Nursery
-
రాజమండ్రి: రూట్ మార్చిన చిరుత
రాజమహేంద్రవరం రూరల్/కడియం: దివాన్ చెరువు అభయారణ్యంలో సంచరించిన చిరుత పులి కడియం నర్సరీ ప్రాంతానికి చేరినట్టు అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. కడియం – వీరవరం రోడ్డు మధ్యలోని దోసాలమ్మ కాలనీలో చిరుత జాడలు కనిపించాయి. దీంతో కాలనీ వాసులందరూ భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న దివాన్ చెరువు ఫారెస్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పద్మావతి, రేంజర్ శ్రీనివాస్, స్క్వాడ్ డీఆర్వో రాజా అండ్ టీమ్, రేంజ్ పరిధిలోని సిబ్బంది ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అవి చిరుత పాదముద్రలే అని గుర్తించారు. అయితే అది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందనే విషయం అంతుపట్టడం లేదు. కొన్ని నర్సరీలలో సీసీ కెమెరాలు ఉంటాయి. పులి భయంతో నర్సరీల్లో రైతులెవ్వరూ ఉండడం లేదు. చిరుత ఈ ప్రాంతంలోనే ఉందా, ఎక్కడికైనా వెళ్లిందా అన్న విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు, కూలీలకు బుధవారం నర్సరీలకు వెళ్లవద్దని సూచించారు. -
హైదరాబాద్ : పీపుల్స్ప్లాజాలో నర్సరీ మేళా (ఫొటోలు)
-
కొబ్బరి పొట్టు..లాభాలు పట్టు
సాక్షి, అమలాపురం: ఇరవై ఏళ్ల క్రితం కొబ్బరి పొట్టు నిరుపయోగ వ్యర్థ పదార్థం. దీనిని వదిలించుకోవడం పీచు పరిశ్రమల యజమానులకు తలకు మించిన భారంగా ఉండేది. కొబ్బరి పీచుకు ధర ఉంటేనే పరిశ్రమలు నడవడం.. లేదంటే మూసేయడంలా ఉండేది. కానీ.. ఆ వ్యర్థమే ఇప్పుడు బంగారమైంది. కొబ్బరి పొట్టును ఇటుకల తయారీలో వాడితే లాభమని గుర్తించారు. ఇటుక తేలిక కావడంతోపాటు ఆకర్షణీయమైన రంగు రావడంతో బట్టి యజమానులు దీని కొనుగోలు మొదలు పెట్టారు. ఆ తరువాత దీని నుంచి అత్యంత నాణ్యమైన కంపోస్టు తయారవుతోందని గుర్తించడంతో కంపోస్టును ఇటుక (కోకోపీట్ బ్లాక్)లుగా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తుండటంతో దీని దశ తిరిగింది. నష్టాల్లో ఉన్న పీచు పరిశ్రమల ఉనికిని ఇప్పుడు కొబ్బరి పొట్టు కాపాడుతోంది. రాష్ట్రంలో ఏడాదికి 24 వేల టన్నుల పొట్టు రాష్ట్రంలో చిన్నాపెద్ద కలిపి సుమారు 950 వరకు కొబ్బరి పీచు పరిశ్రమలు ఉండగా.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 550 వరకు ఉన్నాయి. సగటున 350 గ్రాముల బరువు ఉన్న ఎండు కొబ్బరి కాయ నుంచి 80 గ్రాములు పీచు వస్తే.. కొబ్బరి పొట్టు 160 గ్రాముల వరకు వస్తోంది. రాష్ట్రంలో ఏడాదికి 24 వేల మెట్రిక్ టన్నుల పొట్టు ఉత్పత్తి అవుతోందని అంచనా. ఇందులో విద్యుత్ వాహకత (ఎలక్ట్రిక్ కండెక్టివిటీ–ఈసీ) 6 నుంచి 8 శాతం వరకు ఉంటోంది. అధిక ఈసీ ఉన్న కొబ్బరి పొట్టును నేరుగా వినియోగిస్తే మొక్కలు దెబ్బతింటాయి. దీంతో వివిధ పద్ధతులలో ఈసీ శాతం తగ్గించి కంపోస్టుగాను, బ్రిక్స్ రూపంలో తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. ఈసీ ఎక్కువగా ఉన్న పొట్టును ఇటుక బట్టీలకు టన్ను రూ.2,500 చొప్పున విక్రయిస్తుండగా.. తక్కువ ఈసీ ఉన్న పొట్టును టన్ను రూ.5 వేలకు విక్రయిస్తున్నారు. కొబ్బరి పొట్టు నాణ్యమైన సేంద్రియ ఎరువుగా తయారైతే.. దాని ధర పొట్టు రూపంలో టన్ను రూ.14 వేల నుంచి రూ.20 వేల వరకు ధర ఉంది. అదే ఇటుకల రూపంలో అయితే టన్ను ధర రూ.22 వేల నుంచి రూ.26 వేలు పలుకుతోంది. ఆన్లైన్ మార్కెటింగ్ చేసే అమెజాన్, ఇండియా మార్ట్ వంటి సంస్థలు కేజీ రూ.25 నుంచి రూ.55 వరకు కోకో బ్రిక్ అమ్మకాలు చేస్తున్నాయి. విదేశాలకు కోకోపీట్ బ్లాక్స్ కొబ్బరి పొట్టు ఉత్తరాది రాష్ట్రాలకు అధికంగా ఎగుమతి అవుతోంది. వీటిలో గుజరాత్ది అగ్రస్థానం. ఇక్కడి నర్సరీలకు మట్టికన్నా కొబ్బరి పొట్టు మేలైన ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. మన రాష్ట్రంతోపాటు దక్షణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సింగపూర్, మలేసియా, చైనా, జపాన్, అమెరికా, నెదర్ల్యాండ్, ఆస్ట్రేలియాలకు పొట్టుతో తయారు చేసిన బ్రిక్స్ ఎగుమతి అవుతున్నాయి. మొత్తం కొబ్బరి పొట్టు ఉత్పత్తిలో కేవలం 10% మాత్రమే బ్లాక్ రూపంలో వెళుతుండగా.. 20% కంపోస్టు రూపంలోను, 70% ఇటుక బట్టీలకు వెళుతోంది. మంచి డిమాండ్ ఉంది అంతర్జాతీయంగా కోకోపీట్ బ్లాక్స్కు మంచి డిమాండ్ ఉంది. కానీ.. ఎగుమతులకు వీలుగా కొబ్బరి పొట్టును తక్కువ ఈసీకి తీసుకువచ్చి బ్లాక్లుగా తయారు చేయడం వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. మాకు స్థానికంగా ఇటుక బట్టీలకు అధికంగా వెళుతోంది. క్వాయర్ పరిశ్రమలు నడుస్తున్నాయంటే అందుకు కొబ్బరి పొట్టే కారణం. – నండూరి ఫణికుమార్, క్వాయర్ పరిశ్రమ యజమాని -
నర్సరీ పెట్టు.. కాసులు పట్టు
కడప అగ్రికల్చర్: తక్కువ పెట్టుబడితో అనతికాలంలో అధిక ఆదాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కిసాన్ మల్బరీ నర్సరీ సాగుకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఈ కిసాన్ మల్బరీ నర్సరీ సాగుతో ఆరు నెలల్లో పెట్టుబడికి రెట్టింపు ఆదాయం పొందే అవకాశం కల్పిస్తుంది. ఇందుకు చేయూతగా నర్సరీ సాగుకు ప్రభుత్వం సబ్సిడీని కూడా అందిస్తుంది. మల్బరీ సాగుకు అయ్యే ఖర్చులో ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీ, ఓసీ, బీసీలకు 75 శాతం సబ్సిడీ అందిస్తుంది. ఆసక్తి ఉన్న రైతులు నర్సరీ సాగుకు ముందుకు రావాలని సూచిస్తోంది. జిల్లాలో మల్బరీ సాగుకు మొక్కల కోసం ముందుగా నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచి రైతులకు అందించేందుకు ప్రోత్సహిస్తోంది. ఎకరాకు నర్సరీకి 1,60,000 మొక్కలు... మల్బరీకి సంబంధించి ఒక ఎకరా కిసాన్ నర్సరీలో 1,60,000 మొక్కలను నాటితే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ఈ నర్సరీలో 4 నుంచి 5 నెలలపాటు మల్బరీ మొక్కలను పెంచి తరువాత రైతులు మొక్కలను విక్రయించాల్సి ఉంటుంది. నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలను రైతు తమ పొలంలో సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు నర్సరీలో ఒక్కో మొక్కకు రైతు రూ. 2 చెల్లించి కొనుగోలు చేయాలి. తెచ్చుకున్న మొక్కలను తమ పొలంలో సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఎకరాకు సాగుకు మొక్కలను నాటేదాన్ని బట్టి 4500 నుంచి 10 వేల మొక్కల వరకు నాటి సాగు చేస్తారు. ప్రభుత్వ సబ్సిడీ ఇలా.. నర్సీరీ మొక్కల సాగుకు ప్రభుత్వం ఒక యూనిట్కు రూ.1,50,000 అందిస్తుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీతో రూ.1,35,000 ఉచితంగా అందిస్తుంది. అలాగే ఓసీ, బీసీలకు 75 శాతం సబ్సిడీతో రూ.1,12,500 ఉచితంగా అందిస్తుంది. మిగతా మొత్తాన్ని రైతు భరించాల్సి ఉంటుంది. నర్సరీ సాగు పూర్తయ్యాక (ఓసీ, బీసీ రైతులకు) రైతుకు ఒక్కో మొక్కను 2 రూపాయలతో విక్రయిస్తే రూ.2,40,000 రాబడి వస్తుంది. అలాగే ప్రభుత్వం అందించే సబ్సిడీ రూ.1,12,500 కలుపుకుని మొత్తం రూ.3,12,500 కాగా ఇందులో రూ.1,50, 500 ఖర్చు పోను నికరంగా రైతుకు రూ.2,02,500 లాభం వస్తుందని మల్బరీ అధికారులు తెలిపారు. అలాగే (ఎస్సీ, ఎస్టీ రైతులకు) సంబంధించి రైతు రాబడి రూ.2,40,000, ప్రభుత్వ సబ్సిడీ రూ.1,35,000 కలుపుకుని మొత్తం రూ.3,75,000 కాగా ఇందులో రూ.1,50, 500 ఖర్చు పోను రైతుకు నికరంగా రూ.2,25,000 లాభం వస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ నర్సరీల ద్వారా... మల్బరీ నర్సరీ మొక్కల సాగుకు సంబంధించి ప్రభుత్వ ఆ«ధ్వర్యంలో రెండు నర్సరీ కేంద్రాలలో పెంపకాన్ని చేపడుతున్నారు. ఇందులో ఒకటి కడప నగర శివార్లలోని ఊటుకూరు కేంద్రంలో ఒక దానిని, మైదుకూరు మండలం వనిపెంట పట్టు పరిశ్రమలశాఖ క్షేత్రంలో మరొక మల్బరీ నర్సరీ సాగును చేపడుతున్నారు. ఇందులో భాగంగా 2023–24 సంవత్సరానికి ప్రతి నర్సరీలో 2 లక్షల మల్బరీ మొక్కలను సాగు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇందులో ఊటుకూరు క్షేత్రంలో ఇప్పటికే 1,50,000 మొక్కలను నాటించారు. త్వరలో వనిపెంట నర్సరీలో కూడా నాటించనున్నారు. ఈ ఏడాది జిల్లాలో 4 వందల ఎకరాల మల్బరీ సాగు లక్ష్యంగా ప్రభుత్వం కేటాయించింది. ఈ రెండు నర్సరీల ద్వారా రైతులకు కావాల్సిన మొక్కలను అందజేయనున్నారు. ఇందులో ఒక్కో మొక్క రూ. 2కు అందజేస్తారు. వ్యాధి రహిత పట్టు పురుగుల పెంపకం.. వ్యాధి రహిత పట్టు పురుగులను( చాకీ పురుగుల పెంపకం) అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం మైసూరులోని జాతీయ పట్టు గుడ్ల ఉత్పత్తి కేంద్రం నుంచి గుడ్లు తెప్పించి పెంచుతోంది. ఇందులో 100 గుడ్లను 13 వందలకు తెప్పించి వనపెంటలోని సీడ్ఫామ్లో పెంచుతారు. అక్కడ 13 రోజుల తరువాత పగిలి చాకీ పురుగులు బయటకు వస్తాయి. వాటికి ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఇలా 3 రోజులపాటు 6 మేతలను అందిస్తారు. ఈ తరుణంలో వాటికి మొదటి జ్వరం వస్తుంది. తరువాత 2వ మేతను రెండున్నర రోజులు అందిస్తారు. తర్వాత 2వ జ్వరం వస్తుంది. తరువాత రైతులకు ఈ చాకీ పురుగులను సరఫరా చేస్తారు. ఇందులో 100 పట్టు గుడ్ల రేటు రూ.1300 కాగా 100 పట్టు పురుగులను 9 రోజులపాటు పెంచి ఇచ్చినందుకు ఈ ఖర్చు అవుతుంది. ఇలా రైతుకు 100 చాకీ పురుగులను అందించాలంటే రూ.2600 రైతు చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత చాకీ పురుగులను కడపతోపాటు గిద్దలూరు, ప్రకాశం ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది 4 వందల ఎకరాలు ఈ ఏడాది జిల్లాలో 4 వందల ఎకరాల మల్బరీ సాగును లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఇందు కోసం కడప ఊటుకూరుతోపాటు వనిపెంట నర్సరీలో మల్బరీ మొక్కల పెంపకాన్ని చేపట్టాము. ఇప్పటికే ఊటుకూరు నర్సరీలో 1,50,000 మొక్కలను సాగు చేశాము. మిగతా వాటిని కూడా త్వరలో నాటి కావాల్సిన రైతులకు అందిస్తాము. – అన్నపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా పట్టు పరిశ్రమలశాఖ అధికారి. -
మొక్కవోని నిఘా!
వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది.. అన్నదాతకు అండగా నిలిచేందుకు పకడ్బందీ కార్యాచరణ అమలు చేస్తోంది.. అందులో భాగంగా సాగుకు అనుబంధంగా సాగుతున్న నర్సరీలపై ప్రత్యేక దృష్టి సారించింది.. రైతుకు నాణ్యమైన మొక్కలు సరఫరా చేసేలా కట్టుదిట్టంగా చర్యలు చేపడుతోంది.. విత్తు నాటింది మొలకెత్తించే విధానం.. మొక్క ఎదుగుదల మొదలు దిగుబడి వచ్చేవరకు అన్ని దశలపై నిఘా పెట్టి నిశితంగా పరిశీలిస్తోంది.. నాసిరకం నారుతో ఒక్క రైతు కూడా నష్టాలపాలు కాకుండా పక్కాగా జాగ్రత్తలు తీసుకుంటోంది.. ఇందుకో సం రిజి్రస్టేషన్ సమయంలోనే నర్సరీ యాజమాన్యాల్లో జవాబుదారీతనం పెంచుతోంది. సాక్షి, చిత్తూరు : వ్యవసాయంలో కాలక్రమేణా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు రైతులు తమ పొలాల్లోనే నారు పోసుకునేవారు. అనంతరం మొక్క నాటుకుని సాగు చేసేవారు. ఈ క్రమంలో ఒక్కోసారి నాసిరకం విత్తనాలు విత్తడం, నారు పెంపకంలో చిన్న చిన్న పొరబాట్లు, సక్రమంగా యాజమాన్య పద్ధతులు పాటించకపపోవడం కారణంగా పంట నష్టపోయేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఇబ్బడిముబ్బడిగా నర్సరీలు పుట్టుకొచ్చాయి. రైతులు తమకు కావాల్సిన పంటకు సంబంధించి మొక్కలను నేరుగా నర్సరీల్లోనే కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ విధానం ముందుగా పువ్వులు, పండ్లు, కూరగాయల పంటల్లో ప్రారంభమైంది. మలిదశలో వరి, చెరుకు తదితర పంటలకు కూడా వ్యాప్తి చెందింది. ఆధునిక పద్ధతులు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా నర్సరీలు ప్రారంభమయ్యాయి. కార్పొరేట్ కంపెనీలు సైతం తమ విత్తన వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు నర్సరీలకు శ్రీకారం చుట్టాయి. ప్రస్తుతం దాదాపు అన్ని పంటలకు సంబంధించిన మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నారు. వరి, చెరుకు, టమాట, వంగ, బీర ,కాకర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, మామిడి, సపోటా, నిమ్మ, చీనీ, జామ, దానిమ్మతోపాటు అన్ని రకాల పువ్వుల మొక్కలను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే నర్సరీలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఒక్కోసారి ఈ నర్సరీలు సరఫరా చేసే మొక్కలు నాణ్యంగా లేకంటే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. నర్సరీ యజమాన్యాలు బాధ్యతాయుతంగా మొక్కలను పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. నాణ్యమైన విత్తనాలను సేకరించడం, వాటిని విత్తటం, మొలకెత్తించటం, మొక్కలను పొలంలో నాటే వరకు నిరంతరం పరిశీలించాలని స్పష్టం చేసింది. అన్నదాత నాసిరకం నారు కారణంగా నష్టపోకూడదని ఉద్యానశాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టంగా నిఘా పెట్టింది. పకడ్బందీగా రిజిస్ట్రేషన్ ఉద్యానవన చట్టం– 2010 ప్రకారం నర్సరీలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, డైరెక్టర్ ఆఫ్ హార్టీకల్చర్ విభాగం పర్యవేక్షిస్తోంది. నర్సరీ ఏర్పాటు చేసిన ప్రదేశం, దానికి సంబంధించిన లేఅవుట్ మ్యాప్, భూమి స్థితిగతులు, భూసార పరీక్షల రిపోర్టు డిజిటల్ ఫొటోలతో పాటు యజమాని ఆధార్ కార్డు వివరాలను పొందుపరుస్తూ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అలాగే రైతులు ఏమాత్రం నష్టపోకుండా చూసే బాధ్యతను సైతం నర్సరీల యాజమాన్యంపైనే ఉంచుతున్నారు. పక్కాగా పర్యవేక్షణ నర్సరీల్లో మొక్కల సంరక్షణ పద్ధతులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది.విత్తనాల కొనుగోలు నుంచిమొక్కలను రైతులకు అప్పగించే వరకు సమగ్ర సమాచారాన్ని సేకరిస్తోంది. ఒకవేళ రైతు నష్టపోతే నర్సరీల యాజమాన్యాలు, విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలే బాధ్యత వహించేలా సర్కారు చర్యలు చేపట్టింది. సేవకు గుర్తింపుగా అవార్డు నర్సరీ రంగంలో దాదాపు 20 ఏళ్లుగా ఉన్నా. మరోవైపు వ్యవసాయం చేస్తున్నా. సాగుకు చేసిన సేవలకు గుర్తింపుగా డాక్టర్ వైఎస్సార్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు నాణ్యమైన మొక్కలను సరఫరా చేస్తున్నాం. ఈ విధానం ద్వారా నర్సరీ యాజమాన్యాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయి. – రాఘవేంద్ర, నర్సరీ యజమాని, శాంతిపురం ప్రభుత్వ నిర్ణయంతో న్యాయం వ్యవసాయంలో నష్టపోకుండా ఉండాలంటే ముందు నాణ్యమైన మొక్కలను నాటుకోవాలి. రూ.లక్షలు వెచ్చించే రైతు విషయంలో నర్సరీలవారిపై ప్రభుత్వం బాధ్యత పెట్టడం మంచి నిర్ణయం. దీంతో రైతులకు న్యాయం జరుగుతుంది. – అరుణ, రైతు, ఎంకే పురం, కుప్పం మండలం నిరంతర పర్యవేక్షణ రైతులు ఎక్కువగా ఉద్యా న పంటలు సాగు చేస్తున్నా రు. నాణ్యమైన మొక్కలను సరఫరా చేయకపోతే భారీగా నష్టపోయే ప్రమాదముంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు నర్సరీ యజమాని బాధ్యతగా నాణ్యమైన మొక్కలను సరఫరా చేయాలి. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. – లక్ష్మీప్రసన్న, ఉద్యానశాఖాధికారి, పలమనేరు రైతు సంక్షేమం కోసమే.. రైతు సంక్షేమం కోసమే నర్సరీలపై ప్రభుత్వం నిఘా పెట్టింది. నాణ్యమైన మొక్కలను అందిస్తే అన్నదాతలు చక్కటి ఉత్పత్తులు సాధిస్తా రు. తద్వారా గిట్టుబాటు ధర దక్కుతుంది. ఇందుకోసమే నర్సరీల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. అలాగే నర్సరీ యాజమాన్యాలకు కూడా ప్రోత్సాహం అందిస్తున్నాం. – మధుసూదన్రెడ్డి, జిల్లా ఉద్యానశాఖాధికారి -
కడియం మొక్కల ఎగుమతులకు ప్రత్యేక ప్రణాళిక
సాక్షి, అమరావతి: అందమైన పూల, అలంకరణ పూల మొక్కలకు ప్రఖ్యాతి గడించిన కడియం నర్సరీ ఇప్పుడు అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఎగుమతి విధానాలు, ధ్రువపత్రాలు, నాణ్యతపై నర్సరీ రైతులకు అవగాహన కల్పించడం, నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా విదేశాలకు అవరమైన మొక్కలను పెంచి, ఎగుమతులు పెంచుకుంటారని అధికారులు చెబుతున్నారు. తద్వారా రైతుల ఆదాయం పెరుగతుందని తెలిపారు. నర్సరీకి అవసరమైన గాలిలో తేమ, ఉష్ణోగ్రతలు, సారవంతమైన భూమి ఉన్న కడియం చుట్టుపక్కల సుమారు 15 కి.మీ పరిధిలో 7,000 ఎకరాల్లో నరర్సరీలు ఏర్పాటయ్యాయి. ప్రతి ఏటా డిమాండ్కు అనుగుణంగా నర్సరీ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. కడియం చుట్టుపక్కల సుమారు 2,300 నర్సరీలు ఉండగా, వీటిలో 15 సంస్థలు మాత్రమే ఎగుమతులకు లైసెన్సులు కలిగి ఉన్నాయి. 1,600 నర్సరీలు అసంఘటిత రంగంలోనే ఉన్నాయి. దీనివల్ల ఎగుమతులు పెరగడంలేదని అధికారులు భావిస్తున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ కోట్ల వ్యాపారం చేస్తున్న కడియం నర్సరీ రైతులు సరైన అవగాహన లేక అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా నర్సరీల నుంచి రూ.229 కోట్ల విలువైన మొక్కలు ఎగుమతి అవుతుండగా, ఎంతో పేరెన్నికగన్న కడియం నుంచి తక్కువ మొత్తంలో ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రస్తుతం కడియం నుంచి ఏడు దేశాలకు ఏటా రూ.5.5 కోట్ల విలువైన మొక్కలు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. వచ్చే మూడేళ్లలో.. అంటే 2024–25కి ఈ మొత్తాన్ని రూ.7.4 కోట్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకోసం తూర్పు గోదావరి జిల్లా ఎగుమతుల కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం స్వాట్ అనాలసిస్ (స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, త్రెట్) చేసి దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ (ఎగుమతులు) జీఎస్ రావు ‘సాక్షి’కి వివరించారు. రాష్ట్రం నుంచి ఎగుమతికి బాగా అవకాశాలున్న ఒమన్, కువైట్, బెహ్రయిన్, మాల్దీవులు, ఖతార్, టర్కీ, యూఏఈకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. అక్కడి మార్కెటింగ్కు అనుగుణంగా ఇక్కడి రైతులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. ఇదీ ప్రణాళిక అసంఘటిత రంగంలో ఉన్న నర్సరీలన్నింటినీ సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ద్వారా ఒక తాటిపైకి తెస్తారు. ఇతర దేశాల మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎగుమతి లైసెన్సులు ఉన్న వారిలోనూ చాలా మంది నాణ్యత సర్టిఫికేషన్స్ వంటి వాటిపై అవగాహన లేకపోవడంతో అవకాశాలను అందిపుచ్చుకోవడంలేదు. వీరందరికీ జిల్లా ఎక్స్పోర్ట్స్ హబ్ ద్వారా శిక్షణ ఇస్తామని అధికారులు వెల్లడించారు. ► తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసే విధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తారు. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ పథకాల ప్రయోజనాలను వివరిస్తారు. ► 2022–27 రాష్ట్ర ఎగుమతి ప్రోత్సాహక విధానం కింద పలు ప్రోత్సాహకాలను ఇస్తారు. విదేశీ ప్రదర్శనల్లో పాల్గొనే వారికి 30 శాతం అద్దె రాయితీ, ఎగుమతుల్లో కీలకమైన జెడ్ఈడీ సర్టిఫికెట్ పొందడంలో 10 శాతం రాయితీతో పాటు ఎగుమతి నాణ్యతకు సంబంధించిన ధృవపత్రాలు పొందడానికి అయ్యే వ్యయాల్లో 50 శాతం రాయితీ ఇస్తామని అధికారులు తెలిపారు. ► దేశీయంగా రియల్టర్లు, ల్యాండ్ స్కేపర్స్, ఆర్కిటెక్చర్స్కు అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు, మొక్కల సరఫరాపై అవగాహన కల్పిస్తారు. ► ఇండోర్, ఔట్డోర్ గార్డెన్స్లో చూపు తిప్పుకోలేని విధంగా వివిధ ఆకృతుల్లో మొక్కలను పెంచేలా నర్సరీ రైతుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్ హబ్స్లోప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. -
పీపుల్స్ ప్లాజాలో 12వ గ్రాండ్ నర్సరీ మేళా (ఫొటోలు)
-
Sandalwood Cultivation: చందనం సాగుపై ఐ.డబ్ల్యూ.ఎస్.టి. కోర్సు
చందనం తదితర విలువైన కలప జాతుల సాగు, వ్యాపారంలో నైపుణ్యాలపై బెంగళూరులోని, కేంద్ర అటవీ పరిశోధన–విద్యా మండలి అనుంబంధ సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐ.డబ్ల్యూ.ఎస్.టి.) సంస్థ శిక్షణ ఇవ్వనుంది. సెప్టెంబర్ 19 నుంచి 23 తేదీ వరకు శిక్షణ ఉంటుంది. చందనం (శాండల్వుడ్) మొక్కల నర్సరీ, తోటలను ఆరోగ్యంగా పెంచడంతోపాటు చందనం చెక్కలో నూనె శాతాన్ని అంచనా వేయటం, చందనం వాణిజ్యం, ఆర్థిక అంశాలు, చందనం సాగును ప్రోత్సహించే ప్రభుత్వ విధానాలు.. ఈ అంశాలపై ఐ.డబ్ల్యూ.ఎస్.టి. ఆచరణాత్మక శిక్షణ ఇస్తుంది. వసతి, భోజన సదుపాయాలతో కూడిన శిక్షణ పొందగోరే అభ్యర్థి రూ. 17,700 లను డీడీ రూపంలో చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సీనియర్ శాస్త్రవేత్త డా. ఆర్. సుందరరాజ్ కోర్సు డైరెక్టర్గా వ్యవహరిస్తారు. తెలుగులో ఇతర వివరాలు తెలిసుకోవడానికి 080–22190166. rsundararaj@icfre.org -
నర్సరీలతో ఉపాధి... ఒక్కో నర్సరీకి రూ. 6 లక్షలు
కడప సిటీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది కొత్తగా నర్సరీల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించి ఆర్థికాభివృద్ధి సాధించేందుకు తోడ్పాటు కల్పిస్తున్నారు. అలాగే నిర్మాణాత్మక పనులకు కూడా నిధులు కేటాయిస్తున్నారు. దీంతోపాటు నీటి సంరక్షణ పనులకు కూడా ప్రభుత్వం ఉపాధి హామీలో నిధులు కేటాయిస్తోంది. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు పండ్ల తోటల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. పూర్తి ఉచితంగా సన్న, చిన్నకారు రైతులు సాగు చేసేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికే 11 రకాల పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది కొత్తగా సన్న, చిన్నకారు రైతులు మరింత ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఉపాధి హామీ పథకానికి అవసరమైన మొక్కలను పెంచేందుకు నర్సరీల అవసరం ఏర్పడింది. ఈ నర్సరీలను పెంచేందుకు రైతులకే అవకాశం కల్పించారు. ఒక్కో నర్సరీకి రూ.6 లక్షలు నర్సరీ ఏర్పాటుకు ఏడాదికి రూ. 6 లక్షల నిధులు ఉపాధి హామీ పథకం నుంచి రైతులకు అందుతాయి. 50 వేల మొక్కలను సంబంధిత రైతు నర్సరీలో పెంచాల్సి ఉంటుంది. ఒక్కో మొక్కకు నెలకు రూపాయి చొప్పున కేటాయిస్తారు. దీంతో నెలకు రూ. 50 వేల ఆదాయం సమకూరుతుంది. అటవీ ఉత్పత్తులైన కానుగ, వేప, నీరుద్ది, నెమలినార, నిద్రగన్నేరు, నేరేడు, టేకు, ఎర్రచందనం, మునగ మొక్కలను పెంచాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఆరుచోట్ల నర్సరీల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. సిద్దవటం మండలం జేఎంజే కళాశాల ఎదురుగా ఉన్న మూలపల్లె గ్రామంలో, చెన్నూరు మండలం బయనపల్లె, కమలాపురం మండలం నసంతపురం, వీఎన్ పల్లె మండలం గోనుమాకులపల్లె గ్రామాల్లో నర్సరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అలాగే చక్రక్రాయపేట మండలం గంగారపువాండ్లపల్లె, సుండుపల్లె ప్రాంతాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లాలో ఉపాధి హామీ పథకం అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో నర్సరీల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. రైతులకు వరం సన్న, చిన్నకారు రైతులకు మరొక వరం లాంటి అవకాశం వచ్చింది. ఆసక్తిగల రైతులు నర్సరీలు పెంచేందుకు ముందుకు రావాలని ఉపాధి హామీ అధికారులు సూచించారు. ఉపాధి హామీ పథకం కింద రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల్లో మొక్కలు నాటేందుకు అవసరమైన మొక్కలను సేకరించేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని రైతులకు ఇచ్చి నర్సరీల ద్వారా అటవీ జాతి మొక్కలను పెంచేందుకు అవకాశం కల్పించారు. పొలం ఉన్నా.. లేకున్నా.. సన్న, చిన్నకారు రైతులకు నర్సరీల ఏర్పాటుకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. నీటి సౌకర్యం కలిగి ఉండాలి. అలాగే ఒకవేళ పొలం లేకున్నా స్థలం, నీటి సౌకర్యం ఉంటే నర్సరీలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆసక్తిగల రైతులు ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న ఉపాధి సిబ్బందిని కలిసి వివరాలు తెలుసుకోవచ్చు. మొక్కలు, సంబంధిత బ్యాగులు, పొలాన్ని చదును చేయడం, స్టంప్స్ (పెద్ద కర్రలు)తోపాటు పాటిమిక్చర్ (ఎరువు, ఇసుక, ఎర్రమట్టి)ను కూడా ఉపాధి హామీ పథకం కిందనే ఉచితంగా అందజేస్తారు. నర్సరీలతో మరింత ఉపాధి రైతులకు నర్సరీల ద్వారా మరింత ఉపాధి లభించే అవకాశం ఉంది. ఒక్కో నర్సరీకి రూ. 6 లక్షల నిధులు అందుతాయి. నెలకు రూ. 50 వేలు ఆదాయం పొందవచ్చు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – యదుభూషణరెడ్డి, డ్వామా పీడీ, కడప -
