సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ మరో 2 లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేసింది. ఉండి, నరసరావుపేటలో వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతలకు అధికారులిచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ పిటిషన్లు వేసింది. ఈ పిటిషన్లను అనుమతిచ్చిన ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపి.. స్టేటస్ కో విధించింది. మొత్తం 18 వైఎస్సార్సీపీ కార్యాలయాలు యథాస్థితిలో కొనసాగేలా కోర్టు స్టేటస్ కో ఇచ్చింది.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలపై ఇచ్చిన నోటీసులపై వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే చర్యలు తీసుకోవద్దని.. యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలంటూ బుధవారం ఆదేశాలిచ్చింది. అయితే.. తదుపరి నిర్ణయం వెలువరించేంత వరకు ఆ స్టేను పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
కూల్చివేతలపై అధికారులను నియంత్రించాలంటూ పిటిషన్లు.. అన్ని జిల్లాల్లోని తమ పార్టీ కార్యాలయాల కూల్చివేతలకు పురపాలక శాఖాధికారులు జారీచేసిన షోకాజ్ నోటీసులను, ప్రాథమిక ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ, ఆ పార్టీ నేతలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కూల్చివేతకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలని కోరారు. అలాగే, కూల్చివే తలకు పాల్పడకుండా అధికారులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలంటూ అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అలాగే, గురువారం మరిన్ని వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ గురువారం మరోసారి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సీవీ మోహన్రెడ్డి, పి. వీరారెడ్డి, న్యాయవాదులు వీఆర్ఎన్ ప్రశాంత్, యర్రంరెడ్డి నాగిరెడ్డి, వీఆర్ రెడ్డి, వి. సురేందర్రెడ్డి, ఉగ్రనరసింహ, రాసినేని హరీష్, వివేకానంద విరూపాక్ష తదితరులు సుదీర్ఘ వాదనలు వినిపించగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment