్కక పోగా, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న ఘటనలు కోకొల్లలు. కొన్ని ఆస్పత్రుల్లో రోగులను తీసుకెళ్లేందుకు వీల్చైర్లు, స్ట్రెచర్లు కూడా లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. బోధనాసుపత్రుల్లో ఏటా దాదాపు 39 వేల మంది మృతి చెందుతుంటే వాటికంటే స్థాయి తక్కువైన వైద్యవిధాన పరిషత్ పరిధిలోని జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వీటిల్లో ఏటా 15 వేల మృతులు ఉండవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో కనీస స్థాయిలో కూడా వైద్యులు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సామాన్యుడే సమిధ ఒకప్పుడు సామాన్యుడి పాలిట సంజీవనిలా నిలిచిన ఆరోగ్యశ్రీ కార్డుకు టీడీపీ ప్రభుత్వం వచ్చాక విలువ లేకుండా పోయింది. తమ రాష్ట్ర వాసులకు ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్య సేవ) కింద హైదరాబాద్లో వైద్యమందించొద్దని రాష్ట్ర సర్కార్ ఇటీవల ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సకల వసతులు ఉండే కార్పొరేట్ ఆస్పత్రులు, పేరొందిన వైద్య నిపుణులున్న ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఉచితంగా సర్జరీలు చేయించుకునే అవకాశాన్ని సామాన్యుడు కోల్పోయాడు. హైదరాబాద్లో ఆరోగ్యశ్రీ అందకుండా చేయడంతో ఏపీ ప్రజలంతా రాష్ట్రంలోనే ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్సలు చేయించుకోవాల్సి వస్తోంది. అయితే అన్ని సౌకర్యాలూ ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు కూడా రాష్ట్రంలో తగినన్న లేవు. పోనీ ప్రభుత్వాసుపత్రికే పోదామంటే అక్కడ మౌలిక వసతుల పరిస్థితి మరీ ఘోరం. సిరంజి ఉంటే సూది ఉండదు, నర్సు ఉంటే డాక్టర్ ఉండరు, వీరుంటే పడకలుండవు, అవి ఉన్నా వెంటిలేటర్లుండవు!! ఇక 108, 104 లాంటి వాహనాలు డీజిల్కు డబ్బుల్లేక, సిబ్బంది జీతాలివ్వక మూలన పడుతున్నాయి. మృతుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణాలు - మౌలిక వసతుల లేమి. వెంటిలేటర్ల కొరతతో 30 శాతం మందికి సకాలంలో ఆక్సిజన్ అందడం లేదు - రోగుల సంఖ్యకు – పడకలు, ఆపరేషన్ థియేటర్లకూ పొంతన లేదు.. తగినన్ని ఐసీయూలు లేకపోవడం - అనంతపురం పెద్దాసుపత్రిలో ఇప్పటికీ అనస్థీషియా వర్క్స్టేషన్లు, బేబీ ఇంక్యుబేటర్లు లేని దుస్థితి - 90 శాతం పెద్దాసుపత్రుల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో లేరు - గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం వంటి పెద్దాసుపత్రుల్లోనే చిన్నారుల వైద్యానికి తగిన పరికరాలు లేవు - ఇప్పటికీ అత్యాధునిక ల్యాప్రొస్కోపిక్ పరికరాలు అందుబాటులో లేవు - మూత్రపిండాలు, కాలేయం, క్యాన్సర్ వంటి జబ్బులకు స్పెషలిస్టు డాక్టర్లు లేరు - ఆస్పత్రి అభివృద్ధి సొసైటీల్లో కోట్ల రూపాయలున్నా మౌలిక వసతులు కల్పించడం లేదు - అత్యవసర మందులు అందుబాటులో లేకపోవడం ఆస్పత్రుల వివరాలు 1157 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 192 సామాజిక ఆరోగ్య కేంద్రాలు 32 ఏరియా ఆస్పత్రులు 8 జిల్లా ఆస్పత్రులు 11 బోధన ఆసుపత్రులు -
సర్కారు ఆస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలు
సాక్షి, హైదరాబాద్: గత ఆరు నెలలుగా ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాలు గణనీయంగా పెరిగాయని వైద్యారోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. ప్రసవాల సంఖ్య 33 శాతం నుంచి 41 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 82 శాతం, మేడ్చల్ జిల్లాలో తక్కువగా ఐదు శాతం ప్రసవాలు నమోదయ్యాయని చెప్పారు. కేసీఆర్ కిట్ల పథకం అమలు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై అన్ని జిల్లాల జిల్లా వైద్యాధికారులతో మంత్రి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తక్కువ ప్రసవాలు జరిగిన జిల్లాల్లో వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రసవాల సంఖ్య 2017 జనవరిలో 33 శాతం, ఫిబ్రవరిలో 30 శాతం, మార్చిలో 35 శాతం, ఏప్రిల్లో 39 శాతం, మేలో 40 శాతం, జూన్లో 41 శాతంగా నమోదైందని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ పథకం అమలు తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగిందని చెప్పారు. -
ప్రభుత్వాసుపత్రుల్లోనే 50% ప్రసవాలు జరగాలి
► అధికారులకు వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశం ► 3న సీఎం చేతుల మీదుగా కేసీఆర్ కిట్ల పథకం ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రస్తుతం 30–40 శాతంగా ఉన్న ప్రసవాలను 50 శాతానికి పెంచాలని అధికారులను వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. మేడ్చల్ జిల్లా కేంద్రంలో వెంటనే మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. వైద్యారోగ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, కేసీఆర్ కిట్ల పథకం సన్నాహాలపై శుక్రవారం సచివాల యంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ కిట్ల పథకాన్ని వచ్చే నెల 3న హైదరాబాద్లోని పేట్ల బురుజు ఆస్పత్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ప్రసవాలు జరిపే అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. కేసీఆర్ కిట్ల పథకం కింద గర్భిణుల నమోదు మొదలైందని, ఇప్పటివరకు 2 లక్షల మందికిపైగా పేర్లు నమోదు చేసుకున్నారని, ఈ ప్రక్రియ నిరంతరం జరగాలని చెప్పారు. గర్భిణులకు మూడు విడతల్లో రూ.12 వేల ప్రోత్సా హకం అందిస్తామని, ప్రసవం తర్వాత రూ.2 వేల విలువైన 16 రకాల వస్తువులు గల కేసీఆర్ కిట్లను పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఏడాదికి 6.28 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయని, అన్ని ప్రసూతి కేంద్రాల్లో వైద్య బృందాలను పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించామన్నారు. వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నమాట నిజమేనని, నియామకాలు పూర్తయ్యేలోగా అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బందిని క్రమబద్ధీకరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు రఘునందన్రావు, ఎంవీ రెడ్డి, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ వేణుగోపాల్, ఆరోగ్య పథకం సీఈఓ పద్మ పాల్గొన్నారు. -
పల్లె వైద్యానికి గ్రహణం
* ఆస్పత్రి అభివృద్ధి కమిటీల ఏర్పాటులో జాప్యం * రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసిన అధికార పార్టీ * విభేదాలతో పలువురు కోర్టుకు * మూలనపడిన విలువైన యంత్రాలు సాక్షి, గుంటూరు: పల్లె వైద్యానికి అధికార పార్టీ గ్రహణం పట్టింది. మైనింగ్లు మొదలుకొని, మద్యం వరకు దేనినీ వదలని తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు వైద్యశాలలపై పడుతున్నారు. కాసుల కక్కుర్తిలో ప్రతి పనికి అడ్డు తగులుతూ సొంత ప్రభుత్వ పథకాలను నీరుగారుస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో ఈ తంతు అధికంగా ఉంది. జిల్లాలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ వాటిలో ఎక్కడా ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయడం కానీ, వాటి ద్వారా నిధులు వినియోగించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడడం గానీ జరగడం లేదు. నిధులున్నా.. వినియోగమేదీ.. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సరిపడా నిధులున్నా వినియోగించేందుకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ లనే ఏర్పాటు చేయలేదు. వాటి అనుమతి ఉంటేనే ఈ నిధులు వినియోగించాల్సిన పరిస్థితుల్లో కమిటీలను ఏడాదిన్నరగా ఏర్పాటు చేయకపోవడంతో అరకొర సౌకర్యాలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మాతా శిశు మరణాలను తగ్గించటమే లక్ష్యంగా ప్రభుత్వం జిల్లాలో 11 ప్రభుత్వ ఆస్పత్రులకు స్కానింగ్ మిషన్లు మంజూరు చేసినా అవి నిరుపయోగంగా మారాయి. ఎనిమిది నెలల క్రితం జిల్లాకు వచ్చిన రూ.1.50 కోట్ల విలువ చేసే స్కానింగ్ మిషన్లు మూలన పడ్డాయి. నిరుపయోగంగా యంత్రాలు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు లేక ప్రసవాలకు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారనే విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఉచిత స్కానింగ్ పరీక్షల సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. రూ.1.50 కోట్లు వెచ్చించి జిల్లాలోని 11 ఆస్పత్రులకు వాటిని స్కానింగ్ మిషన్లను పంపించింది. సత్తెనపల్లి, రేపల్లె, చిలకలూరిపేట, మాచర్ల, నగరం, వినుకొండ, కొల్లిపర, పిట్టలవానిపాలెం, పొన్నూరు, పెదకూరపాడు, ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వాటిని చేర్చారు. స్కానింగ్ మిషన్లు వచ్చి ఎనిమిది నెలలు దాటుతున్నా అవి నిరుపయోగంగా మూలన పడ్డాయి. స్కానింగ్లు చేయాలంటే తప్పనిసరిగా డీఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలో స్కానింగ్ మిషన్ను రిజిస్ట్రేషన్ చేయించాలి. మిషన్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు రూ.35 వేలు డీడీ రూపంలో డీఎంహెచ్ఓ కార్యాలయానికి చెల్లించాలి. సదరు సొమ్మును హెచ్డీఎస్ ఖాతాలో నుంచి డ్రా చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేయకపోవడంతో స్కానింగ్ మిషన్ల రిజిస్ట్రేషన్లు ముందుకు సాగడం లేదు. రాజకీయ జోక్యం వల్లే జాప్యం... రాజకీయ జోక్యం వల్లే హెచ్డీఎస్ కమిటీలను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం మండలస్థాయి అధికారులను హెచ్డీఎస్ కమిటీలో సభ్యులుగా నియమించింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిదప మండల స్థాయి అధికారులను తొలగించి వారి స్థానంలో తెలుగు తమ్ముళ్లకు చోటు కల్పించి హెచ్డీఎస్ కమిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు. దీంతో అధికార పార్టీ నేతల మధ్య సఖ్యత లోపించి విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ విషయంపై వివాదం నెలకొని పలువురు కోర్టులను ఆశ్రయించడంతో హెచ్డీఎస్ కమిటీల నియామకాల్లో తెలుగు తమ్ముళ్లను పక్కన బెట్టాలని సూచించారు. అయినప్పటికీ వారి జోక్యం తగ్గకపోవడంతో నేటికీ పలు ఆస్పత్రుల్లో హెచ్డీఎస్ కమిటీలు ఏర్పడలేదు. ఒక్కో ఆస్పత్రిలో ఏడాదికి రూ.1.75 లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు వివిధ రకాల అభివృద్ధి పనుల నిమిత్తం హెచ్డీఎస్ ఖాతాలకు ప్రభుత్వం ఎన్హెచ్ఎం పథకం ద్వారా విడుదల చేస్తుంది. ఏడాదిగా నిధులు హెచ్డీఎస్ ఖాతాలోనే మూలుగుతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, పలు మార్లు జిల్లాలో ఆస్పత్రులను తనిఖీ చేస్తున్నప్పటికీ ఆస్పత్రుల అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసి రాజకీయ గ్రహణాన్ని తొలగించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కమిటీలు లేకే రిజిస్ట్రేషన్కు దరఖాస్తులు లేవు... జిల్లాలో 11 ఆస్పత్రులకు ఆరు నెలల క్రితం స్కానింగ్ మిషన్లు వచ్చాయి. రిజిస్ట్రేషన్ కాకపోవడంతో స్కానింగ్లు జరగడం లేదు. హెచ్డీఎస్ కమిటీలు లేక రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేయలేకపోతున్నారు. జిల్లాలో 40 శాతం ఆస్పత్రులకు కమిటీలు ఏర్పాటయ్యాయి. మిగతా ఆస్పత్రులకు కమిటీలు ఏర్పడగానే అనుమతులు మంజూరు చేస్తాం. – డాక్టర్ పద్మజారాణి, డీఎంఅండ్హెచ్వో -
వైద్య సేవలందేలా చూడాలి
ప్రభుత్వాస్పత్రి ఆకస్మిక తనిఖీ వైద్య సేవలపై అసంతృప్తి మంచిర్యాల టౌన్ : జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. గురువారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ వార్డు, మందుల నిల్వ, వివిధ వ్యాధుల పరీక్షల ల్యాబ్, ఎక్స్రే రూం, సురక్ష క్లీనిక్, టి.బి గది, ఆరోగ్యశ్రీ వార్డు, శస్త్ర చికిత్సల రోగుల వార్డులను పరిశీలించారు. వైద్య సేవలపై కొంత సంతృప్తి వ్యక్తం చేసినా, ఇతరత్రా సౌకర్యాలు రోగులకు కల్పించడం, పారిశుధ్యంపై సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల ప్రాంతీయ ఆసుపత్రికి రోగుల తాకిడి ఎక్కువ ఉందని, జిల్లా కేంద్రం ఏర్పాటుతో రోగుల సంఖ్య మరింత పెరుగుతుందని, ప్రస్తుత ఆసుపత్రిలో అందుబాటులోఉన్న వైద్య సేవలను జిల్లా ప్రజలకు నిరంతరాయంగా అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీరజను ఆదేశించారు. రెడ్క్రాస్ సంస్థలో నిల్వ ఉన్న రక్తాన్ని మొదటగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు అందుబాటులో ఉంచాలన్నారు. మలేరియా, టైఫాయిడ్, తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలన్నింటికీ ఒక సమీకృత ల్యాబ్ను ఏర్పాటు చేసి పరీక్షలు చేయాలన్నారు. టీబీ రోగుల వివరాలు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించి తగు వైద్యసేవలను అందించాలన్నారు. త్వరలోనే జిల్లా ప్రధాన ఆసుపత్రి ఏర్పాటు కానున్నందున ప్రజలకు మరింత వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని , వైద్య సిబ్బంది అంకితభావంతో నిరంతరాయంగా అందుబాటులో ఉండి పనిచేయాలన్నారు. -
అనారోగ్య ఆంధ్రప్రదేశ్
-
‘బయో’పెట్టినా మాయే..
* వైద్యశాలల్లో నామమాత్రంగా భయోమెట్రిక్ హాజరు * కచ్చితమైన సమయానికి వచ్చి వేలిముద్ర * తర్వాత ఉడాయింపు.. తిరిగి వచ్చి మళ్లీ ముద్ర వైద్యరంగంలో మెరుగైన సేవలందించడం కోసం ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా అవి క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. వెరసి సకాలంలో వైద్యసేవలు అందక రోగులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం తప్పుదోవ పట్టిస్తూ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నరసరావుపేట టౌన్: ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహించే వైద్యాధికార సిబ్బంది విధి నిర్వహణ సమయంలో ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ఉండటం లేదన్న కారణంతో ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వైద్యులు, సిబ్బంది ప్రతి రోజు విధులకు హాజరయ్యే సమయం, విధులు ముగించుకొని తిరిగి వెళ్లే సమయంలో బయోమెట్రిక్ మిషన్లో వేలి ముద్రల ద్వారా నమోదును పొందుపరచాల్సి ఉంటుంది. దీన్ని బట్టే వేతనాలు అందుతుంటాయి. కానీ స్థానిక వైద్యశాఖ అధికారులు, సిబ్బంది ఉదయం ఆసుపత్రికి వచ్చి బయోమెట్రిక్ నమోదు వేసి బయటికి వెళ్లి తిరిగి సాయంత్రం విధులు ముగిసే సమయంలో వచ్చి బయోమెట్రిక్ నమోదు చేసుకుంటున్నారని తెలుస్తోంది. అధికారులు,సిబ్బంది విధినిర్వహణ సమయంలో బయట వెళ్లి ప్రైవేటుగా తమ కార్యకలాపాలను కొనసాగిçస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోపాటు రాత్రి సమయాల్లో వైద్యులు అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులు రోగుల నుంచి వస్తున్నాయి. దీంతో ఆసుపత్రికి వచ్చ పేదలు ప్రభుత్వాసుపత్రిలో రాత్రి పూట సిబ్బంది లేకపోవడంతో ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. రాత్రు పూట ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడితే అనేక అక్రమాలు బయట పడతాయాని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. రాత్రి సమయంలో వైద్యం అందని ద్రాక్షే.. డివిజన్ కేంద్రమైన నరసరావుపేట పట్టణానికి సమీపంలో హైవే మార్గాలు ఉండటంతో రోడ్డు ప్రమాదాలతో పాటు రైల్వే ప్రమాదాల్లో మృతుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. దీంతోపాటు డివిజన్లో పలు ఫ్యాక్షన్ గ్రామాలు ఉండటం మూలంగా నిత్యం అనేక అల్లర్లు చోటు చేసుకుంటుంటాయి. ఆయా సంఘటనలలో గాయపడి అర్థరాత్రిళ్లు చికి త్స కోసం ఏరియా వైద్యశాలను ఆశ్రయిస్తే అక్కడ వైద్యులు ఉండరు. ఉన్న సిబ్బంది నామమాత్రపు సేవలు అందించడంతో మెరుగైన వైద్యసేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా సంతమాగులూరు వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన వ్యక్తిని 108లో ఏరియా వైద్యశాలకు తీసుకొచ్చారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేక పోవడంతో బాధితుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సిబ్బంది గుంటూరు వైద్యశాలకు క్షతగాత్రుణ్ణి తరలించారు. ఇటువంటి సంఘటనలు ఏరియా వైద్యశాలలో అనేకం జరుగుతున్నాయి. విచారించి చర్యలు తీసుకుంటాం.. విధి నిర్వహణ సమయంలో వైద్యశాలలో అధికారులు, సిబ్బంది అందుబాటులో లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిపై సమగ్రంగా విచారించిన అనంతరం చర్యలకు సిఫారసు చేస్తాం. టి. మోహన్ శేషుప్రసాద్, సూపరిండెంట్ -
రోగుల ప్రాణాలతో చెలగాటం!
మాచర్ల ప్రభుత్వాస్పత్రిలో మహిళా వైద్యుల నిర్లక్ష్యం రోగులను పట్టించుకోని వైనం ప్రైవేట్ ప్రాక్టీస్లకే ప్రాధాన్యం తాజాగా గర్భిణికి వైద్యం చేయని వైద్యురాలు పైగా రాజీనామా లేఖ ఇచ్చి వెళ్లిన ఉదంతం నిరుపేద రోగులకు ఉచిత వైద్యం అందించాల్సిన వైద్యులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ తమ బాధ్యత మరిచి సమయపాలన పాటించకుండా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అదేమని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది. అందుకు కారణం అక్కడ పనిచేసే ఇద్దరు మహిళా వైద్యులు అధికార పార్టీ నేతల కోడళ్లు కావడమే. ఇది మాచర్ల పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో జరుగుతున్న తంతు. ఇలాంటి సంఘటనలు ఇక్కడ నిత్యం జరుగుతూనే ఉన్నా, ఉన్నతాధికారులు వారి జోలికి వెళ్లాలంటే వెనుకంజ వేస్తున్నారు. సాక్షి, గుంటూరు: వైద్యో నారాయణో హరి.. అంటూ వైద్యుడిని భగవంతుడితో సమానంగా కీర్తించటం తెలిసిందే. సమాజంలో వైద్యుడికి ఇచ్చే గౌరవమది. కానీ కొందరు వైద్యులు తమ వృత్తికే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తుండటం శోచనీయం. నిరుపేద రోగులకు వైద్యం అందించే క్రమంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించటమే గాక.. వారి ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నారు. మాచర్ల పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. కాన్పు కోసం వచ్చిన గర్భిణికి వైద్యం అందించకుండా అక్కడి వైద్యురాలు రాజీనామా చేసి వెళ్లిపోయింది. ఈ ఉదంతంలో అదృష్టవశాత్తూ బాధితురాలు, ఆమె బిడ్డ క్షేమంగా ఉన్నారు. పురిటి నొప్పులతో కాన్పు కోసం వస్తే... దుర్గి మండలం పోలగట్ల గ్రామానికి చెందిన చాట్ల సాగరమ్మ అనే గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో ఆమె కుటుంబసభ్యులు శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటలకు మాచర్ల ప్రభుత్వాస్పత్రికి ఆమెను తీసుకొచ్చారు. వైద్యులు ఎవరూ లేకపోవడంతో నాలుగు గంటల పాటు నొప్పులతో బాధపడుతూనే గర్భిణి ఎదురుచూసింది. ఉదయం 8.30 తర్వాత వచ్చిన వైద్యురాలిని ఆలస్యంగా రావటంపై గర్భిణి బంధువులు ప్రశ్నించడంతో.. ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ తాను రాజీనామా చేస్తున్నానని చెప్పి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి వైద్య సేవలు అందించకుండానే వెళ్లిపోవటం గమనార్హం. అక్కడే ఉన్న సూపరింటెండెంట్ డాక్టర్ శిరీష కూడా తాను పిల్లల డాక్టర్నంటూ వైద్యం చేసేందుకు నిరాకరించటంతో విధిలేక బాధితురాలిని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జీజీహెచ్ వైద్యులు పెద్ద మనసు చేసుకుని చికిత్స అందించటంతో బాధితురాలు, ఆమె బిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రశ్నించేవారు ఉండరనే... మాచర్ల నియోజకవర్గంలో అధిక శాతం మంది ఎస్సీ, ఎస్టీలు, బీసీలే. మాచర్ల రూరల్, వెల్దుర్తి, దుర్గి, విజయపురిసౌత్ మండలాల్లో ఏ గ్రామంలో ఎలాంటి రోగం వచ్చినా మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు పరుగులు తీయాల్సిందే. ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించుకునే స్థోమత లేక నిరుపేద రోగులంతా ఇక్కడికి వస్తుంటారు. 30 పడకలు ఉన్న ఈ ఆస్పత్రిలో గతంలో ఎనిమిది మంది వైద్యులు వైద్య సేవలు అందించేవారు. ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉండగా, వారిలో ఇద్దరు అధికార పార్టీ నేతల కోడళ్లు. తమను ప్రశ్నించేవారు ఉండరనే ధైర్యంతో వారు ఇష్టం వచ్చినప్పుడు ఆస్పత్రికి రావడం కొద్దిసేపు ఉండి తిరిగి సొంత ప్రాక్టీస్కు వెళ్లిపోవడం జరుగుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఆస్పత్రి పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లు వదిలేయటంతో రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. అధికారం అండతో... మాచర్ల ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్న కాంట్రాక్టు వైద్యురాలు డాక్టర్ కొమ్మారెడ్డి రోహిణి టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డి కోడలు కాగా, సూపరింటెండెంట్ డాక్టర్ శిరీష ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ నెల్లూరి మంగమ్మ కోడలు. దీంతో వీరిద్దరినీ ప్రశ్నించే ధైర్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఉన్నతాధికారులు సైతం చేయడం లేదు. మామూలుగా ఉద్యోగం నుంచి మానుకోవాలన్నా, సెలవు పెట్టాలన్నా ముందస్తుగా ఉన్నతాధికారులకు సమాచారం అందించాల్సి ఉన్నప్పటికీ శుక్రవారం గర్భిణికి వైద్య సేవలు అందించకుండా అక్కడి నుంచి డాక్టర్ రోహిణి వెళ్లిపోవడంపై జిల్లాలోని వైద్య నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ శిరీష సైతం బాధిత గర్భిణిని గుంటూరుకు తరలించి చేతులు దులుపుకొన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా జరగరానిది జరిగి ఉంటే తమ పరిస్థితి ఏమిటంటూ వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇదే ఆస్పత్రిలో వైద్యుల తప్పునకు ఓ గర్భిణి మృతిచెందడంతో బంధువులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. -
వసతుల కల్పనకు కృషి
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్ల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలకు గాను వసతుల కల్పనకు కృషిచేస్తానని ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో శుక్రవారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ..ప్రభుత్వ ఆస్పత్రులకు అధికశాతం పేదవారే వస్తారని, వీరికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషిచేస్తానన్నారు. వైద్య రంగంలో ఎన్నో ఆధునికమైన పరికరాలు వచ్చాయని, వాటిని ఆస్పత్రికి తీసుకురావడానికి సంబంధితశాఖాధిపతులతో మాట్లాడతానని తెలిపారు. చేవెళ్లలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో ‘ఆరోగ్యశ్రీ‘ సేవలు అందించడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వానికి నివేదించానని వివరించారు. ఆస్పత్రిలో కొత్త జనరేటర్, శిథిలమైన మార్చురీగది స్థానంలో కొత్త గది నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆస్పత్రి ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ డాక్టర్. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..ఆస్పత్రిలో ఇన్వర్టర్లు పనిచేయడంలేదని, విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు రోగులకు ఇబ్బంది కలుగుతుందన్నారు.డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గదుల్లో వసతులు కల్పించాలని విజ్ఞప్తిచేశారు. అనంతరం ఆస్పత్రిలో వసతులు, పరిసరాలను ఎమ్మెల్యే అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీఓ చంద్రమోహన్, జిల్లా కమ్యూనిటీ హెల్త్ అధికారి డాక్టర్.హనుమంతరావు, మహిళా సంఘాల జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, చేవెళ్ల జెడ్పీటీసీ సభ్యురాలు చింపుల శైలజ, శంకర్పల్లి ఎంపీపీ చిన్న నర్సింహులు, మొయినాబాద్ జెడ్పీటీసీ చంద్రలింగంగౌడ్, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 29సిహెచ్వి 03ః చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య 29సిహెచ్వి 04ః ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే కాలె యాదయ్య -
ఈ పాపం ఎవరిది?
-
డెంగీ వీరంగం !
-
డెంగీ వీరంగం!
* ఆరోగ్యశ్రీ మాత్రం వర్తించదు.. * ‘ప్రైవేట్’ను ఒప్పించలేకపోతున్న సర్కారు * ప్లేట్లెట్ల కోసం లక్షలు ఖర్చు చేస్తున్న బాధితులు * రాజధాని సహా తెలంగాణ జిల్లాల్లో విజృంభిస్తోన్న డెంగీ, మలేరియా * 846 మందికి డెంగీ, 4,761 మందికి మలేరియా సోకినట్లు నిర్ధారణ * ఈ సంఖ్య అంతకు ఐదింతలు పైనే ఉంటుందంటున్న వైద్యనిపుణులు * డెంగీతో రాష్ట్రంలో ఇప్పటివరకు 50 మంది మరణించినట్లు అంచనా సాక్షి, హైదరాబాద్: రెక్కాడితేగానీ డొక్కాడని రాజయ్యకు జ్వరమొచ్చింది... సర్కారు దవాఖానాకు వెళితే ‘జ్వరం’ బిళ్లలు ఇచ్చి పంపారు.. అయినా తగ్గక ప్రైవేటు ఆస్పత్రికి వెళితే ‘డెంగీ’గా నిర్ధారించారు... ప్లేట్లెట్లు ఎక్కించాలన్నారు, వేల రూపాయలు ఖర్చవుతాయన్నారు.. ‘ఆరోగ్యశ్రీ’ కార్డు తీసి చూపితే అది పనికిరాదన్నారు.. రాజయ్య కుటుంబ సభ్యులు గొడ్డూగోదా అమ్మి, అప్పు చేసి 60 వేలు తెచ్చి ఆస్పత్రిలో కడితే.. ప్రాణాలతో బయట పడ్డాడు. పేదలను ఆదుకోవాల్సిన ‘ఆరోగ్యశ్రీ’ పనికిరాకుండా పోయింది.. ఒక్క జ్వరం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. రాష్ట్రంలో డెంగీ విజృంభణ కారణంగా వందలాది మంది పేదలు, మధ్యతరగతి జీవుల దుస్థితి ఇది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘డెంగీ’కి చికిత్స చేయరు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లినా దీనికి ‘ఆరోగ్యశ్రీ’ వర్తించదు. రోజు రోజుకూ విజృంభిస్తూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డెంగీని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడంలో సర్కారు విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. సాధారణ జ్వరాల మాదిరిగానే డెంగీ వస్తోందని, అందువల్ల దీన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం కష్టమన్న కొద్దిమంది అధికారుల అభిప్రాయం మేరకు ప్రభుత్వం దీన్ని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అంతా పేదలే.. దోమలు స్వైర విహారం చేసే మురికివాడలు, గిరిజన పల్లెలు, పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువగా డెంగీ విజృంభిస్తోంది. అటువంటి ప్రాంతాల్లో ఉండేవారంతా దిగువ మధ్యతరగతి వారు, పేదలే. వీరి జీవితాలను డెంగీ పీల్చిపిప్పిచేస్తోంది. గత ఐదేళ్ల సర్కారు గణాంకాలను పరిశీలించినా... డెంగీ మరింతగా విస్తరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 2011లో 520 డెంగీ కేసులు నమోదుకాగా.. ఈ సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 846 మందికి డెంగీ వచ్చింది. 4,761 మలేరియా కేసులు, 84 చికున్గున్యా కేసులు నమోదయ్యాయి. అదే ప్రైవేటు వర్గాల అంచనా ప్రకారం రాష్ట్రంలో సుమారు 5 వేల మందికి డెంగీ, 20 వేల మందికి మలేరియా సోకినట్లు తెలుస్తోంది. డెంగీ కారణంగా ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయి, వైద్యం చేయించుకోలేక 50 మంది వరకు మరణించినట్లు అంచనా. ఈ పరిస్థితిని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. సాధారణ చికిత్సతో నయం చేసే అవకాశాలున్నా ప్లేట్లె ట్ల సంఖ్య తగ్గిందంటూ వాటిని ఎక్కిస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కో ప్లేట్లెట్ ప్యాకెట్ ధర రూ.15 వేల వరకూ ఉంటోంది. ఒక్కో బాధితుడికి ఐదు నుంచి 20 వరకు కూడా ప్లేట్లెట్ ప్యాకెట్లు ఎక్కిస్తున్నారు. వారం పది రోజులు ఆసుపత్రిలో ఉంచుకొని చికిత్స చేసినందుకు మొత్తంగా రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తూ పీల్చిపిప్పి చేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు తమ వద్ద వసతులు లేవంటూ.. నిర్ధారణ పరీక్షలకు వీలులేదంటూ ప్రైవేటు ఆసుపత్రులకే పంపిస్తున్నాయి. తమకు నష్టమనే..! ఆరోగ్యశ్రీ పరిధిలో ప్రస్తుతం 938 వ్యాధులున్నాయి. ఆ జబ్బులకు అయ్యే ఖర్చును ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ప్యాకేజీ ప్రకారం సర్కారు చెల్లిస్తుంటుంది. అయితే డెంగీని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తే తమకు నష్టమని భావించిన ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు... దీనికి అనేక అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ప్లేట్లెట్ల పేరుతో లక్షలకు లక్షలు వసూలుచేసే అవకాశాన్ని కోల్పోతామనే దుర్మార్గపు ఆలోచనతోనే తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర జబ్బులకు నిర్ణీత చికిత్స, సమయం వంటివి ఉంటాయి. డెంగీ వస్తే ప్లేట్లెట్ల సంఖ్యను బట్టి వైద్యం ఉంటుంది. పరిస్థితిని బట్టి రోజుల కొద్దీ ఆసుపత్రుల్లో ఉంచాలి. ఈ అంశాలను నిర్ధారించి ప్యాకేజీ ప్రకటించాలి. ఒకవేళ డెంగీని ఆరోగ్యశ్రీలో చేరిస్తే ప్రభుత్వం కనీస నిర్ణీత ప్యాకేజీ ప్రకటిస్తే... తమకు నష్టమని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు భావిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ప్రైవేటు ఆసుపత్రులకే వంతపాడుతోంది. మరోవైపు ఒక ప్రైవేటు బీమా కంపెనీ డెంగీకి ఆరోగ్య బీమా ఇస్తోంది. రూ.400 ప్రీమియం కడితే డెంగీ చికిత్సకు రూ.50 వేల వరకు ఇస్తామని చెబుతోంది. ఒక కంపెనీయే డెంగీకి బీమా ఇవ్వగలుగుతున్నప్పుడు ఆరోగ్యశ్రీలోకి తీసుకురావడానికి ప్రభుత్వం వెనుకాడుతుండడం సందేహాస్పదంగా మారింది. పోలియో మాదిరిగా డెంగీపై ఉద్యమం ‘‘డెంగీ జ్వరం వస్తే చావడమేనా? ఇంతకుమించి దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్లేట్లెట్లు ఎక్కించే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరైనా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు రావాల్సిందే. ప్లేట్లెట్లు తగ్గితే చనిపోయే పరిస్థితులు ఉంటున్నాయి. పోలియోపై సమరం చేసినట్లుగా డెంగీపైనా చేయాలి. దీన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలి.’’ - శివకుమార్, ఓ కార్పొరేట్ ఆసుపత్రి ఉద్యోగి ఇది సాధారణ జ్వరమే.. ‘‘డెంగీ సాధారణ జ్వరంలానే ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీలో ప్యాకేజీగా ప్రకటించడం కష్టం. డెంగీ వచ్చిన వారిలో కేవలం 5 శాతం మందికే సీరియస్ అవుతుంది. మిగతా వారికి నయం అవుతుంది. ప్రత్యేకంగా డెంగీ కోసం ఆరోగ్యశ్రీ కింద చికిత్సకు కవరేజీ లేకపోయినా ప్లేట్లెట్లు తగ్గి రక్తస్రావం జరిగితే ప్లేట్లెట్లకు కవరేజీ ఇవ్వొచ్చు..’’ - డాక్టర్ చంద్రశేఖర్, తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో ఐదేళ్లలో తెలంగాణలో డెంగీ కేసులు సంవత్సరం నమోదైనవి 2011 520 2012 576 2013 654 2014 789 2015 (ఇప్పటివరకు) 846 -
'కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వాసుపత్రులు'
హైదరాబాద్: నగరంలో ఉన్న ఆస్పత్రులకు రూ.552 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.... ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతామని రాజయ్య తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకుంటున్న చర్యలు వివరించాలని అసెంబ్లీలో సభ్యుడు ప్రశ్నకు టి.రాజయ్య పైవిధంగా సమాధానమిచ్చారు. -
మార్పు లేనట్టే!
- ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు 40 శాతమే - వైద్యుల నిర్లక్ష్యమే కారణం - ప్రైవేట్ ఆస్పత్రుల్లో 57 శాతం సాక్షి, అనంతపురం : ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు జరిపి మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మార్పు’ కార్యక్రమం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ‘మార్పు’పై వైద్యులకు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పీహెచ్సీల్లో ప్రసవాలకు కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు. ఆ లక్ష్యాలకు మించి అదనంగా ప్రసవాలు చేసిన సిబ్బందికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. లక్ష్యాలను అధిగమించడం సంగతి అటుంచితే ఒక్క ప్రసవం కూడా జరగని ఆస్పత్రులు ఉన్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు. జిల్లాలో 80 పీహెచ్సీలు, 18 సీహెచ్సీలు, 4 ఏరియా ఆస్పత్రులు, జిల్లా హెడ్క్వార్టర్స్ ఆస్పత్రి (హిందూపురం) ఒకటి, అనంతపురం సర్వజనాస్పత్రి ఒకటి ఉన్నాయి. కాగా ప్రైవేటు ఆస్పత్రులు 500 వరకు ఉన్నాయి. వైద్యపరంగా గణనీయమైన మార్పులు వచ్చి ప్రభుత్వాస్పత్రులలో ఎంతో విలువైన పరికరాలు సైతం సమకూర్చుతున్నా కనీసం ప్రసవాలను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోతున్నారు. వైద్య సిబ్బందికితోడు అంగన్వాడీ, ఆశా కార్యకర్తల సహాయం కూడా తీసుకుంటున్నా ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదని నాలుగేళ్ల గణాంకాలను బట్టి తెలుస్తోంది. 2011 నుంచి 2014 ఆగస్టు వరకు జిల్లాలో 2,63,727 ప్రసవాలు జరగ్గా.. అందులో పీహెచ్సీలలో మాత్రమే 1,06,606 (40.42 శాతం) ప్రసవాలు జరిగాయి. ప్రైవేటు ఆస్పత్రులలో 1,50,830 (57.19శాతం), ఇళ్ల వద్ద 6297 (2.38శాతం) ప్రసవాలు జరిగాయి. కారణాలు అనేకం ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు ఎక్కువగా జరగక పోవడానికి ప్రధాన కారణం వైద్యుల నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. గర్భిణులు పరీక్షల నిమిత్తం వచ్చినపుడు స్వయంగా వైధ్యాధికారి పరీక్షించి మందులను ఇవ్వడంతో పాటు తగిన సూచనలు ఇవ్వాలి. ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలకు వచ్చేలా మనోధైర్యాన్ని కల్పించాలి. అయితే గర్భిణులు ప్రసవాలకు ఆస్పత్రులకు వస్తే వైద్యులు అందుబాటులో ఉండని సందర్భాలు అనేకం ఉంటున్నాయి. ఈ ఏడాది జులైలో గుమ్మఘట్ట మండలం పూలకుంటకు చెందిన శివప్ప భార్య వడ్డే ఈశ్వరమ్మ ప్రసవ వేదనతో బాధపడుతూ గుమ్మఘట్ట పీహెచ్సీకి వచ్చింది. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కొత్తగా ఆస్పత్రికి వచ్చిన స్టాఫ్నర్సు, స్వీపర్ కలసి ఈశ్వరమ్మకు కాన్పు చేశారు. కాసేపటికే ఈశ్వరమ్మ పురిటి బిడ్డతో సహా మృతి చెందింది. ఇలాంటి సంఘటనలు జిల్లాలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. కేవలం స్టాఫ్నర్సులు, ఏఎన్ఎంలు, కాంపౌండర్లు, ఇతర సిబ్బందే పెద్ద దిక్కుగా ఉండటంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకని, ప్రైవేట్ నర్సింగ్ హోంల వైపు మొగ్గు చూపుతున్నారు. గర్భిణుల నమోదులో చూపిన శ్రద్ధ ప్రసవ సమయంలో ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై డీఎంఅండ్హెచ్ను ఫోన్లో సంప్రదించగా తాను బిజీగా ఉన్నానని, మళ్లీ మాట్లాడుతానని ఫోన్ కట్ చేశారు. -
ఆయుష్తీరింది
భీమవరం, తాడేపల్లిగూడెంలో మూతపడిన సంజీవని ఫార్మసీలు ఏలూరు (టూటౌన్) : పేద ప్రజలకు మందులు అందుబాటు ధరలో అందించేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన సంజీవని ఫార్మసీ దుకాణాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. జిల్లాలోని ఏలూరు కేంద్ర ప్రభుత్వాసుపత్రితో పాటు తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిల్లో సంజీవని ఫార్మసీలను వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రులు జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన వీటిలో తాడేపల్లిగూడెం, భీమవరం ఫార్మసీలను మూసివేశారు. జంగారెడ్డిగూడెం, తణుకుల్లో ఏర్పాటు చేసిన సంజీవని ఫార్మసీలు కూడా అంతంతమాత్రంగానే నడుస్తున్నాయి. ఒక్క ఏలూరులోని సంజీవని ఫార్మసీ ఒక్కటే సక్రమంగా సాగుతోంది. ఇక్కడ మాత్రమే అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్పైర్ అయిన మందులు సరైన ప్రణాళిక లేకుండా జిల్లా సమాఖ్య లక్షల రూపాయలు వెచ్చించి ముందస్తుగా మందులు కొనుగోలు చేసింది. అయితే వాటి తేదీ ఎక్స్పైర్ అయిపోవడంతో వృథాగా మారాయి. భీమవరం, తాడేపల్లిగూడెం ఫార్మసీలు మూతపడడంతో వీటిని పడేశారు. ఏలూరులో రూ.2 లక్షలు విలువైన 108 రకాల మందులు ఎక్స్పైర్ కావడంతో వాటిని వెనక్కి పంపివేయడం జరిగింది. ఈ విషయం డీఆర్డీఏ అధికారులు జరిపిన విచారణలో బహిర్గతమైంది. జంగారెడ్డిగూడెం, తణుకు ఫార్మసీల్లో పూర్తిస్థాయిలో మందులు లేకపోవడంతో విక్రయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో అక్కడ పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఏలూరులో సంవత్సరానికి రూ.12 లక్షల మేర అమ్మకాలు జరగడంతో కొద్దిస్థాయిలో లాభాలబాటలో ఉంది. ప్రస్తుతం జిల్లాలోని 5 సంజీవని ఫార్మసీల్లో ఈ పరిస్థితులు ఉండగా జిల్లా అధికారులు మాత్రం ప్రతి మండల కేంద్రాల్లో ఫార్మసీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా సరైన నిర్వహణ, పూర్తిస్థాయిలో మందులు లేకపోతే అవి కూడా నిరుపయోగంగా మారే పరిస్థితి ఉంది. అధికారులు ఏం చేస్తారో వేచి చూడాలి. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల కల్పన
కలెక్టరేట్, న్యూస్లైన్: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఆరోగ్యశ్రీ సీఈఓ కె.ధనుంజయరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకం నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా గజ్వేల్, నర్సాపూర్ పీహెచ్సీ, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి, సదాశివపేటలోని వైద్య శిబిరాన్ని సందర్శించినట్టు తెలిపారు. జిల్లా సమస్యలపై కలెక్టర్తో చర్చించి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సూచిం చినట్టు చెప్పారు. జిల్లాలో 9 నెట్వర్క్ ఆస్పత్రులు పనిచేస్తున్నాయన్నారు. ఇందులో 8 ప్రభుత్వ ఆస్పత్రులు కాగా ఒకటి ఎంఎన్ఆర్ ప్రైవేటు ఆస్పత్రి ఉందన్నారు. ఆస్పత్రులకు పరికరాలను సమకూర్చడంతోపాటు, వైద్యుల కొరతను తీర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. తెల్ల రేషన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలకు అర్హులేనన్నారు. రేషన్కార్డు లేనివారికి సీఎం క్యాంపు కార్యాల యంతోపాటు రాష్ట్రంలోని వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూల్, కాకినాడలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన లబ్ధిదారుల కార్డులు జారీ చేస్తారని తెలి పారు. 104 టోల్ఫ్రీ నంబర్ ద్వారా ఆరోగ్యపరమైన సూ చనలు, సలహాలు పొందవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1,474 వైద్య శిబిరాలు నిర్వహించి 3 లక్షల పైచి లుకు వారికి స్క్రీనింగ్ చేసి 9,878 మందికి శస్త్రచికిత్స కోసం రిఫర్ చేశామన్నారు. ఇందులో 2,660 నెట్వర్క్ ఆస్పత్రులు పాల్గొన్నాయన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 61,391 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించి రూ.167 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆరోగ్యమిత్రలు, గ్రామైక్య సంఘాలు, ప్రజాప్రతినిధుల ద్వారా ఆరోగ్యశ్రీ పథకంపై విస్తృత ప్రకారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో జీఎం డాక్టర్ జైకుమార్, విజిలెన్స్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సి.రంగారెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సౌజన్య పాల్గొన్నారు. అంతకుముందు సంగారెడ్డిలోని పాత డీఆర్డీఎ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఆరోగ్యమిత్రలతో సమావేశమైన అనంతరం కలెక్టర్తో సమావేశమై చర్చించారు. ఆస్పత్రి తనిఖీ.. నర్సాపూర్: స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రిలోని ఆరోగ్యమిత్ర కార్యాలయాన్ని ఆరోగ్యశ్రీ పథకం సీఈఓ ధనుంజయరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్యమిత్రల పనితీరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని గజ్వేల్, జహీరాబాద్, సదాశివపేట, జోగిపేట ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేస్తారని చెప్పారు. ఆయా ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాలను ఈ పథకం ద్వారానే సమకూరుస్తున్నట్టు తెలిపారు.