24 నుంచి గ్రాండ్ నర్సరీ మేళా: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: గ్రాండ్ నర్సరీ మేళాకు నెక్లెస్ రోడ్ గ్రౌండ్స్ ముస్తాబవుతోంది. ఈ నెల 24 నుంచి 28 వరకు నిర్వహించే ఈ మేళాకు సంబంధించిన బ్రోచర్ను వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్రావు శనివారం మిని స్టర్స్ క్వార్టర్స్లో ఆవిష్కరించారు. 5 రోజుల పాటు జరిగే ఈ మేళాలో మొక్కలు, మొక్కల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల తోటలు, ఎరువులు, ఆర్గానిక్ ఉత్పత్తులు, అగ్రి కల్చర్ లో ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, ఎడ్యుకేషన్, ఫుడ్ ఇండస్ట్రీ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్ వంటి నూతన టెక్నాలజీని ప్రదర్శించనున్నారు. 120కు పైగా నర్సరీ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మెడిసినల్ ప్లాంట్స్ కిచెన్, అవుట్ డోర్, ఎక్సోటిక్, బల్బ్, సీడ్, సీడ్ లింక్స్, ఇండోర్, ఆడినియం, బోన్సా య్, క్రీపర్స్, ఫ్లవర్స్, ఇంపోర్టెడ్ ప్లాంట్స్ అం దుబాటులో ఉంటాయి. డార్జిలింగ్, కోల్కతా, ఢిల్లీ, హరియాణా, ముంబై, బెంగళూరు, పుణే, షిర్డి, చెన్నై, తెలంగాణ, ఆంధ్ర ప్రాం తాల ప్లాంట్స్ ప్రదర్శిస్తారు. నెక్లెస్ రోడ్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. రూ. 50 నుంచి రూ.3 లక్షల వరకు మొక్కలు లభ్యమవుతాయని మేళా ఇన్చార్జి ఖలీద్ అహ్మ ద్ తెలిపారు. మేళాను మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు. -
ఢిల్లిలో దీపావళి తర్వాతే మిగిలిన తరగతులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి నియంత్రణలో ఉన్నందున, దశల వారీగా మిగిలిన తరగతుల కోసం పాఠశాలలను తిరిగి తెరవాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నిర్ణయించింది. బుధవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అధ్యక్షతన జరిగిన డీడీఎంఏ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నర్సరీ నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలను నవంబర్ మొదటి వారంలో తిరిగి తెరవనున్నారు. దీపావళి పండుగ తర్వాత అధికార యంత్రాంగం దశలవారీగా పునః ప్రారంభించే విధానాలను నిర్ణయిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు సెప్టెంబర్ 1 నుంచి దశలవారీగా తెరుచుకున్నాయి. విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఫేస్ మాస్క్లు, హ్యాండ్ శానిటైజర్ల వాడకం, సామాజిక దూరాన్ని పాటించడం వంటి అన్ని కోవిడ్–19 ప్రోటోకాల్లను పాటిస్తూ తరగతులు జరుగుతున్నాయి. దీనితో పాటు రాంలీలా, దసరా, దుర్గాపూజ పండుగలను సైతం సామాజిక దూరం, మాస్కులు ధరించడం వంటి కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని సూచించారు. అంతేగాక కోవిడ్ ప్రోటోకాల్స్ను ఖచ్చితంగా అమలు చేయాలని ఢిల్లీ పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. (చదవండి: జండర్ న్యూట్రల్ వ్యాక్సిన్ వచ్చేసింది) -
నర్సరీ మొక్కలకు ‘బయోపాట్స్’.. గద్వాల విద్యార్థిని ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఓ పాఠశాల విద్యార్థిని వినూత్న ఆలోచన సరికొత్త ఆవిష్కరణకు పురుడుపోసింది. మొక్కల పెంపకంలో సహజత్వానికి, నూతనత్వానికి పాదులు వేసింది. మొక్కల పెంపకానికి నర్సరీల్లో ఉపయోగించే నల్లరంగు ప్లాస్టిక్ కవర్లతో జరుగుతున్న నష్టాన్ని కళ్లారా చూసిన 14 ఏళ్ల విద్యార్థిని శ్రీజ మదిలో కొత్త ఆలోచన మెదిలింది. కవర్లకు బదులుగా వేరుశనగ పొట్టు మిశ్రమంతో తయారు చేసి కుండీల్లో మొక్కలు పెంచితే పర్యావరణహితంగా ఉంటుందని శ్రీజ భావించింది. తన సహ విద్యార్థి రామకృష్ణ, గణిత ఉపాధ్యాయుడు ఆగస్టీన్ సహకారంతో జీవకుండీలు తయారు చేయడంలో విజయం సాధించింది. కుండీల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు కూడా స్థానికంగా లభించేవి కావడం శ్రీజ ఆవిష్కరణకు మరింత ఉపయోగపడింది. శ్రీజ చేసిన ఆవిష్కరణకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్తోపాటు సీఎస్ఐఆర్ తదితర ప్రతిష్టాత్మక సంస్థల గుర్తింపు లభించింది. టీ వర్క్స్ బయోప్రెస్ యంత్రాల తయారీ జీవకుండీలుగా పిలిచే బయోపాట్స్ తయారీకి రూపొందించిన ‘బయోప్రెస్’యంత్రాలను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు టీ వర్క్స్ సన్నాహాలు చేస్తోంది. జీవకుండీలను వివిధ రూపాలు, వేర్వేరు సైజుల్లో తయారు చేసేందుకు, ఇంట్లో లభించే స్టీలు గ్లాసులు, ఇతర వంటపాత్రలను శ్రీజ మోల్డ్ (అచ్చులు)గా ఉపయోగించింది. మరోవైపు జీవకుండీల తయారీ ప్రయోగాలలో శ్రీజకు టీ వర్క్స్ సహకారం అందిస్తోంది. శ్రీజ రూపొందించిన బయోపాట్ ఫార్ములేషన్కు పేటెంట్ సాధించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని టీ వర్క్స్ ప్రకటించింది. ఒక్కో బయోప్రెస్ యంత్రానికి నెలకు ఒక్కో షిఫ్ట్లో 6 వేల జీవకుండీలను తయారు చేసే సామర్థ్యం ఉంటుంది. బయోప్రెస్ యంత్రం డిజైన్కు మార్పులు, చేర్పులు చేస్తే నెలకు 50 వేల కుండీలను కూడా తయారు చేసే అవకాశముంది. 2020 ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో శ్రీజ ఆవిష్కరణ మా దృష్టికి వచ్చింది. ఈ ఆవిష్కరణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతోపాటు ఇతర చోట్ల జీవకుండీల వినియోగం పెరిగేలా మార్కెటింగ్పై దృష్టి పెడుతున్నాం. ఈ కుండీల తయారీ నిమిత్తం మహిళా స్వయం సహాయక సంఘాలకు అవసరమైన శిక్షణ ఇస్తాం. – డాక్టర్ శాంత తౌటం, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, టీఎస్ఐసీ పడేసిన ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయం ఆలోచించా హరితహారంలో నల్ల ప్లాస్టిక్ కవర్లు తొలగించి వృథాగా పడేయడం నాలో ఆలోచనను కలిగించింది. కవర్లు చింపే క్రమంలో మొక్కల వేరు వ్యవస్థ దెబ్బతింటుందని గమనించా. దీంతో మా గ్రామంలో దొరికే వేరుశనగ పొట్టును మిశ్రమంగా చేసి బయోపాట్స్ తయారు చేశా. మొక్కతోపాటు 20 రోజుల వ్యవధిలో కుండీ కూడా భూమిలో కలిసి నైట్రోజన్, ఫాస్ఫరస్ వంటి ఎరువుగా పనిచేసింది. – శ్రీజ, జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని, చింతలకుండ, జోగుళాంబ గద్వాల జిల్లా చదవండి: Ganesh: జజ్జనకరి జనారే.. నిమజ్జన హుషారే -
హైదరాబాద్: నగరవాసులకు తీపి కబురు
సాక్షి, బంజారాహిల్స్: నగరవాసులకు తీపి కబురు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నర్సరీ మేళా వచ్చేస్తోంది. ప్రకృతి ప్రియులకు చేరువలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ఆలిండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షో పేరుతో పదో గ్రాండ్ నర్సరీ మేళా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ ఈ నర్సరీ మేళాను నిర్వహిస్తోంది. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ప్రవేశ రుసుము రూ.20. చదవండి: పేరుకి కోటీశ్వరులు.. మరి అందులో కక్కుర్తి ఎందుకో ► ఈ మేళాలో వివిధ రకాల మొక్కలు, వివిధ ప్రాంతాల అరుదైన జాతులను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా గార్డెనింగ్ మెథడ్స్, టెర్రస్ గార్డెనింగ్, వరి్టకల్ గార్డెనింగ్, హైడ్రోపోనిక్, కిచెన్ గార్డెనింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ► దేశవ్యాప్తంగా వివిధ జాతుల మొక్కలను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. తాజా సాంకేతిక పరిజ్ఞానంతో మొక్కల పెంపకంపై అవగాహన కలిగించనున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ మేళాలో వందస్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. నర్సరీ ప్లాంట్లు కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ► గ్జోటిక్ ప్లాంట్స్, బోన్సాయ్, అడనీయం, ఇండోర్, అవుట్డోర్, హై క్వాలిటీ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ ప్లాంట్స్, మెడిసినల్ అండ్ ఆక్సిజన్ ప్యూరిఫయింగ్ ప్లాంట్స్, ఆర్గానిక్ మొక్కలు, సేంద్రీయ ఎరువులు, సెరామిక్ అండ్ ఫైబర్ ప్లాంట్ స్టాండ్స్, హై క్వాలిటీ సీడ్స్, బల్బ్సŠ, టూల్స్, దేశీయ, అంతర్జాతీయ ఎక్విప్మెంట్ ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. కోవిడ్ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఈ మేళా జరుగుతోంది. -
నర్సరీ మేళాకు విశేష స్పందన..
