మహారాణిపేట: పేదల సొంతింటి కలను నెరవేర్చాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు. మంజూరైన ప్రతి ఇల్లునూ అధికారులు దగ్గరుండి కట్టించాలని, గుత్తేదార్లకు, లబ్ధిదారులకు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ పి. సంపత్ కుమార్, వీఎంఆర్డీఏ కమిషనర్ కె. విశ్వనాథన్, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి శుక్రవారం జీవీఎంసీ సమావేశమందిరంలో సమీక్ష నిర్వహించారు. సాంకేతిక సమస్యలను అధిగమించి నిర్మాణాల్లో జోరు పెంచి, జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు.సమావేశంలో భాగంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 1.0 పథకంలో భాగంగా లబ్ధిపొందిన వారికి మరొక్క గృహ సంబంధిత పథకంలో అవకాశం ఉండదని రాజాబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1.0లో లబ్ధి పొందిన వారికి 2.0లో అవకాశం రాదని, మార్పులు చేర్పులు ఉండబోవని తేల్చిచెప్పారు. పెండింగ్ బిల్లులేమైనా ఉంటే నివేదించాలని, వారం రోజుల్లో పరిష్కరిస్తానని గృహ నిర్మాణ శాఖ ఎండీ చెప్పారు. జిల్లాలో జరిగిన ఇళ్ల నిర్మాణాల ప్రగతిని గృహ నిర్మాణ శాఖ ఎండీకి వివరించిన కలెక్టర్ హరేందిర ప్రసాద్ వివరించారు. 100 రోజుల ప్రణాళికకు అనుగుణంగా సమన్వయంతో పనిచేస్తామని, ఇళ్ల నిర్మాణాల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పారు. సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ పీడీ డి. అఖిల, విశాఖ, భీమిలి ఆర్డీవోలు హుస్సేన్ సాహెబ్, భాస్కర్ రెడ్డి, శేషశైలజ, ఇతర విభాగాల అధికారులు, గుత్తేదార్లు పాల్గొన్నారు.
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ రాజాబాబు
Comments
Please login to add a commentAdd a comment