convicts
-
నిర్ణయాధికారం పార్లమెంట్దే
న్యూఢిల్లీ: క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాలం నిషేధం విధించాలన్న వినతిని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. వారిపై అనర్హత వేటు వేయడం అనేది కేవలం పార్లమెంట్ పరిధిలోని అంశమని ఉద్ఘాటించింది. నిర్ణయాధికారం పార్లమెంట్దేనని పేర్కొంది. దీనితో న్యాయ వ్యవస్థకు సంబంధం లేదని పరోక్షంగా తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 8(1) ప్రకారం.. రాజకీయ నేతలు ఏవైనా క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిరూపితమైతే వారు ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రస్తుతం నిషేధం అమల్లో ఉంది. అలాంటి వారిపై కేవలం ఆరేళ్ల నిషేధం సరిపోదని, జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ సీనియర్ అడ్వొకేట్ అశ్వినీ ఉపాధ్యాయ్ గతంలో సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ మేరకు చట్టం తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 10వ తేదీన కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నాయకులపై జీవితకాలం నిషేధం విధించడం అత్యంత కఠినమైన చర్య అవుతుందని పేర్కొంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం ఆరేళ్లపాటు నిషేధం విధిస్తే సరిపోతుందని తేల్చిచెప్పింది. అయితే, దోషులుగా నిర్ధారణ అయిన నాయకులపై జీవితకాల నిషేధం విధించాలా? లేక ఆరేళ్లపాటు నిషేధం విధించాలా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకొనే అధికారం పార్లమెంట్కే ఉందని వెల్లడించింది. -
బిల్కిస్ బానో దోషులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో రేప్ కేసులో ఇద్దరు దోషులకు శుక్రవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. శిక్ష తగ్గింపును కొట్టివేస్తూ ఈ ఏడాది జనవరి 8న సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును సవాల్ చేస్తూ దోషులు రాధేశ్యామ్ భగవాన్దాస్ షా, రాజుభాయ్ బాబూలాల్ సోనిలు దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించడానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. సమాన సంఖ్యలో జడ్జీలు ఉన్న ధర్మాసనం ఇచి్చన తీర్పుపై తామెలా విచారణ చేపట్టగలమని (రెండు ధర్మాసనాల్లోనూ సమంగా ఇద్దరేసి జడ్జీలు ఉన్నందువల్ల) ప్రశ్నించింది. 2002లో గోద్రా అలర్ల అనంతర ఘటనల్లో గర్భవతి బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురు హత్యకు గురుయ్యారు. ఈ కేసులో మొత్తం 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. భగవాన్దాస్ షా పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం 2022 మే 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్ష విధానానికి అనుగుణంగా షాను విడుదల చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో గుజరాత్ ప్రభుత్వం అదే ఏడాది ఆగస్టు 15వ తేదీన బిల్కిస్ బానో కేసుల యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న 11 మందిని స్రత్పవర్తన కలిగి ఉన్నారనే కారణంతో క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు తలెత్తాయి. వివిధ రంగాలు చెందిన మేధావులు, ప్రముఖులు ఆరు వేల మంది దోషులకు శిక్ష మినహాయింపును రద్దు చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఒక లేఖలో కోరారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి 8న వారికి శిక్ష మినహాయింపు సరికాదని తీర్పునిచి్చంది. రెండు వారాల్లోగా దోషులందరూ జైలులో లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. విచక్షణాధికారాలను తప్పుగా వాడారని, అనైతిక పద్దతుల ద్వారా దోషులకు అనుకూలంగా వ్యవహరించారని గుజరాత్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసింది. కేసు విచారణ మహారాష్ట్రలో జరిగింది కాబట్టి క్షమాభిక్షను ప్రసాదించే అధికార పరిధి కూడా ఆ రాష్ట్రానిదేనని, గుజరాత్ ప్రభుత్వం మహారాష్ట్ర అధికారాన్ని చట్టవిరుద్ధంగా లాక్కుందని పేర్కొంది. సమానబలం కలిగిన సుప్రీంకోర్టు ధర్మాసనాలు (రెండూ ద్విసభ్య ధర్మాసనాలే) శిక్ష మినహాయింపుపై పరస్పర విరుద్ధ తీర్పులు ఇచ్చాయని, విస్తృత ధర్మాసనానికి ఈ కేసును రిఫర్ చేయాలని పిటిషనర్లు కోరారు. ‘ఇదేం పిటిషన్. ఇది ఎలా విచారణార్హం అవుతుంది? ఇది పూర్తిగా తప్పుగా అర్థం చేసుకొని వేసిన పిటిషన్. ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎలా వేస్తారు? సమాన సంఖ్య ఉన్న ధర్మాసనం ఇచ్చిన తీర్పును మేము సమీక్షించలేం’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లు శుక్రవారం స్పష్టం చేశారు. దీంతో పిటిషన్ల తరఫున న్యాయవాది రిషి మల్హోత్రా తమ వ్యాజ్యాన్ని ఉపసహరించుకోవడానికి అనుమతి కోరారు. ధర్మాసనం దీనికి సమ్మతించింది. భగవాన్దాస్ షా మధ్యంతర బెయిల్ను కూడా కోరారు. -
Association of Democratic Reforms: ఎంపీల్లో 46 శాతం నేర చరితులు
న్యూఢిల్లీ: లోక్సభకు తాజాగా ఎన్నికైన 543 మందిలో 46 శాతం అంటే 251 మంది నేరచరితులు ఉన్నారని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) నివేదించింది. ఈ 251 మందిలో 27 మంది దోషులుగా తేలారు. నేర చరితులు ఇంత భారీ సంఖ్యలో దిగువసభకు ఎన్నికవడం ఇదే మొదటిసారి అని ఏడీఆర్ పేర్కొంది. 2014 ఎన్నికల్లో 34 శాతం అంటే 185 మంది, 2009లో 30 శాతం అంటే 162 మంది, 2004లో 23 శాతం అంటే 125 మంది క్రిమినల్ కేసులున్న వారు లోక్సభకు ఎన్నికైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. -
‘బిల్కిస్’ దోషులు జైలుకు
గోధ్రా: బిల్కిస్ బానో కేసులో మొత్తం 11 మంది దోషులు గుజరాత్లోని గోధ్రా సబ్ జైలులో అధికారుల ఎదుట లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ప్రకారం దోషులందరూ జనవరి 21వ తేదీ అర్ధరాత్రి జైలుకు వచ్చినట్లు స్థానిక క్రైం బ్రాంచి ఇన్స్పెక్టర్ ఎన్ఎల్ దేశాయ్ ధ్రువీకరించారు. 2002లో గుజరాత్లో మత కలహాల సమయంలో బిల్కిస్ బానో అనే అయిదు నెలల గర్భవతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆమె కుటుంబంలోని ఏడుగురిని దుండుగులు దారుణంగా చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి కోర్టు 11 మంది దోషులకు జీవిత ఖైదు విధించింది. అయితే, 14 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన వీరిని సత్ప్రవర్తన కలిగిన వారిగా పేర్కొంటూ 2022లో గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని ఈ నెల 8వ తేదీన సుప్రీంకోర్టు కొట్టివేసింది. -
Bilkis Bano Case: సుప్రీంను ఆశ్రయించిన దోషులు
ఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో తాము లొంగిపోయే గడువును పెంచాలని కోరుతూ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు నుంచి ఆరు వారాల పాటు పొడిగించాలని కోరుతూ ముగ్గురు దోషులు పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్లను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దోషులలో ఒకరైన గోవింద్భాయ్.. తన 88 ఏళ్ల తండ్రి, 75 ఏళ్ల తల్లిని చూసుకునే బాధ్యతను పేర్కొంటూ గడువు పొడిగింపును కోరాడు. తల్లిదండ్రులకు ఏకైక సంరక్షకుడనని ఆయన పేర్కొన్నాడు. మరో దోషి రమేష్ రూపాభాయ్ చందనా తన కుమారుడి పెళ్లికి సమయం కావాలని, ఆరు వారాల పొడిగింపును కోరాడు. మూడవ దోషి మితేష్ చిమన్లాల్ భట్ కూడా ఆరు వారాల పొడిగింపును అభ్యర్థించాడు. శీతాకాల పంట కోతకు సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అఘాయిత్యం చోటు జరిగింది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. ఈ శిక్ష కాలాన్ని తగ్గిస్తూ గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగానే వీళ్లను విడుదల చేసింది. అయితే.. ఈ అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. దోషులు మళ్లీ జైలులో జనవరి 21లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
నిఠారీ హత్యలు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: దేశ్యవ్యాప్తంగా చర్చనీయాశమైన నిఠారీ హత్యల కేసులో అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిఠారీ హత్య కేసులో దోషులుగా తేలిన అన్ని కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించింది.ముఖ్యంగా సురీందర్ కోలికి మరణశిక్షను కూడా అలహాబాద్ హైకోర్టు కోర్టు రద్దు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురీందర్ కోలీపై ఉన్న 12 కేసుల్లో నిర్దోషిగా తేల్చింది. అలాగే మరో నిందితుడు వ్యాపారవేత్త మోనీందర్ సింగ్ పంధేర్పై ఉన్న రెండు కేసుల్లోనూ నిర్దోషి అని కోర్టు సోమవారం నిర్ధారించింది. అత్యాచారం, హత్య ఆరోపణలపై దోషులుగా తేల్చిన ఘజియాబాద్లోని సీబీఐ కోర్టు విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ కోలీ, పంధేర్లు దాఖలు చేసిన అప్పీళ్లను జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్హెచ్ఏ రిజ్వీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. అయితే ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు చెప్పింది. అలహాబాద్ హైకోర్టు మోనీందర్ సింగ్ పందేర్పై మొత్తం 6 కేసులు ఉండగా, అన్నింటిలోనూ నిర్దోషిగా కోర్టు తేల్చిందని మోనీందర్ సింగ్ పంధేర్ తరపు న్యాయవాది మనీషా భండారీ వెల్లడించారు. 2006లో నోయిడాలోని నిథారీ ప్రాంతంలో మధ్య మోనీందర్ సింగ్ పంధేర్ ఇంటిలో వరుస హత్యలు కలకలం రేపాయి. 2006, డిసెంబరు 29న నోయిడాలోని నిథారీలోని పంధేర్ ఇంటి వెనుక ఉన్న కాలువలో ఎనిమిది మంది చిన్నారుల అస్థిపంజర అవశేషాలు కనిపించడంతో ఈ సంచల హత్యలు వెలుగులోకి వచ్చాయి. సురీందర్, పంధేర్ ఇంట్లో పనిమనిషిగా ఉండేవాడు. ఈ సందర్భంగా పిల్లలను మిఠాయిలు, చాక్లెట్లతో మభ్య పెట్టి ఇంట్లోకి రప్పించేవాడు. ఆ తరువాత పంధేర్వారిపై అత్యాచారం చేసి హత్య చేశాడనేది ప్రధాన ఆరోపణ. బాధితుల్లో ఎక్కువ భాగం ఆ ప్రాంతం నుండి తప్పిపోయిన పేద పిల్లలు, యువతులవిగా గుర్తించారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు పిల్లల మృతదేహాలను నరికి, ఆ భాగాలను కాలువల్లో పడవేసేవారనీ సీబీఐ అభియోగాలు మోపింది. అంతేకాకుండా నరమాంస భక్షక ఆరోపణలు కూడా చేసింది. 2007లో పంధేర్, కోలీలపై సీబీఐ 19 కేసులు నమోదు చేసింది. అయితే 19 కేసుల్లో మూడింటిని తొలగించిన సీబీఐ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. కాగా సురేంద్ర కోలీపై బాలికలపై అనేక అత్యాచారాలు , హత్యలకు పాల్పడి దాదాపు 10 కంటే ఎక్కువ కేసులలో మరణశిక్ష విధించాయి కోర్టులు. జూలై 2017లో, 20 ఏళ్ల మహిళ పింకీ సర్కార్ హత్య కేసులో స్పెషల్ CBI కోర్టు పంధేర్, కోలీలను దోషులుగా నిర్ధారించి, మరణశిక్ష విధించింది. దీన్ని అలహాబాద్ హైకోర్టుకూడా సమర్ధించింది. అయితే, కోలీ క్షమాభిక్ష పిటిషన్పై నిర్ణయంలో జాప్యంకారణంగా దీన్ని జీవిత ఖైదుగా మార్చింది. ఈ నిఠారీ హత్యల్లో మరో బాధితురాలు 14 ఏళ్ల రింపా హల్దార్ హత్య, అత్యాచారానికి సంబంధించి 2009లో సాక్ష్యాలు లేకపోవడంతో పంధేర్ను నిర్దోషిగా ప్రకటించింది. #WATCH | Manisha Bhandari, lawyer of Nithari case convict Moninder Singh Pandher, in Prayagraj, Uttar Pradesh "Allahabad High Court has acquitted Moninder Singh Pandher in the two appeals against him. There were a total of 6 cases against him. Koli has been acquitted in all… pic.twitter.com/BYQHeu3xvz — ANI UP/Uttarakhand (@ANINewsUP) October 16, 2023 -
మనీ లాండరింగ్ కేసుల్లో 93 శాతం నేర నిరూపణలు
న్యూఢిల్లీ: దేశంతో గత తొమ్మిదేళ్లలో మనీ లాండరింగ్ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 93.54 శాతం నేరాలను నిరూపించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద 31 కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసిందని, ఇందులో 29 కేసుల్లో 54 మందిని దోషులుగా గుర్తించిందని వెల్లడించారు. పీఎంఎల్ఏ కింద నేర నిరూపణ రేటు 93.54 శాతం ఉందని పేర్కొన్నారు. అలాగే ఈడీ గత తొమ్మిదేళ్లలో రూ.16,507.86 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందని తెలియజేశారు. -
గోద్రా కేసు..దోషులకు సుప్రీంకోర్టులో ఊరట
ఢిల్లీ: గోద్రా రైలు దహనం కేసులో దోషులకు ఎట్టకేలకు ఊరట లభించింది. గుజరాత్ అల్లర్లకు కారణమైన గోద్రా సబర్మతి రైలు దహనం కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఎనిమిది మందికి శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. అయితే మరో నలుగురికి మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు శుక్రవారం బెయిల్ ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది మంది 17 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవించిన కారణంగా వాళ్లు బెయిల్కు అర్హులేనని ప్రకటించింది ధర్మాసనం. అయితే ఈ నేరంలో మరో నలుగురి పాత్ర తీవ్రత దృష్ట్యా వాళ్లకు బెయిల్ అభ్యర్థలనలను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. 👉 2002, ఫిబ్రవరి 27వ తేదీన గుజరాత్ గోద్రా రైల్వే స్టేషన్ వద్ద సబర్మతి ఎక్స్ప్రెస్లోని కొన్ని కోచ్లను తగలబెట్టారు. ఈ దుర్ఘటనలో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అయోధ్య కరసేవకు వెళ్లి తిరిగి వస్తున్నవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఆ మరుసటి రోజు నుంచి గుజరాత్ భగ్గుమంది. ఈ పరిణామం.. గుజరాత్ అల్లర్లకు కారణమైంది. 👉 2011లో స్థానిక కోర్టు(ట్రయల్ కోర్టు) గోద్రా ఘటనకు సంబంధించి కేసులో.. 31 మందిని నిందితులుగా, 63 మంది నిర్దోషులుగా ప్రకటించింది. పదకొండు మందికి మరణశిక్ష, 20 మందికి జీవిత ఖైదు విధించింది ట్రయల్ కోర్టు. 👉 ఈ తీర్పును సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. గుజరాత్ హైకోర్టు 31 మందినీ దోషులుగానే ప్రకటించింది. కానీ, ట్రయల్ కోర్టు విధించిన 11 మంది మరణశిక్షను మాత్రం జీవిత ఖైదుగా మారుస్తూ తీర్పు ఇచ్చింది. 👉 గుజరాత్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. 2018లో సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయ్యింది. అది అప్పటి నుంచి పెండింగ్లో ఉంది. 👉 ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన బెయిల్ కోసం దోషులు పిటిషన్లు వేసుకోగా.. కొందరి బెయిల్ పిటిషన్లను(ట్రయల్ కోర్టు మరణ శిక్ష ఖరారు చేసిన దోషులకు) సుప్రీం కోర్టు తిరస్కరించింది. అయితే.. జీవిత ఖైదు పడిన వాళ్లకు మాత్రం బెయిల్ అభ్యర్థనలను పరిశీలిస్తామని పేర్కొంది. అంతకు ముందు.. 👉 సోమవారం ఏప్రిల్ 17వ తేదీన సుప్రీం కోర్టులో దోషుల బెయిల్ అభ్యర్థనలపై విచారణ సందర్భంగా.. గుజరాత్ ప్రభుత్వం ఈ కేసులో గట్టి వాదనలే వినిపించింది. దోషులు తీవ్ర నేరాలను పాల్పడ్డారని, బోగీలకు బయటి నుంచి డోర్లను బిగించి మరీ మారణకాండకు పాల్పడ్డారని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు. అయితే ఇప్పటికే పదిహేడేళ్ల శిక్షఅనుభవించిన విషయాన్ని గుర్తు చేస్తూ దోషుల తరపు న్యాయవాది వాదనల్ని వినిపించారు. 👉 ఇక ఇవాళ్టి వాదనల తర్వాత ఎనిమిది మందికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది సీజేఐ నేతృత్వంలోని బెంచ్. ఇదీ చదవండి: గుజరాత్ అల్లర్ల కేసు.. బీజేపీ నేతను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు -
బిల్కిస్ బానో దోషులకు ఇదోరకం శిక్ష!
గాంధీనగర్: బిల్కిస్ బానోస్ సామూహిక అత్యాచార కేసులో దోషులకు క్షమాభిక్ష.. తదనంతర సన్మాన ఘట్టం తీవ్ర విమర్శలకు దారి తీసింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వాళ్లను మళ్లీ కటకటాల వెనక్కి పంపాలంటూ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే.. జైలు నుంచి విడుదలయ్యాక ఆ పదకొండు మందిలో చాలావరకు ఇప్పుడు పత్తా లేకుండా పోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోలీసులు మాత్రం వాళ్ల కదలికలపై నిఘా పెట్టి ఉంచగా.. సొంత వూరిలోనే అవమానాలు, ఛీత్కారాలు, బెదిరింపులతో భయంభయంగా గడుపుతున్నాయి దోషుల కుటుంబాలు. గుజరాత్లోని రంధిక్పూర్లో.. చాలావరకు దోషుల ఇళ్లకు తాళాలు ఉన్నాయ్. అక్కడంతా నిశబ్ద వాతావరణం నెలకొంది. తమ విడుదలపై విమర్శలు చెలరేడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎక్కడ మళ్లీ అరెస్ట్ చేస్తారో.. అక్రమ కేసులు బనాయించి కటకటాల వెనక్కి నెడతారేమో అని ఊరి వదిలి పారిపోయినట్లు బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఇచ్చిన వివరణ ద్వారా తెలుస్తోంది. బిల్కిస్ బానోస్పై అఘాయిత్యం జరిగే సమయంలో.. శైలేష్ భట్ బీజేపీ క్రియాశీలకగా నేతగా ఉన్నాడు. ఆ సమయంలోనే శైలేష్ భట్, మిటేష్ భట్లు ఇళ్లలో ఉండేవాళ్లు కారని.. రాజకీయాలంటూ తిరిగేవాళ్లని చుట్టుపక్కల వాళ్లు చెప్తున్నారు. ఆగష్టు 15న రెమిషన్ మీద విడుదలయ్యాక ఈ ఇద్దరు ఇళ్లకు తాళాలు వేసుకుని ఎటో వెళ్లిపోయారు. మరో దోషి రాధేశ్యామ్ షా ఇంటి వద్ద కూడా ఇదే పరిస్థితి. ఇక మరో నిందితుడు బకాభాయ్ ఇల్లు శిథిలావస్థకు చేరుకోవడంతో.. ఆ కుటుంబం మరో చోట గుడారం వేసుకుని జీవిస్తోంది. అయితే తన భర్త జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి గ్రామస్తులు కొందరు ఆయన్ని వెంబడించి.. ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని బకాభాయ్ భార్య మంగ్లీబెన్ చెబుతోంది. ఆ భయంతో తన భర్త బయటకు రావడం మానేశాడని ఆమె అంటోంది. అంతేకాదు.. తప్పుడు అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు పెట్టి మళ్లీ జైలుకు పంపుతామంటూ కొందరు ఆయన్ని బెదిరిస్తున్నారని ఆమె వాపోతోంది. దోషుల్లో నలుగురైదుగురిది మాత్రమే ఉన్నత కుటుంబాలు. మిగతా కుటుంబాలు కూలీనాలీ చేసుకుని బతికేవే!. గ్రామస్థుల నుంచి ప్రత్యేకించి ముస్లిం కమ్యూనిటీ నుంచి దోషుల కుటుంబాలపై అప్రకటిత బహిష్కరణ నడుస్తోంది. అప్పటిదాకా కూలీనాలీ పనులు చేసుకుంటూ పోతున్న ఆ కుటుంబాలకు(ఐదారు).. వాళ్లు విడుదలయ్యాక ఉపాధి లేకుండా పోయింది. వెలివేత, చిన్నచూపు తప్పడం లేదు. తప్పు చేసింది ఒకరైతే.. శిక్ష తాము అనుభవించాల్సి వస్తోందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు ఇప్పుడు. ఇదీ చదవండి: బొగ్గు కుంభకోణం: ఇప్పుడు ఆ మంత్రిపై సీబీ‘ఐ’ -
28 ఏళ్ల తర్వాత సిస్టర్ అభయ హత్య కేసులో తీర్పు
సాక్షి, తిరువనంతపురం: కేరళలో 1992లో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో సీబీఐ కోర్టు మంగళశారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీని దోషులుగా తేల్చింది. రేపు(డిసెంబర్23) దోషులకు శిక్షలు ఖరారు చేయనున్నట్లు సీబీఐ కోర్టు వెల్లడించింది. 1992, మార్చి 27న కొట్టాయంలో సిస్టర్ అభయ హత్యకు గురైంది. సిస్టర్ అభయను ఫాదర్ థామస్, నన్ సెఫీ హత్య చేసినట్లు నికోర్టు నిర్ధారించింది. 28 ఏళ్ల తర్వాత అభయ హత్య కేసులో తీర్పు వెలువడింది. చదవండి: 9 కంపెనీలు.. 9 బ్యాంకులు.. రూ.9వేల కోట్లు కేసు వివరాలు.. 1992లో సిస్టర్ అభయ(21) కేరళలోని బీఎంసీ కళాశౠలలో సైకాలజీ కోర్సు చేస్తోంది. ఆ సమయంలో థామస్ కొట్టూరు సైకాలజీ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 27న కొట్టాయంలోని సెయింట్ పియస్ ఎక్స్ కాన్వెంట్లో ఉన్న ఓ బావిలో అభయ శవమై తేలింది. ప్రమాదవశాత్తు అభయ బావిలో పడి మరణించి ఉండవచ్చునని పోలీసులు తొలుత నిర్దారించారు. కానీ మానవ హక్కుల కార్యకర్త జోమోన్ పుతెన్పురక్కల్ ఈ కేసును కోర్టులో సవాల్ చేయడంతో న్యాయస్థానం దీని విచారణను 1993లో సీబీఐకి అప్పగించింది. అనంతరం సిస్టర్ అభయ హత్యకు గురైందని సీబీఐ తేల్చింది. ఈ ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత సెయింట్ పియస్ కాన్వెంట్లో అధ్యాపకులుగా పనిచేస్తున్న థామస్ కొత్తూర్, జోస్ పుత్రుక్కయిల్తో పాటు ఓ సిస్టర్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సీబీఐ చార్జిషీట్లో పేర్కొన్న వివరాల ప్రకారం... మార్చి 27,1992న తెల్లవారుజామున 4.15గంటలకు సిస్టర్ అభయ తన హాస్టల్ గది నుంచి కిచెన్ వైపు వెళ్లింది. అక్కడ థామస్ కొత్తూర్,జోస్ పుత్రుక్కయిల్ ఓ క్రైస్తవ సన్యాసినితో అభ్యంతరకర రీతిలో కనిపించారు. ఈ విషయం అభయ ఎక్కడ బయటపెడుతుందోమోనన్న భయంతో ఆమెపై దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం మృతదేహాన్ని కాన్వెంట్ ప్రాంగణంలోని బావిలో విసిరేశారు. తమ కుమార్తెకు న్యాయం జరగాలని చాలాకాలంగా ఎదురుచూసిన అభయ తల్లిదండ్రులు నాలుగేళ్ల క్రితమే మరణించారు. ఎట్టకేలకు 28 ఏళ్ల తర్వాత ఈ కేసు ఓ కొలిక్కి వచ్చి థామస్. నన్ సెఫీని దోషులుగా తేల్చుతూ న్యాయస్థానం తీర్పిచ్చింది. -
నిర్భయ దోషులకు ఉరి: చివర్లో ఉత్కంఠ
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరితీయ బడ్డ నలుగురు దోషులు అద్భుతం జరుగుతుందని చివరి నిమిషం వరకు అనుకున్నారని తీహార్ జైలు వర్గాలు వెల్లడించాయి. ఉరిశిక్ష వేయకుండా నిలిపివేస్తారని ఆశ పడ్డారని తెలిపాయి. కోర్టు నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా అని పదేపదే అడిగారని జైలు అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల వరకు ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులో విచారణ జరగడంతో చివరి నిమిషంలో తమకు మరణదండన తప్పుతుందన్న ఆశ నలుగురు నేరస్తుల్లో కనిపించినట్టు చెప్పారు. తీహర్ జైలులోని 3వ నంబర్ బరాక్లో ఉన్న దోషుల చివరి నిమిషం వరకు ’కోర్టు నుంచి ఏదైనా వర్తమానం వచ్చిందా’ అన్న ప్రశ్న తమకు ఎదురైందని వెల్లడించారు. ఉదయం 5.30 గంటలకు ఉరితీసే వరకు తమకు కాపలా ఉన్న 15 మంది భద్రతా సిబ్బందిని ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారట. (ఆ మైనర్ ఇప్పుడెక్కడా?!) లడ్డూలు, నూడుల్స్ అడిగారు నలుగురు దోషులకు గురువారం మధ్యాహ్నం రోజూ మాదిరిగా ఆహారంలో రోటీ, పప్పు, అన్నం, కూర ఇచ్చారు. ప్రత్యేకంగా ఏమి అడగలేదని, అందరూ లంచ్ చేశారని జైలు అధికారులు తెలిపారు. అక్షయ్ గురువారం సాయంత్రం టీ తాగాడు. అక్షయ్, పవన్ రాత్రి భోజనం చేయలేదు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ముకేశ్, అక్షయ్, వినయ్ తమకు లడ్డూలు, నూడుల్స్ కావాలని అడగడంతో వాటిని తెప్పించి పెట్టినట్టు వెల్లడించారు. గురువారం రాత్రి 11 గంటలకు దోషులు నలుగురికి న్యాయవాది, మానసిక వైద్యుడి సమక్షంలో చివరిసారిగా వైద్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున 4.45 గంటలకు జిల్లా మేజిస్ట్రేట్ (పశ్చిమ) డెత్వారెంట్ను దోషులకు చదివి వినిపించారు. ఉరిశిక్షకు భయపడిన పవన్ కాసేపు గలాభా సృష్టించడంతో అతడి వద్ద ఎక్కువ మంది పోలీసులను ఉంచారు. జైలు సిబ్బంది ఇచ్చిన బట్టలు వేసుకునేందుకు అతడు నిరాకరించాడు. ‘మేము ఇచ్చిన బట్టలను వేసుకోకుండా నేలకేసి కొట్టాడు. తనను క్షమించాలని ఏడుస్తూ వేడుకున్నాడు. ఉరి కంబం దగ్గరకు తీసుకెళుతుండగా దోషులందరూ తమను క్షమించాలని కన్నీళ్లు పెట్టుకుంటూ అర్ధించార’ని జైలు అధికారి ఒకరు వెల్లడించారు. (నేనైతే ఫాంహౌజ్కు తీసుకువెళ్లి తగలబెట్టేవాడిని..) 8వ నంబర్ సెల్ ఉన్న వినయ్ శర్మ, ముఖేష్ సింగ్.. ఒకటో నంబర్సెల్ ఉన్న పవన్ గుప్తా, ఏడో నంబర్ సెల్లో ఉన్న అక్షయ్ సింగ్లను భద్రత సిబ్బంది ఉరికంబం వద్దకు తీసుకొచ్చారు. వినయ్ శర్మ, ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ సింగ్లను ఒకేసారి ఉరి తీశారు. ఆ సమయంలో జిల్లా మేజిస్ట్రేట్, జైలు సూపరింటెండెంట్, ఇద్దరు సహాయ సూపరింటెండెంట్స్, వార్డెన్, వైద్యాధికారి, ఢిల్లీ జైళ్ల శాఖ డీజీ ఉన్నారు. యూపీలోని మీరట్కు చెందిన తలారి పవన్ జలాద్కు ఒక్కో ఉరికి రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.60 వేలు చెల్లించినట్టు సమాచారం. జైలులో పనిచేసిన సంపాదించిన మొత్తాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని దోషులు చెప్పినట్టు అధికారులు తెలిపారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 2 వేల నుంచి మూడు వేల వరకు ఉన్నట్టు సమాచారం. డబ్బుతో పాటు వారి బట్టలు, దుప్పట్లను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. (తలారికి లక్ష నజరానా.. జైలు వద్ద హడావుడి) -
‘నిర్భయ’దోషులకు ఉరి
న్యూఢిల్లీ: నిర్భయ తల్లిదండ్రుల ఏడేళ్ల న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. 2012లో రాజధాని నడిబొడ్డున నడుస్తున్న బస్సులో పారామెడికో విద్యార్థిని నిర్భయని అత్యంత క్రూరంగా హింసించి అత్యాచారం, హత్య చేసిన కేసులో దోషులైన ముఖేష్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ సింగ్(31)లను శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు తీహార్ జైల్లో ఉరితీశారు. ఇలా ఒకేసారి నలుగురికి ఉరి శిక్ష అమలు చేయడం తీహార్ జైలు చరిత్రలో ఇదే మొదటిసారి ప్రాణాల మీద ఆశతో దోషులు చివరి వరకు ఉరిశిక్ష అమలును ఆపడానికి తీవ్రంగా ప్రయత్నించారు. చట్టంలో ఉన్న అవకాశాలను వాడుకుంటూ ఆఖరి వరకు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. దాంతో, గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా వారి ఉరిపై సందిగ్ధత నెలకొంది. గురువారం రాత్రి పవన్ గుప్తా పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టు అత్యవసర విచారణ చేపట్టాయి. తన క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రెండోసారి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ పవన్ గుప్తా వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు బెంచ్ అసాధారణ రీతిలో శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ప్రారంభించింది. గంటపాటు జరిగిన వాదనల అనంతరం ఆ పిటిషన్ను బెంచ్ కొట్టివేసింది. దాంతో, ఉరి శిక్ష అమలు చేయడానికి చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఉరిశిక్ష అమలుకు ముందు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినివ్వాలని అక్షయ్ సింగ్, పవన్ గుప్తా పెట్టుకున్న అభ్యర్థనను కూడా అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇది జరిగిన మూడు గంటల్లోనే తీహార్ జైలు అధికారులు నలుగురికీ ఉరి శిక్ష అమలు చేశారు. నిబంధనల ప్రకారం.. ఉరి వేసిన తరువాత అరగంట పాటు వారిని ఉరికంబానికే వేలాడదీసి ఉంచారని జైలు అధికారులు తెలిపారు . ‘ఉరిశిక్ష అనంతరం డాక్టర్లు పరీక్షించారు. నలుగురూ మృతి చెందారని నిర్ధారించారు’ అని ఆ తరువాత తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ ప్రకటించారు. ఆ తరువాత డీడీయూ ఆసుపత్రిలో పోస్ట్మార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించామన్నారు. అక్షయ్, ముఖేష్ల మృతదేహాలను బిహార్, రాజస్తాన్ల్లోని తమ తమ గ్రామాలకు వారు తీసుకెళ్లారని చెప్పారు. వినయ్, పవన్ల మృతదేహాలను ఢిల్లీలో రవిదాస్ క్యాంప్లో ఉన్న వారి ఇళ్లకు తరలించామన్నారు. చివరి క్షణాలు ఒకవైపు కోర్టులో వాదనలు జరుగుతున్నా.. తీహార్ జైలు అధికారులు ఉరిశిక్ష అమలుకు సన్నాహాలు చేస్తూనే ఉన్నారు. గురువారం రాత్రి నుంచే మొత్తం జైలుని లాక్డౌన్ చేశారు. దోషులు నలుగురిని వేర్వేరు గదుల్లో ఉంచారు. రాత్రి డిన్నర్ని ముఖేష్, వినయ్ రోజూ మాదిరిగా ఇచ్చిన టైమ్కి తినేశారు. వారికిచ్చిన ఆహారంలో రోటీ, పప్పు, అన్నం, కూర ఉన్నాయి. అక్షయ్ గురువారం సాయంత్రం టీ తాగాడు. ఆ తర్వాత అతను ఏం తీసుకోలేదు. పవన్ గుప్తా కూడా ఆహారం తీసుకోవడానికి నిరాకరించాడు. వారిలో ఎలాంటి ఆందోళన కనిపించలేదని, రాత్రంతా కూడా వారు ముభావంగానే గడిపారని జైలు అధికారి ఒకరు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత లాంఛనాలు పూర్తి చేయడానికి తెల్లవారు జామున 3.30 గంటలకి ఆ దోషులు నలుగురిని నిద్ర లేపడానికి అధికారులు వెళ్లారు. అయితే వారు మేలుకొని ఉన్నారు. రాత్రంతా వారు నిద్రలేకుండానే గడిపారని జైలు అధికారులు వెల్లడించారు. స్నానం చేయడానికి, అల్పాహారం తినడానికి ఇష్టపడలేదు. నిర్వికారంగానే ఉరికంబం వైపు అడుగులు వేశారు. ఒకరి ఆత్మహత్య.. మరొకరి విడుదల దోషులుగా తేలి, ఉరిశిక్షకు గురైన నలుగురితో పాటు మరో ఇద్దరు నిందితులుగా విచారణ ఎదుర్కొన్నారు. విచారణ జరుగుతుండగానే.. ఆ ఇద్దరిలో రామ్సింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు నేరం జరిగిన సమయానికి మైనర్ కావడంతో.. నిర్బంధ వసతి గృహంలో మూడేళ్లు శిక్ష అనుభవించి 2015 సంవత్సరంలో విడుదల అయ్యాడు. ప్రధాని మోదీ హర్షం నిర్భయ దోషుల ఉరిపై ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. నిర్భయ కేసును ప్రస్తావించకుండా.. ‘న్యాయం గెలిచింది. మహిళల గౌరవం, భద్రత మనకు అత్యంత ముఖ్యమైన విషయం. మన మహిళలు అన్ని రంగాల్లోనూ అద్భుత విజయాలు సాధిస్తున్నారు. మహిళల సాధికారతపై ప్రధానంగా దృష్టి పెట్టే.. మహిళలకు సమానత్వం, సమాన అవకాశాలు లభించే సమాజాన్ని మనమంతా కలిసి నిర్మించాలి’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, మహిళలపై హింసను నివారించేందుకు మరణశిక్ష ఏ నాటికి పరిష్కారం కాబోదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించింది. ఈ ఉరి శిక్ష భారతదేశ మానవహక్కుల చరిత్రలో ఒక మరకలా నిలిచిపోతుందని పేర్కొంది. ఆఖరి కోరికలివే ఉరికంబం ఎక్కడానికి ముందు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ తన అవయవాలను దానం చేశాడు. అదే తన ఆఖరి కోరికని చెప్పాడు. వినయ్ తాను జైల్లో ఉన్నప్పుడు వేసిన పెయింటింగ్లను జైలు సూపరింటెండెంట్కి ఇవ్వమని కోరాడు. తాను చదివే హనుమాన్ చాలీసా తన కుటుంబసభ్యులకు ఇవ్వమని చెప్పినట్టు జైలు అధికారి వెల్లడించారు. ముఖేష్, వినయ్, పవన్, అక్షయ్ ఎవరూ ఎలాంటి విల్లు రాయలేదని ఆ అధికారి చెప్పారు. విజయ సంకేతం చూపుతున్న నిర్భయ తల్లిదండ్రులు, లాయర్లు సీమా కుష్వాహ, జితేంద్ర ఝా 2012 నుంచి 2020 వరకు న్యూఢిల్లీ: నిర్భయ ఘటన 2012 డిసెంబర్ 16న చోటు చేసుకోగా, దోషులకు ఉరిశిక్ష 2020 మార్చి 20న అమలైంది. ఏడు సంవత్సరాలకు పైగా ఈ కేసు విచారణ సాగింది. దోషులుగా తేలి, ఉరిశిక్షను నిర్ధారించిన తరువాత కూడా కేసును సాధ్యమైనంత సాగదీశారు. విచారణ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి కార్యాలయం చుట్టూ పలుమార్లు ఈ కేసు చక్కర్లు కొట్టింది. చివరగా, మార్చి 5న ట్రయల్ కోర్టు మార్చి 20న ఉరిశిక్షను అమలు చేయాలని డెత్ వారెంట్లను జారీ చేసింది. ‘నిర్భయ’ తలారికి లక్ష నజరానా యశవంతపుర: నిర్భయ హంతకులను ఉరి తీసిన తలారి పవన్ జల్లూద్కు రూ.లక్ష నజరానా ప్రకటించినట్లు నటుడు జగ్గేశ్ ట్వీట్ చేశారు. హంతకులను ఉరితీసే వ్యక్తికి రూ. లక్ష బహుమతిగా ఇస్తానని గతంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఉరితీతతో సత్యం, ధర్మానికి న్యాయం లభించిందన్నారు. ఈ డబ్బుతో తన కుమార్తె వివాహం చేస్తానని జల్లూద్ గతంలో పేర్కొనడాన్ని జగ్గేష్ గుర్తు చేశారు. జైలు వద్ద నినాదాలు తీహార్ జైలు వెలుపల గురువారం రాత్రంతా జనం హడావుడి కనిపించింది. కరోనా భయాన్ని కూడా పక్కనపెట్టి వందలాది మంది గుమిగూడారు. దోషులను ఉరి తీశారన్న వార్త వినగానే జాతీయ జెండాను ఎగురవేస్తూ లాంగ్ లివ్ నిర్భయ, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేశారు. న్యాయం దక్కింది నిర్భయ దోషులకు ఉరిశిక్షపై పలువురు ప్రముఖుల హర్షం న్యూఢిల్లీ/బెంగళూరు: నిర్భయ దోషుల ఉరిపై ప్రధాని మోదీ సహా, పలువురు కేంద్రమంత్రులు, మహిళా సంఘాలు సానుకూలంగా స్పందించాయి. పలువురు రాజకీయ నేతలు న్యాయనిపుణులు హర్షం వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్ష అమలును పలువురు కేంద్ర మంత్రులు స్వాగతించారు. దేశంలో మహిళలపై జరిగే అత్యాచారాలకు కఠిన శిక్షలు అమలు చేయాలని బాలీవుడ్ ప్రముఖులు రిషి కపూర్, తాప్సీ పన్ను, రితేశ్ దేశ్ముఖ్ తదితరులు పేర్కొన్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మాత్రం.. మహిళలపై అత్యాచారాలకు దోషులకు మరణ శిక్ష విధించడం ఏమాత్రం పరిష్కారం కాదని తెలిపింది. భారత్ మానవహక్కుల రికార్డుపై ఈ ఘటనను మాయని మచ్చగా అభివర్ణించింది. దోషులకు కఠిన శిక్షలు పడేలా నిర్భయ తల్లి సాగిస్తున్న పోరాటాన్ని స్వయంగా చూశాం. ఇందుకు కొంత సమయం తీసుకున్నా, చివరికి ఆ కుటుంబానికి న్యాయం దక్కినందుకు సంతోషంగా ఉంది. నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలుతో నేరగాళ్లు చట్టం నుంచి తప్పించుకోలేరని గట్టి హెచ్చరిక పంపినట్లయింది. –మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ నిర్భయ ఘటనల వంటివి భవిష్యత్తులో జరక్కుండా చూస్తామని ఈ సమయంలో మనమంతా ప్రతినబూనాలి. ఏ కూతురికీ ఇలాంటి ఆపద రాకూడదు. వ్యవస్థలో లోపాలను అధిగమించేందుకు పోలీసులు, కోర్టులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషి చేయాలి. –ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర వేదనను అనుభవించిన ఒక కూతురు నిర్భయకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. మరణశిక్ష అమల్లో జాప్యం అయ్యేలా దోషులు తప్పుదోవ పట్టించకుండా ఇకపై న్యాయవ్యవస్థ, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. –కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ నిర్భయకు ఎట్టకేలకు న్యాయం దొరికింది. ఆమె ఆత్మకు శాంతి లభించింది. ఈ కేసులో నలుగురు దోషులను ఉరి తీయడం మిగతా వారికి హెచ్చరికలా పనిచేస్తుంది. న్యాయ వ్యవస్థలోని లొసుగులను ఈ కేసు బయటపెట్టింది. వీటిని నలుగురు దోషులు వాడుకున్నారు. –జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ నిర్భయ నివాసంలో హర్షం దోషులకు ఉరిశిక్ష అమలు శుక్రవారంనాడు పూర్తి కావడంతో పశ్చిమ ఢిల్లీ ద్వారకా ప్రాంతంలోని నిర్భయ కుటుంబసభ్యులు, ఇరుగు పొరుగువారు సంతోషం వ్యక్తం చేశారు. నిర్భయ కుటుంబసభ్యులను కలిసేందుకు జనం క్యూ కట్టారు. ఈ సందర్భంగా వారంతా స్వీట్లు పంచుకున్నారు. పాటలు పాడుకుంటూ, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ‘గత ఏడాది డిసెంబర్ 12వ తేదీ నుంచి మా ఇంటి ఆవరణలో నిర్భయకు నివాళిగా రోజూ కొవ్వొత్తులను వెలిగిస్తున్నాం. ఇటీవల ఒక రోజు రాత్రి భారీ వర్షం కురిసినా కూడా ఒక కొవ్వొత్తి వెలుగుతూనే ఉండటం గమనించాం. దీనిని మేం శుభ సూచికంగా భావించాం’అని నిర్భయ తండ్రి బద్రీనాథ్ సింగ్ తెలిపారు. నిర్భయ దోషుల మృతదేహాలతో ఆస్పత్రి వద్దకు వచ్చిన వ్యాన్ -
డమ్మీ ఉరి పూర్తి, 20న ఉరి శిక్ష అమలు?
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2012 నిర్భయ సామూహిక హత్యాచార కేసులో దోషుల ఉరి శిక్ష అమలుకు సర్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం తలారి పవన్ జల్లాద్ డమ్మీ ఉరి కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్చి 20 న ఉరి తీయడానికి రెండు రోజుల ముందే తీహార్ జైలులో నలుగురు మరణశిక్షకు సంబంధించి డమ్మీ ఉరిని నిర్వహించినట్టు తలారి పవన్ బుధవారం తెలిపారు. మంగళవారం మీరట్ నుండి వచ్చి తాడులను పరీక్షించడానికి డమ్మీ ఉరిశిక్షను అమలు చేశామన్నారు. తీహార్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో మరోసారి అన్ని సన్నాహాలతో, బుధవారం 'డమ్మీ ట్రయల్' జరిగినట్టు తీహార్ జైలు అదనపు ఇన్స్పెక్టర్ జనరల్ రాజ్ కుమార్ తెలిపారు. జైలు నెంబర్ -3 ఉరి గదిలో జైలు అధికారుల సమక్షంలో దీన్ని నిర్వహించామని, ఉరి శిక్ష అమలుకు ముందు ఇలాంటి పరీక్షలు సాధారణమైన విషయమని ఆయన తెలిపారు. తద్వారా ఉరి సమయంలోఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్ధారించుకునేందుకు డమ్మీ ట్రయల్ ఉంటుందన్నారు. ఇది అరగంట పాటు కొనసాగిందని సీనియర్ అధికారి చెప్పారు. మరోవైపు శిక్ష ఖరారైనప్పటినుంచి దోషులు నలుగురు న్యాయ పరమైన అవకాశాలను వినియోగించు కుంటూ, శిక్ష అమలుపై అవరోధాలతో మరణ శిక్షనుంచి విజయవంతంగా తప్పించుకుంటున్నారు. తాజాగా విడాకులు ఇప్పించాల్సిందిగా అక్షయ్ భార్య పిటిషన్ దాఖలు చేసింది. ఇది ఇలా వుంటే ఉరిశిక్ష అమలు పై స్టే విధించాలని కోరుతూ దోషులు మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వ న్యాయవాదికి నోటీసులు జారీ చేసిన కోర్టు, నిర్భయ దోషుల తాజా పిటిషన్ను ఢిల్లీ కోర్టు గురువారం విచారించనున్నట్లు పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో మార్చి 20 ఉరి శిక్ష అమలవుతుందా? లేక మరోసారి వాయిదా పడుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ కేసులో ఆరుగురు దోషలుగా తేలగా, విచారణ ప్రారంభమైన కొన్ని రోజుల తరువాత తిహార్ జైలులో ఆరవ నిందితుడు రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మరో దోషి మైనర్ జువైనల్ హోంనుంచి విడుదలయ్యాడు. మిగిలిన దోషులు నలుగురు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31) లకు విధించిన ఉరిశిక్ష అమలు ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. కోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులకు శిక్ష అమలు కావాల్సి వుంది. -
ఉరి మళ్లీ వాయిదా
-
నిర్భయ దోషులకు రేపే ఉరి ...
-
నిర్భయ దోషులకు రేపే ఉరి..!
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై ఉత్కంఠ తొలగింది. డెత్వారెంట్పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పటియాల హౌజ్ కోర్టు నిరాకరించింది. దీంతో రేపు(మార్చి 3) ఉదయం 6గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. మరోవైపు తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ ఖైదు శిక్షగా మార్చాలంటూ నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త పెట్టుకున్న పిటిషన్ను సుప్రీం ధర్మాసనం కొట్టి వేసింది. దీంతో నలుగురు దోషులకు రేపు తీహార్ జైల్లో ఉరి శిక్ష అమలు అయ్యే అవకాశం ఉంది. (చదవండి : మార్చి 3న ఉరితీయండి ) అయితే పవన్కి ఇంకా రాష్ట్రపతికి క్షమాభిక్షకు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది. మరో వైపు ఈ కేసులో ఉరి అమలు వాయిదా పడేందుకు దోషులు విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చివరి నిమిషంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడంతో గతంలో రెండు సార్లు శిక్ష అమలు వాయిదా పడింది. అయితే ప్రస్తుతం అన్నీ అడ్డంకులు తొలిగిపోవడంతో రేపు ఉదయం ఆరు గంటలకు నలుగురు నిందితులను తీహార్ జైల్లో ఉరి తీయనున్నారు. -
‘తీహార్’ అధికారులు సహకరించట్లేదు!
న్యూఢిల్లీ: తీహార్ జైలు అధికారులు తమకు సహకరించడం లేదంటూ నిర్భయ దోషులు ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు వేసేందుకు అవసరమైన పత్రాలను అధికారులు ఇవ్వడం లేదని ఉరిశిక్ష పడిన నలుగురిలో ముగ్గురు శుక్రవారం కోర్టులో పిటిషన్లు వేశారు. వినయ్ కుమార్ శర్మ క్షమాభిక్ష పిటిషన్కు అవసరమైన 70 పేజీల డైరీ ప్రతితోపాటు అక్షయ్కుమార్ సింగ్, పవన్ సింగ్ క్యూరేటివ్ పిటిషన్లకు జైలు అధికారులు కొన్ని పత్రాలను ఇవ్వాల్సి ఉందని అందులో తెలిపారు. అవి లేనందున వెంటనే దరఖాస్తు చేయలేకపోయామని, వాటిని వెంటనే ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఇందుకోసం ఈ పిటిషన్ను అత్యవసరంగా భావించి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పటియాలా హౌస్ కోర్టులో వేసిన ఈ పిటిషన్లు శనివారం విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. కాగా, వినయ్, ముకేశ్ సింగ్లు ఆఖరిప్రయత్నంగా వేసిన క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. దీంతోపాటు ముకేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఉరిశిక్ష అమలును పలు విధాలుగా సవాలు చేస్తూ కాలం గడిపేయొచ్చనే అభిప్రాయం దోషుల్లో ఏర్పడరాదంటూ గురువారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
ఉరి తీస్తున్నాం.. కడసారి చూసివెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషులను ఉరితీసేందుకు తీహార్ జైలు అధికారులు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలోని పటియాల కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలలోపు నలుగురు దోషులు వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్(31), ముఖేష్ కుమార్ (32), పవన్(26)లకు మరణశిక్ష విధించనున్నారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులను చివరిసారిగా చూసుకునే అవకాశం దోషులకు కల్పించాలనేది అనవాయితీ. అయితే మీ చివరి కోరిక ఏంటని జైలు అధికారులు దోషులను ప్రశ్నించినప్పడు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఉరిశిక్ష అమలుకు సమయం దగ్గర పడుతుండటంతో దోషుల తల్లిదండ్రులుకు జైలు అధికారులు ఓ వర్తమానం పంపారు. ‘నిర్భయ అత్యాచార, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురిని ఫిబ్రవరి 1న ఉరితీస్తున్నాం. ఈలోపు మీ పిల్లల్ని చివరి సారిగా చూసుకోవడానికి ఉరితీసే సమయంలో లోపు జైలుకు రావచ్చు’ అని సమాచారం ఇచ్చారు. (చివరి కోరిక చెప్పని నిర్భయ దోషులు) కాగా ఉరిశిక్ష అమలుకు అధికారులు జైలు నెం3లో ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇసుక బస్తాలతో ట్రైల్స్ కూడా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన పవన్ జల్లద్ నలుగురు దోషులను ఉరితీయనున్నారు. కాగా అనేక ఉత్కంఠ పరిణామాలు, రివ్యూ పిటిషన్ల కొట్టివేత అనంతరం వారి ఉరికి రంగం సిద్ధమైంది. ఉరిశిక్షను తప్పించుకునేందుకు దోషులు చేయని ప్రయత్నలు లేవు. చివరికి సుప్రీంకోర్టు కూడా వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
చివరి కోరికపై మౌనంగా నిర్భయ దోషులు
-
బ్రజేశ్ ఠాకూర్ దోషే
న్యూఢిల్లీ: బిహార్లోని ముజఫర్పూర్లోని ఒక షెల్టర్ హోంలో బాలికలపై జరిగిన లైంగిక దాడికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడు బ్రజేశ్ ఠాకూర్ను ఢిల్లీలోని పోక్సో కోర్టు సోమవారం దోషిగా తేల్చింది. ఠాకూర్, మరో 18 మంది దోషులేనని స్పష్టం చేసింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, లైంగిక దాడి, లైంగిక వేధింపులు, బాలికలకు డ్రగ్స్ ఇవ్వడం, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం.. తదితర నేరారోపణలపై బ్రజేశ్ ఠాకూర్, ఆ వసతి గృహం సిబ్బంది, బిహార్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోని పలువురు ఉద్యోగులపై ఈ కేసు నమోదైంది. ముజఫర్పూర్లో ఠాకూర్ నిర్వహిస్తున్న వసతి గృహంలో జరిగిన ఈ దారుణాన్ని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెన్ 2018లో వెలుగులోకి తెచ్చింది. బాలికలపై అత్యాచారం, సామూహిక అత్యాచారం తదితర నేరాలకు సంబంధించి పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే చట్టం), భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని పలు సెక్షన్ల కింద ఆయనను న్యాయమూర్తి సౌరభ్ కులశ్రేష్ట దోషిగా నిర్ధారించారు. ఏ శిక్ష విధించాలనే విషయమై ఈ నెల 28న వాదనలు వింటామని న్యాయమూర్తి ప్రకటించారు. పైన పేర్కొన్న నేరాలకు యావజ్జీవం పడే అవకాశముంటుంది. ముజఫర్పూర్లోని చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ రోజీ రాణిని కూడా కోర్టు దోషిగా పేర్కొంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్మన్ దిలీప్ కుమార్ వర్మ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రవి రోషన్ సహా మిగతా 17 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ తీర్పును పై కోర్టులో సవాలు చేస్తామని ఠాకూర్ తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ కేసులో సీబీఐ హాజరుపర్చిన 69 మంది సాక్ష్యులను కోర్టు విచారించింది. వేధింపులకు గురైన 44 మంది బాలికల వాంగ్మూలాలను తీసుకుంది. ఆ బాలికల్లో 13 మంది మానసికంగా సరైన ఎదుగుదల లేనివారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోజువారీ విచారణ చేపట్టి ఆర్నెల్లలో విచారణను కోర్టు ముగించింది. బ్రజేశ్తో తన భర్తకు సంబంధాలున్నాయన్న ఆరోపణ రావడంతో బిహార్ మంత్రి మంజు వర్మ పదవికి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2019లో ఈ కేసును ముజఫర్పూర్ కోర్టు నుంచి ఢిల్లీలోని పోక్సో కోర్టుకు బదిలీ చేశారు. -
సోనియా అంత మనసు లేదు
న్యూఢిల్లీ: ‘నిర్భయ’ దోషులను క్షమించాలంటూ సుప్రీంకోర్టు లాయర్ ఇందిరా జైసింగ్ చేసిన సూచనపై ‘నిర్భయ’ తండ్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాంటి సలహా ఇచ్చినందుకు జైసింగ్ సిగ్గుపడాలన్నారు.. తమకు సోనియా గాంధీ అంత పెద్ద మనసు లేదని వ్యాఖ్యానించారు. మరణశిక్షను తీవ్రంగా వ్యతిరేకించే జైసింగ్ శుక్రవారం ఒక ట్వీట్ చేస్తూ... కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హంతకులను క్షమించినట్టుగానే ఈ కేసు దోషులను నిర్భయ తల్లిదండ్రులు క్షమించాలని సూచించారు. ఒక తల్లిగా నిర్భయ తల్లిదండ్రుల బాధను తాను అర్థం చేసుకోగలనని, కాకపోతే మరణశిక్ష మాత్రం సరికాదని ఇందిరా జైసింగ్ తన ట్వీట్లో వ్యాఖ్యానించారు. రాజీవ్ హంతకురాలు నళినీ శ్రీహరన్కు న్యాయస్థానం మరణ శిక్ష విధించగా.. సోనియాగాంధీ జోక్యం చేసుకుని ఆమెను క్షమించినట్లు ప్రకటించారు. ఆ తరువాత ఆమెకు పడ్డ మరణశిక్ష కాస్తా యావజ్జీవ కారాగార శిక్షగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాలన్నింటిపై నిర్భయ తండ్రి స్పందిస్తూ.. ఇందిరా జైసింగ్ సూచనను తోసిపుచ్చారు. మహిళగా ఉంటూ అలాంటి సలహా ఇచ్చినందుకు ఆమె నిర్భయ తల్లికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఏడేళ్లుగా మేము ఈ కేసుపై పోరాడుతున్నాం. మేము రాజకీయ నాయకులము కాము. సామాన్యులము. మా హృదయాలు సోనియా గాంధీ అంత విశాలం కాదు’’ అని స్పష్టం చేశారు. ఇందిరా జైసింగ్ చేస్తున్న వ్యాఖ్యల వంటివే దేశంలో అత్యాచారాలు పెరిగిపోయేందుకు కారణమని అన్నారు. నిర్భయ తల్లి కూడా తన వ్యాఖ్యలతో ఏకీభవిస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా.. సామూహిక అత్యాచారం వంటి క్రిమినల్ కేసుల్లో పడే శిక్షపై దోషులను క్షమించమని బాధితుల కుటుంబ సభ్యులు చెప్పడంతో ఏమీ మారిపోదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘‘న్యాయ వ్యవస్థ పరంగా చూస్తూ బాధితురాలి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు అనే విషయానికి విలువ లేదు. న్యాయస్థానాలు చట్టం ప్రకారమే నడుచుకుంటాయి. పైగా సోనియాగాంధీ మాదిరిగా నిర్భయ దోషులను క్షమించాలన్న ఇందిరా జైసింగ్ సలహాను నిర్భయ తల్లిదండ్రులు తోసిపుచ్చుతున్నారు’’ అని సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేదీ తెలిపారు. అయితే రాష్ట్రపతికి పెట్టుకునే క్షమాభిక్ష పిటిషన్లలో ఇలాంటి (బాధితురాలి కుటుంబం క్షమించింది) విషయాలను ప్రస్తావించవచ్చునని మరో న్యాయవాది వికాస్ సింగ్ చెప్పారు. -
సభ్య సమాజానికే ఇది తలవంపు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 2013లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోక్సో కోర్టు శనివారం దోషులుగా నిర్ధారించింది. ఈ ఘటన సమాజానికే తలవంపులు తెచ్చిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ దారుణ సంఘటన 2012 డిసెంబర్లో నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు తర్వాత నాలుగు నెలలకు చోటుచేసుకుంది. నిందితులు మనోజ్ షా, ప్రదీప్ కుమార్ బాధితురాలిని లైంగికంగా హింసించారు. అనంతరం బాలిక చనిపోయిందనుకుని వదిలేసి వెళ్లారు. 40 గంటల తరువాత ఏప్రిల్ 17న బాలికను రక్షించారు. ప్రస్తుతం ఈ కేసులో అదనపు సెషన్స్ జడ్జి నరేశ్కుమార్ మల్హోత్రా ఇద్దరినీ దోషులుగా నిర్ధారించారు. బాలికను వారు క్రూరంగా హింసించారని వ్యాఖ్యానించారు. ‘మన సమాజంలో మైనర్ బాలికలను దేవతలుగా ఆరాధిస్తారు. కానీ ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది’ అని పోక్సో కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, తన కుమార్తెకు న్యాయం లభించినందుకు బాలిక తండ్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ‘విచారణ రెండేళ్ళలో పూర్తి కావాలి, కానీ ఆరేళ్ల తరువాతైనా మాకు న్యాయం లభించినందుకు సంతోషం’ అని అన్నారు. దోషులకు శిక్షల విధింపుపై జనవరి 30న విచారిస్తామని కోర్టు తెలిపింది. 2013లో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మే 24 చార్జిషీట్ దాఖలు చేశారు. జూలై 11న అభియోగాలు మోపుతూ హాజరుపరిచారు. -
జైల్లో డమ్మీ ఉరి ట్రయల్స్
-
నిర్భయ దోషులందరూ తీహార్ జైల్లో
న్యూఢిల్లీ: ఢిల్లీలో నిర్భయపై మూకుమ్మడి అత్యాచారం, హత్య కేసులో దోషులకి ఉరి శిక్ష అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బిహార్ బక్సర్ జైలు నుంచి ఉరితాళ్లను తీసుకువస్తున్నారు. ఉరికంబంపై శిక్ష అమలు ఎలా జరపాలో నలుగురు దోషుల బరువు, ఎత్తున్న దిష్టిబొమ్మలకి ఉరి తీసి డమ్మీ ట్రయల్స్ వేసి చూశారని జైలు వర్గాలు తెలిపాయి. దోషులందరినీ ప్రస్తుతం తీహార్ జైలు నంబర్ మూడులో వేర్వేరు గదుల్లో ఉంచి సీసీటీవీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జైలు నంబర్ 3లోనే దోషులకి ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఇటీవల మండోలి జైలులో ఉన్న పవన్ కుమార్ గుప్తాను తీహార్ జైలుకి తరలించినట్టు డైరెక్టర్ జనరల్ (జైళ్లు) సందీప్ గోయెల్ వెల్లడించారు. ముఖేష్ సింగ్, అక్షయ్ సింగ్, వినయ్ శర్మను ఉంచిన జైలు నెంబర్3లో పవన్ కుమార్ గుప్తాను ఉంచారు. నిర్భయను 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి బస్సులో ఆరుగురు రాక్షసులు మూకుమ్మడిగా అత్యాచారం చేయడమే కాకుండా, దారుణంగా హింసించడంతో ఆమె కొన్నాళ్లు మృత్యువుతో పోరాడి సింగపూర్ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఆరుగురు దోషుల్లో ఒకరైన రామ్సింగ్ జైల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు మైనర్ కావడంతో మూడేళ్ల పాటు జువైనల్ హోంకి పంపారు. మిగిలిన నలుగురిని ఏ రోజైతే అత్యంత పాశవికంగా నిర్భయపై అత్యాచారానికి పాల్పడ్డారో అదే రోజు డిసెంబర్ 16న ఉరితీస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దోషులందరూ ఒకే జైలుకి చేరడంతో వారికి ఉరిశిక్ష అమలు జరపడం ఖాయమన్న వార్తలకు ఊతమిచ్చినట్టయింది. ఢిల్లీ కాలుష్యం చంపేస్తోంది.మళ్లీ ఉరి ఎందుకు ? సుప్రీంలో అక్షయ్ సింగ్ రివ్యూ పిటిషన్ నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు దోషుల్లో ఒకరైన అక్షయ్ సింగ్ మరణ దండనని సమీక్షించాల్సిందిగా సుప్రీం కోర్టుకెక్కినట్టు అతని తరఫు లాయర్ ఏపీ సింగ్ వెల్లడించారు. తన రివ్యూ పిటిషన్లో అక్షయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీలో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం ఎలాగూ తమని చంపేస్తోందని, తమ ఆయుష్షుని తగ్గిస్తోందని మళ్లీ ఉరి శిక్ష ఎందుకంటూ ప్రశ్నించాడు. 2018, జూలై 9న అత్యున్నత న్యాయస్థానం మిగిలిన ముగ్గురు దోషులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ని కొట్టి వేసింది. అప్పుడు రివ్యూ పిటిషన్ వేయని అక్షయ్ ఉరి శిక్ష అమలుకు సన్నాహాలు జరుగుతున్న వేళ పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ను కూడా సుప్రీం కోర్టు కొట్టివేసే అవకాశాలే ఎక్కువున్నాయి. -
నేను ఉరి తీస్తా.. ఆమె ఆత్మ శాంతిస్తుంది
సాక్షి, న్యూఢిల్లీ: 2012లో డిసెంబర్ 16న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ హత్యాచార ఘటన ‘నిర్భయ’ కేసు దోషులకు మరణ శిక్ష ఖాయమైన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరి తీసే తలారి లేకపోవడంతో జైలు అధికారులు టెన్షన్ పడుతున్నారన్న వార్తకు స్పందన వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ షిమ్లాకు చెందిన రవి కుమార్ దేశాధ్యక్షుడు రామనాథ్ కోవింద్కు ఒక లేఖ రాశారు. ఢిల్లీ తీహార్ జైలులో ఎగ్జిక్యూటర్ లేనందున తనను తాత్కాలిక తలారిగా నియమించాలని కోరారు. తద్వారా నిర్భయ కేసు దోషులను త్వరలో ఉరి తీయవచ్చు. నిర్భయ ఆత్మ శాంతిస్తుందని ఆయన పేర్కొన్నారు. కదులుతున్న బస్సులో పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ కేసులో బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచడం కోసం ఆమె పేరును నిర్భయగా మార్చారు. నేరస్థులో ఒకడైన రాంసింగ్ తానున్న జైలు లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, బాల నేరస్థుడు సంస్కరణ గృహంలో ఉన్నాడు. ఇక మిగిలిన నలుగురికి ఉరిశిక్షను ఖరారు చేసింది సుప్రీంకోర్టు. మరోవైపు క్షమాభిక్ష పిటిషన్ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించడంతో, తీహార్ జైలులో ఉన్న వినయ్ శర్మ రాష్ట్రపతిని ఆశ్రయించాడు. అయితే దోషులకు ఎట్టి పరిస్థితుల్లో క్షమాభిక్ష పెట్టవద్దని జాతీయ మహిళా కమిషన్ రాష్ట్రపతికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరిస్తే నిర్భయ కేసులో దోషులైన వినయ్ శర్మతోపాటు ముకేష్, పవన్, అక్షయ్కు మరణశిక్షను అమలు చేయనున్నారు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఈ పిటిషన్ను తిరస్కరించిన వెంటనే కోర్టు దోషులను ఉరి తీయాలని ‘బ్లాక్ వారెంట్’ జారీ చేసే అవకాశముందని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. అక్కడ తలారి లేక.. ఇతర జైళ్లలో తలారీలు ఎవరైనా ఉన్నారా అని తీహార్ జైలు అధికారులు ఆరా తీస్తున్నారట. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాల్లోనూ పదవీ విరమణ చేసిన తలారీలు ఎవరైనా ఉన్నారా? అని వెతికే పనిలో ఉన్నారు. తలారీని కాంట్రాక్టు పద్ధతిపై నియమించాలని తీహార్ జైలు అధికారులు యోచిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో తాజా లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది. Himachal Pradesh: Ravi Kumar, from Shimla has written to President Kovind to appoint him as temporary executioner in Delhi’s Tihar Jail as there is no executioner there.He states, “Appoint me executioner so ‘Nirbhaya’ case convicts can be hanged soon & her soul rests in peace". pic.twitter.com/fqZLarNZIQ — ANI (@ANI) December 4, 2019 -
'నిర్భయకేసు దోషులకు త్వరలో మరణశిక్ష'
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపి, మహిళల రక్షణకు కొత్త చట్టాలు చేసేలా పాలకులను కదిలించిన నిర్భయ కేసులో దోషులకు వచ్చే నెలలో ఉరి శిక్ష అమలు కానుంది. ఇప్పటి వరకూ వారు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లు ఏవీ ఆమోదానికి నోచుకోలేదు. నిర్భయ కేసులో మరణశిక్ష పడి, ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న వినయ్శర్మ రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దోషి క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించిన వెంటనే కోర్టు దోషులను ఉరి తీయాలని బ్లాక్ వారెంట్ జారీ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరి తీసే తలారీ లేకపోవడంపై జైలు అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఉరి తీసే తలారీ ఉద్యోగాన్ని భర్తీ చేయడం కానీ.. తాత్కాలికంగా ఎక్కడైనా పని చేస్తున్న వారిని తీహార్ జైలుకు బదిలీ చేసి.. శిక్షను అమలు పరచలా అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. నిర్భయ కేసులో శర్మ, ముకేశ్, పవన్, అక్షయ్, రామ్ సింగ్, ఓ మైనర్ బాలుడు నిందితులు కాగా, మైనర్ బాలుడు విడుదలయ్యాడు. రామ్ సింగ్ జైల్లోనే ఉరేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. మిగిలిన నలుగురినీ ఉరితీయాల్సి ఉంది. ఇటీవల శర్మ మెర్సీ పిటిషన్ పెట్టుకోగా, దాన్ని తిరస్కరించాలని ఢిల్లీ సర్కారు సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది. నిర్భయ ఘటనలో దోషులకు క్షమాభిక్ష పెట్టవద్దని లేఖ లో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరిస్తే నిర్భయ కేసులో దోషులైన వినయ్ శర్మతోపాటు ముకేష్, పవన్, అక్షయ్ లకు మరణశిక్షను అమలు చేయనున్నారు. ఢిల్లీలో 2012 డిసెంబరు 16వ తేదీన కదులుతున్న బస్సులో ఒక పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బస్సు నుంచి రోడ్డు పక్కన పడేశారు. తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె అదే సంవత్సరం డిసెంబర్ 20న కన్నుమూసింది. ఈ కేసులో బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచడం కోసం ఆమె పేరును నిర్భయగా నిర్ణయించారు. అంతే కాకుండా ఆ పేరుపై మహిళల సంరక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది. -
మృగాడిగా మారితే... మరణశిక్షే
సాక్షి, వరంగల్ : ప్రస్తుత వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయ ప్రధా న ద్వారం.. గతంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి పోలీసు హెడ్క్వార్ట ర్స్ ముఖ ద్వారానికి అటూఇటు పరిశీలిస్తే ఎడమ పక్క పోలీసు హెడ్క్వార్టర్స్ అనీ, మరోపక్క ‘ఎవర్ విక్టోరియస్’ అని పెద్ద అక్షరాలతో ఉంటుం ది. దీనికి అర్థం ‘ఎప్పుడూ విజేతలే’ అని! దీనిని సార్థకం చేసుకునేలా వరంగల్ పోలీసు పనితీరు ఉంటోంది. తాజాగా తొమ్మిది నెలల చిన్నారి పై అత్యాచారం, హత్య చేసిన నిందితుడు పోలేపాక ప్రవీణ్కు 48 రోజు ల్లో ఉరిశిక్ష పడేలా దర్యాప్తు చేసిన పోలీసులను ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఈ విషయాన్ని, పోలీసు తీరుపై వచ్చిన విమర్శలను కాసేపు పక్కన పెడితే... మగాళ్లు మృగాళ్లుగా మారితే ఇక అంతేనన్న విషయం మాత్రం సుస్పష్టం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొన్నేళ్లుగా జరిగిన ఘటనలను పరిశీలిస్తే ఇది నిజమేనని అంగీకరించాల్సి ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో వరంగల్ పోలీసుల దర్యాప్తు తీరు మరోసారి మార్మోగింది. ఇక్కడి పోలీసులకు వర్ విక్టోరియస్(ఎప్పుడు విజేతలే)గా ఉన్న పేరు మరోసారి నిజం చేసుకున్నట్లయింది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వారు కేసులను త్వరితగతిన చేధిస్తున్నారు. శ్రీహిత కేసును రికార్డు స్థాయిలో 48 రోజుల్లోనే తీర్పు వచ్చేలా కేసుకు సంబంధించి అన్ని రకాల సాక్షాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి ఎక్కడ కూడా కేసు వీగిపోకుండా తీసుకున్న జాగ్రత్తలే పోలేపాక ప్రవీణ్కు ఉరిశిక్ష పడడానికి కారణమయ్యాయి. గతంలో సైతం పోలీసులు తీసుకున్న నిర్ణయాలు, ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ మరోసారి కూడా దక్కింది. ఈ మేరకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకున్న పలు ఘటన వివరాలను ఓసారి పరిశీలిద్దాం. అశోక్రెడ్డి కేసులో 16మందికి యావజ్జీవం హసన్పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన గౌరు అశోక్రెడ్డితో