పిఠాపురం: గొల్లప్రోలు మండలం తాటిపర్తి శ్రీమార్కండేయ నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో 16వ ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు ఈ నెల 30 నుంచి జరుగనున్నాయి. వీటిని తాటిపర్తిలోని అపర్ణా కళా తోరణం శ్రీబత్తుల మురళీకృష్ణ కళా వేదికపై నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెల 2వ తేదీ వరకూ పోటీలు ఉంటాయని శ్రీమార్కండేయ నాటక కళా పరిషత్ అధ్యక్షుడు పడాల రవి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నాటక రంగంలో గుర్తింపు పొందిన కళాకారులు పాల్గొంటారన్నారు. కొత్త పరిమళం, రైతే రాజు, చీకటి పువ్వు, నాన్న నేనొచ్చేస్తా, వెండి అంచులు, గమ్యస్థానాల వైపు, కాపలా తదితర నాటికలు ప్రదర్శిస్తారన్నారు. కళాభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
శతాధిక వృద్ధుల మృతి
ఉప్పలగుప్తం: ఎన్.కొత్తపల్లి పంచాయతీ పరిధి రాజుపాలేనికి చెందిన శతాధిక వృద్ధుడు పొత్తూరి సత్యనారాయణ రాజు (104) మంగళవారం మృతి చెందాడు. ఆయనకు భార్య వెంకాయమ్మ, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. సత్యనారాయణ గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేసేవారని ప్రజలు తెలిపారు. గొల్లవిల్లిలో సీఎస్ఎమ్ ఇంటర్, ఎమ్ఎస్ఎస్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఆయన సహకరించారు.
అంబాజీపేట: స్థానిక కొర్లపాటివారిపాలేనికి చెందిన శతాధిక వృద్ధురాలు కొర్లపాటి రత్నకుమారి (100) మంగళవారం మృతి చెందారు. రత్నకుమారికి ఒక కుమారుడు, ఐదుగురు కుమార్తెలు, మనుమలు, మనుమరాళ్లు, ముని మునుమలు కలిపి మొత్తం 82 మంది ఉన్నారు. ఆమె మృతికి బంధువులు, గ్రామస్తులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment