yadadri bhuvanagiri
-
ముప్పుతిప్పలు పెట్టిన అడవి దున్న ఎట్టకేలకు చిక్కింది...
భువనగిరి: అటవీ శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన అడవి దున్న ఎట్టకేలకు చిక్కింది. అయితే అది మృతిచెందినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అటవీశాఖ అధికారి పద్మజారాణి తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడురోజుల నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరిస్తున్న అడవి దున్నను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు, పశువైద్యాధికారులతో కలిపి 10 బృందాలను ఏర్పాటు చేశారు. అడవి దున్నకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు వరంగల్ జూపార్క్ నుంచి వైద్యులు కూడా వచ్చారు. శుక్రవారం భువనగిరి మండలం రెడ్డినాయక్ తండా పరిసర ప్రాంతాల్లో అడవి దున్న సంచరిస్తున్నట్లు గుర్తించి వైద్యులు అడవి దున్నకు సమీపంలో నుంచి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో భయంతో అడవి దున్న అక్కడ ఉన్న గుట్టల పైన పరుగులు పెట్టి పడిపోయింది. మత్తుతో ఉన్న దున్నను వాహనంలోకి ఎక్కించే క్రమంలో పరిశీలించగా అది మృతిచెందినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రెండు రోజుల నుంచి పరుగులు పెడుతున్న అడవి దున్న అప్పటికే అనార్యోగానికి గురికావడంతో పాటు మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత పరుగులు పెట్టడం వల్ల మృతిచెందినట్లు జిల్లా అటవీశాఖ అధికారి తెలిపింది. అడవి దున్నకు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేసినట్లు పేర్కొన్నారు. -
ఎలాగైనా వెళ్లాల్సిందే
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్ : సంక్రాంతి పండుగ వేళ...ప్రయాణాలు సాగుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా మహానగరం పల్లెబాట పట్టింది. వారం రోజులుగా సుమారు 30 లక్షల మందికి పైగా నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లినట్టు అంచనా. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయాయి. సొంత వాహనాల్లోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. సుమారు 8 లక్షల మందికి పైగా రైళ్లలో తరలివెళ్లినట్టు అధికారులు అంచనా వేశారు.ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఏపీ వైపు వెళ్లే బస్సులను కూకట్పల్లి, మియాపూర్, అమీర్పేట, లక్డీకాఫల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ మీదుగా నడిపారు. వరంగల్ వైపు వెళ్లే బస్సులను ఉప్పల్కే పరిమితం చేశారు.కొన్నింటిని సాగర్రోడ్డు, బీఎన్రెడ్డినగర్, హయత్నగర్ వరకు పరిమితం చేశారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల్లో కలిపి 12 లక్షల మందికి పైగా వెళ్లారు. హైవేలన్నీ వాహనాలతో నిండుగా..: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం కూడా రద్దీ కొన సాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ బస్టాండ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్జామ్ ఏర్పడింది. పంతంగి టోల్ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచి రాత్రి 7 గంటల వరకు 65 వేల వాహనాలు వెళ్లాయి. నల్లగొండ జిల్లాలోని కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు 30 వేల వాహనాలు వెళ్లాయి.హెదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్ప్లాజా నుంచి సాధారణ రోజుల్లో 30వేల వరకు వాహనాలు రాకపోకలు సాగించగా, ఆదివారం 70 వేలకు పైగా వాహనాలు వెళ్లాయి. ఫాస్టాగ్ స్కానింగ్ ఆలస్యం కావడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు మల్టిజోన్–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. -
యాద్రాది: డ్యూటీలకు డుమ్మా.. టీచర్లపై వేటు
సాక్షి, యాద్రాది: దీర్ఘకాలంగా విధులకు హాజరుకాకుండా డుమ్మా కొడుతున్న టీచర్లపై వేటు పడింది. 2005, 2006 నుంచి విధులకు రాని 16 మంది టీచర్లను తొలగిస్తూ యాద్రాది భువనగిరి జిల్లా డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.యాద్రాది జిల్లాలో 18 మంది ఉపాధ్యాయులు విధులకు హాజరుకావడం లేదు. 2005 నుంచి ఇప్పటివరకు డుమ్మా కొడుతున్న వారుండగా.. గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఇద్దరు డ్యూటీలో చేరారు. మిగిలిన 16 మంది స్పందించలేకపోవడంతో. గత మే నెలలో కూడా గెజిట్ నోటీసు విద్యాశాఖ జారీ చేసింది. అయినా టీచర్ల నుంచి స్పందన రాకపోవడంతో వారందరికీ సర్వీస్ నుంచి తొలగిస్తూ డీఈవో ఆదేశాలు జారీ చేశారు. -
పీహెచ్సీల్లో స్పెషలిస్టు వైద్య సేవలు
సాక్షి, యాదాద్రి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిపుణులైన డాక్టర్లతో వైద్య సేవలు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పీహెచ్సీలలో ప్రాథమిక వైద్యంతో పాటు స్పెషలిస్ట్ వైద్య సేవలను రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీ వరకు పీహెచ్సీలలో వారానికి మూడు రోజులు క్యాంపులు నిర్వహి స్తారు. వైద్య, ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్లు సంయుక్తంగా చేపట్టిన ఈ కార్య క్రమంలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 29 మంది నిపుణులైన వైద్యులు పీహెచ్సీలకు వెళ్లి 12 రకాల వైద్య సేవలు అందిస్తారు.ఇందుకోసం భువనగిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక షెడ్యూల్ను రూపొందించింది. భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న స్పెషలిస్ట్ వైద్యులు ఆయా పీహెచ్సీలకు వెళతారు. వీలైతే అక్కడే వైద్యం చేసి మందులను ఇస్తారు. అవసరాన్ని బట్టి మెరుగైన వైద్యం కోసం భువనగిరి మెడికల్ కళాశాల, జిల్లా కేంద్ర ఆస్పత్రి, జనరల్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరాల్లో పీడియాట్రిక్, గైనకాలజీ, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, ఈఎన్టీ, సైక్రియాట్రిక్, దంత వైద్యం, ఫిజియోథెరపీ, చర్మవ్యాధులు, సాధారణ శస్త్ర చికిత్సలకు పరీక్షలు నిర్వహిస్తామని భువనగిరి జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ తెలిపారు. -
ఘోరం.. అంత్యక్రియలకు అడ్డుపడ్డ ఆ నలుగురు!
యాదాద్రి భువనగిరి జిల్లా: రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… రూపాయి రూపాయి నువ్వు ఏం! చేస్తావు? అని అడిగితే! హరిశ్చంద్రుని చేత అబద్ధం ఆడిస్తాను, భార్య-భర్తల మధ్యన చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డలను విడదీస్తాను. అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను. ఆఖరుకు.. ప్రాణ స్నేహితులను కూడా విడగొడ్తాను అందట. యాదాద్రి భువనగిరి జిల్లాలో తాజాగా జరిగిన ఘటన అది నిజమేనని నిరూపించింది. అయినవాళ్లే వేధిస్తుండడంతో తట్టుకోలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే.. అతనికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఆ అయినవాళ్లే అడ్డుకోవడంతో మూడు రోజులుగా ఆ మృతదేహం మార్చురీలోనే మగ్గుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగికి చెందిన చీరిక హనుమంతరెడ్డి(48) హైదరాబాద్లో ప్రైవేటు బస్సు డ్రైవర్గా పనిచేస్తూ... అక్కడే అద్దె ఇంట్లో ఉండేవారు. హనుమంతరెడ్డి తండ్రి నర్సిరెడ్డి పేరిట 7.24 ఎకరాల భూమి ఉంది. పోస్ట్మాస్టర్గా ఉద్యోగ విరమణ చేసిన నర్సిరెడ్డి... మూడేళ్ల క్రితం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు.ఈలోపు తండ్రి ఆస్తిలో తమకూ వాటా కావాలని హనుమంతరెడ్డి తోబుట్టువులు కోర్టును ఆశ్రయించారు. తమ్ముడు కరుణాకర్రెడ్డితోనూ హనుమంతరెడ్డికి ఆస్తి తగాదాలున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా మానసిక వేదనతో ఉన్న హనుమంతరెడ్డి శనివారం రాత్రి పంతంగిలోని ఇంటికి వచ్చి ఉరి వేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున పక్కింట్లో ఉన్న వారు చూసి పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగు చూసింది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, తన భర్త మృతికి ఆడపడుచులు, మరిదే కారణమని హనుమంతరెడ్డి భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ముగ్గురిపై కేసు నమోదైంది. దీంతో భయపడ్డ ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు... ఆ కేసును ఉపసంహరించుకోవాలని గ్రామ పెద్దలు, బంధువుల ద్వారా హనుమంతరెడ్డి భార్యపై ఒత్తిడి తెచ్చారు. ఆస్తి విషయమై కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని హనుమంతరెడ్డి భార్య స్వప్న, బంధువులు భీష్మించారు. ఆది, సోమ వారాల్లో అతడి సోదరుడు, చెల్లెళ్లతో బంధువులు చర్చించారు. కేసు ఉపసంహరణకు వారు ఒప్పుకొన్నా.. సోమవారం కోర్టు సమయం మించిపోవడంతో వీలు కాలేదు. మంగళవారం కేసు ఉపసంహరించుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఫామ్ ల్యాండ్ బురిడీ
సాక్షి, యాదాద్రి: ధరణిలోని లొసుగులను ఆసరాగా చేసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు..అధికారులతో కుమ్మక్కై ప్రధానంగా ఫామ్ ల్యాండ్ వెంచర్లు, అలాగే అనధికారిక లేఅవుట్లు, చట్టవిరుద్ధ రిజిస్ట్రేషన్లు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయి. స్థానిక సంస్థల స్థిరాస్తి ఆదాయానికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి కొడుతున్నాయి. వాస్తవానికి అనధికారిక లే అవుట్లను అదుపు చేయడంతో పాటు, ఆదాయానికి గండి పడకుండా, ప్రజలు రియల్టర్ల మోసాల బారిన పడకుండా ప్రభుత్వం మెమో జారీ చేసింది. దీని ప్రకారం తహసీల్దార్ కార్యాలయంలో 0.20 ఎకరాల కంటే తక్కువ రిజిస్ట్రేషన్ చేయకూడదు. కానీ గుంట, రెండు గుంటల భూమిని కూడా ఫామ్ ల్యాండ్ వెంచర్ల కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అదేవిధంగా తహసీల్దార్ ఇచ్చిన నాలా కన్వర్షన్ పత్రాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్లాట్లను 2000 చదరపు గజాల కంటే తక్కువ రిజిస్ట్రేషన్ చేయకూడదు. కానీ 121 (గుంట), 242 (రెండు గుంటలు) గజాల ప్లాట్లను కూడా రిజిస్టర్ చేస్తున్నారు. అలాగే డీటీసీపీ, హెచ్ఎండీఏ, రెరా, వైటీడీఏల అప్రూవ్డ్ లేఅవుట్లలోనే ఆయా వెంచర్లకు సంబంధించిన మొత్తం సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేయాలి. కానీ ఓపెన్ ప్లాట్లకు నాలా కన్వర్షన్తో 121, 242, 363 గజాల ప్లాట్లకు కూడా వెంచర్కు సంబంధించిన అన్ని సర్వే నంబర్లు వేసి, ఆ ప్లాటు చుట్టూ హద్దులు ఇతర ప్లాట్లకు సంబంధించిన నంబర్లు వేయడం ద్వారా అన్ని అనుమతులు ఉన్నాయని కొనుగోలుదారులను నమ్మిస్తూ ఫామ్ ల్యాండ్ పేరుతో యధేచ్చగా రిజిస్ట్రేషస్లు చేసేస్తుండటం గమనార్హం. కొనుగోలుదారులకు ఎర ఎలాంటి అనుమతులు లేకుండా కొత్త కొత్త పేర్లతో వేల ఎకరాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేస్తున్నారు. కొనుగోలుదారులను ఆకర్షించడానికి వారాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వెంచర్ ప్రారంభోత్సవం రోజునే ప్లాటు కొనుగోలు చేసిన మొదటి 50 మందికి నెలకు రూ.10 వేల చొప్పున 30 నెలల పాటు రెంటల్ చెల్లిస్తామని ఆఫర్ ఇస్తూ పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి ఈ అక్రమ వ్యాపారంతో ప్రభుత్వానికి, స్థానిక సంస్థల ఆదాయానికి భారీగా గండి పడుతోంది. రియల్టర్లు డెవలప్మెంట్ చార్జీల చలాన్ల నిమిత్తం ఎకరానికి సుమారు రూ.లక్ష చొప్పున చెల్లించకుండా, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు 10 శాతం స్థిరాస్తి భూమిని గిఫ్ట్ డీడ్ చేయకుండా ఎగవేస్తున్నారు. గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన జీఓ ప్రకారం అప్పటి కలెక్టర్ పమేలా సత్పతి ఫాంల్యాండ్ రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో కొంత కాలం నిలిచిపోయినా తిరిగి ఊపందుకున్నాయి. 900 వరకు అక్రమ వెంచర్లు! జిల్లాలో ఫామ్ ల్యాండ్ పేరుతో వ్యాపారం చేస్తున్న సుమారు 900 వరకు అక్రమ వెంచర్లు ఉన్నట్లు అంచనా. యాదగిరిగుట్ట, ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, ఆత్మకూర్(ఎం) వలిగొండ, రాజాపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం, బీబీనగర్తో పాటు పలు ప్రాంతాల్లో అక్రమ వెంచర్లు సాగుతున్నాయి. ప్రధానంగా వంగపల్లి, సర్వేపల్లి, కాచారం, రఘునాథపురం, కొలనుపాక, యాదగిరిపల్లి, సైదాపురం, పెద్ద కందుకూరు శ్రీనివాసాపురం, పటేల్గూడెం, గుండ్లగూడెం ఆలేరులలో ఫామ్ ల్యాండ్ ప్లాట్లను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇంటి నిర్మాణం కుదరదు..రుణం రాదు ఫామ్ ల్యాండ్ పేరుతో రిజిస్ట్రేషన్లు జరిగిన ప్లాట్లలో ప్రధానంగా ఇంటి నిర్మాణాలకు అనుమతి లభించదు. డీటీసీపీ అనుమతి లేనందున బ్యాంకు రుణం రాదు. కొనుగోలుదారు ప్లాటు పొజిషన్కు స్థానిక సంస్థలు చట్టబద్ధతను సైతం ఇవ్వడం లేదు. 70 ఎకరాల్లో అనధికార లేఅవుట్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలం ధర్మపురం రెవెన్యూ శివారులో శ్రీసిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్.. రాయల్ గార్డెన్–2 ఫామ్ ల్యాండ్ పేరుతో సర్వే నంబర్లు 26 నుంచి 28 వరకు, అలాగే 30 నుంచి 38 వరకు, 42, 49ల్లోని సుమారు 70 ఎకరాలు అనధికారికంగా లేఅవుట్ చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. వ్యవసాయ భూమిని కేవలం వ్యవసాయేతర భూమిగా మార్చి (నాలా కన్వర్షన్), 60, 40, 30 ఫీట్ల రోడ్లు వేసి, విద్యుత్ స్తంభాలు నాటి గజం రూ.4,600 చొప్పున విక్రయిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ 300 గజాల ప్లాట్ (నం.806)ను మోత్కూర్ సబ్ రిజి్రస్టార్ కార్యాలయంలో (డాక్యుమెంట్ నంబర్ 4716/19) సర్వే నంబర్లు మొత్తం వేసి రిజిస్టర్ చేశారు. ఈ ఒక్క వెంచర్లోనే వివిధ విస్తీర్ణాల్లో 2 వేలకు పైగా ప్లాట్లు ఉన్నాయి. -
రైతుల చేతులకు సంకెళ్లు!
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ మార్చాలని ఆందోళన చేసిన రైతులకు యాదాద్రి భువనగిరి పోలీసులు సంకెళ్లు వేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. పోలీసుల తీరుపై రాజకీయ పార్టీల నేతలు, రైతు, ప్రజా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జైల్లో ఉన్న రైతులను మంగళవారం భువనగిరి కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకు వచ్చే క్రమంలో వారి చేతులకు పోలీసులు సంకెళ్లు వేశారు. వాస్తవానికి ఆ రైతులకు సోమవారమే బెయిల్ వచ్చింది. అయినా పోలీసులు సంకెళ్లు వేసి తీసుకురావడంపై వారు కన్నీటిపర్యంతమయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రి కాన్వాయ్ను అడ్డుకోవడంతో.. భువనగిరి మండలం రాయిగిరి గ్రామ రైతులు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ రోడ్డుతో తాము భూములను పూర్తిగా కోల్పోతున్నా మని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మే 30న భువనగిరి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తుండగా.. అదే సమయంలో మంత్రి జగదీశ్రెడ్డి కలెక్టరేట్లో సమావేశం ముగించుకుని వెళ్తున్నారు. ధర్నా చేస్తున్న రైతులు మూకుమ్మడిగా వెళ్లి మంత్రి కాన్వాయ్ను అడ్డుకున్నారు. పోలీసులు వారిని చెద రగొట్టారు. అదే రోజు భువనగిరి రూరల్ పోలీసులు ఆరుగురు రైతులపై కేసు నమోదు చేశారు. రాత్రికల్లా గడ్డమీద మల్లేశ్ (ఏ1), పల్లెర్ల యాదగిరి (ఏ2), అవిశెట్టి నిఖిల్ (ఏ3), మల్లెపోయిన బాలు (ఏ4) అనే నలుగురు రైతులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏ5 తంగళ్ళపల్లి రవికుమార్, ఏ6 గూడూరు నారాయణరెడ్డి (బీజేపీ నేత)లు పరా రీలో ఉన్నట్టుగా చూపించారు. తొలుత భువనగిరి సబ్ జైలుకు తరలించిన నలుగురు రైతులను.. వారికి రాజకీయ నాయకుల పరామర్శలు అధికం కావడంతో శాంతిభద్రతల సమస్యను కారణంగా చూపుతూ 4న నల్లగొండ జైలుకు తరలించారు. బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో.. రిమాండ్లో ఉన్న నలుగురికి సోమవారం భువన గిరి జిల్లా కోర్టులో కండిషనల్ బెయిల్ మంజూరైంది. అయితే బెయిల్ ప్రక్రియలో జాప్యం కావడంతో వారి విడుదల ఆలస్యమైంది. అయితే సోమవారా నికి 14 రోజుల రిమాండ్ పూర్తి కావడంతో మంగళ వారం ఉదయమే భువనగిరి కోర్టులో హాజరుపర్చ డానికి తీసుకువచ్చారు. కోర్టు ముందువరకు సంకెళ్లు వేసి రైతులను వాహనంలో తీసుకువచ్చిన పోలీసులు.. వారిని జడ్జి ముందు హాజరుపరిచి తిరిగి పోలీస్ వాహనంలో ఎక్కించుకునిపోయే క్రమంలోనూ బేడీలు వేయడంతో వివాదం తలెత్తింది. తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇలావుండగా ఈ రైతులు మంగళవారం సాయంత్రం నల్లగొండ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి: ఎంపీ కోమటిరెడ్డి సాక్షి, హైదరాబాద్: రైతులకు బేడీలు వేయడం చూసి తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర రైతాంగాన్ని అవమానపర్చడమేనని, అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేయడం కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమని చెప్పారు. దొంగలు, రౌడీల మాదిరిగా బేడీలు వేస్తారా?: బండి సంజయ్ రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి న్యాయం చేయాల్సింది పో యి దొంగలు, రౌడీల మాదిరిగా బేడీలు వేస్తారా? అని మండిపడ్డారు. కాగా రైతులేమైనా తీవ్రవాదులు, రేపిస్టులు, బందిపోట్లా? సంకెళ్లు వేసి తీసుకెళ్ల డానికి.. అని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలావుండగా రైతుల దగ్గర ఏకే 47 తుపాకులున్నాయని సంకెళ్లు వేశారా? అని కాంగ్రెస్ నేత వీహెచ్ ప్రశ్నించారు. న్యాయం చేయమని ప్రాధేయపడితే సంకెళ్లు వేస్తారా? నల్లగొండ క్రైం: న్యాయం చేయమని ప్రాధేయ పడితే సంకెళ్లు వేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదల అయిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రజా ప్రతినిధులను అడిగిన ప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వ కోసం, వరంగల్ రహదారి కోసం, హైటెన్షన్ విద్యుత్ లైన్ కోసం మూడు దశలుగా ఇప్పటికే తమ భూములు త్యాగం చేశామని, ఇప్పుడు మళ్లీ ఆర్ఆర్ఆర్కు భూములు ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఉన్న కొద్దిపాటి భూమి కూడా పోతే తమ కుటుంబాల భవిష్యత్ అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
యాదాద్రి కొండపై భక్తులకు కష్టాలు
సాక్షి, యాదాద్రి : వేసవి కాలం భానుడి భగభగలు ప్రారంభంతోనే యాదాద్రికొండపైకి వచ్చిన భక్తులు ఉరుకులు పరుగులు పెట్టక తప్పడంలేదు. దేవస్థానానికివస్తున్న వేలాది మంది భక్తులు ఎండకు తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. రాతికొండపై కృష్ణ శిలలతో నిర్మించిన నూతన దేవాలయం ప్రాంగంణం అంతా భగభగమండిపోతోంది. ఉదయం 11 గంటల నుంచే ఫ్లోరింగ్ బండల నుంచి వేడి సెగలు భక్తులను పరుగులు పెట్టిస్తున్నాయి. రూ.150 టికెట్తో శీఘ్ర దర్శనం కోసం క్యూలో ఉన్న భక్తులకు నిలువ నీడ లేకుండాపోయింది. ఆలయంలో శ్రీ స్వామి దర్శం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన ఫ్లోరింగ్ బండలపై నడిచే భక్తుల కాళ్లు కాలుతున్నాయి. వృద్ధులు వేగంగా నడవలేక అరికాళ్లు కమిలిపోతున్నాయి. దూరంగా ఉన్న ప్రసాదాల విక్రయం వద్దగల నీడ కోసం పరుగులు తీస్తున్నారు. కొండపైన విశాలమైన స్థలం ఉన్నా కనీసం చలువ పందిళ్లు వేయకపోవడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
BRS Party: ఎమ్మెల్సీ చాన్స్ ఎవరికి? నేరుగా కేసీఆర్, కేటీఆర్తోనే..
సాక్షి, నల్గొండ/యాదాద్రి భువనగిరి: ఎమ్మెల్సీ పదవి కోసం జిల్లా బీఆర్ఎస్లో కోలాహలం మొదలైంది. శాసనసభ్యుల కోటాలో ఎన్నికైన ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం మార్చి 29న ముగియనుంది. ఈ నేపథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అధినేత కేసీఆర్ ఇప్పటికే పలువురికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు వారికే ఇస్తారా లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అన్నది చర్చనీయాంశమైంది. ఎవరి ప్రయత్నాల్లో వారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడు ఎలిమినేటి కృష్ణారెడ్డికి ఆరేళ్ల క్రితం శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కిన విషయం తెలిసిందే. వచ్చేనెల ఆయన పదవీకాలం ముగియనుండడంతో ఆశావహులు ఆ సీటుపై కన్నేశారు. ఈ దఫా తమకు అవకాశం కల్పించాలని మంత్రి జగదీశ్రెడ్డి ద్వారా కొందరు ప్రయత్నిస్తుండగా.. మరికొందరు నేరుగా అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి వేడుకుంటున్నారు. తమకే వస్తుందన్న ధీమా అధినేత కేసీఆర్ వివిధ ఎన్నికల సందర్భంగా పార్టీలోని పలువురు ముఖ్య నేతలకు పదవుల విషయంలో హామీ ఇచ్చినట్లు ప్రచారం ఉంది. దీంతో వారు ధీమాతో ఉన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీజేపీలో చేరారు. ఈ భర్తీని పూడ్చేందుకు బీజేపీలో ఉన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ను పార్టీ పెద్దలు రాత్రికిరాత్రి ఒప్పించి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పారు. అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్న భిక్షమయ్య ఆలేరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో టికెట్ అవకాశం కోసం బీజేపీ గూటికి చేరారు. అయితే మార్చిలో రాష్ట్రంలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎక్కడో ఒక చోట నుంచి అవకాశం కల్పిస్తానని భిక్షమయ్యగౌడ్కు అధినేత కేసీఆర్ మాటివ్వడంతో ఆయన తిరిగి బీఆర్ఎస్లో చేరినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా సామాజిక వర్గ సమీకరణల్లో భాగంగా పార్టీ అవసరాల దృష్ట్యా భిక్షమయ్యగౌడ్కు అవకాశం దక్కనుందన్న ప్రచారం సాగుతోంది. మరికొందరు ఇక జిల్లాకు చెందిన సీనియర్ నేత చింతల వెంకటేశ్వర్రెడ్డి కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఖాయమైందన్న ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడు ఎలిమినేటి సందీప్రెడ్డికి ఆ పదవి దక్కింది. దీంతో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని, అప్పట్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని చింతల వర్గీయులు చెబుతున్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు సమసిపోవడానికి ఒక ప్రయత్నంగా అధిష్టానం ఎవరికో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి తనకు మరోమారు అవకాశం కల్పించాలని మనసులో ఉన్న మాటను తన వర్గీయులతో అన్నట్లు తెలుస్తోంది. అయితే తనకంటే కూడా తన కుమారుడు వివేక్ రెడ్డి ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కేసీఆర్ను కోరినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ, సంస్థాన్నారాయణపురానికి చెందిన కర్నె ప్రభాకర్, శాసన మండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. సామాజిక సమీకరణలపై లెక్కలు ఎమ్మెల్సీ పదవి కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్న పలువురు బీఆర్ఎస్ నేతలు సామాజిక వర్గ సమీకరణలపైనా లెక్కలు వేసుకుంటున్నారు. రాష్ట్ర యూనిట్గా ఎమ్మెల్సీ అభ్యర్థులను అధినేత ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక వర్గ సమీకరణలు బలంగా పని చేయనున్నాయి. మార్చిలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీ సామాజికవర్గానికి చెందిన స్థానం ఉంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బలమైన సామాజిక వర్గానికి అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి బీసీ గౌడ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం లేనందున ఆ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వచ్చన్న ప్రచారం జరుగుతోంది. -
ఇల్లు ఖాళీ చేయాలని నోటీసు.. గుండెపోటుతో భూ నిర్వాసితుని మృతి
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బీఎన్ తిమ్మాపూర్లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న తమ భూములు, ఇళ్లకు పరిహారం ఇవ్వాలని బీఎన్ తిమ్మాపూర్ గ్రామ భూ నిర్వాసితులు 58 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే ఇదేమీ పట్టించుకోకుండా ఈ నెల 24న రెవెన్యూ అధికారులు వారికి ఇళ్లు ఖాళీచేయాలని నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు. దీంతో పరిహారం ఇవ్వకుండా.. ఇల్లు ఖాళీచేయమంటున్నారని మనస్తాపం చెందిన జూపల్లి నర్సింహ(46 ) అనే వ్యక్తి బుధవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. మృతునికి చెందిన అర ఎకరం భూమి రిజర్వాయర్ ముంపు కింద పోతుండడంతో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని ధర్నా గ్రామస్తులంతా నర్సింహ మృతదేహంతో కలె క్టర్ కార్యాలయం వద్దకు వెళ్తుండగా పోలీసు లు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు మాసు కుంట వద్ద హైదరాబాద్–వరంగల్ రోడ్డుపై ఆందోళనకు దిగారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. సుమారు రెండు గంటల పాటు వీరి ఆందోళన కొనసాగింది. ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు గ్రామస్తుల వద్దకు చేరుకుని.. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో అందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏశాల అశోక్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, ఎంపీటీసీ ఉడుత శారదా అంజనేయులు, సర్పంచ్ లతరాజు తదితరులు పాల్గొన్నారు. చదవండి: పిల్లల్లో పోషకాహార లోపం.. తెలంగాణలో 1.20 లక్షల మందిలో గుర్తింపు -
పోస్టులు పంచుకున్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు.. ఒక్కో పోస్టు రూ.50 వేలు?
సాక్షి, యాదాద్రి: టీఆర్ఎస్ 18, బీజేపీ 5, కాంగ్రెస్ 5 ఇవేవో ఎన్నికల ఫలితాలు అనుకుంటే పొరపాటే.. భువనగిరి మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించనున్న పారిశుద్ధ్య సిబ్బంది ఉద్యోగాలను ఆయా పార్టీలు పంచుకున్నాయి. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు పొరుగుసేవల ఉద్యోగుల భర్తీ కోసం ఒక్కటయ్యారు. అధికార పార్టీకి ఉన్న 18 మంది కౌన్సిలర్లు ఒక్కొక్కరు చొప్పున, బీజేపీ, కాంగ్రెస్లు కౌన్సిలర్లతో సంబంధం లేకుండా ఐదుగురు చొప్పున తమకు నచ్చిన వారిని నియమించుకోవాలని అంతర్గత ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇందులో కొందరు కౌన్సిలర్లు ఉద్యోగాలు పెట్టిస్తామని సదరు నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేసిన విషయం బయటకు పొక్కడంతో సోమవారం హడావుడిగా ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. చేయాల్సిన పనులు: మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చడం, డ్రెయినేజీలను శుభ్రం చేయుట, చెత్త సేకరణ ఇతరత్రా పారిశుద్ధ్య పనులు చేయడానికి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన 9 మంది మహిళలు, 19 మంది పురుషులు మొ త్తం 28 మందిని నియమించుకోవాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అర్హత కలిగినవారు ధరఖాస్తు చేసుకోవా లని ఉపాధి కల్పన అధికారి శాంతిశ్రీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి: వీళ్లు మనుషులేనా.. ప్రేమ పెళ్లి చేసుకుందని.. కూతురుని కిడ్నాప్ చేసి గుండుకొట్టించి) నియామక ప్రకటన ఇదీ పారిశుద్ధ్య పోస్టుల్లో నియామకం కోసం ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. 21 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయస్సున్నవారు అర్హులు. అనుభవం అవసరం లేదు. అరోగ్యవంతులై ఉండాలి. అభ్యర్థులు భువనగిరికి చెందిన వారే అర్హులు. నెలకు రూ.15,600 పారి తోషకం చెల్లిస్తారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఉపాధి కల్పనాధికారి కార్యాలయం, కలెక్టరేట్లోని తెలంగాణ ఎంప్లాయిమెంట్ అసిస్టెంట్ మిషన్ (టీమ్) ఆఫీస్లో ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 లోపు అందజేయాలి. బయటకు పొక్కకుండా జాగ్రత్తలు మున్సిపాలిటీలో పొరుగు సేవల ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు కౌన్సిలర్లు ఇప్పటికే డబ్బుల వసూళ్లు ప్రారంభించారు. 28 పోస్టులను పార్టీల వారీగా పంచుకున్న వెంటనే కొందరు కౌన్సిలర్లు అశావహుల నుంచి రూ.50 వేల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో పక్క ఉద్యోగాల కోసం వసూళ్లు అంటూ ప్రచారం జరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై సోమవారం నోటిఫికేషన్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. (చదవండి: ఆ విద్యార్థులకే నిజాం కాలేజీ కొత్త హాస్టల్: మంత్రి సబితా) -
రామకృష్ణ హత్య కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఏసీపీ
సాక్షి, భువనగిరి: మాజీ హోంగార్డు రామకృష్ణ హత్య కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. హత్య కేసుకు సంబంధించి భువనగిరి ఏసీపీ వెంకట్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రామకృష్ణను మామ వెంకటేష్ హత్య చేయించారని తెలిపారు. లతీఫ్ గ్యాంగ్కు సుపారీ ఇచ్చి రామకృష్ణను హత్య చేయించాడని పేర్కొన్నారు. రామకృష్ణ హత్య కేసులో మొత్తం 11 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. గుండాల మండలానికి రామకృష్ణను తీసుకెళ్లి చంపినట్లు నిందితులు తెలిపారని చెప్పారు. లతీఫ్ గ్యాంగ్తో పాటు దివ్య, మహేష్, మహ్మద్ అప్సర్లను అరెస్ట్ చేశామని అన్నారు. భార్గవి తండ్రి వెంకటేష్ సుపారీ ఇచ్చి రామకృష్ణను చంపించారని వెల్లడించారు. రూ.10 లక్షల సుపారీ కోసమే ఈ హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు. హోం గార్డ్ యాదగిరి, రాములుకు పరిచయం అయ్యాడని, అనంతరం రాములు లతీఫ్ గ్యాంగ్ను పరిచయం చేశాడని తెలిపారు. ఈ కేసులో అరెస్టైన 11 మందిలో నలుగురు నిందితులను రీమాండ్కు పంపించామని అన్నారు. మిగిలిన ఏడుగురిని మళ్లీ రీమాండ్ చేస్తామని ఏపీపీ పేర్కొన్నారు. -
పరువు హత్య కలకలం.. తాళ్లతో కట్టేసి.. తలపై మేకులు కొట్టి..
భువనగిరి క్రైం/కొండపాక (గజ్వేల్): యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడని కక్ష పెంచుకున్న ఓ వీఆర్వో సుపారీ గ్యాంగ్తో రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకుని అల్లుడిని దారుణంగా మట్టు బెట్టించాడు. భువనగిరి ఏసీపీ వెంకట్రెడ్డి ఆదివారం రాత్రి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రామచంద్రయ్య గౌడ్ కుమారుడు ఎరుకల రామకృష్ణ (32) 2019లో యాదగిరిగుట్టలో హోంగార్డుగా విధులు నిర్వహించేవాడు. అప్పట్లో యాద గిరిగుట్టలోనే ఉంటూ వీఆర్వోగా పనిచేస్తున్న గౌరాయిపల్లికి చెందిన పల్లెపాటి వెంకటేశంతో రామకృష్ణకు పరిచయం ఏర్పడింది. దీంతో రామకృష్ణ తరచూ వెంకటేశం ఇంటికి వచ్చి పోతుండేవాడు. ఈ క్రమంలో వెంకటేశం కూతురు భార్గవితో రామకృష్ణకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే, వెంకటేశం కొద్ది రోజులకే వీరి ప్రేమ విషయం తెలుసుకుని రామకృష్ణను దూరం పెట్టాడు. ఇదే క్రమంలో 2019లో తుర్కపల్లిలో గుప్తనిధుల కేసులో రామకృష్ణను విధుల నుంచి తొలగించారు. తన కూతుర్ని ప్రేమించాడన్న కోపంతో రామకృష్ణను వెంకటేశమే గుప్తనిధుల కేసులో ఇరికించాడనే ఆరోపణలు ఉన్నాయి. కాగా అప్పటి నుంచి రామకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. (చదవండి: వాలీబాల్ ఆడుతూ 15 ఏళ్ల బాలుడు మృతి ) పలుమార్లు బెదిరించినా ఫలితం లేక.. రామకృష్ణ, భార్గవి పెద్దలను ఎదిరించి 2020 ఆగస్టు 16న నల్ల గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు ఆల యంలో వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత రెండు నెలల్లోనే రెండుసార్లు వెంకటేశం తన కుమార్తెను వదిలిపెట్టాల్సిందిగా రామకృష్ణను బెదిరించాడు. ఈ క్రమంలో భార్గవి ఆస్తిలో వాటా అడగనంటూ తండ్రికి ఓ పత్రం కూడా రాసిచ్చింది. భువనగిరి తాతానగర్లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న రామకృష్ణ దంపతులకు ఓ పాప (ప్రస్తుతం ఆరు నెలలు) కూడా పుట్టింది. సుపారీ గ్యాంగ్తో ఒప్పందం చేసుకుని.. రామకృష్ణపై కక్ష పెంచుకున్న వెంకటేశం కొద్ది నెలల క్రితమే అతన్ని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. సిద్దిపేటకు చెందిన లతీఫ్ గ్యాంగ్తో ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్గా రూ.6 లక్షలు చెల్లించాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం రామకృష్ణ ఇంటికి లతీఫ్, జమ్మాపురం సర్పంచ్ అమృతయ్య వచ్చారు. తమకు భూములు చూపించాలని అడిగి అతన్ని వెంట తీసుకువెళ్లారు. రాత్రి అవుతున్నా భర్త ఇంటికి రాకపోవడంతో భార్గవి పలుమార్లు ఫోన్లు చేసినా పనిచేయలేదు. మరుసటి రోజు కూడా రామకృష్ణ ఆచూకీ లేకపోవడంతో భార్గవి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోనె సంచిలో కట్టి, వాహనంలో తరలించి.. లతీఫ్, అమృతయ్యలు రామకృష్ణను గుండాల మండలం రామారం గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ మరో తొమ్మిది మందితో కలిసి తాళ్లతో బంధించారు. అనంతరం రామకృష్ణ తలపై మేకులు కొట్టి దారుణంగా హింసించి అదే రోజు రాత్రి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి టాటాఏస్ వాహనంలో లతీఫ్ ఇంటికి తీసుకెళ్లి తెల్లవారుజాము వరకు శవాన్ని వాహనంలోనే ఉంచారు. తర్వాత కొండపాక మండలం లకుడారం గ్రామంలోని ఓ నీళ్లు లేని కాల్వలో పూడ్చిపెట్టారు. ఐదు నెలల క్రితమే వ్యూహరచన రామకృష్ణను హత్య చేసేందుకు ఐదు నెలల క్రితమే వ్యూహం రచించినట్లు సుపారీ కిల్లర్ లతీఫ్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడని ఏసీపీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 11మంది భాగస్వాములు కాగా, లతీఫ్, గోలి దివ్య, అఫ్జల్, మహేశ్లను అదుపులోకి తీసుకున్నామని, మిగతా వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కులాంతర వివాహం చేసుకోవడంతో పాటు, ఆస్తిలో వాటా కావాలని రామకృష్ణ ఒత్తిడి చేస్తుండడంతోనే అతడిని హత్య చేయాలని వెంకటేశం నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రామకృష్ణ హత్యోదంతం బయటకు రాగానే యాదగిరిగుట్ట పట్టణం శ్రీరాంనగర్లో ఉంటున్న వెంకటేశం తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిపోయాడు. (చదవండి: బంజారాహిల్స్లో భూకబ్జా ముఠా హల్చల్) పూడ్చిన గొయ్యి తవ్వి.. భార్గవి ఫిర్యాదు నేపథ్యంలో మిస్సింగ్ కేసు నమోదు చేసిన భువనగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తుతెలియని వ్యక్తులు లకుడారం గ్రామ శివారులో శవాన్ని పూడ్డి పెట్టినట్టుగా అందిన సమాచారం మేరకు.. ఆదివారం ఉదయం లకుడారం శివారులోని పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద రైల్వే పనులు జరుగుతున్న చోట గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కాల్వలో గొయ్యి తీసి పూడ్చివేసినట్టు అనుమానం రావడంతో సాయంత్రం రామకృష్ణ చిన్నమ్మ కుమారుడు జహంగీర్గౌడ్ సమక్షంలో కుకునూరుపల్లి పోలీసులతో కలిసి తవ్వించారు. మృతదేహం కన్పించడంతో బయటకు తీశారు. అది రామకృష్ణదేనని జహంగీర్ నిర్ధారించాడు. కాగా తన కొడుకును చంపిన వారిని కఠినంగా శిక్షించాలని రామకృష్ణ తల్లి కలమ్మ డిమాండ్ చేసింది. నా తండ్రే హత్య చేయించాడు నేను కులాంతర వివాహం చేసుకున్నాననే కోపంతో నా తండ్రే డబ్బులిచ్చి హత్య చేయించాడు. నా బంధువు మోత్కూరుకు చెందిన యాకయ్య నెల క్రితం లతీఫ్ను నా భర్తకు పరిచయం చేశాడు. శుక్రవారం లతీఫ్, జమ్మాపురం సర్పంచ్ అమృతయ్య పథకం ప్రకారం భూములు చూపించాలంటూ తీసుకెళ్లి హత్య చేశారు. – భార్గవి -
అంచనాలు తారుమారు.. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల ఎంపికలో ఊహించని మలుపు
సాక్షి, నల్లగొండ: టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ నియమితులయ్యారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అధిష్టానం బుధవారం ప్రకటించింది. ఈ నియామకాలతో జిల్లా నేతల అంచనాలు తారుమారయ్యాయి. మొదటి నుంచి జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేసిన వారెవరికీ పదవి దక్కలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి జిల్లాలో ఓసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి భావించారు. తద్వారా జిల్లాలో అన్ని వర్గాలను దగ్గర చేసుకోవ్చనే ఆలోచన చేశారు. ఇదే విషయాన్ని గతంలో పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రకటించిన జిల్లా అధ్యక్షుల నియామకాలను చూస్తే మంత్రి మాట నెగ్గినట్టు అవగతమవుతోంది. సీఎం కేసీఆర్కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్, పక్కన మంత్రి, ఎమ్మెల్యేలు తనకు ఇస్తారని కిషన్రెడ్డి భావించినా.. నల్లగొండలో రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కోటాలో తనకు కచ్చితంగా జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందన్న ఆశలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్రెడ్డి భావించారు. గతంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కూడా కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో జిల్లా అధ్యక్ష పదవి కచ్చితంగా ఇస్తారని ఎదురుచూసినా దక్కలే. ఆయనతో పాటు గుత్తా జితేందర్రెడ్డి, సత్తయ్యగౌడ్ కూడా జిల్లా అధ్యక్ష పదవిని ఆశించారు. కానీ, అనూహ్యంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రవీంద్రకుమార్కు అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. చదవండి: అనూహ్యంగా తెరపైకి పేరు.. గులాబీ బాస్గా ‘కల్వకుంట్ల’ సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోనూ అంతే.. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అధ్యక్షుల నియామకాల విషయంలోనూ ఊహించని విధంగా నియామకాలు జరిగాయి. సూర్యాపేట జిల్లా నుంచి వై.వెంకటేశ్వర్లు, ఎస్ఏ రజాక్, నిమ్మల శ్రీనివాస్గౌడ్ పేర్లు చివరి వరకు పరిశీలనలో ఉన్నట్లుగానే పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. చివరకు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్కు జిల్లా అధ్యక్ష పదవి వచ్చింది. దీంతో అక్కడ బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్లైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ బూడిద భిక్షమయ్యగౌడ్, ఆకుల ప్రభాకర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారిద్దరిలో ఎవరో ఒకరికి కచ్చితంగా అధ్యక్ష పదవి దక్కుతుందనే ఊహాగానాలు వచ్చాయి. వాటిని తారుమారు చేస్తూ ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ రామకృష్ణారెడ్డికి పదవిని కట్టబెట్టారు. ఒకటి ఎస్టీ, మరొకటి బీసీ, ఇంకొకటి ఓసీ సామాజికవర్గానికి కేటాయించారు. పవర్ సెంటర్గా మారకూడదనే.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జిల్లాలో పార్టీ నేతలను అందరిని కలుపుకుపోయే వారినే పార్టీ అధ్యక్షులుగా నియమిస్తారని పార్టీలో మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నియోజకవర్గాల్లో కీలకమైన ఎమ్మెల్యేల మాట కాదనకుండా ముందుకు వెళ్లే వారికే పార్టీ బాధ్యతల అప్పగించాలన్న ఆలోచనలు చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో చాలా చోట్ల పార్టీ బాధ్యతలను కూడా ఎమ్మెల్యేలకే అధిష్టానం అప్పగించింది. ఇక్కడా అదే అమలు చేసింది. దేవరకొండ ఎమ్మెల్యేకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఆయనతో పార్టీ నేతలు ఎవరికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కలిసిపోయే తత్వం కావడం.. మంత్రికి అనుగుణంగానే ఉండే నాయకుడు అయినందున ఆయన్ని నియమించింది. చదవండి: వీరే గులాబీ రథసారథులు.. 33 జిల్లాల అధ్యక్షుల జాబితా ఇదే సూర్యాపేటలో ఎంపీ లింగయ్య యాదవ్ కూడా మంత్రి జగదీష్రెడ్డికి అనుకూలంగా ఉంటారు. యాదాద్రిలోనూ అంతే. కాగా, మూడు జిల్లాల్లోనూ అధ్యక్ష పదవిని ఆశించిన వారికి ఇస్తే ఎమ్మెల్యేలకు వారికి మధ్య కొంత గ్యాప్ వస్తుందనే భావన నెలకొంది. పైగా పార్టీ అధ్యక్షులు అయినందున వారు మరో పవర్ సెంటర్గా మారుతారనే వాదన ఉంది. అవేమీ లేకుండా మంత్రికి, ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు అనుగుణంగా ఉండేవారికి అధ్యక్ష పదవులను కట్టబెట్టినట్లు తెలిసింది. కాంగ్రెస్కు దీటుగా.. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్కు దీటుగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించింది. నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా శంకర్నాయక్ ఉండగా, సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా వెంకన్నయాదవ్ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అనిల్కుమార్రెడ్డి ఉండగా, ఈ మూడు జిల్లాల్లోనూ టీఆర్ఎస్ కూడా అదే సామాజిక వర్గాల వారిని అధ్యక్షులుగా నియమించింది. విధేయత, సమన్వయమే లక్ష్యంగా.. నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ గతంలో కమ్యూనిస్టు నాయకునిగా ప్రజల్లో తిరిగిన అనుభవంతోపాటు పార్టీకి విధేయుడిగా ఉంటారని పార్టీ అంచనా. బడుగుల లింగయ్య యాదవ్ కూడా టీడీపీ అధ్యక్షునిగా సుధీర్ఘ కాలం పని చేశారు. రామకృష్ణారెడ్డి కూడా పార్టీకి విధేయునిగా ఉండటంతో పాటు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటారన్న అంచనాలతోనే నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. పార్టీ పటిష్టతకు నిరంతరం కృషి దేవరకొండ : జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్ట పర్చేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాని ఆ పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన సందర్భంగా బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గిరిజన ఎమ్మెల్యేను అయిన నాపై పూర్తి విశ్వాసం ఉంచి పార్టీ జిల్లా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటానన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో పార్టీ కార్యకర్తలకు మరింత చేరువయ్యే అవకాశం లభించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పారు. బయోడేటా పేరు : రమావత్ రవీంద్రకుమార్ స్వస్థలం : దేవరకొండ మండలం రత్యాతండా రాజకీయ ప్రస్థానం: రవీందక్రుమార్ డిగ్రీ ఫైనలియర్ చదువుతుండగానే 1995లో దేవరకొండ మండలం శేరిపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వచ్చింది. సీపీఐ మద్దతుతో ఆయన సర్పంచ్గా గెలుపొందారు. 2001లో రెండోసారి కూడా సర్పంచ్గా గెలిచారు. సర్పంచ్గా మూడేళ్ల మూడేళ్ల పదవీకాలం పూర్తయ్యాక 2004లో సీపీఐ తరఫున దేవరకొండ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేగా విజయం సాధించాక సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు. 2009లో ఎమ్మెల్యే పోటీచేసి ఓడిపోయారు. 2014లో సీపీఐ నుంచి పోటీచేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2016లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. -
యాదాద్రి భువనగిరి జిల్లాలో కుండపోతగా వర్షాలు
-
Menhir: 3000 ఏళ్ల నాటి.. సమాధి ముందు గుర్తుగా పాతే నిలువు రాయి
సాక్షి, హైదరాబాద్: ఇది దాదాపు మూడు వేల ఏళ్లనాటి మెన్హిర్. అంటే ఆదిమ మానవుల సమూహంలో కాస్త ముఖ్యమైన వ్యక్తులుగా భావించే వారి సమాధి ముందు గుర్తుగా పాతే నిలువు రాయి. అలాంటి రెండు అరుదైన మెన్హిర్లు యాదాద్రి భువనగిరి జిల్లా వెంకటాపురం గ్రామ శివారులో వెలుగు చూశాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, మహ్మద్ నజీర్, గోపాల్ వీటిని గుర్తించారు. అందులో ఒకటి కొంత విరిగి నేలపైకి ఒరిగిపోగా, 4–5 అడుగుల వెడల్పు, 15–16 అడుగుల ఎత్తు ఉన్న మరో మెన్హిర్ నిలిచే ఉందని పరిశోధకులు చెప్పారు. గతంలో ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో సమాధులు ఉండేవని, వాటికి చెందిన పెద్దపెద్ద రాతి గుండ్లను స్థానికులు ఇళ్ల నిర్మాణం కోసం తరలించారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని ధ్వంసం చేస్తున్నారన్నారు. ఇలాంటి వాటిని కాపాడి చరిత్రను భావితరాలకు అందించాలని కోరారు. -
రిజర్వాయర్లోకి ధైర్యంగా దూకిన ఎస్సై.. శభాష్ సైదులు
సాక్షి, యాదాద్రి : అధికారిగా ఆదేశాలిచ్చేకంటే తానే పనిలోకి దిగితే ఆదర్శవంతమైన ఫలితం ఉంటుందన్న అతని నమ్మకం సత్ఫలితాలనిచ్చింది.బాలుర మృతదేహాలను బయటకు తీయడానికి తానే ధైర్యంగా రిజర్వాయర్లోకి దిగిన భువనగిరి రూరల్ ఎస్ఐ సైదులుపై అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి.కరోనా కాలంలోనూ అభాగ్యుల ఆకలితీర్చాడు. ప్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు సేవలందిస్తున్న భువనగిరి రూరల్ ఎస్ఐ కె.సైదులుపై ప్రత్యేక కథనం రిజర్వాయర్లోకి ధైర్యంగా దూకి భువనగిరి కిసాన్నగర్కు చెందిన పవన్కుమార్రెడ్డి(14), హనుమాన్వాడకు చెందిన హేమంత్(15)సోమవారం సాయంత్రం భువనగిరి మండలం బస్వాపురం శివారులోని నృసింహ రిజ ర్వాయర్ను చూడటానికి వెళ్లి నీటిలో మునిగి పోయారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సైదులు అక్కడకు చేరుకున్నాడు. పిల్లల చెప్పులను చూసి రిజర్వాయర్లో మునిగిపోయారని ధ్రువీకరించుకున్నాడు.ఎన్డీఆర్ఎఫ్, గజ ఈత గాళ్ల కోసం సమాచారం ఇచ్చారు. వారు వచ్చేసరికి ఆలస్యమవుతుందని భావించి తానే రంగంలోకి దిగాడు. 15 ఫీట్ల లోతున్న నీటిలోకి దిగి మూడు గంటలు గాలించి బాలుర మృతదేహా లను బయటకు తీశారు.ఎస్ఐని బ స్వాపు రానికి చెందిన నాయకులు సత్కరించారు. మతిస్థిమితం లేని కోటీశ్వరుడి గుర్తింపు హైదరాబాద్లోని బల్కంపేటకు చెందిన శ్రీ కాంత్ కోటీశ్వరుడు. 15 రోజుల క్రితం రాయగిరికి వచ్చాడు. రోడ్ల పక్కన తిరుగుతుండటంతో ఎస్ఐ గమనించి చేరదీశాడు. వివరాలు తెలుసుకోగా అతడు కోటీశ్వరుడని తేలింది. అతన్ని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చాడు. లాక్డౌన్లో.. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్లోనూ ఎస్ఐ సైదులు అనేక సేవలందించాడు. వందలాది మంది అభాగ్యులకు సొంత ఖర్చుతో భోజనం అందిజేసి ఆకలి తీర్చాడు. నేనే ముందుంటా.. అధికారిగా తాను ముందుండి పనిచేయ డం ద్వారా మిగతావా రు కలిసి వస్తారు. బ స్వాపూర్ రిజర్వాయర్లో అదే చేశాను.గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చాను కాబట్టి నా కు ఈత వచ్చు. ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లకోసం ప్రయత్నించాం. కానీ,ఆలస్యం అవుతుందని భావించి నేనే రిజర్వాయర్లోకి ది గాను.ఇద్దరు పిల్లల మృతదేహాలను బయటకు తీశాను. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో కరోనా సమయంలో వందలాది మంది ఆకలి తీర్చాను. –కె.సైదులు, ఎస్ఐ, భువనగిరి రూరల్ -
భువనగిరిలో ‘రియల్ దందా’.. 700 కోట్ల అక్రమాలు!
హైదరాబాద్: యాదాద్రికి సమీపంలో భారీ రియల్ దందా బయటపడింది. యాదాద్రి, భువనగిరి చుట్టుపక్కల భూముల కొనుగోళ్లలో రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల మధ్య గత ఆరేళ్లలో రూ.700 కోట్ల విలువైన లెక్కల్లో చూపని అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సోదాల్లో అధికారులు గుర్తించారు. యాదగిరిగుట్టతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ సంస్థలు వెంచర్లతో పాటు అపార్ట్మెంట్లను నిర్మిస్తుంటాయి. యాదగిరిగుట్ట, హైదరాబాద్ నగర శివారులో ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో అనేక డాక్యుమెంట్లు, ఒప్పంద పత్రాలు, వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి కీలక సమాచారం సేకరించారు. భూముల కొనుగోళ్లలో అనేక అక్రమాలు జరిగాయని గుర్తించారు. ఈ సోదాల సందర్భంగా లెక్కలు చూపని రూ.11.88 కోట్ల నగదు, రూ.1.93 కోట్ల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. గడిచిన ఆరేళ్లలో లెక్కలు చూపకుండా (నల్లదనం) సాగించిన లావాదేవీలకు సంబంధించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసిన విలువ కంటే ఎక్కువ నగదు స్వీకరించి, ఆ నగదును భూముల కొనుగోలు, ఇతర వ్యాపార కార్యకలాపాలకు వినియోగించినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. కలకలం రేపిన సోదాలు.. మార్చి 23, 24వ తేదీల్లో భువనగిరి, యాదగిరిగుట్ట పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న పలు సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ సోదాలు జరిపిన కంపెనీల్లో హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న స్పెక్ట్రా, సన్సిటీ సంస్థలు ఉన్నాయి. స్పెక్ట్రా సంస్థ చైర్మన్ జగన్, సన్సిటీ సంస్థ చైర్మన్ నారాయణగౌడ్ కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిగాయి. ఇందులో భాగంగా స్పెక్ట్రాలో కంపెనీ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న కాంగ్రెస్ ఆలేరు ఇన్చార్జి బీర్ల అయిలయ్య ఇంటిపై మార్చి 23, 24 తేదీల్లో అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ 2 సంస్థల మధ్య జరిగిన దాదాపు రూ.700 కోట్ల మేర లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. ఎవరీ బీర్ల ఐలయ్య.. యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపురం గ్రామానికి చెందిన బీర్ల అయిలయ్య రాజకీయంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆలేరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్నారు. కొంతకాలంగా యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో భూములు కొంటూ.. అమ్ముతూ వ్యాపారం వ్యాపారం చేస్తున్నారు. గతంలో సైదాపురం సర్పంచ్గా, పాల సంఘం చైర్మన్గా, యాదగిరిగుట్ట పట్టణంలో ఎంపీటీసీగా కొనసాగారు. ఈ క్రమంలోనే కొందరు భాగస్వామ్యంతో యాదగిరిగుట్ట మండలంలోని చుట్టు పక్కల గ్రామాల్లో భూములు కొనుగోలు చేయడం, అమ్మడం చేసేవారు. హైదరాబాద్కు చెందిన స్ప్రెక్టా రియల్ ఎస్టెట్ కంపెనీతో పరిచయం పెంచుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు. బీర్ల అయిలయ్య రాజకీయంగా చురుగ్గా ఉండటమే కాకుండా, పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. -
మహిళల భద్రతకు సీఎం ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, యాదాద్రి : రాష్ట్రంలోని ప్రతి మహిళ భద్రతతో ఉండేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఐఏఎస్, ఐపీఎస్లతో కూడిన కోర్ గ్రూపు కమిటీ సమావేశంలో ఆమె మహిళా భద్రత చర్యలను సమీక్షించారు. డయల్ 100, 181 తదితర హెల్ప్లైన్ వ్యవస్థల పనితీరు గురించి కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేస్తే కలెక్టర్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే సునీతా మహేందర్రెడ్డి మాట్లాడుతూ ఫిర్యాదులపై మహిళా రక్షణ కమిటీలు తక్షణం స్పందించినప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్, సీఎంఓ హరితహారం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్, ఐఏఎస్ అధికారి యోగితా రాణా, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖా కమిషనర్ వాకాటి కరుణ, హైదరాబాద్, నల్లగొండ, యాదాద్రి కలెక్టర్లు శ్వేతా మహంతి, ప్రశాంత్ జీవన్ పాటిల్, అనితా రామచంద్రన్, హైదరాబాద్ షీ టీం ఇన్చార్జి అనసూయ పాల్గొన్నారు. -
యాదాద్రిలో ఆధ్యాత్మిక బస్ టెర్మినల్
యాదాద్రి, భువనగిరి : దేశ, విదేశాల నుంచి దర్శనానికి వచ్చే లక్షలాదిమంది భక్తుల రద్ధీకి అనుగుణంగా ఆలయ సమీపంలో 7 ఎకరాల్లో ఆధ్యాత్మిక బస్ టెర్మినల్ను ఏర్పాటు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం యాదాద్రి ఆలయంలో నిర్మించే బస్ టెర్మినల్, బస్ డిపోకు కావల్సిన స్థలాన్ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మతో పాటు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. సైదాపురం గ్రామ శివారులో 150 బస్సులు పార్కింగ్ చేసేలా డిపో నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆమోదంతో బస్ స్టేషన్, డిపో నిర్మాణాలను చేపడతామన్నారు. ఆలయ ప్రారంభానికి ముందే బస్ టెర్మినల్, డిపోలను ప్రారంభించడానికి అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.ఆలయానికి వెళ్లేందుకు ప్రత్యేకమైన స్టేషన్, ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు మరో స్టేషన్ నిర్మాణం నూతన బస్ టెర్మినల్ లో నిర్మించేలా ఇంజినీర్లు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారుఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ సుశీల్ శర్మ, కలెక్టర్ అనితా రామచంద్రన్, రవాణా శాఖ కమిషనర్ శ్రీ ఎం.ఆర్.ఎం. రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శ్రీ పురుషోత్తం, శ్రీ పి.వి.మునిశేఖర్, నల్గొండ ఆర్.ఎం శ్రీ వెంకన్న, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఈ ఓ గీత, ఆర్ అండ్ బీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
వాసాలమర్రిని దత్తత తీసుకున్న కేసీఆర్
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని, ఎర్రవల్లి తరహాలో అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. సీఎం శనివారం జనగామ జిల్లా కొడకండ్లకు రోడ్డుమార్గంలో వెళ్లి వస్తూ వాసాలమర్రిలో ఆగి గ్రామస్తులతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గ్రామ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో సర్పంచ్ను ఆదివారం ఫాంహౌస్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు సర్పంచ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎంపీపీ సుశీల, ఎంపీటీసీ సభ్యుడు నవీన్, కొందరు టీఆర్ఎస్ నేతలు ఎర్రవల్లి ఫాంహౌస్లో సీఎంను కలిశారు. వినతిపత్రం ఇవ్వబోగా అవసరం లేదని, వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుని రూ.100 కోట్లు ఖర్చయినా అభివృద్ధి చేస్తానని సీఎం ప్రకటించారు. వెంటనే జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్తో మాట్లాడి వాసాలమర్రిని ఎర్రవల్లి తరహాలో అభివృద్ధి చేయాలని, గ్రామానికి ఏమేం కావాలనే అంశాలపై బ్లూ ప్రింట్ తయారు చేయాలని ఆదేశించారు. గ్రామస్తులను ఎక్స్పోజర్ విజిట్ కోసం నిజామాబాద్ జిల్లా అంకాపూర్కు తీసుకుపోవాలని ఆదేశించారు. మరో 10 రోజుల్లో ఊరుకు వచ్చి గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేస్తానని చెప్పారు. ఎర్రవల్లిని అభివృద్ధి చేసిన అప్పటి సిద్దిపేట, ప్రస్తుత సంగారెడ్డి కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ శోభ, కలెక్టర్ అనితారామచంద్రన్, పలువురు అధికారులు సోమవారం వాసాలమర్రికి రానున్నారు. గ్రామసమస్యలపై సర్వే చేపట్టనున్నారు. గ్రామాభివృద్ధికిగాను బ్లూ ప్రింట్ తయారీ కోసం ప్రత్యేకాధికారిగా డీఆర్డీవో పీడీ మందడి ఉపేందర్రెడ్డిని నియమించారు. కలెక్టర్ అనితారామచంద్రన్ ఆదివారం వాసాలమర్రిని సందర్శించి సర్పంచ్, గ్రామస్తులతో అభివృద్ధి, ఉపాధి అంశాలపై చర్చించారు. -
కలెక్టర్ కారును ఢీ కొట్టిన లారీ
యాదాద్రి, భువనగిరి : జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్కు తృటిలో ప్రమాదం తప్పింది. భువనగిరి సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కలెక్టర్ క్షేమంగా బయటపడ్డారు. అకాల వర్షంతో వలిగొండ మండలంలో పలు గ్రామాల్లో పంటపొలాలను పరిశీలించి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
దిల్ రాజు కీలక నిర్ణయం
ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రుల అకాల మరణంతో అనాథలుగా మిగిలిన ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సత్యనారాయణ ఏడాది క్రితం కాలం చేశాడు. అతని భార్య అనురాధ కూడా ఇటీవలే మరణించారు. దీంతో ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు. తొమ్మిదేళ్ల పెద్ద కుమారుడే పెద్ద దిక్కుగా మారి తన చెల్లి, తమ్ముడి ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. ఈ కథనం ఎంతో మందిని కదిలించగా నటుడు సోనూసూద్ వారికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. (సోనూ సూద్ వెనుక సోనాలి పాత్ర) వారు ఎంతమాత్రం అనాథలు కారని, వారి బాధ్యత తాను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వారిని మహారాష్ట్రలోని నాసిక్కు తీసుకువచ్చి ఓ ఆశ్రమంలో ఉంచుతానని తెలిపారు. మరోవైపు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సైతం వారి పరిస్థితికి చలించిపోయారు. ఆ ముగ్గురిని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. వారి బాధ్యతను తన భుజాలపై వేసుకుంటానని వెల్లడించారు. అయితే ఆ ముగ్గురు పిల్లలు ఈ ఇద్దరిలో ఎవరి దగ్గరకు వెళ్తారనేది ఇంకా నిర్ణయించుకోలేదు. (సోనూసూద్ అన్లిమిటెడ్ : వారి బాధ్యత నాదే) -
దివీస్ ఫార్మా కంపెనీకి ఎన్జీటీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : దివీస్ ఫార్మా కంపెనీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. కాలుష్యాన్ని వెదజల్లుతూ పర్యావరణానికి నష్టం కలిగిస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చెందిన కాలుష్య పరిరక్షణ సమితి ఎన్జీటిని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన జరిపిన జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సహా దివీస్ ఫార్మా కంపెనీకి నోటీసులు జారీ చేసింది. (ఎమ్మెల్యేలతో పాటు సీనియర్లు కూడా..) అలాగే ఫార్మా కాలుష్యంపై విచారణ జరిపేందుకు ఎన్జీటీ చౌటుప్పల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా కేంద్ర పర్యావరణ శాఖ ఫార్మా వ్యవహారాల విభాగం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ శాఖ, యాదాద్రి జిల్లా కలెక్టర్ను చేర్చింది. చౌటుప్పల్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఫార్మా కంపెనీలు వ్యవహరిస్తూ కాలుష్యానికి కారణమైతే తీసుకోవాల్సిన చర్యలను నివేదించాలని పేర్కొంది. తదుపరి విచారణను ఆగష్టు 21కి వాయిదా వేసింది. (వారికి వైఎస్ జగనే కరెక్ట్ : నాగబాబు) -
బ్రెయిన్లో బ్లడ్ క్లాట్.. జార్జియాలో శివాణి
యాదాద్రి జిల్లా : భువనగిరికి చెందిన శివాణి అనే విద్యార్థిని జార్జియా దేశంలో చిక్కుకుపోయింది. వెంకటేష్, సరిత దంపతుల కూతురు శివాణి పై చదువుల కోసం జార్జియా వెళ్లింది. స్థానిక అకాకి త్సెరెటెలి విశ్వవిద్యాలయంలో ఆమె మెడిసిన్ చదువుతోంది. కళాశాలకు బస్సులో వెళుతున్న సమయంలో ఒకసారి వాంతి చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ బ్రెయిన్లో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. వెంటనే శివాణి తల్లిదండ్రులకు విద్యార్థులు సమాచారం అందించారు. దీంతో కూతురుకు మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించి శివాణిని రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జార్జియా నుంచి వచ్చే సమయంలో ఎయిర్ పోర్ట్ సబ్బంది చివరి నిమిషంలో శివాణిని భారత్కు పంపేందుకు నిరాకరించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కూతురు శివాణి భారత్కు రావడానికి అన్ని ఏర్పాట్లు చేసినా.. చివరి నిమిషంలో రాకుండా అడ్డుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురును ఆదుకోవాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. -
ప్రభుత్వ భూమికి ఎసరు..!
చౌటుప్పల్ (మునుగోడు) : మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీపార్క్ స్థలంపై అక్రమార్కుల కన్నుపడింది. పట్టణ నడిబొడ్డున అత్యంత విలువైన ఈ భూమిని ఆక్రమించేందుకు కుట్రలు ప్రారంభమయ్యాయి. గ్రామానికి చెందిన దొరవారు పంతంగి శ్రీనివాస్రావు ఈ భూమిని అప్పట్లో గ్రామ పంచాయతీకి దానంగా ఇచ్చారు. సుమారు 0–35 ఎకరాల వరకు ఉన్న ఈ స్థలం మొన్నటి వరకు కంపచెట్లు, చెత్తాచెదరంతో ఉన్నప్పటికీ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గాంధీపార్క్ను పూర్తిగా శుభ్రం చేశారు. ఫిబ్రవరి 27 నుంచి 29వ తేదీ వరకు పనులు జరిగాయి. పదేళ్ల క్రితం వరకు ఆక్రమణలు జరిగినప్పటికీ అప్పటి నుండి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. హద్దురాళ్లు నాటిన గుర్తు తెలియని వ్యక్తులు కానీ, సోమవారం తెల్లవారే వరకు గాంధీపార్క్ స్థలంలో హద్దురాళ్లు వెలిశాయి. ఊర కృష్ణమూర్తి ఇంటి పక్క నుంచి ప్రధాన మురికి కాల్వ వైపునకు రూ.3కోట్లకు పైనే విలువ చేసే 500 గజాల స్థలానికి రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు నాటారు. ఉదయం చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ మందడి రామదుర్గారెడ్డిని సంప్రదించగా హద్దు రాళ్లు నాటిన విషయం తమ దృష్టికి వచ్చిందని, తొలగిస్తామని తెలిపారు. హద్దురాళ్లు నాటిన వ్యక్తుల వివరాలు తెలియలేదన్నారు. -
యాదాద్రి మున్సిపాలిటీలు కారు కైవసం
సాక్షి,యాదాద్రి : మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఆరు మున్సిపాలిటీలను, ఐదు వైస్ చైర్మన్లను ఆ పార్టీ గెలుచుకుంది. సీపీఎంకు ఒక చోట వైస్ చైర్మన్ దక్కింది. ఆలేరు, భూదాన్పోచంపల్లి, మోత్కూరులో సొంత బలంతో పదవులను కైవసం చేసుకోగా భువనగిరి, యాదగిరిగుట్టలో ఎక్స్ అఫిషియో, ఇండింపెండెంట్ల ఓట్ల ద్వారా చెర్మన్, వైస్చైర్మన్ పదవులను గెలుపొందారు. చౌటుప్పల్ కాంగ్రెస్ కూటమిలో చీలిక తెచ్చి సీపీఎం కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్ పీఠం దక్కించుకున్నారు. సీపీఎంకు వైస్ చైర్మన్ దక్కింది. దీంతో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి చైర్మన్ ఎంపిక వరకు బాధ్యతలన్నీ ఎమ్మెల్యేలపైనే మోపడంతో వారు సవాల్గా తీసుకుని విజయం సాధించారు. భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, చౌటుప్పల్లో మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ముందుండి నడిపించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన దిశానిర్దేశంతో క్లీన్ స్వీప్ చేశారు. క్యాంపుల నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయాలకు ఈ నెల 25న ఎన్నికల ఫలితాలు వెలువడగానే గెలిచిన కౌన్సిలర్లను ఎమ్మెల్యేలు క్యాంపులకు తరలించారు. క్యాంపుల్లోనే కౌన్సిలర్ల అభిప్రాయాలను సేకరించారు. చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకుని అంతిమంగా ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుని గోప్యంగా ఉంచారు. దీంతో కౌన్సిల్ హాల్ లోకి వచ్చేవరకు ఎవరు చైర్మన్, వైస్చైర్మన్ అవుతున్నారో తెలియకుండా జాగ్రత్త పడ్డారు. పార్టీ తరఫున విప్ జారీ చేసి ఎన్నికల అధికారులకు చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాలను అందజేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం అధికా రులు ప్రకటించిన పేర్లకు మద్దతుగా చేతులెత్తడం ద్వారా తమ సమ్మతిని తెలియజేసి ఎన్నుకున్నారు. అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా చైర్మన్, వైస్చైర్మన్ అభ్యర్థులను పోటిలో నిలిపింది. సకాలంలో హాజరుకాని బీజేపీ 22 వార్డు కౌన్సిలర్ బొర్ర రాకేశ్పై చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు జిల్లా నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. భువనగిరిలో పోటాపోటీ.. 35 వార్డులున్న మున్సిపాలిటీలో టీ ఆర్ఎస్ కు ఇండిపెండెంట్లతో 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అదనంగా ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్రెడ్డి ఎక్స్ ఆఫిషియో ఓట్లతో కలిసి టీఆర్ఎస్ బలం 19కి చేరింది. కాంగ్రెస్, బీజేపీల పొత్తుతో వారిబలం 18కి చేరినప్పటికీ బీజేపీకి చెందిన 22వ వార్డు కౌన్సిలర్ బొర్ర రాకేష్ సకాలంలో హాజరు కాలేదు. దీంతో వారి బలం 17కు పడిపోయింది. టీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా ఎనబోయిన ఆంజనేయులు, కాంగ్రెస్ అభ్యర్థిగా పోత్నక్ ప్రమోద్కుమార్ పోటీ పడ్డారు. అయితే అంజనేయులకు 19 ఓట్లు రాగా ప్రమోద్కుమార్కు 17 ఓట్లు వచ్చాయి. దీంతో అంజనేయులు చైర్మన్గా గెలుపొందారు. కాగా వైస్ చైర్మన్ కోసం టీఆర్ఎస్ తరఫున చింతల కిష్టయ్య, బీజేపీ తరఫున మాయ దశరథ పోటీ పడ్డారు. అయితే చైర్మన్ తరహాలోనే టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆలేరులో : 12 వార్డులకు గాను టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 1, బీజేపీ 1, ఇండింపెండెంట్లు ఇద్దరు గెలిచారు. ఇండిపెండెంట్ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడంతో బలం 9కి చే రింది. చైర్మన్గా వస్పరి శంకరయ్య, వైస్ చైర్మన్ మొరిగాడి మాధవి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భూదాన్పోచంపల్లిలో: 13 వార్డులకు టీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 2, బీజేపీ 1, ఇండిపెండెంట్ ఒకచోట విజయం సాధించాయి. పూర్తి మెజార్టీ ఉండడంతో టీఆర్ఎస్కు చెందినచిట్టిపోలు విజయలక్ష్మి చైర్మన్గా, బాత్కలింగస్వామి వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మోత్కురులో ఏకగ్రీవం: మున్సిపాలిటీలో 12 వార్డులకు టీఆర్ఎస్ ఏడుగురు కౌన్సిలర్లను గెలుచుకోగా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ఓటు నమోదు చేసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ బలం 8కి చేరింది. కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య ఐదు మాత్రమే ఉంది. దీంతో చైర్మన్ పదవికి టీఆర్ఎస్ తరఫున తీపిరెడ్డి సావిత్రి, కాంగ్రెస్ తరఫున గుర్రం కవిత పోటీ పడ్డారు. ఎన్నికల అధికారులు ఓటింగ్ నిర్వహించడంతో టీఆర్ఎస్ అభ్యర్థి తీపిరెడ్డి స్వాతి చైర్మన్గా విజయం సా«ధించింది. వైస్ చైర్మన్గా బొల్లేపల్లి వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చౌటుప్పల్లో టీఆర్ఎస్ ఏకగ్రీవం: చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తత నడుమ జరిగింది. ఎన్ని కను కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ సభ్యులు బహిష్కరించారు. 20వార్డులు ఉండగా టీర్ఎస్ 8, కాంగ్రెస్ 5, బీజేపీ 3, సీపీఎం 3 ఇండిపెండెంట్లు ఒక చోట విజయం సా«ధించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం కూటమిగా పోటీ చేశాయి. అయితే టీఆర్ఎస్కు సీపీఎం మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగింది. స్థానిక ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి టీఆర్ఎస్, సీపీఎం పొత్తును నిరసిస్తూ ఎన్నికనుఅడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయనను పోలీస్ల సహయంతో బయటకు పంపించారు. దీంతో కాంగ్రెస్, ఇండిపెండెంట్ సభ్యులు ప్రమాణస్వీకారం చేయకుండానే బయటకువెళ్లిపోయారు. బీజేపీకి చెందిన ముగ్గురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో సమావేశంలో టీఆర్ఎస్, సీపీఎంలకు చెందిన 11 మంది సభ్యుల కోరం ఉండడంతో చైర్మన్గా టీఆర్ఎస్కు చెందిన వెన్రెడ్డిరాజు, వైస్ చైర్మన్గా సీపీఎంకు చెందిన బ త్తుల శ్రీశైలంలను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. యాదగిరిగుట్టలో ఉద్రిక్తత నడుమ.. ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తత నడుమ జరిగాయి. ఎక్స్అఫిషియో సభ్యుల బలంలో టీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. 12 వార్డులకు టీఆర్ఎస్ 4 చోట్ల గెలువగా, ఎక్స్ అఫిషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు కర్రె ప్రభాకర్, కడియం శ్రీహరి, ఇండిపెండెంట్ సభ్యులతో కలిపి టీఆర్ఎస్ బలం 8 కి చేరింది. అయితే కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్ 4, సీపీఐ 1, ఇండిపెండెంట్లు ఇద్దరు కౌన్సిలర్లతో బలం 7కు చేరింది. టీఆర్ఎస్ తరపున చైర్పర్సన్గా ఎరకల సుధ, కాంగ్రెస్ నుంచి గుండ్లపల్లి వాణి పోటీపడ్డారు. టీఆర్ఎస్ అభ్యర్థికి ఎనిమిది ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి ఏడు ఓట్ల వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. వైస్ చైర్మన్గా టీఆర్ఎస్ కూటమిలో ఉన్న ఇండిపెండెంట్ కౌన్సిలర్ కాటంరాజు ఎన్నికయ్యారు. -
అమల్లోకి ఫాస్టాగ్: టోల్గేట్ల వద్ద భారీ ట్రాఫిక్జామ్
-
అమల్లోకి ఫాస్టాగ్: నిలిచిపోయిన వాహనాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వం జాతీయ రహదారుల్లో ఫాస్టాగ్ విధానాన్ని నేటి నుంచి అమల్లోకి తెచ్చింది. కానీ ఫాస్టాగ్ విధానంపై వినియోగదారులు పెద్దగా మొగ్గు చూపలేదు. ఫలితంగా పలు టోల్గేట్ల వద్ద భారీ ట్రాఫిక్జామ్ ఏర్పడింది. ఫాస్టాగ్కు అధిక లైన్లు, నగదు చెల్లింపు లైన్లను తక్కువకు కుదించి, ఫాస్టాగ్కు ఎక్కువ లైన్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. యాదాద్రి భువనగిరి: జిల్లాలోని పంతంగి టోల్గేట్ వద్ద పెద్దసంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. టోల్ప్లాజాలోని ఐదుగేట్ల ద్వారా ఫాస్టాగ్కు అనుమతి ఉంది. మరో మూడు గేట్ల ద్వారా నగదు చెల్లించి వాహనాల రాకపోకలు కొనసాగించవచ్చు. ఈ క్రమంలో ఆదివారం ఫాస్టాగ్ లేని గేట్ల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. టోల్గేట్ ఇరువైపులా కిలోమీటర్ మేర వాహన రాకపోకలు స్థంభించిపోయాయి.. ఫాస్టాగ్ విధానం అమలుతో నగదు చెల్లింపు కౌంటర్లు కుదించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని అధికారులు పేర్కొంటున్నారు. కృష్ణా: జిల్లాలోని టోల్గేట్ల వద్ద ఫాస్టాగ్ విధానం మొరాయించడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంచికర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్లు పనిచేయలేదు. రెండు లైన్లలో ఫాస్టాగ్ పనిచేయకపోవడంతో టోల్గేట్ సిబ్బంది క్యాష్ కౌంటర్లు ఏర్పాటు చేసి వాహనాలను పంపిస్తున్నారు. -
యాదాద్రి..భక్తజన సందడి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ధర్మదర్శనం, ప్రసాద విక్రయశాల క్యూలైన్లు, ఆలయ పరిసరాలు, ఘాట్ రోడ్డు భక్తులతో నిండిపోయాయి. యాదగిరిగుట్ట పట్టణంలో సైతం ట్రాఫిక్జామ్ ఏర్పడింది. సెలవుదినం కావడం, కార్తీకమాసం ముగుస్తుండడంతో భక్తులు భారీగా తరలివచ్చి స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 40వేల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. –యాదగిరికొండ(ఆలేరు) సాక్షి,యాదగిరికొండ (భువనగిరి):యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. సెలవు దినం, కార్తీకమాసం ముగుస్తుండడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయంలోని వివిధ విభాగాల క్యూలైన్లు, కొండపై పరిసరాలు, ఘాట్ రోడ్డు కాలు పెట్టడానికి వీలులేకుండా భక్తులుతో నిండిపోయాయి. రూ.150 క్యూలైన్లు నిండి భక్తులు బయటకు బారులుదీరారు.ప్రసా§ద విక్రయశాల క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. హోటల్, దుకాణాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానికి 6 నుంచి 7గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఉదయం నుంచే భక్తుల రాక మొదలు కార్తీకమాసం ముగుస్తుండడం సెలవుదినం కూడా కావడంతో ఉదయం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి ఎలాంటి వాహనాలను అనుమతించలేదు. దీంతో భక్తులు కాలినడకన, ఆటోల్లో కొండపైకి చేరుకున్నారు. ద్విచక్ర వాహనాలు రెండో ఘాట్రోడ్డు మూలమలుపు వరకు పార్కింగ్ చేశారు. కొండకింద పార్కింగ్, టెంపుల్ సిటీ ఘాట్రోడ్డు పూర్తిగా కార్లతో నిండిపోయింది. కొండ కింద చెక్పోస్టు వద్ద ఘాట్రోడ్డు ప్రారంభంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో సీఐలు ఆంజనేయులు, నరసింహారావు తమ సిబ్బందితో కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. అయినా భక్తులు స్వామి దర్శనం అనంతరం చెక్పోస్టు నుంచి బస్టాండ్ చేరుకోవడానికి 45 నిమిషాల సమయం పట్టిందని తెలిపారు. సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరిస్తున్న భక్తులు భక్తులకు తప్పని తిప్పలు భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో సరైన వసతులు లేక ఇబ్బందులకు గురయ్యారు. అభివృద్ధి పనులు జరుగుతున్న దృష్ట్యా కొండపై స్థలం లేకపోవడంతో కూర్చొని సేదదీరడానికి సైతం భక్తులు అవస్థలు పడ్డారు. ఇదే అదనుగా దుకాణాదారులు వస్తువులను అధిక ధరలకు విక్రయించారు. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్లను సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేశారు. కొబ్బరికాయలను సైతం దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు విక్రయించారు. విశేష పూజలు బాలాలయంలో స్వామి, అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఉదయం సుదర్శన హోమం, మూలమంత్రాలతో హవనం, అనంతరం స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం నిర్వహించారు.అలాగే భక్తులు స్వామివారికి సువర్ణ పుష్పార్చన గావించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, గట్టు యాదగరిస్వామి, మంగళగిరి నరసింహామూర్తి, అధికారులు మేడి శివకుమార్, వేముల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. సమకూరిన ఆదాయం యాదాద్రి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. ఆదివారం ఒక్క రోజే రూ.13.50 లక్షల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. నిత్య పూజలు, టికెట్ల ద్వారా వచ్చిన రూ.4.40లక్షలు, సత్యనారాయణవ్రతాల ద్వారా రూ.9.10లక్షల ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. -
ప్రేమ వేధింపులు భరించలేక..
-
ప్రేమ వేధింపులకు బలైన బాలిక
సాక్షి, యాదాద్రి భువనగిరి: ప్రేమ వేధింపులు తాళలేక పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన జిల్లాలోని సమస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే నారాయణపురంలో భవాని అనే అమ్మాయి పదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన గిరి అనే యువకుడు గత కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో ఆమె వెంటపడుతున్నాడు. అతన్ని మందలించినా కూడా అతనిలో మార్పు రాలేదు. అతని వేధింపులతొ తీవ్ర మనస్తాపం చెందిన బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా నిందితుడు గిరి పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ప్రేమ పేరుతో వల విసిరి ఉన్మాదం) -
దాయాదులే నిందితులు..!
సాక్షి, భువనగిరి: అనుమానం పెనుభూతమైంది. తన భార్యకు చేతబడి చేయడంతోనే అనారోగ్యం బారిన పడిందని అనుమానించాడు. అందుకు కారణమైన వ్యక్తిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అదునుచూసి వెంబడించి వేటాడి ఘాతుకానికి ఒడిగట్టాడు. వలిగొండ మండలం సంగెం గ్రామానికి చెందిన బోయిని శంకరయ్యను దాయాదులే మట్టుబెట్టారని పోలీసుల విచారణలో వెల్లడైంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామ శివా రులో ఈ నెల 23న చోటు చేసుకున్న హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యోదంతా నికి పాల్పడిన నలుగురు నిందితులను శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో మీడియా ఎదుట ప్రవేశపెట్టి డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని వలిగొండ గ్రా మానికి చెందిన బోయిన ఎట్టయ్య కుమారుడు శంకరయ్య(62) ఒగ్గు కథలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఎట్టయ్య పాలివారైన బోయిని బుచ్చయ్య కుమారుడు శంకరయ్య 20ఏళ్ల క్రితం హైదరాబాద్కు వెళ్లి చికెన్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బంధువు చనిపోతే.. రెండేళ్ల క్రితం గ్రామానికి చెందిన బోయిన ఎట్టయ్య, బుచ్చయ్య బంధువు చనిపోయాడు. అంత్యక్రియలకు హైదరాబాద్లో ఉంటున్న శంకరయ్య కుటుంబంతో సహా హాజరయ్యాడు. ఆ సందర్భంలో శంకరయ్య వరుసకు కుమారుడైన శంకరయ్య భార్య చెవులను పట్టుకుని మాట్లాడాడు. అప్పటినుంచి శంకరయ్య భార్యకు చెవులు లాగడం, కడుపులో నొప్పిగా ఉండడం ఇతరత్ర అనారోగ్యాల బారిన పడింది. అయితే తన భార్య అనారోగానికి వరుసకు బాబాయి అయిన శంకరయ్య చేతబడి చేయడమే కారణమని భావించాడు. కక్ష పెంచుకుని.. తన భార్య అనారోగ్యం భారిన పడడానికి బాబాయి శంకరయ్యే కారణమని శంకరయ్య కక్ష పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా అంతమొందించాలని శంకరయ్య నిర్ణయించుకున్నాడు. అందుకు అదునుకోసం వేచి చూస్తున్నాడు. కొ ద్దిరోజులుగా శంకరయ్య కదలికలపై నిఘా పెట్టించాడు. ఒక్కడి వల్ల కాదని.. అయితే, బాబాయి శంకరయ్యను హత్య చేయడం తన ఒక్కడి వల్ల కాదని భావించిన శంకరయ్య తన చికెన్ దుకాణంలో పనిచేసే టేచౌత సాయికిరణ్, సంగెం గ్రామానికే చెందిన బోయిని ప్రభాకర్, బోయిని యాదయ్యలను ఆశ్రయించాడు. వరుసకు బాబాయి అయ్యే శంకరయ్యను హత్య చేసేందుకు సహకరించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెంటాడి.. వేటాడి.. సంగెం గ్రామానికి చెందిన శంకరయ్య ఈ నెల 23(శుక్రవారం)న చౌటుప్పల్ మండలం వాయిళ్లపల్లి గ్రామంలో ఓ ఇంట్లో ఒగ్గుకథ చెప్పేం దుకు ఉదయం వెళ్లాడు. అప్పటికే సమాచారం ఉన్న శంకరయ్య హైదరాబాద్ నుంచి స్కార్పియో వాహనంలో తన దుకారణంలో పనిచేసే సాయికిరణతో కలిసి చౌటుప్పల్కు చేరుకున్నాడు. అక్కడ ఉన్న సంగెం గ్రామానికి చెందిన ప్రభాకర్, యాదయ్యలను కలుసుకున్నాడు. శంకరయ్య వాయిళ్లపల్లికి కథ చెప్పడానికి వెళ్లాడని తెలుసుకుని అక్కడే మాటేశారు. ఒగ్గుకథ పూర్తయిన తర్వాత శంకరయ్య ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. అదే దారిలో స్కార్పియో వాహనంలో కాపుకాసిన నలుగురు వ్యక్తులు శంకరయ్యను వెంబడించారు. సరిగ్గా సంగెం గ్రామ శివారులోకి రాగానే శంకరయ్య బైక్ను స్కార్పియోతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శంకరయ్య బైక్పైనుంచి ఎగిరి కిందపడడంతో వెంటనే స్కార్పియో నుంచి దిగిన శంకరయ్య, సాయికిరణ్ కత్తులతో అతడి గొంతు కోసేశారు. అనంతరం చెవులను కోసుకుని అక్కడినుంచి అదే వాహనంలో పరారయ్యారు. కాసేపు రక్తపుమడుగులో కొట్టుమిట్టాడిన శంకరయ్య ప్రాణాలు విడిచాడు. అనుమానంతో అదుపులోకి తీసుకోగా.. శంకరయ్య తండ్రి ఎట్టయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే మొదట శంకరయ్య ఒంటిపై ఉన్న ఆభరణాల కోసమే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావించారు. అయితే హత్య చేసిన అనంతరం బుచ్చయ్య కుమారుడు శంకరయ్యపై పోలీసులకు అనుమానం కలిగింది. స్కార్పియో వాహనంలో ఆదివారం అతడు సాయికిరణ్తో కలిసి హైదరాబాద్కు వెళుతుండగా అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. హత్యోదంతంలో పాల్గొన్న బోయిని ప్రభాకర్, యాదయ్యలను కూడా అరెస్ట్ చేసి కేసు నమో దు చేసినట్టు డీసీపీ వివరించారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఏసీపీ సత్తయ్య, రామన్నపేట సీఐ శ్రీనివాస్, స్థానిక ఎస్ఐ శివనాగప్రసాద్,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు . -
హైకోర్టు న్యాయమూర్తిగా బోగారం వాసి
సాక్షి, రామన్నపేట (నకిరేకల్) : యాదాద్రిభువనగిరి జిల్లాకు మరో అరుదైన గౌరవం దక్కింది. జిల్లాలోని రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన కూనూరు లక్ష్మణ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. వీరితోపాటు మరో ముగ్గురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రప్రతి రామ్నాథ్కోవింద్ ఈనెల 23న ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. బాల్యం–విద్యాభ్యాసం రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన కూనూరు గోపాల్–సత్తెమ్మలది సామాన్య రైతు కుటుంబం. ఆ దంపతులకు శమంత, లక్ష్మణ్, మాధవి, భాస్కర్, అరుణ సంతానం. రెండవ సంతానమైన లక్ష్మణ్ 1966 జూన్ 2న తన అమ్మమ్మగారి ఊరైన ఇంద్రపాలనగరం(తుమ్మలగూడెం)లో జన్మించారు. బోగారం ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి వరకు. రామన్నపేట ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో 10వ తరగతి వరకు, ఇంటర్ రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తిచేశారు. ఆమీర్పేటలోని న్యూసైన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన లక్ష్మణ్ నెల్లూరు వీఆర్ లా కాలేజీలో ఎల్ఎల్బీ చదివి పట్టా పొందారు. 1993లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. న్యాయవాదిగా రాణింపు సీనియర్ న్యాయవాది ఎం.రాధాకృష్ణమూర్తివద్ద జూనియర్గా చేరి వృత్తికి సంబంధించిన మెళకువలను లక్ష్మణ్ నేర్చుకున్నారు. 1999 నుంచి సొంతంగా ప్రాక్టీసు ప్రారంభించారు. కొద్దిరోజులకే మంచి న్యాయవాదిగా పేరు సంపాదించారు. యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు న్యాయవాదిగా వ్యవహరించడంతోపాటు, సివిల్, లేబర్, రాజ్యాంగసంబంధ కేసుల్లో ప్రావీణ్యం సాధించారు. 2017లో అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్గా కొనసాగుతున్నారు. ఆయనకు భార్య మంజుల, శ్రీజ, హిమజ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కృష్ణాష్టమిరోజున జన్మించిన లక్ష్మణ్ అదే రోజునే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడం విశేషం. గర్వంగా ఉంది నా కుమారుడు అత్యున్నతమైన హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. చిన్నప్పటి నుంచి చదువు మీదనే ఎక్కువ శ్రద్ధ చూపేవాడు. ఆడంబరాలకు పోయేవాడు కాదు. తాను ఏ పనితలపెట్టినా పట్టుదలతో పూర్తిచేసేవాడు. వృత్తి నిర్వహణలో తీరిక దొరకక పోయినప్పటికీ మా యోగక్షేమాలు చూసుకోవడం మాత్రం మరచిపోడు. –గోపాల్–సత్తెమ్మ, న్యాయమూర్తి తల్లిదండ్రులు -
వెంబడించి కారుతో ఢీకొట్టి.. వ్యక్తి దారుణ హత్య
సాక్షి, వలిగొండ (భువనగిరి) : పట్టపగలే ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన వలిగొండ మండలం సంగెం గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగెం గ్రామానికి చెందిన బోయిని శంకరయ్య (62)ఒగ్గు కథలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వృతిలో భాగంగా శుక్రవారం కైతపురంలో ఓగ్గు కథ చెప్పి బైక్పై స్వగ్రామానికి వస్తున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కారులో వెంబడించి సంగెం గ్రామ సమీపములో ఢీకొట్టారు. దీంతో శంకరయ్య రోడ్డుపక్కన పడిపోవడంతో వెంటనే కొంత మంది దుండగులు కారు దిగి శంకరయ్య మెడ చెవులు కోసి శరీరంపై ఉన్న నగలను తీసుకెళ్లారు. మెడ భాగములో తీవ్ర రక్తస్రావం కావడంతో శంకరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. అటు వైపు వెళుతున్న వాహనదారులు సమాచారం ఇవ్వడముతో ఎస్సై శివనాగ ప్రసాద్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఎస్ఐ ఇచ్చిన మాచారం మేరకు డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ సత్తయ్య ఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. ఘటన స్థలంలో క్లూస్ టీమ్ తనిఖీలు చేసి ఆధారాలు సేకరించారు అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంగారు ఆభరణాల కోసం హత్య చేశారా..? మరో కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. -
బురిడీ బాబాలకు దేహశుద్ధి
సాక్షి, రాజాపేట(నల్గొండ) : బాబాజీల పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసిన బురిడీ బాబాలకు దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడకు చెందిన ముగ్గురు బాబాజీలు రఘునాథపురం గ్రామంలో ఉదయం నుంచి సాధనాసురులమంటూ జాతకం చెబుతామంటూ ఇంటింటికీ తిరిగి ప్రజలను నమ్మబలికిం చారు. భయబ్రాంతులకు గురిచేస్తూ మోసపూరితమాటలతో ప్రజల నుంచి కొంతడబ్బు వసూలు చేశారు. వీరిపై మధ్యాహ్నం గ్రామస్తులకు అనుమానం రావడంతో వారిని నిలదీశారు. వారి ఆధార్ కార్డులను తీసుకుని చూసి అనుమానం రావడంతో మొసం చేస్తున్నారని గుర్తించి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాబాజీలను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కమలం గూటికి మోత్కుపల్లి?
సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాషాయం కండువా కప్పుకోబోతున్నారా.. అందుకు ముహూర్తం కూడా ఖరారైందా.. అంటే అవుననే చెబుతున్నాయి తాజా పరిస్థితులు. బీజేపీ రాష్ట్ర నాయకులు రెండు రోజుల క్రితం హైదరాబాద్లో మోత్కుపల్లి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం, మోత్కుపల్లి సుముఖత వ్యక్తం చేయడం, వెంటనే తన అనుచరులతో మంతనాలు జరపడం అందుకు బలా న్ని చేకూరుస్తున్నాయి. సాక్షి, యాదాద్రి : తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన బీజేపీ జాతీయ నాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇతర పార్టీల్లో మంచి పేరుండి, జనబలం కలిగిన రాష్ట్ర స్థాయి నేతలను తమ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును బీజేపీలోకి తీసుకురావడానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి శనివారం హైదరాబాద్లోని మోత్కుపల్లి నర్సింహులు ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై పరస్పరం చర్చించిన అనంతరం మోత్కుపల్లి బీజేపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నెల 25న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు మోత్కుపల్లి ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. కాగా భారీ అనుచరగణంతో పార్టీలో చేరడానికి మోత్కుపల్లి సిద్ధం అవుతున్నారు. కార్యకర్తలు, తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. బీజేపీకి పెరగనున్న బలం ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు ఉమ్మడి ఆ«ంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెలుగు వెలిగిన మోత్కుపల్లి నర్సింహులు.. తమ పార్టీలో చేరడం వల్ల లాభిస్తుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలు స్తోంది. మోత్కుపల్లి బీజేపీలో చేరితే మరో మారు ఆయన రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల కం అయ్యే అవకాశం లేకపోలేదు. మోత్కుపల్లి చేరికతో రాష్ట్రంలో బీజేపీకి అదనపు బలం చేకూరే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. అప్పట్లో చంద్రబాబుపై ధ్వజం టీటీడీపీలో సీనియర్ నేత అయిన మోత్కుపల్లి నర్సింహులు తనకు గవర్నర్ పదవి వస్తుందని చంద్రబాబుహామీతో అప్పట్లో మూడేళ్లుకు పైగా ఎదురుచూశారు. గవర్నర్ పదవి ఇప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. పేదవాడిని కావడం వల్లే పదవులు రావడం లేదని ఆయన చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు.టీడీపీలో సామాజిక న్యాయం లేదని కోట్ల రూపాయలకు ఎంపీ టికెట్లు అమ్ముకున్నాడని ఆరోపణలు చేశారు. తెలంగాణలో టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని, టీఆర్ఎస్లో విలీనం చేయాలని ఒకానొక సమయంలో సంచలన ప్రకటన చేశా డు. దీంతో గత ఎన్నికల ముందు మోత్కుపల్లిని టీడీపీ నాయకత్వం పార్టీ నుంచి బహిష్కరించిం ది. అనంతరం మోత్కుపల్లి ప్రజావేదికను పునరుద్ధరించి చంద్రబాబు ఓటమి లక్ష్యంగా తనదైన శైలిలో పని చేశారు. అయితే ఒకానొక దశలో టీఆర్ఎస్లో చేరుతున్నారన్న ప్రచారం ఎన్నికల ముందు జోరుగా సాగింది. అయితే ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గంలో బీఎల్ఎఫ్ మద్దతుతో ఆలేరులో పోటీ చేసి ఓడిపోయారు. కొంత కాలంగా మౌనంగా ఉన్నారు. మోత్కుపల్లి రాజకీయ ప్రస్థానం 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశంను స్థాపించినప్పుడు మోత్కుపల్లి విద్యార్థి దశలోనే పార్టీలో చేరారు. 1983లో జరిగిన ఎన్నికల్లో ఆయన తొలిసారిగా ఆలేరు నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 1985 లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ప్రత్యేక కారణాలతో టీడీపీనుంచి టికెట్ రాకపోవడంతో 1989లో ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు, 1994 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ నుం చి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అ నంతరం చోటు చేసుకున్న పరిణామాలతో 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలేరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో టీడీపీ తరఫున ఆలేరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2008లో మరోసారి ఆలేరులో జరిగిన ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2009లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2014లో ఖమ్మం జిల్లా మధిరలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1991లో నంద్యాల లోక్సభకు జరిగిన ఉప ఎన్నికలో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావుపై పోటీ చేసి ఓడిపోయారు. విద్యార్థి దశనుంచే రాజకీయాల్లోకి.. మోత్కుపల్లి నర్సింహులు విద్యార్థి దశలోనే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరా రు. సుధీర్ఘకాలం పాటు ప్రజాప్రతినిధిగా పని చేశారు. ఎన్టీఆర్ మంత్రి వర్గంలో గనులు, వి ద్యుత్ శాఖ, సాంఘిక సంక్షేమం, టూరిజం శా ఖ మంత్రిగా వేర్వేరు సమయాల్లో పని చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ మోత్కుపల్లి నర్సింహులు ఓ వెలుగు వెలిగారు. -
యాదాద్రిలో కలకలం: జింక మాంసంతో విందు
సాక్షి, యాదాద్రి: జింకను వేటాడటమే కాక దాన్ని వండుకుని తిన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోత్కూర్ మండలంలోని కొండాపురం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు.. జింకను వేటాడి, వండుకుని తిన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై అధికారులు గురువారం దర్యాప్తు చేపట్టగా జింక మాంసాన్ని ఆరగించిన విందులో రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని అటవీశాఖ అధికారులు తెలిపారు. -
కూరెళ్లకు దాశరథి పురస్కారం
రామన్నపేట : ప్రముఖ సాహితీవేత్త, రచయిత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను దాశరథి పురస్కారం వరించింది. జూలై 22న దాశరథి కృష్ణమాచార్యులు జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం దాశరథి పురస్కారాన్ని అందజేస్తోంది. 2019 సంవత్సరానికిగాను ప్రభుత్వం కూరెళ్లను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన కూరెళ్ల లక్ష్మమ్మ–వెంకటరాజయ్యల కుమారుడు కూరెళ్ల విఠలాచార్య. ఆయన ఏడవ తరగతి నుంచే తన రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించారు. కూరెళ్ల రాసిన 18కి పైగా గ్రంథాలు ఇప్పటివరకు ముద్రితమయ్యాయి. ఆయన సాహితీరంగానికే పరిమితంకాక జిల్లా వ్యాప్తంగా పలు సాంస్కృతిక సంస్థలు, యువజన సంఘాలను నెలకొల్పి సామాజిక సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. ఆయనకు మధురకవి, అభినవ పోతన, తెలంగాణ వేమన, నల్లగొండ కాళోజీ తదితర బిరుదులు ఉన్నాయి. -
హాజీపూర్ బాధితుల దీక్ష భగ్నం
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్లో జరిగిన బాలికల హత్య కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్రెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలని కోరుతూ బాధిత కుటుంబాలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను శనివారం తెల్లవారుజామున రాచకొండ పోలీసులు భగ్నం చేశారు. దీంతో ఆగ్రహించిన బాధితుల బంధువులు, గ్రామస్తులు బాలికలను చంపి పూడ్చి పెట్టిన తెట్టెబావిలోకి దిగి మరోసారి నిరసనకు దిగారు. దీంతో కలెక్టర్ స్పందించి స్థానిక అధికారులు, నాయకులతో ఫోన్లో చర్చలు జరిపారు. బాధితులతో తాను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని కలెక్టరేట్కు రావాలని కోరారు. నిరసన చేస్తున్న వారు అందుకు అంగీకరించి బావిలోంచి బయటకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ వద్దకు వచ్చి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వపరంగా న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. వివరాల్లోకి వెళ్తే.. హత్యకు గురైన ముగ్గురు బాలికల కుటుంబాలు, బంధువులు, గ్రామస్తులు బొమ్మలరామారంలో గురువారం నుంచి ఆందోళన చేస్తున్నారు. న్యాయం చేయాలని కోరుతూ చేపట్టిన నిరాహార దీక్ష మూడో రోజుకు చేరడంతో వారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో వైద్యులు పరీక్షలు నిర్వహించి ఇచ్చిన నివేదిక ఆధారంగా దీక్ష శిబిరంలో నిద్రిస్తున్న బాధితులను శనివారం తెల్లవారుజామున సుమారు రెండున్నర గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 22 మందిని మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం గుడిబావి చౌరస్తా వద్ద ఉన్న దీక్ష శిబిరాన్ని తొలగించి ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దించారు. దీక్షలో కూర్చుని అనారోగ్యం బారిన పడిన పక్కీరు రాజేందర్రెడ్డి, పాముల ప్రవీణ్లను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి ఫ్లూయిడ్స్ ఎక్కించారు. వారి ఆరోగ్యం కొంత వరకు మెరుగుపడ్డాక తిరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు. శనివారం ఉదయం మొదటి విడతలో 15 మందిని వదిలివేశారు. మిగతా వారిని తర్వాత వదిలేశారు. కొనసాగుతున్న పోలీస్ పికెట్ ఆందోళనలతో అట్టుడుకుతున్న హాజీపూర్ గ్రామంలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. వరుస హత్యలు వెలుగు చూసిన నాటినుంచి గ్రామంలో పోలీసు పహారా ఏర్పాటు చేశారు. కాగా, శాంతియుతంగా కొనసాగుతున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారనే సమాచారంతో గ్రామంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుం ది. గ్రామంలోని మహిళలందరూ కలసి బొమ్మలరామారం మండల కేంద్రంలో ధర్నా, రాస్తారోకో చేసేం దుకు సిద్ధమయ్యారు. అనంతరం దీక్షలో పాల్గొన్న వ్యక్తులను విడిచి పెట్టారని తెలిసి ధర్నా ప్రయత్నా న్ని విరమించారు. పోలీసులు వదలిపెట్టాక బాలికల ను హత్య చేసిన బావిలోకి దిగి నిరసన చేట్టారనే సమాచారంతో తెట్టెబావి వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. తెట్టె బావిలోకి దిగిన బాధితులు ప్రభుత్వం తాము శాంతియుతంగా చేపట్టిన దీక్షను భగ్నం చేసిందని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బాధిత కుటుంబాల సభ్యులు శ్రావణి, మనీషాలపై అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన తెట్టెబావిలోకి దిగి అరగంటకుపైగా నిరసన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించి బావి నుంచి బయటకు వచ్చారు. తర్వాత కలెక్టర్ను కలసి తమ డిమాండ్లను వివరించారు. బాధితుల డిమాండ్లను సావధానంగా విన్న కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డిలు చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నా కొడుకును ఉరి తీయాలి శ్రీనివాస్రెడ్డి తండ్రి బాల్రెడ్డి బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ వరుస హత్యల కేసులో తన కొడుకు మర్రి శ్రీనివాస్రెడ్డిని ఉరితీయాలని నిందితుడి తండ్రి బాల్రెడ్డి శనివారం మీడి యా ముందు కోరారు. శ్రీనివాస్రెడ్డి దురాగతాలు తమకు తెలియవన్నారు. గతంలో కర్నూల్లో ఓ కేసు విషయమై బెయిలుపై విడిపించామని తెలిపారు. శ్రావణి హత్యకు పాల్పడినప్పుడు మృతదేహాన్ని వెలికి తీస్తున్న సమయంలో తమతోపాటే తన కుమారుడు శ్రీనివాస్రెడ్డి బావి వద్దనే ఉన్నాడన్నారు. మృతదేహాన్ని వెలికి తీసే సమయంలో, మరుసటి రోజు అతని ముఖంలో ఎలాంటి భ యం, ఆందోళన కనిపించలేదన్నారు. ఏదైనా పనిచేయాలని చెబితే తనవైపు ఉరిమి చూసేవాడని బాల్రెడ్డి వెల్లడించారు. అనుమానంతో పోలీసులు ఇంటికి వస్తే ఈ హత్యలలో నీ హస్తం ఏమైనా ఉందా? అని అడిగితే.. ‘నీకేం భయం వద్దు. ఆ హత్యలతో నాకేం సంబంధం లేదు’అని బుకాయించాడన్నారు. ఆధారాలు లభించవు అన్నాడు శ్రావణి పోస్ట్మార్టంలో అన్ని విషయాలు బయటæపడతాయని తాను కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు శ్రీనివాస్రెడ్డి తనకేమీ పట్టనట్లుగా ఉన్నాడని అతని సోదరుడు మర్రి సుధాకర్రెడ్డి తెలిపారు. మృతదేహం కుళ్లిపోయిందని.. పోస్టుమార్టంలో కూడా ఆధారాలు లభించవని శ్రీనివాస్రెడ్డి బుకాయించాడని పేర్కొన్నారు. తన సోదరుడు ఇలాంటి క్రూరుడనే విషయం తెలిసి చాలా బాధపడుతున్నామని తెలిపారు. తాను కష్టపడి కట్టుకున్న ఇంటిని ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తన సోదరుడు చేసిన పనికి తమను ఎవరూ రానివ్వడం లేదని, హైదరాబాద్ బస్టాండ్లలో తల దాచుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్కు వినతిపత్రం అందిస్తున్న బాధిత కుటుంబాలు బాధితుల డిమాండ్లు ఇవీ.. - నిందితుడు శ్రీనివాస్రెడ్డిపై నిర్భయ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి ఉరిశిక్ష పడేట్టు చేయాలి. దీనిని ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా పరిష్కరించాలి. - ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. - బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. - హజీపూర్–మాచన్పల్లి మధ్యన శామీర్పేట వాగుపై బ్రిడ్జిని నిర్మించాలి. హజీపూర్, మైసిరెడ్డిపల్లి, తిరుమలగిరి, నాగినేనిపల్లికి బస్సు సౌకర్యం కల్పించాలి. - నిందితుడు శ్రీనివాస్రెడ్డికి సంబంధించిన భూమిని బాధిత కుటుంబాలకు పంచాలి. -
మేడిచెట్టుకు సైకో శ్రీనివాస్రెడ్డి పూజలు
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడి అమానుషంగా చంపిన సైకో కిల్లర్ శ్రీనివాస్రెడ్డి దినచర్యలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఎవరితోనూ పెద్దగా స్నేహంగా ఉండని శ్రీనివాస్రెడ్డి గ్రామ సమీపంలోని శమాసుల బావి వద్ద గల మేడిచెట్టుకు నిత్యం పూజలు నిర్వహించేవాడు. శ్రీనివాస్రెడ్డి అరాచ కాలు వెలుగులోకి రాక ముందు నుంచే ఈ మేడిచెట్టుకు అతను పూజలు నిర్వహించేవాడని తెలుస్తోంది. మేడిచెట్టు ఉన్న ప్రాంతంలోనే వేప, రాగి చెట్లు కూడా ఉన్నాయి. ఏమైనా దోషాలు ఉంటే నివారణ కోసం చెట్లకు పూజలు చేయడం సాధారణం. మరి కొందరు తమకు అంతా శుభం జరగాలనే ఇలాంటి చెట్లకు పూజలు నిర్వహిస్తారు. అదే కోణంలో శ్రీనివాస్రెడ్డి మేడిచెట్టుతో పాటు రాగి, వేప చెట్లకు పూజలు చేయడాన్ని గ్రామస్తులు పట్టించుకోలేదు. శ్రీనివాస్రెడ్డి దారుణాలు వెలుగులోకి వచ్చిన తర్వాత పూజలపై ప్రజలు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. మేడిచెట్టుపై మూడు పేర్లు శ్రీనివాస్రెడ్డి నిత్యం పూజచేసే మేడిచెట్టుపై మూడు పేర్లు చెక్కి ఉన్నాయి. అందులో ఒక పేరు మనీషాది కనిపిస్తోంది. మరో రెండు శ్రావణి, కల్పన పేర్లుగా భావిస్తున్నారు. రోజూ ఈ చెట్ల వద్దకు వచ్చే శ్రీనివాస్రెడ్డి నీళ్లు పోసి పసుపు, కుంకుమ బొట్లను చెట్టు మొదట్లో పెట్టి పూజలు చేసేవాడని సమాచారం. హత్యలు వెలుగులోకి వచ్చినా పూజలు.. నిందితుడు మర్రి శ్రీనివాస్రెడ్డి మేడిచెట్టు, రాగి, వేప చెట్లకు చేస్తున్న పూజల వెనక బలమైన కారణం ఉందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. శ్రీనివాస్రెడ్డి దారుణాలలో మొదటగా వెలుగులోకి వచ్చిన శ్రావణి హత్య అనంతరం కూడా ఈ చెట్లకు పూజలు కొనసాగించాడని తెలిసింది. హాజీపూర్ గ్రామంతోపాటు మండల ప్రజలందరూ భువనగిరి జిల్లా ఆస్పత్రికి శ్రావణి మృతదేహంతో ధర్నాకు వెళ్తుంటే ఇతను మాత్రం ఈ మేడి, రాగి, వేప చెట్లకు పూజలు చేస్తూ గ్రామస్తుల కంట్లో పడ్డాడు. బాలికలపై దారుణాలకు ఒడికట్టింది శ్రీనివాస్రెడ్డేనని తెలియక ఈ అంశాన్ని గ్రామస్తులు పెద్దగా పట్టించుకోలేదు. మూడు హత్యలకు పాల్పడి.. ఎలాంటి బెరుకు లేకుండా చెట్లకు పూజలు చేయడమేంటని హాజీపూర్ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
‘మనీషా హత్య కూడా ఆ రోజే బయట పడేది’
సాక్షి, యాదాద్రి : శ్రావణి మృతదేహం తీసిన రోజే కాస్తా లోతుగా దర్యాప్తు చేసి ఉంటే.. మనీషా హత్య కూడా వెలికి వచ్చేదన్నారు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శ్రావణి మృతదేహం దొరికిన బావిలోనే డిగ్రీ విద్యార్థిని మనీషా శవం బయటపడ్డ సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కోమటిరెడ్డి.. తెలంగాణలో కనీస మానవత్వం లేని ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డమ్మీ హోం మినిస్టర్తో సీఎం పాలన సాగిస్తున్నారన్నారు. ఇప్పటికే ఇంటర్ బోర్డ్ వైఫల్యంతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతుండగా.. మరోవైపు ఆడపిల్లలకు రక్షణ కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు హత్యకు గురయ్యారని.. దీనిపై సీఎం, హోం మినిస్టర్తో సహా కనీసం జిల్లా మంత్రి కూడా స్పందిచలేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. జిల్లాలో జోరుగా గంజాయి దందా సాగుతుందన్నారు. పోలీసులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని.. ఫలితంగా పెద్ద ఎత్తున యువత మత్తుకు బానిసలవుతున్నారని పేర్కొన్నారు. కాగా, శ్రావణి, మనీషా కుటుంబాలకు కోమటిరెడ్డి.. చెరో యాభై వేల రూపాయల తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేశారు. -
కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు
-
‘గొంగిడి’కి నిరసన సెగ
రాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు టీఆర్ఎస్లోని అసంతృప్త వర్గం నుంచి నిరసన ఎదురైంది. ఆదివారం ఆలేరు నియోజకవర్గంలోని రాజాపేట మండలం చల్లూరు గ్రామానికి ఆమె ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ క్రమంలో డప్పు వాయిద్యాలు నిర్వహిస్తున్న బొద్దు సురేశ్ ఎమ్మెల్యేకు అడ్డుగా ఉండటాన్ని గమనించి పక్కకు జరగమని ఓ వ్యక్తి అనడంతో గొడవ మొదలైంది. దీంతో అసంతృప్త వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు కలుగజేసుకుని ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్లో పనిచేస్తున్న నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఘర్షణకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. గొడవకు కారణమైన బొద్దు సురేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మనస్తాపానికి గురైన అతను ఒంటిపై పెట్రోల్ పోసుకోవటంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు, టీఆర్ఎస్ అసంతృప్తవాదుల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ అర్ధనగ్నంగా వారి వాహనం ఎదుట బైఠాయించి, పోలీసుల జులుం నశించాలి, సునీత గో బ్యాక్, కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు కలుగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. -
ప్రియురాలి దీక్ష.. విషం తాగిన ప్రియుడు..
సాక్షి, యాదాద్రి భువనగిరి : ప్రేమించినవాడు పెళ్లి చేసుకోమంటే బుకాయిస్తూ, మరో పెళ్లికి సిద్ధపడుతున్నాడని ఓ యువతి అతడి ఇంటి ముందు దీక్షకు దిగింది. ఈ ఘటన జిల్లాలోని వలిగొండ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన పల్లపు జ్యోతి వలిగొండకు చెందిన రావుల భాస్కర్ ప్రేమించుకున్నారు. అయితే, భాస్కర్ వివాహానికి నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ అతడి ఇంటి ముందు జ్యోతి దీక్షకు దిగారు. అప్పటికి వివాహానికి నిరాకరించడంతో వలిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత మూడు రోజులుగా ఫిర్యాదు చేస్తూ పోలీసులు పట్టించుకోవడం లేదంటూ శనివారం స్థానిక వేంకటేశ్వర థియేటర్ పక్కన ఉన్న సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రియుడు భాస్కర్ను వలిగొండ పోలీస్ స్టేషన్కు పిలిపించిన పోలీసులు పెళ్లి చేసుకోవాలని సూచించారు. అందుకు నిరాకరించిన భాస్కర్ ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో అతడిని హుటాహుటిని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
భార్యకు అడ్డంగా దొరికిపోయాడు..
సాక్షి, యాదాద్రి : భర్త అక్రమ సంబంధాలను భార్య బయటపెట్టారు. భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ వివరాలిలా.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ఏఓగా పనిచేసిన హరిప్రసాద్ సస్పెండ్ అయ్యారు. హరిప్రసాద్కు నిర్మల అనే మహిళతో 2002లో వివాహం జరిగింది. అయితే గత రెండేళ్లుగా మయూరి అనే మహిళతో భర్త అక్రమ సంబంధం పెట్టుకుని తనను, తమ పిల్లలను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎన్ని సార్లు చెప్పినా పద్దతి మార్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిన్న రాత్రి నుంచి ఇంటికిరాని భర్తపై అనుమానం వచ్చిన నిర్మల తన సోదరుడు, కొందరు బంధువులతో కలిసి వెళ్లి మయూరితో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిర్మల, సహా ఆమెతో పాటు వచ్చిన బంధువులు హరిప్రసాద్కు, మయూరికి దేహశుద్ధి చేశారు. అనంతరం భర్తను పోలీసులకు అప్పగించారు. కాగా, హరిప్రసాద్ భార్య నిర్మల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. భర్త బాగోతంపై నిర్మల మీడియాతో మాట్లాడుతూ.. హరిప్రసాద్కు మయూరి అనే మహళతో శారీరక సంబంధాలున్నాయి. ఈ కారణంగా గత కొంతకాలం నుంచి నాపై, నా పిల్లలపై దాడులకు పాల్పడుతున్నారు. నా కొడుకుకు ఇటీవల యాక్సిడెంట్ చేశారు. అయినా మమ్మల్ని వదిలిపెట్టడం లేదు. సంవత్సరం నుంచి గొడవ ముదురుతోంది. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో పనిచేసినప్పుడు నా భర్తకు మయూరితో పరిచయం ఏర్పడింది. అక్రమ సంబంధాలపై హెచ్చరిస్తే.. మా ఇద్దరి మధ్య ఏం సంబంధం లేదని బాండ్ పేపర్ల మీద నా భర్త, మయూరి రాసిచ్చారు. అందుకు సంబంధించి వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయని తెలిపారు. కొడుకుకు యాక్సిడెంట్ అయి నేను ఇబ్బంది పడుతుంటే ఆయన మాత్రం వేరే మహిళల వద్దకు వెళ్తున్నాడంటూ హరిప్రసాద్ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లావ్ అని అడిగితే విజయవాడ వెళ్లానంటూ బుకాయిస్తున్నారు. తెల్లారేసరికల్లా ఇంటికి వచ్చేయాలి కానీ వేరే మహిళ ఇంటికి ఎందుకు వచ్చాడని భర్తను నిలదీశారు. -
భర్త అక్రమ సంబంధం..రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య
-
చేతిలో సిగరెట్.. కాళ్ల మధ్య స్టీరింగ్
సాక్షి, యాదాద్రి/వలిగొండ : డ్రైవర్ 60 ఏళ్ల వృద్ధుడు.. లైసెన్స్ లేదు.. గతంలో డ్రైవింగ్ చేసిన అనుభవం అంతకంటే లేదు.. ఇటీవల నేర్చుకొని ట్రాక్టర్ స్టీరింగ్ పట్టాడు.. 30 మందిని ఎక్కించుకున్నాడు.. వీటన్నింటికితోడు అంతులేని నిర్లక్ష్యం.. సిగరెట్ వెలిగించుకునేందుకు స్టీరింగ్ను కాళ్లకు అప్పగించాడు.. అంతలోనే చిన్న కుదుపు.. కంట్రోల్ చేసేందుకు బ్రేకు తొక్కాడు.. అయినా అదుపు తప్పింది.. పక్కనే ఉన్న మూసీ కాల్వలోకి బోల్తా కొట్టింది.. చూస్తుండగానే ట్రాలీ తిరగబడి 15 మంది నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి! మృతుల్లో 14 మంది మహిళలు, నాలుగేళ్ల బాలుడు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామంలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదమిదీ!! బయల్దేరిన ఐదు నిమిషాలకే అమాయకులైన నిరుపేద కూలీలు జలసమాధి అయ్యారు. మరో పది నిమిషాల్లో చేనుకు చేరి పనులు చేసుకునే వారి బతుకులు డ్రైవర్ నిర్లక్ష్యంతో తెల్లారిపోయాయి. ఎలా జరిగిందంటే..? వేములకొండలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమిని వెంకటనారాయణ మూడు సంవత్సరాలుగా కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా సాగుకు సిద్ధమయ్యాడు. ఇటీవల వర్షం కురవడంతో ఆదివారం పత్తి విత్తనాలు వేసేందుకు తన ట్రాక్టర్ఈ ట్రాక్టర్(ఏపీ16 ఏబీ 8775)లోనే లోనే 30 మంది కూలీలను తీసుకుని చేనుకు బయల్దేరాడు. కూలీలకు పంచేందుకు స్వీటు డబ్బా కూడా తీసుకుని వెళ్లాడు. ట్రాక్టర్ ఇంజిన్పై వెంకటనారాయణతోపాటు మరో ఐదుగురు కూర్చున్నారు. డ్రైవర్ వెనుక చెక్కపై ముగ్గురు, రెండువైపులా టైర్లపైన ఒక్కొక్కరు చొప్పున కూర్చున్నారు. ఇది పాత మోడల్ ట్రాక్టర్. టైర్లు పూర్తిగా అరిగిపోయాయి. కొంతకాలంగా వాడటం లేదు. కూలీలను తీసుకెళ్లేందుకు ఆదివారమే బయటకు తీశాడు. రెండు బ్రేక్లు ఒకేసారి కొడితేనే ట్రాక్టర్ నిలకడగా ఆగుతుంది. ఎడమ, కుడి బ్రేక్లలో ఏ ఒక్కదాన్ని నొక్కినా ట్రాక్టర్ అటువైపే లాగుతుంది. కూలీలతో బయల్దేరిన ఐదు నిమిషాలకు సిగరెట్ ముట్టించేందుకు వెంకట నారాయణ రెండు చేతులు విడిచిపెట్టి స్టీరింగ్ను రెండు కాళ్ల మధ్య పెట్టి తిప్పాడు. ఇదే సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి కుడివైపు ఉన్న మూసీ కాల్వ వైపు మళ్లింది. దీంతో డ్రైవర్ కుడి వైపు బ్రేక్ తొక్కడంతో ట్రాక్టర్ ట్రాలీ కూడా అటువైపే ఒరిగింది. అది నల్లరేగడి భూమి కావడం, శుక్రవారం కురిసిన వర్షానికి నానడంతో స్కిడ్ అయి ట్రాలీ కాల్వలో పడిపోయింది. గుర్రపు డెక్క.. పట్టా.. ట్రాక్టర్ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి గుర్రపు డెక్క కూడా కారణంగా కనిపిస్తోంది. మూసీ కాల్వ వెంట గుర్రపు డెక్క ఏపుగా పెరిగి ప్రమాదకరంగా మారింది. ట్రాలీ తిరగడి పడిపోవడం, అందులోని కూలీలు గుర్రపు డెక్క మధ్య చిక్కుకుపోవడంతో బయటపడే మార్గం మూసుకుపోయింది. అలాగే ట్రాలీలో కూర్చునేందుకు యూరియా బస్తాల పట్టా పరిచారు. కాల్వలో ట్రాక్టర్ పడిపోగానే ఇది కూడా కూలీలపై పడిపోయి ఊపిరి ఆడకుండా చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే వెంకటరమణ అక్కడ్నుంచి పారిపోయాడు. మృతులు వీరే.. జడిగె మారమ్మ( 55), ఎనుగుల మాధవి (26), బందారపు స్వరూప (35), పంజాల భాగ్యమ్మ (27), బీసు కవిత (27), కాడిగల్ల లక్ష్మమ్మ (35), మనీషా (18), కాడిగల్ల నర్మద( 25), ఇంజమూరి శంకరమ్మ (30), ఇంజమూరి నర్సమ్మ (50), అంబాల రాములమ్మ(50), అరూరు మణెమ్మ (30), గన్నెబోయిన అండాలు( 35), బోయ శంకుతల(23), మల్లిఖార్జున్ (4). వీరిలో కాడిగల్ల లక్ష్మమ్మ, మనీషాలు తల్లికూతుళ్లు. మృతదేహాలకు వేములకొండలోని పీహెచ్సీలో పోస్టుమార్టం నిర్వహించారు. బయటపడిన 15 మంది.. ప్రమాదంలో 15 మంది గాయాలతో బయటపడ్డారు. వారిలో కాడిగల్ల అఖిల, కాడిగల్ల హేమలత, గన్నెబోయిన మంజుల, రత్నకుమారి, జోగు శాంతమ్మ, మట్టిపల్లి లక్ష్మమ్మ, ఇంజమూరి లక్ష్మమ్మ , రాపోలు జయమ్మ, బొంగు లక్ష్మమ్మ, కాడిగల్ల తేజ, అంబుల సోమమ్మ, కోట అనిత, బొంత మంజుల, కాడిగల్ల ఇందిర ఉన్నారు. వీరిని రామన్నపేట, భువనగిరి ఏరియా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ఏడాది క్రితం తండ్రి.. ఇప్పుడు తల్లి.. వేములకొండకు చెందిన సుంచు నర్మద (25) భర్త నరేశ్ గతేడాది ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆమె గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆమెకు మహీదర్(6), అవంతిక(4) సంతానం. గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్గా శిక్షణ పొందుతోంది. నర్మద సాధారణంగా కూలీకి వెళ్లదు. ఆదివారం రోజు ఇంటి దగ్గర ఉండలేక తన చెల్లి మనీషతో కలసి పత్తి గింజలు పెట్టేందుకోసం వెళ్లింది. ప్రమాదంలో నర్మద మృతి చెందగా, శిరీష ట్రాక్టర్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకుంది. ఇప్పటికే తండ్రి చనిపోగా, ఇప్పుడు తల్లి మరణించడంతో పిల్లలు మహీదర్(6), అవంతిక అనాథలయ్యారు. అమ్మమ్మ, మేనత్త, పిన్నిల వద్దకు వెళ్లి అమ్మ కావాలంటూ చిన్నారులు ఏడ్వడంతో చూసినవారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయ్యో పాపం..! చౌటుప్పల్: పొట్ట చేతపట్టుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఓ కుటుంబం ట్రాక్టర్ ప్రమాదంతో ఛిన్నాభిన్నమైంది. కర్నూలు జిల్లా ఆధోని గ్రామానికి చెందిన బోయ పరశురాం(35).. భార్య శకుంతల(30), నాలుగేళ్ల కుమారుడు మల్లిఖార్జున్తో కలిసి 15 రోజుల క్రితం జీవనోపాధి కోసం భువనగిరి జిల్లా వేములకొండకు వచ్చారు. గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఇంటి వద్ద కుమారుడి ఆలనాపాలనా చూసే వాళ్లు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెంట తీసుకెళ్తున్నారు. ఆదివారం కూడా ముగ్గురు కలిసి ట్రాక్టర్లో ఎక్కారు. బాలుడు తల్లి ఒడిలో కూర్చోగా పరశురాం ట్రాలీ వెనుక భాగంలో బాడీపై కూర్చున్నాడు. ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతిచెందగా పరశురాం ప్రాణాలతో బయటపడ్డాడు. మేమే బయటకు తీశాం ట్రాక్టర్ బోల్తా పడిందని తెలియగానే పరుగున వచ్చాం. 15 మంది చనిపోయారు. వారందరినీ బయటకు తీశాం. మరో ఏడుగురికి కాళ్లు, చేతులు విరిగాయి. వారిని బయటకు తీసి ఆస్పత్రికి పంపించాం. – ఏర్పుల యాదయ్య, వేములకొండ పట్టా చుట్టేసింది ట్రాక్టర్ బోల్తా పడిన సమయంలో ట్రాలీలో కూర్చున్న మహిళలంతా నీటిలో పడిపోయారు. వారిపై ట్రాలీ పడింది. మహిళలు కూర్చునేందుకు ట్రాలీలో పట్టా ఏర్పాటు చేశారు. అది మహిళలను చుట్టేసింది. లోపల ఉన్న వారు బయటకు రాలేకపోయారు. పైన బçస్తా పట్టా, ఆపై ట్రాలీ ఉండడంతో ఊపిరాడక చనిపోయారు. – గుడెళ్ల శ్రీహరి, ప్రత్యక్ష సాక్షి ఊపిరాడకే చనిపోయారు: పోస్టుమార్టం నివేదిక ట్రాక్టర్ ప్రమాద మృతుల పోస్టుమార్టం నివేదికను వైద్యులు విడుదల చేశారు. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్లే కూలీలంతా చనిపోయినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోట్యానాయక్ ‘సాక్షి’కి తెలిపారు. ఛాతీపై బరువు పడడంతో 9 మంది, నీళ్లు మింగి ఆరుగురు చనిపోయినట్టు నివేదికలో పేర్కొన్నారు. కాగా ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వెంకటనారాయణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముందే హెచ్చరించిన సాక్షి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాల్వ కట్టలు బలహీనంగా, ఇరుకుగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ‘సాక్షి’ముందే హెచ్చరించింది. ఏప్రిల్ 6న పెద్ద అడిశర్లపల్లి మండలం పడమటితండాలో కాల్వలో ట్రాక్టర్ బోల్తా పడి తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. ఆ సమయంలో ఉమ్మడి జిల్లాలోని మూసీ, ఏఎమ్మార్పీ, ఎస్ఎల్బీసీ కాల్వ కట్టల పరిస్థితిపై ‘సాక్షి’ప్రత్యేక ఫొటో ఫీచర్ ప్రచురించింది. ఎక్కడెక్కడ ప్రమాదం పొంచి ఉందో వివరించింది. అయినా అధికారుల్లో చలనం రాకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కేసీఆర్ దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉత్తమ్, జానా సంతాపం వేములకొండలో జరిగిన ప్రమాదంపై కాంగ్రెస్ సంతాపం వ్యక్తం చేసింది. ఈ ఘటన చాలా బాధాకరమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. -
చేతబడి చేస్తున్నాడని...
సాక్షి, యాదాద్రి భువనగిరి: మంత్రతంత్ర విద్యలతో చేతబడి చేస్తున్నాడన్న కారణంగా ఓ వృద్ధుడిని గ్రామస్తులు చెట్టుకు కట్టేసి కొట్టారు. దీంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన చౌటుప్పల్ మండలం తంగడిపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. చిత్రాల కిష్టయ్య(80) అనే వృద్ధుడు చేతబడి చేస్తున్నాడని గ్రామస్తుల నమ్మకం. అయితే... ఇటీవల గ్రామంలో పలువురు జబ్బుపడ్డారు. కిష్టయ్యే మంత్ర తంత్ర విద్యలతో వారిని అనారోగ్యానికి గురిచేశాడన్న అనుమానంతో గ్రామస్తులు అతడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. దీంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. కొందరు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే స్పందించి గ్రామాన్ని సందర్శించారు. అలాగే కిష్టయ్యపై దాడికి పాల్పడ్డ పలువురిపై కేసు నమోదు చేశారు. -
విషాదం: భార్యాభర్తల ఆత్మహత్య
సాక్షి, యాదాద్రి: దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. యాదగిరిగుట్ట యాదవ్ నగర్లో నివసిస్తున్న మల్లపూరానికి చెందిన బొంత వెంకటేష్(28), అతని భార్య మహేశ్వరి(25)లు తమ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
చెరువులో మునిగి ముగ్గురు యువకుల మృతి
యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎండవేడిమికి తట్టుకోలేక చెరువులో ఈతకెళ్ళిన ముగ్గురు యువకులు నీటిలో మునిగి మృతిచెందారు. ఈ సంఘటన జిల్లాలోని వలిగొండ మండలం జంగారెడ్డిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. మృతులను సాయివినాస్(16), గణేష్(18), శ్రీకాంత్(19)లుగా గుర్తించారు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. గ్రామస్తులు చెరువు వద్దకు చేరి మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
కాసుల కోసం కక్కుర్తి
రాజుపేట(యాదాద్రిభువనగిరి): ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు ఓ వ్యాపారి అక్రమ మార్గంలో వెళ్లి అడ్డంగా దొరికిపోయాడు. యాదాద్రిభువనగిరి జిల్లా రాజుపేట మండలం సోమారం గ్రామానికి చెందిన గడ్డం శ్రీను భువనగిరిలో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల గ్రామ రైతుల నుంచి ఇటీవల దాదాపు 60 క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశాడు. కందులను రైతు పేరుతో భువనగిరి మార్కెట్లో మద్దతు ధరకు విక్రయించి సుమారు రూ.3 లక్షల మేర అతడు లాభం పొందాడు. అనుమానం వచ్చిన విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టగా శ్రీనుకు వరి పొలం, మామిడితోట మాత్రమే ఉన్నాయని, కంది పంట సాగు చేయలేదని తేలింది. దీనిపై సోమవారం వీఆర్వో పద్మ ఫిర్యాదు మేరకు ఎస్సై బీసన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.