![నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/3/02sng50-350047_mr-1738546224-0.jpg.webp?itok=mmBws1qq)
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
● తొలిసారి సీసీ కెమెరాల పర్యవేక్షణలో.. ● ఏర్పాట్లు పూర్తి చేసిన ఇంటర్ విద్యాశాఖ
మెదక్జోన్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 3 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మాస్ కాపీయింగ్ను అరికట్టడంలో భాగంగా ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాక్టికల్ పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించనుంది. పరీక్షల నిర్వహణను ఇంటర్ బోర్డు అధికారులు పర్యవేక్షించనున్నారు.
ప్రతీ కళాశాలలో రెండు సీసీ కెమెరాలు
జిల్లాలో మొత్తం 59 జూనియర్ కళాశాలలు ఉండగా, 16 ప్రభుత్వ, 10 ప్రైవేట్, 33 సెక్టోరియల్ కళాశాలలు ఉన్నాయి. మొదటి సంవత్సరంలో 6,066, ద్వితీయ సంవత్సరంలో 6,418 కలిపి మొత్తం 12,484 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా అన్ని కళాశాలలకు సంబంధించి మొత్తం 7,840 మంది విద్యార్థులు ప్రయోగ పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రాక్టికల్ పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలల్లో రెండు సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ. 12 వేలు విడుదల చేసింది. రెండు కెమెరాలలో ఒకటి ల్యాబ్ లోపల, మరో కెమెరాను ప్రవేశద్వారం దగ్గర ఏర్పాటు చేశారు. దీంతో ప్రయోగ పరీక్షల జరిగే సమయంలో వీడియోతోపాటు ఆడియో కూడా రికార్డు కానుంది.
ప్రశ్నపత్రాలు ఆన్లైన్లో..
ప్రాక్టికల్స్కు సంబంధించిన ప్రశ్న పత్రాలను ఏరోజుకారోజు ఇంటర్బోర్డు ఆన్లైన్లో పొందుపరచనుంది. ఈ ప్రశ్న పత్రాలకు సంబంధించి అరగంట ముందుగానే కళాశాల ప్రిన్సిపాల్ లాగిన్కు మెయిల్ వస్తుంది. దాని ప్రకారం ప్రశ్న పత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రింట్ తీసుకున్న ప్రశ్న పత్రాన్ని విద్యార్థులకు అందజేస్తారు. ప్రశ్న పత్రాలను మాత్రమే సీసీ కెమెరా పర్యవేక్షణలో ఓపెన్ చేసేవారు. కాగా, ఈ ఏడాది ప్రయోగాలను కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment