దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ బయట పడే పరిస్థితి లేదు
10 నుంచి 12 ఎంపీ సీట్లు గెలిస్తే మనమే చక్రం తిప్పొచ్చు
మగాడివైతే హామీలు అమలు చేయాలని
రేవంత్కు సవాల్ మేం తెచ్చిన కంపెనీలన్నీ వెళ్లిపోతున్నాయి
రియల్ ఎస్టేట్ పడిపోయింది
యాదాద్రిని రాజకీయాల కోసం వాడుకోలేదు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు
ఇబ్రహీంపట్నం రూరల్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు బయటపడే పరిస్థితి లేదని, కేంద్రంలో ఆ రెండు పార్టీలకు స్పష్టమైన మెజార్టీ రాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అంచనా వేశారు. మన తెలంగాణ నుంచి బీఆర్ఎస్కు 10నుంచి 12 ఎంపీ సీట్లు వస్తే మనమే చక్రం తిప్పొచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్ను గెలిపించాలని కోరుతూ శుక్రవారం ఆదిభట్ల మున్సిపాలిటీ బొంగ్లూర్లో నిర్వహించిన పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సీఎం గుంపు మేస్త్రీ అని.. పీఎం తాపీ మేస్త్రీ అని.. వీరిద్దరూ కలిసి బీఆర్ఎస్ను ఖతం చేసేందుకు చూసు్తన్నారనీ, కానీ అది వారి తరం కాదన్నారు.
రేవంత్ మైక్ వీరుడు
డిసెంబర్ 9న సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పిన రేవంత్ ఆలస్యమైతే కుర్చీ పోతుందనే భయంతో రెండు రోజులు ముందుగానే ప్రమాణ స్వీకారం చేశాడన్నారు. ఎప్పుడూ.. మగాడివైతే నాపై గెలువు అనే సీఎంను తన మాటల్లోనే అడుగుతున్నానని.. మగాడివైతే రైతులకు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, మగాడివైతే ఆడబిడ్డలకు రూ.2,500 ఇచ్చాకే ఓటు అడగాలని, మగాడివైతే ముసలోళ్లకు రూ.4 వేలు ఇచ్చి మాట్లాడాలని, మగాడివైతే రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ మైక్ వీరుడేనని ఎద్దేవా చేశారు.
పూలే, అంబేద్కర్ వారసుడు కేసీఆరే..
పూలే, అంబేద్కర్కు నిజమైన వారసుడు కేసీఆర్ మాత్రమేనని కేటీఆర్ అన్నారు. పూలే చెప్పినట్లు విద్యతోనే వికాసం వస్తుందని నమ్మి ఒకేసారి 1,008 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.లక్షా ఇరవై వేలు ఖర్చు పెట్టింది ఆయ ననేనని గుర్తు చేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ సచివాలయం, దళితబంధు కేసీఆర్కే సాధ్యమయ్యాయన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ప్రస్తుతం జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో యాభై శాతానికి పైగా సీట్లను బీసీలకు ఇచ్చిన ఘనత అధినేత కేసీఆర్దేనని కొనియాడారు.
రాముడు అందరివాడని, ఆయన పేరుతో రాజకీయాలు సరికాదని బీజేపీకి కేటీఆర్ హితవు పలికారు. తాము కూడా యాదాద్రిని అద్భుతంగా అభివృద్ధి చేశామని, కానీ ఏనాడూ రాజకీయం కోసం వాడుకోలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఎంపీ అభ్యర్థి మల్లేశ్, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం పాల్గొన్నారు.
రియల్ ఎస్టేట్ పడిపోయింది
రియల్ ఎస్టేట్ అంటే రేవంత్రెడ్డి అని చెప్పాడని.. ఇప్పుడు రంగారెడ్డి, ఇబ్రహీంపట్నంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లుందని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి తెలివి లేక రియల్ ఎస్టేట్ పడిపోయిందని విమర్శించారు.
ప్రపంచ దిగ్గజ కంపెనీ ఫాక్స్కాన్, రూ.3,500 కోట్లతో మరో కంపెనీ కేన్స్ను తీసుకొస్తే కొత్త ప్రభుత్వం రావడంతో గుజరాత్కు తరలిపోయాయని ఆరోపించారు. ప్రç³ంచంలోనే ఎక్కడా లేని విధంగా ఫార్మాసిటీ ఏర్పాటుకు భూమి కేటాయించి, వసతులు కల్పించామని, దాన్ని నడుపుకొనే చేతకాని అసమర్థ నాయకులు కాంగ్రెస్ వాళ్లని మండిపడ్డారు. పరిశ్రమలు వస్తే రియల్ ఎస్టేట్ వస్తుందన్న అవగాహన కూడా ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు.