city buses
-
సిటీ డిపోలన్నీ ప్రైవేటుకే..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ఆర్టీసీ డీజిల్ బస్సులను నగరం వెలుపలికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించటం ఆ సంస్థ ఉద్యోగులకు ప్రాణ సంకటంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. డీజిల్ బస్సుల స్థానంలో ప్రైవేటు సంస్థలకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులను తిప్పాలని భావిస్తున్నారు. ఈ బస్సుల్లో కండక్టర్ తప్ప ఇతర సిబ్బంది అంతా సదరు సంస్థవారే ఉంటారు. దీంతో ఇప్పుడు నగరంలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బంది డీజిల్ బస్సులతోపాటే నగరం బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. సిటీ బయటకు 80 శాతం సిబ్బంది! ప్రస్తుతం నగరంలో 2,500 సిటీ బస్సులు తిరుగుతున్నా యి. విమానాశ్రయం సర్వీసులు, సిటీ సర్వీసులుగా తిరుగుతున్న కొన్ని నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు మినహా అన్నీ డీజిల్ బస్సులే. ఇటీవలే ఎలక్ట్రిక్ పాలసీలో మార్పులు తెచి్చన రాష్ట్ర ప్రభుత్వం.. నగరంలో డీజిల్ బస్సులను తిప్పొద్దని నిర్ణయించింది. వీటిని ఔటర్ రింగురోడ్డు అవ తలికి తరలించి, నగరంలో ఎలక్ట్రిక్ బస్సులనే తిప్పాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభిస్తున్న పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద ఆర్టీసీ దరఖాస్తు చేసింది. ఆ పథకం కింద దేశవ్యాప్తంగా 9 నగరాలకు 14 వేల ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అందులో 2,800 బస్సులు తమకు అందజేయాలని టీజీఆర్టీసీ కోరింది. ఈ పథకానికి సంబంధించి ఈ నెలలో లేదా వచ్చే నెలలో కేంద్రం టెండర్లు పిలవనుంది. టెండర్లు దక్కించుకునే సంస్థలు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) పద్థతిలో ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో అద్దెకు తిప్పుతాయి. ఈ బస్సుల నిర్వహణ బాధ్యత ఆయా సంస్థలదే. ఒక్క కండక్టర్ సర్వీసును మాత్రమే ఆర్టీసీ పర్యవేక్షిస్తుంది. డ్రైవర్, మెకానిక్, సెక్యూరిటీ వంటి బాధ్యతలను బస్సుల యజమానులే చూసుకొంటారు. దీంతో నగరంలోని ప్రస్తుత ఆర్టీసీ డిపోలన్నీ ప్రైవేటు బస్సులు నిలిపేందుకు కేటాయిస్తారు. రెండేళ్లలో దశలవారీగా ఈ ప్రక్రియ పూర్తిచేస్తారు. డిపోలపై అజమాయిషీ మాత్రం ఆర్టీసీదే ఉండనుంది. అంటే, డిపో మేనేజర్, సహాయ మేనేజర్, కండక్టర్లకు టికెట్ యంత్రాలు అందివ్వటం, టికెట్ల ద్వారా వచ్చే నగదును లెక్కించి బ్యాంకుల్లో జమ చేయటం వంటి బాధ్యతలు చూసే కొద్దిమంది సిబ్బంది మాత్రమే ఆర్టీసీలో ఉంటారు. డ్రైవర్లు, మెకానిక్–శ్రామిక్లు, సెక్యూరిటీ సిబ్బందిని రాష్ట్రంలోని ఇతర డిపోలకు పంపాల్సి ఉంటుంది. దీంతో నగరంలోని 80 శాతం మంది ఆర్టీసీ సిబ్బంది ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఉద్యోగాల భర్తీ కూడా ఉండదని చెబుతున్నారు. ఇది ప్రైవేటీకరణే:కార్మిక సంఘాలుఆర్టీసీ డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పగించి వాటి సిబ్బంది ఆధ్వర్యంలో బస్సులను తిప్పటమంటే అంతమేర ఆర్టీసీని ప్రైవేటీకరించినట్టేనని ఆర్టీసీలోని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని సహించేది లేదని, ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నాయి. మరో వైపు జీసీసీ పద్ధతిలో బస్సుల నిర్వహణ చేపట్టినంత మాత్రాన దాన్ని ప్రైవేటీకరించినట్టు అనటం సరికాద ని ఉన్నతాధికారులు పేర్కొంటున్నా రు. డిపోల్లోని స్థలాలను మాత్రమే ఆయా సంస్థలు బస్సులు నిలుపుకోవటం, చార్జింగ్ చేయటం, నిర్వహణ పనులకు వినియోగించుకుంటాయని చెబుతున్నారు. డిపోల అజమాయిషీ పూర్తిగా ఆర్టీసీ ఆధీనంలోనే ఉంటుందని అంటున్నారు. -
సచివాలయానికి సిటీ బస్సులు.. ప్రయాణికులకు తిప్పలు
సాక్షి, సిటీబ్యూరో: సిటీ బస్సులు సచివాలయానికి పరుగులు తీశాయి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వం వివిధ ప్రాంతాల నుంచి మహిళలను పెద్ద ఎత్తున తరలించింది. ఇందుకోసం సిటీబస్సులను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, భువనగరి, చౌటుప్పల్, సంగారెడ్డి తదితర శివారు జిల్లాలతో పాటు నగరంలోని వివిధ నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలను పెద్ద సంఖ్యలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. బస్సులన్నీ సచివాలయం కోసమే ఏర్పాటు చేయడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా సాయంత్రం విధులు ముగించుకొని ఇళ్లకు చేరుకొనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన ఉద్యోగులు, వ్యాపారులు, స్కూళ్లు, కాలేజీల నుంచి ఇళ్లకు బయలుదేరిన విద్యార్థులు గంటలతరబడి బస్సుల కోసం పడిగాపులు కాశారు. చివరకు ఆటోలు, తదితర ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లవలసి వచ్చింది. మరోవైపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. అమీర్పేట్, ఖైరతాబాద్, నెక్లెస్ రోడ్డు, లిబర్టీ, ఇందిరాపార్కు లోయర్ట్యాంక్బండ్ తదితర చోట్ల వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్లోనే ఉండాల్సి వచ్చింది. -
TSRTC: ఆర్టీసీ బస్సుల్లో సీటు బెల్టులు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా కార్లలో సీటు బెల్టులు వాడుతుంటారు. కానీ, తొలిసారి నగరంలో సీట్ బెల్టులుండే సిటీ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. విదేశాల్లో బస్సుల్లో కూడా సీటు బెల్టులు తప్పని సరి. వాస్తవానికి మన దగ్గర కూడా బస్సుల్లోనూ సీటు బెల్టులుండాలనే నిబంధ న ఉన్నా అది అమలుకావటం లేదు. తొలిసా రి ఆర్టీసీ సిటీ సర్విసుల్లో ఆ తరహా సీట్లను అందుబాటులోకి తెస్తోంది. నగరంలో మరో నెలన్నరలో అందుబాటులోకి రానున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో ఇవి కనిపించనున్నాయి. ఆ బస్సులు ఎలా ఉండనున్నాయో అధికారులు పరిశీలించేందుకు వీలుగా నమూనా బస్సును సోమవారం బస్భవన్కు తీసుకురాగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిశీలించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కారిడార్ మార్గాల్లో తిరిగేందుకు వీలుగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తిప్పాలని ఆర్టీసీ ఇటీవల నిర్ణయించింది. ఇప్పటికే పుష్పక్ పేరుతో 40 ఎలక్ట్రిక్ బస్సులు విమానాశ్రయం మార్గంలో తిరుగుతున్న విషయం తెలిసిందే. అవన్నీ లాభాల్లో ఉండటం, రద్దీకి చాలినన్ని లేకపోవటంతో అదనంగా మరిన్ని బస్సులు తిప్పాలని నిర్ణయించారు. దానితోపాటు ఐటీ కారిడార్లో మెట్రో రైలు సేవలు అందుబాటులో లేని రూట్లలో కొన్ని తిప్పనున్నారు. ప్రస్తుతం విమానాశ్రయ మార్గంలో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులతో పోలిస్తే ఆధునిక వసతులు అదనంగా ఉన్న ఈ కొత్త బస్సులు ప్రయాణికులకు మెరుగైన రవాణా వసతిని అందించనున్నాయి. 500 బస్సులకు ఆర్డర్ 500 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నగరంలో తిప్పాలని నిర్ణయించిన ఆరీ్టసీ, ఇప్పటికే ఆర్డర్ ఇచి్చన విషయం తెలిసిందే. సిటీ బస్సులుగా తిప్పే సర్విసులకు సంబంధించి తొలి విడతలో 50 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అందులో 20 శంషాబాద్ విమానాశ్రయానికి, 30 ఐటీ కారిడార్లో తిరుగుతాయి. ఇందులో 25 బస్సులు నెలనెలన్నరలో రోడ్డెక్కుతాయని అధికారులు అంటున్నారు. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్దతిలో వీటిని ఆర్టీసీ అద్దెకు తీసుకుంటోంది. ఇవి కాకుండా మరో 800 ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా సమకూర్చుకోవాలనేది ఆర్టీసీ ఆలోచన. వాటికి ఇంకా టెండర్లు పిలవలేదు. ఆకుపచ్చ, తెలుపు రంగుతో.. ఆకుపచ్చ, తెలుపు రంగుతో ఈ బస్సులుంటాయి. రంగుల మేళవింపుపై ఎండీ సంతృప్తి వ్యక్తం చేశారు. బస్సు ముందువైపు ఆర్టీసీ లోగో లేకపోవటాన్ని ప్రశ్నించిన ఆయన, ప్రయాణికులకు కనిపించేలా లోగో ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్ని సీట్లకే బెల్టులుండటంతో, అన్ని సీట్లకు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఓఓ రవీందర్, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్, ఒలెక్ట్రా కంపెనీ ప్రతినిధులు వేణుగోపాలరావు, ఆనంద్, యతీశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 12 మీటర్ల పొడవు.. ఇప్పుడు కొత్తగా సమకూరే ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు 12 మీటర్ల పొడవుతో ఉంటాయి. ఒక్కో బస్సులో 35 సీట్లుంటాయి.ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సాకెట్ అందుబాటులో ఉంటుంది. బస్సుల్లో మూడు సీసీ టీవీ కెమెరాలు అమర్చి ఉంటాయి. అవి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్తో ఉంటాయి. రివర్స్ చేసేప్పుడు డ్రైవర్కు వెనక భాగం కనిపించేలా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. ప్రయాణికులకు సూచనలు అందజేసేందుకు వీలుగా బస్సులో నాలుగు ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులుంటాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు వీలుగా బస్సులో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం ఉంటుంది. వెహికిల్ ట్రాకింగ్ సిస్టం కూడా ఉంటుంది. ఒకసారి ఫుల్ చార్జి అయితే 225 కి.మీ. దూరం వరకు ప్రయాణిస్తాయి. ఫుల్ చార్జింగ్కు దాదాపు 3 గంటల సమయం పడుతుంది. -
ఒకే టికెట్తో సిటీ బస్, మెట్రో, రైలులో ప్రయాణం.. ఎక్కడంటే!
సాక్షి, చెన్నై: రాజధాని నగరం చెన్నై రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇక్కడికి రోజూ లక్షలాది మంది వచ్చివెళ్తుంటారు. ఇక 2026లో చెన్నై సరిహద్దులు పూర్తిగా మారిపోనున్నాయి. కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాలు, రాణిపేట జిల్లా పరిధిలోని అరక్కోణం వరకు 1,225 గ్రామాలు, ప్రాంతాలు చెన్నై మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలోకి రానున్నాయి. ఇది వరకు నగరం, సబర్బన్ ప్రాంతాలు 1,189 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉండగా.. సరిహద్దు మార్పుతో అది ఏకంగా 5,904 చదరపు కిలోటమీటర్లకు చేరనుంది. కొత్తగా చెన్నై నగర సరిహద్దు చెంగల్పట్టు జిల్లా అచ్చరపాక్కం వరకు, రాణి పేట జిల్లా అరక్కోణం వరకు ఉండనుంది. ఈ విస్తరణ నేపథ్యంలో చెన్నై మహా మహా నగరంలో రవాణా వ్యవస్థను పటిష్టం చేయడమే కాకుండా ఒకే గూటి కిందికి తెచ్చేందుకు డీఎంకే ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. సీఎండీఏ చుట్టూ రవాణా.. ప్రధాన రవాణా వ్యవస్థలుగా చెంగల్పట్టు నుంచి బీచ్ వరకు, సెంట్రల్ నుంచి అరర్కోణం , గుమ్మిండి పూండి వైపుగా ఎలక్ట్రిక్ రైలు సేవలు, బీచ్ నుంచి వేళచ్చేరి వరకు ఎంఆర్టీఎస్ రైలు సేవలు చెన్నైలో ఇప్పటికే ఉన్నాయి. ఇటీవల విమానాశ్రయం నుంచి కోయంబేడు – సెంట్రల్ మీదుగా విమ్కో నగర్కు ఓ మార్గం, సెయింట్ థామస్ మౌంట్ నుంచి ఆలందూరు మీదుగా అన్నా సాలై వైపుగా సెంట్రల్కు మారో మార్గంలో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో ఎంఆర్టీఎస్ సేవలు మరికొన్ని నెలల్లో వేళచ్చేరి నుంచి సెయింట్ థామస్ మౌంట్ వరకు విస్తరించనున్నాయి. అలాగే మెట్రో సేవలు చెన్నై నగర శివారుల్లో ఓ వైపు కీలాంబాక్కం వరకు, మరోవైపు సిరుచ్చేరి వరకు, ఇంకో వైపు మాధవరం వరకు విస్తరించనున్నాయి. ఈ నగరానికి నలుదిశల్లో మెట్రో ప్రయాణమే కాకుండా అన్ని రకాల రవాణా వ్యవస్థను సులభతరం చేయనున్నారు. ఇందుకోసం కంబైన్డ్ ట్రాన్స్పోర్టు అథారిటీ రంగంలోకి దిగింది. మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్లను ఏకీకృతం చేయడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేసింది. 2024లో అందుబాటులోకి.. ఒకే గూటి కిందికి అన్ని రకాల రవాణా సేవలను తీసుకొచ్చేందుకు కంబైన్డ్ ట్రాన్స్పోర్టు అథారిటీ వేగవంతం చేసింది. ఒకే టికెట్టుతో పైన అన్ని రకాల రవాణా సేవలను ప్రజలు పొందేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆయా మార్గాలను ఏకం చేయడం, రైల్వేతో అనుసంధానించడం, బస్టాండ్ల ఏర్పాట్లు, ప్రయాణికులకు రవాణా మార్గాలను సులభతరం చేయడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్ను సిద్ధం చేస్తున్నారు. తద్వారా ప్రయాణ టికెట్ పొందేందుకు వీలుగా రూట్ మ్యాప్తో పాటు అన్ని రకాల రవాణా సమాచారం, సమయం తదితర వివరాలను ప్రత్యేకంగా ప్రయాణికులకు తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ యాప్లో ప్రయాణంలో బయలుదేరే ప్రాంతం, సమయం, చేరవలసిన ప్రాంతం గురించి వివరాలను, మధ్యలో ఉన్న అన్ని రకాల రవాణాలకు సంబంధించిన స్టేషన్లు, స్టాపింగ్ల సమాచారం ఉంటుంది. చేరవలసిన రూట్ మ్యాప్ ఆధారంగా వివరాలను నమోదు చేసిన పక్షంలో చార్జీ మొత్తం వివరాలు యాప్ ద్వారా తెలుసుకుని ఆన్లైన్ నగదు బదిలీకి అవకాశం కల్పిస్తున్నారు. ఒకే టికెట్టు ద్వారా అన్ని రకాల రవాణా సేవలను 2024 జనవరిలో అమల్లోకి తెచ్చే విధంగా ఆ అథారిటీ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. -
ప్రయాణికుల ఆనందమే లక్ష్యం.. సిటీ బస్సుల్లో 'టీఎస్ఆర్టీసీ రేడియో’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ప్రయాణికులకు మరింతగా చేరువ అయ్యేందుకు కొత్త ఆలోచనలతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే ప్రయాణికుల ప్రయాణం వినోదాత్మకంగా, సంతోషంగా కొనసాగేందుకు బస్సుల్లో ‘టీఎస్ఆర్టీసీ రేడియో’ను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దానిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన తర్వాత.. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ సిటీలోని 9 ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో ఈ రేడియోను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్లోని బస్ భవన్లో కూకట్పల్లి డిపోకు చెందిన బస్సులో ఈ రేడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శనివారం ప్రారంభించారు. అనంతరం రేడియో పనితీరును పరిశీలించారు. రేడియో ఏర్పాటు, పనిచేస్తున్న విధానం, సౌండ్, తదితర విషయాల గురించి టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) పీవీ మునిశేఖర్, కూకట్పల్లి డిపో మేనేజర్ ఇషాక్ బిన్ మహ్మద్, మెకానికల్ సూపరింటెండెంట్ జయరాం, ఎలక్ట్రిషియన్ కేవీఎస్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. కాగా, పైలట్ ప్రాజెక్టుగా 9 సిటీ బస్సుల్లో ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ రేడియో ప్రయాణీకులను అలరించనుందని సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉప్పల్-సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్-సికింద్రాబాద్, గచ్చిబౌలి-మెహిదీపట్నం, సికింద్రాబాద్-పటాన్చెరువు, కూకట్పల్లి-శంకర్పల్లి, కొండాపూర్-సికింద్రాబాద్, కోఠి-పటాన్చెరువు, ఇబ్రహీంపట్నం-జేబీఎస్ మార్గాల్లో నడిచే బస్సుల్లో ఈ రేడియోను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయా బస్సుల్లో శనివారం నుంచే రేడియో సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఈ రేడియోలో మంచి పాటలతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను, టీఎస్ఆర్టీసీ అందిస్తోన్న సేవలను ప్రయాణికులకు వివరిస్తున్నామని పేర్కొన్నారు. మానవ సంబంధాల ప్రాముఖ్యత, నైతిక విలువలను పెంపొందించే నీతి కథలను ఈ రేడియోలో అందుబాటులో ఉంచామని వివరించారు. అలాగే, ఈ రేడియో ద్వారా మహిళల, పిల్లల భద్రత, సైబర్, ఆర్థిక నేరాలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రయాణికులకు వినోదం అందించడంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు వివరించారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్బ్యాక్.. ప్రయాణికుల అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత.. పూర్తిస్థాయిలో అన్ని బస్సుల్లోనూ రేడియోను అందుబాటులోకి తీసుకురావాలని యాజమాన్యం భావిస్తుందని సజ్జనార్ వెల్లడించారు. ప్రయాణికుల అభిప్రాయాల స్వీకరణకు 9 బస్సుల్లో క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఆ క్యూఆర్ కోడ్ను స్మార్ట్ ఫోన్లో స్కాన్ చేసి.. రేడియోపై ఫీడ్బ్యాక్ను ప్రయాణికులు ఇవ్వాలని సూచించారు. టీఎస్ఆర్టీసీ తీసుకువచ్చిన ఎన్నో కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వదించారని, ఈ సరికొత్త విధానాన్ని కూడా ప్రోత్సహించాలని కోరారు. TSRTC launched a pilot project of radio services in 9 city buses in Hyderabad. It was inaugurated by our MD Sri V.C. Sajjanar, IPS, along with the Executive Director (Operations), Sri P.V.Munishekar. Passengers can share their valuable feedback by scanning the QR codes. pic.twitter.com/RD5ddzQkEr — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 28, 2023 -
TSRTC: నష్టాల సాకు.. బస్సులకు బ్రేకు
సాక్షి, హైదరాబాద్: ప్రగతి రథచక్రం ప్రజారవాణా నుంచి మెల్లగా తప్పుకుంటోంది. నష్టాల సాకుతో బస్సు సర్వీసులకు కోత పెడుతూ ‘సిటీ’జనులను ప్రత్యామ్నాయ రవాణా మార్గాల వైపు మళ్లేలా చేస్తోంది. దేశవ్యాప్తంగా మహానగరాల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను ఆయా రాష్ట్రాల రవాణా సంస్థలు పెంచుతుండగా.. మన గ్రేటర్లో మాత్రం బస్సుల సంఖ్య దాదాపు సగానికి తగ్గిపోయింది. సామర్థ్యానికి మించి రాకపోకలు సాగించిన బస్సులను ఫిట్నెస్లేమి కారణంగా తుక్కుకు పంపిస్తుండగా.. వాటి స్థానాన్ని భర్తీ చేసేందుకు సరిపడా బస్సులను రోడ్డెక్కించడంలో ఆర్టీసీ విఫలమవుతోంది. దీనికి సంస్థ ఆర్థిక నష్టాలే ప్రధాన కారణం. దీంతో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేయడం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంస్థకు భారంగా పరిణమించింది. ఆక్యుపెన్సీ బాగా ఉన్నా.. ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తున్న రూట్లలోనూ బస్సుల సంఖ్య పెంచుకోకపోవడానికి ఇది ప్రధాన అడ్డంకిగా మారింది. కేవలం 2,550 బస్సులే.. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు జనాభా 1.30 కోట్లు. ఆ నగరంలో సిటీ బస్సుల సంఖ్య 6 వేలు. మరో 2,500 బస్సులను కొనేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. అదే కోటి జనాభా దాటిన మన భాగ్యనగరంలో బస్సుల సంఖ్య ఎంతో తెలుసా? కేవలం 2,550 మాత్రమే. ఐదేళ్లలో హైదరాబాద్లో సిటీ బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అదే సమయంలో బెంగళూరు సహా ముంబై, ఢిల్లీ నగరాల్లో బస్సుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. మెట్రో నగరాల్లో ప్రజారవాణా సేవలను విస్తరించేందుకు ఆయా రవాణా సంస్థ ప్రత్యేకకార్యాచరణను అమలు చేస్తున్నాయి. శివార్లకు బస్సుల సంఖ్య పెంచడం, విమాన, రైల్వేస్టేషన్లకు బస్సులను అనుసంధానించడం ద్వారా రవాణా సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి. అదే మన గ్రేటర్లో మాత్రం సిటీ బస్సుల సంఖ్య తగ్గి వ్యక్తిగత వాహనాలు భారీగా పెరిగాయి. మెట్రో, ఎంఎంటీఎస్, సిటీ బస్సుల మధ్య అనుసంధానత లేకపోవడంతో నగరవాసులు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో సుమారు 74 లక్షల సొంత వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. పడిపోయిన ప్రజా రవాణా... రవాణారంగ నిపుణుల అంచనాల ప్రకారం 2015 నాటికే హైదరాబాద్ నగరానికి కనీసం 6 వేల బస్సులు అవసరం. కానీ 2013 నుంచి ఇప్పటివరకు కేవలం 80 ఏసీ బస్సులు మాత్రమే కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. అప్పటివరకు ఉన్న 3,850 బస్సులలో 850 బస్సులను కార్గో వాహనాలుగా మార్చారు. మరికొన్నింటికి కాలం చెల్లిపోవడంతో తుక్కుగా మార్చారు. వాటి స్థానంలో ఒక్క నయా బస్సు కూడా అందుబాటులోకి రాలేదు. మూడేళ్ల క్రితం వరకు రోజుకు 42 వేల ట్రిప్పుల చొప్పున సుమారు 9 లక్షల కిలోమీటర్ల పైచిలుకు తిరిగిన బస్సులు ఇప్పుడు 30 వేల ట్రిప్పులు కూడా తిరగడం లేదు. హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ ప్రవేశపెట్టాలని భావించినా నిధుల్లేమి కారణంగా ఆ ప్రతిపాదనను ఆర్టీసీ విరమించుకుంది. అయితే హెచ్ఎండీఏ సాయంతో బస్సులను ప్రవేశపెట్టే దిశగా ఏడాదిగా ఆలోచన చేస్తున్నా కార్యరూపం దాల్చలేదు. అదే ముంబైలో మాత్రం విద్యుత్తో నడిచే డబుల్ డెక్కర్ బస్సుల ప్రవేశానికి ఆ నగర రవాణా సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. మెట్రో నగరాల్లో ఇలా ►సుమారు 3.2 కోట్ల జనాభా కలిగిన ఢిల్లీలో మెట్రో రైలు సదుపాయాలను గణనీయంగా విస్తరించారు. మరోవైపు ప్రస్తుతం అక్కడ నడుస్తున్న 6,000కుపైగా సిటీ సీఎన్జీ బస్సుల స్థానంలో 2025 నాటికి పూర్తిగా విద్యుత్ ఆధారిత ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టారు. ►సుమారు 2.09 కోట్ల జనాభా కలిగిన ముంబై నగరంలో ప్రతిరోజూ 600కు పైగా లోకల్ రైళ్లు తిరుగుతున్నాయి. 4,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం 2,500 బస్సులకు ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే 300 బస్సులు బృహన్ ముంబై విద్యుత్ సరఫరా, రవాణా (బెస్ట్)కు చేరాయి. మరో 100 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ►బెంగళూరు మహానగరంలో 6,000 ఏసీ బస్సులు తిరుగుతున్నాయి. ప్రయాణికుల రద్దీ మేరకు మరో 2,500 బస్సులను కొత్తగా కొనుగోలు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. దశలవారీగా 12,000 బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. విఫలమైన కనెక్టివిటీ ప్రపంచంలోని ఏ నగరంలోనైనా వివిధ రకాల ప్రజారవాణా వాహనాల మధ్య పటిష్టమైన కనెక్టివిటీ ఉంటుంది. లండన్ మహానగరంలో సుమారు 19,000 బస్సులతో రైల్వే వ్యవస్థకు కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి ప్రజారవాణాపై సమగ్ర సమీక్ష నిర్వహించి సదుపాయాలను విస్తరిస్తారు. హైదరాబాద్లో నాలుగు మార్గాల్లో మెట్రో రైళ్లు, ఫలక్నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి వంటి రద్దీ రూట్లలో ఎంఎంటీఎస్ అందుబాటులో ఉన్నా సిటీ బస్సులతో కనెక్టివిటీ లేదు. హైదరాబాద్ మహానగరం ఇప్పుడు 7 జిల్లాల పరిధిలో విస్తరించింది. నగర శివార్ల నుంచి నగరంలోని ప్రధాన మార్గాలను అనుసంధానిస్తూ సర్వీసులనునడపాలనే ప్రజల డిమాండ్ మేరకు బస్సులు లేకపోవడం గమనార్హం. -
ఆర్టీసీ బస్సులో మహిళలతో కండక్టర్ అసభ్యకర ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో రంగంలోకి దిగిన షీ టీమ్స్.. అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఘటన నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నగరంలోని సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఓ మహిళా ప్రయాణికురాలితో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సయీద్ అమీన్(40) బస్సులో మహిళా ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. బస్సు టికెట్స్ ఇచ్చే క్రమంలో మహిళా ప్రయాణీకులను తాకరాని చోట తాకుటుండటంతో వారు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళా ప్రయాణీకురాలు ధైర్యం చేసి నాచారాం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ విషయాన్ని టీ షీమ్స్ దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన షీ టీమ్స్.. బస్సులో నిఘా ఉంచి కండక్టర్ అమీన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. ఇలా చేస్తాడని ఎవరు అనుకోరు -
హైదరాబాద్: చార్జీలు సరే.. బస్సేదీ!