-
తెల్లదోమ విజృంభణ
సర్పిలాకార తెల్లదోమ దెబ్బకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉద్యానతోటలు అతలాకుతలమవుతున్నాయి. మరీ ముఖ్యంగా కొబ్బరి, ఆయిల్ పామ్ తోటలను ఇది పీల్చి పిప్పి చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం పూల ð ¬క్కలకు ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీలనూ తెల్లదోమ చుట్టుముట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల రైతాంగంతోపాటు తెలంగాణలోని సత్తుపల్లి ప్రాంత కొబ్బరి, ఆయిల్ పామ్ రైతులను సైతం కలవరపెడుతోంది. దీనిని ఎదుర్కొనేందుకు అధికారులు, శాస్త్రవేత్తలు సంయుక్తంగా కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఉద్యాన శాఖ సమీక్షలో ఆదేశాలిచ్చారు. ఇప్పటికే ఈ పనిలో నిమగ్నమైన అధికార యంత్రాంగం సీఎం ఆదేశాలతో నివారణ చర్యలను ఉధృతం చేసింది. రూగోస్ తెల్లదోమ ఇలా వ్యాపిస్తుంది ► వలయాకారపు తెల్లదోమ (రూగోస్) ప్రధానంగా గాలి ద్వారా తొలుత కొబ్బరి, ఆయిల్ పామ్ చెట్లను ఆశిస్తుంది. వీటిలో చక్కెర ఎక్కువ ఉండటమే దీనికి ప్రధాన కారణం. ► అక్కడి నుంచి జామ, మామిడి, పూలు, అలంకరణ మొక్కలను ఆశిస్తుంది. ► ఆకులో ఉండే పత్ర హరితాన్ని హరిస్తుంది. ► ఆకుల నుంచి రసాన్ని పీల్చి వేసి మైనం లాంటి తెల్లటి పదార్థాన్ని విసర్జిస్తుంది. దానిపై ’కాప్నోడియం’ అనే బూజు పెరిగి.. ఆకుపై నల్లటి పొర ఏర్పడుతుంది. దీని వల్ల సూర్యరశ్మి అందక కిరణజన్య సంయోగ ► క్రియ స్తంభించి చెట్టు పూర్తిగా నీరసించిపోతుంది. ► కొబ్బరిలో 40 శాతం, ఆయిల్ పామ్లో 35 శాతం దిగుబడి తగ్గిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ► తెల్లదోమను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని, నివారణే మార్గమంటున్నారు. ఎక్కడెక్కడ ఉందంటే..? ► తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొబ్బరి తోటల్ని, ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల్లోని వేలాది ఎకరాల ఆయిల్ పామ్ తోటల్ని ఇది ఆశించింది. ► తెలంగాణలోని సత్తుపల్లి ప్రాంతంలో కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్ని కూడా తెల్లదోమ ఆశించింది. ► కడియం నర్సరీలలో కొబ్బరి, ఆయిల్ పామ్, జామ, అలంకరణ మొక్కలను సైతం తెల్లదోమ కమ్మేసింది. ► 1.60 లక్షల ఎకరాల కొబ్బరిని, అదే స్థాయిలో ఆయిల్ పామ్ తోటల్ని ఇది ఆశించినట్టు అనధికారిక అంచనా. సమగ్ర యాజమాన్యంతోనే తెల్లదోమకు చెక్ ► సర్పలాకార తెల్లదోమ సోకితే రసాయనిక పురుగుమందులు చల్లటం తగదు. వీటిని చల్లితే మిత్రపురుగులు నశించి తెల్లదోమ రెండు–మూడు రెట్లు విజృంభిస్తుంది. అందువలన అవాంఛిత పురుగుమందుల వాడకం నివారించి మిత్రపురుగులను పెంచుకోవాలి. ► జీవ నియంత్రణతో తెల్లదోమను అదుపు చేయొచ్చు. ► కొబ్బరి, ఆయిల్పామ్ తోటల్లో పసుపు రంగు టార్పలిన్ అట్టలను ఎకరానికి 10 నుంచి 15 చొప్పున (1 మీ.“ 1 మీ. విస్తీర్ణం) అతికించి, వాటికి ఆముదం పూసి, తెల్లదోమ తల్లి పురుగులను ఆకర్షించి, చంపాలి. ► వీటి ద్వారా దోమను పూర్తిగా అదుపు చేయకున్నా.. ఒక తల్లి దోమను చంపడం ద్వారా 100 పిల్ల దోమలను నిరోధించవచ్చు. ► తెల్లదోమ సోకిన మొక్కలను ఒక చోట నుంచి మరొక చోటకు తరలించకూడదు. ► డైకోక్రైసా ఆస్టర్ పురుగు తెల్లదోమ గుడ్లను తినేస్తుంది. డైకోక్రైసా ఆస్టర్ సంతతి వృద్ధికి దాని గుడ్లను తెల్లదోమ ఆశించిన తొలి దశలోనే చెట్ల ఆకులకు పిన్ చేసుకోవాలి. వీటిని అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధనా స్థానంలోనే దేశంలోకెల్లా మొట్టమొదటి సారిగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఏడాది 15 లక్షల గుడ్లను ఉత్పత్తి చేసి రైతులకు అందించారు. దేశవ్యాప్తంగా రోజుకు 3–4 లక్షల గుడ్లకు డిమాండ్ ఉంది. వచ్చే ఏడాది నుంచి రోజుకు లక్ష గుడ్ల ఉత్పత్తికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ► మిత్రపురుగైన ఎన్కర్సియా గ్వడెలోపే అనే బదనికలు ఈ తెల్లదోమలను అదుపులో ఉంచుతాయి. ఈ పురుగును ప్రయోగశాలలో ఉత్పత్తి చేసే అవకాశం లేదు. సహజ సిద్ధంగా కొబ్బరి తోటల్లో ఈ మిత్ర పురుగులు అభివృద్ధి చెందుతుంటాయి. అక్కడి నుంచి సేకరించి తెల్లదోమ ఆశించిన ప్రాంతాల్లో విడుదల చేయాలి. ► రిజర్వాయర్ మొక్కలు / బ్యాంకర్ మొక్కలను పెంచడం వలన ఎన్కార్సియా గ్వడెలోపే సంతతి పెరుగుతుంది. ► పురుగు స్థాయి ఎక్కువగా ఉండి మిత్రపురుగులు లేకపోతే, 1 శాతం వేపనూనెకు 10 గ్రా. డిటర్జెంట్ పౌడర్ కలిపి ఆకు అడుగు భాగాలు పూర్తిగా తడిచేలా 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ► ఐసోరియ ఫ్యూమోసోరోసే అనే రకం కీటకాలను అరికట్టే శిలీంధ్రాన్ని లీటరు నీటికి 5 గ్రాముల స్పోర్స్ సాంద్రత 1“108గా ఉండాలి చొప్పున కలిపి తయారు చేసుకున్న శిలీంద్ర ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయడం ద్వారా తెల్లదోమను అదుపులోకి తేవచ్చు. శిలీంద్రం సాంద్రత తగినంత లేకపోతే ఫలితాలు పాక్షికంగానే వస్తాయి. ఒక ప్రాంతంలో రైతులందరూ కలిసికట్టుగా చేయాల్సి ఉంటుంది. శిలీంద్ర ద్రావణాన్ని తయారు చేసుకునే పద్ధతిని అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధనా కేంద్రంలో రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు మదర్ కల్చర్ను కూడా పంపిణీ చేస్తున్నారు. ► నీటికి కొరత లేకపోతే.. నీటిలో డిటర్జెంట్ పౌడర్ కలిపి తెల్లదోమ ఆశించిన మొక్కలపై 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ► పగటి ఉష్ణోగ్రత పెరగేకొద్దీ తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. 40 డిగ్రీల సెల్షియస్కు పెరిగేటప్పటికి తగ్గుతుంది. ► రైతులు సామూహికంగా నివారణ చర్యలు చేపడితే సర్పలాకార తెల్లదోమను సమర్థవంతంగా అరికట్టవచ్చు. – డా. ఎన్బీవీ చలపతిరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధన స్థానం, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, అంబాజీపేట, తూ.గో. జిల్లా – ఎ. అమరయ్య, సాక్షి బ్యూరో, అమరావతి -
దొరవారొస్తున్నారు.. దాక్కోవాలి!
ఇప్పుడు మా ఎస్.పీ. దొరవారొస్తారు. ఆయనకు చాలా కోపం. చిన్నపిల్లలు కనిపిస్తే గట్టిగా అరుస్తారు, భయపెడ్తారు.‘నా చిన్నప్పుడు..’ అని చెప్పుకోవాలంటే అందరికీ సరదాగానే ఉంటుంది. చిన్నప్పుడు బెరుకు భయమేకాదు కల్మషం లేని మనసులతో చేసిన పనులు కాబట్టి అందులో ఎప్పుడూ సరదానే కనిపిస్తుంది. ఎవర్ గ్రీన్ సినిమాల్లాగా బాల్యం ఎప్పటికీ ఎవర్ గ్రీనే కదా మరి!నాకు రెండేళ్ళ వయసున్నప్పుడు అమ్మమ్మ తాతయ్యల దగ్గరే ఉండేదాన్ని. అమ్మ ఒక్కతే కూతురు కావటం, పైగా నాకూ చెల్లికి ఏణ్ణార్ధమే తేడా కాబట్టి ఇద్దరు పిల్లలతో మా అమ్మ చేసుకోలేదని కూడా నన్ను అమ్మమ్మవాళ్ళే తెచ్చేసుకున్నారు. నాక్కూడా అమ్మమ్మ తాతయ్యలే ఎక్కువ ఇష్టం కాబట్టి తాతయ్యను తాతయ్యా అని అన్నా అమ్మమ్మను మాత్రం అమ్మా అనే పిలిచే దాన్నట.తాతయ్య అప్పటికి ఇంకా ఉద్యోగంలోనే ఉన్నారు. అప్పుడు తాతయ్య హెడ్ కానిస్టేబుల్గా ఉండేవాళ్ళు. ఇప్పట్లోలాగా నా అదష్టంకొద్దీ అప్పుడు డే కేర్ సెంటర్లు, నర్సరీ స్కూళ్ళు లేక నేను బ్రతికిపోయానుగానీ పాపం మా అమ్మమ్మ వీరబలైపోయేది రోజూ నేనడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక. మరీ చోద్యం కాకుంటే అందరు పిల్లల్లాగే నాకూ డౌట్లు వచ్చేవండి. అడిగితేనేమో పెద్దవిసిగిచ్చేస్తున్నట్టు భావిస్తారు నేనేంచేయను. కానీ నేను కాస్త అదేదో ఇప్పటివాళ్ళు అన్నట్టు ‘హైపరేక్టివ్’ అనుకుంటా.ప్రశ్నలంటే చిన్నవే.. ‘మా పెరట్లోని మామిడి చెట్టుమీదున్న కాకికి తెలుగు వచ్చా? రాదా? ఒకవేళ వస్తే దాని ‘కా’ భాషలో ‘అన్నంతినాలి’ అని ఎలా చెప్తుంది? ఒకవేళ రాకుంటే ఎలా మాట్లాడుకుంటాయి? కాకి వాళ్ళింట్లో ఎంతమంది ఉంటారు? కాకిపిల్లకు అమ్మమ్మ ఉందా? ఉంటే ఏమని పిలుస్తుంది?’ జస్ట్ ఇంతే...ఇలాంటివే!దానికే భయపడిపోయి అమ్మమ్మ ఒకరోజు ‘బాబ్బాబు రేపు మన ఊళ్ళో జాతర కదా? ఇది ప్రశ్నలతో నన్ను తినేస్తుంది..నేను ఏ పని చేసుకోలేను. రేపు అమ్మాయివాళ్ళు కూడా వస్తారాయె కాస్త ఈ పూటకి నీతో మీ స్టేషన్ కి పట్టుకెళ్ళమని’ బ్రతిమాలుకుందట. తాతయ్య నా పక్షమే కాబట్టి అందరు నన్ను పిడుగన్నా ఆయనొక్కరే ప్రేమగా ‘శాంతకుమారీ’ అని పాతతరం సినిమాల్లో శాంతంగా ఉండే ఒకావిడ పేరుని నాకుపెట్టి పిలిచేవాళ్ళు. ‘ఎందుకే బిడ్డను అలా అంటావు? పసిపిల్ల ఏదో తెలియక నాలుగు ప్రశ్నలేస్తే చెప్పినంత మాత్రాన ఏమైపోతుంది? నీ నోరేమైనా అరిగిపోతుందా?అసలా వయసుకి అలా అడగాలన్న బుద్ధి ఎంతమందికుందో చెప్పు’ అని, ‘ఏం ఫరవాలేదు మా అమ్ములు ఇవ్వాళ నాతోనే వస్తుందిలే. నీ పనులేవో చేసుకో’ అనేసి నన్ను వాళ్ళ స్టేషన్ కి తీసుకెళ్ళారు. నేనప్పుడు నా కిష్టమని యాపిల్సు, కేకులు తప్ప మరేమీ తినేదాన్నికాదు. తాతయ్య గారాబం ఎక్కువేకనుక హేంగరుకెప్పుడూ బ్యాగులో యాపిల్సు, వంటగదిలోని స్టీలు డబ్బాలో కేకుముక్కలు స్టాకుండేవి. రెండేళ్ళకే నాలుగేళ్ళదాన్లా ముద్దుగా బొద్దుగా ఉండేదాన్నట. మర్నాడు జాతర ఏర్పాట్లగురించి పరిశీలించడానికి ఆకస్మికంగా అప్పటికప్పుడే ఎస్.పీ.గారు వస్తున్నారని తెలిసిందిట.అంతే. మా తాతయ్యకు కాలు చెయ్యి ఆడలేదుట. అప్పట్లో ఆఫీసర్లు చాలా స్ట్రిక్ట్గా ఉండే వాళ్ళట. కనీసం నన్ను ఇంటిదగ్గర వదిలొచ్చే సమయమైనా లేదని భయపడిపోయి గబగబా అక్కడున్న ఇనప్పెట్టె వెనుక నన్ను కూర్చోబెట్టి ‘అమ్ములు బంగారూ..! ఇప్పుడు మా ఎస్.పీ.దొరవారొస్తారు. ఆయనకు చాలా కోపం. చిన్నపిల్లలు కనిపిస్తే గట్టిగా అరుస్తారు, భయపెడ్తారు. కాబట్టి నువ్విక్కడే ఆయనకు కనిపించకుండా కూర్చుంటే ఆయనెళ్ళిపోయాక నీకు బోలెడన్ని చాక్లెట్లు, బిస్కెట్లుకొనిపెడ్తాను’ అనేసి హడావిడిగా వెళ్ళిపోయి అందరితో బాటూ అటెన్షన్లో నిలబడ్డాడట సెల్యూట్ ఫోజులో.జీపుదిగి నేరుగా ఎస్.పీ.గారొచ్చి చైర్లో కూర్చుని మాట్లాడుతున్నారట. రెండంటే రెండునిముషాలైనా కాకుండానే నేను లేచి బయటకొచ్చేసి నేరుగా ఆయనదగ్గరికే వెళ్ళిపోయి ‘ఎస్.పీ దొరవారంటే మీరేనా? మా తాతయ్య మీరెళ్ళే వరకూ నన్నక్కడ దాక్కోమన్నారు. మీరెందుకు అందర్నీ భయపెడ్తారు? మీరెళ్ళిపోయాక మా తాతయ్య నాకు బిస్కెట్లు, చాక్లెట్లు, కేకులు కొనిపెడ్తానన్నారు. కావాలంటే మీక్కొన్నిపెడతాను మా తాతయ్యను మాత్రం భయపెట్టొద్దేం?’ అనేసరికి తాతయ్యకు పైప్రాణాలు పైనేపోగా మిగతా స్టాఫ్ ‘ఈ గోవిందస్వామికి రోజు మూడిందిరోయ్’ అని అనుకున్నారట. కానీ దొరవారు గట్టిగా నవ్వేసి నన్నెత్తుకుని ‘సరే మరైతే నాకెన్ని బిస్కెట్లు చాక్లెట్లు పెడతావో చెప్పు నేనే తెప్పిస్తా’ అని నాకోసం అవన్నీ తెప్పించిపెట్టారట. పైగా తాతయ్యతో ‘ఏమయ్యా నాగురించి పసిపిల్ల దగ్గర అబద్ధాలు చెబుతావా?’ అని నాతో ‘మంచి దొరవారు’ అనిపించుకుని వెళ్ళారట. ఇంటికొచ్చాక దిష్టి తగిలిందని అన్ని దిష్టులూ తీసినా పదే పదే ఈ కథ మా అమ్మమ్మ నాకు చెప్పి మురిసిపోతుంటుంది. – డేగల అనితాసూరి, హైదరాబాద్ -
ఊరికో నర్సరీ
సాక్షి, సిరిసిల్ల : హరితహారం కార్యక్రమం నిరాటంకంగా సాగేందుకు ఊరూరా నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. ఈమేరకు స్థలాలు ఎంపిక చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. కొత్త పంచాయతీరాజ్ జట్టంలో నర్సరీల ఏర్పాటు, మొక్కల పెంప కం, రక్షణ తదితర అంశాలను చేర్చింది. ఈ నెల 2 నుంచి కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలులోకి రావడంతో ఈమేరకు గ్రామానికో నర్సరీ ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో, ప్రభుత్వ పాఠశాలలు, భూములు, రైతుల నివాస, పరిసర ప్రాంతాల్లో నాటేం దుకు అవసరమైన మొక్కలు గ్రామ నర్సరీలోనే అందుబాటులో ఉండాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని మొత్తం 261 గ్రామ పంచాయతీల్లో 220 గ్రామ పం చాయతీల్లో నర్సరీల ద్వారా మొక్కలు పెం చాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. స్థానికంగా ఉపయోగపడే మొక్కలతో..స్థానికంగా ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా పండ్ల జాతుల మొక్కలను నర్సరీల్లో పెంచనున్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండే మొక్కలు, భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులకు అనువుగా పెరిగే మొక్కలనే ఈ నర్సరీల్లో పెంపకానికి ఎంచుకుంటారు. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న నర్సరీలకు అదనంగా మరిన్ని నర్సరీలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో నర్సరీలో 20వేల నుంచి లక్ష వరకు మొక్కలు.. గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయనున్న నర్సరీల్లో స్థానికంగా ఉన్న స్థలం, నాటడానికి అవసరమయ్యే మొక్కలను బట్టి కనీసం 20 వేల నుంచి లక్ష వరకు వివిధ జాతుల మొక్కలను పెంచనున్నారు. ఈ నర్సరీలకు గ్రామాల్లో స్థల సేకరణే కీలకంగా మారనుంది. ఈనెల 15 లోగా గ్రామ పంచాయతీల పరిధిలో అందుబాటులో ఉన్న స్థలాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నర్సరీలకు అవసరమైన స్థలం, ఫెన్సింగ్, బోరు మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుని అక్టోబర్ నాటికి నర్సరీల్లో మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈలోగా మొక్కల పెంచేందుకు అవసరమైన విత్తన బ్యాగులను ఏర్పాటు చేసేందుకు బెడ్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పాలిథిన్ బ్యాగుల్లో మట్టిని నింపి వాటిలో పండ్ల విత్తనాలు, టేక్ స్టంప్స్ నాటి అక్టోబర్ ఆఖరుకల్లా సిద్ధం చేయాల్సి ఉంది. స్థల సేకరణే ప్రధానం.. గ్రామాల్లో ఏర్పాటు చేసే నర్సరీలను ఉపాధి హామీ పథకం, గ్రామ పంచాయతీ సమన్వయంతో నిర్వహిస్తారు. ఆయా గ్రామాల్లో నర్సరీల ఏర్పాటుకు స్థల సేకరణయే ప్రధాన సవాల్గా మారింది. ప్రభుత్వ భూముల్లో కాకుండా ఎవరైనా జాబ్కార్డు ఉన్న ప్రైవేటు వ్యక్తులు స్థలం సమకూర్చితే వారికే నర్సరీ నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. నర్సరీల నిర్వహణకు ఉపాధిహామీ కూలీలను వినియోగించుకునేందుకు ప్రభుత్వ వీలు కల్పించింది. నర్సరీల నిర్వహణ, నాటిన మొక్కల సంరక్షణకు గ్రామాల్లో ప్రత్యేకంగా గ్రామ కమిటీతో కూడిన హరితసైన్యాలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచుతోపాటు ఔత్సాహికులైన రైతులు, యువకులు ఇందులో భాగస్వామ్యం కల్పించనున్నారు. నర్సరీలు, మొక్కల సంరక్షణ బాధ్యతలు వీరు చూసుకోవాల్సి ఉంటుంది. నిర్వహణకయ్యే ఖర్చు ప్రభుత్వమే చూసుకుంటుంది. -
ఊరూరా నర్సరీ ఏర్పాటు చేయాలి: జూపల్లి
సాక్షి, హైదరాబాద్ : పంచాయతీరాజ్ కొత్త చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణా రావు అధికారులకు వివరించారు. నర్సరీల ఏర్పాటు దిశగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. హరితహారం, ఎల్ఈడీ వీధిదీపాల ఏర్పాటుపై జూపల్లి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహిం చారు. జూన్ 10లోగా నర్సరీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని, జూలై 15 నాటికి నర్సరీల ఏర్పాటు పూర్తి కావాలని అన్నారు. దాదాపు మూడు వేలకు పైగా గ్రామాల్లో నర్సరీలున్నాయని, మిగిలిన గ్రామాల్లోనూ వెంటనే భూములను సేకరించి నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నర్సరీల నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీలకే అప్పగించాలని జూపల్లి అధికారులకు సూచించారు. -
నగరంలో రైతన్న ఫణివేణు!
విస్తారమైన పొలాల్లో అనేక దశాబ్దాలు వ్యవసాయం చేసిన ఒక సీనియర్ రైతు.. పిల్లల చదువుల నేపథ్యంలో నగరానికి తరలి వచ్చారు. అంతవరకే అయితే పెద్దగా చెప్పుకోవలసిందేమీ ఉండేది కాదు. కాన, ఫణివేణు(49) విభిన్నమైన సిటీ ఫార్మర్గా, సర్వీస్ ప్రొవైడర్గా మారారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలానికి చెందిన జమలాపురపు ఫణివేణు అనేక దశాబ్దాలుగా అనువంశికంగా సంక్రమించిన 22 ఎకరాల భూమిలో వ్యవసాయం చేశారు. తమ పొలంలో యూకలిప్టస్ మొక్కలు నాటి.. పిల్లల చదువుల కోసం హైదరాబాద్ నగరానికి మకాం మార్చారు. రసాయనిక అవశేషాల్లేని సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తమ ఇళ్లపైనే సాగు చేసుకోవడంపై నగరవాసులు అమితాసక్తిని కనపరుస్తుండడం.. అయితే నగరవాసులకు ఇంటిపంటల సాగులో సేవలందించే వ్యవస్థ శైశవదశలో ఉండడం ఫణివేణును ఆలోచింపజేసింది. కూరగాయలు తదితర ఆహార పంటల సాగులో తనకున్న అనుభవంతో నగరంలో ఇంటిపంటల సాగుదారులకు సర్వీస్ ప్రొవైడర్గా మారి తోడ్పాటునందించాలని కొద్ది నెలల క్రితం నిర్ణయించుకున్నారు. నగరవాసుల ఆసక్తి, ప్రత్యేక అవసరాల మేరకు మేడలపైన షేడ్నెట్ హౌస్లు నిర్మించడం.. కుండీలలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలను ఏర్పాటు చేయించడం.. చీడపీడలు రాకుండా జాగ్రత్తలు పాటించడం.. సేంద్రియ ఇంటిపంటల సాగులో సంతృప్తికరమైన దిగుబడిని రాబట్టేలా శ్రద్ధ తీసుకోవడం ఆయన ప్రత్యేకత. షేడ్నెట్ హౌస్లో పెరిగే మొక్కలకు చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని, దిగుబడి బాగుంటుందని ఆయన అంటారు. ఆసక్తితో పెంచుకునే కూరగాయలు, పండ్ల మొక్కల ద్వారా మంచి దిగుబడి సాధించాలంటే.. నాణ్యమైన విత్తనంతో నారు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని ఫణివేణు చెబుతున్నారు. హైబ్రిడ్ విత్తనాలతో కూడా సేంద్రియ ఇంటిపంటల్లో మంచి ఫలితాలు రాబట్టవచ్చంటున్న ఆయన.. ఎల్.బి. నగర్లో సొంతంగా చిన్న నర్సరీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికి 8 టెర్రస్ కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసి, వాటి బాగోగులు చూస్తున్నారు. షేడ్నెట్ నిర్మించుకొని 200 కుండీలు పెట్టుకుంటే పూర్వానుభవం లేకపోయినప్పటికీ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను నిశ్చింతగా పండించుకోవచ్చని అంటూ.. అందుకు నగరవాసులకు తోడ్పడడమే తన లక్ష్యమని ఫణివేణు(99088 79247) అంటున్నారు. అవసరమైన వారికి డ్రిప్, షేడ్నెట్లో నీటి తుంపర్లను వెదజల్లే ఫాగర్లను సైతం ఏర్పాటు చేసుకోవడం ద్వారా తక్కువ శ్రమతో ఖచ్చితమైన పంట దిగుబడిని పొందవచ్చంటున్న నగరంలో రైతన్న ఫణివేణుకు జేజేలు! -
ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్: హరితహారంలో భాగంగా ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో నర్సరీలను ఏర్పాటు చేయాలని సీఎస్ ఎస్.కె.జోషి పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో హరితహారం కార్యక్రమంపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థలు, 12751 గ్రామపంచాయతీలలో భూమి గుర్తింపు, అవసరమైన మౌలిక సదుపాయాలు, మొక్కలు తదితర వివరాలను వారంలోగా పంపాలన్నారు. అర్బన్ పార్కుల్లో నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ నర్సరీల పర్యవేక్షణకు అర్బన్ ఫారెస్ట్రీ, ఎంఏయూడీ ఓఎస్డీ కృష్ణను నోడల్ అధికారిగా నియమించినట్లు సీఎస్ తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నారు నాణ్యతే రైతుకు రొక్కం!
సాగు పద్ధతి ఏదైనప్పటికీ రైతు మంచి ఉత్పాదకత, అధిక నికరాదాయాన్ని ఆర్జించాలంటే.. విత్తనం.. ఆ విత్తనంతో తయారైన నారు కూడా అత్యంత ఆరోగ్యవంతంగా ఉండాలి. వైరస్ వంటి రుగ్మతల్లేని నారును సమకూర్చుకోవటం ప్రాథమిక అవసరం. ఈ అవసరాన్ని తీర్చే ఉదాత్త లక్ష్య సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ హైదరాబాద్ శివారులో అత్యాధునిక సాంకేతిక విజ్ఞానంతో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను నెలకొల్పింది. గత పది నెలలుగా లక్షలాది సంఖ్యలో పూలు, కూరగాయ పంటలకు సంబంధించి నాణ్యమైన నారును రైతులకు అందించింది. వందలాది మంది రైతులు, అధికారులు శిక్షణ పొందారు. కూరగా యలు, పూల సాగులో ప్రపంచస్థాయి నైపుణ్యాన్ని రైతులకు అందిస్తున్న అరుదైన నైపుణ్య కేంద్రంపై ప్రత్యేక కథనం.. తెలంగాణ ఉద్యాన శాఖ హైదరాబాద్ శివారులో (జీడిమెట్ల గ్రామం పైపుల రోడ్డులో) పదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ‘సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ పది నెలలుగా ఉద్యాన రైతులకు విశిష్టమైన సేవలు అందిస్తున్నది. 8 పాలీహౌస్లు, 6 వాకింగ్ టన్నెల్స్, షేడ్నెట్ హౌస్లు ఉన్నాయి. వీటిలో జెర్బర, కార్నేషన్, ఆర్కిడ్స్ తదితర ఖరీదైన పూలు, క్యాప్సికం, టమాటో, కీరదోస, బ్రకోలి, చెర్రీ టమాటోలు, ఆకుకూరలను అత్యాధునిక రసాయనిక పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. కొన్ని పంటలను పురుగుమందులు చల్లకుండా సాగు చేస్తున్నారు. నెలకు 12 లక్షల నారు సరఫరా 2 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటైన స్వయం నియంత్రిత హరితగృహం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్లగ్లింగ్స్ నర్సరీ పద్ధతిలో చీడపీడలు, వైరస్ సోకకుండా అత్యాధునిక సదుపాయాల మధ్య నెల రోజులు పెంచిన నాణ్యమైన నారును రైతులకు అందిస్తున్నారు. రసాయనిక/సేంద్రియ పద్ధతుల్లో లేదా పాలీహౌస్లు/షేడ్నెట్ హౌస్లు, సాధారణ పొలాల్లో కూరగాయ పంటలు సాగు చేసే రైతులు ఈ నారును తీసుకెళ్తు్తన్నారు. నెలకు 12 లక్షల నారును అందించే సామర్థ్యం ఉంది. దీన్ని 15 లక్షలకు పెంచే సన్నాహాలు చేస్తున్నారు. ముందే చెల్లించాలి ఈ హైటెక్ ఆటోమేటెడ్ గ్రీన్హౌస్లో పెంచిన నారును రెండు పద్ధతుల్లో రైతులకు అందిస్తున్నారు. క్యాప్సికం, బంతి, టమాటో పంటలకు సంబంధించి అధిక దిగుబడినిచ్చే ప్రత్యేక రకాలను సాగు చేసే రైతులు ముందుగా విత్తనాలు తెచ్చి ఇచ్చి, మొక్కకు 60 పైసల చొప్పున సర్వీసు చార్జిగా చెల్లిస్తే.. నెల రోజులు పెంచిన రోగరహితమైన నాణ్యమైన నారును సరఫరా చేస్తారు. సేంద్రియ, రసాయనిక సేద్యం చేసే రైతులు ఎవరైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. సాధారణ రకాల నారు కావాలనుకునే రైతులు విత్తనాలు తెచ్చి ఇవ్వనవసరం లేదు. మొక్కకు 75 పైసల చొప్పున డబ్బు చెల్లించి తమకు కావాల్సిన రకం నారును నెల రోజుల తర్వాత నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి వచ్చి తీసుకెళ్లవచ్చు. టమాటో, వంగ, పచ్చిమిరప, క్యాబేజి, కాలిఫ్లవర్, క్యాప్సికం, కాకర, బీర తదితర కూరగాయ పంటలకు సంబంధించిన మేలైన నారు మొక్కలను రైతులు పొందడానికి అవకాశం ఉంది. పాలీహౌస్లు, షేడ్నెట్ హౌస్లలోనే కాదు.. ఆరుబయట పొలాల్లో పంటలు సాగు చేసే రైతులు సైతం ఈ మొక్కలను వాడుతుండటం విశేషం. వేస్ట్ డీకంపోజర్తో నులిపురుగులకు చెక్! కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న ఘజియాబాద్లోని జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం రూపొందించిన వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో పంటలకు వాడుతున్నారు. ఈ కేంద్రంలో వంద మంది రైతులకు కూడా దీనిపై శిక్షణ ఇచ్చారు. మట్టి ద్వారా పంటలకు సోకే తెగుళ్లను ఇది నివారిస్తున్నదని, నులిపురుగుల (నెమటోడ్స్)ను ఇది నూటికి నూరు శాతం నివారిస్తుందని రాజ్కుమార్ తెలిపారు. వేరుకుళ్లు, బూజు తెగులును నిరోధిస్తుందని, వానపాముల వృద్ధికి అనువైన సూక్ష్మ వాతావరణం కల్పిస్తుందన్నారు. కూరగాయల బెడ్ తయారీలోనూ వేస్ట్ డీకంపోజర్ ద్రావణం ఉపకరిస్తోందన్నారు. ఇంటిపంటల సాగుదారులకు చేదోడు ఇళ్ల మీద సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకునే వారికి సైతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సేవలందిస్తున్నది. మేడలపైన సిల్పాలిన్ బెడ్స్లో సేంద్రియ ఇంటిపంటల సాగు డెమోను ఈ కేంద్రం భవనం పైన ఏర్పాటు చేశారు. గార్డెనింగ్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. క్యాప్సికం(మొక్క రూ.2), వంగ, టమాటో, క్యాబేజీ నారు(మొక్క రూ.2)ను, బంతి, చామంతి నారును విక్రయిస్తున్నారు. పనస, దొండ, బొప్పాయి (రెడ్లేడీ) మొక్కలను రూ. 20కి అమ్ముతున్నారు. కుండీలు, మట్టి+ఎరువు మిశ్రమాన్ని కూడా అందుబాటులో ఉంచారు. గాలులను తట్టుకునే షేడ్నెట్ హౌస్! తీవ్రమైన గాలులను సైతం తట్టుకొని నిలిచే కొత్త తరహా షేడ్నెట్ హౌస్ను బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) రూపొందించింది. దీని పైకప్పు సమతలంగా ఉండదు. ఎగుడు, దిగుడుగా ఉంటుంది. మధ్యలో నుంచి గాలి, వెలుతురు పారాడుతూ ఉంటాయి. ఎండ ఏటవాలుగా దీని లోపలి మొక్కల పైకి ప్రసరిస్తూ ఉంటుంది. దీనికి 50% మోనో షేడ్నెట్ వాడటంతోపాటు, షేడ్నెట్ను ఫ్రేమ్కు క్లిప్పులతో అనుసంధానం చేయటం విశేషం. ఈ సరికొత్త షేడ్నెట్ హౌస్ను జీడిమెట్లలోని ఉద్యాన నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేశారు. వేసవి పంటగా టమాటా సాగు చేయబోతున్నారు. దీంట్లో ఖరీఫ్, రబీ, వేసవి సీజన్లలో పంటలు సాగు చేయవచ్చు. టమాటా, క్యాప్సికం, పచ్చిమిర్చి, పుచ్చ, మస్క్మిలన్, వంగ, కొత్తిమీర తదితర పంటలను సాగు చేయవచ్చని, నర్సరీ పెంపకానికి కూడా ఇది అనువుగా ఉంటుందని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్చార్జ్ రాజ్కుమార్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. చ. మీ.కు రూ. 500 వరకు ఖర్చవుతుందన్నారు. మేడలపైన ఇంటిపంటల సాగుకూ ఇది అనువైనదే! నాణ్యమైన కూరగాయ పంటల నారు రైతులకు ఇస్తాం! కూరగాయలు, పూల సాగులో తెలంగాణ రైతులను రారాజులుగా తీర్చిదిద్దటమే మా లక్ష్యం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ప్రారంభమైన పంటల కాలనీలలో కూరగాయ పంటల రైతులకు సబ్సిడీపై ఇప్పటికే 25 లక్షల నాణ్యమైన, వైరస్ రహిత నారును అందించాం. ప్రస్తుతం నెలకు 12 లక్షల నాణ్యమైన నారును ఉత్పత్తి చేస్తున్నాం. రైతుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా 15 లక్షలకు పెంచబోతున్నాం. మంచి కూరగాయ పంటల నారు కావాలనుకున్న రైతులు ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. ముందుగా డబ్బు చెల్లించిన రైతులకు నెల రోజుల్లో నాణ్యమైన నారు అందిస్తున్నాం. సబ్సిడీపై నారు కావాల్సిన పంటల కాలనీల రైతులు అధికారుల ద్వారా లేఖ రాయించాలి. – గాజుల రాజ్కుమార్, ఇన్చార్జ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు coejeedimetlahyd@gmail.com – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు: కె.రమేశ్, సీనియర్ ఫొటో జర్నలిస్టు -
‘ఆధునికత’ వైపు వెళ్లాల్సిందే
నర్సరీ రైతుల సమావేశంలో పలువురు వక్తలు కడియం (రాజమహేంద్రవరం రూరల్) : నర్సరీ రంగం సంప్రదాయక విధానాలను వీడి ఆధునికత వైపునకు వెళ్లాల్సిందేనని ఏపీ నర్సరీ రైతుల సమావేశంలో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఇండియన్ నర్సరీమన్ అసోసియేషన్ (ఐఎన్ఏ) ఆధ్వర్యంలో స్థానిక జీఎన్ఆర్ ఏసీ కల్యాణ మంటపంలో ఆదివారం ఈ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఐఎన్ఏ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నర్సరీ రైతులకు ఉచిత విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు. అనంతరం సమావేశంలో సాగు విధానాల నుంచి మార్కెటింగ్, టాక్స్ చెల్లింపుల వరకు పలువురు ప్రముఖులు, శాస్త్రవేత్తలు, అధికారులు మాట్లాడారు. నర్సరీ రంగంపై ఆధారపడిన భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే ఆధునిక పద్ధతులను అవలంబించడం ద్వారా మరింత మెరుగైన మార్కెట్ను సృష్టించుకోవచ్చునని సర్వత్రా అభిప్రాయపడ్డారు. మొక్కలను ఎగుమతులు చేసేందుకు తోడ్పడే ప్లాంట్స్ క్వారంటైన్ సెంటర్ను కడియం నర్సరీలకు సమీపంలో ఏర్పాటు చేయాలని ఐఎన్ఏ ప్రధాన కార్యదర్శి పుల్లా వీరవెంకట్రావు కోరారు. సమావేశంలో ఏపీయంఐపీ పీడీ సుబ్బారావు, హార్టీకల్చర్ ఏడీ చిట్టిబాబు, హార్టీకల్చర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు, నర్సరీ రంగ ప్రముఖులు తాడాల వీరాస్వామి, కేఎన్ఏ అధ్యక్షులు పుల్లా చంటియ్య, ఐఎన్ఏ ప్రధాన కార్యదర్శి పుల్లా వీరవెంకట్రావు, కోశాధికారి టి.రవికుమార్, జీసీ సభ్యుడు ఎం.వీరబాబు, జె.సుబ్రహ్మణ్యం, నర్సరీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. రైతుల్లో చొరవ పెరగాలి కడియం ప్రాంత నర్సరీ రైతుల్లో చొరవ మరింత పెరగాలి. ఆధునిక విధానాలను అవగాహన చేసుకుని అమలు చేయాలి. ఉద్యాన రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందుకు తగిన ప్రోత్సాహకాలను మంజూరు చేస్తున్నాం. నర్సరీ రైతులు కోరిన వెంటనే పలు అనుమతులు కూడా ఇచ్చాం. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడి రైతులు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం పొందాలంటే విదేశీ మార్కెట్పై పట్టు సాధించుకోవాలి. ఇక్కడి మొక్కలను తీసుకువెళ్లి ఇతర రాష్ట్రాల్లోని వ్యాపారులు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడి రైతులు నేరుగా విదేశీ ఎగుమతులు చేస్తే మరిన్ని లాభాలనార్జించే వీలుంటుంది. నర్సరీ రైతులు అన్ని సదుపాయాలు కల్పించేందుకు ఉద్యాన శాఖ ఎప్పుడూ సిద్ధమే. – చిరంజీవ్ చౌదరి, రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ సాయిల్లెస్ సేద్యం చేపట్టాలి కేవలం మట్టిని మాత్రమే వినియోగించి మొక్కలు పెంచే విధానానికి స్వస్తి పలకాల్సిన పరిస్థితి ఉంది. కొబ్బరి పొట్టు తదితర ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలి. నెమటోడ్స్ వంటి తెగుళ్లు మట్టి ద్వారా దేశమంతా వ్యాపించే అవకాశం ఉన్నందున దీనిపై చర్యల తీసుకునే పరిస్థితి ఉంది. సరైన అవగాహన లేకపోవడం కారణంగా నెమటోడ్స్ వ్యాప్తి విస్తృతమవుతోంది. ఇప్పటికైనా జాగ్రత్త పడాలి. శాస్త్రవేత్తలు ఇచ్చే శిక్షణను కూడా వినియోగించుకోవాలి. హార్టీకల్చర్ యూనివర్శిటీకి అనుబంధంగా సబ్సెంటర్ను ఏర్పాటు చేసి రైతులకు నేరుగా సూచనలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను కోరాం. త్వరలోనే దీనిపై అనుమతి వస్తుంది. – డాక్టర్ జె.దిలీప్బాబు, వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్శిటీ రీసెర్చ్ డైరెక్టర్ 20 అడుగుల చెట్లకు డిమాండ్ ప్రస్తుతం మౌలిక వసతుల రంగం అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే నర్సరీ రంగం మరింత వేగంగా వృద్ధి చెందాల్సిన అవసరముంది. పదిహేనేళ్ల నుంచి వచ్చిన మార్పులకంటే రానున్న మూడు, నాలుగేళ్లలో మరింత విస్తృతమైన మార్పు ఈ రంగంలో చోటు చేసుకుంటుంది. నేలపైనే మొక్కలను పెంచడం కాకుండా గోడలపై, రూఫ్టాప్లపై కూడా మొక్కలను పెంచడం ప్రారంభమైంది. అందుకు తగిన మొక్కలను ఉత్పత్తి చేసేందుకు నర్సరీలు సిద్ధంగా ఉండాలి. దుబాయ్లోని బుర్జ్ఖలీఫా టవర్వద్ద ఏర్పాటు చేసిన గార్డెన్లో వేసిన అనేక రకాల మొక్కలు కడియం ప్రాంత నర్సరీ రైతులనుంచి సేకరించినవే. కానీ ఇక్కడి రైతులు నేరుగా వారికి అమ్మకపోవడంతో కష్టం నర్సరీ రైతులదైతే, లాభం మధ్యలో ఉన్నవారికి దక్కింది. విదేశీ రకాల మొక్కల కంటే మన వాతావరణానికి అనుకూలంగా మన వద్దే ఉన్న అనేక రకాల మొక్కలను గుర్తించి, అభివృద్ధి చేయాలి. తద్వారా రైతులకు లాభాలు పెరుగుతాయి. చిన్న మొక్కలకు మార్కెటింగ్ కంటే 20 అడుగులున్న మొక్కలకు విస్తృత మార్కెట్ సదుపాయం భవిష్యత్తులో ఏర్పడుతుంది. – నవీన్, సీనియర్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్, హైదరాబాద్ ఆదాయం పెంచి చూపడం ముప్పే వివిధ కారణాలతో కొందరు నర్సరీ రైతులు ఆదాయాన్ని పెంచి చూపిస్తున్నారు. ఇలా చేస్తే లాభం కంటే నష్టమే అధికంగా ఉంటుంది. దీనిని రైతులు గుర్తుంచుకోవాలి. నర్సరీ రంగానికి జీఎస్టీ అమలు చేయాలన్న ప్రతిపాదనలు ఉండడాన్ని గుర్తించి ఐఎన్ఏ అధ్యక్షుడు పల్ల సుబ్రమ్మణ్యంకు చెబితే వెంటనే స్పందించి నర్సరీ రైతులతో కలిసి ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అరుణ్జైట్లీలతో సహా 25 మంది ఎంపీలకు వినతిపత్రాలు అందజేశారు. మోడల్ బిల్లు రూపుదిద్దకోక మునుపే మేలుకోవడం వల్ల మినహాయింపు లభించింది. దీంతో నర్సరీ రంగం ద్వారా సమకూరే ఆదాయాన్ని కూడా వ్యవసాయ ఆదాయంగానే పరిగణిస్తూ జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎగుమతుల విషయంలో కూడా ఆడిటర్ల సలహాలను రైతులు పాటించాలి. – వీఎస్ ప్రకాష్రావు, చార్టర్డ్ అక్కౌంటెంట్, రాజమహేంద్రవరం -
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చిన్నారికి చోటు
ఏలూరు సిటీ : స్థానిక దక్షిణపు వీధిలోని ది ఇండో ఇంగ్లిష్ పాఠశాలలో నర్సరీ చదువుతున్న బేబీ జాగృతి త్రిశతాధిక చిత్రధారణలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించినట్టు పాఠశాల వ్యవస్థాపకుడు డాక్టర్ ఏవీఎ న్ రాజు శనివారం తెలిపారు. 20 అంశాలకు సంబంధించి సుమారు 300 పైగా చిత్రాలకు పేరు చెప్పగానే చిత్రాన్ని చూపిస్తూ రికారు సృష్టించినట్టు చెప్పారు. బేబీ జాగృతి గిన్నిస్ రికార్డ్ గ్రహీత డాక్టర్ నారాయణం శివశంకర్, సుగుణ దంపతుల కుమార్తె. జాతీయ, రాష్ట్ర చిహ్నాలు, తెలుగు కవులు, చారిత్రక ప్రదేశాలు, భారత ప్రధానులు, మంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు, ప్రముఖ క్రీడాకారులు, వాహనాలు, శరీర భాగాలు, పక్షులు, పండ్లు, కూరగాయలు, వృత్తులు, అడవి జంతువులు, ఇలా 20 అంశాలకు చెందిన చిత్రాలను చూపిస్తూ తన జ్ఞాపకశక్తిని ప్రదర్శించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి వచ్చిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ సాయిశ్రీ, ఏలూరు డివిజ న్ సలహాదారు సుబ్బారావు పర్యవేక్షించారు. ముఖ్య అతిథులుగా ఆశ్రం అస్పత్రి రిటైర్డ్ ఆర్ఎంవో డాక్టర్ పి.బాపిరాజు, చిన్మయి మిష న్ పూర్వ చైతన్య మాతాజీ హాజరయ్యారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఈబీవీ ప్రసాద్, పాఠశాల కరస్పాండెంట్ సుభద్ర రాజు, వైస్ ప్రిన్సిపాల్ కల్యాణి ప్రసాద్ పాల్గొన్నారు. -
అరుదైన వనమూలికలతో హెర్బల్ నర్సరీ !
-
కడియం రైతులకు కరెంట్ షాక్ !