administrative officer
-
డిగ్రీతో ఏఓ కొలువు.. నెలకు రూ.60వేల వేతనం
భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ.. ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్... 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(ఏఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే ప్రారంభంలోనే నెలకు రూ.60వేల వేతనం అందుకోవచ్చు!! ► పోస్టులు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ► మొత్తం పోస్టుల సంఖ్య: 300(అన్ రిజర్వ్డ్–121, ఓబీసీ–81, ఎస్సీ–46, ఎస్టీ–22, ఈడబ్ల్యూఎస్–30, పీడబ్ల్యూబీడీ–17) ► వేతనం: ఎంపికై ఉద్యోగంలో చేరిన వారికి వేతన శ్రేణి రూ.32795–రూ.62315 లభిస్తుంది. ఇతర అలవెన్సులు, సౌకర్యాలు ఉంటాయి. ప్రారంభంలోనే మెట్రోపాలిటిన్ సిటీల్లో నెలకు రూ.60వేల వరకూ వేతనం అందుకోవచ్చు. ► అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/పోస్ట్గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 30.09.2021 నాటికి విద్యార్హతల సర్టిఫికెట్ ఉండాలి. ► వయసు: 01.04.2021 నాటికి వయసు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► ప్రిలిమినరీ పరీక్ష: ప్రిలిమినరీ పరీక్ష ఆన్లైన్ విధానంలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ 35 మార్కులకు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. ఇందులో ప్రతి విభాగంలో కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులను మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. పోస్టుల సంఖ్యకు 15 రెట్ల మందిని మెయిన్ రాసేందుకు అనుమతిస్తారు. ► మెయిన్ పరీక్ష: మెయిన్ పరీక్షలో ఆబ్జెక్టివ్ టెస్ట్ 200 మార్కులకు, డిస్క్రిప్టివ్ టెస్ట్ 30 మార్కులకు నిర్వహిస్తారు. ఈ రెండు టెస్టులుఆన్లైన్ విధానంలోనే జరుగుతాయి. ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 50 మార్కులకు, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50మార్కులకు, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ 50మార్కులకు, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఆబ్జెక్టివ్ టెస్ట్లో అర్హత సాధించిన వారి డిస్క్రిప్టివ్ పరీక్ష పేపర్లను మాత్రమే మూల్యాంకనం చేస్తారు. ► డిస్క్రిప్టివ్ పద్ధతిలో 30 మార్కులకు జరిగే పరీక్షలో.. ఇంగ్లిష్ నైపుణ్యాన్ని పరీక్షించేలా లెటర్ రైటింగ్ పది మార్కులకు, ఎస్సే 20 మార్కులకు అడుగుతారు. ► మెయిన్ పరీక్షల్లో ప్రతిభ చూపిన వారిని పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ► మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూల్లో సాధించిన స్కోర్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.09.2021 ► దరఖాస్తులకు చివరి తేది: 21.09.2021 ► ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబర్ 2021 ► ఆన్లైన్ మెయిన్ పరీక్ష: నవంబర్ 2021 ► వెబ్సైట్: www.newindia.co.in/portal -
తొలిసారి: హిందూ యువతికి పాక్లో అత్యున్నత పదవి
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో ఓ హిందూ యువతి సత్తా చాటింది. ఆ దేశంలోని అత్యున్నత పదవిని అధిష్టించనుంది. ఆ దేశ అత్యున్నత ఉద్యోగానికి ఎంపికై అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టనుంది. ఆ దేశంలో ఓ హిందూ యువతి ఆ బాధ్యత చేపట్టడం ఇది తొలిసారి. ఆమెనే పాక్లోని సింధ్ ప్రావిన్స్లోని షికార్పూర్ జిల్లాకు సనా రామ్చంద్. మన దేశంలో సివిల్స్ మాదిరి పాకిస్తాన్లో పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (పాస్). సెంట్రల్ సుపీరియర్ సర్వీస్ (సీఎస్ఎస్)లో హిందూ యువతి సనా రామ్చంద్ ఉత్తీర్ణత సాధించి పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (పాస్)కు ఎంపికైంది. అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టనుంది. ఈ సీఎస్ఎస్ పరీక్షను 18,553 మంది రాయగా వారిలో 221 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో సనా రామ్చంద్ ప్రతిభ కనబర్చడంతో ఆమె పాక్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కు ఎంపికైంది. అంటే మనదేశంలో ఐఏఎస్ మాదిరి. సనా వృత్తిరీత్యాఆ వైద్యురాలు కూడా. సింధ్ ప్రావిన్స్లోని చంద్కా వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం సింధ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూరాలజీలో ఎఫ్సీపీఎస్ చదువుతున్నది. సర్జన్ కావాలని ప్రయత్నాలు చేస్తోంది. చదవండి: మేకను తప్పించి సింహానికి బలైన యువకుడు చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్డౌన్ -
ఆయన సేవలు మాకొద్దు
సాక్షి, వేంపల్లె(కడప) : ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న సెక్యూరిటీ ఆఫీసర్ అర్జున్ నాయక్ సేవలు మాకొద్దంటూ ఆర్జీయూకేటీ చాన్స్లర్ కె.చెంచురెడ్డి, ట్రిపుల్ ఐటీ పరిపాలనా అధికారి మోహన్కృష్ణ చౌదరిలు పేర్కొన్నారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీలో అర్జున్ నాయక్ (సీఐ) మహిళా సెక్యూరిటీ గార్డులను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు అందాయన్నారు. గత రెండేళ్లుగా సెక్యూరిటీ ఆఫీసర్గా సీఐ కేడర్లో ఆయన విధులు నిర్వహిస్తున్నారన్నారు. అయితే ఇక్కడి అధికారులకు తెలియకుండానే బయోమెట్రిక్ యంత్రాలు ఒక్కరోజు రాత్రి ట్రిపుల్ ఐటీలోని తన గెస్ట్హౌస్కు షిప్టు చేశారని తెలిసింది. ఈ విషయం సెక్యూరిటీ ద్వారా తమ దృష్టికి వచ్చిందన్నారు. అంతేకాకుండా మహిళా సెక్యూరిటీ గార్డులపట్ల ఆయన అసభ్యకరంగా మాట్లాడుతున్నారని గత కొద్దిరోజుల నుంచి ఆరోపణలు రావడంతో బాధితులను పిలిపించి మాట్లాడామన్నారు. రెండు నెలల నుంచి ఆయన ఆరాచకాలు భరించలేకపోతున్నామని చెబితే తమ ఉద్యోగాలు ఎక్కడపోతాయోనని బాధితులు అధికారుల ముందు కన్నీరుమున్నీరు పెట్టుకున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం అర్జున్ నాయక్ ఆరోపణలు నిజమేనని నిర్ధారణ కావదతడంతో విధుల నుంచి తొలగించినట్లు వారు తెలిపారు. అలాగే జిల్లా ఎస్పీ అన్బురాజన్కు ట్రిపుల్ ఐటీ అధికారులు లేఖ పంపనున్నట్లు వారు తెలిపారు. -
ఏసీబీ గాలానికి చిక్కిన ఇంజనీర్..
సాక్షి, గుంటూరు : పట్టణంలో మరో అవినీతి అధికారి ఆగడాలకు అడ్డుకట్ట వేశారు ఏసీబీ అధికారులు. ఏఓగా పనిచేస్తున్న మధవరావు అక్రమాస్తుల చిట్టా ఒక్కక్కటిగా విప్పారు. ఏసీబీ అధికారుల తనిఖీల్లో భాగంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం ఇతనికి ఇరవై విలువైన ఇళ్ల స్థలాలు, నాలుగు నివాస గృహాలకు సంబంధించిన రికార్డులను గుర్తించారు. అంతేకాక ఏడు లక్షల రుపాయల నగదు, పెద్దఎత్తున బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్ లెక్కల ప్రకారం దాదాపు ఆరు కోట్ల రుపాయలు. ఏకకాలంలో ఇతని బంధువుల ఇంటిపై కూడా అధికారులు దాడి చేశారు. పొన్నూరు మండలం మాచవరంలో ఇతని బినామీ చిట్టిబాబు ఇంట్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించి విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. -
ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ అదనపు కమిషనర్
సాక్షి, అమరావతి/లక్ష్మీపురం (గుంటూరు)/విశాఖ క్రైం/శ్రీకాకుళం/హైదరాబాద్: విజయవాడ వాణిజ్య పన్నుల శాఖలో అదనపు కమిషనర్గా పనిచేస్తున్న జి. లక్ష్మీప్రసాద్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు చేసింది. గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలతోపాటు హైద్రాబాద్లో మొత్తం 20చోట్ల బుధవారం ఏకకాలంలో సోదాలు జరిపింది. దాడుల్లో రూ.1.84 కోట్ల విలువ చేసే చరాస్తులను గుర్తించినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్.పి.ఠాకూర్ వెల్లడించారు. లక్ష్మీప్రసాద్తోపాటు ఆయన బంధువులు, బినామీల నివాసాల్లో జరిపిన సోదాల్లో పలు ఇళ్లు, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూమిని గుర్తించారు. వీటికి సంబంధించిన దస్తావేజులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో లక్ష్మీప్రసాద్ అత్త పేరిట రెండు ఎకరాల వ్యవసాయ భూమి, తెలంగాణలోని మహేశ్వరం మండలం అమీర్పేటలో ఆయన బంధువు పేరిట రెండెకరాల వ్యవసాయ భూమి, పరిగిలో నాలుగు ప్లాట్లు, 30తులాల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, విలువైన సెల్ఫోన్లు, రూ.34లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో గుర్తించిన చరాస్తుల్లో.. రూ.కోటి విలువ చేసే ప్రాంసరీ నోట్లు, బ్యాంకు నిల్వ రూ.34 లక్షలు, నగదు రూ.32 వేలు, రూ.40 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, గృహోపకరణాలు రూ.10 లక్షలు, మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక లాకర్ ఉన్నాయి. స్థిరాస్తుల విలువ తెలియాల్సి ఉంది. శ్రీకాకుళంలోని లక్ష్మీప్రసాద్ ఇంట్లో తనిఖీలు చేస్తున్న అధికారులు -
సోషల్ వెల్ఫేర్ అధికారి ఇళ్లల్లో ఏసీబీ సోదాలు
పులివెందుల: ప్రస్తుం కర్నూలు జిల్లా ఆత్మకూరులో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి కార్యాలయంలో ఏవో గా పనిచేస్తున్న రాజ కుళ్లాయప్ప ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏకకాలంలో కర్నూలు, కడప జిల్లాల్లో ఏడుచోట్ల తెల్లవారుజాము నుంచి సోదాలు కొనసాగిస్తోంది. గతంలో ఈయన పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి బీసీ హాస్టల్ వార్డెన్గా పనిచేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఉన్నాయన్న అభియోగంపై పులివెందుల, వేంపల్లిలోని ఆయన ఇళ్లలో, ప్రైవేట్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఆయన స్నేహితుడు, సెరికల్చర్ ఉద్యోగి అయిన జగన్మోహన్ రెడ్డి ఇంటిపై కూడా దాడులు నిర్వహించారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. -
ఏఓ కిరణ్కుమార్రెడ్డి సస్పెన్షన్
అనంతపురం అగ్రికల్చర్: కళ్యాణదుర్గం భూసంరక్షణా విభాగంలో పనిచేస్తున్న వ్యవసాయాధికారి (ఏఓ) కె.కిరణ్కుమార్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. బ్రహ్మసముద్రం మండలానికి ఇన్చార్జ్ ఏఓగా పనిచేస్తున్న కిరణ్కుమార్రెడ్డి విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యామ్నాయ విత్తన పంపిణీతో ఇతర వ్యవసాయ పథకాల అమలులో తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నందున ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. -
ఆ ఒప్పందంతో 2 వేల ఉద్యోగాలు ఢమాల్
ప్రపంచ ఇంటర్నెట్ రంగంలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా వెలిగిన యాహూను సొంతం చేసుకున్న వెరిజోన్ కమ్యూనికేషన్ ఇంక్ ఉద్యోగులపై భారీ వేటు వేయనుంది. యాహూ కొనుగోలు ఒప్పందం నేపథ్యంలో రెండు కంపెనీలకు చెందిన దాదాపు 2 వేల మందిని ఇంటికి పంపించనుందని తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం 2 వేల ఉద్యోగాలను తగ్గించనున్నట్లు వెరిజోన్ కమ్యూనికేషన్స్ ఇంక్ తొలగించనుంది. మొత్తం 4.48 బిలియన్ డాలర్లు ఒప్పందం పూర్తయిన అనంతరం ఈ తొలగింపులను చేపట్టనుంది. రెండు యూనిట్లకు చెందిన 15శాతం ఉద్యోగులను తగ్గించనుంది వీటిలోముఖ్యంగా కాలిఫోర్నియా సహా, అమెరికా వెలుపల ఉద్యోగులు ఇందులో ఉన్నారు. మరోవైపు యాహూ- వెరిజోన్ విలీనానికి వాటాదారుల సాధారణ సమావేశం గురువారం ఆమోదం తెలిపింది. ప్రాథమిక ఫలితాల ప్రకారం కంపెనీ విక్రయ ప్ర్రకియ మంగళవారం పూర్తి కానుంది. వెరిజోన్ , యాహూ విలీనంతో కొత్త వెంచర్ ఓథ్ ఉనికి లోనికి రానుంది. వెరిజోన్కు చెందిన అమెరికన్ మల్టీనేషనల్ మాస్ మీడియా కార్పొరేషన్ ఏఓఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ ఆర్ స్ట్రాంగ్ నేతృత్వంలోని ఓథ్ అనే నూతన సంస్థగా రీబ్రాండ్ అయింది. కాగా 2012లో యాహూ సీఈవోగాఎంపికైన మెరిస్సా మేయర్ పెట్టుబడిదారుల విశ్వాసం కోల్పోవడంతో వివాదం రగిలింది. ఈ క్రమంలోనే 2015లో యాహూ, తన వ్యాపారంలోని ముఖ్య విభాగాలైన డిజిటల్ అడ్వర్టయిజింగ్, ఈ-మెయిల్, మీడియా విభాగాలను వేరిజోన్ కు విక్రయించిన సంగతి తెలిసిందే. -
వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశారు!
వికారాబాద్: బీటెక్ విద్యార్థి కన్నారెడ్డిని పోలీసులు చితకబాదిన కేసులో సస్పెండైన వ్యవసాయ అధికారిణి (ఏవో) నీరజ తాజాగా సాక్షి టీవీతో మాట్లాడారు. ఎరువుల దుకాణానికి అనుమతి ఇచ్చేందుకు తాను లంచం అడిగినట్టు కన్నారెడ్డి కుటుంబసభ్యులు చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆమె చెప్పారు. వెంటిలేటర్ లేకపోవడంతోనే ఎరువుల దుకాణం ఏర్పాటుకు అనుమతించలేదని అన్నారు. వ్యవసాయ కార్యాలయంలో తనతోపాటు మరో ఇద్దరు మహిళా అధికారులున్నారని, తమ పట్ల కన్నారెడ్డి, వారి కుటుంబసభ్యులే అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. అంతేకాకుండా తమ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశారని, అందుకే పోలీసులను ఆశ్రయించామని చెప్పారు. రాత్రికి రాత్రే తనను ప్రభుత్వం సస్పెండ్ చేస్తుందని ఊహించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై తనకు నమ్మకం ఉందని, తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. వికారాబాద్ జిల్లా ఎర్రవల్లికి చెందిన కన్నారెడ్డి స్థానికంగా ఎరువుల దుకాణం ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరగా.. ఏవో నీరజ రూ. 20 వేలు లంచం ఇవ్వాలని అడిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇచ్చేందుకు అతను నిరాకరించడంతో అతనిపై స్థానిక పోలీసులతో దాడి చేయించినట్టు కథనాలు వచ్చాయి. పోలీసులు ఎలాంటి ఫిర్యాదు నమోదు చేసుకోకుండానే కన్నారెడ్డిపై అమానుషంగా వ్యవహరించారు. దీంతో తీవ్రంగా గాయపడిన కన్నారెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ వ్యవహారంలో వ్యవసాయ అధికారి నీరజ, మొమిన్పేట్ ఎస్సై రాజులపై పోలీసుల కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఏవో నీరజను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. -
కన్నారెడ్డి కేసు: సర్కారు సీరియస్
లంచం ఇవ్వబోనని చెప్పడమే కాక లంచగొండి అధికారిని ఏసీబీకి పట్టించాలని అనుకున్నందుకు పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న కన్నారెడ్డి కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కన్నారెడ్డిని చితకబాదిన కేసులో మోమన్పేట ఎస్ఐ రాజు, ఏఎస్ఐ వీరాస్వామితో పాటు హెడ్ కానిస్టేబుళ్లు వెంకటయ్య, శంకరయ్య, కానిస్టేబుళ్లు శివయ్య, రాఘవేందర్లను హెడ్ క్వార్టర్స్కు ఎటాచ్ చేశారు. ఫెర్టిలైజర్ షాపు అనుమతి కోసం వ్యవసాయాధికారి నీరజను కన్నారెడ్డి కలిశారు. అయితే అందుకు అతడి నుంచి నీరజ రూ. 20వేల లంచం డిమాండ్ చేశారు. లంచం ఎందుకివ్వాలని అడిగినందుకు కన్నారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో నిజానిజాలు ఏంటో తెలుసుకోకుండా నీరజ ఫిర్యాదుతో ఎస్ఐ రాజు, సిబ్బంది కలిసి కన్నారెడ్డిని చితకబాదారు. రాజు దాడితో కన్నారెడ్డి రెండు కిడ్నీలు బాగా దెబ్బతిన్నాయి. దాంతో అతడు హైదారబాద్ ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
కన్నారెడ్డిపై దుర్మార్గం.. నీరజ, ఎస్సైపై కేసు
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. ఓ బీటెక్ విద్యార్థినిపై అమానుషంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. లంచం ఇవ్వలేనన్నందుకు పోలీసులు, స్థానిక వ్యవసాయ అధికారిణి నీరజ కలిసి ఈ దుర్మార్గానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ కేసులో వ్యవసాయ అధికారి నీరజ, మొమిన్పేట్ ఎస్సై రాజులపై తాజాగా మంగళవారం పోలీసుల కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా ఎర్రవల్లికి చెందిన కన్నారెడ్డి స్థానికంగా ఎరువుల దుకాణం ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందాలని భావించాడు. ఇందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా స్థానిక వ్యవసాయ అధికారి నీరజను కోరగా.. లైసెన్స్ ఇచ్చేందుకు రూ. 20 వేలు లంచం ఇవ్వాలని ఆమె అడిగినట్టు తెలుస్తోంది. దీనిపై కన్నారెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేశాడు. ఏసీబీ ఆధారాలు కోరడంతో ఆధారాలు సేకరించేందుకు అతను ప్రయత్నిస్తుండగానే.. ఈ విషయం తెలుసుకున్న నీరజ తన భర్తను పిలిపించుకొని అతనిపై దాడి చేసింది. ఆ తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు ఎలాంటి ఫిర్యాదు నమోదు చేసుకోకుండానే కన్నారెడ్డిపై అమానుషంగా వ్యవహరించారు. అత్యంత దారుణంగా అతనిపై థర్డ్డిగ్రీ ప్రయోగించారని కుటుంబసభ్యులుఆరోపిస్తున్నారు. పోలీసుల దెబ్బలకు తీవ్రంగా గాయపడిన కన్నారెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. చేతులతో కనిపించని దెబ్బలు కొట్టడంతో కన్నారెడ్డి రెండు కిడ్నీలు సరిగ్గా పనిచేయడం లేదని, ఇప్పటికే ఓసారి డయాలసిస్ చేశామని, భవిష్యత్తులోనూ ఈ దెబ్బల వల్ల అతని ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశముందని వైద్యులు చెప్తున్నారు. తమ కొడుకును దారుణంగా కొట్టి హింసించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే లంచం అడిగిన ఏవో నీరజపైనా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్నారెడ్డి కుటుంబసభ్యులు కోరుతున్నారు. -
యాహూ ఇక గతమే.. కొత్త పేరెంటో తెలుసా?
ఇంటర్నెట్ దిగ్గజంగా గతంలో ఓ వెలుగు వెలిగిన యాహూ కంపెనీ ఇక కాలగర్భంలో కలిసిపోనుంది. యాహూను సొంతం చేసుకున్న వెరిజాన్ కంపెనీ.. తన ఏవోఎల్ మెయిల్ను దానితో విలీనం చేసి.. ఓథ్ (ప్రమాణం) పేరిట కొత్త బ్రాండ్ను తెరపైకి తీసుకొచ్చింది. ఇకమీదట ఓథ్ మెయిల్, ఓథ్ ఫైనాన్స్ కంపెనీలు ఇంటర్నెట్ యూజర్లను పలుకరించనున్నాయి. వెరిజాన్ కంపెనీ 4.8 బిలియన్ డాలర్ల మొత్తానికి యాహూ కంపెనీని కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏవోఎల్ మెయిల్లో యాహూ విలీనమైన తర్వాత ఈ రెండింటినీ కలిపి.. ఓథ్ అనే కొత్త కంపెనీ గొడుగు కిందకు తీసుకురానున్నట్టు ఏవోఎల్ సీఈవో టిమ్ ఆర్మ్స్ట్రాంగ్ ట్విట్టర్లో వెల్లడించారు. 'వందకోట్లకుపైగా వినియోగదారులు, 20కిపైగా బ్రాండ్లు, ఎదురులేని బృందం.. టేక్ ద ఓథ్ (ప్రమాణం చేయండి)' అంటూ ఆర్మ్స్ట్రాంగ్ ట్వీట్ చేశారు. -
ఇన్ఫోసిస్ బైబ్యాక్ దిశగా తొలి అడుగు!
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ కంపెనీ షేర్ల బైబ్యాక్కు వీలుగా తొలి అడుగు పడింది. ఇందుకు వీలుగా నూతన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (ఏఓఏ)లో నిబంధనల మార్పు ప్రతిపాదనకు వాటాదారులు పోస్టల్ బ్యాలట్ విధానంలో ఆమోదం తెలిపినట్టు ఇన్ఫోసిస్ కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. అలాగే, కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, హోల్టైమ్ డైరెక్టర్ యూబీ ప్రవీణ్రావు పారితో షికం పెంపునకు కూడా వాటాదారులు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. నూతన ఏఓఏ ప్రకారం ఇన్ఫోసిస్ సొంత కంపెనీ ఈక్విటీ షేర్లను లేదా సెక్యూరిటీలను బైబ్యాక్ విధానంలో కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని కంపెనీ వివరించింది. ఇన్ఫోసిస్ వద్ద రూ.35,697 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. రూ.12,000 కోట్ల మేర విలు వైన షేర్ల బైబ్యాక్ నిర్ణయాన్ని ఇన్ఫోసిస్ ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. -
ఏవో, ఏఈవో, హెచ్వో పోస్టుల భర్తీకి
హైకోర్టు గ్రీన్సిగ్నల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రత్యేక వెయిటేజీకి నిరాకరణ సాక్షి, హైదరాబాద్: వ్యవసాయాధికారులు (ఏవో), వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈ వో), ఉద్యానవన అధికారుల (హెచ్వో) పోస్టుల భర్తీకి ఉమ్మడి హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీ సమయంలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు మార్కులు వస్తే, అటువంటి సందర్భాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రాధాన్యతనివ్వాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయ మూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాం ప్రసాద్ల ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. వ్యవసాయాధి కారులు, విస్తరణాధికారులు, ఉద్యానవన అధికారుల పోస్టుల భర్తీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పోస్టుల భర్తీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని, ఆ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, రాత పరీక్షకు అనుమతినిస్తూ ఫలితాలను వెల్లడించవద్దని పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఆదేశించింది. తరువాత వీటిపై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం గురువారం తన నిర్ణయాన్ని వెలువరించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. అయితే మిగిలిన అభ్యర్థులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు మార్కులు వస్తే, అటువంటి సందర్భాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రాధాన్యతనివ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. -
‘ఏవో, ఏఈవో’ ఫలితాలను ఇవ్వండి
సర్కార్కు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయాధికారులు (ఏవో), వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) పోస్టుల ఫలితాలను సీల్డ్కవర్లో తమ ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏవో, ఏఈవోల పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పోస్టుల భర్తీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని, ఆ మేర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. -
రూ.4 లక్షల ఎరువుల సీజ్
శింగనమల : ఎరువుల దుకాణలలో బయోపెస్టిసైడ్స్ అమ్మితే చర్యలు తీసుకుంటామని ఏఓ పవన్కుమార్ తెలిపారు. గురువారం మండలంలోని నాయనపల్లిక్రాస్ వద్ద నున్న సాయిబాబా, ఆదిత్య ఎంటర్ప్రైజర్, లక్ష్మినరసింహా ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. జేడీఏ ఆదేశాల మేరకు ఈతనిఖీలు చేపట్టామని పవన్కుమార్ చెప్పారు. ఈమూడు షాపులలో నిల్వ ఉంచిన రూ. 4 లక్షల స్టాక్ను సీజ్ చేశామన్నారు. -
ఏఓపై దాడికి ఏఆర్ ఎస్సై యత్నం
సస్పెన్షన్కు రంగం సిద్ధం నెల్లూరు (క్రైమ్): జిల్లా పోలీస్ కార్యాలయ ఏఓపై ఏఆర్ ఎస్సై దాడికి యత్నించిన ఘటన శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో చోటుచేసుకుంది. పోలీస్ అధికారుల సమాచారం మేరకు.. నాగభూషణం ఏఆర్ కానిస్టేబుల్గా గతంలో డిప్యూటేషన్పై చెముడుగుంటలోని జిల్లా పోలీస్ శిక్షణ కళాశాలలో రైటర్గా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన అందరితో పాటు 15 శాతం అలవెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంజూరులో జాప్యం జరగడంతో పలుమార్లు మినిస్టీరియల్ సిబ్బందిని కలిశారు. సమాధానం రాకపోవడంతో ఏఓ రాజశేఖర్ను కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డిప్యూటేషన్పై విధులు నిర్వర్తించే వారికి అలవెన్స్ వర్తించదని ఏఓ ప్రభుత్వ జీఓను చూపించారు. ఈ విషయమై నాగభూషణం ఏఓపై కక్ష పెంచుకున్నారు. ఇటీవల ఆయన ఏఆర్ ఎస్సైగా పదోన్నతి పొంది జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏఓ పోలీస్ కార్యాలయానికి వచ్చి కారు దిగుతుండగా నాగభూషణం కర్రతో వెళ్తున్న విషయాన్ని గమనించిన డ్యూటీ ఆర్ఎస్సై అంకమరావు గార్డ్ను అప్రమత్తం చేయడంతో వారు అడ్డుకున్నారు. వారి నుంచి తప్పించుకునేందుకు నాగభూషణం యత్నించిచా సాధ్యం కాకపోవడంతో ఏఓను దుర్భాషలాడారు. విధుల బహిష్కరణ ఏఓపై దాడికి యత్నం విషయం తెలుసుకున్న మినిస్టీరియల్ సిబ్బంది విధులను బహిష్కరించారు. నాగభూషణంపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ విశాల్గున్నీకి ఫిర్యాదు చేశారు. నాగభూషణం వ్యవహారశైలిని వారు ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎస్పీ విచారించి నివేదికను సమర్పించాల్సిందిగా ఏఆర్ ఆర్ఐ శ్రీనివాసరావును ఆదేశించారు. దీంతో మినిస్టీరియల్ సిబ్బంది ఆందోళనను విరమించారు. ఆర్ఐ పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఎస్పీకి నివేదికను సమర్పించారు. నాగభూషణాన్ని విధుల నుంచి సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. గతంలోనే రాజీనామా లేఖ నాగభూషణం వ్యవహారశైలి ఆది నుంచే భిన్నంగా ఉండేదని సమాచారం. ప్రమోషన్ విషయంలో కలత చెంది రెండు సార్లు తన ఉద్యోగానికి రాజీనామా లేఖను ఏఆర్ ఉన్నతాధికారులకు నాగభూషణం సమర్పించారు. ఉన్నతాధికారులు ఆయనకు కౌనెలింగ్ నిర్వహించి మంచిపద్ధతి కాదని సూచించడంతో తన యత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం. -
పరడలో పంటపొలాలు పరిశీలన
కట్టంగూర్ మండలంలోని పరడ గ్రామంలో బుధవారం వ్యవసాయ అధికారి బి. సన్నిరాజ్ పంటపొలాలను, పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి ఆకు ఎరుపురంగులోకి మారితే మెగ్నిషియం లోపనివారణగా గుర్తించి ఒక లీటరు నీటి రెండు గ్రాముల మెగ్నిషియం సల్ఫేట్ను పిచికారీ చేయాలని సూచించారు. వరి ఆకులు ముదురు గోధుమ రంగులోకి మారటంతో పాటు వడ్ల గింజలపై నల్ల మచ్చలు ఏర్పడితే దీని నివారణకు ఒక లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల ఫ్రొఫెనోపాస్ కలిపి పిచికారీ చేసుకోవాలని రైతులకు సూచించారు. ఆయన వెంట రైతులు ప్రభాకర్రెడ్డి, మోహన్రెడ్డి, శశిపాల్రెడ్డి, మాండ్ర వీరయ్య ఉన్నారు. -
సస్యరక్షణకు సమయమిదే..
సోయాబీన్కు తెల్లదోమ బెడద ఆందోళన అవసరం లేదు వ్యవసాయ జిల్లా ఉపసంచాలకులు మాధవి శ్రీలత జగదేవ్పూర్: రైతులు పంటల సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని జిల్లా వ్యవసాయ సంచాలకులు మాధవిశ్రీలత అన్నారు. గురువారం సాయంత్రం సీఎం దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో సాగవుతున్న సోయాబీన్ పంటలను జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు గ్రామాల్లో సోయాబీన్ సంటలు బాగానే ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. సోయాబీన్ పంటలను సాగు చేసిన రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పంటలు ఆర్థిక వయో పరిమితి దశలో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం వర్షాలు లేనందున్న పంటలకు తెల్లదోమ సోకే అవకాశం ఉందని, దోమ నివారణకు రైతులు తగిన పురుగుల మందులను కొట్టాలన్నారు. లార్వీన్, అవైట్, రీమాన్లాంటి మందులను పంటలకు పిచికారీ చేయాలని సూచించారు. వర్షం కురిసిన వెంటనే పంటలకు పోటాషియం వేయాలన్నారు. కార్యక్రమంలో వీడీసీ గౌరవ అధ్యక్షులు బాల్రాజు, ఏఓ నాగరాజు, ఏఈఓ దామోదర్, గ్రామ రైతులు సత్తయ్య, ప్రభాకర్రెడ్డి, వెంకట్రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
‘ఫసల్ను సద్వినియోగం చేసుకోండి
కందుకూరు : రైతులుప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏఓ గీత సూచించారు. దానికి సంబంధించిన వివరాలను ఆమె మంగళవారం వెల్లడించారు. ఈ పథకంలో అన్ని ఖరీఫ్ పంటలకు రెండు శాతం, రబీ పంటలకు 1.5 శాతం ప్రీమియంను నిర్ధారించడం జరిగిందన్నారు. మొక్కజొన్న హెక్టార్కు రూ.50 వేల బీమాకు రైతు వాటాగా రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తే గ్రామం యూనిట్గా తీసుకుంటారన్నారు. వరి హెక్టార్కు రూ.70 వేలకు ప్రీమియం రైతు వాటాగా రూ.910, జొన్న హెక్టార్కు రూ.25 వేలకు గాను ప్రీమియం రూ.500, కంది హెక్టార్కు రూ.32,500 బీమాకు గాను రూ.650, పెసర, మినుము హెక్టార్కు రూ.25 వేల బీమా మొత్తానికి గాను ప్రీమియం రూ.500 చొప్పున చెల్లించాలని చెప్పారు. మొక్కజొన్న మినహా మిగతా పంటలన్నీ మండలం యూనిట్గా తీసుకుని నష్టపరిహారాన్ని అంచనా వేస్తారని వివరించారు. రుణం తీసుకోని రైతులు ప్రీమియంను ‘ఏఐసీ ఆఫ్ ఇండియా లిమిటెడ్’పేరుతో డీడీ తీసి సమర్పించాలని తెలిపారు. దరఖాస్తుతో పాటు డీడీ, పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్, బ్యాంక్ ఖాతాను జతచేసి సంబంధిత బ్యాంక్లో అందజేయాలన్నారు. బ్యాంకు నుంచి రుణం తీసుకున్న రైతులకు ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. బ్యాంక్ నుంచి రుణం తీసుకునే రైతులకు సెప్టెంబర్ ఆఖరు వరకు గడువు ఉంటుందన్నారు. దరఖాస్తులు మీ-సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
వరిలో జింక్ లోపం..
► జాగ్రత్తలు తీసుకోకుంటే పంట నాశనమే ► మెలుకువలు పాటిస్తే పంటకు చీడపీడలు దూరం ► మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్కుమార్ ఇబ్రహీంపట్నం రూరల్ : కరువులో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కాస్తోకూస్తో రైతులు అక్కడక్కడా వరి పంటలను వేసుకుంటున్నారు. వాటిని కాపాడుకోవాలంటే మెలుకువలు తప్పవని.. అవి పాటించకుంటే పంట పాడవడం ఖాయమంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. జింక్ లోపంతో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులు తప్పకుండా మెలుకువలు పాటిస్తే పంట దక్కుతుంది. వరిలో జింక్లోపం వల్ల కలిగే నష్టాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్కుమార్ రైతులకు సూచించారు. జింక్ సల్పేట్ లోపిస్తే వచ్చే లక్షణాలు వరి ఆకుల పై నుంచి 3లేదా 4 ఆకుల మధ్య ఈనె పాలిపోతుంది. నాటిన 2 నుంచి 4 లేదా 6 వారాల్లో ముదురాకు చివర్లో మధ్య ఈనెకు ఇరు పక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. ఆకులు చిన్నదిగా , పెళుసుగా ఉండి వంచగానే శబ్ధం చేస్తూ విరిగిపోతాయి. మొక్కలు గిడసబారి దుబ్బి చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు జాగ్రత్తలు ఇలా.. ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి , రెండు పంటలు పండించేట్టయితే ప్రతి రబీ సీజ¯ŒSలో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. లేదా పైరు పై జింక్ లోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 5 రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు పిచికారి చేయాలి. జింక్ లోపం వల్ల దాదాపు 10 శాతం దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా జింక్ సల్ఫేట్ను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. వ్యవసాయ శాఖ తరఫున సబ్సిడీపై జింక్ సల్ఫేట్ అందుబాటులో ఉంది. ఇబ్రహీంపట్నం వ్యవసాయ శాఖ వద్ద సుమారు 5టన్నుల జింక్ అందుబాటులో ఉంది. రైతులు సద్విని యో గం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్కుమార్ కోరుతున్నారు. పంటను కాపాడుకోవాలంటే జింక్ వేయాలి ప్రస్తుతం కరువులో వరిపంట వేసుకున్న రైతులు తప్పకుండా మెలుకువలు పాటించాలి. ఎప్పటికప్పుడు పంట ఏ రకంగా పెరుగుతుందో రైతు రోజూ పరిశీలించుకోవాలి. ఇటుక రంగుతో పైరు ఎర్రబారిన వెంటనే జింక్ వేసుకోవాలి . జింక్ వేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే పంట పాడువుతుంది. ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకుంటే మంచిది. – శ్రవణ్కుమార్, వ్యవసాయ శాఖ అధికారి -
ఉద్యోగులను ఐరన్ రాడ్తో బెదిరించి..
న్యూఢిల్లీ: జిందాల్ స్టీల్ వర్క్స్(జేఎస్డబ్ల్యూ) ఓ పరిపాలన అధికారిని సస్పెండ్ చేసింది. ఆ సంస్థలో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగులపై ఆయన ఐరన్ రాడ్డుతో దాడి చేయడంతోపాటు అసభ్యకరపదజాలంతో తిట్టడంతో అతడిని సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. దీంతో సంస్థ ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. ఎంత కోపం వస్తే మాత్రం కింది స్థాయి ఉద్యోగుల విషయంలో అంత దారుణంగా ప్రవర్తిస్తారా అని మందలిస్తూ అతడిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. -
దిగొచ్చిన రవిశంకర్
న్యూఢిల్లీ :ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవిశంకర్ ఎట్టకేలకు దిగి వచ్చారు. నిన్నటివరకు పైన్ కట్టేది లేదని భీష్మించిన రవిశంకర్ చివరికి అంగీకరించారు. కోర్టు తమకు విధించిన ఫైన్ చెల్లించేందుకు గడువు కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నాలుగు వారాల్లోగా అయిదు కోట్ల జరిమానాను చెల్లిస్తామని శుక్రవారం కోర్టును ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వేడుకుంది. అంత పెద్ద మొత్తాన్ని ఇప్పటికిపుడు చెల్లించలేమని తెలిపింది. తమది స్వచ్ఛంధ సంస్థ అని, కల్చరల్ ఫెస్టివల్ ఆరంభమయ్యేలోపు అంత మొత్తాన్ని సమీకరించలేమని పిటిషన్లో పేర్కొంది. అటు జైలుకైనా వెళతాకానీ, ఫైన్ కట్టేదిలేదన్న రవిశంకర్ వ్యాఖ్యలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయన లాంటి వారినుంచి అలాంటి ప్రకటనను ఊహించలేమని, ట్రిబ్యునల్ ను వివాదాస్పదం చేయొద్దని హెచ్చరించింది. బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. అయితే తక్షణమే రూ.25 లక్షలు చెల్లించాలని, మిగిలిన రూ 4.75 కోట్లు చెల్లించడానికి వీలుగా 3 వారాల గడువును ఇస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఒకవేళ ఈరోజు రూ .25 లక్షల చెల్లించడంలో సంస్థ విఫలమైతే ప్రభుత్వం జారీ చేసే 2.5 కోట్ల రూపాయలు ఎటాచ్ చేయబడతాయని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను ఏ్రపిల్ 4వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యమునా నది తీరంలో వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ కు గ్రీన్ సిగ్నల్ పడినట్టయింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఫెస్టివల్ ను ప్రారంభించనున్నారు. అటు పండిట్ రవిశంకర్ నిర్వహిస్తున్న ప్రపంచ సంస్కృతి ఉత్సవంపై ఇవాళ కూడా పార్లమెంట్ దద్దరిల్లింది. రాజ్యసభలో రవిశంకర్ వైఖరిపై జేడీయూ నేత శరద్ యాదవ్ మండిపడ్డారు. కల్చర్ ఈవెంట్తో పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేశ్ ఆరోపించారు. -
ఏఈఈ, ఏవో పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), అగ్రికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈనెల 17, 18వ తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్టు (సీబీఆర్టీ) నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. హైదరాబాద్లో 48 కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షలకు దాదాపు 18 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు 17న ఉదయం జనరల్ స్టడీస్ పరీక్ష, 18న ఉదయం ఆప్షనల్ పేపర్ ఉంటుందని... అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు 17న ఉదయం జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం ఆప్షనల్ పేపర్ ఉంటుందని... ఏఈఈ పోస్టులకు 18న ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం ఆప్షనల్ పేపర్ ఉంటుందని వివరించారు. జనరల్ స్టడీస్ పేపర్ తెలుగు, ఇంగ్లిషు రెండు మాధ్యమాల్లోనూ ఉంటుందని.. ఆప్షనల్ (సబ్జెక్టు) పేపర్ మాత్రం ఇంగ్లిషులోనే ఉంటుందని తెలిపారు. వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్ష కేంద్రాన్ని ముందుగానే చూసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. పరీక్ష కేంద్రంలో రిజిస్ట్రేషన్, తనిఖీలకు సమయం పడుతుందని, అందువల్ల ముందుగానే పరీక్షా కేంద్రాలకు వెళ్లాలని చెప్పారు. ఉదయం పరీక్షకు 8:30 నుంచి 9:15 లోపే, మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంట నుంచి 1:45 లోపే పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాలని సూచించారు. పరీక్షల పర్యవేక్షణకు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పకడ్బందీగా నిర్వహించేందుకు నలుగురు జోనల్ అధికారులను, 800 మంది ఇన్విజిలేటర్లను, 700 మంది సపోర్టింగ్ స్టాఫ్, 150 మంది కమిషన్ అబ్జర్వర్లు, 12 స్పెషల్ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాలను వెబ్సైట్లో (tspsc.gov.in) పొందవచ్చని వివరించారు. -
రైతులకు పింఛన్ అందించాలి: వైఎస్ఆర్ సీపీ
ఆదిలాబాద్ అర్బన్ : రైతు సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ సీపీ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది. సమస్యలు పరిష్కరించాలని, కరువు మండలాలను ప్రకటించాలని, ఆత్మహత్య చేసుకున్నరైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రూ.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసింది. అనంతరం కలెక్టరేట్లోకి వెళ్లి ఏవో రాజేశ్వర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్కుమార్ మాట్లాడుతూ.. కరువు మండలాలు ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని, రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా తక్షణమే అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరువుతో ఇబ్బుందులు పడుతున్న రైతులకు రూ.5 వేల చొప్పున పింఛన్ అందించాలని, పశువులకు పశుగ్రాసాన్ని, పాడి పశువులకు దానాను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర రూ.6 వేలు ప్రకటించాలన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి రైతుల కళ్లలో ఆనందం చూడాలనుకున్నారని, రైతు సంతోషంగా ఉంటేనే దేశం ఆనందంగా ఉంటుందనే వారని, కానీ ఈ ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్నా పాపన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎం.గంగన్న, ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు సలావుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
ఏఓపీ సరిహద్దులో భారీ వర్షాలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఏఓపీ సరిహద్దులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల నుంచి పడుతున్న వర్షాలకు నాగావళి , వంశధార నదుల్లో నీటి మట్టం భారీగా పెరిగింది. గొట్టా బ్యారేజీ లో ప్రస్తుతం ఇన్ ఫ్లో 33 వేలుగా ఉంది. వరద నీరు పెరుగుతుండటంతో 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ ఇన్ ఫ్లో 70 వేలకు పెరిగే అవకాశం ఉంది. -
ఆవు గుండెతో హైదరాబాదీకి కొత్త జీవితం
చెన్నై: గుండె కవాటాలు దెబ్బతిన్న వృద్ధురాలికి గోమాత ఊపిరిలూదింది. తన గుండెతో ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. హైదరాబాద్కు చెందిన అల్లూరి సీతాయమ్మ(81) అనే వృద్ధురాలికి గత శనివారం చెన్నై మొగపేర్లోని ఫ్రాంన్టియర్ లైఫ్ లైన్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఆవు గుండె నుంచి తయారుచేసిన కవాటాలు ఆమెకు అమర్చారు. వాల్వా ఇన్ వాల్వా ట్రాన్ స్కాథెటర్ ఎరొటిక్ వాల్వా రీప్లెస్మెంట్ (వీఐవీ-టీఎవీఆర్) అనే విధానంలో చికిత్సను విజయవంతం చేసినట్టు ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ కేమ్ చెరియన్ తెలిపారు. మహాధమని పూడుకుపోవడంతో 11 ఏళ్ల క్రితం ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయితే ఈ ఏడాది ఆరంభం మరోసారి సమస్య తలెత్తడంతో ఆమె పలు ఆస్పత్రులు తిరిగారు. ఆవు గుండెతో తయారు చేసిన కవాటాలు అమర్చి సమస్యను పరిష్కరించినట్టు ఫ్రాంన్టియర్ కార్డియాలజిస్ట్ అనంతరామన్ తెలిపారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో సీతాయమ్మ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. -
అగ్నిపర్వతం బిలంలోనే ఆ గ్రామం
టోక్యో: అంతర్గతంగా కుతకుత ఉడుకుతున్న ఓ ఉష్టమండల అగ్ని పర్వతం బద్దలైతే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెల్సిందే. అలాంటి ఓ అగ్నిపర్వతం బిలంలోనే ఓ కుగ్రామం ఉందంటే, అందులో 205 మంది ధైర్యంగా నివసిస్తున్నారంటే ఆశ్చర్యమే. ఆ అగ్ని పర్వతం, ఆ కుగ్రామం....జపాన్ రాజధాని టోక్యో నగరానికి 358 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఐజూ దీవుల సముదాయంలో భాగంగావున్న ఆ గ్రామం పేరు అగాషిమ. టోక్యో నగరం పాలనా యంత్రాంగం కిందనే అగాషిమ కొనసాగుతోంది. ఈ గ్రామంవున్న అగ్ని పర్వతాన్ని మూడో కేటగిరి కింద విభజించారు. ఇది ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశం ఉంటుంది. 1780లో మొదటి సారి ఈ అగ్ని పర్వతం బద్దలైనప్పుడు గ్రామ ప్రజల్లో సగం మంది చనిపోయారు. మిగిలిన వారు సమీపంలోని దీవులకు వలసపోయారు. ఆ తర్వాత యాభై ఏళ్లకు వారిలో కొంత మంది తిరిగొచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారని చరిత్ర చెబుతోంది. గ్రామస్థులు వేడినీళ్ల స్నానం చేయడానికి, వంట చేసుకోవడానికి వంట చెరకును వాడాల్సిన అవసరం లేదు. వేడి నీటి చెలిమల్లోనే వారు స్నానం చేస్తారు. మరీ తుక తుక ఉడుకుతున్నట్టు బుసబుస పొంగే చిన్న చిన్న నీటి గుంటలపై ఎలాంటి ఖర్చు లేకుండా వంట చేసుకుంటారు. ఉడకబెట్టిన గుడ్లు, బంగాళ దుంపలు, ఇతర కూరగాయలు వారి ప్రధాన ఆహారం. ప్రపంచానికి సంబంధం లేనట్టు ఉండే ఈ గ్రామానికి 1993 వరకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు. నౌకలను లంగరు వేసే అవకాశాలు కూడా లేకపోవడంతో టోక్యో నగరం 1993లో రోజుకు ఒక హెలికాప్టర్ సర్వీసును ఏర్పాటు చేసింది. ఆ హెలికాప్టర్లో కేవలం తొమ్మిది మంది ప్రయాణిలను తీసుకెళతారు. పేరుకు రోజువారి సర్వీసేగానీ ఆ హెలికాప్టర్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళుతుందో ఎవరూ చెప్పలేరు. వాతావరణ పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సర్వీసు నడుస్తుంది. అగ్నిపర్వతం నుంచి వెలువడే దట్టమైన పొగ, గ్యాస్ కారణంగా అక్కడ హెలికాప్టర్ దిగే పరిస్థితులు అన్ని వేళలా ఉండవు. టోక్యో పాలనా యంత్రాంగం హెలికాప్టర్ సర్వీసును ప్రారంభించిన తర్వాత వారికి భూగర్భం నుంచి వెలువడే జియోథర్మల్ స్ట్రీమ్ను ఉపయోగించి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసింది. అక్కడి వారి పిల్లల కోసం ఒక ప్రాథమిక పాఠశాలను కూడా నడుపుతోంది. అందులో ప్రస్తుతం 25 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. హై స్కూల్కు వెళ్లాలంటే వారు టోక్యో నగరానికి వెళ్లాల్సిందే. అలా చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థుల్లో 99 శాతం మంది టోక్యో నగరంలోనే స్థిరపడుతున్నారట. వెనక్కి రావడం లేదట. అందుకని భారత్లో పెళ్లి కూతురును అత్తారింటికి పంపుతున్నట్టు విద్యార్థులను వారు ఘనంగా చదువు కోసం సాగనంపుతున్నారు. -
కొండంత వ్యాధికి మెండైన చికిత్స!
మెడికల్ మెమరీస్ కొండాలు ఊరు గుంటూరు జిల్లాలోని పెదకాకాని. పేరుకు తగ్గట్టుగానే ఆయన కొండల్లాంటి బరువులను అలవోకగా మోస్తుంటాడు. తానో ముఠామేస్త్రి. పొగతాగడం వంటి దురలవాట్లేమీ లేవు. రక్తపోటూ, మధుమేహం లాంటి దీర్ఘకాలిక జబ్బులూ లేవు. ఇంట్లోని రెండు పాడిగేదెల నుంచి రోజూ పాలు పితికేస్తాడు. జీవితంలోని ఆనందాలను పిండేస్తూ బతికేస్తాడు. కుటుంబసభ్యుల వెతలను తీర్చేస్తాడు. ఇదీ కొండాలు జీవనశైలి. ఒక రోజున 50 కిలోల బియ్యం మూట మోస్తుంటే అకస్మాత్తుగా ఛాతీలో కలుక్కుమంది. చిన్ననొప్పేకదా అని పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత తెలిసింది... కొండాలుకు వచ్చింది కొండంత కష్టమని! మూడునాలుగు రోజుల్లోనే గుండె నొప్పి హెచ్చింది. ఆయాసం పెరిగింది. గుంటూరు పెద్దాసుపత్రిలో చూపించాడు. డాక్టర్లు పరీక్ష చేసి ‘అయోర్టిక్ డిసెక్షన్’ అని నిర్ధారించారు. అంటే... గుండె నుంచి అన్ని అవయవాలకూ రక్తాన్ని సరఫరా చేసే బృహద్ధమని గోడలు చిట్లిపోయాయి. ఆ చిట్లిన చోట్ల రక్తం చేరి గడ్డకడుతుంది. దాంతో ఇతర అవయవాలకు జరగాల్సిన రక్తసరఫరాకు అడ్డుకట్ట పడుతుంది. ఫలితంగా ఆయా అవయవాలు చచ్చుబడిపోయే ప్రమాదముంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ‘ప్రాణాంతకమైన వ్యాధి’. కొండాలు వ్యాధి తీవ్రత పెరుగుతూ పోతోంది. బాధ తగ్గడం కోసం ఎక్కని మెట్టూ లేదు. మొక్కని చెట్టూ లేదు. ఎవరూ భరోసా ఇవ్వడం లేదు. ఎక్కడా థిలాసా కలగడం లేదు. విజయవాడ వెళ్లి సంప్రదిస్తే ‘ఈ చికిత్సకు ఆపరేషన్ ఒక్కటే మార్గం. కానీ భారతదేశంలోనే ఈ తరహా ఆపరేషన్లు చాలా అరుదు. అది కూడా చాలా ఖరీదు’ అన్నారు డాక్టర్లు. మరో పదిరోజులు గడిచాక అయోర్టిక్ డిసెక్షన్ తీవ్రత మరింత పెరిగింది. ఎడమ మూత్రపిండానికి రక్తప్రసరణ ఆగిపోయింది. ఎడమకాలికీ రక్తప్రవాహం నిలిచిపోయింది. పరిస్థితి కిడ్నీ ఫెయిల్యూర్ వరకూ రావడంతో కొండాలు ఆయుష్షు ఇక రోజులేనని తేల్చేశారు అక్కడి డాక్టర్లు. ఈలోగా కొండాలు తమకు దగ్గరి బంధువైన డాక్టర్ సుజాతను కలిశాడు. సుజాత గన్నవరం దగ్గరి పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్. ఆమె తండ్రికి గతంలో నేను యాంజియోప్లాస్టీ చేశాను. నామీది గురితో ఒకసారి నన్ను సంప్రదించమని చెప్పిందామె. ఐదేళ్ల క్రితం అంటే... 2010లో కొండాలు నన్ను కలిసేనాటికి ఆ వ్యాధి ఎంతగా ముదరిందంటే శస్త్రచికిత్సతో దాన్ని తగ్గించడం ఇక అసాధ్యం అని తేలిపోయింది. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలేమిటని వెతకడం మొదలుపెట్టాను. 2010కి ముందు కొందరిలో ఈ వ్యాధిని స్టెంట్ వేసి తగ్గించిన దాఖలాల గురించి నేను పరిశోధన పేపర్లలో చూసి ఉండటంతో ఆ దిశగా ఓ ప్రయత్నం చేద్దామని అనుకున్నా. కానీ అయోర్టిక్ డిసెక్షన్ కేసుల్లో బృహద్ధమనికి స్టెంట్ వేసి నయం చేయవచ్చని పుస్తకాల్లో చదివానే తప్ప ఆ తరహా చికిత్స ఎప్పుడూ చేయలేదు. పైగా ఎడమ మూత్రపిండానికీ, కాలికీ రక్తప్రసరణ ఆగడంతో కేసు మరీ సంక్లిష్టమైంది. అయినా ఒక ప్రయత్నం చేసి చూద్దామనే నా సంకల్పం. కొన్ని సందేహాలు వస్తే బెంగళూరులోని సీనియర్ వైద్యుల సలహాలు తీసుకున్నాం. మర్నాడు స్టెంట్ అమరిక ఆపరేషన్కు సర్వవిధాలా సన్నద్ధమయ్యాం. ఈ ప్రయత్నంలో నా సహచరవైద్యుడూ చీఫ్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ వెంగళరెడ్డి సహకారం మరువలేనిది. ముందుగా కుడికాలి రక్తనాళం ద్వారా బృహద్ధమని వరకూ చేరదామని ప్రణాళిక వేసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ అక్కడివరకూ చేరలేకపోయాం. వెంటనే చేతి ధమని (రేడియల్ ఆర్టరీ) ద్వారా మళ్లీ ప్రయత్నించాం. ఈసారి సరైన చోటికే చేరాం. బృహద్ధమనిలో అవసరమైన ప్రదేశంలో స్టెంట్ వేశాం. ఆపరేషన్ విజయవంతమైంది. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడంతో కేవలం 60 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తయ్యింది. కొండాలు గుండెలోని అడ్డుతో పాటూ... మా గుండెల్లోని బరువూ తొలగిపోయింది. మూడు నెలల తర్వాత సీటీ స్కాన్ తీసి చూస్తే కిడ్నీకీ, కాలికీ రక్తప్రసరణ పూర్తిగా పునరుద్ధితమైంది. ఆపరేషన్ అయ్యాక ఐదు రోజుల తర్వాత సురక్షితంగా ఇంటికి వెళ్లిన కొండాలు ఇప్పుడు ఐదేళ్ల తర్వాత ఒకసారి సాధారణ చెకప్ కోసం నా దగ్గరికి వచ్చాడు. కొండాలు మాట ఎలా ఉన్నా అత్యంత అరుదైన వ్యాధికి, అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియను అత్యంత సులువు చేసి, ఆయన్ని బతికించినందుకు నాకు కొండంత ఆనందం! నిర్వహణ: యాసీన్ కొండాలు వ్యాధి తీవ్రత పెరుగుతూ పోతోంది. బాధ తగ్గడం కోసం ఎక్కని మెట్టూ లేదు. మొక్కని చెట్టూ లేదు. ఎవరూ భరోసా ఇవ్వడం లేదు. -
అమ్మో.. ‘ఆపరేషన్’!
ఆపరేషన్ అంటే ఎంత గుండె నిబ్బరం గల రోగికైనా భయమే. ఎంతటి వారికైనా గుండె దడ సహజమే. అయితే.. పేషెంట్లాగే కొందరు వైద్యాధికారులు సైతం అదంటేనే భయంతో వణుకుతున్నారు. వైద్యాధికారులు ఏమిటి.. వారికి ఆపరేషన్ ఏమిటి.. అనుకుంటున్నారా..?. అవును.. వారు నిజంగానే ఆపరేషన్ను ఎదుర్కోబోతున్నారు. అది అట్లాంటిది.. ఇట్లాంటిది కాదు. సర్కారు చీల్చిచెందాడేది. ఇంకా అర్థం కాలేదా..? అయితే.. చదవండి. ఖమ్మం వైరారోడ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ‘ఆపరేషన్’ చేపట్టింది. వైద్యారోగ్య శాఖలో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాలపై దృష్టి సారించింది. అక్రమార్కుల భరతం పట్టేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర డెరైక్టర్పై వేటు వేయడంతోపాటు ఆ శాఖలో జరుగుతున్న అవినీతిపై జిల్లాల వారీగా నిఘా పెట్టిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని వైద్యారోగ్య శాఖ అధికారుల్లో గుబులు మొదలైంది. ఇప్పటి దాకా అందిన కాడికి దోచుకున్న కొందరు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విచారణ చేపడితే తామెక్కడ దొరికిపోతామోనని భయంతో వణికిపోతున్నారు. వివాదాల పుట్ట.. డీఎంహెచ్ఓ కార్యాలయం ఖమ్మం డీఎంహెచ్ఓలో అవినీతి తాండవిస్తోందనే ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తాయి. ఎన్ఆర్హెచ్ఎం నిధుల దుర్వినియోగం, 104లో డిప్యుటేషన్లు, కాంట్రాక్ట్ నియామకాలు, వాహనాల రిపేర్లు తదితర విషయాల్లో భారీగా అవినీతి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అధికారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఏఓ నాగార్జునను సంప్రదించకుండా డీఎంహెచ్ఓ భానుప్రకాశ్ నేరుగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో ఇటీవల విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆ తర్వాత కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం వివాదం సద్దుమణిగింది. ‘అనారోగ్య’మిషన్! జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు ప్రతి మూడు నెలలకోసారి లక్షల్లోనూ ఒక్కోసారి కోట్లలోనూ నిధులు వస్తుంటాయి. వాటిని జిల్లాలోని పీహెచ్సీలు, ఏరియా, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణకు వెచ్చిస్తుంటారు. అయితే.. ఈ బాధ్యతను డీపీఎం నిర్వర్తించాల్సి ఉండగా డీఎంహెచ్ఓ నేరుగా చూస్తుండటం చర్చనీయాంశమైంది. ఈక్రమంలో ఈ నిధుల్లో భారీగానే అవినీతి చోటుచేసుకుంటోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. నియామకాల్లోనూ అంతే.. ‘104’లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఇటీవల 20 మందిని అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా లేకుండా నియమించుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో ఏఓ, డీఎంహెచ్ఓ మధ్య విభేదాలు పొడచూపాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా అపాయింట్మెంట్ ఆర్డర్ లేని ఔట్సోర్సింగ్ ఉద్యోగి తనకు జీతం చెల్లించే విషయంలో ఏఓ వేధిస్తున్నారంటూ ఘర్షణ పడిన ఘటన కూడా చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఏఓకు వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు అండగా నిలిచారు. డీఎంహెచ్ఓ ప్రవర్తన కారణంగానే ఏఓ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఓను సంప్రదించకుండా నియామకాలు చేపట్టడంపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ విషయం కలెక్టర్ వద్దకు కూడా వెళ్లింది. ఇదిలా ఉండగా వైద్యారోగ్య శాఖలో డిప్యూటేషన్లలో కూడా అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అవసరం లేని చోట ఇద్దరు, ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించడం వివాదానికి దారి తీసింది. అంతేకాకుండా హెల్త్ అసిస్టెంట్ల నియామకంలోనూ అవినీతి చోటుచేసుకుందని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. వాహనాల రిపేర్ల పేరుతో దోపిడీ జిల్లా వైద్యారోగ్య శాఖకు చెందిన వాహనాలతోపాటు 104, 108 వాహనాలు తరచూ రిపేర్లకు వస్తుంటాయి. వాటికి సంబంధించిన బిల్లులు డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి చెల్లిస్తుంటారు. వాటిలోనూ భారీగా కుంభకోణం చోటుచేసుకుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రిపేర్లకు ఎక్కువ ఖర్చయినట్లు బిల్లులు సృష్టించి నిధులు స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. -
'తప్పనిసరైతే ప్రత్యామ్నాయ మార్గాలు'
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రహదారుల మూసివేత వ్యవహారంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సైనికాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సైనికాధికారులకు గవర్నర్ సూచించారు. రహదారుల మూసివేత తప్పనిసరైతే ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని అన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని తొమ్మిది రూట్లలో వాహనాల రాకపోకలపై రక్షణాధికారులు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
ఉల్లిపైనే ఆశలు!
ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలు.. తల్లికూడా చేయదంటారు. అంటే దీన్ని తీసుకోవడం ఎంత ఆరోగ్యదాయకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జిల్లాలోనే ఈ పంట సాగుకు పేరుగాంచినది మనూరు మండలం. ఇక్కడ చాలా మంది రైతులు ప్రతిఏటా ఉల్లిని విస్తారంగా పండిస్తారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా సంప్రదాయంగా ఇది కొనసాగుతోంది. ప్రతీ గ్రామంలో 100 హెక్టార్లకుపైగానే ఈ పంట సాగవుతోంది. అయితే దీని సాగులో పాటించాల్సిన మెలకువలు, జాగ్రత్తలపై ఏఓ శ్రీనివాస్రెడ్డి (సెల్: 9676606020) అందించిన సలహాలు, సూచనలు... పంట సాగుకు ముందు విత్తనశుద్ధిని విధిగా పాటించాలి. దీనివల్ల చీడపీడల నుంచి రక్షణ పొందవచ్చు. కిలో విత్తనానికి 1గ్రాము కొర్బండిజం, 2.5గ్రాముల మ్యాంగోజబ్ను కలిపి శుద్ధి చేసుకోవాలి. ఉల్లినారు వేసే సమయంలో 20 నుంచి 30 రోజుల ముందు ఒక్క అంగుళం ఎత్తులో మట్టి బెడ్డును ఏర్పాటు చేసుకోవాలి. ఈ బెడ్డు 10 నుంచి 15గజాల పొడవు ఉండాలి. బెడ్డుపైన ఆకులు, అములు వంటి చెత్త వేసి కాల్చివేయాలి. దీంతో బెడ్డుపైన ఉన్న శిలీంద్రాలు, బ్యాక్టీరియా చనిపోతాయి. అనంతరం బెడ్డును నీటితో తడిపి ఉల్లి విత్తనాలు చల్లుకోవాలి. ఒక్క ఎకరాకు నాలుగు కిలోల ఉల్లి విత్తనాలు వేసుకోవాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న విధంగా ఎన్ని ఎకరాలు వేస్తే అన్ని బెడ్లు వేసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో నారుకు నీటి తడులు అందించాలి. సాగు నేలను సిద్ధం చేసుకోండిలా... ఉల్లినారు చేతికి వచ్చిన సమయంలో సాగు నేలను సిద్ధం చేసుకోవాలి. ఇందులో భాగంగా ఒక్క ఎకరాకు ఒక కిలో డీఏపీ, 30 కిలోల పొటాష్, 25 కిలోల యూరియా చల్లిన తరువాత భూమిని చదనుగా దున్ని మడులను సిద్ధం చేసుకోవాలి. నాట్లు వేసే ఒకరోజు ముందు మడులను నీటితో తడపాలి. అనంతరం నారును నాటేయాలి. 5 నుంచి 7 రోజుల అనంతరం మడులలో నెర్రెలుబారిన తర్వాత తిరిగి నీటిని వదలాలి. కలుపు నివారణ పంట నాటిన తర్వాత 20 నుంచి 25 రోజుల అనంతరం మొదటి కలుపు తీయాలి. కలుపు నివారణకు గాను ఎకరాకు 200 మిల్లీలీటర్ల ఆక్సాడయాక్సిన్ను పిచికారీ చేసుకోవాలి. ఈ మందు పిచికారీ చేసే సమయంలో భూమి తేమగా ఉండాలి. అనంతరం 30 నుంచి 35 రోజుల మధ్య రెండోసారి కలుపు తీసి ఎకరాకు 35 కిలోల యూరియా చల్లి నీటిని అందించాలి. 40 నుంచి 45 రోజుల్లో మూడోసారి కలుపు తీసి 30 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ చల్లితే పంట ఏపుగా పెరుగుతుంది. ప్రత్యేక జాగ్రత్తలు 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. పంటను తీయడానికి వారం రోజుల ముందు మడులకు నీరు పారించొద్దు. దీంతో ఉల్లిగడ్డ దిగుబడి, బరువు పెరుగుతుంది. మళ్ల నుంచి తొలగించిన ఉల్లిని చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. లేక చెట్టు నీడ అయిన ఫర్వాలేదు. దీంతో ఉల్లి కుళ్లి పోకుండా ఉంటుంది. వారం రోజుల్లో మార్కెట్కు తరలించుకోవచ్చు. లేకుంటే గిడ్డంగులకు తరలించి నిల్వ ఉంచుకోవచ్చు. మార్కెట్ రేటును బట్టి రైతులు ఉల్లిని విక్రయించుకోవచ్చు. తెగుళ్ల నివారణ ఉల్లి పంటకు రసం పీల్చే పురుగు బెడద ఉంటుంది. దీని నివారణకు గాను ఎకరాకు 1లీటర్ నీటిలో 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ మందును కలిపి పిచికారీ చేయాలి. లేదా ఒక లీటరు నీటిలో 1మి.లీ. టిప్రోనిల్ను కలిపి స్ప్రే చేయాలి. లీటరు నీటిలో 3గ్రాముల చొప్పున ఎం.45 మందును కలిపి కొట్టినా పురుగును నివారించవచ్చు. రసం పీల్చే పురుగు బెడద మరీ ఎక్కువగా ఉంటే 30నుంచి 45రోజుల మధ్య 10లీటర్ల నీటిలో 6 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందును స్ప్రేచేయాలి. ఎకరా భూమిలో దాదాపు 80నుంచి 90 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వంద క్వింటాళ్ల వరకు తీయొచ్చు. -
కలెక్టరేట్లో దొంగలు పడ్డారు
కలెక్టరేట్ : జిల్లా పరిపాలనకు గుండె కాయలాంటి కలెక్టరేట్లోనే దొంగలు పడిన సంఘటన సంచలనం సృష్టిస్తుంది. నిత్యం వందలాది మంది ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్కు వచ్చే ప్రజలతో కిటకిటలాడే కలెక్టరేట్ పరిపాలనా అధికారి (ఏఓ) ఛాంబర్లో ఇటీవల కంప్యూటర్ మాయమైంది. చాంబర్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సంబంధిత అధికారితో పాటు అక్కడ ఒక అటెండర్ కూడా ఉంటాడు. చాంబర్ పక్కనే రెవెన్యూ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుంటారు. ఇక్కడ ఎప్పుడూ వివిధ పనులు కోసం ఉద్యోగులు కిందకు...పైకి తిరుగుతుంటారు. మరి ఇలాంటి చోట కంప్యూటర్ ఏ విధంగా మాయమైందో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఎప్పుడు అత్యంత రద్దీగా కలెక్టరేట్లో కంప్యూటర్ దొంగిలించారంటేనే విస్మయం కలుగుతుంది. అసలు కంప్యూటర్ ఎప్పుడు పోయింది.. ఏ సమయంలో పోయింది అనే విషయంపై సంబంధిత అధికారుల్లోనే స్పష్టతలేదని తెలుస్తుంది. ఏఓ చాంబర్లో జిల్లాకు సంబంధించిన అనేక కీలకమైన ఫైళ్లు ఉంటాయి. వాటికి సంబంధించిన సమాచారం కంప్యూటర్లో నిక్షిప్తమై ఉండడం వల్లనే దానిని దొంగిలించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ప్రభుత్వ శాఖకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆయా మండలాల నుంచి సమాచారం ఏఓకు చేరుతుంది. ఇంతటి ప్రాముఖ్యత గల చాంబ ర్లో కంప్యూటర్ దొంగతనానికి గురైనా దానిపై విచారణ కూడా చేయించకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిని బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. కాగా అసలు ఈ కంప్యూటర్ను దొంగిలించింది ఇంటి దొంగలా లేక బయటి వాళ్ల అనే విషయాలపై కూడా ఇక్కడి వారు దృష్టి పెట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధం గా ఏఓ చాంబర్లో మరికొన్ని ముఖ్యమైన ఫైళ్లు కూడా పోయాయనే ప్రచారం జరుగుతుంది. జిల్లాకు ప్రధాన కార్యాలయం అయిన కలెక్టరేట్లోనే భద్రత కరువయితే ఇక మిగతా కార్యాలయాల్లో అన్ని సక్రమమేనా అనే సందేహాలు తెలెత్తకమానవు. కంప్యూటర్ దొంగతనంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే దొంగలు రెండు రోజుల్లోనే దొరికే అవకాశముందనే అభిప్రాయం ఉద్యోగుల్లో వ్యక్తం అవుతుంది. కంప్యూటర్ పోయింది వాస్తవమే : సత్తయ్య, కలెక్టరేట్ పరిపాలనాధికారికలెక్టరేట్ పరిపాలనాధికారి చాంబర్లో కంప్యూటర్ పోయిన విషయం వాస్తవమే. అది పోయిన సమయంలో నేను పరిపాలనాధికారిగా లేను. కంప్యూటర్ పోయిన రోజే పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
విజేత ఏఓసీ
జింఖానా, న్యూస్లైన్: ఓపెన్ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో ఏఓసీ జట్టు విజేతగా నిలిచింది. విక్టరీ ప్లేగ్రౌండ్లో ముంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఏఓసీ జట్టు 75-72తో ఎస్సీఆర్ జట్టుపై నెగ్గి టైటిల్ కైవసం చేసుకుంది. తుది పోరులో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి 39-37తో ఏఓసీ ఆధిక్యంలో నిలిచింది. ముందు నుంచి దూకుడుగా ఆడిన జలీల్ (30), సత్యనారాయణ (12), నాగరాజు (11) చివరి వరకు అదే ఆటతీరును ప్రదర్శించారు. ఎస్సీఆర్ క్రీడాకారులు నిహాల్ యాదవ్ (23), మురళి (19) చెమటోడ్చినప్పటికీ ఫలితం దక్కలేదు. విజేతలకు జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ అడిషనల్ కంట్రోలర్ ఎస్.అన్నపూర్ణ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి బీడీఎల్ మాజీ సీనియర్ జనరల్ మేనేజర్ కృష్ణ, ఏపీ బాస్కెట్బాల్ సంఘం కార్యదర్శి సంపత్ తదితరులు పాల్గొన్నారు.