సాక్షి, హైదరాబాద్: టికెట్ ధరల్లో రౌండప్ పేరిట, డీజిల్ సెస్ పేరుతో భారీగా చార్జీలు పెంచిన ఆర్టీసీ తాజాగా విద్యార్థులను సైతం వదిలిపెట్టకుండా పాస్లపై మోత మోగించింది. చార్జీలను రెండింతలు చేసింది. ప్రయాణికుల రద్దీ, వివిధ ప్రాంతాల్లో ఉన్న డిమాండ్కు సరిపడా బస్సులు మాత్రం ఏర్పాటు చేయలేకపోతోంది. నగర శివారు ప్రాంతాల్లోని వందలాది కాలనీలు, బస్తీలకు తగినన్ని బస్సుల్లేవు. ఆర్టీసీ పెంచిన చార్జీలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా బస్సులు అందుబాటులో లేకపోవంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఉదయం, సాయంత్రం విద్యార్థుల రద్దీ మేరకు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ రూపొందించకపోవడం విడ్డూరం. సకాలంలో బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సివస్తోంది. కొరత.. తీరని వ్యధ.. ∙కీసర, రాంలింగంపల్లి, తూముకుంట, బండకాడిపల్లి, ఉషారుపల్లి, ఉద్దమర్రి తదితర ప్రాంతాల నుంచి ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులు ఈసీఐఎల్, కుషాయిగూడ, సైనిక్పురి, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలకు వెళ్తుంటారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఘట్కేసర్, కీసర వైపు ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలకు వేలాది మంది విద్యార్థులు ప్రతి రోజు రాకపోకలు సాగిస్తారు. ఈసీఐఎల్ నుంచి ఉషారుపల్లి, ఉద్దమర్రి, బండకాడిపల్లి తదితర గ్రామాలకు బస్సులు పెంచాలని ఏడాదిగా స్థానికులు ఆర్టీసీని కోరుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ రూట్లో బస్సుల సంఖ్య పెరగలేదు. దీంతో విద్యార్ధులు, కూరగాయల రైతులు, పాల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగర శివార్లలోని అనేక ప్రాంతాల్లోనూ విద్యార్ధులు, స్థానికుల డిమాండ్ మేరకు సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో రోజుకు 6 ట్రిప్పులు తిరిగిన రూట్లలో ఇప్పుడు మూడు ట్రిప్పులే నడుస్తున్నాయి. 4 ట్రిప్పులను రెండింటికి కుదించారు. గ్రేటర్లో బస్సుల సంఖ్య భారీగా తగ్గడమే ఇందుకు కారణం. గతంలో 3850 బస్సులు ఉంటే ఇప్పుడు 2550 మాత్రమే తిరుగుతున్నాయి. ట్రిప్పుల సంఖ్య గణనీయంగా తగ్గింది. విద్యా సంస్థలు తెరిస్తే కష్టమే... నగర శివార్లలోని ప్రాంతాల్లోని కళాశాలల్లో సుమారు 7 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వివిధ మార్గాల్లో ప్రతి రోజు 1500 బస్సులు నడుస్తున్నట్లు అంచనా. కానీ సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులకు రవాణా సదుపాయాన్నందజేసే ఈ బస్సుల్లో విద్యార్థులు ఫుట్బోర్డు ప్రయాణం చేస్తున్నారు. అమ్మాయిలకు బస్సు ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. -
డబుల్’ ధమాకా! టికెట్ పైనే రెండు గంటలు ఉచిత ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: పుష్పక్ బస్సుల్లో ఎయిర్పోర్టు నుంచి నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు డబుల్ ధమాకా. ఎయిర్పోర్టు నుంచి పుష్పక్లో టికెట్ తీసుకున్నప్పటి నుంచి రెండు గంటల పాటు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రమయానికి నడిచే పుష్పక్ బస్సుల్లో ప్రయాణికుల భర్తీ సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు ఆర్టీసీ వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టింది. మరో వారం, పది రోజుల్లో ఇది అందుబాటులోకి రానుంది. విమానాశ్రయం నుంచి పుష్పక్లో వచ్చే ప్రయాణికులు తీసుకొనే టికెట్లపైనే ఈ రెండు గంటల ఉచిత ప్రయాణం నమోదై ఉంటుంది. ఎయిర్పోర్టు ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన రవాణా సదుపాయాన్ని అందజేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందిస్తోంది. ఠంచన్గా పుష్పక్... ప్రస్తుతం 39 పుష్పక్ బస్సులు నగరంలోని జేఎన్టీయూ, పర్యాటక భవన్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల నుంచి వివిధ మార్గాల్లో ఎయిర్పోర్టు వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికుల అవసరాలకనుగుణంగా ఈ బస్సులు 24 గంటల పాటు అందుబాటులో ఉండేవిధంగా నడుపుతున్నారు. ఎయిర్పోర్టు నుంచి తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. 70శాతం ఆక్యుపెన్సీతో బస్సులు నడుస్తున్నాయి. కానీ నగరం నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లే సమయంలోనే 25 నుంచి 30 శాతం వరకే ఆక్యుపెన్సీ నమోదవుతోంది. ఫ్లైట్ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది ప్రయాణికులు ఎయిర్పోర్టుకు వెళ్లేటప్పుడు క్యాబ్లు, ఇతర వాహనాల్లో వెళ్తున్నట్లు ఆర్టీసీ గుర్తించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సిటీ నుంచి బయలుదేరే ప్రతి బస్సు కచ్చితమైన సమయపాలన పాటించేవిధంగా చర్యలు చేపట్టారు. బస్సుల సమయపాలనపై ప్రయాణికులకు నమ్మకాన్ని కలిగించేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టనున్నారు. బస్సుల్లో, బస్షెల్టర్లో కచ్చితమైన వేళలను ప్రదర్శించనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పుష్పక్ల నిర్వహణపై ఎప్పటికప్పుడు ప్రయాణికుల స్పందన తెలుసుకొనేందుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల నుంచి అందే సమాచారం ఆధారంగా బస్సుల నిర్వహణలో మార్పులు, చేర్పులు ఉంటాయి. ఫ్లైట్ వేళలతో అనుసంధానం.. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 190కిపైగా జాతీయ విమాన సర్వీసులు, మరో 30కిపైగా అంతర్జాతీయ విమానాసర్వీసులు నడుస్తున్నాయి. రోజుకు 40 వేల నుంచి 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. పుష్పక్లను వినియోగించుకొనేవారి సంఖ్య 5వేలు మాత్రమే. కనీసం మరో 10 వేల మంది ప్రయాణికులను పెంచుకోగలిగినా పుష్పక్ బస్సుల్లో ఆక్యుపెన్సీ గణనీయంగా పెరుగుతుందని అధికారుల అంచనా. ఇందుకనుగుణంగా విమానాల వేళలను దృష్టిలో ఉంచుకొని ప్రతి బస్సు సకాలంలో ఎయిర్పోర్టుకు చేరేవిధంగా పుష్పక్ల నిర్వహణపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. (చదవండి: వడివడిగా ‘స్టడీ’...నిరుద్యోగులకు ప్రత్యేక కోచింగ్) -
సిటీ బస్సులో సీఎం.. ఆశ్చర్యపోయిన ప్రయాణికులు
సాక్షి ప్రతినిధి, చెన్నై : వినూత్న రీతిలో ప్రజలకు చేరువయ్యేందుకు యత్నిస్తున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం మరో కొత్త పంథాను అనుసరించారు. చెన్నై సిటీ బస్సులో నిలబడి ప్రయాణికులతో కలిసి కొద్దిసేపు పర్యటించారు. సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని గడిచిన ఎన్నికల మేనిఫెస్టోలో స్టాలిన్ పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే అమలు చేశారు. డీఎంకే ప్రభుత్వం ఏర్పడి శనివారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా తన ఇంటి నుంచి తండ్రి కరుణానిధి నివసించిన గోపాలపురంలోని ఇంటికి చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు మేళతాళాలతో స్టాలిన్కు స్వాగతం పలికారు. ఇంటిలోని కరుణానిధి చిత్రపటం వద్ద నివాళులరి్పంచారు. తల్లి దయాళుఅమ్మాళ్కు నమస్కరించి ఆశీర్వాదం అందుకున్నారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతూ స్టెల్లా మెరీస్ కాలేజీ వద్ద కారును నిలపమని చెప్పి అనుసరిస్తున్న మంత్రులను వెంట రావద్దని ఆదేశించారు. అక్కడికి సమీపంలోని బస్స్టాండ్ వద్దకు వెళ్లి పెరంబూరు–బిసెంట్నగర్ మధ్య ప్రయాణించే 29సి మహిళల ప్రత్యేక బస్సు ఎక్కారు. సిటీ బస్సులో అకస్మాత్తుగా సీఎం స్టాలిన్ ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులు సంభ్రమాశ్చర్యాలకు లోనై లేచి నిలబడ్డారు. స్టాలిన్ వారిని కూర్చోమని చెప్పి సంభాషణ మొదలు పెట్టారు. తన జీవితంలో 29సి రూట్ బస్సును మరువలేనన్నారు. చిన్నతనంలో గోపాలపురం నుంచి 29సిలోనే స్కూలుకు వెళ్లానని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పథకం సౌకర్యంగా ఉందా..? అని ప్రశ్నించగా ప్రయాణికులంతో తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. తనకు రూ.9 వేలు జీతం, ఉచిత ప్రయాణం వల్ల నెలకు రూ.900 మిగులుతోందని ఓ ప్రయాణికురాలు బదులిచ్చారు. ఇలా మిగిలిన సొమ్మును ఏం చేస్తున్నారని స్టాలిన్ ప్రశ్నించగా పొదుపు చేస్తున్నట్లు బదులిచ్చారు. అలాగే బస్సులోని విద్యార్థినులను ‘డీఎంకే ఏడాది ప్రభుత్వం ఎలా ఉందని’ అడగ్గా, చాలా తృప్తిగా ఉందని బదులిచ్చారు. మిమ్మల్ని నేరుగా చూడటం ఆనందంగా ఉందని పేర్కొంటూ పలువురు ప్రయాణికురాళ్లు సెల్ఫోన్ ద్వారా సెలీ్ఫలు తీసుకున్నారు. సిటీ బస్సులు సమయానికి వస్తున్నాయా..?, ఉచిత టిక్కెట్లను సక్రమంగా ఇస్తున్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. సుమారు 2 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన సీఎం ఆ తరువాత బస్సు దిగి వెనుకనే వస్తున్న కారులో ఎక్కి వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: కన్నడనాట కాంగ్రెస్కు భారీ షాక్? -
గుడ్న్యూస్: సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
TSRTC Offers To Travelers: దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న సర్వీసు వద్దకు చేరే వరకు సిటీలో రెండు గంటల పాటు ఫ్రీగా ప్రయాణించే గొప్ప అవకాశం టీఎస్ ఆర్టీసీ కల్పించిందని భెల్ డిపో మేనేజర్ సత్యనారాయణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు, తిరుపతి, చెన్నై, విశాఖపట్టణం, కాకినాడ, భద్రాచలం, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు, 250 కిలోమీటర్ల దూరం మించి ఉన్న ప్రాంతాలకు ఆన్లైన్ లేదా బుకింగ్ కేంద్రాల వద్ద రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ అవకాశం పొందవచ్చన్నారు. ముందుగా బుక్ చేసుకున్న బస్సు బయలుదేరే టైం వరకు రెండు గంటల ముందు నగరంలో ఏ ప్రాంతం నుంచైనా బస్సు ఉన్న చోటుకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. నాన్ ఏసీ బుక్ చేసుకున్న ప్రయాణికులు నాన్ ఏసీ సిటీ సర్వీసుల్లో, ఏసీ బస్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఏసీ సర్వీస్ల్లోనూ, నాన్ ఏసీ బస్సుల్లోను ప్రయాణించే వెసులుబాటు ఉందని తెలిపారు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు వచ్చే ప్రయాణికులకు కూడా వారు షెడ్యూల్డ్ టైం నుంచి 2 గంటలలోపు వారి గమ్యస్థానాలకు చేరుకునే వరకు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉందన్నారు. టీఎస్ ఆర్టీసీ కల్పించిన ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చదవండి: (నిలోఫర్లో ఇద్దరు చిన్నారుల మృతి? ఉద్రిక్తత) -
60 శాతం బస్సులు మేడారానికే.. హైదరాబాద్ పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సులు విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. సకాలంలో అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొద్ది రోజులుగా సిటీ ఆర్డినరీ బస్సులను మేడారం జాతరకు తరలిస్తున్నారు. దీంతో నగరంలో ట్రిప్పులు గణనీయంగా తగ్గాయి. ఉదయం, సాయంత్రం స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే సమయంలో తిరిగి ఇళ్లకు చేరుకొనేందుకు విద్యార్థుల డిమాండ్కు అనుగుణంగా బస్సులు ఉండడం లేదు. మరోవైపు విద్యార్థుల బస్పాస్లు కేవలం ఆర్డినరీ బస్సులో మాత్రమే చెల్లుబాటవుతాయి. మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్లలో వీరి పాస్లకు అనుమతి ఉండదు. ఆర్డినరీ బస్సులు లేకపోవడంతో మెట్రోల్లో చార్జీలు చెల్లించాల్సివస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ఆర్డినరీ పాస్లపై రాకపోకలు సాగించే సాధారణ ఉద్యోగులు సైతం ఇబ్బందులను ఎదుర్కోవాల్సివస్తోంది. 60 శాతం బస్సులు అక్కడికే.. ► గ్రేటర్ పరిధిలో సుమారు 2,850 బస్సులు ఉన్నాయి. రోజుకు 20 వేలకు పైగా ట్రిప్పులు తిరుగుతున్నాయి. 25 లక్షల మంది ప్రయాణికులు సిటీ బస్సుల సేవలను వినియోగించుకుంటున్నట్లు అంచనా. ప్రస్తుతం 60 శాతం బస్సులను మేడారం జాతరకు తరలించారు. జాతర రద్దీని దృష్టిలో ఉంచుకొని నగరంలోని డిపోలను ఉమ్మడి వరంగల్ జిల్లా డిపోలతో అనుసంధానం చేశారు. దీంతో సిటీ డిపోల్లో బస్సుల నిర్వహణ ప్రస్తుతం వరంగల్ అధికారుల పర్యవేక్షణలో ఉంది. ► అధికారులను, సిబ్బందిని సైతం పెద్ద ఎత్తున మేడారంలో మోహరించారు. 3,845 బస్సులను మేడారం జాతర కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతో సిటీలో బస్సుల కొరత ఏర్పడింది. ఇది తాత్కాలికమే అయినా విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా బస్పాస్లు ఉన్న వారు చార్జీలు చెల్లించి మెట్రో బస్సుల్లో ప్రయాణం చేయాల్సివస్తోంది. ప్రత్యామ్నాయమేదీ? ► గ్రేటర్లో సుమారు 5 లక్షల స్టూడెంట్ పాస్లు ఉన్నాయి.1.5 లక్షల మందికి పైగా విద్యార్ధులు ఉచిత పాస్లపై ఆర్డినరీ బస్సుల్లో స్కూళ్లకు వెళ్తున్నారు. పదో తరగతి వరకు అమ్మాయిలకు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం ఉంది. ► కాలేజీలకు వెళ్లే విద్యార్థులంతా రూట్ పాస్లు, నెలవారీ బస్పాస్లపై వెళ్తున్నారు. ఆర్డినరీ బస్సులను మేడారానికి తరలించడంతో మెట్రో బస్సుల్లో వీటిని అనుమతించడం లేదు. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే పల్లెవెలుగు బస్సుల్లోనూ అనుమతించడం లేదు. ► జాతర పూర్తయ్యే వరకు తమ బస్పాస్లను పల్లెవెలుగు, మెట్రో బస్సుల్లో తాత్కాలికంగా అనుమతించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
పల్లె వెలుగులు .. పట్నం బాట
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు పల్లెవెలుగులుగా గ్రామీణ ప్రాంతాలకు తిరిగిన బస్సులు కొన్ని సిటీ సర్వీసులుగా మారనున్నాయి. ఈ మేరకు పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం చాలా ఊళ్లకు పల్లెవెలుగు బస్సులు తిరగటం లేదు. తక్కువ ఆక్యుపెన్సీ రేషియో ఉండటం, రోడ్లు బాగాలేకపోవటం తదితర కారణాలతో కొన్ని ఊళ్లకు బస్సులను ఆపేసిన విషయం తెలిసిందే. మరోవైపు అద్దె బస్సుల సంఖ్య కూడా పెరగటంతో కొన్ని పల్లెవెలుగు బస్సులు వృథాగా ఉన్నాయి. అయితే వాటిని సిటీ బస్సులుగా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో మియాపూర్లోని బస్బాడీ వర్క్షాపులో పల్లెవెలుగు బస్సులను సిటీ బస్సులుగా మారుస్తున్నారు. ప్రస్తుతానికి దాదాపు 350 బస్సులను ఈ విధంగా సిద్ధం చేస్తున్నారు. నగరంలో కొరత రానుండటంతో.. హైదరాబాద్లో తిరుగుతున్న సిటీబస్సుల్లో చాలావరకు పాతబడిపోయాయి. మరోవైపు ఇప్పట్లో కొత్త బస్సులు కొనే వీలు లేకుండా పోయింది. ఉన్న బస్సులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్క్రాప్ (తుక్కు)పాలసీ ప్రకారం 15 ఏళ్లు పూర్తయిన బస్సుల్ని తిప్పేందుకు వీలులేదు. ఈ కారణంగా వచ్చే మార్చి నాటికి నగరంలో దాదాపు 600 బస్సులను తొలగించాల్సి ఉంది. మరోవైపు రెండేళ్ల క్రితం సమ్మె జరిగిన సమయంలో ప్రభుత్వ ఆదేశం మేరకు దాదాపు 800 బస్సులను తగ్గించారు. వాటిల్లో ఎక్కువ శాతం బస్సులను ఆర్టీసీ కొత్తగా ప్రారంభించిన సరుకు రవాణా (కార్గో) బస్సులుగా మార్చేశారు. ఇలా కొన్ని కార్గో సర్వీసులుగా మారిపోవడం, 600 బస్సుల గడువు తీరిపోనుండటంతో నగరంలో బస్సులకు తీవ్రమైన కొరత ఏర్పడనుంది. దీంతో పల్లెవెలుగు బస్సులను సిటీ సర్వీసులుగా మార్చి నగర ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. అద్దెబస్సుల రాకతో మిగులు సమ్మె సమయంలో ఆర్టీసీ కొత్తగా 1,300 అద్దె బస్సులను తీసుకుంది. వీటిల్లో ఎక్కువ బస్సులను పల్లెవెలుగు సర్వీసులుగానే చేర్చుకుంది. దీంతో చాలా డిపోల్లో సొంత పల్లెవెలుగు బస్సులు మిగిలిపోయాయి. వాటిని అప్పట్లో కార్గోకు బదిలీ చేయాలని భావించారు. కానీ కార్గో విభాగం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటంతో అన్ని బస్సులు ఇవ్వాల్సిన అవసరం లేదని తర్వాత తేల్చారు. దీంతో మిగిలిపోయిన బస్సులన్నీ డిపోల్లో వృథాగా ఉన్నాయి. అలాగే వేరే ఇతర కారణాలతో నిలిపివేసిన బస్సులు కూడా ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని ఎంపిక చేసి సిటీ బస్సులుగా మారుస్తున్నారు. సీట్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయటంతో పాటు, నిర్మాణంలో తేడా ఉన్న వాటిని పూర్తిస్థాయిలో సరిచేసి రంగులేసి కొత్త బస్సుల తరహాలో సిద్ధం చేస్తున్నారు. పూర్తయిన వాటిని డిపోలకు అప్పగిస్తున్నారు. -
ఏ బస్సు ఎప్పుడొస్తుందో..?
నగరంలోని వివిధ రూట్లలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటేనే కష్టంగా మారింది. అర్జెంటుగా వెళ్లాల్సి ఉన్నా గంటల తరబడి బస్సుల కోసం బస్టాపుల్లో వేచి చూడాల్సిన దుస్థితి దాపురించింది. బస్సుల వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని, అందుకు బస్సులకు జీపీఎస్ అనుసంధానం చేసిన ప్రభుత్వం లాక్డౌన్ అనంతరం దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలియక ఎదురు చూసి చివరకు అధిక డబ్బులు చెల్లించి క్యాబులు, ఆటోల్లో ప్రయాణించాల్సిన దుస్థితి ఉంది. చాలా రూట్లలో కనీసం సమయపాలన ఉండటం లేదు. నిత్యం ఆయా రూట్లలో ప్రయాణించేవారికి నరకం కనిపిస్తోంది. ఒకరోజు ఓ సమయానికి వచ్చిన బస్సు మరోరోజు ఆ సమయానికి రావడంలేదు. దీంతో ఉద్యోగులు, ఇతర అవసరాల నిమిత్తం వెళ్లేవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో రూట్ నంబర్ 279. సికింద్రాబాద్ జూబ్లీబస్స్టేషన్ నుంచి ఇబ్రహీంపట్నం. నిత్యం ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే రూట్ ఇది. కానీ బస్సెక్కాలంటే గంటల తరబడి పడిగాపులు కాయాల్సిందే. ఉప్పల్ నుంచి చాంద్రాయణగుట్ట, అత్తాపూర్ రూట్లో మెహిదీపట్నం రాకపోకలు సాగించే ‘300 రూట్లో ‘ నాలుగైదు బస్సులు వరుసగా బయలుదేరుతాయి. ఆ సమయంలో ప్రయాణికుల డిమాండ్ మేరకు ఒకటి, రెండు బస్సులు ఏర్పాటు చేస్తే చాలు. కానీ ఐదు బస్సులు ఒకేసారి బయలుదేరడం వల్ల మిగతా మూడు ఖాళీగా వెళ్లాల్సి వస్తోంది. ఈ రెండు రూట్లే కాదు.. గ్రేటర్లోని అనేక మార్గాల్లో బస్సుల నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో డిమాండ్కు తగిన విధంగా బస్సులు అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు డిపోల మధ్య సమన్వయం కొరవడటం వల్ల వివిధ రూట్లలో బస్సులు తరచూ బంచింగ్ అవుతున్నాయి. నో టైమింగ్స్.. గ్రేటర్ పరిధిలో సుమారు 2,500 బస్టాపులు ఉన్నాయి. మరో 20కి పైగా బస్బేలు, సికింద్రాబాద్, జేబీఎస్, ఎంజీబీఎస్, కోఠీ, కాచిగూడ, ఈసీఐఎల్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, హయత్నగర్, ఫలక్నుమా తదితర ప్రాంతాల్లో బస్స్టేషన్లు, ప్రయాణ ప్రాంగణాలు ఉన్నాయి. ప్రతిరోజూ 29 డిపోల నుంచి సుమారు 2,500 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ప్రధాన బస్స్టేషన్లలో మినహా ఎక్కడా బస్సుల రాకపోకలకు సంబంధించిన వివరాలు లేవు. గతంలో కొన్ని ముఖ్యమైన బస్టాపుల్లో ఎల్ఈడీ డిస్ప్లేలు ఏర్పాటు చేశారు. ఏ బస్సు ఏ సమయానికి వస్తుందో ప్రదర్శించేవాళ్లు. లాక్డౌన్ నిబంధనల సడలింపు తర్వాత దశలవారీగా పూర్తిస్థాయిలో బస్సులను పునరుద్ధరించినప్పటికీ ‘సమయపాలన’ మాత్రం పునరుద్ధరించలేదు. దీంతో బస్సుల కోసం ఎదురుచూపులే మిగులుతున్నాయని నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొరవడిన సమన్వయం.. గ్రేటర్లో 29 డిపోల నుంచి సుమారు 1,150 రూట్లలో బస్సులు నడుపుతున్నారు. గతంలో రోజుకు 40 వేల ట్రిప్పులు తిరిగేవి. బస్సుల సంఖ్యను తగ్గించడంతో ట్రిప్పులు సైతం గణనీయంగా తగ్గాయి. వివిధ డిపోల నుంచి బస్సుల షెడ్యూల్స్ రూపొందించడంలో డిపోమేనేజర్లకు, ఉన్నతాధికారులకు మధ్య కచి్చతమైన సమన్వయం లేకపోవడం వల్ల ఒకే రూట్లో రెండు, మూడు డిపోలకు చెందిన బస్సులు ఒకే సమయంలో రాకపోకలు సాగిస్తున్నాయి. ‘కోవిడ్ అనంతరం బస్సుల నిర్వహణపైన సీరియస్గా దృష్టి సారించకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు’ ఆర్టీసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అటకెక్కిన జీపీఎస్.. జీపీఎస్ ద్వారా బస్సుల రాకపోకలను ట్రాకింగ్ చేసే వ్యవస్థను గతంలో ప్రవేశపెట్టారు. బస్సుల నిర్వహణలో శాస్త్రీయమైన పద్ధతి ఉంటుందని భావించారు. ప్రతి ట్రిప్పును లెక్క వేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రయాణికుల రద్దీ, బస్సుల డిమాండ్ వంటి అంశాలపైన అవగాహన ఏర్పడుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ప్రా జెక్టు ప్రస్తుతం అటకెక్కింది. ‘ఒకవైపు మెట్రో రైలు, మరోవైపు ప్రైవేట్ వాహనాలు గ్రేటర్ ఆరీ్టసీకి సవా ల్గా మారాయి. బస్సుల నిర్వహణలో కచ్చితమైన అంచనాలు ఉంటే తప్ప ఫలితాలను రాబట్టుకోవడం కష్టం..’ అని డిపో మేనేజర్ ఒకరు తెలిపారు. -
రోడ్డెక్కిన సిటీ బస్సులు
సాక్షి, అమరావతి: కోవిడ్ ఆంక్షల మధ్య రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్టణంలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. ట్రయల్ రన్లో భాగంగా విజయవాడలో వంద, విశాఖపట్టణంలో వంద బస్సుల చొప్పున తిప్పారు. నేటి నుంచి పూర్తి స్థాయిలో బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. రెండు నగరాల్లో కలిపి సిటీ సర్వీసు బస్సులు 1,100 వరకు ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన ప్రత్యేక మార్గదర్శకాల ప్రకారం అధికారులు బస్సుల్ని నడిపారు. ► నగర శివారు ప్రాంతాల నుంచి మెట్రో బస్ సర్వీసుల్ని 70 శాతం వరకు తిప్పారు. నగరాన్ని ఆనుకుని ఉన్న పల్లెలకు పల్లెవెలుగు బస్సులు నడిపారు. ► 60 ఏళ్లు పైబడిన వారిని వ్యక్తిగత బాధ్యతతో ప్రయాణానికి అనుమతించారు. వీరికి రాయితీ నిలిపేశారు. ► ప్రతి బస్ స్టాప్ వద్ద సిబ్బందిని అందుబాటులో ఉంచి బస్సు ఎక్కేవారి టెంపరేచర్ పరీక్షించారు. -
బెజవాడలో రోడ్డెక్కిన సిటీ బస్సులు
-
రోడ్డెక్కిన సిటీ బస్సులు
-
రోడ్డెక్కిన సిటీ బస్సులు
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ నేపథ్యంలో ఆరు నెలల పాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ సిటీ బస్సులు శనివారం విజయవాడ, విశాఖపట్నంలో రోడ్లపైకి వచ్చాయి. మొదటి రోజు ఉదయం ఆరు గంటల నుంచి వంద బస్సులు పలు రూట్లలో ప్రారంభమయ్యాయి.ఆర్టీసీ అధికారులు కోవిడ్ నిబంధనలను సిటీ బస్సులలో కఠినంగా అమలు చేస్తున్నారు. బస్సుల్లో స్టాడింగుకు అనుమతించడం లేదు. ప్రతి స్టాప్ వద్ద ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించిన తరువాతే బస్సులోకి ప్రయాణికులను సిబ్బంది అనుమతించనున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారికి బస్సులోకి అనుమతి లేదని తెలిపారు. ప్రయాణికులు ప్రతి ఒక్కరూ మాస్క్, సామాజిక దూరం పాటించాలని నింబంధనలు విధించారు. ఇక వృద్ధులు, పిల్లలు బస్సు ప్రయాణాలకు అనుమతి నిరాకరించారు. ప్రయాణికుల రద్దీ ఆధారంగా బస్సుల సంఖ్య పెంచనున్న ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలు తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సాధారణ పరిస్థితులు రాగానే సీనియర్ సిటీజన్లకు రాయితీని వర్తింపు కొనసాగుతుందని తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైద్య శాఖ అనుమతి రాగానే రోడ్డెక్కనున్న సిటీ బస్సులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో సిటీ బస్సులు నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. లాక్డౌన్ 4.0లో భాగంగా ప్రజా రవాణాపై ఆంక్షలు ఎత్తేయడంతో సిటీ బస్లు తిప్పేందుకు వైద్య ఆరోగ్య శాఖను ఏపీఎస్ ఆర్టీసీ సంప్రదించింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు లేఖ రాశారు. హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం సిటీ సర్వీసులు నడుపుతామని అందులో పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అనుమతి రాగానే విజయవాడ, విశాఖలో సిటీ సర్వీసులు మొదలు కానున్నాయి. మిగిలిన బస్ సర్వీసులు కూడా 50 శాతం వరకు తిప్పేందుకు ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. కాగా, గత నెలలో రోజుకు 8 లక్షల కిలోమీటర్ల మేర బస్సుల్ని తిప్పిన ఆర్టీసీ.. గత వారం నుంచి రోజుకు 12 లక్షల కిలోమీటర్ల వరకు నడుపుతోంది. ఇక సర్వీసుల్ని 2,200 నుంచి 2,746కు పెంచింది. హైదరాబాద్కు ప్రైవేటు బస్సులు ► అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఐదు నెలలకు పైగా ఖాళీగా ఉన్న ప్రైవేటు బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. ► రవాణా శాఖ అధికారుల అనుమతితో ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్కు బస్సులు తిప్పుతున్నారు. ఏపీలోని ప్రధాన ప్రాంతాల నుంచి శనివారం రాత్రి ఇవి ప్రారంభమయ్యాయి. 150 ప్రైవేటు బస్సులకు ఆన్లైన్లో టికెట్ రిజర్వేషన్ విధానాన్ని ఆపరేటర్లు మొదలుపెట్టారు. ► మరోవైపు హైదరాబాద్కు ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు గానూ అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ దీనిపై తెలంగాణ సర్కార్ ఇంకా స్పందించలేదు. ► సర్వీసుల పెంపునకు టీఎస్ ఆర్టీసీ ససేమిరా అంటోంది. అలాగే ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణ భూ భాగంలో తిప్పే కిలోమీటర్లు తగ్గించాలని.. తాము ఎట్టి పరిస్థితిలోనూ ఏపీ భూ భాగంలో కిలోమీటర్లు పెంచబోమని టీఎస్ ఆర్టీసీ తెగేసి చెబుతోంది. -
సిటీ బస్సులు ఇప్పట్లో లేనట్లే
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్లో ఆర్టీసీ సిటీ బస్సులతోపాటు ఎయిర్పోర్టు సర్వీసులను ఇప్పట్లో పునరుద్ధరించరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిటీ బస్సులతో ఇప్పటికే నష్టాలు వచ్చాయని, ప్రస్తుత పరిస్థితిలో సిటీ బస్సులు నడిపి ఇంకా నష్టాలు పెంచుకోరాదని నిశ్చయించింది. అలాగే తెలంగాణతో సరిహద్దు పంచుకుంటున్న ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రతో ఒప్పందాలు కుదుర్చుకున్నాకే అంతర్రాష్ట్ర బస్సు సర్వీ సుల రాకపోకలను అనుమతిం చాలని నిర్ణయించింది. మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఆర్టీసీపై సుదీర్ఘంగా సమీక్షించి ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్, అధికారులు పాల్గొన్నారు. బస్సుల సంఖ్య లెక్కనే ఒప్పందాలు ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందం ఆధారంగానే ఇప్పటివరకు మహా రాష్ట్ర, కర్ణాటకకు అంతర్రాష్ట బస్సు సేవలు నడిచాయి. తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో ఏపీతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకతో కొత్త ఒప్పందం కుదుర్చుకున్నాకే అంతర్రాష్ట్ర బస్సు సేవలను పునరుద్ధరించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర భూభాగంలో ఆయా రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు ఎన్ని కిలోమీటర్లు తిరిగితే తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ఆయా రాష్ట్రాల్లో అన్ని కిలోమీటర్లు తిరిగేలా ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ఆయా రాష్ట్రాల నుంచి కేటగిరీల వారీ (ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, వోల్వో)గా ఎన్ని బస్సులు తెలంగాణలో ఎన్ని కిలోమీటర్లు తిరిగితే అదే కేటగిరీలకు సంబంధించిన తెలంగాణ బస్సులు సైతం అదే సంఖ్యలో అన్ని కిలోమీటర్ల మేరకు ఆయా రాష్ట్రాల్లో తిరిగేలా ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ప్రధానంగా లాభాలొచ్చే రూట్లలో ఏపీఎస్ఆర్టీసీ అధిక సంఖ్యలో బస్సులు నడిపి నష్టాలు వచ్చే రూట్లలో తక్కువగా నడుపుతుండటంతో తెలంగాణ ఆర్టీసీ నష్టపోవాల్సి వస్తోందని ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల బస్సులు ఒక రూట్లో ఎన్ని కిలోమీటర్లు నడిపితే రాష్ట్ర బస్సులు సైతం అన్ని కిలోమీటర్లు నడిపేలా పకడ్బందీగా ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం సూచించినట్లు సమాచారం. ఆయా రాష్ట్రాల సీఎస్లతో రాష్ట్ర సీఎస్ సమావేశమై ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. జిల్లాల్లో ఆర్టీసీకి నష్టాలెందుకు? కరోనా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేశాక జిల్లాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించినా నష్టాలు ఎందుకు వస్తున్నాయని సీఎం అధికారులను ప్రశ్నించారు. అయితే కరోనా వైరస్ భయంతో ప్రయాణికులు బస్సులు ఎక్కట్లేదని, దీంతో సగం సీట్లు ఖాళీగా పెట్టి బస్సులు నడపాల్సి వస్తోందని అధికారులు సీఎంకు నివేదించారు. రాష్ట్రంలో సరుకు రవాణా కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో 85 కార్గో బస్సు సర్వీసులను ప్రారంభించినా ప్రైవేటు ఆర్డర్లను సాధించడంలో రవాణా శాఖ అధికారులు విఫలమయ్యారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేటు ట్రాన్స్పోర్టు కంపెనీలు ఆర్డర్లు తెచ్చుకుంటున్నా ఆర్టీసీ అధికారులు ఎందుకు ఆ దిశగా ప్రయత్నాలు చేయట్లేదని సీఎం ప్రశ్నించినట్లు తెలిసింది. -
నయా కండక్టర్లు
విచిత్రమేంటంటే అసలు విధులు కాకుండా కొసరు పనుల్లో బిజీగా ఉన్న ఈ ముగ్గురు ఉన్నది ఉప్పల్ బస్టాప్లోనే కావటం విశేషం. డిపోలో ఇప్పటికే ఇద్దరు కంట్రోలర్లు ఉన్నారు. వారు కాకుండా కొత్తగా ఇలా ముగ్గురొచ్చారు. ఇలా ప్రధాన ప్రాంతాల్లో కండక్టర్లు ఈ పనుల్లో దర్శనమిస్తున్నారు. అసలు పనులు వదిలి ఇలా రోడ్డెక్కటానికి కారణం ఆర్టీసీ పొదుపు చర్యల్లో భాగమే. బస్సులు గ్యారేజీకి.. వీరు బస్టాపులకు.. ఆర్టీసీ నష్టాలను తగ్గించే క్రమంలో ఇటీవల పెద్ద సంఖ్యలో సొంత బస్సులను ఆర్టీసీ ఉపసంహరించుకుంది. ఇందులో సిటీలో దాదాపు 800 ఉండగా, కొత్తగా జిల్లాల్లో 1,300 అద్దె బస్సులు వచ్చి చేరనుండటంతో అంతే సంఖ్యలో సొంత బస్సులను రద్దు చేసుకుంటోంది. దీంతో పెద్ద సంఖ్యలో కండక్టర్లు, డ్రైవర్లు మిగిలిపోతున్నారు. నగరంలో ఇప్పటికే 800 బస్సుల రద్దు అమల్లోకి వచ్చింది. దీంతో దాదాపు 1,600 మంది వరకు కండక్టర్లు మిగిలిపోతున్నారు. ఇప్పటివరకు ఉన్న ఖాళీల్లో కొందరిని సర్దుబాటు చేయగా దాదాపు వేయి మందికిపైగా మిగిలిపోయారు. డ్రైవర్లలో మిగిలిన వారిని ఇతర శాఖలకు పంపేందుకు సిద్ధపడగా, ప్రస్తుతానికి ఫైర్ సర్వీసెస్ 42 మందిని తీసుకుంది. మిగతావారిలో ఎక్కువమందిని కొత్తగా ప్రారంభిస్తున్న సరుకు రవాణా విభాగానికి పంపుతున్నారు. కండక్టర్లకు మాత్రం వేరే శాఖల్లో అవకాశం లేక ఆర్టీసీలోనే అంతర్గతంగా వినియోగించుకోవాల్సి వచ్చింది. బస్సు రాగానే మైక్ పట్టుకుని దాని వివరాలను ప్రయాణికులకు వెల్లడిస్తున్న ఈయన కూడా సీనియర్ కండక్టరే. కానీ కండక్టర్ విధులు దక్కక ఇలా అదనపు డ్యూటీలో ఉండాల్సి వచ్చింది. సరుకు రవాణా విభాగంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్గా కొందరిని తీసుకోగా, మరికొందరిని ఇలా బస్టాపుల్లో ఉంచి బస్సుల నియంత్రణ, ఆటోలు అడ్డుగా లేకుండా చూడటం, ప్రయాణికులకు సమాచారమివ్వటం లాంటి పనులకు వినియోగిస్తున్నారు. బస్టాపుల్లో ఆటోలు తిష్ట వేయకుండా కొన్ని చోట్ల హోమ్గార్డులుండేవారు. ఇప్పుడు మిగిలిపోయిన కండక్టర్లను ఆయా బస్టాపులకు పంపి హోంగార్డుల పనులు వారికే అప్పగించినట్టు సమాచారం. ఉప్పల్ బస్టాపులో హోంగార్డులు లేక ఆటోవాలాలు రెచ్చిపోతున్నారు. కండక్టర్లనే బెదిరింపులకు గురిచేస్తూ బస్సులకు అడ్డంగా నిలిపి ప్రయాణికులను మళ్లించుకుంటున్నారు. ఈయన ఆర్టీసీలో సీనియర్ కండక్టర్. ప్రస్తుతం అసలు విధులు వదిలి ఉప్పల్ బస్టాప్లో బస్సుల రాకకు అడ్డుగా ఉన్న ఆటోలను పక్కకు తోలే పనిలో ఇలా నిమగ్నమయ్యాడు. సిటీలో 800 బస్సుల రద్దు.. నిజానికి నగరంలో బస్సులు తగ్గిపోవటంతో ప్రయాణికులకు ఇబ్బందులు పెరిగాయి. అసలే వాటి సంఖ్య చాలక కొన్ని ప్రాంతాలకు బస్సు ట్రిప్పులను నడపలేకపోతున్నారు. ఇప్పుడు ఏకంగా 800 బస్సులను తగ్గించటంతో కాలనీలకు వెళ్లే సర్వీసులు చాలా రద్దయ్యాయి. తక్కువ దూరం తిరిగే సర్వీసులను దూరప్రాంతాలకు పొడిగించారు. ఫలితంగా బస్టాపుల్లో పడిగాపులు పెరిగాయి. ఇటు ప్రయాణికులకు అటు మిగిలిపోయిన సిబ్బందికి ఈ చర్య ఇబ్బందిగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వం వాస్తవాలు గుర్తించి పునరాలోచించాలన్న డిమాండు ప్రయాణికుల నుంచి బలంగా వస్తోంది. -
1000 సిటీ బస్సులు ఔట్?
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న కాలుష్యానికి విరుగుడుగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెంచటంతోపాటు సొంత వాహనాల స్థానంలో జనం వీలైనంత ఎక్కువగా ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణించేలా ప్రపంచవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రజా రవాణా వ్యవస్థలను బలోపేతం చేస్తున్నారు. అయితే, దేశంలో కాస్మోపాలిటన్ సిటీగా శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్లో మాత్రం పరిస్థితి విరుద్ధంగా కని పిస్తోంది. దాదాపు కోటి జనాభా ఉన్న మరే నగరంతో పోల్చినా సిటీ బస్సులు ఇక్కడే తక్కువ. కేవలం ప్రధాన రోడ్లపై మాత్రమే సిటీ బస్సులు నడుస్తుంటాయి. దీంతో అంతర్గత ప్రాంతాల ప్రజలు బస్సు కోసం కొంత దూరం వెళ్లక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించ డానికి వీలైనన్ని ఎక్కువ బస్సులు అందుబాటులోకి తేవడం ద్వారా పెరిగిపోతున్న సొంత వాహనాల విస్తృతిని నియంత్రించాలని పలువురు సూచిస్తున్నారు. దీన్ని అనుసరించటం అటుంచి తే, ఇప్పుడు హైదరాబాద్లో ఏకంగా వేయి బస్సులను జనవరి 1 నాటికి తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో నగరంలో 2,700 బస్సులే ఉండనున్నాయి. పదేళ్ల క్రితం సిటీలో తిరిగిన బస్సుల సంఖ్యకిది సమానం. ఈ పదేళ్లలో హైదరాబాద్ లో 30 లక్షలకుపైగా జనాభా పెరిగింది. అందుకనుగుణంగా బస్సుల సంఖ్య పెరగాల్సి ఉండగా.. ఆర్టీసీ తిరోగమనంలో ఆలోచిస్తోంది. నష్టాలను తగ్గించేందుకేనంటూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ రూ.1200 కోట్ల నష్టాలను చవిచూడ నుందని అంచనా. ఇందులో రూ.550 కోట్ల నష్టం హైదరాబాద్ నుంచే ఉంటుందని చెబుతున్నారు. బస్సుల సంఖ్య పెరిగే కొద్దీ నష్టాలు పెరుగుతాయన్న సూత్రాన్ని అనుసరించి, బస్సుల సంఖ్య తగ్గించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన రెండు సమావేశాల్లో సిటీ బస్సులతో వస్తున్న నష్టాలపై చర్చ జరిగింది. మధ్యాహ్నం వేళ బస్సు లు ఒకదాని వెంట ఒకటి తిరుగుతున్నాయని, ఒక్కో బస్సులో పది, పదిహేను మందికి మించి ప్రయాణికులుండటం లేదని సీఎం పేర్కొన్నారు. నష్టాల నేపథ్యంలో ఇలా నడపడం ఎందుకని ప్రశ్నించారు. దీంతో అధికారులు ఇక బస్సుల సంఖ్య తగ్గించటమే మేలని నిర్ణయించారు. ఇలా చేస్తారు... ►ప్రస్తుతం కాలం చెల్లిన 600 బస్సులను ఈ ఖాతాలో తగ్గించేస్తారు. ►500 మంది వరకు డ్రైవర్ల కొరత ఉంది. దీంతో కొన్ని సర్వీసులు డిపోల కే పరిమితమవుతున్నాయి. ఆ మేరకు సర్వీసులకు కోత పెడతారు. ఇలా చేయొచ్చు... ►బస్సుల సంఖ్య తగ్గించటం కంటే ఉన్నవాటిని హేతుబద్ధీకరించాలి. మధ్యాహ్నం వేళ చాలా ప్రాంతాలకు రద్దీ తక్కువగా ఉంటున్నందున ఆ సమయాల్లో కొన్ని బస్సులను కొత్త ప్రాంతాలకు తిప్పాలి. ►ఓఆర్ఆర్ వరకు సిటీ విస్త రించినందున ఆ ప్రాంతాన్ని దాటి సమీపంలోని కొత్త ప్రాం తాలకు ఆ బస్సులు నడపాలి. దీంతో ఆదాయం పెరగొచ్చు. ►ఉదయం, రాత్రి రద్దీ వేళల్లో ఉన్న బస్సులే సరిపోవడంలే దు. బస్సుల సంఖ్య తగ్గిస్తే ఆ సమయాల్లో ఇబ్బంది తప్పదు. సిబ్బందినేం చేస్తారు?: ప్రస్తుతం ఆర్టీసీలో బస్సులు–సిబ్బంది దామాషా 1:6గా ఉంది. వేయి బస్సులు తగ్గిస్తే 6వేల మంది సిబ్బందిని తగ్గించాలి. ఇలా మిగిలే సిబ్బందిని ఇప్పుడేం చేస్తారన్నది ప్రశ్న. పైగా, ఆర్టీసీ మొత్తం వ్యయంలో 58 శాతం సిబ్బంది జీతాల రూపేణా ఖర్చవుతోంది. నష్టాలు తగ్గించేందుకు బస్సుల సంఖ్య తగ్గించినా, సిబ్బంది అలాగే ఉంటారు కదా. వారి జీతాలు తగ్గవన్న విషయం గుర్తించలేదా?. చార్జీలతో ఆదాయం పెరిగింది: ఇటీవల పెంచిన చార్జీలతో నగరంలో ఆర్టీసీకి దాదాపు 25 శాతం మేర ఆదాయం పెరిగింది. బస్సు పాస్ల ధరల పెంపుతో, ప్రభుత్వం నుంచి వచ్చే రీయింబర్స్మెంట్ మొత్తం కూడా పెరుగుతుంది. ఉన్న బస్సులను రేషనలైజ్ చేస్తే కొంత ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ రెండు విషయాలను క్రోడీకరించుకునే కసరత్తు చేస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్: జనాభా దాదాపు కోటి ఆర్టీసీ బస్సులు: 3,700 పరిస్థితి: రాత్రి 9 తర్వాత బస్సులు చాలా పలచగా తిరుగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం ఆరు తర్వాత గానీ రోడ్లపై ఎక్కువగా కనిపించవు. సిఫారసు: ఉన్నఫళంగా వేయి బస్సులు పెంచాలని గతేడాది ఆర్టీసీపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచించింది. బెంగళూరు: జనాభా దాదాపు కోటి సిటీ బస్సులు: 6,500 పరిస్థితి: ఉదయం నాలుగు నుంచి రాత్రి 12 వరకు బస్సులు అందుబాటులో ఉండటమే కాకుండా, అంతర్గత కాలనీలకు కూడా నడుస్తున్నాయి. ప్రత్యేకత: దేశంలో ఢిల్లీ తర్వాత అన్ని ఏసీ బస్సులున్న నగరం ఇదే. ఏకంగా ప్రభుత్వమే సొంత నిధులతో గతంలో వేయి ఏసీ బస్సులు అందుబాటులో ఉంచింది. సిటీ కోసం ప్రత్యేకంగా ఉన్న కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరిన్ని బస్సులు సమకూరబోతున్నాయి. ఆర్టీసీలో 359 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 359 మంది సిబ్బందిని క్రమబద్ధీకరిస్తూ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆర్టీసీ లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తం రెగ్యులరైజ్ అయినట్టయింది. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సీఎం కేసీఆర్ కాం ట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఎండీని ఆదేశించడంతో శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 296 మంది డ్రైవర్లు కాగా, మిగతా వారు కండక్టర్లు. నిజానికి వీరు 2015లోనే రెగ్యులరైజ్ కావాల్సి ఉంది. ఆ సమ యంలో వేతన సవరణ కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన సమయంలో, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ డిమాండ్ను కూడా ప్రభుత్వం ముందుంచారు. దానికి సమ్మతిస్తూ అప్పట్లో కార్మిక సంఘాలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ మేరకు 4,400 మందిని క్రమబద్ధీకరించారు. కానీ శాఖా పరమైన చర్యలకు గురైనవారు, ఇతర లోటుపాట్లు ఉన్నవారు మిగిలిపోయారు. అప్పటి నుంచి తమను కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ వస్తున్నారు. ఇటీవల సమ్మె నేపథ్యంలో సీఎం ప్రకటించి న వరాల్లో భాగంగా వీరికి కూడా అవకాశం లభించింది. 240 పనిదినాల అనుభవం ఉండటాన్ని అర్హతగా నిర్ధారించారు. వీరిలో చాలామంది ఐదారేళ్లుగా పనిచేస్తున్న వారుండటంతో దాదాపు అంతా దానికి అర్హత సాధించే అవకాశం ఉంది. ఎవరికైనా అన్ని పని దినాల అనుభవం లేకుంటే, వారు పని దినాలు పూర్తి చేసుకోగానే రెగ్యులరైజ్ చేయనున్నట్టు ఉత్తర్వుల్లో ఎండీ పేర్కొన్నారు. -
సిటీ బస్సులను పునరుద్ధరించాలి
సాక్షి, ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ నుంచి గతంలో నడిచే సిటీ బస్సులను పునరుద్ధరించాలని విద్యార్థులు కోరారు. ఓయూ క్యాంపస్ నుంచి కోఠిమహిళా కాలేజీ, నిజాం కళాశాల, సికింద్రాబాద్, సైఫాబాద్ పీజీ కాలేజీకి, వివిధ ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్లకు విద్యార్థులు బస్సుల్లో వెళ్తుంటారు. అయితే.. క్యాంపస్ నుంచి బస్సులు తిరగక పోవడంతో ఆటోల్లో వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే టీఎస్ ఆర్టీసీ, ఏపీ ఆర్టీసీ బస్సులు క్యాంపస్ నుంచి వెళ్తుండగా.. లోకల్ బస్సులు మాత్రం క్యాంపస్ వెనుక నుంచి వెళ్లడం వల్ల విద్యార్థులతో పాటు వివిధ పనుల పై ఓయూ క్యాంపస్కు వచ్చే వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తార్నాక నుంచి కోఠి, నాంపల్లి వెళ్లే 3, 136 నంబర్ బస్సులు క్యాంపస్ నుంచి వెళ్తూ ఆర్ట్స్ కాలేజీ, లా కళాశాల, లేడీస్ హాస్టల్, ఇంజినీరింగ్ కాలేజీ ఆంధ్రమహిళా సభ విద్యా సంస్థల బస్ స్టాప్ వద్ద ఆగేవని, దీంతో విద్యార్థులకు ఎంతో సౌకర్యాంగా ఉండేదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అనంతరం క్యాంపస్ నుంచి సిటీ బస్సుల రాకపోకలను నిలిపివేసిన్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు. -
సిటీ బస్సుల్లో ‘సేఫ్’ జర్నీ!
సాక్షి, సిటీబ్యూరో : బస్సుల రాకపోకలపై ప్రయాణికులకు ఇక నుంచి ప్రత్యక్ష సమాచారం లభించనుంది. నగరంలోని ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోక లపై ‘హైలైట్స్’ మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రయాణికులకు ప్రత్యక్ష సమాచారం అందజేస్తున్న తరహాలోనే బస్సుల రాకపోకలపైన ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేసేందుకు ‘సేఫ్’ (సొసైటీ ఫర్ యాక్సిడెంట్ ఫ్రీ ఎన్విరాన్మెంట్) అనే సంస్థతో ఆర్టీసీ తాజాగా ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ రోడ్లపై నడిచే బస్సుల కదలికలను ఎప్పటికప్పుడు నమోదు (వెహికల్ ట్రాకింగ్) చేయడంతో పాటు, బస్సుల రాకపోకలపైన ప్రయాణికులకు ప్రత్యక్ష సమాచారాన్ని అందజేస్తుంది. ఇందుకోసం అన్ని చోట్ల ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. మొదట ఏసీ బస్షెల్టర్లతో ప్రారంభించి ఆ తరువాత క్రమంగా నగరంలోని అన్ని బస్టాపులకు ఈ ప్రత్యక్ష సమాచార బోర్డులను విస్తరిస్తారు. అలాగే ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో సేఫ్ యాప్ ద్వారా కూడా బస్సుల రాకపోకలపై ప్రత్యక్ష సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీంతో ఇంటి నుంచి బయలుదేరే సమయంలోనే తాను ఎక్కాల్సిన బస్సు ఇంకా ఎంత దూరంలో ఉన్నది, ఏ సమయానికి తాను ఉన్న చోటుకు వస్తుందనే వివరాలు ప్రయాణికుడికి తెలిసిపోతాయి. అలాగే సేఫ్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా లభించే డేటాను ‘టీ–సవారీ’లో అప్డేట్ చేస్తారు. దీంతో ప్రయాణికులకు ఈ యాప్ ద్వారా ఓలా, ఊబర్ తదితర వాహనాలతో పాటు బస్సుల వివరాలు కూడా లభిస్తా యి. మెట్రో రైల్వేస్టేషన్లకు అందుబాటులో ఉన్న బస్సుల వివరాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఇప్పటికే గ్రేటర్ ఆర్టీసీలో 1200 బస్సులకు వీటీపీఐఎస్ (వెహికల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) టెక్నాలజీనీ అమలు చేస్తున్నారు. కానీ ఇది మొక్కుబడిగానే అమలవుతోంది. ప్ర యాణికులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు లభించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వెహికల్ ట్రాకింగ్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థను అమలు చేసేందుకు సేఫ్ సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. మొదట నగరంలోని అన్ని ఏసీ, మెట్రో లగ్జరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సులకు సేఫ్ వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేసి ఆ వివరాలను ప్రయాణికుల మొబైల్ ఫోన్కు, బస్టాపుల్లోని ఎల్ఈడీ బోర్డులకు అనుసంధానం చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్లోని 3650 బస్సులకు ఈ టెక్నాలజీని అమలు చేసిన అనంతరం తెలంగాణలోని 10,093 బస్సులకు దీనిని విస్తరిస్తారు. హైలైట్స్ తరహాలో సమాచారం.. గ్రేటర్లో బస్షెల్టర్ల ఆధునీకరణకు అనుగుణంగా బస్సుల సమాచారం అందుబాటులో లేకపోవడం పెద్ద లోపంగా ఉంది. నగరంలోని 26 ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు, సికింద్రాబాద్; నాంపల్లి, కాచిగూడ, మల్కాజిగిరి తదితర ప్రధాన స్టేషన్ల ద్వారా ప్రతి రోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రాకపోకలు సాగించే 121 ఎంఎంటీఎస్ సర్వీసుల ప్రత్యక్ష సమాచారాన్ని తెలియజేసేందుకు ‘హైలైట్స్’ దోహదం చేస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు తాము ఎదురు చూస్తున్న రైల్వేస్టేషన్కు ఎంఎంటీఎస్ ఎంత దూరంలో ఉన్నదీ ప్రత్యక్షంగా తెలిసిపోతుంది. సరిగ్గా ఇలాంటి పరిజ్ఞానం ద్వారానే బస్సుల రాకపోకలను ప్రయాణికులకు అప్డేట్ చేస్తారు. బస్టాపులను జియో ఫెన్సింగ్ చేస్తారు. ప్రధాన కార్యాలయంలోని సర్వర్ రూమ్ నుంచి ఈ మొత్తం వ్యవస్థను నియంత్రిస్తారు. మొదట నగరంలో అమలు చేసిన తరువాత హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–విజయవాడ, మెట్టుపల్లి–కరీంనగర్, హైదరాబాద్–వరంగల్ వంటి ప్రధాన రూట్లకు విస్తరిస్తారు. టి–సవారీతో అనుసంధానం... మరోవైపు ఈ సమాచారాన్ని టి–సవారీతో అనుసంధానం చేయడం వల్ల ప్రయాణికుడికి ఒకే సమ యంలో అన్ని రకాల ప్రజారవాణా వాహనాల సమాచారం అందుబాటులోకి వస్తుంది. తద్వారా వాటిలో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకొని బయలుదేరవచ్చు. ఉదాహరణకు మియాపూర్ నుంచి అమీర్పేట్ వరకు మెట్రో రైల్లో వచ్చిన వ్యక్తికి తాను ట్రైన్ దిగే సమయానికి అమీర్పేట్లో బస్సు, ఓలా, ఊబెర్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బైక్స్ వంటి వాటిలో ఏది అందుబాటులో ఉంటే అందులో బయలుదేరవచ్చు. సేఫ్ సంస్థ నుంచి ఆర్టీసీకి లభించే ఈ సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా ఉచితం. ఇందుకు ప్రతిగా వ్యాపార ప్రకటనలపైన ఆ సంస్థ ఆదాయాన్ని ఆర్జించనుంది. ఒకటి, రెండు నెలల్లో ఈ సరికొత్త సాంకేతిక వ్యవస్థ ఆచరణలోకి రావచ్చునని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
‘చిల్లర సమస్య నుంచి కండక్టర్లకు ఊరట’
సాక్షి, హైదరాబాద్: రాజధానితోపాటు వరంగల్ సిటీ బస్సుల్లో టికెట్ ధరలను రూ.5, 10, 15, 20, 25, 30కు మారుస్తూ హేతుబద్ధీకరించటంతో చిల్లర సమస్య నుంచి కండక్టర్లకు ఊరట లభిస్తుందని ఆర్టీసీ ఎన్ఎంయూ వెల్లడించింది. సోమవారం నుంచి దీన్ని అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు సంఘం నేతలు నాగేశ్వరరావు, నరేందర్, మౌలానా, కమాల్రెడ్డి పేర్కొన్నారు. డిస్కంలకు ఉన్న రూ.12 వేల కోట్ల రుణాన్ని భరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టీసీకి ఉన్న రూ.2,500 కోట్ల రుణాన్ని కూడా భరించాలని కోరారు. -
చిల్లర సమస్యకు చెక్
హన్మకొండ: బస్సుల్లో చిల్లర సమస్యకు ఆర్టీసీ పరిష్కారం చూపింది. ఈ మేరకు చార్జీలను సర్దుబాటు చేసింది. దీంతో కొన్ని స్టేజీలకు స్వ ల్పంగా చార్జీలు పెరుగగా, మరికొన్ని స్టేజీలకు చార్జీలు తగ్గాయి. చిల్లర ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది మధ్యన ఘర్షణలకు దారితీస్తోంది. ఈ క్రమంలో ఆర్టీసీ యాజ మాన్యం చిల్లర సమస్యలను పరిష్కరించాలని తీసుకున్న నిర్ణయం మేరకు చార్జీల్లో మార్పులు చేశాయి. వరంగల్ మహానగరంలోని వరంగల్, హన్మకొండ, కాజీపేట మధ్యన ఆర్టీసీ లోకల్ బస్సులు సేవలు అందిస్తున్నాయి. సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సులు నగర ప్రయాణికులకు రవాణా సేవలు అందిస్తున్నాయి. చిల్లర సమస్య తొలగించేందుకు ఈ బస్సుల చార్జీలు సర్దుబాటు చేశారు. సర్దుబాటు చేసిన చార్జీలు ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ తోట సూర్యకిరణ్ తెలిపారు. -
సైకిళ్ల నగరంలో షి'కారు'
సిటీ ఆఫ్ బైస్కిల్స్.. అంటే సైకిళ్ల నగరమని అర్థం.. ఎటు చూసినా సైకిళ్లే కనిపించడంతో ఒకప్పుడు మన భాగ్యనగరాన్ని అలా పిలిచేవారు.. మరి ఇప్పుడో...? రవాణా రంగ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది! రోడ్డెక్కి ఆటో కోసం, సిటీ బస్సు కోసం పడిగాపులు కాయాల్సిన పనిలేదు. ఆటోవాలాల ఆగడాలను భరించాల్సిన అవసరం లేదు. బెంబేలెత్తించే మీటర్ ట్యాంపరింగ్లు లేవు. అక్కడక్కడా ఒకట్రెండు ఘటనలు మినహా పూర్తిగా భద్రతతో కూడిన రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అదీ ఆటోరిక్షా కంటే చౌకగా!! మొబైల్లో బుక్ చేస్తే క్యాబ్లు క్షణాల్లో ఇంటి ముందు వాలిపోతున్నాయి. సినిమాకు వెళ్లాలన్నా, షికారుకెళ్లాలన్నా, ఆసుపత్రికెళ్లాలన్నా, బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలకు ఎక్కడికి వెళ్లాలన్నా ఇప్పుడు సొంత వాహనాన్ని తలపించే క్యాబ్ ఉంది. ఉబెర్, ఓలా వంటి అంతర్జాతీయ సంస్థలతోపాటు మేరు, డాట్, గ్రీన్క్యాబ్స్, రేడియో క్యాబ్స్, షీ క్యాబ్స్ వంటి స్థానిక క్యాబ్ సంస్థలు ప్రయాణికులకు రవాణా సదుపాయం అందజేస్తున్నాయి. నగరంలో మారుతున్న రవాణా రంగ ముఖచిత్రంపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్.. – సాక్షి, హైదరాబాద్ నాటికి నేటికి ఎంత తేడా..? గుర్రపు బగ్గీలు, టాంగాలు, జట్కాలు మాత్రమే రవాణా సాధనాలుగా ఉన్న రోజుల్లో సైకిల్ దూసుకొచ్చింది. అదీ కొందరు సంపన్నుల వద్దే కనిపించేది. కాలక్రమంలో నగరపు రహదారులను సైకిళ్లు ముంచెత్తాయి. వాహనప్రియుల అభిరుచికి అనుగుణంగా రకరకాల మోడళ్లలో సైకిళ్లను రూపొందించి వినియోగంలోకి తెచ్చారు. 1930 నుంచి మొదలైన సైకిల్ ప్రస్థానం నాలుగైదు దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా సాగింది. సంపన్నులతో మొదలై నిరుపేదల వరకు సైకిల్ను వాడేవారు. అలా ఇంటింటికీ సైకిల్ వచ్చేసింది. దీనికి సమాంతరంగా సైకిల్ రిక్షాలు పరుగులు తీశాయి. 1980 నాటికి హైదరాబాద్లో సైకిల్ రిక్షాయే అతి ముఖ్యమైన రవాణా సాధనమైంది. నిజాం కాలం నుంచే సిటీ బస్సులు అందుబాటులో ఉన్నా పరిమితమైన రూట్లలోనే తిరిగేవి. 80వ దశాబ్దం నాటికి సిటీ బస్సుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగినా చిన్నచిన్న బస్తీలు, ఇరుకు గల్లీల్లోంచి గణగణ గంట మోగించుకొంటూ సైకిల్ రిక్షా దూసుకుపోయింది. ‘రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్...రిక్షావాలా జిందాబాద్.. మూడు చక్రములు గిరగిరా తిరిగితే మోటారు కారు బలాదూర్...’ అంటూ సైకిల్ రిక్షా హైదరాబాద్ను ఏలిన రోజులవి! ఎనభైల నాటికి సుమారు లక్ష వరకు సైకిల్ రిక్షాలు ఉండేవని అంచనా. అంతకు రెట్టింపు సంఖ్యలోనే సైకిళ్లు ఉండేవి. ఎనభయ్యో దశాబ్దం హైదరాబాద్ వాహనరంగాన్ని ఓ కుదుపు కుదిపింది. జట్కాలు, టాంగాలు, సైకిల్ రిక్షాల కంటే వేగంగా గమ్యాన్ని చేర్చే ఆటోరిక్షాలు వచ్చాయి. 1990 నాటికి సిటీ బస్సుతో పాటు ఆటోరిక్షాలు ప్రజా రవాణా రంగంలో అగ్రభాగంలో నిలిచాయి. సహజంగానే మొదట్లో ఉన్నత వర్గాలే వీటిని వినియోగించినా క్రమంగా ప్రతి ఒక్కరు ఆటోను వినియోగించే స్థాయికి వీటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. పోటెత్తిన వ్యక్తిగత వాహనాలు నగరం విస్తరిస్తున్నట్లుగానే అందుకు అనుగుణంగా వాహనాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. రవాణా శాఖ లెక్కల ప్రకారం 1970లో వ్యక్తిగత వాహనాలు కేవలం 9789. ప్రజా రవాణా వాహనాలు 5083 మాత్రమే ఉండేవి. 1980 నాటికి వ్యక్తిగత వాహనాల సంఖ్య 27,819కు, ప్రజా రవాణా వాహనాల సంఖ్య 10,437కు చేరింది. 1990లో సుమారు 2.22 లక్షల వాహనాలు నమోదయ్యాయి. ఆ తర్వాత వాహనాల వినియోగంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. సైకిళ్లు, సైకిల్ రిక్షాలు, ఆటోలు తదితర వాహనాల కంటే బైక్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇదే సమయంలో కార్ల వినియోగం ఎక్కువైంది. ఈ అభివృద్ధి మరింత వేగంగా కొనసాగింది. 2012 నాటికి అన్ని రకాల వాహనాలు కలిపి 36.72 లక్షలకు చేరాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 50 లక్షలకు చేరింది. అంటే సుమారు కోటి జనాభా ఉన్న నగరంలో అరకోటి వాహనాలు ఉన్నాయన్నమాట! ప్రతి మనిషికీ ఓ బైక్ అన్నట్టుగా వాహన రంగం విస్తరించింది. మధ్య తరగతి, వేతన జీవుల ఆదాయానికి అనుగుణంగా కార్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 35 లక్షలకు పైగా ద్విచక్రవాహనాలు ఉంటే 10 లక్షలకు పైగా కార్లున్నాయి. మిగతావి రవాణా రంగానికి చెందినవి. క్యాబ్ వైపే మొగ్గు ఎందుకు? - సికింద్రాబాద్ నుంచి హైటెక్సిటీకి వెళ్లేందుకు ఆటోరిక్షాలో కనీస చార్జీ రూ.20. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్కు రూ.11 చొప్పున కనీసం రూ.500 వరకు చార్జీ అవుతుంది. కానీ అంతే దూరానికి క్యాబ్లు రూ.300 నుంచి రూ.350 వరకే లభిస్తున్నాయి. - పైగా నేరుగా ఇంటి నుంచే బయలుదేరి గమ్యానికి చేరుకొనే సదుపాయం ఉండడంతో ప్రతి ఒక్కరు క్యాబ్ వైపు మొగ్గుతున్నారు. - మూడేళ్ల క్రితం వరకు నగరంలో సుమారు 1.3 లక్షల ఆటోరిక్షాల్లో ప్రతి రోజు 15 లక్షల మంది పయనించగా ఇప్పుడు ఆ సంఖ్య 8 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఉంది. - నగరంలో 3,550 సిటీ బస్సుల్లో రోజుకు 33 లక్షల మంది తిరుగుతున్నట్లు అంచనా. కానీ క్యాబ్లు, ఇతర ప్రైవేట్ వాహనాల పోటీ కారణంగా ఈ సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఒకప్పుడు 72 శాతం ఉన్న సిటీ బస్సు ఆక్యుపెన్సీ రేషియో ఇప్పుడు ఏకంగా 65 శాతానికి పడిపోయింది. - నగరంలో ప్రతిరోజు 121 ఎంఎంటీఎస్ సర్వీసుల్లో రోజుకు 1.4 లక్షల మంది పయనిస్తున్నారు. ట్రైన్ దిగిన ప్రయాణికులు తిరిగి క్యాబ్లను వినియోగిస్తుండటం గమనార్హం. క్షణాల్లో బుకింగ్లు.. నిమిషాల్లో పరుగులు.. శరవేగంగా దూసుకొచ్చిన క్యాబ్ సర్వీసులతో ఆటోరిక్షాలు, సిటీ బస్సుల గ్రాఫ్ క్రమంగా పడిపోయింది. గ్రేటర్లో సుమారు 2 లక్షల క్యాబ్లు ప్రతిరోజు 20 లక్షల మందికి పైగా రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఒక్క శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికే ప్రతిరోజు సుమారు 10 వేల క్యాబ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉబెర్, ఓలా మొబైల్ యాప్ల నుంచి రోజూ సుమారు 15 లక్షల మంది తమ గమ్యస్థానాలను బుక్ చేసుకుంటున్నట్లు అంచనా. మరో 5 లక్షల మంది మిగతా క్యాబ్లను వినియోగిస్తున్నారు. ఇందులో ఇండికా, ఆల్టో వంటి చిన్న కార్ల నుంచి ఇన్నోవా, స్విఫ్ట్ డిజైర్ వంటి లగ్జరీ వాహనాల వరకు అందుబాటులో ఉన్నాయి. ఓలా సంస్థ మరో అడుగు ముందుకేసి ఆటోరిక్షా సర్వీసులను కూడా అందజేస్తోంది. మరోవైపు మోటో పేరుతో ఉబెర్ బైక్లు అందుబాటులోకి వచ్చాయి. హైటెక్సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ కారణంగా ఇబ్బందులకు గురయ్యే ఐటీ ఉద్యోగులు, ఇతర వర్గాలు క్షణాల్లో కార్యాలయాలకు చేరుకొనేందుకు ఉబెర్ బైక్లను వినియోగిస్తున్నారు. ఓలా క్యాబ్లలో కేవలం రూ.36ల కనీస చార్జీలతో మొదలై ఒక కిలోమీటర్కు రూ.6 చొప్పున రవాణా సదుపాయం అందజేసే మైక్రో, మినీ వాహనాల నుంచి రూ.80ల కనీస చార్జీలతో సేవలందజేసే ప్రైమ్ వాహనాలున్నాయి. ఉబెర్ పూల్, ఉబెర్ ఎక్స్, ఉబెర్ గో, కేటగిరీలలో ప్రయాణికులకు రవాణా సదుపాయాలు అందుతున్నాయి. ట్యాక్సీ గిరాకీ దెబ్బతిన్నది ఇరవై ఏళ్ల నుంచి ట్యాక్సీ నడుపుతున్నా. క్యాబ్ పోటీకి తట్టుకోలేకపోతు న్నారు. క్యా బ్లు వచ్చిన తర్వాత గిరాకీ మొత్తం పడిపోయింది. క్యాబ్ తరహాలో మేం ఎక్కడికంటే అక్కడకు వెళ్ల లేం. చార్జీలు కూడా ట్యాక్సీలో ఎక్కువగానే ఉంటాయి. సికింద్రా బాద్ నుంచి బేగంపేట్కు వెళ్లాలంటే ట్యాక్సీ చార్జీ రూ.300 వరకు ఉంటుం ది. అదే క్యాబ్లో అయితే చాలా తక్కువ. ఏం చేయాలో అర్థం కావడం లేదు. రాత్రింబవళ్లు కష్టపడ్డా పెట్రోల్, డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదు. – సయ్యద్ అఫ్సర్, ట్యాక్సీ డ్రైవర్ ఆటో ఎక్కడమే మరిచాను ఒకప్పుడు ఆటో ఎక్కువగా వినియోగించే వాణ్ని. రెండేళ్ల నుంచి పూర్తిగా మానేశాను. నాలుగైదు కిలోమీటర్లయినా సరే క్యాబ్లే ఎంతో సౌకర్యంగా ఉన్నాయి. ఎక్కడికంటే అక్కడికి వస్తారు. బేరమాడాల్సిన పనిలేదు. పైగా ఆటో కంటే తక్కువ చార్జీ. ఏసీ సదుపాయం ఉంటుంది. అనుకున్న చోటుకు అనుకున్న సమయానికి చేరుకోవచ్చు. ఒక ప్రయాణికుడికి ఇంతకంటే ఏం కావాలి? – హరీష్, ప్రైవేట్ ఉద్యోగి ట్రైన్ దిగగానే క్యాబ్ రెడీగా ఉంది కొద్దిక్షణాల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో దిగు తామనగా క్యాబ్ బుక్ చేసుకున్నాం. స్టేషన్ బయటకు వచ్చే వరకు క్యాబ్ రెడీగా ఉంది. ఎలాంటి బేరసారాలు లేవు. డ్రైవ ర్ ఫొటో, బండి నంబర్, ఫోన్ నంబర్, సికింద్రాబాద్ నుంచి మల్కాజిగిరి వరకు అయ్యే రూ.135 చార్జీ వివరాలు అన్నీ ముందే ఫోన్లో నమోదయ్యాయి. నిశ్చిం తంగా బయలుదేరాం. క్యాబ్ సదుపాయం చాలా బాగుంది. – కుమారి మిగతా వాటి కన్నా క్యాబే బెటర్ బస్సు కోసం, ఆటో కోసం ఎదురు చూసే రోజులు పోయాయి. ప్రయాణానికి క్యాబ్ ఒక నిర్వచనంగా మారింది. మహిళలకు భద్రతాపరమైన కొన్ని ఇబ్బందులు ఉన్నమాట నిజమే కానీ, మిగతా ట్రాన్స్పోర్ట్ కంటే ఇది బెటర్ కదా. – రవి, శరణ్య దంపతులు మాకు కష్టంగానే ఉంది ఆటోలకు గిరాకీ లేదు. గతంలో రోజుకు రూ.1,200 వస్తే ఇప్పుడు రూ.800 కూడా రావడం లేదు. చాలా కష్టంగా ఉంది. ఆటో కిరాయి రూ.300, ఎల్పీజీ ఖర్చు రూ.250 మినహాయిస్తే ఒక రోజుకు రూ.200 కూడా గిట్టుబాటు కావడం లేదు. క్యాబ్ల వల్ల పోటీ బాగా పెరిగింది. – మహ్మద్ అబ్దుల్లా, ఆటో డ్రైవర్ ఆదాయం అంతంతే ఓలా, ఉబెర్, క్యాబ్ల వల్ల ప్రయాణికులకు బాగానే ఉన్నా ఈ రంగంలో పెరిగిన పోటీ కారణంగా ఆదాయం బాగా పడిపోయింది. రోజుకు 18 గంటలు కష్టపడితే తప్ప రూ.1000 లభించడంలేదు. గతంలో వారానికి రూ.1,500 ప్రోత్సాహకంగా ఇచ్చేవారు. ఇప్పుడు పూర్తిగా తగ్గించారు. కమీషన్లు, ట్యాక్స్లు చెల్లిస్తే మాకు దక్కేది కూడా తక్కువే. – బాబర్, క్యాబ్ డ్రైవర్ -
5 నుంచి సిటీబస్సుల సందడి
మొదటి రెండు రోజులూ ఉచితం ∙ ఎంపీ మురళీమోహ¯ŒS రాజమహేంద్రవరం సిటీ : ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి ఆర్టీసీ సిటీ బస్సులు నడిపేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్టు ఎంపీ మురళీమోహ¯ŒS పేర్కొన్నారు. ఆదివారం కార్పొరేష¯ŒS కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఎంపీ మాట్లాడుతూ రెండు రోజుల పాటు ఉచితంగా నడిపేందుకు ఆర్టీసీ అధికారులను ఆదేశించామన్నారు. మొదటి విడతగా 10 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఈ ఏడాది చివరకు దఫదఫాలుగా 50 బస్సులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉదయం 7.30 గంటలకు మొదలయ్యే ఈ బస్సులను నగర వాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ బస్సులు నడిచేందుకు వీలుగా రహదారి ఆక్రమణలు తక్షణమే తొలగించే చర్యలు చేపట్టాలని కమిషనర్ను కోరారు. బస్సులు ఆగేందుకు స్టాండ్లు ఏర్పాటు చేస్తామన్నారు. టిక్కెట్ ధర రూ.7 నుంచి రూ.18Sవరకూ నిర్ణయించారన్నారు. ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ నగరంలో పబ్లిక్ ట్రా¯Œ్సపోర్ట్ పెరగాలన్నారు. ప్రస్తుతం అధికారుల నిర్ణయించిన మూడు రూట్లలో కాకుండా ప్రయాణీకులకు అనువుగా ఉండే విధంగా బస్సులు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. కమినషర్ విజయరామరాజు, ఆర్టీసీ అధికారులు ఆర్వీఎస్ నాగేశ్వర్రావు, పెద్దిరాజు కుమార్ పాల్గొన్నారు. -
కొత్త రూట్లలో సిటీ బస్సులు..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పలు కొత్త రూట్లలో సిటీ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ పురుషోత్తం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబర్ 1 నుంచి సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. కోఠి–ఈసీఐఎల్ (40/16ఎన్) రూట్లో సెమీ లోఫ్లోర్ బస్సు అందుబాటులోకి రానుంది. ఇది ఏఎస్రావునగర్, సైనిక్పురి, నేరేడ్మెట్, సఫిల్గూడ, మల్కాజిగిరి, ఆలుగడ్డబావి, సికింద్రాబాద్, కవాడీగూడ, హిమాయత్నగర్ మార్గంలో కోఠి వరకు రాకపోకలు సాగిస్తుంది. బండ్లగూడ– జగద్గిరిగుట్ట (90బీ/30) మార్గంలో 3 మెట్రో ఎక్స్ప్రెస్లు బండ్లగూడ నుంచి ఉప్పల్ క్రాస్రోడ్స్ తార్నాక, సికింద్రాబాద్, బాలానగర్, ఐడీపీఎల్ మీదుగా జగద్గిరిగుట్టకు రాకపోకలు సాగించనుంది. ప్రణీత్ హౌసింగ్ కాలనీ నుంచి సికింద్రాబాద్ (10కె/పీ) రూట్లో 3 సెమీ లోఫ్లోర్ బస్సులు బాచుపల్లి, నిజాంపేట్, జేఎన్టీయూ, కేపీహెచ్బీ, ఎర్రగడ్డ, ఎస్ఆర్నగర్, బేగంపేట్ రూట్లో నడుస్తాయి. హయత్నగర్–గండిమైసమ్మ (290/272జీ) రూట్లో 2 మెట్రో ఎక్స్ప్రెస్లు ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, బాలానగర్, జీడిమెట్ల మీదుగా తిరుగనున్నాయి. జగద్గిరిగుట్ట– మెహదీపట్నం మార్గంలో (19కెజె) ఆర్డినరీ బస్సు ఆల్విన్ కాలనీ, కూకట్పల్లి, ఎర్రగడ్డ, అమీర్పేట్, రోడ్నెంబర్ 1 బంజారాహిల్స్, మాసాబ్ట్యాంక్ మార్గంలో నడుస్తుంది. హయత్నగర్–సికింద్రాబాద్ (290), కోఠి–సికింద్రాబాద్(40), దిల్సుఖ్నగర్–సికింద్రాబాద్(107వీఆర్), ఇబ్రహీంపట్నం–దిల్సుఖన్ నగర్(277డి) రూట్లలో అదనపు బస్సులు నడుపనున్నట్లు వెల్లడించారు. బస్సు సర్వీసుల పొడిగింపు.... మరి కొన్ని బస్సుల రూట్లను పొడిగించనున్నారు. కోఠి–కొండాపూర్ మధ్య నడిచే (127కె),కోఠి–నందినగర్ (127ఎన్) బస్సులను ఎల్బీనగర్ వరకు పొడిగిస్తారు. సికింద్రాబాద్–ఎల్బీనగర్ మధ్య నడిచే (40 ఎల్) బస్సును ఎన్జీవోస్ కాలనీ వరకు, వీఎస్టీ–బీర్బాగ్ (137) బస్సును జియాగూడ వరకు పొడిగిస్తారు. సికింద్రాబాద్–జియాగూడ (86జె) బస్సును టోలీమసీద్ వరకు నడుపుతారు. చార్మినార్– కాటేదాన్ మధ్య నడిచే (178కె) మినీ బస్సులను శ్రీరామ్ కాలనీ వరకు నడుపుతారు. కేశవగిరి–సికింద్రాబాద్ (102/38) బస్సులను ఈస్ట్మారేడ్పల్లి వరకు, హయత్నగర్–మెహదీపట్నం (156/126) బస్సులను జేఎన్ టీయూ వరకు పోడిగించనున్నారు. ఉప్పల్–మెహదీపట్నం (113 ఐఎం/126) మధ్య నడిచే బస్సులను జేఎన్టీయూ వరకు నడుపుతారు. కోఠి–ఇందిరానగర్ (74) మధ్య నడిచే బస్సులను మెహిదీపట్నం వరకు పొడిగించనున్నారు. -
పలు కొత్త రూట్లకు సిటీ బస్సులు
సాక్షి, సిటీబ్యూరో: సోమవారం నుంచి కొత్త రూట్లలో సిటీ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ పురుషోత్తమ్ ఒక ప్రకటనలో తెలిపారు. రిసాలాబజార్–గచ్చిబౌలీ (5 ఆర్జీ), సికింద్రాబాద్–దమ్మాయిగూడ (16డీ), కుషాయిగూడ–ఎన్జీవోస్ కాలనీ (17హెచ్ఎన్/90ఎల్ఆర్), ఎన్జీవోస్ కాలనీ–కేపీహెచ్బీ (186), ఈసీఐ ఎల్–గచ్చిబౌలీ (6ఎన్జీ), మేడ్చెల్–ఇబ్రహీంపట్నం(229/279) రూట్లలో బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ బస్సులు రాకపోకలు సాగించ నున్నాయి. -
మరిన్ని పట్టణాలకు సిటీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు కొత్త బస్సులు రానున్నాయి. యూపీఏ హయాంలో పెండింగ్లో ఉన్న ప్రతిపాదనలకు ఎన్డీయే ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. లక్ష నుంచి మూడు లక్షల జనాభా ఉన్న పట్టణాలను జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో చేరుస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా ఈ పథకం కింద కరీంనగర్ 70, ఖమ్మం, మహబూబ్నగర్లకు 30 చొప్పున కొత్త బస్సులను మంజూరు చేసింది. ఈ మేరకు సిటీ బస్సులు కొనేందుకు వీలుగా నిధులు మంజూరు చేసింది. దాదాపు ఆరు నెలల క్రితమే సూత్రప్రాయ అంగీకారం రావటంతో.. నిధులెలాగూ వస్తాయన్న ఉద్దేశంతో టీఎస్ ఆర్టీసీ ముందుగానే కొన్ని బస్సులు కొనుగోలు చేసి కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్ పట్టణాలకు కేటాయించింది. ఆరు పట్టణాలకు వెసులుబాటు... ఈ ఆర్థిక సంవత్సరంతో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం ముగిసి ‘అమృత్’ పథకం పూర్తిస్థాయిలో పట్టాలెక్కబోతున్నందున నిజామాబాద్, సిద్దిపేట, నల్లగొండ లాంటి కొత్త పట్టణాలకు ప్రతిపాదనలు త్వరగా పంపాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఆర్టీసీ అధికారులు త్వరలో సర్వే చేయనున్నట్టు తెలిసింది. ఆ బస్సులు మాకొద్దు... గతంలో ఈ పథకం కింద హైదరాబాద్కు కేంద్రం మంజూరు చేసిన బస్సుల బాడీ సరిగా లేకపోవటంతో తరచూ మరమ్మతులు చేయిస్తేగాని అవి నడవని దుస్థితి ఉండటం విశేషం. దీంతో ఈసారి ఆ బస్సులొద్దని, నిధులిస్తే అనుకూలంగా ఉండే బస్సులు సమకూర్చుకుంటామంటూ రాష్ట్రప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం సమ్మతించింది. -
రోడ్డెక్కిన 12 నూతన బస్సులు
ఖమ్మం: ఖమ్మం నగరంతో పాటు శివారు ప్రాంతాలకు సిటీ బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. జేఎన్ఎన్యూఆర్ఎం కింద కేంద్రం కేటాయించిన 12 నూతన బస్సులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నెస్పీ ప్రాంతంలో మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఓ బస్సులో మంత్రి తుమ్మలతోపాటు, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, సుధాకర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ గడిపల్లి కవిత, కలెక్టర్, ఇతర అధికారులు నగరంలో పర్యటించారు. -
ఆర్టీసీకి ‘మేడారం’ సవాల్
సాక్షి, హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరయ్యే అవకాశం. ఇప్పుడిది ఆర్టీసీకి పెద్ద సవాల్గా పరిణమించింది. రెండేళ్లకోమారు జరిగే మేడారం జాతర... తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి జరగబోతోంది. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించిన ప్రభుత్వం ఈ వేడుకనూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి భక్తుల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. భక్తులను మేడారానికి చేర్చాల్సిన ఆర్టీసీ కూడా ముందస్తు ప్రణాళికతో రంగంలోకి దిగింది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత జరుగుతున్న తొలి వేడుక కావడంతో ఆర్టీసీకి బస్సులు సరిపడక కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ వేడుకల కోసం 4 వేలకు పైచిలుకు బస్సులను కేటాయించారు. ఇందుకు హైదరాబాద్ నుంచి వేయి సిటీ బస్సులు, దానికి పొరుగు జిల్లాల నుంచి మరో వేయి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ల నుంచి మరో రెండు వేల బస్సులను కేటాయించారు. గత వేడుకల నాటికి రాష్ట్రం ఉమ్మడిగా ఉండటంతో ఆంధ్ర ప్రాంతంలో తిరిగే బస్సులను, అక్కడి సిబ్బందిని వినియోగించుకునేవారు. ఈసారి కేవలం తెలంగాణ బస్సులు, తెలంగాణ ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలనే యోచనలో అధికారులున్నారు. ఇటీవల సంక్రాంతి పండుగ సమయంలో హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రాంతం వారిని స్వస్థలాలకు చేర్చే బాధ్యతను పూర్తిగా ఏపీఎస్ఆర్టీసీనే తీసుకుంది. దాదాపు రెండున్నరవేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి సుమారు 20 లక్షల మందిని తరలించింది. తుదకు విజయవాడ నుంచి సిటీ బస్సులను రప్పించి వినియోగించారు. ఇప్పుడు మేడారం జాతరను కూడా తానొక్కటే నిర్వహించాలనే యోచనలో టీఎస్ఆర్టీసీ ఉంది. దీంతో సాధారణ బస్సులు సరిపోక వేయి వరకు సిటీ బస్సులను రంగంలోకి దించారు. జాతరకు పిల్లాపాపలతో వచ్చే భక్తులకు వెనక డోర్ ప్రమాదకరంగా మారుతుందన్న ఉద్దేశంతో యుద్ధప్రాతిపదికన ఇనుపరేకులతో మూయించేశారు. చలిగాలుల నుంచి కూడా రక్షణగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయా డిపోల్లో తలుపులు మూయించే పని పూర్తి చేసి సోమవారం నుంచి వాటిని వివిధ ప్రాంతాలకు పంపనున్నారు. వీటిల్లో కొన్ని డొక్కు బస్సులు కూడా ఉన్నాయి. వాటిని గ్యారేజీలకు పంపి ఫిట్నెస్ పరీక్షించి కొత్త బ్రేకులు, ఇతర అవసరమైన కొత్త పరికరాలు కూడా బిగించేశారు. 20 లక్షల మందికిపైగా... గత ఏడాది మేడారం వేడుకలో దాదాపు 18 లక్షల మందిని ఆర్టీసీ బస్సుల్లో తరలించారు. ఈసారి కనీసం 20 లక్షల మంది భక్తులను తరలించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఆదాయం కూడా రూ.20 కోట్ల వరకు సమకూరుతుందని అంచనా. బస్సుల సంఖ్య పరిమితంగా ఉన్నందున ట్రాఫిక్ చిక్కుల్లో ఇరుక్కుని సకాలంలో రాకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నందున వరంగల్ నుంచి మేడారం మార్గం, తిరిగి వచ్చే మార్గాలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. వచ్చేమార్గం 20 కి.మీ. దూరం పెరిగింది. కానీ ఎదురురెదురుగా వాహనాలు వచ్చే అవకాశం లేనందున బస్సులు తొందరగా గమ్యస్థానాలకు చేరే అవకాశం ఉంటుం దని అధికారులు చెబుతున్నారు. డీజిల్ సమస్య ఉత్పన్నం కాకుండా ప్రైవేటు బం కుల్లో పోయించుకునే ఏర్పాటు చేశారు. 40 తాత్కాలిక బస్టాండ్లను ఏర్పాటు చేశారు. -
ఏపీఎస్ ఆర్టీసీకే ‘సంక్రాంతి’
♦ హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు ♦ రద్దీని సొమ్ము చేసుకోవడానికి విజయవాడ సిటీ బస్సులు ♦ ఆదాయం పొందే అవకాశమున్నా.. చేతులెత్తేసిన టీఎస్ ఆర్టీసీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ఎల్బీనగర్ కూడలి ప్రాంతం.. సంక్రాంతి పండుగ కోసం ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతోంది.. విజయవాడలో తిరిగే సిటీ బస్సులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఎల్బీనగర్లో ఆగుతున్నాయి.. ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లిపోతున్నాయి. వాటితోపాటు ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన గరుడ, డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులూ పెద్ద సంఖ్యలో వచ్చి జనాన్ని తీసుకెళుతున్నాయి. ఇంతగా ప్రయాణికుల రద్దీ ఉన్నా తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సులేవీ అక్కడ కనబడడం లేదు. భారీ స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశమున్నా ఇక్కడి అధికారులు పట్టించుకోవడం లేదు. హైదరాబాద్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటే బస్సులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తెలంగాణ ఆర్టీసీకి ఉంటుంది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులను చేరవేయడం ద్వారా భారీగా ఆదాయమూ దక్కే అవకాశం ఉంది. కానీ సంక్రాంతి రద్దీ వేళ పరిస్థితి ఇం దుకు పూర్తి విరుద్ధంగా కొనసాగుతోంది. ‘సంక్రాంతి’ ప్రయాణికులను చేరవేసి గంపగుత్తగా ఆదాయం పొందేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రణాళికాబద్ధంగా దూసుకుపోతుండగా.. తెలంగాణ ఆర్టీసీ మాత్రం చోద్యం చూస్తోంది. అదేమంటే ఆంధ్రా ప్రాంతానికి తిప్పేందుకు పర్మిట్లు లేవని చెబుతోంది. ఆ పర్మిట్లలో మూడొంతులకుపైగా ఏపీఎస్ ఆర్టీసీ చేతిలో ఉన్నా... ఇంతకాలం నోరుమెదపకుండా.. ఇప్పుడు నిస్సహాయత వ్యక్తం చేస్తుండడంపై టీఎస్ఆర్టీసీ సిబ్బందే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 3 వేలకుపైగా ప్రత్యేక బస్సులు.. హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగ కోసం ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు దాదాపు 20 లక్షల మంది వరకూ వెళ్తారు. ఇందుకోసం ఏటా ప్రత్యేక బస్సులు వేస్తారు. రద్దీబాగా పెరిగితే హైదరాబాద్ సిటీ బస్సులకు ‘స్పెషల్’ బోర్డులు తగిలించి నడిపారు కూడా. కానీ ఈసారి ఆ ‘స్పెషల్’ బస్సులుగా విజయవాడ సిటీ బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ రంగంలోకి దింపింది. అవి ఇమ్లీబన్ బస్స్టేషన్ వరకు వస్తే టీఎస్ ఆర్టీసీ సిబ్బంది అడ్డుకునే అవకాశం ఉంటుందని భావించిన ఏపీ అధికారులు వాటిని ఎల్బీనగర్ వరకే పరిమితం చేశారు. మొత్తంగా ఏపీఎస్ ఆర్టీసీ మూడువేలకు పైగా ప్రత్యేక బస్సులను రంగంలోకి దింపింది. మరోవైపు ఈ సీజన్లో కనీసం రూ.5 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశం ఉండి కూడా తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ఆంధ్రాప్రాంతానికి అదనపు బస్సులను తిప్పడం లేదు. సంక్రాంతి కోసం రెండు వేలకుపైగా ప్రత్యేక బస్సులు తిప్పుతున్నట్టు ఇటీవల ప్రకటించినా... వాటిని కేవలం తెలంగాణ జిల్లాలకే పరిమితం చేసింది. -
ఆర్టీసీలో స్మార్ట్కార్డులు
సాక్షి, హైదరాబాద్: సిటీబస్సుల్లో స్మార్టుకార్డులను ప్రవేశపెట్టేందుకు గ్రేటర్ ఆర్టీసీ ప్రణాళిక లను సిద్ధం చేసింది. రోజువారీ టికెట్లు, నెలవారీ బస్పాస్లను కూడా ఇక నుంచి స్మార్ట్కార్డుల రూపంలో అందజేయనున్నారు. ప్రయాణికులు తమ అవసరం మేరకు కార్డులను కొనుగోలు చేయవచ్చు. జేబులో నగదు లేకపోయినా సరే ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా సిటీబస్సుల్లో పయనించేందుకు స్మార్టుకార్డులు ప్రీపెయిడ్ తరహాలో ఉపయోగపడతాయి. జీపీఎస్ విధానంతో బస్సుల ట్రాకింగ్, బస్స్టేషన్లలో వైఫై ఐటీ ఆధారిత సేవలను ఏర్పాటు చేసిన ఆర్టీసీ.. ప్రస్తుతం మరో అడుగు ముందుకేసి టికెట్లెస్, క్యాష్లెస్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ముంబైలో బస్పాస్లకు మాత్రమే పరిమితమైన స్మార్ట్కార్డు సదుపాయాన్ని గ్రేటర్లో బస్పాస్లతో పాటు డైలీ టికెట్లకు కూడా విస్తరించనున్నారు. నగరంలోని మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు, మెట్రో డీలక్స్లు, మెట్రో ఎక్స్ప్రెస్ల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి ఆ తరువాత అన్ని బస్సుల్లో ఈ సదుపాయాన్ని అమలు చేసేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. ఈ మేరకు స్మార్ట్కార్డుల పనితీరును త్వరలో ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉన్న ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా పరిశీలించి, ప్రయాణికులకు అందుబాటులోకి తేవడానికి కొంత సమయం పట్టవచ్చునని ఆయన తెలిపారు. అలాగే నగరానికి వచ్చే పర్యాటకులు, సందర్శకులు సైతం తమ ప్రయాణ అవసరాన్ని బట్టి రూ.50, రూ.100 మొదలుకొని రూ.1,000 ల విలువైన కార్డులను కూడా కొనుగోలు చేయవచ్చు. కండక్టర్ వద్ద కొనుక్కోవచ్చు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే స్మార్ట్కార్డులలో మైక్రో చిప్లు ఏర్పాటు చేస్తారు. ఆ కార్డు విలువ అందులో నమోదై ఉంటుంది. ప్రస్తుతం కండ క్టర్ల వద్ద ఉన్న టికెట్ ఇష్యూయింగ్ (టిమ్స్) మిషన్లకు స్మార్ట్కార్డులను కూడా స్వీకరించే మరో ఆప్షన్ను ఇస్తారు. ప్రయాణికులు పయనించిన దూరానికి చెల్లించవలసిన చార్జీలు స్మార్ట్కార్డు నుంచి నేరుగా ఆర్టీసీ ఖాతాలో జమ అయ్యే విధంగా ఈ టిమ్స్ యంత్రాలను అనుసంధానం చేస్తారు. నగరంలోని బస్పాస్ కౌంటర్లతో పాటు, కండక్టర్ల వద్ద కూడా స్మార్ట్కార్డులు లభిస్తాయి. స్మార్ట్కార్డులు వద్దనుకున్నవాళ్లు సాధారణ టికెట్లపైన ప్రయాణం చేయవచ్చు.ప్రస్తుతం బస్పాస్ల కోసం కౌంటర్ల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. రద్దీ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్మార్ట్కార్డులు అందుబాటులోకి వస్తే ఇలాంటి పడిగాపులు ఉండవు. క్షణాల్లో డబ్బులు చెల్లించి కార్డులు కొనుగోలు చేయవచ్చు. -
సిటీ బస్సులపై రాళ్ల వర్షం
హైదరాబాద్: కొందరు ఆందోళనకారులు రెండు సిటీ బస్సులపై రాళ్లు రువ్వి వాటి అద్దాలు ధ్వంసం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చే స్తూ.. అఖిలపక్షాలు చేపట్టిన బంద్లో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని డిపోల ఎదుట శాంతీయుతంగా నిరసనలు తెలుపుతున్న విపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి, దగ్గర్లో ఉన్న పీఎస్లకు తరలించారు. కాగా.. నగరంలోని ఆబిడ్స్ జీపీఓ వద్ద రెండు సిటీ బస్సులపై కొందరు ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రెండు బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తూ బస్సుల్లో ఉన్న ఎవరికీ గాయాలు కాలేదు. మరో వైపు రాజేంద్రనగర్లో ఆందోళన చేపట్టిన మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పల్లిలో కొందరు ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులపై రాళు రువ్వారు. ఈ ఘటనలో బసు అద్దాలు ధ్వంసం అయ్యాయి. -
బస్..తుస్!
మూణ్ణాళ్ల ముచ్చటగా జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు వెయ్యికి పైగా డొక్కువే మెట్రో సర్వీసులు ప్రధాన రూట్లకే పరిమితం శివారు ప్రాంతాలకు అరకొరగానే... ఇదీ నగరంలో ఆర్టీసీ తీరు సిటీబ్యూరో: సిటీ బస్సులు ప్రయాణికులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఏ బస్సు ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. నడిరోడ్డుపై అర్ధాంతరంగా నిలిచే డొక్కు బస్సుల కారణంగా లక్షలాది మంది ప్రయాణికులు సకాలంలో గమ్యం చేరుకోలేక పోతున్నారు. ఆర్టీసీపై నమ్మకం కోల్పోయిన ప్రజలు సొంత వాహనాలను, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాదిలో సుమారు 3.36 లక్షల కొత్త వాహనాలు రోడ్లపైకి రావడం ప్రజా రవాణా డొల్లతనానికి నిదర్శనం. గ్రేటర్ పరిధిలోని 28 డిపోలలో 3,850 బస్సులు ఉంటే... వాటిలో సుమారు 1000 బస్సులు డొక్కువే. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద 2008-2010 మధ్య కాలంలో వచ్చిన వందలాది బస్సులు ఐదారేళ్లకే బ్రేక్డౌన్ స్థితికి చేరుకున్నాయి. సుమారు రూ.160 కోట్ల నష్టాలతో నడుస్తున్న గ్రేటర్ ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేయలేక... డొక్కువి నడపలేక ప్రయాణికులకు దూరమవుతోంది. గత అయిదేళ్లలో ఆక్యుపెన్సీ రేషియో 72 నుంచి 68 శాతానికి పడిపోవడమే దీనికి ప్రబల నిదర్శనం. 15 వేల కిలోమీటర్ల మేర రద్దు ఒకవైపు రూ.కోట్లు ఖరీదు చేసే ఓల్వో వంటి అధునాతన బస్సులను సమకూర్చుకుంటున్న గ్రేటర్ ఆర్టీసీ... ఉన్న బస్సుల నిర్వహణలో విఫలమవుతోంది. ప్రస్తుతం 3,850 సిటీ బస్సులు ఉండగా... అందులో 2,500 మాత్రమే ఆర్డినరీవి. మిగతావి ఏసీ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్ప్రెస్లు. జేఎన్ఎన్యూఆర్ఎం కింద కొనుగోలు చేసిన వాటిలో 500కు పైగా మెట్రో ఎక్స్ప్రెస్లు, మరో 500 ఆర్డినరీ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. సాధారణంగా ఒక బస్సు 15 సంవత్సరాల పాటు లేదా 11.5 లక్షల కిలోమీటర్ల వరకు సేవలందిస్తుంది. జేఎన్ఎన్యూఆర్ఎం బస్సుల జీవిత కాలం ఏడెనిమిదేళ్లకే ముగుస్తోంది. నిత్యం 20 నుంచి 25 బస్సులు ఎక్కడో ఒకచోట ఆగిపోతున్నాయి. దానికితోడు మెట్రో పనులు, ట్రాఫిక్ రద్దీ వంటి కారణాల వల్ల రోజూ వేలాది ట్రిప్పులు రద్దవుతున్నాయి. ఇలా 12వేల నుంచి 15 వేల కిలోమీటర్ల వరకు రద్దవుతున్నట్లు అంచనా. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు విడిభాగాల కొరత కూడా బ్రేక్డౌన్లకు ఆజ్యం పోస్తోంది. సకాలంలో నట్లు, బోల్టులు, బ్రష్లు, కమాన్పట్టాలు, ఇతర టెక్నికల్ స్పేర్పార్ట్స్ అమర్చకపోవడం వల్ల బస్సులు మొండికేస్తున్నాయి. సికింద్రాబాద్, బేగంపేట్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, కోఠి, అబిడ్స్, పంజగుట్ట వంటి రద్దీ ప్రాంతాల్లో బస్సులు బ్రేక్డౌన్ కావడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభిస్తోంది. శివార్లలో తప్పని పడిగాపులు ఎల్బీ నగర్ నుంచి లింగంపల్లికి, దిల్సుఖ్నగర్ నుంచి పటాన్చెరుకు, కోఠి నుంచి బీహెచ్ఈఎల్కు ప్రతి 5- 10 నిమిషాలకు ఒక బస్సు బయలుదేరుతాయి. కానీ ఎల్బీనగర్కు కూతవేటు దూరంలో ఉన్న మన్సూరాబాద్కు సిటీ బస్సు ఎప్పుడొస్తుందో... ఎప్పుడు వెళ్తుందో తెలియదు. జీడిమెట్ల-జగద్గిరిగుట్ట మధ్య బస్సుల జాడ కనిపించదు. బ్రేక్డౌన్లతో సిటీ బస్సులు ప్రధాన రూట్లకే పరిమితమవుతున్నాయి. నగర శివార్లకు, కొత్తగా ఏర్పడే కాలనీలకు బస్సులు అందుబాటులో ఉండడం లేదు. చీకటి పడితే చాలు... బస్సుపై ఆశలు వదులుకోవలసి వస్తోంది. అనేక కాలనీలకు రాత్రి 9 దాటితే బస్సులు వెళ్లడం లేదు. ఎల్బీనగర్ కేంద్రంగా ఉన్న కొత్తపేట, రామకృష్ణాపురం, సరూర్నగర్, మన్సూరాబాద్, కర్మన్ఘాట్, చిన్నరావిరాల, పెద్దరావిరాల, బండరావిరాల, గౌరెల్లి, బాచారం తదితర ప్రాంతాలకు బస్సులు చాలా తక్కువ.జీడిమెట్ల పారిశ్రామికవాడను ఆనుకొని వందలాది కాలనీలు ఉన్నాయి. కానీ అనేక ప్రాంతాలకు ఉదయం, సాయంత్రం రెండు, మూడు ట్రిప్పులకే బస్సులు పరిమితం.బాలానగర్లోని సాయినగర్, జీడిమెట్ల- జగద్గిరిగుట్ట, మచ్చబొల్లారం ప్రాంతాలకు సిటీబస్సు గగనమే. నేరేడ్మెట్, మల్కాజిగిరి ప్రాంతాలను ఆనుకొని ఉన్న 150 కాలనీలకు ఇప్పటికీ అరకొర బస్సులే.కాప్రా పరిధిలోని అంబేద్కర్ నగర్, సాయిబాబా నగర్, వంపుగూడ తదితర ప్రాంతాల్లోని వందలాది కాలనీల ప్రజలకు నిత్యం పడిగాపులు తప్పడం లేదు. పర్వాతాపూర్లోని సత్యనారాయణపురం, శ్రీనివాసపురం, లక్ష్మీనగర్, మల్లికార్జున నగర్. సాయిప్రియ నగర్ తదితర కాలనీల కు రాత్రి 9 దాటితే బస్సులు బంద్.శేరిలింగంపల్లి పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, మయూరి నగర్, బీకే ఎన్క్లేవ్, గోకుల్ ఫ్లాట్స్ వంటి ప్రాంతాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం తక్కువే. -
లగ్జరీలో..దర్జాగా..!
సాక్షి, గుంటూరు : రాజధాని నగరమైన గుంటూరులో భోపాల్, ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల తరహాలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సిటీ బస్సులు నడిపేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. గుంటూరు నగరంలో కాలం చెల్లిన సిటీ బస్సులు నడుస్తుండటంతో కాలుష్యం అధికంగా ఉంటుంది. అంతేకాక, సిటీ బస్సుల్లో ప్రయాణం నరకప్రాయంగా ఉంటుందని ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికితోడు సిటీ బస్సులతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. గుంటూరును సుందరంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే అనేక ప్రణాళికలు రూపొందించిన నగరపాలక సంస్థ అధికారులు సిటీ బస్సుల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ ట్రావెల్స్ కంపెనీలకు అప్పగించి పర్యవేక్షించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా నగరంలో అర్బన్ మాస్టర్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ సర్వే నిర్వహిస్తోంది. టెండర్ల ద్వారా నేషనల్ లెవల్ బిడ్డింగ్ నిర్వహించి సిటీ బస్సుల నిర్వహణ ప్రైవేట్ ట్రావెల్స్ కంపెనీలకు అప్పగించనున్నట్లు కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీకి షేర్ ఇచ్చే యోచన... నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సిటీ బస్సులు నడపాలంటే ఏపీఎస్ఆర్టీసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్టీసీ ద్వారా నగరంలో సిటీ బస్సులు నడపా లనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదు. మామూలు బస్సులు కాకుండా రాజధాని నగరంలో అందుకు తగ్గ లగ్జరీ బస్సులు నడిపి సిటీ లుక్కు తేవాలని కమిషనర్ కన్నబాబు భావిస్తున్నారు. ఈ తరహా బస్సులు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండటంతోపాటు నగరపాలక సంస్థకు ఆదాయం భారీగా రాగలదని అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదనలను ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు అంగీకరించని పక్షంలో సంయుక్తంగా నిర్వహించేలా ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. సిటీ బస్సుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్టీసీ, జీఎంసీలు షేర్ చేసుకొనేలా ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే నిర్వహణ బాధ్యతలు పూర్తిగా తామే చేపట్టేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు నగరపాలకసంస్థ అధికారులు సమాయత్తమవుతున్నారు. సిటీ లుక్ తేవడంతోపాటు ఆదాయం సమకూరుస్తాం.. నగరానికి రాజధాని సిటీ లుక్ తేవడంతోపాటు ఆదాయాన్ని సమకూర్చేందుకు సిటీ బస్సులను నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఏర్పాటు చేస్తున్నాం. ఆర్టీసీతో షేరింగ్ చేసుకునే ఆలోచనలో ఉన్నాం. నిర్వహణ బాధ్యతలను మాత్రం నగరపాలక సంస్థ చూసుకుంటుంది. - కె.కన్నబాబు, జీఎంసీ కమిషనర్ కార్యరూపం దాల్చని ఆర్టీసీ ప్రతిపాదన పట్నంబజారు (గుంటూరు) : గుంటూరు నగరంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో సిటీ బస్సులు తిప్పాలనే ప్రతిపాదన ఎప్పటి నుండో ఉంది. ఈ విషయంలో అధికారులు తాత్సారం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు రాగానే నగరంలో సిటీ సర్వీసుగా తిప్పుతామని చెప్పిన ఆర్టీసీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇటీవల జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు 50 వచ్చినా వాటిని గుంటూరు సిటీకి కేటాయించకుండా రీజియన్ పరిధిలో తిప్పుతున్నారు. పుష్కరాల అనంతరం సిటీ సర్వీసులు జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు సిటీలో తిప్పాలని ఆలోచన చేస్తున్నాం. ప్రస్తుతం వచ్చిన బస్సులు రీజియన్ పరిధిలో ట్రయల్ రన్లో భాగంగా నడుస్తున్నాయి. బస్సులన్నీ కేవలం సిటీ సర్వీసుల కోసం వచ్చినవి కావు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రధాన ప్రాంతాల్లో తిప్పుతాం. గోదావరి పుష్కరాల అనంతరం సిటీ సర్వీసులు నగరంలో కచ్చితంగా తిరుగుతాయి. - జ్ఞానంగారి శ్రీహరి, ఆర్టీసీ ఆర్ఎం. -
కడపలో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు
-
విశాఖ సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
విశాఖపట్నం(ద్వారకానగర్): దూర ప్రాంత ప్రయాణికులు విశాఖ సిటీ బస్సుల్లో ఇకపై ఉచితంగా ప్రయాణించొచ్చు. దూర ప్రాంత బస్..బస్టాండ్లో బయలుదేరే సమయానికి రెండు గంటల ముందు నుంచి ఇలా ప్రయాణించేందుకు అవకాశం ఉంది. అలాగే, దూర ప్రాంతాల నుంచి విశాఖ చేరుకున్న వారు కూడా ఈ సౌకర్యం పొందే వీలుంది. అయితే, వారు విశాఖ బస్స్టేషన్లోని డ్యూటీ కంట్రోలర్ వద్ద ప్రయాణపు టికెట్టుపై స్టాంపు, సంతకం చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ సమయం నుంచి వారు రెండు గంటల వరకు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించినట్లు విశాఖ రీజినల్ మేనేజర్ సుధీష్కుమార్ పేర్కొన్నారు. -
సూపర్ ఫిట్
తమకు 44 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం... ఆర్టీసీ కార్మికుల్లో ఆనందోత్సాహాలను నింపింది. దీంతో వివిధ ప్రాంతాల్లో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులు వేడుకల్లో మునిగి తేలారు సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణతో బుధవారం సాయంత్రం సిటీ బస్సులు రోడ్డెక్కాయి. గురువారం ఉదయం నుంచి ఆర్టీసీ సేవలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు తెలిపారు. ఆశించిన దానికన్నా ఒక శాతం ఎక్కువే సాధించుకున్న కార్మికులు సమ్మె విరమించి సంబరాలు చేసుకున్నారు. డిపోలు, బస్ భవన్, జూబ్లీ, ఎంజీబీఎస్, తదితర బస్ స్టేషన్ల వద్ద కార్మికులు మిఠాయిలు పంచుకున్నారు. టపాసులు పేల్చి విజయోత్సవాలు నిర్వహించారు. బుధవారం ఉదయం కార్మికుల ధర్నాతో దద్దల్లిన బస్భవన్ ప్రాంగణం... సాయంత్రం విజయోత్సవ నినాదాలతో మిన్నంటింది. అన్ని డిపోల వద్ద టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ల నేతృత్వంలో వేడుకలు జరిగాయి. 44శాతం ఫిట్మెంట్ ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే అప్పటి వరకు సమ్మెలో ఉన్న కార్మికులంతా సంబరాల్లో మునిగిపోయారు. నిరసన ప్రదర్శనలు విజయోత్సవాలుగా మారాయి. వివిధ ప్రాంతాల్లో సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంతోషాన్ని ప్రకటించారు. అంతకు కొద్దిసేపటి క్రితం వరకు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కార్మికులు... ఆ తరువాత జిందాబాద్లతో హోరెత్తించారు. గ్రేటర్ హైదరాబాద్లోని 28 డిపోలలో పని చేసే సుమారు 24 వేల మంది కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, సూపర్వైజర్లు, వివిధ కేటగిరీల ఉద్యోగులకు ఫిట్మెంట్ పెంపుతో ప్రయోజనం లభించనుంది. మరోవైపు ఎనిమిది రోజుల పాటు బస్సులు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జరుగనున్న దృష్ట్యా విద్యార్థులు, తల్లిదండ్రులు ఊర ట చెందుతున్నారు. ఇప్పటికే రూపొందించిన ప్రణాళిక ప్రకారం ఎంసెట్కు 600కు పైగా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను యధావిధిగా నడపనున్నట్లు ఈడీ జయరావు చెప్పారు. గురువారం ఉదయం నుంచి అన్ని డిపోల పరిధిలో పూర్తి స్థాయిలో 3850 బస్సులు రోడ్డెక్కనున్న దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను కూడా గురువారం నుంచి పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. నరకం చూశారు... ఆర్టీసీ కార్మికుల సమ్మెతో నగరంలో ప్రయాణికులు ఎనిమిది రోజుల పాటు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన ప్రయాణికులు ఉదయం, సాయంత్రం వేళల్లో నరకం చవి చూశారు. మరోవైపు ఆటోలు, ప్రైవేట్ వాహనాల దోపిడీ తారస్థాయికి చేరింది. చార్జీలు రెండు, మూడు రెట్లు పెంచి... ప్రయాణికులను దోచుకున్నారు. నగరం నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులు, ట్యాక్సీలు, వివిధ రకాల రవాణా వాహనాలు సైతం నిలువుదోపిడీకి పాల్పడ్డాయి. ప్రైవేట్ కండక్టర్లు, డ్రైవర్లు ఆటోవాలాల కు ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రయాణికుల నుంచి ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేశారు. టిక్కెట్లు ఇవ్వకుండా కొంతమొత్తం జేబుల్లో వేసుకొని మిగిలిన సొమ్ము ఆర్టీసీ డిపోల్లో జమ చేశారు. నగర శివారు ప్రాంతాలకు, కాలనీలకు రాత్రి వేళల్లో బస్సులు లేకపోవడంతో సాయంత్రం విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఫిట్మెంట్ పెంపు నేపథ్యంలో చార్జీలను పెంచనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో నగరంలోని 35 లక్షల మంది ప్రయాణికులు భారం మోసేందుకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
బస్సులు నడుస్తున్నాయి కానీ...
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ ఇస్తే కానీ బస్సులు తిప్పేది లేదంటూ ఆర్టీసీ కార్మికులు భీష్మించుకోవటంతో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి దెబ్బే తగిలింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టున పడేయటంతో పాటు, లాభాలు పుంజుకోవాలంటే అందుకు వేసవి కాలమే అసలైన సీజన్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు ...వేసవితో పాటు మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా కలసి రావడంతో ఎంతో కొంత లాభాలు పండించు కోవచ్చని ఆర్టీసీ యాజమాన్యం ఆశపడింది. టైమ్ చూసి దెబ్బ కొట్టినట్లు కార్మికులు సమ్మె రూపంలో ఆ ఆశను ఆడియాశ చేశారు. సమ్మె నేపథ్యంలో ఇరు రాష్ట్రాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమానులు, ఆటోవాలాలు ఎంత దండుకోవాలో అంత దండుకుంటున్నారు. వారి రేట్ల దెబ్బకు ఏ వాహనం లేని మధ్య తరగతి ప్రజల జేబులు గుల్ల అవుతున్నాయి. అయితే నగర జీవులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిటీ బస్సులు నడిపిస్తాంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించినా అది ఆచరణలో అటకెక్కింది. పంతం కొద్దీ కాంట్రాక్ట్ డ్రైవర్కు రూ.1000, కండక్టర్కు రూ.800 ఇచ్చి తాత్కాలిక ఉద్యోగులను నియమించి అరా కొరా బస్సులు తిప్పుతున్నా అవి ఎటూ సరిపోవటం లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ , ఆటోవాలాల బాదుడు నుంచి తప్పించుకునేందుకు ఆర్టీసీ బస్సుల కోసం పడిగాపులు పడి.. అవి ఎక్కినా...అక్కడ కూడా మరో రకం బాదుడే. బస్సు ఎక్కాక తీరిగ్గా బస్సులో పాస్లు చెల్లవు ... టికెట్ తీసుకోవాలంటూ కండాక్టర్లు చెప్పడంతో.. ముందే డబ్బు కట్టి బస్ పాస్లు తీసుకున్న వాళ్లకు షాక్. అదేమని ప్రశ్నిస్తే... డిపో మేనేజరే చెప్పారంటూ సమాధానం. అంతేకాకుండా ఏడు రూపాయల టిక్కెట్ ఇచ్చి పది రూపాయలు ముక్కుపిండి మరీ వసూలు చేయటం విశేషం. అదేమంటే...అంతే ఇష్టమైన ఎక్కు...లేకుంటే దిగిపో అని గీరగా సమాధానం వస్తుంది. వెరసి కడుపుమండిన బడుగు జీవులు.. నానా తిట్లు లక్కించుకోవటం, నాశనం అయిపోతారు, నీ బొందలో పెట్టుకో, పబ్లిక్ వెర్రోళ్లా...అంటూ శాపనార్థాలు. ఇంతదానికి బస్సులు తిప్పుడెందుకు అంటూ పాస్ హోల్డర్లు ఆర్టీసీని దుమ్మెత్తి పోస్తున్నారు. బస్సులు నడుస్తున్నాయి కానీ ... బస్ పాస్లు నడవటం లేదంటూ గొణుక్కోవటం మినహా మరేమీ చేయలేకపోతున్నారు. -
నెలలోగా కడపకు సిటీ బస్సులు
కడప అర్బన్ : ఆర్టీసీ ఆధ్వర్యంలో మే నెలాఖరులోపు కడపకు 40 సిటీ బస్సులు వస్తాయని కడప రీజినల్ మేనేజర్ గోపినాథరెడ్డి తెలిపారు. బుధవారం తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. సిటీ బస్సులన్నీ కడప డిపో-2 పర్యవేక్షణలో నడుస్తాయన్నారు. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ (జేఎన్ఎన్యూఆర్ఎం) సౌజన్యంతో ఈ బస్సులు రానున్నాయన్నారు. సెమి ఫ్లోర్తో ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా 20 నుంచి 30 లక్షల ఖర్చుతో ఒక్కో బస్సు ఆధునిక పరిజ్ఞానం ఐటీ, జీపీఎస్ ద్వారా స్టేజీ పేర్లు డిస్ ప్లే అవుతాయన్నారు. బస్సులో ప్రయాణించేవారికి రాబోయే స్టేజీ పేరు డి స్ ప్లే కావడం వల్ల అప్రమత్తంగా ఉంటారన్నారు. కడపలో సిటీ బస్సులు విజయవంతమైతే ప్రొద్దుటూరులో కూడా నడుపుతారని తెలిపారు. దాదాపు 40 కిలోమీటర్ల పరిధిలో ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయన్నారు. రూటుమ్యాప్ను త్వరలోనే రూపొందిస్తామన్నారు. సౌకర్యాల కల్పనకు దాతల ముందడుగు ఆర్టీసీ బస్టాండ్లలో మంచినీటి సౌకర్యంగానీ, ఇతర సౌకార్యల ఏర్పాటుకు దాతలు ముందుకు వస్తున్నారని ఆర్ఏం తెలిపారు. రాయచోటిలో ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశారని, దీని కోసం లక్షలాది రూపాయలు విరాళంగా ఇచ్చారని తెలిపారు. ప్రొద్దుటూరులో అద్దె బస్సుల అసోసియేషన్ ఆర్వో ప్లాంటును ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. అలాగే కడపలో ఐఓసీ వారు ఆర్వో ప్లాంటును ప్రయాణీకుల సౌకర్యార్థం బస్టాండులో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. నష్టాలను తగ్గించే ప్రయత్నం కడప రీజియన్ పరిధిలో ఆర్టీసీ నష్టాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని ఆర్ఎం తెలిపారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 68 కోట్లు నష్టం వచ్చిందన్నారు. 2014-15 సంవత్సరానికి ఆ నష్టం రూ. 65 కోట్లకు చేరుకుందన్నారు. 2015-16 సంవత్సరానికి రూ. 62 కోట్లు లేక అంతకంటే తక్కువ వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. రద్దీ అధికంగా ఉన్న బస్సు సర్వీసుల రూట్లలో పల్లె వెలుగు స్థానాల్లో ఎక్స్ప్రెస్లు నడుపుతున్నామని తెలిపారు. భవిష్యత్తులో కడప- పులివెందుల, కడప-ప్రొద్దుటూరు, కడప-రాజంపేటలకు బస్సు సర్వీసులను పెంచుతామన్నారు. అవసరం లేని రూట్లలో బస్సు సర్వీసులను తగ్గించామన్నారు. తద్వారా నష్టాన్ని తగ్గించగలుగుతున్నామన్నారు. -
రాజధాని గ్రామాల్లో త్వరలో సిటీ బస్సులు
గుంటూరు : రాజధాని గ్రామాల్లో త్వరలో సిటీ బస్సులు నడుపుతామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. వచ్చే నెలలో సుమారు 200 బస్సులు కొనుగోలు చేయనున్నట్లు ఆయన ఆదివారమిక్కడ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. -
'కొందరు మగవాళ్లు మాట వినడంలేదు'
మహిళల భద్రత దృష్ట్యా సిటీ బస్సుల్లో 'స్లైడింగ్ డోరు సిస్టమ్' ఏర్పాటును పలువురు పురుషులు జీర్ణించుకోలేక పోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో ప్రవేశపెట్టిన స్లైడింగ్ వ్యవస్థ అంతగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చేసేందుకు సిటీ బస్సులలో మహిళల, పురుషుల సీట్లకు మధ్య స్లైడింగ్ డోర్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరు మగవాళ్లు మాత్రం ... ఆర్డినరీ సిటీ బస్సు ముందు డోర్ల నుంచి ఎక్కడం...మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లలో కూర్చోవటం తమ జన్మహక్కుగా వ్యవహరిస్తున్నారట. ఈ కొత్త సిస్టమ్ను అనుసరించడం లేదు. స్త్రీలకు మేం దూరంగా ఉండలేము అన్నట్లుగా ఉంది పురుషుల వ్యవహారం. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే... మధ్యవయస్సు వారితో ఎక్కువగా సమస్యలు తలెత్తుతున్నాయనేది కండక్టర్లు, డ్రైవర్ల వాదన. 'బస్సు ముందు డోరు భాగం అనేది స్త్రీలు, వృద్ధులు, వికలాంగులకు కేటాయించారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా కూడా మగవాళ్లు వినిపించుకోవడం లేదు' అని ఓ సిటీ బస్సు డ్రైవర్ అన్నారు. 'పురుషులకు కేటాయించిన సెక్షన్కు వెళ్లాలని ఎంత చెప్పినా మగవారు అర్థం చేసుకోవడం లేదు. మధ్య వయస్సు ఉన్న వారితోనే అసలు సమస్య వస్తుంది. ఆరోగ్యం బాగాలేదని కూర్చోవడానికి అనుమతించాలని మహిళల విభాగంలోనే ఉంటున్నారు. పెనాల్టీ లాంటిది ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ పరిస్థితి ఉండదు' అని ఓ మహిళా కండక్టర్ తెలిపారు. ఇక సిటీ బస్సుల్లో తమ కోసం కంపార్ట్మెంట్ ఏర్పాటు చేయడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ ఊపిరి పీల్చుకుంటుంటే... మగవారు మాత్రం స్లైడింగ్ డోరు వ్యవస్థను జీర్ణించుకోలేకపోతున్నారు. -
తెగువే మగువకు రక్షణ
సిటీ బస్సులు... కాలేజీ సెంటర్లు... ఎంఎంటీఎస్లు... ఏరియా ఏదైనా ఈవ్ టీజింగ్ మాత్రం కామనయిపోయింది. అమ్మాయిలను వేధించి ఆనందించే ఆకతాయిలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. చట్టాలు... వ్యవస్థలు... ఎన్ని ఉన్నా రోజూ ఎక్కడో అక్కడ ఈవ్ టీజర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. మరి దీనికి ఫుల్స్టాప్ పెట్టేదెవరు..? అమ్మాయిలను రక్షించేదెవరు? ఇవే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్నలు. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూసే కంటే.. మనల్ని మనం రక్షించుకొనే ప్రయత్నం చేస్తే వీటి నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చని చూపారు హర్యానా సిస్టర్స్. బస్సులో వెంటాడిన ఈవ్ టీజర్లను బెల్టు తీసి భరతం పట్టిన వీరిలా అందరూ తెగువ చూపాలంటున్నారు మాదాపూర్ శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యార్థినులు. వారి చర్చే ఈ వారం ‘క్యాంపస్ కబుర్లు’... మానస: హర్యానాలో జరిగిన బస్సు సంఘటన వీడియో చూసి హ్యాపీగా ఫీలయ్యా. ఒక్క క్షణం ఇది నిజమేనా అనిపించింది. నిజంగా భారతి, పూజ ప్రతి ఒక్క భారతీయ మహిళకు ఆదర్శం. స్నేహ: యా మానస.. ఆ సీన్ చూడగానే నేను బస్సులో ఎదుర్కొన్న సంఘటనలన్నీ కళ్ల ముందు తిరిగాయి. ఓసారి బస్సులో కాలేజీకి వస్తుంటే... మా ఫాదర్ ఏజ్ ఉంటుంది అతనికి. పక్కనే నిలబడ్డాడు. కావాలని నా చేతిని టచ్ చేస్తున్నాడు. రెండు మూడుసార్లు చూసి ‘ఏం కావాలి?’ అంటూ అరిచాను. బస్ బాగా రష్గా ఉందంటూ చెప్పాడు. నిశ్చల: బస్సుల్లో ఇవి కామనయిపోయాయి. అయితే ఎంతమంది అమ్మాయిలు ఎదురుతిరుగుతున్నారనేది ప్రశ్న. ఈ మధ్యనే మా ఫ్రెండ్ బస్లో వెళుతుంటే ఓ యాభై ఏళ్ల వ్యక్తి తనను బాగా ఇబ్బంది పెట్టాడు. నలుగురిలో అతన్ని ఎదిరిస్తే తనెక్కడ అల్లరి అవుతుందోననే భయంతో బస్సు దిగేసింది. టీనా: ఇట్స్ టూ బ్యాడ్. కనీసం ఆమె అతన్ని కొట్టక్కర్లేదు... గట్టిగా నాలుగు మాటలంటే... చుట్టుపక్కలవారికి భయపడైనా దూరంగా జరిగేవాడు కదా! నిశ్చల: నో... టీనా ఇలాంటి సందర్భాల్లో అమ్మాయినే తప్పుపట్టేవారున్నారు. హరిణి: యస్... ఆ అమ్మాయి కాస్త మోడ్రన్ డ్రెస్ వేసుకుందనుకో... సపోర్ట్ చేయకపోగా కామెంట్ చేసేవారూ ఉన్నారు. టీనా: అఫ్కోర్స.. కాలం మారింది. బస్సులో ఆకతాయిలతో పాటు మనలాంటి పిల్లలున్న అమ్మానాన్నలు కూడా ఉంటున్నారు కదా.. వారు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. హరిణి: హర్యానా బస్సు ఇన్సిడెంట్లో అక్కాచెల్లెళ్లు తమకు ఇబ్బంది అనిపించగానే... చుట్టుపక్కలవారు ఏమనుకుంటారని ఆలోచించలేదు. బెల్టు తీసి బుద్ధి చెప్పడానికి సిద్ధపడ్డారు. మనమైనా అలాగే ఆలోచించాలి. సౌందర్య: ఎగ్జాట్లీ... నాకూ ఇలాంటి అనుభవం ఒకటుంది. అయితే ఇక్కడ టీజ్ చేసింది బస్ కండక్టరే. టికెట్లు తీసుకున్న తర్వాత కూడా కావాలని వెనక్కి, ముందుకీ ఓ పదిపదిహేను సార్లు మమ్మల్ని తోసుకుంటూ తిరుగుతున్నాడు. ఇక లాభం లేదని... నా దగ్గరికి రాగానే వాడి కాలుని నా హైహీల్స్తో గట్టిగా తొక్కా. దెబ్బకు కిక్కురుమనకుండా వెనక్కి వెళ్లిపోయాడు. అనూష: ఒక్క బస్సు సంఘటనలే కాదు... మిగతా చోట్లా ఆడవాళ్లను వేధిస్తున్నారు. అలాంటి సందర్భాల్లో కూడా తెలిగా వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి. స్నిగ్ధ: యస్... మనం ఆ పని చేయాలే గానీ సొసైటీ తప్పనిసరిగా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతుంది. టీనా: ఇక్కడ సొసైటీ ఎవరు స్నిగ్ధ? మనం ఇంకా ఎవరో వస్తారని, ఏదో చేస్తారనే లోకంలోనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ భారతి, పూజ సంఘటన చూడు. ఎపిసోడ్ మొత్తంలో ఆ అక్కాచెల్లెళ్ల రియాక్షన్ మాత్రమే ఉంది. బస్సు నిండా పదుల సంఖ్యలో ఆడవాళ్లు, మగవాళ్లు ఉన్నారు. వారెవరూ స్పందించలేదు. అస్మిత: వాళ్లిద్దరూ టీజర్లని చితకబాదింది చుట్టూ ఉన్నవారిని చూసి కాదు... వారిలో ఉన్న ధైర్యం, అందుబాటులో ఉన్న బెల్టుని చూసుకుని. అంటే ఆత్మరక్షణే ఈ సమస్యకు పరిష్కారం. గుణపాఠం భారతి, పూజని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించాలనుకున్న నిర్ణయం చాలా గొప్పది. పాఠాలు వేరు, గుణపాఠాలు వేరు. ఈ రోజు వారు మగవారి వంచనకు గురవుతున్న మహిళలకు ఆదర్శంగా నిలిచారు. ఎలాంటి సందర్భంలోనూ మగవారి వేధింపులను భరించాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న ఏ చిన్న వస్తువునైనా ఆయుధంగా మలచుకుని ఎదురుతిరగాలి. - అజిత సురభి, డెరైక్టర్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ భువనేశ్వరి ఫొటోలు: రాజేష్రెడ్డి -
మెట్రో లగ్జరీ వోల్వో బస్సులను ప్రారంభించిన కేసీఆర్
* నాలుగు రూట్లలో ఏసీ మెట్రో లగ్జరీ బస్సులు *కనీస చార్జీ రూ.15, గరిష్ట చార్జీ రూ.110 *మహిళా ప్రయాణికులకు పటిష్ట భద్రత హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో మెట్రో లగ్జరీ వోల్వో బస్సులను ప్రారంభించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే లక్ష్యంతో సిటీ రోడ్లపై 'కూల్'గా ప్రయాణం చేసేందుకు గ్రేటర్ ఆర్టీసీ ఈ బస్సులను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ఉన్న పుష్పక్, శీతల్, నాన్ ఏసీ లోఫ్లోర్ బస్సుల కంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బస్సులు రూపొందాయి. అలాగే సిటీ బస్సుల రాకపోకలపై ప్రయాణికులకు ముందస్తు సమాచారం తెలిపేందుకు ప్రయోగాత్మకంగా వంద బస్టాపుల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ బోర్డులను కూడా కేసీఆర్ ఆరంభించారు. ఒక్కో బస్సుకు రూ.కోటి చొప్పున రూ.80 కోట్లతో 80 మెట్రో లగ్జరీ బస్సులను జెఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా ఆర్టీసీ కొనుగోలు చేసింది. మెట్రో లగ్జరీ వోల్వో బస్సుల రూట్లు ఇవీ... *17 హెచ్/10 డబ్ల్లూ *113ఎం/డబ్ల్యూ *218 డి * 222 -
సేఫ్ జర్నీ
⇒ సిటీ బస్సుల్లో మహిళలకిక సంపూర్ణ రక్షణ ⇒ స్లైడింగ్ డోర్లు ఏర్పాటు ⇒ ఆకతాయిలు, పిక్పాకెటర్లకు చెక్ ⇒ పురుషులకు నో ఎంట్రీ ⇒ రేతిఫైల్ బస్స్టేషన్లో ప్రారంభించిన ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు సికింద్రాబాద్: సిటీ బస్సుల్లో ఇక మహిళలు ఎలాంటి అభద్రత లేకుండా ప్రయాణించవచ్చు. ఆకతాయిల వేధింపులు, పికెపాకెటింగ్ సమస్యలకు చెక్పడనుంది. ఈమేరకు ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలకు ప్రత్యేకంగా స్లైడింగ్ బోగీలను ఏర్పాటు చేసిన మాదిరిగా... ఆర్టీసీ బస్సుల్లో సైతం ఈ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చారు. సరికొత్త స్లైడింగ్ విధానాన్ని ఆదివారం ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు సికింద్రాబాద్ రెతిఫైల్ బస్స్టేషన్లో ప్రారంభించారు. స్లైడింగ్ వ్యవస్థతో మహిళలకు కేటాయించిన సీట్ల ప్రదేశం వరకు పురుషులు ప్రవేశించే అవకాశం ఉండదు. సీట్ల మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశంలో సైతం మహిళలు మాత్రమే నిల్చునే అవకాశమే ఉంటుంది. మహిళలకు కేటాయించిన సీట్లకు అడ్డంగా రెయిలింగ్ను ఏర్పాటు చేసి అక్కడే స్లైడింగ్ డోర్ను ఏర్పాటు చేశారు.దీంతో మహిళలకు ప్రత్యేక చాంబర్ ఏర్పాటయినట్లయింది. త్వరలో అన్ని బస్సుల్లో... సిటీ బస్సుల్లో మహిళలకు పూర్తి స్థాయి భద్రత కల్పించడం కోసమే స్లైడింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు చెప్పారు.రెతిఫైల్ బస్స్టేషన్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక్కో బస్సుకు స్లైడింగ్ డోర్ను ఏర్పాటుకు రూ.16.500 వేలు ఖర్చు అవుతుందని చెప్పారు. ప్రస్తుతం నగరంలోని 50 బస్సులకు స్లైడింగ్ డోర్లు ఏర్పాటు చేయించామన్నారు. రానున్న రోజుల్లో నగరంలో తిరుగుతున్న 2400 సిటీ బస్సుల్లో ఈ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామన్నారు. పిక్పాకెటింగ్, ఈవ్టీజింగ్ ఎక్కువగా ఆర్డినరీ బస్సుల్లో జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఆ బస్సులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జాయింట్ ఎండీ రమణారావు, గ్రేటర్ ఆర్టీసీ ఈడీ జయారావు, సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సురక్షితం ఆర్టీసీ బస్సుల్లో స్లైడింగ్ వ్యవస్థ ఏర్పాటు బాగుంది. ఇది మాకు ఎంతో భద్రత కల్పిస్తుంది. నిత్యం బస్సు ప్రయాణంలో చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నాం. ఇక ఈ బెడద తగ్గుతుందని భావిస్తున్నా. -అనిత, ఉద్యోగిని, చిలకలగూడ దొంగతనాలు జరగవు ఆర్టీసీ బస్సు ప్రయాణాల్లో ఇకపై దొంగతనాలు జరిగే అవకాశం ఉండదు. మహిళలకు కేటాయించిన ప్రదేశంలోకి ఇతరుల ప్రవేశాన్ని నిరోధించడం సబబే. మహిళల సీట్లలో తిష్టవేసిన వారిని బతిమిలాడుకునే ఇబ్బందులు ఉండవు. -నయీమాబేగం, మేడ్చల్ ఇబ్బందులు తప్పాయి మహిళల సీట్ల మధ్యకు వచ్చి నిల్చునే ఆకతాయిలను తప్పిం చడం, మహిళలకు కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యే వారిని పంపించడం మాకు తలనొప్పిగా మారింది. స్లైడింగ్ విధానం వల్ల మాకూ ఇబ్బందులు తప్పుతాయి. -లలిత, లేడీ కండక్టర్, జీడిమెట్ల డిపో -
సిటీ బస్సులేవీ?
సాక్షి, రాజమండ్రి :నగరాల రూపురేఖలు మారిపోతున్నాయి. పెరుగుతున్న జనాభాతో కిలోమీటర్ల కొలదీ విస్తరిస్తున్నాయి. దీంతో ప్రజల రవాణా అవసరాలు సైతం పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి జిల్లాలోని ప్రధాన నగరాలైన రాజమండ్రి, కాకినాడల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని ఆటోలు వందల నుంచి వేల సంఖ్యలో పెరిగిపోయాయి. నేడు ఈ రెండు నగరాల్లో కుటుంబం అంతా కలసి ఎక్కడికైనా వెళ్లాలంటే ఆటో ఎక్కక తప్పని స్థితి నెలకొంది. కనీసం రూ. 50 నుంచి రూ. 100 ఖర్చుచేయక పోతే కుదరని దుస్థితి. ఈ తరుణంలో త్వరలో ఈ రెండు నగరాల రోడ్లపై సిటీబస్సులు పరుగులు పెడతాయని వచ్చిన వార్తలు ప్రజలకు కొండంత ఆనందాన్ని ఇచ్చాయి. ఏడాది క్రితం వచ్చిన ఈ అవకాశాన్ని మన రాజకీయ పెద్దలు సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయ్యారని తెలిసి నిరాశకు వారు గురవుతున్నారు. బస్సుల ప్రతిపాదన ఇలా పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు, అభివృద్ధికి ఉద్దేశించిన జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్ఎన్యూఆర్ఎం) నగరాల్లో సిటీబస్సులు నిర్వహించేందుకు గుర్తింపు పొందిన సంస్థలకు ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ సంస్థ నేరుగా బస్సులను కోనుగోలు చేసి అందిస్తుంది. ఇందులో భాగంగా 2013 మే నెలలో రాష్ట్రానికి సుమారు వెయ్యి బస్సులు అందించేందుకు ముందుకు వచ్చింది. ఆర్టీసీ కూడా ఈ బస్సులను 17 నగరాల్లో సిటీబస్సులుగా తిప్పేందుకు జేఎన్ఎన్యూఆర్ఎంకు ప్రతిపాదనలు పంపింది. మొత్తం రూ. 273 కోట్ల ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు కేంద్రం సహాయం పోను ఆర్టీసీ వాటాగా రూ. 28 కోట్లు భరించేందుకు అంచనాలు రూపొందించారు. ఇందులో రాజమండ్రి, కాకినాడల్లో 35 బస్సులు వంతున సిటీ సర్వీసులు తిప్పాలని ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. కేంద్ర సహాయంలో భాగంగా గత అక్టోబర్లో 400 బస్సులను కేటాయించారు. వీటిలో 75 బస్సులను తక్షణం అందజేశారు. స్థానిక ప్రజా ప్రతినిధుల ప్రయత్న లోపంతో అవి విశాఖ, విజయవాడ, ఖమ్మం తదితర ప్రాంతాలకు కేటాయించేశారు. కారణాలు ఇవిగో ప్రజలకు సిటీ సర్వీసుల అవసరం దండిగా ఉన్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. ఆర్టీసీ అధికారులు కూడా సిటీ సర్వీసుల నిర్వహణపై అనాసక్తత వ్యక్తం చేశారని తెలిసింది. బస్సుల ద్వారా కొత్తగా డ్రైవర్, కండక్టరు పోస్టులు వస్తున్నప్పటికీ ఉన్న బస్సులకు తోడు కొత్తవి వస్తే పనిభారం పెరిగిపోతుందని భావించారో ఏమో తమ శాఖపై స్థానిక అధికారులు కూడా పెద్దగా వత్తిడి తేలేదని తెలుస్తోంది. ప్రధానంగా సిటీ సర్వీసుల పరుగులు ఆటోలకు చెక్ పెడతాయన్న భయంతో ప్రైవేట్ ఆపరేటర్లను రక్షించుకునేందుకు బస్సులు రాకుండా కొందరు రాజకీయ నాయకులు ప్రభుత్వ స్థాయిలో మోకాలడ్డారని విమర్శలు వినవస్తున్నాయి. పుష్కరాలకైనా ఫలించేనా? రాజమండ్రిలో వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి రోజూ లక్షలాది మంది వచ్చి గోదావరి స్నానాలు చేస్తారు. ఈ లోగానైనా సిటీ సర్వీసులు రాజమండ్రిలో పరుగులు పెడితే ఎంతో సౌకర్యంగా ఉంటుందని స్థానికులు అంటున్నారు. -
దర్జాగా.. దౌర్జన్యంగా.. ఏం మగాళ్లండీ వీళ్లు?!
పురుషోత్తములు రైళ్లలో, సిటీ బస్సుల్లో ‘స్త్రీలకు మాత్రమే’ అని ఉన్నచోట ఈ మగాళ్లెలా ధైర్యంగా కూర్చోగలరో ఎప్పటికీ అర్థం కాని విషయం. పైగా దబాయింపు చూపొకటి... ‘లేవం, ఏం చేసుకుంటావో చేస్కో ఫో’ అన్నట్లు! ఎందుకిలా ప్రవర్తిస్తారు వీళ్లు? ఆ... ఆడవాళ్లే కదా అన్న తేలిక భావమా? సంస్కారం లేకపోవడమా? కారణాలు ఏవైనా ఇలాంటి మగాళ్లకు బుద్ధి చెప్పడం కోసం మహిళాప్రయాణికులతోపాటు, ఇప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్సులూ ఫైట్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు ఢిల్లీ మెట్రో రైళ్లు. వీటిల్లో మొదటి కంపార్ట్మెంట్ పూర్తిగా మహిళలది. మగాళ్లు కూర్చోకూడదు. అయినా కూడా ఈ ఏడాది ఆరంభం నుండి ఇప్పటి వరకు ఈ కంపార్ట్మెంట్లలో పట్టుబడిన ‘పురుషోత్తముల’ సంఖ్య 3,500. ఈ సంఖ్య గతేడాది ఇలా లేడీస్ కంపార్ట్మెంట్లలో దర్జాగా కూర్చొని దొరికిపోయినవారి సంఖ్య కన్నా తక్కువేనట. అంటే మగాళ్లలో మార్పు వచ్చిందనా? కాదు కాదు, ‘సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (మెట్రో) నిఘా పెరిగింది. ఈ ఫోర్సు మెల్లగా వస్తుంది. మామూలు దుస్తులలో వస్తుంది. లేడీస్ సీట్లలో కూర్చొని ఉన్న మగాళ్లను మెరుపులా పట్టేస్తుంది. కొందరు ‘తెలియక ఎక్కాం’ అంటారు. కొందరు ‘పెహ్లీ బార్ థా, జానేదో ప్లీజ్’ అంటారు. కొందరు ‘ఐ వాజ్ జస్ట్ చార్జింగ్ మై మొబైల్’ అంటారు. కొందరు ‘సారీ’ చెప్పి స్టేషన్ రాగానే దిగి పోతారు. ఇలాంటివి మినహాయించినా కూడా ఇన్ని వేల మంది దొరకడమే విశేషం. పట్టుకున్న వారిని సెక్యూరిటీ ఫోర్స్ ఊరికే వదిలి పెట్టదు. ఫైన్ వేస్తుంది. ఇంకా ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తుంటే పోలీసులకు అప్పజెబుతుంది. ప్లాట్ఫారమ్ మీద, ఉమన్ కంపార్ట్మెంట్ లోపల స్త్రీలకు మాత్రమే అని గమనికలు ఉంటాయి. ‘స్త్రీల కంపార్ట్మెంట్లో స్త్రీలనే కూర్చోనివ్వండి’ అనే అనౌన్స్మెంట్లు నిరంతరం వినిపిస్తూనే ఉంటాయి. అయినా సరే, మగాళ్లు కనిపిస్తూనే ఉండడం సెక్యూరిటీ సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘‘రోజుకి సుమారు 50 మంది మగాళ్లు లేడీస్ కోచ్లో మాకు పట్టుబడతారు. వాళ్లను మా సిబ్బంది... స్టేషన్ కంట్రోల్ రూమ్కి తరలిస్తారు. అక్కడే వాళ్లు ఫైన్ కూడా కట్టాలి. మహిళలను వేధించడానికే వాళ్లంతా ఆ కోచ్లో కూర్చున్నారు అనేందుకు లేదు. కానీ కొందరు అందుకోసమే ఎక్కుతారు. ఏ ఉద్దేశంతో ఎక్కినా, తమ తప్పు ఒప్పుకుని లేచిపోతే పర్వాలేదు కానీ, వాదనకు దిగితే మాత్రం వారికి ఫైన్ తప్పదు’’ అని సీఐఎస్ఎఫ్ డెరైక్టర్ జనరల్ అరవింద్ రంజన్ అంటారు. ఒక్క ఢిల్లీ మెట్రోలోనే కాదు, మెట్రో వ్యవస్థ ఉన్న ప్రతి నగరంలోనూ, సిటీ బస్సులలోను మహిళా ప్రయాణికులకు మగవాళ్ల బెడద తప్పడం లేదు. అంతదాకా ఎందుకు... మన హైదరాబాద్ సిటీ బస్సులలోనే చూడండి. లేడీస్ సీట్లలో మగాళ్లొచ్చి కూర్చుంటారు. లేవమంటే కోపంగా చూస్తారు. లేదంటే మాట వినిపించుకోనట్లు కిటికీల్లోచి బయటికి చూస్తుంటారు. చాలాసార్లు కండక్టర్ కూడా వాళ్లను లేపలేని అసహాయ స్థితిలో పడిపోవడం కనిపిస్తుంది. టికెట్ చెకింగ్కి ఉన్న విధంగా... లేడీస్ సీట్లలో ధీమాగా, దర్జాగా, ధైర్యంగా, దౌర్జన్యంగా కూర్చున్న మగాళ్లను లేపడానికి సిటీ బస్సులలో కూడా సెక్యూరిటీ ఫోర్స్లాంటి మెరుపు దాడులుండాలి. అప్పుడుగానీ లేడీస్ సీట్లు లేడీస్కి దక్కవేమో! -
సిటీ బస్సులు..మూణ్నాళ్ల ముచ్చటేనా?
- రద్దయిన బస్సు సేవలు - పునరుద్ధరించాలని ప్రయాణికుల డిమాండ్ రామడుగు, న్యూస్లైన్: కరీంనగర్ పట్టణానికి సమీప గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రవేశపెట్టిన సిటీ బస్సులు మూ ణ్నాళ్ల ముచ్చటగానే మారాయి. గత నవంబర్లో అప్పటి ఆర్టీసీ చైర్మన్ ఎం. సత్యనారాయణరావు ప్రారంభించా రు. వీటిని కరీంనగర్ నుంచి తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, కరీంనగర్ నుంచి కొత్తపలి, వెదిర గ్రామాలకు, మానకొండూర్ నుంచి పద్మనగర్ వరకు సర్వీసులను ప్రారంభించారు. గత ఏప్రిల్ చివరి వరకే బస్సులు నడిచాయి. ప్రస్తుతం ఈ సిటీ బస్సుల జాడ కనిపించకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆర్టీసీ మాజీ చైర్మన్ ఎమ్మెస్సార్ స్వగ్రామం వెదిర వరకు సిటీబస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు చేసిన విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ అధికారులు నవంబర్ 12 నుంచి సిటీ బస్సులను పొడిగిం చారు. వీటితో ఈ రూట్లోని గ్రామస్తులకు సౌకర్యవంతంగా ఉన్నాయి. ప్రస్తుతం రద్దు చేయడంతో విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర పనులకు కరీంనగర్ వెళ్లే వారికి అవస్థలు తప్పడం లేదు. కనిపించని ఆర్డినరీ బస్సులు కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి గుండా ఆర్డినరీ బస్సులు ఆధికారులు అంతంత మాత్రంగానే నడిపించడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ రహదారిపై గుండా కేవలం మూడు ఆర్డినరీ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయని పలు గ్రామాల ప్రజలు చెబుతున్నా రు.బస్సులు లేకపోవడంతో ఆటోల్లో రాకపోకలు సాగిస్తున్నామని వెదిరకు చెందిన సత్యనారాయణ తెలిపారు. ఆర్టీసీ ప్రవేశపెట్టిన సిటీ బస్సులను వెంటనే పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వెదిర, దేశరాజ్పల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు. -
సిటీలో డిపో
మంకమ్మతోట, న్యూస్లైన్ : నగర ప్రజలకు ఇంకా మెరుగైన రవాణా సేవలు అందనున్నాయి. జిల్లా కేంద్రంలో సిటీ బస్సుల కోసం డిపో ఏర్పాటుకు ఇప్పటికే అనుమతి ఇవ్వగా ఇందుకు రూ.25.5 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నగరాల్లో మెరుగైన ప్రజారవాణా వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 13 నగరాలకు సిటీ బస్సుల సౌకర్యం కల్పించింది. ఇందులో భాగంగా 75 బస్సులు మంజూరు చేసింది. రాష్ట్రం నుంచి వరంగల్, నెల్లూరు, కర్నూలు, నిజామాబాద్, నంద్యాల, కరీంనగర్, రామగుండం, ఒంగోలు, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయనగరంలలో సిటీ బస్సులు ఏర్పాటు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ మొత్తం 12 ప్రతిపాదనలు పంపించగా ఒక్క కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాత్రమే సిటీ బస్సుల ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రం ఆమోదం తెలిపింది. డిపో ఏర్పాటుకు అనుమతితోపాటు అవసరమైన నిధులు శుక్రవారం మంజూరు చేసింది. డిపో ఎక్కడ? సిటీ డిపో ఏర్పాటుకు స్థలం ఎంపిక చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని ఆర్టీసీ బస్స్టేషన్, వన్, టూ డిపో, ఆర్టీసీ జోనల్ ఆస్పత్రి, జోనల్ వర్క్షాప్ల్లో సంస్థ స్థలాలు ఉన్నాయి. సిటీ బస్ డిపో నగరానికి దూరంగా ఉండకుండా ప్రస్తుతం బస్సులను శుభ్రం చేయడానికి ఏర్పాటు చేసిన వాషింగ్ పాయింట్, టూ వీలర్ పార్కింగ్ స్థలాల్లో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. ముందస్తుగా సిటీ బస్సుల నిర్వహణ, రూట్లు, బస్పాయింట్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నవంబర్లో 12 బస్సులు ఏర్పాటు చేశారు. ప్రజలు సిటీ బస్సులో ప్రయాణించేందుకు ఆసక్తి కనబర్చుతుండడంతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు డిపో ఏర్పాటు చేస్తున్నారు. డిపో ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్నాథ్కు కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. సిటీ బస్సుల సౌకర్యం కల్పించాలని కోరుతూ యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ కలిసి చేసిన విజ్ఞప్తిని పరిశీలించి సంబంధిత మంత్రికి ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. త్వరలో శంకుస్థాపన సిటీ బస్ డిపో పనుల శంకుస్థాపనను కేంద్ర సహాయమంత్రి సర్వే సత్యనారాయణ చేతులమీదుగా చేపట్టనున్నట్లు ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. డిపో ఏర్పాటుకు స్థల సేకరణ ప్రయత్నాల్లో అధికారులున్నారని పేర్కొన్నారు. ఈ నెల 15, 16 లేదా 22 తేదీల్లో కేంద్ర మంత్రి పర్యటన ఉంటుందని స్పష్టం చేశారు.