విశాఖ లీగల్ : బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడికి 20 ఏళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ నగరంలోని 12వ అదనపు జిల్లా కోర్టు కం పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జి.ఆనంది శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రభుత్వం బాలికకు రూ.5 లక్షలు చెల్లించాలని ఆ తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాలివీ.. నిందితుడు గుడ్ల వెంకటరమణ (27) గాజువాక దగ్గర పెదగంట్యాడ, వెంపల్ నగర్లో ఉంటున్నాడు. వృత్తి రీత్యా సిమెంట్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. నిందితుడు బాధిత బాలికకు మేనమామ అవుతాడు. బాధితురాలిని (13) తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిచిపెట్టారు. పెదగంట్యాడకు చెందిన నీలాపు రాజి అనే మహిళ బాలికను చేరదీసి తన ఇంట్లో సహాయకురాలిగా ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో 2023 మార్చి 27వ తేదీన రాత్రి నిందితుడు వెంకటరమణ, ఆమె ఉంటున్న ఇంటి దగ్గర నుంచి బలవంతంగా తన మోటార్ సైకిల్పై తీసుకువెళ్లాడు. సమీపంలోని ఒక హోటల్ నుంచి భోజనం తెచ్చి ఒక పాడుపడిన బంగ్లాలో బాలికను ఉంచాడు. ఆమైపె లైంగిక దాడికి ప్రయత్నం చేయగా బాలిక నిరాకరించింది. రాత్రి 9 గంటల సమయంలో బాలికను గాయపరిచి వేధించడంతో నిద్రలోకి జారుకుంది. అదే రోజు రాత్రి ఒంటిగంట సమయంలో బాలికకు మెలకువ వచ్చింది. ఆ సమయంలో నిందితుడు బాలికపై బలవంతంగా లైంగిక దాడి చేశాడు. బాలికను నిర్జన ప్రదేశంలో వదిలిపెట్టాడు. బాలికకు సంరక్షకురాలిగా ఉన్న నీలాపు రాజి నిందితుని పట్టుకుని బాలికలు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యూ పోర్టు పోలీసులు ఫిర్యాదు స్వీకరించి నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి 376, 363, పోక్సో చట్టంలోని సెక్షన్ 3, 4 ఇతర సెక్షన్లపై కేసు నమోదు చేశారు. అప్పటి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వివేకానంద కేసును విచారణ జరిపి నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. ప్రస్తుత ఏసీపీ పెంటారావు కేసును పర్యవేక్షించారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తిపై విధంగా తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment