tribal welfare department
-
ఆ గిరిజన గ్రామాలు ఏమయ్యాయి?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని 792 గిరిజన గ్రామాలకు ప్రస్తుతం 292 గ్రామాలే ఉండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. మిగిలిన గ్రామాలన్నీ ఏమయ్యాయని, ఎలా మాయమయ్యాయని అధికారులను నిలదీసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని, లేని పక్షంలో తదుపరి విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యక్తిగతంగా హాజరు కావాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. గిరిజన ప్రాంతాల పరిధిని, విస్తీర్ణాన్ని ఎందుకు, ఏ అధికారంతో కుదించేస్తున్నారో కూడా వివరించాలంది. తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి ర వి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజనేతరుల కోసం గిరిజన ప్రాంతాల విస్తీర్ణాన్ని అధికారులు తగ్గించేస్తున్నారని, పెద్ద సంఖ్యలో గ్రామాలను పట్టణాల్లో కలిపేస్తున్నారంటూ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు టి.వెంకట శివరాం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎ. శ్యాంసుందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అధికారులు ఉద్దేశపూర్వకంగా గిరిజన ప్రాంతాల విస్తీర్ణాన్ని, పరిధులను కుదించేస్తున్నారని తెలిపారు. పెద్ద సంఖ్యలో గిరిజన గ్రామాలను పట్టణ ప్రాంతాల్లో కలిపేశారన్నారు. దీనివల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని, గిరిజనేతరులు లబ్ధి పొందుతున్నారని వివరించారు. అందుకే గిరిజన ప్రాంతాలను నిర్దిష్టంగా నోటిఫై చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. అధికారులు సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన వివరాల ప్రకారం గతంలో 792 గ్రామాలు ఉండగా, ప్రస్తుతం 292 గ్రామాలే ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ గిరిజన ప్రాంతాల పరిధులను ఎందుకు కుదించేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై కేంద్రం ఎందుకు స్పందించడంలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అయిన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావును ప్రశ్నించింది. తాము పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగామని, ఇప్పటివరకు ఇవ్వలేదని పొన్నారావు తెలిపారు. తదుపరి విచారణ నాటికి అఫిడవిట్ రూపంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది. -
రాష్ట్ర వాటా విడుదల ఎప్పుడో!
సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల ఉపకార వేతనాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా ఇంకా ఎదురు చూపులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడమే ఇందుకు కారణం. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాలున్నాయి. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి కేంద్రం 75% నిధులు ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం 25% నిధులు భరిస్తుంది. ఎస్సీ అభివృద్ధి శాఖకు సంబంధించి కేంద్రం 60% నిధులు ఇస్తుండగా.. 40% రాష్ట్రం చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్రం తన వాటాను విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాలు విడుదల చేయలేదు. విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్కు ఎదురుచూస్తూనే ఉన్నారు. రూ.450 కోట్లు అందుబాటులో ఉన్నా.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులకు ప్రస్తుతం రూ.450 కోట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇందులో ఎస్సీ అభివృద్ధి శాఖలో రూ.275 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో రూ.175 కోట్లు ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ మొత్తాన్ని కేంద్రం విడుదల చేసింది. గతేడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగడంతో గత ఆర్థిక సంవత్సర నిధులు విడుదలలో జాప్యం జరిగింది. అయితే నెలన్నర క్రితం అప్పటి నిధులను క్లియర్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ను విడుదల చేసిన వెంటనే ఈ నిధిని వినియోగించాలనే నిబంధన విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు. కేంద్రం ఇచ్చిన నిధులను సకాలంలో వినియోగించుకోకుంటే వాటిని కేంద్రం వెనక్కు తీసుకునే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్లో తాజా దరఖాస్తుల ప్రక్రియ మరోవైపు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి గత నెల 31తోనే ఈ గడువు ముగిసింది. అయితే విద్యార్థుల నుంచి పెద్దసంఖ్యలో దరఖాస్తులు అందలేదు. దీంతో గడువు పొడిగింపు కోసం సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదించలేదు. అయితే వెబ్సైట్లో దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ను అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. -
కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం అమలు చేసే పథకాలపై కసరత్తు చేసి రాష్ట్రానికి నిధులు సాధించే ప్రణాళికలతో రావాలని అధికారులను సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో గిరిజనులకు విద్యా, వైద్యం, సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్షించారు. గిరిజనులు సాగుచేస్తున్న భూములు, ఆయా పంటలకు వస్తున్న ఆదాయం, గిరిజన ఉత్పత్తులు..ఇతర పనుల ద్వారా తలసరి ఆదాయంపై సమగ్ర వివరాలతో రావాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని ఆదేశించారు. ఫీడర్ అంబులెన్స్లను తిరిగి ప్రవేశ పెట్టడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చూడాలన్నారు. నెలలు నిండిన గర్భిణిల కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలన్నారు. వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలను ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలిఅరకు కాఫీని ప్రమోట్ చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. గిరిజన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని, దాన్ని ఉపయోగించుకుంటే గిరిజనుల జీవితాల్లో మార్పులు తేవచ్చని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో సారవంతమైన భూములున్నాయని, ఆ ప్రాంతాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. తేనె, హార్టికల్చర్, కాఫీని ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి ఎక్కడా కనిపించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏలు పూర్తిగా యాక్టివేట్ కావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. -
అడవి బిడ్డల ఆనందం
సాక్షి, అమరావతి: అడవిపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన తెగలు ప్రగతి బాటలో పురోగమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్వోఎఫ్ఆర్ పట్టాల జారీ, దేశంలో తొలిసారిగా ఏజన్సీ రైతులకు రైతు భరోసా లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు గిరిజనాభివృద్ధికి ఊతమిస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, అటవీ సంపదతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసింది. అడవితో ముడిపడిన గిరిజనుల జీవితం అక్కడి నుంచే అభివృద్ధి చెందేలా బాటలు వేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణతోపాటు వ్యవసాయం, పోడు భూముల సాగును ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తోంది. గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే నేతృత్వంలో ఇ.రవీంద్రబాబు, జి.చిన్నబాబు, నాగరాజు చిక్కాల రూపొందించిన నివేదికను గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు జె.వెంకట మురళి ఆవిష్కరించారు. గిరిజన యువత, కళాకారులు, నాయకులు, అధికారులతో సహా పలువురిని భాగస్వాములను చేశారు. ఆర్వోఎఫ్ఆర్, పీసా, 1 ఆఫ్ 70 చట్టాలు, గిరిజన జీవనోపాధి, సంప్రదాయ కళారూపాలు, అభివృద్ధి ప్రాంతాలను పరిశీలించడంతోపాటు గిరిజనులకు సంబంధించిన పలు పుస్తకాలను అధ్యయనం చేశారు.సాగు.. నైపుణ్యాభివృద్ధి.. మార్కెటింగ్పాడేరు, రంపచోడవరం, సీతంపేట సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో 16 గ్రామాల్లో అధ్యయనం నిర్వహించి నివేదిక రూపొందించారు. సాగు, నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్ ద్వారా గిరిజనులకు మరింత మేలు చేయవచ్చని నివేదిక సూచించింది. పంటల సాగులో మెళకువలతోపాటు నైపుణ్యాభివృద్ధి చర్యల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొంది. నల్ల మిరియాలు, మిర్చి, కొండ చీపుర్లు లాంటి అటవీ ఉత్పత్తులు, సాగును ప్రోత్సహించడం ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలను పెంపొందించవచ్చని సూచించింది. ప్రధానంగా అత్యంత బలహీన గిరిజన సమూహాలైన (పీవీటీజీ) మూక దొర, భగత, కొండ దొర, సవర, కొండ రెడ్డి తెగల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆదాయం లభించేలా కొండ చీపుర్లు, గడ్డి పెంపకం, మార్కెటింగ్ నైపుణ్యాలపై శిక్షణ, అవగాహన కల్పించాలని నిర్దేశించింది. కాఫీ తోటల్లో అంతర పంటలుగా నల్ల మిరియాల సాగును ప్రోత్సహించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచవచ్చు. దీంతోపాటు మిర్చి రకాల సాగుపై అవగాహన పెంచడం, అధిక దిగుబడులు సాధించేలా పరిజ్ఞానాన్ని అందించడం, మంచి ధర దక్కేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవడం ద్వారా గిరిజనులకు మరింత ఊతం ఇచ్చినట్టు అవుతుందని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ అధ్యయనంలో పేర్కొంది.అడవి బిడ్డలకు అండగా సీఎం జగన్⇒ గిరిజనులకు ముఖ్యమంత్రి జగన్ కొండంత అండగా నిలిచారు. నవరత్నాల సంక్షేమ పథకాలను అందించి ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు భూమిపై హక్కులు కల్పించి సాగుకు ఊతమిచ్చారు. సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో గిరిజన కుటుంబాలకు ఏకంగా 3.22 లక్షల ఎకరాలను అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్ఆర్) ప్రకారం పట్టాలు అందించడం దేశంలోనే రికార్డు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి దివంగత వైఎస్సార్ శ్రీకారం చుట్టగా సీఎం జగన్ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలతోపాటు డీకేటీ పట్టాలు పంపిణీ చేసి ఆ భూములను సాగులోకి తెచ్చేందుకు ఉపాధి హామీతో చేయూతనందించారు. ⇒ దేశంలోనే తొలిసారిగా సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 3,40,043 మంది గిరిజన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, బిందు, తుంపర సేద్యం పరికరాలు సమకూర్చారు. అల్లూరి జిల్లాలో 2,58,021 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్న దాదాపు 2,46,139 మంది గిరిజన రైతులకు అన్ని విధాలా అండంగా నిలిచారు. కాఫీ తోటల సాగుకు సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, పెట్టుబడి సాయం, రుణాలు, యంత్రాలు లాంటివి అందించారు. అంతర పంటగా మిరియాల సాగుకు అవసరమైన పరికరాలు అందించారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర దక్కేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే అధికంగా జీసీసీ చెల్లిస్తోంది. శ్రీశైలం, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గిరిజనుల ద్వారా సేకరిస్తున్న తేనెను రాజమహేంద్రవరం, చిత్తూరులోని జీసీసీ తేనె శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి చేసి ‘గిరిజన్‘ బ్రాండ్తో మార్కెటింగ్ చేస్తున్నారు. గిరిజన రైతులకు వ్యవసాయం, కాఫీ సాగుకు జీసీసీ రుణాలు అందచేస్తోంది. -
ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ) కె.జగజ్యోతి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే... గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిజామాబాద్ పట్టణంలో ఒక నిర్మాణ పనిని, గాజుల రామారంలో జువెనైల్ బాయిస్ హాస్టల్ నిర్మాణపనులను బొడుకం గంగన్న అనే లైసెన్స్డ్ కాంట్రాక్టర్ చేపట్టారు. వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయమై కాంట్రాక్టర్ను ఆ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జ్ సూపరింటెండెంట్ కె.జగజ్యోతి లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేల లంచం తీసుకుంటుండగా సోమవారం హైదరాబాద్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ(డీఎస్ఎస్) భవన్లో జగజ్యోతిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలోనూ కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తర్వాత ఆమెను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈఈ స్థాయి అధికారి అయిన జగజ్యోతి ఇన్ఛార్జి హోదాలో ఎస్ఈ బాధ్యతలూ నిర్వర్తిస్తుండటం గమనార్హం. -
గిరిజన పల్లెకు సంక్షేమ పలకరింపు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ పథకాల ఫలాలతో పులకరిస్తున్న గిరిజన పల్లెలను మరోసారి ప్రభుత్వ యంత్రాంగం ఆత్మీయంగా పలకరించనుంది. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారంతో పాటు, పథకాలు అందని అర్హులు ఎవరైనా మిగిలుంటే వారికి పథకాలు అందేలా చూస్తారు. ఇందుకోసం ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’లో భాగంగా రాష్ట్రంలోని గిరిజన పల్లెల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు షెడ్యూల్ను ఖరారు చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘జన జాతీయ గౌరవ్ దివస్’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 15న విశాఖ బీచ్ రోడ్డులో ర్యాలీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ప్రారంభిస్తారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) సభ్యులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొంటారని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ అడిషినల్ డైరెక్టర్ రవీంద్రబాబు తెలిపారు. ఈ నెల 26వ తేదీ వరకు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఆ రెండు జిల్లాల్లోని 430 గిరిజన గ్రామాల్లో నాలుగు ప్రత్యేక వాహనాల(ప్రభుత్వ పథకాల ప్రచార వ్యాన్)తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రామ, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ), జిల్లాల స్థాయిలో స్థానిక ప్రజలు, స్వయం సహాయక సంఘాలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించాలనేది ప్రత్యేకంగా షెడ్యూల్ను ఖరారు చేశారు. వీటిపై ప్రత్యేక దృష్టి ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించనున్నారు. గిరిజనుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఇంకా అర్హత ఉన్న వాళ్లకు ఎవరికైనా రాకుంటే.. వారికి సంక్షేమ ఫలాలు అందించేలా తక్షణ చర్యలు చేపడతారు. గిరిజన జిల్లాల్లో సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్, ఏకలవ్య మోడల్ స్కూల్లో విద్యార్థులను చేరి్పంచడం, స్కాలర్షిప్ల మంజూరు, అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాల అమలు, అర్హులకు వాటిని దరి చేర్చడం వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ‘జన జాతీయ గౌరవ్ దివస్’ను ఘనంగా జరుపుదాం సీఎం జగన్కు కేంద్ర మంత్రి లేఖ జన జాతీయ గౌరవ్ దివస్ను ఘనంగా జరిపేందుకు రాష్ట్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని, మంత్రులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా లేఖ రాశారు. 15న జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా పార్లమెంట్ కాంప్లెక్స్లో భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ నివాళి అర్పిస్తారని తెలిపారు. అలాగే బిర్సా ముండా జన్మస్థలం జార్ఖండ్ రాష్ట్రం ఉలిహటు వద్ద నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని.. దేశంలోని 75 ఆదివాసీల ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో ‘హమారా సంకల్ప్ వికసిత్ భారత్‘ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని.. మీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. -
గిరిజన భూ వివాదాలకు సత్వర పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గిరిజన భూ వివాదాల సత్వర పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని గిరిజనులకు చెందిన షెడ్యూల్డ్ ఏరియా ‘భూ బదలాయింపు నిబంధనలు (ఎల్టీఆర్) 1/70’ ప్రకారం వారి హక్కులను కాపాడేలా పక్కా కార్యాచరణ చేపట్టింది. దాదాపు 1976 నుంచి పేరుకుపోయిన వేలాది ఎల్టీఆర్ కేసుల్లో వేగంగా విచారణ జరిపి సత్వర న్యాయం అందించే దిశగా ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చడంతోపాటు ఇటీవల ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. పెండింగ్లో ఉన్న ఎల్టీఆర్ కేసులు విచారణ వేగవంతం చేయడం, పాత కేసుల్లోని భూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించడం, కొత్తగా నమోదైన కేసులను 6 నెలల గడువులోను, అప్పీల్కు వెళ్లిన కేసులు రెండు నెలల్లో పరిష్కరించాలని ఆదేశాలిచ్చింది. అప్పటికీ వివాదం కొలిక్కిరాకపోతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, కమిషనర్ విచారణకు వెళుతుంది. కేసుల్లో గిరిజనులకు అనుకూలమైన ఉత్తర్వులను వేగంగా అమలులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. గిరిజనులకు వ్యతిరేకంగా వచ్చింన వాటి వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేయడంతోపాటు ఆయా గ్రామ సచివాలయాల వద్ద ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎల్టీఆర్ కేసుల పురోగతిపై ఎప్పటికప్పుడు ఐటీడీఏ పీవోలు, మైదాన ప్రాంత కలెక్టర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి నివేదిక పంపించాలి. ఎల్టీఆర్ కేసులు, హక్కులపై ఐటీడీఏల పరిధిలో వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా గిరిజనులకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాలు ఇచ్చింది. గిరిజన భూములకు రక్ష 1/70 యాక్ట్ రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించారు. భూములకు సంబంధించి 1/70 (1959 చట్ట సవరణ) సెక్షన్–3తో గిరిజనులకు భూములపై హక్కులున్నాయి. షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులకు చెందిన భూములు వారే అనుభవించాలి. గిరిజనులు నుంచి గిరిజనులు భూములు పొందచ్చు. గిరిజనుల నుంచి గిరిజనేతరులు కొనుగోలు చేయడం, ఆక్రమించడం వంటివి చెల్లవు. భూముల అన్యాక్రాంతాన్ని నిరోధించడమే దీని ఉద్దేశం. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతం (షెడ్యూల్డ్ ఏరియా) 37 మండలాల పరిధిలోని 3,512 గ్రామాల్లో నివసించే వారికి ఈ హక్కులు వర్తిస్తాయి. గిరిజనులకు చెందిన భూవివాదాల పరిష్కారం కోసం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాలకు చెందిన రంపచోడవరం, పాడేరు, పార్వతీపురం, సీతంపేట, కోట రామచంద్రపురం, పోలవరం ఐటీడీఏల పరిధిలో ఐదు ప్రత్యేక ఎల్టీఆర్ కోర్టులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆయా ప్రాంతాల్లో భూ వివాదాలను తొలుత డిప్యూటీ తహసిల్దార్ (డీటీ) గుర్తించి నోటీసులు జారీ చేస్తారు. తగిన సమాచారం సేకరించిన అనంతరం ఐటీడీఏల పరిధిలోని పాడేరు, రంపచోడవరం, ఎల్వీఎన్ పేట, కేఆర్ పురం, పోలవరం కోర్టుల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు విచారణ చేపడతారు. ఈ వివాదాల్లో తగిన పత్రాలు, ఆధారాలను సమర్పించడం ద్వారా భూమి ఎవరిదో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎల్టీఆర్ ఆర్డర్ అమలు ఇలా ♦ ప్రారంభం (1976) నుండి ఈ ఏడాది జూన్ వరకు 29,810 ఎల్టీఆర్ వివాదాలు(1,47,554 ఎకరాలు) గుర్తించారు. ♦ 12,678 కేసులు (56,882 ఎకరాలు) గిరిజనులకు అనుకూలంగా ఉత్తర్వులు అమలయ్యాయి. ♦ 11,754 కేసుల్లో 51,278 ఎకరాలను గిరిజనులకు స్వాదీనం చేశారు. ♦ 924 కేసుల్లో 5,604 ఎకరాలను అప్పగించాల్సి ఉంది. మరికొన్ని కేసులు పలుస్థాయి (కోర్టు)ల్లో పెండింగ్లో ఉన్నాయి. -
పోడు పట్టాల పండగ!
సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు పోడు భూములకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జూన్ 24 నుంచి 30 వరకు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు పథకాన్ని వర్తింపచేయాలని ఆదేశించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు పట్టాల పంపిణీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంగళవారం సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమానికి తాను స్వయంగా హాజరవుతానని ముఖ్యమంత్రి తెలిపారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్ఓఎఫ్ఆర్)–2006 కింద పట్టాలు పొంది రైతుబంధు అందుకుంటున్న గిరిజన రైతులతో, కొత్తగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్ధిదారులను క్రోడీకరించాలని సూచించారు. ఇతర రైతుల తరహాలోనే వీరికీ రైతుబంధు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వమే బ్యాంకు ఖాతాలను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధు మొత్తాన్ని జమ చేస్తుందని చెప్పారు. కొత్తగా పోడు పట్టాలు అందుకుంటున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖకు అందజేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను కేసీఆర్ ఆదేశించారు. అర్హులైన నిరుపేదలకు భూములు గ్రామాల్లో ఇంకా మిగిలి వున్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను గుర్తించి, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అర్హులైన నిరుపేదల ఇళ్ల నిర్మాణాల కోసం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సొంత జాగాలో ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం విధివిధానాలను త్వరితగతిన తయారు చేయాలని, జూలైలో ఈ పథకాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. జూలైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్కు సూచించారు. కలెక్టర్లతో రేపు సదస్సు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు పాల్గొంటారు. 14న నిమ్స్ విస్తరణకు శంకుస్థాపన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా జూన్ 14న నిమ్స్ ఆస్పత్రి విస్తరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 2,000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణం పనులకు పునాదిరాయి వేయనున్నారు. -
ఒక్కో గిరిజన గురుకులానికి రూ. 5 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని గురుకుల పాఠశాలలకు అదనపు హంగులు దిద్దాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలో 47 గిరిజన గురుకుల పాఠశాలలున్నాయి. ఇవన్నీ శాశ్వత భవనాల్లోనే నిర్వహిస్తున్నప్పటికీ... ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ భవనాల సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో శాశ్వత ప్రాతిపదికన అదనపు గదులు, డారి్మటరీలు, డైనింగ్ హాల్స్ ఏర్పాటు కోసం గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. గిరిజనుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న షెడ్యూల్డ్ ట్రైబ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్టీ ఎస్డీఎఫ్) ద్వారా సివిల్ పనులు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేయగా... రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే ఆమోదం తెలిపింది. ఒక్కో పాఠశాలకు రూ. 5 కోట్లు... గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో పాత పాఠశాలల్లో నిర్మాణ పనుల కోసం ఒక్కో గురుకులానికి రూ.5 కోట్లు చొప్పున కేటాయించింది. చాలాచోట్ల తరగతి గదులతో పాటు డార్మిటరీ భవనాల ఆవశ్యకత ఎక్కువగా ఉంది. ఇదివరకు ఒక్కో పాఠశాలలో ఒక తరగతికి ఒక సెక్షన్ మాత్రమే ఉండేది. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయ్యింది. దీంతో పాటు ఇంటరీ్మడియట్ కాలేజీలుగా దాదాపు అన్నీ అప్గ్రేడ్ అయ్యాయి. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా వసతి లేకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలతో ఇప్పటివరకు నెట్టుకొచ్చారు. తాజాగా ఎస్టీ ఎస్డీఎఫ్ ద్వారా నిధుల లభ్యతకు అనుగుణంగా నిధులు కేటాయించారు. మొత్తం 47 పాఠశాలలకు రూ.235 కోట్లు కేటాయించారు. అతి త్వరలో ఈ పనులకు సంబంధించి టెండర్లు ఖరారు చేసిన తర్వాత పనులు ప్రారంభించనున్నారు. గిరిజన విద్యార్థుల అడ్మిషన్ల డిమాండ్కు అనుగుణంగా 2023–24 వార్షికంలో కొత్తగా మరో రెండు పాఠశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో వీటికి శాశ్వత ప్రాతిపదికన భవనాలను నిర్మించేందుకు ప్రత్యేక నిధులను సైతం కేటాయించింది. ఒక్కో పాఠశాలకు రూ.12కోట్లు చొప్పున రెండింటికి కలిపి రూ.24కోట్లు కేటాయించింది. దీంతో గురుకుల పాఠశాలల నిర్మాణ పనులకు మొత్తంగా రూ.259 కోట్లు ఖర్చు చేయనుంది. గిరిజన ఇంజనీరింగ్ పర్యవేక్షణ... ఎస్టీ గురుకులాల్లో త్వరలో చేపట్టనున్న ఈ సివిల్ పనుల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న గిరిజన ఇంజనీరింగ్ విభాగానికి అప్పగించింది. టెండర్ల ఖరారు, పనుల కేటాయింపు, పర్యవేక్షణ, నాణ్యత పరిశీలన తదితర పూర్తిస్థాయి బాధ్యతలను గిరిజన ఇంజనీరింగ్ అధికారులే చూసుకుంటారు. గత మూడేళ్లుగా నిర్మాణ పనులకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో స్తబ్ధుగా ఉన్న గిరిజన ఇంజనీరింగ్ విభాగానికి తాజాగా ఊరట లభించినట్లయింది. -
యానాదుల బతుకుల్లో మార్పుకు శ్రీకారం
సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన యానాదులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే నెల్లూరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిధిలో ప్రత్యేకంగా యానాదులకు ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆధార్ కార్డుల జారీతో వారికి ప్రభుత్వ పథకాలు, విద్య, వైద్యం వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెల్సిందే. తాజాగా విజయవాడ ఐటీడీఏ(మైదాన ప్రాంతం) పరిధిలోని ఎన్టీఆర్ జిల్లాలో యానాదుల స్థితిగతులను అధ్యయనం చేసి వారికి ప్రభుత్వ పథకాలను చేరువ చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. కేర్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కోబో కలెక్ట్ యాప్(మొబైల్ అప్లికేషన్) సాయంతో సర్వే నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి సర్వేలో సేకరించిన అంశాల ఆధారంగా వారికి ప్రభుత్వ పథకాలతో పాటు అవసరమైన సహకారాన్ని అందించనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్గా చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలిస్తుండటంతో మిగిలిన జిల్లాల్లోనూ అమలు చేసే విషయాన్ని గిరిజన సంక్షేమ శాఖ పరిశీలిస్తోంది. కోబో యాప్తో సమగ్ర సమాచారం గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణలో కేర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఏకుల రవి, వెలుగు చంద్రరావు తమ సిబ్బందితో కలిసి కోబో కలెక్ట్ యాప్తో ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామాల్లో పర్యటించి యానాదులను గుర్తిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాలతో పాటు వారి స్థితిగతులు, సమస్యలను యాప్ ద్వారా సేకరిస్తున్నారు. సేకరించిన సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు అందిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పలు ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని యానాదుల సమస్యలను పరిష్కరిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల సహకారంతో బడి ఈడు పిల్లలను బడిలో, చిన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేరుస్తున్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల యంత్రాంగంతో మాట్లాడి వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇప్పించేలా చర్యలు చేపట్టారు. 412 మంది యానాదులకు ఇళ్ల మరమ్మతుల కోసం రూ.50 వేల చొప్పున అందించారు. 2,500 మందికి ఆధార్ కార్డులు, 550 మందికి రేషన్కార్డులు, మూడు వేల మందికి కుల ధ్రువీకరణ పత్రాలిప్పించేలా చర్యలు చేపట్టారు. చేపల వేటకు లైసెన్స్లిస్తున్నాం.. మైదాన ప్రాంత ఐటీడీఏ పరిధిలోని ఎస్టీల్లో లంబాడీ, ఎరుకల, యానాది, చెంచు, నక్కల తెగల వారున్నారు. వారిలో యానాదులకు సరైన చిరునామా, నివాసం లేక అవస్థలు పడుతున్నారు. వారి స్థితిగతులపై చేపట్టిన సర్వే మరో రెండు నెలల్లో పూర్తవుతుంది. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని అందిస్తున్నాం. ప్రధానంగా చేపల వేటపై ఆధారపడి జీవించే యానాదుల ఉపాధిని మరింత మెరుగుపరిచేలా దృష్టి సారించాం. కాలువలు, నదుల్లో చేపలను వేటాడుకునేలా జి కొండూరు మండలం కవులూరు గ్రామానికి చెందిన 18 మందికి కొత్తగా లైసెన్స్లిచ్చాం. మత్స్యశాఖ, గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో సబ్సిడీపై వలలు అందించేలా కార్యాచరణ చేపట్టాం. – ఎం.రుక్మంగదయ్య, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, మైదాన ప్రాంత ఐటీడీఏ(విజయవాడ) -
ఏజెన్సీలో మరో 32 గర్భిణీ వసతి గృహాలు
సాక్షి, అమరావతి: కొండలు, కోనల్లో ఉండే గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్ పలు చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 159 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీలు) ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులను అత్యవసర సమయాల్లో డోలీలు, మంచాలపై మోసుకెళ్లకుండా వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించి, ముందుగానే ఆస్పత్రులకు తరలించేందుకు గిరిజన ప్రాంతాల్లో గర్భిణీ వసతి గృహాలు (బర్త్ వెయిటింగ్ హోమ్స్–బీడబ్ల్యూహెచ్) ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి 45 ఉన్నాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రతిపాదనల మేరకు మరో 32 గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేయనున్నారు. వీటితో మొత్తం వీటి సంఖ్య 77కు పెరగనుంది. మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులకు తక్షణ వైద్య సేవలు అందించి తల్లీ బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడంలో ఈ వసతి గృహాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో 1818 మారుమూల ప్రాంతాలున్నాయి. కొండలు, గుట్టలు, అడవులు, సెలయేరులు తదితర మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు గతంలో వైద్యం గగనమే అయ్యేది. దీంతో మరణాలూ అధికంగానే ఉండేవి. గర్భిణుల అవస్థలు చెప్పనలవి కాదు. సరైన వైద్యం అందక, ప్రసవ సమయానికి ఆస్పత్రికి వెళ్లలేక మరణించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. గిరిజనులకు ఈ అవస్థలు తప్పించి, వారికి మంచి వైద్య సేవలను వైఎస్ జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఆ ప్రాంతాల్లో తల్లీ బిడ్డలను క్షేమంగా ఉంచేందుకు గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేస్తోంది. గిరి రక్షక్ పేరుతో ఏర్పాటు చేయనున్న బైక్ అంబులెన్స్లు నెలలో 25 రోజులపాటు ప్రతి మారుమూల ప్రాంతాన్ని సందర్శించి గర్భిణుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంటారు. స్థానిక ఏఎన్ఎం దగ్గర్నుంచి మండల స్థాయి వైద్యాధికారి, మండల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గర్భిణులతోపాటు అక్కడి వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి తగు చర్యలు చేపడుతుంటారు. ప్రతి గురువారం గ్రామ సచివాలయ బృందం అన్ని మారుమూల (డోలీపై ఆధారపడిన) ప్రాంతాలను సందర్శిస్తుంది. ప్రతి శనివారం (పలకరింపు) వైద్య బృందం వెళ్లి అక్కడి వారికి ప్రాథమికంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రతి మంగళవారం ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు మారుమూల ప్రాంతాలకు వెళ్లి క్షేమ సమాచారం తెలుసుకుంటారు. డోలీ మరణాల నివారణకు మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులను డాక్టర్ నిర్ధారించిన ప్రసవ సమయానికి నెల రోజుల ముందుగానే సురక్షిత రవాణా వ్యవస్థ (108 అంబులెన్స్, ఫీడర్అంబులెన్స్, బైక్ అంబులెన్స్) ద్వారా బర్త్ వెయిటింగ్ హోమ్కు తరలిస్తారు. ఈ గృహాల్లో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు నిరంతరం గర్భిణుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంటారు. నిత్యం పోషకాహారాన్ని, మందులను అందిస్తారు. మెరుగైన వైద్యం అవసరమైతే సమీపంలోని ప్రాథమిక, సామాజిక, జనరల్ ఆసుపత్రులకు తరలిస్తారు. -
ఆదివాసీ, గిరిజనానికి ప్రత్యేక ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మించిన జంట భవనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రేపు(ఈనెల 17న) ప్రారంభించనున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఈ ఏర్పాట్లను అత్యంత ఘనంగా చేపట్టింది. భవనాల ప్రారంభోత్సవానికి ఆయా వర్గాల ప్రజలను ఆహ్వానిస్తోంది. గిరిజన గూడేలు, ఏజెన్సీ గ్రామాలు, తండాల్లోని పంచాయతీలకు ప్రత్యేకంగా ఆహ్వానాలను పంపింది. ఆదివాసీ తెగలు, గిరిజన పౌరులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని అందులో సూచించింది. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులంతా హైదరాబాద్లో జంట భవనాల ప్రారంభోత్సవానికి హాజరు కావాలని సూచి స్తూ, ఆయా ఉద్యోగులకు ఆన్డ్యూటీ సౌకర్యాన్ని సైతం కల్పించింది. జంట భవనాల ప్రారంభోత్సవం అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే గిరిజన మహాసభను విజ యవంతం చేయాల్సిందిగా ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఒక్కో భవనానికి రూ. 22 కోట్లు... మహానగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్లో ఈ రెండు భవనాల కోసం ఎకరా స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చింది. నిర్మాణంకోసం రూ.44 కోట్లు కేటాయించింది. ఓక్కో భవనానికి రూ.22 కోట్లు చొప్పున ఖర్చు చేసింది. ఒక్కో భవనంలో సగటున వెయ్యి మంది సమావేశమయ్యేందుకు వీలుగా నిర్మించింది. ఇక ఈ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులకు అక్కడే వసతి కల్పించేలా గదులు ఉన్నాయి. ఆయా భవనాల్లోకి ప్రవేశించగానే వారి సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే బొమ్మలు, కళాత్మక చిత్రాలను కూడా ఏర్పాటు చేసింది. గతేడాది సెప్టెంబర్ నాటికే భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సమయం కోసమే గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈనెల 17న ముహూర్తం కుదరడంతో.. రేపు ఆ రెండు భవనాలు ప్రారంభం కానున్నాయి. -
గిరిజనులకు పీఎంఏవై ఇళ్లు ఇవ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గిరిజనులకు పూర్తిస్థాయి సబ్సిడీతో ఇచ్చే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు 31 లక్షలకుపైగా ఇళ్లస్థలాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇళ్ల పట్టాలు ఇచ్చిన పేదలు దశలవారీగా ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సొంతంగా పక్కా ఇల్లు లేని 92 వేల గిరిజన కుటుంబాలు ఉన్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వీటిలో 15 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేసేందుకు సాంకేతిక సమస్య ఎదురైంది. వారికి గతంలో రేకుల షెడ్డు, పెంకుటిల్లు నిర్మాణానికి ప్రభుత్వం గృహనిర్మాణ పథకంలో నిధులు ఇచ్చింది. అప్పట్లో గృహనిర్మాణ పథకంలో డబ్బులు ఇచ్చినందున ఆ రేకుల షెడ్డు, పెంకుటింటి స్థానంలో పక్కా ఇల్లు నిర్మించుకోవాలంటే మళ్లీ ప్రభుత్వం సాయం అందించేందుకు నిబంధనల ప్రకారం కుదరదు. ఈ నిబంధనలను సవరించి వారికి కూడా పక్కా భవనం నిర్మించుకునేలా ప్రత్యేక మినహాయింపు ఇచ్చి పీఎంఏవై మంజూరు చేయించేలా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. పేదలందరితోపాటు గిరిజనులకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం వారికి కూడా పక్కా ఇల్లు నిర్మించేలా పీఎంఏవై కోసం ప్రతిపాదించింది. కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిని కోరాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవాప్తంగా గిరిజనులకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలు చేశాం. గతంలో 15 వేలమంది గిరిజనులకు రేకుల షెడ్డు, పెంకుటింటి కోసం ప్రభుత్వం సాయం అందించడంతో ఇప్పుడు పక్కా భవనం కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం వారు అనర్హులు అని వస్తోంది. సాంకేతికంగా వచ్చిన ఆ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. వారికి కూడా పూర్తిస్థాయి సబ్సిడీతో పీఎంఏవై కింద ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ముండాను కోరాం. ఆర్థికంగాను, సామాజికంగాను అత్యంత వెనుకబడిన 92 వేల గిరిజన కుటుంబాలకు దశలవారీగానైనా పీఎంఏవై ఇళ్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు సమర్పించాం. – పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి -
మైదాన ప్రాంతంలోనూ ‘సమీకృత గిరిజనాభివృద్ధి’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు మరిన్ని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజన చేయడంతో మైదాన ప్రాంతంలో ఏడు జిల్లాలకు ఐటీడీఏల ఏర్పాటు అత్యవసరమైంది. ఆయా జిల్లాల్లోని గిరిజనులకు సేవలు అందించేలా ఒకటి, రెండు ఐటీడీఏలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఇటీవల కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం గిరిజన జనాభా 27.39 లక్షలు. వీరిలో 15.88 లక్షలమంది (58 శాతం) మైదాన ప్రాంతంలోనే నివసిస్తున్నారు. వారి అభివృద్ధి, సంక్షేమానికి మరిన్ని ఐటీడీఏల అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. రాష్ట్రంలో ప్రస్తుతం తొమ్మిది ఐటీడీఏలున్నాయి. వీటిలో విజయవాడ కేంద్రంగా ఉన్న మైదాన ప్రాంత ఐటీడీఏ మాత్రమే ఎస్టీలు తగినంత సంఖ్యలో ఉన్న ఏడుజిల్లాలకు సేవలందిస్తోంది. జిల్లాల పునర్విభజనలో రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం.. రెండు పూర్తిస్థాయి గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మైదానప్రాంత జిల్లాలైన అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గిరిజనులు గణనీయంగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ జిల్లాల్లో కనిష్టంగా 75,886 మంది, గరిష్టంగా 2,88,997 మంది గిరిజనులున్నారు. ఈ జిల్లాల్లోని గిరిజనుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేకంగా ఐటీడీఏలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తగినన్ని ఐటీడీఏలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి మరింత సమర్థంగా అందించే వీలుకలుగుతుందని పేర్కొంది. మైదాన ప్రాంత ఎస్టీల కోసం ఐటీడీఏ అత్యవసరం మైదాన ప్రాంతాల్లో ఎస్టీల సంక్షేమానికి, అభివృద్ధికి మరిన్ని ఐటీడీఏలు కావాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖకు ప్రతిపాదనలు అందించాం. ఏపీలోని గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మైదాన ప్రాంతంలోని ఎస్టీల అవసరాలను గుర్తించి వారి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఏజెన్సీలో మాదిరిగానే మైదాన ప్రాంతంలోని ఎస్టీలకు ప్రాథమిక విద్య, వైద్యం, రహదారుల కల్పన, విద్యుత్, ఆర్థికాభివృద్ధిపై అవకాశాలు వంటి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. – పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి -
గిరిజనుల్లో 'నవరత్న' కాంతులు.. ప్రగతిబాటలో ఏజెన్సీ గ్రామాలు
ఇతని పేరు మడివి సిరమయ్య. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని మారుమూల గ్రామమైన గుంజవరం. మూడేళ్లలో ‘నవరత్నాల’ ద్వారా ఏకంగా రూ.2.86 లక్షల మేర లబ్ధి పొందాడు. గత ప్రభుత్వ హయాంలో సాయం అంటే ఏమిటో తెలీకుండా ఉండేదని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు వలంటీర్ స్వయంగా తన ఇంటికొచ్చి పథకాలూ అందేలా చూస్తున్నారని అంటున్నాడు. అడవుల్లో ఎవరికీ పట్టనట్లు ఉండే గిరిజన బతుకులు సీఎం వైఎస్ జగన్ పుణ్యాన బాగుపడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశాడు. ఈమె పేరు కుంజం సావిత్రి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ముసురుమిల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈమెకు అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్ఆర్) ప్రకారం రెండు ఎకరాలకు భూమి హక్కు పట్టా అందించింది. అలాగే, మూడేళ్లుగా రైతుభరోసా అందిస్తూ పోడుభూముల్లో వ్యవసాయం చేసుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండదండగా నిలుస్తున్నారంటూ కృతజ్ఞతలు తెలిపింది. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం: అన్ని సామాజిక వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. అనేక సంవత్సరాలుగా కనీస సదుపాయాలకు నోచుకోని ఆదివాసీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వరాల మూట అందిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గిరిజనోద్ధరణకు అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయి. వీటిద్వారా 95 శాతం మంది గిరిజనులు లబ్ధి పొందారు. దేశ చరిత్రలో మరే రాష్ట్రంలోనూ ఇంత ప్రయోజనం కలిగిన దాఖలాల్లేవు. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల హక్కులు, రక్షణ కోసం పునరంకితమయ్యేలా ఏటా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో గిరిజనులకు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మేలు ఏమిటంటే.. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 27.39 లక్షల మంది గిరిజనులున్నారు. 9 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో 16,068 గిరిజన ఆవాసాలున్నాయి. వాటిలో 7 ఐటీడీఏలు అటవీ ప్రాంతంలోను, రెండు ఐటీడీఏలు మైదాన ప్రాంతాల్లోను గిరిజనుల కోసం పనిచేస్తున్నాయి. ఇక నవరత్నాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా గత మూడేళ్లలో 51,74,278 మంది గిరిజన లబ్ధిదారులకు రూ.9,204.75 కోట్ల మేర లబ్ధిచేకూరింది. ప్రత్యక్షంగా నగదు బదిలీ (డీబీటీ) ద్వారా 33,92,435 మందికి రూ.7,012.35 కోట్లు, పరోక్షంగా (నాన్ డీబీటీ) 17,81,843 మందికి రూ.2,192.40 కోట్ల మేర లబ్ధిచేకూరింది. గిరిపుత్రులకు ఇంత భారీ స్థాయిలో ఆర్థిక ప్రయోజనం చేకూరడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. దీనికితోడు గిరిజన ఉప ప్రణాళిక(ట్రైబల్ సబ్ప్లాన్).. కేంద్ర, రాష్ట్ర నిధులతో దాదాపు 40 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. గిరిజనం కోసం ప్రభుత్వ చర్యల్లో ముఖ్యమైనవి.. ► గిరిజన రైతులకు పోడు భూములపై యాజమాన్య హక్కులను కల్పించేలా సీఎం జగన్మోహన్రెడ్డి స్పెషల్ డ్రైవ్ను చేపట్టారు. గత మూడేళ్ల కాలంలో 1,34,056 మందికి ఆర్ఓఎఫ్ఆర్, ఆర్ఓఆర్ పట్టాలు చేతికందాయి. తద్వారా వారికి 2,48,066 ఎకరాలపై హక్కు లభించింది. అంతేకాదు వారికి వైఎస్సార్ రైతుభరోసా పథకాన్ని ముఖ్యమంత్రి వర్తింపజేశారు. ► గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక వైద్య కళాశాలల నిర్మాణంతోపాటు మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.746 కోట్లు మంజూరు చేసింది. ► గిరిజన గ్రామాల్లో డోలీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఫీడర్ అంబులెన్సులను వినియోగిస్తున్న ప్రభుత్వం తాజాగా.. 128 బైక్ అంబులెన్సులను అందుబాటులోకి తేనుంది. ► రక్తహీనత కారణంగా బాలింతలు, శిశువులు మరణిస్తుండడంతో గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం గిరి గోరుముద్ద, బాల సంజీవని, పోషకాహార బుట్ట వంటి ప్రత్యేక వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని అమలుచేస్తున్నారు. ► ఏజెన్సీలో 2,652 మంది గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్ (సీహెచ్డబ్ల్యూ)లకు 1995 నుంచి ఉన్న రూ.400 జీతాన్ని ఏకంగా రూ.4 వేలకు పెంచారు. ► గిరిజనులకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు. ► వంద శాతం గిరిజనుల జనాభా కలిగిన తండాలు, గూడేలను 165 కొత్త గిరిజన పంచాయతీలుగా ఏర్పాటుచేసిన ప్రభుత్వం అక్కడ ప్రజాప్రతినిధులంతా గిరిజనులే ఎన్నికయ్యేలా రిజర్వ్ చేస్తూ జీఓ నెంబర్ 560 జారీచేసింది. ► 4,76,206 గిరిజనుల కుటుంబాల గృహావసరాలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తోంది. ► గిరిజనులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తూ కురుపాంలో రూ.153 కోట్లతో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాలకు సీఎం శ్రీకారం చుట్టారు. ► కోట్లాది రూపాయలతో విద్యా సంస్థల భవనాలు, గిరిజన ప్రాంతాల్లోని రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. è రాష్ట్రానికి మంజూరైన గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రస్తుతం విజయనగరం వద్ద నిర్వహిస్తున్నారు. ► కరోనా కష్టకాలంలో.. అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అడవి బిడ్డలకు అండగా నిలిచింది. ► ఇక విశాఖ జిల్లా తాజంగిలో రూ.35 కోట్లతో గిరిజన సమరయోధుల మ్యూజియం, కాపులుప్పాడలో రూ.45 కోట్లతో అల్లూరి సీతారామరాజు స్మారక మ్యూజియం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. విశాఖలో రూ.10కోట్లతో ట్రైబల్ రీసెర్చ్ మిషన్ (టీఆర్ఎం)కు భవన నిర్మాణం పూర్తయింది. గిరిజనులకు వైఎస్ కుటుంబమే బాసట నాడు వైఎస్సార్ ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డి పాలనలో గిరిజనులకు ఎంతో మేలు జరిగింది. అందుకే వీరిని గిరిజనులు దైవంతో సమానంగా భావిస్తారు. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటుచేశారు. మరో జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదనలున్నాయి. గిరిజనులకు విద్య, వైద్యం రెండు కళ్లుగా భావిస్తూ సీఎం జగన్మోహన్రెడ్డి విద్యాసంస్థలు, ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. ప్రత్యక్షంగానే రూ.9వేల కోట్లకు పైగా వారికి లబ్ధిచేకూర్చారు. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి -
సమావేశమా.. అయితే సందర్శకులు బంద్!
సాక్షి, హైదరాబాద్: ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, స్వయం ఉపాధికి రాయితీ రుణాలు, కల్యాణలక్ష్మి, దళితబంధు లాంటి ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తున్న వివిధ సంక్షేమ శాఖల కార్యాలయాలకు నిత్యం సందర్శకుల తాకిడి ఉంటుంది. పేదలకు నేరుగా లబ్ధి చేకూరే ఈ పథకాలు అమలు చేస్తున్న ప్రధాన కార్యాలయాలున్నది మాసాబ్ట్యాంక్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో. వందల మంది లబ్ధిదారులు ఇక్కడ సంబంధిత శాఖల ఉన్నతాధికారులను నేరుగా కలసి తమ గోడు వినిపించుకుంటారు. అలాంటి వారి సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారం లభిస్తుంది. ఆ నమ్మకంతోనే ఇక్కడికి రాష్ట్రం నలు మూలలనుంచి వస్తుంటారు. కానీ ప్రస్తుతం సందర్శకులపై ఆంక్షలు విధించారు. గిరిజన సంక్షేమ శాఖ నిర్వహణలో ఉన్న ఈ భవన్లో సందర్శకులను అనుమతించడం లేదు. ఈ శాఖ ఉన్నతాధికారుల సమావేశాల పేరిట ఇతర కార్యాలయాలకు వచ్చే వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారు. రోజూ ఈ శాఖ అధికారులకు సంబంధించి ఏదో ఒక సమావేశం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆరు అంతస్తుల్లో వివిధ కార్యాలయాలున్న సంక్షేమ భవన్లో మొదటి అంతస్తు వద్దే సందర్శకులను నిలువరిస్తుండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు సంబంధిత ఉన్నతాధికారులను కలవకుండా ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. గురుకుల ప్రవేశాలతో రద్దీ.. ప్రస్తుతం సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి సీట్ల కేటాయింపులన్నీ ఆన్లైన్ పద్ధతి ద్వారానే జరుగుతున్నా.. వివరాల్లో పొరపాట్లు, రిపోర్టింగ్ వివరాలు, ఇతర సమస్యలతో పెద్ద సంఖ్యలో పిల్లల తల్లిదండ్రులు ప్రతిరోజూ సంక్షేమ భవన్కు వస్తున్నారు. ముఖ్యంగా రెండో అంతస్తులోని బీసీ గురుకుల సొసైటీ కార్యాలయానికి విద్యార్థులు, తల్లిదండ్రుల తాకిడి అధికంగా ఉంటోంది. ఈ క్రమంలో మొదటి అంతస్తు వరకే సందర్శకులను అనుమతించడం, పైఅంతస్తుల్లోకి పంపకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బందిని నిలదీస్తున్న కొందరిని లిఫ్ట్ ద్వారా అనుమతిస్తుండగా.. అధికశాతం సందర్శకులను నిలిపివేస్తుండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళితబంధు పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు సైతం సంక్షేమ భవన్లోని ఐదో అంతస్తులో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయ అధికారులను కలిసేందుకు అనుమతి దొరకడం లేదు. కాగా, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమావేశం మందిరం మెట్ల దారి పక్కనే ఉందని, సమీక్షలు, సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎవరినీ అనుమతించవద్దని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించినందునే సందర్శకులను నిలిపివేస్తున్నామని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. -
భావి తరాలకు పదిలంగా..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను రాబోయే తరానికి అందించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చేస్తున్న కృషి ఫలిస్తోంది. గిరిజన తెగల సంస్కృతి, భాషల అధ్యయనం విస్తృతంగా సాగుతోంది. గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను వీడియో డాక్యుమెంటేషన్ చేసి విస్తృత ప్రచారం కల్పించేందుకు గట్టి ప్రయత్నం జరుగుతోంది. గిరిజనుల వారసత్వాన్ని పరిరక్షిస్తూ వాటికి సంబంధించిన సమాచారాన్ని రాబోయే తరాలకు తెలియజేయడం కోసం గిరిజన వస్తు ప్రదర్శనశాలలు(మ్యూజియం)ను ఏర్పాటు చేసింది. అరకులోయ, శ్రీశైలం, సీతంపేట(శ్రీకాకుళం జిల్లా)లో గిరిజన వస్తు ప్రదర్శనశాలలను గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది. షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన సాహిత్యం, వాజ్ఞయాలతో కూడిన 15 వేలకు పైగా పుస్తకాలను రూపొందించడంతోపాటు, వాటిలోని చాలా వరకు డిజిటలైజేషన్ చేసింది. గ్లోబలైజేషన్ యుగంలో వివిధ గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలుపై హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించిన చర్చాగోష్టిలో సమర్పించిన పత్రాలను నాలుగు సంపుటాలుగా వెలువరించింది. గిరిజన బడుల్లో 1 నుంచి 3వ తరగతి వరకు చదువుతున్న గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషలోనే విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకుంది. కోయ, ఆదివాసి, సుగాలి, కొండ, సవరా, భారతి, కువి, భాషల్లో 54 వాచకాలు రూపొందించి గిరిజన విద్యార్థులకు అందించింది. బడగ, గదబ, కొండకాపు, గౌడు, కొఠియా, రోనా, భిల్లు, పరంగి పోర్జా, పోర్జా, మాలి, ధూలియా, కట్టునాయకన్, యానాది వంటి గిరిజన తెగలకు చెందిన వారి సంస్కృతి భాష, ఇతర సంప్రదాయాలపై సమగ్ర అధ్యయనాలను చేపట్టింది. కొండరెడ్డి, కోండ్, గదబ, చెంచు, కొరజ, సవర, జాతాపు, నక్కల, కోయ, వాల్మీకి తెగల ఆచార వ్యవహారాలను సంస్కృతిని సంప్రదాయక పరిజ్ఞానాన్ని పరిరక్షించడం కోసం వారి జీవన శైలిని వీడియో రూపంలో డాక్యుమెంటేషన్ చేయడం విశేషం. ఏటా గిరిజనోత్సవాలు గిరిజన సంస్కృతిని వెలుగులోకి తేవడంతోపాటు గిరిజన స్వాతంత్య్ర పోరాటాలను స్మరించుకోవడానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఏటా గిరిజనోత్సవాలను నిర్వహిస్తోంది. అలాగే ప్రతి ఏడాది మే నెలలో మోదకొండమ్మ జాతర, జూలై 4న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, ఆగస్ట్ 9న ప్రపంచ ఆదివాసీల దినోత్సవం నిర్వహిస్తోంది. గిరిజన కళలను ప్రోత్సహించేందుకు అనేక పోటీలు, ఔత్సాహిక కార్యక్రమాలను చేపడుతోంది. గిరిజన నాట్య బృందాలకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే గిరిజన ఉత్సవాల్లో పోటీలకు పంపిస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయపూర్లో 2019లో జరిగిన జాతీయ గిరిజన నృత్యోత్సవంలో రాష్ట్రానికి చెందిన ‘కొండరెడ్ల కొమ్ము’ నాట్యానికి 3వ బహుమతి వచ్చింది. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నాం.. సీఎం జగన్ ఆదేశాలతో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు అనేక చర్యలు చేపట్టాం. గిరిజన తెగలకు సంబంధించిన విస్తృత సమాచారాన్ని ప్రపంచానికి అందించేందుకు కృషి చేస్తున్నాం. గిరిజనుల జీవనశైలి, వారి సంస్కృతి, వేషభాషలు, సంగీత, నాట్య పరికరాలు, వ్యవసాయ పరికరాలు, కళలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని సేకరించి మ్యూజియంలతోపాటు, వీడియోలు, ఫొటోలు, డిజిటలైజేషన్ తదితర రూపాల్లో అందుబాటులోకి తెస్తున్నాం. మరింత పరిజ్ఞానం తెలుసుకునేలా అధ్యయనం చేపట్టడంతోపాటు గిరిజన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాం. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి -
స్టార్స్.. మెమ్స్!
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలలు కొత్త రూపును సంతరించుకోబోతున్నాయి. ఈ శాఖ పరిధిలోని ఆశ్రమ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2022–2023) నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఈ స్కూళ్లను మరింత ఆధునీకరించబోతున్నారు. నాణ్యమైన బోధన, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు రూ. 25 కోట్లు అవసరమవుతాయని గుర్తించారు. గురుకుల పాఠశాలల స్థాయిలో ఆశ్రమ పాఠశాలలు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 326 ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిల్లో మూడు నుంచి పదో తరగతి వరకు బోధిస్తున్నారు. 1.05 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీళ్లకు ఉచిత వసతి, భోజన సౌకర్యము కల్పిస్తారు. ఇవిగాక 1,432 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 30 వేల మంది పిల్లలున్నారు. ఈ పాఠశాలన్నీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయి ఆంగ్ల మాధ్యమంలోకి మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలల పేర్లను ‘ఎస్టీ అడ్వాన్స్డ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (స్టార్)’గా, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను మోడల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ (మెమ్స్)గా పేరు మార్చనున్నారు. ఆశ్రమ పాఠశాలలన్నింటినీ గురుకుల పాఠశాల మాదిరి నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. విడతల వారీగా టీచర్లకు శిక్షణ ఆశ్రమ, గిరిజన ప్రభుత్వ పాథమిక పాఠశాలలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా మార్చే క్రమంలో అన్ని రకాల వసతులు సమకూర్చాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. లైబ్రరీ, ప్రయోగ శాలలు, ఆట వస్తువులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, టీచర్లలో బోధన సామర్థ్యం పెంపు, బ్రిడ్జి కోర్సులను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రాథమిక సౌకర్యాల కోసం కనీసం రూ.25 కోట్లు అవసరమని గిరిజన సంక్షేమ శాఖ గుర్తించింది. మరింత లోతుగా ప్రణాళిక తయారు చేస్తోంది. మరోవైపు ఆశ్రమ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల టీచర్లకు శిక్షణ తరగతులను గిరిజన సంక్షేమ శాఖ ప్రారంభించింది. విడతల వారీగా అన్ని కేటగిరీల్లోని టీచర్లకు శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం రూ.5 కోట్లు కేటాయించింది. -
హెచ్ఐవీ బాధిత ఎస్టీ కుటుంబాలకు చేయూత
సాక్షి, అమరావతి: హెచ్ఐవీ బాధిత గిరిజన కుటుంబాలకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చేయూత అందిస్తోంది. హెచ్ఐవీ కారణంగా బతుకుదెరువు లేక మానసికంగా కుంగిపోకుండా వారిలో మనోధైర్యం నింపేలా ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. బాధితులు తమ కుటుంబాలను పోషించుకునేలా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేసి స్వయం ఉపాధి చూపించే చర్యలు చేపట్టింది. ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఇప్పటికే 117 మంది బాధితులను గుర్తించి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎస్టీల్లో హెచ్ఐవీ బాధితుల జాబితాలు పంపించాలని కలెక్టర్లను కోరామని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రత్యేక శ్రద్ధతో ఎస్టీల్లో హెచ్ఐవీ బాధితులకు రూ.1.17 కోట్లు మంజూరయ్యాయని గిరిజన సంక్షేమ అధికారి ఎం.రుక్మాంగదయ్య చెప్పారు. -
గిరిజనుల స్వయం ఉపాధికి సర్కార్ కృషి
డుంబ్రిగుడ/అరకులోయ రూరల్: అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే గిరిజనుల స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే చెప్పారు. విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో డుంబ్రిగుడ మండలం అరకు సంతబయలు జీసీసీ గోడౌన్లో కొర్రాయి వీడీవీకే ఏర్పాటు చేసిన బిస్కెట్ తయారీ కేంద్రాన్ని ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ, అరకు ఎమ్మెల్యే ఫాల్గుణతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంతీలాల్ దండే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కృషితో కేంద్ర ప్రభుత్వం 350 వన్ధన్ వికాస కేంద్రాలను ఏపీకి మంజూరు చేసిందన్నారు. సీతంపేట, పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల పరిధిలో వీటిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అటవీ ఉత్పతులకు అదనపు విలువ జోడించి ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. వీటిని కాటేజీ పరిశ్రమ కిందకు మారిస్తే విద్యుత్ రాయితీ పొందవచ్చని సూచించారు. ఎమ్మెల్యే ఫాల్గుణ మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా తగిన సహకారం అందిస్తోందన్నారు. అనంతరం కాంతీలాల్ దండే కుటుంబ సమేతంగా అరకులోయను సందర్శించారు. గిరి గ్రామదర్శినిలో కాంతిలాల్ దంపతులకు గిరిజన సంప్రదాయ దుస్తులు వేసి మరోసారి పెళ్లి తంతు జరిపించారు. సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్న ఈ రోజుల్లో గిరి గ్రామదర్శిని నిర్వహణ అభినందనీయమన్నారు. పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ ఎస్ఈ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ చట్టారి జానకమ్మ, ఎంపీపీ బాక ఈశ్వరి, సర్పంచ్ శారద పాల్గొన్నారు. -
ఆటలకు సై..!
సాక్షి, అమరావతి: గిరిజన బిడ్డలు చదువుల్లోనే కాదు ఇకపై ఆటల్లోనూ దూసుకుపోనున్నారు. రాష్ట్రంలోని గిరిజన పాఠశాలలు, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో క్రీడా మైదానాల అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10 ప్రాంతాల్లో రూ.18 కోట్లతో ఆట స్థలాల అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ పనులను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ(శాప్) పర్యవేక్షిస్తోంది. స్టేడియం నిర్మాణం, క్రీడా సౌకర్యాల ఆధునికీకరణ పథకంలో చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు నాలుగు పనులు పూర్తి కాగా, మరో ఆరు పనులు వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని నెల్లూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని గిరిజన విద్యాలయాల్లో రూ.2 కోట్లతో ఆట స్థలాల అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రెండేసి, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున పనులు జరుగుతున్నాయి. ఈ ఆరు క్రీడా మైదానాల అభివృద్ధికి, క్రీడా పరికరాల ఆధునికీకరణకు రూ.16 కోట్లు కేటాయించారు. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలోని అన్ని గిరిజన పాఠశాలలకు సంబంధించిన క్రీడా మైదానాలను మట్టి, ఇసుకతో మెరక చేసి అభివృద్ధిపరిచేలా ‘సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)’లకు బాధ్యతలు అప్పగించారు. ఆట స్థలాల అభివృద్ధి పనులను నాడు–నేడు, ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాల్లో చేపట్టాలని ప్రతిపాదించారు. ఇందుకోసం తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకుల విద్యాలయాన్ని ప్రయోగాత్మకం(ఫైలెట్)గా తీసుకుని ఆటస్థలం అభివృద్ధి పనులు చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. -
పాడేరు ఐటీడీఏ ఈఈపై ఏసీబీ దాడులు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : గిరిజన సంక్షేమ శాఖ అధికారిపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) శనివారం దాడులు నిర్వహించింది. పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) కాట్రెడ్డి వెంకటసత్యనగేష్కుమార్పై అక్రమాస్తులపై ఫిర్యాదు రావడంతో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలపై ఏసీబీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖతో పాటు మూడు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగాయి. విశాఖ, అనకాపల్లిలోని నగేష్కుమార్ ఇళ్లు, పాడేరులోని కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నగేష్కుమార్, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో రెండు ఫ్లాట్లు, 9 ఇళ్ల స్థలాలు, 6.50 ఎకరాల సాగు భూమి, రెండు కార్లు, నగదు, బంగారు, వెండి వస్తువులను గుర్తించారు. వాటి విలువ రూ.2,06,17,622 ఉంటుందని అంచనా వేశారు. మొత్తంగా ప్రాథమిక దర్యాప్తులో ఆదాయానికి మించి రూ.1,34,78,180 ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించారు. బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉంది. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ ప్రధాన కార్యాలయం పేర్కొంది. -
గిరిజన కష్టాలకు కాంగ్రెస్సే కారణం
భోపాల్: కాంగ్రెస్ హయాంలో గిరిజనుల సంక్షేమం మరుగునపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. గత పాలకుల వల్ల ఇప్పటికీ వెనుకబాటుకు గురైన ప్రాంతాల అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. గత ప్రభుత్వాల వీఐపీ సంస్కృతి నుంచి ఈపీఐ(ప్రతి వ్యక్తీ ముఖ్యుడే) సాధన దిశగా దేశం ప్రస్తుతం పరివర్తన చెందుతోందని ప్రధాని అన్నారు. సోమవారం ఆయన భోపాల్లో జన్జాతీయ గౌరవ్ దివస్ మహాసమ్మేళన్లో మాట్లాడారు. అనంతరం ప్రధాని ఆధునీకరించిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. గోండ్ రాణి దుర్గావతి ధైర్యసాహసాలు, రాణి కమలాపతి త్యాగాలను దేశం ఎన్నటికీ మరువదన్నారు. ‘గత ప్రభుత్వాల్లో గిరిజనులకు సముచిత స్థానం దక్కలేదు. కనీస సౌకర్యాలకు కూడా నోచుకోలేదు. అంబేద్కర్ జయంతి, గాంధీ జయంతి, వీర్సావర్కర్ జయంతిల మాదిరిగానే భగవాన్ బిర్సాముండా జయంతిని ఏటా నవంబర్ 15న నిర్వహిస్తాం’అని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్న 50 ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈపీఐ దిశగా పరివర్తన: గత ప్రభుత్వాల వీఐపీ సంస్కృతి నుంచి ఈపీఐ(ప్రతి వ్యక్తీ ముఖ్యుడే) సాధన దిశగా దేశం ప్రస్తుతం పరివర్తన చెందుతోందని ప్రధాని చెప్పారు.‘వీఐపీ సంస్కృతి నుంచి ఈపీఐ(ప్రతి ఒకరూ ముఖ్యులే) అన్న ఆదర్శం దిశగా దేశం పరివర్తన చెందుతోందనడానికి ఇదే ఉదాహరణ. దేశవ్యాప్తంగా 175 రైల్వే స్టేషన్లలో ఇటువంటి అత్యాధునిక వసతులను సమకూరుస్తాం’అని చెప్పారు గత ప్రభుత్వాల హయాంలో రైల్వే ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు 40–50 ఏళ్లు పట్టేంది. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1,100 కిలోమీటర్ల ఈస్టర్న్, వెస్టర్న్ ఫ్రెయిట్ కారిడార్ల పనులు ఏడేళ్లలోపే పూర్తయిందన్నారు. -
జాతీయ ఆదివాసీ దినోత్సవం: గిరిజన కళలకు 'కళ'
సాక్షి, అమరావతి/బీచ్రోడ్డు(విశాఖ తూర్పు): గిరిజన కళలకు ఊతమిచ్చేలా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ వారం పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 146వ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ‘జన్ జాతి గౌరవ దివస్’(జాతీయ ఆదివాసీ దినోత్సవం)గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22 వరకు గిరిజన కళలను ప్రోత్సహించేలా కార్యాచరణ చేపట్టారు. దీనిలో భాగంగా విశాఖ ఆర్కే బీచ్లో సోమవారం ప్రారంభించిన గిరిజన హస్తకళల ప్రదర్శన, విక్రయాలు 19 వరకు కొనసాగుతాయి. సవర, కొండరెడ్డి, కొండదొర, నూకదొర, కోయ, జాతపు, కొండ కమ్మర, వాల్మీకి, భగతహ, కొటియా తదితర ఆదిమ గిరిజనులు రూపొందించిన హస్త కళలను ఐదు రోజుల పాటు ప్రదర్శించనున్నారు. గిరిజన సంప్రదాయ, ప్రత్యేకత కలిగిన ఈ హస్తకళ నైపుణ్యాలను మరో తరానికి అందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు దోహదపడతాయి. గిరిజన హస్తకళాకారులకు జీవనోపాధి చూపడంతో పాటు.. సంప్రదాయ గిరిజన హస్తకళలను నిలబెట్టేందుకు 12 ప్రధాన రకాల ఉత్పత్తులతో గిరిజన సంక్షేమ శాఖ స్టాల్స్ను ఏర్పాటు చేసింది. మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ గిరిజన ప్రాంతాల నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా థింసా నృత్యం చేస్తున్న సమయంలో గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ రంజిత్ బాషా, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశా కూడా నృత్యం చేశారు. డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలు రాష్ట్రంలోని గిరిజన కళాకారులను ప్రోత్సహించేలా ఈ నెల 18 వరకు డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పర్యవేక్షణలో నిర్వహించే ఈ పోటీల్లో విజేతలకు ఈ నెల 21న రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి రూ.50 వేలు, రూ.25 వేలు, రూ.15 వేల చొప్పున ఈ నెల 22న జరిగే ముగింపు కార్యక్రమంలో బహుమతులను అందిస్తారు. గిరిజన పోరాట యోధుడు.. బిర్సా ముండా ఆదివాసీల కోసం బ్రిటీష్ వారిపై వీరోచితంగా పోరాడిన గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతి రోజైన నవంబర్ 15న ‘జన్ జాతి గౌరవ దివస్’గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 1875 నవంబర్ 15న రాంచీలో జన్మించిన బిర్సా ముండా 1900 జూన్ 9న రాంచీ సెంట్రల్ జైల్లోనే మరణించాడు. గిరిజన వ్యవసాయ పద్ధతులను, జీవన విధానాలను దెబ్బతీసే చర్యలకు పాల్పడిన బ్రిటీష్ వారిపై పోరాటం చేశాడు. ఆయన స్ఫూర్తి భావితరాలకు అందించాలని కేంద్రం ఆయన జయంతిని జన్ జాతి గౌరవ దివస్గా నిర్వహిస్తోంది. -
ఐబీపీఎస్ పరీక్షలకు ఎస్టీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గిరిజన స్టడీ సర్కిల్లో ఐబీపీఎస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమశాఖ సంయుక్త సంచాలకుడు సముజ్వల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు నెలల పాటు నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు studycircle.cgg.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల అర్హతలో మెరిట్ ఆధారంగా శిక్షణకు ఎంపిక చేస్తామని, మొత్తం వంద మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. మూడోవంతు సీట్లు మహిళలకు కేటాయించామన్నారు. వివరాలకు 6303497606 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. -
గిరిజన గర్భిణులకు కొండంత రక్షణ
సాక్షి,అమరావతి: మన్యంలోని గర్భిణులకు కొండంత రక్షణగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ప్రెగ్నెంట్ ఫ్రెండ్లీ’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మరింత సమన్వయంతో సమర్థవంతమెన ఆరోగ్య సేవలు అందించేలా ‘ట్రైబల్ హెల్త్ కొలాబరేటివ్ మానిటరింగ్ సిస్టం’ (గిరిజన ఆరోగ్య సమన్వయ పర్యవేక్షణ విధానం) పేరుతో ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ దీనిని నిర్వహించనుంది. గిరిజన గర్భిణులకు కొత్తగా అందించనున్న సేవలతోపాటు కొత్త యాప్ను కూడా సోమవారం ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. విశాఖ జిల్లా పాడేరులో నిర్వహించే ట్రయల్ రన్ను ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పర్యవేక్షిస్తారు. యాప్తో ప్రయోజనాలు ఇలా ఏజెన్సీ ప్రాంత గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ రూపొందించిన ఈ ప్రత్యేక యాప్తో ప్రయోజనం మెండుగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గిరిజనుల ఆరోగ్య సమాచారం సేకరించి ఈ యాప్లో పొందుపరుస్తారు. గర్భిణుల నుంచి చిన్నారుల వరకు అవసరమైన వైద్యసేవలు సకాలంలో అందించేలా ఈ యాప్ ఎప్పటికప్పుడు అధికారులను, సంబంధిత విభాగాల సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. సమాచార సేకరణ నుంచి వైద్య సేవలు అందించే వరకు గిరిజన సంక్షేమ, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ, విద్యా శాఖల సమన్వయంతో పనిచేసేలా దీనిని రూపొందించారు. యాప్లో పొందుపరిచిన సమాచారం మేరకు ప్రసవానికి 30 రోజుల ముందు నుంచే గర్భిణులకు వైద్యం అందించే వైద్యంపై ఆయా కుటుంబాల వారికి ఆశ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు అవగాహన కల్పిస్తారు. 20 రోజుల ముందు వారిని ఏ ఆస్పత్రికి తరలించేది గ్రామ సచివాలయాలకు సమాచారం అందిస్తారు. ప్రసవానికి 15 రోజుల ముందు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆస్పత్రికి సమాచారం అందిస్తారు. 10 రోజుల ముందు ఐటీడీఏ పీవోలకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తారు. ప్రసూతి వసతి గృహాలకు తరలింపు ఈ యాప్ ద్వారా ఒకవైపు అధికారులను అప్రమత్తం చేస్తూ మరోవైపు గర్భిణులకు అవగాహన, వారి బంధువులకు కౌన్సెలింగ్ ఇచ్చి ప్రసవానికి 30 నుంచి 10 రోజుల సమయం ఉండగానే ప్రసూతి వసతి గృహాలకు తరలిస్తారు. ఇందుకోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా 41 ప్రసూతి వసతి గృహాలను ఏర్పాటు చేశారు. వాటిలో 2,600 బెడ్లు సమకూర్చారు. ప్రసవానికి ముందు నుంచి గర్భిణులు ఆరోగ్యంగా, ఆనందంగా గడిపేలా ఆట పాటలతో కూడిన వాతావరణ కల్పిస్తారు. అంతేకాకుండా వారికి ఆరోగ్యం పట్ల అవగాహన తరగతులు నిర్వహించడంతోపాటు బలమైన ఆహారం అందిస్తారు. తల్లీబిడ్డల మరణాలు తగ్గించడమే లక్ష్యం గిరిజన ప్రాంతాల్లో తల్లీబిడ్డల మరణాలు లేకుండా చూసేందుకు ప్రభుత్వం అనేక విప్లవాత్మక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే డోలీతో మోసుకొచ్చే పద్ధతికి స్వస్తి పలుకుతూ బైక్ అంబులెన్సులు అందుబాటులోకి తెచ్చాం. ఈ యాప్లో గర్భిణుల వివరాలతోపాటు గురుకుల విద్యార్థుల వివరాలు, చిన్నారులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, వారికి అందించాల్సిన వైద్య సేవలు వంటి ఎన్నో వివరాలు ఉంటాయి. – పుష్ప శ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి -
గిరిజనులకు భూమి పట్టాల పంపిణీలో ఏపీ ఆదర్శం
సాక్షి, అమరావతి: అర్హత కలిగిన గిరిజనులందరికీ అటవీ హక్కుల చట్టం (ఆర్ఓఎఫ్ఆర్) పథకం ద్వారా భూమి పట్టాలను అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధానం అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయమని తెలంగాణ అధికారుల బృందం ప్రశంసించింది. గిరిజనులకు భూమి పట్టాల పంపిణీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొంది. ఏపీలో ఆర్ఓఎఫ్ఆర్ పథకం అమలు అవుతున్న తీరుపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఆ రాష్ట్ర అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేయడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారీగా పట్టాలను ఏ విధంగా పంపిణీ చేశారనే విషయమై అధ్యయనం చేసేందుకు ఆ రాష్ట్ర అధికారుల బృందం శనివారం ఏపీకి వచ్చింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు దిలీప్ కుమార్, ప్రవీణ్కుమార్, టి,మహేష్, టి.శ్రీనివాసరావు వెలగపూడి సచివాలయంలో ఏపీ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ పి.రంజిత్ బాషాతో సమావేశమయ్యారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేయడానికి అనుసరించిన విధానాలను అడిగి తెలుసుకున్నారు. అటవీ హక్కుల పట్టాలను మంజూరు చేసే చట్టాలలో ఉన్న సమస్యలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. 2.29 లక్షల ఎకరాలు పంపిణీ రాష్ట్రంలో అర్హత కలిగిన గిరిజనులందరికీ ఆర్ఓఎఫ్ఆర్ పథకం ద్వారా అటవీ భూములకు పట్టాలు అందిస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేశారని రంజిత్ బాషా తెలంగాణ అధికారులకు వివరించారు. గతేడాది అక్టోబర్ 2న ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీని ప్రారంభించారన్నారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ ఇవ్వనంత భారీగా ఇప్పటి వరకూ 2.29 లక్షల ఎకరాల భూమి పట్టాలను గిరిజనులకు అందించారని చెప్పారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి గిరిజన కుటుంబానికి ఆర్ఓఎఫ్ఆర్ పథకం కింద కనీసం 2 ఎకరాల భూమికి పట్టాలను అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. అటవీ భూములలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులందరికీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను అందించామని తెలిపారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. అటవీ భూములు కాకపోతే తిరస్కరించే వారు ► గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములు అటవీ శాఖకు చెందినవి అయితేనే గతంలో వారికి పట్టాలు ఇచ్చే వారు. అటవీ భూములు కాకపోతే దరఖాస్తులు తిరస్కరించే వారు. ఈసారి అలా కాకుండా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు అటవీ శాఖకు చెందని రెవెన్యూ భూములైతే వాటికి డీకేటీ పట్టాలను అందించాలని సీఎం ఆదేశించారు. ► ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలతో పాటుగా డీకేటీ పట్టాలను కూడా గిరిజనులకు అందించాం. ఇప్పటి వరకు 2,28,334 ఎకరాల భూమిని 1.24 లక్షల మంది గిరిజనులకు పట్టాలుగా ఇచ్చాం. 26 వేల మంది గిరిజనులకు 39 వేల ఎకరాల రెవెన్యూ భూమిని డీకేటీ పట్టాలుగా అందించాం. ► ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మరింత మంది గిరిజనులకు భూమి పట్టాలను అందించనున్నాం. పట్టాలు మంజూరు చేసిన భూములలో సరిహద్దు రాళ్లను నాటడంతో పాటు ఉపాధి హామీ పథకం ద్వారా ఆ భూముల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ► గిరిజనులకు సంబంధించిన భూమి వివరాలు.. ఇతర సంక్షేమ పథకాల ద్వారా వారు పొందుతున్న ప్రయోజనాలను సమీక్షించడానికి ‘గిరిభూమి’ పోర్టల్ను అభివృద్ధి చేస్తున్నాం. -
ఏపీ గిరిజన సంక్షేమానికి ఐఎస్వో సర్టిఫికెట్
సాక్షి, అమరావతి: ఉత్తమ పనితీరు కనబరిచిన ఏపీ గిరిజన సంక్షేమ ప్రధాన కార్యాలయం, ఏపీ గిరిజన సహకార ఆర్థిక సంస్థలకు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సరి్టఫికెట్(ఐఎస్వో) లభించింది. ఈ మేరకు ఏపీ గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు పి.రంజిత్బాషా, ఏపీ గిరిజన సహకార ఆరి్థక సంస్థ ఎండీ ఇ.రవీంద్రబాబు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పలు పథకాల అమలు, నిర్వహణ, సేవలు తదితర అనేక అంశాలపై హైమ్ ఇంటర్నేషనల్ సరి్టఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్(హైదరాబాద్) సంస్థ మదింపు(ఆడిట్) చేసి ఈ ఐఎస్వో సరి్టఫికెట్ను ప్రకటించినట్లు పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన విజయవాడలోని ఈ రెండు ప్రధాన కార్యాలయాలు ఉత్తమ పనితీరుతో అంతర్జాతీయ గుర్తింపు పొందడం వరుసగా ఇది మూడో ఏడాది అని రంజిత్బాషా, రవీంద్రబాబు తెలిపారు. -
గిరిజన సంక్షేమంలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో కూడా గిరిజనులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అభినందనీయమని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ నావల్జిత్ కపూర్ పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని ప్రశంసించారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో సోమవారం కేంద్ర, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలు, ఏపీ గిరిజన సాంస్కృతిక పరిశోధన–శిక్షణ మిషన్, సెంటర్ రీజనల్ స్టడీస్ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరిగింది. వర్చువల్ విధానంలో ఈ సదస్సులో పాల్గొన్న నావల్జిత్ కపూర్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, మంచినీరు, రోడ్లు తదితర మౌలిక వసతులను కల్పించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఏపీలో గిరిజన ఉప ప్రణాళిక అమలుకు సహకారం అందిస్తామన్నారు. ఉప ప్రణాళిక అమలులో ముందున్నాం.. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. గిరిజన ఉప ప్రణాళిక అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పారు. నవరత్నాలతో పాటు పలు సంక్షేమ పథకాల ద్వారా గిరిజనుల జీవితాల్లో సీఎం జగన్ కొత్త వెలుగులు నింపారని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమం, హక్కుల రక్షణలో ఏపీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఏపీ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతీలాల్ దండే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గిరిజనులకు 2వ దఫా పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు పి.రంజిత్బాషా, గిరిజన సంక్షేమ శాఖ మిషన్ సంచాలకుడు రవీంద్రబాబు, డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. థింసా నృత్యం చేసిన మంత్రి పుష్పశ్రీవాణి సీతానగరం(పార్వతీపురం)/కురుపాం/ పాడేరు: విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే జోగారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి పాల్గొన్నారు. స్థానిక గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, జోగారావు, ఎమ్మెల్సీ రఘువర్మ, ఐటీడీఏ పీవో కూర్మనాథ్ తదితరులు పాల్గొన్నారు. పాడేరులో ఘనంగా: విశాఖ ఏజెన్సీలోని పాడేరులో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో ఎంపీ గొడ్డేటి మాధవి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు కె.భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, కలెక్టర్ మల్లికార్జున, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ నర్సింగరావు, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బుల్లిబాబు, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ హాజరయ్యారు. -
'పోలవరం' పునరావాసం భేష్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన రీతిలో పునరావాసం కల్పిస్తోందని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అనిల్కుమార్ ఝా ప్రశంసించారు. పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి.. నాణ్యతతో ఇళ్లను నిర్మిస్తున్నారని అభినందించారు. గోదావరి వరదలవల్ల గిరిజనులు ఇబ్బంది పడకుండా పునరావాసం కల్పించాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు సహాయ పునరావాస (ఆర్అండ్ ఆర్) ప్యాకేజీ కింద పునరావాసం కల్పించడాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ‘మానిటరింగ్ కమిటీ’ని కేంద్రం ఏర్పాటుచేసింది. ఈ కమిటీ గురువారం అనిల్కుమార్ ఝా అధ్యక్షతన వర్చువల్ విధానంలో సమావేశమైంది. పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, సభ్య కార్యదర్శి ఎన్కే శ్రీనివాస్, రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి, సీఈ సుధాకర్బాబు, పోలవరం అడ్మినిస్ట్రేటర్ ఆనంద్ పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేసేలా పనులను వేగవంతం చేశామని శ్యామలరావు చెప్పారు. నిర్వాసితులకు వేగంగా ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పి అక్కడ మౌలిక సదుపాయాల కల్పన పనులను వర్చువల్ విధానంలో చూపించారు. వీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని నియమించాలని ఆదేశించారన్నారు. వాటిని పరిశీలించిన ఝా సంతృప్తి వ్యక్తంచేశారు. ఇళ్లను వేగంగా, నాణ్యంగా నిర్మిస్తున్నారని ప్రశంసించారు. ఈ సీజన్లో వరదలవల్ల నిర్వాసితులు, గిరిజనులు ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా పునరావాసం కల్పించాలని ఆదేశించారు. వచ్చే నెలలో పునరావాస కాలనీలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని చెప్పారు. వారి జీవనోపాధులను మెరుగుపర్చడంపై కూడా దృష్టి పెట్టాలని ఝా సూచించగా.. శ్యామలరావు స్పందిస్తూ.. ఆ మేరకు చర్యలు చేపట్టామన్నారు. -
ఏజెన్సీ విద్యార్థులకు ‘గిరిదర్శిని’!
సాక్షి, హైదరాబాద్: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నడుంబిగించింది. ఈ మేరకు ‘గిరిదర్శిని’పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ నేపథ్యంలో పాఠశాలలు ఇంకా తెరుచుకోకపోవడం, ఆన్లైన్ పద్ధతిలోనే బోధన సాగుతుండటంతో విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయుక్తం కానుంది. అయితే పాఠశాలలకు విద్యార్థులు వచ్చి స్టడీ మెటీరియల్ తీసుకునే బదులుగా వారి ఇళ్లకే నేరుగా పంపడం, అందులోని నిర్దేశిత అసైన్మెంట్ను పూర్తి చేసిన తర్వాత తిరిగి వాటిని సేకరించి పాఠశాలలకు చేర్చే బాధ్యతను తపాలా శాఖకు అప్పగించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య తపాలాశాఖ వారధిగా వ్యవహరించనుంది. గిరిజన సంక్షేమ శాఖతో తపాలాశాఖ అవగాహన కుదుర్చుకుంది. 3 నుంచి 10వ తరగతి వరకు ప్రతి విద్యార్థికీ స్టడీ మెటీరియల్ అందించేలా గిరిజన సంక్షేమ శాఖ కార్యాచరణ రూపొందించింది. ఆన్లైన్ సౌకర్యం లేని వారికి.. ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఇంటర్నెట్ సౌకర్యం, స్మార్ట్ ఫోన్లు, వాటి వినియోగంపై అవగాహన లేకపోవడంతో ఆన్లైన్ తరగతులకు విద్యార్థులు దూరంగా ఉంటున్నారు. దాదాపు 5 వేల ఆవాసాల్లోని 400 పాఠశాలల పరిధిలో అలాంటి విద్యార్థులను గిరిజన సంక్షేమ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులందరికీ ఆన్లైన్ బోధనతోపాటు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో బోధన, అభ్యసన కార్యక్రమాల నిమిత్తం స్టడీ మెటీరియల్ను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. నాలుగైదు రోజుల్లో నిర్దేశించిన పాఠశాలల విద్యార్థులకు తపాలా శాఖ ద్వారా స్టడీ మెటీరియల్ పంపిణీ కానుంది. స్టడీ మెటీరియల్ వినియోగం, అసైన్మెంట్ వర్కవుట్పై సూచనలూ అందులోనే ఇచ్చారు. మరోవైపు ఫోన్లు అందుబాటులో ఉన్న విద్యార్థులతో ఉపాధ్యాయులు నిత్యం మాట్లాడి సందేహాలను నివృత్తి చేస్తారు. -
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఫ్యాకల్టీ పోస్టులు
తెలంగాణ ప్రభుత్వ టీటీడబ్ల్యూ ఆర్ఈఐఎస్ గురుకులానికి చెందిన అశోక్నగర్(వరంగల్ రూరల్), రుక్మాపూర్ (కరీంగనగర్)లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్, ఉమెన్ (టీటీడబ్ల్యూఆర్ఏఎఫ్పీడీసీ).. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 46 ► పోస్టుల వివరాలు: పీజీటీ, టీజీటీ, ఆర్ట్, కంప్యూటర్, కౌన్సిలర్. ► సబ్జెక్టులు: తెలుగు, ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, హిందీ తదితరాలు. అర్హత: ► టీజీటీ పోస్టులకి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్తోపాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సీటెట్/టెట్ అర్హత సాధించి ఉండాలి. ► ఆర్ట్ టీచర్ పోస్టులకి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. ► కంప్యూటర్ టీచర్ పోస్టులకు ఎంసీఏ/బీటెక్ (కంప్యూటర్స్) ఉత్తీర్ణులవ్వాలి. ► కౌన్సిలర్ పోస్టులకు సైకాలజీలో ఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. ► పీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్తోపాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సీటెట్/టెట్ అర్హత సాధించి ఉండాలి. ► వేతనం: టీజీటీ అభ్యర్థులకు నెలకు రూ.30,000, పీజీటీ అభ్యర్థులకు నెలకు రూ.40,000, ఆర్ట్, కంప్యూటర్, కౌన్సిలర్ పోస్టులకు నెలకు రూ.20,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.07.2021 ► వెబ్సైట్: https://tswreis.in/ https://tgtwgurukulam.telangana.gov.in/ కిట్స్, వరంగల్లో ఫ్యాకల్టీ పోస్టులు వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీకి చెందిన అటానమస్ ఇన్స్టిట్యూట్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(కిట్స్).. వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► పోస్టులు: ప్రిన్సిపల్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. ► విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీ రింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరిం గ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. మాస్టర్స్ అభ్యర్థులకు నెట్/స్లేట్/సెట్ అర్హతతోపాటు టీచింగ్/ పరిశోధనలో అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: అకడమిక్ విజయాలు, అనుభవం ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తారు. ఇలా షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ నిర్వహించి.. తుది ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిన్సిపల్, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్–506015 చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 06.07.2021 ► వెబ్సైట్: www.kitsw.ac.in మరిన్ని నోటిఫికేషన్లు: అప్రెంటిస్ ఖాళీలు.. అప్లై చేసుకోండి! పవర్గ్రిడ్లో డిప్లొమా ట్రెయినీ ఖాళీలు -
ఎదురులేని ఏకలవ్యులు!
సాక్షి, అమరావతి: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు’ అనే సూక్తిని నిజం చేస్తున్నారు.. గిరిపుత్రులు. క్రీడల్లో అసమాన ప్రతిభ చూపుతూ జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పతకాలు కొల్లగొడుతున్నారు. గిరిజన గురుకుల విద్యాలయాలు ఇస్తున్న ప్రత్యేక శిక్షణను అందిపుచ్చుకుంటూ పతకాల పంట పండిస్తున్నారు. గిరిజన విద్యార్థులు సహజంగానే కొండకోనల్లో పుట్టి పెరగడం, చిన్ననాటి నుంచి వాటిని ఎక్కిదిగడం వల్ల వారి శరీరం క్రీడలకు అనువుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ వారికి మంచి ప్రోత్సాహమందిస్తూ చక్కటి శిక్షణ ఇప్పిస్తోంది. వ్యాయామం నుంచి యోగా వరకు.. ప్రస్తుతం రాష్ట్రంలో 190 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 51,040 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు కాకుండా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 370 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రతి పాఠశాలలో సుమారు వందమందికిపైగానే విద్యార్థులు ఉన్నారు. ప్రతి గురుకుల, ఆశ్రమ స్కూళ్లకు ఒక ఫిజికల్ డైరెక్టర్ చొప్పున ప్రభుత్వం నియమించింది. వీటిలో పాఠాలతోపాటు క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండటంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. రోజూ ఉదయం 5.30 నుంచే విద్యార్థుల దినచర్య ప్రారంభమవుతుంది. ఉదయం 6.30 గంటల వరకు వ్యాయామం, తర్వాత యోగా తరగతులు నిర్వహిస్తారు. సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఆటల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆగస్టు 15, నవంబర్ 14న స్పోర్ట్స్, గేమ్స్ పోటీలను జోనల్, రాష్ట్ర స్థాయిలో నిర్వహించి ప్రతిభావంతులకు బహుమతులు అందిస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్ సాధిస్తా జాతీయ స్థాయి వెయిట్లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం నెగ్గాలనే లక్ష్యంతో అరకు స్పోర్ట్స్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నాను. రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాను. ఈ నెలలో ఉత్తరప్రదేశ్లో జరిగే పవర్లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటున్నా. – నినావత్ నరసింహ నాయక్, వెయిట్లిఫ్టర్ మెరికల్లా తీర్చిదిద్దుతున్నాం.. గిరిజన విద్యార్థులను క్రీడల్లో మెరికల్లా తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే వారి ప్రతిభ దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు చదువుల్లోనూ మంచి ప్రతిభ చూపుతున్నారు. క్రీడల్లో సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది. – కె శ్రీకాంత్ ప్రభాకర్, కార్యదర్శి, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విశాఖపట్నం జిల్లా అరకు స్పోర్ట్స్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న పవన్ కుమార్ పేద గిరిజన కుటుంబం. జాతీయ స్థాయిలో అండర్–14 జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో కాంస్య పతకం గెలుచుకున్న అతడు ఆ తర్వాత తిరుపతిలో నిర్వహించిన నేషనల్ అథ్లెటిక్స్ మీట్లో 100 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకాన్ని సాధించి అదరగొట్టాడు. గత నెలలో కేరళలో జరిగిన జాతీయ సౌత్ జోన్ అథ్లెటిక్స్ పోటీల్లో ఏకంగా బంగారు పతకాన్ని ఒడిసిపట్టాడు. స్పోర్ట్స్ స్కూల్లో ఇస్తున్న శిక్షణే తనను ఇక్కడి దాకా తీసుకొచ్చిందని చెబుతున్నాడు. విశాఖ జిల్లా చింతపల్లి మండలం కొత్తూరు బయలుకు చెందిన నందకిశోర్ది పేద గిరిజన వ్యవసాయ కుటుంబం. అరకు క్రీడా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అతడు లాంగ్జంప్లో విశేషంగా రాణిస్తున్నాడు. 2019లో కర్ణాటకలో జరిగిన జాతీయ స్థాయి అండర్–14 పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించాడు. అలాగే ఈ ఏడాది అసోంలో జరిగిన నేషనల్ గేమ్స్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించాలన్నదే తన లక్ష్యమని అంటున్నాడు. ప్రత్యేక ఆకర్షణగా అరకు క్రీడా పాఠశాల ప్రభుత్వం విశాఖపట్నం జిల్లా అరకులో ఏర్పాటు చేసిన గురుకుల క్రీడా పాఠశాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ ప్రస్తుతం ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు 180 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి వారి ఆసక్తిని బట్టి విలువిద్య, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, హ్యాండ్బాల్, వాలీబాల్, ఫుట్బాల్, హాకీ, రగ్బీ, వెయిట్లిఫ్టింగ్లో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం మొత్తం ఏడుగురు కోచ్లు ఉన్నారు. ఇద్దరు విద్యార్థులు అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం 10వ తరగతి వరకే ఉండటం వల్ల అండర్–14లో మాత్రమే విద్యార్థులు పాల్గొంటున్నారు. త్వరలోనే జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేసి అండర్–16, అండర్–18లో కూడా పతకాలు సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని స్కూల్ ప్రిన్సిపాల్ పీఎన్ఎన్ మూర్తి తెలిపారు. -
ఐటీడీఏలతో గిరిజనాభివృద్ధి
సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమం, అభివృద్ధిలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలు (ఐటీడీఏ) కీలకపాత్ర పోషిస్తున్నాయి. గిరిజనులను ఆధునిక సమాజం వైపు మళ్లించే కార్యక్రమంలో భాగంగా అటవీ ప్రాంతాల్లో ఇవి ఏర్పాటయ్యాయి. విద్య, వైద్యం వంటి రంగాల్లో వీరికి మరిన్ని సదుపాయాలు కల్పించాలనే ధ్యేయంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అంతేకాక.. గిరిజనుల్లో పోషకాహార లోపాన్ని సరిదిద్దేందుకు, వారికి జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఐటీడీఏల ద్వారా చర్యలు తీసుకుంటోంది. షెడ్యూల్డ్ ఏరియాగా అటవీ గ్రామాలు 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 27.39 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. వీరు అధికంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ఏరియాలో ఉన్న అటవీ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో 36 మండలాలు, 4,765 గ్రామాలున్నాయి. వీటికి ప్రత్యేక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. షెడ్యూల్డ్ గ్రామాల్లో గిరిజనులు గ్రామసభల ద్వారా తీసుకునే నిర్ణయాలను ప్రభుత్వం అమలుచేయాల్సి ఉంటుంది. పీవీటీజీల కోసం ప్రత్యేక కార్యాచరణ రాష్ట్రంలోని పాడేరు, పార్వతీపురం, రంపచోడవరం, సీతంపేట, శ్రీశైలం ఐటీడీఏల్లో ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూపులు (పీవీటీజీ) ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా కోండు, గదబ, పూర్జ, చెంచు వంటి ఆదిమ గిరిజనులు ఉన్నారు. ఆధునిక సమాజం గురించి ఇప్పటికీ వీరికి పూర్తిస్థాయిలో అవగాహనలేదు. అందువల్ల వీరి కోసం ప్రత్యేక కార్యాచరణ ద్వారా కార్యక్రమాలు చేపడతారు. శ్రీశైలం ఐటీడీఏ పూర్తిగా చెంచు గిరిజనుల కోసం ఏర్పాటుచేసింది. నల్లమల అడవుల్లో వీరు నివసిస్తున్నారు. అలాగే, నెల్లూరులో కేవలం యానాదుల కోసం ఐటీడీఏ ఏర్పాటైంది. ఇక మిగిలిన రంపచోడవరం, సీతంపేట, పార్వతీపురం, కోట రామచంద్రాపురం, చింతూరు, పాడేరు ఐటీడీఏల్లో అన్ని కులాలకు చెందిన గిరిజనులు ఉన్నారు. ఒక్క పాడేరులోనే 6,04,047 మంది గిరిజనులు ఉన్నారు. సాధారణ జనంతో పోలిస్తే ఇక్కడ గిరిజనులు 91 శాతంమంది ఉన్నారు. అరకు ప్రాంత అడవులపై వీరు ఆధారపడి జీవిస్తున్నారు. ఇలా మొత్తం 34 రకాల కులాలకు చెందిన గిరిజనులు రాష్ట్రంలో జీవిస్తున్నారు. ఏజెన్సీ పల్లెల ముంగిట్లోకి ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలతోపాటు విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అయితే, గిరిజన విశ్వవిద్యాలయం, గిరిజన ఇంజనీరింగ్–మెడికల్ కాలేజీలు, ఏడు ఐటీడీఏల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటుచేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ గిరిజన సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అంతేకాక.. ప్రతి పంచాయతీలో గ్రామ సచివాలయాలు ఏర్పాటుకావడంతో పూర్తిస్థాయిలో ప్రభుత్వం వారి ముంగిటకు చేరింది. ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం గిరిజనులకు కలిగింది. వెంటనే ఐటీడీఏ స్పందిస్తోంది. ఆచార వ్యవహారాల్లో మార్పులు గిరిజనులు ఒకప్పుడు వారి ఆచార వ్యవహారాలకు అత్యంత విలువ ఇచ్చేవారు. ఇప్పుడూ వాటికి విలువిస్తూనే ఆధునిక సమాజం వైపు కూడా అడుగులు వేస్తున్నారు. అలాగే, శ్రీశైలం ఐటీడీఏ తీసుకున్న చర్యలతో ఆదిమ గిరిజనులైన చెంచుల వస్త్రధారణలో మార్పులు వచ్చాయి. 25 ఏళ్ల క్రితం పురుషులు కేవలం గోచీ.. మహిళలు తువ్వాళ్లు మాత్రమే చుట్టుకునే వారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఐఏఎస్ అధికారుల ఆలోచనలతో ముందుకు.. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో కంటే గిరిజన సంక్షేమ శాఖలోనే ఐఏఎస్లు ఎక్కువమంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం సీతంపేట, రంపచోడవరం, పాడేరు ఐటీడీఏల్లో వీరున్నారు. అంతేకాక.. ఈ శాఖలో డైరెక్టర్, ముఖ్య కార్యదర్శుల హోదాల్లో కూడా ఐఏఎస్లు ఉన్నారు. మిగిలిన ఐటీడీఏలకూ గతంలో ఐఏఎస్లు ఉండే వారు. కానీ, ప్రస్తుతం ఆ స్థానాల్లో గ్రూప్–1 అధికారులున్నారు. ఇలా అత్యధికంగా ఉన్నతాధికారులు ఉన్న సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖే. వీరి ఆలోచనలతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని గిరిజన సంక్షేమం, అభివృద్ధిని ముందుకు నడిపిస్తోంది. పోడు వ్యవసాయానికి పెద్దపీట ఏజెన్సీలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులకు ప్రభుత్వం ఇటీవల భూమి హక్కు పత్రాలు ఇచ్చింది. వీటి ద్వారా అటవీ భూములపై గిరిజనులకు హక్కులు ఏర్పడతాయి. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2.50 లక్షల మంది గిరిజనులకు భూమి హక్కుపత్రాలు ఇప్పించారు. ఆ తరువాత ఇప్పుడే ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ 3.20 లక్షల మంది గిరిజన రైతులకు భూమి హక్కు పత్రాలు ఇప్పించి వారి మనసుల్లో నిలిచారు. మరో లక్ష మందికి ఇప్పించేందుకు సర్వే జరుగుతోంది. -
త్వరలో ‘గిరిజన వికాసం’ వెబ్సైట్
సాక్షి, అమరావతి: గిరిజనుల ఆస్తులకు రక్షణ కల్పించే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్వరలో ‘గిరిజన వికాసం’ పేరుతో వెబ్సైట్ను ప్రారంభించనుంది. గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన ఈ వెబ్సైట్లో గిరిజన కుటుంబాలకు చెందిన అన్ని వివరాలు పొందుపరచనున్నారు. వెబ్సైట్లో ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి సబంధించిన సమగ్ర వివరాలు ఉండటం వల్ల వారి ఆస్తులకు రక్షణ ఉంటుందని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. దీనివల్ల ఎలాంటి భూ వివాదాలకు తావుండదని చెప్పారు. ముఖ్యమంత్రితో ఈ వెబ్సైట్ను ప్రారంభింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆధార్ నంబర్తో అనుసంధానం రాష్ట్రంలో గిరిజన కుటుంబాలకు సంబంధించి నిర్వహించిన సమగ్ర సర్వేలో సేకరించిన సమాచారం పూర్తిగా ఒక చోట ఉండేలా చర్యలు తీసుకున్నారు. గిరిజన కుటుంబ యజమాని లేదా కుటుంబ సభ్యుని ఆధార్ నంబర్ వెబ్సైట్లో నమోదు చేయగానే ఆ కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారం కనిపిస్తుంది. ఒక వేళ సమాచారంలో లోపం ఉంటే సంబంధిత ఐటీడీఏలో వివరాలు తెలిపి మార్పులు చేయించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు గిరిజన కుటుంబాలకు అందాయా? లేదా? అనే విషయం తెలుసుకునేందుకు కూడా ఇది ఉపయోగ పడుతుంది. వెబ్సైట్లో ఏముంటాయంటే.... ► గిరిజన కుటుంబంలో సభ్యుల పూర్తి వివరాలు. స్థిర, చరాస్తుల వివరాలు ► గిరిజన రైతుల పేరిట ఉన్న భూముల సమగ్ర వివరాల నమోదు, వెబ్ల్యాండ్, ఆర్వోఎఫ్ఆర్ çహక్కు పత్రాల వివరాలు. ► పట్టాదారు పేరు, ఊరిపేరు, సర్వే నంబరు ఇతర వివరాలు. ► రైతు భరోసా కింద ప్రభుత్వం చేసిన ఆర్థిక సాయం వివరాలు. ► అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి వివిధ పథకాల ద్వారా ఎంత మొత్తం సాయం అందిందనే వివరాలు ► భూములు లేని వారి వివరాలు కూడా నమోదు. వారు ఏ ప్రభుత్వ పథకం కింద ఎంత మొత్తం సాయం తీసుకున్నారనే వివరాలు. ► ఆర్వోఎఫ్ఆర్ పట్టా భూమిలో గిరిజన రైతుతో జియో ట్యాగింగ్. -
ఏజెన్సీల్లో సమాచార 'విప్లవం'
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో సమాచార విప్లవం వచ్చింది. వీటివల్ల ఏ గిరిజన గూడెంలో ఏం జరిగినా వెంటనే తెలుసుకునే అవకాశం ఏర్పడింది. గిరిజన పంచాయతీల్లోని సచివాలయాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంవల్లే అక్కడి స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు రాష్ట్ర ప్రభుత్వానికి కలిగింది. అలాగే, అడవుల్లో సరైన రహదారులు లేని గ్రామాలకు ఐశాట్ ఫోన్లు ఇచ్చింది. వీటి ద్వారా కూడా అత్యవసర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం తెలుసుకుంటోంది. గ్రామ సచివాలయాలకు ఫైబర్నెట్ సేవలు గిరిజన పంచాయతీల్లోని ప్రతి గ్రామ సచివాలయానికి ఫైబర్నెట్ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇటీవల రూ.3కోట్లను ఫైబర్నెట్ సంస్థకు గిరిజన సంక్షేమ శాఖ అందజేసింది. వీటికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు.. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న పలు సెల్టవర్ల పరిధిలో అప్పుడప్పుడు సిగ్నల్స్ సరిగ్గా ఉండని కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో.. త్వరలో ఫైబర్నెట్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుండడంతో ఆ సమస్యలకు చెక్ పడనుంది. గిరిజన గూడేల్లోని వారు తమ ఇళ్లకు కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందవచ్చు. అంతేకాక.. వివిధ టీవీ చానెల్స్ కూడా ఈ ఫైబర్నెట్ ద్వారా వీక్షించవచ్చు. అత్యవసర సమాచారానికి ఐశాట్ ఫోన్లు ఇక గిరిజన గూడేల్లో ఏవైనా సంఘటనలు జరిగినా, సరైన వసతులు లేకపోయినా, వైద్య సాయం కావాల్సి వచ్చినా వెంటనే తెలిపేందుకు ప్రభుత్వం ఆయా ఐటీడీఏలకు ఐశాట్ ఫోన్లను అందజేసింది. ఈ ఫోన్లు ఐటీడీఏ పీవోల పర్యవేక్షణలో ఉంచింది. ఇవి వాకీటాకీల్లా పనిచేస్తాయి. సీతంపేట, పాడేరు, పార్వతీపురం, ఆర్సీ వరం, కేఆర్ పురం, చింతూరు, శ్రీశైలం ఐటీడీఏల్లో మొత్తం 203 ఐశాట్ ఫోన్లు ఉన్నాయి. వలంటీర్లకు కూడా వీటిని ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మరోవైపు.. ఏజెన్సీలోని వైద్య వలంటీర్లకు ఫోన్లు ఇవ్వడం ద్వారా కూడా గిరిజనుల ఆరోగ్య సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలు కలిగింది. సమాచారం తెలుసుకోవడంలో ముందున్నాం గతంలో గిరిజన గూడేల్లో సమాచారం తెలుసుకునేందుకు సమయం పట్టేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వ సహకారంతో పలు కంపెనీలు ఇప్పటికే సెల్టవర్లను ఏర్పాటుచేశాయి. అలాగే, ప్రస్తుతం గ్రామ సచివాలయాలకు ఫైబర్నెట్ కనెక్షన్ల పనులు చురుగ్గా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల పూర్తయ్యాయి. ఐశాట్ ఫోన్ల ద్వారా కూడా సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తోంది. – ఇ.రవీంద్రబాబు, అడిషనల్ డైరెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ -
నెలాఖరుకు అద్దాల్లా ఆశ్రమ పాఠశాలలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలల్లో నాడు–నేడు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పనులు ఈనెలాఖరుకు పూర్తయ్యే అవకాశాలున్నాయి. అన్ని వసతులతో రూపుమార్చుకుంటున్న ఈ పాఠశాలలు అద్దాల్లా మారుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 378 ఆశ్రమ పాఠశాలలున్నాయి. ఇవన్నీ ఏజెన్సీ ప్రాంతంలోను, నల్లమల అడవుల్లోను ఉన్నాయి. 31 ప్రభుత్వ భవనాలు, రెండు అద్దె భవనాలు, ఒక అద్దెలేని భవనం కలిపి 34 మినహా మిగిలిన 344 స్కూళ్లలో నాడు–నేడు పనులు చేపట్టారు. అటవీ ప్రాంతాల్లో చాలా పాఠశాలలకు ఇప్పటివరకు ప్రహరీలు లేవు. జంతువుల భయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి పగటిపూటే ఎలుగుబంట్లు, చిరుతపులులు పాఠశాలల పరిసరాల్లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు ప్రతి పాఠశాలకు ప్రహరీ నిర్మిస్తుండటంతో ఈ సమస్య తీరనుంది. ప్రహరీ నుంచి లోపలికి రోడ్డు వేసి ఆటస్థలాన్ని కూడా తీర్చిదిద్దుతున్నారు. స్నానాల గదుల్లో టైల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మరుగుదొడ్లు, వాష్బేసిన్లు విద్యార్థుల సంఖ్యను బట్టి ఏర్పాటు చేస్తున్నారు. డైనింగ్ హాల్స్ రూపుదిద్దుకుంటున్నాయి. 16 నుంచి ప్రారంభమైన 9, 10 తరగతులు ఆశ్రమ పాఠశాలలు గురుకుల విద్యాలయాలను పోలి ఉంటాయి. విద్యార్థులు రాత్రిపూట ఇంటికి వెళ్లేందుకు అవకాశం ఉంది. ఉపాధ్యాయులు కూడా రాత్రి వరకు ఉండి ఇంటికి వెళతారు. విద్యావిధానం గురుకుల పాఠశాలల్లో మాదిరే ఉంటుంది. ఆశ్రమ పాఠశాలల్లో ఈనెల 16 నుంచి 9, 10 తరగతులు మొదలయ్యాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. మిగిలిన క్లాసుల వారికి ఆన్లైన్లో బోధిస్తున్నారు. గిరిజన సంక్షేమశాఖ ద్వారా నిర్వహిస్తున్న 179 ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ హాస్టళ్లలో నాడు–నేడు పనులు పూర్తికావచ్చాయి. ప్రీ మెట్రిక్ హాస్టళ్లు 21, పోస్టు మెట్రిక్ హాస్టల్స్ 158 ఉన్నాయి. -
గిరిజన గూడేలకూ ఇంటర్నెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి గిరిజన గూడేనికీ ఇంటర్నెట్ సౌకర్యం కలగనుంది. కొండకోనల మధ్య ఉండే గిరి శిఖర గ్రామాలకు సైతం ఇంటర్నెట్ సేవల్ని అందించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టింది. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ నిర్వహణకు ఇంటర్ నెట్ తప్పనిసరి కావడంతో ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి గిరిజన గ్రామానికీ ఈ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. 134 గూడేల్లో వేగంగా పనులు ఇప్పటికే 134 గిరిజన గూడేల్లో ఫైబర్ నెట్ కనెక్టివిటీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం రూ.3 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్ నెట్ కార్పొరేషన్కు ఇప్పటికే చెల్లించింది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 51 గ్రామాలు, విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 49 గ్రామాలు, విశాఖపట్నం జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో 26 గ్రామాలు, శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో 6 గ్రామాలు, చింతూరు, కేఆర్ పురం ఐటీడీఏల పరిధిలో ఒక్కో గ్రామంలో ఫైబర్ నెట్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొండ ప్రాంతాల్లో ప్రభుత్వ సహకారంతో రిలయన్స్ సంస్థ 200కు పైగా టవర్స్ ఏర్పాటు చేసింది. వీటిద్వారా సమీప ఏజెన్సీ గ్రామాల్లో వైర్లెస్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరో 251 గూడేల్లోనూ.. ఫైబర్ నెట్ను ప్రతి గిరిజన గ్రామానికి విస్తరించే కార్యక్రమంలో భాగంగా 251 గూడేల్లో పనులు చేపట్టేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఇందుకు రూ.24.50 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. త్వరలోనే నిధులు మంజూరవుతాయని, ఆ వెంటనే పనులు చేపడతామని అధికారులు చెప్పారు. -
ట్రైబల్ సబ్ప్లాన్ పటిష్టంగా అమలు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా, ప్రతి పైసా గిరిజనులకే చేరేలా చూడాలని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి నోడల్ ఏజెన్సీ ఆమోదం పొందకుండా నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేయడాన్ని నియంత్రించాలని కోరారు. తాత్కాలిక సచివాలయంలో బుధవారం ఆమె గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో గిరిజన గురుకుల విద్యా సంస్థలలో ఏర్పాటు చేసిన డిజిటల్, వర్చువల్ క్లాసు రూములపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. హాస్టళ్ల నుంచి స్కూళ్లుగా స్థాయి పెంచిన అన్ని పాఠశాలల భవనాల నిర్మాణానికి కావాల్సిన స్థలాలను గుర్తించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన గురుకుల విద్యాలయాలపై ఆమె సమీక్షించారు. -
గురుకుల పాఠశాలల నిర్వహణకు ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: గురుకుల విద్యా సంస్థల్లో క్లాసుల నిర్వహణకు సంబంధించి అధికారులు కొన్ని ప్రతిపాదనలను తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. కోవిడ్–19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని క్లాసులు ఒకేసారి నిర్వహించడం వీలుకాదని అధికారులు ఇటీవల సమావేశమై ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ, ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి పాల్గొన్నారు. వీరు పంపిన సూచనలను ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంది. అవేంటంటే.. ► 2020–21 విద్యా సంవత్సరానికి గురుకుల విద్యాలయాల్లో 9, 10, ఇంటర్ తరగతులను మాత్రమే నిర్వహించాలి. ► ప్రతి క్లాసును విద్యార్థుల సంఖ్య ఆధారంగా సెక్షన్లుగా విభజించాలి. ఒక్కో సెక్షన్లో 20 మంది విద్యార్థులు ఉండాలి. ► క్లాసులకు హజరయ్యే వారు చేతులను శుభ్రం చేసుకోవడం కోసం వాష్ బేసిన్ల సంఖ్యను పెంచాలి. ప్రతి విద్యార్థికి 3 మాస్కులు, శానిటైజర్ ఇవ్వాలి. పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న నర్సులకు కోవిడ్–19పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ► విద్యార్థులకు వైద్య చికిత్స అవసరమైనప్పుడు తీసుకెళ్లేందుకు వీలుగా మారుమూల గురుకుల పాఠశాలల వద్ద ఒక వాహనం అందుబాటులో ఉండాలి. ► స్కూళ్ళకు సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ► గురుకులాల్లో మిగిలిన తరగతులు చదువుతున్న విద్యార్థులకు ‘విద్యామృతం’ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధించాలి. ► కరోనా వ్యాధిపై ప్రభుత్వం, వైద్య శాఖ సూచనల మేరకు దశల వారీగా మిగిలిన క్లాసుల విద్యార్థులను కూడా గురుకులాలకు పిలిపించాలి. -
గిరిజనులకు అన్యాయం జరగనివ్వం
సాక్షి, అమరావతి: గిరిజన ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీపడే సమస్యే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజనులకు అన్యాయం జరగనివ్వకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి నేతృత్వంలో గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిశారు. ఏజెన్సీ ప్రాంతంలోని టీచర్ పోస్టులను 100 శాతం గిరిజనులకే కేటాయించాలంటూ ఉమ్మడి ఏపీలో జారీ అయిన జీవో నంబర్ 3ను ఇటీవల సుప్రీం కోర్టు కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని వారు సీఎంను కోరారు. జీవో నంబర్ 3ను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకుని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఇదివరకే ఆదేశాలిచ్చినట్టు సీఎం వారితో చెప్పారు. ఈ నేపథ్యంలో దీనిపై గిరిజన ఎమ్మెల్యేలతో చర్చించి వారి సలహాలు తీసుకునేందుకు గురువారం గిరిజన సలహా మండలి (ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్) సమావేశాన్ని సచివాలయంలో ఏర్పాటు చేశారు. సీఎంను కలిసిన వారిలో తెల్లం బాలరాజు, పీడిక రాజన్న దొర, కె.కళావతి, భాగ్యలక్ష్మి, చెట్టి ఫల్గుణ, ధనలక్ష్మి తదితరులున్నారు. -
అన్నీ ఉంటేనే అనుమతి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించే కాలేజీలకే అనుమతులు మంజూరు చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించింది. ఈమేరకు బోర్డు బుధవారం సవివరమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. కొత్త కాలేజీల ఏర్పాటు, అదనపు సెక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్లో నిబంధనలు పొందుపరిచారు. యాజమాన్యాలు సంబంధిత పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. భవనాలు, ల్యాబ్లు, లైబ్రరీలు, తరగతి గదులకు సంబంధించిన ఫొటోలను జియో ట్యాగింగ్ చేసి అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. ► రాష్ట్రంలో ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, జూనియర్ కాలేజీలు, కోఆపరేటివ్, ఇన్సెంటివ్, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల రెసిడెన్షియల్ కాలేజీలు, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలతోపాటు కేంద్రీయ విద్యాలయాలు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. బోర్డు ఇదివరకు ఇచ్చిన అనుమతులు వచ్చే విద్యాసంవత్సరానికి (2020–21) పొడిగింపు, అదనపు సెక్షన్ల ఏర్పాటు కోసం ఆన్లైన్లో దరఖాస్తులు అందించాలి. గరిష్టంగా రెండేళ్లకే అనుమతి వర్తిస్తుంది. ► 2020–21కి సంబంధించి అఫ్లియేషన్/అదనపు సెక్షన్ల ఏర్పాటు, ఇన్స్పెక్షన్ ఫీజు ఇప్పటికే చెల్లించిన కాలేజీలు కూడా దరఖాస్తులను రూ.500 రుసుముతో ఆన్లైన్లో సమర్పించాలి. ► ‘హెచ్టీటీపీఎస్://బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో ఆన్లైన్ దరఖాస్తు ఫారం పొందుపరిచారు. కాలేజీలు తమ సంస్థ కోడ్, పాస్వర్డ్ వినియోగించి ఈ ఫారాలను పొందవచ్చు. ► అప్లికేషన్, అఫ్లియేషన్, ఇన్స్పెక్షన్ ఫీజులను ఆన్లైన్లో చెల్లించిన అనంతరం బోర్డు లింక్ ద్వారా ‘బీఐఈ జియో ట్యాగింగ్’ యాప్ డౌన్లోడ్ చేసుకొని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ► కాలేజీ భవనం, తరగతి గదులు, ల్యాబ్లు,లైబ్రరీ, ఆటస్థలం తదితరాల ఫొటోలను జియో ట్యాగింగ్ ద్వారా అప్లోడ్ చేయాలి. ► అదనపు సెక్షన్లకు అనుమతించేందుకు ఆర్సీసీ భవన వసతి, తరగతి గదుల లభ్యతను పరిశీలిస్తారు. ► భవనపు రిజిస్టర్డ్ లీజ్ డీడ్, సొంత భవనమైతే సంబంధిత డాక్యుమెంట్లు, ఆటస్థలం లీజ్ డీడ్లను పరిశీలిస్తారు. ► భవన నిర్మాణ ప్లాన్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్, శానిటరీ, స్ట్రక్చరల్ సౌండ్నెస్ సర్టిఫికెట్లతో పాటు నిరభ్యంతర పత్రాలను కాలేజీలు బోర్డుకు సమర్పించాలి. ► పార్కింగ్ స్థలం, బోధన, బోధనేతర సిబ్బంది, అర్హతల వివరాలను వెల్లడించాలి. ► బోర్డు అనుమతి లేకుండా కొత్త సెక్షన్లు ప్రారంభించరాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు. -
సిక్కోలులో కలకలం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పార్వతీపురం గిరిజన సంక్షేమ శాఖ (ఐటీడీఏ)లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ, ఎఫ్ఏసీ)గా పనిచేస్తున్న తూతిక మోహనరావు ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగవారం దాడులు చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురంలలో మంగళవారం తెల్లవారుజాము నుంచి మోహనరావు ఇళ్లపై దా డులు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఆదా యానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో ఈఈ స్థిరాస్తులు, బంగారం, వెండి, గృహోపకరణాలు, గృహాలంకరణ, నగదు అంతా కలిపి ప్రస్తుత మార్కెట్ విలువను అంచనా వేశారు. దీని ప్రకారం మొత్తం రూ.10కోట్లకు పైగా అక్రమాస్తులున్నట్లు డీఎస్పీ విలేకరులకు తెలిపారు. దీనిలో బంగారం580 గ్రాములు విలువ రూ.27లక్షలుగాను, వెండి రెండు కేజీలు రూ.1.50లక్షలుగాను, గృహాలంకరణాల విలువ రూ.16లక్షలు, ఆయన ఇంట్లో నగదు రూ.7లక్షలు, బ్యాంక్ ఖాతాలో రూ.30లక్షలున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటితో పాటు ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తూతిక మోహనరావు వాస్తవానికి డిప్యూ టీ ఇంజనీర్ (డీఈ) కేడర్లో పార్వతీపురం, ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్నారు. ఈయన గతంలో సీతంపేట, నర్సీపట్నంలలో ఐటీడీఏల్లో డీఈగా కూడా పనిచేశారు. అనంతరం పార్వతీపురంలో ఈఈ పోస్టు ఖాళీగా ఉండడంతో విషయం తెలుసుకున్న మోహనరావు తన పలుకుబడితో ఈఈగా అదనపు బాధ్యతలు చేపట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోహనరావు ఇంట్లో దస్త్రాలు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు సిక్కోలులో కలకలం శ్రీకాకుళం నగరంలోని ఎల్బీఎస్ కాలనీలో సొంత నివాసంలో ఉంటున్న మోహనరావుకు విజయనగరం జిల్లా పార్వతీపురంలో కూడా అద్దె ఇల్లు కూడా ఉంది. ఈ ఇళ్లల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి మంగళవారం దాడులు నిర్వహించారు. తెల్లవారు జామునే పార్వతీపురంలో తొలుత దాడులు చేశారు. అనంతరం మోహనరావును శ్రీకాకుళంలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో మోహనరావు ఇళ్లల్లో పెద్ద మొత్తంలో నగదు, వెండి, బంగారం, విలువైన ఆస్తుల పత్రాలు గుర్తించి వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురంలో ఆయన ఉన్న అద్దె ఇంటిలో రూ.3.5 లక్షలు, శ్రీకాకుళంలో రూ.3.5 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. నేడు ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తాం: ఏసీబీ డీఎస్పీ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న తూతిక మోహనరావును బుధవారం విశాఖపట్నం ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి సాక్షికి తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు మహేశ్వరరావు, భాస్కర్, సత్యారావులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. సింగూరు ఇసుక ర్యాంపు తాత్కాలికంగా మూసివేత ఆమదాలవలస రూరల్: పొందూరు మండలం సింగూరు ఇసుక ర్యాంపును తాత్కాలికంగా మూసివేశారు. సింగూరు రెవెన్యూలో సేకరించిన ఇసుకను దూసిలో నిల్వ చేసి అవసరాలకు ఏపీఎండీసీ ద్వారా తరలించేవారు. ఇసుక ర్యాంపుపై ఇటీవల పోలీసులు దాడులు నిర్వహించగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 15 లారీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. ఇసుక ర్యాంపు నిర్వాహకులు హరనాథరావు, భరత్, వాసులతో పాటు ముగ్గురు మైన్స్ అధికారులపై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరిపై కేసులు నమోదు చేయడంతో ర్యాంపులో ఉన్న వారు భయపడి ర్యాంపును ఆపేసినట్లు తెలిపారు. అందుకే ఇసుక ర్యాంపును తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు. ఇసుక ర్యాంపులో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిని కూడా విధు ల నుంచి అధికారులు తొలగించారు.ఇసుక ర్యాంపు నిర్వహణలో వారి విధానాల వల్ల అక్రమంగా ఇసుక తరలిపోయినట్లు గుర్తించిన మైన్స్ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. -
గిరిజన విద్య.. కాదిక మిథ్య
సాక్షి, అమరావతి: గిరిజన బిడ్డలను విద్యావంతుల్ని చేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. గిరిజనుల్లో అక్షరాస్యత శాతం పెంచాలనే పట్టుదలతో ముందడుగు వేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 27,39,920 మంది గిరిజనులు ఉన్నారు. వీరిలో అక్షరాస్యత శాతం 48.98 మాత్రమే. సగానికి పైగా గిరిజనులు విద్యకు దూరంగా ఉంటున్నారు. 2,678 గిరిజన విద్యాసంస్థలు గిరిజన పల్లెల్లో ప్రత్యేకంగా 2,678 విద్యాసంస్థలున్నాయి. వీటిలో 2,05,887 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో 189 గురుకులాలను గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది. వీటిలో పూర్తిగా సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు విద్యకు దూరం కాకుండా ప్రణాళికలు రూపొందించింది. ఒక్కొక్క విద్యార్థికి నాలుగు జతల చొప్పున స్కూల్ యూనిఫారాలు సమకూరుస్తోంది. ఒక సెట్ బెడ్డింగ్ మెటీరియల్ సరఫరా చేసింది. నోట్ పుస్తకాలను ఇప్పటికే అందజేసింది. ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు సైతం ఇచ్చింది. హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో ఉండే విద్యార్థులకు ప్రత్యేకంగా కాస్మొటిక్ చార్జీలు అందజేస్తోంది. ప్రైవేట్ స్కూళ్లలోనూ చదివిస్తోంది అత్యున్నతమైన ప్రైవేట్ స్కూళ్లను ఎంపిక చేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద విద్యార్థులను వాటిలో ప్రభుత్వం చేర్పించింది. ఆ పిల్లలకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వమే నిధులు ఇస్తోంది. ప్రతిభ చాటే గిరిజన విద్యార్థులకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలు కల్పించింది. కార్పొరేట్ కాలేజీల పథకం కింద ఎంతోమంది గిరిజన విద్యార్థులను ఆయా కాలేజీల్లో చేర్పించింది. ఇందుకయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద గిరిజన విద్యార్థులను విద్యాభ్యాసం కోసం విదేశాలకు ప్రభుత్వ ఖర్చులతోనే పంపిస్తోంది. పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్లు ఇవ్వడం ద్వారా ఆయా విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. 237పాఠశాలల్లో వృత్తి విద్యా కోర్సులు 184 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, 53 గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు కలిపి 237 స్కూళ్లల్లో వృత్తి విద్యను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటిలో 80,091 మంది గిరిజన విద్యార్థులు వృత్తి విద్య నేర్చుకుంటున్నారు. మెటీరియల్ను నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సమకూరుస్తోంది. -
‘సంక్షేమం’.. సజావుగా సాగుతోందా..
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాలు పక్కదారి పడుతున్నాయా? లబ్ధిదారుల్లో అక్రమార్కులున్నా రా? అనేది తేల్చేందుకు సిద్ధమవుతోంది గిరిజన సంక్షేమ శాఖ. పథకాలు దారితప్పకుండా, పక్కా గా అర్హులకు చేర్చాలనే లక్ష్యంతో దీనికి ఉపక్రమిస్తోంది. ఈ శాఖ ద్వారా ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలకు అర్హతలు నిర్ధారించిన తర్వాత ఫలాలు పంపిణీ చేస్తున్నప్పటికీ... వారంతా అర్హతలున్నవారేనా? కాదా? అనే కోణంలో పరిశీలించనున్నారు. రెండ్రోజుల క్రితం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. పునఃపరిశీలన ఎలా చేపట్టాలనే దానిపై స్పష్టతకు రావాలని ఆమె సూచించడంతో అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 76 రకాల సం క్షేమ కార్యక్రమాలను అమ లు చేస్తున్నారు. ఇందులో విద్య, వైద్యం, ఆర్థిక చే యూత, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో అమలు చేస్తున్న వాటి ల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ కార్యక్రమాలున్నా యి. ఇందులో అధిక నిధులు ఖర్చు చేస్తున్న పథకాలపై పునఃపరిశీలన చేపట్టాలని నిర్ణయించారు. ఆర్థిక చేయూత కార్యక్రమాల్లో లబ్ధిదారుల స్థితిని తెలుసుకోనున్నారు. ప్రధానంగా ఆర్థిక చేయూత పథకాల్లో పరిశీలన చేసే అవకాశం ఉండగా... ఇం దులో అనర్హులుగా తేలితే వేటు వేయాలని నిర్ణ యించారు. అలాగే, దుర్వినియోగమైన మొత్తాన్ని రికవరీ చేయాలనేది అధికారులు పరిశీలిస్తున్నారు. -
గిరిజన ఆవాసాలన్నింటికీ రహదారులు
సాక్షి, అమరావతి/విజయవాడ స్పోర్ట్స్: గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని, గిరిజన ఆవాసాలన్నింటికీ రహదారి సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి గిరిజన శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గిరిజన రోగులను డోలీలలో తీసుకెళ్లాల్సి వస్తున్న పరిస్థితిని మార్చాలన్నారు. అన్ని గిరిజన ప్రాంతాల్లో నియోజకవర్గానికి 100 పడకలతో గర్భిణులకు హాస్టళ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. సచివాలయంలో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులతో శనివారం ఆమె సమీక్ష నిర్వహించారు. గిరిజన శాఖలో మంజూరు చేసిన పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయనపుడు వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆడపిల్లలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి మహిళల రక్షణకు అవసరమైన చర్యలను సీఎం వైఎస్ జగన్ చేపట్టారని, ప్రతీ గ్రామంలో ఒక మహిళా పోలీసును నియమించడం, మద్యాన్ని పూర్తిగా నిషేధించే దిశగా అడుగులు వేయడం వీటిలో భాగమేనని పుష్ప శ్రీవాణి చెప్పారు. సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా, ఏపీ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో డాక్టర్ వైఎస్సార్ స్మారక 10వ జాతీయ కరాటే చాంపియన్షిప్ పోటీలను ఆమె ప్రారంభించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. 6వ తరగతి నుంచి బాలికలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించడానికి ప్రయత్నిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రముఖ సినీ నటుడు సుమన్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
కొత్తగా ఎనిమిది ‘ఏకలవ్య’ స్కూళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 8 ఏకలవ్య మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు వేగిరం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో 8 స్కూళ్లు నిర్వహిస్తుండగా.. మరో 8 స్కూళ్ల ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. కేంద్రం అనుమతిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ప్రస్తుతమున్న ఈఎంఆర్ స్కూళ్లకు శాశ్వత భవనాలున్నప్పటికీ వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఈఎంఆర్ఎస్ల కోసం ప్రత్యేక సొసైటీని ఏర్పాటు చేసిన క్రమంలో రాష్ట్రంలోని ఈఎంఆర్ఎస్లకు శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు, వసతులు కల్పించాలని రాష్ట్ర గిరిజన శాఖ కేంద్రానికి నివేదించింది. సీబీఎస్ఈ అనుమతితో: ఇప్పటికే ఉన్న 8 ఈఎంఆర్ఎస్లకు సీబీఎస్ఈ అనుమతులు వచ్చేశాయి. తాజాగా మరో 8 స్కూళ్లను ప్రారంభించాలని ఆ శాఖ నిర్ణయించడంతో వాటికి సీబీఎస్ఈ అనుమతులకు అధికారులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారు. తాజాగా వీటికి కూడా అనుమతులు ఇస్తున్నట్లు సీబీఎస్ఈ సమాచారం ఇచ్చింది. ఈఎంఆర్ఎస్ల నిర్వహణకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు విడుదలవుతున్నాయి. దీంతో కొత్తగా ఏర్పాటయ్యే ఒక్కో ఈఎంఆర్ఎస్కు రూ.20 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. దీనిపై కేంద్రం నుంచి ఇంకా స్పందన రాలేదు. వచ్చే ఏడాది సీబీఎస్ఈ సిలబస్తో ప్రారంభమయ్యే స్కూళ్లు.. సీరోల్, మరిమడ్ల, గాంధారి, ఎల్లారెడ్డిపేట్, కురవి, బాలానగర్, ఇంద్రవెల్లి, గండుగులపల్లి. -
షెడ్యూల్డ్ ఏరియాలుగా గిరిజన పునరావాస గ్రామాలు
సాక్షి, అమరావతి: పునరావాసం కింద గిరిజనులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించినప్పుడు ఆ ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రభుత్వం ప్రకటించాలని గిరిజన సలహా మండలి సమావేశం తీర్మానించింది. కొన్ని ప్రాజెక్టుల కారణంగా గిరిజనులను తరలించి పునరావాసం ఏర్పాటు చేసినప్పుడు గిరిజన హక్కులు కోల్పోతున్నారని సలహా మండలి అభిప్రాయ పడింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అధ్యక్షతన మంగళవారం గిరిజన సలహా మండలి సమావేశం జరిగింది. సమావేశంలో సభ్యులైన గిరిజన ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, పీడిక రాజన్నదొర, బాలరాజు, చెట్టి ఫల్గుణ, భాగ్యలక్ష్మి, కె ధనలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా, డైరెక్టర్ పి రంజిత్బాషా, అడిషనల్ డైరెక్టర్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఆమోదించిన తీర్మానాలను అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పుష్పశ్రీవాణి వివరించారు. - గిరిజనుల కోసం ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతాం. - రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో ప్రస్తుతం నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న 554 గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో కల´బాలి. - ఆర్వోఎఫ్ఆర్ పథకం కింద వచ్చే ఫిబ్రవరిలో గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వం పేదలకు ఉగాది నాటికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో అంతకు ముందుగానే గిరిజనులకు ఇవ్వాలని నిర్ణయం. - బాక్సైట్ తవ్వకాల జీవో రద్దు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు. అలాగే సాలూరులో వైఎస్సార్ గిరిజన యూనివర్సిటీ, పాడేరులో మెడికల్ కాలేజీ, కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ, ఏడు గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు గిరిజనులు అడగకుండానే ఇచ్చిన సీఎంకు ధన్యవాదాలు. -
విస్తరిస్తున్న విశాఖ యాపిల్
సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని అరకు లోయ, లంబసింగి ప్రాంతాల్లో యాపిల్ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ ఏజెన్సీ పరిధిలో ఇప్పటికే 10 వేల ఎకరాల్లో యాపిల్ సాగు చేస్తున్నారు. మరో 10 వేల ఎకరాల్లో గిరిజన రైతులతో యాపిల్ సాగు చేయించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రైతులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేయనుంది. - వచ్చే జనవరి నుంచి గిరిజన రైతులకు మొక్కల పంపిణీకి శ్రీకారం చుడతారు - ఏడాది వయసున్న ఒక్కొక్క మొక్కకు రూ.250 చొప్పున వెచ్చించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది - లంబసింగి ప్రాంతంలో వాతావరణం యాపిల్ సాగుకు బాగా అనుకూలం - ఇక్కడ ఒక్కో సమయంలో ఉష్ణోగ్రత మైనస్ ఐదు డిగ్రీలకు పడిపోతుంది. ఎక్కువ రోజులు సున్నా డిగ్రీలు నమోదవుతుంది - హిమాచల్ ప్రదేశ్లో పండుతున్న అన్నా, డార్సెట్ గోల్డెన్ రకాలను ఇక్కడ సాగు చేయిస్తారు - రైతులు మూడేళ్లపాటు మొక్కలను సంరక్షిస్తే.. అప్పటినుంచి 20 ఏళ్ల వరకు ఫలసాయం వస్తుంది. యాపిల్ సాగుకు అనువైన ప్రాంతం పాడేరు ఐటీడీఏ పరిధిలోని అరకు లోయ, లంబసింగి, చింతపల్లి, జీకే వీధి గిరిజన గ్రామాలు యాపిల్ సాగుకు అనువైనవిగా గుర్తించాం. తక్కువ ఉష్టోగ్రతల్లో పండే యాపిల్ రకాలను ఇక్కడ సాగు చేయించాలని నిర్ణయించాం. భూసార పరీక్షలు చేయించి.. వచ్చే ఏడాది జనవరిలో గిరిజన రైతులకు మొక్కలు పంపిణీ చేస్తాం. – ఆర్పీ సిసోడియా, ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ -
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులందరికీ ఇంటి స్థలం ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నివాస స్థలాలు లేని 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వాలంటే రూ.40 వేల కోట్లు కావాలని రెవెన్యూ శాఖ తయారు చేసిన గణాంకాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. సరైన అంచనాలు, ప్రణాళికలు లేకుండా ఇలాంటి అంచనాలు వేసి భయపెట్టొద్దని హితవు పలికారు. ఇచ్చిన హామీని తక్కువ ఖర్చుతో అమలు చేసే మార్గాలు చూడాలన్నారు. 25 లక్షల ఇళ్ల స్థల పట్టాల జారీకి రూ.40 వేల కోట్లు అవుతుందని లెక్కలు వేయడమంటే ఇక దాన్ని ముట్టుకోవద్దని చెప్పడమేనని, ఇలా భయపడేలా చేస్తారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. 25 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వడానికి 83,833 ఎకరాలు అవసరమని, ఇందుకు రూ.40 వేల కోట్లు అవసరమవుతాయని రెవెన్యూ శాఖ పవర్ పాయింట్ ప్రజంటేషన్ సిద్ధం చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు సిద్ధం కాగానే ముఖ్యమంత్రి కలుగజేసుకుని ఆ గణాంకాలు అవసరం లేదని, పక్కన పడేయాలని ఆదేశించారు. ‘రాష్ట్రంలో ఇంటి స్థలం లేని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇచ్చి తీరుతాం. 25 లక్షల మంది మహిళల పేరుతో నివాస స్థలాలు పంపిణీ చేస్తామని చెప్పాం. వచ్చే ఉగాది నాడు పండుగలా నివాస స్థలాలు పంపిణీ చేస్తాం. గత పాలకుల్లాగా పట్టాలు ఇచ్చి స్థలాలెక్కడో చూపని పరిస్థితి ఉండకూడదు. ఏయే గ్రామాల్లో ఎంతమందికి ఇంటి స్థలాలు లేవో గ్రామ వలంటీర్లు లెక్క తీస్తారు. ఆయా గ్రామాల్లో వారికి పట్టాలు ఇవ్వడానికి ఎంత భూమి కావాలో.. ప్రభుత్వ భూమి ఎంత ఉందో చూడండి. ఎక్కడైనా కొంత తక్కువ ఉంటే కొనుగోలు చేద్దాం. ఎకరా రూ.20 లక్షలు అని, రూ.40 లక్షలు అని ఏవేవో లెక్కలు వేస్తే ఎలా?’ అని సీఎం ప్రశ్నించారు. దీంతో మన్మోహన్సింగ్ పట్టణ ప్రాంతాల్లో స్థలం కొరత ఉన్నందున మల్టీ స్టోరీడ్ భవనాలు ఇద్దామని, గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇద్దామని ప్రతిపాదించారు. దీనికి స్పందించిన సీఎం పట్టణ ప్రాంతాల్లో జీ ప్లస్ 3, జీ ప్లస్ 4కు అనుగుణంగా నంబర్ ఆఫ్ ప్లాట్లు ప్లాన్ చేసుకుని అన్ డివైడెడ్ షేర్కు పట్టాలు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం స్థలాలు ఇద్దామన్నారు. కాగా పట్టణ గృహ నిర్మాణంలో గతంలో భారీ స్కామ్ జరిగిందని సీఎం వైఎస్ జగన్ ఎత్తి చూపారు. ‘300 చదరపు అడుగుల ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక ఉచితమే. సబ్సిడీతో సిమెంటు వస్తోంది. అలాంటప్పుడు చదరపు అడుగుకు రూ.1,100 మించి కాదు. వాస్తవం ఇది కాగా.. గత ప్రభుత్వం చదరపు అడుగుకు రూ.2,200 పెట్టి స్కామ్గా మార్చింది. ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 1.50 లక్షలు కలిపి రూ.3 లక్షలు ఇస్తున్నాయి. ఇంటి నిర్మాణానికి ఇది సరిపోతుంది. కానీ గత పాలకులు దీన్ని రూ.6 లక్షలకు పెంచారు. ఇంత ఎందుకవుతుందో నాకు అర్థం కావడం లేదు. రివర్స్ టెండరింగ్కు వెళదాం’ అని సీఎం పేర్కొన్నారు. మానవత్వంతో ముందుకెళ్దాం గిరిజన ప్రాంతాల్లో ఎస్సీలకు, ఇతరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని, ఇవ్వాలన్నా చట్టం అంగీకరించదనే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి ప్రస్తావించారు. ఈ అంశంపై గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా కలుగజేసుకుని 1/70 చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లో గిరిజనేతరులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీలులేదని తెలిపారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ జోక్యం చేసుకుని కోస్తాలో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని గ్రామాల పక్కనే అటవీ ప్రాంతం ఉన్నందున ఐదు ఎకరాల వరకూ ఇళ్ల స్థలాలకు వినియోగించుకునేలా చట్ట సవరణ చేసే విషయం పరిశీలించాలని కోరారు. ‘రమణన్న చెప్పినట్లుగా చేద్దాం. ముఖేష్ అన్నా (ముఖేష్ కుమార్ మీనాను ఉద్దేశించి) ముందు గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు పట్టాలు ఇవ్వండి. మిగిలినవారికి ఎలా ఇవ్వాలో ఆలోచిద్దాం’ అని సీఎం పేర్కొన్నారు. -
మన్యంలో కొండెక్కని అక్షరం!
సాక్షి, విశాఖపట్నం : మన్యంలో బడి ముఖం చూడని చిన్నారులు వందల సంఖ్యలో దర్శనమిస్తున్నారు. అక్షరం అక్కడ మచ్చుకైనా కనిపించదు. చిట్టిచేతులతో అక్షరాలు దిద్దాల్సిన పిల్లలు అడవి బాటపడుతున్నారు. గత సర్కార్ పాలనలో కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయకపోవడంతో పిల్లలు అక్షర జ్ఞానానికి నోచుకోలేదు. బడి ముఖం చూడని చిన్నారుల మాదిరిగానే మధ్యలో బడి మానేసినవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచేటప్పుడు, సెలవులకు ముందు మాత్రం డ్రాపౌట్లపై సిబ్బంది సర్వే చేసి అధికారులకు నివేదికలు ఇస్తారు. తరువాత ఆ విషయాన్ని మరచిపోతున్నారు. మళ్లీ అదే సర్వేలు.. అవే నివేదికలు. వారిని పాఠశాలకు తీసుకువచ్చే పరిస్థితి లేదు. ఇక పాఠశాలలు లేని గ్రామాలు కొన్నింటిని ఎంపిక చేసుకుని సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఎన్ఆర్ఎస్టీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మార్చిలో మూసేస్తున్నారు. దీంతో పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో నేటికీ చాలామంది చదువుకు దూరంగానే ఉన్నారు. గత ప్రభుత్వం విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. మూడు సంవత్సరాల కిందట విద్యాశాఖ నిర్వహించిన సర్వేలో మన్యంలో అసలు బడిముఖం చూడని పిల్లలు ఏడు వేలు దాటి ఉన్నట్టు తేలింది. అయితే వారిని బడిలో చేర్పించడం ఎలా అనేది మాత్రం అధికారులు తేల్చలేకపోయారు. చిన్నపిల్లలను గ్రామాలకు దూరంగా ఉన్న పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. అడవిలో కట్టెలు ఏరుతున్న డ్రాపౌటు పిల్లలు దీంతో బడికి వెళ్లాల్సిన చిన్నారులు తల్లిదండ్రులతో అడవికి వెళ్లడం, వ్యవసాయం చేయడం, పశువుల కాపర్లుగా మారిపోతున్నారు. కొన్ని చిన్న గ్రామాలుగా ఉంటే మరికొన్ని పెద్ద గ్రామాలుగా ఉన్నాయి. పెద్ద గ్రామాల్లో బడి ఈడు కలిగిన పిల్లలు 15 మంది వరకు ఉంటున్నారు. వారిని దూరంగా ఉన్న ప్రాంతాలకు బడికి పంపడం లేదు. ఆశ్రమ పాఠశాలల్లో మూడో తరగతి నుంచి చేర్చుకుంటున్నారు. అయితే ఒకటి రెండు తరగతులు చదివేందుకు వీలులేకుండా పోయింది. ఆ ఒకటి రెండు తరగతులు చదివేందుకు ఉపాధ్యాయులను వేయాలని కోరుతోన్నా స్పందించడంలేదు. ఏటా ఎన్ఆర్ఎస్టీసీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆరు నెలల తరువాత వాటిని ఎత్తేస్తున్నారు. ఆ పాఠశాలలు నడిపే సమయంలో విద్యార్థులకు భోజనం పెట్టడం లేదు. విద్యార్థులపై వివక్ష మారుమూల ప్రాంతాల్లో అధికంగా జీపీఎస్ (టీడబ్ల్యూ) మండల పరిషత్ ప్రాథమికక పాఠశాలలుంటాయి. రెండింటిలోను చదివేది గిరిజన విద్యార్థులే. అయినా అధికారులు మండల పరిషత్ పాఠశాలపై వివక్షత చూపుతున్నారనే విమర్శలున్నాయి. జీపీఎస్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బ్యాగ్లు, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బూట్లు, అందజేస్తున్నారు. మండల పరిషత్ విద్యార్థులకు అలాంటివి ఏమి అందించడం లేదు. దీనిపై అధికారులు చెప్పే సమాధానం విచిత్రంగా ఉంటుంది. జీపీఎస్ పాఠశాలలు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయని, మండల పరిషత్ పాఠశాలలు వారికి సంబంధం లేదంటున్నారు. కాని చదివేది పేద విద్యార్థులన్న వాస్తవాన్ని విద్యాశాఖాధికారులు మరచిపోతున్నారు. గడచిన రెండేళ్లుగా ఈ వివక్ష కొనసాగుతోంది. -
తయారీ యూనిట్లపై జీసీసీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: వ్యాపార వృద్ధిలో భాగంగా గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) తయారీ యూనిట్ల ఏర్పాటువైపు దృష్టి సారించింది. గిరి తేనె, సహజ సిద్ధమైన సబ్బులు, షాంపూల తయారీతో బహిరంగ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన జీసీసీ.. తాజాగా తృణధాన్యాల ఉత్పత్తుల వైపు దృష్టి పెట్టింది. జొన్నలు, రాగులు, కొర్రలు, సజ్జలతో తయారుచేసిన సహజసిద్ధమైన స్వీట్లు, స్నాక్స్, వంటకాలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఈ దిగుబడులకు ధరలు సైతం అధికంగా ఉండటంతో గిరిజన సంక్షేమ శాఖ యంత్రాంగం ఐటీడీఏ ప్రాంతాల్లోని గిరిజన రైతాంగాన్ని వీటి సాగుకు ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో వచ్చిన పంట దిగుబడులను ప్రాసెసింగ్ చేసి వాటి ద్వారా ఆహార పదార్థాల తయారీకి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 25 యూనిట్ల ఏర్పాటు.. ఉట్నూరు, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో జీసీసీకి తేనె పరిశ్రమలు ఉన్నాయి. ఏటూరు నాగారం పరిధిలో సబ్బులు, షాంపూల తయారీ యూనిట్లున్నాయి. వీటితోపాటు నగరంలోని కొన్ని పరిశ్రమలను లీజు రూపంలో తీసుకుని అక్కడ వివిధ రకాల సబ్బులు, షాంపూలు తయారు చేసి మార్కెట్లోకి తెస్తున్నారు. ప్రస్తుత ప్రొడక్షన్ బహిరంగ మార్కెట్లో కంటే సం క్షేమ వసతి గృహాలు, గురుకులాలకే సరిపోతోంది. డిమాండ్కు తగినట్లు సరఫరా చేయాలనే ఉద్దేశంతో జీసీసీ కొత్త యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఒక్కో యూనిట్ను గరిష్టంగా రూ.40 లక్షలతో ప్రారంభించాలని భావిస్తోంది. రాష్ట్రంలోని మూడు ఐటీడీఏల పరిధిలో ప్రాధాన్యతా క్రమంలో వీటిని ఏర్పాటు చేస్తారు. పంట దిగుబడులను బట్టి యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. దాదాపు రూ.10 కోట్లతో తయారీ యూనిట్లను నెలకొల్పాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. దీనిలో 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టును సమర్పిస్తే కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ నుంచి 60 శాతం గ్రాంటు రానుం దని అధికారులు భావిస్తున్నారు. మిగతా 30 శాతం బ్యాంకు రుణం ద్వారా, మరో పది శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. గిరిజన యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోనే ఈ యూనిట్లను నెలకొల్పుతున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. -
గిరిజనులకు ఇక నేషనల్ ఫెలోషిప్
సాక్షి, హైదరాబాద్: గిరిజన తెగలకు చెందిన పరిశోధన విద్యార్థులకు ఫెలోషిప్ కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నిర్వహిస్తోంది. గతంలో యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ద్వారా ఫెలోషిప్ కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ... కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులతో ఫెలోషిప్ కార్యక్రమ అమలు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోకి వచ్చింది. ఈ క్రమంలో పరిశోధన విద్యార్థుల ఎంపికను ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. గైడ్ టీచర్ల ఎంపిక ప్రక్రియ మొదలు దరఖాస్తు విధానం, సబ్జెక్టుతో పాటు ప్రజెంటేషన్ తదితర అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే అర్హతను నిర్ధారిస్తుంది. కార్యక్రమ అమలులో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి యూనివర్సిటీ రిజిస్ట్రార్లకు అవగాహన కార్యక్రమాల్ని చేపట్టింది. గిరిజన పరిశోధన విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ‘నేషనల్ ఫెల్లోషిప్ అండ్ స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎస్టీ స్టూడెంట్స్’కార్యక్రమానికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 10 యూనివర్సిటీల పరిధిలో 157 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గిరిజన తెగల నుంచి పరిశోధన విద్యార్థులు ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడం ఇదే తొలిసారి. వర్సిటీల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా 750 మంది గిరిజన పరిశోధన విద్యార్థులకు మాత్రమే ఈ కార్యక్రమం కింద అవకాశం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులు పెద్ద సంఖ్యలో రావడంతో జాగ్రత్తగా వడపోసి అర్హులను ఎంపిక చేసేందుకు శాస్త్రీయ పద్ధతిని అవలంభించనున్నారు. పీవీటీజీ తెగలకు చెందిన గిరిజనులకు 3 శాతంతో పాటు మహిళలకు 30 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులను ఈ నెల 15వ తేదీలోపు పరిశీలించి ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను కేంద్రానికి పంపిస్తారు. అనంతరం వాటిని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ వడపోసి తుది జాబితాను రూపొందిస్తుంది. ఎంఫిల్ విద్యార్థులకు ప్రతి నెల రూ.25 వేల చొప్పున రెండేళ్ల పాటు చెల్లిస్తారు. అలాగే సంవత్సరానికి రూ.22 వేలు కంటింజెన్సీ కింద ఇస్తారు. అదేవిధంగా పీహెచ్డీ విద్యార్థులకు ప్రతి నెల రూ.28 వేలు చొప్పున ఐదేళ్ల పాటు అందిస్తారు. కంటిజెన్సీ కింద ఏటా రూ.45,500 ఇస్తారు. సగటున ఒక్కో పరిశోధన విద్యార్థికి ఏడేళ్ల కాలానికి రూ.25 లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది. ఎంఫిల్కు... రెండేళ్ల పాటు ప్రతి నెలా 25 వేల చొప్పున ఇస్తారు. కంటింజెన్సీ కింద ఏటా 22 వేలు ఇస్తారు. పీహెచ్డీ... ఐదేళ్ల పాటు ప్రతి నెల 28 వేల చొప్పున ఇస్తారు. కంటింజెన్సీ కింద ఏటా రూ.45,500 ఇస్తారు. -
సంక్షేమ హాస్టళ్లపై సర్కార్ శీతకన్ను!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లపై సర్కార్ శీతకన్ను కొనసాగుతోంది. గత మూడు నెలల నుంచి హాస్టళ్ల మెస్ బిల్లులు ఇంకా విడుదల చేయకపోవడమే దీనికి నిదర్శనం. హాస్టల్ మెస్ బిల్లులు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ విదేశీ విద్యా దీవెన ఫీజురీయింబర్స్మెంట్, సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థుల మెస్ చార్జీలు కూడా విడుదల కాలేదు. దీంతో సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు, విదేశాల్లో చదువుకుంటున్నవారు, సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, కాపు కార్పొరేషన్ నుంచి సుమారు రూ.500 కోట్ల వరకు బిల్లులు విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. సంక్షేమ హాస్టళ్లలో ప్రస్తుతం 3,39,664 మంది విద్యార్థినీవిద్యార్థులు (కాలేజీ, ప్రీమెట్రిక్) చదువుకుంటున్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో 1,065, గిరిజన సంక్షేమ శాఖలో 639, బీసీ సంక్షేమ శాఖలో 1,137 చొప్పున మొత్తం 2,841 హాస్టళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా గురుకుల విద్యాలయాలు కూడా ఉన్నాయి. హాస్టళ్లకు జనరల్ బడ్జెట్ నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. బిల్లులు పెట్టినా కాంప్రహెన్షివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్ఎంఎస్)లో పెండింగ్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్థిక శాఖకు ప్రభుత్వ పెద్దల ఆదేశాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలకు ముందుగా నిధులు ఇవ్వాలని ఆదేశించడంతో సాధారణ బిల్లులకు నిధులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో అప్పులు ఇచ్చినవారు హాస్టల్ వార్డెన్లపై ఒత్తిడి మొదలు పెట్టారు. ఒక్కో హాస్టల్ వార్డెన్ కనీసం రూ.ఐదు లక్షల వరకు అప్పులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న హాస్టల్ వార్డెన్ల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ప్రతి సంక్షేమ శాఖలోనూ హాస్టళ్ల మెస్ బిల్లుల బకాయిలు సుమారు రూ.100 కోట్లకు పైనే పేరుకున్నాయి. విదేశీ విద్యాదీవెన.. ఇబ్బందులెన్నో.. ఎన్టీఆర్ విదేశీ విద్యాదీవెన కింద విదేశాల్లో విద్యనభ్యసిస్తున్నవారికి మూడు నెలలైనా ఫీజురీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచి కొత్తగా దరఖాస్తులు చేసుకున్నవారికి, రెండో విడత రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సినవారికి ఆపేశారు. దీంతో విదేశాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది పార్ట్టైమ్ ఉద్యోగాలు చూసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. కొందరు పెట్రోల్ బంకుల్లో గంటల ప్రకారం పనిచేసి వచ్చిన డబ్బులతో కాలం గడుపుతున్నారు. ఆస్ట్రేలియా వెళ్లినవారిలో సుమారు 90 శాతం మందికి రెండో విడత ఇవ్వాల్సిన ఫీజురీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. నాలుగు నెలల క్రితం ఎంపిక చేసినవారికి జిల్లాల డీడీలు నిధులు విడుదల చేయలేదు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే ట్రెజరీల్లో డబ్బులు లేవని, అవి రాగానే విడుదల చేస్తామని, బిల్లులు పెట్టామని డిప్యూటీ డైరెక్టర్లు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్లలో ఈ దుస్థితి ఉంది. సివిల్స్ అభ్యర్థుల గగ్గోలు ఇక సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు ఇవ్వాల్సిన డైట్ చార్జీలను కూడా సకాలంలో ఇవ్వలేదు. ఒకటీ, అరా ఇన్స్టిట్యూషన్లలో కొంత మొత్తం ఇచ్చినా మిగిలిన సంస్థలకు ఇవ్వలేదు. కోచింగ్ తీసుకుంటున్న నగరాన్ని బట్టి ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు అభ్యర్థుల భోజన, వసతి ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. అయితే, ఇవ్వకపోవడంతో ఢిల్లీ, బెంగళూరు, చెన్నైల్లో కోచింగ్ తీసుకుంటున్నవారు నానా అవస్థలు పడుతున్నారు. రూము అద్దెలు, మెస్ చార్జీలు సకాలంలో చెల్లించకపోవడంతో యజమానులు ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వకపోవడంతో బయట అధిక వడ్డీలకు అప్పులు చేసి తామే అద్దెలు, మెస్ బిల్లులు కట్టుకుంటున్నామని చెబుతున్నారు. అధికారులను ఈ విషయమై ప్రశ్నిస్తే.. పరిశీలించాల్సి ఉందని మాటదాటేస్తున్నారు. -
పేద గిరిజనులకు పక్కా ఇళ్లు!
సాక్షి, హైదరాబాద్: అత్యంత వెనుకబడ్డ గిరిజన తెగ (పీవీటీజీ)ల్లోని కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. పీవీటీజీల్లో 4 తెగలున్నాయి. చెంచు, తోటి, కొండ రెడ్డి, కొలామ్ తెగలు అత్యంత వెనుకబడ్డ గిరిజనులుగా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. దీంతో ఈ తెగల్లోని కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆ శాఖ చర్యలు మొదలుపెట్టింది. పూర్తిగా అటవీ ప్రాంతంలో నివసించే తెగలకు చెందిన వీరు ప్రస్తుతం తాత్కాలిన నివాసాల్లోనే ఉంటున్నప్పటికీ వీరికి అనువైన చోట పక్కా ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీరి పూర్తిస్థాయి ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం అమలు చేస్తున్న సాంప్రదాయ పరిరక్షణ అభివృద్ధి పథకం నిధులను వినియోగించు కోవాలని గిరిజన సంక్షేమ శాఖ యోచిస్తోంది. నాలుగు తెగల్లో 50 వేల కుటుంబాలు రాష్ట్రంలో 3 ఐటీడీఏలున్నాయి. ఉట్నూరు, ఏటూరు–నాగారం, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో పీవీటీ జీ కేటగిరీ కింద దాదాపు 50 వేల కుటుంబాలుంటా యని గిరిజన సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నా యి. ఇందులో దాదాపు 95% మందికి పక్కా ఇళ్లు లేవు. దీంతో అటవీ ప్రాంతాల్లో ఉంటున్న పేద గిరిజనులకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పీవీటీజీల్లో ఉన్న పేద కుటుంబా లన్నింటికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికా రులు నిర్ణయించారు. సంఖ్య ఎక్కువగా ఉంటే విడ తల వారీగానైనా పూర్తిస్థాయిలో అర్హులకు న్యాయం చేయాలని భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) ఆధ్వర్యంలో అనంత పురంలో గిరిజనులకు పక్కా గృహాలు నిర్మించి ఇచ్చారు. తక్కువ ఖర్చుతో మన్నికైన ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో.. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆ దిశగా చర్చలు జరుపుతోంది. దీనిలో భాగంగా తాజాగా డీఎస్ఎస్ భవన్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులతో గిరిజన సంక్షేమ శాఖ సమావేశం నిర్వహించింది. పీవీటీజీలకు ఎలాంటి ఇళ్లు నిర్మించి ఇస్తే బాగుంటుందనే దానిపై చర్చలు జరిపారు. ఆర్డీటీ రూపొందించిన ఇంటి నమూనాలనూ పరిశీలించా రు. ఒక ఇల్లు నిర్మించాలంటే రూ.3 లక్షల వరకు ఖర్చవుతున్నట్లు అధికారులు అభిప్రాయపడు తున్నారు. ఈనేపథ్యంలో పూర్తిస్థాయిలో చర్చలు జరిపి డిజైన్ రూపొందించాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. -
చెల్లప్ప కమిషన్ గడువు ఆర్నెల్లు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజనుల ప్రాముఖ్యతలపై విచారణ చేపడుతున్న చెల్లప్ప కమిషన్ కాలపరిమితిని ప్రభుత్వం ఆర్నెల్లు పొడిగించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్దత్ ఎక్కా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి జనవరి 31 నాటితో ఈ కమిషన్ గడువు ముగియనుంది. కానీ, విచారణ ప్రక్రియ ఇంకా పూర్తికానందున కాలపరిమితిని మరో ఆర్నెల్లు పొడిగించింది. నిర్దేశిత గడువులోగా విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
ఈ–కామర్స్లోకి ‘గిరిజన’ బ్రాండ్స్
సాక్షి, హైదరాబాద్: జీసీసీ (గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్) ఉత్పత్తులన్నీ వినియోగదారుల ముంగిట్లోకి తెచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాల వరకే పరిమితమైన అమ్మకాలను, తాజాగా ఆన్లైన్కు విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు ఈ–కామర్స్తో గిరిజన సంక్షేమ శాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది. దీనికోసం గత కొంతకాలంగా చర్చలు జరిపిన అధికారులు అవగాహన కుదుర్చుకోనున్నారు. సంప్రదాయ ఉత్పత్తుల పేరుతో.. జీసీసీ ద్వారా తేనె, సబ్బులు, షాంపూలు, కారం, పసుపు, మసాలా పొడులు విక్రయిస్తున్నారు. వీటికి సంబంధించి ఐటీడీఏ పరిధిలో పలుచోట్ల ప్రాసెసింగ్ కేంద్రాలు సైతం ఏర్పాటు చేయడంతో ఉత్పత్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. మరోవైపు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని టీఆర్ఐ (ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) ద్వారా గిరిజనుల సంస్కృతులకు సంబంధించి చిత్రకళను సైతం అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఔత్సాహిక కళాకారులను గుర్తించి వారితో పెయింటింగ్స్ వేయించి విక్రయించే వెసులుబాటు కల్పించారు. తాజాగా జీసీసీ ఉత్పత్తులతోపాటు గిరిజన సాంస్కృతిక చిత్రాలను కూడా అమెజాన్ వెబ్సైట్ ద్వారా విక్రయించనున్నారు. వీటిని ట్రైబల్ ట్రెడిషన్ ప్రొడక్ట్స్ పేరిట ప్రత్యేకంగా వెబ్సైట్లో పొందుపర్చనున్నారు. అమెజాన్తో అవగాహన నేపథ్యంలో కంపెనీ అధికారులు పలుమార్లు జీసీసీని సందర్శించారు. అదేవిధంగా పెయింటింగ్స్ను సైతం పరిశీలించారు. అవగాహన కుదిరితే ఉత్పత్తుల్లో శాంపిల్ను గోడౌన్లో అందుబాటులో పెట్టాల్సి ఉంటుంది. మిగతా వాటిని డిమాండ్కు తగినట్లు సరఫరా చేయాలి. అమెజాన్ వెబ్సైట్లో గిరిజన సంక్షేమ శాఖ సెల్లర్ కేటగిరీలో కనిపిస్తుంది. ప్రస్తుతం జీసీసీ నుంచి వచ్చే తేనెకు విపరీతమైన డిమాండ్ ఉంది. అదేవిధంగా కారం, పసుపు, సహజసిద్ధమైన సబ్బులకు సైతం డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వార్షిక టర్నోవర్ రూ.200 కోట్లకు చేరింది. ఆన్లైన్ విక్రయాలు మొదలుపెడితే టర్నోవర్ రెట్టింపు అయ్యే అవకాశాలున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అంచనా వేస్తోంది. అవగాహన ప్రక్రియ పూర్తయితే వచ్చేనెల మొ దటివారం నుంచి గిరిజన ఉత్పత్తులు ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. -
కొత్తగా మరో గురుకుల సొసైటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో గురుకుల సొసైటీ ఏర్పాటు కానుంది. ఇప్పటివరకు 5 సంక్షేమ శాఖల పరిధిలో 5 గురుకుల సొసైటీలు ఉన్నాయి. ఎస్సీలకు ఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, గిరిజనులకు టీటీడబ్ల్యూఆర్ఈఐ ఎస్, బీసీలకు ఎంజేపీటీఎస్బీసీడబ్ల్యూ ఆర్ఈఐఎస్, మైనారిటీలకు ఎండబ్ల్యూఆర్ఈఐఎస్, విద్యాశాఖ పరిధిలో టీఎస్ఆర్ఈఐఎస్ పేరుతో గురుకుల విద్యాలయ సొసైటీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తాజాగా ఏకలవ్య గురుకుల విద్యా సంస్థల సొసైటీ పేరుతో ఏర్పాటు కానుంది. ఈ సొసైటీకి నిధులు, విధులన్నీ కేంద్రమే నిర్వహించనుంది. దీనిపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యాచరణ మొదలుపెట్టింది. సులభంగా నిధుల వినియోగం.. ఈఎంఆర్ఎస్లకు నిధులు కేంద్రమే ఇస్తుంది. వీటిని గిరిజన సంక్షేమ శాఖకు విడుదల చేయడంతో అక్కడి నుంచి అవసరాలను బట్టి నిధు లు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో నిధులు నేరుగా కాకుండా ప్రత్యేక పద్దుల ద్వారా ఖర్చు కావడంతో ప్రాధాన్యాంశాలు, అత్యవర కేటగిరీల్లో నిధుల వినియోగంలో సమస్యలు తలెత్తుతున్నాయి. కొత్తగా గురుకుల సొసైటీ ఏర్పాటు చేస్తే నిధులను నేరుగా విడుదల చేయడం సులభతరం కానుంది. గురువారం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జుయల్ ఓరమ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. త్వరలో సొసైటీ ప్రతిపాదనలు పంపేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. కొత్తగా మరో 13 ఈఎంఆర్ఎస్లు రాష్ట్రంలో 11 ఈఎంఆర్ఎస్లు ఉన్నాయి. ఇవన్నీ గిరిజన మండలాల్లోనే ఉన్నాయి. తాజాగా మరో 13 ఈఎంఆర్ఎస్లను మంజూరు చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఇవన్నీ వచ్చే విద్యా సంవత్సరంలోగా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. -
‘గిరిజన’ శాఖలో.. సమస్యలు కొలిక్కి వచ్చేనా.?
ఒంగోలు టూటౌన్: జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో గాడితప్పిన సంక్షేమం కొలిక్కి వచ్చేనా..? అన్న సంశయం గిరిజన సంఘాలను వెంటాడుతోంది. గతంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డీటీఓగా పనిచేసి రిటైర్డ్ అయిన ప్రేమనందం అనంతరం ఆయన స్థానంలో జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారిగా రెవెన్యూ శాఖకు చెందిన కె. రాజ్యలక్ష్మి డిప్యూటేషన్పై 2017 అక్టోబర్ నెలలో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అవుట్ సోర్సింగ్ గిరిజన ఉద్యోగులకు కష్టాలు మొదలయ్యాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాల్లేవ్.. జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ ద్వారా 14 గురుకుల పాఠశాలలు, 17 ఆశ్రమ పాఠశాలలు పనిచేస్తున్నాయి. వీటితో పాటు మూడు పోస్టు మెట్రిక్, మూడు ఫ్రీ మెట్రిక్ వసతి గృçహాలు మొత్తం 37 వసతి గృహాలు నడుస్తున్నాయి. సుమారుగా 4 వేల మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటిలో ప్రభుత్వం ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిపి మొత్తం 140 వరకు పనిచేస్తుండగా అందులో 56 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెల వేతనం రూ.12 వేల వరకు ఉండగా కటింగ్లు పోను రూ.10,300 వరకు చేతికొస్తోంది. ఆ చాలీచాలనీ వేతనంతోనే తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో డిప్యూటేషన్పై బాధ్యతలు చేపట్టిన కె. రాజ్యలక్ష్మి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ సడెన్గా నిలుపుదల చేశారు. 2018 విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత జూన్లో రెన్యువల్ ఆర్డర్లు అడగటానికి జిల్లా గిరిజన సంక్షేమశాఖకు వెళ్లిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు చేదు అనుభవం ఎదురైంది. డీటీడబ్ల్యూఓ మిమ్మలను తొలగిస్తున్నట్లు తెలపడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో 56 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. తరువాత పనిచేసిన కాలంలో రావాల్సిన పది నెలల వేతనాలు మంజూరు కాక ఆర్థిక కష్టాల పాలయ్యారు. నిత్యం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయని రోజులేదు. దీంతో గత్యంతరం లేక గిరిజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో బాధితులు స్థానిక ప్రకాశం భవనం వద్ద ధర్నాలకు దిగారు. ఆందోళనలు నిర్వహించారు. చివరకు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఆమెను మాతృశాఖకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్తో పాటు గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా బాధితుల ఆవేదన, ఆక్రందన ఆవేదనగానే మిగిలిపోయింది. ఎవరూ సమస్యను పరిష్కరించలేకపోయారు. చివరకు పాలకుల దృష్టికి గిరిజన సంఘం నాయకులు తీసుకెళ్లారు. దీంతో డీటీడబ్ల్యూఓని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఆమె స్థానంలో నెల్లూరు జిల్లా పౌరసరఫరాల శాఖలో విజిలెన్స్ విభాగంలో పనిచేసే ఎం. వెంకటసుధాకర్ను ఇటీవల గిరిజన సంక్షేమశాఖ అధికారిగా నియమించింది. ఆయన వెంటనే బాధ్యతలు చేపట్టారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు గిరిజన సంఘం రావూరి శ్రీనివాసరావు, సంఘం నాయకులు కలిసి తమ సమస్యలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను విన్నవించారు. వీటితో పాటు భూమి కొనుగోలు పథకం అమలు, సీఆర్టీలకు వేతనాలు, ఎన్ఎస్ఎఫ్టీసీ ఇలా పలు గిరిజన సంక్షేమ పథకాలు పడకేశాయని గిరిజన సంఘం నాయకులు లక్ష్మయ్య, శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీటీడబ్ల్యూఓకి విజ్ఞప్తి చేశారు. ఈయన ఏ మేరకు సమస్యలు పరిష్కరిస్తారో వేచిచూడాలి మరి. -
నవోదయకు దీటుగా ‘ఏకలవ్య’
హైదరాబాద్: జవహర్ నవోదయ పాఠశాలలకు దీటుగా ఏకలవ్య పాఠశాలలను తీర్చిదిద్దుతామని గిరిజన వ్యవహారాల కేంద్ర సహాయమంత్రి జశ్వంత్ సిన్హ్ సుమన్ భాయ్ భభోర్ అన్నారు. సోమవారం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈఎం ఆర్ఎస్ (ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్) తొలి ‘ఫస్ట్ నేషనల్ స్పోర్ట్స్ మీట్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం ప్రారం భమైన ఈ స్పోర్ట్స్ మీట్ 16 వరకు జరగనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏకలవ్య పాఠశాలలు నెలకొల్పాలన్న దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి ఆలోచననే ప్రధాని నరేంద్ర మోదీ ఆచరణలో పెట్టారని తెలిపారు. 2022లోగా 400 ఏకలవ్య మోడల్ స్కూళ్లు ప్రారంభించి, వాటిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దతామన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో కీలకంగా నిలిచిన ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఏకలవ్యకు నిధులు పెంచాం.. ఈఎంఆర్ఎస్ టలకు 2014–15 బడ్జెట్తో పోలీస్తే.. 2018–19 బడ్జెట్లో నిధులు అధికంగా కేటాయించామని వివరించారు. వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదం చేస్తాయని, అందరూ పట్టుదలతో కృషి చేసి క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. గిరిజన యువతలో ఎంతో ప్రతిభా పాటవాలు దాగి ఉంటాయని, అందుకు క్రికెటర్ ధోనీ, బాక్సర్ మేరికోమ్లే నిదర్శనమని అన్నారు. 20 వేల జనాభాకు ఒక గురుకులం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏక్ భారత్ – శ్రేష్ట భారత్ నినాదంతో దేశ అభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఈఎంఆర్ఎస్ విద్యార్థులు స్వచ్ఛ భారత్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం నృత్యాలు, వివిధ రాష్ట్రాల విద్యార్థులు ప్రదర్శించిన కోయ, లంబాడీ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బిశ్వజిత్ దాస్, రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్యదర్శి డాక్టర్ బెన్హూర్ మహేశ్ దత్ ఎక్క, కమిషనర్ డాక్టర్ క్రిస్టినా జడ్ చోగ్తు, టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రటరీ ప్రవీణ్కుమార్, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ డైరెక్టర్ రాజేంద్ర కుమార్, శాట్స్ చైర్మన్ ఎ.వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన యూనివర్సిటీకి మోక్షం
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు గిరిజన యూనివర్సిటీకి ముందడుగు పడింది. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర అవతరణ సమయంలో ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీ.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానుంది. భూపాలపల్లి జిల్లా జాకారం సమీపంలో 483 ఎకరాల విస్తీర్ణంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ వద్ద పెండింగ్లో ఉంది. పార్లమెంటులో గిరిజన యూనివర్సిటీ బిల్లుకు ఆమోదం లభించాకే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే పార్లమెంటులో బిల్లుకు జాప్యం జరుగుతున్నందున విభజన చట్టం ప్రకారం పనులు మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యూనివర్సిటీ మంజూరు, నిధుల కేటాయింపులు, నిర్వహణ అంతా కేంద్రం ఆధ్వర్యంలోనే ఉంటుంది. 173 ఎకరాలు అప్పగింత..: జాకారంలో 483 ఎకరాల స్థలాన్ని గిరిజన యూనివర్సిటీకి ప్రతిపాదించారు. ఇందులో 173 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానిదే కావడంతో ఆ మేరకు రెవెన్యూ శాఖ.. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించింది. మరో వంద ఎకరాలు అసైన్డ్ భూమి కావడంతో రైతులకు పరిహారం చెల్లించాక అప్పగించాలని భావిస్తోంది. ఇప్పటికే సేకరణ ప్రక్రియ మొదలైంది. మరో 213 ఎకరాలు అటవీ శాఖ పరిధిలో ఉంది. ఈ భూమి అప్పగింతకు సంబంధించి అటవీ శాఖతో సంప్రదింపులు పూర్తయ్యాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే అటవీ శాఖ భూమిలో ఉన్న పచ్చదనానికి ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని, ప్రహరీ మాత్రమే నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. రూ.500 కోట్లతో నిర్మాణాలు గిరిజన వర్సిటీ కార్యకలాపాలు మరో 6 నెలల్లో ప్రారంభం కానుండగా అప్పట్లోగా కొత్త భవనాలు నిర్మించడం సాధ్యంకానందున మౌలిక వసతుల కల్పనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. జాకారంలో ఉన్న వైటీసీ(యూత్ ట్రైనింగ్ సెంటర్)ను పరిపాలన విభాగం, తరగతుల నిర్వహణకు వాడుకోనున్నారు. ఇందులో అడ్మినిస్ట్రేషన్తో పాటు 300 మంది విద్యార్థులకు సరిపడా సదుపాయాలున్నా యి. రెండేళ్లలో నిర్మాణ పనులు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ పనులకు రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. తొలుత యూజీ, పీజీ కోర్సులు 2019–20 విద్యా సంవత్సరంలో గిరిజన యూనివర్సిటీలో 6 కోర్సులను అందుబాటులోకి తేనున్నారు. ఇందులో డిగ్రీ, పీజీ కోర్సులున్నాయి. డిగ్రీలో బీఏ(హోటల్ మేనేజ్మెంట్), బీసీఏ, బీబీఏ, ఎంసీఏ, ఎంబీఏ (మార్కెటింగ్, ప్యాకేజింగ్), ఎంఏ (గిరిజన సంస్కృతి, జానపద కళలు) కోర్సులను ప్రారంభిస్తారు. మరిన్ని పీజీ, పీహెచ్డీ కోర్సులను దశల వారీగా అందుబాటులోకి తేనున్నారు. తొలి ఏడాది వివిధ కోర్సుల్లో 180 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. ఏడేళ్ల తర్వాతికి ఈ యూనివర్సిటీలో 7 వేల మంది విద్యార్థులుంటారు. గిరిజనుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ కావడంతో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రవేశాల్లో 30శాతం సీట్లు వారికి కేటాయించనుంది. పరిహారానికి రూ.10 కోట్లు: ఎస్కే జోషి గిరిజన వర్సిటీ భూసేకరణ వేగవంతం చేయాలని సీఎస్ ఎస్కే జోషి అధికారులను ఆదేశించారు. దీని కోసం రూ.10 కోట్లను భూపాలపల్లి జిల్లా కలెక్టర్కు విడుదల చేయాలని గిరిజన సంక్షేమ శాఖను ఆదేశించారు. గిరిజన వర్సిటీపై సచివాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వర్సిటీలో తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ వర్సిటీ కమిటీలో ఉన్నత విద్య, గిరిజన సంక్షేమం, అటవీశాఖ ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా నియమించాలన్నారు. తరగతుల నిర్వహణకు అవసరమైన పనులను ప్రారంభించాలన్నారు. సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ, భూపాలపల్లి కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
గిరిపుత్రులకు ఈ–పాఠాలు!
గిరిపుత్రుల బడి అత్యాధునిక హంగులు సంతరించుకుంది. పాఠ్యాంశ బోధనలో నూతన ఒరవడికి తెరలేపింది. ఆన్లైన్ పాఠాలు, డిజిటల్ తరగతులకు భిన్నంగా లైవ్ టీచింగ్ను గిరిజన సంక్షేమ శాఖ అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేక సదుపాయాలతో ఏర్పాటు చేసిన స్టూడియో ద్వారా ఈ–పాఠ్యాంశ బోధన మొదలుపెట్టింది. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ విధానాన్ని మరింత ఆధునీకరిస్తూ పాఠ్యాంశ బోధనను సరికొత్తగా ఆవిష్కరిస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ–పాఠ్యాంశ బోధన అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా 50 పాఠశాలల్లో ఈ–స్టూడియో బోధన కొనసాగుతోంది. నేరుగా శాటిలైట్ లింకుతో ఈ ప్రక్రియను విజయవంతంగా అమలు చేస్తోంది. పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ లైవ్ టీచింగ్ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్రం మంజూరు చేసిన నిధుల నుంచి రూ.11 కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులను వినియోగించి ఈ–స్టూడియో, డిజిటల్ క్లాస్రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. – సాక్షి, హైదరాబాద్ బోధన ఇలా.. ప్రస్తుతం 50 ఆశ్రమ పాఠశాలల్లో ఈ–స్టూడియో ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. రోజుకు 5 తరగతులుంటాయి. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రోజుకో లైవ్ టీచింగ్ 45 నిమిషాల పాటు సాగుతుంది. దీంతో ప్రతి తరగతికి రోజుకో సబ్జెక్టు బోధిస్తారు. దాన్ని వీక్షించేందుకు స్కూల్లో డిజిటల్ స్క్రీన్, ప్రొజెక్టర్, రిసీవర్, డిష్, ల్యాప్టాప్ తదితరాలతో ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ–స్టూడియో ద్వారా జరిగే పాఠ్యాంశ బోధన స్కూల్లోని డిజిటల్ స్క్రీన్పై కనిపిస్తుంది. బోధకుడికి సంబంధించి చిన్న స్క్రీన్లో వీడియో డిస్ప్లే అవుతూనే.. బ్యాక్గ్రౌండ్లో పాఠ్యాంశానికి సంబంధించిన యానిమేషన్ కనిపిస్తుంది. సందేహాల నివృత్తి.. పాఠ్యాంశ బోధన ప్రక్రియలో విద్యార్థులకు సందేహాలు వస్తే వాటిని లైవ్లోనే అడిగే వీలుంటుంది. పాఠ్యాంశాన్ని వింటున్న ప్రతి విద్యార్థి దగ్గర ఓ బజర్ ఉంటుంది. అందులో వివిధ రకాల బటన్లు ఉంటాయి. సందేహాలు, సమాధానాలు, స్పష్టత తదితరాలకు అనుగుణంగా విద్యార్థులు ఆ బటన్లు నొక్కుతుంటారు. అంశం అర్థం కాకపోతే బటన్ నొక్కితే వారిని లైవ్లోకి తీసుకొస్తారు. ఎక్కువ మందికి సందేహాలు వస్తే పాఠ్యాంశాన్ని తిరిగి అర్థమయ్యేలా బోధిస్తారు. తక్కువ సందేహాలు లేవనెత్తితే వాటికి అక్కడికక్కడే సూచనలు చేస్తూ కీలకాంశాలను రిపీట్ చేస్తారు. ఈ–స్టూడియో కేంద్రంగా.. లైవ్ టీచింగ్ కోసం మాసబ్ట్యాంక్లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా ఈ–స్టూడియోను ఏర్పాటు చేశారు. అక్కడ టీచింగ్ రూమ్తో పాటు కంట్రోల్ రూమ్ ఉంది. పాఠ్యాంశ బోధనలో భాగంగా టీచర్ బోధిస్తున్న సమయంలోనే అందుకు సంబంధించిన యానిమేషన్లు ప్లే చేసేలా వీడియో మిక్సర్ ఉంది. అందుకు తగిన ఆడియోను జోడించేందుకు ఆడియో కంట్రోల్ ఉంటుంది. వీటిని స్టూడియో ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు సందేహాలను లేవనెత్తినప్పుడు క్షణాల్లో వారిని లైవ్లోకి తీసుకొస్తారు. ఈ–స్టూడియోలో ఐదుగురు నిపుణులతో పాటు ఇంజనీర్లు ఉంటారు. ప్రతి స్కూల్లో ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారు. పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతోంది లైవ్ పాఠాలతో పిల్లల్లో ఏకాగ్రత, ఆసక్తి పెరుగుతోంది. సాధారణంగా క్లాస్రూంలో బోర్డుపై ముఖ్యమైన అంశాలను రాస్తూ వివరిస్తాం. ఇక్కడ డిజిటల్ బోర్డుపై యానిమేషన్ల ద్వారా వివరించడంతో పాటు ముఖ్యమైన అంశాలను డిజిటల్ బోర్డుపై రాసే వీలుంటుంది. బోర్డుపై యానిమేషన్లను చూపడంతోనే విద్యార్థులకు విషయం అర్థమవుతుంది. మరింత లోతుగా బోధించే అవకాశం ఉంటుంది. డిజిటల్ బోధనతో విద్యార్థులు మరింత ఏకాగ్రతతో పాఠాన్ని వింటున్నారు. అర్థం కాని అంశముంటే వెంటనే బజర్ నొక్కుతున్నారు. విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. – శ్రీకాంత్, టీచర్ బోధనకు సమాంతరంగా వీడియోలు ఆన్లైన్ బోధనలో యానిమేషన్లు కీలకం. బోధనకు తగినట్లుగా సమయానుకూలంగా వాటిని ప్లే చేయాలి. దీంతో ప్రతి పాఠ్యాంశానికి సంబంధించిన పాయింట్లతో వీడియోలు సిద్ధం చేసుకోవడంతో పాటు వాటి నిడివిని ఖచ్చితంగా అంచనా వేయాలి. అందుకు ముందురోజే ఏర్పాట్లు చేసుకుంటాం. బోధన ప్రక్రియ సాగుతున్నంత సేపు పరిశీలిస్తాం. – చంద్రకాంత్, స్టూడియో ఇంజనీర్ త్వరలో మరో 35 పాఠశాలల్లో.. ఈ–స్టూడియోను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాం. ఈ విద్యా సంవత్సరంలో కచ్చితంగా అమలు చేయాలన్న లక్ష్యంతో 50 పాఠశాలల్లో ఏర్పాటు చేశాం. త్వరలో మరో 35 స్కూళ్లలో అందుబాటులోకి తెస్తాం. కేంద్రం ఇటీవల రూ.2.85 కోట్లు విడుదల చేసింది. ఆశ్రమ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో డిజిటల్ బోధన తీసుకొస్తాం. కొత్త విధానంలో బోధన ప్రక్రియ ప్రారంభ దశలో ఉంది. – నవీన్ నికోలస్,గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ -
‘వసతి’ వణుకుతోంది..
ఖమ్మంమయూరిసెంటర్: వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు చలికి గజగజ వణికిపోతున్నారు. కనీస సౌకర్యాలు లేక నేలపైనే నిద్రిస్తూ చాలీచాలని దుప్పట్లతో అవస్థలు పడుతున్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం.. సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆచరణలో మాత్రం కనిపించని పరిస్థితి నెలకొంది. నాణ్యమైన విద్య కోసం తల్లిదండ్రులను వదిలి.. సంక్షేమ వసతి గృహాల్లో చేరిన విద్యార్థులకు తగిన విధంగా వసతి కల్పించలేకపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులను రాత్రివేళ కంటికి రెప్పలా చూసుకోవాల్సిన సిబ్బంది సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల సందర్శనలో పలు సమస్యలు వెలుగుచూశాయి. సంక్షేమ శాఖ వసతి గృహాలని ప్రభుత్వం చెబుతున్నా.. అవి కేవలం పేరుకే సంక్షేమ వసతి గృహాలుగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు అందించాల్సిన కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రం లోని ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో విద్యార్థులు నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఉంది. పూర్తిస్థాయిలో దుప్పట్లు, మ్యాట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్టీ వసతి గృహాల్లో మినహా ఇతర శాఖల్లో విద్యార్థులు పడుకునేందుకు బంకర్ బెడ్స్ లేవు. అరకొర సౌకర్యాలతోనే బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖ విద్యార్థులు నెట్టుకొస్తున్నారు. సౌకర్యాల లేమితో ఇబ్బందులు.. వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో విద్యార్థులకు దుప్పట్లు, మ్యాట్లు ఇచ్చినా.. సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఎముకలు కొరికే చలిలో సైతం విద్యార్థులు పలుచటి మ్యాట్లను నేలపై వేసుకొని వాటిపైనే నిద్రిస్తున్నారు. దీంతో బండల చల్లదనం, పైన చలిగా లి విద్యార్థులకు నిద్రలేకుండా చేస్తోంది. నగరం లోని ముస్తఫా నగర్ ప్రాంతంలో ఉన్న బీసీ సంక్షేమ ప్రీమెట్రిక్ వసతి గృహంలో పలు గదుల కిటికీలకు తలుపులు లేకపోవడంతో విద్యార్థులు చలికి తట్టుకోలేక వారి వద్ద ఉన్న దుప్పట్లను కిటికీలకు అడ్డంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ పారిశుద్ధ్యం నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఇక గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో కొత్తగా విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులకు దుప్పట్లు లేని పరిస్థితి. నూతనంగా ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో చేరిన విద్యార్థులు ఇంటి నుంచే దుప్పట్లు తెచ్చుకొని చలి నుంచి రక్షణ పొందుతున్నారు. కనిపించని వార్డెన్, వాచ్మెన్లు.. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమశాఖ వసతి గృహాల్లో సౌకర్యాలే లేవను కుంటే.. వసతి గృహాలకు సంరక్షకులుగా ఉన్న సిబ్బంది అక్కడ కనిపించడం లేదు. ముస్తఫా నగర్ బీసీ వసతి గృహంలో రాత్రివేళ విధుల్లో ఉండాల్సిన వాచ్మన్ ఇంటికి వెళ్లిపోవడంతో వసతి గృహంలోని విద్యార్థులు అర్ధరాత్రి వరకు ఇష్టానుసారంగా రోడ్లపైనే తిరుగుతున్నారు. వారు ఇష్టారీతిగా తిరుగుతున్నా వార్డెన్ పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. వార్డెన్, వాచ్మన్ వసతి గృహంలో ఉండకపోవడంతో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. ఇక వసతి గృహంలో విద్యార్థి హత్య జరిగినా.. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మాత్రం వారి నిర్లక్ష్యాన్ని వీడలేదు. నెహ్రూ నగర్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో వార్డెన్, వాచ్మన్లు ఇద్దరూ వసతి గృహ గేట్లకు తాళం వేసి ఇంటికి వెళ్లిపోవడంతో వసతి గృహంలోని విద్యార్థులు గోడలు దూకి బయటకు వెళ్తున్నారు. వసతి గృహ సంక్షేమాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు రోడ్లపైనే తిరుగుతున్నారు. రాత్రివేళ విధుల్లో ఉండాల్సిన వాచ్మన్లు ఇంటికి వెళ్లడం, వసతి గృహాలపై పర్యవేక్షణగా ఉండాల్సిన సంక్షేమాధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థు లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి వసతి గృహాలపై పర్యవేక్షణ ఉంచాలని స్థానిక ప్రజలు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
గడప దాటని గిరిజన వర్సిటీ!
సాక్షి, హైదరాబాద్: గిరిజన యూనివర్సిటీకి చిక్కుముళ్లు వీడటంలేదు. స్థల కేటాయింపులతో పాటు నిధులు విడుదలైనప్పటికీ వర్సిటీ కార్యకలాపాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. తెలంగాణ ఏర్పాటులో భాగంగా విభజన చట్టంలో రాష్ట్రానికి గిరిజన వర్సిటీని కేంద్రం మంజూరు చేసింది. దీనికోసం భూసమీకరణ చేపట్టాలని కేంద్రం సూచించడంతో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 400 ఎకరాలను గుర్తించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మండలం జాకారం సమీపంలో దాదాపు 200 ఎకరాలను గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించింది. మరోవైపు జాకారం గ్రామం సమీపంలో ఉన్న వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్)కోసం నిర్మించిన అత్యాధునిక భవనాన్ని కూడా వర్సిటీ కోసం కేటాయించింది. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ఆ భవనంలో కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఈమేరకు నిర్ణయించింది. భూముల అప్పగింతతో పాటు భవనాన్ని సైతం అప్పగించినా, అనుమతులు తదితర ప్రక్రియ కేంద్రం వద్దే పెండింగ్లో ఉండిపోయింది. హెచ్ఆర్డీ వద్ద పెండింగ్... యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన అనుమతులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇవ్వాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో సంబంధిత నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ఇందులో భాగంగా రెండుసార్లు హెచ్ఆర్డీ అధికారులు పర్యవేక్షణ సైతం చేపట్టినప్పటికీ అనుమతుల ప్రక్రియ పూర్తికాలేదు. తాజాగా సోమవారం హెచ్ఆర్డీ అధికారులు వర్సిటీ ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించారు. పార్లమెంటులో బిల్లుతోనే... యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనుమతితో పాటు వర్సిటీ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలలోనే వర్సిటీ బిల్లుకు ఆమోదం లభిస్తే 2019–20 విద్యా సంవత్సరం ప్రారంభించ వచ్చని ఉన్నాతాధికారలు అంటున్నారు. -
తరగతి గదే నివాస గది!
రాష్ట్రంలో గిరిజన విద్యార్థులతో ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. వారి సంక్షేమాన్ని గాలికొదిలేయడంతో నాణ్యమైన విద్య లభించక గిరిపుత్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో 197 గిరిజన సంక్షేమ హాస్టళ్లను రద్దుచేసి వాటి స్థానంలో రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ఏర్పాటు చేసిన కన్వర్టెడ్ గిరిజన గురుకుల పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం వీటిపై శీతకన్ను వేయడంతో సౌకర్యాల లేమితో కునారిల్లుతున్నాయి. సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో 197 గిరిజన సంక్షేమ హాస్టళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామంటూ రెండేళ్ల క్రితం 80 ఎస్టీ గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. ఇవి పేరుకు మాత్రమే గిరిజన గురుకుల పాఠశాలలు. వాస్తవానికి అక్కడ గురుకుల విద్యా విధానమే లేదు. వాటిని పరిశీలిస్తే.. సంక్షేమ హాస్టళ్ల కంటే అధ్వానంగా ఉన్నాయి. ఈ 80 గురుకుల పాఠశాలలను ప్రభుత్వం కన్వర్టెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లుగా పిలుస్తోంది. బోర్డుపైనే గురుకులం.. లోపల అధ్వానం గతంలో ఉన్న సంక్షేమ హాస్టల్ భవనాల్లోనే గురుకుల స్కూళ్లు అంటూ కొత్తగా బోర్డులు పెట్టి నడుపుతున్నారు. సంక్షేమ హాస్టల్ అంటే.. విద్యార్థుల వసతి కోసం ఏర్పాటు చేసింది. బయట స్కూళ్లలో బోధిస్తారు. ఇప్పుడు వసతి కోసం ఏర్పాటు చేసిన గదిలోనే ఉపాధ్యాయులు క్లాసులు చెబుతున్నారు. ప్రిన్సిపాల్ మినహా అక్కడ పనిచేసే ఉపాధ్యాయులంతా ఔట్సోర్సింగ్, తాత్కాలిక ప్రాతిపదికపై నియమితులైనవారే. తరగతి గది, పడక గది ఒక్కటే కావడంతో విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. ఇబ్బందులెన్నో.. కన్వర్టెడ్ గురుకులాల్లో కొత్తగా వార్డెన్ పోస్టులు వచ్చాయి. హాస్టళ్లు రద్దు కావడంతో వార్డెన్లు నేరుగా తమ సిబ్బంది, విద్యార్థులతో ప్రభుత్వం చెప్పిన మేరకు కన్వర్టెడ్ గురుకులాలకు చేరారు. వార్డెన్లు, సిబ్బంది పిల్లల భోజనం, వసతి సౌకర్యాలను చూస్తారు. ప్రస్తుతం వీరు ఆయా జిల్లాల గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. విద్యార్థులకు బోధించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి తాత్కాలిక ప్రాతిపదికపై ఉపాధ్యాయులను నియమించింది. అయితే ఉపాధ్యాయులకు వసతి కల్పించకపోవడంతో వారు బయట అద్దె ఇళ్లళ్లో ఉంటున్నారు. విద్యార్థులకు విద్యనందించే బాధ్యత గురుకుల విద్యాలయ సంస్థది కావడం, భోజనం, వసతి సౌకర్యాల బాధ్యత ఆయా జిల్లాల గిరిజన సంక్షేమ అధికారులది కావడంతో వార్డెన్లు, ప్రిన్సిపాళ్ల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. వీరి మధ్య వివాదాలతో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. సీఎం మాటకే దిక్కు లేదు సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా అనేక సభలు, సమీక్ష సమావేశాల్లో 80 గిరిజన గురుకుల స్కూళ్లకు కొత్తగా భవనాలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. త్వరలోనే నిర్మాణాలు మొదలుపెట్టాల్సిందిగా పలుమార్లు అధికారులను ఆదేశించారు. అయితే పరిస్థితి ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అనే చందంగా ఉంది. అధికారులను ప్రశ్నిస్తే త్వరలోనే నిర్మాణాలు మొదలవుతాయని, కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని పాతపాటే పాడుతున్నారు. తరగతి గది, పడక గది ఒక్కటే.. విలీన గురుకులాల్లో మొదటి సంవత్సరం మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించారు. గతేడాది ఇక్కడ ఉన్న, బయట నుంచి వచ్చిన అర్హులైన విద్యార్థులతో పాఠశాలల స్థాయిని 6వ తరగతికి పెంచారు. ఇలా ఏటా ఒక్కో తరగతి చొప్పున పదో తరగతి వరకు పెంచుతారు. ఇక రద్దు కాగా మిగిలిన 30 గిరిజన వసతి గృహాల్లో ఉండి చదువుకునే 7, 8, 9, 10 తరగతుల వారికి అక్కడే వసతి కల్పించి, ప్రభుత్వ, పురపాలక, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. వాస్తవానికి వసతి గృహాలను 100 మంది విద్యార్థులకు సరిపోయేలా ఏర్పాటు చేశారు. ఇంతకంటే ఎక్కువ మంది చేరిన చోట పరిస్థితి దారుణంగా ఉంది. మళ్లీ ఈ హాస్టళ్లలోనే గురుకుల పాఠశాలల విద్యార్థులకు 4 గదులు ఇచ్చి మిగిలినవి 7 నుంచి 10 తరగతుల వారికి ఇచ్చి సర్దుకోమంటున్నారు. ఒకరోజైతే పర్వాలేదు. సంవత్సరాల తరబడి సర్దుకోమంటే ఎలా అని విద్యార్థులు వాపోతున్నారు. తెనాలిలోని బాలుర పాఠశాలలోని 54 మంది విద్యార్థులకు 4 గదులు ఇవ్వగా, బాలికల పాఠశాలలో 96 మందికి 4 గదులిచ్చి సరిపెట్టారు. చిలకలూరిపేటలోని బాలుర పాఠశాలలోని 140 మంది 4 గదుల్లో ఉంటున్నారు. ఇక రేపల్లెలోని బాలుర పాఠశాలలో 67 మంది తలదాచుకుంటున్నారు. వీరికి పగలు ఆ గదులలోనే తరగతులు నిర్వహిస్తుండగా రాత్రికి నివాసం కూడా అక్కడే ఉండాల్సిన దుస్థితి. మిగిలిన గదులు వంటకు, ప్రిన్సిపాల్కు, స్టోర్, భోజనశాల, వార్డెన్ గదిగా ఉపయోగిస్తున్నారు. అంటే వీటి కోసం సుమారు 5 గదులు వాడుతున్నారు. ఇంకా మిగిలిన వాటిని 7, 8, 9, 10 తరగతుల విద్యార్థుల వసతికి ఇచ్చారు. గురుకుల పాఠశాల ఉండాల్సింది ఇలా.. గురుకుల విద్యాలయం అంటే అక్కడే విద్యార్థుల విద్యాభ్యాసానికి తరగతి గదులతోపాటు ఉపాధ్యాయులు నివసించేందుకు క్వార్టర్స్ కూడా ఉండాలి. విద్యార్థులకు వసతి కోసం గదులు, భోజనం చేసేందుకు భోజనశాల ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. కనీసం రెండెకరాల ఆటస్థలం ఉండాలి. మొత్తం 20 నుంచి 25 ఎకరాల స్థలంలో గురుకుల విద్యాలయ భవనం ఉండాలి. కానీ ప్రభుత్వం వీటిలో వేటినీ పట్టించుకోలేదు. గురుకుల స్కూల్ నిర్వహణ తీరుతెన్నులపై ప్రైవేట్ ఏజెన్సీతో ఒక అధ్యయన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇంకా ఈ కమిటీ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించలేదు. 80 స్కూళ్ల తరగతులు గచ్చుమీదే.. గుంటూరు జిల్లా రేపల్లె, స్టువర్టుపురం, తెనాలి, గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట, బెల్లంకొండ, కారంపూడి, పిడుగురాళ్ల, రెంటచింతల, వినుకొండ, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, ఉయ్యూరు, విస్సన్నపేట, నందిగామ, కొండపల్లి, మైలవరంలతోపాటు ప్రకాశం, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో 80 గురుకులాలు ఉన్నాయి. వీటిల్లో ఒక్క తరగతి గదిలోనూ విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయకపోవడంతో గచ్చుమీదనే విద్యార్థులు కూర్చోవాల్సిన దుస్థితి. ఏజెన్సీ ప్రాంతంలో హాస్టళ్లను రద్దు చేసి ఏర్పాటు చేసిన 30 ఆశ్రమ పాఠశాలలు మరీ దారుణంగా ఉన్నాయి. వాటికి కనీసం కాపౌండ్ గోడలు కూడా లేవు. దీంతో పాములు, తేళ్లు, ఇతర వన్యజీవులు పాఠశాలల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఒకేసారి హాస్టళ్ల రద్దుతో ఇబ్బందులు నిజమే.. గిరిజన సంక్షేమ హాస్టళ్లను ఒకేసారి పూర్తిగా రద్దు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమే. దీనివల్ల విద్యార్థులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు, ఉపాధ్యాయులు సమస్యలను మా దృష్టికి తెచ్చారు. ప్రత్యామ్నాయాలు చూసుకుని గిరిజన సంక్షేమ హాస్టళ్లను రద్దు చేసి ఉంటే బాగుండేదని తర్వాత గుర్తించాం. ఆ దృష్ట్యా అధ్యయన కమిటీని నియమించాం. నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటాం. కొత్త భవనాల నిర్మాణాలకు స్థలసేకరణ జరుగుతోంది. త్వరలోనే భవన నిర్మాణాలను చేపడతాం. – ఎస్.ఎస్.రావత్, ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేయాలి మా పాఠశాలలో మంచినీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్వో ప్లాంటును ఏర్పాటు చేయకపోవటంతో పలువురు విద్యార్థులు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేయాలి. – మల్లా అంజి, పదో తరగతి విద్యార్థి, పీటీజీ పాఠశాల, విజయపురిసౌత్, గుంటూరు జిల్లా ఈ చిత్రం.. కర్నూలు జిల్లా పాణ్యం మండల పరిధిలోని నెరవాడ మెట్ట వద్ద ఉన్న గిరిజన బాలికల గురుకుల పాఠశాల మరుగుదొడ్ల దుస్థితికి నిదర్శనం. ఈ పాఠశాలలో మొత్తం 279 మంది విద్యార్థినులు ఉన్నారు. ఇక్కడ పరిశుభ్రతను గాలికొదిలేశారు. మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతున్నాయి. వీటికి తలుపులు కూడా సరిగా లేవు. తరగతి గదుల పక్కనే కుళ్లిన చెత్త దర్శనమిస్తోంది. గదుల నిండా బూజు, చెత్తాచెదారం అధికంగా ఉంది. పిల్లలు అపరిశుభ్రంగా, చిరిగిన వస్త్రాలతోనే తరగతులకు హాజరవుతున్నారు. రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేకపోవడంతో విద్యార్థినులను పట్టించుకునేవారు కరువయ్యారు. కొందరు ఉపాధ్యాయులు తరగతులకు గైర్హాజరు అవుతున్నా అడిగేవారే లేరు. ఈ ఫొటోలోని విద్యార్థిని పేరు.. భూమిక. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతోంది. విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఇప్పటివరకు తనకు స్కూల్ యూనిఫాం, చున్నీ ఇవ్వలేదని వాపోతోంది. పాఠశాలకు ప్రహరీ లేదని, దీంతో పాఠశాల ఆవరణలోకి విష పురుగులు వస్తున్నాయని చెబుతోంది. -
‘మోడల్’ బడి
ఉట్నూర్(ఖానాపూర్): ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా వంద పాఠశాలలు ఎంపిక చేసింది. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్కు జిల్లాలో 59 పాఠశాలలను మొదటి విడత ఎంపిక చేసి మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతోపాటు పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దనుంది. ఇందుకోసం ఒక్కో బడికి గిరిజన సంక్షేమ శాఖ రూ.4లక్షల వరకు వెచ్చించనుంది. విద్యాబోధన కోసం ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులను నియమించనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులను పాఠశాలలకు ఆకర్షితులను చేయడంతోపాటు అక్షరాస్యతను పెంపొందించడంలో భాగంగా ఈ చర్యలు చేపడుతోంది. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతోపాటు మెరుగైన వసతుల కల్పన, ఆటపాటలతో కూడిన విద్య అందించనున్నారు. కిచెన్షెడ్ల నిర్మాణం, మరుగుదొడ్లు, డైనింగ్హాల్, క్రీడామైదానం, వివిధ రకాల ఆట వస్తువుల సమూహం, పాఠశాలల్లో టీవీ, ప్రొజెక్టర్ తదితర సౌకర్యాలు కల్పిస్తారు. ఇందుకోసం రూ.4లక్షల వరకు ఖర్చు చేస్తారు. పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి రంగులతో వివిధ రకాల కళాకృతులు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు ఆటపాటలతో కూడిన ఒత్తిడి, బరువు లేని విద్యావిధానం అమలు చేయనున్నారు. పాఠ్యపుస్తకాలను విద్యార్థులు పాఠశాలల్లోనే వదిలి ఇళ్లకు వెళ్లనున్నారు. 2236 మంది విద్యార్థులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 59 పాఠశాలల్లో 2,236 మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వీరికి కార్పొరేట్ స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 28 ప్రాథమిక పాఠశాలల్లో 1,301 మంది, ఆసిఫాబాద్ జిల్లాలో 23 ప్రాథమిక పాఠశాలల్లో 730 మంది, మంచిర్యాల జిల్లాలో 5 ప్రాథమిక పాఠశాలల్లో 144 మంది, నిర్మల్ జిల్లాలో 3 ప్రాథమిక పాఠశాలల్లోని 61 మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు. ప్రతీ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో ప్రత్యేక శిక్షణ పొందిన ముగ్గురు ఉపాధ్యాయులను నియమించి బోధన చేయిస్తారు. జిల్లాల వారీగా ఎంపికైన పాఠశాలలు ఇవే.. ఆదిలబాద్ జిల్లాలో కొత్త లోద్దిగూడ, గాదిగూడ, మామిడిగూడ, చోర్గాం–ఎమ్టీ, పిప్రి–జీ, గోంకొండ, ఇంద్రవెల్లి–కె, అందుగూడ, వాన్వాట్, చోర్గాం–జీ, జాలంతాండ, ఎస్ఎన్ తండా, నానాదిగూడ, గోపాల్పూర్, వంకతుమ్మ, భవానిగూడ–సీ, చింతగూడ, గోపాల్సింగ్తాండ, పర్సువాడ–బీ, దుబార్పెటఏ, పల్సి–బీ తాండ, మనుగ్రోడ్, లంకర్గూడ, జాతర్ల, అందర్బంద్, లక్ష్మిపూర్, బెల్సరాంపూర్, కాండ్వా–జీ. ఆసిఫాబాద్ జిల్లాలో అర్జున్గూడ, అందుగూడ–జీ, పోచంలోద్ది, సావాతి, పంగ్డి, లక్ష్మిపూర్గోంది, కాయచిచాల, కేస్లాగూడ–బీ, కైర్గూడ, ముంజంపల్లి, మాలిని, కాకడ్బుడ్డి, గిన్నెదరి, డోర్గాం, వీవీఆర్హెచ్కాలనీ, గోయాగాం, మార్లవాయి, చిన్న అర్డెపల్లి, మర్కగూడ, పోతపల్లి.– మంచిర్యాల జిల్లాలో హాస్టల్తండా, దమ్మన్నపేట పెద్దపూర్, దేవాపూర్, పెద్దన్పల్లి. నిర్మల్ జిల్లాలో వాకీల్నగర్, గుర్రమదిర, ఇస్లాంపూర్ ప్రాథమిక పాఠశాలలు ఎంపిక అయ్యాయి. గ్రామస్తుల భాగస్వామ్యం.. ఎంపికైన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో గిరిజన సంక్షేమ శాఖ అక్కడక్కడ గ్రామస్తులను కూడా భాగస్వాములను చేస్తోంది. ఆంగ్ల విద్య ప్రాముఖ్యత, పాఠశాలల విధానం వివరిస్తుండడంతో గ్రామస్తులు ముందుకొస్తున్నారు. చోర్గాం–ఎమ్టీ ప్రాథమిక పాఠశాలకు గ్రామస్తులు మూడెకరాల భూమి విరాళంగా ఇవ్వడంతోపాటు ఎనిమిది గదుల భవన నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. గాదిగూడ ప్రాథమిక పాఠశాలకు కిచన్ షెడ్ నిర్మాణాన్ని గ్రామస్తులు చేపట్టగా, పుసిగూడ గ్రామస్తులు పాఠశాలకు కిచెన్ షెడ్ నిర్మాణం, క్రీడా మైదానం కోసం అర ఎకరం భూమి విరాళంగా సమకుర్చారు. నాగోల్కొండ గ్రామస్తులు కిచెన్షెడ్, మరుగుదొడ్లు, రెండు గదుల నిర్మాణం చేపట్టనున్నారు. జాలంతండా వాసులు పాఠశాలకు డైనింగ్ హాల్ నిర్మాణం చేయనున్నారు. అన్ని వసతులు కల్పిస్తాం.. గిరిజన సంక్షేమ శాఖ ఎంపిక చేసిన మోడల్ గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల కోసం కార్పొరెట్ స్థాయిలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు ఎంపికైన పాఠశాలల్లో పూర్తి స్థాయిలో కళాకృతులతో కూడిన రంగులు వేస్తున్నాం. వచ్చే విద్యాసంవత్సరంలో పాఠశాలలు ప్రారంభించనున్నాం. – జగన్, ఏఎంవో ఐటీడీఏ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం వచ్చే విద్యాసంవత్సరం నుంచి మోడల్ గిరిజన ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించనున్నాం. ఇందు కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. పాఠశాలల సౌకర్యాల పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. మోడల్ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు ఐదో తరగతి వరకు ఆటపాటలతో కూడిన గుణాత్మక ఆంగ్ల విద్యాబోధన ఉంటుంది. ఇందుకోసం ప్రతీ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించనున్నారు. – చందన, డీడీటీడబ్ల్యూ ఐటీడీఏ -
తోటి విద్యార్థులే కొట్టి చంపారా?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి దారుణంగా హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన తీరు అత్యంత పాశవికంగా ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. తోటి విద్యార్థులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటన మంగళవారం ఖమ్మంలోని గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖానాపురానికి చెందిన దేవత్ జోసఫ్(10) ఖమ్మం నెహ్రూనగర్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్నాడు. సాయంత్రం 3.15 గంటల వరకు పాఠశాలలోనే ఉన్నాడు. అయితే పక్కనే ఉన్న వసతి గృహానికి వెళ్లిన సదరు విద్యార్థి కొద్ది నిమిషాల్లోనే మృత్యువాత పడటం.. ఆ సమయంలో వసతి గృహంలో విద్యార్థులు పెద్దగా ఎవరూ లేకపోవడంతో ఈ హత్య ఏ రకంగా జరిగింది.. ఎవరు చేశారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జోసఫ్కు తగిలిన బలమైన గాయాలు, మృతదేహం పడి ఉన్న తీరును పరిశీలించిన పోలీసులు.. జోసఫ్తో ఎవరైనా ఘర్షణ పడి.. ఆ తర్వాత హత్య చేసి ఉంటారన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. పదేళ్ల బాలుడిని అత్యంత పాశవికంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని, దీని వెనకాల ఉన్న ఉన్మాదం ఏమిటన్న అంశం చర్చనీయాంశంగా మారింది. నేలకేసి కొట్టి చంపారా? జోసఫ్ శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో అతడిని నేలకేసి బాది ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు హాస్టల్ వార్డెన్ ప్రతాప్సింగ్, సిబ్బందిని విచారించారు. సంఘటన జరిగిన కొద్ది సేపటికే అదే వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఒకరు కంగారు పడుతూ వసతి గృహం ఆవరణ నుంచి బయటకు వెళ్లాడని, ఎక్కడికి వెళ్తున్నావని తాను అడిగితే స్కూల్కు వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయాడని వార్డెన్ పోలీసులకు వివరించారు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జోసఫ్ మృతదేహంపై బలమైన గాయాలు ఉండటంతో అతనితో ఘర్షణకు దిగిన వారే అనంతరం హత్య చేసి ఉంటారని టూ టౌన్ సీఐ నరేందర్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని చెప్పారు. సీసీ పుటేజీలకు పరిశీలించిన ఏసీపీ వెంకట్రావు, టౌటౌన్ సీఐ నరేందర్.. మృతుడు జోసఫ్తో మరో విద్యార్థి కలిసి తిరిగినట్లుగా ఉన్న పుటేజీని గుర్తించారు. జోసఫ్ తల్లి మూగ మహిళ కాగా.. తండ్రి రెక్కాడితే డొక్కాడని దినసరి కూలీ కావడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. కాగా, బాలుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కొడుకు చనిపోవడానికి వసతి గృహం అధికారుల బాధ్యతా రాహిత్యమే కారణమంటూ ఆందోళనకు దిగారు. -
గిరిజనులకు రుణాలు
ఏటూరునాగారం(వరంగల్): చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందే గిరిజనులకు సబ్సిడీ రుణాలు అందకుండా తాత్సారం చేస్తూ బ్యాంకు అధికారులు ట్రైకార్ లక్ష్యాన్ని నీరు గారుస్తూ వస్తున్నారు. దీనిని గుర్తించిన గిరిజన సంక్షేమశాఖ ట్రైకార్ నుంచి నేరుగా రూ.50 వేల రుణాన్ని వంద శాతం సబ్సిడీ ద్వారా ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్క రూపాయి కూడా గిరిజనులు వాటా ధనం, రుణం కిస్తీలు చెల్లించడం ఉండదు. ఈ మేరకు సెప్టెంబర్ 16న ఐటీడీఏకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. 2018–19 ట్రైకార్ వార్షిక యాక్షన్ ప్లాన్ను ఐటీడీఏ అధికారులు సిద్ధం చేసి కమిషనర్కు అందించనున్నారు. గతంలో యాక్షన్ ప్లాన్ రూ.1 లక్ష, రూ.50 వేల సబ్సిడీతో కూడిన రుణాల వివరాలు, పలు రకాల యూనిట్లతో తయారు చేసిన నివేదికను అందజేశారు. నూతనంగా రూ.50 వేలు.. వంద శాతం సబ్సిడీ బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా వారి ఖాతాల్లో జమ వేసేందుకు ప్రభుత్వం నుంచి గిరిజన సంక్షేమశాఖ ఉత్తర్వులు వచ్చాయి. దీంతో మళ్లీ యాక్షన్ ప్లాన్లో మార్పులు చేర్పులు చేసి పంపించారు. నిరుపేదల్లో వెలుగులు రూ.50 వేలు.. వంద శాతం సబ్సిడీ రుణం నిరుపేదల్లో వెలుగు నింపనుంది. గిరిజనుడి బ్యాంకు ఖాతాలో రూ.50 వేలు జమ అయిన వెంటనే వాటిని డ్రా చేసుకుని దుకాణాలను ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే అవకాశం ఉంది. గతంలో బ్యాంకు వాటా ధనం 20 శాతం, లబ్ధిదారుడి వాటా ధనం 10 శాతం జమ చేసుకుని బ్యాంకు చుట్టూ తిరిగే వారు. కాళ్ల చెప్పులు అరిగిపోయినా కూడా రుణం వచ్చేది కాదు. లక్ష నుంచి ఐదు లక్షల వరకు యూనిట్ల వారీగా సబ్సిడీలను అందజేసింది. రూ.50 వేల వరకు వందశాతం సబ్సిడీని అమలు చేస్తూ మిగతా వాటి రుణాలను యథావిధిగా అమలు చేయనున్నారు. నేరుగా లబ్ధిదారుడు ఎంపీడీఓ కార్యాలయంలో రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి నేరుగా ఐటీడీఏ లాగిన్లోకి వచ్చి కలెక్టర్ అప్రూవల్తో కమిషనర్ నుంచి ట్రైకార్ ద్వారా నగదు లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. వంద శాతం సబ్సిడీతో చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకునే గిరిజనులకు ఎంతగానో ఆసరాగా నిల్వనుంది. మొత్తం 1325 యూనిట్లకు రూ. 22,64,00,759 మంజూరయ్యాయి. లబ్ధిదారులు ఇందులో ఉన్న సెక్టార్ల వారీగా రూ.50 వేలకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుడి ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని, గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అనంతరం వారికి రుణాలు మంజూరవుతాయి. అసెంబ్లీ రద్దుతో ఆలస్యం అసెంబ్లీ రద్దు కావడం వల్ల ఎస్టీ కార్పొరేషన్ రుణాలను పొందే లబ్ధిదారులు అక్టోబర్లో లేదా ఎన్నికల పర్వం పూర్తి అయిన తర్వాతనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. 2018లో దరఖాస్తు చేసుకున్న కొంతమంది ఖాతాల్లో మాత్రమే రుణాలు జమ అయ్యాయి. వాటిని పూర్తిగా లబ్ధిదారులకు అందజేసిన తర్వాతనే 2018–19 రుణాల దరఖాస్తులు స్వీకరించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా గతంలో ఇచ్చిన రుణాలకు యుటిలైజ్ సర్టిఫికెట్ (యూసీ)లు కూడా ఇవ్వాలని గిరిజన సంక్షేమశాఖ ఐటీడీఏ అధికారులను ఆదేశించింది. వీటి ఆధారంగా ఎంత మంది రుణాలు సద్వినియోగం చేసుకున్నారని కమిషనర్ నిర్ధారించనున్నారు. 100 శాతం సబ్సిడీతో లాభం 100 శాతం సబ్సిడీపై రూ.50 వేల రుణాలు ఇవ్వడం వల్ల గిరిజన కుటుంబాలు బాగుపడుతాయి. ఇంటి ఆవరణలోనే షాపులను ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే ఆస్కారం ఉంటుంది. రుణాలను ఈ విధంగా ఇస్తే గిరిజనుల జీవితాలు బాగుపడుతాయి. బ్యాంకులతో లింక్ పెడితే ఒక్క రూపాయి కూడా లబ్ధిదారుడికి చేరకుండానే దళారులు మింగుతున్నారు. వంద శాతం సబ్సిడీ గిరిజనులకు ఉపయోగపడనుంది. ఆలం ప్రభాకర్, రాజన్నపేట, కన్నాయిగూడెం మండలం సద్వినియోగం చేసుకోవాలి.. కొత్తగా ప్రవేశపెట్టిన 100 శాతం రూ.50 వేల రుణం గిరిజనులకు లబ్ధి చేకూరనుంది. దాంతో కుటుంబాలు బాగుపడుతాయి. బ్యాంకు వాటాతో సంబంధం లేకుండా పూర్తి స్థాయి సబ్సిడీతో ఈ రుణం ఇవ్వనున్నాం. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఈ రుణాలు అందిస్తాం. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. చక్రధర్రావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఏటూరునాగారం -
‘ఏకరూపం’ అందేదెప్పుడు?
ఆదిలాబాద్రూరల్: సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. కానీ ప్రభుత్వ ప్రకటనలు కాగితాలకు మాత్రమే పరిమితమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. పాఠశాల ప్రారంభంలోనే విద్యార్థులకు నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందిస్తామన్న ప్రభుత్వ హామీ.. హామీగానే మిగిలిపోయింది. పాఠశాల ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందించిన దాఖాలాలు కనిపించడం లేదు. వేలాది మంది విద్యార్థులు పాత దుస్తులతోనే నెట్టుకొస్తున్నారు. ఫలితంగా జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చదువుకుంటున్న 17,893 మంది విద్యార్థులు కొత్త దుస్తుల కోసం ఎదురు చూస్తున్నారు. ఆలస్యంగా పంపిణీ.. బీసీ సంక్షేమ వసతి గృహంలో చదువుకునే విద్యార్థుల దుస్తులు ఇటీవలనే కుట్టు పూర్తయింది. గత రెండు రోజుల కిందట కొంత మంది హెచ్డబ్ల్యూవోలు దుస్తువులు తీసుకెళ్లగా మరికొంత మంది తీసుకెళ్లాల్సి ఉందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థుల అందించే దుస్తులు ప్రస్తుతం దర్జీల వద్ద కుట్టు దశలో ఉన్నాయి. దర్జీలకు కుట్టుకు సంబంధించిన చార్జీ కుదరకపోవడంతో ఆలస్యం జరిగిందని తెలుస్తోంది. హాస్టళ్ల వారీగా విద్యార్థులు.. జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఐటీడీఏ ఆధ్వర్యంలో 54 వసతి గృహాలు ఉండగా ఇందులో బాలికల వసతి గృహాలు 16 ఉండగా ఇందులో 8,272 మంది బాలికలు ఉన్నారు. 38 బాలుర వసతి గృహాల్లో 9,621 మంది బాలురు ఉన్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాలు 9 ఉండగా ఒకటి బాలికల వసతి గృహం ఉంది. ఇందులో 42 మంది ఉన్నారు. బాలుర వసతి గృహాలు 8 ఉండగా ఇందులో 540 మంది విద్యార్థులు ఉన్నారు. దళిత సంక్షేమ శాఖ పరిధిలో 20 వసతి గృహాలు ఉండగా ఇందులో 3 బాలికల వసతి గృహాలు ఉండగా 510 మంది బాలికలు ఉన్నారు. 17 బాలుర వసతి గృహాలు ఉండగా 970 మంది విద్యార్థులు ఉన్నారు. మరో నెల రోజులు పట్టే అవకాశం.. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఐటీడీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వసతి గృహాల విద్యార్థులకు దుస్తుల పంపిణీకి మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రతి విద్యార్థికి రెండు జతల దుస్తులను గిరిజన సంక్షేమ శాఖ కమిషనరేట్ నుంచి రెడీమేడ్ అందించనుందని, మిగితా రెండు జతల దుస్తువులను జిల్లాలోని 30 మంది దర్జీలకు కుట్టు కోసం అందించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. జత కుట్టు కూలీకి రూ. 45 చొప్పున అందించనున్నారు. కొంత మంది హెచ్డబ్ల్యూవోలు తీసుకెళ్లారు.. ఎస్సీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ దుస్తులను అందజేశాం. బీసీ విద్యార్థులకు సంబంధించిన దుస్తులు కుట్టు పూర్తి అయి ఇటీవలనే తమ శాఖకు చేరుకున్నాయి. సగం మంది బీసీ వసతి గృహాల హెచ్డబ్ల్యూవోలు వాటిని తీసుకెళ్లారు. మరికొంత మంది తీసుకెళ్లాల్సి ఉంది. వాటిని సైతం విద్యార్థులకు అందేలా చూస్తాం. – ఆశన్న, బీసీ, ఎస్సీ, అభివృద్ధి శాఖల అధికారి, ఆదిలాబాద్ కుట్టు కోసం అందించాం రెండు జతల దుస్తులను కమిషనరేట్ నుంచి రేడిమేడ్ అందించనున్నారు. మిగితా రెండు జతలకు సంబంధించిన క్లాత్ 15 రోజుల కిందటనే సరఫరా అయింది. దుస్తువులు కుట్టుడు అయిన వెంటనే ఆయా వసతి గృహాలకు పంపిణీ చేస్తాం. మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది. – చందన, డీడీ గిరిజన సంక్షేమ శాఖ, ఉట్నూర్, ఆదిలాబాద్ -
ఆదివాసీల చిత్రకళకు ఊపిరి
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ తెగల సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటేందుకు గిరిజన సంక్షేమ శాఖ చిత్రకళను పునరుద్ధరిస్తోంది. ఇందులో భాగంగా ఆదివాసీ తెగల్లోని ఔత్సాహిక చిత్రకారులను ప్రోత్సహిస్తోంది. గత ఆర్నెళ్లుగా ఆదివాసీ తెగలకు చెందిన గోండు, కొలామీ, బంజార, కోయ వర్గాలకు చెందిన యువతను ఎంపిక చేసి పలు రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. తాజాగా ఈ చిత్రకారులు వేసిన చిత్రాలతో గురువారం మాసబ్ట్యాంక్లోని సెంటినరీ మ్యూజియం ఆవరణలో ప్రదర్శన ఏర్పాటు చేసింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఇందు లో దాదాపు 50కి పైగా చిత్రాలను ఔత్సాహిక చిత్రకారులు ప్రదర్శించారు. ప్రతి ఆదివాసీ తెగకున్న ప్రత్యేకతను వెలుగులోకి తెచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ చిత్రకళ పునరుద్ధరణకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ని గిరిజనులు, ఆదివాసీల సంస్కృతికి సంబంధించి చిత్రకళ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆదివాసీ, గిరిజనుల సంస్కృతిని చిత్రాల రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి కార్యాలయంలో పెయింటింగ్స్ ఆదివాసీ చిత్రకారుల చిత్రాలను ప్రతి ప్రభు త్వ కార్యాలయంలో ఉండేలా గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. దీంతో చిత్రకారులకు మంచి ఉపాధి లభించనుంది. ఇకపై రాష్ట్ర, జిల్లా కార్యాలయాల్లో ఆదివాసీ చిత్రాలు కనిపించనున్నాయి. ప్రైవేటువ్యక్తులు సైతం వీటిని కొనేందుకు వీలుగా ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ల కోసం ఏర్పాట్లు చేస్తోంది. డిమాండ్కు తగినట్లు ఔత్సాహిక చిత్రకారులకు సామగ్రిని యంత్రాంగం సరఫరా చేస్తోంది. -
‘పొరపాటున నోరుజారా.. నా ఉద్దేశం అది కాదు’
హైదరాబాద్ : గిరిజన పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని చెబుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జువల్ ఓరంను చిక్కుల్లో పడేశాయి. శుక్రవారం ఇక్కడి మారియట్ హోటల్లో జరిగిన నేషనల్ ట్రైబల్ ఎంటర్ప్రెన్యూర్ కాన్క్లేవ్–2018లో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలని, అలా కావాలంటే విజయ్ మాల్యాలా తెలివిగా ఆలోచించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలు చాలా చాకచక్యంగా వ్యవహరించి బ్యాంకుల నుంచి సులువగా రుణాలు పొందాలని పిలుపునిచ్చారు. షెడ్యూల్డు కులాలకు చెందిన వారు విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, ఇలా పలు రంగాల్లో రిజర్వేషన్లు పొందుతున్నారని, అయితే ఇతర సామాజిక వర్గాలవారితో సమానంగా చూడటం లేదని జువల్ ఓరం వ్యాఖ్యానించారు. ‘అంతా విజయ్మాల్యాను విమర్శిస్తున్నారు. కానీ మాల్యా ఏం చేశారో గుర్తుచేసుకోంది. అతడు చాలా తెలివైనవాడు. ఎంతోమంది తెలివైనవాళ్లకు ఉపాధి కల్పించాడు. ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు, బ్యాంకులకు మాల్యా చాలా చేశాడంటూ’ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాం రేపాయి. బ్యాంకులను ప్రభావితం చేయండి, ప్రభుత్వాలను, వ్యవస్థలను కాదని షెడ్యూల్డు కులాలవారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం రూ.కోటి వరకు రాయితీతో గిరిజన పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందని, దాన్ని రూ.5 కోట్లకు పెంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అయితే మాల్యాను పొగడటం ఏంటని కేంద్ర మంత్రిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరణ ఇచ్చుకున్న మంత్రి ప్రసంగం మధ్యలో పొరపాటున విజయ్మాల్యా పేరును ప్రస్తావించాను. మరొకరి పేరును ప్రస్తావించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దీనిపై జాతీయ మీడియ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘అనుకోకుండా మాల్యా విషయం తీసుకొచ్చా. అయితే ఉద్దేశపూర్వకంగా చేయలేదు. తెలివైన వ్యక్తి అని మరొకరి పేరు చెప్పి ఉంటే బాగుండేది. వా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని’ కేంద్ర మంత్రి జువల్ ఓరం అన్నారు. -
పటిష్టంగా గిరిజన పథకాల అమలు
సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు మేలు చేసేలా ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని ఆ శాఖాధికారులను ప్రభు త్వ ప్రధానకార్యదర్శి ఎస్.కె.జోషి ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యకలాపాలను సీఎస్ సమీక్షించారు. గిరిజన విద్యాసంస్ధల ద్వారా 2 లక్షలకుపైగా విద్యార్థులు చదువుకుంటున్నారని, వీరికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ట్రైబల్ మ్యూజి యంకు ప్రాచుర్యం కల్పించి, ఎక్కువమంది సంద ర్శించేలా చూడాలని కోరారు. రూ. 205 కోట్లతో 16,479 మందికి ఆర్థిక సహాయం అందించడానికి ప్రణాళిక రూపొందించామని, ఈ ఏడాది ఐదువేల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యం గా పెట్టుకున్నామన్నారు. 2,28,175 గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశామని, కల్యాణలక్ష్మి ద్వారా రూ.150 కోట్లతో 3,400 మందికి సహాయం అందించాలని నిర్ణయించామన్నారు. కాగా, ట్రై ఫెడ్ ఎండీ ప్రవీణ్కృష్ణ సీఎస్తో భేటీ అయ్యారు. గిరిజన అటవీ ఉత్పత్తులకు ఎంఎస్పీ, వన్ధన్ వికాస కేంద్రాల ఏర్పాటు, అటవీ ఉత్పత్తులు, మార్కెటింగ్ సౌకర్యాల కోసం చర్యలు తీసుకుంటున్నామని సీఎస్ వివరించారు. -
గిరిజన పారిశ్రామికవేత్తలకు రూ.5 కోట్ల రాయితీ
సాక్షి, హైదరాబాద్: ఔత్సాహిక గిరిజన పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జోవల్ ఓరం పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.కోటి వరకు రాయితీతో గిరిజన పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందని, దాన్ని రూ.5 కోట్లకు పెంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. శుక్రవారం మారియట్ హోటల్లో జరిగిన నేషనల్ ట్రైబల్ ఎంటర్ప్రెన్యూర్ కాన్క్లేవ్–2018ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల పట్ల వివక్ష ఇప్పటికీ కొనసాగుతోందని, కేంద్ర మంత్రి హోదాలోనూ వివక్షకు గురైన తీరును సభకు వివరించారు. ‘1999లో ఎంపీగా ఎన్నికై వాజ్పేయి ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, చాంబర్లోకి వెళ్దామని బయల్దేరా. కానీ నాకు ప్రత్యేక చాంబర్ లేదు. దాంతో అందుకోసం పోరాడి సాధించా’అని వివరించారు. గిరిజనులు రిజర్వేషన్లతో లాభపడుతున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వివక్షకు కూడా గురవుతున్నారని అన్నారు. రిజర్వేషన్ల వల్ల విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయని, దీంతో వారి అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. అదేక్రమంలో గిరిజనులు తమ పేర్లను వారి సంప్రదాయాల ప్రకారం పెట్టుకోవడంతో సమాజంలో కొంత చిన్నచూపునకు గురవుతున్నారన్నారు. గిరిజన యువతలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగా ప్రత్యేక రాయితీలిస్తూ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. డిక్కీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. నైపుణ్యమున్న గిరిజనులకు పెట్టుబడి రాయితీ: ఈటల రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గిరిజనుల్లో నైపుణ్యం ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహకారం అందిస్తోందన్నారు. మహిళలకు 45%, పురుషులకు 35% పెట్టుబడి రాయితీ ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణ పనుల్లోనూ గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తున్నామని వివరించారు. ఓన్ యువర్ కార్ పథకం కింద ఒక్క వాహనంపై రూ.5 లక్షలు రాయితీ ఇచ్చామని, గిరిజన రైతులకు 95% రాయితీతో ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నామని, వ్యవసాయ పనిముట్లన్నీ 95% రాయి తీతో అందిస్తున్నామని చెప్పారు. కార్పొరేట్ల దగ్గర ప్రాజెక్టు రిపోర్టు ఉందని, కానీ గిరిజనుల దగ్గర కమిట్మెంట్ ఉందని అన్నారు. 45 మంది కార్పొరేట్లకు రూ.7.3 లక్షల కోట్ల రుణం ఇచ్చిన బ్యాంకులు నైపుణ్యం ఉన్నవారికి మాత్రం రుణం ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయన్నారు. అనంతరం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని, వాటిని నూరుశాతం అమలు చేయాలంటే అధికారుల చిత్తశుద్ధి తోడవ్వాలన్నారు. ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే గిరిజనుల అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు, ఎంపీ సీతారామ్ నాయక్, ఎమ్మెల్యే రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిబాల వికాస్ పథకం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: గిరిజన విద్యార్థినీ, విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకై ఉద్దేశించిన ‘గిరిబాల వికాస్’ పథకాన్ని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఏటూరు నాగారం పరిధిలోని గిరిజన పాఠశాలల్లో శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల సమస్యల్ని తొలిదశలోనే గుర్తించి నివారించవచ్చన్నారు. పీరియాడికల్ చెకింగ్తో అనారోగ్య సమస్యల్ని వెంటనే పరిష్కరించవచ్చని చెప్పారు. ఇదే పథకాన్ని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్దత్ ఎక్కా నాగర్కర్నూల్ జిల్లా మన్ననూరులోని గిరిజన బాలికల పాఠశాలలో ప్రారంభించారు. గిరిజన శాఖ కమిషనర్ క్రిస్టినాజెడ్ చొంగ్తూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని గిరిజన బాలికల ఉన్నత ఆశ్రమ పాఠశాలలో ఈ పథకాన్ని ప్రారంభించి, ప్రయోజనాలను వివరించారు. -
నేడు ఓయూసెట్ ఫలితాలు
హైదరాబాద్: ఓయూసెట్–2018 ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. క్యాంపస్లోని గెస్ట్హౌస్లో మధ్యాహ్నం 12గంటలకు వీసీ ప్రొఫెసర్ రాంచంద్రం ఫలితాలను విడుదల చేయనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. ఉస్మానియా వెబ్సైట్తో పాటు, ఇతర సైట్లలో కూడా ఫలితాలను చూడవచ్చన్నారు. గతనెల 4 నుంచి 13 వరకు జరిగిన ఓయూసెట్కు 71 వేల మంది అభ్యర్థులు హాజరైన విషయం విదితమే. సివిల్ సర్వీసెస్కు ఉచిత శిక్షణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ పరీక్షల (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ) కోసం ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో నిర్వహించే ఈ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 9 నెలల శిక్షణలో భాగంగా హాస్టల్ వసతి కల్పిస్తామని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ వి.సర్వేశ్వర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. http://studycircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 5 నుంచి వచ్చే నెల 4 వరకు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 040–27540104 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
గురుకుల డిగ్రీ కాలేజీల్లో 863 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీ ఆధ్వర్యంలోని డిగ్రీ కాలేజీల్లో 863 ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్ఈఐ–ఆర్బీ) ఈ పోస్టులను భర్తీ చేస్తుంది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శివశంకర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని టీఆర్ఈఐ–ఆర్బీ కార్యనిర్వాహక అధికారిని ఆదేశించారు. జోన్, జిల్లా అంశాలతోపాటు రోస్టర్ పాయింట్లు, అర్హతలను నిర్ణయించి పోస్టులను భర్తీ చేయాలని సూచించారు.. పోస్టుల వివరాలు: ప్రిన్సిపాల్ 15, లెక్చరర్ 616, లైబ్రేరియన్ 15, ఫిజికల్ డైరెక్టర్ 15, మెస్ మేనేజర్/వార్డెన్ 15, స్టాఫ్నర్సు 31, కేర్ టేకర్ 15, ల్యాబ్ అసిస్టెంట్ 62, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ 31, అసిస్టెంట్ లైబ్రేరియన్ 22, జూనియర్ అసిస్టెంట్ 11, స్టోర్ కీపర్ 15. -
‘గిరిజనేతరుల హక్కులను కాలరాస్తున్నాయి’
సాక్షి, హైదరాబాద్: గిరిజన ప్రాంతాల్లోని భూముల బదలాయింపు నియంత్రణ చట్టం(1ఆఫ్70 యాక్ట్) లోని కొన్ని నిబంధనలు గిరిజనేతరుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని, వాటిని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఖమ్మం జిల్లా, చెంచుపల్లి గ్రామానికి చెందిన సూరెడ్డి రమణారెడ్డి వ్యాజ్యా న్ని దాఖలు చేశారు. దీనిపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, గవర్నర్ కార్యదర్శిలకు నోటీసులు జారీ చేసింది. -
‘ఆశ్రమ’ టీచర్ల బదిలీ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల బదిలీలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఉపాధ్యాయులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఈ టీచర్లకూ వర్తింపజేశారు. బదిలీలకు సంబంధించి ఏర్పాట్లను పక్కాగా నిర్వహించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆశ్రమ పాఠశాలల్లోని టీచర్ల బదిలీలు సైతం ఆన్లైన్ పద్ధతిలో వెబ్కౌన్సెలింగ్ ద్వారా చేపట్టనుంది. బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సిలింగ్లో వస్తున్న సందేహాలను నివృ త్తి చేయాలని టీఎస్పీఆర్టీయూ పే ర్కొంది. ట్రాన్స్ఫర్ షెడ్యూల్లో అప్లికేషన్కు జూన్ 12 వరకు అవకాశం ఇవ్వాలని కోరింది. ఆన్లైన్లో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని సరి చేసి బదిలీ దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరింది. -
వంద గ్రామాల్లో అంధకారం!
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం దెమ్మెపల్లె గ్రామానికి చెందిన రంజిత్ వ్యవసాయ కూలీ. వచ్చే ఆదాయంలో ఖర్చులు పోగా కొంచెం డబ్బు కూడబెట్టి ఓ టీవీ, ఫ్రిడ్జ్, కూలర్ కొనుగోలు చేశాడు. కానీ ఇంటికి తీసుకొచ్చిన నాటి నుంచి వాటిని అట్టా డబ్బాల్లోంచి బయటకు తీయలేదు. ఎందుకంటే అతడి ఇంటికి విద్యుత్ సరఫరా లేదు. ఆ మాటకొస్తే ఆ ఊరికే విద్యుత్ సరఫరా లేదు. - ఒక్క దెమ్మెపల్లె మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా వందకుపైగా గిరిజన పల్లెల్లో ఇదే పరిస్థితి. రాత్రయితే ప్రతి ఇంట్లోనూ అమావాస్య చీకట్లే. అక్కడక్కడా సోలార్ లైట్లు ఉన్నా.. అవి శాశ్వత పరిష్కారం చూపడం లేదు. సెల్ఫోన్ చార్జింగ్ నుంచి మొదలుకొని ఏ చిన్న పనికైనా విద్యుత్ తప్పనిసరి. కాని ఎన్నోఏళ్లుగా గిరిజన గ్రామాలు కారు చీకట్లలోనే మగ్గిపోతున్నాయి. విద్యుత్ లైన్లు వేయాలంటూ అధికారులకు మొరపెట్టుకున్నా.. కనిపించిన ప్రతి ప్రజాప్రతినిధిని నిలదీస్తున్నా.. ఫలితం మాత్రం శూన్యం. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వందకుపైగా గ్రామాలు ఇప్పటికీ అంధకారంలోనే ఉంటున్నాయి. విద్యుత్ సరఫరా లేక అభివృద్ధి ఆమడదూరంలోనే ఉండిపోయాయి. ప్రత్యేక అభివృద్ధి నిధిలో భాగంగా గిరిజన తండాలకు విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్దేశించినా.. అధికారుల ఉదాసీనతతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. మరోవైపు విద్యుత్ లేని గ్రామాల్లో ఎక్కువ భాగం అటవీ భూములు ఉండటంతో అక్కడ కరెంటు లైన్ల ఏర్పాటుకు అటవీ శాఖ మోకాలడ్డుతోంది. రిజర్వుడ్ అటవీ ప్రాంతం నుంచి లైన్లు వేస్తే అటవీ సంపదకు విఘాతం కలుగుతుందని పేర్కొంటోంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో గిరిజన తాండాలకు విద్యుత్ వెలుగులు అందడం లేదు. సెల్ఫోన్ల మౌనవ్రతం కరెంటు లేని గ్రామాల్లో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. తాగునీటికి చేతిపంపులే దిక్కు. కొన్నిచోట్ల గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు సోలార్ లైట్లు ఇవ్వడంతో కొంత ఊరట లభించింది. కానీ వీటిని పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. కొందరి వద్ద సెల్ఫోన్లు ఉన్నా.. వాటి చార్జింగ్ కోసం మండల కేంద్రం, లేదంటే సమీపంలో కరెంటు ఉన్న గ్రామానికి వెళ్లాల్సి వస్తోంది. బ్యాటరీ నిండుకుంటే మళ్లీ పక్క గ్రామాలకు పరిగెత్తాల్సిందే. అప్పటివరకు సెల్ఫోన్లు మూగబోయి ఉండాల్సిందే. అధికారుల లెక్కల్లో 34 గ్రామాలే.. గిరిజన సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రా ష్ట్రంలో కరెంటు లేని గ్రామాలు 34 మాత్రమే ఉన్నాయి. సగటున యాభై కుటుంబాలున్న ప్రాంతాన్ని గ్రామంగా పరిగణిస్తూ గణాంకాలు రూపొందించినట్లు తెలుస్తోంది. గణాం కాలను సమర్పించిన గిరిజన సలహా మండలి.. అక్కడ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ఆమోదించినప్పటికీ.. పనులు మొదలుకాలేదు. నూనె దీపాలతోనే.. ఊర్లో దాదాపు వంద మంది ఉంటాం. అన్ని గుడిసెల్లోనూ రాత్రిపూట నూనె దీపాలే. కరెంటు సరఫరా కోసం అధికారులను, నాయకులను అడిగి అలిసిపోయాం. కరెంటు లైన్లు వేస్తామంటూ శంకుస్థాపన చేసినా పనులు సాగలేదు. వ్యవసాయ పనుల కోసం పడే కష్టాలు అంతాఇంతా కావు. చేసేది లేక పొరుగు గ్రామాలకు వలసలు పోతున్నాం. – బిజ్జయ్య, రైతు, రాంపూర్ పెంట, అమ్రాబాద్ పనులు ఉన్నప్పుడే ఊర్లో.. ఊర్లో కరెంటు లేకపోవడంతో అందరూ అమ్రాబాద్కు తరలిపోతున్నారు. నేను కూడా వ్యవసాయ పనులు ఉన్నప్పుడే ఊర్లో ఉంటున్నా. గ్రామంలో పని లేకుంటే మండల కేంద్రానికి వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నా. మేజర్ గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుడి హోదాలో కరెంటు సౌకర్యం కల్పించాలని అధికారులను వందలసార్లు కోరా. కానీ ఫలితం మాత్రం లేదు. –అంజయ్య, వార్డు సభ్యుడు, కొమ్మెన పెంట, అమ్రాబాద్ పంచాయతీ -
మినీ గురుకుల సిబ్బందికి వేతన కష్టాలు
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని మినీ గురుకులాల్లో సిబ్బందికి వేతన కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం అత్తెసరు జీతాలే ఇస్తోంది. ఒక్కో ఉద్యోగికి నెలవారీ వేతనం రూ.5వేలకు మించడం లేదు. మెజార్టీ ఉద్యోగులకు నెలకు కేవలం రూ.2,500 చొప్పున ఇవ్వడం గమనార్హం. వీటిని పెంచాలని ఉద్యోగులు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. సాధారణంగా గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి నుంచి అడ్మిషన్లు తీసుకుంటారు. కానీ గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని మినీ గురుకులాలు ఏర్పాటు చేసింది. ఇందులో ప్రాథమిక స్థాయి నుంచే అడ్మిషన్లు తీసుకుని వసతితో కూడిన బోధన అందిస్తుంది. ఇలా గిరిజన సంక్షేమ శాఖ 29 మినీ గురుకులాలను తెరిచింది. వీటిలో వార్డెన్, సీఆర్టీ, పీఈటీ, ఏఎన్ఎం, అకౌంటెంట్, కుక్, ఆయా, హెల్పర్, స్వీపర్, వాచ్మెన్ కేటగిరీల్లో 418 మందిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించింది. ఏళ్లుగా అరకొర జీతాలే మినీ గురుకులాల్లో సిబ్బందికి ఏళ్లుగా అరకొర వేతనాలే ఇస్తున్నారు. వార్డెన్కు రూ.5 వేలు, సీఆర్టీ, పీఈటీ, ఏఎన్ఎంలకు రూ.4 వేలు, అకౌంటెంట్కు రూ.3,500, కుక్, ఆయా, స్వీపర్, వాచ్మెన్లకు రూ.2,500 చొప్పున వేతనాలిస్తున్నారు. ఆరేళ్ల క్రితం ప్రారంభించిన ఈ గురుకులాల్లో సిబ్బందికి ఇప్పటికీ వేతనాలు పెంచలేదు. వేతన పెంపును కోరుతూ పలుమార్లు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేదు. గిరిజన సంక్షేమ శాఖ వేతన పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించి ఏడాది కావస్తున్నా ఫైలుకు మోక్షం కలగలేదు. మరో పక్షం రోజుల్లో 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఆలోపు వేతనాలు పెంచాలని మినీ గురుకులాల సిబ్బంది అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. గడువులోగా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించకుంటే విధులు బహిష్కరించి ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. -
ఆరోపణలున్నా అందలం!
సాక్షి, ఆసిఫాబాద్: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. ఈ మేరకు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. గత డిసెంబరు 24న కుమురం భీం జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం దస్తగిరి హైమద్ఖాన్ను లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై విధుల్లోంచి తప్పించారు. ఈ కేసు విషయమై డీఎస్పీ అధికారి స్థాయిలో విచారణ జరుగుతోంది. ఐటీడీఏ డీడీ స్థాయి అధికారి విచారణ జరిపి నివేదికను పీవోకు సమర్పించినా ఇంత వరకు దానిని బహిర్గత పర్చలేదు. హైమద్ఖాన్ను బెల్లంపల్లి ఆశ్రమ పాఠశాలకు డిప్యూటేషన్పై పంపించడం.. కొద్దిరోజులకు మళ్లీ ఆయనకే హెచ్ఎంగా బాధ్యతలు అప్పగిం చడం చర్చనీయాంశంగా మారింది. గుట్టుగా ఉత్తర్వులు! ఇటువంటి ఆరోపణలు ఉన్న వారికి అదే పాఠశాలలో తిరిగి బాధ్యతలు అప్పగించరు. ఇవేమీ లెక్క చేయకుండా మళ్లీ వాంకిడిలో జాయిన్ అయ్యేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. ఘటనపై విచారణకు ఆదేశించిన ఐటీడీవో పీవో, జిల్లా కలెక్టర్కు తెలియకుండా ఈ ఉత్తర్వులివ్వడం గమనార్హం. ఘటన జరిగినప్పు డు పరీక్షలకు సన్నాహాలు చేసే సమయం కాబ ట్టి సిలబస్ పూర్తి చేయడం, విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు స్పెషల్ ఆఫీసర్గా ఏసీఎంవోను నియమించారు. స్పెషల్ ఆఫీసర్ నుంచి బాధ్యతలు తప్పించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి హెచ్ఎంగా విధుల్లోకి చేరేందుకు ఉత్తర్వులివ్వడం వెనుక ఏదో గూడు పుఠాని ఉందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఆ పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడిని సంప్రదించగా.. దస్తగిరి హైమద్ఖాన్కే హెచ్ఎం బాధ్యతలు అప్పగించారని, వేసవి సెలవులు కాగానే విధుల్లోకి చేరుతారని, దీనికి సంబంధించి ఉత్తర్వులు వచ్చినట్లు చెప్పారు. ఉత్తర్వులు ఇచ్చాం సాధారణంగా డిప్యూటేషన్ అకడమిక్ పూర్తికాగానే అయిపోతుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేం తిరిగి వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జాయిన్ కావాలని ఉత్తర్వులు ఇచ్చాం. –కృష్ణానాయక్, డీటీడీవో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు ప్రస్తుతం బెల్లంపల్లి ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న దస్తగిరి హైమద్ఖాన్ను తిరిగి వాంకిడి ఆశ్రమ పాఠశాలలో పని చేసేందుకు మా నుంచి ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. –ఆర్వీ.కర్ణన్, పీవో, ఐటీడీఏ -
గిరిజన వర్సిటీ మరింత ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు మరింత ఆలస్యమవుతోంది. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు కొత్తగా గిరిజన యూనివర్సిటీని కేంద్రం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన వర్సిటీ ఏర్పాటు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మండలం జాకారం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 837, 53/1లో 285 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ దాన్ని వర్సిటీకి కేటాయించింది. ఇందులో 120 ఎక రాల్లో అధికారులు హద్దురాళ్లు సైతం ఏర్పాటు చేశారు. జాకారం సమీపంలో ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ) భవనాన్ని వర్సిటీ కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చని గిరిజన సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరు నెలల క్రితం భవనాన్ని కేంద్ర బృందం పరిశీలించి వసతులపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తర్వాత వర్సిటీ ఏర్పాటు ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. వాస్తవానికి 2018–19 విద్యా సంవత్సరంలో తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర మానవ వనరుల శాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే కార్యకలాపాలు సాగించే అవకాశం ఉంటుంది. కానీ, కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖలో ఉలుకూపలుకూలేదు. ఒకవేళ అనుమతులు చకచకా వచ్చినా డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఈపాటికే రావాల్సి ఉంది. ప్రకటనలు వచ్చిన తర్వాతే ప్రవేశ పరీక్షలు, కౌన్సెలింగ్ తదితర కార్యక్రమాలు పూర్తి చేయొచ్చు. ఇందుకు కనిష్టంగా నెలన్నర సమయం పడుతుంది. కానీ, కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో ఈ ఏడాది వర్సిటీ ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఈ వర్సిటీని 2019–20 విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తామని రెండ్రోజుల క్రితం గిరిజన అభివృద్ధి మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రకటించారు. దీంతో గిరిజన యూనివర్సిటీ కోసం మరో ఏడాది వేచి చూడాల్సిందే. -
ఐఎస్బీతో గిరిజన సంక్షేమశాఖ ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: సీఎం ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్ పథకం కింద ఔత్సాహిక గిరిజన యువకులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. గచ్చిబౌలిలోని ఖేమ్కా ఆడిటోరియంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ పథకాన్ని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బి మహేశ్ దత్ ఎక్కా ప్రారంభించి మాట్లాడారు. హస్తకళలు, నగలు, సాంప్రదాయ కళాఖండాలను అభివృద్ధి చేసే నైపుణ్యంతో పాటుగా ఇంగ్లిష్పై పట్టు సాధించేలా గిరిజన యువకులకు శిక్షణ అందించాలన్నారు. వీరిని సాన బెడితే కోహినూర్ వజ్రాలుగా తయారవుతారన్నారు. ఈ పథకం కింద ఆన్లైన్ ద్వారా ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, అర్హులైన వారిని ఎంపిక చేసి శిక్షణ అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టీనా జెడ్ చోంగ్తు, ఐఎస్బీ డీన్ రాజేంద్ర శ్రీవాత్సవ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘మేడారానికి’ హోదా హుళక్కే!
సాక్షి, హైదరాబాద్: మేడారంలో జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఆశలు గల్లంతయ్యాయి. ఈ ఉత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. పార్లమెంట్ సభ్యులు అవంతి శ్రీనివాస్తో పాటు పలువురు తెలంగాణ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి జశ్వంత్సింగ్ బబోర్ ఇటీవల లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మేడారం జాతరకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ రూ.2 కోట్లు ఇచ్చిందని, వచ్చేసారి ఈ నిధిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని మాత్రం పేర్కొన్నారు. రాష్ట్ర యంత్రాంగం వైఫల్యం వల్లే.. సమ్మక్క–సారలమ్మ జాతరను రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 23 ఏళ్లుగా ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. గిరిజనులు, ఆదివాసీలతో పాటు వివిధ వర్గాలకు చెందిన కోటి మందికి పైగా భక్తులు జాతరకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ నేపథ్యంలో కుంభమేళా తర్వాత ఆ స్థాయిలో భక్తులు హాజరవుతున్న సందర్భంగా మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ అంశంపై కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సైతం మొదట్లో సానుకూలంగా స్పందించింది. జాతరకు రావాలన్న రాష్ట్ర ఆహ్వానాన్ని సైతం అంగీకరించిన కేంద్ర బృందం, ఉత్సవాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించింది. జాతర తీరును పరిశీలించి నిర్ణయాన్ని ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. అయితే కేంద్ర బృందం వచ్చే ముందు పలుమార్లు సమాచారం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. వీఐపీ తాకిడి ఎక్కువగా ఉన్నందున రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కేంద్ర బృందం పర్యటనకు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో జాతరకు హాజరయ్యే నిర్ణయాన్ని మంత్రుల బృందం విరమించుకుంది. జాతీయ ఉత్సవమైతే... మేడారం జాతరకు జాతీయ ఉత్సవ హోదా దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ నిబంధనల్లో భాగంగా పది లక్షలకు పైగా గిరిజనులు హాజరయ్యే ఉత్సవానికి జాతీయ హోదా అర్హతలుంటాయి. కానీ సమ్మక్క–సారలమ్మ జాతరకు ఏకంగా కోటి మందికి పైగా హాజరవుతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా స్పందించకపోవడంతో చేజేతులా అవకాశం వదులుకున్నట్లైంది. ఈ ఉత్సవానికి జాతీయ హోదా దక్కితే నిధులు, నిర్వహణ అంతా కేంద్రం చూసుకోవడమే కాకుండా, జాతరకు మరింత ప్రచారం దక్కేదని గిరిజన మేధావులు అభిప్రాయపడుతున్నారు. -
ఆశ్రమ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. వాటిని గురుకులాల స్థాయిలో అభివృద్ధి చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో గురుకుల సొసైటీల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలకు సమాంతరంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాలలు కొనసాగుతున్నాయి. భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు, మన్ననూరు ఐటీడీఏల పరిధిలో 319 ఆశ్రమ పాఠశాలలు ఉండగా.. వాటిల్లో 1.2 లక్షల మంది విద్యార్థులున్నారు. పూర్తిగా గిరిజన, అటవీ ప్రాంతాలు కావడం.. బోధన, అభ్యాసనలో వెనుకబాటు ఉండటంతో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేకంగా ఈ ఆశ్రమ పాఠశాలలను నిర్వహిస్తోంది. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం తెలుగు మీడియంలోనే బోధన సాగుతోంది. అయితే మారుతున్న సామాజిక పరిస్థితులు, సర్కారు తలపెట్టిన కేజీ టు పీజీ విద్య పథకంలో భాగంగా ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యత పెరిగింది. ఇప్పటికే గురుకులాల్లో ఇంగ్లిష్ మీడియం అమల్లో ఉంది కూడా. ఈ నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. విడతల వారీగా అమలు.. ప్రస్తుతం ఆశ్రమ పాఠశాలల్లో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు బోధన సాగుతోంది. ఈ పాఠశాలల్లో పూర్తి స్థాయి బోధనా సిబ్బంది ఉండటంతోపాటు హాస్టల్ వసతి కూడా ఉంది. దాదాపు అన్ని ఆశ్రమ పాఠశాలలకు పక్కా భవనాలు కూడా ఉన్నాయి. ఇలా అన్ని సదుపాయాలు ఉన్న నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. అయితే ఒకేసారి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉండటంతో.. దశల వారీగా చేపట్టాలని భావిస్తోంది. తొలుత ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్నారు. తర్వాత ఏటా ఒక్కో తరగతికి పెంచుకుంటూ వెళతారు. ప్రస్తుతం తెలుగు మీడియం అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆటంకం లేకుండా ఇంగ్లిష్ మీడియం అమలవుతుంది. మొత్తంగా దాదాపు ఐదారేళ్లలో ఆశ్రమ పాఠశాలలు పూర్తిస్థాయిలో ఆంగ్ల మీడియం పాఠశాలలుగా మారుతాయి. ఖాళీల భర్తీకి చర్యలు.. ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గిరిజన సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఆరు వందలకు పైగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ద్వారా నియామక ప్రక్రియ చేపట్టనుంది. ఈ భర్తీ ప్రక్రియలో ఇంగ్లిష్ మీడియంలో బోధించే సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విధానానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. -
ఆశ్రమాల్లో ‘స్మార్ట్ కిచెన్’
ఉట్నూర్(ఖానాపూర్) : గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో వంటశాలల రూపురేఖలు మారనున్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కట్టెల పొయ్యిలు, గ్యాస్స్టౌవ్ల స్థానంలో స్టీమ్కుకింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇంధనభారం తగ్గించుకోవడంతో పాటు పర్యావరణహిత పద్ధతిలో వంట చేసేందుకుగాను స్మార్ట్ కిచెన్ వైపు గిరిజన సంక్షేమ శాఖ దృష్టి సారించింది. ఈ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాట్లపై దృష్టి సారించింది. 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు వేగవంతం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 40వేలకు పైగా గిరిజన విద్యార్థులు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో 127ఆశ్రమ పాఠశాలల్లో 39,123 మంది, ఏడు వసతిగృహాల్లో 1,254 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తూన్నారు. వీరందరికీ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఉచితంగా విద్య, భోజన, ఇతర మౌలిక వసతులు కల్పిస్తోంది. ఒక్కో ఆశ్రమ పాఠశాలలో 600కుపైగా విద్యార్థులు ఉన్నారు. వీరందరికి నిర్దేశిత మెనూ ప్రకారం రోజుకు మూడు పూటల భోజనం అందించేందుకు నిరంతరం దాదాపు 350 మంది నాల్గోతరగతి ఉద్యోగులు, 900మంది వరకు ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆశ్రమ పాఠశాలలు ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో ఉండటం అక్కడ గ్యాస్ సరఫరాలో సమస్యల నేపథ్యంలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొగ ఎక్కువగా వెలువడటం, సిబ్బంది అనారోగ్యం పాలవడంతో పాటు వంట రుచిలో తేడాలొస్తున్నాయి. దీనిని గుర్తించిన ప్రభుత్వం 2016లో ప్రతి ఆశ్రమ పాఠశాలలో వంట తయారీ కోసం గ్యాస్ స్టౌవ్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉమ్మడి జిల్లాలో రూ.30.60లక్షల వ్యయంతో 450 గ్యాస్ స్టౌవ్లను ఆశ్రమ పాఠశాలలకు అందించినా గ్యాస్ తిప్పలతో ఆశించిన ఫలితాలు కానరాలేదు. ఈ క్రమంలో వంట సమస్యలను అధిగమిస్తూ విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించేందుకు స్టీమ్ కుకింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈడబ్ల్యూఐడీసీకి బాధ్యతలు... ఆశ్రమపాఠశాలల్లో స్టీమ్ కుకింగ్ పరికరాలు, వంట సామగ్రి కొనుగోలు చేసే బాధ్యతను గిరిజన సంక్షేమ శాఖ ఈడబ్ల్యూఐడీసీ (ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్)కు అప్పగించింది. ఈ మేరకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇందుకు గాను త్వరలో టెండర్లు పిలువడంతో పాటు వేసవి సెలవుల్లోగా ప్రతి ఆశ్రమ పాఠశాలల్లో స్టీమ్ కుకింగ్ విధానం అమలులోకి తీసుకువచ్చేలా చర్యలు వేగవంతం చేస్తోంది. -
ఆశ్రమ పాఠశాలల్లో ‘స్టీమ్ కుకింగ్’
సాక్షి, హైదరాబాద్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో వంటశాలల రూపురేఖలు మారనున్నాయి. కట్టెల పొయ్యి, గ్యాస్ స్టవ్ల స్థానంలో స్టీమ్ కుకింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇంధన భారం తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ హిత పద్ధతిలో వంటలు చేసేందుకుగాను స్మార్ట్ కిచెన్ల వైపు గిరిజన సంక్షేమ శాఖ దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు పచ్చజెండా ఊపడంతో చకచకా ఏర్పాట్లు చేస్తోంది. 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు. 1.2 లక్షల మంది విద్యార్థులు.. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ప్రస్తుతం 319 ఆశ్రమ పాఠశాలలు నడుస్తున్నాయి. ఒక్కో పాఠశాలలో సగటున 4 వందల మంది కలిపి మొత్తంగా 1.20 లక్షల మంది విద్యార్థులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరికి నిర్దేశిత మెనూ ప్రకారం 3 పూటల భోజనం అందజేస్తున్నా.. వంట తయారీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆశ్రమ పాఠశాలలన్నీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండటం.. అక్కడ గ్యాస్ సరఫరాలో సమస్యలు తలెత్తుతుండటంతో వంట చెరకుతో వంటలు చేస్తున్నారు. దీంతో పొగ ఎక్కవగా వెలువడటం, సిబ్బంది అనారోగ్యం పాలవడంతోపాటు వంట రుచిలో తేడాలొస్తున్నాయి. దీన్ని అధిగమించేందుకు స్టీమ్ కుకింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. ముందు 300 స్కూళ్లలో స్టీమ్ కుకింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు ఆ శాఖ అదనపు సంచాలకులు నవీన్ నికోలస్ వెల్లడించారు. -
ఆదివాసీలు ఏకతాటిపై ఉండాలి
ఆదిలాబాద్ రూరల్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకూ ఉద్యమాన్ని కొనసాగించాలని, దీనికోసం ఆదివాసీలందరూ ఏకతాటిపై ఉండాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఉద్యమంలో భాగంగా ఈ నెల 17న కలెక్టరేట్ల ముట్టడి, వినతిపత్రాల సమర్పణ, 19న నాగోబా దర్బార్లో వినతిపత్రాలు ఇవ్వాలని, అలాగే, దర్బార్కు లంబాడీలు ఎవరూ రావద్దని.. 22న గిరిజన సంక్షేమ శాఖ కమిషన్కు, అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాల సమర్పణ ఉంటుందని తెలిపారు. 23న గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతిపత్రం అందజేత, 24న హైదరాబాద్లో ప్రెస్మీట్, 27న మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర నిర్వహణ బోర్డు సభ్యులుగా లంబాడీలు కొనసాగరాదని పూజారులతో సమావేశం, అదే రోజు కుమురంభీం విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తామని వివరించారు. 30, 31వ తేదీల్లో జిల్లాల వారీగా ప్రజాప్రతినిధుల రాజీనామాలపై ఒత్తిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 5 నుంచి అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని సోయం బాపురావ్ వివరించారు. ఈ నెల నుంచి జూన్ వరకు చేపట్టనున్న కార్యచరణను ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. సమావేశంలో ఆదివాసీ సంఘాల నేతలు మడావి రాజు, పల్ల సత్యనారాయణ, దుర్వ సంజీవ్, ఉయికే సంజీవ్, గోడం గణేశ్, సిడాం వామన్ రావ్, కుడ్మేత భీంరావు, గేడం మనోహర్, ఆదివాసీలు పాల్గొన్నారు. -
యువతకు ‘వైటీసీ’ వెలుగులు!
సాక్షి, హైదరాబాద్: అడవి బిడ్డల జీవితాల్లో వెలుగులు పూస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని యువకులు మహానగరంలో కొలువులతో వికసిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ సరికొత్త ప్రణాళికతో ఏజెన్సీ యువత జీవితంలో కొత్త రూపు సంతరించుకుంటోంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు గిరిజన సంక్షేమ శాఖ యువజన శిక్షణ కేంద్రాల (వైటీసీ)ను ఏర్పాటు చేసింది. ఏటూరునాగారం, భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏల పరిధిలో 14 యూత్ ట్రైనింగ్ కేంద్రాలను గత డిసెంబర్లో తెరిచింది. ఒక్కో వైటీసీని 27 వేల చదరపు అడుగులతో ఉన్న పక్కా భవనాల్లో ఏర్పాటు చేసింది. ఉపాధి లక్ష్యంగా శిక్షణ ప్రారంభించింది. శిక్షణ ఇచ్చేందుకు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ గుర్తింపు పొందడంతోపాటు అత్యుత్తమ రేటింగ్ ఉన్న సంస్థలను ఎంపిక చేసింది. వైటీసీల నిర్వహణ, శిక్షణకు సంబంధించి నిధులు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచే అందుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యవేక్షణ బాధ్యతల్ని గిరిజన సంక్షేమ శాఖ పక్కాగా నిర్వహిస్తోంది. ఫలించిన ప్రయోగం యువజన శిక్షణ కేంద్రాల్లో స్వయం ఉపాధి కోర్సులతోపాటు కెరీర్ గైడెన్స్, కంప్యూటర్ ఫండమెంటల్స్, మొబైల్ రిపేరింగ్, ఎలక్ట్రీషియన్, బ్యూటీషియన్, సాఫ్ట్ స్కిల్స్, డ్రైవింగ్, సెక్యూరిటీ గార్డ్స్, ఫుడ్, బేవరేజెస్ తదితర రంగాల్లో శిక్షణ ఇస్తోంది. ఈ క్రమంలో 3,066 మంది వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకున్నారు. ఇందులో ఇప్పటికే 1,073 మంది ఉద్యోగాలు పొందారు. మరో 1,029 మంది శిక్షణ పొందుతున్నారు. ఈ కేంద్రాల ద్వారా మంచి ఫలితాలు వస్తుండటంతో మరిన్ని కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. విద్యార్హతలు, మార్కెట్లో డిమాండ్ను బట్టి చర్యలు తీసుకోనుంది. త్వరలో మరిన్ని కేంద్రాలు వైటీసీలతో ఏజెన్సీ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. మంచి ఫలితాలు వస్తుండటంతో మరిన్ని కేంద్రాలు తెరిచేలా ప్రణాళిక రూపొందించాం. ప్రస్తుతానికి ఆరు చోట్ల కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందుకోసం పక్కా భవనాలు నిర్మిస్తున్నాం. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ గుర్తింపు పొందిన సంస్థల ద్వారానే వైటీసీలను నిర్వహిస్తున్నాం. – ఎం.లక్ష్మిప్రసాద్, స్టేట్ మిషన్ మేనేజర్, ట్రైకార్ కుటుంబానికి ఆసరాగా నిలిచా.. నా చిన్నప్పుడే నాన్న చనిపోయారు. అమ్మ రోజూ కూలి పని చేస్తూ నన్ను, తమ్ముడ్ని పోషించింది. ఇంటర్ వరకు చదివి.. ఆర్థిక కారణాలతో పై చదువులకు వెళ్లలేకపోయా. వరంగల్లోని వైటీసీలో శిక్షణ తీసుకుంటే ఉద్యోగం వస్తుందని తెలియడంతో చేరా. ఫుడ్ అండ్ బేవరేజెస్ కోర్సులో శిక్షణ తీసుకున్నా. జూబ్లీహిల్స్లోని ఓ హోటల్లో ఉద్యోగం దక్కింది. కుటుంబానికి ఆసరాగా నిలిచా. దీనికి కారణమైన గిరిజన సంక్షేమ శాఖకు కృతజ్ఞతలు. – భూక్యా శిరీష, కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా -
గిరిజన ఉపాధికి జీసీసీ కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: గిరిజనుల ఆర్థికాభివృద్ధికి జీసీసీ (గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్) సరికొత్త కార్యాచరణ రూపొందిస్తోంది. ఐటీడీఏలకే పరిమితమైన జీసీసీ మైదాన ప్రాంతాలకూ విస్తరిస్తోంది. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడంతోపాటు గిరిజన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కార్యక్రమాలను అమలు చేయనుంది. ఐటీడీఏల్లోని గిరిజన ఉత్పత్తుల నిర్వహణ, మార్కెటింగ్ వ్యవహారాలను జీసీసీ చూసుకునేది. తాజాగా ఆయా ఉత్పత్తులను నగరాలు, పట్టణాలకు పంపేలా చర్యలు చేపడుతోంది. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు మైదాన ప్రాంతాల్లో జీసీసీ నూనె, తేనె శుద్ధి, సహజ సబ్బుల తయారీ పరిశ్రమలు, న్యాప్కిన్స్ తయారీ, సోయా, చింతపండు శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. అలాగే ఉత్పత్తులు పెరిగి అక్కడ వృద్ధి రేటు పెరగనుంది. నైపుణ్యాభివృద్ధి వైపు.. ఐటీడీఏ ప్రాంతాల్లోని కుటుంబాలు ఎక్కువగా వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. దీంతో ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటోంది. పెద్దగా మార్పుల్లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వలసలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక కేంద్రాలను జీసీసీ ఏర్పాటు చేయనుంది. శిక్షణతో కూడిన ఉపాధికి చర్యలు తీసుకోనుంది. 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2018–24 ప్రణాళికలో భాగంగా ఈ అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఆరేళ్ల ప్రణాళిక కొలిక్కి రానుంది. అనంతరం క్షేత్రస్థాయిలో చర్యలు వేగిరం చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
ఐటీడీఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
సాక్షి, హైదరాబాద్: ఐటీడీఏ(సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ)ల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించాలని ఐటీడీఏ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. దాదాపు 25 ఏళ్లుగా ఐటీడీఏల్లో పనిచేస్తున్నప్పటికీ అరకొర వేతనాలు ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధుల విడుదలలో జాప్యం చేయడంతో సిబ్బందికి నెలవారీ వేతనాలు అందడం లేదని, దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వేతనాల పెంపుతో పాటు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరింది. ఈ మేరకు కాంట్రాక్టు సిబ్బంది సోమవారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.లక్ష్మణ్ను కలసి వినతిపత్రం అందించారు. సిబ్బంది డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. -
‘ఏజెన్సీ’లో ప్రత్యేక అంబులెన్సులు
సాక్షి, హైదరాబాద్: గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టా లని మంత్రి అజ్మీరా చందూలాల్ అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ ద్వారా ఆస్పత్రులను నిర్వహిస్తున్నప్పటికీ.. అత్యవసర సేవలను గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అందించాలని సూచించారు. ఏజెన్సీ మండలాల్లో ప్రత్యేక అంబులెన్సులు ఏర్పాటు చేయాలని, వాటిని మండల కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధా నం చేయాలని ఆదేశించారు. మంగళవారం డీఎస్ఎస్ భవన్లో జరిగిన గిరిజన సలహా మండలి సమావేశంలో చందూలాల్ మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మెడికల్, పారామెడికల్ ఖాళీలన్నీ వీలైనంత త్వరగా భర్తీ చేస్తామన్నారు. భద్రాచలం, ఊట్నూరు, ఏటూరునాగారం, మన్ననూరు ఐటీడీఏలలో గిరిజన బాలికల కోసం ప్రత్యేకం గా నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయను న్నట్లు తెలిపారు. గిరిజన అనాథలు, నిరాశ్రయ మహిళలను ఆదుకునేందుకు ఏజెన్సీ ప్రాంతాల్లో స్టేట్ హోమ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళల అక్రమ రవాణాపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలో అది కార్యరూపం దాల్చుతుందన్నారు. రోడ్లు మెరుగుపరుస్తున్నాం.. రోడ్లు లేని తండాలు, గూడేలకు రవాణా వసతిని మెరుగుపరుస్తున్నామని, ఇందుకోసం రూ.517 కోట్లు కేటాయించామని చందూలాల్ తెలిపారు. ఇప్పటికే టెండర్ల దశ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. చెంచు ప్రాంతాలకు బీటీ రోడ్లు నిర్మించాలని, దీనిపై ప్రతిపాదనలు తయారు చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గిరిజనులకు స్వయం ఉపాధి కింద గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ శాఖ ల్లో ఖాళీగా ఉన్న గిరిజన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గిరిజన గురుకులాల్లో బోధన సమస్యను అధిగమించేందుకు తాత్కాలిక వలంటీర్లను నియమించుకోవాలన్నారు. ఈ సమావేశానికి పలు శాఖల కార్యదర్శులు గైర్హాజరవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇది పునరావృతం కావొద్దని హెచ్చరించా రు. వచ్చేనెలలో మరోసారి సమీక్ష నిర్వహించి.. అన్ని అంశాలపై చర్చ పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్దత్ ఎక్కా, కమిషనర్ లక్ష్మణ్, అదనపు సంచాలకులు వి.సర్వేశ్వర్రెడ్డి, నవీన్ నికోలస్, ఎంపీ సీతారాంనాయక్ పాల్గొన్నారు. -
గిరిజనుల కోసం ‘ఎస్టీ విపత్తు నిధి’
సాక్షి, హైదరాబాద్: గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. గిరిజనులు విపత్తుల బారిన పడినప్పుడు ఆదుకునే విధంగా కొత్త పథకానికి రూపకల్పన చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎస్టీ విపత్తు నిధిని ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ పంపిన ప్రతిపాదనల ను పరిశీలించిన సర్కారు కొత్త కార్యక్రమానికి పచ్చజెండా ఊపేసింది. తాజాగా ఫైల్పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంతకం చేశారు. ఒకట్రెండు రోజుల్లో ‘విపత్తు నిధి’కి సంబంధించి మార్గరద్శకాలు వెలువడే అవకాశముంది. ఏమిటీ ‘విపత్తు నిధి’... ఆర్థిక అభివృద్ధితోపాటు సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. విపత్తులు సంభవించినప్పుడు సైతం ప్రత్యేక కేటగిరీలకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా పథకాలున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీలోని గిరిజను లు ఎక్కువగా పకృతి వైపరీత్యాలకు లోనవు తుంటారు. కొన్ని సందర్భాల్లో ఒకరిద్దరు మాత్రమే ప్రమాదాలకు గురవుతుంటారు. అలాంటి సందర్భంలో నిబంధనలకు లోబడి ఆపద్బంధు పథకం అమలు చేస్తారు. ఎలాంటి ప్రమాదమైనా, ఎంత నష్టం జరిగినా ఈప్రత్యేకనిధి ఏర్పాటుతో ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం కచ్చితంగా అందుతుంది. ఈ నిధి వినియోగంలో జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి సర్వాధికారాలు ఇవ్వనుంది. ఒక లబ్ధిదారుకు సంబంధించి రూ.25 వేల వరకు ఆర్థిక సాయాన్ని కలెక్టర్గాని, ఐటీడీఏ పీవోగాని నేరుగా అందించే అవకాశముంటుంది. రూ.50 వేలలోపు ఆర్థిక సాయమైతే గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ నిర్ణయం తీసుకుంటారు. అంతకు మించితే ప్రభుత్వస్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు దాదాపు ఖరారయ్యాయి. సీఎం ఆమోదం సైతం లభించడంతో ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. -
గిరిజన టీచర్ల భర్తీకి గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో కొనసాగుతున్న పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఖాళీల భర్తీకి సంబంధించిన ఫైలును గిరిజన సంక్షేమ శాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంతకం చేయడంతో ఆయా ఖాళీల భర్తీకి మార్గం సుగమమైంది. ఉట్నూరు, ఏటూరు నాగారం, భద్రాచలం ఐటీడీఏల పరిధిలో 320 గిరిజన సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు లక్ష మంది విద్యార్థులున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో 2,825 పోస్టులుండగా... 601 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 563 ఉండగా... స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 38 ఉన్నాయి. ఇందులో పూర్తిగా ఏజెన్సీ పరిధిలో 241 పోస్టులుండగా.... మైదాన ప్రాంతాల్లో 360 పోస్టులున్నాయి. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ..: గిరిజన పాఠశాలల్లో ఖాళీలను గతంలో జిల్లా స్థాయిలో భర్తీ చేయగా ప్రస్తుతం టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే అవకాశాలున్నాయి. టీఆర్టీ పద్ధతిలోనే పోస్టులను భర్తీ చేస్తా మని సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. కేటగిరీ పోస్టులు ఎస్జీటీ 563 స్కూల్ అసిస్టెంట్ గణితం 1 ఫిజికల్ సైన్స్ 2 సోషల్ స్టడీస్ 1 పీఈటీ 5 క్రాఫ్ట్ 5 డ్రాయింగ్ 2 తెలుగు పండిట్ 18 హిందీ పండిట్ 4 -
‘గిరిజనుల సాగు’లో టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: గిరిజనుల సాగుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలని తెలంగాణ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ట్రైకార్) నిర్ణయించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సాగు పద్ధతుల్లో మెళకువలను రైతులకు వివరించేందుకు గిరిజన సంక్షేమ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈమేరకు శుక్రవారం డీఎస్ఎస్ భవన్లోని ట్రైకార్ కార్యాలయంలో ఇక్రిశాట్తో ఒప్పందం కుదుర్చుకుంది. 2017–18లో ఎంపిక చేసిన 500 మంది రైతులకు శిక్షణలు ఇవ్వడం, కొత్త పద్ధతులపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపట్టనుంది. దీనికి గిరిజన సంక్షేమ శాఖ బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించింది. మహిళా రైతులకూ ప్రాధాన్యత.. సాగు పద్ధతుల్లో సాంకేతికత వినియోగంపై అవగాహన కల్పించేందుకు జిల్లాల వారీగా అర్హులైన రైతులను ఎంపిక చేయాల్సిందిగా గిరిజన సంక్షేమ శాఖ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు ఏర్పాటు చేస్తారు. వ్యవసాయ పంటల సాగుకు ఇక్రిశాట్, అగ్రికల్చర్ వర్సిటీలలో అవగాహన కల్పించనున్నారు. ఉద్యా న పంటల సాగుపై బెంగళూరులోని జాతీ య ఉద్యాన పరిశోధన సంస్థ, తమిళనాడు లోని నీలగిరి ఉద్యాన అభివృద్ధి శాఖ, కూర గాయల పంటలు, మార్కెటింగ్పై పుణే లోని శనిసింగాపూర్ కూరగాయల మార్కెటింగ్ సొసైటీ, మత్స్యసాగుపై కేరళలోని కొచ్చి, ఏపీలోని కాకినాడ, డెయిరీ పరిశ్రమలపై గుజరాత్ డెయిరీ పరిశోధన సంస్థ, హరియా ణాలోని ప్రైవేటు డెయిరీ ఫోరమ్స్లో సదస్సులు నిర్వహించి శిక్షణ ఇస్తారు. గిరిజనుల ఆర్థిక ఎదుగుదల కోసమే.. గిరిజనులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ ఏడాది 500 మందికి అవకాశం కల్పిస్తున్నాం. సాగులో మెళకువలు నేర్పడంతో పాటు ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తాం. జిల్లాల వారీగా అర్హులైన రైతులను ఎంపిక చేసిన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపడతాం. – తాటి వెంకటేశ్వర్లు, చైర్మన్, ట్రైకార్ -
గిరిజన డిగ్రీ కాలేజీల్లో 1,455 పోస్టులు
సాక్షి, హైదరాబాద్ : ఈ ఏడాది కొత్తగా ఏర్పాటైన 22 గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయంలో వివిధ కేటగిరీలతోపాటు ప్రాంతీయ సమన్వయకర్తల పోస్టులను సైతం మంజూరు చేసింది. మొత్తం 1,455 పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పోస్టులు భర్తీ చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖకు సూచించింది. వీటిలో డిగ్రీ కాలేజీలకు సంబంధించి బోధన, బోధనేతర సిబ్బంది కింద 1,430 పోస్టులు, కార్యదర్శి కార్యాలయానికి 25 పోస్టులను కేటాయించింది. వీటిలో అత్యధికంగా 880 డిగ్రీ లెక్చరర్ పోస్టులున్నాయి. గురువారం ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎన్.శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. మంజూరైన పోస్టులివే.. విభాగం: టీటీడబ్ల్యూ డిగ్రీ కాలేజీ పోస్టు కేటగిరీ పోస్టులు ప్రిన్సిపాల్ 22 డిగ్రీ లెక్చరర్ 880 లైబ్రేరియన్ 22 ఫిజికల్ డైరెక్టర్ 22 పరిపాలనాధికారి 22 సూపరింటెండెంట్ 22 మెస్ మేనేజర్/వార్డెన్ 22 స్టాఫ్ నర్స్ 44 సీనియర్ అసిస్టెంట్ 22 కేర్ టేకర్ 22 ల్యాబ్ అసిస్టెంట్ 88 కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ 44 అసిస్టెంట్ లైబ్రేరియన్ 22 జూనియర్ అసిస్టెంట్/డీఈఓ 22 స్టోర్ కీపర్ 22 మ్యూజియం కీపర్ 22 రికార్డ్ అసిస్టెంట్ 22 ఆఫీస్ సబార్డినేట్ 88 విభాగం: కార్యదర్శి కార్యాలయం రిజిస్ట్రార్ 1 డిప్యూటీ సెక్రెటరీ 2 అసిస్టెంట్ సెక్రెటరీ 2 సూపరింటెండెంట్ 3 సీనియర్ అసిస్టెంట్ 3 జూనియర్ అసిస్టెంట్ 3 ఆఫీస్ సబార్డినేట్ 3 రీజినల్ కోఆర్డినేటర్ 8 -
గిరిజన యువతకు ఐఏఎస్ అకాడమీ
సాక్షి, హైదరాబాద్: గిరిజన యువతను సివిల్ సర్వీసెస్ వైపు మళ్లించేందుకు గిరిజన సంక్షేమ శాఖ సరికొత్త కార్యాచరణ రూపొందించింది. సివిల్స్ సాధించాలనుకునే యువతకు కార్పొరేట్ కోచింగ్ సెంటర్లకు దీటుగా ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు ప్రత్యేకంగా ఐఏఎస్ అకాడమీని అందుబాటులోకి తీసుకొస్తోంది. దీని ఏర్పాట్లు సైతం దాదాపు పూర్తి చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్)లో ఈ అకాడమీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి రూ. 1.5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఈ అకాడమీలో 150 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనుంది. ఇందులో 50 మంది మహిళలు, 100 మంది పురుషులకు సీట్లు ఇవ్వనున్నారు. ప్రైవేటుకు చెక్... సివిల్స్కు సన్నద్ధమయ్యే గిరిజన యువతకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు గతంలో ప్రైవేటు కోచింగ్ సెంటర్లను ప్రభుత్వం ఆశ్రయించింది. ఆయా కోచింగ్ సెంటర్లలో అధ్యాపకులను అంతంత మాత్రంగా ఏర్పాటు చేయడంతో ఫలితాలు సంతృప్తికరంగా రాలేదు. 2016–17 విద్యా సంవత్సరంలో దాదాపు రూ.1.35 కోట్లు ఖర్చు చేసి, వందకుపైగా అభ్యర్థులను ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో చేర్చారు. అందులో కేవలం ఒక్క అభ్యర్థి మాత్రమే సివిల్ సర్వీసెస్కు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు స్వస్తి పలుకుతూ సొంతంగా అకాడమీని ఏర్పాటు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ భావించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. నిధులు విడుదల చేసింది. దీంతో రాజేంద్రనగర్లోని వైటీసీ భవనాన్ని అకాడమీగా మార్చేందుకు యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ భవనంలో 35 విశాల గదులతో పాటు మరో 25 గదులున్నాయి. శిక్షణ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు ఇక్కడే వసతి కల్పించనుంది. ఫ్యాకల్టీగా ప్రఖ్యాత ప్రొఫెసర్లను తీసుకురానుంది. సబ్జెక్టు నిపుణులను ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల నుంచి రెండు నుంచి పది రోజుల వరకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి తీసుకురానుంది. నిర్ణీత వ్యవధిలో సిలబస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటోంది. మరోవైపు అడ్మిషన్లు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ బాధ్యతలు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండు దఫాలుగా రాత పరీక్ష, మౌఖిక పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసింది. కార్పొరేట్ స్థాయిలో... రాజేంద్రనగర్లోని వైటీసీలో ఏర్పాటు చేస్తున్న ఈ అకాడమీని కార్పొరేట్ స్థాయిలో గిరిజన సంక్షేమ శాఖ తీర్చిదిద్దుతోంది. విశాలమైన తరగతి గదులు, డిజిటల్ క్లాస్ రూమ్లు, డార్మిటరీలు, 2 వేల పుస్తకాల సామర్థ్యం ఉన్న లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, పూర్తిస్థాయిలో ఫర్నిచర్, బయోమెట్రిక్ మెషీన్లతో హాజరు తదితరాలు ఏర్పాటు చేస్తోంది. అకాడమీలో భద్రత కోసం సీసీ కెమెరాలనూ ఏర్పాటు చేసింది. అన్ని రకాల దినపత్రికలు, జర్నల్స్ను అభ్యర్థుల కోసం అందుబాటులోకి తేనుంది. అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం ‘గిరిజన ఐఏఎస్ అకాడమీని అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభించేలా ఏర్పాట్లు చేశాం. అకాడమీని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రారంభించనున్నారు. ప్రైవేట్ అకాడమీలకు దీటుగా ఏర్పాట్లు చేస్తున్నాం. అత్యుత్తమ అధ్యాపకులను తీసుకొచ్చి అభ్యర్థులకు నాణ్యమైన బోధన అందేలా చర్యలు తీసుకుంటున్నాం. అకాడమీ నిర్వహణకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించాం. అకాడమీలో డాటాఎంట్రీ ఆపరేటర్లు, గార్డ్లు, కిచెన్ స్టాఫ్, క్లీనింగ్ స్టాఫ్, ఆఫీస్ సబార్టినేట్లు, లైబ్రేరియన్లుగా కొత్తగా 13 మందిని నియమించాం’. – వి.సర్వేశ్వర్రెడ్డి, అదనపు సంచాలకుడు, గిరిజన సంక్షేమ శాఖ -
సం‘క్షామ’ హాస్టళ్లు
ఇల్లెందు : గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతో పాటు సకల సౌకర్యాలు, మెరుగైన ఆహారం అందించాలి. ఇందుకోసం మార్కెట్లో సరుకుల ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలి. కానీ గత మూడేళ్లుగా ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచకపోగా విద్యార్థులకు అందించే ఆహార పరిమాణం తగ్గిస్తోంది. మెస్ చార్జీలకు, మెనూ అమలుకు పొంతన లేకపోవడంతో హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల నిర్వహణ తలకు మించిన భారంగా మారిందని సంక్షేమాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌష్టికాహారం సక్రమంగా అందక విద్యార్థులు రక్తహీనతతో వ్యాధుల బారిన పడుతున్నారు. 3 నుంచి ఏడో తరగతి విద్యార్థులకు రోజుకు రూ.25, 8, 9, 10 తరగతుల వారికి రూ.28.33 చొప్పున అందించాలి. ఇందులో రెండు పూటలా భోజనం, ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ డబ్బు సరిపోక టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాసిరకమైన సరుకులు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎదిగే పిల్లలకు మజ్జిగ, పెరుగు అందని ద్రాక్షలా మారింది. కనీసం ఆదివారం కూడా వీరికి పిండి వంటల రుచి తెలియదు. మాంసాహారం ఊసే లేదు. అరటి పండు మినహా మిగితా ఏ పండూ వీరి దరి చేరదు. ఇక హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం ఉప్మా, పులిహోర, కిచిడి, జీరా రైస్, ఎగ్ బిర్యానీ, ఆలుగడ్డ కూర, మధ్యాహ్నం భోజనం, పప్పు, కూరగాయలు, కోడిగుడ్లు అందించాల్సి ఉంది. సాయంత్రం స్నాక్స్లో మూడు పీస్లు పల్లిపట్టీ, శనగలు 20 గ్రాములు, గ్రీన్ పీస్ 20 గ్రాములు, బొబ్బర్లు, శనివారం స్వీటు అందజేయాలి. రాత్రి పూట భోజనంలో అన్నం, కూరగాయలు, సాంబారు అందించాలి. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి కొరవడకుండా ఉండేందుకు విటమిన్లు కలిగిన ఆహారం ఇవ్వాలి. ‘ప్రత్యేక’ పాలనలో పెరగని చార్జీలు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు విద్యాసంవత్సరాల్లో మెస్ చార్జీలు ఏమాత్రం పెంచలేదు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి మెస్ చార్జీలు పెంచగా తదనంతరం అధికారం చేపట్టిన కిరణ్కుమార్రెడ్డి మరోమారు చార్జీలు పెంచారు. ఆ తర్వాత నూతన రాష్ట్రం ఆవిర్భవించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం సన్న బియ్యం అందజేస్తున్నప్పటికీ మెస్ చార్జీలు పెంచటం విస్మరించింది. నింగినంటుతున్న నిత్యావసరాల ధరలు.. నిత్యావసర సరుకుల ధరలు చుక్కలను అంటుతుండగా విద్యార్థులకు అందించే మెస్ చార్జీలు మాత్రం యథాతథంగానే ఉంచారు. దీంతో హాస్టల్, ఆశ్రమ పాఠశాలల సంక్షేమాధికారులు(హెచ్డబ్ల్యూఓ) మూస పద్ధతిలో తక్కువ ధరకు లభించే కూరగాయలతో కాలం గడుపుతున్నారు. ఇక కాస్మొటిక్స్ చార్జీల కింద బాలురకు నెలకు రూ.50, బాలికలకు నెలకు రూ.75 చెల్లిస్తున్నారు. ఏళ్లు గడిచినా ఈ చార్జీలు మాత్రం పెంచటం లేదు. బాలురకు కనీసం రూ.100, బాలికలకు రూ.150 చెల్లించాలని విద్యార్థులు కోరుతున్నారు. బాలుర క్షౌ రానికి పైసా కూడా విడుదల చేయటం లేదు. జిల్లాలో 24 బాలుర, 22 బాలికల ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో బాలురు 7, 721 మంది, బాలికలు 8,958 మంది ఉన్నారు. ఇక గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 12 బాలుర హాస్టళ్లలో 1215 మంది, ఆరు బాలికల హాస్టళ్లలో 1305 మంది ఉన్నారు. హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యనభ్యసించే వారికి 3 నుంచి 7వ తరగతి వరకు రోజుకు 475 గ్రాములు, 8, 9, 10 తరగతుల వారికి 525 గ్రాముల బియ్యం కేటాయించారు. 2015–16లో కిలో పప్పు ధర రూ.103 ఉండగా, నేడు అదే పప్పు ధర కిలో రూ.145కు సరఫరా చేస్తున్నారు. అయితే అప్పుడు ఒక్కో విద్యార్ధికి పప్పు 25 గ్రామలు ఇవ్వగా నేడు 35 గ్రాములు ఇస్తున్నారు. నాడు 25 గ్రాములకు రూ. 2.58 ఉండగా ప్రస్తుతం రూ. 5.08కి పెంచారు. ఒక్కో విద్యార్ధికి పప్పు 10 గ్రాములు పెంచగా రూ. 2.58 పైసల నుంచి రూ. 5.08 పైసలకు భారం పెంచారు. నూనె 15 గ్రాముల నుంచి 10 గ్రాములకు తగ్గించారు. చింతపండు 18 గ్రాముల నుంచి 10 గ్రాములకు తగ్గించారు. కారం పొడి 8 గ్రాముల నుంచి 6 గ్రాములకు తగ్గించారు. ఉప్మా రవ్వ ఒక విద్యార్థికి 40 గ్రాములు కేటాయించగా, నేడు 30కి తగ్గించారు. ఇలా ఒకటి, రెండు వస్తువులు పెంచినా మిగితా అన్నింటి పరిమాణం తగ్గించడం గమనార్హం. -
గిరిజన సంక్షేమంలో ‘ఐటీ సెల్’
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ సమాచార సాంకేతిక కేంద్రం(ఐటీ సెల్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సర్వీసెస్ (టీఎస్టీఎస్)తో ఒప్పందం కుదుర్చుకుంది. గిరిజన సంక్షేమ శాఖ కార్యక్రమాల పనితీరును ఐటీ సెల్ విశ్లేషించనుంది. ఈ సెల్లో ప్రత్యేకంగా నలుగురు టెక్నీషియన్లను నియమించనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 472 గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో 1.22 లక్షల మంది, 99 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 65 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వసతిగృహాలతోపాటు సంక్షేమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల పర్యవేక్షణ బాధ్యతను ఐటీసెల్కు అప్పగించనుంది. ఈ మేరకు రాష్ట్రం లోని అన్ని వసతిగృహాల్లో బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరును అంచనా వేస్తారు. బోధన, భోజన, విద్యార్థుల ఆరోగ్యస్థితి వంటి సమాచారాన్ని వెబ్సైట్లో అప్డేట్ చేసి నివేదికలు రూపొం దిస్తారు. ఈ ప్రక్రియతో ప్రతి హాస్టల్, రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఐటీ సెల్కు కచ్చితమైన సమాచారం వస్తుందని, వాటి ఆధారంగా కార్యాచరణ చేపట్టేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమాయత్తం చేస్తారు. -
గిరిజన యువతకు ‘జాబ్ పోర్టల్’
ప్రారంభించిన మంత్రి అజ్మీరా చందూలాల్ సాక్షి,హైదరాబాద్: గిరిజన యువత ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సరి కొత్త వేదిక ఏర్పాటైంది. హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులు, గిరిజన సంక్షేమ శాఖ సంయుక్తంగా ప్రత్యేక వెబ్పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. శనివారం సచి వాలయంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ ఈ వెబ్సైట్... ఎస్టీఈసీ.తెలంగాణ.జీఓవీ.ఇన్ను ప్రారంభిం చారు. గిరిజన విద్యార్థులు మాత్రమే ఈ వెబ్పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీంతో సదరు అభ్యర్థికి తాజా నోటిఫికేషన్లు, ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు, శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి న సమాచారం అందుతుంది. సంక్షిప్త, ఈమెరుుల్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందివ్వడంతో పాటు ఫోన్ ద్వారా కూడా యువతకు అవగాహన కల్పిస్తారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారిని సన్నద్ధపర్చే కార్యక్రమాల్ని సైతం వెబ్సైట్ నిర్వాహకులు చేపడుతున్నారు. ఉద్యోగం వచ్చే వరకు... రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రతి అభ్యర్థికి ఉద్యోగావకాశం వచ్చే వరకు మార్గనిర్దేశం చేస్తామని హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ నిశాంత్ తెలి పారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే అభ్య ర్థి ఈమెరుుల్కు పాస్వర్డ్ పంపుతారు. అనంతరం అభ్యర్థి అర్హతలను అందులో నిక్షిప్తం చేయాలి. వాటి ఆధారంగా ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తారు. ఆర్థిక స్థోమత లేని అభ్యర్థులకు టీఏ, డీఏ సహకారాన్ని సైతం కల్పిస్తారు. అభ్యర్థి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు పోర్టల్లో ఎంట్రీ చేయాలి. నిరుద్యోగ గిరిజన యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు డిక్కి (దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) చేయూతనివ్వనుంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖతో ఇప్పందం కుదుర్చుకుంది. పెట్టుబడుల సహకారంతో పాటు యూనిట్ల స్థాపనకు సలహాలు సూచనలు ఇవ్వనున్నట్లు డిక్కి చైర్మన్ రవికుమార్ తెలిపారు. గిరిజనులకు వరం: చందూలాల్ ఈ వెబ్పోర్టల్ గిరిజన యువతకు వరంలాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవా లి. త్వరలో ఆండ్రారుుడ్ జాబ్ యాప్ను తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటుంన్నాం. 10 వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు... ‘నగరాల్లో ఉద్యోగాలు చేసే గిరిజన యువతులకు నివాస సదుపాయం సమ స్యగా మారింది. దీన్ని అధిగమించేలా రాష్ట్రవ్యాప్తంగా 10వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ప్రారంభించనున్నాం. అలాగే ఐఏఎస్ శిక్షణ కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తాం’ అని శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్ వెల్లడించారు. -
ఆశ్రమాలు, వసతి గృహాలకు గ్యాస్ స్టౌలు
► తప్పనున్న పొగ తిప్పలు ► డిసెంబర్ నుంచి కట్టెలకు బిల్లులు బంద్ ► స్టౌల సరఫరాకు రూ.30.60 లక్షలు ► 450 స్టౌలు సరఫరా.. ఒక్కో దానికి రూ.6,800 ఉట్నూర్ : ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఇక పొగ కష్టాలు దూరం కానున్నారుు. నాలుగు జిల్లాల్లో కట్టెల పొరుు్యపై వంట తిప్పలు తప్పనున్నారుు. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో గ్యాస్ స్టౌలపై వంటలు వండాలని ఐటీడీఏ నిర్ణయం తీసుకోవడంతోపాటు జూన్లో గ్యాస్ స్టౌల సరఫరాకు టెండర్లు నిర్వహించింది. దీంతో ప్రస్తుతం ఆయూ హాస్టళ్లకు గ్యాస్ స్టౌలు సరఫరా అవుతున్నారుు. నెలాఖరు వరకు అన్ని ఆశ్రమాలు, వసతి గృహాలకు గ్యాస్ స్టౌలు సరఫరా చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కట్టెల బిల్లులు నిలిపి వేస్తున్నట్లు ఐటీడీఏ ప్రకటించింది. నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 123 ఆశ్రమ పాఠశాలలు, ఏడు వసతి గృహాలు ఉన్నారుు. వీటిలో దాదాపు 40 వేలకు పైగా గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఉచిత భోజన, వసతి సౌకర్యాలను ఐటీడీఏ కల్పిస్తోంది. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల భోజనాల కోసం ఏళ్ల తరబడిగా కట్టెల పొరుు్యలు ఉపయోగిస్తున్నారు. దీంతో సకాలంలో వంటలు కాకపోవడం, కట్టెల కొరతతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1995 నుంచి 2004 మధ్యకాలంలో 96 ఆశ్రమ పాఠశాలలకు దాదాపు రూ.38,81,654 వెచ్చించి గ్యాస్ స్టౌల సౌకర్యం కల్పించారు. వాటి నిర్వహణ, మరమ్మతుల కోసం 2004-08 మధ్య కాలంలో రూ.3,33,300 కేటారుుంచారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి ఆశ్రమ పాఠశాలలకు నాలుగు నుంచి 32 సిలిండర్ల వరకు అందించారు. గ్యాస్ స్టౌలను వినియోగించడంలో సిబ్బంది విఫలమవడం, మరమ్మతులు లేక మూలనపడడం జరిగింది. తాజాగా ఐటీడీఏ మళ్లీ గ్యాస్ స్టౌలపై వంటలకు శ్రీకారం చుట్టింది. దీంతో ఒక్కో స్టౌకు రూ.6,800 వెచ్చించి 450 గ్యాస్ స్టౌల సరఫరాకు జూన్లో రూ.30.60 లక్షలకు టెండర్లు నిర్వహించింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రెండు నుంచి నాలుగు స్టౌల సరఫరాకు చర్యలు చేపట్టింది. కట్టెల పేర అక్రమాలకు చెక్ ఆశ్రమ పాఠశాలల్లో వంటల కోసం కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తున్నారు. నిత్యం వార్డెన్లు ఎడ్లబండ్ల సహా యంతో సమీప అటవీ ప్రాంతాల నుంచి కట్టెలు తెప్పిస్తున్నారు. దూరభారాన్ని బట్టి ఒక్కో ఎడ్లబండికి రూ.800 నుంచి రూ.1,200 వరకు చెల్లిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది సిబ్బంది ఒక నెలలో వంట కోసం తెప్పించిన ఎడ్లబండ్ల కంటే రెండింతలు ఎక్కువగా రాస్తూ నిధులు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలున్నారుు. పలుమార్లు అధికారుల దృష్టికి వెళ్లినా ఫలితం ఉండేది కాదు. ఎట్టకేలకు గ్యాస్ స్టౌలు సరఫరా చేస్తుండడంతో కట్టెల పేరిట జరిగే అక్రమాలకు చెక్ పడనుంది. సిలిండర్ల సంఖ్య పెంచితెనే ఫలితం గతంలో ఆశ్రమ పాఠశాలల్లో గ్యాస్ స్టౌలపై వంటలు చేయడం అమలు కావడంతో విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో ఆశ్రమ పాఠశాలకు నాలుగు నుంచి 32 సిలిండర్ల వరకు అందించారు. కొన్నాళ్లకే గ్యాస్ స్టౌలు నిర్వహణ లేక మూలనపడ్డారుు. గ్యాస్ సిలిండర్లు పక్కాదారి పట్టాయి. ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వర్తించే కొందరు తమ సొంత అవసరాలకు ఇళ్లకు తీసుకెళ్లారు. వాటి విషయమై ఆరా తీసే వారు లేకపోవడంతో అప్పట్లో అందించిన సిలిండర్లు.. ఇప్పుడున్న సిలిండర్లకు లెక్క కుదరడం లేదు. మిగిలిన నాలుగైదు సిలిండర్లు మినహా మిగితా వాటి జాడలేదు. ఐటీడీఏ అధికారులు పూర్తి స్థారుులో విచారణ జరిపితే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో కంటే ప్రస్తుతం ఆశ్రమాల్లో విద్యార్థుల సంఖ్య మూ డింతలు పెరిగింది. నాలుగు సిలిండర్లు ఉన్న ఆశ్రమా ల్లో సిలిండర్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది. అదీగాక నాలుగు జిల్లాల్లోని ఆశ్రమాలు మారుమూల ప్రాంతా ల్లో ఉన్నారుు. సకాలంలో సిలిండర్లు సరఫరా కాకుంటే విద్యార్థులు పస్తులుండాల్సి వస్తుంది. సిలిండర్ల సంఖ్య పెంచాలని నిర్వాహకులు కోరుతున్నారు. మంచి నిర్ణయం 1989 నుంచి ఆశ్రమ పాఠశాలల్లో కుక్గా విధులు నిర్వర్తిస్తున్నాను. ఇన్నాళ్లకు ఆశ్రమాల్లో గ్యాస్ పొరుు్యలు ఏర్పాటు చేయడం సంతోషం. కట్టెల పొరుు్యలపై వంట చేస్తుండడంతో నిత్యం పొగ చూరి కుక్లకు కంటి వ్యాధులు వస్తున్నారుు. ఇప్పటికే చాలామంది కంటి సమస్యలతో ఉద్యోగాలు మానుకున్నారు. - అక్బర్, కుక్, బాలుర ఆశ్రమ పాఠశాల, ఉట్నూర్ డిసెంబర్ నుంచి గ్యాస్పై వంటలు నాలుగు జిల్లాల్లోని ఆశ్రమ, వసతి గృహాలకు గ్యాస్ పొరుు్యలు సరఫరా చేస్తున్నాం. డిసెంబర్ నుంచి కట్టెలకు బిల్లులు చెల్లించెది లేదని స్పష్టం చేశాం. గ్యాస్ పొయ్యిలు అందుబాటులోకి రావడంతో పలు ఆశ్రమాల్లో కట్టెల పేరుతో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. ఇప్పటికే చాలా ఆశ్రమాలకు పొరుు్యలు చేరారుు. నెలాఖరు వరకు అన్ని ఆశ్రమ పాఠశాలలకు గ్యాస్ పొరుు్యల సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.- రాంమూర్తి, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు -
గిరిజన సంక్షేమ శాఖలో వివక్ష
అమరావతి : గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై వివక్ష కొనసాగుతున్నదని ఏపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ (సి) ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జగజ్యోతి, జి.చిట్టిబాబు ఆరోపించారు. తాడేపల్లిలోని గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ కార్యాలయ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన ఉద్యోగుల సమావేశంలో వారు మాట్లాడారు. 1984లో ఇంజనీరింగ్ విభాగం ప్రారంభమైన ప్పటి నుంచి ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులు లేవన్నారు. అగ్రవర్ణాల వారికి వస్తున్నాయని, అర్హతలున్నా తమకు రావడం లేదని ఆరోపించారు. విశాఖపట్టణాన్ని కేంద్రంగా చేసుకుని కొందరు ఎస్ఈలు, ఈఈలు, డీప్యూటీ ఈఈలు చక్రం తిప్పుతున్నారని, మంత్రిని సైతం పక్కదోవ పట్టించి కొందరు ఇన్ చార్జి ఈఈలుగా కొనసాగుతున్నారని అన్నారు. ఇన్ చార్జి స్థానాల్లో ఎస్సీ, ఎస్టీల్లో అర్హతలున్న వారికి ప్రమోషన్లు ఇచ్చేందుకు ఉన్నతాధికారులు సిద్ధంగా లేరన్నారు. దీనివల్ల కుల వివక్ష కొనసాగుతోందని వాపోయారు. సీతంపేట, కేఆర్ పురం ఇంజనీరింగ్ విభాగాల్లోని ఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నా వారి స్థానంలో ఇన్చార్జిలు మాత్రమే కొనసాగుతున్నారని చెప్పారు. దళిత గిరిజన ఉద్యోగులకు ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నతాధికారుల నుంచి సహాయ నిరాకరణ ఉందన్నారు. విజ్ఞానం ద్వారా సమాజంలోని రుగ్మతలను అంబేద్కర్ ఎలా ఎదుర్కొన్నారో అదే బాటలో తాము నడుస్తున్నామని హెచ్చరించారు. -
కుమ్రం భీం పురిటిగడ్డ.. ఇక పర్యాటక కేంద్రం
భీం 76వ వర్ధంతి సభలో మంత్రుల వెల్లడి సాక్షి, ఆసిఫాబాద్: జల్, జంగిల్, జమీన్ కోసం నిజాంకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కుమ్రం భీం పురిటిగడ్డను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందులాల్, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్న అన్నారు.గత ప్రభుత్వాలు తెలంగాణ పోరాటవీరులను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం భీం జిల్లాలోని జోడేఘాట్లో గిరిజన పోరాట యోధుడు, ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రం భీం 76వ జయంతి కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. తొలుత భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భీం స్మృతివనం, మ్యూజియంను మంత్రులు ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక వీరులను భవిష్యత్తరాలు గుర్తుంచుకునేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వివరించారు. భీమ్ వారసులను గుర్తించి ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. జిల్లాలోనే అపారమైన అటవీసంపదను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని.. దుర్వినియోగం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. చిన్న జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో పాలన పరుగులు పెడుతుందని, విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా రంగాల్లో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ సతీష్కుమార్ పాల్గొన్నారు. కాగా, కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు రాకపోవడంతో ఆదివాసీలు నిరుత్సాహానికి గురయ్యారు. -
గిరిజన సంక్షేమ శాఖ డీడీ సరెండర్
ఏటూరునాగారం : గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ పోచం అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను మాతృశాఖకు సరెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఐటీడీఏ పీఓ అమయ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పెషల్ డీఎస్సీ 2012–13కు సంబంధించిన ఉపాధ్యాయ పోస్టుల్లో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ పోచం పది మంది గిరిజన అభ్యర్థులను నియమించార న్నారు. అయితే ప్రాథమిక విచారణలో ఆ నియామకాలు ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా జరిగాయని, అలాగే ఉన్నతాధికారుల పేర్లు చెప్పి అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు రావడంతో.. కలెక్టర్ కరుణ ఆయనను మాతృశాఖ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్కు సోమవారం సరెండర్ చేశారన్నారు. అలాగే టీడీడబ్ల్యూఓ చందన్కు డీడీగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారన్నారు. కాగా, డీడీ పోచం హయాంలో జరిగిన అన్ని నియామకాలను ఒక సీనియర్ అధికారి ద్వారా విచారించేందుకు నిర్ణయించినట్లు పీఓ తెలిపారు. -
గిరిజన విద్యావిధానంలో మార్పులు
- మూడో తరగతి నుంచి ఇంగ్లీష్లో విద్యాబోధన - ఆశ్రమ స్కూళ్ళన్నీ రెసిడెన్సియల్ స్కూళ్ళుగా మార్పు - ఈ ఏడాది 30 ఆశ్రమ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనకు శ్రీకారం - మూడో క్లాస్ నుంచి ప్రీమెట్రిక్ స్కాలర్షిప్స్ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సాక్షి, అమరావతి గిరిజన సంక్షేమ శాఖలో విద్యకు పెద్ద పీట వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు విద్యా విభాగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. గిరిజన విద్యార్థులకు మూడో తరగతి నుంచి డేస్కాలర్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ఇప్పటికే ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ళు రెసిడెన్సియల్ స్కూళ్ళుగా మారిపోయాయి. ఈ సంవత్సరం 30 ఆశ్రమ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రారంభించేందుకు నిర్ణయించారు. మూడు నుంచి ఇంగ్లీష్లో విద్యా బోధన ఈ సంవత్సరం మూడో తరగతి నుంచి విద్యార్థులకు ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు 30 ఆశ్రమ స్కూళ్లను శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో గుర్తించారు. ఈ స్కూళ్ళలో యువతీ యువకులైన క్వాలిఫైడ్ టీచర్లను నియమించారు. మంచి బోధన ఉంటే మాణిక్యాలుగా విద్యార్థులు తయారవుతారనే వాదన గిరిజన సంక్షేమ శాఖలో ఉంది. సుమారు 3500 మంది విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన జరగనుంది. రెసిడెన్సియల్ స్కూల్స్గా 179 హాస్టల్స్ గత సంవత్సరం వరకు సంక్షేమ హాస్టల్స్గా ఉన్న 179 హాస్టల్స్ను ఈ సంవత్సరం నుంచి 80 రెసిడెన్సియల్ స్కూళ్ళుగా మార్చారు. గతంలో ఉన్న హాస్టళ్ళ స్థానే రెసిడెన్సియల్ స్కూళ్ళుగా మార్చడంతో పిల్లలకు పెద్దగా ఇబ్బందులు ఏర్పడలేదు. మరీ తక్కువ విద్యార్థులు ఉన్న చోట్ల వేరే రెసిడెన్సియల్లోకి మెర్జ్ చేశారు. అందరికీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు హాస్టలర్స్, డేస్కాలర్లకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు 9,10వ తరగతుల విద్యార్థులకు మాత్రమే ప్రీమెట్రిక్ స్కాలర్షిప్స్ అందేవి. దీనిని 5వ తరగతి నుంచి అమలు చేయాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 5 నుంచి 8వ తరగతి వరకు మొత్తం లక్ష మంది విద్యార్థులకు రూ. 7 కోట్లు అవసమని వివరించింది. అలాగే మూడు నుంచి ఐదు వరకు కూడా పిల్లలను డేష్కార్స్గా పరిగణించి స్కాలర్షిప్స్ ఇవ్వాలని ప్రతిపాదనలు పంపింది. వీరు 1.04 లక్షల మంది ఉన్నారని, రూ.14 కోట్లు స్కాలర్షిప్స్కు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపించారు. గత సంవత్సరం 9, 10 తరగతుల్లో చదువుతున్న 31000 మంది విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ కింద ప్రభుత్వం రూ.11.79 కోట్లు ఇచ్చింది. విద్యాబోధనలో మార్పులు చేస్తున్నాం: డెరైక్టర్ పద్మ విద్యాబోధనలో భారీ మార్పులు తీసుకు వస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ డెరైక్టర్ డాక్టర్ ఎం పద్మ తెలిపారు. సోమవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. సంక్షేమ హాస్టల్స్ను రెసిడెన్సియల్ స్కూళ్ళుగా మార్చడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. మూడో తరగతి నుంచి ఇంగ్లీష్లో విద్యాబోధన సక్సెస్ అవుతుందని, తాను విశాఖ జిల్లాలోని మంప గిరిజన గ్రామం వెళితే అక్కడ విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఇది స్పష్టమైందన్నారు. -
కామన్సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలి
ఇంద్రవెల్లి : గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు కామన్ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని కామన్ సర్వీస్ రూల్స్ సాధన కమిటీ జిల్లా కన్వీనర్ ఆత్రం భుజంగ్రావ్ డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం గురువారం మండలంలోని పిట్టబొంగరం ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు కామన్ సర్వీస్ రూల్స్ వర్తింపజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జగదీశ్వర్ కమిటీ వేసిందని పేర్కొన్నారు. 1975 నుంచి విధులు నిర్వర్తిస్తున్నా 010 ప్రభుత్వ అకౌంట్లో వేతనాలు పొందుతున్న గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు కామన్ సర్వీస్ రూల్స్ వర్తింపజేయానికి కమిటీ వేయకపోవడం శోచనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేశ్వర్,రాథోడ్ ఉల్లష్,నాందేవ్,జీతేందర్,దుర్వ విఠల్,ఆర్ గోవింద్ తదితరులున్నారు. -
మెరుగైన విద్య అందించాలి
గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ లక్ష్మణ్ ఉట్నూర్ : గిరిజన సంక్షేమ ఆశ్రమ, వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పించాలని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ లక్ష్మణ్ ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐటీడీఏ పీవో కర్ణన్, డీడీటీడబ్ల్యూ, సహాయ సంక్షేమాధికారులతో గిరిజన విద్య, ఉపకార వేతనాలు, పోషకాహారం, ట్రైకార్, కాస్మొటిక్స్పై సమీక్షించారు. ఈ సందర్భంగా గిరిజన విద్యాభివృద్ధితోపాటు గిరిజన సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను ఐటీడీఏ పీవో కర్ణన్ వివరించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన కాస్మొటిక్స్తోపాటు పాఠశాలల్లో ల్యాబ్, లైబ్రరీలు ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం సిబ్బంది ఆశ్రమాల్లో ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సహాయ సంచాలకులకు వారి పరిధిలోని ఆశ్రమ పాఠశాలల పర్యవేక్షణకు వాహన సౌకర్యాలు అత్యవసరమని పీవో వివరించడంతో తగిన ప్రణాళికలు సిద్ధం చేసి పంపించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్ని ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు నెలాఖరు వరకు బెడ్షీట్స్తోపాటు, కాస్మొటిక్స్ పూర్తి స్థాయిలో అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో(జనరల్) నాగోరావ్, ఈఈటీడబ్ల్యూ రమేశ్, ఐకేపీ ఏపీడీ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏటీడబ్ల్యూవోలు కరువు
పూర్తిస్థాయిలో ఉన్నది ఇద్దరే.. హెచ్డబ్ల్యూవోలకే ఇన్చార్జి బాధ్యతలు ఎటూ న్యాయం చేయలేకపోతున్న ఇన్చార్జీలు గిరిజన విద్యపై పర్యవేక్షణ కరువు ఉట్నూర్ : గిరిజన విద్య కుంటుపడుతోంది. గిరిజన పాఠశాలలను నిరంతరం పర్యవేక్షించే ఏటీడబ్ల్యూవో (గిరిజన సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు) పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆశ్రమాలపై పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో ఆయా ఆశ్రమాల్లో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏటీడబ్ల్యూవో ఖాళీల స్థానాల్లో ఆశ్రమాల్లో హెచ్డబ్ల్యూవోలు (వార్డెన్లు)గా విధులు నిర్వహిస్తున్న వారికి ఇన్చార్జి ఏటీడబ్ల్యూవోలుగా బాధ్యతలు అప్పగించారు. వారు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్చార్జీలు వారివారి ఆశ్రమ పాఠశాలల్లో రెగ్యులర్ విధులు నిర్వహించలేక.. ఏటీడబ్ల్యూవో పరిధిలోని ఆశ్రమాలను పర్యవేక్షించలేక విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. 123 ఆశ్రమాలు.. 39వేలకు పైగా విద్యార్థులు.. ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ అధీనంలో జిల్లా వ్యాప్తంగా 123 ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిలో ప్రతి విద్యా సంవత్సరానికి దాదాపు 39 వేలకు పైగా గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ ఉచిత విద్యతోపాటు వసతి సౌకర్యాలను ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా కల్పిస్తోంది. అయితే.. గిరిజన విద్యను నిరంతరం పర్యవేక్షించడానికి ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన ఉపసంచాలకుల కార్యాలయంతో పాటు జిల్లావ్యాప్తంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బోథ్, జైనూర్, కాగజ్నగర్, మంచిర్యాల, నిర్మల్, ఉట్నూర్ ప్రాంతాల్లో ఏటీడబ్ల్యూవో కార్యాలయాలు ఏర్పాటు చేశారు. సహాయ సంచాలకులను నియమించి గిరిజన విద్య పటిష్టం కోసం ృషి చేస్తోంది. ఆశ్రమ పాఠశాలలను నిరంతరం ఏటీడబ్ల్యూవోలు పర్యవేక్షించడం.. గిరిజన విద్యాభిృద్ధిలో గిరిజన సంక్షేమ శాఖ అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు ఆయా పాఠశాలల్లో అమలు చేయించడం, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అని పరిశీలించడం, ఉపాధ్యాయుల బోధన తీరును పర్యవేక్షించడం చేపట్టి ఉన్నతాధికారులకు నివేదించాలి. ఒక విధంగా చెప్పాలంటే గిరిజన విద్యాభిృద్ధిలో వీరి పాత్ర కీలకం. ఇలాంటి విధులు నిర్వర్తించే ఏటీడబ్ల్యూవో పోస్టులు ఖాళీగా ఉండడంతో గిరిజన విద్య కుంటుపడుతోంది. ఎనిమిది మందికి ఆరుగురు ఇన్చార్జీలే.. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ఏటీడబ్ల్యూవో కార్యాలయాలు ఉన్నాయి. ఎనిమిది మంది పూర్తి స్థాయి ఏటీడబ్ల్యూవోలు విధులు నిర్వహించాల్సి ఉండగా.. ఇద్దరు మాత్రమే పూర్తిస్థాయి అధికారులు ఉన్నారు. ఆరుగురు ఇన్చార్జీలు కొనసాగుతున్నారు. వీరిలో ఐదుగురు ఆయా ఆశ్రమ పాఠశాలల్లో హెచ్డబ్ల్యూవోలు కాగా.. మరొకరు ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. ఇన్చార్జి ఏటీడబ్ల్యూవోలుగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ వారు దేనికీ న్యాయం చేయలేకపోతున్నారు. ప్రస్తుతం వీరు విధులు నిర్వర్తిస్తున్న ఆశ్రమాలతోపాటు ఆయా ఏటీడబ్ల్యూవో కార్యాలయాల పరిధిలోని ఆశ్రమాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ.. కేవలం పై అధికారులు నిర్వహించే సమీక్ష సమావేశాలకు హాజరు కావడం తప్ప నిరంతరం ఆశ్రమాలను పర్యవేక్షించడం లేదనే ప్రచారం జరుగుతోంది. అదీకాక వీరు హెచ్డబ్ల్యూవోలుగా విధులు నిర్వర్తించే ఆశ్రమాల్లోనూ వందల సంక్య విద్యార్థులు ఉన్నారు. వారి పర్యవేక్షణకు వీరు పరిమితమవుతున్నారు. ఫలితంగా మిగతా ఆశ్రమాల్లోని విద్యార్థుల పట్ల పర్యవేక్షణ లేకుండాపోయింది. ఈ ప్రభావం భోజనం మెనూపైనా చూపుతోంది. దీనికితోడు ఆశ్రమాల్లో పారిశుధ్యం, శానిటేషన్ లోపిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని గిరిజన నాయకులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులు ఆశ్రమాలకు ఎగనామం పెడుతున్నా అడిగేవారు లేరని అంటున్నారు. ఇప్పటికైనా ఏటీడబ్ల్యూవోల ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్చార్జి ఏటీడబ్ల్యూవోలు వీరే.. కేవలం కాగజ్నగర్, నిర్మల్ ప్రాంతాల్లోని ఏటీడబ్ల్యూవో కార్యాలయాలకు మాత్రమే పూర్తిస్థాయి ఏటీడబ్ల్యూవోలు ఉన్నారు. మిగిత ఆరు కార్యాలయాలకు ఇన్చార్జి ఏటీడబ్ల్యూవోలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్చార్జి ఏటీడబ్ల్యూవో అధికారులను పరిశీలిస్తే.. ఉట్నూర్ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్డబ్ల్యూవో సత్యవతికి ఉట్నూర్ ఏటీడబ్ల్యూవోగా ఇన్చార్జి బాధ్యతలు అప్పటించారు. ఈమె తాను నిరంతరం హెచ్డబ్ల్యూవోగా విధులు నిర్వహిస్తున్న ఆశ్రమంతోపాటు మొత్తం 25 ఆశ్రమ పాఠశాలలను పర్యవేక్షించాల్సి ఉంది. ఉట్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాల హెచ్డబ్ల్యూవోగా విధులు నిర్వహిస్తున్న చంద్రమెహన్కు ఆదిలాబాద్ ఏటీడబ్ల్యూవోగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అదీకాక కేబీ ప్రాంగణంలోని వికాసం పాఠశాల హెచ్డబ్ల్యూవోగా అదనపు బాధ్యతలు ఉన్నాయి. ఈయన హెచ్డబ్ల్యూవోగా విధులు నిర్వహిస్తున్న ఉట్నూర్ ప్రాంతం నుంచి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ ఏటీడబ్ల్యూవో కార్యాలయం పరిధిలోని 14 ఆశ్రమ పాఠశాలలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ బాలికల ఆశ్రమ పాఠశాలలో హెచ్డబ్ల్యూవోగా విధులు నిర్వహిస్తున్న సౌజన్యకు బోథ్ ఇన్చార్జి ఏటీడబ్ల్యూవోగా బాధ్యతలు అప్పగించారు. ఈమె తాను విధులు నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలతోపాటు జిల్లా కేంద్రం నుంచి దాదాపు 60 కిలోమిటర్లు ఉన్న బోథ్ ఏటీడబ్ల్యూవో కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది. ఆ పరిధిలోని 14 ఆశ్రమాలను పర్యవేక్షించాలి. వాంకిడి బాలికల ఆశ్రమ పాఠశాలలో హెచ్డబ్ల్యూవోగా విధులు నిర్వహిస్తున్న కనకదుర్గకు దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసిఫాబాద్ ఏటీడబ్ల్యూవోగా ఇన్చార్జి బాధ్యతలు అప్పటించారు. ఈమె తాను హెచ్డబ్ల్యూవోగా విధులు నిర్వహిస్తున్న ఆశ్రమంతోపాటు ఆసిఫాబాద్ కార్యాలయం పరిధిలోని 17 ఆశ్రమ పాఠశాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. లక్షెట్టిపేట బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్డబ్ల్యూవో నీలిమకు మంచిర్యాల ఏటీడబ్ల్యూవోగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈమె తన ఆశ్రమంతోపాటు 26 కిలోమీటర్లు ఉన్న మంచిర్యాల ఏటీడబ్ల్యూవో కార్యాలయం పరిధిలోని 16 ఆశ్రమ పాఠశాలల పర్యవేక్షణ చేయాల్సి ఉంది. జైనూర్ బాలికల అశ్రమ పాఠశాల ప్రదానోపాధ్యాయుడు భాస్కర్కు జైనూర్ ఏటీడబ్ల్యూవోగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దాదాపు 660 మంది విద్యార్థుల చదువులను పర్యవేక్షించే ప్రధానోపాధ్యాయుడికి ఏటీడబ్ల్యూవోగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో ఆశ్రమంలో విద్యార్థుల చదువులను పర్యవేక్షించే వారు కరువయ్యారు. తరచు జైనూర్ ఏటీడబ్ల్యూవో కార్యాలయం పరిధిలోని 17 ఆశ్రమ పాఠశాలల పర్యవేక్షణకు వెళ్తుండడంతో ఆశ్రమంలో విద్య గాడి తప్పుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదోన్నతులు కల్పిస్తే మేలు.. గత విద్యా సంవత్సరం నవంబర్ నెలలో గిరిజన సంక్షేమ శాఖలో చేపట్టిన పదోన్నతులతో కూడిన బదిలీలతో మంచిర్యాల ఏటీడబ్ల్యూవో విజయలక్ష్మి గిరిజన సంక్షేమ శాఖ కమిషన్ కార్యాలయంలో ప్రత్యేకాధికారిగా, బోథ్ ఏటీడబ్ల్యూవో చందన వరంగల్ డీటీడబ్ల్యూవోగా, ఆదిలాబాద్ ఏటీడబ్ల్యూవో సంధ్యారాణి మహబూబ్నగర్ డీటీడబ్ల్యూవోలుగా వెళ్లారు. ప్రభుత్వం డీపీసీ (డిపార్ట్మెంట్ ప్రమోషన్స్ కమిటీ)ని ఏర్పాటు చేసి గిరిజన సంక్షేమ శాఖలో బదిలీలు పదోన్నతులు చేపడుతోంది. జిల్లాలో గిరిజన విద్య గాడి తప్పకుండా ఉండాలంటే డీపీసీ వెంటనే గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న గ్రేడ్-1 హెచ్డబ్ల్యూవోలకు ఏటీడబ్ల్యూవోలుగా పదోన్నతులు కల్పించడం ద్వారా ఈ ఖాళీలు భర్తీ అవుతాయి. -
అసలేం జరుగుతోంది?
గిరిజన సంక్షేమ శాఖలో ఏం జరుగుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రూ.లక్షల్లో అవినీతి చోటు చేసుకుంటున్నా..అధికార పార్టీ కీలక నేత అండదండలతో కొందరు అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. నాలుగేళ్లుగా ఈ శాఖకు డీడీని పూర్తి స్థాయిలో నియమించే పరిస్థితి లేకపోవడంతో ఈ శాఖలో అవినీతికి మరింత ప్రోత్సహించినట్టయింది. దీంతో అధికారుల్లో కొందరు ఎవరిష్టం వచ్చినట్టు వారు వ్యవహరిస్తూ చివరకు విద్యార్థుల ఉపకార వేతనాల్లో భారీ అవినీతికి పాల్పడ్డారు. ఏసీబీ విచారణలో రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తుండడంతో ఈ శాఖపై విమర్శల జడివాన కురుస్తోంది. * గిరిజన సంక్షేమ శాఖలో... * నాలుగేళ్లుగా భర్తీ కాని డీడీ పోస్టు * ఇన్చార్జిలతోనే కాలయాపన! సీతంపేట : విద్యార్థుల ఉపకార వేతనాల కుంభకోణంలో పీకల్లోతు అవినీతిలో కూరుకుపోరుున గిరిజన సంక్షేమ శాఖలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఈ శాఖకు దిశ నిర్దేశం కరువైంది. గిరిజన సంక్షేమానికి సంబంధించి ప్రణాళికను రచించాల్సిన నాధుడు ఇక్కడ లేకపోవడం..ఇన్చార్జిలతోనే కాలం నెట్టుకొస్తుండడం పలు విమర్శలకు తావిస్తుంది. ఇదే అదునుగా అక్రమార్కులు చాప కింద నీరులా తమ పని కానిచ్చేస్తున్నారు. నాలుగేళ్లగా ఈ పోస్టులో గిరిజన ఉప సంచాలకుడు పోస్టు భర్తీ కాలేదంటే ఈ శాఖపై, గిరిజన సంక్షేమంపై ప్రభుత్వానికి, పాలకులకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధమవుతోంది. 2012లో గ్రూప్ వన్ అధికారి సర్వేశ్వరరెడ్డి బదిలీ అయిన తరువాత అందరూ ఇన్చార్జిలతోనే ఈ శాఖ కాలం నెట్టుకొస్తోంది. గతంలో ఏపీవోగా పని చేసిన నాగోరావు, విజయనగరం జిల్లా స్పెషల్ డిప్యూటి కలెక్టర్ శర్మ ఇన్చార్జిలుగా వ్యవహరించారు. వారి బదిలీలు తర్వాత ప్రస్తుతం ఐటీడీఏ డిప్యూటి డీఎంఅండ్హెచ్వో ఎంపీవీ నాయిక్ గిరిజన సంక్షేమ శాఖ డీడీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన ఇటు వైద్య, అటు విద్యా శాఖలను చూడాల్సి ఉంది. ఐటీడీఏ పరిధిలో 44 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, మూడు కేజీబీవీలు, మరో రెండు వసతిగృహాలు, అలాగే 18 పోస్ట్మెట్రిక్ వసతిగృహాలు నడుస్తున్నారుు. వీటిలో 18 వేల మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. ఆయా విద్యా సంస్థలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, ఎక్కడ ఎటువంటి అక్రమాలు జరగకుండా చూడడం, మెనూ సక్రమంగా అమలు అవుతుందా! లేదా! పర్యవేక్షించడం ప్రదాన విధి. గిరిపుత్రిక, గిరిజన విద్యోన్నతి, అంబేడ్కర్ వోవర్సీస్ వంటి పథకాలను అమలు చేయడం వంటివి చేయాల్సి ఉంది. ఇన్ని అమలు చేయాల్సిన చోట పూర్తి స్థాయి డీడీని నియమించకపోవడం గమనార్హం. ఇదీ పరిస్థితి... కింది స్థాయి ఏటీడబ్ల్యూవోల్లో ఇటీవల సీతంపేట ఏటీడబ్ల్యూవో సస్పెన్సన్కు గురయ్యారు. ఆయన కనుసన్నల్లోనే అక్రమాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటీడబ్ల్యూవోగా ఉంటూనే తనకు అనుకూలమైన వారిని కొన్ని పోస్ట్మెట్రిక్ వసతిగృహాలకు వార్డెన్లుగా నియమించుకుని వారిని బినామీలుగా పెట్టుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏమంటే జిల్లాకు చెందిన కీలక అధికార పార్టీ నేత ఆశీస్సులు కూడా ఉన్నాయనే అండతో లక్షల కుంభకోణాలకు పాల్పడినట్టు తెలిసింది. బీసీ ఉపకార వేతనాలను శ్రీకాకుళం గిరిజన సంక్షేమ శాఖ హెచ్డీ(హాన్రోరియం డెరైక్టర్) ఖాతాలోకి వేసినట్టు సమాచారం. గతంలో శ్రీకాకుళం వసతిగృహాల నిర్వహాణలో పలు అక్రమాలు చోటు చేసుకోవడంతో అప్పట్లో విచారణ జరిగింది. ఒక విద్యార్థిని మృతి చెందడంతో ఆ మృతి బయటకు పొక్కకుండా ఉండేందుకు కొంతమంది ఎస్ఎఫ్ఐ నాయకులకు డబ్బులు ఇస్తానని చెప్పడంతో వారు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం ఏకంగా గిరిజన సంక్షేమ శాఖకు చెందిన కమిషనర్ ఏటీడబ్ల్యూవోను సస్పెండ్ చేయడం జరిగింది. ఇన్ని జరుగుతున్నా గిరిజన సంక్షేమ శాఖకు చికిత్స చేసే నాధుడు కరువయ్యాడు. -
ఉపకారం స్కాంలో కొత్త కోణం?
శ్రీకాకుళం టౌన్/పాతబస్టాండ్ : ఉపకార వేతనాల స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. ఏసీబీ అధికారులు గిరిజన సంక్షేమ శాఖపై తాజాగా బుధవారం దృష్టి సారించారు. 2009-10 విద్యా సంవత్సరంలోనే ఈ స్కాంకు బీజం పడిందని ఏసీబీ అధికారులు నిగ్గు తేల్చారు. అప్పటి నుంచి గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ఎస్బీఐ ఖాతా నంబరు 11152305021లో జరిగిన లావాదేవీలన్నింటిని పరిశీలించాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ ఖాతా నుంచి జారీ అరుున చెక్కుల వ్యవహారంలో జరిపిన పరిశీలనలో 2015 అక్టోబరులో ఓ చెక్కు రూ.11.5లక్షలు పాలకొండ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు కళాశాల ప్రతినిధి పేరుతో ఉంది. పాలకొండ సమీపంలో ప్రమాదానికి గురైన కారులో లభించిన రూ.24 లక్షల చెక్కు అంపోలు అజయ్కుమార్ పేరిట 2015 డిసెంబర్ నెలలో జారీ అయినట్టు గుర్తించారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఆ ఏడాది డైట్ బిల్లులు జూన్ నుంచి ఫిబ్రవరి వరకు మంజూరు కాలేదు. మార్చిలో ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయడంలో ఖాతా నంబరు 11152305021 కు నిధులు జమయ్యాయి. డైట్ బిల్లులు లేని సమయంలో ఆ ఖాతాకు రూ.లక్షల మొత్తం ఎలా వచ్చింది? ఆ అకౌంట్ పేరిట చెక్కులు ఎలా ఇచ్చారన్న సందేహాలు నెలకొన్నాయి. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో లాగాన్ కావాల్సిన పాస్ వర్డ్ ప్రైవేటు కళాశాలల నిర్వాహకులకు చెప్పిందెవరన్న ప్రశ్నలు ముసురుకుంటున్నారుు. ఇందువల్లే లక్షల అక్రమాలకు తెర లేచిందని ఆ శాఖ అధికారులే గుసగుసలాడుతున్నారు. బీసీ సంక్షేమ శాఖలో జిల్లా అధికారిగా పని చేసిన రవిచంద్రను కలెక్టర్ ఇటీవల ప్రభుత్వానికి సరండర్ చేశారు. ఆ శాఖ పర్యవేక్షణ బాధ్యతలను సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ ధనుంజయరావుకు అప్పగించారు. ఆ శాఖ నిర్వహణను పర్యవేక్షించాల్సిన ద్వితీయ క్యాడర్ అధికారులు పనితీరుపైనా అనుమానాలు లేకపోలేదు. ఇదిలా ఉంటే ఈ శాఖకు చెందిన కంప్యూటర్లను ఇళ్ల వద్దే ఉంచుకుని కొందరు కార్యకలాపాలు సాగిస్తున్నట్టు అనుమానాలున్నారుు. ఇవన్నీ కలసి ఉపకార వేతనాలు పక్కదారి పట్టాయని విమర్శలొస్తున్నారుు. ఈ క్రమంలో ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే! బీసీ సంక్షేమ శాఖ జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్ శ్రీకాకుళం టౌన్/పాతబస్టాండ్ : జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో జూనియర్ సహాయకునిగా పని చేస్తున్న బి.బాలరాజును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం బుధవారం ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఇతనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేయాల్సిందిగా అప్పటి బీసీ సంక్షేమశాఖ అధికారి రవిచంద్రను కలెక్టర్ గతంలో ఆదేశించారు. ఆయన ఆదేశాలను ధిక్కరించినందుకు ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖాధికారిగా ఉన్న రవిచంద్రను ప్రభుత్వానికి సరెండర్ చేసిన కలెక్టర్ ఇన్చార్జి బాధ్యతలను సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ధనుంజయరావుకు అప్పగించారు. దీనికి తోడు సంక్షేమశాఖలను కుదిపేస్తున్న స్కాలర్షిప్పుల కుంభకోణంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో జూనియర్ అసిస్టెంట్గా ఉన్న బాలరాజును సస్పెండ్ చేశారు. -
ఎవరీ అజయ్కుమార్?
స్కాలర్షిప్పుల వ్యవహారంలో సూత్రధారి ఆయన కారులోనే దొరికిన రూ. 24 లక్షల చెక్కు బీసీ వెల్ఫేర్ పాస్వర్డ్ ట్యాంపరింగ్పై అనుమానాలు గిరిజన హాస్టళ్లలో ఉన్నట్టు చూపిస్తూ కొల్లగొట్టిన వైనం జిల్లాలో విద్యార్థుల ఉపకార వేతనాల్లో అక్రమాలకు సూత్రధారిగా అనుమానిస్తున్న అజయ్కుమార్ ఎవరు? ఆయనకు గిరిజన సంక్షేమ శాఖలో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి. ఇటీవల సస్పెన్షన్కు గురైన గిరిజన సంక్షేమ శాఖ అధికారి సదరు అజయ్కుమార్కు రూ.24 లక్షల చెక్కు ఎందుకిచ్చారు? ఆ చెక్కుతో ఉన్న బ్యాంకు ఖాతాలోకి బీసీ సంక్షేమ శాఖ నిధులు ఎలా వెళ్లాయి? ఈ వ్యహారంలో సూత్రధారులెవరు.. ఇదీ ప్రస్తుతం జిల్లా అధికారుల్లో మెదులుతున్న ప్రశ్న. శ్రీకాకుళం : జిల్లా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో చదువుతున్న విద్యార్థులు ఎస్టీ వసతి గృహల్లో ఉంటున్నట్టు చూపిస్తూ రూ.కోట్లు కొట్టేసిన వ్యవహారం బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. వసతి గృహంలో లేని విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనంగా ఏడాదికి రూ.3,500లు చెల్లిస్తోంది. అయితే ఈ విద్యార్థులను వసతి గృహల్లో ఉన్నట్టు చూపించి ఒక్కొక్కరికి పేరుతో రూ.10,500లు వరకు బీసీ సంక్షేమ శాఖ నుంచి గిరిజన సంక్షేమ శాఖ అధికారుల బ్యాంకు ఖాతాలకు బదలాయించారు. ఈ వ్యవహరంలో అజయ్కుమార్ అనే వ్యక్తి కీలక పాత్రపోషించడంతో గిరిజన సంక్షేమ శాఖకు చెందిన అధికారి రూ.24 లక్షలు ఆయన పేరుతో చెక్కు అందజేశాడు. గిరిజన సంక్షేమ శాఖ ఉప సంక్షేమాధికారిగా మెళియాపుట్టిలో పనిచేస్తున్న ఆ అధికారి సీతంపేటలో గత నెల 20న చెక్కును అజయ్ కుమార్కు ఇచ్చాడు. సీతంపేట నుంచి బయలుదేరిన అజయ్కుమార్ రోడ్డు ప్రమాదానికి గురవడంతో కారులో ఉన్న చెక్కును పాలకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది అన్న అంశంపై నిగ్గు తేల్చాలంటూ కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ఎస్పీని ఆదేశించారు. విచారణ మొదలు సీతంపేటలో సోమవారం మకాం వేసిన కలెక్టర్ ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు సిద్ధమయ్యారు. 2009-10 నుంచి 2015-16 విద్యా సంవత్సరాలకు గాను విద్యార్థుల పేరుతో బీసీ సంక్షేమ శాఖ నుంచి గిరిజన సంక్షేమ శాఖకు బదలాయించిన నిధులు, అందులో జరిగిన అక్రమాలు, 2013-14, 2014-15లో పాస్వర్టు ట్యాంపరింగ్ వ్యవహారాలపై శాఖల వారీగా విచారణ మొదలైయింది. గత ఏడాది డిసెంబర్లో గిరిజన సంక్షేమ శాఖ శ్రీకాకుళం వసతి గృహం వార్డెన్ ఝాన్సీరాణి అకౌంటుకు రూ.32.78 లక్షలు జమా అయితే, ఈనెల 12 వరకు సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయకుండా నిల్వ ఉంచడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించిన కలెక్టర్.. పాలకొండ డీఎస్పీ ఆదినారాయణను విచారణాధికారిగా నియమించారు. -
మంత్రి పేరుతో మామూళ్ల దందా
► వసూళ్ల పర్వానికి తెరలేపిన ► గిరిజన సంక్షేమ శాఖాధికారులు ► విద్యార్థికి రూ.25 చొప్పున ఇవ్వాలంటూ ఒత్తిళ్లు ► ఇదేమి గోలంటున్న వార్డెన్లు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు దోచుకుంటున్నారు.. తాము కూడా అందిన కాడికి దోచుకోవటమే నన్నట్టుగా ఉంది అధికారుల ధోరణి. అక్కడ, ఇక్కడ అనే తేడా లేదు. ధనార్జనే ధ్యేయంగా గిరిజన సంక్షేమశాఖాధికారులు మామూళ్ళ పర్వానికి తెరలేపారు. ఈ సంగతిని పక్కనబెడితే రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్బాబు పేరుతో దందాలు చేస్తున్నారని తెలుస్తోంది. మంత్రి కార్యక్రమాలకు ఖర్చులు అవుతున్నాయంటూ వసతిగృహంలో ఉండే ఒకో విద్యార్థిపై రూ.25 చొప్పున కేటాయించి తమకు అందజేయాలని సంబంధిత శాఖాధికారులు వార్డెన్లకు మౌఖికంగా ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. - గుంటూరు వెస్ట్ జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ప్రీమెట్రిక్ హాస్టళ్లు 31 ఉండగా అందులో 4021 మంది, పోస్టుమెట్రిక్ హాస్టళ్లు 5 ఉండగా 621 ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇవికాక ఆశ్రమ పాఠశాలలు 3 ఉన్నాయి. పోస్టుమెట్రిక్ విద్యార్థులకు నెలకు రూ.1050, 3 నుంచి 7వ తరగతి చదివే ప్రీమెట్రిక్ విద్యార్థులకు రూ.750, 8 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు రూ.850 ప్రభుత్వం చెల్లిస్తున్నది. ప్రీమెట్రిక్ హాస్టళ్లలో ఉండే బాలికలకు నెలకు కాస్మోటిక్ చార్జీల కింద రూ.65, బాలురకు రూ.57 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తున్నది. రికార్డుల్లో నమోదు చేసిన వారందరికీ నెలవారీ ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సదుపాయాలు సమకూరుతాయి. అయితే రికార్డులో నమోదు చేసిన విద్యార్థుల సంఖ్య, హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య భారీగా వ్యత్యాసం ఉంటున్నట్లు తెలిసింది. విద్యార్థుల సంఖ్యను అధికంగా చూపించి ప్రభుత్వం నుంచి అందే ప్రయోజనాలను వార్డెన్లు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు అనేక సందర్భాల్లో వెలుగులోకి వచ్చాయి. వీటిని ఆసరాగా చేసుకున్న జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారులు మంత్రి పర్యటన పేరుతో వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు సమాచారం. వసూల్రాజాల బాగోతం.. ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరిన నేపథ్యంలో ఆయా హాస్టళ్లకు చెందిన వార్డెన్లకు బిల్లులు ట్రెజరీల ద్వారా బిల్లులు మంజూరవుతున్నాయి. ఇదేఅదనుగా భావించిన జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారులు ఒక్కొక్క విద్యార్థిపై రూ.25 చొప్పున స్కాలర్షిప్ వచ్చినంతకాలం ప్రతి నెలా చెల్లించాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో చేసేదేమీ లేక దిక్కు తోచని స్థితిలో వార్డెన్లు కూడా అధికారులకు మామూళ్ళు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నారని సమాచారం. ఈ లెక్కన మంత్రి పేరు చెప్పి వసూలుచేస్తున్న పైకం రూ 12 లక్షలకు పైగా ఉంటుందని అధికారులే అంటున్నారు. అటువంటిదేమీ లేదు.. ఆయా ఆరోపణలపై జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి వి.నారాయణుడును వివరణ కోరగా అలాంటిది ఏమీలేదని అన్నారు. తనకు ఆ అవసరం లేదని చెప్పారు. కొంతమంది తనపై కావాలని ఆవిధంగా చెబుతున్నారని వివరించారు. అక్రమార్కులపై చర్యలేవీ? ఇటీవల గిరిజన హాస్టళ్లలో విధులు నిర్వహించే గ్రేడ్-2 వార్డెన్లకు గ్రేడ్-1 వార్డెన్లుగా నలుగురికి పదోన్నతులు కల్పించారు. ఇందులో భారీగా డబ్బులు చేతులు మారినట్లు తెలిసింది. ప్రమోషన్లు పొందినవారి నుంచి రూ. లక్షల్లో వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈపూరులోని హాస్టల్లో ఉంటున్న విద్యార్థులను ఎలుకలు కొరికిన సంఘటన, రేపల్లె వార్డెన్ విధులకు హాజరుకాకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న సంఘటనలు చోటుచేసుకున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక లక్షల్లో నగదు చేతులు మారినట్లు కార్యాలయ అధికారులే చర్చించుకోవడం గమనార్హం. -
పుస్తకాలు అందకుండానే పద్దులపై చర్చా?
శాసనసభలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఆగ్రహం ♦ అధికార పక్షంలో ఎవరైనా ‘జీనియస్’ ఉంటే మాట్లాడొచ్చు.. ♦ చర్చ కొనసాగిస్తే నిరసన తెలుపుతాన ని హెచ్చరిక ♦ అక్బరుద్దీన్కు మద్దతుగా నిలిచిన విపక్షాలు ♦ మిగతా వారికి తర్వాత సమయం ఇస్తామని స్పీకర్ వివరణ సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ఆదివారం పద్దులపై చర్చను ప్రారంభించడంపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. పద్దుల పుస్తకాలు అందించకుండానే చర్చను ఎలా మొదలు పెడతారని విపక్షాల నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకవేళ పుస్తకాలు ఇచ్చినా... ఒకరోజు గడువు కూడా ఇవ్వకుండా చర్చ సబబు కాదని స్పష్టం చేశారు. అందువల్ల పద్దులపై చర్చను వాయిదా వేయాలని కోరారు. ఆదివా రం శాసనసభలో ప్రశ్నోత్తరాలు ముగిశాక స్పీకర్ మధుసూదనాచారి పద్దులపై చర్చను మొదలుపెడుతున్నట్లు ప్రకటించారు. దీనిపై ఎంఐ ఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అభ్యంతరం తెలిపారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమానికి సంబంధించి పద్దులపై చర్చిస్తామన్నారు. వాటికి సంబంధించిన పద్దుల పుస్తకాలు కొద్దిసేపటి కిందే ఇచ్చారు. మిగతావి అందనే లేదు. డిమాండ్లపై కనీసం ఒకరోజు అయినా సమ యం ఇవ్వకుండా చర్చ ఎలా చేపడతారు..’’ అని ప్రశ్నించారు. పద్దుల పుస్తకాలు లేకుండా మాట్లాడేంత ‘జీనియస్’లు తమ పార్టీలో అ యితే లేరని, అధికార పక్షంలో అలా ఎవరైనా ఉంటే తమకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానిం చారు. ఈ సమయంలో బీజేఎల్పీ నేత లక్ష్మణ్, టీడీ ఎల్పీ నేత రేవంత్రెడ్డి, సీపీఎం సున్నం రాజయ్య, సీపీఐ రవీంద్రకుమార్, వైఎస్సార్సీపీ నేత పాయం వెంకటేశ్వర్లు తదితరులకు మాట్లాడే అవకాశం ఇచ్చినా... వారంతా అక్బరుద్దీన్ను సమర్థించారు. పద్దుల పుస్తకాలు అం దకుండా చర్చ కొనసాగించరాదని కోరారు. అయితే దీనిపై స్పందించిన స్పీకర్... విపక్షాల కు తర్వాత సమయం కేటాయిస్తామని, అధికా ర పక్షం నుంచి ఎవరైనా మాట్లాడితే చర్చ కొనసాగిద్దామంటూ గువ్వల బాలరాజుకు అవకాశమిచ్చారు. కానీ, అక్బరుద్దీన్ మరోమారు అభ్యంతరం తెలిపారు. ‘‘డిమాండ్ పుస్తకాలు ఇవ్వకుండా చర్చ మొదలుపెట్టడం దురదృష్టక రం. అలా ఎవరైనా మాట్లాడితే నిజంగా జీని యస్లే..’’ అని పేర్కొన్నారు. దీంతో మంత్రి కేటీఆర్ కల్పించుకుంటూ... డిమాండ్ పుస్తకా లు సిద్ధంకాలేదని, మరోసారి ఇలా జరగకుం డా చూస్తామని చెప్పారు. కావాలనుకుంటే విప క్ష సభ్యులు తర్వాతి రోజు మాట్లాడవచ్చని, ఇతరులకు అవకాశమిస్తే అభ్యం తర పెట్టొద్దని సూచించారు. అయినా అక్బరుద్దీన్ వెనక్కి తగ్గలేదు. నిబంధనలకు విరుద్ధంగా చర్చ కొనసాగిస్తామంటే సభ నుంచి వాకౌట్ చేసి నిరసన వ్యక్తం చేస్తామని స్పష్టం చేశారు. సకాలంలో పద్దుల పుస్తకాలు అందించని అధికారులపై చ ర్యలు తీసుకోవాలని కోరారు. పుస్తకాలు అం దించడంలో మరోసారి ఆలస్యం కాకుండా చూస్తామని ప్రకటిస్తూ స్పీకర్ సభకు టీ విరా మం ప్రకటించారు. అనంతరం పద్దులపై గువ్వల బాలరాజు చర్చను ప్రారంభించారు. గిరిజన శాఖ పద్దు పుస్తకాలపై గందరగోళం సాక్షి, హైదరాబాద్: పద్దులకు సంబంధించి అసెంబ్లీకి సమర్పించే పుస్తకాల విషయంలో నెలకొ న్న గందరగోళ పరిస్థితులు ఆఖరికి గిరిజన సంక్షేమ శాఖపై చర్చను వాయిదా వేసేందుకు కారణమయ్యాయి. పద్దులకు సంబంధించి శాఖల వారీగా అధికారులు పుస్తకాలను ముద్రించి సభ ముందుంచుతారు. బడ్జెట్ సమయంలో ఆర్థిక శాఖకు సంబంధించి ప్రకటనలు, కేటాయింపులతో కూడిన వివరాలను ఒక పుస్తకంగా, బడ్జెట్లో కేటాయించిన నిధులు, సవరణ బడ్జెట్ వివరాలు మరో పుస్తకంలో ముద్రించడం ఆనవాయితీ. రెండు పుస్తకాలు ముద్రించడం వల్ల ఖర్చు పెరుగుతోందని పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక శాఖ ఓ సూచన చేసింది. అన్ని వివరాలను ఒకే పుస్తకంగా ముద్రించాలని సూచించింది. దీన్ని చాలా శాఖలు పట్టించుకోలేదు. కానీ, గిరిజన సంక్షేమ శాఖ మాత్రం ఒకే పుస్తకంగా ముద్రించింది. ఆదివారం అన్ని శాఖల పద్దుల పుస్తకాల ను సభ ముందుంచారు. మిగిలిన శాఖల పుస్తకాలు రెండుగా ఉంటే, గిరిజన సంక్షేమ శాఖ పుస్తకం ఒకటే ఉంది. దీంతో రెండో పుస్తకం అందలేదంటూ ఎమ్మెల్యేలు గగ్గోలు పెట్టారు. సమాచారమంతా ఒకే పుస్తకంలో ఉందని విషయం అధికారుల నుంచి అందకపోవడంతో పొరపాటు జరిగిందన్న ఉద్దేశంతో ఆ శాఖపై చర్చను సోమవారానికి వాయిదావేశారు. విషయం తెలిసిన తర్వాత కూడా రెండో పుస్తకం కావాల్సిందేనని పట్టుపట్టారు. -
మంత్రి రావెలను ఆంధ్రాలో తిరగనివ్వం
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నం ధర్మారావు గుంటూరు వెస్ట్ : రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్బాబును ఆంధ్రాలోని 13 జిల్లాల్లో ఎక్కడా తిరగకుండా అడ్డుకుంటామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నం ధర్మారావు మాదిగ తెలిపారు. బ్రాడీపేటలోని ఓ హోటల్లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగ సహకారంతోనే కిశోర్బాబు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం వెనుక ఎమ్మార్పీఎస్ సహకారం ఉందన్న విషయాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. భూకబ్జాదారులు, దళారులను ప్రోత్సహిస్తున్న మంత్రి రావెల నేడు కృష్ణమాదిగను అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏటుకూరి విజయ్కుమార్, నాయకులు వర్ల అగస్టీన్, కూచిపూడి సుందర్బాబు, వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గాలిముట్టి కిరణ్ పాల్గొన్నారు. -
సగానికి పైగా బడి బయటే
ఆందోళన కలిగిస్తున్న ఎస్టీ విద్యార్థుల డ్రాపవుట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిపుత్రుల డ్రాపవుట్ శాతం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వపరంగా ఎన్నో చర్యలను తీసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నా పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. బడి మానేస్తున్న పిల్లల సంఖ్య, ఇప్పటివరకు పాఠశాల అంటే ఏంటో తెలియని వారి సంఖ్య కూడా ఏటా పెరిగిపోతోంది. షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్లు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు రాష్ట్రంలోని 10 జిల్లాల్లో అసలు బడుల్లో చేరని, పాఠశాలలు మానేస్తున్న ఎస్టీ పిల్లలకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ముగింపునకు వస్తున్నా, ఇంకా 50 శాతం కంటే అధికంగానే పిల్లలు స్కూళ్ల బయటే ఉన్నారు. బడికి దూర మైన (డ్రాపవుట్స్), అసలు స్కూళ్లలో చేరని (నెవర్ ఎన్రోల్డ్ చిల్డ్రన్) వారు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14,285 మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. వారిలో గత డిసెంబర్ నాటికి 6,982 మంది బాలబాలికలను పాఠశాలల్లో చేర్పించగలిగారు. ఇంకా 7 వేల మందికిపైగా స్కూళ్లలో చేర్పించాల్సి ఉందని తేలింది. గిరిజనుల్లో అక్షరాస్యతా శాతాన్ని పెంచేందుకు, గిరిజనుల పిల్లలను ప్రీమెట్రిక్ హాస్టళ్లు, స్కూళ్లలో చేర్పించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, జిల్లా ఎస్టీ సంక్షేమ అధికారులతో గత బుధవారం జరిపిన సమీక్షలో మంత్రి అజ్మీరా చందూలాల్ గిరిపుత్రుల డ్రాపవుట్స్ పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది వచ్చే వేసవి సెలవుల్లో సమీప తండాలు, గ్రామపంచాయతీల్లో పర్యటించి డ్రాపవుట్ల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్కూల్ డ్రాపవుట్స్కు సంబంధించి ఎస్టీ శాఖ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం.. పది జిల్లాల్లోని మొత్తం 12,129 గిరిజన ఆవాస ప్రాంతాల్లో బడికి వెళ్లని పిల్లలు మొత్తం 14,285 మంది కాగా.. వారిలో బాలలు 6,495 మంది, బాలికలు 6,730 మంది ఉన్నారు. -
సేవాలాల్ మహరాజ్ అందరికీ ఆరాధ్యనీయుడు
గురు సేవాలాల్ మహరాజ్ తండా వాసులు, లంబాడా లకే కాకుండా ప్రజలందరికీ ఆరాధ్యనీయుడని గిరిజనసంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. లంబాడలకు జాతిపిత అయిన సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలకు సంబంధించి ఇంకా ప్రచారం, ప్రాధాన్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తొలి ఏడాది నుంచే ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు జిల్లాకు రూ.పదిలక్షల చొప్పున విడుదల చేస్తోందన్నారు. ఈ ఏడాది కూడా త్వరలోనే నిధుల విడుదల ఉంటుందన్నారు. ఫిబ్రవరి 15న సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకునిగురువారం మంత్రి చందూలాల్ నివాసంలో సంత్సేవాలాల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాల పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. కర్ణాటక, రాయలసీమ, తెలంగాణలలో విస్తృతంగా పర్యటించి,సుస్థిర సమాజం లేక చెట్టుకొకరు, పుట్టకొకరుగా సంచారజీవనం గడుపుతున్న లంబాడ లను ఏకతాటిపైకి తెచ్చిన మహనీయుడు సేవాలాల్ మహరాజ్ అని కొనియాడారు. గ్రామ సమీప ప్రాంతాల్లో తండాలుగా నివాసమేర్పరచుకుని సుస్థిర జీవనం గడపాలని సేవాలాల్ గురూజీ ఉద్భోదించారన్నారు. తన సొంత ఖర్చుతో సేవాలాల్ ఆలయాన్ని నిర్మించి ఏటా జయంతి వేడుకలను నిర్వహిస్తున్న ఇస్లావత్ నామానాయక్ను మంత్రి అభినందించారు. ప్రభుత్వపరంగా అవసరమైన సహకారం ఉంటుందని చెప్పారు. -
త్వరలో ‘నిర్మల్’ సబ్బులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కార్యక్రమాలు విస్తరించి, పటిష్టం చేసేందుకు ఆయా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అయితే ఉమ్మడి జీసీసీ విభజనలో జాప్యం జరుగుతుండటంతో ఈ ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలు, ఇక్కడి అటవీ ఫలసాయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదని, అందుకే జీసీసీని బలోపేతం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఒకటి మహబూబ్నగర్ జిల్లా మన్ననూర్ లేదా నల్లగొండలో, రెండోది మెదక్ జిల్లా నరసాపూర్లో ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా పరిగి, మెదక్ జిల్లా నరసాపూర్, నల్లగొండ జిల్లా చందంపేట, మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్లో 4 కొత్త సొసైటీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. గమ్కరాయ (తప్సిజిగురు), నక్స్వోమికా, మొహ్వా, పొంగుమా, వేప, చింతపండు తదితర అటవీ ఉత్పత్తుల కోసం అడవుల్లో మొక్కల పెంపకం వంటి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. 8 కొత్త ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు..! రాష్ర్టంలోని గిరిజన ప్రాంతాల్లో సేకరించిన అటవీ ఉత్పత్తుల నుంచి ఆయా వస్తువుల తయారీ, శుద్ధి చేసే కేంద్రాలు లేవు. ఇందుకోసం 8 తయారీ, శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. వరంగల్ జిల్లా ములుగులో జిగురు శుద్ధి యూనిట్, వరంగల్ జిల్లా ఏటూరునాగారంలో పసుపు పొడి కేంద్రం, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో సబ్బుల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో సోయా ప్రాసెసింగ్ యూనిట్, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో తేనె శుద్ధి కేంద్రం, మహబూబ్నగర్ జిల్లా కొండనాగులలో షాంపూ తయారీ కేంద్రం, మహబూబ్నగర్ జిల్లా కొండనాగులలో చింతపండు ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పాలని భావిస్తోంది. గిరిజన సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు నాణ్యమైన ఉత్పత్తులు పంపిణీ చేసేందుకు వీలుగాహైదరాబాద్లో వివిధ ఉత్పత్తుల నిలువకు కోల్డ్స్టోరేజీ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను గతంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ విడుదల చేశారు. -
గిరిజన ‘డ్రాపవుట్స్’ నివారణ అంతంతే!
♦ పూర్తిస్థాయిలో ఫలించని సర్కారు ప్రయత్నాలు ♦ మొత్తం 14,286 మంది చిన్నారుల్లో స్కూళ్లలో చేరింది 8,126 మందే సాక్షి, హైదరాబాద్: బడికి దూరమైన, బడుల్లోనే చేరని గిరిజన పిల్లలను స్కూళ్లలో చేర్చాలన్న సర్కారు ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించడం లేదు. రాష్ట్రస్థాయి నుంచి ఉన్నతాధికారులు డ్రాపవుట్స్ పిల్లలను స్కూళ్లలో చేర్పిం చేందుకు కిందిస్థాయి అధికారులను ఆదేశిస్తున్నా వారిని బడుల్లో చేర్చే ప్రయత్నాలు పూర్తిగా సఫలం కావడం లేదు. జిల్లాస్థాయిల్లోని అధికారులు, ఇతర శాఖల సహకారంతో ఈ పిల్లలను చేర్పించేందుకు ప్రత్యేకశ్రద్ధ, చొరవ తీసుకుంటే తప్ప ఈ పిల్లలంతా బడుల్లో చేరే అవకాశాలు కనిపించడం లేదు. గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డెరైక్టర్లు, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం 12,100 గిరిజన ఆవాసాల్లో 14,286 మంది చిన్నారులు స్కూల్ డ్రాపవుట్లుగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారిని స్కూళ్లలో చేర్పించడంలో మాత్రం జిల్లాల్లోని గిరిజన సంక్షేమ అధికారులు విజయం సాధిం చలేకపోతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,126 మంది చిన్నారులను అధికారులు సూళ్లలో చేర్చగా మరో 6,160 మందిని బడుల్లో చేర్పించేందుకు అధికారులు చొరవ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలవారీగా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 4,495 మంది డ్రాపవుట్ల చిన్నారులకుగాను 2,222 మంది పిల్లలను స్కూళ్లలో చేర్చారు. రంగారెడ్డి జిల్లాలో 2,345 పిల్లలకుగాను కేవలం 262 మందిని స్కూళ్లలో చేర్చగా, 2,083 పిల్లలను ఇంకా చేర్పించాల్సి ఉంది. హైదరాబాద్లో 357 మందికిగాను కేవలం 33 మందిని చేర్పించగా, 324 మందిని ఇంకా చేర్పించలేదు. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమశాఖ తాజాగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వచ్చే శని వారం నాటికి మిగిలిన 6,160 పిల్లలను స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. -
‘అక్షరాలా’ నిర్లక్ష్యం
గుంటూరు ఎడ్యుకేషన్ : గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు దూరమైన పేద కుటుంబాల విద్యార్థినులను చేరదీసి వారికి ఉచిత వసతితో కూడిన విద్యను అందించేందుకు ఉద్దేశించిన కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. జిల్లాలో 24 కేజీబీవీలు ఉండగా అన్నింట్లోనూ కాంట్రాక్ట్ ఉపాధ్యాయినులే పనిచేస్తున్నారు. ఊళ్లకు దూరంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న కేజీబీవీల్లో విద్యార్థినులకు భద్రత కరువైంది. గ్రామీణ ప్రాంతాల్లో బాలికా అక్షరాస్యతను పెంపొందించేందుకు ఉద్దేశించిన కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు ఒకనాడు దేశంలో విలువలతో కూడిన విద్యాలయాలుగా విరాజిల్లాయి. ఎంతో ఘన చరిత్ర కలిగిన కేజీబీవీలు ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ప్రాభవం కోల్పోతున్నాయి. పేద కుటుంబాల్లోని విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించి సమాజంలో విద్యావంతులుగా నిలపాల్సిన కేజీబీవీలు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో నడుస్తున్నాయి. కాంట్రాక్ట్ ఉపాధ్యాయినులే దిక్కు జిల్లాలో 24 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో సర్వశిక్షా అభియాన్ యాజమాన్యంలో ఆరు, సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహణలో ఆరు, ఏపీ రెసిడెన్షియల్ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో ఎనిమిది, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో మరో నాలుగు ఉన్నాయి. వీటిలో 4,904 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. ఒక్కో కేజీబీవీలో 200 మంది విద్యార్థినులున్నారు. పులిచింతల నిర్వాసితుల గ్రామాల్లో నుంచి 104 మంది విద్యార్థినులను సమీప మండలాల్లోని కేజీబీవీల్లో చేర్పించారు. ఒక్కో కేజీబీవీల్లో ప్రత్యేకాధికారితో పాటు ఆరుగురు కాంట్రాక్ట్ రెసిడెన్స్ టీచర్లు పనిచేస్తున్నారు. వీరితో పాటు ఔట్ సోర్సింగ్ పద్ధతిపై మగ్గురు వంటపని వారు, ఇద్దరు వాచ్మెన్లు, అటెండర్, ఒక ఏఎన్ఎం పని చేస్తున్నారు. మధ్యలో బడి మానేసిన, అనాథలు, తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన విద్యార్థినులకు కేజీబీవీల్లో ఉచిత విద్య అందించాలని నిబంధనలు స్పష్టం చేస్తుండగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులను అర్ధాంతరంగా పాఠశాల మాన్పించి వేసి కేజీబీవీల్లో చేర్పిస్తున్నారు. దీంతో అసలు లక్ష్యం కాస్తా నీరుకారుతోంది. విద్యార్థినుల భద్రతకు సంబంధించి పటిష్టమైన విధానం లేకపోవడంతో కేజీబీవీల్లోకి రాత్రి వేళ ఆగంతుకులు ప్రవేశించిన సంఘటనలు ఉన్నాయి. కేజీబీవీలకు ప్రహరీ, పగలు, రాత్రి కాపలాదారులు ఉన్నప్పటికీ ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కరువై కాలం నెట్టుకొస్తున్నారు. రోజులో 24 గంటలు కేజీబీవీల్లో ఉంటున్న విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించడంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయినులు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. ఉద్యోగ భద్రత లేకపోవడం, వ్యక్తిగత సమస్యలతో మహిళా ఉపాధ్యాయినులు విధి నిర్వహణలో అభద్రతా భావానికి గురవుతున్నారు. ఊళ్లకు దూరంగా మారుమూల ప్రాంతాల్లో... ఊరికి దూరంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న కేజీబీవీలకు చేరుకునేందుకు సరైన రవాణా సదుపాయాలు లేక ఉపాధ్యాయినులు, విద్యార్థులను చూసేం దుకు వెళ్లే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా రాత్రి వేళల్లో ఆగంతుకులు చొరబడితే రక్షణ కల్పించే వ్యవస్థ లేకపోవడంతోపాటు, పిలిస్తే పలికే నాథుడు సైతం కరువయ్యారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయినులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో నెట్టుకొస్తున్న కేజీబీవీల్లో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు శాశ్వత రీతిలో నియామకాలు చేపట్టాల్సిన అవసరముంది. -
గిరిజనుల దరికి ప్రభుత్వ పథకాలు
జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి నారాయణుడు గుంటూరు వెస్ట్ : ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను గిరిజనులకు అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి(డీటీడబ్ల్యుఓ) వి.నారాయణుడు తె లిపారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారిగా ఇటీవల నూతనంగా బాధ్యత లు స్వీకరించిన ఆయన జిల్లాలో గిరి జనుల సంక్షేమానికి, గిరిజన హాస్టళ్లల్లో ఉంటున్న విద్యార్థుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. జి ల్లాలో ఉన్న 31గిరిజన హాస్టళ్లు, 3 ఆశ్ర మ పాఠశాలలు ఉన్నాయని వాటిలో ఉంటున్న విద్యార్థినీ, విద్యార్థులకు అ వసరమైన అన్ని సౌకర్యాలను కల్పిం చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూస్తానని, హాస్టళ్లలో మెన్ సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వసతిగృహాలలో ఉం టున్న విద్యార్థులు మంచిఫలితాలు సా ధించేలా ప్రణాళికలు రూపొందించి, అ మలుచేస్తున్నట్టు వివరించారు. ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి, సంక్షేమానికి ఎన్టీఆర్ విద్యాజ్యోతి, అంబేద్కర్ ఓవర్సీస్, గిరిపుత్రిక కల్యాణ పథకం తదితర పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ పథకాల అమలుపై విసృ్తత ప్రచారం నిర్వహించి, అర్హులైన వారికి అందజేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని నారాయుణుడు వివరించారు. అనంతపురం జిల్లాలోని రొద్దం మండలం తిమ్మాపురానికి చెందిన ఆయన 1991లో తొలిసారి హైదరాబాద్లోని ట్రైబల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో రీసెర్చ్ అసిస్టెంట్గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. 20 ఏళ్ల సర్వీస్ అనంతరం 2011 ఆగస్టులో నె ల్లూరు జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారిగా (డీటీడ బ్ల్యూఓ)గా పదోన్నతిపై నియమితులయ్యారు. ప్రస్తుతం నెల్లూరు నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చారు. -
గిరిజన గురుకులాల్లో ‘గెస్ట్’గోల
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలికల గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఎట్టి పరిస్థితుల్లో పురుషులు ఫ్యాకల్టీగా ఉండవద్దని, ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని గురుకుల కార్యదర్శి ప్రవీణ్కుమార్ ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదమవుతున్నాయి. బాలికల గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి దళారులు ఓవైపు వేలాది రూపాయలు వసూలు చేస్తుండగా, మరోవైపు గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా ఏళ్ల తరబడి పనిచేస్తున్న గిరిజన నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అసలేం జరుగుతోంది? రాష్ట్రంలోని పది జిల్లాల్లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 33 గురుకుల పాఠశాలలు, 29 కళాశాలలు నడుస్తున్నాయి. పీజీతోపాటు, ట్రైనింగ్ పూర్తి చేసిన నిరుద్యోగులు అనేకమంది ఖాళీగా ఉన్నపోస్టుల్లో పనిచేస్తున్నారు. వీరికి వేతనం రూపంలో రూ.5 వేల వరకు వస్తోంది. ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 657 మంది పనిచేస్తుండగా, అందులో 353 మంది పురుషులు, 304 మంది మహిళలు ఉన్నారు. అయితే, గురుకులాల కార్యదర్శిగా డాక్టర్. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ జారీచేసిన జీవోలో స్పష్టత లేకపోవడం వివాదానికి దారితీస్తోంది. బాలికల గురుకులాల్లో మహిళా ఫ్యాకల్టీని నియమించాల్సి వస్తే అక్కడ పనిచేసే పురుష ఫ్యాకల్టీని మరో గురుకులానికి బదిలీ చేయాలని నిబంధన ఉత్తర్వుల్లో చెప్పి ఉంటే పరస్పర బదిలీలు జరిగేవి. కానీ, అలాంటి స్పష్టత లేకపోవడంతో ఇప్పుడు పురుష ఫ్యాకల్టీ రోడ్డున పడాల్సిన దుస్థితి ఎదురవుతోంది. వాస్తవానికి గెస్ట్ ఫ్యాకల్టీని ఎప్పుడైనా తీసేసే అధికారం సంస్థకు ఉంది. అయితే, ఏళ్ల తరబడి తాము గురుకులాల్లో పనిచేస్తుండడంతో ఎప్పటికయినా ఉద్యోగ భద్రత కలగకపోతుందా అనే ఆశతో గిరిజన నిరుద్యోగ యువత ఉంది. మహిళా ఫ్యాకల్టీని బాలికల గురుకులాల్లో నియమించడానికి తాము వ్యతిరేకం కాదని పురుష ఫ్యాకల్టీ అంటున్నారు. కానీ, ఒక బాలికల గురుకులంలో పురుష ఫ్యాకల్టీ స్థానంలో మహిళను తీసుకుంటే ఆమె పనిచేస్తున్న స్థానానికి తమను పంపాలని వారు కోరుతున్నారు. దీనికి తోడు, ఈ విధంగా కొత్త వారిని తీసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో దళారులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. గురుకులాల్లో అధ్యాపక పోస్టులు ఇప్పిస్తామని చెప్పి రూ.50 వేల వరకు తీసుకుని పోస్టింగ్లు ఇప్పిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. -
కౌన్సెలింగ్లో గందరగోళం
జీవో 3పై రగిలిన వివాదం రెండు వర్గాలుగా ఉపాధ్యాయులు వేర్వేరుగా ఆందోళనలు టవరెక్కిన ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కౌన్సెలింగ్ తాత్కాలిక వాయిదా ఉట్నూర్ : ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కౌన్సెలింగ్లో జీవో నంబర్ 3 వివాదం రాజుకుంది. దీంతో ఉపాధ్యాయులంతా రెండు వర్గాలుగా విడిపోయారు. చివరికి శుక్రవారం జరగాల్సిన పీజీ హెచ్ఎంల పదోన్నతుల కౌన్సెలింగ్ను ఐటీడీఏ పీవో కర్ణన్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా వాయిదా వేశారు. వివరాలివి.. ప్రభుత్వం ఆదేశాలతో ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు పీజీ హెచ్ఎంల బదిలీలు నిర్వహించగా.. రెండో రోజు శుక్రవారం స్కూల్ అసిస్టెంట్లకు పీజీ హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించేందుకు కౌన్సెలింగ్ చేపట్టింది. అయితే.. కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనక యాదవ్రావ్ 342 ఆర్టికల్ జీవో 3 ప్రకారం 1950కి ముందు నుంచి ఉన్న షెడ్యూల్ తెగలకు చెందిన వారికే పదోన్నతులు కల్పించాలని డి మాండ్ చేస్తూ మండలంలోని లక్కారం గ్రామం లో సెల్ టవర్ ఎక్కాడు. దీంతో ఐటీడీఏ ఏపీవో జనరల్ నాగోరావ్, డీడీటీడబ్ల్యూ సావిత్రి, ఆర్డీవో ఐలయ్య అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ ఉద్యోగ, ఉపాధ్యాయ, ఇతర సంఘాల నాయకులు మాట్లాడుతూ.. 342 ఆర్టీకల్ ప్రకారం పదోన్నతులు కల్పించాలని, 1976లో ఎస్టీల్లో చేర్చిన వర్గాలకు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 1976లో కొన్ని వర్గాలను ఎస్టీల్లో చేర్చినా.. కేంద్ర ప్రభుత్వం దానికి చట్టబద్ధత కల్పించలేదని ఆరోపించారు. జిల్లాలో 2000 సంవత్సరం నుంచి వారికే 92 శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయని, తమకు 8 శాతం మాత్రమే దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో డీడీటీడబ్ల్యూ సావిత్రి స్పందిస్తూ.. ప్రభుత్వం నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ వివాదాన్ని కలెక్టర్, ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఐటీడీఏ పీవో ఆదేశాలతో కౌన్సెలింగ్ను తాత్కాలికంగా వాయితా వేస్తున్నట్లు ప్రకటించారు. కౌన్సెలింగ్ వాయిదా వేయడం తగదు.. ఇదిలా ఉంటే.. ఉపాధ్యాయ పదోన్నతి కౌన్సెలింగ్ను అధికారులు తాత్కాలికంగా వాయిదా వేయడం తగదని కౌన్సెలింగ్కు హాజరైన ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. కేబీ ప్రాంగణంలో ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధం లేని వారు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేస్తే అధికారులు కౌన్సెలింగ్ వాయిదా వేయడం సరికాదన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చామని, అధికారులు వెంటనే కౌన్సెలింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. 1976లో ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చిన వర్గాలన్నింటికీ గిరిజన చట్టాలన్నీ వర్తిస్తాయని చెప్పారు. సాయంత్రం వరకు ఆందోళన చేసిన వారు చివరికి విరమించి వెళ్లిపోయారు. -
గిరిజన సంక్షేమ శాఖలో..కామాటీ కథ!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా గిరిజన సంక్షేమశాఖలో దళారుల దందా సాగుతోంది. గిరిజన కార్మికుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని చెప్పి కొందరు లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. దశాబ్దాలుగా దినసరి కార్మికులుగా పనిచేస్తున్న కామాటీలను రెగ్యులైరె జ్ చేసి టైంస్కేల్ కింద వేతనాలు ఇప్పించేందుకుగాను పేద గిరిజనుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఈ శాఖలో అనేక రకాల కార్యక్రమాల కోసం పలువురు దళారులుండగా, ఈసారి ఈ పనిని ఓ వ్యాపారికి అప్పజెప్పినట్టు తెలుస్తోంది. జిల్లా గిరిజన సంక్షేమశాఖలో ‘పెద్దన్న’ పాత్ర పోషిస్తోన్న ఈ వ్యాపారి మరికొందరు దళారుల సాయంతో ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది. ఈయన తనకున్న పలుకుబడితో, కమిషనరేట్లో ఉన్న బడాబాబుల సాన్నిహిత్యంతో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కో పోస్టుకు రూ. 2లక్షల నుంచి రూ.4లక్షల వరకు గుంజుతున్నాడని గిరిజన సంక్షేమ శాఖలో గుప్పుమంటోంది. అయినా అధికారులు మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు కథ ఇది.. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో జిల్లా వ్యాప్తంగా ఉన్న హాస్టళ్లలో 66 మంది దశాబ్దాలుగా కామాటీలుగా పనిచేస్తున్నారు. వీరు 1980 సంవత్సరం తర్వాత పలుదఫాలుగా హాస్టళ్లలో నియమితులయ్యారు. హాస్టళ్లను శుభ్రంగా ఉంచడం, వంట సామాన్లు కడగడం, వంటమనిషి రానప్పుడు పిల్లలకు వంట చేసి పెట్టడం వీరి విధి దాదాపు 30 ఏళ్లకు పైగా పనిచేస్తున్న వీరికి వేతనం ఇంకా దినసరిగానే లెక్కించి చెల్లిస్తున్నారు. హాస్టళ్ల వార్డెన్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వీరికి నెలకు రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు వేతనం వస్తోంది. హాస్టళ్లలో గొడ్డుచాకిరీ చేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని ఈ కామాటీలు పలుమార్లు గిరిజన సంక్షేమ శాఖకు నెత్తీనోరు బాదుకుని చె ప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. నిబంధనల సాకుతో హైదరాబాద్లోని కమిషనర్ కార్యాలయం నుంచి వీరికి ఎప్పుడూ చుక్కెదురయ్యేది. అయితే, ప్రభుత్వంతో విసిగిపోయిన వీరిలో కొందరు ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ)ని ఆశ్రయించారు. వీరి వాదనలతో ఏకీభవించిన ట్రిబ్యునల్ వీరందరినీ రెగ్యులరైజ్ చేయకపోయినా కనీసం టైంస్కేల్ కింద ఉత్తర్వులు ఇవ్వాలని తీర్పునిచ్చింది. ఆ తీర్పు ఆధారంగా గతంలో 17 మందికి టైంస్కేల్ కింద వేతనాలిచ్చేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో మళ్లీ మరో 49 మంది అదే ట్రిబ్యునల్కు వెళ్లారు. వీరి వాదనలను కూడా సమంజసంగానే పరిగణించిన ట్రిబ్యునల్ వీరికి కూడా టైంస్కేల్ వేతనాలు వర్తింపజేయాలని ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వుల మేరకు సదరు కామాటీలు ఎప్పుడు నియమితులయ్యారు... వీరి వయస్సు ఎంత ఉంటుంది.. ఏ పద్ధతిలో వేతనాలు చెల్లిస్తున్నారు.. అనే విషయాలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు హాస్టల్ వార్డెన్లకు గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఉత్తర్వులు వెళ్లడంతో వార్డెన్లు ఈ పనిలో నిమగ్నమయ్యారు. ‘కథ’ మొదలైంది ఇలా... ఈ ఉత్తర్వులు వచ్చిందే తడవుగా గిరిజన సంక్షేమ శాఖలో అక్రమ వ్యాపారం మొదలయింది. నిరక్షరాస్యులైన గిరిజనులు హైదరాబాద్ వరకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకునే పరిస్థితి ఉండదు కనుక, అక్కడ, ఇక్కడా ముట్టజెప్పాలనే సాకుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని నల్లగొండకు పిలి పించుకుని టైంస్కేల్ కింద వేతనాలు ఇప్పిస్తామని, ఇందుకు గాను ఖర్చులుంటాయని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు తీసుకునేందుకు బేరసారాలు మొదలయ్యాయి. అయితే, ఈ ఉత్తర్వులు రావాలంటే ముందు జిల్లా కార్యాలయం ఫైల్ వె ళ్లాలని, ఇక్కడినుంచి వెళ్లేందుకు చాలా ఖర్చు అవుతుందని, మళ్లీ హైదరాబాద్లోని కమిషనరేట్ పెద్దలకు ముట్టజెప్పాల్సి ఉంటుందని చెప్పి ఈ మేరకు గుంజుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మరో విషయమేమిటంటే ఈ ఉత్తర్వులకు సంబంధించిన వ్యవహారాలు చూసే ఓ అధికారి ఆమ్యామ్యాలకు ఆశపడే వ్యక్తి కాకపోవడంతో ఆయనకు ఫైల్ ఇచ్చేందుకు అధికారులు వెనుకాముందు ఆడుతున్నట్టు గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన త్వరలోనే సెలవుపై వెళ్లే అవకాశం ఉన్నందున మరో వ్యక్తికి ఈ ఫైల్ వ్యవహారాలు కట్టబెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. -
గవర్నర్ వద్దకు ‘గిరిజన’ పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీలకు చెందిన గిరిజన సంక్షేమశాఖల పంచాయితీ గవర్నర్ వద్దకు చేరింది. రాష్ట్ర విభజన అనంతరం ఈ శాఖకు సంబంధించి రెండురాష్ట్రాల మధ్య ఆస్తులు, పోస్టుల విభజన ఇంకా కొలిక్కి రాకపోవడంతో తెలంగాణ అధికారులు శుక్రవారం గవర్నర్ను ఆశ్రయించారు. మాసబ్ట్యాంకులోని సంక్షేమభవన్లో ఒక రాష్ట్ర కార్యాలయానికి మరొకరు పోటాపోటీగా తాళాలు వేయడం, ఫర్నిచర్ ధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకున్న సంగతి విదితమే. తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా తమకు కేటాయించిన చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ఏపీ గిరిజనశాఖ ఇవ్వకుండా జాప్యం చేస్తోందనేది తెలంగాణ వాదన. ఈ విషయంలో గవర్నర్నూ ఏపీ గిరిజనశాఖ తప్పుదోవ పట్టిస్తోందంటున్నారు. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ పదిలోని సంస్థలకు సంబంధించిన అన్ని పోస్టులు, ఆస్తులను తెలంగాణ గిరిజన శాఖకు అప్పగించేలా ఏపీ శాఖకు ఆదేశించాలని గవర్నర్కు తెలంగాణ గిరిజనసంక్షేమ శాఖ జేఏసీ విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ కార్యాలయంలో ఓ ఫిర్యాదునూ, సచివాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్శర్మకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ ప్రతినిధి బృందంలో తెలంగాణ గిరిజనసంక్షేమ శాఖ జేఏసీ నాయకులు ఎం.ఏ.రషీద్, నవీన్ నికొలాస్, ఐ. రాజామూర్తి, నైతం లక్ష్మణ్, సాగర్, ఆర్. సత్యనారాయణ, ఉపేంద్రచారి తదితరులున్నారు. -
ఇదేం స్పెషల్ డీఎస్సీ!
సీతంపేట:ఏజెన్సీస్పెషల్ డీఎస్సీపై అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. అరకొరగా పోస్టులు కేటాయించడాన్ని తప్పుబడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా షెడ్యూల్డ్ ఏజెన్సీలో 402 పోస్టుల భర్తీకి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అనుమతినిచ్చింది. అయితే మన జిల్లాకు 26 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. ఇంటర్, డిగ్రీ, బీఈడీ, టెట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్ హిందీ ఒకటి, ఇంగ్లిష్, సోషల్ ఒక్కొక్కటీ, హిందీ పండిట్ గ్రేడ్ టు- 4, ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జీటీ-7, గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో 12 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ అసలు వివిధ ఆశ్రమ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేరు. ఏజెన్సీలో 60కి పైగా టీచర్ పోస్టులు ఖాళీలున్నాయని కేవలం 26 మాత్రమే భర్తీ చేస్తున్నారని పలు ఉపాధ్యాయ సంఘాలు, గిరిజన సంఘాలు వాపోతున్నాయి. ఏ పాఠశాలలో చూసినా సబ్జెక్టు టీచర్ల పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకపోవడంతో విద్యాసంవత్సరం ఆరంభం నుంచే విద్యార్థులకు కష్టాలు తలెత్తే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అప్గ్రేడ్ పాఠశాలల మాటేమిటీ? సీతంపేట ఏజెన్సీలో ఐదు వరకు పాఠశాలలను అప్గ్రేడ్ చేశారు. సీతంపేటలోని గిరిజన వసతిగృహాన్ని ఆశ్రమ పాఠశాలగా మార్చారు. ఇక్కడ ఏడాది పూర్తయినా ఇంతవరకు పోస్టుల భర్తీ లేదు. అలాగే రెండేళ్ల క్రితం శంభాం, సీతంపేట, సామరెల్లి, పూతికవలస, పొల్ల తదితర పాఠశాలలన్నింటినీ అప్గ్రేడ్ చేసి సబ్జెక్టుటీచర్లను ఏళ్ల తరబడి నియమించలేదు. ప్రధాన సబ్జెక్టులైన ఆంగ్లం, గణితం, పీజిక్స్ వంటి సబ్జెక్టులకు కూడా టీచర్లు లేరు. తెలుగు, హిందీ పండిట్ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఈ విషయాన్ని డిప్యూటీ ఈవో మల్లయ్య వద్ద ‘సాక్షి’ విలేకరి ప్రస్తావించగా వాస్తవానికి షెడ్యూల్డ్ ఏరియాకు ఇంకా 9 పోస్టులు, అప్గ్రేడ్ పాఠశాలకు మరో 22 పోస్టులు కేటాయించాల్సి ఉందన్నారు. -
‘ఉపకారం’ హుళక్కేనా ?
ఇందూరు : జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం జిల్లాలోని వందలాది మంది గిరిజన విద్యార్థులకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం గిరిజన సంక్షేమ శాఖకు కోట్లాది రూపాయలు మంజురు చేస్తుంటే.. వాటిని విద్యార్థులకు అందించడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాకు మంజురైన రూ.1.86 కోట్ల నిధుల్లో రూ.12 లక్షలు మాత్రమే ఖర్చు చేయగా, మిగితా రూ.1.74 కోట్లువెనక్కి మళ్లాయంటే వారి పనితీరు ఎలా ఉందో తెలుసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి8వ తరగతి వరకు చదువుతున్న గిరిజన పేద విద్యార్థులకు ఆర్థికంగా దోహదపడేందుకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్లను జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అందిస్తోంది. ఇందుకోసం 2014-15 సంవత్సరానికి రూ.1కోటి 86 లక్షలు కేటాయించింది. జనవరిలో గిరిజన విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు, ప్రధానోపాధ్యాయులకు తెలియజేయాలి. అంతేకాక అందరికీ తెలిసేలా అవగాహన సదస్సులు నిర్వహించాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం చేయడంతో దరఖాస్తుల విషయం చాలామందికి తెలియలేదు. తెలిసిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి దాదాపు రెండు నెలలకు పైగా పట్టింది. ఎందుకంటే చదువుతున్న పాఠశాల నుంచి సర్టిఫికెట్ తీసుకోవడం, కుల, ఆదాయ, నివాస, ఇతర ధ్రువ పత్రాలు తీసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇలా సుమారు వెయ్యి మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా, అందులో 960 మందికి స్కాలర్షిప్లు అందజేశారు. అదే అంతకుముందు సంవత్సరం రెండు వేల మందికి అందజేశారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులు దాదాపు నాలుగు వేలకు పైగా ఉంటారని విద్యా శాఖ అధికారుల అంచనా. ఈ లెక్కన చూస్తే ఇంకా కనీసం మూడు వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తులు పెద్ద మొత్తంలో రాకపోవడానికి గిరిజన సంక్షేమాధికారులు ప్రచారం నిర్వహించకపోవడం, పాఠశాలల ప్రధానోపాద్యాయులకు సకాలంలో సమాచారం అందించకపోవడమే ప్రధాన కారణమని స్పష్టంగా తెలుస్తోంది. వందలాది గిరిజన పేద విద్యార్థులకు విషయం తెలియక, ధ్రువపత్రాలు సమయానికి అందకపోవడంతో ఒక సంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్లను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులకు అక్షింతలు...! పేద గిరిజన విద్యార్థులకు అందిచే స్కాలర్షిప్ నిధులను కనీసం యాబై శాతం కూడా ఖర్చు చేయకపోవడంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్, కమిషనర్ మహేశ్ ఎక్కా, ప్రిన్సిపల్ సెక్రెటరీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా జిల్లా గిరిజన సంక్షేమాధికారి పనితీరుపై అసహనం వ్యక్తం చేశారని సమాచారం. ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తుంటే పేద విద్యార్థులకు అందించకపోవడం చూస్తే మీ నిర్లక్ష్యం ఏంటో తెలిసిపోయిందని మండిపడ్డట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రూ.1కోటి 86 లక్షలు ఇస్తే అందులో 960 మంది విద్యార్థులకు రూ.12 లక్షలు ఖర్చు చేయడంపై సీరియస్ అయ్యారని తెలిసింది. ఇప్పటికైనా పనితీరు మెరుగు పరుచుకోవాలని సూచించినట్లు సమాచారం. -
ప్రక్షాళన .. గిరిజనశాఖ లక్ష్యం
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి అజ్మీరా చందూలాల్ సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసి, ప్రణాళికాబద్ధంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని ఆ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ వెల్లడించారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నామన్నారు. మంత్రి చందూలాల్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు. హాస్టళ్లను రీమోడల్ చేసి విద్యార్థులకు 1 ప్లస్ 1 బెడ్లు, ఆర్ఓ వాటర్ప్లాంట్లు, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో(2015-16)ఏ నెలలో ఏయే పనులను పూర్తిచేయాలి అన్నదానిపై దృష్టిసారించినట్లు చెప్పారు. స్కూళ్లు, హాస్టళ్లు ప్రారంభమయ్యేలోగా విద్యార్థులకు బట్టలు,పుస్తకాలు, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కొందరు అధికారుల్లో నిర్లిప్తత, సరైన దృక్పథంతో పనిచేయకపోవడం వల్ల గత ఏడాది రూ.150 కోట్ల మేర స్కాలర్షిప్ నిధులు మురిగిపోయాయని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఇకముందు అలా జరగనివ్వమన్నారు. హాస్టళ్లలోని విద్యార్థినులకు కాస్మోటిక్చార్జీలను రూ.75 నుంచి రూ.200లకు, అబ్బాయిలకు రూ. 50 నుంచి రూ.150కు పెంచాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించినట్లు చెప్పారు. గిరిజన ఇంజనీర్లను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతాం... ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ పూర్తిచేసిన గిరిజన విద్యార్థులకు హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్లో ప్రత్యేక శిక్షణను అందించి వారు కాంట్రాక్టర్లుగా ఎదిగేలా కృషి చేయనున్నట్లు మంత్రి చందూలాల్ తెలిపారు. జిల్లాల్లో ఉన్న 3,4 యూత్ హాస్టళ్లను బడిమానేసిన, చదువుకు దూరమైన గిరిజన బాల,బాలికలకు శిక్షణనిచ్చే కేంద్రాలుగా రూపొందించాలనే యోచిస్తున్నామన్నారు.పది, ఇంటర్ చదివిన పిల్లలకు ఆయా వృత్తుల్లో శిక్షణ, ఇతరత్రా నైఫుణ్యాల పెంపుదలలో శిక్షణనిస్తామన్నారు. దీనిని ఈ జూన్ నుంచి ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. వచ్చే ఏడాది వంద శాతం సాధించేలా ప్రణాళికలు... గిరిజన గురుకులాల విద్యార్థులు ఇంటర్లో 84.37 శాతం ఫలితాలను సాధించారని, వచ్చే ఏడాది వందశాతం ఫలితాలను సాధించేలా ప్రత్యేక చర్యలను చేపడతామన్నారు. అరకొరగా టీచర్లున్నా, అంతగా సదుపాయాలు లేకపోయినా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా సంబంధిత అధికారులు, సిబ్బంది కృషిచేశారని అభినందించారు. ఇంటర్లో ఫెయిలైన విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయ్యేలా, అన్నిజిల్లాల్లో ప్రత్యేకశిక్షణను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇతర శాఖల్లో పనిచేస్తున్న తమ శాఖ అధికారుల డిప్యుటేషన్లను రద్దుచేసినట్లు మంత్రి వెల్లడించారు.సీఆర్టీ కింద 2 వేల మంది టీచర్లు నెలకు రూ.5 వేల వేతనంతో పనిచేస్తున్నారని, వీరి సర్వీసులను క్రమబద్దీకరించాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపిం చినట్లు మంత్రి చందూలాల్ తెలియజేశారు. -
ఆప్షన్కు ఓకే
‘స్థానికత మేరకు చేపట్టే బదిలీలతో మాకు అన్యాయం జరుగుతోంది. ఖమ్మం జిల్లా నుంచి నియమితులమై..అన్ని రకాల సంబంధ బాంధవ్యాలను తెలంగాణతోనే ఏర్పాటు చేసుకున్నాం. అటువంటి మాకు స్థానికతతో ముడిపెట్టకుండా బదిలీలకు అవకాశం కల్పించాలి.’ అంటూ ట్రిబ్యునల్ను ఆశ్రయించిన జడ్పీ ఉపాధ్యాయులకు అనుకూలంగా తీర్పు వెలువడింది. ముంపు ప్రాంత ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎంచుకున్న దాన్నిబట్టే ముంపు బదిలీలు - ముంపు స్థానికత ఉన్న వారికీ అవకాశం - ట్రిబ్యునల్ తీర్పుతో ఉపాధ్యాయుల్లో హర్షాతిరేకాలు - రేపు గిరిజన సంక్షేమశాఖలో సర్దుబాటు భద్రాచలం :ఏపీలో విలీనమైన ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆప్షన్ల మేరకే బదిలీలు జరగనున్నారు. బుధవారం నాడు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముంపు స్థానికత ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తామని ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులందరికీ బదిలీల్లో అవకాశం కల్పించాలని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేయటంతో ఇక అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలోనే బదిలీలు చేపట్టేందుకు జిల్లా ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. విలీన మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులను జిల్లాలో సర్దుబాటు చేసేందుకు అంగీకరిస్తూ.. మార్చి 19న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 130ని విడుదల చేసింది. కేవలం తెలంగాణ స్థానికత ఉన్న వారికే బదిలీల్లో అవకాశం కల్పించి, ముంపు స్థానికత ఉన్న వారిని అక్కడనే ఉంచాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉద్యోగుల స్థానికత నిర్ధారణ కోసం సర్వీసు రిజిస్టర్లను తనిఖీ చేసి కేవలం తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగుల జాబితానే బదిలీల కోసం అధికారులు సిద్ధం చేశారు. దీన్ని ప్రాతిపదికగా తీసుకునే ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉద్యోగుల బదిలీ కౌన్సెలింగ్ను పూర్తి చేశారు. మరికొన్ని శాఖల్లో బదిలీలు.. జడ్పీ, గిరిజన సంక్షేమశాఖల పరిధిలోని ఉపాధ్యాయులు, రెవెన్యూశాఖ పరిధిలోని వీఆర్వోలకు మాత్రమే ఇంకా బదిలీలు చేయాల్సి ఉంది. అయితే స్థానికత మేరకు చేపట్టే బదిలీలతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఖమ్మం జిల్లా ద్వారా నియమితులై.. అన్ని రకాల సంబంధ బాంధవ్యాలను తెలంగాణతోనే ఏర్పాటు చేసుకున్న తమకూ స్థానికతతో ముడిపెట్టకుండా బదిలీలకు అవకాశం కల్పించాలని జడ్పీ పరిధిలోని కొంతమంది ఉపాధ్యాయులు ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీనిపై వాదోపవాదనలు విన్న ట్రిబ్యునల్ ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ముంపు మండలాల వాసులే అరుునా సకల జనుల సమ్మె, తెలంగాణ ఉద్యమాల్లో వారు కూడా పాల్గొన్నృదష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల విషయంలో సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. ట్రిబ్యునల్ తీర్పును శిరసావహించేందుకే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే విలీన మండలాల్లోని అన్నిశాఖల వారికి ఆప్షన్ల మేరకే బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల ఆప్షన్ల మేరకు బదిలీలు నిర్వహణకు ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వటం హర్షనీయమని ముంపు ఉద్యోగుల ఫోరమ్ సమన్వయకర్త స్వరూప్కుమార్, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిసింగ్రాథోడ్ పేర్కొన్నారు. రేపు ట్రైబల్ వెల్ఫేర్లో... గిరిజన సంక్షేమ శాఖలో గురువారం బదిలీలు చేపట్టేందుకు అంతా సిద్ధం చేశారు. స్థానికత మేరకే బదిలీల జాబితాను తయారు చేసి, జాబితాను ప్రకటించారు. కానీ ట్రిబ్యునల్ తీర్పుతో తెలంగాణకు వచ్చే ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున గురువారం జరగాల్సిన సర్దుబాటు బదిలీలను వాయిదా వేశారు. దీన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లుగా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ నరోత్తమరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
నెల ముందే ‘కల్యాణలక్ష్మి’కి దరఖాస్తు
సాక్షి,హైదరాబాద్: ‘కల్యాణలక్ష్మి’ కింద ప్రభుత్వ ఆర్థికసహాయం అందాలంటే పెళ్లికి దాదాపు నెల రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమ శాఖ డెరైక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. పెళ్లికూతురు బ్యాంకు అకౌంట్లో రూ.51 వేలను జమచేస్తారని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని పెళ్లిచేసుకోబోయే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతులు ఉపయోగించుకోవాలని సూచించారు. వివరాలకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏ, మైనారిటీ సంక్షేమశాఖ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. -
సీఆర్టీల దీక్ష విరమణ
ఉట్నూర్ : గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలోని ఆశ్ర మ పాఠశాలల సీఆర్టీ (కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు)లు శుక్రవారం రాత్రి దీక్షలు విరమించారు. సమస్యల పరిష్కారం కోసం 11రోజులుగా స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి అటవీ,పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న దీక్షా శిబిరాన్ని సందర్శించారు. సమస్యల పరిష్కారానికి హామీనిచ్చి దీక్షలు విరమింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఆర్టీల సమస్యలను ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, పదిహేను రోజుల్లో సీఆర్టీల వేతనాలను ప్రభుత్వం పెంచుతుందని చెప్పారు. సీఆర్టీల్లో ఎస్జీటీలకు రూ.10,900, స్కూల్అసిస్టెంట్లకు రూ.14,860 పెంచుతామని హామీనిచ్చారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను అధికారులు రూపొందించిన తర్వాత ప్రభుత్వం వేతన పెంపును అమలు చేస్తుందని చెప్పారు. క్రమబద్ధీకరణ అనేది ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ అని, అన్ని శాఖల్లో విధులు నిర్వర్తించే కాంట్రాక్టు ఉద్యోగులను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విధులు నిర్వర్తించే వారికి ఒకే విధమైన వేతనాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలు రూపొందించే అధికారుల కొరత ఉందని, స్వామినాథన్ కమిటీ ద్వారా ఉద్యోగుల విభజన పూర్తి కాగానే రాష్ట్రంలో సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయని వివరించారు. 11రోజుల దీక్ష కాలాన్ని ఆన్డ్యూటీగా పరిగణించాలని ఐటీడీఏ పీవోకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఐటీడీఏ పీవో ప్రశాంత్పాటిల్, డీడీటీడబ్ల్యూ భీమ్, సీఆర్టీల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మర్సకొల తిరుపతి, ఉపాధ్యక్షుడు వసంత్కుమార్, అధ్యక్షుడు మునీనాయక్, కన్వీనర్ కమలాకర్, కోశాధికారి శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు జగ్జీవన్, ఉట్నూర్ సర్పంచ్ బొంత ఆశరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు లక్కెరావ్, కందుకురి రమేశ్, టీడబ్ల్యూటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల విజయ్ శేఖర్, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు ఆత్రం భూజంగ్రావ్, సీఆర్టీలు పాల్గొన్నారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా ఆదిలాబాద్ రూరల్ : సీఆర్టీల సమ్మె విరమింపజేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పట్టణంలోని కొమురం భీం చౌక్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పీడీఎస్యూ జిల్లా నాయకులు చంటి, రమేశ్, అరుణ్, మల్లేశ్, రాకే శ్ పాల్గొన్నారు. -
నిఘా..
వసతి గృహాల్లో బయోమెట్రిక్.. సీసీ కెమెరాలు.. ఉట్నూర్ : గిరిజన సంక్షేమ శాఖ అధీనంలోని ఆశ్రమ వసతిగృహాలు, గిరిజన పాఠశాలల్లో అక్రమాల తంతుకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హాజరు శాతం ఎక్కువగా చూపుతూ అవకతవకలకు పాల్పడుతున్న వార్డెన్ల ఆటలకు ఇక బ్రేక్ పడనుంది. ప్రభుత్వ తాజా ని ర్ణయంతో ఇకపై వార్డెన్లు చుట్టపుచూపుగా హాస్టళ్లకు వెళ్ల డం కూడా కుదరదు. నిత్యం స్థానికంగానే ఉంటూ హా స్టళ్లను పర్యవేక్షించక తప్పదు. ఆశ్రమ వసతిగృహాలు, గిరిజన పాఠశాలల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం ఆన్లైన్ విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రతి వసతిగృహంలో విద్యార్థుల హాజరు శా తాన్ని నమోదు చేయడానికి బయోమెట్రిక్ యంత్రాలు, వార్డెన్ల పనితీరు, విద్యార్థులకు అందుతున్న మెనూ పర్యవేక్షించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్కు ఆదేశాలు జారీ చేస్తూ గత మంగళవారం సర్క్యులర్ ఇచ్చింది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఈ విధానం సత్ఫలితాలివ్వడంతో మన దగ్గరా అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. పారదర్శకతకు పెద్దపీట.. జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ అధీనంలో 123 ఆశ్రమ పాఠశాలలు, నాలుగు గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో సుమారు 39,924 వరకు గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ వసతి గృహాల నిర్వహణలో పూర్తిగా పారదర్శకత తేవడానికి.. వసతి గృహాల పూర్తి సమాచారం ఆన్లైన్లో పొందుపరిచేలా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. విద్యార్థి పేరు మొదలుకుని.. వసతి గృహంలో ఉన్న మౌలిక వసతుల వరకు సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు కానుంది. దీనిద్వారా విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలు, సిబ్బంది, వార్డెన్ల పనితీరు, విద్యార్థులపై పర్యవేక్షణ తదితర వాటిలో స్పష్టత రానుంది. చాలా వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని అధికంగా చూపిస్తూ పలువురు వార్డెన్లు నిధులు దండుకుంటున్నారనేది ప్రభుత్వం గుర్తించింది. అమల్లోకి బయోమెట్రిక్ విధానం.. వసతి గృహాల్లో అక్రమాలకు చెక్ పెడుతూ విద్యార్థుల హాజరు శాతాన్ని బయోమెట్రిక్ పద్ధతి ద్వారా ఉదయం, సాయంత్రం నమోదు చేస్తారు. దీనికితోడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో విద్యార్థుల హాజరు, వారికి అందుతున్న మెనూ నేరుగా పర్యవేక్షించే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులకు పోషకాహారం అందనుంది. తద్వారా విద్యార్థుల హాజరు శాతం, మెనూ పరిశీలన ఆధారంగా నిధుల విడుదల ఉంటుంది. వసతి గృహాల్లో విధులు నిర్వహించే వార్డెన్లలో చాలా మంది నాలుగు రోజులకు, వారానికోసారి చుట్టపు చూపుగా హాస్టళ్లకు వచ్చి వెళ్తున్నారనేది ఆరోపణ. అంతేగాకుండా సిబ్బంది సమయానికి వెళ్లడం లేదనేది బహిరంగ రహస్యం. ఫలితంగా హాస్టళ్లలో విద్యార్థులు తింటున్నారా..? లేదా..? రోజుకు ఎన్ని పూటలు తిండి పెడుతున్నారు..? తిండి నాణ్యతగా ఉంటుందా..? వీటిపై అధికారులకు స్పష్టత లేదు. ఈ విధానానికి స్వస్తి పాలకాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు. -
105 సేవలు కల
ఉట్నూర్ : జిల్లా వ్యాప్తంగా ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలోని 123 ఆశ్రమాల్లో దాదాపు 38,821 మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 2012 అక్టోబర్లో తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో ఐటీడీఏ పీవోలు, జిల్లా వైద్యాధికారులు, అదనపు వైద్యాధికారులు, డీఎంవో, మెడికల్ అధికారి, ఎంపీహెచ్వో, ఎస్పీహెచ్వో, డీఈవోలతో ప్రభుత్వం 105 వాహనాల అమలుపై వర్క్షాప్ నిర్వహించింది. పక్షం రోజులకోసారి గిరిజన విద్యార్థుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ ఆశ్రమాల్లో 105 వాహన సేవలు అందుబాటులోకి తీసుకురావాలనేది నిర్ణయం. గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించి రెండేళ్లు కావస్తున్నా ఎలాంటి చర్యలు కానరావడం లేదు. 105 వైద్య సేవల కోసం ఉట్నూర్ సీహెచ్ఎన్సీవో(కమ్యూనిటీ హెల్త్ న్యూట్రీషియన్ క్లస్టర్ ఆఫీస్) పరిధిలో 14 ఆశ్రమాలు, జైనూర్ సీహెచ్ఎన్సీవో పరిధిలోని 13 ఆశ్రమాలు, ఆసిఫాబాద్, బోథ్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, సిర్పుర్-టీ సీహెచ్ఎన్సీవోల పరిధిలో ఒక్కో సీహెచ్ఎన్సీవోలో 12 ఆశ్రమ పాఠశాలల చొప్పున పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపికైన 99 ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు 27,861 మంది విద్యార్థులకు వైద్య సౌకర్యాలు అందించాలని ఐటీడీఏ నిర్ణయం తీసుకున్నా చర్యలు శూన్యం. నాలుగు వాహనాలతో సేవలు మొదటి విడత నాలుగు 105 వాహనాలు జిల్లాకు రానున్నట్లు అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. తర్వాత మరో నాలుగు వాహనాలు వస్తాయన్నారు. మొదటి విడత వాహనాలు ఉట్నూర్, ఆదిలాబాద్, ఆ సిఫాబాద్, తిర్యాణి లేదా ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా అధికారు లు నిర్ణయం తీసుకున్నారు. వాహనాలు ఏ సమయంలో ఎక్కడ ఉన్న యో తెలుసుకునేందుకు వీలుగా ఆన్లైన్ విధానంలో జీపీఎస్ పద్ధతి ద్వారా రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్యాలయం, స్థానిక ఐటీడీఏకు అనుసంధానం చేయడం నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు ఉంటాయని అధికారులు ప్రకటించారు. పీహెచ్సీ మాదిరిగా 105 ద్వారా విద్యార్థులకు వైద్య పరీక్షలు అందుతాయన్నారు. ఇందు కోసం ప్రతీ వాహనం లో వైద్యాధికారి, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, ఏఎన్ఎం, కౌన్సిలర్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఉండేలా చూస్తామన్నారు. పక్షం రోజులకోసారి గుర్తించిన ఆశ్రమాలకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్య స్థితిని అంచనా వే సి అవసరమైతే అదే వాహనంలో ఆస్పత్రులకు తరలించేలా చూస్తామన్నారు. వైద్య పరీక్షల అనంతరం వారిఆరోగ్య స్థితిని విద్యార్థులకు ఇచ్చి న జవహర్ ఆరోగ్య రక్ష కార్డుల్లో నమోదు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా 105 వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎప్పుడు వస్తాయో తెలియదు.. - ప్రభాకర్రెడ్డి, జిల్లా అదనపు వైద్యాధికారి ఉట్నూర్ రెండేళ్ల క్రితం ఆశ్రమ పాఠశాలల్లో 105 వాహనాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని ఉన్నతాధికారుల నుంచి అదేశాలు రావడంతో నివేదికలు సమర్పించాం. అలాగే గుర్తించిన ఆస్పత్రుల్లో విద్యార్థుల కోసం ఐదు పడకలతో ప్రత్యేక వార్డులు ఉంటాయన్నారు. -
ఎస్సీ, ఎస్టీ కేసులను సత్వరం విచారించాలి
* ప్రత్యేక కోర్టు, పోలీస్స్టేషన్, లీగల్ సెల్ ఏర్పాటుచేయాలి * గిరిజన కార్పొరేషన్ను వెంటనే విభజించాలి * యువజన శిక్షణ కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాలి * టీ సర్కార్కు గిరిజన సంక్షేమశాఖ నివేదిక సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ కులాలు, తెగలపై అత్యాచారాలు, దాడులకు సంబంధించి కేసులను సత్వరం విచారించి నిందితులకు శిక్ష పడేలా చేయాలని గిరిజన సంక్షేమశాఖ తెలం గాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ప్రత్యేక కోర్టులు, పోలీస్స్టేషన్లు, విడిగా లీగల్సెల్ను ఏర్పాటుచేయాలని, స్పెషల్ మేజిస్ట్రేట్ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని కోరింది. రాష్ర్టంలోని గిరిజనుల సంక్షేమానికి అందిస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మెరుగైన రీతిలో అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ప్రభుత్వపరంగా అందాల్సిన సహాయం, ఆయారంగాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, సూచనలు, సలహాలతో ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది. ఈ మేరకు పలు ప్రతిపాదనలు చేసింది. రాష్ర్ట విభజన జరిగినప్పటికీ గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ట్రైకార్, ట్రిప్కో, ట్రిమ్కో, గిరిజన సహకార సంఘాలను విభజించకపోవడం వల్ల ఆయా పథకాలు, కార్యక్రమాల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. షెడ్యూ ల్ ఏరియాల్లో నివసిస్తున్న షెడ్యూల్ తెగల వారి సమగ్ర ఆర్థికాభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. వెంటనే కార్పొరేషన్లను విభజించి సీనియర్ అధికారులకు పూర్తి బాధ్యత అప్పగిస్తే వీటి నిర్వహణ సజావుగా సాగుతుంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ లో గిరి జనుల జనాభా 9.34 శాతం (2011 జనాభా లెక్కల ప్రకారం) అని స్పష్టమైంది. అయితే, ఉ న్న ఒకేఒక అదనపు డెరైక్టర్ పోస్టు ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. గిరిజన జనాభా దృష్ట్యా ఆయా పథకాలను సమర్థవంతంగా అమలు చే సేందుకు తెలంగాణకు అదనపు డెరైక్టర్ పోస్టును, ఇతర సిబ్బందిని మంజూరుచేయాలి. నిర్మాణదశలో ఉన్న ఇరవై యువజన శిక్షణా కేంద్రాల్లో మౌలికసదుపాయాలు కల్పించడంతో పాటు జాతీయస్థాయిలో శిక్షణను అందించి వారికి మార్గదర్శనం చేయడం, ఉపాధిని కల్పించేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఎప్పటికప్పుడు అందించాలి. అత్యంత వెనుకబడిన చెంచు. తోటి. కోలామ్, కొండారెడ్డి గిరిజన తెగల కోసం ఆర్థిక సహాయ పథకాలకు అందజేస్తున్న 60 శాతం సబ్సిడీని 80 శాతానికి (గ్రూపులకు గరిష్టంగా రూ.లక్ష వరకు) పెంచాలి. విద్యాహక్కు చట్టంలో భాగంగా గిరిజనుల పిల్లలకు విద్యనందించేందుకు చర్యలు తీసుకోవాలి. కనీస టీచర్, విద్యార్థి నిష్పత్తి ప్రాథమిక పాఠశాలల్లో 1:30, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1:35, హైస్కూల్లో 1:40 ఉండేలా చూడాలి. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో టీచర్ల ఖాళీలు ఉండడంతో అనుకున్న ధ్యేయం నెరవేరడం లేదు. గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, గురుకులాల్లో కలుపుకుని దాదాపు 3,800 టీచర్పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మైదానప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలల్లోనూ ప్రమాణాలు పాటించి, నాణ్యమైన విద్యనందించేందుకు టీచర్పోస్టులను మంజూరు చేయాలి. తొమ్మిది జిల్లాల్లోని మైదాన ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలకు 1,500 టీచర్ పోస్టులను మంజూరు చేయాలి. కాగా, ఇటీవల జరిగిన సంక్షేమరంగ టాస్క్ఫోర్స్ సమావేశంలోనూ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ వివిధ ప్రతిపాదనలు, ప్రభుత్వపరంగా వెంటనే తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ ఒక నివేదికను సమర్పించారు. -
‘ఉపకారం’ ప్రశ్నార్థకం?
నిజామాబాద్ అర్బన్/ఇందూరు, న్యూస్లైన్ : జిల్లాలో 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వాలు, అధికారులు చెబుతున్న భారీ లెక్కలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. మరోవైపు ఫీజు చెల్లించాలని విద్యార్థులపై కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి పెంచుతున్నాయి. నిధుల విడుదలలో మొదటి నుంచి జాప్యం నెలకొనడం ఒక కారణం కాగా, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఆయా సంక్షేమ శాఖల ఖాతాలను స్తంభింప జేశారు. దీంతో నిధుల విడుదలకు బ్రేక్ పడింది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో వివిధ కోర్సులు అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు స్కాలర్షిప్, ఫీజు రీ యింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నా రు. ఇందులో సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో ఫ్రెష్ విద్యార్థులు 7,634 మంది, రెన్యువల్ విద్యార్థులు 6,693 మంది ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ. 5 కోట్ల 24 లక్షలు, ఉ పకార వేతనాల కోసం రూ. 6 కోట్ల 77 లక్షలు ఇప్పటి వరకు మంజూరయ్యాయి. ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్లో రూ. 47 లక్షలు, ఉపకార వేతనాలకు రూ. కోటీ 29 లక్షలు విడుదల కావాల్సి ఉంది. బీసీ సంక్షేమ శాఖ విషయానికి వస్తే రెన్యువల్ వి ద్యార్థులు 27,347, ఫ్రెష్ విద్యార్థులు 23,787మంది ఉన్నారు. ఇందులో ఉపకార వేతనాల కోసం రూ. 32 కోట్ల 3 లక్షలు, రీయింబర్స్మెంట్ కోసం రూ. 18 కోట్ల 7 లక్షలు మంజురయ్యాయి. అయితే 23,787 మంది ఫ్రెష్ విద్యార్థులకు ఉపకార వేతనాలు నేటికీఒక్క రూపాయి కూడా రాలేదు. రీయింబర్స్మెంట్కు సంబంధించి రూ. 5 కోట్ల 50 లక్షలు, ఉపకార వేతనాలకు సంబంధించి రూ. 15 కోట్ల 25 లక్షల నిధులు ఇంకా మంజూరు కావాల్సి ఉంది. ఈబీసీ విద్యార్థులు 3,547 మందికి గాను ఉపకార వేతనాలు రూ. 3 కోట్ల 25 లక్షలు రావాల్సి ఉంది. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి రెన్యువల్ విద్యార్థులు 3,619 మంది ఉండగా, ఫ్రెష్ విద్యార్థులు 3,949 మంది ఉన్నారు. రీయింబర్స్మెంట్కు సంబంధించి రూ. కోటీ 72 లక్షలు, ఉపకార వేతనాలకు సంబంధించి రూ. 2 కోట్ల 59 లక్షలు మంజురయ్యాయి. ఇంకా ఉపకార వేతనాల కోసం రూ. 3 కోట్లు రావాల్సి ఉంది. ఈ విద్యా సంవత్సరానికి 3,949 మంది ఫ్రెష్ విద్యార్థులకు ఒక్కరికి ఒక్క రూపాయి కూడా అందలేదు. ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు సంబంధించి రీయింబర్స్మెంట్ కోసం మొత్తం రూ. 6 కోట్లు, ఉపకార వేతనాల కోసం రూ. 22 కోట్ల 79 లక్షలు రావాల్సి ఉంది. కాగా ఫీజులు చెల్లించాలంటూ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ‘‘మీరైతే ముందుగా ఫీజులు చెల్లించండి.. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత తిరిగి మీకే ఇస్తాం’’ అంటూ విద్యార్థుల నుంచి ముక్కుపిండి మరీ ఫీజులు వసూళ్లు చేస్తున్నారని సమాచారం. కళాశాలలకు సెలవులు ఉన్నా... ఫోన్ ద్వారా విద్యార్థులను వేధిస్తుండడం గమనార్హం. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. -
గిరిజన విద్య.. ఫెయిల్..!
ఉట్నూర్, న్యూస్లైన్ : ఐటీడీఏ ఆధీనంలోని ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్య గాడి తప్పింది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంత దారుణంగా పదో తరగతి ఉత్తీర్ణత శాతం పడిపోయింది. ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిస్తే విద్య తిరోగమన దిశలో పయనిస్తోందా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఒక్కరూ ఉత్తీర్ణత సాధించని ఆశ్రమ పాఠశాలలు నాలుగు, ఒక్కరు ఉత్తీర్ణత సాధించినవి ఏడు, ఇద్దరు ఉత్తీర్ణత సాధించినవి నాలుగు, ముగ్గురు ఉత్తీర్ణత సాధించినవి ఆరు, ఇక పది మంది లోపు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన ఆశ్రమ పాఠశాలలు 30.. ఇలాంటి ఫలితాలు గత పదేళ్ల కాలంలో గిరిజన సంక్షేమ శాఖ చూసి ఉండదు. ఫలితాలు పడిపోవడానికి కారణం ఎవరు.. ఆయా విద్యాలయాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడమా..?, విద్యాలయాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి సారించకపోవడమా..?, విద్యార్థులు పుస్తకాలు ముట్టకపోవడమా..? కారణమేదైనా గిరిజన సంక్షేమ శాఖ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. పడిపోయిన ‘పది’ ఫలితాలు.. గతంతో పోల్చితే ఈ విద్యాసంవత్సరం పదో తరగతి ఫలితాలు దారుణంగా పడిపోయాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలో ఈసారి 3,929 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 1,506 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 71 ఆశ్రమ పాఠశాలల నుంచి 3,046 మందికి గాను 1,083 మంది, 13 కస్తూరిబా గాంధీ పాఠశాలల నుంచి 316 మందికి గాను 106 మంది, నాలుగు రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి 483మందికి గాను 292 మంది, ఆరు వసతి గృహాల నుంచి 84 మందికి గాను 25 మంది విద్యార్థుల చొప్పున ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి వరకు ఉన్న జామ్డా, మహాగాం, రాశిమెట్ట బాలికల ఆశ్రమ పాఠశాలల్లో, మార్లవాయి ఆశ్రమ పాఠశాలలో ఒక్కరూ ఉత్తీర్ణత సాధించకపోవడం గమనార్హం. పర్డీ(బి), గూడమామడ, నార్నూర్, అర్జుని(బాలికల), దోర్డానా, కోహినూర్(కే), గుడిహత్నూర్, ఉమ్రి(బాలికల) ఆశ్రమ పాఠశాలల్లో ఒక్కరు చొప్పున, జైనూర్, గిన్నెధరి, మల్కెపల్లి, పాట్నాపూర్(బాలికల) ఆశ్రమ పాఠశాలల్లో ఇద్దరు చొప్పున ఉత్తీర్ణత సాధించారు. మాన్కపూర్, పోచంలొద్ది, ఖానాపూర్(బాలికల), కుంటాల, జన్నారం, ఖానాపూర్ ఆశ్రమ పాఠశాలల్లో ముగ్గురు చొప్పున ఉత్తీర్ణులయ్యారు. స్వర్ణ, బోథ్(బాలికల), కోర్టికల్(కే) ఆశ్రమ పాఠశాలల్లో నలుగురు చొప్పున ఉత్తీర్ణత సాధించారు. ఇక పది మంది లోపు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన ఆశ్రమ పాఠశాలలు 30 దాటలేదు. ఇక 13 కేజీబీవీల్లో నార్నూర్, మాణిక్యకపూర్ విద్యార్థులు ఒక్కరూ ఉత్తీర్ణత సాధించకపోవడం గమనార్హం. కుస్నపల్లి, కడెం, నార్నూర్, భీంపూర్ వసతి గృహాల్లో ఒక్కరు చొప్పున, భీమారంలో పది మంది, లక్సెట్టిపేటలో 11 మంది ఉత్తీర్ణులయ్యారు. కారణాలు అనేకం.. 2013-14 విద్యాసంవత్సరంలో గిరిజన సంక్షేమ శాఖలో పదో తరగతి ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఐటీడీఏ ఉన్నతాధికారుల మధ్య సమన్వయలోపం తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభమైన నెల తర్వాత అప్పటి డీడీటీడబ్ల్యూ రషీద్ అనారోగ్యం కారణంగా చూపుతూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఉన్నతాధికారులే ఆయనను సెలవుపై పంపించారని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటి ఏపీవో(జనరల్) వెంకటేశ్వర్లుకు ఇన్చార్జి డీడీగా బాధ్యతలు అప్పగించారు. ఆయ న ఉద్యోగ విరమణ సమయం దగ్గరలో ఉండడంతో పూర్తి స్థాయిలో గిరిజన విద్యపై దృష్టి సారించలేదు. సెప్టెంబర్లో ఉద్యోగ విరమణ పొందగానే ఐటీడీఏ ఏవో భీమ్కు బాధ్యతలు అప్పగించినా ఆశించిన ఫలితం లేకుండాపోయింది. ఆశ్రమాలపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొరవడడంతో గిరిజన విద్య గాడి తప్పు తూ వచ్చింది. నవంబర్ 28న సెలవుపై వెళ్లిన రషీద్ డీడీగా తిరిగి బాధ్యతలు స్వీకరించినా.. నెల తిరక్కుండానే డిసెంబర్ 21న ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ విద్యాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలోని విద్యాలయాలను పట్టించుకునే వారే లేకుండాపోయారు. ఆశ్రమ పాఠశాలల్లో 577 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఐటీడీఏ విద్యా సంవత్సరం ఆరంభంలో సీఆర్టీలను నియమించకుండా విడతల వారీగా నియామకాలు చేపట్టింది. ఈ ప్రక్రియ ముగిసే స రికి ఆగస్టు దాటడంతో సిలబస్ పూర్తి కాలేదు. అదీగాక సీఆర్టీలను ఏటా తొల గిస్తూ నియామకాలు చేపట్టడంతో కొత్తగా వచ్చే సీఆర్టీలకు పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన లేక విద్యార్థులకు బోధించలేకపోయారనే ఆరోపణలున్నాయి. విద్యాసంవత్సరంలో సుమారు 20 మంది ఉపాధ్యాయులను ఐటీడీఏ పీవో సస్పెండ్ చేశారు. వీరికి నెలలు గడిచినా పోస్టింగ్లు ఇవ్వకపోవడంతో ఆశ్రమాల్లో పలు సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది. పలువురికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, విద్యాసంవత్సరం మధ్యలో బదిలీలు నిర్వహించడంతో పూర్తి స్థాయిలో తరగతుల బోధన లేక విద్యార్థుల ఫలితాలపై ప్రభావం చూపింది. అధికారుల మధ్య సమన్వయ లోపం, పూర్తి స్థాయి డీడీటీడబ్ల్యూగా బాధ్యతలు నిర్వర్తించే వారు లేకపోవడంతో ఆశ్రమాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది ఆడింది ఆట పాడింది పాటగా మారింది. కొందరు ఉపాధ్యాయులు అనుమతి లేకుండా రోజుల తరబడి విధులకు ఎగనామం పెట్టారు. దూర ప్రాంతాల నుంచి ఇష్టారీతిగా రాకపోకలు సాగించడం, సీఆర్టీలపై భారం వేయడంతో నాణ్యమైన విద్య అందకుండా పోయింది. ప్రక్షాళన చేస్తేనే.. పదో తరగతి ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఈ విద్యాసంవత్సరం ఆరంభం నుంచే గిరిజన సంక్షేమ శాఖలో ప్రక్షాళన చేస్తేనే గిరిజన విద్య గాడిలో పడే అవకాశ ఉందని విద్యావేత్తలు అంటున్నారు. ఆశ్రమాల్లో పూర్తి స్థాయిలో ఫలితాలు సాధించని 50 మంది ఉపాధ్యాయులకు ఐటీడీఏ పీవో షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయి డీడీటీడబ్ల్యూను నియమించడం, పాఠశాలలు ప్రారంభానికి ముందే సీఆర్టీల నియామకం తదితర చర్యలు చేపడుతూ ప్రక్షాళన చేస్తేనే ఫలితం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు గిరిజన గాడిలో పెడతారో లేదో వేచి చూడాల్సిందే. -
సీఆర్టీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి
నల్లగొండ అర్బన్, న్యూస్లైన్ : గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (సీఆర్టీ)లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉపాధ్యాయులు కోరారు. స్థానిక ఎన్జీ కాలేజీ ఆవరణలో సోమవా రం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఆర్టీలు పాల్గొని సమస్యల పరిష్కారానికి తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలోని పలు మారుమూల మండలాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో గత ఆగస్టు నుంచి పనిచేస్తున్న సీఆర్టీలకు సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. స్కూల్ అసిస్టెంట్లకు *5500, ఎస్జీటీలకు *4500 వేతనాన్ని మూడు నాలుగు నెలలకో మారు ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ఆశ్రమ పాఠశాలల సీఆర్టీలు పాల్గొన్నారు -
కస్తూర్బాధలు...!
కేజీబీవీల్లో మెరుగుపడని వసతులు అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న పాఠశాలలు సాంఘిక సంక్షేమం కంటే తక్కువ కేటాయింపులు బాలికా విద్యను ప్రోత్సహించేందుకు.. డ్రాపవుట్స్ను నిరోధానికి, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)లు ఆవిర్భవించాయి. ఇవి ఏర్పాటై మూడేళ్లవుతున్నా మౌలిక వసతుల కోసం యాతన తప్పని పరిస్థితి. జిల్లాలోని 34 కేజీ బీవీల్లో సుమారు 5 వేలమంది విద్యార్థినులున్నారు. చాలా కేజీబీవీలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటిలో విద్యార్థినులకు సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేక అవస్థపడుతున్నారు. జిల్లాలో 2011-12 విద్యా సంవత్సరం నుంచి కేజీబీవీలు నడుస్తున్నాయి. ఇందులో 18 కేజీబీవీలు రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ఆధ్వర్యంలోను, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 8, సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 3, ఏపీ రెసిడెన్షియల్ సొసైటీలో ఐదు ఉన్నాయి. ఆరంభంలో 6, 7, 8 తరగతుల విద్యార్థుల్ని చేర్చుకున్నారు. గత విద్యా సంవత్సరంలో 9వ తరగతి, ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతిని అప్గ్రేడ్ చేస్తూ వచ్చారు. గరిష్టంగా ఒక్కో పాఠశాలకు 200 మందిని విద్యార్థుల్ని కేటాయించారు. అయితే ఆ స్థాయిలో వసతుల్ని మాత్రం కల్పించలేదు. సబ్జెక్టుకు ఒకరు చొప్పున ఒక్కో కేజీబీవీకి ఏడుగురు ఉపాధ్యాయులుండాలి. పీఈటీ, అటెండర్, ఏఎన్ఎం, ఇద్దరు వంట మనుషులు, ఇద్దరు సహాయకులు, స్కావెంజర్, పగలు, రాత్రి కాపలా కాసేందుకు ఇద్దరు వాచ్మెన్లను నియమించాలి. చాలా చోట్ల ఈ పరిస్థితి కానరావట్లేదు. బోధనా సిబ్బంది, కంప్యూటర్ బోధకుల కొరత. ఆర్వీఎం ఆనందపురం, చోడవరం, గొలుగొండ, నర్సీపట్నం, అచ్యుతాపురం మండలాల్లో భవన నిర్మాణాలు పూర్తి చేసింది. వాటిలోనే ప్రస్తుతం కేజీబీవీలు నడుస్తున్నాయి. నాతవరం, కోటవురట్ల, ఎస్.రాయవ రం, కశింకోట, కొయ్యూరుల్లో భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. నక్కపల్లి, సబ్బవరం, మాకవరపాలెం, చీడికాడ, రాంబిల్లి, మునగపాక, వి.మాడుగుల మండలాల్లో టెండర్లు పిలిచారు. మార్చిలో పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి. భీమిలి మండలంలో నిర్మాణ స్థలంపై కోర్టు వివాదం నడుస్తోంది. గతంలో ఇక్కడి బోధనా సిబ్బందిని ప్రభుత్వ టీచర్ల నుంచే డెప్యుటేషన్పై కొనసాగించారు. ఇప్పుడు డెప్యూటేషన్లను రద్దు చేసి, ప్రత్యేక పరీక్ష ద్వారా సిబ్బంది(సీఆర్టీ)ని నియమించారు. డెప్యుటేషన్పై పనిచేస్తున్న రెగ్యులర్ టీచర్లు కోర్టుకెళ్లారు. ఈ విద్యాసంవత్సరం చివరి వరకు పాత స్థానాల్లోనే కొనసాగించాల్సిందిగా కోరుతున్నారు. ఈ వివాదం ఇంకా నడుస్తోంది. చాలా సబ్జెక్టులకు ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. నర్సీపట్నం కేజీబీవీలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, బయాలజీ సబ్జెక్టులు అతిథి టీచర్లతోనే నడుస్తున్నాయి. ఎస్.రాయవరం కేజీబీవీలో విద్యార్థినుల దుస్థితిపై గతంలో జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) బి.లింగేశ్వరరెడ్డి తనిఖీలు నిర్వహించి వసతుల లేమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని 34 కేజీబీవీల్లో ఇక్కడే విద్యార్థులు తక్కువగా ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. -
లింకురోడ్డు నిర్మాణంతో రైతులకు నష్టం
మేడారం(తాడ్వాయి), న్యూస్లైన్ : సమ్మక, సారలమ్మ మహాజాతరను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం మేడారంలో చేపట్టనున్న లింకురోడ్డు నిర్మాణంతో స్థాని క రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. జంపన్నవా గు సమీపంలోని చిలకలగుట్ట ప్రాంతంలో ఉన్న స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అక్కడి నుంచి నేరుగా అమ్మవార్ల గద్దెల వద్దకు వచ్చేందుకు రైతు ల పంటల పొలాల మధ్య నుంచి అధికారులు సుమారు 880 మీటర్ల మేరకు లింకురోడ్డును నిర్మించనున్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణ పనుల కోసం స్థానిక రెవెన్యూ అధికారులు ఆదివారం సర్వే నిర్వహించారు. అయితే లింకురోడ్డు నిర్మాణంతో స్థానిక రైతులు సుమారు 40 ఎకరాల భూమిని కోల్పోవాల్సి వస్తోంది. జాతరకు దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తుల సౌకర్యార్థం లింకురోడ్డు నిర్మాణం చేపట్టడం బాగానే ఉన్నప్పటికీ చేతికొచ్చిన పంటలు నాశనమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే జాతర సందర్భంగా తాము రె ండో పంట సాగు చేయకుండా భక్తుల వసతి కోసం భూములను వదిలేస్తున్నప్పటికీ ప్రస్తుతం లింకురోడ్డు నిర్మాణం ద్వారా మరింత భూమిని కోల్పోవాల్సి వస్తుందని వారు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోతున్న విషయంపై బాధిత రైతులు ములుగు ఆర్డీఓ మోతీలాల్ను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ లింకురోడ్డు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. గిరిజన మహిళకు అస్వస్థత.. చిలకలగుట్ట స్నాన ఘట్టాల నుంచి చేపట్టనున్న లింకురోడ్డుతో తన భూమి పోతుందని ఆందోళనకు గురైన ఓ గిరిజన మహిళ గుండెనొప్పితో అస్వస్థతకు గురైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక రెడ్డిగూడేనికి చెందిన మాజీ ఉప సర్పంచ్ నాలి సావిత్రికి ఉన్న ఎకరం భూమిలో కొంత భూమి స్నానఘట్టాల నుంచి అమ్మవార్ల గద్దెల వద్దకు చేపట్టే రోడ్డు నిర్మాణంలో పోతోంది. విషయం తెలుసుకున్న ఆమె ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలింది. గమనించిన స్థానికు లు చికిత్స నిమిత్తం ఆమెను హుటా హుటినా మేడారం కల్యాణ మండపంలోని వైద్యశాలకు తరలించారు. -
అక్టోబర్ ఒకటి నుంచి ‘నగదు బదిలీ’
సుబేదారి, న్యూస్లైన్ : అక్టోబర్ ఒకటో తేదీ నుంచి జిల్లాలో నగదు బదిలీ పథకం అమలులోకి రానుంది. సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ శాఖ, మైనార్టీ విద్యార్థులకు చెందిన స్కాలర్షిప్లు, డీఆర్డీఏ-ఐకేపీ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న పింఛన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా అవుతున్న నిత్యావసర వస్తువుల లబ్ధిదారులను ఈ పథకంలోకి తీసుకొచ్చారు. ఏడు ఏజెన్సీల ద్వారా జిల్లాలో ఆధార్ కార్డుల అనుసంధానం కార్యక్రమాన్ని నిర్వహించారు. 35,22,089 మొత్తం జనాభా ఉండగా 32,94,161 మంది కార్డులను ఆధార్తో అనుసంధానం చేశారు. 8,71,178 మందికి తెల్ల రేషన్ కార్డులు ఉండగా గిరిజన ప్రాంతాల్లో 44,080 మందికి కార్డులు ఉన్నాయి. వీరికి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నగదు బదిలీ పథకం వర్తింపజేయనున్నారు. 2012-13లో బీసీ వెల్ఫేర్ ద్వారా 62,794 మంది విద్యార్థులు స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పౌరసరఫరాల విభాగం ఇప్పటికే రేషన్ కార్డులకు ఆధార్ కార్డులను అనుసంధానం చేసే కార్యక్రమం పూర్తిచేసింది. ఇందులో వరంగల్ డివిజన్లో 3,41,546, జనగామలో 1,54,844, మహబూబాబాద్లో 1,90,397, ములుగులో 27,852, నర్సంపేటలో 44,080 మంది దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రజల రేషన్ కార్డులను ఆధార్తో అనుసంధానం చేశారు. ఇక నుంచి లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాల నుంచి తమ నగదు బదిలీని పొందాల్సి ఉంటుంది. రేషన్ దుకాణాల నుంచి ఇచ్చే నిత్యావసర సరుకులు, విద్యార్థుల స్కాలర్షిప్లు, సామాజిక భద్రత పింఛన్లు నగదు బదిలీ ద్వారా పొందే అవకాశం ఉంటుంది.