aggriculture
-
వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దీనిద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగంలో పరిశ్రమల ద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకెళ్లేందుకు వీలవుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు. రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్పీవోల) వంటివి చిన్న, మధ్యతరగతి రైతులకు ఎంతగానో ఉపయుక్తం అవుతాయన్నారు. వీటి నిర్మాణానికివ్యవసాయ విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని వెంకయ్యనాయుడు సూచించారు. ఆదివారం బిహార్ చంపారన్లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. చిన్న, మధ్యతరగతి రైతులు తమకున్న పరిమిత వనరులతో అద్భుతాలు సాధించడం వెనుక దేశ వ్యవసాయ రంగం గొప్పదనం దాగుందని, అందుకే వివిధ మార్గాల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా వారికి మద్దతుగా నిలవాలన్నారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ఆహారభద్రతను సుస్థిరం చేయాలన్నారు. -
నిత్య దిగ్బంధనాలా..?
సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు జాతీయ రహదారులను దిగ్బంధిస్తుండడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రహదారుల దిగ్బంధనానికి ముగింపు ఎక్కడ అని ప్రశ్నించింది. రైతుల ఆందోళన కారణంగా జాతీయ రహదారులపై 20 నిమిషాల ప్రయాణానికి 2 గంటలు పడుతోందంటూ నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ను గురువారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. సమస్యను న్యాయస్థానాలు, పార్లమెంట్లో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ జాతీయ రహదారులపై జనం రాకపోకలను అడ్డుకోవడం ద్వారా కాదని పేర్కొంది. ఈ విషయంలో చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహకులదని స్పష్టం చేసింది. ‘ఏవైనా ఆదేశాలు జారీ చేస్తే కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోకి వచ్చామంటూ ఆరోపిస్తారు. చట్టాన్ని ఎలా అమలు చేయాలనేది కార్యనిర్వాహకుల బాధ్యత’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రోడ్లపై ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా రైతులను అభ్యరిస్తున్నామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. జాతీయ రహదారులను దిగ్బంధించకుండా నిరసనకారులను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నామని హరియాణా ప్రభుత్వం వెల్లడించింది. చర్చల నిమిత్తం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, రైతులు రావడానికి నిరాకరిస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు నాలుగుకు వాయిదా వేసింది. -
సాగు చట్టాల ప్రయోజనాలు ప్రచారం చేయండి
న్యూఢిల్లీ: ‘దేశమే ప్రథమం’ అన్న భావన స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. దేశం కోసం, దేశాభివృద్ధి కోసం పని చేయడమే పార్టీ కార్యకర్తల లక్ష్యం కావాలన్నారు. పార్టీ మౌలిక సూత్రం ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్’ భావనేనని వివరించారు. ఈ సూత్రం అధారంగానే ప్రభుత్వం జీఎస్టీ సహా పలు సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. ‘అధికారం సాధించడం మన ఉద్దేశ్యం కాకూడదు.. దేశాభివృద్ధి కోసం ప్రజాసేవ చేయడమే మన లక్ష్యం కావాలి’ అని వివరించారు. పార్టీ కొత్త ఆఫీస్ బేరర్ల తొలి సమావేశాన్ని ఉద్దేశించి మోదీ ఆదివారం ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చినందుకు, కోవిడ్–19 నియంత్రణ దిశగా సమర్ధవంతమైన నాయకత్వం అందించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశంలో ఒక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. బడ్జెట్ ప్రతిపాదనలను, గరీబ్ కళ్యాణ్ యోజనను, సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలను ఎదుర్కొన్న తీరును కూడా తీర్మానంలో ప్రశంసించారు. ‘రైతు ప్రయోజనాలు కేంద్రంగా ప్రభుత్వం మూడు చట్టాలను తీసుకువచ్చింది. వారి వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర లభించడం, వారి ఆదాయం రెట్టింపు కావడం, తమ ఉత్పత్తులను నచ్చినచోట అమ్ముకునే వెసులుబాటు వారికి లభించడం.. అనే లక్ష్యాల సాధన కోసం ఈ చట్టాలు రూపొందాయి’ అని బీజేపీ ఉపాధ్యక్షుడు రమణ్ సింగ్ ప్రవేశపెట్టిన ఆ తీర్మానంలో పేర్కొన్నారు. చైనాతో ఉద్రిక్తతల సమయంలో వెనక్కు తగ్గకుండా, అదే సమయంలో, అనవసరంగా దూకుడుగా వెళ్లకుండా, సంయమనంతో వ్యవహరించి, సానుకూల పరిష్కారం సాధించారని మోదీపై ప్రశంసలు కురిపించింది. సరిహద్దుల్లో పొరుగుదేశాల విస్తరణ వాదాన్ని భారత్ సహించబోదని, ఈ విషయాన్ని మోదీ నాయకత్వంలో భారత్ పలుమార్లు రుజువు చేసిందని వివరించింది. మోదీ నాయకత్వంలో భారతదేశం స్పష్టమైన విధానంతో బలమైన దేశంగా రూపుదిద్దుకుందని పేర్కొంది. కోవిడ్–19పై పోరులో భారత్ను విజయవంతమైన దేశంగా నిలిపారని ప్రశంసించింది. సాగు చట్టాల విషయంలో కాంగ్రెస్ సహా పలు పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆ తీర్మానం పేర్కొంది. నూతన విద్యా విధానం, కార్మిక సంస్కరణలు సహా కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలను తీర్మానంలో ప్రశంసించారు. పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేయాలని పార్టీ శ్రేణులను కోరింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం వివరాలను బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ మీడియాకు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ సమావేశాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. సాగు చట్టాల ప్రయోజనాలను రైతులకు వివరించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. అలాగే, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు కృషి చేయాలని కోరారు. పలు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై, ఆత్మనిర్భర్ భారత్పై, సాగు చట్టాలపై ఈ సమావేశంలో చర్చ జరిగిందని పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వెల్లడించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్షులు పాల్గొన్నారు. -
బిల్ వాపసీ కాదంటే.. గద్దీ వాపసీ!
న్యూఢిల్లీ/జింద్(హరియాణా): ఒకవైపు, రైతు నిరసన కేంద్రాలను ప్రభుత్వం దుర్భేద్య కోటలుగా మారుస్తోంటే.. మరోవైపు, ఉద్యమ తీవ్రతను ప్రభుత్వానికి రుచి చూపిస్తామని రైతు నేతలు హెచ్చరిస్తున్నారు. ఉద్యమం ఇలాగే కొనసాగితే మోదీ సర్కారు అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోనట్లయితే అధికార పీఠం దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ‘ఇన్నాళ్లూ వ్యవసాయ చట్టాలను(బిల్ వాపసీ) వెనక్కు తీసుకోవాలనే డిమాండ్ చేశాం. ఆ చట్టాలను వెనక్కు తీసుకోనట్లయితే.. అధికారాన్ని వెనక్కు తీసుకునే(గద్దీ వాపసీ) నినాదాన్ని మన యువత ఇస్తే పరిస్థితేంటో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి’ అని హరియాణాలో బుధవారం జరిగిన రైతు మహా పంచాయత్లో భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున బారికేడ్లను, ముళ్ల కంచెలను, రోడ్లపై మేకులను ఏర్పాటు చేయడంపై స్పందిస్తూ.. ‘రాజు భయపడినప్పుడే.. కోటను పటిష్టం చేసుకుంటాడు’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రోడ్లపై ఏర్పాటు చేసిన మేకులపై తాను పడుకుని, ఇతర రైతులు తనపై నుంచి సురక్షితంగా దాటి వెళ్లేలా చూస్తానని ఉద్వేగభరితమయ్యారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రమవుతోందని, ఖాప్ పంచాయత్ల నుంచి లభిస్తున్న మద్దతు చూస్తుంటే కచ్చితంగా విజయం సాధిస్తామన్న నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు.ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను కేంద్రం కొనసాగిస్తోంది. ముఖ్యంగా వేలాది రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీ– మీరట్ హైవేపై ఉన్న ఘాజీపూర్ సరిహద్దు వద్ద భద్రత చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ మద్దతు గర్వకారణం రైతు ఉద్యమానికి అంతర్జాతీయ ప్రముఖుల నుంచి మద్దతు లభించడం గర్వకారణమని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. అనధికార చర్చలు లేవు: తోమర్ రైతులతో అనధికార చర్చలు జరపడం లేదని బుధవారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. నిరసన కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున భద్రత చర్యలు చేపట్టడంపై స్పందిస్తూ అది స్థానిక ప్రభుత్వానికి సంబంధించిన శాంతి భద్రతల సమస్య అని పేర్కొన్నారు. రైతు ప్రతినిధులతో ప్రభుత్వం జనవరి 22న జరిపిన 11వ విడత చర్చలు అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన హింసకు సంబంధించి అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేసేవరకు ప్రభుత్వంతో చర్చల ప్రసక్తే లేదన్న రైతుల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘అది శాంతి భద్రతలకు సంబంధించిన అంశం. దానిపై వారు ఢిల్లీ పోలీస్ కమిషనర్తో మాట్లాడాలి. నాతో కాదు’ అని తోమర్ పేర్కొన్నారు. రైతు ఉద్యమానికి అంతర్జాతీయంగా లభిస్తున్న మద్దతుపై బుధవారం బీజేపీ స్పందించింది. ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా కుట్ర జరుగుతోందని ఆరోపించింది. ట్విటర్కి కేంద్రం వార్నింగ్ రైతు ఉద్యమానికి సంబంధించి వస్తున్న అసత్య ప్రచారాల ట్వీట్లను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమం ట్విటర్ని ఆదేశించింది. వెంటనే ఆ పని చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వ్యవసాయ చట్టాలపైన, రైతు ఆందోళనలపైన అవగాహన లేని వారంతా రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నారంది. రైతు మారణహోమం పేరుతో హ్యాష్ట్యాగ్ త్వరలో రాబోతోందన్న సమాచారం ఉందని అలాంటివి వెంటనే అడ్డుకోవాలంటూ ట్విటర్కి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ నోటీసులు పంపింది. -
రైతు ఉద్యమంపై ట్వీట్ వార్
కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తోఢిల్లీలో రైతులు సాగిస్తున్న అవిశ్రాంత పోరాటానికి అంతర్జాతీయంగా మద్దతు వెల్లువెత్తుతోంది. పలువురు ప్రముఖులు రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ విషయంలో కొందరు ప్రముఖులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి అండగా నిలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బుధవారం రైతు అనుకూల, ప్రభుత్వ అనుకూల పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ‘‘భారతదేశాన్ని వెయ్యి సంవత్సరాలపాటు విదేశీ వలసవాదులు అక్రమించుకున్నారు, పాలించారు, లూటీ చేశారు. దేశం బలహీనంకావడం వల్ల కాదు, ఇంటి దొంగల వల్లే ఇదంతా జరిగింది. ఇండియాను అప్రతిష్టపాలు చేసే దిశగా జరుగుతున్న అంతర్జాతీయ ప్రచారం వెనుక ఎవరున్నారో ప్రశ్నించాలి’’ – కిరణ్ రిజిజు, కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ‘‘భారతదేశ శక్తి సామర్థ్యాలు పెరుగుతుండడం చూసి అంతర్జాతీయ శక్తుల్లో వణుకు పుడుతోంది. అందుకే దేశాన్ని, దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేందుకు కుట్రలు సాగిస్తున్నాయి’ – రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ‘‘ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాకు తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకొనే సత్తా ఉంది’’ – అనిల్ కుంబ్లే, మాజీ క్రికెటర్ ‘‘అర్ధ సత్యం కంటే మరింత ప్రమాదకరమైనది ఇంకేదీ లేదు’’ – సునీల్ శెట్టీ, బాలీవుడ్ హీరో ‘‘అరాచక శక్తులను అరాధించే అంతర్జాతీయ ముఠాలను ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఢిల్లీలో హింసను ఎలా ప్రేరేపించారో, జాతీయ జెండాను ఎలా అవమానించారో మనమంతా చూశాం. మనమంతా ఇప్పుడు ఏకం కావాలి. ఇలాంటి శక్తులను ఓడించాలి’’ – హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ‘‘ఇండియాకు, ఇండియా విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న దుష్ప్రచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దు’’ – అజయ్ దేవగణ్, నటుడు ‘ఏవైనా వ్యాఖ్యలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి’ –సాగు చట్టాలపై జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు, ట్వీట్లపై భారత విదేశాంగ శాఖ ‘ప్రచారంతో దేశ ఐక్యతను దెబ్బతీయలేరు. దేశం ఉన్నత శిఖరాలు అధిరోహించకుండా అడ్డుకోలేరు. దేశ భవిష్యత్తును నిర్దేశించేది అభివృద్ధే తప్ప ప్రచారం కాదు’ –కేంద్ర మంత్రి అమిత్ షా -
వ్యవసాయ రంగానికి రూ. 1,31,531 కోట్లు
రైతు ఉద్యమం జోరుగా సాగుతున్న వేళ రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సోమవారం తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బ్యాంకుల ద్వారా వ్యవసాయానికిచ్చే రుణాల పరిమితిని 10% పెంచనున్నట్లు ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సాగు రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లు అయింది. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం పలు ఉత్పత్తులపై సెస్ విధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సెస్ బంగారం, వెండిలపై 2.5% వరకూ ఉంటే.. మద్యంపై 100% వరకూ ఉంది. ఈ నిధులను మౌలిక సదుపా యాలను అభివృద్ధికి ఖర్చు చేస్తామని మంత్రి తెలిపారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల వృద్ధికి ఇచ్చే నిధులను గత ఏడాది (రూ.30వేల కోట్లు) కంటే రూ. పదివేల కోట్లు ఎక్కువ చేయడం, సూక్ష్మ బిందు సేద్యం, మార్కెట్ యార్డుల్లో సదుపాయాలు, అభివృద్ధి నిధుల సాయం అందించడం కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన హైలైట్స్గా చెప్పుకోవచ్చు. న్యూఢిల్లీ: తొలిసారి తన డిజిటల్ బడ్జెట్ను పార్లమెం టులో ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రి సీతారామన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేస్తాయని స్పష్టం చేశారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాల న్నది దేశం మొదటి సంకల్పమని పేర్కొన్నారు. వ్యవ సాయ రుణ వితరణ లక్ష్యాన్ని రూ.16.5 లక్షల కోట్లకు పెంచడంతోపాటు పశుపోషణ; డెయిరీ, చేపల పెంపకానికి కూడా తగినన్ని నిధులు రుణాల రూపంలో అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను పెంచడం వల్ల దిగుబడులు పెరుగుతాయని, పండించిన పంటలను కాపాడుకోవడంతోపాటు, సమర్థంగా ఉపయోగించుకోవచ్చునని ఈ చర్యలన్నింటి కారణంగా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని వివరించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి కోసం సెస్ విధించే సమయంలో వినియోగదారులపై అదనపు భారం పడకుండా తగిన జాగ్రత్త తీసుకున్నామని తెలిపారు. ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ విస్తరణ... వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తుల విలువ, ఎగుమతులను పెంచేందుకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ను మరింత విస్తరిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పథకం కేవలం టమాటాలు, బంగాళదుంప, ఉల్లిపాయలకు మాత్రమే వర్తిస్తూండగా.. మరో 22 ఉత్పత్తులు (త్వరగా నశించిపోయేవి)ను చేర్చనున్నారు. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ–నామ్)లో ఇప్పటికే 1.68 కోట్ల మంది రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని, ఈ డిజిటల్ ప్లాట్ఫార్మ్ ద్వారా రూ.1.14 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరో వెయ్యి మండీలను ఈ–నామ్లకు చేరుస్తున్నట్లు ప్రకటించారు. సూక్ష్మబిందు సేద్యానికి ప్రస్తుతమిస్తున్న రూ.5000 కోట్లను ఈ ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు చేయనున్నట్లు తెలిపారు. ఫిషరీస్ రంగం అభివృద్ధికి కోచీ, చెన్నై, విశాఖపట్నం, పరదీప్, పెటువాఘాట్లలోని ప్రధాన ఫిషింగ్ హార్బర్లను ఆర్థిక కార్యకలాపాల కేంద్రాలుగా మారుస్తామని తెలిపారు. నదీతీరాల్లో, జలమార్గాల్లోనూ మత్స్య సంపద కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, తమిళనాడులో సముద్రపు నాచు పెంపకానికి ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వలస కార్మికుల కోసం... దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు పొందేందుకు వీలు కల్పించే వన్ నేషన్ వన్ రేషన్ పథకం వల్ల 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 86 శాతం మంది లబ్ధిదారులు లాభం పొందారని కేంద్ర మంత్రి వివరించారు. అసంఘటిత రంగంలోని కార్మికులు మరీ ముఖ్యంగా వలస కార్మికుల సమాచారం సేకరించేందుకు, తద్వారా వారి కోసం పథకాలను రూపొందిం చేందుకు ఒక పోర్టల్ను రూపొందించనున్నామని మంత్రి తెలిపారు. సామాజిక భద్రత పథకాలను గిగ్, ప్లాట్ఫార్మ్ కార్మికులకూ వర్తింపచేసేందుకు, ఈఎస్ఐ సేవలు అన్ని వర్గాల కార్మికులకు అందేలా చేసేందుకు కనీస వేతనాల్లో మార్పులు చేస్తూ కార్మిక చట్టాల్లో మార్పులు తేనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా అన్ని రంగాల్లోనూ మహిళలు తగిన రక్షణతో రాత్రి షిఫ్ట్లు పనిచేసేందుకు వీలుగా కూడా చట్టాల్లో మార్పులు తేనున్నట్లు చెప్పారు. స్టాండప్ ఇండియా పథకంలో ఎస్సీఎస్టీ మహిళలకు మార్జిన్ మనీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. మద్దతు ధర వితరణ పెరిగింది... పంటల ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్లు ఎక్కువగా మద్దతు ధర ఇచ్చేందుకు తగిన మార్పులు చేశామని కేంద్ర మంత్రి తెలిపారు. పంట దిగుబడుల సేకరణ క్రమేపీ పెరుగుతున్న కారణంగా మద్దతు ధర వితరణ కూడా ఎక్కువైందని, 2013 –14తో పోలిస్తే వరి, గోధుమ, పప్పుధాన్యాలు, పత్తి పంటల కోసం రైతులకు ఇచ్చిన మొత్తం పెరిగిందని (బాక్స్ చూడండి) వివరించారు. గోధుమల సేకరణ వల్ల 2020–21లో 43.36 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా గత ఏడాది ఈ సంఖ్య 35.57 కోట్లేనని వివరించారు. పప్పుధాన్యాల సేకరణ 2013–14 కంటే నలభై రెట్లు పెరిగి 2019–20 నాటికి రూ.10,530 కోట్లకు చేరుకుందని మంత్రి తెలిపారు. సెస్ విధింపు.. సుంకాల తగ్గింపు.. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం కొన్ని ఉత్పత్తులపై సెస్ విధించిన ప్రభుత్వం కొన్నింటి సుంకాలను తగ్గించింది. ఫలితంగా పెట్రోలు, డీజిల్పై సెస్ వసూలు చేయనున్నప్పటికీ సుంకాల తగ్గింపు కారణంగా ఆ ప్రభావం వినియోగదారులపై పడకపోవచ్చు. ఈ రెండు ఉత్పత్తులపై విధించే ప్రాథమిక ఎక్సైజ్ సుంకం, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. వరి, గోధుమల సేకరణ కోసం పెట్టిన ఖర్చు ఎక్కువైన మాట నిజమే. కానీ ప్రభుత్వం సేకరించే మిగిలిన 20 పంటల పరిస్థితి ఏమిటి? అంతకంటే ముఖ్యమైన విష యం ఏమిటంటే.. పంజాబ్, హరియాణా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ వంటి కొన్ని రాష్ట్రాల నుంచే బియ్యం సేక రణ ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ రుణ వితరణ విషయంలోనూ ఇదే జరుగుతోంది. రూ.16.5 లక్షల కోట్ల రుణ వితరణ లక్ష్యం పెట్టుకున్నా ఈ మొత్తం అన్ని రాష్ట్రాలకు సమంగా పంపిణీ కాదు. రాష్ట్రాల్లోని రైతులకు కూడా సమానంగా ఇవ్వరు. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తం పంపిణీ అవుతుంది. పెద్ద పెద్ద రైతులు లబ్ధి పొందుతూంటారు. వడ్డీ సబ్సిడీల లాభం కూడా వీరికే దక్కుతుం టుంది. వ్యవసాయం చేయని భూస్వాములు తక్కువ వడ్డీతో వచ్చే రుణాలను అనుభవిస్తూంటే అసలు రైతుకు సంస్థాగత రుణాల లభ్యత ఉండటం లేదు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఒక్కో హెక్టారుకు రూ.30,000 వరకూ సబ్సిడీలు లభిస్తూంటే కొన్ని రాష్ట్రాల్లో ఇది మూడు వేలకు మించడం లేదు. ఈ అసమానతలను సరిదిద్దగకపోతే, చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వకపోతే సమస్యలు మరింత జటిలమవుతాయి. ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలి. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు, ఆంధ్రప్రదేశ్లోని రైతు భరోసా, ఒడిశాలోని కాలియా, పశ్చిమ బెంగాల్, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ప్రభావం గురించి ఆర్థిక సర్వేలో ప్రస్తావించి నప్పటికీ బడ్జెట్లో మాత్రం ప్రత్యక్ష నగదు బదిలీ ఊసు లేనేలేకపోవడం గమనార్హం. జి.వి.రామాంజినేయులు, సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్, హైదరాబాద్. 5.6%పెరుగుదల కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు గత ఏడాది కంటే 5.6 శాతం ఎక్కువ నిధులు లభించగా ఇందులో సగం మొత్తాన్ని ప్రధానమంత్రి కిసాన్ కార్యక్రమానికి ఖర్చు చేయనున్నారు. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు 2021–22 సంవత్సరానికి గాను మొత్తం రూ.1,31,531 కోట్లు కేటాయింపులు జరిగాయి. వ్యవసాయ మౌలిక సదుపాయాలు, సాగునీటి పథకాలకు గత ఏడాది కంటే స్వల్పంగా ఎక్కువ నిధులు అందుబాటులోకి వచ్చాయి. 2020–21 సంవత్సరానికి గాను సవరించిన అంచనాలు రూ.1,24,519 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. తాజా కేటాయింపుల్లో రూ.1,23,017.57 కోట్లు వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉపయోగించు కుంటుంది. మిగిలిన రూ.8,513 కోట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కోసం వినియోగిస్తారు. పీఎం–కిసాన్ కార్యక్రమానికి రూ.65,000 కోట్లు ఖర్చు చేస్తారు. మద్దతు ధర వితరణ (రూ. కోట్లలో) ఉత్పత్తి 2013–14 2019–20 2020–21 గోధుమలు 33,874 62,802 75,050 బియ్యం 63,928 1,41,930 172,752 పప్పుధాన్యాలు 236 8,285 10,530 పత్తి 90 - 25,974 వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సెస్ దేనిపై ఎంతంటే(శాతాల్లో) శనగపప్పు 50 శాతం ఆపిల్ పండ్లు 35 శాతం కాబూలీ శనగలు 30 శాతం మసూర్దాల్, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ 20 శాతం ముడి పామాయిల్ 17.5 శాతం బటానీలు 10 శాతం పత్తి, నిర్దిష్ట ఎరువులు 5 శాతం బంగారం, వెండి కడ్డీలు 2.5 శాతం బొగ్గు,పీట్ లిగ్నైట్ 1.5 శాతం పెట్రోలు రూ.2.5 డీజిల్ రూ.4.0 రైతులతో చర్చలకు సిద్ధం: నిర్మలా న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులతో ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గమని ఆమె చెప్పారు. ‘ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఎందుకు బైఠాయించారో మాకు అర్థమయింది. రైతుల అనుమానాలను నివృత్తి చేసేందుకు వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన పలు పర్యాయాలు రైతులతో చర్చలు జరిపారు. కొత్త సాగు చట్టాలపై అంశాల వారీగా సూచనలు ఇవ్వాలని వారిని కోరారు. చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాను. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. ప్రధాని మోదీ కూడా పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇదే విషయం స్పష్టం చేశారు’అని మంత్రి నిర్మల అన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి అనుమానాలు, సందిగ్ధాలను తొలగించుకోవాలని ఆమె రైతులను కోరారు. అనంతరం, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌధరి మీడియాతో మాట్లాడుతూ..‘కొందరు తమ రాజకీయ లబ్ధి కోసం అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. రైతు సంఘాల నేతలు ఈ విషయం అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను’అని వ్యాఖ్యానించారు. -
వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనకంజ
సాక్షి, న్యూఢిల్లీ : రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు చట్టాలను అనేక ప్రాంతాల రైతులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దీ నెలలుగా రైతులు చలిని, ఎండను లెక్కచేయకుండా దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు చేస్తున్నారు. వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. దీనికి కేంద్ర మాత్రం ససేమిరా అంటోంది. ఈ క్రమంలోనే రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఇప్పటి వరకు 9సార్లు చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో కేంద్రం మరోసారి నేడు 10వ సారి చర్చలు జరిపింది. నేటి చర్చల్లో కేంద్రం రైతులకు ఓ ఆఫర్ను ప్రకటించింది. వివాదాస్పదంగా మారిన చట్టాలను ఒకటి లేదా రెండు సంవత్సరాలు పాటు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించినట్లు రైతుల సంఘాల ప్రతినిధి కవిత కూరగంటి బుధవారం మీడియాకు వెల్లడించారు. ‘వ్యవసాయ చట్టాలను ఏడాది, ఏడాదిన్నర నిలుపుదల చేస్తామని కేంద్రం ప్రతిపాదించింది. తమ మాట మీద నమ్మకం లేకుండా సుప్రీంలో అండర్ టేకింగ్ ఇస్తామని చెప్పింది. రైతులు, ప్రభుత్వ ప్రతినిధులతో సంయుక్తంగా కమిటీ ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించింది. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుందామని చెప్పింది. కేంద్రం ప్రతిపాదనపై రైతు సంఘాల నేతలు రేపు సింఘు బోర్డర్ వద్ద సమావేశమై చర్చించుకుంటాం. ప్రభుత్వ ప్రతిపాదన రైతు ప్రయోజనాలు కాపాడేలా ఉందా లేదా అన్నది చర్చిస్తాం. తదుపరి నిర్ణయాన్ని ఈనెల 22న జరిగే భేటీలో కేంద్రానికి తెలియజేస్తాం. ఈ ప్రతిపాదనతో కేంద్రం దిగొచ్చినట్టే కనిపిస్తోంది’ అని కవిత తెలియజేశారు. అయితే మరోసారి జనవరి 22న రైతులతో కేంద్రం చర్చలు జరపనున్నట్లు ప్రకటించింది. -
వ్యవసాయ చట్టాలు: సుప్రీం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాల రద్దుకోసం సుదీర్ఘ ఉద్యమం చేస్తున్న రైతులు, రైతు సంఘాలకు భారీ ఊరట లభించింది. మూడు వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పిటీషన్పై విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. కొంతకాలం చట్టాల అమలును నిలిపి వేయాలని లేదంటే తామే స్టే విధిస్తామని అత్యున్నత న్యాయస్థానం తెగేసి చెప్పింది. ఈ చట్టాల పరిశీలనకు గాను ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే రైతులు తమ నిరసనను కొనసాగించుకోవచ్చని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టాల పై స్టే ఇచ్చిన తర్వాత ఆందోళన నిలిపి వేస్తారా ? అని సుప్రీం రైతు సంఘాల ఉద్యమ నేతలను ప్రశ్నించింది. తదుపరి వాదనలను రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది. ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మక సమస్యగా ఎందుకు చూస్తోందని ప్రశ్నించిన సుప్రీంకోర్టుప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా కేంద్ర వైఖరిపై అసంతృప్తితో ఉన్నామన్నారు. రైతుల ఆందోళన, సమస్యను పరిష్కరించడంలో సరిగా వ్యవహరించలేదన్నారు. పలు దఫాలు చర్చలు విఫలంపై స్పందిస్తూ కేంద్రం పరిస్థితిని సరిగ్గా నిర్వహిస్తోందని, చర్చలు ప్రభావవంతంగా ఉన్నాయని తాము విశ్వసించడలేదంటూ ఘాటుగా స్పందించారు. అందుకే చట్టాల అమలును నిలిపివేయడం ద్వారా వాతావరణాన్ని అనుకూలంగా మార్చడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రైతు సంఘాలతో ప్రభుత్వ చర్చల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య సీజేఐ వ్యాఖ్యలు ప్రాధన్యతను సంతరించుకున్నాయి. కొంతమంది రైతులు ఆత్మహత్యలను ప్రస్తావించిన సుప్రీం, వీటిపై ఆందోళన వ్యక్తం చేసింది. వీటన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు అసలు ఈ వ్యవహారంలో ఏం జరుగుతోందని కూడా ప్రశ్నించింది. ఏదైనా తప్పు జరిగితే మనలో ప్రతి ఒక్కరమూ బాధ్యత వహించాలి. మ ఇకపై ఎవరి రక్తంతోనూ మన చేతులు తడవకూడదని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టాల పరిశీనలకుగాను ఐసీఎఆర్తో సహా నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనిపై వ్యతిరేక, అనుకూల వాదనలను ఈ కమిటీకి అందించుకోవచ్చని, కమిటీ నివేదిక మేరకు వ్యవహరిస్తామని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు కేవలం రెండు, మూడు రాష్ట్రాలు మాత్రమే నిరసన తెలుపుతున్నాయని అటార్నీ జనరల్ మెహతా సుప్రీంకు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల రైతులు, ఇతర ప్రాంతాల రైతులు నిరసనల్లో పాల్గొనడం లేదన్నారు. అయితే కమిటీ వేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే చట్టాలను నిలుపుదల చేయవద్దని ఆయన కోరారు. -
పొయ్యి ఆరలేదు.. స్ఫూర్తి తగ్గలేదు
న్యూఢిల్లీ : కడుపులో ఆకలి మంటల్ని చల్లార్చడానికి అక్కడ పొయ్యి రేయింబగళ్లు మండుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేదాకా వారిలో స్ఫూర్తి ఆరని జ్వాలలా రగులుతూనే ఉంటుంది. కుండపోతగా వాన కురిసినా, ఎముకలు కొరికే చలిలోనైనా రైతన్నలు చలించడం లేదు. సాగు చట్టాలను వెనక్కి తీసుకునే దాకా తాము వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చేశారు. 40 రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నప్పటికీ వారిలో ఆత్మస్థైర్యం రవ్వంత కూడా సడల్లేదు. అందరి కడుపులు నింపే అన్నదాతల కడుపు నింపడానికి ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లో సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు. నిరసన ప్రదర్శనల్లో పాల్గొనే రైతులెవరూ ఆకలి బాధతో ఉండకూడదన్న ఏకైక ఎజెండాతో రైతు నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. లంగర్లలో (కమ్యూనిటీ కిచెన్) నిరంతరం ఏదో ఒక వంటకం తయారవుతూనే ఉంటుంది. పెద్ద పెద్ద పొయ్యిలు, గిన్నెలు, రోటీ మిషన్లు, ఒకటేమిటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. రైతు కుటుంబాల వారే వంతులవారీగా వంటలు చేస్తూ ఉంటారు. గురుదాస్పూర్కి చెందిన పల్వీందర్ సింగ్ (45) అనే రైతు హైవేపైనే ఒక లంగరు ఏర్పాటు చేశారు. ‘‘ఆకలి బాధతో ఉంటే విప్లవం ముందుకు వెళ్లలేదు. సిక్కు గురువుల ప్రబోధాలే మాకు ఆదర్శం. వారి ఆశీర్వాదం మా పై ఉంది. అందుకే ఈ కిచెన్లో పొయ్యి నిరంతరాయంగా మండుతూనే ఉంది’’ అని పల్వీందర్ సింగ్ చెప్పారు.‘‘ ఏ క్షణంలోనైనా మాపై కరకు లాఠీ దెబ్బలు పడొచ్చు, బాష్పవాయువు ప్రయోగాలు జరగొచ్చు. వాటర్ కెనాన్లు ముంచేయొచ్చు. అయినా అన్నీ ఎదుర్కోవడానికి సిద్ధపడే ఇక్కడికి వచ్చాం’ అని చెప్పారు. మొత్తం 200 మంది షిప్ట్ల వారీగా ఆ కిచెన్లో పనిచేస్తారు. పూరీలు, కూర, హల్వా, ఖీర్, అన్నం ఎవరికి ఎంత కావాలో అంత పెడతారు. అక్కడ గొప్పవాళ్లు, పేదవారు అన్న భేదం లేదు. ఎవరైనా సరే ముకుళిత హస్తాలతో క్యూ లైన్లలో వచ్చి తినాల్సిందే. స్ఫూర్తి తగ్గలేదు.. ‘‘గురునానక్ శతాబ్దాల క్రితం ప్రారంభించిన లంగర్లు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇవీ అంతే. 40 రోజులైంది. మా పొయ్యి ఆరలేదు. సరుకులు నిండుకోలేదు. మాలో స్ఫూర్తి కూడా ఏ మాత్రం తగ్గలేదు’’ అని ఒక మహిళా రైతు అన్నారు. అన్నింటికంటే విశేషం ఏమిటంటే ఈ కమ్యూనిటీ కిచెన్లలో సేవలందించడానికి వచ్చిన వారెవరూ తమ పేరు, ఊరు చెప్పడానికి ఇష్టపడడం లేదు. మేము ఎవరిమైతే ఏంటి మాదంతా రైతు కుటుంబమే అని చిరునవ్వుతో చెబుతున్నారు. రైతు పోరాటానికి అక్కడ ఉన్న స్థానికులు కూడా మద్దతు తెలుపుతున్నారు. పాలు, కూరలు వంటివి ఇస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. -
ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం: రైతుల హెచ్చరిక
న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమం కొనసాగుతోంది. వేలాదిగా రైతులు, ముఖ్యంగా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో గత నెల రోజులకు పైగా నిరసనలు కొనసాగిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో నెలకొన్న తీవ్ర చలి పరిస్థితులకు తోడు, అనూహ్య వర్షాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అయినా, డిమాండ్ల సాధన విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని వారంతా ముక్త కంఠంతో స్పష్టం చేస్తున్నారు. రైతులు, ప్రభుత్వం మధ్య గత ఏడు విడతలుగా జరిగిన చర్చల్లో పెద్దగా పురోగతి చోటు చేసుకోలేదు. ముఖ్యంగా వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో ఇరు వర్గాలు తమ పట్టు వీడడం లేదు. ఆ రైతు వ్యతిరేక చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని రైతులు తేల్చి చెబుతుండగా, ఆ చట్టాల రద్దు కుదరదని స్పష్టమైన సంకేతాలిస్తున్న ప్రభుత్వం.. ప్రత్యామ్నాయంగా, ఆ చట్టాల్లోని అభ్యంతరాలపై చర్చ జరిపితే, అవసరమైన సవరణలు చేస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య 8వ విడత చర్చలు ఈ నెల 8న జరగనున్నాయి. 8వ తేదీన జరిగే చర్చల్లో సానుకూల ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్లు సోమవారం జరిగిన చర్చల అనంతరం కేంద్ర వ్యవసాయ మంత్రి, చర్చల్లో ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానించారు. వర్షాల నుంచి రక్షణ కోసం రైతులు తమ దీక్షాస్థలిలో తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రైతుల టెంట్లలో నీళ్లు నిలుస్తుండటంతో ఢిల్లీ సిఖ్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఎత్తైన బెడ్స్ను ఏర్పాటు చేసింది. మరోవైపు, ఢిల్లీకి వెళ్తున్న రైతులపై హరియాణాలోని మాసాని బ్యారేజ్ వద్ద ఆదివారం పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రేపు ట్రాక్టర్ మార్చ్ డిమాండ్ల సాధనలో భాగంగా నేడు(బుధవారం, జనవరి 6న) తలపెట్టిన ట్రాక్టర్ మార్చ్ కార్యక్రమాన్ని రైతులు గురువారానికి వాయిదా వేసుకున్నారు. జనవరి 6న అననుకూల వాతావరణ పరిస్థితులు నెలకొంటాయన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. జనవరి 26న ఢిల్లీకి చేపట్టిన ట్రాక్టర్ మార్చ్ని భారీ స్థాయిలో నిర్వహిస్తామని రైతు నేత జోగిందర్ తెలిపారు. హరియాణాలోని ప్రతీ గ్రామం నుంచి 10 ట్రాక్టర్లు వస్తాయన్నారు. ప్రధానిని కలిసిన పంజాబ్ బీజేపీ నేతలు పంజాబ్ బీజేపీ నాయకులు సుర్జిత్కుమార్ జ్యానీ, హర్జిత్ సింగ్ గ్రేవల్ మంగళవారం ప్రధాని మోదీని కలిశారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నామని సుర్జిత్ అన్నారు. ‘మోదీకి అన్నీ తెలుసు. పంజాబ్ గురించి ఇంకా ఎక్కువ తెలుసు. మా సమావేశంలో ఏం చర్చించామనేది చెప్పలేను. కానీ మంచే జరగబోతోంది’ అని గ్రేవల్ వ్యాఖ్యానించారు. ‘రైతు ప్రయోజనాల కోసం ఏదైనా చేయడానికి ప్రధాని మోదీ సిద్ధంగానే ఉంటారు. కానీ రైతుల ఉద్యమంలోకి మావోయిస్టులు చొరబడ్డారు. వారే సమస్య పరిష్కారం కాకుండా అడ్డుకుంటున్నారు’ అని జ్యానీ పేర్కొన్నారు. చట్టాల రద్దుపై రైతులు మొండిగా ఉండవద్దని, ప్రభుత్వంతో చర్చలకు ఒకరిద్దరు నేతలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. -
వీడని ప్రతిష్టంభన.. అసంపూర్తిగా చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను నిరశిస్తూ రైతులు చేపట్టిన దీక్షలు మరికొన్నాళ్ల పాటు సాగేలా కనిపిస్తోంది. వ్యవసాయ చట్టాలు, పంటకు గిట్టుబాటు ధరపై ప్రతిష్టంభన ఎంతకీ వీడటంలేదు. రైతుల సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం సోమవారం జరిపిన ఏడో విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న రైతుల డిమాండ్స్ను ఏమాత్రం తలొగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. మరోవైపు చట్టాలను వెనక్కి తీసుకోకపోతే దీక్షలు విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 8న మరోసారి చర్చలకు రావాలని కేంద్రం పిలుపునిచ్చింది. (చలికి తోడు వాన) రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో సాగుతున్న రైతు దీక్షలు 40 రోజులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సింఘు, టిక్రీ, ఘాజీపూర్, చిల్లా, పల్వాల్ సరిహద్దుల వద్ద రైతుల నిరసన శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. కాగా చర్చల్లో పురోగతి లేకపోతే ఆందోళనలు ఉధృతం చేయాలని ఇదివరకే రైతు సంఘాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈనెల 6న ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. -
దిగుబడి పెరిగినా తగ్గిన ఆదాయం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు రంగాలు కునారిల్లిపోయి ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ వ్యవసాయ రంగం నిలదొక్కుకోవడమే కాకుండా వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పెరగడం విశేషం. ఈ ఏడాది జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయం 3.4 శాతం అభివద్ధి చెందింది. వ్యవసాయ రంగంపై కరోనా ప్రభావం ప్రత్యక్షంగా లేకపోవడం, ఈ ఏడాది వర్షాలు సమద్ధిగా కురవడం, రబీ, ఖరీఫ్ పంటలకు రిజర్వాయర్లలో నీళ్లు పుష్కలంగా ఉండడం పంటల దిగుబడికి ఎంతో కలసి వచ్చింది. కరోనా కాటుకు వలస కార్మికులు ఇళ్లకు తిరగి రావడం, జీవనోపాధికోసం వారు కూడా వ్యవసాయ కూలీలుగా మారిపోవడం కూడా రైతులకు కలసి వచ్చిందని జాతీయ వ్యవసాయ ఆర్థిక వేత్త, ఇందిరాగాంధీ అభివద్ధి, పరిశోధన సంస్థలో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తోన్న సుధా నారాయణన్ తెలిపారు. కరోనా కారణంగా వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరగడం, పంట దిగుబడులకు ఆశించిన ధరలు లభించ లేదని ఆమె చెప్పారు. ఈసారి కూడా చాలా చోట్ల గిట్టుబాటు ధరలు లేక టన్నుల కొద్ది టమోటా రోడ్ల పాలయింది. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు వారాల క్రితం రోడ్డెక్కిన రైతులు ఇంకా రోడ్లపైనే ఉన్నారు. 2022 నాటికి వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, ఇప్పుడేమో కొత్త చట్టాలతో చిన్న కారు, సన్నకారు రైతుల నోటి కాడ కూడును కొట్టేస్తుందని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. రెండు హెక్టార్లకంటే తక్కువ భూమి కలిగిన చిన్నకారు రైతులే ప్రతి పది మందిలో ఎనమిది మంది ఉన్నారు. దేశం మొత్తం వర్క్ఫోర్స్లో 44.2 శాతం మంది ఒక్క వ్యవసాయ రంగంలోనే పని చేస్తున్నారు. ఈ ఏడాది దేశంలో 88 శాతం మంది రైతులు తమ పంటలను గిట్టుబాటు ధరలకు అమ్మలేక పోయారు. 37 శాతం రైతులు అసలు పంటలే వేయలేకపోయారు. 15 శాతం మంది రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డులకు కూడా తరలించలేక వదిలేశారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ప్రధాని మోదీ ‘పీఎం–కిసాన్ స్కీమ్ను తీసుకొచ్చారు. దేశంలో 14 కోట్ల మంది రైతులుండగా కేవలం ఆ స్కీమ్ 8 కోట్లకు మాత్రమే పరిమితమవుతోందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వ్యవసాయ చట్టాల గురించి లోతుగా అధ్యయనం చేసే స్థితిలో కూడా రైతులు లేరు -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : నియంత్రిత సాగు విధానంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో నియంత్రిత సాగు విధానం అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ప్రగతి భవన్లో వివిధ రకాల పంటల కొనుగోళ్లు సహా ఇతర సాగు అంశాలపై సమీక్ష జరిగిన సీఎం.. పంటల నియంత్రణ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. రైతులు ఏ పంట వేయాలో ఇకపై వాళ్లదే నిర్ణయమని పేర్కొన్నారు. పంటల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు ఉండవన్నారు. పంట కొనుగోలు ద్వారా మొత్తం రూ.7,500 కోట్లు నష్టం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయం చట్టాకు అనుగుణంగా రైతులు పంటకు ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడే అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు. గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా నియంత్రిత సాగు విధానం రాష్ట్రంలో తొలినుంచీ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలతో సహా.. రైతుల సంఘాల నేతలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేపటి నుంచి రైతుబంధు అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు నగదు పంపిణీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రేపటి (సోమవారం) నుంచి నగదు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 61.49 లక్షల మంది రైతులకు ఈ పథకం వర్తించనుంది. ఎకరాకు రూ.5వేల చొప్పున రూ.7,515 కోట్లు పంట సాయం అందించనున్నారు. -
దేశంలో ప్రజాస్వామ్యం లేదు
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ గురువారం దేశ రాజధానిలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ప్రియాంకా గాంధీ వాద్రా సహా సీనియర్ నేతలు, కార్యకర్తలు అక్బర్ రోడ్లోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించాలని మొదట భావించారు. అయితే, ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పార్టీ కార్యాలయం ముందే బైఠాయించి ధర్నా నిర్వహించారు. దాంతో, నిషేధాజ్ఞలను ఉల్లంఘించారన్న కారణంతో ప్రియాంకా గాంధీని, పలువురు ఎంపీలు, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆధిర్ రంజన్చౌధురి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అనంతరం, రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ దేశంలో వాస్తవానికి ప్రజాస్వామ్యం లేదని, ఊహల్లోనే అది ఉందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజస్వామ్యం ఉందన్న ్రభ్రమల్లో బతుకుతున్నామన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో దేశం ప్రమాదకర మార్గంలో వెళ్తోందని హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరిపై అయినా ఉగ్రవాది అని ముద్ర వేస్తారని ఆరోపించారు. ‘అది రైతులైనా, కూలీలైనా, చివరకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అయినా సరే.. మోదీని వ్యతిరేకిస్తే ఉగ్రవాది అని ముద్ర వేస్తారు’ అని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోనట్లయితే.. వ్యవసాయ రంగం, తద్వారా దేశం చాలా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘సన్నిహితులైన ముగ్గురు, నలుగురు కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడం ఒక్కటే ప్రధాని మోదీ లక్ష్యం. పేదల డబ్బుతో ఆ కార్పొరేట్ల జేబులు నింపాలన్నది ప్రధాని తాపత్రయం. అందుకు అడ్డుపడే ఎవరినైనా సరే.. ఉగ్రవాదులు, దేశద్రోహులు, జాతి వ్యతిరేకులు, నేరస్తులు అని ముద్ర వేస్తారు. అందుకు రైతులు, కూలీలు, చివరకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అయినా సరే మినహాయింపు కాదు’ అని రాహుల్ పేర్కొన్నారు. రాహుల్.. చర్చకు రా! రైతుల సంక్షేమం కోసం అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఏం చేసింది? ప్రస్తుత మోదీ ప్రభుత్వం ఏం చేస్తోందనే విషయంలో బహిరంగ చర్చకు రావాలని రాహుల్ గాంధీకి బీజేపీ సవాలు చేసింది. కేంద్రంపై రాహుల్ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారాలని తోసిపుచ్చింది. అధికారంలో ఉండగా రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జావడేకర్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర ఇవ్వలేదని, మోదీ సర్కారు వచ్చిన తరువాతనే స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేశామని, కనీస మద్దతు ధరలను భారీగా పెంచామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి శుక్రవారం ప్రధాని మోదీ రూ. 18 వేల కోట్లను జమ చేయనున్నారన్నారు. ఇప్పటివరకు రూ. 1.20 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, మొత్తంగా పదేళ్లలో రూ. 7 లక్షల కోట్లు రైతులకు అందుతాయని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం చేసింది కేవలం రూ. 53 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే. అదికూడా రైతులకు ఇవ్వలేదు. బ్యాంకులకు ఇచ్చారు’ అని వ్యాఖ్యానించారు. ‘బహిరంగ చర్చకు రావాలని రాహుల్ గాంధీకి సవాలు చేస్తున్నా. రైతుల సాధికారతకు మోదీ ఎంత కృషి చేస్తున్నారో, రైతులను కాంగ్రెస్ ఎలా నిర్లక్ష్యం చేసిందో నిరూపిస్తా’ అన్నారు. ప్రభుత్వానివి అబద్ధాలు రైతులకు అవాస్తవాలు చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై విపక్ష పార్టీలు స్పందించాయి. ప్రధాని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఒక ప్రకటన విడుదల చేశాయి. ఆందోళన మార్గం పట్టిన రైతులకు తమ సంఘీభావం కొనసాగుతుందని స్పష్టం చేశాయి. ‘రైతులు వ్యతిరేకిస్తున్న చట్టాలను మేం పార్లమంట్లోనూ వ్యతిరేకించాం. ఓటింగ్ జరగాలని డిమాండ్ చేసిన ఎంపీలను సస్పెండ్ చేశారు’ అని కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, పీఏజీడీ, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్), ఆరెస్పీ, ఏఐఎఫ్బీ ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. వ్యవసాయ చట్టాలపై సుప్రీంకు.. సాగు చట్టాలను సవాలు చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్(లోక్శక్తి) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే విచారణలో ఉన్న కేసులో తమను ఇంప్లీడ్ చేయాలని కోరింది. అసెంబ్లీ సెషన్ పెట్టండి నూతన వ్యవసాయ చట్టాలపై చర్చించి, వాటిని రద్దు చేయాలని తీర్మానం చేసేందుకు వీలుగా శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్కు మరోసారి సిఫారసు చేయాలని కేరళ మంత్రివర్గం నిర్ణయించింది. గతంలో సిఫారసు చేసినట్లుగా ప్రత్యేక సమావేశాలని కాకుండా, రైతుల అంశంపై చర్చ జరిపేందుకు అసెంబ్లీ 21వ సమావేశాలను డిసెంబర్ 31న ఏర్పాటు చేయాల్సిందిగా సిఫారసు చేయనున్నారు. డిసెంబర్ 23న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని గతంలో కేబినెట్ చేసిన సిఫారసును గవర్నర్ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. రైతులకు మళ్లీ ఆహ్వానం చర్చలకు రావాలని ఆహ్వానిస్తూ రైతు సంఘం నేతలకు ప్రభుత్వం గురువారం మరో లేఖ రాసింది. అయితే, కనీస మద్దతు ధర అంశానికి సంబంధించిన కొత్త డిమాండ్లేవీ చర్చల ఎజెండాలో ఉండకూడదని షరతు విధించింది. కొత్త సాగు చట్టాల పరిధిలో లేని కనీస మద్దతు ధర అంశాన్ని చర్చల్లో భాగం చేయడం అర్థం లేని పని అని వ్యాఖ్యానించింది. 40 రైతు సంఘాల నేతలను ఉద్దేశించి వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ ఈ లేఖ రాశారు. ‘రైతుల నిరసనలు ముగియాలన్న ఉద్దేశంతో వారి అన్ని అభ్యంతరాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది’ అని తెలిపారు. అరెస్ట్ సందర్భంగా మందిర్మార్గ్ పోలీస్స్టేషన్ వద్ద ప్రియాంక, రైతులు. రాష్ట్రపతికి రాహుల్ వినతిపత్రం -
శిరస్సు వంచి నమస్కరిస్తా.. రద్దు చేయండి
కృష్ణలంక (విజయవాడ తూర్పు) : కోట్లాది మంది రైతుల పక్షాన ప్రధాని మోదీకి శిరస్సు వంచి నమస్కారం చేస్తా, దయచేసి రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయండని ప్రముఖ సినీ దర్శకుడు ఆర్.నారాయణమూర్తి వేడుకున్నారు. గవర్నర్పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో అంతర్జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన బుధవారం వ్యవసాయ సంక్షోభం–పరిష్కారం అనే అంశంపై రైతు సంఘీభావ సభ నిర్వహించారు. నారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులతో సహా అన్ని రంగాల ప్రజల మద్దతును కూడగట్టి విజయాలను సాధించగలగడమే స్వర్గీయ చరణ్సింగ్కు ఇచ్చే ఘనమైన నివాళులన్నారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోతే రైతాంగ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆలిండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య మాట్లాడుతూ రైతుల రుణ విమోచన చట్టం తీసుకువచ్చి రైతులను, కౌలు రైతులను అప్పుల ఊబి నుంచి రక్షించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.కేశవరావు మాట్లాడారు. అనంతరం రైతాంగ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 24న మండల కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని, 27, 28 తేదీలలో మాకీబాత్ కార్యక్రమానికి నిరసనగా డప్పులు, పళ్లేలు మోగించి నిరసన తెలపాలని, ఆదాని, అంబానీ వస్తువులను బహిష్కరించాలని, ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం వి.శ్రీనివాసరావు రాసిన వ్యవసాయ చట్టాలతో రైతుకు మరణ శాసనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. సభలో ఏపీ కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సింహాద్రి ఝాన్సీ, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, వివిధ రైతు, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘రైతు క్షేమం’ రాజ్యం బాధ్యతే!
కరుకు కరోనా అనేక రంగాలను కుదిపి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన సంవత్సరం... మనదేశ అగ్రశ్రేణి కుబేరుల సంపద వృద్ధిరేటు నాల్గింట మూడొంతులు పెరిగి నమోదైంది. కరోనా దెబ్బతో ఇదే సంవత్సరం చిన్న, మధ్యతరగతి సమాజం కుదైలై దేశంలో పేద రికం రెట్టింపయినట్టు అంతర్జాతీయ అధ్య యనాలు చెబుతున్నాయి. పరస్పర విరుద్ధ మైన ఈ రెండు పరిణామాలు సామాజంలో ఆర్థిక అంతరాలు అనూహ్యంగా పెరిగిన తీరుకు సంకేతాలు. ఈ పరిణామాలకి, ఇప్పుడు ఢిల్లీ చుట్టూ కేంద్రీకృతమై దేశవ్యాప్తంగా అంటుకున్న రైతు ఉద్యమానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు యథా తథం అమలైతే... సమీప భవిష్యత్తులో ఆర్థిక అంతరాలు అసాధారణ స్థితికి చేరి, సమాజం అశాంతి కుంపటిపై రగులనుందనే భావన వ్యక్త మౌతోంది. ఈ ప్రచారం రాజకీయ ప్రత్యర్థుల కుట్ర అని, తాము ఎన్ని కల్లో హామీ ఇచ్చినట్టు 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే క్రమంలో తాజా సంస్కరణలు పెద్ద ముందడుగని పాలకపక్ష వాదన. కీలక వ్యవసాయ రంగంలో వృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతో ప్రభా వితం చేస్తుంది కనుక తమ చర్యల వల్ల ఆర్థిక అంతరాలు తగ్గుతాయని కేంద్రం అంటోంది. కొత్త చట్టాలను నిరసిస్తూ రైతాంగం ఉద్యమిస్తున్న తాజా పరిస్థి తికి పలువురు మేధావులు విభిన్న భాష్యాలు చెబుతున్నారు. వ్యవ సాయ రంగంలో ఎప్పట్నుంచో రావాల్సిన సంస్కరణలకు ఇది తోవ అని కొందరు పొగడుతుంటే, ఇవి రైతును, వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసే కార్పొరేటీకరణ చర్యలని మరికొందరు తెగుడుతు న్నారు. నడ్డివిరిగి ఉన్న నిస్సహాయ రైతాంగాన్ని మెడబట్టి బహుళ జాతి కంపెనీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ల సందిట్లోకి నెట్టడమేనని వారం టున్నారు. పూర్తి భిన్నమైన వాదనలు సాగుతున్నాయి. మరో వంక, సర్కారు–రైతు సంఘాల మధ్య జరిగిన చర్చల ప్రక్రియ విఫలమై, ఉద్యమం కొనసాగుతూనే ఉంది. వ్యవసాయ రంగంలో కీలక పరి ణామమిది. కొత్త చట్టాల మంచి చెడులు, వాదవివాదాలెలా ఉన్నా... ఉద్యమిస్తున్న రైతులను సముదాయించి, నిర్దిష్ట చర్యలతో సంతృప్తి పరచి, వెంటనే ఆందోళనను కేంద్ర ప్రభుత్వం విరమింపజేయా ల్సింది. ఉద్యమం వెనుక ఇతరేతర శక్తులున్నాయనో, ఇది రెండున్నర రాష్ట్రాల వాళ్లు చేస్తున్న అలజడి అనో రైతు ఉద్యమాన్ని తక్కువ చేసి చూడటం సరైన స్పందన కాదు. తమ జీవితాలతో ముడివడి ఉన్న నిర్ణయాలను రైతాంగం ప్రశ్నిస్తున్నపుడు వారు లేవనెత్తే అంశాలకు, భయ–సందేహాలకు సహేతుకమైన సమాధానాలివ్వడం పాలకుల కర్తవ్యం. భరోసా కల్పించాలి. చట్టాల అమలుకు ముందు ప్రజాభి ప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. రైతు కష్టాలు ఇన్నన్ని కావు అత్యధిక పౌరులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయం మీదే ఆధార పడ్డ దేశం మనది. రైతు అసంఘటిత రంగంలో ఉన్నందున, వ్యవసా యాన్ని పరిశ్రమగా గుర్తించనందున వరుస ప్రభుత్వాలు, పాలక పక్షాలు నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయి. పాలకులు రైతాంగంపై శ్రద్ద పెట్టిన దాఖలాలు పరిమితమే! వేర్వేరు కారణాలతో వ్యవసాయ రంగం నేడు తీవ్ర సంక్షోభంలో ఉంది. రైతాంగం తీరని కష్టాల్లో కూరుకుపోయింది. దుర్భరమైన బతుకీడ్చలేక ఏటా పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబాలు దిక్కులేనివవు తున్నాయి. పెట్టుబడి వ్యయం ఎన్నో రెట్లు పెరిగింది. విత్తనంపై కార్పొ రేట్ల పెత్తనం. ఎరువులతో వ్యాపార జిమ్మిక్కు, పంట భీమాలో మోసాలు, సబ్సిడీల్లో అవినీతి, రుణాల్లో దగా, సర్కారు అప్పులు దొరకవు–ప్రయివేటు అప్పులు భారం, అతివృష్టి–అనావృష్టితో ప్రకృతి కన్నెర్ర, దిగుబడికి భరోసా లేదు, పంట పండినపుడు ధర రాదు, కాటేసే మార్కెట్ల మాయాజాలం... ఇన్ని ప్రతిబందకాల మధ్య కొట్టుమిట్టాడే రైతుకు చట్టాల రూపంలోనైనా సర్కార్ల సహకారం లభించకుంటే పరిస్థితి దుర్భరమే! ఆర్థిక–సరళీకరణ విధానాలు అమల్లోకి తెచ్చిన ప్రపంచీకరణ నుంచి ఎడతెగని కడగండ్లే! దాదాపు ముడు దశాబ్దాలుగా సానుకూల సంస్కరణల కోసం రైతులు నిరీక్షిస్తు న్నారు. తాజా సంస్కరణలు ఎవరి హితంలో ఉన్నాయన్నది పెద్ద ప్రశ్న. కనీస మద్దతు ధర తొలగిపోయి, మార్కెట్లో «కొనుగోలు భరోసా లేకుండా మనుగడ ఎలా? ఉద్దేశపూర్వకంగానే బాధ్యతల నుంచి ప్రభుత్వం క్రమంగా వైదొలగుతోంది. బలహీనమైన రైతులకు–శక్తి మంతులైన కార్పొరేట్లకు మధ్య పోటీ ఎలా సమంజసమనే వాదన వినిపిస్తోంది. ఏకపక్షంగా కార్పొరేట్ కబంద హస్తాల్లోకి జారే దుస్థితి అయితే ‘బతుకెట్లా?’ అనే ప్రశ్నను రైతాంగం లేవనెత్తుతోంది. ఈ అంశం కేంద్రకంగానే రైతు సంఘాలు ఉద్యమాన్ని బలోపేతం చేశాయి. కొత్త చట్టాల్ని వెనక్కి తీసుకోమంటున్నాయి. ఇప్పుడు తెచ్చిన రెండు చట్టాలు, సవరణలు చేసిన మూడో చట్టం, విద్యుత్ సంస్కర ణలు... ఇవన్నీ రైతుకు మేలు చేయకపోగా నష్టం. ఉన్న సదుపా యాల్ని తొలగించి పెనం మీంచి పోయ్యిలో వేసినట్టుందనే అభి ప్రాయం రైతు సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని సవరణలకు సరే తప్ప చట్టాలు వెనక్కి తీసుకోమని కేంద్ర సర్కారు అంటోంది. ఏమిటి భయాలు, ఎందుకు సందేహం? ‘రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య చట్టం’ ముఖ్య ఉద్దేశ్యం రైతు తన ఉత్పత్తుల్ని వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్(మండీ)లలోనే అమ్ముకోవా ల్సిన కట్టుబాటు లేకుండా, ప్రాంత పరిమితులు దాటి ఎక్కడైనా విక్ర యించుకునే వెసలుబాటు అని ప్రభుత్వం చెబుతోంది. ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే రైతు అక్కడికి వెళ్లి అమ్ముకునే సంస్కరణ అంటోంది. రైతు నేతలు దీన్ని మరోలా చెబుతున్నారు. తిరగేసి చూస్తే, ప్రయివేటు కొనగోలుదారుకు లభిస్తున్న వెసలుబాటు అంటోంది. బాధ్యత–జవా బుదారుతనం లేని ప్రయివేటు మార్కెట్లొస్తాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజాపంపిణి వ్యవస్థ (పీడీఎస్)ను క్రమంగా బలహీనపరచి, బదు లుగా లబ్దిదారులకు నగదు బదిలీని ప్రోత్సహిస్తోంది. తాజా చట్టాలతో క్రమంగా సర్కారు మార్కెట్ కమిటీలు బలహీనపడతాయి. ధాన్యం సేకరణ తగ్గుతుంది, మద్దతు దర ఉండదు, మార్కెట్ స్వేచ్ఛ వల్ల పెద్ద ప్రయివేటు సంస్థలు బరిలో దిగి ఆధిపత్యం చెలాయిస్తాయి. గిట్టుబాటు ధర దేవుడెరుగు, కనీస మద్దతు ధరకూ రైతు నోచుకోడు. ఇదీ భయం! వ్యవసాయం చేయలేక, విధిలేని పరిస్థితుల్లో భూము లను కార్పొరేట్లకు అప్పగించి, ఒప్పంద వ్యవసాయానికి తలపడేలా చిన్న, సన్నకారు రైతాంగాన్ని నెట్టడమే అన్నది వారి ఆందోళన! ఇప్పుడు తెచ్చిన ‘ఒప్పంద వ్యవసాయ చట్టం’ నిబంధనలు కూడా కార్పొరేట్లకే తప్ప రైతుకు అనుకూలంగా లేవు. ఇదే జరిగితే, సమా జంలో ఇప్పుడున్న గౌరవం కూడా దక్కదని, కార్పొరేట్లకు రైతులు కట్టుబానిసగా బతకాల్సిందేనని వాపోతున్నారు. దిగుబడి ఉన్నపుడు నాణ్యతకు ముడిపెట్టి, దిగుబడి లేనపుడు మరో వంక చూపి బహుళ జాతి కంపెనీలు చేసే అరాచకాలకు రైతు బలి కావాల్సిందే అన్నది ఆందోళన! లోగడ పలు రాష్ట్రాల్లో పెప్సీ వంటి బహుళ జాతి కంపెనీలు చిప్స్ ఉత్పత్తి కోసం, ఆలూ పండించే రైతులతో జరిపిన ఒప్పంద వ్యవ సాయం ఎన్ని అనర్థాలకు దారి తీసిందో రైతాంగం మరచిపోలేదు. కోర్టుల చుట్టూ తిప్పి, భూములు విక్రయించినా కట్టలేనంత జరిమా నాలతో వేధించిన ఉదంతాలు మరపురాని చేదు జ్ఞాపకాలే! ఇప్పుడా న్యాయ తనిఖీలు కూడా లేకుండా, న్యాయస్థానాల పరిధి తొలగించి, కేవలం అధికార వ్యవస్థ పరిధిలోనే వివాదాల్ని పరిష్కరించుకోవాలని కొత్త చట్టం చెబుతోంది. రాజ్యాంగ పరిధిలో తమకున్న హక్కుల్ని కాల రాయడమేనని రైతు సంఘాలంటున్నాయి. ఇక నిత్యావసరాల చట్ట పరిధిలో, నిలువ నిబంధనల నుంచి చాలా సరుకుల్ని మినహాయిం చడం కార్పొరేట్లకు కార్పెట్ పరవడమే! ఏయే సరుకుల్ని, ఎంతైనా నిలవ చేయవచ్చు! తద్వారా వారు ధరల హెచ్చుతగ్గుల్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకోగలరు. కొనుగోలు సమయంలో రైతులకు తక్కువ ధర, విక్రయించేప్పుడు వినియోగ దారులకు ఎక్కువ «భారం పడేలా చేసి లాభాలార్జిస్తారు. ఇది ఆహార సరఫరా, భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలా డబ్బు గడించే ప్రయివేటు శక్తులు ఎన్ని కల్లో రాజకీయ పక్షాలకు విరాళాలిస్తాయి. ఇదో తెగని విషవలయం! మండీలను సంస్కరిస్తే తప్పేంటి? రైతు ఉద్యమం వెనుక దళారీలున్నారంటున్న కేంద్ర ప్రభుత్వం, ఈ వ్యవసాయ మార్కెట్ (ఎపీఎమ్సీ)లలో లొసుగుల్ని తమ వాదనకు దన్నుగా వాడుకుంటోంది. దశాబ్దాలుగా రైతులు అక్కడ మోస పోతు న్నారు, మేం విముక్తి కలిగిస్తున్నామంటారు. మండీలు రాష్ట్ర ప్రభు త్వాల నియంత్రణలో ఉన్నాయి. కానీ, ప్రకటించిన కనీస మద్దతు ధరకు ధాన్యం, ఇతర వ్యవసాయోత్పత్తుల సేకరణ చేసేది కేంద్ర పరిధిలోని ‘భారత ఆహార సంస్థ’ (ఎప్సీఐ). రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల జాబితాలోని వ్యవసాయంపై ఈ కొత్త చట్టాలతో కేంద్రం పెత్తనం చేస్తోందని చాలా రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి ఇది భంగకరమనేది వాదన. అందుకే, తాజా చట్టాలు వర్తించనీకుండా కొన్ని రాష్ట్రాలు స్థానికంగా విరుగుడు చట్టాలు కూడ తీసుకువచ్చాయి. ఇంతకన్నా, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతును ఆదుకోనేట్టు, వారికి ఉపయోగపడేలా మండీల్లో సంస్కరణలు తీసుకు వస్తే బాగుండేది. అక్కడ కనీస మద్దతు ధర లభించేది. రైతు కిన్ని కష్టాలుండేవి కావు. కమిషన్ ఎజెంట్ల దోపిడీ, వ్యాపారులు కుమ్ము క్కయి వ్యవసాయోత్పత్తుల ధరల్ని తగ్గించడం, చెల్లింపుల్లో జాప్యం, నగదు ఇచ్చేట్టయితే ధరల్లో కొత, తామిచ్చిన అప్పులకు అధిక వడ్డీ వసూళ్లు, సెస్సు విధింపు, నాసిరకం సదుపాయాలు.. ఇలా మండీల్లో చాలా సమస్యలే ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక సర్వే జరిపినపుడు, 57 శాతం మంది రైతులు మండీల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. 43 శాతం మంది ఓకే అన్నారు. ఈ రెండు వర్గాల్లోనూ అత్యధికులు మండీల్లో మార్పులు కోరారు. ఇక మొత్తానికే మండీలు ఉండవంటే ‘మద్దతు ధర’ ఎలా? అని భయపడుతున్నారు. ఉద్యమించేది రైతులు కాదనడం అన్యాయం. ఏ దళారులూ 3 డిగ్రీల చలిలో మూడువారాలపాటు రోడ్డుపక్క దీక్షకు దిగరు. పది కిలోమీటర్ల నిడివి రోడ్లను ఆక్రమించి నెలల కాలమైనా సరే పరిష్కారంతోనే వెళ్తామంటున్న రైతుల సహనాన్ని పరీక్షించొద్దు. రైతాంగ ఆందోళనను విరమింపజేసే అన్ని అవకాశాల్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలి. సమస్యను సానుభూతితో పరిష్కరించాలి. మనదేశ వెన్నెముకను కాపాడాలి. ‘ఈ మొగులు కింద, ఎముకలు కొరికే చలిలో కూర్చో వడం మాకేమైనా సరదానా? కరోనా చంపుతుందో లేదో కానీ, ఈ చట్టాలు మాత్రం మమ్మల్ని తప్పక చంపుతాయి. అన్నీ ఎత్తేసి, కార్పొరేట్ కంపెనీలకు బలిపెడితే బతికేది ఎలా?’ అన్న ఉద్యమ కారుడు, సోనిపత్ రైతు రమేష్ అతిల్ మాటలు మనందరినీ తప్పకుండా ఆలోచింపజేసేవే! ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com దిలీప్ రెడ్డి -
అన్నదాతే కాదు, ఉద్యమ దీపధారి
అడవి, నీరు, గనులు, వినిమయ వస్తువుల వ్యాపారం నుంచి మొదలుకొని దేశంలోని మొత్తం భూమిని తమ కబంధ హస్తాల్లోకి తీసుకోవాలని కార్పొరేట్లు చూస్తున్నాయని పంజాబ్ రైతులు నిలదీస్తున్నారు. భారత పౌరులకు, కార్పొరేట్ వ్యవస్థకు మధ్య సాగుతున్న అంతర్గత ఘర్షణను ఈ పోరాటం బహిరంగ పరిచింది. అందుకే ఇప్పుడు జరుగుతున్న ఈ పోరాటం విజయవంతం అవుతుందా, లేక విఫలమవుతుందా? అన్న ప్రశ్నకన్నా ఈ ఉద్యమం చూపుతున్న ప్రభావం గొప్పది. పంట పొలాల్లో పారిన వారి చెమటచుక్కల సాక్షిగా, ఎముకలు కొరికే చలిలో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో, గుండెనిబ్బరంతో పోరాడు తున్న ఆ రైతాంగాన్ని చరిత్ర ఎన్నడూ మరచిపోదు. ఆ ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతీ రైతన్న పోరాట పటిమ చరిత్రలో ఒక శిలాక్షరమై నిలిచి గెలుస్తుంది. ‘‘అధికారంలో ఉన్న వారికన్నా ప్రజాబలం అత్యంత శక్తిమంతమైంది’’. ఇది అక్షర సత్య మనడానికి నేటి భారతావని ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. పంజాబ్ రైతన్నలు మొదలుపెట్టిన పోరాటం ప్రధానంగా ఉత్తర భారతాన్ని చుట్టేసింది. దాదాపు 20 రోజులకు పైగా రైతులంతా దేశ రాజధానిని ముట్టడిస్తున్నారు. ఒకరకంగా చదరంగం ఆటలో సాధారణ సైనికులు రాజుకి చెక్ పెట్టినట్టు సామాన్య రైతులు ఢిల్లీ ప్రభుత్వాన్ని దిగ్బంధిం చారు. ప్రభుత్వాలు, రాజ్యాలు, చక్రవర్తులు అన్ని రకాల పాలనలూ ప్రజాబలం ముందు మోకరిల్లక తప్పలేదనేది చరిత్ర ఎన్నో సార్లు రుజువు చేసింది. అయితే ఈనాడు జరుగుతున్న రైతాంగ ఉద్యమం పైకి కనిపిస్తున్నట్టుగా కేవలం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ప్రత్యేకించి కొత్త చట్టాలకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, ఇది భారత దేశాన్ని కబళించేందుకు పూనుకున్న కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం. గతంలో కూడా ఇటువంటి పోరాటాలు జరి గాయి. కొన్ని కంపెనీలకు వ్యతిరేకంగా కూడా ఆ ఉద్యమాలు గళమె త్తాయి. ఇంత సూటిగా, శక్తిమంతంగా ఆ ఉద్యమాలు నిలబడలేదు. పంజాబ్తో సహా యావత్ దేశంలోని రైతాంగం చేస్తున్న ఈ పోరాటం రాబోయే ప్రజా ఉద్యమాలకు ఒక దశ, దిశను చూపిస్తున్నది. భారత రైతాంగం సాగించిన గత పోరాటాలన్నీ కూడా ఆనాటి సామాజిక మార్పునకు పునాదులు వేశాయి. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో అనేక పోరాటాలు జరిగాయి. అందులో బిహార్లోని చంపారన్ పోరాటం ప్రముఖమైనది. బ్రిటిష్ ప్రభుత్వం చంపారన్ వ్యవసాయ చట్టం పేరుతో 1917లో ఒక చట్టాన్ని తెచ్చింది. ఇది రైతులకు పెనుశాపంగా మారింది. ఇందులో ప్రధా నంగా భూమిశిస్తు పెంచి రైతుల గొంతుమీద కత్తిపెట్టారు. నీలిమందు పంటను పెంచాలనే నిబంధనను విధించారు. దీనివల్ల రైతులకు తమకు నచ్చిన పంటను వేసుకునే స్వేచ్ఛ లేకుండా పోయింది. అంతే కాకుండా రైతులకు తక్కువ ధర ఇచ్చి పంటను కొనుక్కునే అధికా రాన్ని ప్రభుత్వం వ్యాపారులకు కట్టబెట్టింది. బ్రిటిష్ వ్యాపారుల ప్రయోజనాల కోసం పంట వేయడం వల్ల అదే పంటను ఇంకా ఎక్కడా అమ్ముకునే అవకాశం రైతులకు లేకుండా పోయింది. దీంతో రైతులు పేదరికంలోకి దిగజారిపోయారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకుడిగా గాంధీజీ భారతదేశంలో అడుగుపెట్టారు. దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన అహింసాయుతమైన సత్యాగ్రహ ఉద్య మాన్ని చంపారన్లో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. ఆకలితో, దారిద్య్రంతో అల్లాడుతున్న రైతులకు గాంధీజీ ఒక ఆశాకిరణంగా కనిపించారు. కానీ చౌరీచౌరాలో పోలీస్ స్టేషన్ తగులబడటంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీంతో గాంధీ అక్కడ ఉద్య మాన్ని విరమించారు. అయితే చంపారన్ ఉద్యమం భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ రహస్య ఉద్దేశాన్ని బట్టబయలు చేసింది. తమ వ్యాపార ప్రయోజనాలు, దేశంలోని వనరుల దోపిడీ వారి ప్రధాన లక్ష్యాలని బయటపెట్టింది. అంతేకాకుండా అహింస, సత్యాగ్రహం ద్వారా జాతీయవాదం మరింత బలపడింది. గుజరాత్లోని ఖేడాలో కూడా పత్తి, పొగాకు పండించే రైతులు తీవ్రమైన కరువు కాటకాల్లో చిక్కుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం వారికి ఎటువంటి సహాయం అందించకపోగా, భూమి పన్ను కట్టాల్సిందే నంటూ వేధింపులకు గురిచేసింది. 1919లో గాంధీజీ, వల్లభాయ్ పటేల్, ఎన్.ఎం.జోషి నాయకత్వంలో సత్యాగ్రహం మొదలైంది. బ్రిటిష్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అక్కడ పాటిదార్లు ప్రధాన రైతాంగ శక్తి. ఖేడా ఉద్యమం వల్ల భూమిశిస్తు రద్దయింది. గాంధీజీ, వల్లభాయ్ పటేల్ నాయకత్వ బలోపేతానికి కారణమైంది. అదే గుజరాత్లోని బార్దోలి ప్రాంతంలో వరదలతో రైతులు పంటలను పోగొట్టుకున్నారు. అయినా బ్రిటిష్ ప్రభుత్వం భూమిశి స్తును 30 శాతం పెంచింది. తగ్గించడానికి ససేమిరా అంగీకరించ లేదు. దీనికి వ్యతిరేకంగా 1925లో వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో సహాయనిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది. బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేయడానికే నిశ్చయించుకుంది. పోలీసు బలగా లను దించింది. అరెస్టులను సాగించింది. అయినా రైతాంగం చాక చక్యంగా ఉద్యమాన్ని కొనసాగించింది. వల్లభాయ్ పటేల్ అందించిన నాయకత్వానికి ప్రతిగా రైతాంగం ఆయనకు ‘సర్దార్’ బిరుదును ఇచ్చింది. ఆ రోజు నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్గా మారిపోయారు. ఈ రెండు ఉద్యమాలు ప్రజల్లో భారత స్వాతంత్య్రకాంక్షను పెంచాయి. కేరళలోని మలబార్ ప్రాంతంలో జరిగిన మొఫ్లా రైతాంగ పోరాటం అక్కడి స్థానిక జమీందారుల దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరే కంగా సాగింది. 1835 నుంచి మొఫ్లా రైతులను అక్కడి భూస్వాములు దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. మొఫ్లా రైతులు మెజారిటీ ముస్లిం రైతులు కాగా, భూస్వాములు హిందువులు. అయితే సమస్య మతపరమైనది కాకపోయినప్పటికీ, అంతిమంగా ఆ రూపం తీసుకున్నది. మొఫ్లా తిరుగుబాటు 1921లో ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించలేకపోయింది. ఈ ఉద్యమం ముస్లింలు ప్రారంభించిన ఖిలాఫత్ ఉద్యమం బలపడటానికి, ఒకరకంగా ముస్లింలు ప్రత్యేక శక్తిగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడింది. 1946లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటం స్థాని కంగా జమీందార్లకు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా ప్రారంభమైంది. వీళ్ళకు అండగా వచ్చిన రజాకార్లకు, వీళ్ళందరినీ కాపాడిన నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగింది. ఈ పోరాటం వల్ల జమీందారు, జాగీర్దారు విధానం పోయి, ఆ భూములను ప్రజలు పంచుకున్నారు. దున్నేవాడికే భూమి అనే నినాదం ఇక్కడే ప్రముఖంగా వినిపించింది. వీటన్నింటితోపాటు, కమ్యూనిస్టు సిద్ధాంతం ఆచరణలో ఎంతో శక్తి కలిగి ఉన్నదని చెప్పడానికి తెలంగాణ సాయుధపోరాటం ఉపయోగ పడింది. భూస్వామ్య, పెత్తందారీ, రాచరిక పాలన స్థానంలో ప్రజా స్వామ్య ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం వేసింది తెలంగాణ సాయుధ పోరాటమేనని చెప్పక తప్పదు.భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత ఆదివాసీ ప్రాంతాల్లో పెల్లుబికిన నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరిలోయ రైతాంగ పోరా టాలు పాలకుల మొద్దునిద్రను వదిలించాయి. ఆ పరంపరంలో ఇప్ప టికీ నక్సలైట్ ఉద్యమాలు సాగుతున్నప్పటికీ, నక్సల్బరీ అనంతరం ప్రభుత్వాలు ఆదివాసుల కోసం ఎన్నో చట్టాలను, పథకాలను తెచ్చాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ ఉద్యమ ప్రభావం సమాజంపై పడిందనేది వాస్తవం. ప్రస్తుతం మనం చూస్తున్న పంజాబ్ నాయకత్వంలోని జాతీయ రైతాంగ పోరాటం కార్పొరేట్లతో భారత ప్రజలు సాగించాల్సిన ప్రత్యక్ష పోరాటానికి తెరలేపింది. 1990 నుంచి ప్రారంభమైన ప్రైవేటీకరణ, సరళీకరణ, విశ్వీకరణలు ఈరోజు కార్పొరేట్ వ్యవస్థగా మారి పోయాయి. పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తుల నుంచి, అడవి, నీరు, గనులు, వినిమయ వస్తువుల వ్యాపారం నుంచి మొదలుకొని దేశం లోని మొత్తం భూమిని తమ కబంధ హస్తాల్లోకి తీసుకోవాలని కార్పొ రేట్లు చూస్తున్నాయని పంజాబ్ రైతులు నిలదీస్తున్నారు. ప్రభుత్వాలు, కార్పొరేట్లు వేరువేరనే ముసుగును ప్రస్తుత పోరాటం తొలగించింది. అందుకే ఈ ఉద్యమం సాధారణమైనది కాదు. ఇది చరిత్రాత్మక మైనది. భారత పౌరులకు, కార్పొరేట్ వ్యవస్థకు మధ్య సాగుతున్న అంతర్గత ఘర్షణను ఈ పోరాటం బహిరంగ పరిచింది. గతంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో కార్పొరేట్లను ప్రవే శింపజేయడాన్ని అక్కడి ఆదివాసులు వ్యతిరేకించారు. రెండు సంవ త్సరాల క్రితం నాసిక్ నుంచి 40,000 మంది ఆదివాసీ రైతులు మహా పాదయాత్ర చేసి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తమిళనాడులో, ఆంధ్రాలో ఇంకా అనేక చోట్ల ప్రజలు కార్పొరేట్ కంపెనీలను నిరసిం చారు. పశ్చిమబెంగాల్లోని సింగూరు రైతుల ప్రతిఘటనను కూడా అందులో భాగంగానే చూడాలి. అందుకే ఇప్పుడు జరుగుతున్న ఈ పోరాటం విజయవంతం అవుతుందా, లేక విఫలమవుతుందా? అన్న ప్రశ్నకన్నా ఈ ఉద్యమం చూపుతున్న ప్రభావం గొప్పది. పంట పొలాల్లో పారిన వారి చెమటచుక్కల సాక్షిగా, ఎముకలు కొరికే చలిలో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో, గుండెనిబ్బరంతో పోరాడుతున్న ఆ రైతాంగాన్ని చరిత్ర ఎన్నడూ మరచిపోదు. ఆ ఉద్యమంలో పాల్గొం టున్న ప్రతీ రైతన్న పోరాట పటిమ చరిత్రలో ఒక శిలాక్షరమై నిలిచి గెలుస్తుంది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 మల్లెపల్లి లక్ష్మయ్య -
చర్చలపైనే దృష్టి పెట్టాలి
దాదాపు 20 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ వెలుపల సాగుతున్న రైతుల ఆందోళన ఇప్పట్లో ముగిసే ఛాయలు కనుచూపు మేరలో కనబడని స్థితిలో ఆ సమస్యపై వ్యాపార, వాణిజ్య సంఘాలు తొలిసారి మాట్లాడాయి. ఈ ప్రతిష్టంభన భారీ నష్టానికి దారితీస్తుందని ఆందోళనపడ్డాయి. వాణిజ్య పారి శ్రామిక సంఘాల సమాఖ్య అసోచామ్ చెబుతున్న గణాంకాలనుబట్టి పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కశ్మీర్లలో రోజుకు రూ. 3,500 కోట్ల మేర నష్టం జరుగుతోంది. రైతుల నిరసనతో పంపిణీ వ్యవస్థ దెబ్బతిని ఎక్కడి సరుకు అక్కడే నిలిచిందని, అసలే ఆర్థిక మాంద్యం అలుముకుని వున్న వర్తమానంలో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం అసాధ్యమవుతుందని సీఐఐ హెచ్చరించింది. ఆ రెండు సంఘాలూ సాగు చట్టాలను సమర్థిస్తున్నాయి. కానీ ఈ ప్రతిష్టంభనకు త్వరగా పరిష్కారం లభించాలని కోరుకుంటున్నాయి. కేంద్రం కూడా ఈ విషయంలో ఆలోచన చేస్తున్నదని కొందరు రైతులతో మాట్లాడుతున్న తీరు చూస్తే అర్థమవుతుంది. గుజరాత్లోని కచ్ ప్రాంతాన్ని మంగళవారం సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ సిక్కు రైతులు కొందరితో ఢిల్లీ నిరసనల గురించే మాట్లాడారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ను సోమవారం కొందరు రైతు నేతలు కలిసి సాగు చట్టాలకు అనుకూలమేనని చెప్పారు. సమస్య తలెత్తినప్పుడు చర్చించడం, ఒక పరిష్కారాన్ని అన్వేషించడం మంచిదే. దేశంలోని రైతులంతా ఆ చట్టాలను సమర్థిస్తున్నారనో లేక పూర్తిగా వ్యతిరేకిస్తున్నారనో అభిప్రాయం కలగజేసే ప్రయత్నం వల్ల పెద్దగా ఫలితం సిద్ధించదు. వాస్తవంగా రైతుల భయాందోళనలేమిటో తెలుసుకుని, వాటిని తొలగించడంపైనే దృష్టి కేంద్రీకరించాలి. ఉద్యమం ప్రారంభమయ్యాక ఇప్పటికి అయిదు సార్లు చర్చలు జరిగాయి. ప్రస్తుతం అవి నిలిచిపోయాయి. చట్టాలు తీసుకొచ్చేముందే దేశంలోని రైతులతో, మరీ ముఖ్యంగా పంజాబ్, హరియాణా రైతులతో చర్చించాల్సింది. ఆ తర్వాతే ఆర్డి నెన్సులైనా, బిల్లులైనా తీసుకురావాల్సింది. కనీసం పార్లమెంటులోనైనా చర్చ జరుగుతుందనుకుంటే తీవ్ర గందరగోళం మధ్య బిల్లుల్ని మూజువాణి ఓటుతో ఆమోదించారు. చట్టసభల్లో తగినంత బలం వుండొచ్చు. కోరుకున్న చట్టం తీసుకురావడానికి, నచ్చిన నిర్ణయం చేయడానికి అదొక్కటే సరిపోదు. ప్రజాస్వామ్యంలో ఏ నిర్ణయమైనా చర్చలతోనే ముడిపడి వుంటుంది. ఆ చర్చలు ముందా వెనకా అనేది తేల్చుకోవాల్సింది ప్రభుత్వాలే. ముందే చర్చిస్తే ఆచరణలో అవరోధాలు పెద్దగా ఏర్పడవు. తర్వాత చర్చిద్దామనుకుంటే కొన్నిసార్లు అది అసాధ్యం కావొచ్చు. సాగు చట్టాలకు సంబంధించిన బిల్లులు తీసుకురావడానికి ముందు ఆన్లైన్ ద్వారా 90 లక్షలమంది రైతులతో మాట్లాడామని కేంద్రం చెబుతోంది. అది నిజమే అనుకున్నా... ఆ 90 లక్షలమంది మొత్తంగా రైతుల మనోగతాన్ని ప్రతిబింబించలేకపోయారని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే రైతుల ఆందోళన గమనించాక కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) వగైరాలపై లిఖితపూర్వక హామీని ఇస్తామని ఇప్పుడు కేంద్రం ముందుకొస్తోంది. ఆ 90 లక్షలమందిలో కొందరైనా ఎంఎస్పీ అంశం లేవనెత్తి వుంటే ముందే జాగ్రత్త పడటం వీలయ్యేది. పార్లమెంటులో సరిగా చర్చ జరిగినా ఆ సమస్యపై దృష్టి సారించడం తప్పనిసరని తెలిసేది. ఇప్పుడు రైతులు అటు లిఖితపూర్వక హామీగానీ, ఇటు చట్ట సవరణలుగానీ తమకు సమ్మతం కాదంటున్నారు. వాటి రద్దు ఒక్కటే తమ డిమాండని చెబు తున్నారు. అది కుదరని పని అని కేంద్రం అంటోంది. వాతావరణం ఉద్రిక్తంగా మారినప్పుడు ఇలాంటివన్నీ సహజమే. కచ్లో మాట్లాడిన సందర్భంగా విపక్షం అధికారంలో వుండగా ఈ మాదిరి సంస్కరణలే తీసుకురావడానికి ప్రయత్నించిందని, వాటినే తాము తీసుకొస్తే వ్యతిరేకిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. అందులో వాస్తవముంది. ఇతర అంశాల్లో ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా సంస్కరణల విషయంలో కాంగ్రెస్, బీజేపీలది ఒకటే విధానం. అధికార పక్షంలో వుండగా ఒకలా, విపక్షంలో వుండగా మరొకలా మాట్లాడటంలోనూ ఇద్దరిదీ ఒకే తంతు. కాంగ్రెస్ మేనిఫెస్టోయే మండీల వ్యవస్థను రద్దు చేస్తామని తెలిపింది. అయితే కేవలం విపక్షాల ప్రాపకంతోనే ప్రస్తుత ఆందోళన జరుగుతున్నదని భావించడం పొరపాటు. ఇంతక్రితం కేంద్రమంత్రి తోమర్ సైతం ఈ మాటే అన్నారు. 370 అధికరణనూ, రామమందిరాన్నీ, పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకించినవారే రైతుల ఆందోళన వెనకున్నారని ఆరోపించారు. ఇతర మంత్రులు ఆ రైతుల వెనక ‘టుక్డే టుక్డే గ్యాంగ్’ ఉందని, మావోయిస్టులున్నారని, పాకిస్తాన్, చైనాల హస్తం వుందని... ఇలా రకరకాలుగా మాట్లాడు తున్నారు. ఈ ఆరోపణల విషయంలో తగిన సమాచారముంటే ఆ రైతులకు దాన్ని అందజేయొచ్చు. అటువంటి వారిని దూరం పెట్టమని కోరవచ్చు. తామే చర్యలు తీసుకోవచ్చు. కానీ చర్చలు జరిగి మెరుగైన పరిష్కారం సాధించవలసిన సందర్భంలో ఇలా ఏకపక్షంగా ముద్రలు వేసే ప్రయత్నం సరైందేనా? అందువల్ల సమస్య మరింత జటిలం కాదా? ఇందిరాగాంధీ ప్రధానిగా వుండగా తన వ్యతిరేకుల్ని సీఐఏ ఏజెంట్లని ఆరోపించేవారు. వాస్తవానికి ఇలాంటి ఆరోపణలొస్తాయన్న ఉద్దేశం తోనే రైతులు రాజకీయ పక్షాలను దూరం పెట్టారు. పైగా సంస్కరణల విషయంలో ఎవరి అభిప్రా యాలేమిటో, ఇప్పుడు ఎవరేమి మాట్లాడుతున్నారో వారికి తెలియకపోలేదు. అందుకే విపక్షాల ప్రాపకం వుందన్న కోణం నుంచి సమస్యను చూడకపోవడం ఉత్తమం. ఢిల్లీ చుట్టుపట్ల ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. శీతగాలులతో అది వణుకుతోంది. అక్కడుండే కాలుష్య వాతా వరణానికి తోడు కరోనా మహమ్మారి ప్రమాదం ఇంకా పోలేదు. వీటిని కూడా దృష్టిలో వుంచు కోవాలి. ఇరు పక్షాల్లో ఎవరూ ప్రతిష్టకు పోకుండా చర్చలకు సిద్ధపడాలి. సాధ్యమైనంత త్వరగా అందరికీ ఆమోదయోగ్య మైన పరిష్కారం లభించేందుకు ప్రయత్నించాలి. -
గాంధీ స్ఫూర్తికి సాగు చట్టాలు విరుద్ధం
కారుచీకటిలో కాంతిరేఖలా దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా రైతు– వ్యవసాయ కార్మికులు సమష్టిగా ఒక్క శక్తిగా కదలబారడం 20వ శతాబ్దం తొలి జాతీయోద్యమ రోజుల తర్వాత బహుశా ఇదే మొదటి ఉదాహరణ! పంజాబ్, హరియాణా, రాజస్తాన్ రైతాంగం, వ్యవసాయ కార్మికుల సారథ్యంలో– ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించిన రైతు ఉద్యమం అనేక రాష్ట్రాల రైతాంగ, కార్మిక ప్రజాబాహుళ్యాన్ని కదిలించి, కేంద్రం రూపొందించిన మూడు రైతాంగ వ్యతిరేక సాగు చట్టాలను ప్రతిఘటించేట్లు చేసింది! పచ్చి నిజమేమంటే ఏ బిహార్‡ నీలిమందు రైతులను బ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వ దమనకాండ నుంచి, దాస్యం నుంచి గాంధీ బయటపడేశాడో.. ఆ మహాత్ముడి శాంతిని భగ్నం చేసే చట్టాలను తిరిగి ఈనాటి కేంద్ర పాలకులు తలెత్తుకోవడం! రైతాంగ, వ్యవసాయ కార్మికుల ప్రయోజ నాలను రక్షించడంలో కేంద్ర, రాష్ట్రాల పాల కులు మూడు కొత్త వ్యవసాయ బిల్లులను రుద్దడంలో భారత రాజ్యాంగ చట్ట నిబంధనలను ఉల్లంఘించారు. ఈ క్రమంలో పాలకులు రాజ్యాంగం శాసిస్తున్న కేంద్ర, రాష్ట్రాలు విధిగా పాటించాల్సిన ఉమ్మడి జాబితాను ఉల్లంఘించారు. తద్వారా రాజ్యాంగ చట్టం ఫెడరల్ (సమాఖ్య) స్వభావంపైనే దాడికి తలబడ్డారు. ఇందువల్ల ప్రత్యక్షంగా నష్టపోయే రైతులతో ఎలాంటి చర్చలు జరపకుండానే బిల్లులు తెచ్చారు. చివరికి ఈ బిల్లులపై పార్లమెంటులో వ్యతిరేకత అభ్యంతరాలు వచ్చినా వాటిని వినిపించుకోలేదు. కనీసం బిల్లులపై చర్చించేందుకు కూడా వ్యవధిని ఇవ్వకుండా నల్లేరు మీద బండిని నడిపించినట్టు తోసేశారు. అలాగే, రాజ్యసభలో ఈ బిల్లులపై ఓటింగ్ను కోరితే దాన్నీ నిరాకరిం చారు పాలకులు. ఈ గందరగోళం మధ్య మూజువాణి ఓటుతో బిల్లులు ఆమోదం పొందినట్లు రాజ్యసభ చైర్మన్ చెప్పారు. కోవిడ్ ముమ్మరంగా ఉన్న సమయంలో బిల్లులపై నిరసన తెల్పడానికి ప్రజలు తెగబడి వీధుల్లోకి వచ్చి నిరసన తెలపలేరన్న భరోసాతో ఆ బిల్లుల్ని ఆమోదిం పజేసుకున్నారు. – కేంద్ర, రాష్ట్రాల సర్వీసులలో పనిచేసిన 78 మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంయుక్త ప్రకటన రైతాంగ, వ్యవసాయ కార్మిక సంఘాలు, సంస్థలూ ఏకవాక్యతతో పలు రాష్ట్రాల నుంచి బయల్దేరి ఢిల్లీ సరిహద్దులలో, ఢిల్లీని ముట్టడించే కూతవేటు దూరంలోనే భారీఎత్తున సమీకరణ జరిగి గత 18 రోజు లకు పైగా భీకరమైన స్థాయిలో ఆందోళన కొనసాగిస్తున్న సమయం ఇది. అసలు భూమికోసం, భుక్తికోసం దేశంలో నేడు జరుగుతున్న పోరు.. దేశ పాలకులు ఎంచుకున్న ‘అభివృద్ధి నమూనా’నే తీవ్ర చర్చ లోకి లాగిందని మరచి పోరాదు! ఎందుకంటే మనదేశంలో భూమిలేని వ్యవసాయ కార్మికులు, సాగుచేసుకోవడానికి ఇంత కొండ్ర కూడా లేని నిరుపేద రైతుల సంఖ్యే–భూములున్న రైతుల సంఖ్య కన్నా ఎక్కువని గుర్తుంచుకోవాలి. వ్యవసాయంపై రూపొందించే విధానంలోగాని, వ్యవసాయానికి సంబంధించిన విధాన చర్యలలోగానీ ప్రధానంగా భూమిలేని వ్యవసాయ కార్మికులు, భూమిలేని రైతుల ప్రస్తావన మృగ్యమవుతూ వస్తోంది. దేశంలోకి కాంగ్రెస్, బీజేపీ పాలకులు ప్రవేశ పెట్టిన.. దేశ ప్రయోజనాలకు, రైతాంగ, వ్యవసాయ కార్మిక మౌలిక ప్రయోజనాలకు విరుద్ధమైన ప్రపంచబ్యాంకు ప్రజా వ్యతిరేక సంస్క రణలలో అసలు ‘కల్మషం’ అంతా కేంద్రీకరించి ఉంది. ఈ దుస్థితిలో, కారుచీకటిలో కాంతిరేఖలా దేశవ్యాప్తంగా మొట్ట మొదటిసారిగా రైతు– వ్యవసాయ కార్మికులు సమష్టిగా దేశవ్యాప్తంగా ఒక్క శక్తిగా కదలబారడం 20వ శతాబ్దం తొలి జాతీయోద్యమ రోజుల తర్వాత బహుశా ఇదే మొదటి ఉదాహరణ! ఇందుకు చరిత్రలో తొలి ఉదాహరణగా గాంధీజీ చంపారన్ రైతాంగ సత్యాగ్రహాన్ని ఉదహరిం చుకోవచ్చు! ఆ పిమ్మట దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తలెత్తుతూ వచ్చిన ‘పునప్రా’, బెంగాల్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఫ్యూడల్, భూస్వామ్య దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతుల వ్యవసాయ కార్మికోద్యమాలు, రైతాంగ సత్యాగ్రహోద్యమాలు, రైతాంగ తిరుగుబాట్లను తెలుగునాట, పల్నాటిసీమలో ‘ పుల్లరి’ కోసం సామాన్య ప్రజలు కన్నెగంటి హనుమంతు నడిపిన మహోద్యమం పేద రైతాంగ, ప్రయోజనాలకోసం త్యాగాలతో నిర్వహించిన ఉద్య మాలు, మహోద్యమాలేనని మరువరాదు! ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర రైతు ఉద్యమ నాయకులు ఈ కొసన ఉన్న శ్రీకాకుళం నుంచి ఆ కొసన ఉన్న మద్రాసు వరకు 1,500 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా వెళ్లి రైతాంగ ప్రజల బాధల గురించి సమర్పించిన వినతి పత్రమూ ఈ ఉద్యమాలలో అంతర్భాగమే! వీటన్నింటి సమా హారంగానే నేడు పంజాబ్, హరియాణా, రాజస్తాన్ రైతాంగం, వ్యవ సాయ కార్మికుల సారథ్యంలో– ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి అనేక రాష్ట్రాల రైతాంగ, కార్మిక ప్రజాబాహుళ్యాన్ని కదిలించి మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను ప్రతిఘటించేట్లు చేసింది! లక్షలమంది రైతులను కూడగట్టి 20వ శతాబ్దం తొలి దశాబ్దంలోనే గాంధీజీ తొలిసారిగా ప్రారంభించిన ‘చంపారన్’ (బిహార్) రైతాంగ సత్యాగ్రహం, ఆ తర్వాత ఉద్యమాలన్నింటికి స్ఫూర్తిగా నిలిచిందని మరువరాదు! కానీ ఏ బిహార్ నీలిమందు రైతులను ౖబ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వ దమనకాండ నుంచి, దాస్యం నుంచి ఏ గాం«ధీ బయటపడే శాడో ఆ మహాత్ముడి శాంతిని భగ్నం చేసే చట్టాలను తిరిగి ఈనాటి పాలకులు తలెత్తుకున్నారు. పైగా, దేశంలోని బుద్ధిజీవులంతా భారత పారిశ్రామిక వేత్తల జాతీయ సమాజ సదస్సులో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో.. భారత రైతాంగంకి ఆదాయం పెంచుకోవడానికి ఇప్పు డున్న మార్కెట్లుగాక ‘ప్రత్యామ్నాయ మార్కెట్లను చూపడానికే మూడు వ్యవసాయ చట్టాలను’ ప్రవేశపెట్టాల్సి వచ్చిందని.. వీటిద్వారా రైతాం గానికి ఆదాయాలు పెరుగుతాయని నమ్మింపజూశారు! పైగా రైతాంగ ‘సంక్షేమం కోసమే’ ఈ చట్టాలని ఉద్దేశించామని చెప్పారు. కానీ పాత, మధ్య దళారీలను ఎలా తొలగిస్తారో చెప్పకుండా ‘రైతాంగ ప్రయోజ నాల’ పేరిట బడా కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయ ఉత్పత్తులను అప్పగించడం ద్వారా రైతుల పంటలకు కనీస మద్దతు ధరను ఎలా గ్యారంటీ ఇవ్వగలరో మోదీ భరోసా కల్పించలేకపోయారు. అందుకే కనీస మద్దతు ధరకు గ్యారంటీ ఇస్తూ వ్యవసాయ చట్టా లలో లీగల్గా రక్షణ కల్పించి తీరాలని రైతాంగం కోరుతోంది. ఆ చట్టబద్ధ భద్రత మినహా లిఖిత పూర్వక హామీ ఏదైనా ఇస్తామన్నది మోదీ ప్రభృతుల వాదన! ఇక్కడే ఉంది అసలు ‘కిటుకు’ అంతా అని, ఆవులిస్తే పేగులు లెక్కించడంలో ఇన్నేళ్ల అనుభవం తర్వాత రైతాంగ ప్రజలకు తెలిసిపోయింది. కనుకనే పందొమ్మిది రోజుల సత్యా గ్రహాన్ని మరింతగా ఉధృతం చేయాల్సి వచ్చింది రైతాంగం. వారి దృఢ సంకల్పానికి గాంధీజీ సుదీర్ఘ ‘చంపారన్ రైతాంగ సత్యా గ్రహమే’ గీటురాయి అయింది. ఎందుకంటే ఆంగ్లో అమెరికన్ సామ్రా జ్యవాద పెట్టుబడులను ఇండియా లాంటి వర్ధమాన దేశాల మార్కెట్ల లోకి చొరబడేలా చేసి వాటి స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వీర్యం చేసి ధనిక దేశాల ప్రయోజనాలు కాపాడడమే ప్రపంచ బ్యాంకు, గుత్త పెట్టుబడి వర్గాల టెక్నాలజీ గుట్టుమట్టులని మరచిపోరాదు. ఈ విషయాన్ని వరల్డ్బ్యాంకు దాని అనుబంధ సంస్థలలో కీలక బాధ్యతల్లో పనిచేసిన డేవిసన్ బుధూ, డాక్టర్ జోసెఫ్ స్టిగ్లిజ్లు ఒకటికి పదిసార్లు వర్ధమాన దేశాలకు పాఠంగా బోధించి హెచ్చరించారు. వీరిలో డేవిసన్ బుధూ వరల్డ్ బ్యాంకు వర్ధమాన దేశాలలో తనకు అమలు జరపమని పురమా యించిన బాధ్యతల మూలంగా పేదప్రజల ప్రాణాలతో చెలగాట మాడి ‘నా చేతులు రక్తసిక్తమయ్యాయి. ఈ చేతుల్ని కడిగి పరిశుభ్రం చేసుకోవడానికి ఏ నదీ జలాలూ సరిపోవు’ అని బాహాటంగా ప్రక టించి బ్యాంకు కొలువును చాలించుకున్నాడు. ఇక బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త (స్టిగ్లిజ్) బ్యాంక్ పదవికి రాజీనామా చేసి, తప్పుకున్నాడు! ఇలాంటి పరిణామాల మధ్య భారత రైతాంగ ప్రజల పలు ఉత్ప త్తులకు, ప్రధానంగా ధాన్యం, గోధుమ పంటలకు కనీస ధరను, కనీస మార్కెటింగ్ సౌకర్యాలను గ్యారెంటీ చేస్తూ ప్రభుత్వం హామీ పడాలని, గ్రామీణ స్థానిక మార్కెట్లకు (మండీలు) ప్రైవేటు గుత్త వ్యాపార వర్గాల చేతుల్లో పెట్టరాదని, ప్రభుత్వ ఆహార సంస్థే నేరుగా రైతుల నుంచి ధాన్యోత్పత్తులను కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటు న్నారు. గాంధీజీ చంపారన్ రైతాంగ ఉద్యమం.. దాదాపు అదే కాలంలో స్వదేశీ మిల్లు యజమానుల దోపిడీకి వ్యతిరేకంగా అహ్మదా బాద్ కార్మికులు, కరువు రోజుల్లో కూడా వృత్తి ద్వారా చేసే రెవెన్యూ వసూళ్లకు నిరసనగా జరిగిన ‘ఖేడా’ ప్రతిఘటనోద్యమాలకు దీటైన ఉద్యమంగా నేటి రైతు ఉద్యమాన్ని పరిగణించాలి! అందువల్ల మోదీ తమ మూడు రైతాంగ వ్యతిరేక చట్టాల ద్వారా ‘తొలగించాలని భావిం చుకున్న అడ్డంకులు’ తద్వారా బడా కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయ రంగంపై ఆధిపత్యం కల్పించడానికి చేస్తున్న చట్టాల ద్వారా పెంచేవి లేదా పెంచాలని ఆశిస్తున్నవీ రైతాంగ ఆదాయాలు మాత్రం కావు. గుత్తేదారుల, వారి కంపెనీల ఆదాయాలు మాత్రమే! అందుకే ‘గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థ పెట్టుబడి వర్గాలకు ప్రధాన మైన వనరు. అందువల్లనే పారిశ్రామికవేత్తల లాభాలకు అడ్డుగోడలన్నిం టినీ తొలగించడానికే వ్యవసాయ సంస్కరణల’ని మోదీ కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు! అందుకే సెయింట్ అగస్తిన్ అని ఉంటాడు. ‘పాల కుడెవరో చెప్పండి, ఆ చట్టం ఎలా ఉంటుందో చెప్తా’ అన్నాడు! అందుకే కొందరు పాలకుల్ని గురించి లోకంలో ఒక సామెత స్థిరపడి ఉంటుంది. ‘చీకటి తన నల్ల దుప్పటిని అందరికీ సమంగా పంచాలని చూస్తుందట’! వెలుగు చీకట్లతో మానవులు కాపురం చేయక తప్పదు గానీ, ఎప్పటికప్పుడు చీకటిని వెడలుగొట్టుకుంటూనే ఉండాలి మరి! అదే నిత్య విమోచనకు అర్థం!! abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
ఇప్పుడు మాత్రమే కాదు.. అప్పుడూ ఇదే పాట
కేంద్ర ప్రభుత్వం 2020 సెప్టెంబరులో మూడు వ్యవసాయ బిల్లులను ఆమోదింపచేసుకుంది. ఇవి వ్యవసాయ సంస్కరణలను ఆటో పైలట్ మోడ్లో ఉంచాయి. 1991లో సరళీకరణ కూడా ఇలాంటి ప్రభావాన్నే తీసుకొచ్చింది. ఆరోజు కూడా ప్రతిపక్షాలు సరళీకరణను ఇలాగే అడ్డుకున్నాయి కానీ కాలం గడిచే కొద్దీ వారి అభిప్రాయం తప్పని రుజువైంది. వ్యవసాయ రంగంలో తలుపులు తెరవడం పట్ల రైతులు సానుకూల చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలు కలిసి 1991లో సంస్కరణలు ప్రారంభించిన ఆ పరమాద్భుత క్షణాల్లోకి వెళ్లకుండా భారతీయ వ్యవసాయాన్ని అడ్డుకుంటున్నాయి. ఇన్నేళ్ల తర్వాత వ్యవసాయ బిల్లులు ఆనాటి సరళీకరణను తలపిస్తూ దేశ వ్యవసాయ సంస్కరణలను ఆటో–పైలట్ మోడ్లో ఉంచాయి. ఇప్పటిలాగే ఆనాడు కూడా పెడబొబ్బలు పెట్టే ప్రతిపక్షం ఉండేది. కానీ వారి అరుపులన్నీ కాలం గడిచే కొద్దీ తప్పు అని రుజువయ్యాయి. ప్రజాస్వామ్యానికి అధికార వాణిగా పేరొం దిన థామస్ జెఫర్సన్ చెప్పారు.. ‘‘వ్యవసాయం అనేది అత్యంత తెలివైన అన్వేషణ. ఎందుకంటే అంతిమంగా అది దేశ నిజమైన సంపదకు, మంచి నైతిక విలువలకు, సంతోషానికి తోడ్పడుతుంది’’. భారతీయ వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతను ఆయన మాటలు చక్కగా వర్ణిస్తాయి. 73 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత, శతాబ్దాల వ్యవసాయ అనుభవం తర్వాత కూడా మనం ఆయన ప్రకటన సారాంశాన్ని అర్థం చేసుకోవడం లేదు. సంవత్సరాలుగా, ఇంకా చెప్పాలంటే దశాబ్దాలుగా వ్యవసాయం ఒక ప్రత్యేక రంగంగా విడిగా నడుస్తోంది కానీ జాతీయ ఆర్థిక వ్యవస్థతో అది మిళితం కావడం లేదు. దేశంలో 70 శాతం గ్రామీణ కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడుతున్నాయి. దేశ స్థూలదేశీయోత్పత్తిలో 17 శాతాన్ని మాత్రమే అందిస్తున్న వ్యవసాయ రంగం మొత్తం జనాభాలో 60 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ పరిస్థితి ఏకకాలంలో ఉపాధి లేమిని, అరకొర ఉపాధిని ప్రతిబింబిస్తోంది. అయినప్పటికీ వ్యవసాయ రంగ శక్తిసామర్థ్యాలు అపారమైనవి. కోవిడ్–19 మహమ్మారి కాలంలో వేగంగా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులవైపు దిశను మార్చుకున్న వ్యవసాయ విధానాలు మరింతగా విస్తరించాయి.అదేసమయంలో సవాళ్లు కూడా తక్కువగా లేవు. ప్రకృతిలో అనూహ్య మార్పులు చాలా తరచుగా సంభవిస్తున్నాయి. దీంతో అకాల వర్షాలు, కరువులు పదే పదే వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇక రాజకీయ జోక్యం అనే మరో సవాలు సంస్కరణల పురోగతిని గణనీయంగా అడ్డుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాల అమలు విషయంలో పంజాబ్ తీవ్ర సమస్యలను సృష్టిస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన తాజా వ్యవసాయ చట్టాలు కనీస మద్దతు ధరను ఎత్తివేయడానికి దారి తీస్తాయని, బడా కార్పొరేట్ వర్గాల దయాదాక్షిణ్యాలకు తమను బలిచేస్తారని భావిస్తుండటంతో రైతులు తమ నిరసనలపట్ల ఎలాంటి బాధను, పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచడం లేదు. చిట్టచివరి వారికి కూడా చేరేలా (ఎల్ఎమ్సి) పథకాల ఏర్పాట్లు ఉంటేనే భారతీయ అమలు వ్యవస్థ విజయవంతం అవుతుంది.. గ్రామీణ భారతానికి ఇది మరీ ఎక్కువగా వర్తిస్తుంది. కోవిడ్ మహమ్మారి ఈ ఎల్ఎమ్సి ప్రాధాన్యతను ఒక్కసారిగా వేగవంతం చేసింది. అందుకే ఆత్మనిర్భర ఉద్యమంలో భాగంగా వివిధ ప్రకటనలను కేంద్రం జారీ చేసింది. సమీకృత ఆర్థిక వృద్ధిని సాధించడానికి ప్రతి గ్రామానికీ నాణ్యమైన విద్యుత్తు, నీటి సరఫరా అనేవి ప్రాణాధారమైనవి. కోవిడ్ కాలంలో వ్యవసాయ రంగం మాత్రమే గణనీయ వృద్ధిని నమోదు చేసింది. కరోనా కాలం లోనే వరి ఎగుమతులు బాగా పెరి గాయి. నెస్టిల్, డాబర్, బ్రిటానియా వంటి కంపెనీలు గ్రామీణ ప్రాంతాలకు శరవేకంగా తమ నెట్వర్క్లను విస్తరించాయి. అనుకూలమైన రుతువులు, కొన్ని రాష్ట్రాల్లో కనీస మద్దతు ధర గరిష్టంగా ఉండటం, వలసబాట పట్టిన వారు తిరిగి తమ ఊళ్లకు చేరుకోవడం, ప్రభుత్వ సంక్షేమ చర్యలు పుంజుకోవడం వంటివి దీనికి మరింతగా దోహదం చేశాయి. అదే సమయంలో సరళీకరణ ప్రారంభ దిశలో అంటే 1991లో వ్యవసాయదారులు అద్భుత క్షణాలను ఆస్వాదించారు. చాలా కాలం తర్వాత 2020 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ బిల్లులను చట్టరూపంలోకి తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టాలు స్తబ్దంగా ఉండిపోయిన వ్యవసాయ రంగాన్ని పునరుత్తేజం చెందించే లక్ష్యంతో వరుస సంస్కరణలకు తాజా వ్యవసాయ చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. అయితే వీటి ద్వారా ప్రయోజనాలు పొందే అన్ని వర్గాలు దాపరికం లేని మనస్తత్వంతో వ్యవహరించాలి. అయితే ప్రస్తుతం ఇది సాధ్యమయ్యేటట్లు కనిపించడం లేదు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్లాలు కేంద్ర బిల్లులను రాజకీయంగా వ్యతిరేకించడం ప్రారంభించాయి. మరోవైపున ఈ సంస్కరణలు చిన్న, సన్నకారు రైతులను భయాందోళనల్లో ముంచెత్తుతున్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి భారతీయ వ్యవసాయ రంగం మార్కెట్ ఆధారిత రంగంలోకి ప్రవేశించే క్రమంలో ఉంది. వ్యవసాయ విలువ ఆధారిత సరఫరా చెయిన్ను వేగవంతం చేయడానికి, మధ్యదళారుల నుంచి చిన్న, సన్నకారు రైతులను విముక్తి చేయడానికి, విత్తులు నాటిన సమయం నుంచే ముందే నిర్దేశించిన మార్కెట్ ధరతో రైతులు ప్రయోజనం పొందడం కోసం ఒక సమగ్రమైన, నిలకడైన చట్రాన్నితీసుకురావడానికి రైతులు వ్యవసాయంలో తలుపులు తెరవడం పట్ల చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎట్టకేలకు వ్యవసాయం ఒక పరిణిత రంగంగా మార్పు చెందుతోంది. భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య ఉల్లిపాయలు, యాపిల్స్ వంటి ఉత్పత్తులను దీర్ఘకాలం పాటు శీతలీకరించేందుకు గానూ పది వేల టన్నుల సామర్థ్యంతో కూడిన ఉష్ణోగ్రతల నియంత్రిత గిడ్డంగులను ఏర్పరుస్తోంది. ఇది రైతులకు మేలు చేయడమే కాకుండా ధరల స్థిరీకరణకు కూడా తోడ్బడుతుంది. వ్యవసాయ అభివృద్ధిలో టెక్నాలజీని వర్తింపజేయడం వేగం పుంజుకుంది. కొన్ని టెక్నాలజీ సంస్థలు డేటా ఆధారిత వ్యవసాయాన్ని స్పెషలైజ్ చేస్తున్నాయి. వాతావరణానికి అనుగుణమైన వ్యవసాయంపై దృష్టి తప్పనిసరి అవుతోంది. వ్యవసాయరంగ దుస్థితి దాని కారణంగా ఏర్పడుతున్న నిరుద్యోగిత అనే అతిపెద్ద కొరతను తీర్చడానికి కార్యాచరణ పథకం అవసరం అవుతుంది. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న పంజాబ్ని వ్యవసాయ సంస్కరణలలో బీహార్ మార్గంలో వెళ్లడానికి అనుమతించకూడదు. వ్యవసాయ సంస్కరణలు రాజకీయ సులోచానాల నుంచి చూడకూడదు. పంజాబ్ రాష్టం తన సొంత వ్యవసాయ బిల్లులను ఆమోదించిన తరుణంగా పంజాబ్ రైతులు ఢిల్లీకి ఎందుకు దండు కట్టారన్నదే సమస్య. పంజాబ్ రాష్ట్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లులు ఉత్తమంగా ఉన్నాయని భావిస్తున్న ఆ రాష్ట్ర రైతులు కేంద్రం తీసుకొచ్చిన బిల్లులను మాత్రం వ్యతిరేకిస్తూ రాజకీయ ప్రకటనలను తలపించే మాటలు మాట్లాడుతూ న్యాయ పోరాటానికి కూడా దిగుతున్నారు. అయితే ఇటీవలే ఉల్లిపాయల ఎగుమతుల విషయంలో చేసినట్లు తాత్కాలిక ప్రయోజనాలతో కూడిన రాజకీయాలను అందరూ నిలిపివేయాలి. వాస్తవానికి పురోగామి స్వభావం కలిగిన వ్యవసాయ సంస్కరణలను ఉపయోగించుకోవడానికి రాష్ట్రాల మధ్య పోటీ తత్వం ఉండాలి. అన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలనూ వ్యవసాయ ప్రయోజానాలను ప్రోత్సహించేలా కుదుర్చుకోవాలి. ప్రకృతి సహజమైన, సాస్కృతిక పరమైన వనరులు సమృద్ధిగా ఉన్న భారత్లో రైతుల ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయ–పర్యాటకాన్ని ప్రోత్సహించే చర్యలు చేపట్టాలి. వ్యవసాయ సంస్కరణలు అమలు కావాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. వ్యవసాయ బిల్లులు ఆహార భద్రతకు హామీ ఇస్తున్నప్పటికీ, వినియోగదారుల మనోభావాలపై ప్రభావం చూపేలా దాన్ని అనుమతించకూడదు. కిరణ్ నందా, కార్పొరేట్ ఆర్థికవేత్త -
అన్నదాతలకే కాదు.. అందరికీ ముప్పే
నూతన వ్యవసాయ చట్టాల్లో వాడిన భాషవల్ల (తక్కువస్థాయి) కార్యనిర్వాహకులు తామే న్యాయస్థానా లుగా మారిపోతారు. న్యాయమూర్తి, ధర్మకర్త, తలారి కూడా అయిపోతారు. పెద్ద కార్పొరేట్లకూ, రైతులకూ మధ్య ఇదివరకే ఉన్న అన్యాయమైన అధికార అసమానతలను తాజా చట్టాలు మరింతగా పెంచుతాయి. ప్రభుత్వం ఊహించినదానికి భిన్నంగా రైతులు తమ(మన) హక్కులకోసం నిలబడ్డారు. ‘‘కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారికి, లేదా దీనికి సంబంధించిన మరే ఇతర వ్యక్తికి వ్యతిరేకంగా ఈ చట్టం కింద సదు ద్దేశంతో చేసిన, చేయాలను కున్న వాటి గురించి న్యాయ పరమైన ఫిర్యాదు, దావాలు ఉండవు.’’ రైతు ఉత్పత్తుల అమ్మకం, వాణిజ్య చట్టం, 2020లోని 13వ భాగంలోని వాక్యాలు ఇవి. ఇప్పుడు కూడా ఈ కొత్త చట్టాలు రైతులను మాత్రమే ఉద్దేశించినవని మీరు అనుకుంటు న్నారా? సివిల్ సర్వీస్ ఉద్యోగులు నిర్వహించా ల్సిన న్యాయపరమైన బాధ్యతలకు వ్యతిరేకంగా దావా వేయడానికి మినహాయింపునిచ్చే చట్టాలు కూడా ఉన్నాయి. కానీ ఇది దాన్ని ఎన్నో రెట్లు మించిపోయింది. ‘సదుద్దేశంతో’ వాళ్లు ఏం చేసినా దానికి చట్టపర మైన మినహాయింపు ఇవ్వడం మరీ అతిశయం. ‘సదుద్దేశంతో’నే ఏదైనా నేరం చేసి వుంటే వాళ్లను కోర్టుకు ఈడ్వలేకపోవడమే కాదు, ఇతరత్రా వేరే విధమైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం లేనంత రక్షణలో వారున్నారు. పొరపాటున మీరు ఈ అంశం వదిలేసివుంటే గనక, చట్టంలోని 15వ భాగం దాన్ని తిరిగి నొక్కి చెబు తుంది... ఈ అంశాలను విచారించే పరిధి ఏ సివిల్ న్యాయస్థానానికి కూడా లేదని. అసలు ఎవరీ చట్టపరంగా సవాలు చేయలేని, సదుద్దేశంతో పనులు చేసే ‘మరే ఇతర వ్యక్తి’? క్లూ: నిరసన తెలుపుతున్న రైతుల నినాదాల్లో దొర్లు తున్న బడా కార్పొరేట్ సామ్రాజ్యాధిపతులు పేర్లను వినడానికి ప్రయత్నించండి. ఇదంతా కూడా వ్యాపారాన్ని, చాలా చాలా పెద్ద వ్యాపారాన్ని సులభతరం చేయడంలో భాగంగా జరుగుతున్నది. ‘ఏ ఫిర్యాదు, వ్యాజ్యం లేదా మరే ఇతర న్యాయపరమైన చర్యలు ఉండవు’... వ్యాజ్యం వేయలేనిది రైతులు మాత్రమే కాదు, ఎవరూ వేయలేరు. ప్రజాహిత వ్యాజ్యాలకు కూడా ఇదే వర్తిస్తుంది. లాభాపేక్ష లేని గ్రూపులు, రైతు సంఘాలు, లేదా మంచో చెడో ఉద్దేశాలతో ఉన్న ఏ పౌరుడి జోక్యానికి కూడా ఇందులో వీలులేదు. అత్యవసర పరిస్థితి విధించిన 1975–77 కాలంలో తేలిగ్గా అన్ని ప్రాథమిక హక్కులు రద్దయి పోయాయి. మళ్లీ దాని తర్వాత న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు పౌరుడికి లేకుండా చేసిన విష యంలో ఈ చట్టాలు మరీ అతిశయపు మినహా యింపులు ఇచ్చేశాయి. ప్రతి భారతీయుడి మీద దీని ప్రభావం ఉంటుంది. ఇంకోరకంగా చెప్పాలంటే, ఈ చట్టాల్లో వాడిన భాషవల్ల (తక్కువస్థాయి) కార్యనిర్వాహ కులు తామే న్యాయస్థానాలుగా మారిపోతారు. వాస్తవంగా చెప్పాలంటే, న్యాయమూర్తి, ధర్మకర్త, తలారి కూడా అయిపోతారు. రైతులు మున్ముందు వ్యవహారం చేయాల్సిన పెద్ద కార్పొరేట్లకూ, రైతు లకూ మధ్య ఇదివరకే ఉన్న అన్యాయమైన అధికార అసమానతలను ఇది మరింతగా పెంచుతుంది. దీనిమీద ఆందోళన చెందిన ఢిల్లీ బార్ కౌన్సిల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో ఇలా ప్రశ్నించింది: ‘‘పౌర పరిణామాలకు దారితీసే అవ కాశమున్న వివాదాల్లో పాలన, కార్యనిర్వహణకు సంబంధించిన యంత్రాంగానికి తీర్పునిచ్చే అధికా రాన్ని ఎలా ఇస్తారు?’’ ఈ న్యాయసంబంధ అధికారాలను కార్య నిర్వాహక యంత్రాంగానికి బదిలీ చేయడాన్ని ‘ప్రమాదకరం, మహాపరాధం’ అని ఢిల్లీ బార్ కౌన్సిల్ అభివర్ణించింది. న్యాయవృత్తి మీద చూపే ప్రభావం గురించి, ‘ఇది ప్రత్యేకించి జిల్లా న్యాయ స్థానాల విధులకు తీవ్రమైన హాని కలిగించడంతో పాటు న్యాయవాదుల ఉనికిని కూడా లేకుండా చేస్తుంది’ అని అభిప్రాయపడింది. ఇప్పుడుకూడా ఈ చట్టాలు కేవలం రైతులను ఉద్దేశించినవే నని అనుకుంటున్నారా? కార్యనిర్వాహక యంత్రాంగా నికి న్యాయపరమైన అధికారా లను బదిలీ చేయడం ఒప్పందా లకు సంబంధించిన చట్టంలో ఉంది. దీనిలోని 19వ భాగం ఏమంటుందంటే: సబ్ డివిజినల్ అధికారి, పునర్విచారణ జరిపే అధికారి ఈ చట్టం కింద పూర్తి సాధికారులై నిర్ణయించినదాన్ని నిలిపివేయ గలిగే అధికారం ఏ సివిల్ న్యాయ స్థానానికిగానీ మరే ఇతర అధికార యంత్రాంగానికి గానీ లేదు. ఈ వ్యవసాయ చట్టం లోని 19వ భాగపు సారాంశం... రాజ్యాంగపరమైన విచికిత్సకు హక్కు కల్పించే రాజ్యాంగంలోని 32వ ఆర్టికల్ను కొట్టి పడేస్తోంది. ఆర్టికల్ 32ను రాజ్యాంగపు ప్రాథ మికమైన నిర్మాణంగా పరిగణిస్తారు. కచ్చితంగా ఈ ‘ప్రధాన స్రవంతి’ మీడియా (జనాభాలోని 70 శాతానికి సంబంధించిన అంశా లను విస్మరించేదానికి పెట్టిన చిత్రమైన పేరు)కు ఈ వ్యవసాయ చట్టాలవల్ల భారత ప్రజాస్వామ్యా నికి సంభవించే విపరిణామాల గురించి తెలిసే అవకాశం లేదు. కానీ ప్రజాహితం, ప్రజాస్వామ్యం కన్నా ఎక్కువగా వారిని లాభాపేక్ష నడిపిస్తుంది. ఇందులో ప్రయోజనాల వైరుధ్యం ఏమైనా ఉందా అనే అనుమానాలుంటే అవి వదిలించు కోండి. ఈ మీడియా సంస్థలు కూడా కార్పొరేషన్లే. దేశంలోని అతిపెద్ద కార్పొరేషన్ అధిపతి దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థ యజమాని కూడా. చాలా కాలంగానే ఈ ఫోర్త్ ఎస్టేట్కూ, రియల్ ఎస్టేట్కూ మధ్య ఉన్న తేడా ఏమిటో చూపలేనట్టు అయి పోయింది. కార్పొరేషన్ ప్రయోజనాలను కాదని పౌర ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వలేనంత లోతుగా ఈ ప్రధాన స్రవంతి మీడియా తన ప్రపం చంలో కూరుకు పోయివుంది. వారి పత్రికల్లో, చానళ్లలో రైతులను రాక్షసు లుగా చిత్రించడం జరుగుతోంది– ధనిక రైతులు, కేవలం పంజాబీయులు, ఖలిస్తానీలు, కపటులు, కాంగ్రెస్ దేశద్రోహులు, ఇట్లా ఎన్నో రకాలుగా ఎంతో ప్రతిభావంతంగా చూపుతూనేవున్నారు.కాకపోతే ఈ పెద్ద మీడియా సంస్థల సంపా దకీయాలు భిన్నమైన ఎత్తుగడ అనుసరిస్తాయి. మొసలి కన్నీళ్లు కారుస్తాయి. ప్రభుత్వం ఈ విష యంలో మరింత మెరుగ్గా వ్యవహరించాల్సిందని చెబుతాయి. రైతుల మేలు కోరి, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వ ఆర్థికవేత్తలు, ప్రధానమంత్రి తెచ్చిన ఈ చట్టాలు చాలా అవ సరం, ఆచరించదగ్గవని చెబుతాయి. కానీ అవన్నీ వేసుకోని ఒక ప్రశ్న: ఇప్పుడే ఎందుకు? కార్మిక చట్టాలు కూడా ఇంత హడా వుడిగా ఎందుకు ముందుకు తెచ్చారు? ఎంతో శ్రద్ధ చూపాల్సిన వేయి అంశాలుండగా ఈ కోవిడ్ మహ మ్మారి సంక్షోభ సమయమే ఈ చట్టాలను తేవడా నికి ఎందుకు అనువైన సమయమని బీజేపీ భావిం చింది? కోవిడ్ వల్ల తీవ్రంగా దెబ్బతిని, చలనం కోల్పోయివున్న రైతులు, కార్మికులు ఏ రకంగానూ అర్థవంతమైన నిరసన చేయలేరని వాళ్ల అంచనా. కాబట్టి, ఇదే సరైన సమయం. అంటే సమూల సంస్కరణలను ముందుకు జరిపే ‘రెండో 1991 క్షణాన్ని’ వాళ్లు దర్శించారు. మంచి సంక్షోభాన్ని అస్సలు వృథా చేయొద్దని వాళ్లకు తెలుసు.2018 నవంబరులో లక్ష మందికి పైగా రైతులు ఢిల్లీలోని పార్లమెంట్ దగ్గర స్వామినాథన్ నివేదిక సిఫారసులను అమలు చేయాలని నిరసనకు దిగారు. అందులోని ముఖ్యాంశాలైన రుణమాఫీ, కనీస మద్దతు ధరకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందులో కేవలం పంజాబ్ రైతులే లేరు, 22 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని రైతులు ఉన్నారు.ఇప్పుడు కూడా ప్రభుత్వం ఊహించినదానికి భిన్నంగా రైతులు తమ(మన) హక్కుల కోసం నిలబడ్డారు. తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వ్యవ సాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వ్యాసకర్త ప్రసిద్ధ పాత్రికేయుడు; పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకుడు పి. సాయినాథ్ -
వాళ్లు తల్లిదండ్రులతో సమానం: సోనుసూద్
ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన, నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు రైతులు చేపట్టిన నిరసన దీక్షలకు మద్దతు తెలుపుతున్నారు. మరి కొంతమంది షాహిన్బాగ్ తరహా నిరసనలతో పోల్చడంతో సోషల్ మీడియాలో నెటిజన్ల చేత తీవ్రమైన విమర్శలకు గురవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ నటుడు సోన్సూద్ రైతులు చేస్తున్న నిరసనలపై స్పందించారు. ఆయన రైతుల గొప్పతనాన్ని తెలియజేసేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలోని రైతులు.. జన్మనిచ్చిన తల్లిదండ్రులతో సమానం’ అని ట్వీటర్లో పేర్కొన్నారు. దీంతో ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికంటే ముందు కూడా సోన్సూద్ ‘భారతదేశం రైతు దేశం’ అని ట్వీట్ చేశారు. చదవండి: రైతు దీక్షలు.. సింగర్ కోటి సాయం ఇక శనివారం కేంద్రంతో జరిగిన ఐదో విడత చర్చలు కూడా విఫలమయ్యాయి. కేంద్రంతో జరిగిన చర్చలో రైతు సంఘాలు వ్యవసాయ చట్టాల రద్దును తమ ప్రధాన డిమాండ్గా తెలిపారు. ఈ ప్రతిపాదనపై కేంద్ర డిసెంబర్ 9 వరకు సమయాన్ని కోరింది. తమ డిమాండ్ల సాధనకు 8వ తేదీన రైతు సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్కు పలు ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వ్యవసాయ కార్మికులపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియలో తీవ్ర దుమారం రేపాయి. కంగనా వ్యాఖ్యలను పలువురు బాలీవుడ్ ప్రముఖులు త్రీవంగా ఖండించిన విషయం తెలిసిందే. -
రైతు దీక్షలు.. సింగర్ కోటి సాయం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని నడిబొడ్డున రైతులు చేపట్టిన దీక్షలకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ నెల 8న తలపెట్టన భారత్ బంద్కు ఇప్పటికే విపక్ష పార్టీతో సహా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సైతం మద్దతు ప్రకటించారు. పదిరోజులుగా ఢిల్లీ నడిరోడ్డుపై చలిలో దీక్షలు నిర్వహిస్తున్న రైతులకు సంఘీభావం తెలియజేస్తున్నారు. న్యాయబద్ధమైన రైతుల డిమాండ్స్ను నెరవేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్చించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు రైతులకు అండగా బియ్యం, దుస్తులు, కూరగాయలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రైతుల దీక్షలకు మద్దతు ప్రకటించిన పంజాబ్ నటుడు, ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసంజ్ మరోసారి వారికి అండగా నిలిచారు. చలిలో గత పదిరోజులుగా నిరసన తెలుపుతున్న రైతులకు కోటి రూపాయల సాయం ప్రకటించారు. రైతులకు మద్దతుగా ప్రజాసంఘాలు, నాయకులు ముందుకు రావాలని కోరారు. (రైతుల దీక్షకు సీఎం కేసీఆర్ మద్దతు) కాగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వ్యవసాయ కార్మికులపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై దిల్జిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాము యూపీ వాలా కాదని, పంజాబ్ రైతులమని గట్టి కౌంటరిచ్చారు. ఈ క్రమంలోనే వారిద్దమరి మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం సాగింది. మరోవైపు రైతులతో కేంద్రం జరిపిన ఐదో విడత చర్చలు విఫలమైన నేపథ్యంలో దీక్షలను కొనసాగించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 8న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. దేశ వ్యాప్త బంద్కు విపక్షాలతో పాటు ప్రజాసంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. (చర్చల్లో ప్రతిష్టంభన.. పట్టువీడని రైతులు) -
చర్చలు అసంపూర్ణం
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు, కేంద్ర మంత్రులకు మధ్య గురువారం జరిగిన నాలుగో విడత చర్చలు ఎలాంటి నిర్ణయాత్మక ఫలితం రాకుండానే, అసంపూర్తిగా ముగిశాయి. రేపు(శనివారం) మరో విడత చర్చలు జరగనున్నాయి. ముగ్గురు కేంద్ర మంత్రులు, దాదాపు 40 మంది రైతు సంఘాల ప్రతినిధుల మధ్య ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సుమారు 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. చర్చల సందర్భంగా ప్రభుత్వం నుంచి మంచినీరు కూడా రైతు ప్రతినిధులు స్వీకరించలేదు. ప్రభుత్వం ఆఫర్ చేసిన టీ, లంచ్ను వారు తిరస్కరించారు. హడావుడిగా తీసుకువచ్చిన సాగు చట్టాల్లోని లోటుపాట్లను ప్రస్తావించి, వాటిని రద్దు చేయాలని మరోసారి గట్టిగా డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని, ఆ విషయంలో అపోహలు వద్దని చర్చల సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. ఆ విధానాన్ని టచ్ కూడా చేయబోమని హామీ ఇచ్చారు. పార్లమెంటు సమావేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు. ‘చర్చించాల్సిన అంశాలను నిర్ధారించాం. వాటిపై శనివారం చర్చ జరుగుతుంది. అదే రోజు రైతుల నిరసన కూడా ముగుస్తుందని ఆశిస్తున్నా’ అని చర్చల్లో పాల్గొన్న వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ పేర్కొన్నారు. ‘చర్చల సందర్భంగా కొన్ని అంశాలను రైతు ప్రతినిధులు లేవనెత్తారు. కొత్త చట్టాల వల్ల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ)లు మూత పడ్తాయేమోనని వారు భయపడ్తున్నారు. ప్రభుత్వానికి పట్టింపులేవీ లేవు. సానుకూల దృక్పథంతో రైతులతో చర్చలు జరుపుతున్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీలను మరింత బలోపేతం చేయడానికి, ఆ కమిటీల కార్యకలాపాలను విస్తృతం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం’ అని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. ‘కొత్త చట్టాల ప్రకారం.. ఏపీఎంసీ పరిధికి వెలుపల ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లు ఉంటాయి. రెండు విధానాల్లోనూ ఒకే విధమైన పన్ను వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు. ‘రైతులు తమ ఫిర్యాదులపై ఎస్డీఎం(సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్) కోర్టులకు వెళ్లవచ్చని చట్టంలో ఉంది. అది కింది కోర్టు అని, పై కోర్టుల్లో దావా వేసే వెసులుబాటు ఉండాలని రైతు ప్రతినిధులు కోరారు. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం’ అని తోమర్ తెలిపారు. రైతులు కోరుతున్నట్లు.. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారా? అన్న మీడియా ప్రశ్నకు తాను భవిష్యత్తును చెప్పేవాడిని కాదని తోమర్ బదులిచ్చారు. తోమర్, సోమ్ ప్రకాశ్లతో పాటు రైల్వే, వాణిజ్య, ఆహార శాఖ మంత్రి పియూష్ గోయల్చర్చల్లో పాల్గొన్నారు. చర్చల అనంతరం రైతు సంఘాల ప్రతినిధులు నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. ‘మా వైపు నుంచి చర్చలు ముగిశాయి. ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపనట్లయితే.. తదుపరి చర్చలకు రాకూడదని మా నేతలు నిర్ణయించారు’ అని ఏఐకేఎస్సీసీ(ఆల్ ఇండియా కిసాన్ సంఘర్‡్ష కోఆర్డినేషన్ కమిటీ) సభ్యురాలు ప్రతిభ షిండే తెలిపారు. ‘ఎమ్మెస్పీ సహా పలు అంశాలపై ప్రభుత్వం నుంచి చాలా ప్రతిపాదనలు వచ్చాయి. వాటిపై శుక్రవారం రైతు సంఘాల ప్రతినిధులు చర్చిస్తారు’ అని మరో నేత కుల్వంత్ సింగ్ సంధు తెలిపారు. ‘చట్టాల్లో సవరణలు చేయడం కాదు.. ఆ వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమే మా ప్రధాన డిమాండ్’ అని ఏఐకేఎస్సీసీ ప్రధాన కార్యదర్శి హన్నన్ మోలా స్పష్టం చేశారు. రైతు సంఘాల ప్రతినిధులు శుక్రవారం సమావేశమై, త్రదుపరి చర్చలపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. మీ ఆతిథ్యం మాకొద్దు చర్చల సందర్బంగా ప్రభుత్వ ఆతిథ్యాన్ని రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. తమకోసం సింఘు నుంచి వ్యాన్లో వచ్చిన భోజనాన్ని స్వీకరిం చారు. చర్చల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన టీ, మంచినీరును కూడా వారు తీసుకోలేదు. ‘సహచర రైతులు రోడ్లపై ఉంటే, మేం ఇక్కడ ప్రభుత్వ ఆతిథ్యాన్ని ఎలా తీసుకుంటాం’ అని చర్చల్లో పాల్గొన్న రైతు నేత షిండే వ్యాఖ్యానించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ వద్ద నిరసన తెలుపుతున్న రైతులు -
ఎన్డీయే నుంచి వైదొలుగుతాం..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు దేశ వ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహావేశాలకు దారితీస్తోంది. గత పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా రైతులు, రైతు సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే గడిచిన ఐదు రోజులుగా దేశ రాజధానిలో ఆందోళన చేపడుతున్నారు. రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా రూపొందించిన బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. తమ డిమాండ్స్కు కేంద్రం దిగొచ్చేవరకు నిరసన కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు. (చర్చలకు రండి; కేంద్ర సర్కారు ఆహ్వానం) రైతుల దీక్షకు దేశ వ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మరోవైపు నూతన వ్యవసాయ బిల్లులు ఎన్డీయేలో చిచ్చుపెడుతున్నాయి. ఇప్పటికే ఆయా బిల్లులను వ్యతిరేకిస్తూ బీజేపీ చిరకాల మిత్రపక్షం శిరోమణీ అకాలీదళ్ ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. పంజాబ్ రైతాంగానికి మద్దతుగా ఆ పార్టీ ఎంపీ హర్సిమ్రాత్ కౌర్ బాదల్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా సైతం సమర్పించారు. బిల్లులపై పార్లమెంట్లో చర్చసాగుతున్న తరుణంలో ఆమె ఈ నిర్ణయం తీసుకుని రైతులు మద్దతుగా నిలుచున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతులు వ్యతిరేక విధానాలను నిరశిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా మరోసారి రైతుల నిరసన దేశ రాజధానికి తగలడంతో మరో భాగస్వామ్యపక్షం బీజేపీకి హెచ్చరికలు జారీచేసింది. (బీజేపీ షాక్: రాజీనామా బాటలో డిప్యూటీ సీఎం!) రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించపోతే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగతామని రాజస్తాన్కు చెందిన బీజేపీ మిత్రపక్షం లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) అధ్యక్షుడు హనుమాన్ బేనివాల్ ప్రకటించారు. దేశ రాజధాని నడిబొడ్డున చలిలో వేలాది రైతులు దీక్షలు నిర్వహిస్తుంటే కేంద్రం పట్టించుకోకపోడం దారుణమన్నారు. ఈ మేరకు కేంద్రహోంమంత్రి అమిత్ షాకు సోమవారం బేనివాల్ లేఖ రాశారు. రైతుల డిమాండ్స్కు వెంటనే స్పందించి కేంద్ర ఓ నిర్ణయానికి రావాలని డిమాండ్ చేశారు. కాగా రాజస్తాన్లో బలమైన సామాజిక వర్గం మద్దతుదారులను కలిగిఉన్న ఆర్ఎల్పీ ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో దాదాపు 15 పార్లమెంట్ స్థానాల్లో ప్రభాల్యం కలిగిన బేనివాల్.. తాజాగా రైతు దీక్షకు మద్దతు ప్రకటించారు. కాగా కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో గత ఐదు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాల నేతలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మంగళవారం తమతో చర్చలకు ముందుకు రావాలని కోరింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం రాత్రి ప్రకటించారు. రైతు సంఘాలు పోరాటం ఇక్కడితో ఆపాలని, చర్చలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ పెరుగుతుండడం, చలి సైతం తీవ్రమవుతుండడంతో రెండు రోజుల ముందే చర్చలు సాగించాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. -
చర్చలకు రండి; కేంద్ర సర్కారు ఆహ్వానం
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో గత ఐదు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాల నేతలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మంగళవారం తమతో చర్చలకు ముందుకు రావాలని కోరింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం రాత్రి ప్రకటించారు. రైతు సంఘాలు పోరాటం ఇక్కడితో ఆపాలని, చర్చలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. వాస్తవానికి డిసెంబర్ 3న రైతు సంఘాల నాయకులతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం భావించింది. అయితే, ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ పెరుగుతుండడం, చలి సైతం తీవ్రమవుతుండడంతో రెండు రోజుల ముందే చర్చలు సాగించాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు.. అక్టోబర్ 14, నవంబర్ 13న రైతులతో చర్చించింది. మంగళవారం(డిసెంబర్ 1) మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మూడో దఫా చర్చలు జరగనున్నాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్పై రైతులు, రైతు సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. సాగు చట్టాలు కరోనా కంటే ప్రమాదం కరోనా›హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా అన్నదాతలు నిరసన సాగిస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. కరోనాతో ముప్పు ఉంటుందన్న విషయం తమకు తెలుసని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ కొత్త వ్యవసాయ చట్టాలు కరోనా కంటే మరింత ప్రమాదకరమని పేర్కొంటున్నారు. ధర్నాలో ఉన్న రైతులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహమ్మారిపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఏడుగురు వైద్యులతో కూడిన బృందం నవంబర్ 28 నుంచి 90 మంది రైతులకు పరీక్షలు చేసింది. వీరిలో ఎవరికీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాలేదని డాక్టర్లు చెప్పారు. షరతులు పెడితే.. ఢిల్లీని ముట్టడిస్తాం సాక్షి, న్యూఢిల్లీ: చర్చల విషయం లో కేంద్రం ఎలాంటి షరతులు విధించరాదని రైతులు పేర్కొన్నారు. అవసరమైతే ఢిల్లీని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన చలో ఢిల్లీ సోమవారం ఐదో రోజుకు చేరుకుంది. చలిని సైతం లెక్కచేయకుండా సింఘు, టిక్రీ రహదారులపై బైఠాయించి రైతులు నిరసన తెలుపుతున్నారు. రైతుల ఆందోళనకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. యూనియన్ల మద్దతు.. నిరసన తెలుపుతున్న రైతులకు అఖిల భారత వ్యవసాయ కార్మికుల సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్లు (సీఐటీయూ) సంయుక్త కార్యదర్శి విక్రమ్ సింగ్, అధ్యక్షురాలు కె.హేమలత, సీఐటీయూ కార్యదర్శి కరుమలియన్లు మద్దతు తెలిపారు. రైతుల పోరాటాన్ని దేశవ్యాప్తంగా తీవ్రతరం చేయాలని ఏఐఏడబ్ల్యూయూ నిర్ణయించింది. ఈ మేరకు తక్షణ కార్యాచరణ ప్రకటించింది. -
భగ్గుమంటున్న కూరగాయల ధరలు
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట : రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కరోనాతో ఆర్థికంగా దెబ్బతిన్న కుటుంబాలకు కూరగాయల కొనుగోళ్లు భారంగా మారాయి. రూ.200 పెట్టినా.. సగం సంచి నిండడం లేదు. గత ఏడాదితో పరిశీలిస్తే.. ఈ ఏడాది వానాకాలం అంతటా కూరగాయల సాగు పడిపోవడమే ఇందుకు కారణం. నీటి పారుదల వనరులతో మెట్ట ప్రాంతాల్లో తరి పంటలే ఎక్కువగా సాగయ్యాయి. వరి సాగుకు రైతులు మొగ్గు చూపడంతో కూరగాయల సాగు పడిపోయింది. గత ఏడాది 1,32,610 ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగయితే, ఈ ఏడాది 61,153 ఎకరాల్లోనే ఈ పంట సాగు విస్తీర్ణం నమోదైంది. ఈ పరిస్థితితో కూరగాయల ధరలు పెరిగాయి. రాజధాని చుట్టూ తగ్గిన సాగు రాజధాని చుట్టు పక్కల ఉన్న జిల్లాల్లో కూరగాయల సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో గత ఏడాది సాగు విస్తీర్ణం కన్నా ఈసారి 50 శాతం లోపే సాగు చేశారు. ఈ వానాకాలం రాష్ట్రంలో భారీ వర్షాలు పడటంతో భూగర్భ జలాలు అనూహ్యంగా పైకివచ్చాయి. దీంతో రైతులు మెట్ట పంటలను వదిలి తరి పంటల సేద్యం బాట పట్టారు. టమాట, బెండకాయ, వంకాయ, దొండకాయ, దోసకాయ, పచ్చిమిర్చి, సొరకాయ వంటి కూరగాయలు ప్రతి గ్రామాల్లో కొన్ని ఎకరాల్లోనైనా పండేవి. నీటి వనరుల కళతో రైతులు కూరగాయల సాగును పక్కన పెట్టి ఎక్కువగా వరి సాగు చేశారు. ఎస్సారెస్పీ, కాళేశ్వరం జలాలతో మెట్ట ప్రాంతమంతా తరిగా మారడంతో ఈ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాల్లోనూ కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గింది. కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గడంతో దీని ప్రభావం ధరలపై పడింది. ఏ కూరగాయలను కొనుగోలు చేయాలన్నా ధరను చూసి సామాన్య ప్రజలకు దడ పుడుతోంది. పచ్చి మిర్చి కేజీ రూ.100, బెండకాయ, వంకాయ, టమాట రూ.60 పైనే పలుకుతోంది. గత ఏడాది కన్నా రెండు, మూడు రెట్లు పెరిగాయి. ఐదు నెలలుగా కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయనీ కానీ దిగి రావడం లేదు. అయితే ఈ పంటలు కొద్దిగొప్పో సాగు చేసిన రైతులకు మాత్రం దండిగా ఆదాయం సమకూరుతోంది. ఒకప్పుడు మార్కెట్లో టమాటకు కిలో రూ. 2 కూడా పెట్టలేదని, గత ఐదు నెలలుగా కేజీ హోల్సేల్గా తోట వద్దే రూ.40కి పైగా అమ్ముతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. గత ఏడాది, ఈ ఏడాది పలు జిల్లాల్లో కూరగాయల సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) .. జిల్లా గత ఏడాది ఈ ఏడాది రంగారెడ్డి 37,579 13,652 వికారాబాద్ 5,664 6,328 సంగారెడ్డి 6,823 3,535 నల్లగొండ 4,269 1,191 సిద్దిపేట 9,902 4,696 సూర్యాపేట 2,418 825 -
ఢిల్లీ సరిహద్దుల్లో హై టెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ రైతు, కార్మిక సంఘాలు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమంలో ఉద్రిక్తంగా మారింది. పంజాబ్ నుంచి వేలాది మంది రైతులు హర్యానా మీదుగా రాజధాని బాటపట్టారు. వారిని నిలువరించేందుకు హర్యానా సర్కార్ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపింది. బారికేడ్లు పెట్టి ఎక్కడిక్కడ రైతులను, కార్మిక సంఘాల నేతలను అడ్డుకుంటోంది. అంతేకాకుండా పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్ హర్యానా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి బయలుదేరడంతో ఢిల్లీ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. రైతులను జల ఫిరంగులు ప్రయోగిస్తూ ఎవరినీ కూడా నగరం లోపలకు అనుమతించకుండా అడ్డుకుంటున్నారు. రైతుల నిరసనల నేపథ్యంలో రెండు రోజుల పాటు పంజాబ్కు బస్సు సర్వీసులను హర్యానా ప్రభుత్వం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. హర్యానాలో బారీగేట్లను పెట్టి ట్రాఫిక్ను మళ్లించారు. పంజాబ్కు చెందిన వేలాది రైతులు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కవాతుగా గురువారం ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. వారంతా హర్యానా సరిహద్దు వద్ద సమావేశమయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానా ప్రభుత్వం తన భద్రతా సిబ్బందిని సరిహద్దుల దగ్గర మోహరించింది. కరోనావైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం నగరంలో ఎటువంటి ర్యాలీని అనుమతించడం లేదు. ఢిల్లీ సరిహద్దులైన గురుగ్రామ్, ఫరీదాబాద్ వద్ద కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పంజాబ్ దారులన్నీ మూసివేత.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆదేశాల మేరకు గురువారం, శుక్రవారం పంజాబ్ సరిహద్దులను మూసివేశారు. నిరసన మార్చ్ను అడ్డుకునేందుకు పంజాబ్ రోడ్లపై బారికేడ్లు, వాటర్ ఫిరంగులు, పోలీసు వాహనాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ సమావేశాలను అనుమతించకుండా, నిషేధ ఉత్తర్వులు రాష్ట్రంలో విధించారు. రెండు లక్షల మంది రైతులు హర్యానాకి చేరుకుంటారని భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా-ఉగ్రహాన్) పేర్కొంది. ఈ ర్యాలీకి అవసరమైన రేషన్, కూరగాయలు, కలప, ఇతర నిత్యావసర వస్తువులను రైతులు తీసుకొచ్చారు. చలి కాలం కావడంతో దుప్పట్లు కూడా వెంటతెచ్చుకున్నారు. "మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము, ఈ పోరాటం చాలా కాలం జరగవచ్చు" అని బీకేయు (ఏక్తా-ఉగర్హాన్) ప్రధాన కార్యదర్శి సుఖ్దేవ్ సింగ్ అన్నారు. ఈ విషయం పరిష్కారం అయ్యేవరకు తిరిగి రామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఢిల్లీకి రావద్దు: పోలీసులు రైతుల నిరసన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం సైతం భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. సరిహద్దుల వద్ద బలగాలను మోహరించింది. ముఖ్యంగా ఘాజిపూర్ సరిహద్దు, చిల్లా సరిహద్దు, డిఎన్డిపై దృష్టి సారించింది. ఎనిమిది కంపెనీల పారామిలిటరీ దళాలు ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీ ప్రభుత్వం మెట్రో సర్వీసులను కుదించింది. పలు రైతు సంఘాల నుంచి వచ్చిన అభ్యర్థనలన్నీ తిరస్కరించామని, ఈ విషయాన్ని నిర్వాహకులకు తెలిపామని ఢిల్లీ పోలీసులు బుధవారం ట్వీట్ చేశారు. "కరోనా వైరస్ కారణంగా ఢిల్లీలో ఎటువంటి సమావేశాలు జరపకూడదు, దయచేసి ఢిల్లీ పోలీసులతో సహకరించండి " అని మరో ట్వీట్లో అభ్యర్ధించారు. అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ వరుస ట్వీట్స్తో నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల సంఘాలను కేంద్రం డిసెంబర్ 3 న రెండవ విడత చర్చలకు పిలిచింది. किसानों से समर्थन मूल्य छीनने वाले कानून के विरोध में किसान की आवाज सुनने की बजाय भाजपा सरकार उन पर भारी ठंड में पानी की बौछार मारती है। किसानों से सबकुछ छीना जा रहा है और पूंजीपतियों को थाल में सजा कर बैंक, कर्जमाफी, एयरपोर्ट रेलवे स्टेशन बांटे जा रहे हैं। #FarmersProtest pic.twitter.com/al8dG8ZZhi — Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 26, 2020 -
రైతులు తొందరపడకండి : సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సాగైన వరి ధాన్యం, పత్తి పంటలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 6 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని గింజ లేకుండా కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పంటలకు పెట్టుబడి అందించడం దగ్గరనుండి పంటల కొనుగోలు వరకు ప్రతి విషయంలోనూ తెలంగాణ రైతులను కాపాడుకోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వానాకాలం పంటల కొనుగోలు అంశంపై మంగళవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణలో రికార్డుస్థాయిలో ఈ వానాకాలం మొత్తం 134.87 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, అందులో 52.77 లక్షల ఎకరాల్లో వరి, 60.36 లక్షల ఎకరాల్లో పత్తి, 10.78 లక్షల ఎకరాల్లో కంది సాగైందని సీఎం తెలిపారు. ఐకేపీ సెంటర్లు, కో ఆపరేటివ్ సొసైటీలు, మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు. రైతులు తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని వరి ధాన్యం 17శాతం తేమకు లోబడి తీసుకొస్తే ఏ- గ్రేడ్ రకానికి క్వింటాల్ కు రూ.1,888, బి-గ్రేడ్ రకానికి క్వింటాల్ కు రూ.1,868 కనీస మద్దతు ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. (ఆ అధికారం అపెక్స్ కౌన్సిల్దే: షెకావత్) తాలు, పొల్లు లేకుండా ఎండబోసిన వరిధాన్యాన్ని తెచ్చి కనీస మద్దతు ధర పొందాలని, తేమ ఎక్కువ ఉన్న ధాన్యాన్ని తెచ్చి ఇబ్బంది పడవద్దని సీఎం రైతులను కోరారు. వరి ధాన్యం కొనుగోలుపై ఒకటి, రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదలవుతాయని, ఈ విషయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పత్తిని కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పూర్తిగా కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ విషయంలో సీసీఐతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రైతులకు ఈ విషయంలో ఏమైనా సందేహాలుంటే ఎప్పటికప్పుడు కాల్ సెంటర్ ద్వారా నివృత్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, పెద్దపల్లి జెడ్పీ చైర్ పర్సన్ పుట్ట మధు, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, సివిల్ సప్లయీస్ కమిషనర్ అనిల్ కుమార్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. -
విదేశాలకు మన వంగడాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ నుంచి ఏటా రూ.2,000 కోట్ల విలువైన విత్తనాలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటిలో టమాటా, మిరప, పుచ్చకాయ, మొక్కజొన్న తాలూకు విదేశీ వెరైటీలు కూడా ఉన్నాయి. పలు విదేశీ కంపెనీలు ఇక్కడి రైతులతో భాగస్వామ్యం కుదుర్చుకుని విత్తనాలను ఉత్పత్తి చేసి అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం రూ.200 కోట్ల విలువైన విదేశీ వెరైటీల విత్తనాల ఎగుమతి జరుగుతోంది. ఇక్కడి విత్తనాలకు విదేశాల్లో మార్కెటింగ్, సర్టిఫికేషన్, సబ్సిడీలతో ప్రభుత్వం ప్రోత్సహిస్తే అయిదేళ్లలో మొత్తం ఎగుమతులు నాలుగు రెట్లకు చేరడం ఖాయమని సీడ్స్మెన్ అసోసియేషన్ అంటోంది. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు మరింత ప్రయోజనమని చెబుతోంది. నాబార్డు సహకారంతో లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని అసోసియేషన్ ధీమాగా ఉంది. విత్తన భాండాగారాలు.. తెలుగు రాష్ట్రాలు విత్తన భాండాగారాలుగా విరాజిల్లుతున్నాయి. వాతావరణం, నేలలు అనుకూలంగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విత్తనాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా 60 శాతంగా ఉంది. మొక్కజొన్న, జొన్న విత్తనాల్లో 90 శాతం, సజ్జలు 85 శాతం, వరి 60 శాతం, పత్తి విత్తనాల్లో 50 శాతం తెలుగు రాష్ట్రాలు సమకూరుస్తున్నాయి. ఇక రూ.200 కోట్ల విలుౖÐð న కూరగాయల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి. జాతీయ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల్లో 90 శాతం ఇక్కడ కొలువుదీరాయని సీడ్స్మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కార్న్టెక్ సీడ్స్ సీఈవో యాగంటి వెంకటేశ్వర్లు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో 10 లక్షలకుపైగా రైతులు విత్తన సాగులో నిమగ్నమయ్యారని చెప్పారు. రబీకి పెరగనున్న విక్రయాలు.. కోవిడ్–19 కారణంగా ఉపాధి కోల్పోయిన, ఉద్యోగాలు వదులుకున్న యువత తిరిగి గ్రామాల బాట పట్టారు. వీరిప్పుడు వ్యవసాయంపై దృష్టిసారించారని కంపెనీలు అంటున్నాయి. మరోవైపు వర్షాలు దేశవ్యాప్తంగా అంచనాలను మించి కురిశాయి. ఈ ఏడాది ఖరీఫ్లో పరిశ్రమ 5 శాతం వృద్ధి సాధించింది. రబీకి విత్తన అమ్మకాలు 20–25 శాతం అధికం కావచ్చని పరిశ్రమ భావిస్తున్నట్లు రాశి సీడ్స్ సీవోవో ఏ.ఎస్.ఎన్.రెడ్డి తెలిపారు. ఎంౖMð్వరీలనుబట్టి చూస్తే సాగు విస్తీర్ణమూ పెరగనుందని అన్నారు. రెండున్నర దశాబ్దాల్లో కూరగాయల ఉత్పత్తి మూడు రెట్లు అధికమైందని ఈస్ట్–వెస్ట్ సీడ్ ఎండీ దిలీప్ రాజన్ వెల్లడించారు. కాగా, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కోవిడ్–19 ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో లేదని.. ఇందుకు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా స్పందించడమే కారణమని సీడ్స్మెన్ అసోసియేషన్ తెలిపింది. పరిశోధనకు రూ.2 వేల కోట్లు.. దేశవ్యాప్తంగా విత్తన పరిశ్రమ ఏటా 5–10 శాతం వృద్ధితో రూ.30,000 కోట్లకు చేరుకుంది. ఇందులో కూరగాయల విత్తనాల విలువ రూ.3,000 కోట్ల మేర ఉంది. మొత్తం ఎగుమతులు రూ.2,000 కోట్ల మేర జరుగుతున్నాయి. 2,000 కంపెనీలు పరిశ్రమలో నిమగ్నమయ్యాయి. ఇందులో 500 దాకా కంపెనీలు జాతీయ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పరిశోధన, అభివృద్ధి విభాగంలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జీనోమ్ ఎడిటింగ్ సాంకేతిక విధానంపై ఫోకస్ చేయనున్నందున వచ్చే రెండేళ్లలో రూ.2,000 కోట్ల పెట్టుబడులు పరిశోధన, అభివృద్ధి విభాగంలో రానున్నాయి. 16 లక్షల మంది రైతులతో కంపెనీలు చేతులు కలిపాయి. శాస్త్రవేత్తలు, తయారీ, మార్కెటింగ్ సిబ్బంది ఒక లక్ష వరకు ఉంటారు. -
భగ్గుమన్న దేశ రాజధాని.. ఉద్రిక్తం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన వ్యవసాయం బిల్లులకు వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. పంజాబ్, హర్యానాతో పాటు రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్లోనూ రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ నిరసనల సెగ దేశ రాజధాని ఢిల్లీని తాకింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని పెద్ద ఎత్తున రైతులు ఇండియా గేట్ వద్దకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా వ్యవసాయ బిల్లును నిరశిస్తూ ట్రాక్టర్ను దగ్ధం చేశారు. ప్రధాని మోదీ దిష్టి బొమ్మను సైతం కాలబెట్టారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. (రైతన్న యుద్ధభేరి.. ఏమైనా జరగొచ్చు) పంజాబ్ ముద్దబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు భగత్సింగ్ జయంతి నాడు రైతులు రోడ్డుపై పడాల్సిన పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరమన్నారు. పంజాబ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వరంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకున్నా ఇండియా గేట్ ముందు కూర్చుని ధర్నా నిర్వహించారు. మరోవైపు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్లో రైతుల ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. అమృత్సర్– ఢిల్లీ మార్గంలో రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. (ఎన్డీయేకు గుడ్బై చెప్పిన మిత్రపక్షం) ఓ వైపు దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నా.. రైతుల ఆందోళనలకు కారణమైన వ్యవసాయ బిల్లులు చట్టరూపం దాల్చాయి. అవి.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు–2020, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల బిల్లు–2020, నిత్యావసరాల(సవరణ) బిల్లు–2020.లకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మూడు బిల్లులను ఆమోదించారు. మరోవైపు రైతుల ఉద్యమానికి మద్దతు తెలపాని కాంగ్రెస్ పార్టీ దేశంలోని ప్రధాన పార్టీలను కోరింది. వ్యవసాయ రంగం, రైతుల పాలిట కేన్సర్లా మారిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాలనీ, ఈ విషయంలో ఎన్డీఏను వీడి బయటకు రావాలని జేడీయూ, ఎల్జేపీ, జేజేపీ పార్టీలను కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు ఆదివారం లేఖ రాసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ రాష్ట్రంలో వివిధ రైతు సంఘాలు, వివిధ సంఘాలు సోమవారం కర్ణాటక బంద్కు పిలుపునిచ్చాయి. -
అంతుపట్టని రహస్యం: కేసీఆర్ వ్యూహమేంటి?
సాక్షి, హైదరాబాద్ : ఎన్నో విమర్శలు, వివాదాల నడుమ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణ బిల్లులకు ఆమోదం లభించింది. స్పష్టమైన మెజార్టీ ఉన్నందున లోక్సభలో సునాయాసంగా నెగ్గిన బిల్లులు, రాజ్యసభలో మాత్రం పెను దుమారాన్నే సృష్టించాయి. బీజేపీ చిరకాల మిత్రపక్షం శిరోమణీ అకాలీదళ్ వైదొలగడంతో రాజుకున్న రగడ.. రాజ్యసభలో బిల్లు ప్రతులను చింపివేసే వరకు వెళ్లింది. విపక్షాల నిరసనలు, ఆందోళనల నడమనే పెద్దల సభలోనూ బిల్లులు ఆమోదం పొందాయని డిప్యూటీ చైర్మన్ ప్రకటించడంతో అధికార పక్షం హర్షం వ్యక్తం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ఆమోదించుకున్న వివాదాస్పద బిల్లులపై వివాదం ఇప్పడే ముగిసిపోలేదని దీనిపై పెద్ద ఎత్తున పోరును ముందుకు తీసుకుపోతామని కాంగ్రెస్ నేతృత్వంలోనే విపక్ష పార్టీలు ప్రకటించాయి. బిల్లు ఆమోదం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన ఘటనలు ఉత్తర భారతదేశంతో పాటు దక్షినాదినా కనిపించాయి. అయితే ఈ బిల్లుకు టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు వేయడం చర్చించాల్సిన అంశం. (సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే) జాతీయ స్థాయిలో ఉద్యమం.. అయితే గత ఐదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్కు అనుకూలంగా మెలిగిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఓటువేయడం కొత్త చర్చకు దారితీస్తోంది. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బిల్లులు రైతులను కార్పొరేట్ వర్గాలు దోచుకునే విధంగా ఉన్నాయని, అది తేనెపూసిన కత్తి మాదిరిగా ఉందని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. గతంలో బీజేపీ ప్రభుత్వం ఏ బిల్లు పెట్టిన మద్దతు తెలిపిన టీఆర్ఎస్ తాజాగా తిరుగుబాటు చేయడం వెనుక రాజకీయ పరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ సైతం సాగుతోంది. వ్యవసాయ బిల్లులతో పాటు కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ బిల్లును కూడా కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రల హక్కులను కాలరాసే విధంగా ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీనిపై జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రుల అందరితో (బీజేపీయేతర) చర్చించాల్సిన అవసరం ఉందని ఇదివరకే స్పష్టం చేశారు. అంతేకాకుండా విద్యుత్ బిల్లులపై కేంద్రం వెనక్కి తగ్గకపోతే పెను ఉద్యమానికి సైతం తెరలేపుతామని హెచ్చరించారు. ఈ రెండు పరిణాలమాలతో పాటు బీజేపీ సర్కార్పై కేసీఆర్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు జాతీయ రాజకీయాలపై టీఆర్ఎస్ వ్యూహమేంటదానిపై సర్వత్రా చర్చసాగుతోంది. (కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి) కేసీఆర్ రచించిన వ్యూహం.. రానున్న రెండు నెలల్లో తెలంగాణలో పలు ఎన్నికలు జరుగనున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ఈసీ రంగం సిద్ధం చేసింది. దానితో పాటు నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఓ మండలి స్థానానికి పోలింగ్ జరుగనుంది. ఈ స్థానానికి సీఎం కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలో ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా ఉన్న బీజేపీ నుంచి అసలైన పోటీ వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల అభిప్రాయం. దీనిలో భాగంగానే బీజేపీ వ్యతిరేకంగా నడుచుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీనే ఎదురైయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇస్తే రైతు వ్యతిరేక సందేశం వెళ్లే అవకాశం ఉందని కేసీఆర్ ఊహించినట్లు తెలిసింది. మరోవైపు కీలకమైన ఎన్నికల ముందు బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు టీఆర్ఎస్ రచించిన వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పార్లమెంట్ బిల్లు ఆమోదం తరువాత రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రకటనలు చూస్తే ఇది నిజమనే భావన కలుగక మానదు. (ఉత్కంఠగా పోరులో విజయం ఎవరిదో..!) హరీష్, తలసాని ఆగ్రహం.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం, విద్యుత్ రంగంపై తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికే ప్రమాదకరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు దేశమంతా దుబ్బాక వైపు చూస్తున్నది. ఢిల్లీ దిమ్మతిరిగేలా తెలంగాణ ప్రజల మనోగతాన్ని దుబ్బాక ఓటర్లు దేశానికి తెలియజేయాలి’అని మంత్రి హరీశ్రావు అన్నారు. రైతాంగానికి అన్యాయం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ ఇతర పార్టీలతో కలిసి పోరాడుతుందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు, అలాగే విద్యుత్ సంస్కరణలతో రైతులకు నష్టం జరుగుతుందని, ఈ మేరకు పార్లమెంటులో పోరాడాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారని వివరించారు. దేశ సంస్కృతిని కార్పొరేట్కు అమ్మేశారు! దేశ వ్యవసాయ సంస్కృతిని కార్పొరేట్కు అమ్మేశారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు నిప్పులు చెరిగారు. ఆదివారం రాజ్యసభలో వ్యవసాయ బిల్లులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘మీరు వ్యవసాయ దేశాన్ని కార్పొరేట్ దేశంగా మార్చారు. మీరు తెచ్చింది కేవలం చారిత్రక బిల్లు కాదు.. విప్లవాత్మక బిల్లు..’అంటూ ఎద్దేవా చేశారు. రైతులు కార్పొరేట్ల వద్దకు వెళ్లి ధరను నిర్ధారించేంత సమఉజ్జీలు కాదని, ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నామన్నారు. బంగారు బాతు లాంటి వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం చంపాలనుకుంటోందని మండిపడ్డారు. కరోనా వల్ల దేశ జీడీపీ 23 శాతం మేర క్షీణించినప్పటికీ వ్యవసాయ రంగ వాటా మాత్రం తగ్గలేదని వివరించారు. రాజ్యాంగానికి, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈ బిల్లుల రూపకల్పన జరిగిందన్నారు. ఇది రాష్ట్రాల హక్కులు కాలరాయడమేనని మండిపడ్డారు. రాజ్యాంగంపై నేరుగా జరిగిన దాడిగా అభివర్ణించారు. వ్యవసాయం, సంబంధిత అంశా లు ఎప్పుడూ రాష్ట్ర పరిధిలోనే ఉండాలని సూచించారు. దీనిపై రాష్ట్రాలతో సంప్రదించకపోవడాన్ని తప్పుపట్టారు. రాజకీయ పార్టీల, ప్రజాభిప్రాయం సేకరించలేదన్నారు. రైతులను ఈ బిల్లులు భూమి లేని వ్యవసాయ కూలీలుగా మార్చుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రైతులకు తీరని నష్టం జరుగుతుందని, అందువల్ల ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు కేశవరావు స్పష్టం చేశారు. డిప్యూటీ చైర్మన్కు ఆ అధికారం ఉండదు సభ అనంతరం విజయ్చౌక్ వద్ద ఎంపీలు నామా నాగేశ్వరరావు, సురేశ్రెడ్డి, బడుగు లింగయ్య, సంతోష్, పి.రాములు, రంజిత్రెడ్డి, దయాకర్, బీబీ పాటిల్తో కలసి కేకే విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను ఆమోదింపచేసేందుకు సభానియమాలను డిప్యూటీ చైర్మన్ తుంగలో తొక్కారని ఆరోపించారు. అందుకే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ 12 పార్టీలకు చెందిన 25 మంది ఎంపీల సంతకాలతో కూడిన నోటీసును రాజ్యసభ ఇన్చార్జి అధికారికి ఇచ్చినట్లు చెప్పారు. తీర్మానం పరిష్కారమయ్యేవరకు డిప్యూటీ చైర్మన్కు సభా కార్యకలాపాలు నిర్వహించే అధికారం ఉండదని కేశవరావు తెలిపారు. ‘వ్యవసాయంపై ప్రభుత్వం తెచ్చిన మూడు ఆర్డినెన్సులలో రెండింటిని రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు. వాటిపై చర్చ సజావుగానే జరిగినా ఓటింగ్కు వచ్చేసరికి డిప్యూటీ చైర్మన్ పక్షపాతపూరితంగా వ్యవహరించారు. బిల్లులు తిరస్కరించాలని రెండు చట్టబద్ధ తీర్మానాలు ప్రతిపాదించినా పట్టించుకోలేదు. సవరణలు సూచించినా ఖాతరు చేయలేదు. ఎవరి మాటా వినిపించుకోకుండా బిల్లులు ఆమోదం పొందాయని ప్రకటించారు. నా అరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా రాజ్యాంగాన్ని వెన్నుపోటు పొడవడం, నియమాలను చెత్తకుండీలో పడేయడం ఎప్పుడూ చూడలేదు’అని కేశవరావు అన్నారు. మరో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రైతులు రోడ్లెక్కారు. కోట్ల మంది దేశప్రజలకు అన్నం పెట్టేౖ రెతులను మనం రక్షించుకోవాలి. లోక్సభలో సంఖ్యాబలంతో బిల్లులు ఆమోదించారు. రాజ్యసభలో ఓటింగ్ పెడితే ఓడిపోతామనే భయంతో మూజువాణి ఓటుతో ఆమోదింపచేసుకొని ప్రజాçస్వామ్యం గొంతునొక్కారు. బిల్లులు నిజంగా అంత బాగుంటే అందరినీ సమన్వయపరచడానికి ఎందుకు ప్రయత్నించలేదు? ఎవరితోనూ చర్చలు, సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా ఎందుకు ఆమోదింపచేసుకున్నారు? ఇది నిజంగా రైతుల పాలిట బ్లాక్ డే’అని అన్నారు. -
రసవత్తరంగా రాజ్యసభ.. గట్టెక్కేదెలా!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రేపు (ఆదివారం) రాజ్యసభ ముందుకు రానున్నాయి. వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ఉద్దేశించిన ఆ మూడు బిల్లులు ఎలాంటి అవాంతరాలు లేకుండా లోక్సభలో ఆమోదం పొందగా మూడు బిల్లులపై ఆదివారం రాజ్యసభలో ఓటింగ్ ప్రక్రియ జరుగనుంది. అయితే రాజ్యసభలో బిల్లు గట్టెక్కడం అధికార పార్టీకి అంత సులవైన అంశంలా లేదు. గత మిత్రపక్షం శివసేనాతో పాటు.. తాజాగా శిరోమణీ అకాలీదళ్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయనుంది. ఈ నేపథ్యంలో కీలకమైన బిల్లును రాజ్యసభలో గట్టేక్కిచ్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. (అన్నదాతల ఆందోళన) మొత్తం 245 సభ్యుల గల పెద్దల సభలో ప్రస్తుతం బీజేపీకి సొంతంగా 86 సభ్యుల మద్దతు ఉంది. విపక్ష కాంగ్రెస్కు 40 మంది సభ్యులు ఉండగా.. మిగతా స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అయితే మిత్రపక్షాలతో కలుపుకుని తమకు 130 మంది సభ్యులు మద్దతు లభిస్తుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అకలీదళ్ (3) వ్యతిరేకంగా ఓటు వేసినా.. మిగతా పార్టీల మద్దతును కూడగట్టుకుంటామని లెక్కలు చెబుతోంది. బీజేపీ భావిస్తున్నట్లు జేడీయూతో పాటు అన్నాడీఎంకే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోనే బీజూ జనతాదళ్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీతో పాటు టీఆర్ఎస్ పార్టీ ఓటింగ్పై స్పష్టత లేదు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా టీఆర్ఎస్ బిల్లులకు అనుకూలంగా ఓటు వేసినా.. ఆప్, బీఎస్పీ, ఎస్పీ వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయా పార్టీల మద్దతుపై బిల్లు భవితవ్యం ఆధారపడి ఉంది. (భార్య రాజీనామా వెనుక భర్త వ్యూహం..!) మరోవైపు బిల్లుకు వ్యతిరేకంగా పోరాడేందుకు విపక్ష కాంగ్రెస్ పార్టీల మద్దతును కూడగడుతోంది. రాజ్యసభలో బిల్లులను అడ్డుకుంటామని ఇప్పటికే ప్రకటించిన రాహుల్ గాంధీ.. రైతులను పాండవులతో, ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని కౌరవులతో పోలుస్తూ.. ఈ ధర్మ యుద్ధంలో ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని ఇతర రాజకీయ పార్టీలను కోరారు. ఇక బిల్లులపై దేశ వ్యాప్తంగా నిరసన స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆదివారం నాటి రాజ్యసభ సమావేశాలు రసవత్తరంగా జరుగనున్నాయి. (బీజేపీ షాక్: రాజీనామా బాటలో డిప్యూటీ సీఎం!) -
బీజేపీ షాక్: రాజీనామా బాటలో డిప్యూటీ సీఎం!
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో పాటు ఆ పార్టీ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే అకాలీదళ్ దారిలోనే మరికొన్ని ఉత్తరాది పార్టీలు నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) ఎన్డీయే నుంచి వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేజేపీ చీఫ్ దుశ్యంత్ సింగ్ చౌతాలా ప్రస్తుతం హర్యానా డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, తాము ఇక ప్రభుత్వంలో కొనసాగలేమంటూ అకాలీదళ్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. చౌతాలా మీదకూడా ఒత్తిడి పెరుగుతోంది. (కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ రాజీనామా) కేంద్ర ప్రతిపాదిత బిల్లుపై జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీలోని కొంతమంది సీనియర్లు సైతం అధిష్టానం వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ సీరియర్లు, ఎమ్మెల్యేలతో చౌతౌలా సమావేశం కానున్నారు. ఇక బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జేజేపీ నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాల కోరారు. రైతుల పక్షపాతిగా చరిత్ర కలిగిన చౌతౌలా కుటుంబం క్లిష్ల సమయంలో రైతాంగానికి అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం నుంచి వైదొలగాలని సూచించారు. మాజీ ఉప ప్రధాని, దేవీలాల్కు రైతు బాంధవుడిగా మంచి గుర్తింపు ఉందని, దుశ్యంత్ ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని ట్విటర్ ద్వారా అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎస్ఏడీ, విపక్ష సభ్యుల నిరసనల మధ్య వివాదాస్పద ‘ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్)’ బిల్లును, ‘ద ఫార్మర్స్(ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్’ బిల్లును గురువారం మూజువాణి ఓటుతో లోక్సభ ఆమోదించింది. (బీజేపీకి ఊహించని షాకిచ్చిన మిత్రపక్షం) ఇదిలావుండగా.. 90 స్థానాలు ఉన్న హరియాణాలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిశ్రమ ఫలితాలను సాధించిన సంగతి తెలిసిందే. ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ 40 స్థానాలు సాధించి.. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఫిగర్ (46)ను సొంతంగా అందుకోలేకపోయింది. దీంతో పది స్థానాలు సాధించిన దుష్యంత్ చౌతాలా కింగ్మేకర్గా అవతరించారు. ఈ నేపథ్యంలో జేజేపీ మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో జేజేపీ ప్రభుత్వం నుంచి వైదొలిగితే ఖట్టర్ ప్రభుత్వం కుప్పకూలే అవకాశం ఉంది. -
ఎకానమీకి వ్యవసాయం ఆశాకిరణం
ముంబై: దేశవ్యాప్తంగా బలంగా విస్తరించిన రుతుపవనాలు, మంచి వర్షపాతంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో పంటల ఉత్పత్తి భారీగా పెరగనుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది ఖరీఫ్ దిగుబడి 5–6 శాతం ఎక్కువగా ఉంటుందని, సాగు విస్తీర్ణం కూడా పెరగడంతో, ఉత్పాదకత జోరుగా ఉంటుందని అంచనా వేసింది. వ్యవసాయం బలంగా ఉండడం అన్నది కరోనాతో బలహీనపడిన ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చే అంశమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్ట్ 21 నాటికి దీర్ఘకాల సగటు కంటే 7 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్టు.. దీని ఫలితంగా చాలా రాష్ట్రాల్లో పంటల విత్తుకు దోహపడినట్టు క్రిసిల్ నివేదిక తెలియజేసింది. ఖరీఫ్ సీజన్ 2020లో 109 మిలియన్ హెక్టార్లలో 2–3 శాతం అధికంగా విత్తు వేయడం ఉంటుందని పేర్కొంది. వరి సాగు పెరగనుందని, మంచి వర్షాలకు తోడు, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో కార్మికులు పట్టణాల నుంచి పల్లెలకు తిరిగి వలసపోవడం దోహదపడే అంశాలుగా తెలిపింది. లాభదాయకత కూడా ఎక్కువే.. కరోనా కారణంగా సరఫరా పరంగా ఏర్పడిన అవాంతరాలతో రైతులు అధికంగా పాడైపోయే గుణమున్న టమాటా వంటి వాటికి బదులు తక్కువ పాడైపోయే స్వభావం కలిగిన వంకాయ, బెండకాయ వంటి పంటలకు మళ్లినట్టు క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హేతల్ గాంధీ తెలిపారు. ఖరీఫ్ సీజన్ సాగు భారీగా పెరగడం వల్ల పలు నిత్యావసర వస్తువల ధరలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ఖరీఫ్ సీజన్ లో సాగు లాభదాయకత మొత్తం మీద 3–5% అధికం కానుందని క్రిసిల్ నివేదిక పేర్కొంది. సాగు విస్తీర్ణంపెరగడం, అధిక ఉత్పాదకత, కనీస మద్దతు ధరలకు ప్రభుత్వ కొనుగోళ్లు మద్దతునిస్తాయని వివరించింది. యాపిల్ సాగులో లాభదాయకత మెరుగుపడుతుందని, పత్తి, మొక్కజొన్న ధరలపై ఒత్తిళ్లు కొనసాగుతాయని పేర్కొంది. ఏపీ తదితర రాష్ట్రాల్లో జోరుగా వరిసాగు కార్మికులు వలసపోవడం వల్ల పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువ మంది రైతులే నేరుగా విత్తనాలను వేయనున్నారు. ఇది తక్కువ ఉత్పాదకతకు దారితీయనుంది. కానీ, అదే సమయంలో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో కార్మికులు వెనక్కి వెళ్లిపోవడం వల్ల విత్తడంలో వృద్ధి కనిపించనుంది. దీంతో మొత్తం మీద గతేడాది కంటే ఖరీఫ్ సీజన్ 2020లో వరి ఉత్పాదకత పెరగనుంది. ఉత్తర భారత రైతులకు ఖరీఫ్ సీజన్ 2020 ఎంతో లాభాన్ని మిగల్చనుంది. పంటల సాగు మిశ్రమంగా ఉండడానికి తోడు ప్రభుత్వ కొనుగోళ్లు అధికంగా ఉండడం వల్లే ఇది సాధ్యం కానుంది. – హేతల్ గాంధీ, క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ -
ఒకే దేశం.. ఒకే మార్కెట్
న్యూఢిల్లీ: రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను అధీకృత వ్యవసాయ మార్కెట్లలోనే కాకుండా.. దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలు కల్పించే ‘ద ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్డినెన్స్, 2020’కి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘ఒకే దేశం.. ఒకే వ్యవసాయ మార్కెట్(వన్ నేషన్..వన్ అగ్రి మార్కెట్)’ దిశగా వేసిన ముందడుగుగా ఈ నిర్ణయాన్ని పేర్కొంది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. మార్కెట్లకు వెలుపల తమ దిగుబడులను అమ్మితే రైతులపై రాష్ట్రాలు ఎలాంటి పన్ను విధించవద్దు. రైతులు తాము కోరుకున్న ధరకే తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఈ విషయంలో తలెత్తిన వివాదాలను సబ్ డివిజన్ మేజిస్ట్రేట్, కలెక్టర్ నెల రోజుల్లోగా పరిష్కరించాలి. ఈ వివాదాలు సివిల్ కోర్టుల పరిధిలోకి రావు. ప్రస్తుతం రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ(అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ– ఏపీఎంసీ)ల్లోనే తమ ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఈ మార్కెట్లకు వెలుపల అమ్మాలనుకుంటే వారిపై పలు ఆంక్షలు ఉంటాయి. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడిస్తూ.. ఏపీఎంసీలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రాల ఏపీఎంసీ చట్టాలు కూడా కొనసాగుతాయన్నారు. మండీలకు వెలుపల కూడా రైతులు తమ ఉత్పత్తులను అమ్మే అవకాశం కల్పించి, వారికి అదనపు ఆదాయం అందించాలన్నదే ఈ ఆర్డినెన్స్ ఉద్దేశమన్నారు. ‘ఈ ఆర్డినెన్స్ ద్వారా రైతులు నేరుగా తమ ఇళ్ల నుంచే ఆహార సంస్థలకు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, రైతు సహకార సంస్థలకు తాము కోరుకున్న ధరకు తమ పంటలను అమ్మవచ్చు’ అని వివరించారు. దీనిపై ఎలాంటి నియంత్రణలు ఉండబోవన్నారు. ‘ఈ – ట్రేడింగ్’కు కూడా అవకాశం ఉందన్నారు. వీటిపై నియంత్రణ ఉండదు 65 ఏళ్ల నాటి నిత్యావసర వస్తువుల(ఎసెన్షియల్ కమాడిటీస్– ఈసీ) చట్టాన్ని సవరించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ చట్ట నియంత్రణ పరిధిలో నుంచి నిత్యావసరాలైన పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు, వంట నూనెలు, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలను తప్పించేందుకు ఆ సవరణను ప్రతిపాదించారు. ప్రతిపాదిత చట్ట సవరణ ప్రకారం.. యుద్ధం, జాతీయ విపత్తు, కరువు, ధరల్లో అనూహ్య పెరుగుదల వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆయా ఆహార పదార్థాలు ఈసీ చట్ట నియంత్రణలో ఉంటాయి. మిగతా సమయాల్లో వాటి ఉత్పత్తి, నిల్వ, సరఫరాలపై ఎలాంటి నియంత్రణ ఉండదు. అలాగే, ప్రాసెసింగ్ చేసేవారు, సరఫరా వ్యవస్థలో ఉన్నవారిపై ఆయా ఆహార ఉత్పత్తులకు సంబంధించి ఎలాంటి నిల్వ పరిమితి ఉండదు. రైతుల ఆదాయ పెంపు నిర్ణయాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆహార ఉత్పత్తులను దిగుబడి చేసుకునే, నిలువ చేసుకునే, పంపిణీ చేసుకునే హక్కు లభించడంతో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రైవేట్ సంస్థలకు ఆసక్తి పెరిగే అవకాశముందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా వస్తాయని పేర్కొంది. కోల్కతా పోర్ట్ ఇక శ్యామ ప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయం కోల్కతా నౌకాశ్రయం పేరును శ్యామ ప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయంగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సంవత్సరం జనవరిలో కోల్కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. కోల్కతా నౌకాశ్రయానికి జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామ ప్రసాద్ ముఖర్జీ పేరు పెడ్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఫిబ్రవరి 25న భేటీ అయి పేరు మార్పును ప్రతిపాదిస్తూ ఒక తీర్మనాన్ని ఆమోదించారు. కోల్కతా పోర్ట్ భారత్లోని ఏకైక నదీముఖ నౌకాశ్రయం. 1870 నుంచి కోల్కతా పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోంది. రైతులకు మేలు: మోదీ వ్యవసాయ సంస్కరణలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు గ్రామీణ భారతం, ముఖ్యంగా రైతులపై గణనీయ సానుకూల ప్రభావం చూపుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై ఆంక్షలను తొలగించాలని రైతులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారని, ఆ డిమాండ్ను తాము నెరవేర్చామని తెలిపారు. -
ఊరూరా విత్తనాల ఏటీఎంలు!
ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యల వల్ల వ్యవసాయ రంగ ముఖ చిత్రం మారుతోంది. 10,641 గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో అత్యాధునిక డిజిటల్ కియోస్క్లు ఏర్పాటు చేస్తుండటం విశేషం. ఈ నెల 30న ప్రారంభం కానున్న ‘కియోస్క్’ల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్.. మార్కెటింగ్ సేవలు రైతులకు అందుతాయి. ‘ఏటీఎం’ల వంటి ఈ కియోస్క్ల ద్వారా ఉత్పాదకాలను రైతులకు అందిస్తున్నారు. ఇది దేశ చరిత్రలోనే తొట్ట తొలి ప్రయోగం. 2020 మే 30.. రెండు ప్రత్యేకతలు.. ఒకటి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఏడాది. రెండోది.. వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకేలు) ఆయనే స్వయంగా ప్రారంభిస్తున్న రోజు. దేశ చరిత్రలోనే ఇటువంటి ప్రయోగం తొలిసారి. వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సమస్త వస్తువులు, సేవలు రైతు ఇంటి ముంగిటే దొరికేలా చేయడం ఈ కేంద్రాల విశిష్టత. పంట ఉత్పాదకత పెంపు మొదలు.. సాగు ఖర్చు తగ్గించడంలో కీలకమైన వ్యవసాయ పరికరాలు, సరైన సలహాలు, మేలైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్.. ఇలా ఒకటేమిటి.. చివరకు మార్కెటింగ్కు కూడా ఈ కేంద్రాలే మూల స్థానాలు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవసాయ సమగ్ర కేంద్రాలు. రైతు భరోసా కేంద్రాలు ‘హబ్ (గోదాము) అండ్ స్పోక్స్(రైతు భరోసా కేంద్రాలు)’ నమూనాలో నడుస్తాయి. ప్రతి జిల్లాలో 5 హబ్లు, ప్రతి గ్రామ సచివాలయంలో ఒక స్పోక్ (ఆర్బీకే) ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతి కేంద్రంలో అత్యాధునిక డిజిటల్ టచ్ స్క్రీన్ ‘కియోస్క్’లు ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. రైతులకు తమ గ్రామంలోనే విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు సమస్త సేవలు సులభంగా అందించే ‘ఏటీఎం’ల వంటివే ఈ ‘కియోస్క్’లు! కియోస్క్లు ఎలా పని చేస్తాయంటే.. ఈ డిజిటల్ కియోస్క్ ఓ అత్యాధునిక ఏటీఎం లాంటిది. టచ్ స్క్రీన్, ఫ్రంట్ కెమేరా, ఆధార్తో అనుసంధానమైన ఫింగర్ ప్రింట్ స్కానర్, మైక్రోఫోన్, స్పీకర్లు ఉంటాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని– ధర్మల్ ప్రింటర్, ఆక్సిలరీ ఆడియో ఇన్పుట్, యూఎస్బీ చార్జింగ్ స్లాట్, ఏ–4 కలర్ ప్రింటర్, ఈ పాస్ మిషన్, ఆర్ఎఫ్ఐడీ కార్డ్ రీడర్ నూ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకు ఐదు చొప్పున 65 ఆగ్రోస్ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఒక్కో హబ్కు– దాని పరిథిలోని గ్రామాల రైతుల వివరాలను అనుసంధానం చేశారు. కియోస్క్ను పరిశీలిస్తున్న ఏపీ వ్యవసాయ కమిషనర్ అరుణ్కుమార్ టచ్ స్క్రీన్.. రైతు భరోసా కేంద్రంలోని డిజిటల్ కియోస్క్ ఎదుట రైతు నిలబడి స్క్రీన్ను వేలితో తాకి, ఫోన్ నంబరును ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. వివిధ కంపెనీలకు సంబంధించిన రకరకాల పంటల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా వంటి వాటి బొమ్మలు, వాటి ధరవరలు కియోస్క్ స్క్రీన్పై ప్రత్యక్షమవుతాయి. రైతు తాను కొనుగోలు చేయాలనుకుంటున్న వాటిని ఎంపిక చేసుకొని, ఎంత పరిమాణంలో కావాలో, ఎంత ధర అవుతున్నదో ఒకటికి రెండు సార్లు సరి చూసుకోవాలి. అంతా ఓకే అనుకున్నాక క్లిక్ చేస్తే ఆర్డరు తయారవుతుంది. సమీపంలోని ఆగ్రోస్ కేంద్రానికి అంటే ‘హబ్’(గోదాము)కు తక్షణమే ఆ రైతు కొనుగోలు చేయదలచిన సరుకుల ఆర్డర్ వెళుతుంది. కియోస్క్ నుంచి ఆర్డరు వెళ్లిన తర్వాత ఆయా ఉత్పత్తులు గరిష్టంగా 48 నుంచి 72 గంటల్లోగా రైతులకు అందుతాయి. విత్తనాలను ఏపీ సీడ్స్ సంస్థ, మిగతా వాటిని ఆగ్రోస్ సెంటర్లు సరఫరా చేస్తాయి. ఏమిటీ ‘హబ్, స్పోక్ మోడల్’? ఆర్బీకేలోని అగ్రీ ఇన్పుట్ షాపు ఈ మోడల్లో పని చేస్తుంది. నిల్వ, ఇన్వెంటరీ, అమ్మకం, రాబడుల నిర్వహణ, సరకు రవాణా తదితరాలకు హాబ్లు గిడ్డంగులుగా ఉంటాయి. వర్చువల్ రిటైల్ స్టోర్లుగా స్పోక్స్ పని చేస్తాయి. రైతులు తమ ఆర్డర్లను ఇచ్చేందుకు ప్రతి ఆర్బీకేలో డిజిటల్ విధానంలో ఏర్పాటు చేసే కియోస్కే ఈ స్పోక్. ఈ కియోస్క్ మెషిన్ ఏటీఎం మాదిరిగా ఉంటుంది. దీని నుంచి రైతులు తమ వ్యవసాయానికి కావాల్సిన ఉత్పాదకాల(ఇన్పుట్స్)ను ఆర్డరు చేస్తే.. 48 నుంచి 72 గంటల (2–3 రోజుల)లోగా బట్వాడా చేస్తారు. కియోస్క్ ద్వారా విత్తనాలు తదితరాలను ఎంపిక చేసుకోవడం, ఆర్డర్ చేయడం వంటి విషయాలలో రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే, వీరికి తోడ్పడటానికి ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో ఉంటారు. గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశు సంవర్థక, మత్స్య శాఖల సహాయకులు రైతులకు సహాయపడతారు. కియోస్క్ల ద్వారా సులువుగా సమస్త సమాచారం... ► మారుమూల గ్రామాల్లో కూడా డిజిటల్ కియోస్క్లు ఏర్పాటవుతున్నందున అక్కడి రైతులకు ఉత్పాదకాలతోపాటు సమగ్ర వ్యవసాయ సమాచారాన్ని సులువుగా అందించవచ్చు. ► వ్యవసాయ, అనుబంధ రంగాలకు అవసరమైన ఉత్పాదకాలను గ్రామ స్థాయిలోనే రైతులకు అందించవచ్చు. ► ఏయే వ్యవసాయోత్పత్తులకు మార్కెట్లో మున్ముందు మంచి ధర వచ్చే అవకాశం ఉంది (మార్కెట్ ఇంటెలిజెన్స్)?, ప్రస్తుతం వివిధ మార్కెట్లలో ఏయే పంటలకు ఎంతెంత ధర పలుకుతోంది? ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వంటి ముఖ్యమైన తాజా సమాచారాన్ని రైతులకు అందించవచ్చు. ► వాతావరణ సూచనలు, ఆయా ప్రాంతాల్లోని చీడ పీడల సమాచారాన్నీ అందించవచ్చు. ► భూ రికార్డులను అందుబాటులోకి తేవచ్చు. ► వివిధ పంటల సాగు సాంకేతిక మెళకువలను తెలియజెప్పే వీడియోలను ఈ కియోస్క్ల ద్వారా రైతులకు చూపవచ్చు. రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటైన కియోస్క్ – ఆకుల అమరయ్య, సాక్షి -
వ్యవసాయంపై మళ్లీ శీతకన్ను
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనానికి అంతర్జాతీయ కారణాలకంటే వినియోగ డిమాండ్ పడిపోవడం, పెట్టుబడులు తగ్గిపోవడమే ప్రధాన కారణమని ఆర్థికరంగ నిపుణులు చాలావరకు ఏకాభిప్రాయానికి వస్తున్నారు. పైగా దేశ స్థూల దేశీయోత్పత్తి 5 శాతంకంటే తక్కువకు పతనమైన నేపథ్యంలో గ్రామీణ జనాభాకు మరింత ఎక్కువగా డబ్బును అందించాల్సి ఉంది. వ్యవసాయానికి ఉద్దీపన ప్యాకేజీలు అందించాల్సి ఉంది. కానీ 2020 బడ్జెట్ కూడా వ్యవసాయ రంగ అభివృద్ధి విషయంలో ‘కోల్పోయిన మంచి అవకాశం’ గానే మిగిలిపోయిందనిపిస్తోంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వంటి కీలక రంగాలకు తాజా బడ్జెట్లో కేటాయింపులు పెంచడానికి కేంద్రప్రభుత్వానికి మనసొప్పలేదంటే వ్యవసాయంపై పాలకుల శీతకన్ను ఇంకా కొనసాగుతోందనే చెప్పాల్సి ఉంటుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2020 కేంద్రబడ్జెట్ ముక్కుసూటిగా చెప్పాలంటే ఒక కోల్పోయిన అవకాశంగానే భావించాల్సి ఉంటుంది. గ్రామీణ వ్యయంలో పతనం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పడిపోయి ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనివిధంగా దేశ స్థూల దేశీయోత్పత్తే (జీడీపీ) 5 శాతం కంటే తక్కువగా పతనమైపోయిన సమయంలో గ్రామీణ జనాభా చేతుల్లోకి మరింత ఎక్కువగా డబ్బును అందించాల్సి ఉంది. మన వ్యవసాయంలో ఇప్పటికీ దేశంలోని 70 శాతం గృహాలు పాలు పంచుకుంటున్నందున ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయాలంటే గ్రామీణుల చేతుల్లో మరింత అధికంగా డబ్బు పంపిణీ చేయడం అత్యుత్తమమైన మార్గం. గ్రామీణ వినియోగం ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయిన తరుణంలో పల్లెసీమల్లో ప్రభుత్వ వ్యయాన్ని బాగా పెంచాల్సిన అవసరం ఉంది. అంటే వ్యవసాయానికి ఉద్దీపన ప్యాకేజీలు అందించడం అత్యవసరం. భారతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి అంతర్జాతీయ కారణాల కంటే దేశీయ కారణాలే ప్రధానమన్నది అందరికీ తెలిసిన విషయమే. అవేమిటంటే డిమాండ్ పడిపోవడం, పెట్టుబడులు తగ్గిపోవడం. ఈ దుస్థితినుంచి బయటపడాలంటే వ్యవసాయదారులకు, కూలీలకు ప్రత్యక్ష నగదు మద్దతు రూపంలో మరింత డబ్బు అందేలా చూడటమే మార్గమని చాలామంది ఆర్థికవేత్తలు ఇప్పుడు సూచిస్తున్నారు. జనాభాలోని 60 శాతం మంది అధోజగత్ సహోదరుల చేతుల్లో మొత్తం జాతీయ సంపదలో 4.8 శాతం వాటా మాత్రమే ఉంటున్న స్థితిలో ప్రధానమంత్రి–కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి బడ్జెట్ కేటాయింపులు పెంచడం అనేది ఒక ఆదర్శపూరితమైన పంథా అవుతుంది. పీఎమ్–కిసాన్ పథకానికి కేంద్ర ప్రభుత్వం మరొక రూ.1.50 లక్షల కోట్ల డబ్బును కేటాయించాలని నేను ఇప్పటికే చాలాసార్లు సూచించి ఉన్నాను. అంటే నెలకు దేశంలోని ప్రతి వ్యవసాయ కుటుంబానికి మరొక రూ. 1,500ల డబ్బు ప్రత్యక్ష నగదు మద్దతు రూపంలో అందుతుంది. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రైతులకు అందిస్తున్న వార్షిక మొత్తాన్ని రూ.6,000 నుంచి రూ. 12,000కు రెట్టింపు చేస్తుందని నేను భావించాను. దీనికి అదనంగా జాతీయ పనికి ఆహార పథకం కింద బడ్జెట్ కేటాయింపులను ప్రస్తుతం ఉన్న రూ. 70,000 కోట్లను కనీసం లక్ష కోట్ల రూపాయలకు పెంచినట్లయితే అది ఆర్థిక వ్యవస్థపై గణనీయ ప్రభావం చూపిస్తుంది. పైగా వ్యవసాయ కూలీలు అయిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం కూడా పాలకులు గమనించాల్సి ఉండింది. కానీ ప్రధానమంత్రి కిసాన్ ప«థకాన్ని, జాతీయ పనికి ఆహార పథకాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడంలో ఆర్థిక మంత్రి విఫలమయ్యారు. ఈ రెండు పథకాలకు బడ్జెట్లో ఇతోధికంగా నిధులు కేటాయించి ఉంటే గ్రామీణ వినియోగంలో డిమాండును సృష్టించడం సాధ్యమయ్యేది. ఇది దానికదిగా గ్రామీణ వినియోగాన్ని పెంచి అధిక ఆర్థిక వృద్ధి రేటుకు దోహదపడేది. కానీ దురదృష్టవశాత్తూ వ్యవసాయరంగం, దాని అనుబంధ రంగాలు, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వంటి కీలక రంగాలకు తాజా బడ్జెట్లో గణనీ యంగా కేటాయింపులు పెంచడానికి కేంద్రప్రభుత్వానికి మనసొప్పినట్లు లేదు. ఈసారి వ్యవసాయరంగానికి బడ్జెట్ కేటాయింపులు రూ. 2.83 లక్షల కోట్లు. అయితే గత సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన రూ. 2.68 లక్షల కోట్ల అంచనాతో పోలిస్తే తాజా కేటాయింపుల్లో పెద్దగా పెరుగుదల లేనట్లే. వ్యవసాయ రుణాల కల్పనకు మాత్రం గత సంవత్సరంలో కేటాయించిన రూ.13.5 లక్షల కోట్లతో పోలిస్తే ఈ దఫా కాస్త ఎక్కువగా అంటే రూ. 15 లక్షల కోట్ల మేరకు పెంచడం ముదావహం. అయితే ఈరోజుకీ దేశంలోని చిన్న, సన్నకారు రైతుల్లో దాదాపు 41 శాతంమందికి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులనుంచి వ్యవసాయ రుణాలు అందడం లేదని పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన కీలకమైన విషయం ఏమిటంటే ఇప్పుడు రైతులకు కావలసింది మరింత రుణం కాదు. వారికి అధిక ఆదాయాన్ని కల్పించడమే ప్రస్తుత తక్షణ కర్తవ్యం. నిజం చెప్పాలంటే ఆహార సబ్సిడీకి బడ్జెట్ కేటాయింపులు గత సంవత్సరంలోని రూ.1.84 లక్షల కోట్లతో పోలిస్తే ఈ సంవత్సరం 1.15 లక్షల కోట్ల రూపాయలకు తగ్గించివేయడం దారుణం. ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం ధాన్య సేకరణ కార్యకలాపాలనుంచి మొత్తంగా వైదొలగాలనే ఉద్దేశంతో ఉందా అని పలు సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు వ్యవసాయ గ్రూపులు ఈ అంశంపై తమ ఆందోళనను చాటి చెప్పాయి. దానికి తగినట్లుగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలోనే వ్యవసాయ మార్కెట్లను సరళీకరించడం గురించి మాట్లాడారు. దీంతో దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ఆహార సబ్సిడీలపై ఎన్డీఏ ప్రభుత్వం కోత విధించబోతోందన్న భయాందోళనలు వ్యవసాయదారుల్లో, రైతు సంఘాల్లో పెరిగిపోయాయి. దీనికి తగినట్లుగానే వ్యవసాయ మదుపులు, ధరల కమిషన్ (సీఏసీపీ) బహిరంగ మార్కెట్లో ధాన్య సేకరణ విధానాన్ని నిలిపివేయాలని సిఫార్సు చేసింది. ఇది చాలా ప్రాధాన్యత కలిగిన అంశం. ఇప్పటికే దేశ ధాన్యాగారాలుగా పేరొందిన పంజాబ్, హరియాణా రాష్ట్రాలు ధాన్య సేకరణను గణనీయంగా తగ్గించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. పంజాబ్ ఇప్పటికే ధాన్య సేకరణలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని అనుమతిస్తూ చట్టాలను తదనుగుణంగా సవరించింది కూడా. అలాగే ప్రైవేట్ మండీలను కూడా ప్రారంభించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నడుం కడుతోంది. ఆకాంక్షల భారత్లో భాగంగా దేశీయ వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ వ్యవసాయం వైపుగా మార్చేందుకు రోడ్ మ్యాప్ అందించడం గురించి ఆర్థిక మంత్రి 16 సూత్రాల కార్యాచరణపై మాట్లాడారు. గతంలో ప్రతిపాదించిన త్రీ మోడల్ చట్టాలను అమలుపర్చిన రాష్ట్రాలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. ఈ మూడు మోడల్ చట్టాలకు భూమి కౌలు చట్టం, మార్కెట్ సరళీకరణ, కాంట్రాక్టు వ్యవసాయంతో నేరుగా సంబంధం ఉందని గమనించాలి. వ్యవసాయరంగంలో పోటీ తత్వాన్ని పెంచాల్సిన అవసరముం దని ఆర్థిక మంత్రి చెబుతూ, 2025 నాటికి పాల ప్రాసెసింగ్ను రెట్టింపు చేసే పథకాలను కొన్నింటిని పేర్కొన్నారు. అలాగే 2025 నాటికి దేశీయ మత్స్య ఉత్పత్తిని 2 కోట్ల టన్నులకు పెంచడం, కమోడిటీ ట్రేడింగ్ని ప్రోత్సహించడానికి ఈ–నామ్తో వేర్హౌసింగ్ రిసిప్టులపై ఫైనాన్స్ని ప్రోత్సహించడం గురించి కూడా నిర్మల ప్రతిపాదనలుచేశారు. త్వరగా పాడైపోయే సరకులను రవాణా చేయడానికి కిసాన్ రెయిల్, కిసాన్ ఉడాన్ను ప్రారంభించడం వల్ల వ్యవసాయ వాణిజ్య కంపెనీలకు లబ్ధి చేకూరుతుందని కూడా ఆమె పేర్కొన్నారు. 16 సూత్రాల కార్యాచరణ పథకం గురించి ఆమె చెప్పిన అంశాలు మునుపటి బడ్జెట్లలో కూడా ప్రస్తావించారు, చర్చించారు కానీ ఈ పథకాలకు ప్రత్యేకంగా కేటాయింపులు జరిగినట్లు కనిపించడం లేదు. భవిష్యత్తులో వ్యవసాయరంగం పయనించాల్సిన దిశ కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించడం కచ్చితంగా సరైనదే కానీ ఈ మార్గాన్ని ఎంత సమర్థంగా రూపొందిస్తారు అనేది ముందుగా స్పష్టం కావాలి. ఇప్పటికే మన వ్యవసాయరంగంలో తీసుకొచ్చిన చాలా సంస్కరణలు అమెరికా, యూరోపియన్ యూనియన్ల నుంచి అరువు తెచ్చుకున్నవే. అయితే ఇలా అరువు తెచ్చుకున్న విధానాలు ప్రభావవంతమైనవే అయినట్లయితే అమెరికా, ఈయూలో కూడా వ్యవసాయరంగం ఎందుకు దుస్థితికి గురవుతోందన్నది ఆలోచించాల్సిన విషయం.అమెరికాలో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఆత్మహత్యలు ఆ దేశంలోని పట్టణ కేంద్రాల్లో జరుగుతున్న ఆత్మహత్యల కంటే 45 శాతం అధికంగా నమోదవుతున్నాయి. పైగా, 1960ల నుంచి అమెరికాలో నిజ వ్యవసాయ ఆదాయం పెరుగుదల క్రమంగా పతనమవుతూ వచ్చింది. అందుచేత పాశ్చాత్య నమూనాలను అనుకరించడం కంటే గ్రామీణ సౌభాగ్యాన్ని, సంపదను పెంచిపోషించేలా మన వ్యవసాయరంగాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
భూసార పరికరాలను పరిశీలించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వ్యవసాయ, ఉద్యానశాఖలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి కన్నబాబు, వ్యవసాయశాఖ అధికారులతో సమావేశమైన సీఎం.. పురుగు మందులు, ఎరువుల సరఫరా, దుకాణాల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూసార పరీక్షా పరికరాలను సీఎం జగన్ పరిశీలించారు. ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం, వ్యవసాయం, విత్తనాల పంపిణి, గ్రామాల్లో ఏర్పాటు కానున్న వర్కషాపులు గురించి సీఎం ఆరా తీశారు. -
నవ్వులు నాటిన ‘నైరుతి’!..
సాక్షి, హైదరాబాద్: ‘నైరుతి’వెళ్లిపోయింది.. బుధవారం నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా నిష్క్రమించాయి.. ఇటు ఈశాన్య రుతుపవనాలు మొదలయ్యాయి. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో చివరి రెండు నెలలు నైరుతి రుతుపవనాలతో వర్షాలు కుమ్మేశాయి. ఈ సీజన్లో తెలంగాణలో సాధారణంగా 759.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 805.6 మిల్లీమీటర్లు నమోదైంది. సాధారణం కంటే 6 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. సాధారణానికి అటుఇటుగా వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేయగా, అంతకుమించి వర్షం కురవడం గమనార్హం. 2016 తర్వాత ఈసారి తెలంగాణలో 6 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. 2016లో 19 శాతం అధికంగా వర్షం కురిసింది. అంతకుముందు 2013లో 26 శాతం, 2010లో 32 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. జూన్లో లోటు.. సెప్టెంబర్లో అధికం గత పదేళ్లలో ఈ సీజన్తో కలిపి ఐదు సార్లు అధిక వర్షాలు నమోదు కాగా, మిగిలిన ఐదు సార్లు లోటు వర్షపాతం నమోదైంది. జూన్లో తెలంగాణలో 33 శాతం లోటు వర్షపాతం నమోదైతే, జూలైలో 12 శాతం లోటు రికార్డయింది. ఇక ఆగస్టులో వర్షాలు ఊపందుకున్నాయి. ఆ నెలలో 11% అధిక వర్ష పాతం నమోదు కాగా, సెప్టెంబర్లో రికార్డు స్థాయిలో ఏకంగా 83 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక రాష్ట్రంలో మొత్తం 589 మండలాలుంటే, ఈ సీజన్లో ఇప్పటివరకు 359 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 122 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే కొమురంభీం, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్నగర్, ములుగు, నారాయణపేట జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షం కురిసింది. దేశంలో కూడా రికార్డు దేశవ్యాప్తంగా కూడా ఈ సీజన్లో అధిక వర్షపాతం నమోదైంది. మొత్తంగా 10 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ వందేళ్ల రికార్డు దేశంలో ఒకటి నమోదైంది. సరిగ్గా వందేళ్ల కిత్రం అంటే 1917 సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా 165 శాతం వర్షపాతం నమోదైతే, మళ్లీ ఈ ఏడాది సెప్టెంబర్లో 152 శాతం వర్షపాతం నమోదైంది. వందేళ్ల తర్వాత ఆ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం గమనార్హం. గణనీయంగా ఖరీఫ్ సాగు.. నైరుతి రుతుపవనాలు తెచ్చిన భారీ వర్షాలతో ఈ ఏడాది ఖరీఫ్లో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా నమోదైంది. ఖరీఫ్లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా... ఇప్పటివరకు ఏకంగా 1.10 కోట్ల ఎకరాల్లో (102 శాతం) పంటలు సాగయ్యాయి. అందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 24.11 లక్షల ఎకరాలు కాగా, రికార్డు స్థాయిలో 31.47 లక్షల ఎకరాల్లో (131 శాతం) నాట్లు పడ్డాయి. ఇక పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 43.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు ఏకంగా 46.48 లక్షల ఎకరాల్లో (108 శాతం) సాగైంది. పప్పు ధాన్యాల సాగు సాధారణ విస్తీర్ణం 10.37 లక్షల ఎకరాలు కాగా... 9.42 లక్షల (91 శాతం) ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 128 శాతం, నారాయణపేట జిల్లాలో 122 శాతం పంటల సాగు నమోదైంది. అతి తక్కువగా జనగామ 83 శాతం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో 86 శాతం పంటలు సాగయ్యాయి. ఇక రబీ సాగుకు కూడా ఈ వర్షాలు దోహదం చేశాయి. జలాశయాలు, చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లడంతో రబీలో అంచనాలకు మించి పంటల సాగు నమోదవుతుందని వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రవేశం.. ఈశాన్య రుతుపవనాలు బుధవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. తమిళనాడు దాన్ని ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తమిళనాడు తీరానికి దగ్గరలో ఉన్న నైరుతి బంగాళాఖాతం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో గురువారం అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. ఇక గత 24 గంటల్లో మహబూబాబాద్లో 5 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో గత పదేళ్లలో నమోదైన వర్షపాతం –––––––––––––––––––––––––––––––––––––––––––––– ఏడాది సాధారణంతో పోలిస్తే నమోదైన వర్షపాతం (శాతంలో) –––––––––––––––––––––––––––––––––––––––––––––– 2009 –35 2010 32 2011 –13 2012 4 2013 26 2014 –34 2015 –21 2016 19 2017 –13 2018 –2 2019 6 -
పంట పండింది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో విస్తారంగా కురిసిన వర్షాలు, నిండిన చెరువులు, ప్రాజెక్టుల నుంచి నీటి విడు దల నేపథ్యంలో మార్కెట్లలోకి ధాన్యం పోటెత్తనుంది. ప్రస్తుత సీజన్లో ఏకంగా 26.70 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయడంతో అందుకు తగ్గట్లే ఈ ఏడాది ధాన్యం మార్కెట్లను ముంచెత్తనుంది. గతేడాది ఖరీఫ్తో పోలిస్తే ఈ ఏడాది 15 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా అంటే మొత్తం 55 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరించాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 15 నుంచి కొనుగోళ్లు ఆరంభం కానుండటంతో అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ధాన్యం విక్రయంలో రైతులకు అవగాహన కల్పిస్తూ క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించేలా వ్యవసాయ శాఖను భాగస్వామ్యం చేసింది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు కీలక బాధ్యతలను అప్పగించింది. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఏఈఓను ఇన్ఛార్జిగా నియమించింది. 15న మూడు జిల్లాలతో ఆరంభం.. ఖరీఫ్లో ధాన్యం పోటెత్తే అవకాశాల నేపథ్యంలో రైతులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలను గతంలోనే ఆదేశించారు. దీంతో ఇప్పటికే ఆయా శాఖల మంత్రులు సమీక్షలు నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే 2019–20 ఏడాదిలో మొత్తంగా 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా, ఖరీఫ్లో 55 లక్షల టన్నులు, రబీలో 37లక్షల టన్నులు సేకరించాలని నిర్ణయించారు. ఖరీఫ్ కొనుగోళ్ల కోసం 2,544 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అవసరాన్ని బట్టి దాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. క్వింటాలు గ్రేడ్–ఏ వరి ధాన్యానికి రూ.1,835, కామన్ వెరైటీకి రూ.1,815 చొప్పున అందిస్తామని పౌర సరఫరాల శాఖ తెలిపింది. గత ఏడాది ఖరీఫ్లో 40.41లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ప్రస్తుతం వరి సాగు పెరిగిన నేపథ్యంలో మరో 15 లక్షల టన్నుల మేర పెరిగే అధికంగా ఉండనుంది. గత ఏడాది ఖరీఫ్లో ధాన్యం కొనుగోళ్లకు రూ.13,300 కోట్ల మేర వెచ్చించగా, ఈ ఏడాది అది మరో రూ.5 వేల కోట్ల మేర అదనంగా కలిపి రూ.18 వేల కోట్ల మేర వెచ్చించాల్సి ఉంటుందని లెక్కగట్టారు. మొదటగా కామారెడ్డి, నిజామాబాద్, జనగాం జిల్లాలో 15 నుంచి ధాన్యం సేకరణను ఆరంభించనున్నారు. అనంతరం వరి కోతను బట్టి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద ఈ– అకౌంటింగ్ నిర్వహించేలా, ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలు పొందుపరిచేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కోసం మరుగుదొడ్లు, షెల్టర్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని, అవసరమైన ప్లాడీ క్లీనర్లు, విన్నోవింగ్ మిషన్లు, మాయిశ్చర్ మీటర్లు, టార్పాలిన్లను ఏర్పాటు చేస్తున్నారు. కావాల్సిన 12 కోట్ల గన్నీ సంచులను అందుబాటులో ఉంచనున్నారు. సీఎంఆర్ ఇవ్వకుంటే కఠిన చర్యలే.. నాణ్యత పరిశీలన కోసం కార్పొరేషన్ టెక్నికల్ స్టాప్ను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన థర్డ్పార్టీ బృందంతో కూడా తనిఖీలు చేయనున్నారు. ధాన్యం అందించిన 15 రోజుల్లో మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని అప్పగించాలని మిల్లర్లకు పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు బ్లాక్ మార్కెట్కు తరలిస్తే ఆ మిల్లును బ్లాక్ లిస్టులో పెట్టడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గడువులోగా మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకపోతే ఆర్ఆర్ యాక్టు ప్రయోగిస్తామని పేర్కొంది. మిల్లింగ్ కెపాసిటీని బట్టే ధాన్యాన్ని కేటాయించాలని, దీన్ని డీసీఎస్వోలు పర్యవేక్షించాలని సూచించింది. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా పోలీసు ఆధ్వర్యంలో జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తోంది. ధాన్య సేకరణ కమిటీలు.. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ధాన్యం రవాణా, పర్యవేక్షణ, కనీస మద్దతు ధర, వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర స్థాయిలో మొదటిసారిగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ చైర్మన్గా సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో వ్యవసాయ శాఖ కమిషనర్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్, పోలీస్శాఖ నుంచి ఒకరు, సీడబ్లు్యసీ రీజినల్ మేనేజర్, ఎస్డబ్ల్యూసీ మేనేజింగ్ డైరెక్టర్, సెర్ప్ సీఈఓ, కో–ఆపరేషన్ కమిషనర్, ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ధాన్య సేకరణ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈసారి జిల్లా ఎస్పీ, నగర పోలీస్ కమిషనర్, జిల్లా లేబర్ ఆఫీసర్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్లు కొత్తగా సభ్యులుగా చేర్చడం జరిగింది. -
జీడీపీనా? ఉద్యోగాలా?
ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని ఐదేళ్లలో ఐదు ట్రిలియన్లకు చేర్చాలనేది ప్రధాని మోదీ కల. కానీ ఈ కల సాకారానికి ఎన్నో సవాళ్లు. ఇంకెన్నో సమస్యలు. కనుచూపు మేరలో పరిష్కారం కానరావడమే లేదు. ఆర్థిక వ్యవస్థ 20 త్రైమాసికాల కనిష్టానికి దిగజారింది. పెట్టుబడులు మందగించాయి. ఎకానమీలో కీలక సూచికలేవీ విశ్వాసం రేకెత్తించడం లేదు. ఉద్యోగాలు దొరకడం లేదు. వ్యవసాయ సంక్షోభం ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. కానీ అత్యధిక భారతీయులకు ఇవి ప్రాధాన్యతాంశాలుగా కన్పించడం లేదని, రుణమాఫీ గురించి సానుభూతితో యోచించే పరిస్థితి లేదని ఎకనామిక్స్ టైమ్స్ ముందస్తు బడ్జెట్ సర్వే తేల్చింది. సర్వేలో పాల్గొన్న వారిలో 35.4 శాతం మంది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, వృద్ధిరేటు పెంచడమే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ముందున్న ప్రధాన కర్తవ్యమన్నారు. 31.5 శాతం మంది వృద్ధి కంటే ఉద్యోగాల కల్పనకే పెద్దపీట వేయాలన్నారు. 19.7 శాతం మంది ఆదాయం పన్ను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. రైతాంగ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న వారు కేవలం 13.4 శాతం మంది మాత్రమే. మద్దతు ధర పెంచాల్సిందే.. కనీస మద్దతు ధర పెంచడమే వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారమంటున్నారు 42.8 శాతం మంది. 29 శాతం మంది ఎకరానికి నిర్ణీత మొత్తం చొప్పున చెల్లింపులు జరపడం ఉత్తమమని భావిస్తున్నారు. రుణ మాఫీ వైపు మొగ్గు చూపుతున్న వారు 6.5 శాతం మంది మాత్రమే. 21.7 శాతం మంది ఉచిత విద్యుత్తు, నీటి సౌకర్యం కల్పించడంపై ఆర్థికమంత్రి దృష్టి పెట్టాలంటున్నారు. పన్నులు ఎలా? 38 శాతం మందికిపైగా ప్రజలు ఆదాయం పన్ను బేసిక్ స్లాబ్ను ఐదు లక్షలకు పెంచాలని కోరుతున్నారు. 80(సీ) కింద పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలంటున్న వారు 19.9 శాతం మంది. నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ఏదో ఒక రూపంలో రివార్డులు ఇవ్వాలనే ఆలోచనను 33 శాతం మంది సమర్థిస్తున్నారు. మిగిలిన వారు ప్రస్తుత పన్ను శ్లాబులు బాగున్నాయని, మార్పులు చేయాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడ్డారు. సంస్కరణలు అవసరమా? ప్రత్యక్ష పన్నుల విధానంలో మార్పులు చేయాలని 34 శాతం మంది కోరుతున్నారు. తక్షణమే ఈ మార్పులు అవసరమంటున్నారు. 25.7 శాతం మంది భూ సేకరణ చట్టంలో మార్పులు అవసరమని భావిస్తుండగా, 24.7శాతం మంది కార్మిక చట్టాలను సంస్కరించాలంటున్నారు. విద్యుత్ రంగ సంస్కరణల వైపు మొగ్గు చూపిన వారు 15.6శాతం మంది మాత్రమే. ఉద్యోగాలు ఎలా? ఉపాధి సంక్షోభాన్ని ఎలా పరిష్కరించాలి? ఈ ప్రశ్నకు విద్యా వ్యవస్థను ప్రక్షాళించడమే మార్గమని 40 శాతం మంది తమ అభిప్రాయాన్ని చెప్పారు. 21.9 శాతం మంది కార్మిక సంస్కరణలతో సమస్యను పరిష్కరించవచ్చునన్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం (27.5 శాతం మంది) ‘ముద్ర’తరహా పథకాలు మరిన్ని అమలు చేయడం (10.6 శాతం) ద్వారా ఉద్యోగాలు కల్పించవచ్చునన్నారు కొందరు. కేటాయింపులు ఎలా? బడ్జెట్ కేటాయింపుల్లో మౌలిక సదుపాయాల రంగానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని 36.4 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ రంగ కేటాయింపులకు పెద్ద పీట వేయాలంటున్నారు 29 శాతం మంది. మిగిలిన వారు నైపుణ్యాలు (18.7శాతం) పర్యావరణం (15.9శాతం) వైపు మొగ్గు చూపుతున్నారు. షేర్ల లాభాలపై విధిస్తున్న దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్టీసీజీ) పన్నును రద్దు చేయడం ద్వారా మదుపర్లను ఆకట్టుకోవచ్చునని 27.4 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. అంకుర పరిశ్రమలకు విధించే ఏంజెల్ ట్యాక్స్ను రద్దు చేయాలంటున్నారు 30 శాతం మంది. -
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2019 ఫలితాలను విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ కార్యదర్శి విజయరాజు సోమవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్లో 74.39 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. తెలుగు రాష్ట్రల నుంచి మొత్తం 2,82,711 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్ ఇంజనీరింగ్కు 1,85,711 మంది రాయగా.. 1,35,160 (74.39శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షకు 81,916 మంది విద్యార్థులు హాజరకాగా 68, 512 (83.64శాతం) మంది క్యాలీఫై అయినట్లు అధికారులు వెల్లడించారు. పులిశెట్టి రవిశ్రీ తేజ ఎంసెట్ ఇంజనీరింగ్లో స్టేట్ ర్యాంకు, వేద ప్రణవ్ రెండో ర్యాంకు సాధించారు. మెడికల్లో సుంకర సాయి స్వాతి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఆయా ర్యాంకుల వివరాలను విద్యార్థుల నంబర్లకు పంపనున్నట్లు విజయరాజు తెలిపారు. కాగా ఏపీ ఎంసెట్కు 36,698 మంది తెలంగాణ విద్యార్థులు పరీక్ష రాశారు. ( ఏపీ ఎంసెట్ ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి ) సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇంజనీరింగ్ టాప్టెన్ ర్యాంకర్లు 1. కరిశెటి రవి శ్రీతేజ 2.వేద ప్రణవ్ 3.గొర్తి భాను దత్తు 4. హేథవావ్య 5. బట్టెపాటి కార్తికేయ 6.రిషి షర్రష్ 7.సూర్య లిఖిత్ 8. అప్పలకొండ అభిజిత్ రెడ్డి 9. ఆర్యన్ లద్దా 10.హేమ వెంటక అభినవ్ అగ్రికల్చర్, మెడికల్ టాప్టెన్ ర్యాంకర్లు 1.సుంకర సాయి స్వాతి 2. దాసరి కిరణ్కుమార్ రెడ్డి 3. అత్యం సాయి ప్రవీణ్ గుప్తా 4. తిప్పరాజు రెడ్డి 5.జీ మాధురి రెడ్డి 6. గొంగటి కృష్ణ వంశీ 7. కంచి జయశ్రీ వైష్ణవీ వర్మ 8. భీ. సుభిక్ష 9. కొర్నెపాటి హరిప్రసాద్ 10. ఎంపటి కుశ్వంత్ -
రైతులపై కేసులు ‘సాంకేతిక ఉగ్రవాదమే’
జీవవైవిధ్యంతోనే మనకు ఆహార భద్రత. మంచి ఆహారం, జీవ వైవిధ్యం తోనే సాధ్యం. జీవ వైవిధ్యం కొనసాగడానికి, స్వచ్ఛంగా ఉండడానికి, ప్రాకృతిక సేవలు అందించటంలో విత్తనాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రకృతి వనరుల వ్యాపారీకరణ పట్ల ఆందోళన చెందుతున్న వారు, ఇటీవల విత్తనాలు, జన్యుసంపదను అందరికీ అందుబాటులో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాని బహుళ జాతి కంపెనీలు అభివృద్ధి చెందిన దేశాలలో మేధోహక్కుల పేరిట కొన్ని రకాల విత్తనాల మీద కూడా తమ వ్యాపార హక్కులను విస్తృతపరుచుకుని, తమ మార్కెట్ గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. భారతదేశం విత్తన హక్కులను కంపెనీలకు ధారాదత్తం ఎప్పుడూ చెయ్యలేదు. ఇక్కడి స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలు, రైతులు, సాధారణ పౌరులు అప్రమత్తంగా ఉండి ఆ పరిస్థితి రాకుండా అనేక సమయాలలో అడ్డుకున్నారు. అయినా, అనేక రకాలుగా విత్తన కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించు కుంటున్నాయి. బీటీ ప్రత్తి జన్యుమార్పిడి విత్తనంతో ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. మోన్ శాంటో కంపెనీ రైతులు వ్యతిరేకిస్తున్నా కూడా, స్థానిక విత్తన సంస్థల నిరసనల మధ్య, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మాయపరిచి బీటీ ప్రత్తి విత్తన వ్యాపారాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తోంది. ఈ లాభార్జనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రైతు సంఘాలు కొంత అడ్డుకట్ట వేసినా, బీటీ ప్రత్తి విత్తనం వ్యాప్తిని అడ్డుకోవడంలో భారత ప్రభుత్వం విఫలమైంది. తాజాగా, గుజరాత్లో తమ కంపెనికి చెందిన ఆలుగడ్డ విత్తనం దొంగిలించి పంట వేసుకుంటున్నారని, నలుగురు చిన్న రైతుల మీద పెప్సీకో కేసు పెట్టింది. దానికి ప్రతిగా ఒక్కొక్కరు రూ. కోటి నష్ట పరిహారం కట్టాలని కోర్టు ద్వారా డిమాండ్ పెట్టింది. వాళ్ళు ఎంత పండించినా కోట్ల విలువ చేసే ఆస్కారమే లేదు. కానీ, కోట్ల రూపాయల నష్ట పరిహారం కట్టాలని ఒక బహుళదేశ సంస్థ అయిన పెప్సీ కంపెనీ అడిగిందంటే, రైతులను భయబ్రాంతులను చేయడానికే. పెప్సీ కంపెనీ వాడిన చట్టం పేరు ‘మొక్కల రకాల సంరక్షణ మరియు రైతుల హక్కులు 2001’. కాగా, అదే చట్టంలో స్పష్టంగా ఉంది–రైతులు ఏ విత్తనమైనా తమ ఇష్టానుసారంగా విత్తవచ్చు, మళ్ళీ విత్తవచ్చు, ఇతర రైతులతో పంచుకోవచ్చు, దాచుకోవచ్చు, విత్తన పంటగా కూడా వేయవచ్చు. రైతులకు ఇచ్చిన ఈ హక్కుని కాలరాస్తూ, అదే చట్టం క్రింద తన హక్కులకు భంగం కలిగించారని కేసు పెట్టింది. కంపెనీ సరే, ప్రాథమిక వాదనలు విన్న కోర్టుకు ఈ హక్కు గురించి ఎందుకు తెలియలేదో స్పష్టత లేదు. గుజరాత్ ప్రభుత్వం కూడా రైతుల పక్షాన నిలిచే ప్రయత్నం మొదట చేయలేదు. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను మేము మొదలు పెట్టగా, గుజరాత్ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. పెప్సీ కంపెనీతో చర్చలు జరిపింది. చివరకు, పెప్సీ కంపెనీ ఈ కేసులను ఉపసంహరించుకుంది. ఆ నలుగురితో పాటు ఇదివరకు వేసిన ఇంకొక ఐదుగురి పైన కూడా వేసిన కేసులు ఎత్తివేశారు. ఈ ఉదంతం అనేక ప్రశ్నలకు ఆస్కారం ఇచ్చింది. పెప్సీ కంపెనీ కేసు పెట్టటానికి గుజరాత్ రాష్ట్రాన్ని మాత్రమే ఎందుకు ఎంచుకుంది? అందునా, వ్యవసాయం గురించి అవగాహన లేని ఒక ‘వాణిజ్య కోర్టులో’ కేసు దాఖలు చేసింది. అత్యధికంగా ఆలుగడ్డ వ్యవసాయం చేసే 10 రాష్ట్రాలలో గుజరాత్ నాలుగో స్థానంలో ఉంది. మరి, ఇతర రాష్ట్రాలలో ఈ రకం రైతులు వాడడం లేదా? అసలు రైతులకు విత్తన రకాల మధ్య వ్యత్యాసం సాధారణంగా తెలుస్తుందా? కేవలం, ల్యాబ్ పరీక్షల ద్వారానే తెలిసే పరిస్థితిలో భారత రైతుల మీద ఇట్లాంటి కేసులు ‘సాంకేతిక ఉగ్రవాదం’ అనిపించుకుంటుంది. ఆహార శుద్ధి పరిశ్రమలను విపరీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న నేపధ్యంలో ఆయా ఆహార శుద్ధి పరిశ్రమలు తమకు అవసరమైన వ్యవసాయ పంటలు, విత్తనాల మీద మేథోహక్కులు పొంది, రైతుల మీద ఈ తరహ ‘దాడి’ చేస్తే, అసలే సంక్షోభంలో ఉన్న రైతు, వ్యవసాయం మీద పడే దుష్ప్రభావం మన ఆహార వ్యవస్థ మీద పడదా? ఆహార పంటలు వేస్తే గిట్టుబాటు ధర రావడం లేదని, కోతులు ఇంకా ఇతర అనేక ‘జంతువులూ, పురుగుల’ నుంచి కాపాడుకోలేక, రైతు వాణిజ్య పంటల వైపు పోతుంటే, పెప్సీ లాంటి కంపెనీలు లాభాల మదంతో రైతుల మీద కేసులు వేస్తే, ఆహార ఉత్పత్తి కుంటుపడి, దిగుమతుల మీద ఆధారపడే దుస్థితి తప్పదు. అందుకే, పెప్సీ కంపెనీ మీద దేశీయ ఆహార ఉత్పత్తికి విఘాతం కలిగించే చర్యలు చేపట్టినందుకు ఆర్థిక ఆంక్షలు విధించాలి. ఇంకొక కంపెనీ ఇట్లాంటి దుశ్చర్య చేపట్టకుండా తీవ్ర చర్యలు చేపట్టాలి. తక్షణమే, జాతీయ విత్తనం చట్టం తీసుకు రావాలి. దీనితో రైతుల ప్రయోజనాలు కాపాడుతూ, పర్యావరణ సంరక్షణకు, జన్యుసంపద పరిరక్షణకు, దేశీయ విత్తనాల ఉపయోగానికి మార్పులు తీసుకురావాలి. (నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం) డా.డి. నరసింహరెడ్డి వ్యాసకర్త పర్యావరణ విధాన విశ్లేషకులు nreddy.donthi16@gmail.com -
రేపటి నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్–2019 ఆన్లైన్ పరీక్షలు ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నా యి. 3, 4, 6 తేదీల్లో ఇంజనీరింగ్, 8, 9 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకు ఎంసెట్ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గం టల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టింది. 18 పట్టణాల పరిధిలోని 94 పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేసింది. తెలంగాణలో 15 పట్టణాల పరిధిలోని 83 కేంద్రాల్లో, ఏపీలో మూడు పట్టణాల పరిధిలోని 11 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలకు 2,17,199 మంది విద్యా ర్థులు హాజరు కానున్నారు. అందులో రెండింటికీ హాజరయ్యే వారు 235 మంది ఉన్నారు. దరఖాస్తుదారుల్లో ఈసారి ఐదుగురు ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వారిలో నలుగురు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు హాజ రు కానుండగా, ఒకరు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నారు. గంటన్నర ముందునుంచే పరీక్ష హాల్లోకి.. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఎంసెట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు. విద్యార్థులను పరీక్ష సమయానికికంటే గంటన్నర ముందునుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభం అయ్యాక నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని వెల్లడించారు. విద్యార్థులు చివరి క్షణంలో ఇబ్బందులు పడకుండా వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. మొదటి విడత పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుండగా ఆ పరీక్షకు ఉదయం 8:30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అయ్యే పరీక్ష కోసం విద్యార్థులను 1:30 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని వెల్లడించారు. అగ్రికల్చర్ కోర్సులవైపు బాలికల మొగ్గు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు అత్యధికంగా బాలికలే దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ కోసం బాలురు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు బాలికలు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాసేందుకు 87,804 మంది బాలురు దరఖాస్తు చేసుకోగా, 54,410 మంది బాలికలే దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష రాసేందుకు బాలురు 23,316 మంది దరఖాస్తు చేసుకోగా, బాలికలు 51,664 మంది దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులకు సూచనలు ∙విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాన్ని ఒక రోజు ముందుగానే చూసుకోవాలి. పరీక్ష రోజు ఇబ్బంది పడకుండా వీలైనంత ముందుగా చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ∙పరీక్ష హాల్లోకి హాల్టికెట్, పూర్తి చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఫారం, బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే అటెస్ట్ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకెళ్లాలి. ∙విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లగానే తమ బయోమెట్రిక్ డేటాను నమోదు చేసుకోవాలి. ∙హాల్టికెట్ లేకుండా విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష కేంద్రంలోకి, హాల్లోకి అనుమతించరు. ∙విద్యార్థులు తమ వెంట తెచ్చుకున్న ఆన్లైన్ దరఖాస్తు ఫారాన్ని పరీక్ష హాల్లో అందజేయాలి. ∙పరీక్ష ప్రారంభం అయ్యాక వచ్చే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష హాల్లోకి అనుమతించరు. వచ్చిన వారిని పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు పంపించరు. ∙కాలిక్యులేటర్లు, మ్యాథమెటికల్ లాగ్ టేబుల్స్, పేపర్లు, సెల్ఫోన్లు, వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ నిషేధం. వాటిని పరీక్ష హాల్లోకి తీసుకెళ్లకూడదు. రఫ్ వర్క్ కోసం బుక్లెట్ను పరీక్ష హాల్లోనే అందజేస్తారు. ఆ బుక్లెట్ను తర్వాత ఇన్విజిలేటర్కు ఇచ్చేయాలి. మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. స్ట్రీమ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ విద్యార్థుల సంఖ్య 1,42,218 74,981 బాలురు 87,804 23,316 బాలికలు 54,410 51,664 ట్రాన్స్జెండర్స్ 4 1 -
నేడే పీఎం–కిసాన్ నిధుల బదిలీ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్లోని గోరఖ్పూర్లో ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని 10.30 నుంచి 11 గంటల వరకు పీఎం–కిసాన్ ముఖ్య ఉద్దేశాన్ని, 11 నుంచి 11.30 వరకు మన్ కీ బాత్ కార్యక్రమం, 11.30 నుంచి 12.30 వరకు పథకం ప్రారంభం, ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాలుంటాయని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాల్లోని గ్రామాల నుంచి కొందరు రైతులకు రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయం అందనుంది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా తెలిపారు. పీఎం–కిసాన్ వెబ్సైట్లో మొత్తం 17 లక్షలకు పైగా అర్హులైన రైతుల బ్యాంకు వివరాలు, ఆధార్ నెంబర్లను ఆప్లోడ్ చేశారు. మిగతా వివరాలను త్వరలోనే అప్లోడ్ చేయనున్నారు. ఇందులో కొందరు రైతులకు ఆదివారం పెట్టుబడి సాయం జమ కానుంది. ఇప్పటికే 5 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నిధుల విడుదలకు సంబంధించి టోకెన్లు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొన్నాయి. విడతల వారీగా రైతులందరికీ పెట్టుబడి జమ అవుతుందని తెలిపారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయశాఖ అన్ని జిల్లాల వ్యవసాయాధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ప్రతి సహాయ వ్యవసాయాధికారులు డివిజన్ స్థాయిలో జిల్లా, ఇతర ప్రజాప్రతినిధుల సమన్వయంతో లబ్ధిదారుల సమక్షంలో ప్రారంభించాలని, లబ్ధిపొందే రైతులను ఎక్కువ సంఖ్యలో ఆహ్వానించాలని ఆదేశాలు జారీచేశారు. -
రాష్ట్ర రుణ ప్రణాళిక...లక్ష్యం రూ.లక్షకోట్లు
సాక్షి, హైదరాబాద్: రూ.లక్ష కోట్లతో రాష్ట్ర రుణ ప్రణాళిక ఉండాలని నాబార్డు నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకులకు దిశానిర్దేశం చేస్తూ బుధవారం ‘స్టేట్ ఫోకస్ పేపర్–2019–20’ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆధ్వర్యంలో విడుదల చేసిన ఈ పత్రంలో మొత్తం 70 శాతం పంట రుణాలకే కేటాయించాలని దిశానిర్దేశం చేయడం గమనార్హం. వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నందున ఆ మేరకు కేటాయింపులు పెంచాలన్నది నాబార్డు ఉద్దేశంగా కనిపిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ రంగాలకు రుణ కేటాయింపులు ఎలా ఉండాలన్న దానిపై నాబార్డు అన్ని జిల్లాల నుంచి వివిధ శాఖల ద్వారా క్షేత్రస్థాయి వివరాలను సేకరించింది. వాటిని క్రోడీకరించి ఈ ఫోకస్ పేపర్ను విడుదల చేసింది. దీని ఆధారంగానే రాష్ట్ర రుణ ప్రణాళికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) త్వరలో విడుదల చేయనుంది. పంట రుణాలకు రూ. 49,785 కోట్లు... క్షేత్రస్థాయి సర్వేల ద్వారా వేసిన అంచనా ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1,01,378 కోట్ల రుణం లక్ష్యంగా ముందుకు వెళ్లాలంది. 2018–19 ఫోకస్ పేపర్లో రాష్ట్ర రుణ పరిమితి రూ. 83,388 కోట్లు కాగా, ఈసారి అదనంగా రూ. 17,990 కోట్లు కేటాయించాలని పేర్కొంది. రూ. 70,965 కోట్లు ఇచ్చి వ్యవసాయం, పశుసంవర్థకశాఖ, మత్స్యశాఖ సహా అనుబంధ రంగాలకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలంది. అందులో రూ. 46,344 కోట్లు పంట రుణాలకు , అంటే 2018–19 లక్ష్య పత్రంతో పోలిస్తే అదనంగా రూ. 3,441 కోట్లు కేటాయించాలంది. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ. 2,833 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. వ్యవసాయ మార్కెటింగ్లో మౌలిక సదుపాయాలు, గోదాములకు రూ. 1401 కోట్లు కేటాయించాలని సూచించింది. గృహ రుణాలకు రూ. 5,834 కోట్లు, విద్యా రుణాలకు రూ. 2,009 కోట్లు కేటాయించింది. 2019–20 నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్ ప్రకారం రుణ ప్రణాళిక అంచనా అంశం కేటాయింపు (రూ. కోట్లల్లో) 1) పంట రుణాలు 49,785.59 2) వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు 21,179.58 3) సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు 21,065.98 4) విద్య రుణాలు 2,009.41 5) గృహ రుణాలు 5,834.94 6) రెన్యువబుల్ ఎనర్జీ 317.38 7) సామాజిక మౌలిక సదుపాయాలు 1008.92 8) ఇతరాలు 176.80 మొత్తం 1,01,378.60 -
తాత్కాలికమే కానీ.. వరాల జల్లే!
తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టాలన్న సంప్రదాయాన్ని పాటిస్తూనే.. రాబోయే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలను వెలువరించేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక బడ్జెట్కు కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి మొదటి తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని గతేడాది నుంచి ప్రారంభించిన మోదీ సర్కారు.. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి తాత్కాలిక బడ్జెట్ కాకుండా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందన్న వార్తలు వెలువడ్డాయి. దీనికితోడు బుధవారం ఉదయం ఆర్థిక శాఖ ఒక వాట్సాప్ సందేశంలో.. 2019–20 బడ్జెట్ను తాత్కాలిక బడ్జెట్గా పేర్కొనవద్దని పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి విమర్శలొచ్చాయి. దీంతో వెనక్కు తగ్గిన ఆర్థిక శాఖ.. తాత్కాలిక బడ్జెట్నే ప్రవేశపెడుతున్నట్లు బుధవారం సాయంత్రం స్పష్టం చేసింది. తాత్కాలిక బడ్జెట్ కారణంగా ఈసారి ఎకనమిక్ సర్వే ఉండదు. కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రవేశపెట్టే బడ్జెట్ సమయంలో మాత్రమే ఎకనమిక్ సర్వే ఉంటుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ రైతులపై వరాల జల్లు! తాత్కాలికమైతేనేం.. బడ్జెట్ తాత్కాలికమా? పూర్తిస్థాయిలోనా అన్న సంగతి పక్కన పెడితే.. ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయాలు వెలువరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్డీయే సర్కారు ఈ ఐదేళ్ల పదవీకాలంలో ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే. ఇప్పటిదాకా ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టిన అరుణ్జైట్లీ అనారోగ్య కారణంగా.. ఆ బాధ్యతల్ని స్వీకరించిన రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ తాజా బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ముందు బడ్జెట్ కావటంతో దీనిపై సామాన్యుల నుంచి కార్పొరేట్ల వరకు ఎన్నో వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. రైతులకు ఆర్థిక ప్రయోజనాలతో కూడిన ప్యాకేజీ, వేతన జీవులకు ఆదాయపన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు ఉండొచ్చన్న అంచనాలతోపాటు అత్యధిక సంఖ్యలో ఉన్న చిరువ్యాపారులకు రుణాల పరంగా వెసులుబాటు కల్పించొచ్చని భావిస్తున్నారు. మొదటి బడ్జెటే తాత్కాలికం! భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం చెట్టి స్వతంత్ర భారతంలో ప్రవేశపెట్టిన మొదటిదే తాత్కాలిక బడ్జెట్. దీన్ని 1947 నవంబర్ 26న ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఐదు బడ్జెట్లను కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాల ఆర్థికమంత్రులు ప్రవేశపెట్టారు. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే తాత్కాలిక లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో విధాన నిర్ణయాలు ప్రకటించకూడదు. అయితే, 1947 నవంబర్ 26న ప్రవేశపెట్టిన తొలి తాత్కాలిక బడ్జెట్ అని ఆ సమయంలో.. నాటి ఆర్థిక మంత్రి చెట్టి పేర్కొనలేదు. కానీ, 1948 ఫిబ్రవరి 28న రెండో బడ్జెట్ ప్రవేశపెడుతూ, మొదటిది తాత్కాలిక బడ్జెట్ అని చెప్పారు. కేంద్రంలో తొలి కాంగ్రెసేతర సర్కారు (జనతాపార్టీ) ఆర్థిక మంత్రిగా హెచ్ఎం పటేల్ 1977లో ఓటాన్ అకౌంట్ సమర్పించారు. 1991లో చంద్రశేఖర్ కేబినెట్లోని ఆర్థిక మంత్రి యశ్వంత్సిన్హా తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మన్మోహన్సింగ్.. 1996 పార్లమెంటు ఎన్నికల ముందు తొలిసారి తాత్కాలిక బడ్జెట్ సమర్పించారు. 2009 లోక్సభ ఎన్నికల ముందు జనవరిలో ప్రణబ్ ముఖర్జీ మొదటిసారి తాత్కాలిక బడ్జెట్ సమర్పించారు. 2014 ఫిబ్రవరి 17న పి.చిదంబరం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు జైట్లీకి అనారోగ్యం కారణంగా పీయూష్ గోయల్కు ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టే అవకాశం దక్కింది. ఆదాయపు పన్ను పరిమితి పెంపు! ఇక మధ్యతరగతి వర్గాలు ఆదాయపన్ను పరంగా మినహాయింపులు ఈ బడ్జెట్లో ఉంటాయని ఆశిస్తున్నారు. ఆదాయపన్ను ప్రామాణిక మినహాయింపు రూ.2.5 లక్షల నుంచి పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. సెక్షన్ 80–సీ కింద వివిధ మార్గాల్లో చేసే రూ.1.5 లక్షల పెట్టుబడులపై పన్ను మినహాయింపు ఉంది. పెరుగుతున్న ఆదాయం, ద్రవ్యోల్బణం నేపథ్యంలో దీన్ని రూ.2–2.5 లక్షలు చేయాల్సిన అవసరం ఉందని, అదే జరిగితే ఆర్థిక పరిపుష్టికి ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుందని బ్యాంక్ బజార్ సీఈవో అదిల్శెట్టి అభిప్రాయపడ్డారు. మెట్రో నగరాల్లో ఇళ్ల కొనుగోలుదారులకు ఆదాయపన్ను మినహాయింపును రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. ఇతర డిమాండ్లలో.. కేవలం ఈక్విటీ ఫండ్స్కే కాకుండా, డెట్, హైబ్రిడ్ ఫండ్స్ కూడా సెక్షన్ 80–సీ కింద మినహాయింపు కల్పించడం.. దీర్ఘకాలిక మూలధన లాభం రూ.లక్ష దాటితే పన్ను పరిమితిని పెంచడం వంటివి కూడా ఉన్నాయి. వాస్తవ పరిస్థితులివీ! జీడీపీలో ద్రవ్యలోటును 2018–19 ఆర్థిక సంవత్సరానికి 3.3%కు కట్టడి చేయాలన్నది కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యం. కానీ ఈ లక్ష్యం డిసెంబర్ నాటికే దాటిపోయింది. దీంతో మిగిలి ఉన్న కాలానికి వ్యయాల పరంగా పరిమితులున్నాయి. ఈ నేపథ్యంలో పన్ను తగ్గింపులు, ఇతర ప్రోత్సాహకాలకు తాత్కాలిక బడ్జెట్లో చోటు కల్పిస్తే.. అవి 2019–20 ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాలపై భారం చూపిస్తాయి. 2014లో ఆర్థిక మంత్రిగా జైట్లీ బాధ్యతలు స్వీకరించే నాటికి ద్రవ్యలోటు 5% ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత.. నాటి యూపీఏ సర్కారు ద్రవ్యపరమైన ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టింది. కానీ, వీటిని సకాలంలో ఉపసంహరించుకోలేదు. దీని వల్ల 2009–10 సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 6.5%కు పెరిగిపోయింది. దీన్ని కనిష్ట స్థాయికి తీసుకొచ్చేందుకు మోదీ సర్కారు గట్టి ప్రయత్నాలనే చేసింది. చమురు ధరలు కనిష్ట స్థాయిలకు చేరడం ఇందుకు సాయపడింది. అయితే, జీఎస్టీని అమల్లోకి తేవడం, బ్యాంకుల రీ–క్యాపిటలైజేషన్ సాయం అంచనాలను మించడంతో ద్రవ్యలోటు ప్రణాళికలపై ఒత్తిడికి దారితీశాయి. దీంతో 2017–18లో 3.2% లక్ష్యాన్ని చేరడంలో వెనుకబడింది. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.5% వద్ద స్థిరపడింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2018–19లో ద్రవ్యలోటు 3.3% లక్ష్యం కాగా, డిసెంబర్ వరకు తొమ్మిది నెలల కాలానికే ఈ లక్ష్యానికి 115 శాతానికి చేరింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.3% లక్ష్యాన్ని చేరుకోవడంపై అనుమానాలు నెలకొన్నాయి. -
బోరుబావి రైతులను ఆదుకోరా?
వర్షపునీటితో వ్యవసాయం చేయటమనేది అత్యంత ప్రాచీనమైన కళ. పంటభూమికి నీరందించటానికి మనకున్న ముఖ్యమైన నీటివనరులు మూడు. అవి 1. వర్షపాతం, 2.భూతలజలం, 3. భూగర్భజలం. తెలంగాణలో సగటు వార్షికవర్షపాతం 929 మి.మీ. ఇందులో నైరుతి ఋతుపవనాల ద్వారా రమారమి 67శాతం జూన్ నుంచి సెప్టెంబర్ నెలల్లోనే లభిస్తుంది. 23శాతం వర్షపాతం ఈశాన్య ఋతుపవనాల ద్వారా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు లభిస్తుంది. ఇవి పోగా మిగతా పదిశాతం వర్షపాతం జనవరి నుండి మే నెలల మధ్య ఐదు నెలల్లో లభిస్తుంది. రాష్ట్రంలోని పంటభూమిలో ఒక కోటీæ 43 లక్షల ఎకరాలలో మూడింట ఒక వంతు భూమికి మాత్రమే నీటి వసతి ఉంది. ఈ నీటి వసతి కల్పిం చిన పంట భూమిలో మూడింట రెండువంతుల భూమికి రైతులే స్వయానా అప్పులు చేసి ఎన్నో బాధలుపడి బోరుబావుల ద్వారా నీటివసతిని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణలో ఉన్న మొత్తం చెరువులు, కుంటలు 41,131. వీటి కింద ఉన్న పారుదల 1956–57లో 5,30,565 హెక్టార్లుగా ఉన్నది. 2000–01 నాటికి 1,65,303 హెక్టార్లకు పడిపోయింది. అంటే ఐదు దశాబ్దాలలో చెరువులు, కుంటల కింద నీటిపారుదలలో తగ్గిన విస్తీర్ణం 8,50,000 ఎకరాలకు పైగానే ఉంది. అదే విధంగా కాలువల కింద పారకం 1990–91లో 3,38,276 హెక్టార్లుగా ఉన్నది 2000–01 నాటికి 1,62,315 హెక్టార్లకు పడిపోయింది. రాష్ట్రంలో వాణిజ్యపంటలవైపు మొగ్గుచూపు తున్న రైతులు ప్రాజెక్టులు, చెరువులు, కాలువల ద్వారా సాగునీరు లభించకపోవటంతో గత్యంతరం లేక బోరు బావులపై ఆధారపడుతున్నారని గత 50 ఏళ్ల గణాంకాలు చెబుతున్నాయి. 1970–71లో రాష్ట్రంలో 2,14,500 బోరుబావులుంటే 2017 నాటికి వాటి సంఖ్య 20,21,084కు చేరుకుంది. ప్రస్తుతం 22,50,000వరకు ఉంటాయని నిపుణుల అంచనా. ఒక్కో బోరుబావిపై రైతులు ఖర్చుపెడుతున్నది సగటున లక్షరూపాయలనుకుంటే ఇన్ని బోరుబావులపై రైతులు పెట్టిన ఖర్చు 22,500 కోట్లకు పైగానే ఉంటుంది. నేడు మనరాష్ట్రంలో 1,43,00, 000 ఎకరాలు సాగుకు అనుకూలమైన భూమి ఉంటే అందులో సాగవుతుంది మాత్రం గరిష్టంగా ఒక కోటీ పది లక్షల ఎకరాలు మాత్రమే. ఈ పంటభూమిలో మూడింట ఒకవంతు భూమికి సాగునీటి వసతి 6 భారీ, 30 మధ్యతరహా, 41.131 చెరువుల, కుంటల వ్యవస్థల ద్వారా ప్రభుత్వం గత కొంతకాలంగా లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి కల్పించింది. నీటివసతి గల భూమిలో మూడింట రెండువంతుల భూమికి రైతులే స్వయానా బోర్లద్వారా నీటివసతిని ఏర్పాటు చేసుకున్నారు. కానీ రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంత అన్నది ప్రశ్న? పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న ఈ బోరుబావుల రైతులంతా చిన్నసన్నకారురైతులే. వీళ్లంతా అరెకరం నుండి ఐదు ఎకరాల లోపు వ్యవసాయభూకమతాలు కల్గిఉన్నవారే. వీళ్లలో మెజార్టీ రైతులు ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందినవారు. 80శాతం పైగా బోరుబావులున్నవి వీళ్ల వ్యవసాయక్షేత్రాల్లోనే. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల్లో 80శాతం వరకు ఈ కుటుంబాల నేపథ్యంలోని వారేనని నిపుణుల అంచనా. ఈ చిన్నసన్నకారు రైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారులపై, బంధుమిత్రులపై వ్యవసాయంలో తమ పెట్టుబడి అవసరాల కోసం ఆధారపడుతున్నారు. వడ్డీరేట్లు అధికంగా ఉండటంతో రుణాలు తీర్చలేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రాష్ట్రంలోని బోరుబావులలో 25శాతం బోరుబావులు మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నాయి. మిగతావన్నీ డేంజర్ జోన్లోనివే. భూగర్భజలాశయం ఒకబ్యాంకు లాంటిది. బ్యాంకులో మనం ఎంత డబ్బును జమచేస్తే అంతే తీసుకోగలం. అలాగే ఎంత వాననీరు భూగర్భజలాశయానికి చేరుతుందో అంతనీటిని మాత్రమే మనం బయటకు తీసి వాడుకోవాలి. రాష్ట్రంలోని బోరుబావులను, వాటి సంబంధిత రైతుల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసే నిమిత్తం నిపుణులతో కూడిన ఒక కమిటీని వేసి వారి సూచనలు, సలహాల ప్రకారం ప్రభుత్వం చర్యలు చేపట్టి రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి. దాంతోపాటు దక్కన్పీఠభూమిలో భాగంగా ఉన్న మన రాష్ట్ర నైసర్గిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లక్షల కోట్ల రూపాయల వ్యయంతో కూడిన భారీ నీటిపారుదల ఎత్తిపోతల పథకాలకు స్వస్తి పలికి వీటికి ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ జలవనరుల నిపుణులు హన్మంతరావు ప్రతిపాదించిన చతుర్విద జలప్రక్రియను చేపట్టాలి. చైనా, రాజస్తాన్ లాంటి ప్రాంతాల్లో హన్మంతరావు ప్రతిపాదించిన చతుర్విద జలప్రక్రియ సత్ఫలితాలనిస్తున్నట్లుంది. తక్కువ ఖర్చుతో కూడిన ఈ విధానం మన రాష్ట్ర నైసర్గిక స్వరూపానికి అనుగుణంగా ఉండి సత్ఫలితాలనిస్తుంది. వ్యాసకర్త ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ‘ మొబైల్: 98491 36104 ప్రొఫెసర్ జి. లక్ష్మణ్ -
వ్యవసాయాభివృద్ధితోనే గ్రామాల్లో వెలుగులు
గ్రామీణ సమాజంలో వెలుగులు పూయించాల ంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి. వ్యవసాయదారులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీల సంక్షేమమే వ్యవసాయాభివృద్ధికి కొలబద్ద. దీనిని పరిగణనలోకి తీసుకోకుండా.. అధికారంలో ఉన్న వారు వ్యవసాయ అనుబంధ రంగాలైన చేపలు, ఆక్వారంగంలో అభివృద్ధిని వ్యవసాయరంగ ఆదాయంలో జోడించి వ్యవసాయరంగం రెండంకెల అభివృద్ధి సాధించిందని చెప్పుకోవడం రైతాంగాన్ని వంచించడమే. కారణం ఆక్వా ఆదాయం రాష్ట్రంలో కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం. 2011 గణాంకాల ప్రకారం దేశంలో 55.49% జనాభా వ్యవసాయంపై ఆధారపడగా అందులో 33.6% వ్యవసాయ కార్మికులు. మిగతావారు వ్యవ సాయదారులు, కౌలు రైతులు. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ (సిఎస్పిఎస్) నివేదిక ప్రకారం 76% మంది రైతులు వ్యవసాయాన్ని మానుకుని ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల్లోకి మరలాలని భావిస్తున్నారు. కానీ, ప్రత్యామ్నాయ మార్గాలు లేకనే.. నష్టాల్ని, కష్టాల్ని భరిస్తూ విధిలేక వ్యవసాయం చేస్తు న్నారనే నగ్నసత్యాన్ని పాలకులు మరవకూడదు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రజ్ఞుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ నేతృత్వంలోని కమిషన్ 2007లోనే ఓ సమగ్రమైన నివేదిక అప్పటి కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదికలో విలువైన సూచనలు ఉన్నాయి. ఇదికాక, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పాటయిన నీతి ఆయోగ్ వ్యవసాయరంగంపై ఓ సమగ్ర విధాన పత్రాన్ని అందించింది. ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్’ (ఒఇసిడి) తాజా గణాంకాల ప్రకారం గత 5 ఏళ్లల్లో వివిధ పంటలు చేతికొచ్చాక.. మార్కెట్కు చేరేలోపు జరిగిన నష్టం (పోస్ట్ హార్వెస్ట్ నష్టాలు) 4% నుంచి 16%కు పెరిగాయి. వీటిలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు లాంటివి ప్రధానమైనవి. రైతులకు హెక్టారుకు ఏడు వేల రూపాయలు సబ్సిడీ అందించి ఎరువులపై నియంత్రణ ఎత్తివేయాలని సలహా సంఘం సూచించినప్పటికీ దానిని కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అలాగే, గోధుమ, వరి, బియ్యంలాంటి వాటిని ఎఫ్సీఐ ద్వారా సేకరించడం మానుకుని, ఆ బాధ్యతను రాష్ట్రాలకు వదిలి పెట్టాలన్న సూచన సత్ఫలితాలను సాధించకపోవడం. ముఖ్యంగా.. గత ఐదేళ్లల్లో విత్తనోత్పత్తిలో అధునాతన పద్ధతులేమీ పాటించకపోవడం వల్ల అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు అందుబాటులోకి రాలేదనే వాస్తవాన్ని నీతిఆయోగ్ ఎత్తిచూపింది. తెలంగాణ ప్రభుత్వం గత ఏడాదికాలంగా ఎకరాకు రూ. 4,000 నగదు నేరుగా రైతు ఖాతాలో వేసే పథకాన్ని అమలు చేస్తున్నది. రెండవసారి అధికారంలోకి వచ్చాక ఎకరాకు రూ. 5,000 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కాకుండా పంట నష్టపోయే రైతులను ఆదుకోవడానికి సమగ్ర బీమా పథకం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగంలో అమలు చేస్తున్న పథకాల పట్ల కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నేతృత్వం లోని ప్రభుత్వం.. గత ఐదేళ్లుగా వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెడుతున్నప్పటికీ.. రైతులకు కలిగిన ప్రయోజనం శూన్యమనే చెప్పాలి. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అధినేత రైతాంగం సంక్షేమం కోసం రెండుసార్లు ఆమరణ నిరాహార దీక్షల పేరుతో హడావుడి చేశారు. ఇక, 2014 ఎన్నికలముందయితే.. అధికారంలోకి రాగానే బేషరతుగా రైతుల రుణాలను మాఫీ చేస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక.. టీడీపీ ప్రభుత్వం రైతాంగాన్ని ఏవిధంగా వంచించిందో అందరూ గమనించారు. ఒక్కసారి కూడా చంద్రబాబు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేలేదు. కనీస మద్దతు ధరలు పెంచితే వినియోగదారుడిపై భారం పడుతుంది కనుక స్వామినాథన్ కమిషన్ సిఫార్సు లను అమలు చేయలేమని సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిడ్ దాఖలు చేసినా.. బాబు పెదవి విప్పలేదు. ప్రధాన కారణం కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో మైత్రీ బంధం ఉంది గనుక. దక్షిణాదిన కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఇస్తున్నట్లు కనీసం బోనస్ కూడా ప్రకటించలేదు. ఇక, రైతు రుణమాఫీని ఓ ఫార్సుగా చేశారు. 2014 ఎన్నికల ముందు బాబు రైతుల రుణమాఫీ వాగ్దానం చేసే నాటికి రాష్ట్రంలో రైతుల అప్పులు రూ.87,612 కోట్లు. తరచూ రుణ మాఫీకి కటాఫ్ డేట్లు మార్చారు. కోటయ్య కమిటీ వేసి లక్షరూపాయల రుణం కంటే తక్కువ మొత్తాలకు మాత్రమే రుణమాఫీ అన్నారు. రుణభారం కేవలం రూ. 24,000 కోట్లుగా లెక్క తేల్చి... దానిని ఐదేళ్ల పాటు దఫాలవారీగా ఇస్తామని చెప్పి.. కేవలం 13,000 కోట్లు చెల్లించి, ఇప్పటికీ ఇంకా రూ. 11,000 కోట్లు చెల్లించలేదు. ప్రభుత్వం చేసిన రుణమాఫీ మొత్తం వడ్డీలకే సరిపోయిందని రైతులు గగ్గోలు పెట్టారు. ఆకర్షణీయమైన నినాదాలు తప్ప టీడీపీ రైతుల సంక్షేమానికి నిర్దిష్టంగా చేసిన మేలు మచ్చుకైనా కనపడదు. మరోపక్క.. అనంతపురం జిల్లాలో ‘కరువే మనలను చూసి భయపడి పారిపోయేలా చేస్తాం’ అంటూ ఆర్భాటంగా వందల కోట్లతో రెయిన్ గన్లు కొని.. నీళ్లు లేక వాటిని మూలన పెట్టేశారు. ఈ ఏడాది 30.55 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉండగా.. వివిధ ఎత్తిపోతల పథకాల కింది ఆయకట్టుకు నీరు అందించలేకపోవడంతో కేవలం ఆరుతడి పంటలకు మాత్రమే నీరివ్వాలనే ప్రభుత్వ నిర్ణయం రైతుల పాలిట శాపంగా పరిణమించింది. నాలుగున్నరేళ్లల్లో సంభవించిన కరువు, తుపాన్లతో భారీగా జరిగిన పంట నష్టానికి రైతులు కోలుకోలేని దైన్యస్థితిలో పడిపోయారు. దేశవ్యాప్తంగా అన్నదాతల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఢిల్లీని ఇటీవల 35,000 మంది రైతులు ముట్టడించి కేంద్రానికి చెమటలు పట్టించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు.. ఇలా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు రోడ్ల మీదకు వస్తున్నారు. మోదీ గద్దె దిగాలని కొన్నిరాజకీయ పార్టీలు నినదిస్తున్నాయి. కానీ, అధికారంలోకి ఎవరొచ్చినా వ్యవసాయరంగ పరిస్థితిలో మార్పురావడంలేదు. అధిక ఆదాయం చేకూర్చే రంగంగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దడం అసాధ్యమేమీ కాదు. గ్రామీణ ప్రాంతం లోని యువత శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకోవాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల్ని మెరుగుపర్చాలి. విద్య, వైద్య సదుపాయాలు, మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థలను విస్తృతపర్చాలి. ఈ చర్యలు చేపడితే వ్యవసాయరంగంలో వెలుగులు పూయించడం సాధ్యపడుతుంది. వ్యాసకర్త శాసన మండలి ప్రతిపక్ష నాయకులు, కేంద్ర మాజీ మంత్రి డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు -
అన్నదాతల్లో ‘పెథాయ్’ తుపాన్ భయం
అశ్వారావుపేట రూరల్: అన్నదాతల్లో పెథాన్ తుపాన్ భయం వెంటాడుతోంది. బలంగా వీస్తున్న ఈదురు గాలులతో రైతుల్లో అలజడి మొదలైంది. గడిచిన మూడు రోజులుగా వాతావరణం చల్లబడి, ఆకాశం మేఘావృతమై ఉండటంతోపాటు ఆదివారం ఉదయం నుంచి వర్షం కురవడంతో రైతుల్లో అందోళన నెలకొంది. ఇప్పటికే వరి కోతలు దాదాపుగా పూర్తి కాగా, పొలాల్లో ధాన్యం రాశులు ఆరబెట్టుతున్నారు. అదేవిధంగా ఆరిపోయిన ధాన్యం రాశులను అధిక శాతం మంది రైతులు విక్రయించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించారు. కేంద్రాల్లో రైతులు విక్రయాలకు తీసుకొస్తున్న ధాన్యాన్ని రోజుల తరబడి కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. దాంతో రైతులు ధాన్యం కేంద్రాల్లోనే ఉండిపోతుంది. ఈ తరుణంలో ముంచుకొస్తున్న పెథాయ్ తుపాన్, కురుస్తున్న వర్షంతో ధాన్యం తడిచిపోకుండా ఉండేందుకు రైతులు పడుతున్న పాట్లు వర్ణాతీతంగా ఉన్నాయి. మండలంలోని నారాయణపురం, నెమలిపేట, అచ్యుతాపురం, ఊట్లపల్లితోపాటు మరికొన్ని చోట్ల ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు కుప్పకుప్పలుగా ఉండగా వర్షానికి తడిచిపోకుండా ఉండేందుకు కప్పడానికి టార్ఫాలిన్లు అంతంత మాత్రంగా ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. దాంతో చాలా మంది రైతులు టార్ఫాలిన్ల కోసం ఇతర ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. అదే విధంగా మరికొంత మంది రైతులు అశ్వారావుపేట, వినాయకపురం గ్రామాల్లో అద్దెకు ఇస్తున్న పరదాలను తీసుకొచ్చి ధాన్యం బస్తాలు, పొలాల్లో ఆరబోసిన ధాన్యం రాశులపై కప్పుతున్నారు. ఒకొక్క పరదాను వ్యాపారులు రోజుకు రూ.30 వరకు అద్దె తీసుకుంటుండటంతో రైతులపై మరింత భారం పడుతోంది. మరో వైపు నారాయణపురం, నెమలిపేట, ఊట్లపల్లి, అచ్యుతాపురంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు పేరుకుపోగా, వీటిపై కప్పేందుకు టార్ఫిలిన్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో గ్రామ సమైఖ్య సిబ్బంది సైతం వాటిని వర్షం పాలు కాకుండా చూసేందుకు ఇక్కట్ల పడాల్సి వస్తోంది. కాగా కేంద్రాలకు తీసుకొస్తున్న ధాన్యం రాశులను ఎప్పటికప్పడు రైతుల నుంచి కొనుగోలు చేసి, లారీల ద్వారా రైస్ మిల్లర్లు, గోదాంలకు తరలిస్తే ఈ సమస్య ఉండదని, కానీ అధికారులు చేస్తున్న తాత్సారం వల్ల ఇటు గ్రామ సమైఖ్య బాధ్యులు, అటు రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. పట్టాల కోసం పరుగులు చండ్రుగొండ:పెథాన్ తుపాన్ అన్నదాత గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఆరుగాలం శ్రమించి పంట చేతికొచ్చిన దశలో పెథాన్ తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షం పంటను తడిపేస్తుంది. మండలంలోని దామరచర్లలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సుమారు 20 వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉన్నాయి. కాంటాలు కాకపోవడంతో ధాన్యం రాసులుగా పడి ఉన్నాయి. వర్షం నుంచి పంటను కాపాడుకునేందుకు పట్టాల కోసం రైతులు పరుగులు తీశారు. కిరాయి పట్టాలు సరిపడక పోవడంతో కొత్త పట్టాలు కొనుగోలు చేశారు. పట్టాల కొనుగోళ్ళు రైతులకు ఆర్థికంగా అదనపు భారంగా పరిణమించింది. పట్టాలు ఏర్పాటు చేసినప్పటికీ ధాన్యం తడుస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తడిచిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. మండలంలో చిరు జల్లులు అన్నపురెడ్డిపల్లి: పెధాయ్ తుపాన్ ప్రభావంతో మండలంలోని అన్నపురెడ్డిపల్లి, ఎర్రగుంట, పెంట్లం, అబ్బుగూడెం, మర్రిగూడెం, రాజాపురం, జానికీపురంలో ఆదివారం ఉదయం నుంచి చిరుజల్లులు పడాయి. మండల పరిధిలోని గుంపెన సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులు తాము విక్రయించిన ధాన్యం తడవకుండా బస్తాలపై పరదాలు కప్పి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. వర్షం కారణంగా చలిప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వణికిస్తున్న తుఫాను దమ్మపేట: పెథాన్ తుపాను ముంచుకొస్తుందని తెలుసుకుని రైతుల్లో వణుకుపుడుతోంది. ఆదివారం ఉదయం నుంచి మబ్బులు, చల్లటి గాలుల నడుమ చిరుజ్లులు పడ్డాయి. దీంతో పొలం పనుల్లో రైతులు శ్రమిస్తుండగా పడిన జల్లులతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కోసిన వరి పంటను సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లలో ఉన్నారు. ఇప్పుడు తుపాను విరుచుకు పడితే కోలుకోలేమని, ఎవరు ఎంత సాయం చేసినా తమను కష్టాల నుంచి గట్టెక్కించలేరన్న ఆందోళన రైతుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. -
పెథాయ్ బెంగ
ఖమ్మం, వ్యవసాయం: ‘పెథాయ్’ తుపాను నేపథ్యంలో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేతికందే దశలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన వివిధ రకాల పంటలపై తుపాను ప్రభావం ఉంటుందేమోనన్న గుబులు రైతుల్లో రేకెత్తుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం చోటు చేసుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నుంచి అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు వరంగల్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చూస్తుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఈ పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర వాతావరణ శాఖ కూడా ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని ఈదురు గాలులు వీస్తున్నాయి. జిల్లాకు సరిహద్దులో ఉన్న మహబూబాబాద్, బయ్యారంలో శుక్రవారం వర్షం కురిసింది. ప్రస్తుతం ఖరీఫ్లో సాగు చేసిన వివిధ రకాల పంటలు చేతికందే దశలో ఉన్నాయి. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో ప్రధానంగా సాగు చేస్తున్న వరి పంటను కోస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పంటను కోసి ధాన్యాన్ని తయారు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తరలించారు. కొందరు రైతులు ధాన్యాన్ని కల్లాల్లో ఆరబెడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఎటువంటి రక్షణ లేదు. వర్షం వస్తే కేంద్రాల్లో రాశులుగా పోసిన ధాన్యం తడిసే పరిస్థితి నెలకొంది. వరి పండించిన ప్రాంతాల్లో ఎటువంటి షెడ్లు, గోదాములు లేని ఆరుబయట ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 10 రోజలుగా రైతులు వరికోతలు, విక్రయాల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ ఏడాది ఖమ్మం జిల్లాకు ప్రధాన నీటి వనరైన నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి నీరు చేరటంతో ఖరీఫ్లో సాధారణానికి మించి వరిని సాగు చేశారు. ఈ జిల్లాలో సుమారు 1.75 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కూడా వివిధ జలాశయాలు, ప్రాజెక్టుల పరిధిలో సుమారు లక్ష ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఈ పంట మొత్తం కూడా కోత, కల్లాల్లో ఆరబోసి, కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంది. ఇక ఉమ్మడి జిల్లాల్లో మరో ప్రధాన పంట పత్తి. ఈ పంట రెండో తీత దశలో ఉంది. అక్కడక్కడ రైతులు పత్తి తీసే పనిలో ఉన్నారు. ఈ పంటను కూడా రెండు జిల్లాల్లో దాదాపు 4 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మరో ప్రధాన పంట మిర్చి. ఈ పంట తొలికోత సాగుతోంది. ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 70 వేల ఎకరాల్లో మిర్చిని సాగు చేస్తున్నారు. తుఫాను ప్రభావం ఈ మూడు రకాల పంటలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాకు సరిహద్దుగా ఉన్న కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం కేంద్రంగా తుపాను ప్రభావం కోస్తాంద్రలో బాగా ఉంది. ఇటీవల ఏర్పడిన తత్లీ తుపాను మాదిరిగానే ప్రస్తుతం ఏర్పడిన తుపాను ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తత్లీ ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకులం జిల్లాలో తీరని నష్టం వాటిల్లింది. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు ∙వరి కోత దశలో ఉంది. ఈ కోతలను నిలుపు చేయాలి. కల్లాల్లో ఉన్న ధాన్యం రాశులపై, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న రాశులపై టార్పాలిన్లను కప్పి రక్షణ కల్పించాలి. ∙రెండు మూడు రోజుల పాటు వర్షం కురిస్తే తీతదశలో ఉన్న పత్తికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దూదిలో ఉన్న గింజ మొలకెత్తే అవకాశం ఉంది. దీంతో దూది పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. ∙మిర్చి కూడా తొలి కోతలో ఉంది. ఈ పంటకు కాయకుళ్లు తెగులు సోకే ప్రమాదం ఉంది. ∙కంది కూడా కోత దశలో ఉంది. ఈ పంటపై కూడా వర్షం ప్రభావం ఉంటుంది. ఈ పంట కోతను కూడా నిలిపివేయాలి. మూడు రోజులపాటు ప్రభావం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏర్పడిన తుపాను ప్రభావం 16,17,18 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతంలో తుపాను కారణంగా ఈదురు గాలులతో పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ తుపాను ప్రభావం ఉంది. ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలి. - బాలాజీ నాయక్, సీనియర్ సైంటిస్ట్, వ్యవసాయ, వాతావరణ పరిశోధన కేంద్రం, హైదరాబాద్ -
వ్యవసాయ రుణాల లక్ష్యం పూర్తిచేయాలి
మంచిర్యాలసిటీ : మంచిర్యాల జిల్లాకు కేటాయించిన రైతుల రుణాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. గురువారం ఆయన తన కార్యాలయంలో లీడ్బ్యాంక్ మేనేజర్లు, స్వయం సహాయక బృందాలు, ఎంపీడీవో, ఏపీఎంలు, డీఆర్డీఏ, సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని చేరుకునేందుకు బ్యాంక్, వ్యవసాయశాఖ, సంక్షేమ శాఖ, అధికారులు సమన్వయంతో కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యాంకు ఖాతాదారులకు ఆధార్ అనుసంధానం జిల్లాలో 87.84 శాతం పూర్తయ్యిందన్నారు. బ్యాంకుల వారీగా అనుసంధానం వందశాతం పూర్తి చేయాలన్నారు. ప్రధానమంత్రి యోజన పథకం, సురక్ష భీమా యోజన పథకాలను ప్రజల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మండల స్థాయిలో ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్, ఆశ, ఏఎన్ఎంలు ప్రధానమంత్రి యోజన పథకం లక్ష్యాన్ని పూర్తి చేయాలి. బ్యాంకు అధికారులు ఉపాధిహామీ పథకం కూలీలకు జీరో అకౌంట్తోనే వారి వేతనాలను చెల్లించాలని కోరారు. జిల్లాలోని 23 బ్యాంక్లతో 105 శాఖల ద్వారా 2017–18లో 88.12 ఆతం సిడీఓ రుణాలు అందించడం జరిగిందన్నారు. పంట రుణాల లక్ష్యం రూ:1,22,719.38 లక్షలకుగాను రూ: 75,595,44 పంపిణీ చేశామన్నారు. అదే విధంగా వ్యవసాయ రుణాలు 53.82 శాతం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 46.32 శాతం రుణాలు ఇచ్చామని కలెక్టర్ వివరించారు. నాబార్డు ద్వారా డైరీ, కూరగాయల పంట అభివృద్ధికి రుణాలు ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. సమావేశంలో ఆర్బీఐ ఎల్డీఓ అనిల్కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ హెచ్ రాజు, ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం జయచంద్రన్, ఆర్ఎం వెంకటకుమార్ పాల్గొన్నారు. -
మొలకలోనే మునక..
మొలకెత్తని సబ్సిడీ విత్తనాలు తిప్పి పంపిన వ్యవసాయాధికారులు బయట మార్కెట్ను ఆశ్రయించిన అన్నదాతలు రూ.8.25కోట్ల సబ్సిడీ హుళక్కే పట్టించుకోని ప్రభుత్వం ’వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం.. అన్నదాతకు దన్నుగా నిలుస్తున్నాం’ అంటూ గొప్పలు పోతున్న ప్రభుత్వం జిల్లాలోని రైతులకు సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయడంలోనూ విఫలమైంది. ఫలితంగా మొలక దశలోనే రైతులు మునిగిపోయే దుస్థితి దాపురించింది. సబ్సిడీపై ఏపీ సీడ్స్ సరఫరా చేసిన విత్తనాలు ప్రయోగ దశలోనే మొలకెత్తకపోవడంతో వ్యవసాయాధికారులు తిప్పి పంపారు. దీంతో రైతులు జిల్లావ్యాప్తంగా రూ.8.25కోట్ల సబ్సిడీని కోల్పోవడంతోపాటు బయట మార్కెట్లో అధిక ధరకు విత్తనాలు కొనక తప్పలేదు. పాలకొల్లు టౌన్: జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్లో సుమారు 5.50లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. డెల్టాలో 3.70 లక్షల ఎకరాల్లో రైతులు సాగుబాట పట్టారు. వీరికి సబ్సిడీపై సర్కారు విత్తనాలు సరఫరా చేయాల్సి ఉంది. దీనికోసం వ్యవసాయ ఉన్నతాధికారులు ఏపీ సీడ్స్, ఇతర కంపెనీల ద్వారా విత్తనాలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. ఏపీ సీడ్స్ ద్వారా జూన్ రెండో వారంలోనే జిల్లాకు విత్తనాలు సరఫరా అయ్యాయి. ఎకరానికి 30కిలోల చొప్పున విత్తనాలు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. కిలోకు రూ.5ను సబ్సిడీగా ప్రకటించారు. ఈ లెక్కన 30 కిలోల బస్తాకు రూ.150 సబ్సిడీగా లభిస్తుంది. దీనిప్రకారం.. జిల్లాలోని 5.50లక్షల ఎకరాలకు విత్తనాలు సరఫరా చేస్తే రూ.8.25కోట్లు సబ్సిడీ రైతులకు అందుతుంది. విత్తనాలు మొలకెత్తలేదు అయితే ఏపీ సీడ్స్ నుంచి జిల్లాకు వచ్చిన విత్తనాలను వ్యవసాయాధికారులు ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అవి మొలకెత్తకపోవడంతో చాలాచోట్ల తిప్పి పంపారు. ఒకటి, రెండు చోట్ల సరఫరా ఓ టన్ను సరఫరా చేసినా.. అవి మొలకెత్తలేదు. ఫలితంగా విత్తనాలు అందక పోవడంతో రైతులు బయట మార్కెట్ను ఆశ్రయించారు. అధిక ధరలకు విత్తనాలు కొన్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా సుమారు రూ.8.25కోట్ల సబ్సిడీని రైతులు కోల్పోయినట్టయింది. ఇవిగో ఆధారాలు డెల్టాలోని పాలకొల్లు వ్యవసాయ అధికారులు ఖరీఫ్లో అనువుగా ఉండే ఎంటీయూ 1061, ఎంటీయూ 1064, ఎంటీయూ 1075 రకాలను ఐదు టన్నులను ఏపీ సీడ్స్ నుంచి తెప్పించారు. ముందు జాగ్రత్తగా వాటిని మొలక కట్టారు. అవి సరిగా మొలకెత్తకపోవడంతో తిప్పి పంపారు. యలమంచిలి మండలంలోనూ శిరగాలపల్లి సొసైటీ ద్వారా ఏపీ సీడ్స్ నుంచి ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 విత్తనాలు ఐదు టన్నులు రప్పించారు. అయితే అక్కడ కూడా విత్తనాలు మొలక రాకపోవడంతో వ్యవసాయాధికారులు సూచనల మేరకు సొసైటీ తిరిగి పంపించింది. భీమవరం వ్యవసాయాధికారులు మాత్రం సబ్సిడీపై వరి విత్తనాలను తెప్పించలేదు. నరసాపురం వ్యవసాయాధికారులకు ఆరు టన్నుల విత్తనాలు సరఫరా అయ్యాయి. వీటిలో ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 ఉన్నాయి. ఒక టన్ను విత్తనాలను మాత్రం ఇక్కడి అధికారులు రైతులకు సరఫరా చేశారు. అవి మొలకెత్తకపోవడంతో మిగిలిన ఐదు టన్నులను వెనకకు పంపినట్టు సమాచారం. తాడేపల్లిగూడెం డివిజన్లో మెట్ట ప్రాంతాల రైతులు బోర్లపై ముందుగా నారుమడులు వేస్తారు. అయితే ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాల పంపిణీకి జూన్ మొదటివారంలో అనుమతి ఇవ్వడంతో ఆ ప్రాంతాల రైతులకు అవి అందలేదు. దీంతో మిగిలిన రైతుల కోసం అక్కడి అధికారులు సబ్సిడీ విత్తనాలను తెప్పించలేదు. ఈ లెక్కల ప్రకారం జిల్లాలో 4లక్షల మంది సన్న, చిన్నకారు రైతులకు ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు అందలేదు. అధిక ధరలకు కొన్నాం ప్రభుత్వం సబ్సిడీపై వరి విత్తనాలు అందజేస్తామని ప్రకటించిందే తప్ప రైతులకు అందలేదు. వచ్చిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో వ్యవసాయాధికారులు తిప్పి పాపంరు. దీంతో బహిరంగ మార్కెట్లో 30కిలోల విత్తనాల ప్యాకెట్ రూ.880కు కొనుగోలు చేసి నారుమడులు పోశాం. తక్షణం అధికారులు చర్యలు తీసుకోవాలి. రేఖపల్లి సూర్యనారాయణ, రైతు, ఆగర్తిపాలెం సబ్సిడీ విత్తనాలు మొలకెత్తిలేదు రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై వరి విత్తనాలు సరఫరా చేసింది.ముందుగా ఆ విత్తనాలను మొలక కట్టాం. మొలకెత్తలేదు. దీంతో వ్యవసాయాధికారుల సూచనల మేరకు తిరిగి ఏపీ సీడ్స్కి పంపించేశాం. చిలుకూరి బాపిరాజు, సొసైటీ అధ్యక్షుడు, శిరగాలపల్లి రైతులకు సరఫరా చేయలేదు ఏపీ సీడ్స్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాలకు సబ్సిడీ విత్తనాలు పంపించాం. అయితే వ్యవసాయాధికారులు ముందుగా మొలక కట్టారు. విత్తనాలు మొలక రాకపోవడంతో రైతులకు సరఫరా చేయలేదు. వై.సాయిలక్ష్మీ ఈశ్వరి, జేడీ, వ్యవసాయ శాఖ