Kondagattu Bus Accident
-
మంత్రులకు చేదు అనుభవం
సాక్షి, జగిత్యాల : మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్లకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం హిమ్మత్ రావు పేటకు వెళుతున్న మంత్రుల వాహనాలను రాంసాగర్ చౌరస్తా వద్ద కొండగట్టు బస్సు ప్రమాద బాధితులు, రైతులు అడ్డుకున్నారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు వెంటనే పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఆరు కుటుంబాలకు రావలసిన పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వెంటనే ఇవ్వాలని రోడ్డుపై బైటాయించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో మండలంలోని చెరువులు, కుంటలు నింపాలని ఆందోళన చేపట్టారు. 15 నిమిషాల పాటు మంత్రుల వాహనాలను ఎటూ కదలనీయకుండా అడ్డగించారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య మంత్రులు హిమ్మత్ రావు పేటకు బయలు దేరారు. -
కొండగట్టు బస్సు ప్రమాదానికి ఏడాది
సాక్షి, చొప్పదండి: ఆ భయానక క్షణం ఇంకా వారిమదిలో మెదులుతోంది. ఆ బస్సు ప్రమాద గాయాలు నిత్యం సలుపుతున్నాయి. కన్నవారిని.. ఉన్నవారిని.. కట్టుకున్నవారిని.. ఆత్మీయులను.. అయినవారిని దూరం చేసుకుని ఏడాది అవుతున్నా.. ఆ కన్నీళ్లు నేటికీ ఆరడం లేదు. వారి కష్టాలు తీరడం లేదు. గుర్తుకొచ్చినప్పుడల్లా.. గుండెలవిసేలా రోదిస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం.. అదో ఘోర కలి. దేశంలోనే అతిపెద్ద ప్రమాదం.. జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్రోడ్డుపై బస్సు ప్రమాదం జరిగి నేటికి ఏడాది.. 65మందిని పొట్టన పెట్టుకున్న ఆ ‘మృత్యుఘాట్’ సంఘటన దృశ్యాలు పలువురి మదిలో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి. వందమందికి పైగా ప్రయాణించిన బస్సులో 24మంది ఘటనాస్థలంలో.. 41మంది చికిత్స పొందుతూ ప్రాణాలు విడవగా.. మరెందరో మంచానికే పరిమితమయ్యారు. బస్సు ప్రమాద బాధితుల్లో ఏడుగురికి పరిహారమే అందలేదు. దీంతో కొడిమ్యాల మండలంలోని నాలుగు గ్రామాల వారిని పలుకరిస్తే.. కన్నీళ్లే మాటలుగా వస్తున్నాయి. కొండగట్టు బస్సుప్రమాదం జరిగి నేటికి ఏడాదవుతున్నప్పటికీ.. నాటి పెనువిషాదం నుంచి కొడిమ్యాల మండలంలోని నాలుగు గ్రామాలు ఇంకా తేరుకోలేదు. చనిపోయినవారి జ్ఞాపకాలతో కుటుంబ సభ్యులు దుఃఖిస్తుండగా, మానని గాయాలతో, చికిత్సకోసం అయ్యే ఆర్థికఇబ్బందులతో క్షతగాత్రులు నరకయాతనను అనుభవిస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలు, గాయపడ్డ బాధితుల ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ. నాటి సంఘటనపై ఎవరిని కదిలించినా కన్నీళ్లు వెల్లువెత్తుతున్నాయి. జీవితకాలపు విషాదాన్ని మిగిల్చిన బస్సుప్రమాదం నుంచి బాధిత కుటుంబాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపించడంలేదు. ఆ ప్రమాదంలో 65 మంది మృతిచెందగా, 50 మంది గాయపడ్డారు. ప్రభుత్వం అందించిన పరిహారం బాధితకుటుంబాల వేదనను తీర్చలేదు. నాయకుల పరామర్శలు వారిలో ఆత్మస్థైర్యం నింపలేదు. విధివంచితులు తమ తలరాతలను తల్చుకుని తల్లడిల్లిపోతున్నారు. చీకటి రోజుకు ఏడాది.. కొండగట్టు: చీకటి రోజుకు నేటితో ఏడాది. దేశంలోనే అదో పెద్ద ప్రమాదం. ఆ ఘ టనలో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైనాయి. గతేడాది సెప్టెంబర్ 11న ఆర్టీసీ బస్సు లోయలో పడి 65మంది చనిపోయారు. క్షతగాత్రులు ఇప్పటికీ మంచాల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఘాట్రోడ్డు మూసివేత.. ఘటన జరిగిన వెంటనే అధికారులు ఘాట్రోడ్ను పూర్తిగా మూసివేశారు. ఎలాంటి వాహనాలకు అనుమతులు ఇవ్వలేదు. అనంతరం రోడ్డు సెఫ్టీ అథారిటీ ఐపీఎస్ డీజీపీ కష్ణప్రసాద్, ఢీల్లీకి చెందిన పలు రోడ్డు సెఫ్టీ సంస్థలు, ఇతర అధికారులు ఘటనా స్థలారనికి చేరుకుని ప్రమాదతీరును పరిశీలించారు. నూతన ఘాట్ ఇలా.. ఘటన తర్వాత అధికారులు దాదాపు కోటి రూపాయలతో ప్రమాద స్థలంతో పాటు మరికొన్ని చోట్ల రెయిలింగ్, క్రాష్ బేరియర్స్, బూమ్ బేరియర్స్, కల్వర్ట్స్, రక్షణ గోడలు, దొంగలమర్రి నుంచి నాచుపెల్లి జేఎన్టీయూ మీదుగా సూచికబోర్డులు ఏర్పాటు చేశారు. పాత ఘాట్ రోడ్డు 1.5కి.మీ ఉండగా రోడ్డు సెఫ్టీ, ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షించిన మార్పు చేసి 300మీటర్లు అదనంగా పెంచారు. దొంగలమర్రి నుంచి నాచుపెల్లి, జేఎన్టీయూ, అక్కడనుంచి కొండమీద ఉన్న వై జంక్షన్ సమీపంలోని హరిత హోటల్, ఆలయం ఎదురుగా బీఎస్ఎన్ఎల్ టవర్ దిగువ వరకు, అక్కడి నుంచి ప్రమాదం జరిగిన స్థలం వరకు కొత్త రోడ్డుమ్యాప్ 9.6 కిలో మీటర్లు సిద్ధం చేశారు. రూ.111 కోట్లతో నాలుగు లైన్ల రహదారిని నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. 10కి.మీ. అదనపు రవాణా.. ఘాట్రోడ్డు బంద్ కావడంతో దిగువ కొండగట్టు నుంచి దొంగలమర్రి మీదుగా గుట్టమీదకు చేరుకునేందుకు దాదాపు 10కి.మీ. ప్రయాణం పెరిగింది. దీంతో భక్తులకు కావాలసిన వాహనాలు ఆర్టీసీ వారు ఏర్పాటు చేశారు. చిన్నపాటి అవస్థలు పడుకుంటూ భక్తులు కొండకు చేరుకొని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అంతుచిక్కని వైనం.. ఘాట్రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికీ అధికారులు అధికారికంగా తెలపడంలేదు. డ్రైవర్ నిర్లక్ష్యమా? బ్రేకులు ఫెయిల్? అధిక లోడ్? బస్సు ఫిట్నెస్ లేకపోవడం?ఇలా అనేక సందేహాలు ఉన్నాయి. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు కొండ మీద నుంచి మరో బస్సును నడిపి పరీశీలించారు. స్థానిక అధికారులు, ఢిల్లీ నిపుణులు కొండకు వచ్చి అనేక విధాలుగా ఆధారాలు సేకరించుకొని వెళ్లారు తప్ప నేటికి ప్రమాదం ఎలా జరిగిందో స్పష్టం చేయలేకపోయారు. బస్సు నేటికి మల్యాల పోలీస్స్టేషన్ వద్దే ఉంది. బతికున్నందుకు బాధపడుతున్నా.. శనివారంపేటకు చెందిన గోలి లక్ష్మికి అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రికి వెళ్లేందుకు తోడుకోసం కోనాపూర్లో ఉండేకూతురు ఎల్లమ్మను రమ్మంది. బస్సుప్రమాదంలో కూతురు చనిపోయింది. లక్ష్మి రెండుకాల్లు, రెండుచేతులు విరిగాయి. నుజ్జునుజ్జయిన ఎడమకాలును వైద్యులు మోకాలు పైభాగం వరకు తొలగించారు. మిగతా కాలు, రెండు చేతులకు రాడ్లువేశారు. లక్ష్మి తానున్నచోటునుంచి కదలలేదు. కొట్టివేసిన కాలుకు ఇన్ఫెక్షన్ వచ్చి చీముకారుతుంద ని, నొప్పి భరించలేకపోతున్నానని వృద్ధురాలు చేసే రోదనలు చుట్టుపక్కలవారికి కంటనీరు తెప్పిస్తున్నాయి. ప్రతీ పదిహేను రోజులకోసారి జగిత్యాలలోని ఆసుపత్రికి వెళ్లేందుకు అయ్యే ఆర్థికభారాన్ని వారి పేదకుటుంబం భరిం చలేకపోతోంది. లక్ష్మికి కాలు తొలగించినా వికలాంగ పెన్షన్ రావడంలేదు. తనకు జైపూర్కాలును అమర్చాల ని బాధితురాలు కోరుతున్నది. అమ్మమ్మ వెంట తీసుకెళ్లడంతోనే తన తల్లి చనిపోయిందని మనవడు సరిగా మాట్లాడడంలేదు. తానుకూడా అదేరోజు కూతురుతోపాటు చనిపోతే బాగుండేదంటున్న వృద్ధు రాలి వేదన కఠిన హృదయాలను సైతం కరిగించేలా ఉన్నది. నడవలేక నరకయాతన.. హిమ్మత్రావుపేటకు చెందిన పెంచాల లక్ష్మి, కూతురు సౌందర్య ప్రమాదంలో గాయపడ్డారు. ఉపాధి కోసం బ్రూనై వెళ్లిన భర్త నర్సయ్య తిరిగివచ్చాడు. లక్ష్మి కాలుచర్మం పూర్తిగా పాడవడంతో శరీరంలోని వేరేప్రదేశంలోని చర్మాన్నితీసి కాలుకువేశారు. కాలుకు, చేయికి రాడ్వేశారు. కొత్తగా వేసిన చర్మానికి ఇన్ఫెక్షన్వచ్చి కాలు వాచింది. మంచం దిగి నడవలేని పరిస్థితిలో వేదనపడుతున్నది. – తల్లితో సౌందర్య -
రహదారుల రక్తదాహం
సాక్షి, హైదరాబాద్: రహదారులు రక్తమోడుతున్నాయి.. రోడ్డుమీద రయ్యిమని దూసుకుపోతున్న వాహనాలు క్షణాల్లో ప్రమాదాల తలుపు తడుతున్నాయి. ఇష్టానుసారంగా వెళ్తున్న వాహనాలు ప్రమాదాలకు కారణమవుతూ నేరుగా ప్రయాణికులను యమపురికి చేరుస్తున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు రోడ్డు భద్రతా అధికారులు. రోడ్డు రవాణా, రహదారుల శాఖ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా ఏటా నాలుగు లక్షలకుపైగా ప్రమాదాలు జరుగుతుండగా, 1.6 లక్షల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది గాయాల పాలవుతున్నారు. వేలాదిమంది వికలాంగులుగా మిగులుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణలో సాలీనా దాదాపు ఆరువేల మంది ప్రజలు మరణిస్తున్నారు. జనవరి 1 నుంచి మే 16 వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలు పరిస్థితి తీవ్రతను చెబుతున్నాయి. తెలంగాణవ్యాప్తంగా రోజుకు సగటున 55 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా అందులో దాదాపు 17 మంది మరణిస్తున్నారు, 64 మంది గాయపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది రోజుకు మరణించిన వారి సంఖ్య సగటున 18 ఉండటం గమనార్హం. వేగం తొలికారణం గత పదేళ్లుగా వాహనరంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దీనికితోడు చక్కటి రోడ్లు, జాతీయ రహదారులు అందుబాటులోకి వచ్చాయి. గతంలో రోడ్డు మీద వ్యక్తిగత వాహనాలు కూడా తక్కువగా ఉండేవి. నేడు హైదరాబాద్లోనే కాక జిల్లా ల్లోనూ వ్యక్తిగత వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. పెరిగిన వాహన సామర్థ్యం కూడా ప్రమాదాలకు హేతువుగా మారుతోంది. 2000 నుంచి 5000 సీసీల వరకు సామర్థ్యమున్న కార్లు రోడ్ల మీదకు వస్తునాయి. ఇక బస్సుల్లోనూ అంతే. వాహనాల వేగం కనీసం 100 నుంచి 120 కి.మీ.ల స్పీడుకు తగ్గకుండా వెళ్తున్నారు. ఇలాంటి వాహనాలు ప్రమాదాలకు గురైతే.. ప్రాణనష్టం అధికంగా ఉంటుంది. దీనికితోడు ఫిట్నెస్లేని రవాణా వాహనాలు రోడ్ల మీద తిరగడం కూడా ప్రమాదాలకు మరో ప్రధాన కారణం. కొండగట్టు ప్రమాదంలో ఏకంగా 64 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అప్పటికే ఆ బస్సు 13 లక్షల కిలోమీటర్లు తిరిగి ఫిట్నెస్ లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక ప్రైవేటు ట్రావెల్స్ స్పీడ్కు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వీళ్లు త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్న ఆత్రుతతో 120 నుంచి 150 కి.మీ.ల స్పీడుతో బస్సులను నడుపుతున్నారు. 2013లో డ్రైవర్ అతివేగానికి పాలమూరులో బస్సు కల్వర్టును ఢీకొట్టినప్పుడు కూడా 40 మందికిపైగా ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఏటేటా రోడ్డు ప్రమాద మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. గతేడాది మొత్తం 6,603 మంది వివిధ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోగా 2019లో మే 17వ తేదీవరకు 2,403 మంది విగతజీవులుగా మారారు. ఈ ఏడాది ముగిసేందుకు మరో ఏడునెలల సమయం ఉంది. ఈ లెక్కన గతేడాది కంటే అధిక ప్రమాదాలు నమోదయ్యే అవకాశం ఉందని రోడ్ సేఫ్టీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల వారీగా.. ప్రమాదాలు.. తాజాగా తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాలపై రోడ్సేఫ్టీ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఇందులో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతోపాటు, కరీంనగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట కమిషనరేట్లు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీమ్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి– కొత్తగూడెం, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో జనవరి 1 నుంచి మే 17 వరకు చోటు చేసుకున్న వివిధ రోడ్డు ప్రమాదాలు జాబితా సిద్ధమైంది. మరణించినవారి, క్షతగాత్రుల వివరాలు కూడా పొందుపరిచారు. 263 ప్రమాదాలు, 274 మంది మరణాలతో సైబరాబాద్ రాష్ట్రంలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతంగా నమోదవ్వగా, అతి తక్కువగా 28 ప్రమాదాలు, 28 మంది మరణాలు కుమ్రంభీం జిల్లాలో నమోదయ్యాయి. ఈ నివేదిక ప్రకారం.. మే 16వ తేదీనే తెలంగాణలో 72 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, 16 మంది మరణించారు. 59 మంది గాయపడ్డారు. -
2018 : కన్నీటిని మిగిల్చిన కొండగట్టు ప్రమాదం
కొండగట్టు ప్రమాదం ఎంతో మంది జీవితాల్లో కన్నీటిని మిగిల్చింది.. కథువా ఘటన మనిషిలో కనుమరుగైన మానవత్వాన్ని చూపింది.. ఉన్నావ్ దుర్ఘటన రాజకీయ ఒత్తుడులను చవిచూసింది.. సమాజానికి సిగ్గుచేటుగా దాచేపల్లి ఘటన.. ప్రేమికుడి కోసం భర్తను హత్య చేయించడం మానవ సంబంధాల ఉనికిని చూపెడుతోంది.. ఈ ఏడాది సంచలనం రేపిన ఘటనలను ఓ సారి చూద్దాం.. సంచలనం రేపిన కథువా దుర్ఘటన (జనవరి 10-17) జమ్మూకశ్మీర్లోని కథువాలో 8 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలిక కనిపించకుండా పోయిన వారం రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని కథువా గ్రామానికి కిలోమీటరు దూరంలో గుర్తించారు. ఈ కేసులో ఏప్రిల్ 16వ తేదీన విచారణ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ కేసులో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విషాదం మిగిల్చిన విమానం ఆఫ్రికాలోని అల్జీరియాలో ఏప్రిల్ 11న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 257 మంది దుర్మరణం చెందారు. రాజధాని అల్జీర్స్ నుంచి టేకాఫ్ అయిన విమానం కొద్ది సేపటికే సమీపంలోని పొలాల్లో కుప్పకూలింది. మృతుల్లో ఎక్కువ మంది ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. ఉలిక్కిపడేలా చేసిన ఉన్నావ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లోని ఓ యువతిపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితురాలి తండ్రిని ఏప్రిల్ 5వ తేదీన అక్రమ ఆయుధాల చట్టం కింద అరెస్ట్ చేశారు. ఆయన అదే రాత్రి మృతి చెందడం కలకలం రేపింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం జరగడంతో.. ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. మానవత్వానికి సిగ్గుచేటు.. దాచేపల్లి ఘటన (మే 3-5) గుంటూరు జిల్లా దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై 55 ఏళ్ల వృద్దుడు అన్నం సుబ్బయ్య అత్యాచారానికి పాల్పడటం కలకలం సృష్టించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. చివరకు నిందితుడు గురజాల మండలంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమికుడు కోసం భర్త హత్య (మే 7)విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి మండలంలో సరస్వతి అనే వివాహిత పెళ్లైనా వారం రోజులకే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించడం స్థానికంగా కలకలం రేపింది. ఫేస్బుక్లో పరిచయమైన యువకుడిని ప్రేమించిన సరస్వతి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఈ హత్య దుండగులు చేసినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు సరస్వతిని నిందితురాలిగా తేల్చారు. పడవ బోల్తా.. 26మంది మృతి (మే 15) పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో లాంచీ మునిగిపోయిన ఘటన ఉభయ గోదావరి జిల్లాలను వణికించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 26 మంది మృతి చెందారు. మే 15 సాయంత్రం దేవిపట్నం నుంచి కొండమొదలు బయలుదేరిన లాంచీ సుడిగాలుల తీవ్రతకు బోల్తాపడింది. మేనమామే.. మృగంలా మారి! (జూన్ 15) మానసిక వికలాంగులైన చిన్నారులను సొంత మేనమామే దారుణంగా హత్య చేశాడు. మిర్యాలగూడలోని తన అక్క వద్ద నుంచి పిల్లల్ని తన రూమ్కు తీసుకువచ్చిన మల్లికార్జునరెడ్డి ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డాడు. చివరకు నిందితుడు మృతదేహాలను అర్ధరాత్రి కారులో తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. ఎనిమిదేళ్ల బాలికపై.. (జూన్ 26) మధ్యప్రదేశ్లోని మంద్సౌర్లో ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అతి కిరాతకంగా అత్యాచారనికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా మహిళలు మధ్యప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది.. (జూలై 1) దేశ రాజధాని ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద రీతిలో చనిపోవడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. మూఢ నమ్మకాలపై విశ్వాసంతో.. మోక్షం పొందడం కోసమే వారంతా సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వారి ఇంట్లో లభించిన ఆధారాలు కూడా ఈ వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయి. ఆరుగురు విద్యార్థులు, ఒక వివాహిత గల్లంతు.. (జూలై 14) తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంకలో నాటుపడవ గోదావరి నది పాయలో బోల్తా కొట్టిన దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు, ఒక వివాహిత గల్లంతయ్యారు. చిన్నారులు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అనాథ శరణాలయంలో దారుణం! (జూలై) బిహార్లోని ముజఫర్పూర్లో ఓ అనాథ శరణాలయంలో 34 మంది మైనర్ బాలికలపై నిర్వాహకుడు బ్రజేష్ లైంగిక దాడికి పాల్పడిన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ముంబైకి చెందిన ‘టిస్’ చేపట్టిన సోషల్ ఆడిట్తో ఈ దారుణం బయటపడింది. ఈ ఘటనలో బాధిత బాలికలు ఇచ్చిన వాంగ్మూలాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. కరక్కాయతో కాటువేశాడు! (జూలై) హైదరాబాద్ కేపీహెచ్బీలో కరక్కాయ పొడి పేరుతో జరిగిన ఘరానా మోసం వెలుగుచూసింది. బాధితులకు వేల రూపాయలు ఎరగా చూపిన నిందితులు కోట్లాది రూపాయలతో ఉడాయించారు. ధర్మపురి సంజయ్పై ఆరోపణలు (ఆగస్టు) ప్రముఖ రాజకీయ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు సంజయ్ నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో సంజయ్ 20 రోజలు పాటు సారంగపూర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కన్నీటిని మిగిల్చిన కొండగట్టు ప్రమాదం (సెప్టెంబర్ 11) జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 60 మంది దుర్మరణం పాలయ్యారు. ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్ద బస్సు ప్రమాదంగా ఇది నిలిచింది. ఆర్టీసీ అధికారుల తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శలు తీవ్ర స్థాయిలో వెలువెత్తాయి. మిర్యాలగూడ పరువు హత్య! (సెప్టెంబర్ 14) మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య తెలుగు రాష్ట్రాలో సంచలనం రేపింది. మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్లు ఈ ఏడాది జనవరిలో ఆర్యసమాజ్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కూతురి ప్రేమ వివాహన్ని తట్టుకోలేకపోయిన మారుతి రావు ప్రణయ్ను అంతమొందించాడు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరిగింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మావోయిస్టుల చేతిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హతం! (సెప్టెంబర్ 23) మన్యంలో మాటు వేసిన మావోయిస్టులు విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే కిడారి సోములను దారుణంగా కాల్చి చంపారు. దాదాపు 65 మందితో కూడిన మావోయిస్టు దళం ఈ దాడికి పాల్పడినట్టుగా తెలిసింది. నిఘా వ్యవస్థ వైఫల్యం వల్లనే ఈ దాడి జరిగిందనే విమర్శలు ఉన్నాయి. మిస్టరీగా ఖషోగ్గి హత్య (అక్టోబర్ 2) ఇస్తాంబుల్లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయానికి వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్యకు గురికావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కనీసం ఆయన మృతదేహాం కూడా లభించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఖషోగ్గీ హత్య వెనుక ఉంది సౌదీ అరేబియా ఉందనడానికి తమ దగ్గర ఆధారాలున్నాయంటూ టర్కీ ప్రభుత్వం పేర్కొంది. తనపై విమర్శనాత్మక కథనాలు రాసినందున ఖషోగ్గీని సౌదీ యువరాజు సల్మాన్ చంపించారనే ఆరోపణలు వచ్చాయి. రావణాసురుడి దహణం.. 59మంది దుర్మరణం (అక్టోబర్ 19) పంజాబ్ అమృత్సర్లో దసరా వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. జోడా ఫాటక్ ప్రాంతంలో రావణ దహనాన్ని వీక్షిస్తున్న వారిపైకి రైలు మృత్యువులా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 59 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. అండమాన్లో అమెరికన్ టూరిస్ట్ హత్య (నవంబర్) అండమాన్, నికోబార్ దీవుల్లో నివసించే సెంటినెలీస్ తెగ చేతిలో జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ టూరిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. బయటివారి ఉనికిని ఏమాత్రం ఇష్టపడని ‘సెంటినెలీస్’ తెగ వారు ఈ చర్యకు పాల్పడ్డారు. కాగా, అలెన్ క్రైస్తవ మత ప్రచారం కోసం అక్కడికి వెళ్లారు. ఆలయంలో విష ప్రసాదం.. 15మంది మృతి (డిసెంబర్ 14) కర్ణాటక చామరాజనగర జిల్లా సుళ్వాడిలోని చిక్క మారమ్మ ఆలయంలో విష ప్రసాదం తిని 15 మంది మృతి చెందటం సంచలనంగా మారింది. ఆధిపత్య పోరు ముసుగులో పగతో ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు ఇమ్మడి మహదేవస్వామి తన మనుషులతో ప్రసాదంలో మోనోక్రోటోఫాస్ అనే పురుగుల మందు కలిపి ఈ ఘోరానికి పాల్పడినట్టు తెలింది. -
ప్రణయ్ను సుపారీ ఇచ్చి మరీ చంపించాడు!
2018 సంవత్సరం.. తెలంగాణకు మాయని గాయాలను మిగిల్చింది. ప్రమాదాలు, పరువు హత్యలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. కొండగట్టు బస్సు ప్రమాదం కలవరపరిచింది. టపాసులు పేలి డజను మంది మృత్యువాత పడ్డారు. కులం కోసం ప్రేమించుకున్న వారిని, కన్న వారిని కూడా చూడకుండా కడతేర్చారు. చలికి రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న కుంపటి జీవితాలను బుగ్గిపాలు చేసింది. డబ్బుకు లోకం దాసోహం అన్నట్లుగా మారిన తీరును కొందరు అక్షరాల సత్యం చేశారు. నౌహీరా షేక్ డిపాజిట్ల కుంభకోణం వేల కుటుంబాలను ఆగం చేసింది. – సాక్షి, హైదరాబాద్ ప్రమాదపు చావులు.. దేశ చరిత్రలోనే భారీ ప్రాణనష్టం కొండగట్టు బస్సు ప్రమాదంలో జరిగింది. సెప్టెంబర్ 12న జరిగిన కొండగట్టు ఘాట్రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడి 62 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకుంది. ఈ ఘటనతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. హైదరాబాద్ నుంచి రామగుండం వెళ్లే రాజీవ్ రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగించాయి. ఈ ఏడాది మేలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం 11 మందిని బలిగొంది. ప్రముఖ సినీ నటుడు, నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లా నార్కట్పల్లి చెరువుగట్టు వద్ద కారు ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. అర్థంలేని పరువు హత్యలు.. ప్రేమించి పెళ్లి చేసుకోవడం నచ్చకపోతే వాళ్ల బతుకు వాళ్లను బతకనివ్వాల్సింది. కానీ అర్థం లేని ఆవేశాలకు పోయి కులాంతర వివాహం చేసుకున్నందుకు కన్న కూతుర్ల జీవితాలనే కాలారాశారు. మిర్యాల గూడలో ప్రణయ్ పరువు హత్య రాష్ట్రంలో సంచలనం రేపింది. తన కూతురిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడని, ప్రణయ్ను సుపారీ ఇచ్చి మరీ చంపించాడు అమృత తండ్రి మారుతీరావు. ఇలాంటి ఉదంతమే మంచిర్యాలలో కూడా చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న కన్న కూతురినే తల్లిదండ్రులు, సోదరుడు కలసి గొంతు నులిమి చంపేశారు. కులాంతర వివాహం చేసుకున్నారనే కోపంతో కూతురు, అల్లుడిపై ఎర్రగడ్డలో నడిరోడ్డుపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచాడు ఓ తండ్రి. అదృష్టవశాత్తు వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. హవాలా హవా.. పైకి పార్శిళ్లలాగే ఉన్నా వాటిలో మాత్రం హవాలా డబ్బు సరఫరా అవుతోంది. హైదరాబాద్ నుంచి ముంబైకి హవాలా డబ్బును ఆంధ్రా పార్శిళ్ల సంస్థ రవాణా చేస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు. రూ.66 లక్షల హవాలా సొమ్మును సీజ్ చేశారు. ఏకంగా రైళ్లలోనే హవాలా డబ్బు రవాణా జరగడం ఈ ఏడాది చర్చనీయాంశమైంది. వెయ్యి కోట్లు మింగేసింది.. హీరా గోల్డ్ పేరుతో 8 రాష్ట్రాల్లో డిపాజిట్లు వసూలు చేసినా ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రూ.వెయ్యి కోట్లకు పైగా పలు రకాల స్కీముల పేరుతో డిపాజిట్ల రూపంలో సేకరించింది ఆ సంస్థ యజమాని నౌహీరా షేక్. రాజకీయ వేడి.. ఏడాది చివర జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హవాలా డబ్బు ఏరులై పారింది. రూ.125 కోట్లకు పైగా నగదును పోలీస్ శాఖ స్వాధీనం చేసుకోగా, అందులో హవాలా డబ్బే దాదాపు 40 కోట్లకు పైగా ఉంది. వరంగల్ పెంబర్తిలో పట్టుబడ్డ కేసులో మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కాంగ్రెస్ నేత మద్దిరాజు రవిచంద్ర పేర్లు బయటపడటం కలవరం రేపాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు, విచారణ రాజకీయంగా వేడిని రగిలించాయి. ఎన్నికల ప్రచారం ముగియడానికి ముందు రోజు రేవంత్రెడ్డి ముందస్తు అరెస్ట్ పోలీసు శాఖకు, ఉన్నతాధికారులకు మాయని మచ్చగా మిగిలింది. ఈ అరెస్ట్ వ్యవహారంపై హైకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సంచలన తీర్పులు.. 2007లో జరిగిన హైదరాబాద్ గోకుల్ చాట్, లుంబినీ పార్క్ జంట పేలుళ్ల కేసులో న్యాయస్థానం ఈ ఏడాది సంచలన తీర్పు వెలువరించింది. నిందితుల్లో ఇద్దరికి ఉరిశిక్ష విధించగా, మరొకరికి జీవిత ఖైదు విధించింది. మద్దెల చెరువు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న భానుకిరణ్కు జీవితఖైదు విధిస్తూ సీఐడీ కోర్టు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం శిక్ష ఖరారు చేసింది. నర్సింగ్ విద్యార్థులకు వేధింపులు.. నర్సింగ్ కాలేజీలను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ కుమారుడు సంజయ్ను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శాంకరీ నర్సింగ్ కాలేజీలోని 11 మంది నర్సింగ్ విద్యార్థినులు దీనిపై నేరుగా హోంమంత్రికి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పాతబస్తీలోని నిజాం మ్యూజియం నుంచి రూ.300 కోట్ల విలువైన వస్తువులను కొట్టేశారు దుండగులు. ప్రాణాలు బలితీసుకున్న కుంపటి.. చలి వేస్తుండటంతో వెచ్చదనం కోసం ఇంటిలో పెట్టుకున్న బొగ్గుల కుంపటి ఆరుగురి ప్రాణాలను బలిగొంది. జూబ్లీహిల్స్కు చెందిన బుచ్చివేణి, ఆమె కుమారుడు పద్మరాజు పొగకు ఊపిరాడక మృతిచెందగా, ఆ మరుసటిరోజే శామీర్పేట బొమ్మరాసిపేట గ్రామంలో కోళ్లఫారంలో పనిచేస్తున్న మహబూబ్నగర్కు చెందిన నలుగురు వలస కూలీలు ఇదే రీతిలో మరణించడం సంచలనం రేపింది. కాల్చేసిన బాణసంచా.. రోజువారీ కూలీలుగా పనిచేసుకునే కుటుంబాల్లో అగ్నిప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. వరంగల్ శివారులో బాణసంచా తయారీ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది కూలీలు దుర్మరణం చెందడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాగా, హైదరాబాద్లోని పాతబస్తీ చాంద్రాయణగుట్టలో బాసిత్తో పాటు నలుగురిని ఐసిస్ మాడ్యూల్ కోసం పనిచేస్తున్నట్లు గుర్తించి ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
నెలరోజులైనా పరిహారం ఇవ్వరా?
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆర్టీసీ ప్రమాద బాధిత కుటుంబాలు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కోసం ఆందోళన లు ఉధృతం చేస్తున్నాయి. ప్రమాదం జరిగి నెలరోజులు కావస్తున్నా.. పరిహారం అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పరిహారం కోసం ఈ నెల ఐదో తేదీన జగిత్యాలలో ధర్నాకు దిగిన విషయం విదితమే. జాయింట్ కలెక్టర్ రాజేశం హామీతో ఆందోళనను విరమించిన మృతుల కుటుంబాలు.. బుధవారం మళ్లీ కొడిమ్యాల, మల్యాల మండలాల సరిహద్దు దొంగలమర్రి వద్ద దర్నా నిర్వహించా లని మంగళవారం నిర్ణయించారు. ఇది తెలుసుకున్న మల్యాల సీఐ, కొడిమ్యాల ఎస్ఐ ధర్నా చేయకుండా భగ్నం చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం అందుతుందని, జిల్లా అధికారులతో మాట్లాడిస్తామన్నారు. 40మంది బాధిత కుటుంబాలు కలెక్టర్ శరత్, జేసీ రాజేశంను కలసి తమకు రావాల్సిన నష్టపరిహారాన్ని ఇప్పించాలని కోరాయి. వారం లో పరిహారం అందేలా చర్యలు తీసుకుంటా నని కలెక్టర్ చెప్పడంతో వారు శాంతించారు. త్వరలోనే ఆదుకుంటాం: కలెక్టర్ కొండగట్టు ప్రమాద బాధిత కుటుంబాలను త్వరలోనే ఆదుకుంటామని కలెక్టర్ శరత్ తెలిపారు. అంత్యక్రియలకు రూ.20 వేలు ఇచ్చామని. ఆర్టీసీ రూ.3లక్షల చొప్పున అన్ని కుటుంబాలకు పంపిణీ చేశారన్నారు. ప్రభు త్వం నుంచి రావాల్సిన రూ. 5లక్షలు త్వరలోనే మంజూరు కానున్నాయని పేర్కొన్నారు. పరిస్థితి దయనీయం: ప్రమాదంలో గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న.. వికలాంగులుగా మారిన వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా తయారైంది. బాధితులం దరూ నిరుపేదలే కావడంతో మెరుగైన వైద్యం పొందలేని స్థితిలో ఉన్నారు. మండల పరిధిలో గాయాలపాలైన 43 మందిలో కొందరు పూర్తి గా కోలుకోలేకపోయినా.. ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు వారిని డిశ్చార్జి చేశారు. కాళ్లూ చేతులు విరిగి మంచానికే పరిమితమైన వారు రెండ్రోజులకోసారి వైద్య పరీక్షలకు వెళ్లాలన్నా రవాణా ఖర్చులు లేక వెళ్లలేని స్థితిలో ఉన్నారు. -
కొండగట్టు బాధితులు ఇంటికి వెళ్లొచ్చు!
సాక్షి, హైదరాబాద్: కొండగట్టు ఆర్టీసీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి దయనీయంగా ఉంది. గాయపడ్డవారిలో నలుగురు ఇంటికి వెళ్లొచ్చని ఆస్పత్రి వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. హైదరాబాద్కు క్రమం తప్పకుండా వైద్యపరీక్షల కోసం తీసుకురావాలని డాక్టర్లు సూచించారు. చేతిలో చిల్లిగవ్వలేని కూలీ కుటుంబాలమైన తమకు అదెలా సాధ్యమంటూ వాపోతున్నారు. 62 మంది ప్రయాణికు లను బలితీసుకున్న ఆ దుర్ఘటన నుంచి క్షతగాత్రులు, మృతుల కుటుంబాలు ఇంకా తేరుకోలేదు. సెప్టెంబర్ 11న బస్సు ప్రమాదం జరిగాక రాజమ్మ, సత్తవ్వ, విజయ, రాజయ్య తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లారు. అప్పటి నుంచి వీరు హైదరాబాద్లో సన్షైన్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కళ్లు తెరిచిన విజయ, సత్తవ్వలను శనివారం జనరల్ వార్డుకు మార్చనున్నారు. రాజవ్వ శుక్రవారం స్పృహలోకి వచ్చింది. తీవ్రంగా గాయపడ్డ రాజయ్య మాత్రం ఇంకా కోమాలోనే ఉన్నాడు. వీరంతా ఇంకా కొన్ని నెలలపాటు చక్రాల కుర్చీకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి. ఈ నలుగురూ రోజువారీ కూలీలు. మందులు, రెగ్యులర్ చెకప్లకు హైదరాబాద్కు ఎలా రావాలా? అని ఆందోళన చెందుతున్నారు. 18 రోజులుగా హైదరాబాద్లో ఉండటానికి భోజనం ఖర్చులకే అప్పు చేశామని, భవిష్యత్తులో చికిత్స, మందులు తమకు తలకుమించిన భారమని వాపోతున్నారు. ఏర్పాట్లు చేస్తున్నాం కొండగట్టు బస్సు ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందిస్తున్నాం. డిశ్చార్జ్ అయినవారికి మేమే అంబులెన్స్లు ఏర్పాటు చేస్తాం. వారిని ఇంటి వద్ద దించేదాకా మాదే బాధ్యత. డిశ్చార్జి అయిన క్షతగాత్రులకు జగిత్యాలలో రెగ్యులర్ చెకప్ల కోసం ఇప్పటికే కలెక్టర్తో మాట్లాడాం. వారి చికిత్స విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – జీవన్ ప్రసాద్, ఆర్ఎం, కరీంనగర్ దుబాయ్లో ఉద్యోగం మానేసి వచ్చాను మా అమ్మ మెల్లిగా కోలుకుంటోంది. గర్భవతి అయిన నా సోదరిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో నా చెల్లి చనిపోయింది. ఆ విషయం ఇప్పటికీ మా అమ్మకు చెప్పలేదు. విషయం తెలిసి దుబాయ్ నుంచి వచ్చేశాను. ఇప్పుడు నా ఉద్యోగం పోయింది. డాక్టర్లు చెకప్ల కోసం హైదరాబాద్కు తీసుకురమ్మంటున్నారు. అంత డబ్బు మా దగ్గర లేదు. దయచేసి జగిత్యాల లేదా కరీంనగర్లో మాకు చికిత్స అందించే ఏర్పాటు చేయండి. – అనిల్, విజయ కుమారుడు, తిమ్మాయపల్లి తలకు మించిన భారం నేను దుబాయ్లో ఉద్యోగం చేస్తాను. సెలవుల కోసం వచ్చినపుడు ఈ దుర్ఘటన జరిగింది. ఇక అప్పటి నుంచి నేను దుబాయ్ వెళ్లలేదు. అమ్మ ఈ రోజే కళ్లు తెరిచింది. నన్ను గుర్తుపట్టింది. అదే సమయంలో డాక్టర్లు మరో రెండురోజుల్లో పంపిస్తామని చెప్పారు. దీంతో ఇంటికెళ్లాక అమ్మను ఎలా చూసుకోవాలో అర్థం కావడం లేదు. మా వద్ద సదుపాయాలు లేవు. దయచేసి అమ్మ పూర్తిగా కోలుకోనేదాకా చికిత్స ఇప్పించాలని మనవి. – సాయి, రాజవ్వ కుమారుడు, జగిత్యాల -
కొండగట్టు ప్రమాదం: ఆగని కన్నీళ్లు
జగిత్యాలజోన్/కొండగట్టు/ధర్మపురి: ప్రజలు సుభిక్షంగా ఉండాలనే నారాయణ బలిహోమం నిర్వహిస్తున్నట్లు శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి అన్నారు. ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తాపడి 62మంది చనిపోయిన కొండగట్టు ఘాట్రోడ్డు ఆవరణలో బుధవారం నారాయణ బలి శాంతిహోమం నిర్వహించారు. కార్యక్రమానికి కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాల నుంచి మృతుల కుటుంబాలు భారీగా తరలివచ్చారు. ఘటనాప్రదేశాన్ని చూసి, వారి కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని బోరున విలపించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానందాస్వామి మాట్లాడుతూ.. దేశంలోనే కొండగట్టు బస్సు ప్రమాదం ఘోరమైందన్నారు. ప్రమాదంలో మరణించిన వారిని తీసుకురాలేమని, ఉన్నవారికి మంచి జరగాలనే ఉద్దేశంతో నారాయణబలిహోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ హోమం ద్వారా ప్రేతాత్మకు విముక్తి, ఆత్మశాంతి కలుగాలని కోరుతున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. సంఘటన స్థలం వద్ద శాస్త్రోత్తకంగా పిండ ప్రదానం చేసి వాటిని ధర్మపురి గోదావరిలో కలుపుతారని వెల్లడించారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి పిల్లలకు ఉచిత వసతి, విద్యను అందించేందుకు జగిత్యాల జిల్లా కేంద్రంలో బాలుర కోసం వాల్మీకి అవాసం, బాలికల కోసం భగిని నివేదిత అవాసాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తాను సాయం అందిస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైదికులు డాక్టర్ బాచంపల్లి సంతోష్కుమార్ శర్మ, కరీంనగర్, జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జీలు బండి సంజయ్, ముదుగంటి రవీందర్రెడ్డి, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వెంకట్ రాజ్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్లు డాక్టర్ శంకర్, డాక్టర్ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. కన్నీరు.. మున్నీరు.. కొండగట్టు ప్రమాద ఘటనాస్థలానికి భారీగా మృతుల కటుంబసభ్యులు వచ్చారు. ఎవరి మోహంలో నిరునవ్వు లేదు. కన్నీరు ఆగడం లేదు. ఘటనాస్థలాన్ని చూసిన వారు తమ వారిని గుర్తు చేసుకుని గుండెలవిసేలా రోదించారు. ముందుగా పండితులు మృతుల కుటుంబసభ్యులపై గోదావరి పుణ్యతీర్థం చల్లారు. అనంతరం హోమం, పూజలు, సామూహిక పిండాలు ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అక్కడే అన్నదానం నిర్వహించారు. పంచభూతాల పరిరక్షణతో క్షేమం.. పకృతిని ఆరాధిస్తూ పంచభూతాలను పరిరక్షించడం ద్వారా దేశం సుభిక్షంగా ఉంటుందని శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి పేర్కొన్నారు. కొండగట్టు మృతుల పిండాలను ధర్మపురి గోదావరిలో కలిపారు. అనంతరం ఆర్అండ్బీ వసతిగృహంలో మాట్లాడారు. ధర్మపురిలో సాక్ష్యాత్తు భగవంతుని సొమ్ముకే రక్షణ లేకపోవడంతో శోచనీయం అన్నారు. ధర్మపురి పవిత్ర గోదావరిలో కొంతకాలంగా డ్రయినేజీ నీరుకలుస్తూ కాలుష్య కోరల్లో చిక్కుకోగా దీన్ని నివారించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందని అన్నారు. పంచభూతాల్ని పవిత్రంగా కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఘాట్రోడ్ ప్రమాదంపై మరో బస్సుతో పరిశీలన ఘాట్రోడ్పై బస్సు ప్రమాదంపై అధికారులు కదిలారు. ఈ ఘటనపై రాష్ట్ర రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కృష్ణప్రసాద్ ఇప్పటికే మూడుసార్లు కొండగట్టు చేరుకుని అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. దీంతో స్థానిక అధికారుల్లోనూ కదలిక వచ్చింది. మరోవైపు బుధవారం నల్గొండ జిల్లా ఆర్ఎం విజయ్కుమార్ ఘటనస్థలానికి వచ్చి ఘాట్రోడ్పై ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు సేకరించారు. మరో ఆర్టీసీ బస్సును కొండపై నుంచి కిందకు తీసుకొచ్చారు. వచ్చేక్రమంలో ఘాట్రోడ్ స్పీడ్ బ్రేకర్ల వల్ల ప్రమాదం జరిగిందా..? టర్నింగ్లతోనా.. ? ప్రమాద సమయంలో బస్సు స్పీడు ఎంత ఉంది.. ? ఎంత స్పీడులో ఈ ప్రమాదం జరిగింది.. ? ఆ సమయంలో బ్రేకులు ఫెయిలయ్యాయా...? అని అనేక కోణాల్లో పరిశీలించారు. ప్రమాద సమయంలో ధ్వంసమైన రెయిలింగ్తోపాటు ప్రమాదకరలోయనూ పరిశీలించారు. -
‘కొండగట్టు’ ఘటనపై హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి సరైన వైద్యసేవలు అందించలేదని, మృతదేహాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్.ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ఘటనలో 62 మంది మృతి చెందిన విషయం తెలి సిందే. కాలం చెల్లిన బస్సును నడిపేందుకు అనుమతి ఇచ్చిన జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావు, ఇతరుల గురించి మల్యాల పోలీసుల ఎఫ్.ఐ.ఆర్.లో ఉండేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కొండగట్టు ప్రాంతంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా లేవని, బస్సులో 57 మంది ప్రయాణించేందుకు వీలుండగా 105 మం దితో కిక్కిరిసి వెళతూ ప్రమాదానికి గురైం దని వివరించారు. బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించరాదని, ప్రమాదాల్లో గాయడిన వారికి నాణ్యమైన వైద్యమందించేందుకు మల్టీస్పెషాలిటి హాస్పిటళ్లకు తీసుకువెళ్లేలా చేయాలని కోరారు. -
‘ప్రజల ప్రాణాలు పోతున్నా కేసీఆర్ తీరు మారదా’
సాక్షి, నల్గొండ : ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న భయానక ఘటనలపై కేసీఆర్ స్పందించిన తీరు సరికాదన్నారు. ప్రేమ వివాహం కారణంగా మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ కుంటుంబ సభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడతూ.. ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ ప్రాణాలు తీయడం అత్యంత బాధకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎప్పుడూ ఫామ్హౌక్కే పరిమితమయ్యే కేసీఆర్.. సచివాలయానికి రాకున్నా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తక్షణమే స్పందించాలని హితవు పలికారు. కొండగట్టు బస్పు ప్రమాదంలో 60 మంది చనిపోయినప్పుడు కూడా కేసీఆర్ రాకపోవడం విస్మయం కలిగిచిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరువు హత్యలపై కఠిన చట్టాలు తెస్తామని వెల్లడించారు. చదవండి : మిర్యాలగూడలో పరువు హత్య చదవండి : కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం.. 60 మంది దుర్మరణం -
చెదిరిన బతుకు చిత్రం!
కొడిమ్యాల (చొప్పదండి): జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. చాలా మంది కాళ్లు, చేతులు కోల్పోయి జీవచ్ఛవాలుగా మిగిలిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎందుకు బతికాంరా దేవుడా..! అని రోదిస్తున్నారు. అయినవారు లేక.. ఆదుకునేవారు కనిపించక.. దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతు న్నారు. ప్రమాదంలో 58 మంది గాయపడగా, అందులో కొడిమ్యాల మండలానికి చెందినవారే 47 మంది ఉన్నారు. డబ్బుతిమ్మయ్యపల్లికి చెంది న 11 మంది, హిమ్మత్రావుపేటకు చెందిన 10 మంది, శనివారంపేటకు చెందిన 11 మంది, రాంసాగర్కు చెందిన 9 మంది, తిర్మలాపూర్కు చెందిన ఐదుగురు, సంద్రాలపల్లికి చెందిన ఒక్క రు ఉన్నారు. క్షతగాత్రులు జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్ ఆçస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా రు. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన ఎన్.లక్ష్మికి, ఎ.లింగవ్వకు 2 కాళ్లు, చేతులూ విరిగిపోయాయి. ప్రస్తుతం వీరు హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన తైదల లింగయ్యకు 2 కాళ్లు విరిగిపోయాయి. తైదల లతకు కుడిచేయి విరిగింది, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి కుటుంబసభ్యులు ఆస్ప త్రులకే పరిమితమై వారికి సేవలు చేస్తున్నారు. ఇళ్లకు తాళాలు వేసి.. ప్రమాదంలో డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన కొంపెల్లి విజయ రెండు కాళ్లు విరిగాయి. ఈమె భర్త నచ్చయ్య 15 ఏళ్ల క్రితమే మృతి చెందాడు. కొడుకు తిరుపతి ఆర్నెల్ల క్రితం దుబాయ్కి వెళ్లాడు. కూతురు స్వప్న ఇంటికి తాళం వేసి తల్లి వెంట కరీంనగర్ ఆస్పత్రిలో ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన లైసెట్టి శారద రెండుకాళ్లు విరిగాయి, తండ్రి కమలాకర్ దుబాయ్లో ఉండగా.. తల్లి లక్ష్మితో పాటు చెల్లి జయ, తమ్ముడు గణేశ్ బాధితురాలితో ఆస్పత్రిలో ఉంటున్నారు. సందడిగా ఉండే వీరి ఇంటికి తాళం పడింది. పెద్దమ్మ కళావతిని ప్రమాదంలో కోల్పోయింది. డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన సీహెచ్ విజయకు రెండుకాళ్లు, పక్కటెముకలు విరిగాయి. మనవడు సూరజ్కు కాళ్లకు గాయాలయ్యాయి. బాధితులు హైద రాబాద్లో చికిత్స పొందుతున్నారు. బాధితురా లి ఇద్దరు కుమారులు, కోడళ్లు ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ప్రమాదంలో గోల్కొండ విజయ పక్కటెముకలు విరిగాయి. గర్భవతైన కూతురు సుమలతను ప్రమాదంలో కోల్పోయింది. కొడుకు అనిల్ ఆస్పత్రిలో తల్లి వెంట ఉంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన వనితకు కడుపులో తీవ్ర గాయాలు కావడంతో హైదరాబా ద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భర్త సంజీవ్రెడ్డి సింగపూర్ నుంచి వచ్చి ఆస్పత్రిలో ఉంటున్నాడు. పక్కటెముకలు విరగిన గడ్డం జలజ హైదరాబాద్లోనే చికిత్స పొందుతోంది. ‘హిమ్మత్’ కోల్పోయింది బస్సు ప్రమాదంతో హిమ్మత్రావుపేట తన హిమ్మత్ను కోల్పోయింది. గ్రామానికి చెందిన లంబ మల్లవ్వ కాళ్లు విరిగాయి, కోడలు రజిత కాలు, చేయి విరిగింది. కొడుకు మహేష్ దుబాయ్ నుంచి వచ్చి, తల్లి, భార్యకు సపర్యలు చేస్తున్నాడు. ఎ.రమకు కాళ్లు, చేతులకు తీవ్ర గాయా లయ్యాయి. భర్త, పిల్లలు లేకపోవడంతో తమ్ము డు ఆస్పత్రిలో ఆమెతో ఉన్నాడు. ఆరె రాజమ్మ కా ళ్లు విరిగి హైదరాబాద్లో చికిత్స పొందుతోంది. రాంసాగర్.. విషాదసాగరం రాంసాగర్ గ్రామం విషాద సాగరమయ్యింది. గ్రామానికి చెందిన డి.అనిత కాలు విరిగింది, ప్రమాదంలో భర్త స్వామి చనిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బీ కీర్తన కాలుకు గాయాలయ్యాయి. ప్రమాదం లో కూతురు రితన్యను కోల్పోయింది. డిగ్రీ వి ద్యార్థినులు వైష్ణవి, సంగీత కాళ్లు, చేతులకు గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్నారు. సాహితికి గాయాలయ్యాయి. -
ఎవరిని కదిలించినా కన్నీళ్లే
-
ఆగని కన్నీళ్లు..!
చితి మంటలు ఆరలేదు.. కన్నీటి ధారలు ఆగలేదు.. ‘కొండగట్టు’ పల్లెల్లో కొడిగట్టిన విషాదం కొండంత శోకాన్ని మూటకట్టింది. ప్రమాదం జరిగి మూడురోజులు గడిచినా.. ఆ పల్లెల్లో విషాదం వీడలేదు. ఎవరినీ కదిలించినా కన్నీళ్లే. పచ్చని పొలాలు.. పాడి పంట.. కులవృత్తులు.. ఏ ఇంటి పెరడి చూసినా నిండాకాసిన కూరగాయలు. పాలు అమ్ముకుని కొందరు, పనికిపోయి ఇంకొందరు ఇలా.. ఏ గడప చూసినా.. పట్టెడన్నం తిని చల్లగా బతికిన ఊర్లవి. ‘కొండం’త అభివృద్ధి, సింగారించుకున్న ప్రజా జీవన సౌందర్యం ఆయా గ్రామాలకే సొంతం. ఇదంతా నాలుగు రోజుల కిందటి ముచ్చట. ఇప్పుడా పల్లెలు కళతప్పాయి. ఏ ఊరు చూసినా పెనువిషాదమే.. ఏ ఇళ్లు చూసినా విషాదఛాయలే.. ఏ గుండె తట్టినా కన్నీటిధారలే.. వెక్కివెక్కి ఏడ్చిన పల్లెజనం కళ్లలో నీళ్లూ ఇంకిపోయాయి. అయినా.. ఏడుపు ఇంకా మిగిలే ఉంది. తల్లికోసం బిడ్డ.. బిడ్డ కోసం తల్లిదండ్రులు.. భర్తను గుర్తుచేసుకుని భార్య.. భార్యను మరవలేని భర్త.. పని కోసం బయటికి వెళ్లి, తిరిగిరాని తోడుకోడళ్లు. అంతులేని విషాదం ఆ ఊళ్లలో చోటు చేసుకోగా.. ఇప్పుడా గ్రామాలు గణేష్ ఉత్సవాలకు కూడా దూరంగా ఉన్నాయి. ఎక్కడా చూసినా సిద్ధమైన మండపాలు.. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పెద్ద మనుషుల ఇళ్లలో వినాయకుడి విగ్రహాలు.. ఊహించిన ఘటనతో విషాదం నిండిన ఆ పల్లెలు వినాయక ఉత్సవాలను జరుపుకోవడం లేదు. కొండగట్టు పల్లెల నుంచి ‘సాక్షి’కథనం.. సాక్షిప్రతినిధి, కరీంనగర్/సాక్షి జగిత్యాల: చిన్నా, పెద్ద, స్త్రీ, పురుషుల వయోభేదం లేకుండా కన్నుల పండుగలా జరుపుకునే గణేష్ నవరాత్రోత్రి ఉత్సవాల కళ ఆ గ్రామాల్లో తప్పింది. శనివారంపేట, హిమ్మత్రావుపేట, డబ్బుతిమ్మాయిపల్లె, రాంసాగర్లో ఏర్పాటు చేసి న గణేష్ మండపాలు వెలవెలబోతున్నాయి. ఈనె ల 11న కొండగట్టు ఘాట్రోడ్పై నుంచి లోయలో పడిన ప్రమాదంలో 62మంది మరణించిన సం గతి తెలిసింది. ఈ గ్రామాలకు చెందిన 43 మంది కొండగట్టు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు, గర్భిణులు, విద్యార్థులు ఉన్నారు. ఈ పల్లెల్లో ఏ వాడ, ఏ గల్లికి, ఏ ఇంటి తలుపు తట్టినా ఆ విషాదకరమైన సంఘటననే తలచుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. కేవలం మృతుల కుటుంబాల్లోనే కా దు.. గ్రామస్తులందరిలోనూ నిస్తేజం. పదేళ్ల చి న్నారి నుంచి పండు ముసలి వరకు ఎవర్ని తట్టినా గుండెచెరువే.. అందరి కళ్లలోనూ ఇదే విషాదం. నిన్నటివరకు ఆ దారి గుండా అంజన్న చెంతకు వెళ్లాలనుకున్న భక్తులు ఇప్పుడు ఆ మార్గమంటేనే వెనకడుగు వేస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం డీజి ల్ పొదుపు.. లాభాపేక్ష ఆ ఊళ్లను వల్లకాడుగా మార్చింది. మృతులపై ఆధారపడ్డ కుటుంబాలను ఛిద్రం చేసింది. పిల్లలపై తల్లిదండ్రులు.. తల్లిదండ్రులపై ఒకరికొకరు పెట్టుకున్న ఆశలను అడియాశలు చేసింది. గణేష్ విగ్రహాలను కూడా ఏర్పాటు చేసుకోలేక గణేష్ ఉత్సవాలకు దూరంగా ఉంటూ.. వాళ్ల బాధను ఎవరికీ చెప్పుకోలేక, ఏం చేయాలో అర్థం కాక విషాదవదనంతో ఉన్నారు. మండపాలు ఎక్కని గణేష్ విగ్రహాలు.. పండుగకు దూరంగా పల్లెలు హిమ్మత్రావుపేటలో ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ముందుగానే యూత్ సంఘాలు, కుల సంఘాలు గ్రామాలకు చెందినవారు మండపాలను ఏర్పాటు చేసుకున్నారు. నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు డబ్బులు చెల్లించి విగ్రహాలను కూడా తెచ్చుకున్నారు. కానీ ఇంతలోనే కొండగట్టు ప్రమాదం రూపేణా ఆ ఊరికి చెందిన 10 మందిని కబళించింది. మొత్తం మృతుల్లో 60 మంది ఉంటే ఈ ఒక్క గ్రామానికి చెందిన వారే 10 మంది. దీంతో ఆ విగ్రహాలను గ్రామపంచాయతీ కార్యాలయాలు, పెద్ద మనుషుల ఇళ్లలో పెట్టి ఆ తర్వాత మండపాలకు పరిస్థితి లేకపోయింది. ఎందుకంటే ఈ ఊరిలో ప్రాణాలు కోల్పోయిన 10 మంది కూడా నిత్యం గ్రామస్తులతో ఐక్యంగా కలిసిమెలిసి ఉండేవాళ్లే. నిన్నమొన్నటి వరకు తమతో కలిసి తిరిగిన వాళ్లు నిత్యం మాట్లాడిన వాళ్లు లేకపోవడం ఆ బాధను తట్టుకోలేక ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ పండగ జరుపులేక గ్రామాలు కళ తప్పాయి. ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రోత్సవాలు వచ్చాయంటే కన్నుల పండువగా జరుపుకునే ఈ పండుగను ఈసారి జరుపుకోలేని పరిస్థితి. అలాగే శనివారంపేట, డబ్బు తిమ్మాయిపల్లె, రాంసాగర్లలోను ఈసారి గణేష్ నవరాత్రులను నిర్వహించడం లేదు. -
డ్రైవర్పై ఆర్టీసీ కుట్ర..!
సాక్షి, హైదరాబాద్: కొండగట్టు ఘోర రోడ్డు ప్రమాదం విచారణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. విచారణ మొదలుకాక ముందే.. మరణించిన డ్రైవర్ శ్రీనివాస్ను బలిపశువును చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డ్రైవర్ తప్పుచేశాడంటూ స్థానిక ఆర్టీసీ అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపారు. ఈ విషయాన్ని ఓ దినపత్రికకు లీక్ చేయడంపై శ్రీనివాస్ కుటుంబీకులు, ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఆర్టీసీ అధికారులు నిందను డ్రైవర్పై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 62 మందిని బలిగొన్న కొండగట్టు బస్సు ప్రమాదంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు బుధవారం రాత్రి సమావేశమయ్యారు. దుర్ఘటనపై ఆర్టీసీ, పోలీసు, ఆర్టీఏ అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వారెవరన్నది మాత్రం ప్రకటించలేదు. ఈలోగా మరునాడు ఉదయం డ్రైవర్ నిర్లక్ష్యమంటూ ఓ దినపత్రికలో కథనం రావడం కలకలం రేపింది. ఆర్టీసీ తన ప్రాథమిక నివేదికలో డ్రైవర్ అప్రమత్తం గా లేడని, బస్సును న్యూట్రల్లో నడిపాడని, బ్రేకుకు బదులు యాక్సిలేటర్ తొక్కాడని ప్రచారం ఎలా చేస్తారని శ్రీనివాస్ కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు. రెండు నాల్కల ధోరణి నా భర్త చనిపోయిన మరునాడు స్థానిక ఆర్ఎం మా ఇంటికి వచ్చారు. నీ భర్త శ్రీనివాస్ మంచోడు అన్నడు, కుటుంబానికి అండగా ఉంటామన్నరు. కానీ, నా భర్తే ప్రమాదం చేసిండని అధికారులు పేపర్లలో రాయించారు. ఇదేం న్యాయం. 30 ఏళ్లలో ఎన్నడూ చిన్న యాక్సిడెంట్ కూడా చేయలేదు. – బూస నాగమణి, శ్రీనివాస్ భార్య డ్రైవర్ తప్పేం లేదు బస్సు ప్రమాదం జరిగినప్పుడు నేను వెనుక బస్సులో వస్తున్నా. ప్రయాణికులు దిగిపోవాలని డ్రైవర్ అరిచాడు. ఎదురుగా వస్తున్న రెండు వాహనాలను తప్పించాడు. తాను నిజంగా యాక్సిలేటర్ తొక్కితే ఈ రెండు వాహనాలను ఢీకొట్టేవాడే కదా! ఆయన తప్పు చేశాడనడం సమంజసం కాదు. – శేఖర్ (కొడిమ్యాల), ప్రత్యక్ష సాక్షి బలి చేస్తున్నారు దీనిపై ఆర్టీసీ యూనియన్ సంఘాలు కూడా స్పందించాయి. దేశంలోనే అతిపెద్ద ప్రమాదం ఇది. చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటోందోనన్న భయంతో చనిపోయినవాడు బతికిరాడన్న ధీమాతో నేరాన్ని డ్రైవర్పై మోపుతున్నారు. – నాగేశ్వరరావు (ఎన్ఎంయూ), రాజిరెడ్డి (ఈయూ) హనుమంత్ (టీజేఎంయూ) -
పోదుపుపై ఉన్న శ్రద్ధ ప్రయాణికుల భద్రతపై లేదు
-
‘కొండగట్టు బాధితులను తక్షణమే ఆదుకోవాలి’
సాక్షి, కరీంనగర్ : కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రోఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. గురువారం కొండగట్టు బస్సు ప్రమాదంలో గాయపడి కరీంనగర్లో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్సు ప్రమాదానికి ఆర్టీసీ అధికారుల పని ఒత్తిడి, ఓవర్ డ్యూటీనే కారణమని ఆరోపించారు. అంత పెద్ద సంస్థకు ఎండీ లేకపోవటం విచారకరమన్నారు. తక్షణమే ఐఏఎస్ లేదా ఐపీఎస్ను ఎండీగా నియమించాలని డిమాండ్ చేశారు. -
కొండగట్టు ప్రమాదం; బస్సు కండక్టర్ స్పందన
సాక్షి, కరీంనగర్: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాస్తో పాటు 60 మందికి పైగా ప్రాణాలు కొల్పోయారు. మరికొందరు ప్రాణాలతో పోరాడుతున్నారు. అయితే ఈ ప్రమాదం పూర్తిగా ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డ కండక్టర్ పరమేశ్వర్ మాట్లాడుతూ.. బస్సు ఫిట్నెస్ సరిగా లేకపోవడంతో.. ఘాట్ రోడ్లో బ్రేక్ ఫెయిల్ అయి ఉంటుందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను బస్సు చివరలో ఉన్నానని అన్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ గట్టిగా అరిచాడని వెల్లడించారు. బస్సు కండీషన్పై, ప్రయాణికుల రద్దీపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తమపై ఒత్తిడి పెంచినట్టు తెలిపారు. ఘాట్ రోడ్డులో శ్రావణమాసం నుంచే బస్సులు నడుపుతున్నట్టు ఆయన తెలిపారు. బస్సులో మొత్తం 114 మంది ఉన్నారని.. అందులో 96 మందికి టికెట్ ఇచ్చానని పేర్కొన్నారు. నలుగురు చిన్నపిల్లలు కాగా, ఏడు ఎనిమిది మందికి పాసులు ఉన్నాయని.. జెఎన్టీయూ వద్ద బస్సు ఎక్కిన ఆరుగురికి ఇంకా టికెట్లు ఇవ్వలేదని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇంధనం పొదుపులో శ్రీనివాస్ ఉత్తమ డ్రైవర్ అందుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇంధనం పొదుపు కోసం డ్రైవర్ ఘూట్ రోడ్లో న్యూట్రల్లో వచ్చాడనే ఆరోపణలను పరమేశ్వర్ ఖండించలేదు. ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆయన తెలిపారు. -
కొండగట్టు ప్రమాదం వెలికితీసిన బస్సు
-
కొండగట్టు బస్సు ప్రమాదం.. కారణాలు ఇవే!
సాక్షి, జగిత్యాల : కొండగట్టు ఘాట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 62కు చేరింది. ఈ ఘటనలో మరో 38 మంది కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. కారణాలు ఇవే.. కొండగట్టు ఘాట్రోడ్డు లోయలో పడిన ఆర్టీసీ బస్సును అధికారులు గురువారం వెలికితీశారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేసిన అధికారులు.. ప్రమాదానికి గురైన బస్సును పరిశీలించారు. ఆర్టీసీ బస్సు కండిషన్లో లేకపోవడం, బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. 2007 మోడల్కు చెందిన ఆర్టీసీ బస్సు జీవితకాలంలో 12 లక్షల కిలోమీటర్లు తిరగాల్సి ఉండగా.. ప్రమాదానికి గురైన బస్సు మాత్రం 14 లక్షల 95 వేల 116 కిలో మీటర్లు తిరిగిందని గుర్తించారు. 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత బస్సును స్క్రాప్ (తుక్కు) కింద భావించి పక్కకు పడేయాలని, కానీ, స్క్రాప్గా భావించే బస్సును జగిత్యాల- శనివారంపేట రూటులో ఆర్టీసీ అధికారులు నడపడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. రెగ్యులర్ బస్సు, రెగ్యులర్ డ్రైవర్ అయినప్పటికీ కాలం చెల్లిన వాహనం కావడం.. ఘాట్రోడ్డులో సరిగ్గా బ్రేక్ వేయడానికి వీలుపడకపోవడంతో ప్రమాదం జరిగిందని విచారణ అధికారులు భావిస్తున్నారు. విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. బస్సు ఫిట్నెస్ సరిగా లేకపోవడం, బ్రేక్ రాకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులు బస్సులో ఉండడం ఈ మహా విషాదానికి కారణమని వారు ప్రాథమికంగా తేల్చినట్టు తెలుస్తోంది. పార్టీ పరంగానూ సహాయం అందజేస్తాం కరీంనగర్లో చికిత్స పొందుతున్న 36మందిని మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ గురువారం పరామర్శించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వపరంగా రూ. ఐదు లక్షలు, ఆర్టీసీ పరంగా రూ. 3 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని మంత్రి ఈటల తెలిపారు. గాయపడ్డవారికి రెండున్నర లక్షల చొప్పున సహాయం అందిస్తామన్నారు. వారు పూర్తిగా కోలుకునే వరకూ ప్రభుత్వపరంగా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో తొమ్మిది మందికి రైతు బంధు జీవిత భీమా వర్తిస్తుందని, ఇక, పార్టీ సభ్యత్వం ఉన్న వారికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. రైతుబంధు, పార్టీ సభ్యత్వం వర్తించని వారికి టీఆర్ఎస్ పార్టీపరంగా ఆర్థిక సహాయం అందజేస్తామని మంత్రి ఈటల హామీ ఇచ్చారు. -
కొండగట్టు బస్సు ప్రమాదం పెరిగిన మృతుల సంఖ్య
-
కొండగట్టు ప్రమాదంపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
కరీంనగర్ జిల్లా: కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కి కరీంనగర్ లోక్సత్తా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ప్రమాదంలో మృతిచెందిన 60 మందికి రూ.20 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాలం చెల్లిన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీకి నోటీసులు జారీ చేసి తక్షణ చర్యలు చేపట్టాలని హక్కుల కమిషన్ను కోరారు. -
నాన్న దుబాయ్లో.. అమ్మ ఆసుపత్రిలో..
సాక్షి, జగిత్యాల (కరీంనగర్): రెండేళ్ల వయసు. తండ్రి దుబాయిలో ఉంటున్నాడు. కొడుక్కి ఆరోగ్యం బాగోలేదని, ఆస్పత్రిలో చూపించాలని బస్సులో బయల్దేరింది ఆ తల్లి. దురదృష్టం వెంటాడి కొడుకు ప్రాణాలు బలితీసుకుంది. కనిపెంచిన తల్లిదండ్రులు కడచూపునకు కూడా నోచుకోలేదు. చివరికి బంధువులే అంత్యక్రియలు జరిపించారు. ఈ హృదయవిదారక సంఘటన అందరినీ కలచివేసింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శనివారంపేటకు చెందిన గాజుల అశోక్, లత దంపతులు. వీరికి కూతురు శ్రీవాణి, కొడుకు హర్షవర్ధన్ (2) ఉన్నారు. అశోక్ ఏడాది క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. హర్షవర్ధన్ ఆరోగ్యం బాగలేకపోవగడంతో లత చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బస్సు ఎక్కింది. కొండగట్టు ఘాట్ వద్ద జరిగిన ప్రమాదంలో లత కాలు, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. హర్షవర్ధన్ అక్కడికక్కడే చనిపోయాడు. తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. తండ్రి దుబాయ్లో ఉండిపోయాడు. బుధవారం బంధువులే అంత్యక్రియలు జరిపించారు. పది రోజుల క్రితమే రాఖీ కడితే అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని తనకు ఇచ్చాడని హర్షవర్ధన్ అక్క శ్రీవాణి గుర్తు చేసుకుంటూ గుండెలవిసేలా రోదించిన తీరు పలువురిని కన్నీరు పెట్టించింది. -
ఇక సెలవు...
సాక్షిప్రతినిధి, కరీంనగర్/సాక్షి, జగిత్యాల: ఓ ప్రమాదం 60 నిండు ప్రాణాలను బలిగొంది. తల్లీబిడ్డలను వేరు చేసింది. సురక్షితం అనుకున్న ఆర్టీసీ బస్సు వారి ప్రాణాలను అనం త వాయువులో కలిపేసింది. ఎప్పుడు వెళ్లే దారే అయినా.. అదే చివరి ప్రయాణమని ఎవరూ ఊహించలేదు. పనులు చేసుకుని తిరిగొద్దామనుకున్నారు. కానీ కానరాని లోకాలకు వెళ్లిపోయారు. అంజన్న సాక్షిగా జరిగిన పెను ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. ఎన్నో కుటుంబాలను వీధిన పడేసింది. 60 కుటుంబాలను చీకట్లోకి నెట్టేసింది. మృతుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కోదీనగాధ.. ఆ ఏడు గ్రామాలలో మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలే.. ఏఊళ్లో చూసినా కన్నీటి ధారలే.. ఎక్కడ చూసినా వెక్కివెక్కి ఏడ్చేవాళ్లే. శనివారంపేటలో వీధులన్నీ విషాదంలో నిండిపోయాయి. ఒక్కో సంఘటన హృదయ విదారకం... విషాదంలో కుటుంబాలు శనివారం పేటకు చెందిన వరలక్ష్మి బంధువులను కలిసేందుకు కుమారుడితో కలిసి జగిత్యాలకు వెళ్లుతుంది. కొండగట్టు దాటాక కుటుంబ సభ్యులతో మాట్లాడింది. ఈలోపే బస్సు లోయలో పడటంతో అక్కడికక్కడే మరణించింది. కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్యను కోల్పోయి భర్త, తల్లి కోల్పోయి కూతురు విలపిస్తున్నారు. డబ్బు తిమ్మాయిపల్లెకు చెందిన వొడ్నాల కాశీ రాం, లక్ష్మి వృద్ధ దంపతులు జ్వరంతో బాధపడుతున్న కాశీరాం దంపతులు వైద్యం కోసం జగిత్యాలకు వెళ్లుతుండగా ప్రమాదానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయా రు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. డబ్బుతిమ్మయ్యపల్లెలో ఒక వీధి లో నలుగురు మృతితో విషాదం అలముకుంది. తిర్మలాపూర్కు చెందిన తైదల పుష్ప, దుర్గమ్మ కూతురు అర్చన, భవానీలు, పుష్ప బీడీలు చుడుతూ పిల్లల్ని చదివించుకుంటుంది. ఆరోగ్యం బాగోలేని చిన్న కుమార్తె అర్చనను వెంట పెట్టుకోని జగిత్యాలకు బయలుదేరింది. ప్రమాదంలో తల్లి మృత్యువాత పడగా అర్చన తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తిర్మలాపూర్కు చెందిన పడిగెల స్నేహలత డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. అన్ని ఉద్యోగాలకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా భావించి కంప్యూటర్ శిక్షణ కోసం కరీంనగర్ వస్తుండగా బస్సు ప్రమాదం కబళించింది. మృతురాలు తండ్రి ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ ఇద్దరు కుమార్తెలు, కుమారున్ని చదివిస్తున్నాడు. పెళ్లీడుకు వచ్చిన కూతురు మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొడిమ్యాల మండలం రాంసాగర్కు చెందిన గడ్డం రామస్వామిది వ్యవసాయ కుటుంబం. ఆయన 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం భార్య అనితతో కలిసి ఆసుపత్రికి వెళ్తూ ప్రమాదంలో కన్ను మూశాడు. అనిత కాళ్లు, చేతులు విరిగి చికిత్స పొందుతుంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాంసాగర్కు చెందిన మేడి చెలిమెల సత్తయ్య భార్య గౌరు బీడీలు చుడుతూ ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారున్ని పోషిస్తుంది. మల్యాలలోని సోదరున్ని చూసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తల్లి మృతితో ఆ ఇద్దరు కుమార్తెలు, కుమారుడు గుండెలవిసేలా రోదించారు. కొడిమ్యాల మండలం కోనాపూర్కు చెందిన లత జ్వరంతో బాధపడుతున్న కుమార్తె నందనకు చికిత్స కోసం జగిత్యాలకు బయలుదేరింది. బస్సు ప్రమాదంలో తల్లి తీవ్రంగా గాయపడగా, కూతురు నందన అక్కడికక్కడే మృతి చెందింది. జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి పక్కనే స్ట్రెచర్పై విగతజీవిగా ఉన్న కుమార్తె మృతదేహన్ని పోల్చుకోలేక నా బిడ్డ ఎక్కడుంది అంటూ ఆరా తీయడం అందరినీ కలచివేసింది. విషాదం నింపిన ప్రమాదం.. కొండగట్టు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నిలిపింది. శనివారంపేట, హిమ్మత్రావుపేట, డబ్బుతిమ్మాయిపల్లి, రాంసాగర్, తిర్మలాపూర్, సంద్రాలపల్లి, రాంపల్లి, కోనాపూర్ ఏడు గ్రామాలు మరుభూములుగా మారాయి. ముక్కు పచ్చలారని చిన్నారులు, చదువుకునే విద్యార్థులు, గర్భిణులు, వృద్ధుద్దులు, వివిధ పనుల కోసం జగిత్యాలకు వెళ్లుతున్న యువతీ యువకులు మహిళలు ఇలా ఎందరో ప్రాణాలు విడిచారు. కొడుకును కోల్పోయిన తండ్రి, కూతురిని కోల్పోయిన తల్లి, భర్తను కోల్పోయిన భార్య, భార్యను కోల్పోయిన భర్త, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎటు చూసినా విషాదమే.. ఎవరిని కదిపినా కన్నీళ్లే నిన్నటి వరకు సంతోషంగా ఉన్న ఆ పల్లెలు ఇప్పుడు తమ వారిని తలుచుకుంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నాయి. మృతుల్లో 40 మంది నాలుగు ఊళ్లకు చెందిన వారే. ఒక్క శనివారంపేటలోనే 15 మంది అసువులు బాశారు. ఆ గ్రామంలో ఇప్పుడు ఎక్కడ చూసినారోదనలే. హిమ్మత్రావుపేట, డబ్బుతిమ్మాయిపల్లి, రాంసాగర్లోను అదే పరిస్థితి. ఏ ఊళ్లో చూసినా కన్నీటి ప్రవాహమో.. ఏ పల్లెను కదిలించినా ఎవరితో మాట్లాడినా వెక్కివెక్కి ఏడ్చేవారే. -
కన్నీటిపేట
-
రూ. 800.. 60 ప్రాణాలు!
సాక్షి, హైదరాబాద్/జగిత్యాల జోన్: ప్రకృతి ప్రకోపించలేదు.. బాంబులు పేలలేదు.. తూటాలు విరు చుకుపడలేదు.. కేవలం అధికారుల నిర్లక్ష్యమే 60 నిండు ప్రాణాలను బలిగొంది. రూ.800లకు ఆర్టీసీ అధికారులు కక్కుర్తి పడటం వల్లే ఇంతటి ఘోర ప్రమాదం జరిగింది. ఉద్యోగులపై అధికారుల వేధింపులే కొండగట్టు బస్సు ప్రమాదానికి కారణంగా నిలిచాయి. మృతుల సంఖ్య పెరిగేందుకు స్థానిక అధికారుల తీరు కారణమైంది. వారి వేధింపులు, టార్గెట్ల కారణంగా ఎంతో సీనియారిటీ ఉన్న ఉద్యోగులు కూడా రక్షణ చర్యలు పక్కనబెట్టి, ఓవర్లోడ్ ఎక్కించుకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వం ఆర్టీసీ డిపో మేనేజర్ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది. మెమోలు, వేధింపులు :గ్రామీణ ప్రాంతాల్లో నడిచే పల్లె వెలుగు బస్సుల్లో పెద్దగా ఆక్యుపెన్సీ రేషియో ఉండటం లేదని మొదటి నుంచి ఆర్టీసీ మొత్తుకుంటోంది. దీన్ని అధిగమించేందుకు ఆయా డ్రైవర్లు, కండక్టర్లకు ఎక్కువ మందిని ఎక్కించుకోవాలని టార్గెట్లు పెడుతున్నారు. బస్సు నిండా మంది ఉన్నారని స్టాపులో బస్సు ఆపలేదని తెలిస్తే తెల్లారి ఆ కండక్టర్, డ్రైవర్లకు చుక్కలు చూపిస్తారు. దీంతో అధికారులు చెప్పినట్లు వారు చేయాల్సి వస్తోంది. అదనపు ఆదాయం రూ. 828! కొండగట్టు నుంచి ఘాట్ రోడ్డు ద్వారా జగిత్యాల ప్రధాన రహదారి 3 కి.మీ. దూరం. ఇందుకు బస్సు ఎక్కితే కేవలం రూ.6 చార్జీ. అదే జీపు ఎక్కితే రూ.20కిపైగా వసూలు చేస్తారు. కండక్టర్ కూడా బస్సు సామర్థ్యం కన్నా అదనంగా 10 మందిని ఎక్కించుకున్నా పెద్దగా ప్రమాదం ఉండేది కాదు. దీనికి అదనంగా మరో 36 మందిని ఎక్కించుకోవడం వల్ల బస్సుపై ఓవర్లోడ్ పడింది. ఇంతచేస్తే ఈ 36 మంది ద్వారా టికెట్కు రూ.23 చొప్పున ఆర్టీసీకి వచ్చే అదనపు ఆదాయం కేవలం రూ.828. మహిళల మరణానికి కారణం ఇదే..! ప్రమాదానికి గురైన బస్సు వాస్తవ సామర్థ్యం 55 సీట్లు. ఈ బస్సు కొండగట్టుకు వచ్చే సరికి అప్పటికే బస్సు నిండా జనం ఉన్నారు. మంగళవారం కావడంతో అక్కడ భారీగా ఉన్న భక్తులంతా బస్సు ఎక్కా రు. మహిళా సీట్లు కాస్త విశాలంగా ఉండటంతో ఐదుగురికిపైగా సీట్లల్లో సర్దుకున్నారు. ఘటనాస్థలి వద్ద ఉన్న స్పీడు బ్రేకర్ల వద్దే బస్సు అదుపు తప్పింది. కుడివైపు ఉన్న ప్రయాణికులుఅంతా డ్రైవరుపై పడిపోవడంతో అతను బస్సును అదుపు చేయలేకపోయాడని స్థానికులు తెలిపారు. దీంతో నేరుగా వెళ్లి పక్కనే ఉన్న కందకంలో పడిపోయింది. బస్సు కుడివైపు భాగం నేలను బలంగా ఢీకొంది. ఈ తీవ్రతకు సీట్ల న్నీ విరిగిపోయాయి. ఆ ధాటికి శరీరాలు నలిగిపోయాయి. ‘ఘాట్’మీదుగా 44 ట్రిప్పులు.. కొండగట్టు ఘాట్ రోడ్డు మీదుగా ఆర్టీసీ వేములవాడ డిపోకు చెందిన 11 బస్సులు రోజూ 44 ట్రిప్పులు కొన్నేళ్లుగా నడుస్తున్నాయి. జగిత్యాల డిపో బస్సును కొడిమ్యాల మండలంలోని రాంసాగర్, హిమ్మత్రావుపేట, శనివారంపేట, డబ్బు తిమ్మయ్యపల్లె గ్రామాల కోసం కొంత కాలంగా దొంగలమర్రి మీదుగా నడిపిస్తున్నారు. తిరిగి అదే మార్గంలో వెళ్తుండటంతో ఆర్టీసీకి అనుకున్నంత ఆదాయం రావట్లేదు. దీంతో కొండగట్టు పుణ్యక్షేత్రం మీదుగా వెళ్తే భక్తుల రాకపోకలతో ఆదాయం పెరుగుతుందని జూలై 12 నుంచి దొంగలమర్రి నుంచి రావడం, కొండగట్టు నుంచి కిందకు దిగేలా రూటు మార్చారు. దీంతో కి.మీ.కు ఆదాయం రూ.12 నుంచి రూ.15కు పెరిగింది. దీంతో కొండగట్టు ఘాట్రోడ్డు మీద నుంచే బస్సు నడిపిస్తున్నారు. ‘సన్షైన్’లో నలుగురికి చికిత్స హైదరాబాద్: కొండగట్టు ప్రమాద ఘటనలో గాయపడిన నలుగురు బాధితులు సికింద్రాబాద్ సన్షైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నలుగురిని వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాలకు చెందిన రాజవ్వ (52), సత్తవ్వ (39), శనివారంపేట్కు చెందిన రాజయ్య (50), తిమ్మాయిపల్లికి చెందిన విజయ (45)లను బుధవారం రాత్రి జగిత్యాల నుంచి సన్షైన్ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉందని మరో 48 గంటలు గడిస్తే కానీ ఏది చెప్పలేమని డాక్టర్లు వెల్లడించారు. వీరి చికిత్సకు అయ్యే ఖర్చును ఆర్టీసీ భరిస్తుందని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వినోద్ కుమార్ ఆస్పత్రికి లేఖ రాసి ఇచ్చారు. దీంతో వీరికి ఆస్పత్రి వైద్యులు చికిత్స మొదలుపెట్టారు. -
పల్లె గుండె పగిలింది
ఈ చేతితోనే బువ్వ పెట్టాను.. ఈ చేతితోనే నడక నేర్పాను.. ఈ చేతితోనే పాడె మోయాలా.. ఈ చేతితోనే కొరివి పెట్టాలా.. ఒకే రోజు 50 అంత్యక్రియలు..ప్రమాదంలో కొడిమ్యాల మండల పరిధిలో మొత్తం 51 మంది చనిపోగా.. 50 మంది అంత్యక్రియలను ఆయా కుటుంబీకులు పూర్తి చేశారు. శనివారంపేటలో 13 మంది, డబ్బు తిమ్మయ్యపల్లిలో 10 మంది, రాంసాగర్లో 10, హిమ్మత్రావుపేటలో 9, తిర్మలాపూర్లో 5, కోనాపూర్లో 2, సండ్రలపల్లిలో ఒకరి చొప్పున 50మంది అంత్యక్రియలు జరిగాయి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, జగిత్యాల: పల్లె గుండె పగిలింది. నిన్నటి వరకు జనంతో కిక్కిరిసిన పల్లె.. ఇప్పుడు వల్ల్లకాడును తలపిస్తోంది. శుభకార్యాలకు డప్పు కొట్టిన వాళ్లే చావు డప్పులు కొట్టారు. ఎవరిని తట్టినా.. గుండె పిండేసే బాధే.. ఏ మోము చూసినా కళ్లలో నీటి సుడులే.. ఎటు చూసినా అంతిమయాత్రలే.. అరగంటకో పాడె వెళ్తున్న దృశ్యాలే.. బరువెక్కిన గుండెలతో అగ్గి మోసుకెళ్తున్న తండ్రులు, కుమారులు.. తల్లిదండ్రులకు కొరివి పెట్టిన తనయులు.. చితి ఆరకముందే మరో చితికి సిద్ధం అవుతున్న బంధువులు.. కన్నపేగు కడచూపునకు నోచుకోని తల్లిదండ్రులు.. బిడ్డ చనిపోయిన సంగతి తెలియక అపస్మారక స్థితిలో తల్లి.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ బిడ్డ అంత్యక్రియలకు అంబులెన్సులో వచ్చిన తల్లులు.. ఇళ్ల ముందు శవాలు పెట్టుకుని అయినవారి కోసం ఎదురుచూసిన అభాగ్యులు.. ఎవరిని కదిలించినా వర్ణించలేని బాధే.. ఇదీ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని డబ్బుతిమ్మయ్యపల్లి, శనివారంపేట, హిమ్మత్రావుపేట, రాంసాగర్, కోనాపూర్, తిర్మలాపూర్, సండ్రాలపల్లి గ్రామాల పరిస్థితి. మంగళవారం శనివారంపేట నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు మల్యాల మండలం కొండగట్టు వద్ద ఘాట్ రోడ్డుపై నుంచి లోయలోకి దూసుకెళ్లడంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 60మంది మృతి చెందారు. మృతుల్లో 51 మంది కొడిమ్యాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారే కావడంతో ఆయా పల్లెల్లో అంతులేని విషాదం నెలకొంది. బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన అంత్యక్రియలతో పల్లెలన్నీ మరుభూములను తలపించాయి. నాలుగైదు ఇళ్లకో మృతదేహం.. కొడిమ్యాల మండలంలోని శనివారంపేట గ్రామం నుంచి ఏకంగా 13 మంది దుర్మరణం చెందడంతో ఆ పల్లెలో పెను విషాదాన్నే నింపింది. ప్రతి నాలుగైదు ఇళ్లకో మృతదేహంతో.. ఆ గ్రామం ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తోంది. ఒక శవయాత్ర తర్వాత మరొకటి.. కాటికి వెళ్లింది. రోజూ ఉదయమే వెళ్లొస్తానని చెప్పిన తన పెనిమిటి తిరిగిరాని లోకానికి వెళ్లాడని తెలిసి దాన్ని జీర్ణించుకోలేని భార్య. అమ్మా.. నాన్న ఇక రాడా..? అని పదే పదే అమాయకంగా అడిగే పిల్లలు. వృద్ధాప్యంలో తమకు ఆసరాగా ఉంటాడనుకుంటే మధ్యలోనే వదిలివెళ్లిన తమ కొడుకు ఇక లేడనే తల్లిదండ్రుల రోదన చూపరులను కన్నీళ్లు పెట్టించింది. గ్రామంలో 13 మందికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించగా.. చివరి చూపులకు వచ్చిన మృతుల బంధుమిత్రులతో శనివారంపేట కిక్కిరిసింది. వచ్చినంత మందిని ఎక్కించుకున్నం: పరమేశ్వర్, కండక్టర్ బస్సులో 105 మంది ప్రయాణికులు ఉన్న మాట వాస్తవం. కొండగట్టు గుట్ట వరకు టికెట్లిచ్చిన. తర్వాత మరి కొందరు బస్సెక్కారు. వాళ్లకు టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుండగానే ప్రమాదం జరిగింది. వచ్చినంత మందిని ఎక్కించుకున్నం. ఇంకో బస్సు లేదు. కిందికి దిగే సమయంలో మైలేజీ కోసం న్యూట్రల్ చేసిండని చెప్పిన్రు. అంత్యక్రియలకు ట్రాక్టర్లపైనే.. కొడిమ్యాల (చొప్పదండి): కుటుంబ సభ్యుల మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న వారే అంత్యక్రియల ఏర్పాట్లను చేసుకోవాల్సిన పరిస్థితి. కుటుంబసభ్యులు, బంధువులే పాడెను కట్టారు. శ్మశానంలో కట్టెలు పేర్చారు. సంప్రదాయ కార్యక్రమాలను కూడా సొంత మనుషులే నిర్వహించారు. చివరకు అంత్యక్రియల నిర్వహణ ఇబ్బందిగా మారడంతో చాలా వరకు మృతదేహాలను ట్రాక్టర్లలోనే శ్మశానానికి తరలించారు. అమ్మను దక్కించుకోలేకపోయాం నేను తిర్మలాపూర్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నాకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో అమ్మ పుష్పలతతో కలసి జగిత్యాల హాస్పిటల్కు బయల్దేరాం. బస్సునిండా ప్రయాణికులు ఉన్నారు. కొండగట్టు ఘాట్రోడ్డు మూలమలుపు వచ్చేసరికి బస్సు డ్రైవర్ పట్టు కోల్పోయాడు. కిందికిదూకి ప్రాణాలు కాపాడుకోవాలని ఆయన అరిచాడు. ఇంతలోనే బస్సు గోతిలో పడింది. సీట్లో కూర్చున్న అమ్మపై చాలామంది పడ్డారు. నేను నిలబడి ఉండటంతో ప్రాణాలు దక్కాయి. నాచేయి విరిగింది. మా అమ్మను అంబులెన్స్లో జగిత్యాలకు, అక్కడి నుంచి కరీంనగర్కు తరలించినా ప్రాణాలు దక్కలేదు – తైదల అర్చన కన్ను తెరవకముందే కన్నుమూశారు! కొడిమ్యాల (చొప్పదండి): బస్సు ప్రమాదంలో ముగ్గురు గర్భస్థ శిశువులు కళ్లు తెరవకముందే కన్నుమూశారు. ఈ లోకంలోకి అడుగుపెట్టక ముందే పరలోకాలకు వెళ్లిపోయారు. కొడిమ్యాల మండలంలోని శనివారంపేట గ్రామానికి చెందిన ఎండ్రిక్కాయల సుమలత (26)కు ఇద్దరు కుమారులు. ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. ప్రసవం కోసం అత్తతో కలిసి జగిత్యాల ఆసుపత్రికి బస్సులో వెళ్తూ ప్రమాదంలో కన్నుమూసింది. అదే గ్రామానికి చెందిన నామాల మౌనిక (21)కు ఏడు నెలల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. ఈమె కూడా బస్సులో ఆసుపత్రికి వెళ్తూ మృతి చెందింది. డబ్బుతిమ్మయ్యపల్లి గ్రామానికి చెందిన గోల్కొండ సుమలత (21)కు 8 నెలల క్రితం పెళ్లయ్యింది. ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. వైద్య పరీక్షల కోసం జగిత్యాలకు వెళ్తూ ప్రమాదంలో అసువులు బాసింది. దీంతో బాధిత కుటుంబాల్లో అంతులేని విషాదం మిగిలింది. మంచుగడ్డలపైనే శవాలు.. కొడిమ్యాల(చొప్పదండి): కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంలో కొడిమ్యాల మండలంలోని 5 గ్రామాలకు చెందిన 51 మంది మృతి చెందడంతో మృతుల కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు, ఇతర జిల్లాల నుంచి కూడా ఫ్రీజర్లను తెప్పించారు. అయినా అందరికీ సరిపోలేదు. పోస్టుమార్టం అనంతరం మంగళ వారం రాత్రి ఇళ్లకు తరలించిన మృతదేహాలను బంధువులు మంచుగడ్డలపై ఉంచి, పైనుంచి ఊక పోశారు.సరైన జాగ్రత్తలను తీసుకోక ప్రమాదానికి కారణమైన అధికారులు.. కనీసం ఫ్రీజర్లను కూడా అందుబాటులో ఉంచకపోవడంపై మృతుల కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరి చూపు కూడా దక్కలేదు.. కొడిమ్యాల (చొప్పదండి): ఘాట్రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తమ వారిని చివరి చూపు కూడా చూసుకోలేకపోయారు ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లిన కుటుంబ సభ్యులు. రాంసాగర్ గ్రామానికి చెందిన గాజుల హర్షవర్ధన్ తండ్రి అశోక్ సౌదీకి, శేర్ల హేమ భర్త అశోక్ ఇరాక్కు, కొండ సాయివరుణ్ తండ్రి శేఖర్ దుబాయ్కి ఉపాధి కోసం వలస వెళ్లారు. అయిన వారు మృతి వార్త తెలిసినా కూడా తాము పనిచేస్తున్న కంపెనీల నుంచి అనుమతులు రాకపోవడంతో చివరి చూపులకూ నోచుకోలేదు. డ్రైవర్కు ఇదే మొదటి.. చివరి యాక్సిడెంట్! జగిత్యాలజోన్: కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాద సమయంలో ఆ బస్సు నడుపుతున్న డ్రైవర్ శ్రీనివాస్కు డ్రైవింగ్లో 23 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన డ్రైవింగ్ వృత్తిలో ఇదే మొదటి.. చివరి యాక్సిడెంట్ కావడం గమనార్హం. బస్సు ప్రమాదంలో తానూ బలయ్యాడు. శ్రీనివాస్ స్వస్థలం కరీంనగర్ జిల్లా అశోక్నగర్. ఆయనకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కూతురుకు ఇటీవలే వివాహమైంది. ఆర్టీసీలో 1998 మే 13న కాంట్రాక్ట్ డ్రైవర్గా చేరారు. 2002లో పర్మినెంట్ అయ్యారు. జగిత్యాల డిపోలో 2014 నుంచి డ్రైవర్గా పనిచేస్తున్నారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఏడాదికోసారి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఫిట్ అని తేలడంతోనే ఆ రూట్ బస్సును అప్పగించినట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీనివాస్కు ఇంకా ఐదేళ్ల సర్వీస్ ఉంది. హెచ్చార్సీలో ఫిర్యాదు.. సాక్షి, హైదరాబాద్: కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మంది మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)కి ఫిర్యాదు అందింది. హైకోర్టు న్యాయవాది అరుణ్కుమార్.. హెచ్చార్సీ కమిషనర్కు బుధవారం పిటిషన్ అందజేశారు. బస్సు ప్రమాదానికి కారణమైన డిపో మేనేజర్, సూపర్ వైజర్, ఆర్టీవోలపై కేసులు నమోదు చేయాలని కోరారు. 60కి చేరిన మృతులు.. బస్సు ప్రమాద ఘటనలో బుధవారం మరో ముగ్గురు కన్నుమూశారు. దీంతో ప్రమాద మృతుల సంఖ్య 60కి చేరింది. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్కు చెందిన చిదురాల రజిత (38) ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కరీంనగర్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమె భర్త సదయ్య తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మయ్యపల్లెకి చెందిన గోల్కొండ సుమలత (21) ఏడు నెలల గర్భిణి కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. వైద్య పరీక్షల నిమిత్తం పుట్టింటికి వచ్చిన రజిత తన తల్లి విజయతో కలిసి వెళ్తూ.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందింది. కొండగట్టుకు చెందిన పసులోటి లక్ష్మి (60) జగిత్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసింది. మరో 45 మంది క్షతగాత్రులు కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్ అసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకునేందుకు ఢిల్లీకి చెందిన సేవ్ లైఫ్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన అభిజిత్, సౌరవ్లను కొండగట్టుకు పంపింది. తల్లిదండ్రులు ఒడ్నాల లస్మవ్వ, కాశీరాంలకు ఒకేసారి అంత్యక్రియలు నిర్వహిస్తున్న కుమారుడు ఒడ్నాల అంజయ్య కంట్రోల్ చేయలేకపోయాడు అమిత్ రవిదాస్, జార్ఖండ్ మాది జార్ఖండ్లోని అంజోర ఫిరోజ్పూర్ గ్రామం. బట్టలు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతాను. కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూ కళాశాల వద్ద బస్సు ఎక్కాను. బస్సులో ప్రయాణికులు చాలామంది ఉన్నారు. కొండ దిగే సమయంలో బస్సును డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో ఆకస్మాత్తుగా అదుపు తప్పి భారీ గుంతలోకి పడింది. కదిలిస్తే కన్నీళ్లే ‘నా చేతులతోనే నీళ్లు పోసిన.. నా చేతులతోనే అన్నం తినిపించిన.. జ్వరం వచ్చిందని ఆస్పత్రిలో చూపించేం దుకు బస్సు ఎక్కిన.. 15 నిమిషాలకే ఏమైందో తెలియదు.. నా కొడుకు కనబడలే.. నా కొడుకు లేని బతుకెందుకు? నా కళ్లతోనే బిడ్డ దహన సంస్కారాలు చూసిన. ఆ దేవుడు నన్ను తీసుకుపోయినా బాగుండు’ అంటూ ఓ తల్లి బోరున విలపించింది. కొండగట్టు బస్సు ప్రమాదంలో ఎందరో తమ కొడుకులు, కూతుళ్లు, తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను కోల్పోయారు. మరి కొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నారు. జగిత్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం ‘సాక్షి’ కదిలించింది. ఎవరిని కదిపినా.. కన్నీళ్లే..! –జగిత్యాల టౌన్ చిన్నారుల అంత్యక్రియలకు అంబులెన్స్లో వచ్చిన తల్లులు బాబును ఒక్కసారి చూడనివ్వరూ.. శనివారంపేట గ్రామానికి చెందిన గాజుల లత (27) తన కొడుకు హర్షవర్ధన్ (3)కు జ్వరం రావడంతో జగిత్యాల ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బస్సు ఎక్కింది. ప్రమాదంలో లత, హర్షవర్ధన్లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం అవుతుం డటంతో వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి హర్షవర్ధన్ మృతి చెందాడు. బుధవారం స్పృహలోకి వచ్చిన లత ‘నా బిడ్డ ఎక్కడ’ అని కన్నీళ్లు పెడుతూ అందరినీ వేడుకుంది. కొడుకు మృతి గురించి తెలుసుకుని గుండెలు బాదుకుంటూ రోదించింది. ‘కడసారి చూపునైనా చూడనివ్వండి’ అంటూ బంధువుల కాళ్లావేళ్లా పడింది. తల, కాళ్లకు, నడుముకు బలమైన గాయాలైన ఆ తల్లి అంబులెన్స్లో స్వగ్రామానికి చేరుకుని కొడుకును కడసారి చూసుకుంది. బిడ్డా..ఒక్కసారి కనపడవా! కొడిమ్యాల(చొప్పదండి): ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నరకయాతన ఓవైపు.. తొమ్మిది నెలలు మోసి, కనిపెంచిన పిల్లలు చనిపోయిన హృదయవేదన మరోవైపు.. ఆ మాతృమూర్తుల మనసులను రంపపుకోత కోశాయి. అంబులెన్సుల్లోనే అంత్యక్రియలకు హాజరై కన్నపేగుకు కడసారి వీడ్కోలు పలికారు. కొడిమ్యాల మండలం రాంసాగర్కు చెందిన బైరి కీర్తన తన కూతురు రితన్య (4)కు ఆరోగ్యం బాగా లేక పోవడంతో మంగళవారం జగిత్యాలకు బయల్దేరింది. కొండగట్టు ఘాట్రోడ్డుపై జరిగిన ప్రమాదంలో రితన్య చనిపోగా.. కీర్తన కాలు విరిగింది, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. కూతురు మరణించిందన్న వార్త విన్న ఆ తల్లి హృదయం తల్లడిల్లింది. అంబులెన్సులోనే కూతురు అంత్యక్రియలకు హాజరైంది. కొడుకు మృతి.. ఆస్పత్రిలో అమ్మ.. హిమ్మత్రావుపేట గ్రామానికి చెందిన శైలజ తన కొడుకు అరుణ్సాయికి అనారోగ్యంగా ఉండటంతో తన తల్లి భాగ్యవ్వతో కలిసి జగిత్యాలలోని ఆస్పత్రికి బయలుదేరింది. ప్రమాదంలో తల్లి భాగ్యవ్వతోపాటు కొడుకు అరుణ్ సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఛాతీ ఎముకలు విరిగి తీవ్రగాయాలైన శైలజ జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సంఘం డబ్బులు చెల్లించేందుకు వెళ్తే.. కొంపల్లి విజయ, తిమ్మయ్యపల్లి, కొడిమ్యాల స్వశక్తి సంఘం డబ్బులను నాచుపల్లి బ్యాంక్లో జమ చేసేందుకు వెళ్లాను. కొండగట్టు దిగి నాచుపల్లి వెళ్లాల్సి ఉంది. గుట్ట దిగే సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రమాదం జరిగింది. తల, కాళ్లకు తీవ్రగాయాలతోపాటు చెయ్యి విరిగింది. ఆస్పత్రికి వచ్చాకే స్పృహలోకి వచ్చాను. దేవుడి దయతో నా తల్లి, కొడుకు క్షేమం సీహెచ్.లక్ష్మీనారాయణ,బాధితుల కుటుంబ సభ్యులు, తిమ్మయ్యపల్లి మా అమ్మ విజయతోపాటు వాళ్ల ఊరికి వెళ్తానని నా కొడుకు సూరజ్ మారాం చేయడంతో తిమ్మయ్యపల్లిలో వారిని బస్సు ఎక్కించాను. 10 నిమిషాలకే బస్సు ప్రమాదానికి గురైందని సమాచారం అందింది. పెద్ద ప్రమాదమని తెలిసి నా ఆశలు ఆవిరయ్యాయి. తల్లిని, కొడుకును చూశాకే నా మనసు కుదుటపడింది. అమ్మకు ఛాతీలో ఎముకలు విరిగాయి. కొడుకుకు కాలు విరిగింది. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దేవుడి దయతో ఇద్దరూ బ్రతికే ఉన్నారు. -
కొండంత విషాదం: వెంటీలెటర్పై మరో నలుగురు
సాక్షి, జగిత్యాల/హైదరాబాద్ : అంజన్న భక్తులకు కొండంత విషాదాన్ని మిగిల్చిన కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 60కి చేరింది. మరోవైపు హైదరాబాద్లోని సన్షైన్ ఆస్పత్రిలో తీవ్రంగా గాయపడిన పలువురు చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురు వెంటిలేటర్పై ఉన్నారు. మరో 24 గంటలు గడిస్తే కానీ.. వారి ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని సన్షైన్ ఆస్పత్రి వైద్యులు చెప్పడంతో వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హెచ్చార్సీలో ఫిర్యాదు కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్లో హైకోర్టు న్యాయవాది అరుణ్కుమార్ ఫిర్యాదు చేశారు. ప్రమాదానికి బాద్యులైన అధికారులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని ఆయన హెచ్చార్సీని కోరారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్గ్రెషియా ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలంటూ కమిషన్ను అభ్యర్థించారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమే కారణం ఆర్టీసి అధికారుల నిర్లక్ష్య కారణంగానే కొండగట్టు బస్సు ప్రమాదం జరిగిందని, ఇలాంటి రోజు మళ్లీ రాకూడదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. అధికారులు చేసిన తప్పిదాల వల్ల పేదల కుటుంబాలు బలి అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం నుంచి బయటపడిన ఇద్దరు చిన్నారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. బుధవారం కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఒకరు, హైదరాబాద్లో మరొకరు మృతి చెందడంతో మరణించిన వారి సంఖ్య 60కి చేరింది. తీవ్ర గాయాలపాలైన మరో 41మంది కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ ఘాట్ రోడ్డు వద్ద మంగళవారం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 101 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో అదుపు తప్పి బస్సు లోయలో పడింది. -
కొండంత విషాదం.. పాపం పసివాడు
మొన్ననే రాఖీ కట్టిన తమ్ముడు ప్రమాదంలో విగతజీవుడయ్యాడు. తమ్ముడితో వెళ్లిన అమ్మ చావుబతుకుల మధ్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. బతుకుదెరువు కోసం నాన్నేమో దుబాయ్కు పోయిండు.. ఏం చేయాలో తెలియని ఆ అక్కాచెల్లెళ్లు.. ‘లేరా తమ్ముడూ ఆడుకుందాం’ అంటూ ఏడుస్తున్న ఘటన హృదయాల్ని పిండేస్తోంది.. సాక్షి, కొండగట్టు: గుండెల్ని పిండేసే ఘోర రోడ్డు ప్రమాదంతో ఆ ఊరు కన్నీటి ప్రవాహంగా మారింది. ఎవరిని కదిలించినా కన్నీళ్లు తప్ప.. మాటలు రావడం లేదు. వెక్కివెక్కి ఏడ్చేవాళ్లు కొందరు.. తమ వాళ్లను కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగుకుని వారిని ఓదార్చేవాళ్లు ఇంకొందరు.. ప్రమాద బాధిత శనివారంపేటలో ఎవరిని కదిలించినా ఇదే దృశ్యాలు. కొండగట్టు రోడ్డు ప్రమాదంలో ఈ ఊరి నుంచే ఏకంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారి హర్ష అంత్యక్రియలు తల్లితండ్రులు లేకుండానే పూర్తయ్యాయి. గ్రామానికి చెందిన గాజుల లత, అశోక్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. ఒక కుమారుడు హర్ష(2). అశోక్ బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లగా.. లత గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తోంది. అనారోగ్యంతో ఉన్న కుమారుడికి చికిత్స చేయించేందుకు ఆమె జగిత్యాలకు బస్సులో బయల్దేరింది. అంతలోనే ఊహించని ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నిపింది. ప్రమాదంలో హర్ష మరణించగా.. అతడి తల్లి తీవ్రంగా గాయపడింది. అప్పటి వరకు తమతో ఆడుకున్న హర్ష ఒక్కసారిగా విగతజీవిగా మారడంతో అతడి అక్కలు తట్టుకోలేకపోయారు. తమ్ముడు కావాలి అంటూ ఏడుస్తున్న ఆ చిన్నారులను ఆపడం ఎవరితరం కావడం లేదు. గల్ఫ్లో ఉన్న తండ్రికి కుమారుడి మరణ వార్త ఎలా తెలియజేయాలో తెలియక మధన పడ్డ కుటుంబ సభ్యులు చివరకు ఆ బాలుడి అంత్యక్రియలు పూర్తి చేశారు. గల్ఫ్లో ఉన్న ఆ తండ్రి, ఆసుపత్రిలో ఉన్న ఆ తల్లి తన ముద్దుల కొడుకును కడసారి చూసుకోలేకపోయారు. ఆ తల్లి కోలుకొని తన కొడుకు ఎక్కడా అని అడిగితే ఏమని చెప్పాలని బంధువులు బోరుమంటున్నారు. రాఖీ పౌర్ణమీ సందర్భంగా తన అక్కలు రాఖీ కడితే హర్ష కాళ్లు మొక్కి డబ్బులు కూడా ఇచ్చాడని ఆ ఫొటోలు ఇవే అంటూ చూపిస్తూ వారు కంటతడి పెట్టారు. -
డ్యూటీ సమయం ఎక్కుమైనా విశ్రాంతి ఉండదు
-
కడసారి చూపుకోసం.. మంచుగడ్డలపై
-
మనకేదీ రక్షణ
రెండేళ్ల క్రితం ఘాట్ రోడ్డు మీదుగా అనంతగిరి నుంచి కేరెళ్లికి వెళ్తున్న బస్సు బ్రేక్లు ఫెయిల్ అయ్యాయి. బస్సు అదుపు తప్పి ఒక్కసారిగా కుడివైపున ఉన్న ఘాట్లోకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తు ఓ చెట్టును ఢీ కొట్డడంతో వేగం తగ్గి అక్కడే ఆగిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు బతుకుజీవుడా అంటూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనంతగిరి (రంగారెడ్డి): జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జిల్లా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. నిత్యం తాము రాకపోకలు సాగించే రూట్లో ఉన్న ఘాట్ రోడ్లను తలుచుకుని అభద్రతా భావానికి గురయ్యారు. వికారాబాద్ పట్టణానికి సమీపంలో అనంతగిరి వద్ద ఎత్తైన ఘాట్ రోడ్లు ఉన్నాయి. వీటి కింది లోయలు సుమారు 1,500 అడుగుల లోతులో ఉంటాయని అంచనా. ఇక్కడ ప్రమాదం జరిగితే తమ పరిస్థితి ఏమిటని ప్రజలు చర్చించుకున్నారు. ఈ మధ్య కాలంలో అనంతగిరికి శని, ఆదివారాల్లో వేల సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఈ దారిలో ఎత్తైన ఘాట్ రోడ్లు ఉన్నాయి. వీటికి రెండు మూడు చోట్ల మాత్రమే సైడ్వాల్స్, రక్షణ రాళ్లు ఉన్నాయి. అనేక చోట్ల ఎలాంటి రక్షణ చర్యలూ తీసుకోలేదు. ఒకవేళ వాహనాలు అదుపుతప్పితే లోయలోకి దూసుకుపోవాల్సిందే. ఇప్పటికే పలు ట్యాంకర్లు, లారీలు ఇక్కడ బోల్తా పడ్డ ఘటనలు అనేకం ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఘాట్ రోడ్డు మీదుగా అనంతగిరి నుంచి కేరెళ్లికి వెళ్తున్న బస్సు బ్రేక్లు ఫెయిల్ అయ్యాయి. ఎంతకీ అదుపు కాకపోవడంతో ఒక్కసారిగా కుడివైపున ఉన్న ఘాట్ లోకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తు ఓ చెట్టు ను ఢీకొట్డడంతో వేగం తగ్గి అక్కడే నిలిచిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు బతుకుజీవుడా అంటూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 3 నెలల క్రితం అనంతగిరి– కేరెళ్లి మొదటి ఘాట్లో ఏర్పాటు చేసిన సైడ్వాల్ను ఓ అంబులెన్స్ ఢీకొట్టింది. వేగం తక్కువగా ఉండటంతో అక్కడే ఆగిపోయింది. ఏమాత్రం స్పీడ్ ఉన్నా వాహనం లోయలో పడిపోయేదే. ఇక్కడ దెబ్బతిన్న సైడ్వాల్కు ఇప్పటికీ మరమ్మతు చేసిన పాపాన పోలేదు. 6 ఏళ్ల క్రితం ఈ ఘాట్ రోడ్డును కొంతమేర విస్తరించినప్పటికీ ఎలాంటి రక్షణ గోడలు నిర్మించలేదు. అనుకోని సంఘటన ఏదైనా అధిక ప్రాణనష్టం తప్పదని ప్రయాణికులు, జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘాట్ రోడ్లపై గతంలో ఆర్టీసీ బస్సులు ఎన్నోసార్లు ఆగిపోయాయి. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి లోయ అంచులవరకూ వెళ్లాయి. పలుమార్లు డ్రైవర్ల అప్రమత్తతతో పెను ప్రమాదాలే తప్పాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఘాట్రోడ్ల వద్ద రక్షణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. -
కొండగట్టు ప్రమాదం: 60కి చేరిన మృతుల సంఖ్య
సాక్షి, జగిత్యాల : అంజన్న భక్తులకు కొండంత విషాదాన్ని మిగిల్చిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఒకరు, హైదరాబాద్లో మరొకరు మృతి చెందడంతో మరణించిన వారి సంఖ్య 60కి చేరింది. తీవ్ర గాయాలపాలైన మరో 41మంది కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ ఘాట్ రోడ్డు వద్ద మంగళవారం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 101 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో అదుపు తప్పి బస్సు లోయలో పడింది. ఈ విషాదకర ఘటనలో 60 మంది మృతి చెందగా, క్షతగాత్రులను కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించారు. కాగా బాధిత కుటుంబాలకు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. సంబంధిత కథనాలు... దేశ చరిత్రలోనే అతిపెద్ద బస్సు ప్రమాదం కొండగట్టు బస్సు ప్రమాదం; మృతుల వివరాలు నిర్లక్యం ఖరీదు! -
ప్రమాద ప్రాంతాన్ని సందర్శించిన ప్రతిపక్ష నేతలు
జగిత్యాల జిల్లా: కొండగట్టు రోడ్డులో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కాంగ్రెస్, టీడీపీ నేతల బృందం బుధవారం సందర్శించి పరిశీలించింది. అనంతరం మృతుల కుటుంబాలను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, పెద్దిరెడ్డి, వి. హనుమంతరావు, పొన్నం ప్రభాకర్లు పరామర్శించారు. బస్సు ప్రమాదాన్ని ప్రభుత్వ హత్యగా పరిగణించాలని ఈ సందర్భంగా నాయకులు వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి బాధ్యులైన మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణలను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని కోరారు. ప్రభుత్వంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని..లేదంటే ఆర్టీసీ అన్ని డిపోల ముందు ఆందోళనకు దిగి ఆర్టీసీని స్థంభింపజేస్తామని కాంగ్రెస్, టీడీపీ నేతలు హెచ్చరించారు. కొండగట్టు ఘటన దురదృష్టకరమని మండలి చైర్మన్ స్వామిగౌడ్ వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు ప్రభుత్వమే చికిత్స చేయిస్తుందని, దీనికి కారకులైన వారిపై చర్య తీసుకుంటామని తెలిపారు. అసలే విషాదం.. ఆపై వర్షం కొండగట్టు ప్రమాదంలో మృతిచెందిన వారి అంత్యక్రియలకు వర్షం వల్ల అంతరాయం కలిగింది. శనివారం పేట, హిమ్మత్ రావు పేట, తిర్మలాపూర్, రామ్సాగర్, డబ్బూతిమ్మాయిపల్లిలో వర్షం జోరుగా పడుతోంది. -
మృత్యుంజయులు ఈ చిన్నారులు
కొడిమ్యాల(చొప్పదండి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని రాంసాగర్ గ్రామానికి చెందిన బైరి కీర్తన, కూతురు రితన్య, ఏడాది వయస్సున్న కుమారుడు శివతో కలిసి జగిత్యాలకు బయలుదేరింది. ప్రమాదంలో రితన్య చనిపోగా.. కీర్తనకు తీవ్రగాయాలయ్యాయి. శివ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. అలాగే.. రాంసాగర్ గ్రామానికే చెందిన కావ్యశ్రీ,, ఉదయశ్రీ అనే కవలలు తాత మెడిచెల్మల రాజేశం(60)తో జగిత్యాల బయలుదేరారు. ప్రమాదంలో రాజేశం మృతిచెందగా.. కవలలు మృత్యుంజయులుగా నిలిచారు. దాదాపు బస్సులోని వారందరూ మృత్యుముఖానికి వెళ్లగా చిన్నారులు మాత్రం సురక్షితంగా బతికి బయటపడడంతో సంబంధీకులు ఊపిరిపీల్చుకున్నారు. -
అడ్డదారే ప్రమాదానికి కారణం
-
కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్షి బృందం – కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్ : జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో మంగళవారం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదం 60 మందిని బలిగొంది. కొడిమ్యాల మండలం శనివారంపేట నుంచి జగిత్యాలకు వస్తున్న ఆర్టీసీ (ఏపీ 29 జెడ్ 2319 ఆర్డినరీ) బస్సు కొండగట్టు సమీపంలోని ఘాట్ వద్ద లోయలో పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 101 మందిలో 60 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ప్రమాద స్థలంలోనే 24 మంది మృతి చెందారు. మరో 26 మంది జగిత్యాల ఆస్పత్రిలో, ఏడుగురు కరీంనగర్ జిల్లా కేంద్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, 38 మంది మహిళలు ఉన్నారు. 43 మంది క్షతగాత్రులను కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్ శ్రీనివాస్ మృతి చెందగా, కండక్టర్ పరమేశ్వర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. క్షతగాత్రుల్లో సగం మందికిపైగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రమాద ఘటనలో ఊపిరి ఆడకపోవడంతోనే ఎక్కువ మంది చనిపోయారని అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం విషయం తెలుసుకుని జిల్లా యంత్రాంగం, వైద్య సిబ్బంది అందరూ హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలను ఈటల రాజేందర్, కేటీఆర్, మహేందర్రెడ్డి, ఎంపీ కవిత పరామర్శించారు. ప్రమాదం జరిగిందిలా.. ఆర్టీసీ ఆర్డినరీ బస్సు ఉదయం 10.15 గంటలకు శనివారంపేట నుంచి జగిత్యాలకు బయల్దేరింది. 11.18 గంటల సమయంలో కొండగట్టు జంక్షన్ను దాటింది. తర్వాత ఘాట్రోడ్డు వద్ద జలబుగ్గ మూలమలుపునకు చేరుకోగానే అదుపు తప్పి పక్కనే ఉన్న ఘాట్లోకి దూసుకెళ్లింది. ఏం జరుగుతున్నదో తెలుసుకునే లోపే బస్సు లోయలో పడిపోయింది. బస్సు పడిపోతున్న సమయంలో ప్రయాణికుల హాహాకారాలు వినిపించాయి. మరో అరగంటలో జగిత్యాలకు చేరుకోవాల్సిన బస్సు.. పెను విషాదాన్ని మిగిల్చింది. కొంపముంచిన ఓవర్లోడింగ్ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిం చుకోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సులో సీటింగ్ సామ ర్థ్యం 52 మాత్రమే. కానీ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 101 మందిని ఎక్కించుకున్నారు. అంతమంది ఎక్కడంతో ఆ బస్సు కిక్కిరిసింది. దీనికి తోడు కొండగట్టు ఆలయ ప్రాంగణం నుండి గుట్ట కింద వరకు ఉన్న దారి పొడవునా ఆరు ప్రమాదకర మూలమలుపులున్నాయి. ఆ మార్గంలో వాహనాలు నడపాలంటే సుశిక్షుతులైన డ్రైవర్లే ఉండాలి. ఈ క్రమంలో డ్రైవర్ శ్రీనివాస్ కూడా ఉత్తమ డ్రైవర్ అవార్డు గ్రహీతనే. అయితే బస్సు జలబుగ్గ ప్రాంతానికి చేరుకోగానే ఎదురుగా వస్తున్న జీపును తప్పించబోయి డ్రైవర్ బస్సును కట్ కొట్టాడు. దీంతో బస్సు ప్రయాణికులందరూ ఒకేవైపు ఒరగడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిందని సాక్షులు చెబుతున్నారు. రూట్ మార్చడంపై విమర్శలు అధికారులు రూటును మార్చడం కూడా ప్రమాదానికి కారణమని మృతుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి బస్సు శనివారంపేట నుంచి హిమ్మత్రావుపేట, రాంసాగర్, తిమ్మయ్యపల్లె, నాచుపల్లి మీదుగా జగిత్యాలకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆర్టీసీ అధికారులు పదిరోజుల క్రితమే బస్సు రూటును మార్చి.. శనివారంపేట నుంచి హిమ్మత్రావుపేట, రాంసాగర్, తిమ్మయ్యపల్లె నుంచి నేరుగా కొండగట్టు మీదుగా జగిత్యాలకు నడిపిస్తున్నారు. కొండగట్టు స్టేజీ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందనే అధికారులు రూటు మార్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్తనాదాలతో దద్దరిల్లిన ఆస్పత్రి మృతుల కుటుంబీకుల రోదనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో జగిత్యాల జిల్లా ఆస్పత్రి దద్దరిల్లింది. మృతదేహాలను సంఘటనా స్థలం నుంచి ఆస్పత్రికి తరలించగానే.. వారి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులందరూ ఆస్పత్రికి చేరుకున్నారు. కుప్పగా పడి ఉన్న మృతదేహాలను చూస్తూ తమ వారి కోసం వెతుక్కున్నారు. గుండెలు పగిలేలా ఏడ్చారు. ఎవరిని కదిలించినా.. హృదయవిదారక గాథలే వినిపించాయి. చూపరులను కంటతడి పెట్టించాయి. మృతులు, క్షతగాత్రులను చూసేందుకు జిల్లా నలుమూలలతో పాటు కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల నుండి జనం వేల సంఖ్యలో తరలివచ్చారు. 45 మృతదేహాలకు జగిత్యాల ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించారు. సుమారు 18 మంది డాక్టర్లతో కూడిన వైద్య బృందం శవపరీక్షలు నిర్వహించింది. 12.10కి ప్రారంభమైన పోస్టుమార్టం ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. తొమ్మిది మృతదేహాలకు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. క్షతగాత్రులను జగిత్యాల ప్రధాన ఆస్పత్రికి తరలించేందుకు 15 అంబులెన్స్లు, మృతదేహాలను తరలించేందుకు 8 మార్చురీ వ్యాన్లను ఉపయోగించారు. పోస్టుమార్టం అనంతరం రాంసాగర్, డబ్బుతిమ్మయ్యపల్లి, హిమ్మత్రావుపేట గ్రామాలకు చెందినవారి మృతదేహాలు ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక వాహనాల ద్వారా పంపించారు. అధికారుల ఘెరావ్ ఘటనా స్థలాన్ని సందర్శించేందుకు వెళ్లిన కలెక్టర్ డాక్టర్ శరత్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్రెడ్డి, జగిత్యాల ఎస్పీ సింధూశర్మను మృతుల కుటుంబీకులు ఘెరావ్ చేశారు. గతంలో రెండుసార్లు ప్రమాదాలు జరిగినా చర్యలు తీసుకోలేదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.10 లక్షల నష్ట పరిహారం ఇవ్వడంతోపాటు ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మార డంతో స్థానిక నాయకులు వారికి నచ్చజెప్పారు. ఫిట్నెస్ ఇంకో నెల రోజులుంది ప్రమాదానికి గురైన బస్సు ఫిట్నెస్ గడువు మరో నెల రోజులుంది. ఆర్టీఏ నిబంధనల ప్రకారం.. రోడ్డుపై నడవాలంటే ఆ వాహనం ఫిట్నెస్ చూస్తాం. ఫిట్నెస్ లేకపోతే వాహనాన్ని పక్కనబెడతాం. అంటే మనం ఆస్పత్రికి వెళ్తే ఆ రోజు వరకు ఉన్న పరిస్థితికి అనుగుణంగానే వైద్యం చేస్తాం. తర్వాత ఏమయ్యేదీ డాక్టర్లు చెప్పలేరు కదా.. వారంలోనే చావొచ్చు, 20 ఏళ్లు కూడా బతకవచ్చు. – కిషన్రావు, ఇన్చార్జి డీటీసీ, జగిత్యాల... (60 మంది మృతి చెందిన ఘటనను ఉద్దేశించి ఆర్టీఏ అధికారి ఇచ్చిన వివరణ ఇది) మృత్యుంజయులు ఈ చిన్నారులు కొడిమ్యాల: రాంసాగర్ గ్రామానికి చెందిన బైరి కీర్తన తన కూతురు రితన్య, ఏడాది వయసున్న కుమారుడు శివతో కలిసి జగిత్యాలకు బయలుదేరింది. ప్రమాదంలో రితన్య చనిపోగా.. కీర్తనకు తీవ్రగాయాలయ్యాయి. శివ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. రాంసాగర్కే చెందిన కావ్యశ్రీ,, ఉదయశ్రీ అనే కవలలు తాత మెడిచెల్మల రాజేశం (60)తో జగిత్యాల బయలుదేరారు. ప్రమాదంలో రాజేశం మృతిచెందగా.. కవలలు మృత్యుంజయులుగా నిలిచారు. శివ (పైన ), కవలలు కావ్యశ్రీ, ఉదయశ్రీ (కింద) అడ్డదారే ప్రమాదానికి కారణం ఘటన జరిగిన మార్గంలో పలు చోట్ల ప్రమాదకర మలుపులున్నాయి. ఇప్పటికే ఆ మార్గంలో రెండుసార్లు ప్రమాదం జరిగింది. 2012 మార్చి 21న అదే మార్గంలోని మరో లోయలో లారీ పడి 11 మంది మృతి చెందారు. రెండేళ్ల క్రితం ఇదే లోయలో ఆటో పడి ఇద్దరు చనిపోయారు. దీంతో ఆ మార్గం నుంచి బస్సులు నడపకుండా ప్రత్యామ్యాయంగా బైపాస్ రోడ్డు నిర్మించారు. ఘాట్ రోడ్డు నిర్మాణం కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆర్అండ్బీ అధికారులు గుర్తించి.. ప్రభుత్వానికి నివేదిక పంపారు. రోడ్డుకి ఇరువైపులా రక్షణ గోడ నిర్మించాలని సూచించారు. గోడ నిర్మించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని.. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ రోడ్డుపై వాహనాలు నడపరాదని చెప్పినా.. గత 3 నెలలుగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలకు అనుమతిస్తున్నారు. ఘాట్రోడ్డు నుంచి హైవే కిలోమీటరు దూరంలో ఉంటుంది. ప్రత్యామ్నాయ బైపాస్ రోడ్డును ఉపయోగిస్తే అదనంగా 5కి.మీ ప్రయాణించాల్సి వస్తుందని భావించిన ఆర్టీసీ అధికారులు.. ఘాట్ రూట్లోనే బస్సులు నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జగిత్యాల డిపోలో కాలపరిమితి ముగిసిన సుమారు 20 బస్సులను నడుపుతున్నట్లు తెలిసింది. మరోవైపు కొండగట్టు ఘాట్రోడ్ పెద్ద వాహనాలకు ప్రమాదం అని తెలిసి గతంలో పెద్ద వాహనాలు నడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఆర్టీసీ అధికారులు గత 10 రోజుల నుంచి కొడిమ్యాల నుంచి కొండగట్టుకు బస్సు నడుపుతున్నారు. దేశంలోనే అతిపెద్ద బస్సు ప్రమాదం! కొండగట్టు ప్రమాదం దేశంలోనే అతిపెద్దదిగా చెబుతున్నారు. ఆర్టీసీ చరిత్రలో కూడా ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వంటి ప్రమాదకర ఘాట్ రోడ్లు, కొండ చరియలు కలిగిన రాష్ట్రాల్లో జరిగిన ప్రమాదాల్లోనూ ఇంత పెద్ద మొత్తంలో ప్రాణనష్టం జరగలేదు. జమ్మూకశ్మీర్లో 2008లో 60 మందితో వెళ్తున్న బస్సు బోల్తా పడగా, 44 మంది మృతి చెందా రు. మరో ప్రమాదంలో ఆ రాష్ట్రంలోనే మరో 51 మంది దుర్మరణం చెందారు. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో 2012లో జరిగిన బస్సు ప్రమాదంలో 52 మంది మృతిచెందారు. మహారాష్ట్రలో 2008 లోని నాసిక్లో భక్తులతో వెళ్తున్న బస్సు లోయలో పడిన ఘటనలో 39 మంది ప్రయాణికులు మరణించారు. మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 45 మంది, మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొట్టిన ప్రమాదంలో 26 మంది విద్యార్థులు చనిపోయారు. కొండ గట్టు బస్సు ప్రమాదంలో 60 మంది చనిపోవడంతో దేశ చరిత్రలోనే అత్యంత ఘోర ఘటనగా నమోదైంది. కంటతడి పెట్టిన కేటీఆర్, కవిత రాయికల్ (జగిత్యాల): కొండగట్టు ప్రమాద మృతదేహాలు, క్షతగాత్రులను చూసి మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ చలించిపోయారు. పరామర్శించేందుకు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వారు బాధితుల బంధువుల ఆర్తనాదాలు చూసి కంటతడి పెట్టారు. కాగా, ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు రూ.8 లక్షల ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరఫున రూ.3 లక్షలు అందిస్తామన్నారు. చనిపోయిన వారిలో రైతులు ఉంటే రైతుబీమా కింద మరో రూ.5 లక్షల పరిహారం అందుతుందన్నారు. ఓవర్లోడ్తో బస్సును నడిపించినందుకు జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న కేటీఆర్, మహేందర్ రెడ్డి, ఈటల, ఎంపీ కవిత తదితరులు కాలం చెల్లిన బస్సులు ఆర్టీసీ ధనదాహమే 60 మంది చావుకు కారణమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఒక్కో ఆర్టీసీ బస్సు 10 లక్షల కిలోమీటర్లు మాత్రమే నడపాలి. అయితే ప్రమాదానికి గురైన బస్సు పెద్దపల్లి జిల్లా మంథని డిపోలో రెండు నెలల క్రితమే 20 లక్షల కి.మీ తిరిగింది. తర్వాత ఆ బస్సును ఉన్నతాధికారుల మెప్పుకోసం జగిత్యాలకు తీసుకొచ్చి కొడిమ్యాల నుంచి జగిత్యాల రూట్లో నడుపుతున్నారు. రెండు నెలల కాలంలో ఇప్పటి వరకు ఆ బస్సు అదనంగా మరో 4 లక్షల కి.మీ తిరిగింది. మరోవైపు మూడేళ్ల క్రితం వరకు 8 లక్షల కి.మీ తిరిగిన బస్సులను ఆర్టీసీ స్క్రాప్ కింద పక్కన పెట్టేది. తర్వాత 10 లక్షల కి.మీ, 12 లక్షల కి.మీ వరకు పరిమితిని పెంచి ఇటీవల 14 లక్షల కి.మీ తప్పనిసరి చేసిందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదానికి గురైన బస్సుకు 3 నెలల క్రితమే మరమ్మతులు చేసి.. రంగుపూసి రోడ్డెక్కిచ్చినట్లు చెబుతున్నారు. ఆ దృశ్యం భయానకం... ఒక బాంబు పేలుడు జరిగితే ఎంతటి భయానకమైన పరిస్థితి కనిపిస్తుతుందో.. కొండగట్టు బస్సు ప్రమాదం అంతకు మించిన భయానక దృశ్యాన్ని చూపిస్తోంది. బస్సంతా ఛిన్నాభిన్నం.. స్టీరింగ్ ఎక్కడకు పోయిందో తెలియదు.. గేర్ రాడ్బాక్స్ తుక్కుతుక్కుగా మారిపోయింది. సీట్లు ఆకృతిని కోల్పోయి భయంకరమైన దృశ్యాన్ని తలపించాయి. ఘాట్ రోడ్డు నుంచి వస్తూ స్పీడ్ బ్రేకర్ల వద్ద బస్సు పట్టుతప్పింది. నేరుగా 15 మీటర్ల లోతులో ఉన్న గుంతలో పడింది. బస్సు ముందు భాగం వేగంగా వెళ్లి గుంత గట్టు ప్రాంతాన్ని ఢీకొట్టింది. ఇక్కడే బస్సులో నిల్చుని ఉన్న వాళ్లంతా డ్రైవర్ పైనా, గేర్ బాక్స్ ప్రాంతం నుంచి అద్దాల మీద పడి గుంత దరిని ఢీకొట్టారు. ఇక్కడే 15 నుంచి 25 మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. సీట్లలో కూర్చున్న వాళ్లు వెనుక భాగంలో నిల్చొని ఉన్న వాళ్లు సైతం ఒక్క కుదుపుకే తీవ్రమైన గాయాలతో, ఇంటర్నల్ బ్లీడింగ్తో సంఘటనా స్థలిలోనే మృత్యవాతపడ్డారు. మిగిలిన వాళ్లని బయటకు తీసే క్రమంలో స్థానికులు, భక్తులు ఎంత సహాయం చేసినా అంతర్గతంగా తగిలిన గాయాలతో మార్గమధ్యంలో, చికిత్స సమయంలో మృత్యువాతపడ్డట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. -
డొల్ల.. తేట తెల్లం!
సాక్షి, హైదరాబాద్: లక్షల మంది భక్తులు.. వేల కొద్దీ వాహనాలు.. పైగా ఘాట్ రోడ్డు. జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రం వరుస ప్రమాదాలతో రక్తమోడుతోంది. ఘాట్ రోడ్డు విస్తరణ నిర్లక్ష్యం కంటికి కనిపిస్తున్నా.. ఉన్న రోడ్డు నిర్మాణాన్ని సైతం పాలకులు పట్టించుకోకపోవడంతో 57 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం.. అక్కడి ఘాట్ పరిశీలనలో సంచలనాత్మక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కొండగట్టు గుట్టపై నుంచి కిందికి దిగే 3.5 కిలోమీటర్ల మార్గం అత్యంత భయానక స్థితిలో ఉంది. ప్రమాదకరమైన మలుపులు, వాటి వద్ద కనీసం భద్రతా చర్యలు లేకపోవడం భవిష్యత్లో మరెంత మంది ప్రాణాల మీదకు తీసుకొస్తుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుట్టపై నుంచి కిందకు వస్తున్న మార్గంలో ఐదు మలుపుల ప్రాంతం భవిష్యత్ ప్రయాణాన్ని ఆందోళనలో పడేస్తోంది. మూల మలుపుల వద్ద సూచిక బోర్డులు, రెయిలింగ్ కూడా లేని దుస్థితి ‘సాక్షి’ పరిశీలనలో బయటపడింది. సాధారణ కల్వర్టు కోసం ఎప్పుడో 15 ఏళ్ల కింద నిర్మించిన కల్వర్టు సిమెంట్ రెయిలింగ్ ప్రాంతం ఇప్పుడున్న రోడ్డు కింద భాగంలోకి కుచించుకుపోయింది. ఇదే మలుపు వద్ద డ్రైవర్లు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఊహించలేని నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఈ మలుపుల ప్రాంతం నుంచి సుమారు 50 మీటర్ల లోతు ఉన్న లోయల్లో వాహనాలు పడే ప్రమాదం ఉంది. కొన్ని మలుపు ప్రాంతాల్లో రెయిలింగ్స్ ఏర్పాటు చేసినా పెద్దగా వాటితో ఉపయోగం లేదు. ఘాట్ రోడ్డులో కనీసం 2 మీటర్ల ఎత్తున్న రెయిలింగ్లు ఏర్పాటు చేయాలి. రేడియం స్టిక్కర్లను ఏర్పాటుచేస్తే ప్రమాదాల నియంత్రణకు అవకాశం ఉంటుంది. భద్రతా చర్యలేవీ? ప్రమాదం జరిగిన కొండగట్టు ఘాట్ రోడ్డులో ఎక్కడ కూడా ప్రమాద నివారణ సూచికలు, భద్రతా చర్యలు పాటించకపోవడం వివాదాస్పదంగా మారుతోంది. అధిక లోడ్ ఉన్న వాహనాలను ఈ రోడ్డు మార్గంలో నడపడం ప్రమాదకరమని తెలిసినా నడుపుతున్నారు. కాగా, కొండగట్టు పుణ్యక్షేత్రానికి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వచ్చి చేరుతోంది. ఆలయ కమిటీ, పాలక పక్షాలు, ప్రభుత్వవిభాగాలు కనీసం రోడ్ల విస్తరణ పనులు చేపట్టకపోవడం ఈ కారణానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఘాట్ రోడ్డు కనీసం 100 ఫీట్ల నుంచి 120 ఫీట్లు అంటే డబుల్ రోడ్డుతో పాటు మధ్యలో రెండు ఫీట్ల వాహనల గ్యాప్ వదిలేసేలా ఉండాలి. కానీ ప్రస్తుతమున్న రోడ్డు 60 నుంచి 80 ఫీట్ల పరిధిలోనే ఉంది. ఆ రోడ్డు కూడా విస్తరించాల్సిందే.. ఘాట్రోడ్డు కాకుండా కొండగట్టు గుట్టపైకి వచ్చేందుకు దొంగలమర్రి, జేఎన్టీయూ కాలేజీ మీదుగా మరో మార్గం ఉంది. ఆ మార్గం సైతం 80 ఫీట్ల లోపుగానే నిర్మితమైంది. ఈ రహదారిలో 40 శాతం మేర ఘాట్ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని కీలక మలుపులు సైతం వాహనదారులను వణికించేలా కనిపిస్తున్నాయి. ఘాట్ రోడ్ విస్తరణతో పాటు జేఎన్టీయూ, దొంగలమర్రి రహదారిని విస్తరించే ప్రమాదాల నియంత్రణతో పాటు రాకపోకలు, సౌలభ్యం కూడా కలిసివస్తుందని భక్తులు కోరుతున్నారు. కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతంతో పాటు కొండగట్టు వెళ్లేందుకు ఉన్న రెండు మార్గా లనూ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ డీజీ కృష్ణప్రసాద్ పరిశీలించారు. ప్రమాదం జరగానికి ఓవర్వెయిట్ కారణంతో పాటు రోడ్ డెవలప్మెంట్ కూడా ఉందని అభిప్రాయపడ్డారు. రోడ్ రెయిలింగ్స్ను విస్తరించి, సూచికలు, భద్రతాచర్యలు, రోడ్డు ఇంజనీరింగ్పై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు. దేశంలో ఈ ఏడాది జరిగిన భారీ బస్సు ప్రమాదాలు జూలై01 ఉత్తరాఖండ్ పౌరీ జిల్లాలోని పౌరీ గర్వాల్లో జరిగిన ప్రమాదంలో 48 మంది మరణించారు. ఓవర్లోడ్తో వెళుతున్న బస్సు లోయలో పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. జనవరి29 పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో ఓ బ్రిడ్జి రెయిలింగ్ను ఢీకొని గోబ్రా కెనాల్లోకి బస్సు దూసుకెళ్లడంతో 45 మంది చనిపోయారు. జూలై 28 మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో డాపోలి వ్యవసాయ వర్సిటీ సిబ్బందితో వెళ్తున్న బస్సు లోయలో పడి 33 మంది మృతిచెందారు. ఏప్రిల్10 హిమాచల్ప్రదేశ్ కాంగ్రా జిల్లాలోని నుర్పూర్ వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో 30 మంది చనిపోయారు. మృతుల వివరాలు: 1. నామాల మౌనిక (23), శనివారంపేట 2. బైరి రిత్విక్(3), రామసాగర్ 3. పోలు లక్ష్మి(50), హిమ్మత్ రావుపేట 4. చెర్ల లక్ష్మి (45), హిమ్మత్ రావుపేట 5. గండి లక్ష్మీ (60), శనివారంపేట 6. డబ్బు అమ్మయి(50) D/o తిమ్మయ్య, డబ్బు తిమ్మయ్యపల్లి 7. బండపల్లి చిలుకవ్వ(76) 8. గోలి అమ్మాయి(44), శనివారంపేట 9. తిప్పర్తి వెంకటరత్నం(56), తిరుమలాపూర్ 10. కంకణాల ఎల్లవ్వ(70), సండ్రలపల్లి 11. లాంబ కిష్టయ్య(65), హిమ్మత్ రావుపేట 12. బందం లస్మవ్వ (65) ముత్యంపేట 13. బొల్లారం బాబు (54), శనివారంపేట 14. లైసెట్టి చంద్రకళ (45), శనివారంపేట 15. ఎండ్రికాల ఎంకవ్వ, శనివారంపేట 16.ఎండ్రికాల సుమ(30), శనివారంపేట 17. ర్యాగాల రాజవ్వ (56), డబ్బు తిమ్మయ్యపల్లి 18. ఉత్తమ్ నందిని , కోనాపూర్ 19. మల్యాల అనిల్(19), హిమ్మత్ రావుపేట 20. గాజుల చిన్నయ్య (60), s/o హన్మంతు, డబ్బు తిమ్మయ్యపల్లి 21. శామకూరా మల్లవ్వ (38), తిర్మలాపూర్ 22. సలేంద్ర వరలక్ష్మి (28), శనివారంపేట 23. కుంబాల సునంద (45), శనివారంపేట 24. గుడిసె రాజవ్వ (50), శనివారంపేట 25. పందిరి సత్తెవ్వ (75), హిమ్మత్ రావుపేట 26. దాసరి సుశీల (55), తిరుమలపూర్ 27. డ్యాగల ఆనందం(55), రామసాగర్ 28. నేదునూరి మదనవ్వ(75), హిమ్మత్ రావుపేట 29. చెర్ల హేమా(30), హిమ్మత్ రావుపేట 30. పిడుగు రాజిరెడ్డి(55), డబ్బు తిమ్మయ్యపల్లి 31. చెర్ల గంగయ్య(75), శనివారం పేట 32. ఒడ్నాల లస్మవ్వా (48), తిమ్మయ్యపల్లి 33. ఒడ్నాల కాశిరం(55), తిమ్మయ్యపల్లి 34. గోల్కొండ లచవ్వ(51), డబ్బు తిమ్మయ్యపల్లి 35. గోల్కొండ దేవయ్య (63), డబ్బు తిమ్మయ్యపల్లి 36.కొండ అరుణ్ సాయి(5), కోరెం 37. బొంగని మదునయ్య(55), రాంపెల్లి 38. ఓత్యం భూలక్మి(40), కొనపూర్ 39. సోమిడి పుష్ప(45), తిర్మల్పూర్ 40. బొంగోని భూమక్క(55), పెద్దపల్లి 41. వేముల భాగ్యవ్వ(50), హిమ్మత్ రావుపేట 42. బాలసాని రాజేశ్వరి(40), రేకుర్తి 43. తిరుమాని ముత్తయ్య(40), రామసాగర్ 44. బొంగోని రాంచరణ్ (09), రాంపెల్లి 45. చిర్రం పూజిత (15, జగిత్యాల 46. ఆరె మల్లయ్య, హిమ్మత్ రావుపేట 47. మేడి చెలిమల రాజేషం (70), రాంసాగర్ 48. చెర్ల మౌనిక (24), రాంసాగర్ 49. డ్రైవర్ శ్రీనివాస్ (ఆర్టీసీ డ్రైవర్) 50. మేడి చెలిమల గౌరీ (48), రాంసాగర్ 51.పడిగెల స్నేహలత (22), హిమ్మత్రావుపేట 52. డ్యాగల స్వామి (32), రాంసాగర్ 53. గాజుల శ్రీహర్ష (02), శనివారంపేట 54. తైదల పుష్ప (40), తిర్మలాపూర్ 55. పుండ్రా లలిత (36), డబ్బు తిమ్మాయిపల్లి 56. పోతుగంటి జ్యోత్స్నా (27), మల్యాల 57. గోలి రాజమల్లు (60), శనివారంపేట -
మలుపుల్లో 'మృత్యువు'
ఘాట్ రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా గత మూడేళ్లుగా బస్సులు లోయల్లో పడిన ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేవలం గతేడాది బస్సు ప్రమాదాల్లో సగటున రోజుకు 29 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. బస్సు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళలు ముందున్నాయి. హిమాచల్ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్లో రోజూ ఏదో ఒక చోట బస్సు లోయలో పడిన ప్రమాదాల గురించే వింటున్నాం. 2017లో బస్సు ప్రమాదాల్లో 9,069 మంది మరణించారు. ఇందులో తమిళనాడులోనే 1,856 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్లో గతేడాది 1,406 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇక కర్ణాటకలో బస్సులు లోయలో పడిన ప్రమాదాల్లో 800 మంది మరణించారు. జగిత్యాల క్రైం/టౌన్: కొండగట్టు రోడ్డు ప్రమాదంలో కొడిమ్యాల మండలానికి చెందిన వారే 50 మంది మృతిచెందారు. శనివారంపేటకు చెందిన 15 మంది, హిమ్మత్రావుపేటకు చెందిన 10 మంది, డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన 10 మంది, రాంసాగర్కు చెందిన 9 మంది, తిర్మలాపూర్కు చెందిన ఆరుగురు మృతిచెందారు. దీంతో మండలమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. శనివారంపేటకు చెందిన గర్భిణులు సుమలత (తొమ్మిది నెలలు), నామాల మౌనిక (5 నెలలు) ప్రమాదంలో చనిపోయారు. కారణాలు శాస్త్రీయంగా అన్వేషించాలి ఘాట్రోడ్లపై భద్రతాపరమైన ఏర్పాట్లు ఎక్కడా కనిపించడం లేదు. ఘాట్రోడ్లలో రహదారికి ఇరువైపులా బారియర్లు నిర్మించాలని రోడ్డు భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఫైబర్ మిర్రర్స్ ఏర్పాటు చేసినా కొంతవరకు ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. తమిళనాడు వంటి రాష్ట్రాలు ఘాట్రోడ్లపై ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులు పెడుతు న్నాయి. ఆ ఘాట్ల గురించి క్షుణ్ణంగా తెలిసిన డ్రైవర్లనే నియమిస్తున్నాయి. ఘాట్రోడ్లపై కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రోడ్డు భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. ‘ఏదైనా ప్రమాదం జరగ్గానే అందరూ డ్రైవర్ వైపే వేలెత్తి చూపిస్తున్నారు. కానీ అది సరైనది కాదు. ప్రమాదానికి గల అసలు కారణాలేంటో కనుక్కోవాలి. రోడ్డు తీరుతెన్నులు, ప్రతికూల పరిస్థితులు, సామర్థ్యానికి మించి ఎక్కించుకోవడం, నిబంధనల్ని పాటించకపోవడం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి’ అని ట్రాన్స్పోర్ట్ ప్లానర్ ప్రొఫెసర్ ఎన్.రంగనాథన్ అభిప్రాయపడ్డారు. ప్రమాదాలకు కారణాలు ఘాట్ రోడ్లపై ప్రమాదాలకు చాలా కారణాలున్నాయి. కొండల్లో ఇరుకు దారులు, ప్రమాదకర మలుపులు, చెత్త రోడ్లు, వెలుతురు సరిగా లేకపోవడం, వాహనాల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం, వేరే వాహనాన్ని ఓవర్టేక్ చేయడానికి డ్రైౖవర్లు ప్రయత్నించడం, మద్యం సేవించడం వంటివి ఘాట్ రోడ్లపై ప్రమాదాలకు కారణాలుగా చెప్పొచ్చు. ప్రమాదాల్లో 50% ప్రమాదకరమైన మలుపుల కారణంగా, డ్రైవర్ నిర్లక్ష్యంతో 25% ప్రమాదాలు జరుగుతున్నాయి. గుంతల కారణంగా ప్రమాదాలు.. రోడ్లపై గుంతల కారణంగా కూడా మరణాలు సంభవిస్తున్నాయి. గత మూడేళ్లలో రహదారులపై గోతుల కారణంగా జరిగిన ప్రమాదాల్లో 9,300 మందికి పైగా మరణించారు. 25 వేల మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని రహదారుల శాఖ మంత్రి మన్సుక్ ఎల్.మాండవీయ పార్లమెంటులో చెప్పారు. అంటే రోడ్లపై గుంతల కారణంగా దాదాపు రోజుకు 10 మంది మృతి చెందుతున్నారన్నమాట. 2015లో 3,416 మంది, 2016లో 2,324 మంది రోడ్లపై గోతుల కారణంగా మరణించారు. 2017లో పై తరహా ప్రమాదాల్లో 3,597 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవి గత సంవత్సరం తీవ్రవాద దాడుల కారణంగా సంభవించిన మరణాల (803) కంటే ఎక్కువ. 2016లో నిర్మాణంలో ఉన్న రోడ్ల దగ్గర జరిగిన ప్రమాదాల్లో 3,878 మంది మరణించారు. 2017 నాటికి ఈ సంఖ్య 4,250కి పెరిగింది. బస్సులు137 డ్రైవర్లు 62 జగిత్యాల డిపోలో పని ఒత్తిడి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ అంకెలే సాక్ష్యం. మొత్తం 137 బస్సులు ఉన్న జగిత్యాల డిపోలో 62 మంది డ్రైవర్లే అందుబాటులో ఉన్నారు. ఈ లెక్కన ప్రతి రెండు బస్సులకు ఒక్క డ్రైవరు మాత్రమే అందుబాటులో ఉన్నాడు. అందుకే ప్రతి డ్రైవర్కు పని ఒత్తిడి తప్పట్లేదు. చాలాసార్లు తమకు విధులు వద్దని చెప్పినా వినకుండా.. విధులు చేయాల్సిందేనని బలవంతం చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఘాట్ రోడ్ కోసం శిక్షణేదీ? కొండగట్టు ప్రమాదం ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆదాయం కోసం చూపిన ఉత్సాహం ప్రయాణికులకు రక్షణ కల్పించడంలో చూపట్లేదని తేటతెల్లమైంది. వాస్తవానికి తిరుమలలో ప్రత్యేకమైన బస్సును డిజైన్ చేసి నడుపుతున్నారు. అక్కడ ప్రత్యేక కంట్రోలర్ ఉంటారు. ఎవరినీ నిలబడనీయరు. అసలు ఎవరు నిలుచుని ఉన్నా.. బస్సు ముందుకు కదలదు. అంతా కూర్చున్నాకే బస్సు స్టార్టవుతుంది. అక్కడి డ్రైవర్లకు ఈ విషయంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రయాణికుల రక్షణకు పెద్దపీట వేస్తారు. రద్దీ వల్లే.. వేములవాడ నుంచి కొండగట్టు మీదుగా జగిత్యాలకు ఒకే ఆర్టీసీ బస్సు నడుపుతున్న ఆర్టీసీ.. భక్తుల రద్దీ నేపథ్యంలో 10 రోజుల క్రితం కొడిమ్యాల మండలం శనివారంపేట నుంచి కొండగట్టు మీదుగా మరో బస్సును (ప్రమాదానికి గురైంది) ప్రారంభించింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దేవాలయం నుంచి 30 మందికి పైగా ప్రయాణికులు బస్సులో ఎక్కినట్లు తెలుస్తోంది. కాపాడాలని వేడుకున్నరు కొండగట్టు ఘాట్ రోడ్డు కింద ఓ రైతు భూమిని జేసీబీతో చదును చేస్తున్నం. గుట్ట పైనుంచి వస్తున్న బస్సులో నుంచి కాపాడండంటూ అరుపులు వినిపించాయి. మేము అటు చూస్తుండగానే బస్సు లోయలో పడిపోయింది. మేం వెంటనే లోయ వద్దకు వచ్చినం. అప్పటికే అందరూ చెల్లాచెదురుగా పడ్డరు. బస్సులో ఉన్న కొందరిని మొదట మేమే బయటకు తీసినం. ఒక్కొక్కరినీ బయటకు తీస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగినయ్. బస్సులో వెనుక ఉన్న వాళ్లందరూ ముందుకొచ్చి పడ్డరు. – ప్రత్యక్ష సాక్షులు చంద్రశేఖర్,రవిప్రతాప్, జేసీబీ డ్రైవర్లు మా ఆటోకు తాకింది.. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి టాటా ఏస్ ఆటోలో వెళ్లినం. ఆటోలో ఆరుగురు పెద్దవాళ్లం. నలుగురు చిన్నపిల్లలు ఉన్నారు. కొండగట్టు గుట్టమీదికి వెళ్తుండగా కిందకు పడుతున్న బస్సు నుంచి అరుపులు వినబడ్డయ్. పక్కకు జరగమని అరిచారు. మా ఆటో డ్రైవర్ వెంటనే స్పీడ్ పెంచిండు. క్షణాల్లో బస్సు మా దగ్గరికి వచ్చి ఆటోకు తాకి రోడ్డు కిందకు దూసుకుపోయింది. ఏమైందో తెల్వలేదు. బస్సు ఆటోను తాకడంతో అద్దాలు పగిలినయ్. అదృష్టం కొద్ది ఆటోలో ఉన్నవారెవరికీ దెబ్బలు తగల్లేదు. మెడబోయిన కొమురయ్య,చిగురుమామిడి వేగానికి భయపడి మధ్యలోనే బస్సు దిగిన.. మా ఊరు కొడిమ్యాల. జగిత్యాలకు వెళ్లేందుకు తిర్మలాపూర్ వద్ద బస్సు ఎక్కిన. డ్రైవర్ బస్సును వేగంగా పోనిస్తూ ముందు వెళ్లే వాహనాలను వేగంగా ఓవర్ టేక్ చేశాడు. మెల్లగా వెళ్లాలని చెప్పినా వినలేదు. దీంతో జేఎన్టీయూ కాలేజీ బస్స్టాప్ వద్ద దిగిన. కొద్దిసేపటికే బస్సు కొండగట్టు ఘాట్రోడ్డు లోయలో పడిందని తెలిసింది. నా అదృష్టం బాగుంది. నేను ఎప్పుడు కూడా దారి మధ్యలో బస్సు దిగిపోలేదు. మొదటిసారిగా బస్సు వేగంగా వెళ్తుంటే భయపడి దిగిన..ప్రాణాలు దక్కినయ్. – ప్రకాశ్, కొడిమ్యాల స్వచ్ఛందంగా యువకుల సాయం మల్యాల: కొండగట్టు ఘాట్రోడ్డు సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో క్షత గాత్రులను తరలించేందుకు యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అయిల్నేని సాగర్రావు క్షతగాత్రులను ఎత్తుకుని తీసుకొచ్చి తన వాహనంలో జగిత్యాలకు తరలించారు. నేళ్ల రాజేశ్వర్రెడ్డి, కొక్కుల రఘు, కృష్ణారావు, దూస వెంకన్న తదితరులు క్షతగాత్రులను లోయలో నుంచి పైకి తీసుకొచ్చారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించి, అంబులెన్స్లతో పాటు ప్రైవేటు వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను తరలించేందుకు అంబులెన్సులు సరిపోకపోవడంతో అధికారులు సైతం తమ వాహనాల్లో తరలించారు. కొండ కింద ట్యాక్సీ జీపులు నడిపే డ్రైవర్లు కూడా సంఘటనా స్థలా నికి చేరుకుని తమ వాహనాల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రిలోనూ స్థానిక ముస్లిం యువకులు, ఎన్సీసీ కేడెట్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృత దేహాలను పోస్టుమార్టం గదికి తరలించడం.. క్షతగాత్రులను వాహనాల నుంచి ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లడంలో జిల్లా యంత్రాంగానికి సాయం అందించారు. కడవరకూ కలసే.. కొడిమ్యాల (చొప్పదండి): ధర్మేచ, అర్థేచ, కామేచ నాతిచరామి అని పెళ్లినాడు చేసిన ప్రమాణాలను ఆ మూడు జంటలు నిలబెట్టుకున్నాయి. కడవరకూ కలసే సాగాయి. కొడిమ్యాల మండలంలోని డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన గొల్కొండ దేవయ్య (60) –గోల్కొండ లక్ష్మి (55), వొడ్నాల కాశీరాం (60)–వొడ్నాల లక్ష్మి (55), శనివారంపేట గ్రామానికి చెందిన గోలి రాయమల్లు (55)–గోలి అమ్మాయి (50) దంపతులు ప్రమాదంలో మృతిచెందారు. దేవయ్యకు జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం దంపతులు జగిత్యాల ఆసుపత్రికి.. వొడ్నాల కాశీరాం చికిత్స నిమిత్తం జగిత్యాలకు, వొడ్నాల లక్ష్మి కూతురు వద్దకు.. గోలి రాయమల్లు, గోలి అమ్మాయిలు బంధువుల ఇంటికి వెళ్తుండగా.. ప్రమాదంలో మృతి చెందారు. -
నిర్లక్యం ఖరీదు!
జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలంలోని రాంసాగర్, డబ్బతిమ్మయ్యపల్లి, శనివారంపేట, హిమ్మత్రావుపేట గ్రామాలు కొండగట్టు పుణ్యక్షేత్రానికి శివారులో ఉంటాయి. ఈ గ్రామాలకు గత కొన్నేళ్లుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తోంది. పది రోజులకు ముందు వరకు ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డు మీదుగా కాకుండా, జేఎన్టీయూ, నాచుపల్లి మీదుగా నడిపించేవారు. పది రోజులుగా ఆర్టీసీ అధికారులు రూట్ మార్చారు. ఒక మార్గంలో వెళ్లి మరో మార్గంలో వచ్చేలా రూపొందించారు. గ్రామాలకు వెళ్లేటప్పుడు జేఎన్టీయూ, నాచుపల్లి, పూడూర్, దొంగలమర్రి మీదుగా వెళ్తుంది. వచ్చేటప్పుడు జగిత్యాలకు వెళ్లే రూట్లోనే కొండగట్టు పుణ్యక్షేత్రం ఘాట్ రోడ్డు మీదుగా నడుపుతున్నారు. ఘాట్ రోడ్డు పక్కనే లోయలు ఉండటంతో బస్సును నడిపించవద్దని ఆయా గ్రామాల ప్రజలు కోరారు. కానీ ఆర్టీసీ అధికారులు ఘాట్ రోడ్డుపై నుంచి బస్సు నడపడం, అది ప్రమాదానికి గురికావడంతో అమాయకులు మృత్యువాత పడ్డారు. సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదం కంటే ఘోరం.. ఉన్మాదం కన్నా దారుణం.. ఊచకోత కంటే భయానకం.. అదే నిర్లక్ష్యం.. మంగళవారం జగిత్యాల జిల్లా కొండగట్టుపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి కారణం ముమ్మాటికీ ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమే. సామర్థ్యానికి మించి జనాన్ని ఎక్కించి ఘాట్ రోడ్డు గుండా తీసుకురావడమే ప్రమాదానికి ప్రధాన కారణం. 70 ఏళ్ల ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ జరగని ఘోరం జరిగిపోయింది. ఏకంగా 57 మందిని పొట్టనపెట్టుకుంది నిర్లక్ష్యమే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆదాయం కోసమే తెరిచారు.. వాస్తవానికి ఇక్కడ ప్రమాదాలు కొత్తకాదు. గతంలోనూ పలుమార్లు ఇక్కడ ప్రమాదాలు జరిగాయి. 2005లో జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తాపడి 30 మంది మరణించారు. 2011లో ఇదే ఘాట్రోడ్డుపై లారీ బోల్తాపడి 16 మంది హనుమాన్ భక్తులు అసువులుబాసారు. దీంతో అప్పుడు కలెక్టర్గా ఉన్న స్మితా సబర్వాల్ ఈ ఘాట్రోడ్డు గుండా రాకపోకలను నిషేధించారు. ఈ ప్రాంతం జగిత్యాల జిల్లా కిందకు వచ్చింది. గతేడాదిగా ఈ మార్గం గుండా ప్రయాణాలు సాగించాలని స్థానిక అధికారులు డ్రైవర్లకు ఆదేశాలు జారీ చేశారు. కేవలం దూరం తగ్గుతుంది.. టార్గెట్ పెరుగుతుంది.. వీలైనంత మంది ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించుకోవచ్చన్న అత్యుత్సాహమే ఇంతమంది ప్రాణాలు బలితీసుకుంది. బస్సుల ప్రమాదాలు... సురక్షిత ప్రయాణానికి చిరునామాగా ఉన్న ఆర్టీసీ బస్సులు కొంతకాలంగా తీవ్ర ప్రమాదాలకు హేతువులుగా నిలుస్తుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా జరిగిన కొండగట్టు ప్రమాదం ఏకంగా ఆర్టీసీ చరిత్రలోనే అత్యధిక మందిని బలితీసుకున్న విషాదకర దుర్ఘటనగా నిలిచిపోయింది. గతంలో జరిగిన ఘటనలు.. - 2013 అక్టోబర్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పాలెం వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో 45 మంది దుర్మరణం చెందారు. - 2018 మే 26 సిద్దిపేట జిల్లా రిమ్మనగూడ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 16 మంది చనిపోయారు. - 2018 మే 29 కరీంనగర్ సమీపంలోని మానకొండూరు (చెంజర్ల) వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు చనిపోయారు. - 2018 సెప్టెంబర్ 10న గచ్చిబౌలిలో ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు ప్రయాణికులు మరణం. కొండగట్టు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి .. సాక్షి, న్యూఢిల్లీ: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంపై భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ మేరకు తెలుగులో ప్రకటన వెలువడింది. ‘కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు, గాయపడిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం క్షతగాత్రులను ఆదుకుంటున్నదని ఆశిస్తున్నాను’అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన చేశారు. ప్రమాదాన్ని మాటల్లో చెప్పలేని విషాదకర దుర్ఘటనగా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గవర్నర్ సంతాపం.. కొండగట్టు బస్సు ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన కలచి వేసిందని పేర్కొన్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే జగిత్యాల జిల్లా కలెక్టర్తో గవర్నర్ మాట్లాడారు. తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని, వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సీఎం కేసీఆర్ తీవ్ర విచారం.. సాక్షి, హైదరాబాద్: కొండగట్టు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగడం, పలువురు తీవ్రంగా గాయపడటంపై సీఎం ఆవేదన చెందారు. వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని, గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కొండగట్టు రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. అమ్మను చూపించరా.. గాయపడిన అమ్మ ఓ చోట.. చనిపోయిన కొడుకు మరో చోట. ‘నేను చని పోయినా ఫర్వాలేదు.. నా కొడుకును బతికించండి’ అంటూ ఓ తల్లి రోదన. ‘నాకు మా అమ్మను చూడా లని ఉంది. ఒక్కసారి చూపించండి అంకుల్’ అంటూ గాయాలతో డాక్టర్ను వేడుకుంటున్న ఐదేళ్ల చిన్నారి. రోదనలు.. వేదనలు.. ఆప్తుల ఆర్త నాదాలు.. జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో ఎటు చూసినా ఇదే పరిస్థితి. కాలు తెగిపోయిన ఓ వృద్ధురాలు.. చేయి విరిగిన ఓ యువతి, తలకు తీవ్రగాయాలై రక్తం, వాంతులతో మాట్లాడలేని స్థితిలో వృద్ధుడు, ఒకే కుటుంబంలో అందరూ చనిపోవడం, నిండు గర్భిణులు మృత్యువాత పడటం, ఆసుపత్రి మంచం మీద పడుకోబెట్టగానే చనిపోయిన మహిళలు.. అన్నీ కన్నీరు తెప్పించే దృశ్యాలే. మనసును మెలిపెట్టే సన్నివేశాలే. మృతులు, క్షతగాత్రుల బంధువులు వేల సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని తమ వారి కోసం వెతుకు తుండటం కనిపించింది. తమతో పాటే బస్సెక్కిన వారు ఏమయ్యారో తెలియదు.. ఎవరు చని పోయారో.. ఎవరో బతికున్నారో చెప్పేవారు కూడా లేని దుస్థితి. కలసిన వారినల్లా ‘సార్.. మా అమ్మ ఎక్కడుంది, మా అయ్య ఎక్కడున్నడు’ అంటూ రోదిస్తూ అడగడం కనిపించింది. ఉద్యోగం వచ్చిందని అమ్మకు చెప్పేందుకు వచ్చి.. హిమ్మత్రావుపేట గ్రామా నికి చెందిన పడిగెల స్నేహ లత ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. వెంటనే ఉద్యోగం సంపాదిం చింది. ఇంటి వద్ద ఉన్న తల్లిదండ్రులకు ఉద్యోగం వచ్చిందని చెప్పి, తిరిగి బస్సులో వెళ్తూ మృతువాత పడింది. ఎప్పుడైనా వాళ్ల నాన్న దొంగలమర్రి వద్ద దించుతుండేవాడు. కాని తండ్రి వ్యవసాయ పను లకు పోవడంతో, ‘‘బస్సులో వెళ్తా. కొండగట్టు కింద దిగి హైదరాబాద్కు వెళ్తా’’ అని ఇంట్లో చెప్పిన కొద్ది నిమిషాలకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. డెలివరీ కోసం వస్తూ.. శనివారంపేటకు చెందిన ఎండ్రికాయల సుమలత నిండు గర్భిణి. డాక్టర్లు ఆమెకు బుధవారం డెలివరీ చేస్తామని చెప్పారు. దీంతో అత్త ఎండ్రికాయల వెంకవ్వ, కోనాపూర్కు చెందిన తల్లి ఎండ్రికాయల భూలక్ష్మితో కలిసి బస్సు ఎక్కింది. ప్రమాదంలో గర్భిణితోపాటు అత్త, తల్లి కూడా మృత్యువాత పడ్డారు. పెళ్లయిన 9 నెలలకే.. శనివారంపేటకు చెందిన నామల మౌనికది చిన్న వయస్సే. పెళ్లి జరిగి 9 నెలలే అవుతోంది. ప్రస్తుతం మౌనిక 7 నెలల గర్భిణి. డాక్టర్కు చూపించుకునేందుకు జగిత్యాలకు వెళ్తూ ప్రమాదంలో కన్నుమూసింది. బంధువులు ఆసుపత్రిలో ఉన్నారని.. బంధువులు జగిత్యాల అసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో, వారిని చూసేందుకు బస్సులో వస్తూ డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన గాజుల రాజవ్వ, గాజుల చిన్నయ్య మృత్యువాత పడ్డారు. దీంతో పరామర్శకని వచ్చి.. విగతజీవులుగా ఆస్పత్రికి చేరుకున్నారని బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. అమ్మను ఆసుపత్రిలో చూయించేందుకు వస్తూ.. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన సామకూర మల్లవ్వ తన తల్లికి అనారోగ్యానికి గురైంది. జగిత్యాల ఆసుపత్రిలో చూయించేందుకు తల్లితో కలిసి బస్సులో వస్తూ మృత్యువాత పడింది. తల్లి మాత్రం కూతురు కోసం ఆసుపత్రిలో వేచి చూస్తోంది. మధ్యాహ్న భోజన డబ్బు కోసం వెళ్తూ.. సండ్రళ్లపల్లికి చెందిన ఎల్లవ్వ.. గ్రామ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తోంది. మధ్యాహ్న భోజన డబ్బుల కోసం మల్యాల మండలంలోని బ్యాంకుకు వస్తూ బస్సు ప్రమాదంలో మృత్యువాత పడింది. బిడ్డకు జ్వరం వచ్చిందని.. డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన లైశెట్టి చంద్రకళ కూతురు హైదరాబాద్లో పీజీ చదువుతోంది. బిడ్డకు జ్వరం రావడంతో జగిత్యాల ఆసుపత్రిలో చూపిస్తానని చెప్పింది. దీంతో బిడ్డ నేరుగా జగిత్యాలకు రాగా, తల్లి చంద్రకళ బస్సులో జగిత్యాలకు వెళ్తూ ప్రమాదంలో మృత్యువాత పడింది. దీంతో తల్లిపై పడి కూతురు రోదిస్తున్న తీరు కలచివేసింది. కళ్లద్దాలు తీసుకుందామని.. శనివారంపేటకు చెందిన బొల్లారపు బాపుకు ఇటీవల కళ్లు సరిగ్గా కనిపించడం లేదు. జగిత్యాల కంటి ఆసుపత్రిలో చూయించుకుని కళ్ల అద్దాలు తీసుకువెళ్దామని చెప్పి బస్సులో జగిత్యాల బయలు దేరి మృత్యువాత పడ్డాడు. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చి.. రాంసాగర్కు చెందిన ద్యాగల ఆనందం.. ఫ్యాన్ చెడిపోవడంతో జగిత్యాలలో బాగు చేయిస్తామని చెప్పి, ఫ్యాన్ను తీసుకుని బస్సులో వెళ్తూ మృత్యువాత పడ్డారు. నూనె పట్టించుకోవడానికి వచ్చి.. హిమ్మత్రావుపేట గ్రామానికి చెందిన గండి లక్ష్మి.. పల్లి నూనె పట్టించుకోవడానికి, పల్లీలు తీసుకుని జగిత్యాల బస్సు ఎక్కింది. ప్రమాదంలో మృతిచెందింది. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: సోమారపు ప్రమాదం జరగడం విషాదకరమని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పేర్కొ న్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం ఇప్పటికే రూ.5 లక్షలు ప్రకటించిందని, ఆర్టీసీ తరఫున మరో రూ.3 లక్షలు ఇప్పిస్తామన్నారు. కోర్టు ఆదేశిస్తే.. రూ.15 నుంచి 20 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పా రు. సిబ్బంది లేకపోవడం వల్లే డ్రైవ ర్లకు ఓవర్ డ్యూటీలు ఇస్తున్నామని, రద్దీని బట్టి అధిక డ్యూటీలు ఇస్తు న్నాం తప్ప మరో ఉద్దేశం లేదన్నారు. ఉత్తమ డ్రైవర్గా అవార్డు.. బస్సు సామర్థ్యం పరంగా అన్ని పరీక్షలు పూర్తిచేసుకుంది. 3 నెలలకోసారి చేసే పరీక్షల్లో భాగంగా ఆగస్టు 9న ఈ బస్సుకు చివరిసారి అన్ని పరీక్షలు పూర్తి చేశారు. బస్సు డ్రైవర్ శ్రీనివాస్ ఉత్తమ డ్రైవర్గా అవార్డు అందుకున్నాడు. జగిత్యాల డిపో బాధ్యతలు చూస్తున్న డీఎం హనుమంతరావు కూడా ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్నాడు. మరి తప్పు ఎక్కడ జరిగింది? అన్న చర్చ ఇప్పుడు ఆర్టీసీలో జరుగుతోంది. 52 సీట్ల సామర్థ్యం ఉన్న బస్సులో ఏకంగా 100 మందిని ఎక్కించుకునేలా కండక్టర్లకు టార్గెట్లు పెట్టిన అధికారులదే ఈ పాపం అని ఆర్టీసీ ఉద్యోగులు, స్థానికులు, బాధితుల బంధువులు మండిపడుతున్నారు. పట్టుమని 10 మీటర్ల లోతులేని గోతిలో పడి ఏకంగా 57 మంది దుర్మరణం చెందడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రమాదం జరిగిన మూలమలుపు వద్ద ప్రయాణికులంతా డ్రైవర్ మీద పడేసరికి బస్సు అదుపుతప్పి గోతిలో పడింది. ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం.. కొండగట్టు వద్ద బస్సు లోయలో పడిన ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృతిచెందడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు. రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కొండగట్టు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రూ.25 వేలు ప్రకటించిన ఎల్.రమణ బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు అందిస్తామని రమణ ప్రకటించారు. ఘటనకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కన్నవారి కలలు కల్లలు కొడిమ్యాల: కొండగట్టు ప్రమాదంలో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువతీ, యువకులు తనువు చాలించారు. మండలంలోని హిమ్మత్రావు పేటకు చెందిన మల్యాల అనిల్ (19) జగిత్యాల లోని ఎన్ఎస్వీ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. మంగళవారం కళాశాలకు బయల్దేరిన అనిల్ బస్సు ప్రమాదంలో మృతిచెందాడు. ఇదే గ్రామానికి చెందిన పడిగెల స్నేహలత (19) హైదరాబాద్లో పాలిటెక్నిక్ పూర్తి చేసి ఆరు నెలలుగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. కింది కొండగట్టు వరకు వెళ్లి, అక్కడినుండి కరీంనగర్ వెళ్లేందుకు బస్సు ఎక్కింది. ప్రమాదంలో తుదిశ్వాస విడిచి, కన్నవారికి తీరని శోకం మిగిల్చింది. రాంపల్లిలో విషాదం పెద్దపల్లిరూరల్: కొండగట్టు వద్ద మంగళ వారం ఆర్టీసీ బస్సు లోయలో పడ్డ ఘటన పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రాంపల్లి గ్రామానికి చెందిన రెండు కుటుం బాలకు చెందిన 8మంది ఈ ప్రమాదం బారిన పడ్డారు. దురదృష్టవశాత్తు వారిలో నలుగురు మృత్యు వాత పడ్డారు. రాంపల్లికి చెందిన బొంగాని నారాయణ, ఆయన భార్య స్వప్న, కుమారులు రాంచరణ్, పర్శరాములు, తల్లి భూమక్క, చేగుర్తి నుంచి వచ్చిన అత్త బాలసాని రాజేశ్వరీలతో పాటు సమీప బంధువులైన బొంగాని మధునయ్య, మధునమ్మ దంపతులు శనివారం సాయం త్రం దైవదర్శనానికి బయల్దేరారు. కొమురవెల్లి, వేముల వాడ, కొండగట్టు దేవాలయాల్లో మొక్కులు సమర్పించు కుని మంగళవారం తిరుగుపయనమయ్యారు. కొద్దిసేపట్లో దిగుతామనుకునే లోపే తాము ఎక్కిన బస్సు ప్రమాదానికి గురై బొంగాని మధునయ్య (54), బొంగాని భూమక్క (50), బాలసాని రాజేశ్వరి (48), రాంచరణ్ (12)లు అక్కడికక్కడే మరణించారు. బొంగాని నారాయణ, స్వప్న, పర్శరామలు, మధునమ్మలు తీవ్ర గాయాలతో కరీంనగర్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వచ్చెవారం పోయిన బాగుండు.. ‘అమవాస్య అయితంది.. మల్లొచ్చే వారం పోతమన్నరు.. ఏమైందో ఏమో శని వారమే బయల్దేరి పోయిండ్రు. వచ్చే వారం పోయినా బతుకుదురు. దేవుని మొక్కులు అప్పజెప్పెతందుకు పోయి దేవుని దగ్గరనే ఉండిపోయిండ్రు’ – బొంగాని చిలకమ్మ, రాంపల్లి సహాయక చర్యల్లో పాల్గొనండి: రాహుల్ కొండగట్టు ప్రమాదంలో 57 మంది మృత్యువాతపడటం పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. ప్రమాదంలో గాయపడిన, మృతిచెందిన కుటుంబాలకు సహాయక చర్యలు అందించాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిం చాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని అత్యంత సీరియస్గా పరిగణించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
ఇంత నిర్లక్ష్యమా?!
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ‘ప్రగతి రథం–ప్రజల నేస్తం’ లోగోతో ఉంటాయి. ‘ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, క్షేమకరం’ అన్న నినాదాలకు కూడా కొదవలేదు. కానీ జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద మంగళవారం చోటుచేసుకున్న ప్రమాదంలో కనీవినీ ఎరుగని రీతిలో 57మంది ప్రయాణీకులు బలైపోయారు. దుర్ఘటన జరిగిన సమయంలో బస్సులో చిన్న పిల్లలతోసహా 102మంది ప్రయాణికులున్నారని చెబుతున్నారు. అనేకులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. మన రహదారుల వాలకం చూస్తున్నా, వాటిపై ప్రతి క్షణం పరుగులు తీసే వాహనాల తీరును గమనిస్తున్నా ఇంటి నుంచి బయటికెళ్లినవారు క్షేమంగా తిరిగొస్తారన్న గ్యారెంటీ ఉండటం లేదు. కానీ మంగళవారంనాటి ప్రమాదం అన్నిటినీ తలదన్నింది. బస్సులో డ్రైవర్తోసహా 51మంది ప్రయాణికులకు మించరాదన్న నిబంధన ఉండగా ఈ వాహనంలో అంతకు రెట్టింపు సంఖ్యలో ఎలా ఉన్నారన్న సందేహం తలెత్తుతోంది. ఇది చాలదన్నట్టు ప్రమాద సమయానికి అది పెను వేగంతో వెళ్తున్నదని గాయపడినవారిలో కొందరు చెబుతున్నారు. ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉన్న బస్సును వేగంగా పోనిస్తూ మలుపు తిప్పితే అందరూ అటువైపు ఒరిగిపోతారు. దాంతో బరువు ఒకవైపే పడి బస్సు అదుపు తప్పి ఉండొచ్చునన్నది నిపుణులు చెబుతున్న మాట. అంటే బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండకపోతే ప్రమాదానికి ఆస్కారం ఉండేది కాదు. కనీసం ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసేవి కాదు. మృతుల్లో చాలామంది ఊపిరాడక చనిపోవ డాన్ని గమనిస్తే ఈ సంగతి అర్ధమవుతుంది. కొండగట్టులో కొలువైన ఆంజనేయుడి దర్శనం కోసం భారీ సంఖ్యలో అక్కడికి భక్తులు వెళ్తుం టారు. మంగళవారాలు ఈ రద్దీ మరింత అధికం. ఇటువంటి మార్గాల్లో సాధారణ ప్రజలకు రవాణా సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ ఇటీవలికాలంలో దాన్ని గాలికొదిలేస్తు న్నారు. ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థగా కాక ప్రైవేటు సంస్థ మాదిరిగా వ్యవహరిస్తోంది. అధికా దాయం లభించే రూట్లలో తక్కువ బస్సులతో ఎక్కువ ఆదాయం రాబట్టడం ఎలా అన్నదే దానికి ప్రధానమైపోయింది. అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కంట్రోలర్లను నియమిస్తే ప్రయాణికుల సంఖ్యను గమనించి వారు డిపో మేనేజర్కు వర్తమానం పంపే వీలుంటుంది. అలాంటపుడు అవసర మనుకున్నప్పుడు అదనపు బస్సుల్ని పంపే అవకాశం ఏర్పడుతుంది. కానీ డిపో నుంచి బయల్దేరిన బస్సు ఎలా ఉందో, డ్రైవర్ పరిస్థితేమిటో, అది వెళ్లిన రూట్లో రద్దీ ఎలా ఉందో గమనించే నాథుడు లేకుండా పోయాడు. బస్సులుంటే సరిపోదు. తగినంతమంది డ్రైవర్లుండాలి. కానీ ఆ రెండు విషయా ల్లోనూ ఆర్టీసీ తీసికట్టే. రిటైరవుతున్నవారి స్థానంలో కొత్తవారిని తీసుకోవటం లేదని, ఉన్నవారితోనే అదనపు గంటలు పనిచేయిస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. ఒక డ్రైవరు ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉండగా, కనీసం అయిదారు గంటలు అదనంగా పనిచేయకతప్పడం లేదని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. అలాగే బస్సుల ఫిట్నెస్ గురించి పట్టడం లేదని చెబుతున్నాయి. ఇలాంటి పరి స్థితులు డ్రైవర్లపై ఒత్తిళ్లు పెంచుతున్నాయి. ఇటు బస్సు రావటంలో జాప్యం జరిగితే ప్రయాణికుల్లో అసహనం, ఆత్రుత పెరుగుతాయి. వచ్చిన బస్సు ఎక్కకపోతే వేరే బస్సు రావటానికి మరెంత సమయం పడుతుందోనన్న ఆందోళన వారిని ఆవహిస్తుంది. దాంతో కష్టమైనా, ఎంతో అసౌకర్యంగా ఉన్నా వచ్చిన బస్సే ఎక్కడానికి ప్రయత్నిస్తారు. లాభాలు ఆర్జించి కోట్లకు పడగెత్తాలన్న దురాశతో ప్రైవేటు సంస్థలు గతంలో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడాయి. కనుకనే అప్పట్లో బస్సు రూట్ల జాతీయం కోసం అందరూ డిమాండు చేసేవారు. కానీ ఇప్పుడు యూనియన్లు, సిబ్బంది చెబు తున్న మాటలు వింటుంటే ఆర్టీసీ కూడా అదే రూట్లో వెళ్తోందన్న భావన కలుగుతుంది. ప్రమాదం సంభవించిన బస్సును నడిపిన డ్రైవర్ శ్రీనివాస్కు మంచి పేరుంది. నెలక్రితం ఆయనకు అవార్డు కూడా వచ్చింది. మద్యం అలవాటు లేదంటున్నారు. ఇన్ని అనుకూలాంశాలు కూడా ఒక పెను ప్రమాదాన్ని నివారించలేకపోయాయి. ప్రమాదం సమయానికి బస్సు వేగంగా వెళ్తున్నదని బస్సులోని ప్రయాణికులతోపాటు బయటివారు కూడా చెబుతున్నారు. ఒకటి రెండు వాహనాలను ఓవర్ టేక్ చేయడంతోపాటు ప్రమాదం జరగడానికి ముందు బస్సు ఒక ఆటోను ఒరుసుకుంటూ పోయింది. దీన్నంతటిని గమనిస్తే బ్రేకులు విఫలం కావడం వల్ల డ్రైవర్ బస్సుపై అదుపు కోల్పోయాడా అన్న అనుమానం తలెత్తుతోంది. ఈ బస్సు ఇంతక్రితం వేరే డిపోలో ఎక్స్ ప్రెస్గా తిరిగి ఇప్పుడు పల్లె వెలుగు బస్సుగా రూపు మార్చుకుని వచ్చిందంటున్నారు. పైగా 8 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సును తక్కుగా పరిగణించి పక్కన పడేసే నిబంధనను మూడేళ్లక్రితం సవ రించి దాన్ని 10 లక్షల కిలోమీటర్లకు పెంచారని చెబుతున్నారు. చిత్రమేమంటే ఇప్పుడు ప్రమాదానికి గురైన బస్సు ఆ పరిమితిని కూడా దాటిపోయి, రెండు నెలలక్రితమే 20 లక్షల కిలోమీటర్ల స్థాయికి చేరుకుందని అంటున్నారు. అలాంటి బస్సుకు రంగులద్ది, మరమ్మతులు చేసి రోడ్డెక్కించిన పాపం ఎవరిదో, అసలు పాత నిబంధనలను ఎవరు ఏ ప్రాతిపదికన సవరించారో తేలాలి. ఇంకా దారుణ మేమంటే ఇలాంటి డొక్కు బస్సులు జగిత్యాల డిపోలోనే మరో 20 ఉన్నాయంటున్నారు. ఇతర డిపోల్లో ఎన్ని ఉన్నాయో కూడా లెక్క తీయాలి. వాటిని తక్కుగా పరిగణించాలి. అలాగే ఇప్పుడు ప్రమాదం జరిగిన రోడ్డు నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపాలున్నాయని గుర్తించారని, అందువల్లే ద్విచక్ర వాహనాలు తప్ప వేరే వాహనాలు వెళ్లకూడదన్న నిబంధన మొన్నటివరకూ ఉండేదని చెబుతున్నారు. ఆ నిబంధన మారిందా లేక జగిత్యాల డిపో అధికారులు అధికాదాయానికి ఆశ పడి దాన్ని ఉల్లంఘించారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా సాధారణ పౌరుల ప్రాణాలు గడ్డిపోచతో సమానమని కొండగట్టు ఘాట్ రోడ్డు దుర్ఘటన నిరూపించింది. ఇది సహించరాని నిర్లక్ష్యం. -
ఆజాద్ రాష్ట్ర పర్యటన వాయిదా
సాక్షి, హైదరాబాద్: కొండగట్టు ప్రమాద నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ తెలంగాణ పర్యటన వాయిదా పడిందని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఆయన బుధవారం ఉదయం హైదరాబాద్కు వచ్చి, సాయంత్రం సంగారెడ్డిలో జరిగే మైనార్టీ సభలో పాల్గొనాల్సి ఉంది. అనంతరం రాత్రి హైదరాబాద్లోనే బసచేసి గురువారం ఉదయ్పూర్ వెళ్లాల్సి ఉంది. అకస్మాత్తుగా ఈ ప్రమాదం జరిగి 57 మంది మృతి చెందడంతో పర్యటనను వాయిదా వేసుకున్నారు. అయితే సంగారెడ్డిలో జరిగే మైనార్టీ సభ మాత్రం యథావిధిగా జరగనుంది. ఇక ఈ నెల 18న ఆజాద్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. నేడు కొండగట్టుకు టీపీసీసీ బృందం కొండగట్టు ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన వారిని పరామర్శించేందుకు కాంగ్రెస్ బృందం బుధవారం కరీంనగర్ జిల్లాకు వెళ్లనుంది. -
‘ఉత్తమ డ్రైవర్’ గా అవార్డు.. అంతలోనే విషాదం
సాక్షి, జగిత్యాల : కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 57 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాస్ కూడా దుర్మరణం పాలయ్యాడు. అయితే శ్రీనివాస్కు ఆగస్టు 15న ఉత్తమ డ్రైవర్గా అవార్డు దక్కింది. అయితే అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొడిమ్యాల మండలంలోని ఏడు గ్రామాలకు చెందిన 45 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లా రాంపల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
రోడ్ టెర్రర్
-
ప్రభుత్వం రూ.5 లక్షలు, ఆర్టీసీ రూ.3 లక్షలు
సాక్షి, కొండగట్టు : ఆర్టీసీ బస్సు చరిత్రలోనే ఘోర ప్రమాదం. జగిత్యాల జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు 25 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 57 మంది దుర్మరణం పాలయ్యారు. 33 మంది గాయాలు పాలయ్యారు. ప్రమాదం సంభవించిన సమయంలో 88 మంది ఆ బస్సులో ఉన్నట్టు తెలిసింది. బస్సుల్లో ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో, మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో కొండ ప్రాంతమంతా ఆక్రందనలతో మిన్నంటింది. ఆర్టీసీ తప్పిదం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు మండిపడుతున్నారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్గ్రేసియా ప్రకటించింది. ఆర్టీసీ తరుఫున కూడా మృతులకు రూ.3 లక్షల ఎక్స్గ్రేసియా అందించనున్నట్టు ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ తెలిపారు. చనిపోయిన వారిలో రైతులు ఉంటే నష్టపరిహారంతో పాటు రైతు బీమా వర్తింపజేస్తామని ఆర్థిక శాఖ ఆపద్ధర్మ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఎక్స్గ్రేషియాతో పాటు టీఆర్ఎస్ సభ్యత్వం ఉన్నవారికి రూ.2 లక్షలు అదనంగా ఇస్తామన్నారు. దీంతో మృతుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల సహాయం అందేలా చూస్తామని ఈటెల హామీ ఇచ్చారు. గాయపడ్డ వారందరికీ పూర్తిస్థాయిలో చికిత్స ప్రభుత్వమే అందిస్తుందన్నారు. ప్రమాదం సంభవించిన స్థలిని ఆపద్ధర్మ మంత్రులు మహేందర్ రెడ్డి, కేటీఆర్, ఎంపీ కవిత సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రయాణికులను మంత్రులు పరామర్శించారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ జరిపిస్తామని, మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగిత్యాల డిపో మేనేజర్ హనుమంతరావును సస్పెండ్ చేసినట్టు తెలిపారు. గాయపడిన వారికి ప్రభుత్వం తరుఫున అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. -
‘ఆర్టీసీ తప్పిదం వల్లే ప్రమాదం జరిగింది’
సాక్షి, కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి ఆర్టీసీ, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణమని వారు మండిపడుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు సాక్షితో మాట్లాడుతూ.. ‘ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. శనివారంపేట నుంచి జగిత్యాల వెళ్లే ఆర్టీసీ బస్సులు మాములుగా దొంగలమర్రి, నాచుపల్లి మీదుగా వెళ్లాలి. కానీ గత పది రోజులుగా బస్సులు కొండగట్టు ఘాట్ రోడ్డు మీదుగా వెళ్తున్నాయి. ప్రమాదం జరిగిన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండటం, బస్సు కండీషన్లో లేకపోవడం ప్రమాదానికి ఒక కారణం అయి ఉండొచ్చు. మూల మలుపు వద్ద బస్సు అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగింది. మేము ఇక్కడికి చేరుకున్నప్పుడు ఇరవై మంది మృతి చెందారు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం, ఆర్టీసీ తప్పిదం వల్లే జరిగింద’ ని తెలిపారు. ‘ఈ రూట్లో అసలు బస్సును నడపాల్సింది కాదు. దీనికి కారణమైన జగిత్యాల డిపో మేనేజర్, ఆర్టీసీ డీఎంపై చర్యలు తీసుకోవాలి. ఈ రోడ్డుపై గతంలో లారీ ప్రమాదం జరిగిందని.. అయినా ఘాట్ రోడ్డు భద్రతపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాల’ని స్థానికులు కోరుతున్నారు. కాగా ఈ ప్రమాదంలో 55మంది మృతి చెందారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. -
బస్సు ప్రమాదం: జగిత్యాల ఆస్పత్రి వద్ద తీవ్ర విషాదఛాయలు!
-
ఆర్టీసి చరిత్రలో అతి పెద్ద బస్సు ప్రమాదాలు
-
దేశంలో అతి పెద్ద బస్సు ప్రమాదాలు
సాక్షి, హైదరాబాద్ : జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ వద్ద జరిగిన ఆర్టీసి బస్సు ప్రమాదంలో 50 మంది దుర్మరణం పాలైన విషయంతెలిసిందే. కొండగట్టు బస్సు ప్రమాదం దేశ చరిత్ర అతిపెద్ద ప్రమాదం. ఇంత వరకు ఇంత పెద్ద ప్రాణ నష్టం జరిగిన బస్సు ప్రమాదం దేశంలో ఎక్కడా జరగలేదు. ఈ సందర్భంగా దేశంలో జరిగిన అతిపెద్ద రోడ్డు ప్రమాదాల వివరాలు ఒక సారి పరిశీలిద్దాం. తెలంగాణ జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ వద్ద జరిగిన ఆర్టీసి బస్సు ప్రమాదంలో 50 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో మరింత మంది ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్ సిమ్లా వద్ద బస్సు లోయలో పడిపోవడంతో 51 మంది ప్రయాణికులు మరణించారు. 15మందికిపైగా ప్రయాణికులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. హిమాచల్ ప్రదేశ్లో రోడ్డు చాలా వరకు ఘాట్ రోడ్డు ఉండడంతో పెద్ద ప్రమాదాలే జరిగాయి. జమ్మూ కశ్మీర్ కశ్మీర్లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 51 మంది మరణించారు. మరికొంత మంది ఆచూకి లభించలేదు. గుజరాత్ గుజరాత్లోని వడోదరలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 47 మంది దుర్మరణం పాలైయ్యారు. గుజరాత్ చరిత్రలో ఇదే అతిపెద్ద రోడ్డు ప్రమాదం. తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద సంభవించిన బస్సు ప్రమాదంలో 45 మంది సజీవదహనం. బస్సు కల్వర్డును ఢీ కొట్టడంతో పెట్రోల్ ట్యాంక్ లీకవ్వడంతో సెకన్లపాటు సమయంలోనే బస్సులో పూర్తిగా మంటలు వ్యాపించడంతో 45 మంది సజీవదహనమయ్యారు. జమ్మూ కశ్మీర్ జమ్మూ కశ్మీర్లో 2008లో జరిగిన బస్సు ప్రమాదంలో 44 మంది మృతి చెందారు. 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు 370 మీటర్ల ఎత్తునుంచి చినాబ్ నదిలోకి పడిపోవడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఇలాంటి ప్రమాదాల కశ్మీర్లో చాలానే జరిగాయి. లోయప్రాంతం కావడంతో ప్రయాదాలు జరగడం సాధారణంగా మారింది. మహారాష్ట్రా మహారాష్ట్రాలో 2008లో జరిగిన బస్సు ప్రమాదంలో 39 మంది ప్రయాణికులు మరణించారు. నాసిన్కు భక్తులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 39 మంది భక్తులు చనిపోగా.. 40 మంది గాయాలతో బయటపడ్డారు. ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో జరిగిన బస్సు ప్రమాదంలో 36 మంది భక్తులు మరణించారు. నేపాల్కి చెందిన భక్తులు ప్రైవేటు వాహనంలో వెళ్తుండగా బస్సు ఆలకనందా నదిలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ మూసాయిపేట వద్ద జరిగిన బస్సు-రైలు ప్రమాదంలో 26 మంది స్కూల్ విద్యార్ధులు మృతి చెందారు. ప్రమాదంలో చనిపోయినవారంతా పది నుంచి పదిహేనేళ్లలోపు వారే. బస్సు పాఠశాలకు వెళ్తుండగా రైల్వే లెవలింగ్ క్రాస్ లేకపోవడంతో ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్లో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మరణించారు. బస్సు కొండపై నుంచి లోయలోకి పడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బిహార్లో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మృతి చెందారు. -
కొండగట్టు బస్సు ప్రమాదం; మృతుల వివరాలు
సాక్షి, కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 57 మంది మృతిచెందారు. ఆర్టీసీ, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 88 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ప్రమాదంలో గాయపడ్డ వారికి జగిత్యాల, కరీంనగర్లలో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో మహిళలు అధికంగా ఉన్నారు. మృతుల వివరాలు: 1. నామాల మౌనిక (23), శనివారంపేట 2. బైరి రిత్విక్(3), రామసాగర్ 3. పోలు లక్ష్మి(50), హిమ్మత్ రావుపేట 4. చెర్ల లక్ష్మి (45), హిమ్మత్ రావుపేట 5. గండి లక్ష్మీ (60), శనివారంపేట 6. డబ్బు అమ్మయి(50) D/o తిమ్మయ్య, డబ్బు తిమ్మయ్యపల్లి 7. బండపల్లి చిలుకవ్వ(76) 8. గోలి అమ్మాయి(44), శనివారంపేట 9. తిప్పర్తి వెంకటరత్నం(56), తిరుమలాపూర్ 10. కంకణాల ఎల్లవ్వ(70), సండ్రలపల్లి 11. లాంబ కిష్టయ్య(65), హిమ్మత్ రావుపేట 12. బందం లస్మవ్వ (65) ముత్యంపేట 13. బొల్లారం బాబు (54), శనివారంపేట 14. లైసెట్టి చంద్రకళ (45), శనివారంపేట 15. ఎండ్రికాల ఎంకవ్వ, శనివారంపేట 16.ఎండ్రికాల సుమ(30), శనివారంపేట 17. ర్యాగాల రాజవ్వ (56), డబ్బు తిమ్మయ్యపల్లి 18. ఉత్తమ్ నందిని , కోనాపూర్ 19. మల్యాల అనిల్(19), హిమ్మత్ రావుపేట 20. గాజుల చిన్నయ్య (60), s/o హన్మంతు, డబ్బు తిమ్మయ్యపల్లి 21. శామకూరా మల్లవ్వ (38), తిర్మలాపూర్ 22. సలేంద్ర వరలక్ష్మి (28), శనివారంపేట 23. కుంబాల సునంద (45), శనివారంపేట 24. గుడిసె రాజవ్వ (50), శనివారంపేట 25. పందిరి సత్తెవ్వ (75), హిమ్మత్ రావుపేట 26. దాసరి సుశీల (55), తిరుమలపూర్ 27. డ్యాగల ఆనందం(55), రామసాగర్ 28. నేదునూరి మదనవ్వ(75), హిమ్మత్ రావుపేట 29. చెర్ల హేమా(30), హిమ్మత్ రావుపేట 30. పిడుగు రాజిరెడ్డి(55), డబ్బు తిమ్మయ్యపల్లి 31. చెర్ల గంగయ్య(75), శనివారం పేట 32. ఒడ్నాల లస్మవ్వా (48), తిమ్మయ్యపల్లి 33. ఒడ్నాల కాశిరం(55), తిమ్మయ్యపల్లి 34. గోల్కొండ లచవ్వ(51), డబ్బు తిమ్మయ్యపల్లి 35. గోల్కొండ దేవయ్య (63), డబ్బు తిమ్మయ్యపల్లి 36.కొండ అరుణ్ సాయి(5), కోరెం 37. బొంగని మదునయ్య(55), రాంపెల్లి 38. ఓత్యం భూలక్మి(40), కొనపూర్ 39. సోమిడి పుష్ప(45), తిర్మల్పూర్ 40. బొంగోని భూమక్క(55), పెద్దపల్లి 41. వేముల భాగ్యవ్వ(50), హిమ్మత్ రావుపేట 42. బాలసాని రాజేశ్వరి(40), రేకుర్తి 43. తిరుమాని ముత్తయ్య(40), రామసాగర్ 44. బొంగోని రాంచరణ్ (09), రాంపెల్లి 45. చిర్రం పూజిత (15, జగిత్యాల 46. ఆరె మల్లయ్య, హిమ్మత్ రావుపేట 47. మేడి చెలిమల రాజేషం (70), రాంసాగర్ 48. చెర్ల మౌనిక (24), రాంసాగర్ 49. డ్రైవర్ శ్రీనివాస్ (ఆర్టీసీ డ్రైవర్) 50. మేడి చెలిమల గౌరీ (48), రాంసాగర్ 51.పడిగెల స్నేహలత (22), హిమ్మత్రావుపేట 52. డ్యాగల స్వామి (32), రాంసాగర్ 53. గాజుల శ్రీహర్ష (02), శనివారంపేట 54. తైదల పుష్ప (40), తిర్మలాపూర్ 55. పుండ్రా లలిత (36), డబ్బు తిమ్మాయిపల్లి 56. పోతుగంటి జ్యోత్స్నా (27), మల్యాల 57. గోలి రాజమల్లు (60), శనివారంపేట -
అప్డేట్స్: బస్సులో మొత్తం 101 మంది.. 60 మంది దుర్మరణం..!
సాక్షి, కొండగట్టు : జగిత్యాల జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ ఘాట్ రోడ్డులో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఘోర రోడ్డు ప్రమాదంలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 30పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 101 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారుల సమాచారం. సంఘటనా స్థలానికి బస్సు చేరుకునే సమయానికి కండక్టర్ 82 మందికి టికెట్ ఇచ్చారు. మిగతావారికి టికెట్ ఇవ్వాల్సి ఉంది. అంతలోపే ఈ ఘోరం జరిగిపోయింది. జగిత్యాల జిల్లా శనివారంపేట నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి.. కొండగట్టు ఘాట్ రోడ్డులోయలో పడిపోవడంతో ఈ ప్రదేశంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్... సాయంత్రం 5. 30 గంటలు: కొండగట్టు ఘాట్రోడ్డులో చోటుచేసుకున్న ఘోర బస్సుప్రమాదం కేసులో విచారణ ప్రారంభమైంది. ఈ ఘటన నేపథ్యంలో జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావుపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సాయంత్రం 5. 30 గంటలు: కొండగట్టు ఘాట్రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంఘటనాస్థలాన్ని ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డి, ఎంపీ కవిత పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను అధికారులు వారికి వివరించారు. మృతుల కుటంబాలను ఆదుకుంటామని, గాయపడిన వారికి పూర్తి చికిత్స అందించడంతోపాటు అండగా ఉంటామని కేటీఆర్, మహేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. సాయంత్రం 5.30 గంటలు: కొండగట్టు బస్సుప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. The bus accident in Telangana’s Jagtial district is shocking beyond words. Anguished by the loss of lives. My thoughts and solidarity with the bereaved families. I pray that the injured recover quickly. — Narendra Modi (@narendramodi) 11 September 2018 సాయంత్రం 4.30 గంటలు: కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్లిన తమవారు.. రోడ్డుప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను తరలించిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణ బంధువుల రోదనలతో ఉద్విగ్నంగా మారిపోయింది. ఆస్పత్రి వద్ద తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. తమవారిని మృత్యువు కబళించడంతో.. అయినవారు, ఆత్మీయులు బంధువులు గుండెలు అవిసేలా విలపిస్తున్నారు. ఆస్పత్రి వద్ద మహిళలు గుండెలు బాదుకొని రోదిస్తున్న దృశ్యాలు చూపరులను సైతం కంటతడి పెట్టిస్తున్నాయి. కొండంత విషాదం.. ఎవరిది నిర్లక్ష్యం.. ఎన్నెన్నో ప్రశ్నలు.. చదవండి కొండగట్టు బస్సుప్రమాదంపై పూర్తి కథనాలు అంజన్న భక్తులకు విషాదం ఊపిరాడకపోవడం వల్లే ఎక్కువ మంది మృతి దేశంలో అతి పెద్ద బస్సు ప్రమాదాలు కొండగట్టు బస్సు ప్రమాదం; మృతుల వివరాలు బస్సు ప్రమాదం: అడ్డదారే కొంప ముంచింది! కొండగట్టు ప్రమాదం: డ్రైవర్ తప్పిదం వల్లే? సాయంత్రం 4 గంటలు: కొండగట్టు ఘాట్రోడ్డులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు, గాయపడిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం క్షతగాత్రులను ఆదుకుంటోందని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై తెలుగులో, ఆంగ్లంలో ఆయన ట్వీట్ చేశారసు. తెలంగాణలో జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు మరియు గాయపడిన వారికి నా ప్రఘాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం క్షతగాత్రులను ఆదుకుంటోందని ఆశిస్తున్నాను. — President of India (@rashtrapatibhvn) 11 September 2018 Shocked to learn about the bus accident in Jagtial, Telangana. Thoughts with the bereaved families and those injured. I understand local authorities are making efforts to rescue and help passengers who have suffered #PresidentKovind — President of India (@rashtrapatibhvn) 11 September 2018 మధ్యాహ్నం 3.30 గంటలు: కొండగట్టు బస్సు ప్రమాదం పట్ల నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆమె కోరారు. మధ్యాహం 3 గంటలు: కొండగట్టు వద్ద బస్సు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియాను వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదంలో పసిపిల్లలు కూడా ఉన్నారని, గాయపడిన పిల్లలు అత్యవసరస్థితిలో ఉంటే ఆసుపత్రులు వారిని వెంటనే చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులు పేదవారైతే వారికి అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ తరఫున సహాయం అందిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలు: జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్న మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత, మంత్రి మహేందర్రెడ్డి.. మరికాసేపట్లో హెలికాప్టర్లో వెళ్లనున్న నేతలు -
బస్సు ప్రమాదం: అడ్డదారే కొంప ముంచింది!
సాక్షి, కొండగట్టు : జగిత్యాల జిల్లా కొండగట్టులో చోటుచేసుకున్న ఘోర ప్రమాదానికి ఆర్టీసీ, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. గతంలో ఇదే చోట ఓ లారీ ప్రమాదంలో సుమారు 20 మంది మృతి చెందారు. ఆ తర్వాత ఇంతటి పెద్ద ప్రమాదం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. లారీ ప్రమాదమప్పుడే అధికారులు ఈ ఘాట్ రోడ్డుపైకి భారీ వాహనాలను నిషేదించారు. కేవలం బైక్స్ను మాత్రమే అనుమతించేవారు. దీనికి సంబంధించి హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఈ రోడ్డుకు ప్రత్యామ్నయంగా బైపాస్ రోడ్డు కూడా ఉంది. కానీ గత మూడు నెలల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రయివేట్ వాహనాలను మళ్లీ అనుమతిస్తున్నారు. ఘాట్ రోడ్డు నుంచి హైవేపైకి కిలోమీటర్ దూరం ఉంటుంది. ప్రత్యమ్నాయ రోడ్డు ఉపయోగిస్తే మరో ఐదు కిలోమీటర్లు ఎక్కువగా ప్రయాణించాల్సి వస్తుంది. దీంతోనే ఆర్టీసీ అధికారులు డిజీల్కు కక్కుర్తిపడి బస్సులను షార్ట్కట్గా భావించిన ఘాట్రోడ్డు రూట్లో నడిపిస్తున్నారు. ఘాట్ రోడ్డు నిర్మాణం కూడా ఆర్అండ్బీ నిబంధనలకు విరుద్దంగా ఉందని గతంలోనే అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించారు. ఘాట్ రోడ్డుకు ఇరువైపుల గోడను నిర్మించాలని కూడా నిర్ణయించారు. ఆ గోడ నిర్మాణం చేబడితే ఈ ఘోర ప్రమాధం సంభవించేది కాదని, వారి నిర్లక్ష్యంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు అధికారుల తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 57మంది ప్రాణాలు కోల్పోయారు. -
అంజన్న భక్తులకు విషాదం
సాక్షి, కొండగట్టు : జగిత్యాల జిల్లాలో పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల జిల్లా శనివారంపేట నుంచి బయలు దేరిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు కొండగట్టు ఘాట్ రోడ్డు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కొండగట్టుకు వచ్చిన హనుమాన్ భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం కావడంతో కొండగట్టుకు హనుమాన్ భక్తుల తాకిడి ఎక్కుగా ఉంది. దర్శనం చేసుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో అధిక సంఖ్యలో బస్సెక్కారు. దీంతో ఓవర్లోడైన బస్సు అదుపు తప్పి లోయలో పడ్డట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొండగట్టులో బస్సెక్కిన భక్తులకు కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో మూడు కిలోమీటర్లు దూరం వెళ్తే బస్సు జగిత్యాల హైవే ఎక్కేది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 88 మంది ప్రయాణీకులున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తమ ఇష్టదైవం దగ్గరకు వచ్చిన భక్తులు ఊహించని ప్రమాదంలో మరణించారు. నిమిష నిమిషానికి మృతుల సంఖ్య పెరుగుతోంది. మృతుల్లో అధిక సంఖ్యలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఊపిరాడకనే ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అప్పటివరకు తమతో కలిసి ప్రయాణం చేసిన వారిలో చాలా మంది నిర్జీవులుగా మారడంతో బాధితుల దుఃఖానికి అంతేలేకుండా పోయింది. జగిత్యాల ఆసుపత్రి ప్రాంగణం బాధితుల ఆర్తనాదాలతో దద్దరిల్లుతోంది. -
ఊపిరాడకపోవడం వల్లే ఎక్కువ మంది మృతి
సాక్షి, కొండగట్టు: అంజన్న దర్శనం పూర్తి చేసుకొని మరికొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుతామనుకున్న భక్తుల ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి. ఈ ఘోరప్రమాదంలో 57 మందికిపైగా మృత్యువాత పడ్డారు. మరికొంత మందికి తీవ్ర గాయలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పుత్రులకు తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 88 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఘాట్ రోడ్ వద్ద బస్సు మలుపు తిప్పుతున్నప్పుడు ప్రయాణికులు ఒక వైపే ఒరగడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడి వుంటుందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నిమిష నిమిషానికి మృతుల సంఖ్య పెరుగుతోంది. మృతుల్లో అధిక సంఖ్యలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఊపిరాడకనే ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని భావిస్తున్నారు. మంగళవారం కూడా కావడంతో కొండగట్టుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసీ.. బస్సులు ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ఏపీ 28 జెడ్ 2319 నంబర్ ఆర్టీసీ బస్సు 88మందితో శనివారంపేట నుంచి జగిత్యాలకు బయలుదేరింది. రెగ్యులర్ డ్రైవర్ కాకుండా కొత్త డ్రైవర్ బస్సును నడిపిస్తున్నారు. డ్రైవర్ మలుపులను అంచనా వేయలేకపోయాడని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాస్ రెండు కాళ్లు విరిగిపోయాయి. అదే విధంగా ఘాట్ రోడ్డు వెడల్పు లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని స్థానికలు పేర్కొన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ రహదారులను పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం స్థలం వద్ద మృతిచెందిన వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
కొండగట్టలో ఘోర రోడ్డు ప్రమాదం ఫోటోలు
-
కొండగట్టు ప్రమాదం: డ్రైవర్ తప్పిదం వల్లే?
సాక్షి, కొండగట్టు: ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురి కావడంతో 57 మందికిపైగా మృతి చెందగా, మరి కొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కొండగట్టులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలను వేములవాడ డిపో మేనేజర్ వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తామని తెలిపారు. అయితే బస్సు కండీషన్లోనే ఉందని.. డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఘాట్ రోడ్డుపై సైన్ బోర్డులు ఉన్నప్పటికి ఈ ప్రమాదం జరగడం బాధకరం అని పేర్కొన్నారు. బస్సు శనివారంపేట నుంచి కొండగట్టుకు బయలుదేరిందని తెలిపారు. బస్సులో ఎక్కువ శాతం మంది స్థానికులు ఉన్నట్లు చెప్పారు. సహాయక చర్యల కోసం స్థానికుల సహాయం తీసుకుంటున్నామని పేర్కొన్నారు. (ఈ విషాద ఘటనకు సంబంధించిన మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దేశ చరిత్రలోనే అతిపెద్ద బస్సు ప్రమాదం!
కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 60 మంది దుర్మరణం పాలయ్యారు. గాయపడిన వారిలో 15 మందికి జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 25 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. బస్సు కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 101 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన బస్సు జగిత్యాల డిపోకు చెందినదిగా గుర్తించారు. 44 మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఐదు మృతదేహాలు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ కొండగట్టు అంజన్న స్వామి భక్తులు. దేశ ఆర్టీసీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదంగా భావిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, మృతుల్లో డ్రైవర్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. కొండగట్టు ఘాట్ రోడ్డులో బస్సు కిందకు దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు మరో నిమిషంలో ప్రధాన రహదారికి చేరుకుంటుందనగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో బాధితుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో విషాద వాతావరణం నెలకొంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. మృతుల్లో ఎక్కువగా 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. సహాయక చర్యల్లో స్థానికులు నిమగ్నమయ్యారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్సులో పరిమితికి మంచి ప్రయాణికులు ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాద సమయంలో బస్సు ఒక పక్కకు ఒరిగిపోవడంతో అందరూ ఒకరిపై ఒకరు పడి ఊపిరి ఆడక పిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి ఈ దుర్ఘటనపై తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అటు ఆపద్ధర్మ ఆర్థిక శాఖమంత్రి ఈటల రాజేందర్ స్పందిస్తూ సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జగిత్యాల కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యల్లో నిమగ్నమైనట్టు చెప్పారు. ప్రభుత్వం తరపున క్షతగాత్రులకు వైద్య సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. ప్రమాదం చాలా బాధాకరం: రవాణ మంత్రి కొండగట్టు రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమని ఆపద్ధర్మ రవాణ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఈ కొండపై తొలిసారి ఇంత పెద్ద ప్రమాదం జరిగిందన్నారు. తను ఘటనాస్థలికి బయలు దేరుతున్నానని, ఇప్పటికే జిల్లా అధికారులు, మంత్రి ఈటల రాజేందర్ అక్కడికి చేరుకున్నారని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ప్రమాద వివరాలను ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధితులను ఆదుకుంటామన్నారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి కొండగట్టు ఆర్టీసీ ప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చంద్రబాబు దిగ్భ్రాంతి అమరావతి : కొండగట్టు రోడ్డుప్రమాదంపై ఏపీ శాసనమండలిలో సీఎం చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. (ఈ విషాదానికి సంబంధించిన మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)