సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించిందనే వాస్తవాన్ని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. మూసీ నది పునరుద్ధరణలో ఇళ్లు కోల్పోతున్న వారికి.. డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే దీనికి నిదర్శనమన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ చేసిన విష ప్రచారం, అబద్ధాలకు తాజా ఉత్తర్వులే సాక్ష్యమని ‘ఎక్స్’వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. ‘మేము నిర్మిస్తే.. మీరు కూల్చేస్తున్నారు.
మాది నిర్మాణం.. మీది విధ్వంసం. లక్షల నిర్మాణాలు మావి.. లక్షల కూల్చివేతలు మీవి. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టలేదని ఇన్నాళ్లూ ప్రజలను మభ్యపెట్టారు. మరి లక్ష ఇళ్లు రాత్రికి రాత్రే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి. మీ జూటా మాటలు, కుట్రలు, మెదడు తక్కువ పనుల ద్వారా జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు నేడు కేసీఆర్ పాలనలో జరిగిన నిర్మాణాలే దిక్కయ్యాయి’.. అని కేటీఆర్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment