మతిస్థిమితం లేని మహిళ హత్య? | - | Sakshi
Sakshi News home page

మతిస్థిమితం లేని మహిళ హత్య?

Published Sat, Sep 21 2024 2:20 AM | Last Updated on Sat, Sep 21 2024 2:20 AM

మతిస్థిమితం లేని మహిళ హత్య?

ఒంటి నిండా గాయాలే..

అక్కిరెడ్డిపాలెం: భెల్‌ సిగ్నల్‌ పాయింట్‌ వద్ద ప్రసన్న వెంకటేశ్వరాలయం సమీపంలోని బస్‌ షెల్టర్‌లో తీవ్ర గాయాలతో మతిస్థిమితం లేని మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. శుక్రవారం ఉదయం జీవీఎంసీ, ఆలయ సిబ్బంది మృతదేహాన్ని గుర్తించి.. గాజువాక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ రవికుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వివరాలివీ.. 25 నుంచి 30 ఏళ్ల వయసున్న మహిళ ప్రసన్న వెంకటేశ్వరాలయం సమీపంలోని బస్‌ షెల్టర్‌లో ఉంటోంది. ఆమె ఎల్లప్పుడూ ఆలయం మెట్ల వద్ద లేదా రాంనగర్‌లోని టిఫిన్‌ సెంటర్ల వద్దే కనిపించేది. కొంతమంది ఆమెకు ఉదయాన్నే టిఫిన్‌ ఇచ్చేవారు. ఆమెకు తెలుగు రాదని.. వేరే రాష్ట్రానికి చెందిన మహిళ అయి ఉంటుందని స్థానికులు తెలిపారు. కాగా.. ఆమె మృతి చెందడం స్థానికంగా కలకలం రేగింది. ఆమె మృతదేహంపై నుదుటి నుంచి కడుపు వరకు అనేక గాయాలు ఉన్నాయి. బస్‌ షెల్టర్‌ గోడలు రక్తంతో నిండి ఉన్నాయి. కొన్ని కర్ర ముక్కలు ఘటనా స్థలంలో కనిపించాయి. ఆమైపె గురువారం అర్ధరాత్రి ఎవరైనా అత్యాచారానికి పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఎస్‌ఐ రవికుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ ఎ.పార్థసారధి మాట్లాడుతూ అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement