Street dogs
-
30 లక్షల కుక్కల హతం!
2030 ఫిఫా వరల్డ్ కప్కు స్పెయిన్, పోర్చుగల్తో కలిసి ఆతిథ్యం ఇవ్వనున్న మొరాకో ఆ లోపు దేశంలో వీధికుక్కల బెడదను వదిలించుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఏకంగా 30 లక్షల కుక్కలను చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం! విషం పెట్టడం మొదలుకుని నానారకాలుగా వాటి ఉసురు తీస్తోంది. రక్తపు మడుగులో నిస్సహాయ స్థితిలో ఉన్న కుక్కలను ట్రక్కుల్లోకి విసిరేస్తున్న హృదయ విదారక దృశ్యాలు షాక్కు గురి చేస్తున్నాయి. దీనిపై ఇంటర్నేషనల్ యానిమల్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ కోలిషన్ (ఐఏడబ్ల్యూపీసీ) ఆందోళన వ్యక్తం చేసింది. ‘మొరాకోస్ అగ్లీ సీక్రెట్’ పేరుతో ప్రచారాన్నే ప్రారంభించింది. ఇంజక్షన్లు, ఆహారం ద్వారా విషమిచ్చి కుక్కలను అమానవీయంగా చంపుతున్నారని పేర్కొంది. దీనిపై తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ ఫిఫాకు లేఖలు వెల్లువెత్తుతున్నాయి. లేదంటే ఫిఫా ప్రతిష్ట మసకబారుతుందని పర్యావరణ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. భయానకం... మొరాకో వీధుల్లో వీధి కుక్కలు నొప్పితో కేకలు వేస్తున్న వీడియోలు వైరలవుతున్నాయి. కుక్క పిల్లను తలకిందులుగా వేలాడదీసి, భయభ్రాంతులకు లోనై చూస్తున్న కుక్కల ట్రక్కులోకి విసిరేయడం కనిపించింది. మరో వీడియోలో రెండు కుక్కలు రక్తమోడుతూ నేలపై పడున్నాయి. ఇదంతా పిల్లల ముందే జరుగుతుండటంతో వారు తీవ్ర దిగ్భ్రాంకి లోనవుతున్నారని ఐఏడబ్ల్యూపీసీ తెలిపింది. దాంతో మొరాకోపై అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వీధి కుక్కలతో తస్మాత్ జాగ్రత్త !
-
చిన్న పిల్లోడు...20 కుక్కలు ఒకేసారి..!
-
కుక్కలు మనుషుల్ని ఎందుకు కరుస్తాయి?వాటికీ ఫ్రస్ట్రేషన్ ఉంటుందా?
జిల్లాలో రోజురోజుకూ కుక్కకాటు ఘటనలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్క డో ఒక చోట మనుషులపై దాడి చేసి గాయపరుస్తూ నే ఉన్నాయి. వీధులు, రోడ్లపై గుంపులు గుంపులు గా తిరుగుతూ పాదచారులు, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని వెంబడించి మరీ కరుస్తున్నాయి. అంతేకాకుండా ఇళ్లలోకి దూరి దాడి చేస్తున్నాయి. శునకాల దాడిలో చిన్నారులు ప్రాణాలు వదిలిన సందర్భా లు అనేకం. కుక్క కాటుకు గురైన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. రోజు రోజుకు కుక్కల బాధితులు పెరిగిపోతున్నారు. కుక్కలు కరవడం వల్ల రేబిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. రేబిస్ వల్ల ఏటా 55 వేల మందికి పైగా చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మన దేశంలో కుక్క కాటుకు ఏటా 15 వేలకు పైగా మంది చనిపోతున్నారు. ఆకలితో దాడి చేస్తున్నాయా..? ఇంతకీ కుక్కలు మనుషులపై ఎందుకు తెగబడుతున్నాయి. ఆకలితోనా లేక దూపతోనా.. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకప్పుడు వీధి కుక్కలు మనుషులపై దాడి చేసేవి కావు. గ్రామాల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినా, వాటికి హాని చేసే జంతువులు, ఇతర ప్రాణులు ఏవైనా కనిపిస్తే దాడి చేయడం చూశాం. కానీ ఇప్పుడు మనుషులపై దాడి చేయడం ఎక్కువైంది. ఏ కుక్క మంచిదో ఏది పిచ్చిదో తెలియని పరిస్థితి నెలకొంది. శునకాల దాడికి ప్రధాన కారణం ఆకలి అని పలువురు అంటున్నారు. గ్రామాల్లో, మున్సిపలిటీల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా మెరుగుపడింది. దీంతో వాటికి ఆహారం దొరకడం లేదు. అలాగే ఇంటింటా చెత్త సేకరణ ప్రారంభమయ్యాక రోడ్డు పక్క అన్నం, ఇతర ఆహార పదార్థాలు పడేయడం తగ్గింది. దీంతో వాటికి ఆహారం దొరకడం కష్టంగా మారింది. పైగా కుక్కలు తరుచూ దాడి చేస్తుండడంతో వాటిని ఎవరూ చేరదీసి ఆహారం పెట్టడం లేదు. దీంతో అవి ఆకలికి అలమటిస్తున్నాయి. కనీసం దాహం తీర్చుకునేందుకు వీధి నల్లాల వద్ద నీరు కూడా దొరడం లేదు. కుక్కలు డీ హైడ్రేషన్కు గురైనప్పుడు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఆ సమయంలో అధిక శబ్ధం వినిపించినా, వ్యక్తులు అధికంగా తన పక్క నుంచి తిరిగినా, వాటి పక్క నుంచి హఠాత్తుగా పరుగెత్తుతున్న కుక్కలు కరిచేసే అవకాశం ఉంది. కొన్ని సార్లు ప్రజల్ని భయపెట్టడానికి కుక్కలు అరుస్తుంటాయి. అవి అలా అరుస్తూ వెంటపడినప్పుడు ప్రజలు పరుగెడతారు. దీంతో తమకు భయపడి మనుషులు పరుగెడుతున్నారని కుక్కలు భావిస్తాయి. ఈ క్రమంలోనే వాళ్లను వెండిస్తూ కరచే దాకా వదలవు. ఇలా చేస్తే కుక్క కాటు నుంచి తప్పించుకోవచ్చు .. ►కుక్క దగ్గరికి వస్తే కదలకుండా నిలబడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగెత్తరాదు. కళ్లలోకి తదేకంగా చూడరాదు. కుక్క పిల్లల దగ్గరికి వెళ్లరాదు. ► నిద్రిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పిల్లలకు పాలిస్తున్నప్పుడు ఏ రకంగానూ ఇబ్బంది పెట్టరాదు. ► కుక్క దాడి చేసేటప్పుడు ముఖాన్ని పంచె లేదా తువ్వాలు తదితర వాటితో కప్పుకోవాలి. ఏమీ లేకపోతే చొక్కాను పైకి జరుపుకోవాలి. లేదా ముఖాన్ని చేతులతో కప్పుకోండి. ముఖంపై కరిస్తే ఇన్ఫెక్షన్ మెదడుకు త్వరగా సోకుతుంది. దీనివల్ల ప్రాణహాని ఉండే ప్రమాదం ఉంది. ►కుక్క కోపంగా దగ్గరికి వస్తే నేల వైపు చూస్తూ దానికి దూరంగా మెల్లగా నడవాలి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికారాబాద్ మున్సిపల్ పరిధిలో గత ఏడాది ఏర్పాటు చేసిన ఏబీసీలో 1,429 శునకాలకు సంతానం కలగకుండా ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ల అనంతరం కొన్నాళ్ల పాటు సెంటర్లోనే ఉన్న కుక్కలు బయటి వచ్చాక వరుసపెట్టి జనాలపై దాడికి తెగబడుతున్నాయి. వీధి కుక్కలను ఒకేచోట పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు బంధించి ఉంచడంతో అవి ఒత్తిడికి లోనై మనుషులపై దాడి చేస్తున్నట్లు తెలిసింది. తాండూరులోని ఏబీసీ సెంటర్లో కూడా సుమారు 1,247 కుక్కలకు ఆపరేషన్లు చేశారు. కుక్క కరిస్తే ఏం చేయాలి? కుక్క కాటుకు గురైన వ్యక్తి ఐదు సార్లు రేబిస్ వ్యాధికి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. కుక్క కాటు వల్ల బాగా గాయం అయ్యి రక్తస్రావం అయితే వ్యాక్సిన్ తో పాటు కరిచిన చోట ఇమ్యునొగ్లోబిలిన్స్ ఇంజెక్షన్ తీసుకోవాలి. కుక్క కరిస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే..గతంలో కుక్క కాటుకు గురైన వ్యక్తికి ఒకప్పుడు బొడ్డు చుట్టూ 16 ఇంజెక్షన్లు వేసేవారు. దీంతో ఆ వ్యక్తి ఎంతో బాధను అనుభవించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ పద్ధతి మారింది. వ్యాక్సినేషన్ ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 3వేల కుక్కలకు రేబీస్ వ్యాధి సోకకుండా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ వేశారు. అయినా ఎక్కడో ఒక చోట రేబీస్ వ్యాధితో కుక్కలు జనాలపై దాడి చేస్తున్నాయి. రేబిస్తో చాలా ప్రమాదం రేబీస్ వ్యాధికి గురైన పశువులను కుక్కలు కరిసినా, రేబీస్ వ్యాధి ఉన్న కుక్కను మరో కుక్క కరిచినా వ్యాధి ఒకదాని నుంచి మరొక దానికి సోకుతుంది. ఆ కుక్కలు మనుషులను కరిస్తే ప్రమాదం. వెంటనే వైద్యులను సంప్రదించాలి. అయితే రేబీస్ వ్యాధి సోకుండా ప్రతి ఏటా జూన్ మొదటి వారంలోనే పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో టీకాలు వేస్తున్నాం. పెంపుడు కుక్కలకు కూడా వాటి యజమానులు తప్పకుండా వ్యాక్సిన్ వేయించాలి. కుక్కలను భయపెట్టడం, నేరుగా వాటివైపు చూడడం, వాటి దగ్గరగా పెద్ద చప్పుడు చేయడం వంటివి చేయరాదు. అలా చేస్తే అవి దాడిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. – అనిల్కుమార్, జిల్లా పశు వైద్యాధికారి -
‘భౌ’బోయ్.. కరుస్తున్నాయ్!
సాక్షి, అమరావతి: కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 82 శాతం మంది ప్రజలు నిత్యం వీధి, పెంపుడు శునకాలతో దాడి ముప్పు పొంచి ఉందని భయపడుతున్నారట. ఇందులో 61 శాతం మంది ఇలాంటి దాడులు సర్వ సాధారణమని చెప్పగా.. ఇది గతంతో పోలిస్తే 31 శాతం పెరుగుదలను చూపిస్తోంది. లోకల్ సర్కిల్స్ దేశవ్యాప్తంగా 326 జిల్లాల్లో 53 వేల మందికిపైగా ప్రజల నుంచి ప్రతి స్పందనలు స్వీకరించింది. వీరిలో 67 శాతం పురుషులు, 33 శాతం మహిళలు ఉన్నారు. ప్రతి 10 మందిలో 8 మంది కుక్కల బెడదను తొలగించడంలో అధికారుల సహకారం దూరమైందని అభిప్రాయపడ్డారు. వీధి కుక్కల నియంత్రణ, పెంపుడు కుక్కల డేటా సేకరణలోనూ నిర్లక్ష్యంగా ఉన్నట్టు సర్వే తెలిపింది. కేవలం 10 శాతం మంది మాత్రమే అధికార యంత్రాంగంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 71 శాతం మంది ప్రజలు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద విచ్చలవిడి జంతు నిర్వహణకు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం విశేషం. 36 శాతం రేబిస్ మరణాలు భారత్లోనే! దేశంలో జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం–1960 ప్రకారం జంతువులను హింసించడం, చంపడం చట్టవిరుద్ధం. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్–2001 ప్రకారం.. వాటి జనాభాను తగ్గించడానికి వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, టీకాలు వేయాల్సి ఉంటుంది. అయితే, చాలా రాష్ట్రాల్లో నిధుల కొరతతో వీధి కుక్కలకు టీకాలు వేయడంలో విఫలమవుతున్నట్టు సర్వే చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా రేబిస్ మరణాలలో 36 శాతం భారతదేశం నుంచే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అంటే 18వేల నుంచి 20వేల మరణాలు సంభవిస్తున్నాయి. 30నుంచి 60 శాతం మృతుల్లో 15 ఏళ్లలోపు చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారు. వీధి శునకాలకు వేటాడే స్వభావం వీధి శునకాలకు విచ్చలవిడిగా వేటాడే స్వభావం ఉంటుందని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవి సంచరిస్తున్న ప్రదేశంలో ఆహారం లభించకుంటే చిన్నచిన్న జంతువులను చంపి తింటాయని.. ఆ ప్రక్రియ వాటి మానసిక ప్రవృత్తిని ప్రభావితం చేస్తోందని వాదిస్తున్నారు. ఏటా ఆడ శునకం 20 పిల్లలకు జన్మనిస్తుంది. ఒక్కసారి కారు, బైక్ ప్రమాదంలో శునకం పిల్ల చనిపోతే ఆ వాహనాన్ని శత్రువుగా భావిస్తుంది. అలాంటి వాహనాలు వస్తే దూకుడుగా వెంబడించడం.. దాడి చేయటం వాటికి అలవాటుగా మారుతుందంటున్నారు. గతేడాది మహారాష్ట్రలో అత్యధికంగా 3,46,318 శునకాల దాడుల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 3,30,264 కేసులతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. ఏపీలో 1,69,378, ఉత్తరాఖండ్లో 1,62,422, కర్ణాటకలో 1,46,094, గుజరాత్లో 1,44,855, బీహార్లో 1,18,354 కేసులొచ్చాయి. -
కరీంనగర్ జిల్లాలోనూ కుక్కలు స్వైర విహారం
-
హైదరాబాద్ లో కుక్కల బెడదపై స్పందించిన కేటీఆర్
-
హైదరాబాద్ అంబర్ పేటలో విషాదం
-
పిచ్చికుక్కలు స్వైరవిహారం...20 మంది పై దాడి
సాక్షి, హైదరాబాద్/అల్వాల్: ఓల్డ్ అల్వాల్ ప్రెసిడెన్సీ కాలనీలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. కుక్కల దాడిలో దాదాపు 20 మందికి పైగా కాలనీ వాసులు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బుధవారం రాత్రి కాలనీలో పాదచారులు, బయట ఆడుకుంటున్న చిన్నారులపై దాదాపు మూడు పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఫలితంగా కాలనీలో నివసించే వారితో పాటు అటుగా వెళ్తున్న పాదచారులు సైతం తీవ్ర గాయాల పాలయ్యారు. దాదాపు 20 మందికి పైగా కుక్కల దాడిలో గాయపడ్డారు. గాయత్రి అనే అయిదేళ్ల చిన్నారిపై పిచ్చి కుక్క విచుకుపడటంతో ఆమె ముఖంపై తీవ్ర గాయమై పెద్ద ఎత్తున రక్తస్రావం జరిగింది. కాలనీలో గురువారం ఉదయం వరకు పిచ్చికుక్కలు వీరంగం చేశాయి. దీంతో జీహెచ్ఎంసి సిబ్బంది కుక్కలను పట్టుకువెళ్లారు. కుక్కల బెడద తప్పేదెప్పుడు..? కుక్కల సంతాన నియంత్రణకు, ప్రజలు కుక్కకాట్ల బారిన పడకుండా ఉండేందుకు ఏటా దాదాపు రూ.10 కోట్లు జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తున్నప్పటికీ, నగరంలో పిచ్చి కుక్కల బెడద తప్పడం లేదు. తాజాగా అల్వాల్ సర్కిల్ పరిధిలో కుక్కలు 20 మందిని కరవడంతో నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రెండేళ్ల క్రితం సైతం అమీర్పేటలో ఓ కుక్క దాదాపు 50 మందిని కరవడం తెలిసిందే. అప్పట్లో ఆ కుక్కకు రేబిస్ వ్యాధి ఉన్నట్లు బెంగళూర్లోని పరిశోధన సంస్థ వెల్లడించింది. తాజా ఘటనలోనూ పరీక్ష ఫలితాలు వెలువడితే కానీ దానికి రేబిస్ ఉందో, లేదో తెలియదు. కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు, రేబిస్ సోకకుండా వ్యాక్సిన్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అనుమానాలకు తావిస్తోంది. కుక్కల సంఖ్యను తగ్గించేందుకు ఏడాది క్రితం కొన్ని వార్డులను ఎంపిక చేసి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రకటించిన అధికారులు దాని ఫలితాలేమిటో వెల్లడించలేదు. వీధి కుక్కలను పట్టుకురావడం.. సంరక్షణ బాధ్యతల్ని సైతం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించినట్లు పేర్కొన్నారు. అయినా నగరంలో కుక్కల బెడద తప్పడం లేదు. ఏటా ఎన్నో ఆపరేషన్లు చేసినట్లు చెబుతున్నా ఇప్పటికీ నగరంలో పది లక్షలపైనే వీధి కుక్కలున్నట్లు అంచనా. ప్రతినెలా నగరంలో 2వేల నుంచి 4వేల మంది వరకు కుక్కకాట్ల బారిన పడుతున్నారు. (చదవండి: ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో మజాక్ చేస్తే ఇట్లనే ఉంటది) -
మూగప్రేమకు అమ్మానాన్న.. 50 ఏళ్లకుపైగా సేవలు
‘మానవసేవే మాధవసేవ’గా భావిస్తారు. ఈ దంపతులు మాత్రం అంతకుమించి జంతుసేవలో జీవిత పరమార్థాన్ని తెలుసుకున్నారు. ‘ఆకలి’ అన్ని ప్రాణులకు సమానమే. మనిషికి ఆకలైతే నోరు తెరిచి అర్ధించి కడుపు నింపుకుంటారు. జంతువులు ఆకలైయినా నోరు తెరిచి అడగలేవు. తాము తినేప్పుడు ఎదుటకు వచ్చిన మూగజీవుల ఆకలి బాధను వారు గ్రహించారు. ఆరోజు నుంచి క్రమం తప్పకుండా రెండుపూట్ల వాటి ఆకలి తీర్చడం దినచర్యగా పెట్టుకున్నారు. అన్నం, కూరలు వండి మూగజీవులుండే ప్రాంతాలకు వెళ్లి ప్రేమతో ఆహారాన్ని అందిస్తూ అమ్మానాన్నలయ్యారు. నెల్లూరు(స్టోన్హౌస్పేట): నెల్లూరు నగరంలోని దర్గామిట్ట పోలీస్కాలనీలో ఎం.విజయ్కుమార్, రాజ్యలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వారుండేది మానవ ప్రపంచంలో అయినా మనస్సు మాత్రం జంతు ప్రపంచంతో ముడిపడి ఉంది. విజయ్కుమార్ కేబుల్ ఆపరేటర్. వేకువజాము నుంచి కుక్కలు, కోతులు, పిల్లులు, ఆవులు, పక్షుల ఆకలి తీర్చడంతో ఈ దంపతుల దినచర్య ప్రారంభమవుతోంది. ఆ సమయానికి మూగప్రాణులు వారి కోసం ఎదురు చూస్తుంటాయన్న ఆత్రుత వారిలో కనపడుతుంటుంది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద నుంచి అయ్యప్పగుడి సెంటర్ వరకు ఉన్న వీధుల్లోని మూగజీవాలకు అతను సుపరిచితుడు. ఉదయాన్నే పాలు, బిస్కెట్లు దగ్గర నుంచి భోజనం వరకు అందిస్తుంటాడు. అనారోగ్యం పాలై ఇబ్బందులు పడే వాటికి వైద్యసేవలు సైతం అందిస్తుంటాడు. తాను తినే ముద్దలో మూగజీవాల ఆకలి తీర్చాలనే సంకల్పాన్ని తండ్రి ఆనందరావు దగ్గర నుంచి విజయ్కుమార్ పుణికి పుచ్చుకున్నాడు. దీనికితోడు భార్య రాజ్యలక్ష్మి సహకారం కూడా తోడవడంతో తన సేవా కార్యక్రమాలు మరింత బలపడ్డాయి. దీంతో సుమారు 50 ఏళ్లుగా మూగజీవాల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. స్వయంగా వెళ్లి.. ఉదయం ఐదు కేజీలు, సాయంత్రం ఐదు కేజీల బియ్యం, కూరలు, అప్పుడప్పుడు మాంసం, చేపలు కూరలు సైతం వండి ఆయా ప్రాంతాలకు స్వయంగా వెళ్లి మూగజీవాలకు పెడుతుంటాడు. వీధుల్లో చాలామంది ఆహార పదార్థాలను పడేస్తుంటారు. వాటిని తీసుకొచ్చి మూగజీవాలు తినేవిధంగా తయారు చేస్తారు. విజయ్కుమార్ దంపతుల సేవను గుర్తించిన స్నేహితులు, బంధువులు సైతం ఈ విషయంలో తోడుంటారు. వైద్యసేవలు ఆకలి తీర్చడంతో పాటు జబ్బున పడిన మూగ జీవులకు వైద్యసేవలు అందించేందుకు డాక్టర్ల సహాయం తీసుకునేవాడు విజయ్కుమార్. ఓ రోజు రాత్రి సమయంలో రైలు పట్టాల మధ్యలో ఆవు చిక్కుకున్న విషయాన్ని గుర్తించి పశువైద్యాధికారులను, రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేసి ఆవును ప్రమాదం నుంచి తప్పించిన ఘటన తన జీవితంలో మర్చిపోలేనని చెప్తాడు. కరెంట్ షాక్కు గురైన కోతి కాలును బాగు చేయించేందుకు మూడు నెలలకు పైగా వైద్యసేవలు అందించానంటాడు. తాను చేస్తున్న పనులను చూసి ఆ వీధుల్లో వారు పాలు, పెరుగు ఇచ్చేవారు. కరోనా సమయంలో.. కరోనా సమయంలో మూగజీవాలు ఆకలికి అల్లాడాయి. ముఖ్యంగా కరెంటాఫీస్ సెంటర్ కోతులకు కేంద్రం. ఆ సమయంలో విజయ్కుమార్ కష్టపడి అరటి పండ్లను సేకరించి వాటి ఆకలి తీర్చాడు. ఇంటి వద్దకు వచ్చే ఆవులకు, పిల్లులకు సైతం ఆకలిని తీర్చడం కరోనా సమయంలో కష్టమైంది. అయినా తమ సేవా కార్యక్రమాలను ఆపలేదు. జంతువులపై తనకున్న జాలి, దయ, తన సంపాదనలో అధికంగా వెచ్చించేందుకు ఇష్టపడ్డాడు. ఇటీవల నెల్లూరులో భారీ వర్షాలు, వరదల సమయంలో సైతం మూగజీవాలకు ఆహారం పెట్టే కార్యక్రమాలకు బ్రేక్ వేయలేదు. మొదలైందిలా.. విజయ్కుమార్ తండ్రి ఆనందరావు ఆర్టీసీ ఏడీసీగా పని చేస్తుండేవారు. ఆ రోజుల్లో జంతువులకు బిస్కెట్లు, పాలు అందించేవాడు. తాను వి«ధులకు వెళ్లి వచ్చేప్పుడు విధిగా ఈ పనిని చేయడం తనకు అలవాటు. ఈ పని చిన్నప్పటి నంచి విజయ్కుమార్ చూస్తూ మూగజీవాలపై ప్రేమను పెంచుకున్నాడు. ఉద్యోగం నుంచి తండ్రి విశ్రాంతి పొందిన తర్వాత తండ్రీ కొడుకులిద్దరూ ఈ పనిని కొనసాగించారు. తమకున్నంతలో కూరగాయలు, పండ్లు, ఆకు కూరలతో పాటు అన్నం ఆయా ప్రాంతాల్లోని జంతువులకు పెట్టడం దిన చర్యగా చేసుకున్నారు. ఎంతో ఆనందాన్నిస్తోంది తాను తినే ముద్దలోనే పశుపక్షాదుల ఆకలి గుర్తు చేసుకుంటాం. ఉన్నంతలోనే మా కుటుంబం మూగజీవాల కోసం సహాయం అందించడం తృప్తినిస్తుంది. వీధి కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించడం సామాజిక బాధ్యతగా భావిస్తాను. ఉదయాన్నే గోవులు, పక్షుల ఇంటి ముందు వాలడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉదయం, సాయంత్రం ఒక గంట కేటాయిస్తే మూగజీవాల ఆకలి తీర్చిన వాడినవుతాను. మనుషులకు పెడితే మర్చిపోతారేమో కానీ, మూగజీవాలు మాత్రం తమ ప్రేమను కళ్లల్లోనే చూపే విధానం ఒక మధురమైన అనుభూతి. మూగజీవాలకు ఎటువంటి సేవలు కావాలన్నా 97002 21223 నంబర్కు ఫోన్ చేస్తే నిస్వార్థంగా అందిస్తాను. – విజయ్కుమార్ -
250 కుక్కలకు చికెన్ బిర్యానీ; నెలకు రూ.60 వేల ఖర్చు
సాక్షి, హైదరాబాద్: సామాజికసేవ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ యానిమల్ సర్వీస్ చేసేవాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు. వారిలో ఒకరు హైదరాబాద్కు చెందిన ప్రసాద్. సౌదీ అరేబియాలో జాబ్ చేసిన ఇతను భారత్కు తిరిగి వచ్చాక సమాజసేవ చెయ్యాలనుకున్నాడు. దీంతో ఘటకేసర్లో ఆర్ఫనేజ్ మొదలు పెట్టాడు. అయితే ల్యాండ్ సమస్య వల్ల అది మూసివేయాల్సి వచ్చింది. గత 12 సంవత్సరాల నుంచి మాత్రం ఈయన డాగ్ లవర్గా మారిపోయారు. ఎల్లారెడ్డిగూడ నుంచి ఎస్ఆర్నగర్ వరకు రోజూ 200 నుంచి 250 వీధి కుక్కలకు ఈయన భోజనం పెడుతుంటాడు. వివిధ ప్రమాదాల నుంచి కాపాడిన కుక్కలు కూడా ఈయన దగ్గర 10 వరకు ఉన్నాయి. రోజూ ఉదయం 4 గంటలకు లేచి కుక్కలకోసం వంట వండడం స్టార్ట్ చేస్తారు. ఉదయం దాదాపు 70 కుక్కలకు, సాయంత్రం 200 నుంచి 250 కుక్కలవరకు పోషిస్తున్నాడు. పైగా చికెన్ బిర్యానీ లాంటివి కూడా వండి పెడుతుంటాడు. వీటికి నెలకు 60 వేలు ఖర్చవుతుంది. అయినా కూడా ఈయన ఆ పని చేస్తూనే ఉన్నాడు. స్నేహితులు, చుట్టాలు, యానిమల్ లవర్స్ సహాయంతో దీనిని నేటికి కొనసాగిస్తున్నాడు. ఆయన చేస్తున్న ఈ పనికి తన కుటుంబం కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. -
అక్కున చేర్చుకుందాం
మూడున్నర కోట్లకు పైగా వీథికుక్కలున్నాయి మనదేశంలో. పెంపుడు కుక్కలకు ఉన్నట్లు వాటి పొట్టను చూసి ఆకలి తీర్చే పెట్ పేరెంట్స్ ఎవరూ వీథి కుక్కలకు ఉండరు. వాటి ఆహారాన్ని అవి సొంతంగా సంపాదించుకుంటాయి. అది ప్రకృతి నియమం కూడా. అయితే... వాటికి ఎదురయ్యే ప్రధాన కష్టం ఆరోగ్యరక్షణ లేకపోవడమే. ‘‘ప్రతి పాణికీ జీవించే హక్కు ఉంది. వీథికుక్కలు అయినంత మాత్రాన వాటి జీవించే హక్కును కాలరాసే అధికారం మనిషికి ఉండదు. చేతనైతే వాటిని పరిరక్షించడానికి ముందుకు రండి’’ అంటున్నారు ఎన్ఆర్ఐ ఉజ్వల చింతల. ఇందుకోసం ఆమె ‘స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ ను స్థాపించి అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇండియాలోని వీథికుక్కల కోసం పని చేస్తున్నారు. మాది మహేశ్వరం ఉజ్వల చింతల 2019లో యూఎస్, ఫ్లోరిడాలో ‘స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ సంస్థను స్థాపించారు. అంతకు ముందు కొన్నేళ్లుగా ఆమె వీథి కుక్కల కోసం పని చేస్తూనే ఉన్నారు. ‘‘మాది హైదరాబాద్ సమీపంలోని మహేశ్వరం. నాన్న నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయంలోనే చదివాను. బాండింగ్ నా బలం, బలహీనత కూడా. ఇంటర్కి విజయవాడలోని మేరీస్టెల్లా కాలేజ్లో చేరిస్తే అమ్మానాన్నలకు దూరంగా ఉండలేక, మూడు నెలల్లో వెనక్కి వచ్చేశాను. డిగ్రీ హన్మకొండ, ఎంబీఏ బెంగళూరులో చేసిన తర్వాత పెళ్లితో యూఎస్ వెళ్లాల్సి వచ్చింది. యూఎస్లో కంప్యూటర్స్ కోర్సులు చేసి ఉద్యోగంలో చేరాను. పేరెంట్స్ మీద బెంగ తో తరచూ ఇండియాకి వస్తూనే ఉంటాను. అలా రావడమే ఈ సేవాపథంలో నడిపించింది. పాలు తాగే పిల్లల్ని విసిరేశారు 2013లో ఇండియా వచ్చినప్పుడు ఒక ఇంటి వాళ్లు చిన్న కుక్కపిల్లల్ని పాలుతాగే పిల్లలని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా బయటపడేయడం నా కంట పడింది. అప్పుడు తల్లి కుక్క పడిన ఆరాటం, ఆవేదన వర్ణించడానికి మాటలు చాలవు. మరోసారి పెళ్లిలో భోజనాల దగ్గర... పదార్థాలన్నీ పారవేస్తున్నారు. ఆ ప్లేట్ల కుప్ప మీదకు కుక్కలు ఎగబడుతున్నాయి. ఓ వ్యక్తి కర్ర తీసుకుని వాటిని విచక్షణరహితంగా కొడుతున్నాడు. అలాంటిదే మరోటి... ఓ కుక్కకు వెనుక కాళ్లు రెండూ విరిగిపోయాయి. దేహాన్ని నేల మీద ఈడ్చుకుంటూ పోతోంది. దానికి ట్రీట్మెంట్ చేయించడానికి ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. పర్మిషన్ తీసుకుని నాతోపాటు మూడు కుక్కలను యూఎస్ తీసుకెళ్లాను. అక్కడ చికిత్స చేయించి కోలుకున్న తర్వాత పెంచుకునే వాళ్లకు దత్తత ఇచ్చాను. అప్పటి నుంచి స్ట్రే యానిమల్స్ కోసం పని చేస్తున్నాను. అమెరికాలో లడ్డూ హౌస్ హైదరాబాద్, అమీన్పూర్లో షెడ్ వేసి, ముగ్గురు ఉద్యోగులతో ఓ సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించాను. ఇప్పడు తొంభై ఉన్నాయి. నెలనెలా వాటి పోషణ, ట్రీట్మెంట్ కోసం డబ్బు పంపిస్తున్నాను. నా జీతం నుంచి కొంత భాగం, నా లడ్డూ హౌస్ రాబడితో వాటిని సంరక్షిస్తున్నాను. లడ్డూ హౌస్ బ్రాండ్ మీద నేను ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో తినుబండారాలు తయారు చేసి, ఆదివారం ‘స్ట్రే యానిమల్స్ కోసం’ అని బోర్డు పెట్టి సేల్ చేస్తున్నాను. యూఎస్లో చారిటీ కోసం సేల్స్ చేసినప్పుడు... ఒక వస్తువు ధరను ఆ పదార్థానికి ఆపాదించి చూడరు, చారిటీ కోసం ధారాళంగా ఖర్చు చేస్తారు. మేము ప్రధానంగా గాయపడిన కుక్కలకు వైద్యం చేయించడం, కోలుకున్న తర్వాత పెంపకానికి ఇచ్చేయడం లేదా స్వేచ్ఛగా వదిలేయడం మీద దృష్టి పెట్టాం. ముసలితనం వల్ల ఎటూ పోలేని కుక్కలకైతే జీవితకాలపు సంరక్షణ బాధ్యత మాదే. ఇక కుక్కలకు స్టెరిలైజేషన్ వంటి కొన్ని సహకారాలను బ్లూ క్రాస్ నుంచి తీసుకుంటాం’’ అని చెప్పారు ఉజ్వల. భారతీయ సమాజాన్ని ఆమె కోరుకునేది ఒక్కటే... మనం మనుషులం, మానవీయంగా మసలుకుందాం. కుక్క అనగానే తక్కువగా చూడవద్దు. వాటి జీవితం మన అధికారం ప్రదర్శించవద్దు. మనవి ‘ప్రాణాలను హరించే చేతులు కావద్దు, రక్షించే చేతులు కావాలి’ అన్నారు. – వాకా మంజులారెడ్డి -
పెద్ద మనసుంటే తప్ప చేయలేని పని ఆమె చేస్తోంది
పదహారేళ్లయింది ఈ ఫ్రెంచి ప్రొఫెసర్ తన జన్మభూమిని వదిలిపెట్టి వచ్చి. రెండేళ్లుగా ఇండియాలో ఉంటున్నారు. థెరిసా కాలేజ్లో పాఠాలు బోధించడమే కాదు, థెరిసా ప్రబోధాలను ఆచరణలో పెడుతూ ఇచ్చే చెయ్యిగా, పెట్టే ముద్దగా జీవిస్తున్నారు. నోరు లేని జీవుల్ని మనుషులుగా చూసే ప్రొఫెసర్ ఫేడెట్.. నోరు తెరిచి ఆడగలేని మనుషుల్ని గమనించి తనే వెళ్లి ఆదుకుంటూ ఉంటారు. ఇదేమీ పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. కానీ పెద్ద మనసుంటే తప్ప చెయ్యలేని పని! ఎర్నాకుళంలోని సెయింట్ థెరిసా కాలేజ్లో ఫ్రెంచి భాషను బోధిస్తుండే ప్రొఫెసర్ ఫేడెట్ బ్యాడీ డీఆర్సిస్ గత ఇరవై నెలలుగా కొచ్చిలోని ప్రధాన కూడళ్లలో కనిపించే ఎవరికీ చెందని మూగజీవాలకు (స్ట్రే యానిమల్స్) ప్రేమతో ఆహారాన్ని అందిస్తున్నారు. ఫేడెట్ ఉంటున్నది కొచ్చిలో. అక్కడి నుంచి ఎర్నాకుళం పది కి.మీ. దూరం. కొచ్చి నుంచి రోజూ ఎర్నాకుళం వెళ్లొస్తుండే ఫేడెట్ తరచు కొచ్చిలోని హైకోర్టు జంక్షన్లో అక్కడి వీధి శునకాలకు బిస్కెట్లు వేస్తూ కనిపిస్తుంటారు. కొన్నిసార్లు వాటి కోసమే వండి తెచ్చిన ఆహార పదార్థాలను ప్రేమగా తినిపిస్తూ ఉంటారు. ‘‘మనుషుల్ని నేను ఎంత ప్రేమిస్తుంటానో ఈ మూగజీవుల్నీ అంతే’’ అంటారు ఫేడెట్. ఇప్పుడీ కరోనా సెకండ్ వేవ్లోనైతే వాటి కోసమే ఆమె వీధుల్లోకి వస్తున్నారు. అందుకు ఆమె పోలీస్శాఖ నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. 2019 లో కొచ్చి వచ్చారు ఫేడెట్. ఫ్రెంచి ఫ్రొఫెసరమ్మగా కొచ్చి అంతటా ఆమె తెలుసు. ‘‘కోవిడ్ ఇక్కడ ఇంత ఎక్కువగా ఉంది. మీకేమీ భయం వేయడం లేదా? మీ దేశానికి వెళ్లిపోవాలని లేదా?’’ అంటే ‘‘ఇక్కడ నేను సేఫ్గానే ఉన్నాను. ఉద్యోగం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చారు. కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్.. అన్నీ ఉన్నాయి. ఈ మాత్రం లేనివాళ్లు మనలో ఇక్కడ ఎంత మంది లేరు? సేఫ్ అంటే కరోనా నుంచి మాత్రమే కాదు కదా. ఆకలి నుంచి, నిరుద్యోగం నుంచి, ప్రతికూల జీవన పరిస్థితుల నుంచి అందరూ సేఫ్గా ఉండాలి. అందుకోసం అందరం అందరికీ సహాయంగా ఉండాలి’’ అంటున్నారు ఫెడెట్. -
గ్రామాల్లో వీధి కుక్కలన్నింటికీ టీకాలు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో తిరుగాడే వీధి కుక్కలన్నింటికీ ర్యాబీస్ వ్యాధి వ్యాప్తి నిరోధక టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ర్యాబీస్ వ్యాధి నివారణ, నియంత్రణ చర్యల్లో భాగంగా పశుసంవర్థక శాఖతో సమన్వయం చేసుకుంటూ పంచాయతీరాజ్శాఖ ఈ టీకాల కార్యక్రమ అమలుకు చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో వీధి కుక్కలలో సంతానోత్పత్తిని నియంత్రించేందుకు ఆపరేషన్ చేయించడంతో పాటు కుక్క కరిచినా ర్యాబీస్ సోకకుండా శునకాలకు టీకాలు వేస్తారు. వీధి కుక్కల టీకాలు వేసే ప్రక్రియలో పశు సంవర్థక శాఖ సిబ్బందితో ఎక్కడికక్కడ సమన్వయం చేసుకునేందుకు గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలంటూ పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలను ఆదేశించింది. మండలంలో ప్రతి రోజూ కనీసం 10 వీధి కుక్కలకు, జిల్లాలో కనీసం 500 కుక్కలకు టీకాలు వేయాలని పేర్కొంది. జిల్లాల వారీగా వీధి కుక్కల టీకాల పురోగతిని ఎప్పటికప్పుడు కమిషనర్ కార్యాలయానికి తెలియజేయాలని ఆదేశించింది. కాగా, 2020 పూర్తి ఏడాదితో పాటు 2021లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 72 వేల మంది కుక్క కాటుకు గురైనట్లు అంచనా. -
హృదయవిదారకం: కరోనా మృతదేహాలను పీక్కుతింటున్నాయి
డెహ్రాడూన్: కరోనా వైరస్ మహమ్మారి అందరి జీవితాలను తలకిందులు చేస్తోంది. ఇది ఒకరి నుంచి ఒకరికి సోకే వ్యాధి కావడంతో ప్రతీ ఇంట్లోనూ కరోనా వచ్చిన వారిని దూరంగా ఉంచుతున్నారు. అలా కరోనాతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంగతి వర్ణనాతీతం. కరోనాతో ఒక వ్యక్తి చనిపోతే.. ఆ ఇంటి కుటుంబసభ్యులు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయడానికి కూడా భయపడుతున్నారు. వారికి ఎక్కడ సోకుతుందో అని భయపడి దూరంగా ఉండే వారికి అంతిమ సంస్కారాలు కానిస్తున్నారు. తాజాగా కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం చూసి అక్కడి స్థానికులు కంటతడి పెడుతున్నారు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తర కాశీలోని భాగీరథీ నదీ తీర ప్రాంతంలోని కేదార్ ఘాట్ వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. కరోనాతో మృతి చెందినవారికి భాగీరథీ నదీ తీరంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం కొన్ని మృతదేహాలను ఖననం చేస్తుండగా.. మరికొన్నింటిని చితి పేర్చి కాలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని మృతదేహాలు సగం మాత్రమే కాలినా వాటిని పట్టించుకోకుండా అలాగే వదిలేస్తున్నారు. దీంతో వీధి కుక్కుల అక్కడికి చేరుకొని సగం కాలిన శవాల శరీర బాగాలను పీక్కు తింటున్నాయి. ఇది చూసిన అక్కడి స్థానికులు వీటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఒక వ్యక్తి ఈ ఘటనపై స్పందిస్తూ.. ''ఇది చాలా హృదయవిదారకం.. భాగీరథి నదీ తీరానా సగం కాలిన శవాలను కుక్కుల పీక్కు తింటుంటే నా మనసు చెమ్మగిల్లింది. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో నదిలో నీటిమట్టం పెరిగింది. దీంతో మృతదేహాల ఒడ్డుకు కొట్టుక వస్తున్నాయి. వీధి కుక్కలు ఆ శవాలను పీక్కుతింటున్నాయి. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఆ మృతదేహాలు కరోనా సోకినవారివైతే వ్యాధి మరింత వ్యాపించే అవకాశం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'నా ఆత్మహత్య కశ్మీర్ ప్రభుత్వ టీచర్లకు అంకితం' Uttarakhand | Residents claim that dogs are eating half-burnt COVID bodies at Kedar Ghat, Uttarkashi. After receiving complaints from locals, we have assigned a person at Kedar Ghat for cremation of half-burnt bodies: Municipality president Ramesh Semwal pic.twitter.com/9IvC9ysC6O — ANI (@ANI) June 1, 2021 -
వీధి కుక్కలంటే అందరికి భయం.. కానీ ఆమెకు కాదు!
సాక్షి, నిజాంపేట్: అందరూ కుక్కలు అంటేనే భయపడతారు.. కాని కొందరే వాటిని ప్రేమిస్తారు. అంటువంటి వారిలో సాయిశ్రీ ఒకరు అని చెప్పవచ్చు.. మన పక్కనున్న వారినే పట్టించుకోని ఈ రోజుల్లో.. వీధుల్లో తిరుగుతున్న శునకాలను ఓ యువతి చేరదీసి అన్నీ తానై కంటికి రెప్పలా వాటిని కాపాడుతోంది. వాటి పోషణలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఆపాయ్యతను పంచడంలో ఎక్కడా హెచ్చుతగ్గులు చూపిండం లేదు. వివరాలు.. బాచుపల్లిలోని ఆదిత్య గార్డెన్స్లో నివాసం ఉంటున్న సాయిశ్రీ రెడ్డి బాక్సింగ్ చాంపియన్. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరిగిన అనేక పోటీల్లో పాల్గొని పతకాలు కూడా సాధించింది. కాగా గత సంవత్సరం లాక్డౌన్ కారణంగా హోటల్స్, ఫంక్షన్ హాళ్లను మూసివేయడంతో సరిపడా ఆహారం దొరక్క తల్లడిల్లిన వీధి కుక్కుల పరిస్థితి చూసి ఆమె చల్లించిపోయింది. వాటి సంరక్షణకు నడుం బిగించింది. ప్రగతినగర్లోని సింహపురి కాలనీలో ఓ గోదాములో వీధి కుక్కలను ఉంచి వాటికి ప్రతి రోజు ఆహారం అందించడం ప్రారంభించింది. శునకాల ఆలనా పాలాన చూసుకునే బాధ్యతను తన భుజాన వేసుంది. ఇందు కోసం ప్రతి నెలా సుమారు రూ. 30 వేల వరకు వెచ్చిస్తుండటం గమనార్హం. తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతో .. ► వీధి కుక్కల సంరక్షకు సాయిశ్రీ తల్లిదండ్రులైన ఈశ్వర్రెడ్డి, సు«ధల సహకారంతో పాటు స్నేహితులు, బంధువుల సహకారం కూడా తీసుకుంటోంది. ►తమ కుమార్తె చేస్తున్న పనికి తల్లిదండ్రులు కూడా చేదోడువాదోడుగా నిలవడం గమనార్హం. ►గాయపడిన కుక్కులకు చికిత్స.... ►వివిధ ప్రమాదాల్లో గాయపడిన కుక్కలను, మనుషుల దాడిలో గాయపడిన శునకాలను అక్కున చేర్చుకుని అవసరమైన చికిత్స చేయించి గాయాలు మానే వరకు వాటిని పూర్తి స్థాయిలో సంరక్షిస్తోంది. ►కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కడ ఎలాంటి సందర్భంలోనైనా కుక్కలు గాయపడితే వెంటనే సాయిశ్రీకి ఫోన్ వస్తుంది. ►ఇలా ఇప్పటి వరకు 50 వరకు శునకాలను చేరదీసింది. ప్రతి రోజు ఆహారం వండాల్సిందే... ప్రతిరోజు తన దగ్గర ఉన్న కుక్కలకు ఆహారం చికెన్తో, గుడ్లతో వండి అందిస్తోంది. గాయపడిన కుక్కలకు ప్రతి రోజు డ్రెస్సింగ్ చేయడం, అవసరమైన మందులు వేయడం చేస్తోంది. అలాగే వృద్ధాప్యం కారణంగా కొందరు తమ పెంపుడు కుక్కలను సైతం రోడ్లపై వదిలేసి వెళుతుంటారు. అలాంటి వాటిని కూడా ఈమె సంరక్షించడం చెప్పుకోదగ్గ విషయం. దీంతో ప్రస్తుతం ఈమె సంరక్షణలో వీధి కుక్కలతో పాటు ల్యాబ్, పామేరియన్ లాంటి బ్రిడ్ జాతి కుక్కలు కూడా ఉన్నాయి. స్థలం లేక పెంపకానికి ఇబ్బంది అవుతోంది.. రోజు రోజుకు కుక్కల సంఖ్య పెరగుతుండటంతో అవసరమైన స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం మా బంధువు గోదామును గత సంవత్సరం కాలంగా వాడుకుంటున్నాను. కాని అక్కడ వారి పనికి ఇబ్బంది అవుతోంది. ప్రభుత్వం కాని ఎవరైన దాతలు స్పందించి అవసరమైన స్థలం కేటాయిస్తే నా సేవలు మరింత విస్తృత పరుస్తా. కుక్కల ఆహారం కోసం మనసున్న కొద్దిమంది బియ్యం అందిస్తున్నారు. కుక్కలకు మానవత్వంతో ఆహారం అందించాలనుకునేవారు, ఎక్కడైన కుక్కలు గాయాలకు, ప్రమాదాలకు గురైనప్పుడు ఈ నెంబర్కు 9949679131 ఫోన్ చేసి సమాచారం తెలుపవచ్చు. – సాయిశ్రీరెడ్డి -
మనిషి కాదు.. మృగం!
మైసూరు: మైసూరులో సభ్యసమాజం తలదించుకునే అమానుషం ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ యువకుడు వీధి కుక్కపైన లైంగిక దాడికి పాల్పడగా కొందరు వీడియో తీసి సోషల్మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. మైసూర్లోని గోకులం 3వ స్టేజ్లో నివసించే సోమశేఖర్ (26) ఈ నెల 11న రాత్రి సమయంలో సందులో చాటుగా వీధి కుక్కపైన లైంగిక దాడికి పాల్పడుతుండగా, కొందరు యువకుల వీడియో తీసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారు. పీపుల్ ఫర్ అనిమల్స్ (పీఎఫ్ఎ) అనే స్వచ్ఛంద సంస్థ వీవీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. జంతువులపై లైంగికదాడి జరిపాడన్న అభియోగాలతో కేసు నమోదు చేసి నిందితున్ని సోమవారం అరెస్టు చేశారు. కుక్కను గుర్తించి వైద్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు. చదవండి:పార్లమెంట్ హౌజ్లోనే అత్యాచారం -
వీధి కుక్కల కోసం 'అడాప్ట్ ఎ పెట్'
-
వీధికుక్కలను బతకన్విండి... ప్లీజ్
ప్రకృతిలో మానవుడితో అనేక రకాల జీవులు ఉన్నాయి. అన్ని రకాల జంతువులు, జీవజాలం మానవుడికి ఉపయోగపడుతున్నాయి. అయితే కొన్ని జీవులు, జంతువుల పట్ల మానవులు పక్షపాతధోరణి ప్రదర్శిస్తున్నారు. ఖరీదైన విదేశీ కుక్కలను కొనుగోలు చేసి వాటిని అపురూపంగా పెంచుకుంటున్నారు. అదే సందర్భంలో వీధుల్లో కనిపించే కుక్కల పట్ల వివక్ష చూపుతున్నారు. కొందరు అకారణంగా వాటిని చంపివేయడం, గాయ పరచడం చేస్తున్నారు. చాల వీధికుక్కలకు ఆహారం అందక, తాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్నాయి. కరోనా వచ్చాక వీధి కుక్కల పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ఇంతకు మునుపు హోటళ్లు, రెస్టారెంట్లలో మిగిలిన ఆహారం తెచ్చి వేసేవారు, ప్రస్తుతం హోటళ్లు, రెస్టారెంట్ల నడవటం గగనమై వీధి కుక్కలకు ఆదరణ, ఆహారం కరువైంది. ఈ నేపథ్యంలో వీధికుక్కలను ఆదరిస్తూ అక్కున చేర్చుకుంటున్నారు.. తిరుపతికి చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ ఉదయ. తన చిన్నతనం నుంచి తన తల్లిదండ్రులు, అవ్వా తాతలు వీధుల్లో తిరిగే ఆవులు, కుక్కలు, ఇతర జంతువులపై ప్రేమ చూపేవారు. వారి నుంచి ఈ సద్గుణాన్ని అందిపుచ్చుకున్న ఉదయ శ్రీ 10 సంవత్సరాల క్రితం బాణ సంచా పేలి శరీరం అంతా కాలి, కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న ఒక వీధి కుక్కను అక్కున చేర్చుకొని దానిని బాగు చేయించి తానే పెంచుకోవడంతో పాటు దాని సంతతిని తన బంధువులకు ఇచ్చి పెంచుకొనేలా చేసింది. అంతే కాకుండా గత 10 సంవత్సరాలుగా తిరుపతి నగరంలో భవాని నగర్, అశోక్ నగర్, అలిపిరి బైపాస్ రోడ్డు, కపిల తీర్థం రోడ్డు, ఇస్కాన్ టెంపుల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో సుమారు 150 వీధి కుక్కలకు ఆహారం అందిస్తోంది. ఎవరి సహాయం కోసమో ఎదురుచూడకుండా తనకున్న ఆర్థిక వనరులతోనే వాటికి ఆహారం సిద్దం చేసి నిత్యం ఆటోలో వెళ్లి ఆయా ప్రాంతాల్లో వీ«ధికుక్కలకు ఆహారం పంచుతూ తనకున్న జంతుప్రేమను చాటుకొంటోంది. శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కలకు ఆహారం అందిస్తున్న ఉదయశ్రీని ‘సాక్షి’ పలుకరించింది. ఈ సందర్బంగా ఆమె పలు విషయాలు సాక్షికి వివరించింది. ఆమె చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే... నా పేరు నవకోటి ఉదయశ్రీ. తిరుపతి నగర శివార్లలోని ఒక ప్రయివేట్ ఇంజినీరింగ్ కళాశాలలో 2014లో బీటెక్ పూర్తి చేశాను. బీటెక్ తర్వాత టీసీఎస్ సంస్థలో ఉద్యోగంలో చేరాను. మూడు సంవత్సరాలు పనిచేశాక ఉద్యోగం వదిలేశాను. ప్రస్తుతం తిరుపతిలోనే ఉంటున్నాను. నా తల్లిదండ్రులు, అవ్వతాతలకు జంతువులంటే ఎంతో ప్రేమ. అమ్మ శాంతి వీధి కుక్కలను, ఆవులను, ఇతర జంతువులను ఆదరించేవారు. వాటికి ఆహారం అందించేవారు. గాయపడిన జంతువులు కనిపిస్తే వాటికి వైద్యం అందించేవారు. చిన్న తనం నుంచి ఇది చూసిన నాకు జంతువులపై ఎంతో ప్రేమ కల్గింది. గత కొన్నేళ్లుగా అనేక వీధి కుక్కలు ఆహారం, నీరు దొరక్క వీధుల్లో రోదిస్తుండటం చూసి వాటికోసం ఏమైనా చేయాలనుకున్నాను. నా వంతు సాయంగా ఆహారం సిద్దం చేసి నగరంలోని వివిధ ప్రాంతాల్లోని సుమారు 150 వీధి కుక్కలకు అందిస్తున్నాను. నా స్వంత ఖర్చులతోనే ఈ పని చేస్తున్నాను. ఎక్కడైనా వీధి కుక్కలు, ఆవులు గాయపడి కనిపించినా వెంటనే బ్లూ క్రాస్ సంస్థ సహకారంతో వాటికి వైద్యం అందిస్తాను. ఇందుకు అనిమల్ కేర్ లాండ్ సంస్థ నిర్వాహకులు డాక్టర్ శ్రీకాంత్ సహకారిస్తున్నారు. నా ప్రయత్నంలో కొన్నిసార్లు చికాకులు ఎదురవుతుంటాయి. అయినప్పటికీ ఆపలేదు. వీధికుక్కలు, ఇతర జంతువులు గాయపడతాయన్న కారణంగా చిన్నతనం నుంచి దీపావళి జరుపుకోవడం లేదు. నా ప్రయత్నానికి అమ్మ శాంతి ఎంతో సహకారం అందిస్తున్నారు. నా విజ్ఞప్తి ఏమిటంటే... కొన్ని కుక్కలు తప్పు చేశాయని అన్నిటిని ఆలాగే చూడటం భావ్యం కాదు. ఖరీదైన కుక్కల స్థానంలో వీటిని ఆదరిస్తే బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఆహారం, మురికి నీరు తాగడం వల్ల వాటికి గజ్జి, ఇతర వ్యాధులు సంభవిస్తున్నాయి. వాటికి ఆదరణ ఉంటే ఇలా ఉండవు. ప్రతి ఒక్కరూ ఒక వీధికుక్కనైనా దత్తత తీసుకుంటే బాగుంటుంది. ఉదయశ్రీని ఆతృతతో చుట్టుముట్టిన వీధికుక్కలు -
వీధి శునకాల లెక్క పక్కాగా!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో వీధి కుక్కల బెడద అంతాఇంతా కాదు. వీటి దాడుల్లో తరచూ ఎంతోమందికి గాయాలవుతూనే ఉన్నాయి. అడపాదడపా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ముఖ్యంగా కుక్కల దాడుల్లో మరణిస్తున్న వారిలో చిన్నపిల్లలే ఉండటం విషాదకరం. కుక్కల సంఖ్య పెరగకుండా ఉండాలంటే వాటికి సంతాన నిరోధక శస్త్రకిత్సలు (స్టెరిలైజేషన్స్) చేయడం ఒక్కటే మార్గం. కుక్క కరిచినా దాని ద్వారా వచ్చే రేబిస్ వ్యాధి రాకుండా ఉండాలంటే వీధి కుక్కలన్నింటికీ వ్యాధి నిరోధక వ్యాక్సిన్ (టీకా) వేయాలి. ఇంతకుమించి వేరే మార్గాల్లేవు. కుక్కలను సంహరించేందుకు జంతు సంరక్షణ చట్టాలు ఒప్పుకోవు. అంతేకాదు.. ప్రజల నుంచి ఫిర్యాదులు అందినప్పుడు జీహెచ్ఎంసీలోనిసంబంధిత వెటర్నరీ సిబ్బంది కుక్కలను పట్టుకొని వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్లు చేసి తిరిగి ఎక్కడ పట్టుకున్నారో.. అక్కడే వదిలిపెడతారు. దీంతో ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాగా.. నగరంలో కచ్చితంగా ఎన్ని వీధికుక్కలు ఉన్నాయో సరైన లెక్కల్లేవు. కుక్కలు ఎనిమిది నెలల వయసులోనే సంతానోత్పత్తి శక్తి కలిగి ఉండటం, ఒక కుక్క ఏడాదికి రెండు పర్యాయాలు సంతానోత్పత్తి చేసే అవకాశం ఉండటంతో వీటి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక కుక్క, దాని సంతతి ద్వారా ఏడాదికాలంలో 40కిపైగా కుక్కలు నగర వీధుల్లోకి చేరుతున్నాయి. వెటర్నరీ విభాగం శునకాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నప్పటికీ, ప్రజలకు కుక్క కాట్లు తప్పడం లేవు. ఈ నేపథ్యంలో గ్రేటర్ నగరంలో ఉన్న మొత్తం వీధి కుక్కలెన్నో తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం సిద్ధమైంది. గుర్తించే ప్రతి కుక్కకూ టీకా వేయడం, దానికి అప్పటి వరకు సంతాన నిరోధక శస్త్ర చికిత్స జరిగి ఉండకపోతే శస్త్ర చికిత్స చేయాలనేది లక్ష్యం. గ్రేటర్ మొత్తం ఒకే పర్యాయం కాకుండా పైలట్ ప్రాజెక్టుగా తొలుత ఐదు వార్డుల్లో ఈ పనులకు నెల క్రితం శ్రీకారం చుట్టారు. ఆగస్ట్ 15 వరకు ఈ సర్వే పూర్తి చేయాలనుకున్నప్పటికీ.. వెటర్నరీ సిబ్బందిలో కూడా కొందరికి కరోనా సోకడం తదితర పరిణామాలతో ఆగస్ట్ నెలాఖరు వరకు పూర్తవుతుందని భావిస్తున్నారు. పాతబస్తీలోని శాలిబండతోపాటు ఆసిఫ్నగర్ వార్డుల్లో సర్వే నెమ్మదిగా జరుగుతోంది. ఆ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందిలో ఎక్కువ మందికి కరోనా సోకడంతో కొందరు మాత్రమే సర్వేలో పాల్గొంటున్నట్లు సమాచారం. -
సంపదలో పేదవాడు.. గుణంలో ధనవంతుడు
-
సంపదలో పేదవాడు.. గుణంలో ధనవంతుడు
మనిషికి మానవత్వానికి విడదీయరాని బంధం ఉంది. అయితే ప్రస్తుతం మనిషి, మనిషికి మధ్య బంధాలు, బంధుత్వాలు తెగిపోతున్నాయి. ఇక కరోనా మహమ్మారి కారణంగా మానవత్వం సన్నగిల్లుతోంది. కానీ మనిషిలోని మంచితనం ఇంకా బతికి ఉందనేందుకు ఈ సంఘటన అద్దంపడుతోంది. అయితే అతడేం ధనవంతుడు కాదు. అయినప్పటికీ తనకున్న దానిలో సాయం చేసి తన దయా గుణాన్ని చాటుకున్నాడు. (అమ్మాయ్.. ఎన్ని మార్కులొచ్చాయ్?) భారత అటవీశాఖ అధికారి సుశాంత్ నందా తన ట్విటర్ ఖాతాలో ఓ సందేశాత్మక వీడియోను పోస్టు చేశారు. 17 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో వృద్ధుడైన ఓ బిచ్చగాడు తింటుండగా.. వీధి కుక్కలు అతని చుట్టూ వచ్చి చేరాయి. దీంతో ఆ వృద్ధుడు తింటున్న ఆహారాన్ని రెండు ప్లేట్లలో వేసి కుక్కలకు తినిపించాడు. ‘సంపదలో పేదవాడు. మనసున్న వ్యక్తిలో ధనవంతుడు’ అని షేర్ చేసిన ఈ వీడియోను పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే వైరల్గా మారింది. అంతేగాక వృద్ధుడు దయతో చేసిన మంచితనాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘ఈ రోజుల్లో మానవ్వతం తగ్గిపోతుంది. ఈ వృద్ధుడు మనిషిలోని మానవత్వాన్ని చాటుకున్నాడు’. అంటూ కామెంట్ చేస్తున్నారు. (సూపర్ హిట్ సాంగ్కు డాన్స్ చేసిన వార్నర్ కూతుళ్లు) -
తన మేకను కుక్క కరిచిందని, 40 కుక్కలను..
భువనేశ్వర్ : ఓ వీధి కుక్క తన మేకను కరిచిందని కుక్కలన్నింటిపైనా కక్ష కట్టాడో వ్యక్తి. ఊర్లో ఉన్న అన్ని కుక్కలకు విషం ఇచ్చి వాటిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని చౌదార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కటక్ జిల్లాలోని మహంగలో బ్రహ్మానంద మాలిక్ అనే వ్యక్తి పెంచుకుంటున్న మేకను ఓ రోజు వీధి కుక్క కరిచింది. దానికి గాయమవడంతో అతడు కుక్క జాతిపైనే పగ పట్టాడు. ఊరిలోని కుక్కలన్నింటి ప్రాణాలు తీసేందుకు కుట్ర పన్నాడు. దీనికి భరత్ మాలిక్ అనే వ్యక్తి సాయం తీసుకున్నాడు. అతనితో కలిసి కుక్కలకు ఎంతో ఇష్టమైన మాంసం తీసుకొచ్చి వాటిలో విషపు గుళికలు కలిపాడు. (మంచాన పడ్డ తల్లిని బ్యాంకుకు లాక్కెళ్తూ..) అనంతరం ఆ విషపు ఆహారాన్ని శునకాలకు ఎరగా వేశాడు. దీంతో దాన్ని తిన్న 40 కుక్కలు రోడ్డుపై విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాయి. ఈ ఘటనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. "కళ్లముందే కుక్కలు బాధతో గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోవడం చూడలేకపోయాం. ఇది మా హృదయాలను కలిచి వేసింది" అని ఓ గ్రామస్థుడు తెలిపాడు. ఈ విషయం గురించి ఆ ఊరి సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు సమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇక ఈ ఘటన సరిగ్గా ఏ రోజు జరిగిందనేది తెలియరాలేదు. (పోలీసునంటాడు.. సెల్ఫోన్లతో ఉడాయిస్తాడు) -
గ్రామసింహాలూ వేట వైపు?
కేరళ.. ఓ సంవత్సరన్నర క్రితం వరదలతో పోరాడింది. ఆ సమయంలో వందల ఊళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. అక్కడే ఉండిపోయిన శునకాలకు తిండిలేక దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ప్రాణాలు నిలుపుకునే క్రమంలో అవి ‘వేట’ఆరంభించాయి. కోళ్లు, పక్షులు, కుందేళ్లు లాంటి వాటిని ఆహారం చేసుకున్నాయి. మన దేశంలో దాదాపు 3.5 కోట్ల శునకాలు ఉంటాయన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. హైదరాబాద్లో వాటి సంఖ్య దాదాపు 9 లక్షలు ఉంటుంది. మన రాష్ట్రంలో 25 లక్షలకు పైమాటే. సాక్షి, హైదరాబాద్: అనుకోకుండా వచ్చి పడ్డ కరోనా సమస్య ఎన్నో మార్పులకు కారణం కాబోతోంది. స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట ఇది. కరోనా విపత్తు నుంచి తేరుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. కానీ, ఎన్నడూ చూడని విధంగా ప్రస్తుతం మనం అమలుచేసుకుంటున్న లాక్డౌన్ కూడా ఎన్నో మార్పులకు కారణమవుతోంది. ఇది మనుషులకే కాదు, జంతువులకూ వర్తించనుంది. ఈ విషయంలో శునకాలు ముందు వరసలో ఉన్నాయంటున్నారు జంతు ప్రేమికులు. లాక్డౌన్ సమయంలో ఎక్కువ రోజుల పాటు కుక్కలకు తిండి దొరక్కపోవడంతో అవి క్రమంగా ఇతర జంతువులను వేటాడేందుకు యత్నిస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదని వారు హెచ్చరిస్తున్నారు. ఒకసారి ఇతర జంతువులను వేటాడి చంపేందుకు అలవాటు పడితే, వెంటనే అవి తీరు మార్చుకోని పక్షంలో వన్య ప్రాణులకు ఇబ్బందులు ఎదురుకాక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న లాక్డౌన్, మరో పక్షం రోజులు (పొడిగింపు లేకుంటే) జరగాల్సి ఉన్న తరుణంలో కుక్కల తీరులో విపరీత మార్పులు చోటుచేసుకునే ప్రమాదం ఉందని ‘యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ’పేర్కొంటోంది. లాక్డౌన్ నేపథ్యంలో కుక్కల ప్రవర్తనలో మార్పులపై కొద్ది రోజులుగా ఆ సంస్థ ప్రతినిధులు అధ్యయనం చేస్తున్నారు. పూర్తి జనావాసాల్లో ఉండే కుక్కల కంటే, చుట్టూ ఇళ్లు తక్కువగా ఉండే ప్రాంతాల్లోని శునకాల్లో ప్రవర్తనలో మార్పు వస్తోందని చెబుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్, సంజీవయ్య పార్కు, హయత్నగర్ వైపు ఉన్న శివారు ప్రాంతాల్లో వారు అధ్యయనం చేశారు. పక్షులు, చిన్న జంతువులపై దాడులు.. ఇళ్లలో పెంచుకునే కుక్కలకు నిత్యం సమయానుకూలంగా తిండి లభిస్తుంది. కానీ వీధుల్లో సంచరించే శునకాలు మనుషులు పడేసే పదార్థాల నుంచి ఆహారాన్ని సేకరించుకుంటాయి. హోటళ్ల సమీపంలోని చెత్తకుండీలు, కాలనీలు, బస్తీల్లోని డంపింగ్ స్థలాలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో పడేసిన ఆహారాన్ని అవి తింటాయి. లాక్డౌన్ నేపథ్యంలో వాటికి ఆ తిండి బాగా కరువైంది. పార్కులు, రైల్వేస్టేషన్, బస్టాండ్ పరిసరాల్లో అయితే అక్కడికి వచ్చే సందర్శకులు, ప్రయాణికులు పడేసే వాటినే అవి తింటుంటాయి. ఇప్పుడు జనం ఇళ్లకే పరిమితం కావటంతో అలాంటి ప్రాంతాల్లో వాటికి తిండి లేకుండా పోయింది. దీంతో చాలా ప్రాంతాల్లో అవి తీవ్ర ఆకలితో నకనకలాడుతున్నాయి. ఫలితంగా కంటికి కనిపించిన ఇతర చిన్న జంతువులు, పక్షులను వేటాడే ప్రయత్నం చేస్తున్నాయి. వన్య ప్రాణులకు ప్రమాదం.. కుక్కలు ఒకసారి ఇతర పక్షులను వేటాడేందుకు అలవాటుపడితే ప్రమాదం అంటున్నారు యానిమల్ వారియర్స్ సంస్థ వ్యవస్థాపకులు ప్రదీప్ నాయర్. ‘లాక్డౌన్ పరిధి ఎక్కువగా ఉంటే కుక్కలు ఆకలి తీర్చుకునేందుకు ఇతర జంతువులు, పక్షులను వేటాడే పరిస్థితి ఉంటుంది. వాటిలో వచ్చే విపరీత ప్రవర్తనలతో ఒక్కోసారి మనుషులపై దాడి చేసే పరిస్థితి వస్తే ఆ పరిణామం తిరిగి కుక్కలకే శాపంగా మారుతుంది. తమపై దాడి చేస్తే జనం ఆ కుక్కలను చంపేందుకు కూడా వెనకాడరు. ఒకచోట దాడి చేస్తే, చాలాచోట్ల ఊరకుక్కలను బతకనీయరు’ అని పేర్కొన్నారు. కొత్త రోగాలకు అవకాశం: ‘వేటలో భాగంగా కుక్కలు ఇతర జంతువులను వేటాడి తింటే వాటి ద్వారా కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆ కుక్కల ద్వారా వన్యప్రాణులకు కొత్త రోగాలు సంక్రమించే ప్రమాదం ఉంది’ అని ఆ సంస్థ మరో ప్రతినిధి సంజీవ్ వర్మ అంటున్నారు. అందుకే ఇలాంటి దుస్థితి రాకుండా గ్రామసింహాలకు ప్రజలు ఆహారాన్ని అందించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని చెబుతున్నారు. -
నేలపాలైన పాల కోసం కుక్కలతో....
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో పొట్టనింపుకునేందుకు నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆకలి రుచి ఎరగదు.. నిద్ర సిగ్గు ఎరగదని... ఈ సంఘటన ఈ నానుడిని మరోసారి గుర్తు చేస్తుంది. నేలపై ఒలికిపోయిన పాలను ఒకవైపు మనిషి ఎత్తిపోసుకునేందుకు ప్రయత్నిస్తే... ఇంకోవైపు కుక్కల గుంపు ఆబగా జుర్రుకోవడం అందరి మనసులను కలచివేసేదే. విషయం ఏమిటంటే.. ఆగ్రాలో తాజ్మహల్కు ఆరు కిలోమీటర్ల దూరంలో సోమవారం ఉదయం ఓ భారీ పాల వ్యాను బోల్తా పడింది. దీంతో బోలెడన్ని పాలు నేలపై ఒలికిపోయాయి. లాక్డౌన్ కారణంగా తగినంత ఆహారం దక్కని కుక్కల గుంపు ఈ పాలను తాగుతూండగానే...ఓ మనిషి ఈ పాలను ఎలాగైనా వాడుకోవచ్చు అన్న అంచనాతో ఓ మట్టి కుండలో వాటిని చేతులతోనే నింపుకునే ప్రయత్నం కనిపించింది. కమాల్ ఖాన్ అనే వ్యక్తి ఈ విషాద దృశ్యాన్ని వీడియోలో బంధించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కరోనా వైరస్ కట్టడి కోసం మార్చి ఆఖరు వారంలో అకస్మాత్తుగా దేశవ్యాప్తంగా మూడు వారాల లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పలువురు వలస కూలీలు స్వస్థలాలకు చేరుకునేందుకు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలామందికి తినడానికి తిండి కూడా దక్కడం లేదు. దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల శిబిరాలు ఏర్పాటు చేసి వలస కూలీలకు ఆహారం అందించే ప్రయత్నం జరుగుతున్నా.. కొందరు ఇప్పటికీ తిండికి అల్లాడిపోతూనే ఉన్నారు. కరోనా వైరస్ను నియంత్రించేందుకు మూడువారాల లాక్డౌన్ ముగిసిన క్రమంలో మరో రెండు వారాల పాటు పొడిగించిన క్రమంలో దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది మందిని తీవ్ర పేదరికంలోకి నెట్టివేసింది. పని కోల్పోయిన వలస కార్మికులు వేలాది కిలోమీటర్లు నడుస్తూ స్వస్ధలాలకు చేరుకోగా, మరికొందరు నగరాలు, పట్టణాల్లో చిక్కుకుపోయి పూటగడవని స్ధితిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మంది పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు సబ్సిడీపై ఆహార ధాన్యాలు సమకూర్చింది. మరోవైపు భారత్లో కరోనా పాజిటివ్ కేసులు 11,000 దాటగా 377 మందికి పైగా మరణించారు. -
మూగజీవాలపై ద్వేషమేల?
కర్ణాటక,బనశంకరి: మూగజీవాలకు విషమిచ్చి చంపాడో కిరాతకుడు. విషం పెట్టిన ఘటనలో ఏడు వీధికుక్కలు మృత్యవాత పడగా, నాలుగు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన జేపీ.నగర పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. జేపీ.నగర ఎంఎస్.రామయ్యసిటీలో ఎవరో దుండగులు విషం కలిపిన ఆహారాన్ని కుక్కలకు వేశారు. వాటిని తిని ప్రాణాలు పోగొట్టుకున్నాయి. కొనప్రాణంతో ఉన్న కుక్కలను స్థానికులు, ప్రాణిప్రియులు గమనించి ప్రాణి చికిత్సా కేంద్రానికి తరలించారు. కారకులెవరో తెలిస్తే కేసు పెడతాం ఈ ఘటన పై బీబీఎంపీ ప్రత్యేక కమిషనర్ రందీప్ మాట్లాడుతూ. వీధికుక్కలకు విషంతో కూడిన ఆహారం వేసిన ఘటన తమ దృష్టికిరాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలా చేయడం నేరమని, కారకుల ఆచూకీ తెలిస్తే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
వీధి శునకాల ఆత్మ బంధువు
జూబ్లీహిల్స్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్, యూసఫ్గూడ పోలీస్ లైన్స్ పెట్రోల్ బంక్.. ఇలాంటి చోట్లవేసవిలో కాస్త పరీక్షగా చూస్తే నీళ్లు నింపిన సిమెంట్ తొట్టెలు కనిపిస్తాయి. కాసేపు అక్కడే ఉండిగమనిస్తే వీధి శునకాలు అక్కడికి రావడం.. ఆ తొట్టెల్లోని నీరు తాగడం కూడా చూడొచ్చు. నగరంలో ఇలాంటివి ఇంకా చాలా చోట్లేకనిపిస్తాయి. వీటి ఏర్పాటు వెనుక వీధి శునకాల దుస్థితికిచలించిపోయిన ‘విజయలక్ష్మి’ మానవతా హృదయం ఉంది. పెంపుడు జంతువులు మాత్రమే కాదు..రోడ్డు మీద తిరిగే ప్రతి జంతువు బాగూ కోరే కొండంత తపన ఉంది. సాక్షి, సిటీబ్యూరో :బేగంపేటలోని ఓ వీధిలో అపార్ట్మెంట్స్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో వీధికుక్క ఆరు పిల్లల్ని పెట్టింది. చుట్టుపక్కల నివాసితులంతా వాటిని అక్కడి నుంచి ఎలా తరిమేయాలా అనే ఆలోచన చేశారు. కొందరు తరిమేసేందుకు విసిరిన రాళ్ల దెబ్బలకూ బెదిరి అటూ ఇటూ పరుగులు తీసిన పిల్లల్లో రెండు రోడ్డుపై వెళ్లే వాహనాల కింద పడి నలిగిపోయాయి. మిగిలిన తల్లీ పిల్లల్ని స్థానికుల ఫిర్యాదు మేరకు మున్సిపల్ వ్యాన్లో తరలించబోతే అడ్డుకుని వాటిని పెంచుకుంటానని ఇంటికి తెచ్చుకుంది ఆ మానవతా హృదయం. ఆ మనసు పేరు ‘‘ఇవటూరి విజయలక్ష్మి’’. వెంగళరావునగర్ డివిజన్ సిద్ధార్థనగర్లో నివసిస్తున్న ఈమె వీధి శునకాల కోసం ‘డాలర్ హోమ్స్’ పేరుతో ప్రత్యేక స్వచ్ఛంద ఆశ్రమాన్నే నడుపుతున్నారు. అంతేకాదు శంషాబాద్లో దాదాపు 250 దాకా నిరాశ్రయ శునకాలను సాకుతున్నారు. ఆమె పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. వీధికుక్కలకూ విలువుంది.. శునకాలంటే చిన్నప్పటి నుంచి అభిమానం. మాకు ఇంట్లో ‘డాలర్’ పేరుతో ఓ పమేరియన్ ఉండేది. దాన్ని బాగా చూసుకునేవాళ్లం. అదే సమయంలో వీధిలో తిరిగే కుక్కల్ని చూసినప్పుడు బాధనిపించేది. గాలికి తిరుగుతూ రాళ్ల దెబ్బలు తింటూ ఏ వాహనం కిందో పడి రాలిపోయే వీధి కుక్కల సమస్యలు చూసి చలించిపోయేదాన్ని. బేగంపేటలో మా అపార్ట్వెంట్ పక్కనే ఖాళీ స్థలంలో ఓ శునకానికి పుట్టిన ఆరు పిల్లల్లో రెండు అలాగే ప్రాణాలు కోల్పోయాయి. మిగిలిన తల్లీ, పిల్లల్నీ తీసుకొచ్చి పెంచతున్నాను. తల్లికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించాను. ఫ్రెండ్కి ఒకటి దత్తతకి ఇచ్చాను. బేగంపేట నుంచి ఇల్లు మారే సమయంలో కుక్క పిల్లలకి రూ.500, పెద్ద వాటికి రూ.1000 చొప్పున చెల్లించి కిస్మత్పూర్లోని కెనల్లో ఉంచాను. నెలకి ఇంత చొప్పున చెల్లించే పద్ధతిలో మొత్తం 11 వీధి కుక్కల్ని అక్కడ ఉంచాను. కెనల్ నిర్వాహకురాలికి ఆరోగ్యం బాగాలేదని నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకునేటప్పటికి అక్కడ నేను చేర్చిన శునకాతో కలిపి 42 ఉన్నాయి. అవన్నీ ఏమవుతాయో అనే భయంతో అలవాటు లేని పనే అయినా కెనల్ నిర్వహణ తలకెత్తుకున్నా. డాలర్ని కోల్పోయి.. కేన్సర్కు గురై.. నా పిల్లలు ముగ్గురికి పెళ్లయి అమెరికాలో సెటిలైపోయారు. సొంత బిడ్డలా 15 ఏళ్లు పెంచుకున్న నా డాలర్ పమేరియన్ ఐదేళ్ల క్రితం చనిపోవడంతో తట్టుకోలేకపోయాను. అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆస్పత్రి పాలయ్యా. అదే సమయంలో నాకు కేన్సర్ అని నిర్థారణ అయింది. దాంతో భర్త, పిల్లలు నేను చేసే ప్రైవేట్ జాబ్ మాన్పించేశారు. మరోవైపు చాలా మంది నన్ను ఈ కుక్కల బాధ్యతలు వదిలేయమని సలహా ఇచ్చారు. కానీ అప్పుడే నాకు ఇంకా పట్టుదల వచ్చింది. కేన్సర్తో పోరాడుతూనే.. నచ్చిన సేవను విస్తరించాను. అంకురించిన ‘డాలర్ హోమ్స్’ డాలర్ హోమ్స్ పేరుతో ఓ ట్రస్ట్ రిజిస్టర్ చేశాను. శంషాబాద్లోని తుండుపల్లి గ్రామం వద్ద స్థలం తీసుకుని వీధి శునకాల కోసం హోమ్ ప్రారంభించాను. ఇది ఒక రకంగా మనుషులకు ఉన్నట్టే శునకాల అనాధాశ్రమం. ఇందులో ఆరుగురు పనివాళ్లు ఉన్నారు. పెరాలసిస్ వచ్చినవి, కళ్లులేని, అంగవైకల్యం కలవి.. ఇలా అన్ని రకాల శునకాలూ ఇక్కడ ఆశ్రయం పొందుతున్నాయి. వలంటీర్స్ కొందరు రెస్క్యూ చేసిన డాగ్స్ తెచ్చి ఇస్తుంటారు. ఏటేటా వ్యాక్సిన్లు వేయించడం, స్టెరిలైజేషన్ అవన్నీ చేస్తుంటాం. ఏదైనా శునకం చనిపోతే అంత్యక్రియలు చేస్తాం. వండిన ఫుడ్ నైవేద్యం కింద పెట్టి మిగతాది కుక్కలకి పెడతాం. ఈ హోమ్కి చాలా మంది సిటిజనులు మద్ధతు ఇస్తున్నారు. ఏపీ టూరిజంలో పనిచేసే గోవిందరాజులు గత నాలుగేళ్లుగా తండ్రి సంవత్సరీకం రోజున కిలోల కొద్దీ చికెన్, పెడిగ్రీ, పెరుగు.. తెచ్చి ఇక్కడి డాగ్స్కి పెడుతుంటారు. గచ్చిబౌలిలో వెటర్నరీ డాక్టర్ మధు పదుల సంఖ్యలో కుక్కలకు ఉచిత సర్జరీలు కూడా చేశారు. అనాథ శునకాలకు కనీసం తాగే నీరు కూ డా కరవే. ఎండాకాలంలో వాటి బాధలు వర్ణనాతీతం. ఆకలి కొంతైనా తీర్చాలని సమ్మర్లో బక్కెట్ వాటర్ పట్టే సిమెంట్ బౌల్స్ వందల సంఖ్యలో తయారు చేయిస్తున్నాం. దాదాపు నగరంలో అన్నిచోట్లా పెట్టిస్తున్నాం. పూర్తి స్థాయి షెల్టర్ లక్ష్యంగా.. కేన్సర్ వ్యాధికి మందులు తీసుకుంటున్నా. అందుకే 10 రోజులకో, రెండు వారాలకోసారి మాత్రమే మా డాలర్ హోమ్స్కు వెళ్లగలుగుతున్నా. నగరంలో ఏ యానిమల్ అయినా సరే ఏ కారణంగానైనా బాధపడకూడదనే ఉద్దేశంతో ‘డాలర్ హోమ్స్’ పెట్టాను. మీకు వద్దనుకున్న డాగ్స్ని రోడ్డు మీద వదిలేయకుండా నా దగ్గర వదిలేయాలని కోరుతున్నా. డాగ్స్తో పాటు అన్ని రకాల జంతువులకీ షెల్టర్ ఇవ్వాలని, దీనికోసం మరింత భారీ స్థాయిలో సొంతంగా హోమ్ కట్టాలని ఆలోచన ఉంది. అలాగే వీధి శునకాలకు బర్త్ కంట్రోల్ సర్జరీలు చేసే పనిలో పెద్ద ఎత్తున పాలుపంచుకోవాలని ఉంది. -
అమ్మో ‘భౌ’బోయ్...
సాక్షి, పలమనేరు : పలమనేరులో కుక్కల బెడద పెద్ద సమస్యగా మారింది. గత ప్రభుత్వం వీధికుక్కల సమస్యను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కుక్కల సంతతి విపరీతంగా పెరిగింది. వీటిని చంపేందుకు నిబంధనలు ఒప్పుకోనందున ఖచ్చితంగా స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేయాల్సి ఉంది. అయితే పంచాయతీలకు, మున్సిపాలిటీకి ఈ నిధులు అందక సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదు. పలమనేరు మున్సిపాలిటీలో మాత్రం గతంలో కొన్ని కుక్కలను పట్టి వాటిని మదనపల్లికి తీసుకుని వెళ్లి స్టెరిలైజేషన్ చేయించి వదిలిపెట్టారు. మిగిలిన కుక్కలను పట్టించుకోలేదు. దీంతో సమస్య మళ్లి మొదటికొచ్చింది. రోడ్డుపైకి రావాలంటే భయపడుతున్న జనం.. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వీధుల్లో కుక్కల బెడద ఎక్కువయ్యింది. రాత్రిపూట వీధుల్లోకి రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. కుక్కలు గుంపులు గుంపులుగా జనంపైకి వచ్చి పడుతున్నాయి. పలమనేరు పట్టణంలో గత రెండు సంవత్సరాల్లో కుక్కకాటుకు గురైన కేసులు 500 దాకా ఉన్నాయంటే వీటి బెడద ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాత్రిపూట గస్తీ తిరిగే పోలీసులను సైతం ఈ కుక్కలు వదలడం లేదు. కుక్కల దెబ్బకి రాత్రి సమయంలో ఏవైన పనులు ఉంటే వాయిదా వేసుకోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. బైక్పై వెలుతున్న వారికి తప్పడం లేదు.. రాత్రిపూట బైక్లపై ప్రయాణిస్తున్న వారిని రోడ్లపై కాచుకున్న కుక్కలు తరముకుంటూ వెళ్లి కాటేస్తున్నాయి. కుక్కలను చూసి వేగం పెంచడంతో బైక్ అదుపుతప్పి గాయపడిన సంఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కుప్పం రోడ్డులో నక్కపల్లి, కొలమాసనపల్లి, కూర్మాయి, మదనపల్లి రోడ్డులో కల్లుపల్లి, మబ్బువాళ్లపేట, గుడియాత్తం రోడ్డులో డిగ్రీ కళాశాల, టి.వడ్డూరు, కాలువపల్లితో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. పంచాయతీలకు విడుదల కాని నిధులు.. ఒక్కో కుక్కకు కు.ని శస్త్రచికిత్స చేయాలంటే రూ.500 దాకా ఖర్చు అవుతుంది. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 20వేల కుక్కలకు రూ.కోటి అవసరముంది. కానీ పంచాయతీలకు కుక్కల స్టెరిలైజేషన్కోసం గత మూడు సంవత్సరాలుగా ఒక్క పైసా కూడా విడుదల కాలేదు. పలమనేరు మున్సిపాలిటీలో మాత్రం గత సంవత్సరం ‘మిషన్ రాబిస్’ అనే పథకంలో భాగంగా 600 కుక్కలను మదనపల్లిలోని ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్టెరిలైజేషన్ ఆపరేషన్లు నిర్వహించి తిరిగి పట్టణంలో వదిలిపెట్టారు. ఈ ప్రక్రియ కొన్ని రోజులు కొనసాగి ఆ తర్వాత నిలిచిపోయింది. ప్రభుత్వం నుంచి సదరు ఏజెన్సీకి నిధులు విడుదల కాకపోవడంతో ఈ కార్యక్రమం ఆలస్యమవుతోందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. పశువులనూ వదలడం లేదు.. నియోజకవర్గంలో గత ఏడాది కాలంలో 152 పశువులు కుక్క కాటుకు గురి కాగా ఇందులో 20 దాకా మృతి చెందాయి. వీటిని సంబందిత మండలాల్లోని వెటర్నరీ ఆస్పత్రులకు తోలుకెలితే అక్కడ వైల్స్ అందుబాటులో లేవు. దీంతో ప్రైవేటుగానే వీటిని రైతులు కొనుగోలు చేయాల్సి వచ్చేది. మొత్తం మీద ప్రభుత్వం నుంచి అటు పంచాయతీలకు, ఇటు మున్సిపాలిటీలకు పూర్తి స్థాయిలో నిధులు మంజురైనప్పుడే కుక్కల సమస్య అదపులోకి వచ్చే అవకాశం ఉంది. -
మానవతా మరణం
అనంతపురం కల్చరల్: పురిటి బిడ్డను కాలవ పాలు చేసిన ఘటన మరువక ముందే అనంతలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు నవజాత శిశువులు కుక్కలకు ఆహారంగా మారారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురంలోని విద్యుత్ నగర్ నుంచి శారదానగర్ను కలుపుతూ కొత్తగా నిర్మిస్తున్న 80 అడుగుల రోడ్డు పక్కనే సోమవారం మధ్యాహ్నం ముళ్ల కంపల్లో ఓ నవజాత శిశువును అట్టపెట్టిలో పెట్టి పారిపోయారు. ఎవరూ గమనించకపోవడంతో వీధి కుక్కలు ఆ శిశువు శరీరంలోని చాలా భాగాలను తినేశాయి. కాగా, అట్టపెట్టెలో శిశువును పడేసి వెళుతున్న ఇద్దరిని స్థానికులు గుర్తించి ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. వీరిలో ఒకరు సర్వజనాస్పత్రిలో పనిచేస్తున్న శివ, మరొకరు కరిముల్లా అని తేలింది. విచారణలో తమకు సెక్యూరిటీ ఆఫీసర్ జోషి రూ. 500 ఇచ్చి నవజాత శిశువును ఖననం చేయాలని సూచించినట్లు నిందితులు తెలిపారు. మరో ఘటనలో జేఎన్టీయూ సమీపంలో ఓ పసికందును పడేసి వెళ్లారు. సోమవారం ఉదయమే రెండు ఆటోల్లో వచ్చిన అమ్మాయిలు ఇందుకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, అధికారుల సూచన మేరకు మృతశిశువుల మృతదేహాలను సాయి సంస్థ అధ్యక్షుడు విజయసాయికుమార్ ఖననం చేశారు. -
ప్రతీ కుక్కకో లెక్క!
గచ్చిబౌలి: గ్రేటర్లో వీధి కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల కుక్కకాటు కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో శునకాల సంఖ్యను తగ్గించేందుకు, సకాలంలో వ్యాక్సినేషన్లు వేసేందుకు జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారు లు ఓ ఆలోచనకు వచ్చారు. వీధి కుక్కలకు ఐడెంటిఫికేషన్ చిప్ అమర్చితే మెరుగైన ఫలితాలు ఉంటాయని భావిస్తున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ... కుక్కల బెడద తగ్గేందుకు అవకాశముంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఒక్కో దానికి రూ.100–150 ఖర్చు... ఐడెంటిఫికేషన్ చిప్ను కుక్క చర్మంలోకి పంపిస్తారు. దీనికి జీపీఎస్ విధానం అనుసంధానం చేసి ఉంటుంది. దీని ద్వారా కుక్క ఎక్కడ తిరుగుతుందో తెలుసుకోవచ్చు. అదే విధంగా కుక్కకు యాంటీ బర్త్ కంట్రోల్(ఏబీసీ) చేశా రా? లేదా? అని, రెగ్యులర్ ఏఆర్వీ (యాంటీ రేబిస్ వ్యాక్సిన్) చేశారా? లేదా? అనే విష యాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇవి చేయని పక్షంలో ఏబీసీ, ఏఆర్వీ చేయొచ్చు. బంజారాహిల్స్లోని డాక్టర్ విజయలక్ష్మి పెట్ క్లినిక్లో పెంపుడు శునకాలకు ఈ చిప్ను అమరుస్తున్నారు. ఇదే తరహాలో జీహెచ్ఎంసీలోనూ చేపట్టాలనే ఉద్దేశంతో దీనిపై అధికారుల్లో చర్చ జరిగింది. ఒక్కో కుక్కకు చిప్ను అమర్చేందుకు రూ.100 నుంచి రూ.150 ఖర్చవుతుందని జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు పేర్కొంటున్నారు. కుక్కకు ఏబీసీ చేసిన తర్వాతే చిప్ అమరుస్తారు. కుక్క పిల్లలకు వ్యాక్సినేషన్ చేసిన తర్వాత చిప్ అమర్చి వదిలేయొచ్చు. చిప్ ద్వారా దాని వయస్సు తెలుసుకోవచ్చు. 8నెలల వయస్సు వచ్చే సరికి జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం సిబ్బంది దానికి ఏబీసీ చేస్తారు. ఏడాదికోసారి క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ చేసే అవకాశం ఉంటుంది. పెట్స్ పెరిగాయ్.. బ్లూక్రాస్ స్వచ్ఛంద సంస్థ లెక్కల ప్రకారం శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్ పరిధిలోని శేరిలింగంపల్లి, చందానగర్, కూకట్పల్లి, మూసాపేట్ తదితర సర్కిళ్లలో 2017 మార్చి నాటికి 81,058 వీధి కుక్కలు ఉండగా, 2018 నాటికి 77,831 తగ్గాయి. చిప్స్ అమర్చితే వీటి సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. ఇక ఈ జోన్లో 2017–18లో 3,571 పెంపుడు శునకాలు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో 707 పెట్స్కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2018–19లో వీటి సంఖ్య 3,681కి పెరిగింది. రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. జీహెచ్ఎంసీ పరిధిలో పెంపుడు కుక్కలకురిజిస్ట్రేషన్ తప్పనిసరి అనే నిబంధన ఎప్పటి నుంచో అమలులో ఉంది. అయినప్పటికీ కొందరు యజమానులు దీనిపై ఆసక్తి చూపడం లేదు. అవసరమైనప్పుడు ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు, ఇతర రాష్ట్రాలకు పెట్స్ను తీసుకెళ్లేందుకు రిజిస్ట్రేషన్ ఉపయోగపడుతుంది. జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేట్ పెట్ క్లినిక్స్లలో వాక్సినేషన్ షెడ్యూల్ బుక్, పొరుగువారు ఇచ్చే ఎన్ఓసీ ప్రతులను జతపరిచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రోడ్లపైకి వస్తే జరిమానా... పెంపుడు కుక్కలు రోడ్లపైకి వచ్చి మల, మూత్ర విసర్జన చేస్తే ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో భాగంగా దాని యజమానికి రూ.10 వేలు జరిమానా విధిస్తాం. ఇరుగుపొరుగు, ఇతరులు ఎవరైనా ఫిర్యాదు చేసినా ఈ మొత్తం కట్టాల్సిందే. పెట్స్కు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వీటికి చిప్స్ను అమర్చే ప్రక్రియ ప్రైవేట్ క్లినిక్లు చేపడుతున్నాయి. వీధి కుక్కలకు అమర్చాలనే దిశగా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.– డాక్టర్ రనజిత్,వెటర్నరీ ఆఫీసర్, వెస్ట్ జోనల్ -
ప్రేమైక జీవితం
సాక్షి ప్రతినిధి, చెన్నై:‘కల్ల కండాల్ నాయి కాణుం..నాయి కండాల్ కల్ల కాణుం’ (రాయి ఉన్నపుడు కుక్క కనపడదు.. కుక్క కనపడినపుడు రాయి ఉండదు). వీధి కుక్కుల విషయంలో విసిగి పోయిన తమిళనాడు ప్రజల నోళ్లలో బహుళ ప్రాచుర్యం పొందిన నానుడు ఇది. కుక్క కనిపిస్తే రాయితో కొట్టి తరిమేయడమే అందరికీ తెలుసు. కానీ ఆ వృద్ధురాలికి వాటిని చేరదీయడం మాత్రమే తెలుసు. కాటికి కాళ్లు చాపుకున్న వయసులో కన్నబిడ్డలతో సమానంగా చూసుకుంటున్న వృద్ధురాలి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. కన్యాకుమారి జిల్లా కులశేఖరం కావలస్థలం ప్రాంతానికి చెందిన అయీషాబీవీ (77) భర్త పీర్ మహ్మమద్ అదే పట్టణ పంచాయతీలో కౌన్సిలర్గా పనిచేశాడు. రిటైర్డు ఉపాధ్యాయుడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే భర్త కొంత కాలం క్రితం చనిపోగా, పిల్లలకు పెళ్లిళ్లయి వేరుగా ఉంటున్నారు. సహజంగా జాలి, దయ మెండుగా కలిగి ఉన్న అయిషా కొన్నేళ్ల క్రితం రెండు వీధి కుక్కలను చేరదీసి తనకున్న దాంట్లో కొద్దిగా పెట్టడం ప్రారంభించింది. ఈ రెండు కుక్కలను చూసి క్రమేణా మరిన్ని కుక్కలు రావడం ప్రారంభించాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 27కు చేరింది. పిల్లలు ఇచ్చే కూసింత డబ్బులు, భర్త పింఛను తప్ప మరే ఆసరాలేని అయిషా కుక్కలకు ఆహారం విషయంలోమాత్రం రాజీపడదు. కుక్కలు ఊరంతా తిరిగి ఏ రాత్రికి ఇంటికి చేరుకున్నా రకరకాల తిండి, మాంసం, బిస్కెట్లు పెడుతుంది. దీంతో 24 గంటలు ఆమె ఇంటి ముందు కుక్కల సందడే సందడి. అయిషా కుక్కలపై చూపుతున్న ప్రేమవాత్సల్యాలు మాకు ఇబ్బందిగా మారిందని ఇరుగూ పొరుగూ వారూ వ్యాఖ్యానాలు చేసేవారు. అడ్డుకునేవారు. అయితే వృద్ధురాలు మాత్రం ఇవేమీ పట్టించుకునేది కాదు. పట్టణ పంచాయతీవారు కుక్కలను పట్టుకుని చంపేస్తుంటే కేందమంత్రి మేనకాగాంధీకి ఉత్తరం రాయగా అధికారులు వెంటనే నిలిపివేశారు. ఈ వయసులో నీకెందుకు ఈ అవస్థలు అని పిల్లలు ఎన్ని చెప్పినా వినలేదు. ఇటీవల ఆమెకు బలమైన గాయం తగలడంతో నడవలేని స్థితికి చేరుకుంది. దీంతో పిల్లలు మరోసారి ఒత్తిడి చేయడంతో విధిలేక అంగీకరించింది. అయితే బిడ్డల్లా చూసుకుంటున్న కుక్కల మాటేమిటని ఆమె కలత చెందింది. మరోసారి మేనకాగాంధీకి, జిల్లా కలెక్టర్కు ఉత్తరం రాశారు. పీపుల్స్బార్ యానిమల్ సంఘం నిర్యాహకుడు ఆజాద్ సైతం వృద్ధురాలి వినతిని వివరిస్తూ జిల్లా కలెక్టర్కు ఉత్తరం రాశారు. ఈ ఉత్తరాలకు స్పందించిన జిల్లా కలెక్టర్ కన్యాకుమారి జిల్లా మూగ ప్రాణుల వధ నిరోధక సంఘం కార్యదర్శి కృష్ణమణికి తెలిపారు. కుమారకోయిల్ సమీపంలోని జంతుశరణాలయానికి వృద్ధురాలి ఆధీనంలోని 27 కుక్కలను రెండురోజుల క్రితం తరలించారు. కన్నీళ్ల పర్యంతమైన వృద్ధురాలు శరణాలయ సిబ్బంది కుక్కలను తీసుకెళుతుండగా వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. ఇక వాటిని చూడలేను, ఆహారం పెట్టలేనన్న ఆవేదనతో చివరిసారిగా పరోటా, మాంసం, బిస్కెట్లు పెట్టింది. ఆ మూగజీవాలు సైతం పెద్దగా అరుస్తూ వృద్ధురాలిని చూస్తూ మూగంగా రోదించడం ప్రారంభించాయి. వదలివెళ్లమంటూ మొండికేయడంతో గొలుసులతో కట్టి తరలించేందుకు శరణాలయ సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది. -
కుక్కల దాడిలో బాలుడు మృతి
సర్పవరం (కాకినాడ సిటీ): ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేసి దారుణంగా చంపేశాయి. ప్రహరీ దూకి వెళ్లి మరీ చిన్నారిపై దాడి చేశాయి. అందరూ ఇంటి లోపల ఉండడంతో ఆ బాలుడి ఆర్తనాదాలు ఎవరికీ వినబడలేదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శనివారం ఈ దారుణం చోటుచేసుకుంది. కాకినాడ బాలా చెరువు సెంటర్లోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న దీపాలవారి వీధిలోని ఓ ఇంటిలో ఆరు కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆటోమెకానిక్గా పనిచేస్తున్న వాసంశెట్టి శ్రీనివాస్ కుటుంబంతో సహా ఇటీవలే ఆ ఇంటిలో అద్దెకు దిగాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. భార్య భూలక్ష్మి ఓ వృద్ధురాలి వద్ద ఆయాగా పనిచేస్తోంది. కుమారుడు నాగేంద్ర ఒకటో తరగతి చదువుతున్నాడు. శనివారం రంజాన్ పర్వదినం సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో చిన్నారులు ఇంటి వద్దే ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ రోజు మాదిరిగానే పనికి వెళ్లిపోయారు. అక్కలు ఇంటిలో ఉండగా, నాగేంద్ర ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో ఇంటి ప్రహరీ దూకి వీధికుక్కలు ఒక్కసారిగా నాగేంద్రపై దాడి చేసి ఈడ్చుకెళ్లాయి. అందరూ లోపల ఉండిపోవడంతో అతడి ఆర్తనాదాలు ఏ ఒక్కరి చెవినా పడలేదు. కొద్దిసేపటికి చుట్టుపక్కల వారు గమనించి వారి బంధువులకు చెప్పారు. వారి వెళ్లి చూడగా అప్పటికే నాగేంద్ర మరణించాడు. అతడి తల వెనుక భాగాన్ని, భూజాన్ని కుక్కలు పీక్కు తిన్నాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే ఇంటికి చేరుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
‘వీధి కుక్కలకు శస్త్ర చికిత్సలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో వీధి కుక్కలకు రోగనిరోధక టీకాలు ఇవ్వడంతో పాటు పునరుత్పత్తి నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిపిస్తామని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర వింద్కుమార్ తెలిపారు. వీధి కుక్కలను చంపకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం ఆయన బ్లూక్రాస్ సొసైటీ వ్యవస్థాపకురాలు, సినీ నటి అక్కినేని అమలతో సమావేశమయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వెటర్నరీ విద్యార్థుల కోసం త్వరలో 2 వారాల శిక్షణ కోర్సును ప్రారంభించనున్నామన్నారు. వెటర్నరీ విద్యార్థులకు శిక్షణ అందించడానికి బ్లూక్రాస్ సొసైటీ ద్వారా ప్రభుత్వానికి సహకరిస్తామని అమల పేర్కొన్నారు. కార్యక్రమంలో పురపాలక శాఖ డైరెక్టర్ డీకే శ్రీదేవి పాల్గొన్నారు. -
హైదరాబాద్లో రెచ్చిపోతున్న వీధికుక్కలు
-
వీధికుక్కల దాడిలో బాలుడి మృతి
♦ రంజాన్ పండుగ రోజు విషాదం ♦ శరీరంపై వంద గాట్లు.. మేడ్చల్ జిల్లాలో ఘటన హైదరాబాద్: ఆనందంగా గడపాల్సిన రంజాన్ పండుగ రోజు ఆ ఇంట విషాదం నెలకొంది. మజీద్ బయట ఆడుకుం టున్న చిన్నారిని వీధికుక్క లు బలితీసుకున్నాయి. కళ్లెదుటే కన్నకొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఈ విషాదకర ఘటన మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండలం మూడు చింతలపల్లి కాశవాడలో సోమవారం చోటు చేసుకుంది. మూడు చింతలపల్లి కాశవాడకు చెందిన ఎం.డి.ఇమామ్, ఖాదర్బీ దంపతులకు హసీనా, ఎండీ ఫారుక్(7), ఎండీ హస్మీ సంతానం. రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం ఉదయం వీరు స్థానిక మజీద్కు వచ్చారు. అందరూ నమాజ్ చేస్తుండగా ఫారూక్ మజీద్ సమీపంలో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో పోట్లాడుకుంటూ వచ్చిన ఆరు వీధి కుక్కలు ఒక్కసారిగా ఫారూక్పై దాడి చేశాయి. బాలుడి తల, మెడ, వీపు, కడుపు, కాళ్లు, చేతులు ఇలా శరీరమంతా గాయాలై తీవ్ర రక్త స్రావమైంది. ‘అల్లా ,అబ్బా, అమ్మీ ముజుకో బచావో’అంటూ ఆ చిన్నారి మొత్తుకుంటున్నా కుక్కలు విడిచి పెట్టలేదు. కేకలు విన్న తండ్రి ఇమామ్ వెంటనే చిన్నారి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే తీవ్రంగా కరవడంతో బాలుడి పరిస్థితి విషమించింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఫారుక్ను అంబులెన్స్లో మొదట నగరంలోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి శరీరంపై వంద కాట్లు ఉన్నాయి. పరిస్థితి విష మంగా ఉందని వైద్యులు చెప్పడంతో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొం దుతూ ఫారూక్ మృతి చెందాడు. ఫారూక్ మృతిని తట్టుకోలేక కుటుం బీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో ఆస్పత్రిలో విషా దఛాయలు అలుముకున్నాయి. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కో సం బాలుణ్ని అంబులెన్స్లో నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అక్క డి వైద్యులు బాలుని శరీరంపై ఉన్న సుమారు వందకుపైగా కుక్కగాటు గాయా లను శుభ్రం చేసి రిగ్ ఇంజక్షన్ ఇచ్చారు. నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. -
అర్ధరాత్రి బుడ్డోడి సాహసం; వైరల్ వీడియో
హైదరాబాద్: అర్ధరాత్రి. సమయం 12:40. చిన్నారులు పూజ- చందులు చేతిలో చెయ్యివేసుకుని చిన్న గల్లీలోకి ఎంటర్ అయ్యారు. కొద్ది దూరం నడిస్తే ఇల్లొచ్చేస్తుంది. కానీ అంతలోనే ఓ వీధికుక్కల గుంపు వారికేసి గుర్రుమంది. ప్రమాదాన్ని పసిగట్టిన పూజ.. క్షణంలో పారిపోయింది. చందుకు మాత్రం కుక్కలు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దూసుకొచ్చి చుట్టుముట్టాయి. పెద్దవాళ్లుసైతం గజగజా వణికిపోయే ఆ పరిస్థితిలో చందూ సాహసం ప్రదర్శించాడు. కుక్కలను ఎదిరించి సురక్షితంగా బయటపడగలిగాడు. హైదరాబాద్లోని మూసాపేట్లో శనివారం రాత్రి చోటుచేసుకున ఈ సంఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. మూసాపేట్లోని శ్రీకాకుళం బస్తీలో శనివారం రాత్రి ఓ పెళ్లి జరిగింది. పెళ్లింటి నుంచి రెండు వీధుల అవతలుండే సొంతింటికి వెళ్లే క్రమంలో చందు, పూజలు ఇలా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వీధికుక్కల నుంచి రక్షణకల్పించాల్సిందిగా స్థానికులు పలుమార్లు వేడుకున్నా అధికారులు స్పందిచడంలేదు. -
అర్ధరాత్రి బుడ్డోడి సాహసం; వైరల్ వీడియో
-
ముత్తాయిపేటలో ఊర కుక్కలు హతం
విషం పెట్టి చంపిన గ్రామపంచాయతీ కార్మికులు ఊహించని స్థితిలో ఓ పెంపుడు కుక్క మృతి తట్టుకోలేక తల్లడిల్లుతూ రోదించిన చిన్నారులు వారిని చూసి గ్రామస్తుల కంటతడి మెదక్: ఊర కుక్కలు దాడులు చేసి ప్రజలను గాయపరుస్తున్నాయని ఆ గ్రామస్తులంతా తీర్మానించి విషంతో వాటిని చంపించారు. అందులో ఓ పెంపుడు కుక్క సైతం మృతి చెందడంతో పదేళ్లలోపు అక్కా తమ్ముళ్లు నాలుగు గంటలపాటు రోదించారు. ఈ ఘటన మండల పరిధిలోని ముత్తాయికోట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ముత్తాయికోట గ్రామంలో కొన్ని రోజులుగా సుమారు 300మంది గ్రామస్తులను వీధి కుక్కలు తీవ్రంగా కరిచి గాయపర్చాయి. దీంతో ఇటీవల గ్రామ పంచాయతీ ఊర కుక్కలను చంపేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసింది. అందులో భాగంగానే గురువారం సుమారు 150 కుక్కలకు విషం పెట్టి చంపారు. ఇందులో గ్రామానికి చెందిన మూడబోయిన కృష్ణ పెంపుడు కుక్క సైతం మృతి చెందింది. కృష్ణ పిల్లలు భవాని, భవాని ప్రసాద్లు ఆ పెంపుడు కుక్కను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అది లేనిదే ఒక్క క్షణం కూడా ఉండలేని ఆ చిన్నారులు కుక్క చనిపోయిన విషయం తెలుసుకొని సుమారు 4గంటలపాటు రోదించారు. వారి రోదనలు ఆపడం ఎవరితరం కాలేదు. వారిని చూసిన గ్రామస్తులు సైతం కంటతడి పెట్టకుండా ఉండలేకపోయారు. విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన పెంపుడు కుక్కతో ఆ చిన్నారులిద్దరూ అత్యంత ఆప్యాయంగా ఉండేవారని ఆ కుటుంబీకులు తెలిపారు. -
పిచ్చి కుక్క దాడి: 23 మందికి గాయాలు
ఏఎస్ పేట: నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తోంది. పంచాయతి పరిధిలోని పలు కాలనీలలో తిరుగుతూ గతరాత్రి నుంచి ఇప్పటివరకు 23 మందిని గాయపర్చింది. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. గ్రామస్థులంతా కలిసి పిచ్చి కుక్కను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రబుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
వీధికుక్కల వీరంగం
- తీవ్రంగా గాయపడ్డ మూడేళ్ల చిన్నారి నల్లకుంట వీధికుక్కలు వీరంగం సృష్టించాయి. హైదరాబాద్ నగరంలోని ప్రజలపై కుక్కుల దాడి మరీ ఎక్కువైంది. ఇంట్లో ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటన ఉప్పల్ కళ్యాణ పురి కాలనీ లో జరిగింది. బాధితురాలి తండ్రి ఇచ్చిన వివరాల ప్రకారం.. గుంపుగా తిరుగుతున్న వీధి కుక్కలు బుధవారం ఒక్కసారి గా ఇంట్లో కి వచ్చి.. ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి పావని(3) ని నోట కర్చుకుని ఈడ్చుకు వెళ్లాయి. చిన్నారి తల, ముఖం, కడుపు, వీపు, చేతులపై తీవ్ర గాయాలు చేశాయి. ఇంతలో దాడిని గమనించిన స్థానికులు కుక్కలను తరిమి.. చిన్నారిని కాపాడారు. రక్తం ఓడుతున్న చిన్నారిని హుటాహుటిన నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
చైతన్యపురిలో కుక్కల స్వైరవిహారం
హైదరాబాద్ : నగరంలోని చైతన్యపురిలో వీధి కుక్కలు వీర విహారం చేస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రణీత(4)పై కుక్కలు దాడి చేశాయి. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికి సమీపంలోనే భాను(20) అనే యువకుడిపై కూడా కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించగా.. వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుంచి ఇద్దరినీ ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. -
వీధి కుక్కల వీరంగం... చిన్నారి మృతి
హైదరాబాద్: వీధికుక్కల వీరంగం.. ఓ చిన్నారి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా నారాయణ్ఖేడ్ గ్రామానికి చెందిన సంగారెడ్డి చాలాకాలం క్రితం నగరానికి వచ్చి ఓల్డ్ కాప్రాలో నివాసం ఉంటున్నాడు. అతని కూతురు సోనీ(8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. బుధవారం సాయంత్రం వారి ఇంటి సమీపంలో వీధి కుక్కలన్నీ ఒకచోట చేరి పోట్లాడుతూ వీరంగం సృష్టించాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న సోనీపైకి కుక్కలన్నీ ఒక్కసారిగా దూసుకురావడంతో చిన్నారి కింద పడిపోయింది. తలకు తీవ్ర గాయం కావడంతో తల్లిదండ్రులు బాలికను ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ మృతి చెందింది. వీధి కుక్కల బెడదను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని, వారి నిర్లక్ష్యం మూలంగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. -
పిచ్చికుక్క దాడిలో పది మందికి గాయాలు
శాయంపేట: వరంగల్ జిల్లా శాయంపేటలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు. మండలంలోని సాధన్పల్లిలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. బాధితులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పిచ్చికుక్కల విహారంతో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. -
వీధికుక్కల స్వైర విహారం
మెదక్ జిల్లా దుబ్బాకలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో ఆరుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారులను చికిత్స నిమిత్తం హుటాహుటిన సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు -
మూడేళ్ల బాలుడిపై వీధికుక్క దాడి
మరో సారి విశాఖలో వీధికుక్కలు రెచ్చిపోయాయి.. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని విధికుక్కలు తీవ్రంగా గాయపర్చాయి. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం సత్యనారాయణ పురంలో గురువారం జరిగింది. వివరాలు.. స్థానిక కాలనీలో నివాసముంటున్న మురళి, కుమారిల మూడేళ్ల కుమారుడు ఊట్కూరి కిరణ్ ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో.. వీధి కుక్క దాడి చేసింది. దీంతో బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. దాడిని గుర్తించిన తల్లిదండ్రులు కుక్కను తరిమి బాలుడిని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మహబూబ్నగర్ జిల్లాలో వీధికుక్కల స్వైరవిహారం
-
వీధి కుక్కల దాడి: ముగ్గురికి గాయాలు
హయత్నగర్: నగరంలోని హయత్నగర్లో వీధి కుక్కలు మరోసారి విజృంభించాయి. సోమవారం హయత్నగర్లో కుక్కలు ఒక వృద్ధుడు, ఇద్దరు చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కాగా, గత వారంలో హయత్నగర్ పరిధిలో కుక్కల దాడిలో 14 మంది గాయపడిన విషయం తెలిసిందే. నిరంతరం కాలనీల్లో కుక్కలు దాడి చేస్తున్నా మున్సిపల్ అధికారులు స్పందించడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
హైదరాబాద్లో కుక్కల స్వైరవిహారం
-
వీధి కుక్కుల దత్తతకు జంతు ప్రేమికుల క్యూ
బంజారాహిల్స్ (హైదరాబాద్): వీధి కుక్కలను దత్తత తీసుకునేందుకు జంతు ప్రేమికులు క్యూ కట్టారు. ఆదివారం నెక్లెస్ రోడ్డులోని లేక్వ్యూ పార్క్లో హైదరాబాద్ పెట్ అడాప్షన్ అనే స్వచ్చంద సంస్థ ఆద్వర్యంలో చేపట్టిన వీధి కుక్కల దత్తత కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. నగరంలో తొమ్మిదో విడత నిర్వహించిన ఈ దత్తత కార్యక్రమంలో 15 కుక్క పిల్లలను నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వారికి అందజేసినట్లు సంస్థ సభ్యులు చిత్ర, శ్రావణి, ఆనంత్రాబర్ట్లు తెలిపారు. అయితే, దత్తత ఇచ్చిన తర్వాత తమ పని అయిపోయిందని చేతులు దులుపుకోబోమని... నెలకోసారైనా వాటి సంరక్షణ ఎలా ఉందో తెలుసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకూ వేయి కుక్కలను చేరదీసి దత్తత ఇచ్చినట్లు తెలిపారు. -
పిచ్చి కుక్కలు దాడి: 21 మందికి గాయాలు
వరంగల్: వరంగల్ జిల్లాలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ, రేల్వే స్టేషన్ సమీపంలో శనివారం కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. మరో పది మంది మహిళల పై కూడా శునకాలు దాడి చేశాయి. సుమారు 21 మందిపై దాడి చేశాయి. కుక్కల దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పిచ్చి కుక్కల స్వైర విహారంతో.. స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన ఎవరిపై దాడి చేస్తాయోనని బయటకు రాలేకపోతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
శునకం.. భయానకం
కుక్కకాటుతో జనం విలవిల్లాడుతున్నారు. రాత్రిళ్లే కాదు.. పగటి పూట కూడా కుక్క కనిపిస్తే జడుసుకుంటున్నారు. గత మార్చి నెలలో 1,463 మంది కుక్క కాటుకు గురయ్యారంటే తీవ్రతకు అద్దం పడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న బాధితుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో వీధి కుక్కలకు కు.ని.ఆపరేషన్ చేయాలని, పిచ్చికుక్కలను చంపేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించినా ఎక్కడా అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. 1463 గత మార్చిలో కుక్కకాటు బాధితులు 10 ఈ నెల 16న గూడూరులో పిచ్చికుక్కలు కరిచిన వారి సంఖ్య కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటల ఆసుపత్రులు 40.. నంద్యాలలో జిల్లా ఆసుపత్రి, ఆదోని, ఎమ్మిగనూరుల్లో ఏరియా ఆసుపత్రులు, కర్నూలులో బోధనాసుపత్రి రోగులకు వైద్యసేవలు అందిస్తున్నాయి. ఈ ఆసుపత్రులన్నింటి లో కుక్కకాటుకు యాంటి రేబిస్ వ్యాక్సిన్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ప్రతి పీహెచ్సీలో నీసం నాలుగు వ్యాక్సిన్లైనా అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలోని ఏపీఎంఎస్ఐడీసీ డ్రగ్ స్టోర్ నుంచి యాంటిరేబిస్ వ్యాక్సిన్ ఆయా ఆసుపత్రులకు సరఫరా చేస్తారు. 2012-13లో 32వేలు, 2013-14లో 30వేలు, 2014-15లో 28వేల డోసుల యాంటి రేబిస్ వ్యాక్సిన్ను కుక్కకాటు బాధితులకు అందజేశారు. ప్రస్తుతం డ్రగ్స్టోర్లో 9,650 డోసులు, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 2,448 డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. మార్చిలో 1463 మందికి కుక్కకాటు జిల్లాలోని 53 పీహెచ్సీల పరిధిలో 1463 మంది కుక్కకాటుకు గురైనట్లు వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. అధికంగా కోసిగిలో 54, బేతంచర్లలో 43, గూడూరులో 45, పగిడ్యాలలో 50, జూపాడుబంగ్లాలో 44, తిమ్మాపురంలో 35, మద్దికెరలో 33, మద్దూరులో 42, కలుదేవకుంట్లలో 116, గోనెగండ్లలో 162, మిడుతూరులో 48, ఆస్పరిలో 34, తుగ్గలిలో 30, హుసేనాపురంలో 31 మంది కుక్కకాట్లకు గురయ్యారు. మొ త్తం 1,463 మందిలో 897 మంది పు రుషులు, 566 మంది స్త్రీలు ఉన్నారు. పెద్దాసుపత్రిపైనే భారం కుక్క కరిచిందంటే చాలు కర్నూలు నగరం నుంచే గాక చుట్టుపక్క గ్రామాల ప్రజలు సైతం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆశ్రయిస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ ఇక్కడ కుక్కకాటుకు వ్యాక్సిన్ అందిస్తున్నారు. రోజూ కొత్తవారు 25 నుంచి 30, పాతవారు 30 నుంచి 40 మంది చికిత్స కోసం వస్తున్నారు. మొత్తంగా నెలకు 1300 మందికి పైగా రోగులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికి సైతం ఏపీఎంఎస్ఐడీసీ డ్రగ్ స్టోర్ నుంచి యాంటి రేబిస్ వ్యాక్సిన్ను సరఫరా చేస్తారు. కుక్కకాటు బాధితులు పెరిగితే మాత్రం ఆసుపత్రి నిధుల నుంచి కొనుగోలు చేసి వేయాల్సి వస్తోంది. కుక్క కరిచిన వారికి అభయారబు వ్యాక్సిన్ను మొదటిరోజు, మూడవ రోజు, ఏడవ రోజు, 28వ రోజు వేయించాలి. ముందుజాగ్రత్తగా అయితే మొదటి, ఏడు, 28వ రోజు వ్యాక్సిన్ తప్పనిసరి. గ్రామాల్లో బహిర్బూమికి వెళ్లిన పెద్దలు, చిన్నపిల్లలు ఎక్కువగా కుక్కకాటుకు గురవుతున్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని.. లేకపోతే కర్రలు పట్టుకుని బహిర్బూమికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. శునకాల నియంత్రణకు చర్యలేవీ.. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో వీధికుక్కల నియంత్రణకు చర్యలు కరువయ్యాయి. ఏ వీధిలో చూసినా పదుల సంఖ్యలో వీధికుక్కలు గుంపులు రావడం చూసి జనం బెంబేలెత్తుతున్నారు. వీటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడం.. లేదా ఇతర పద్ధతుల ద్వారా నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోవడం మానేశారు. తాజాగా రాష్ట్రంలో మూడు, నాలుగు చోట్ల తీవ్రస్థాయిలో కుక్కకాటు బాధితులు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. గ్రామపంచాయతీలకు ఆదేశాలు కుక్కలను నియంత్రించేందుకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి పంచాయతీ కార్యాలయాలకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశాలను పంపించారు. 1994 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఆయా గ్రామ పంచాయతీల్లో లెసైన్స్లేని వీధి కుక్కలను పట్టుకుని ఎన్జీవోలకు అప్పగించాలి. తప్పదనిపిస్తే పిచ్చికుక్కలను చంపేయాలి. మటన్, చికెన్ షాపుల వద్ద పారేస్తున్న వ్యర్థాల వల్ల కుక్కలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు లెసైన్స్లేని మాంసపు విక్రయ దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆడ కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడంలో పశు సంవర్ధక శాఖకు సహకరించాలని పంచాయతీలను ఆదేశించారు. మాంసపు దుకాణాలు వ్యర్థాలకు ప్రత్యేక డస్ట్బిన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అయితే కర్నూలు మినహా ఇతర ప్రాంతాల్లో నామమాత్రంగానూ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. కుక్క కరిస్తే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి... ⇒ కుక్క కరిచిన చోట దారగా పారే కుళాయి నీటిని పది నిమిషాల పాటు వదలాలి. ⇒ డెటాల్, బెటాడిన్ యాంటిసెప్టిక్ లోషన్ పూయవచ్చు. ⇒ పసుపు మంచిదే. కానీ కొమ్మ నుంచి పసుపుపొడిగా మారే సమయంలో కలుషితమై ఉంటే దాని వల్ల గాయంపై ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఒక్కోసారి ధనుర్వాతం వ్యాధి వస్తుంది. ⇒ సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి. వైద్యులు సూచించిన మేర మందులు వాడాలి. ⇒ కుక్కలు పెంచే వారు ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ వేయిస్తే మంచిది. వ్యాక్సిన్ వేయించిన కుక్క మనిషిని కరిస్తే తప్పక యాంటి రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే. ⇒ కుక్క కరిచినా యాంటి రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోకపోతే వారిలో 80 శాతం మందికి రేబిస్ ఎన్సెఫలైటిస్ అనే వ్యాధి వస్తుంది. 10 నుంచి 20 శాతం మందికి అసిండింగ్ ఫెరాలసిస్ వ్యాధి వస్తుంది. -
మరోసారి కుక్కల స్వైరవిహారం
-
ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్కల దాడి
హైదరాబాద్: ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలికపై పది కుక్కలు మూకుమ్మడిగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. వివరాల్లోకి వెళితే... కర్మన్ఘాట్ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీలో నివాసముండే వెంకటేష్, కళ దంపతుల కూతురు స్వాతి (6) స్థానికంగా ఉన్న ఆల్ఫా పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. గురువారం ఇంటి ముందు స్వాతి ఆడుకుంటుండగా అటుగా వచ్చిన పది కుక్కలు దాడిచేసి తల, శరీరంలోని పలు చోట్ల గాయపరిచాయి. తీవ్రంగా గాయపడిన స్వాతిని ఆస్పత్రికి తరలించారు. -
పిచ్చికుక్కల స్వైరవిహారం.. ముగ్గురిపై దాడి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని బెజ్జూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గురువారం రోడ్డుపై వెళుతున్న ఓ ముగ్గురు విద్యార్థినులపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల దాడిలో గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పిచ్చి కుక్కల స్వైర విహారంతో.. స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన ఎవరిపై దాడి చేస్తాయోనని బయటకు రాలేకపోతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
కసి తీర్చుకున్నఊరకుక్కలు!
బీజింగ్: ఛీ... ఊరకుక్కంటూ చులకనగా చూడవద్దు. కోపంతో తన్ని తగిలేయొద్దు. వాటికి కూడా రోషముంటుంది. అలా చేసిన ఓ చైనా కుర్రాడికి ఊరకుక్కలు కలిసికట్టుగా తగిన గుణపాఠం చెప్పాయి. చైనాలోని చాంగ్కింగ్ నగరంలో ఇటీవల ఓ కుర్రాడు కారులో షికారుకెళ్లి తన ఇంటి ముందుకొచ్చాడు. తనకిష్టమైన కారు పార్కింగ్ స్థలంలో ఓ ఊరకుక్క కునికిపాట్లు పడుతూ కనిపించింది. హారన్ కొట్టినా అది అక్కడి నుంచి కదలలేదు. దీనికింత పొగరా ! అంటూ కారు దిగిన ఓ కుర్రాడు దాన్ని కాలుతో ఒక్క తన్ను తన్నాడు. ఆ కుక్క కుయ్...మనకుండా చురచురా చూపులతో అప్పటికి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ ఊరకుక్క తన మిత్రులతో అక్కడికి కలిసొచ్చి కుర్రాడి కారుపై దాడికి దిగింది. ముందటి చక్రం పైభాగానుండే కారు రేకును కసిదీర కొరికి ధ్వంసం చేసింది. ఇక దాని మిత్రులు తమవంతు సహకారంగా కారు అవతలి టైరును పాడు చేయడమే కాకుండా కారద్దం వైపర్స్ను కొరికి ధ్వంసం చేశాయి. ఆ తర్వాత ఎప్పటికో ఇంటి నుంచి బయటకొచ్చిన ఆ కుర్రాడు తన కారును చూసుకొని కుయ్యో...మొర్రో...అన్నాడు. కుక్కల దాడిని తన సెల్ కెమేరాలో షూట్ చేసిన పక్కింటాయన వచ్చి జరిగినదంతా చూపించాడు. ఊరకుక్కల వల్ల బీమా కంపెనీల నుంచి నష్ట పరిహారం కూడా రాద ంటూ ఆ కుర్రాడు బిక్కమొహం వేయక తప్పలేదు. చైనాలో ఊరకుక్కల గొడవెక్కువే. వాటిని హింసించినా, అవి కరిచినా బాధితులకు నష్ట పరిహారం చెల్లించే చట్టాలేవీ అక్కడ లేవు. లెసైన్స్డ్ కుక్కల నుంచి నష్టం జరిగితేనే వాటి యజమానుల నుంచి మాత్రం పరిహారం ఇప్పిస్తారు. -
కుక్కకు కు.ని. ... ఖర్చు ఎంతో తెలుసా?
తాడేపల్లిగూడెం : రాష్ట్రంలోని శునకాలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తాం.. ఇటీవల రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విజయవాడలో ఓ కార్యక్రమంలో చేసిన ప్రకటన ఇది. ప్రతి పట్టణం, గ్రామంలో వీధి కుక్కల సంఖ్య పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శునకాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులున్నాయి. కుక్కలు కరవడం వల్ల ర్యాబిస్ సోకడంతో పాటు నెలల పాటు పథ్యం చేయాల్సి రావడం, ఏఆర్వీ మందుల కొరత నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించడమే పరిష్కార మార్గమని తెలిపారు. అయితే వీధి కుక్కలకు కు.ని. చేయించడం అంత ఈజీ కాదని, ఖర్చుతో కూడుకున్న విషయమని, ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని ఈ ఆపరేషన్లు చేయడంలో పేరున్న డాక్టర్ శ్రీధర్ తెలుపుతున్నారు. ఒక్కో శునకానికి కు.ని ఖర్చు రూ.1,200 ఒక్కో కుక్కకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలంటే రూ. 1,200 ఖర్చవుతుందని చెప్పారు. ఆపరేషన్ చేసిన కుక్కను ఐదు రోజుల పాటు ప్రత్యేక శ్రద్ధతో చూడాలి. కుట్లు విడిపోకుండా గమనిస్తూ ఉండాలి. ఇలాంటి పర్యవేక్షణ ఉంటే కాని కుక్కకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స ఫలించదు. కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసినప్పుడు స్త్రీల మాదిరి కాకుండా అండాశయం, గర్భాశయం పూర్తిగా తొలగిస్తారు. పునరుత్పత్తి అండాశయాల క్యాన్సర్ను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ద్వారా తగ్గించవచ్చు. ఆడ కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడం మేలని శ్రీధర్ తెలిపారు. విదేశాల్లో ఈ పద్ధతి అమలులో ఉన్నట్టు చెప్పారు. ఆడ కుక్కలను గుర్తించి, ప్రత్యేక వలల ద్వారా పట్టుకుని శస్త్రచికిత్స చేసిన తర్వాత కుట్లు ఆరే వరకు ప్రత్యేక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా అవి మగ కుక్కలతో కలిసినా సంతానోత్పత్తి జరగకపోవడంతో పాటు వాటికి పిచ్చి పట్టదు. దీనివల్ల వీధి కుక్కల సంఖ్యనుతగ్గించవచ్చని డాక్టర్ శ్రీధర్ సూచిస్తున్నారు. -
దయతో..
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న తొమ్మిదవ కథనమిది... దయగల హృదయం.. ఉదాత్తమైన ఆశయం కలగలిసి మూగజీవులకు ఆపన్నహస్తం అందిస్తోంది. వీధికుక్కలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. వేలు..లక్షలు ఖరీదు చేసే శునకాల వైభోగం అంతాఇంతా కాదు. కానీ, గుప్పెడు మెతుకులకు గంపెడు విశ్వాసం చూపించే వీధి కుక్కల్ని పట్టించుకునే వారెవరు?. ఒకరోజు అన్నంపెడితే మనింటి కాంపౌండ్ వాల్ చుట్టూ చక్కర్లు కొడుతూ...కనిపించగానే తోక ఊపుతూ ప్రేమను పంచే ఆ మూగజీవులే ప్రియకు ప్రాణం. వాటి కోసమే ‘దయ’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పిన ఆ పెట్స్ ప్రేమికురాలి సేవా కార్యక్రమాల పరిచయం.. మూడేళ్ల క్రితం.. ‘ఒకరోజు ఉదయం వనస్థలిపురం రైతుబజార్కి వెళ్లాను. దారిలో ఓ వీధికుక్కను మిగతా కుక్కలు కరుస్తున్నాయి. వెంటనే బండి ఆపి, వాటిని చెదరగొట్టాను. అప్పటికే అది బాగా గాయపడింది. తెలుపురంగులో ఉన్న ఆ కుక్కని తీసుకొచ్చి మా ఇంటికి దగ్గరగా ఉన్న వెటర్నరీ ఆసుపత్రిలో చూపించాను. కాలికి బలమైన గాయం కావడంతో చిన్నపాటి ఆపరేషన్ చేసి పంపించారు. దాన్ని ఇంట్లో పెట్టుకుని కొన్నాళ్లు జాగ్రత్తగా చూసుకున్నాను. ఈ సంఘటన గురించి తెలుసుకున్న నా స్నేహితులు శ్రావణి, స్వాతి, సందీప్, కుషన్శర్మ.. కలసి మూగజీవుల గురించి ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుందన్నారు. నేను వెంటనే 2011లో ‘దయ’ అనే ఆర్గనైజేషన్ని స్థాపించాను’ అంటూ నాటి నేపథ్యాన్ని వివరించారు ప్రియ. గాయపడ్డ వాటిని... గాయపడ్డ కుక్కలను చేరదీసి వాటికి వైద్యం చేయించి కావాల్సిన వారికి దత్తత ఇవ్వడంపై దృష్టిపెట్టిన ‘దయ’ సభ్యులు.. ఆ విషయంలో నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యారు. గత మూడేళ్లలో గాయపడ్డ 70 వీధికుక్కలను చేరదీసి వైద్యం చేయించారు. వాటిలో కొన్నింటిని బ్లూక్రాస్కి, ఇంకొన్నిటిని దగ్గర్లోని పెట్కేర్ సెంటర్లకు, మరికొన్నింటిని దత్తతకు ఇచ్చారు. మిగిలిన వాటిని ఇంట్లో ఉంచి చూసుకుంటున్నారు. ‘ఒక్క గాయపడ్డ కుక్కలనే కాదు.. ఖరీదైన ప్రాంతాల్లో కొందరు జబ్బులొచ్చిన పెంపుడు కుక్కలను వీధుల్లో వదిలేసిపోతున్నారు. ఈ మధ్యనే కేన్సర్ జబ్బుపడ్డ జర్మన్ షెపర్డ్ కుక్క బంజారాహిల్స్ వీధిలో దొరికింది. దానికి వైద్యం చేయించి ఇంట్లో పెట్టుకున్నాం. కొన్ని పెట్కేర్ సెంటర్లు ‘దయ’తో వీధికుక్కలకు ఉచితంగా ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఇక వాటికయ్యే వైద్యం గురించి చెప్పాలంటే ముందుగా మా వెటర్నరీ డాక్టర్ సురేష్కుమార్ గురించి చెప్పాలి. ఆయన కూడా జంతు ప్రేమికుడే. ఇప్పటివరకూ కుక్కలన్నింటికి ఆయన ఉచితంగా వైద్యసేవలందించారు’ అని వివరించారు ప్రియ. వైద్యం ఖర్చుల సంగతి పక్కన పెడితే వాటి ఆశ్రయం, పోషణకయ్యే ఖర్చూ ఎక్కువే. దాని కోసం ‘దయ’ సంస్థ సిబ్బంది వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. పాతన్యూస్ పేపర్ల డబ్బుతో.. ‘మాకు తెలిసినవారి దగ్గరి నుంచి పాత న్యూస్పేపర్లు సేకరించి వాటిని అమ్మితే వచ్చిన డబ్బుకు మేమంతా కొంత మొత్తం కలిపి మూగజీవుల పోషణ చేపడుతున్నాం. దీనికి తోడు చాలామంది మూగజీవుల ప్రేమికులు చాలా సందర్భాల్లో స్పందిస్తున్నారు. కేవలం శునకసేవే కాకుండా దయ సంస్థ గో సంరక్షణ కార్యక్రమాలూ చేపడుతోంది. గోవుల అక్రమ రవాణా సమాచారం తెలిసినపుడు మా టీమ్ వెంటనే స్పందించి వాటిని రక్షించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికి వందకు పైగా ఆవుల్ని రక్షించాం. ఇక వేసవిలో పక్షుల రక్షణకు మా ప్రాంతంలోని అన్ని కాలనీల్లో ప్రతి ఇంటి దగ్గరా చిన్న గిన్నె పెట్టి వాటిలో నీళ్లు పోయాలని చెబుతాం’ అని చెప్పారు దయ సభ్యురాలు శ్రావణి. యోగా శిక్షకురాలు కూడా అయిన ప్రియ ఉచితంగా యోగా తరగతులు నిర్వహిస్తూ అక్కడ మూగజీవుల సంరక్షణకోసం డ్రాప్బాక్సులు పెట్టి సాయం కోరుతున్నారు. నోరులేని మూగజీవుల్ని ప్రేమగా పలకరిస్తూ, ‘దయ’ గల హృదయాలను వెతుక్కుంటూ ముందుకుసాగుతున్న ఈ సంస్థ సేవలకు హ్యాట్సాఫ్. సదా మీ సేవలో.. చీకటి వెలుగుల జీవితంలో అందరూ కోరుకునేది వెలుగే. ఆ జిలుగు నీడలో పదివుందినీ ఆహ్వానించే వారు కొందరే ఉంటారు. అలాంటి వారి గురించి పదివుందికీ తెలిస్తే.. వురెందరి హృదయూల్లోనో సేవాభావం వెలుగు చూస్తుంది. సవూజం కోసం మీరు చేతులు కలిపి చేసిన చేతల వివరాలు వూకు తెలియుజేయుండి. మీకు స్ఫూర్తిగా స్టార్డమ్కి సేవను జోడించి తనదైన శైలిలో స్పందిస్తున్న సినీ నటి సవుంత ‘సిటీప్లస్’లో వెలుగుచూసే కథనాలకు బాసటగా నిలుస్తానంటోంది. మీరు చేయూల్సిందల్లా.. ఓ సంస్థ ద్వారా, వ్యక్తిగతంగా మీరు చేస్తున్న సేవల వివరాలను వూకు మెరుుల్ చేయుండి. వాటిని ‘సిటీప్లస్’లో ప్రచురిస్తాం. ఇలా ఉత్తమ సేవలు అందిస్తూ సమాజహితానికి పాటుపడుతున్న ‘సేవకుల’ను సవుంత పలకరిస్తారు. ఒక్క సవుంత వూత్రమే కాదు.. సేవ చేసే హృదయూలను అభినందించడానికి వురెందరో సెలబ్రిటీలు వుుందుకు రానున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు చేస్తున్న చారిటీ వివరాలు మెరుుల్ టు.. sakshicityplus@gmail.com ప్రజెంటేషన్: భువనేశ్వరి bhuvanakalidindi@gmail.com ఫొటోలు: సృజన్ పున్నా -
పశువులకు కుక్కకాటుపై నిర్లక్ష్యం వద్దు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : వీధి కుక్కలు పశువులను కరిచినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా యాంటీ రేబిస్ టీకాలు వేయించాలి. నాటు వైద్యంపై ఆధారపడవద్దు. జిల్లాలోని అన్ని పశు వైద్యశాల కేంద్రాల్లో టీకాలు అందుబాటులో ఉన్నా యి. జిల్లాలోని డివిజన్ కేంద్రాలు నిర్మల్కు 500, మం చిర్యాలకు 350, ఆదిలాబాద్కు 150 వ్యాక్సిన్లు అందజేశాం. కుక్కకాటు బారిన పశువులకు టీకాలు వేయించాలి. జిల్లాలో సుమారు 18వేల వరకు కుక్కలు ఉన్నా యి. ఈ ఏడాది జూలై వరకు సారంగాపూర్ మండలంలో 40, జైపూర్లో 25, లక్ష్మణచాందలో 15 పశువులను కుక్కలు కరిచాయి. పశువులను మూతి భాగంలో కరుస్తాయి కాబట్టి వాటికి త్వరగా వెర్రి లేచే ప్రమాదముంది. కుక్కలు పశువుల దగ్గరకు రాగానే కొమ్ములతో పొడిచే ప్రయత్నం చేస్తాయి. దీంతో మూతి, ముక్కు దగ్గర ఎక్కువగా కరుస్తాయి. రేబిస్ వైరస్ రక్తనాళాల గుండా చిన్నమెదడుకు త్వరగా చేరి చనిపోయే ప్రమాదం ఉంటుంది. మనిషిని కాటు వేస్తే 20 సంవత్సరాల వరకు బతికే అవకాశం ఉంది. కానీ పశువులు రెండేళ్లకంటే ఎక్కువగా జీవించే అవకాశాలు లేవు. లక్షణాలు.. కుక్కకాటుకు గురైన పశువులు గడ్డి తినకుండా 105 డిగ్రీల నుంచి 108 డిగ్రీల జ్వరంతో బాధపడుతుంది. నోటి నుంచి సొల్లు కారుస్తూ ఎప్పుడూ నిల్చోనే ఉంటాయి. వాటికి కళ్లముందు ఏమీ కనిపించవు. ఎవరినైనా పొడిచే ప్రయత్నం చేస్తాయి. వీటికి నీటిని చూస్తే భయంగా ఉంటుంది. వర్సాకాలం నాడీ వ్యవస్థపై రేబిస్ ప్రభావం త్వరగా మెదడుకు చేరుతుంది. చల్లటి వాతావరణంలో ఇది రక్తనాళాలల్లో చిన్నమెదడుకు చురుగ్గా చేరి దశదిశ లేకుండా ప్రయాణిస్తుంటాయి. నోరు మూగ పడిపోయి తరచూ మూత్ర విసర్జన చేస్తాయి. వెనక కాలు జాడిస్తూ తలను గోడకు వేసి రాయడం, ఎదురుగా వచ్చేది ఏదైనా చూడకుండా కొమ్ములతో పొడవడానికి, నోటితో కొరికేందుకు ప్రయత్నిస్తాయి. వ్యాక్సిన్ అందించే పద్ధతి.. కాటుకు గురైన రోజు, మూడో రోజు, ఏడో రోజు, 14వ రోజు, 28వ రోజు, 60వ రోజు ఇలా క్రమం తప్పకుండా ఏడు డోసులు టీకాలు వేయించాలి. రెండు మూడు డోసులు వేయించి ఊరుకున్నా ప్రమాదమే. వర్షాకాలంలో అధికంగా కుక్కకాటుకు గురవుతుంటాయి. పశువుల పోషకులు సకాలంలో గమనించి వైద్యం అందించాలి.