జరిగిన స్థానిక గొడవలను పెద్దగా తీసుకున్న కొందరు 4 మార్చి 2012న హత్య చేశారు. అశోక్రెడ్డి భార్య ఫిర్యాదుతో హసన్పర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఇన్స్పెక్టర్ మోజెస్ సుమారు 27 మందిని సాక్షులుగా పేర్కొంటూ వారి వాంగ్మూలాన్ని రికార్డు చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. కేసుకు సంబంధించి ప్రతీ సాక్ష్యాన్ని పకడ్బందీగా సేకరించారు. దీంతో పాటే అశోక్రెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న 27 మంది ఎవరి ప్రలోభాలకు లొంగకుండా, వెనక్కి తగ్గకుండా నిజం చెప్పేలా పోలీసులు వారికి ధైర్యం, భరోసా కల్పించారు. ఈ కేసులో తీర్పు ఈనెల 5వ తేదీన వచ్చిందంటే ఏడేళ్లకు పైగా సాక్షులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కాపాడగలిగారు. దీంతో కోర్టు నిందితులు 16 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జిల్లాలో ఒకేసారి ఇంత మందికి యావజ్జీవం పడటం సంచలనం కలిగించడమే కాకుండా పోలీసుల తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. కమిషనరేట్లో 82 పీడీ యాక్టు కేసులు నేరం చేయాలంటే వెన్నులో భయం పుట్టేలా ప్రస్తుత వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్ చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ నేరం చేసే వ్యక్తులు మరోసారి నేరం చేయకుండా ఉండేలా పీడీ యాక్టు నమోదు చేస్తున్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. వివిధ రకాల నేరాలు, దొంగతనాలకు పాల్పడే వ్యక్తులపై ఇప్పటి వరకు 82 పీడీ యాక్టు కేసులు నమోదు చేశారు. పెట్రోల్, యాసిడ్ దాడులు... పీడీ యాక్టు ప్రేమ నిరాకరించిందన్న కోపంతో ఈ ఏడాది ఫిబ్రవరి 27న హన్మకొండ కిషనపురలో హాస్టల్ నుంచి కళాశాలకు వెళ్తున్న డిగ్రీ విద్యార్థిని తోపుచర్ల రవళిపై సాయి అన్వేష్ పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని హన్మకొండ పోలీసులు అరెస్టు చేశారు. రవళి తీవ్ర గాయాలతో హైదరాబాద్లో చికిత్స పొందుతూ మార్చి 4న తుదిశ్వాస విడిచింది. అనంతరం మే 18న నిందితుడు సాయి అన్వేష్పై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. అలాగే, 2017లో ఐనవోలు మండలం గర్మిళ్లపల్లిలో వివాహిత బోయిన మాధవిపై యాసిడ్తో దాడి చేయగా ఆమె మృతి చెందింది. ఈ కేసులో నిందితులు కల్వల చంద్రశేఖర్, అడెపు అనిల్ను అరెస్టు చేసి జైలుకు తరలించడంతో పాటు వారిపై పీడీ యాక్టు నమోదు చేశారు. యాసిడ్ దాడి... ఆపై ఎన్కౌంటర్ రాష్త్రంలో తీవ్ర సంచలనం కలిగించిన యాసిడ్ దాడి సంఘటన 2008 డిసెంబర్లో హసన్పర్తి మండలం భీమారం దగ్గర జరిగింది. కిట్స్ కళాశాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థినులు స్వప్నిక, ప్రణీతపై శాఖమూరి శ్రీనివాస్ ఇద్దరు స్నేహితులతో కలిసి యాసిడ్తో దాడిచేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన స్వప్నిక చికిత్స పొందుతూ మృతి చెందగా, ప్రణీత తీవ్ర గాయాలతో బయటపడింది. ఈ ఘటన జరిగినప్పుడు ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోగా.. సాక్షాల సేకరణ సమయంలో వారు తప్పించుకునేందుకు యత్నించగా ఎన్కౌంటర్ చేయడంతో ముగ్గురూ మృతి చెందారు. ఆ సమయంలో ప్రజలు తండోపతండాలుగా, స్వతంత్రంగా పోలీసు హెడ్క్వార్టర్స్కు చేరుకుని ఎస్పీ సజ్జనార్ను భుజాలపై ఎత్తుకుని జేజేలు కొట్టారు. ఆ సమయంలో ‘తప్పు చేస్తే వరంగల్ పోలీసులు వదలరు’ అనే సంకేతం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. జంట హత్యకేసు... 24 గంటల్లో ఛేదన హసన్పర్తి మండల కేంద్రంలో 2018 జూన్ 18న గడ్డం దామోదర్, గడ్డం పద్మ దంపతుల హత్య జరిగింది. ఈ కసులో నిందితుడు కామరపు ప్రశాంత్ను హసన్పర్తి పోలీసులు 24 గంటల్లోపే అరెస్టు చేశారు. నిందితుడు దొంగిలించిన రూ.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా అనేక కేసుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి బాధితుల పక్షాన నిలిచి న్యాయం జరిగేలా చేసిన కృషితో పోలీసు అధికారులు, సిబ్బంది కీర్తి పెరిగిపోతోంది. మనీషా కిడ్నాప్... ముగ్గురు ఎన్కౌంటర్ వరంగల్కు చెందిన పత్తి వ్యాపారి కుమార్తె మనీషాను 2008లో కిడ్నాప్ చేసి హత్య చేశారు. అప్పట్లో ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. అప్పటి ఎస్పీ సౌమ్యామిశ్ర ప్రజల నుంచి వచ్చిన ఒత్తిళ్లను అర్థం చేసుకుని కేసులో ముందుకు సాగారు. డబ్బు కోసం అభంశుభం తెలియని పాప మనీషాను నిర్ధాక్షిణంగా హత్య చేసిన ముగ్గురిని విచారించే క్రమంలో ధర్మసాగర్ మండలం తాటికాయల వ్యవసాయ బావి వద్ద ఎన్కౌంటర్కు గురయ్యారు. ఈ ఘటనలో కూడా వరంగల్ పోలీసులకు ప్రజల నుంచి మద్దతు.. ఎస్పీ సౌమ్యామిశ్రాకు ప్రశంసలు లభించాయి. సిబ్బందిలో ఆత్మస్థైర్యం పెరిగింది శ్రీహిత కేసులో నిందితుడు పోలేపాక ప్రవీణ్కు ఉరిశిక్ష పడడంతో పోలీసు అధికారులు, సిబ్బందిలో ఆత్మస్థైర్యం పెరిగింది. ప్రజలకు ఇంకా సేవ చేయాలనే తపన వస్తోంది. ఇలాంటి కేసుల్లో విజయం వల్ల పోలీసులు మరింత స్ఫూర్తితో మరింత ముందుకు సాగుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ వృత్తి నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. ఇలాంటి కేసుల్లో న్యాయం జరగడం వల్ల ప్రజల్లో మాపై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో మేం మరింత బాధ్యతగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదు. – డాక్టర్ రవీందర్, వరంగల్ సీపీ -
సంచలన హత్యకేసులో బీజేపీకి షాక్
ఆర్టీఐ కార్యకర్త హత్య కేసులో బీజేపీకి గుజరాత్లో భారీ షాక్ తగిలింది. సంచలనాత్మక హత్య కేసులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ ఎంపీ, మైనింగ్ మాఫియా దిను బోఘా సోలంకితో పాటు మరో ఆరుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. అనేక మలుపులు తరువాత ఈ కేసులో సంచలన తీర్పు వెలువడింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక న్యాయమూర్తి కెఎం డేవ్ శనివారం ఈ తీర్పును వెలువరించారు. ఈ నెల (జూలై) 11న వీరికి శిక్షలను ఖరారు చేయనున్నారు. దోషుల్లో దిను సోలంకి మేనల్లుడు శివ సోలంకి, శైలేష్ పాండ్యా(షూటర్) తోపాటు బహదూర్సింగ్ వాధర్, పంచన్ జి దేశాయ్, సంజయ్ చౌహాన్, ఉదాజీ ఠాకూర్ ఉన్నారు. పులుల సంరక్షణా కేంద్రం గిర్ అడవుల్లో అక్రమ తవ్వకాలపై ప్రశ్నించినందుకు ఆర్టీఐ కార్యకర్త అమిత్ జేత్వా హత్యకు గురయ్యారు. జూలై 20, 2010న గుజరాత్ హైకోర్టు ఆవరణలో ఇద్దరు దుండగులు అమిత్ను దారుణంగా కాల్చి చంపారు. ఈ హత్య కేసులో కీలక కుట్రదారుడిగా సోలంకిపై సీబీఐ అభియోగాలు మోపింది. గిర్ అడవిలోని నిషేధిత ప్రాంతాలలో సోలంకి అక్రమ మైనింగ్ కార్యకలాపాలను వెలుగులోకి తెచ్చినందున అమిత్ను కిరాయి గుండాలతో హత్య చేయించినట్టుగా సీబీఐ ఆరోపించింది. 2013లో సోలంకిని అరెస్ట్ చేసిన సీబీఐ అమిత్ హత్య కేసులో కీలక కుట్రదారుడిగా వాదించింది. ప్రధానంగా నిందితుల కాల్ డేటా రికార్డ్స్ (సిడిఆర్) ఆధారంగా వీరిని నేరస్తులుగా పేర్కొంటూ చార్జ్షీటు దాఖలు చేసింది. కాగా ఈ హత్య కేసును మొదట అహ్మదాబాద్ డిటెక్షన్ క్రైమ్ బ్రాంచ్ (డిసిబి) విచారించింది. కానీ నిందితులందరికీ డీసీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే విచారణ సమయంలో 195మంది సాక్షుల్లో 105 మంది సోలంకి బెదిరింపులకు లొంగిపోయారనీ, సీబీఐ దర్యాప్తు కోరుతూ అమిత జెత్వా తండ్రి భిఖాభాయ్ జెత్వా గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ తరువాత కేసు మరో మలుపు తిరిగింది. అనూహ్యంగా విచారణను నిలిపి వేసింది కోర్టు. కానీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అసాధారణ ఆదేశాలిచ్చింది. ఈ కేసును పునిర్విచారణ చేయాలని స్పెషల్ కోర్టును కోరింది. అంతేకాదు న్యాయమూర్తి దినేష్ ఎల్ పటేను మార్చాలని కూడా ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా తీర్పు వెలువడింది. -
‘ఆ పాపాలకు మూల్యం చెల్లిస్తారు’
సాక్షి, న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ను ఢిల్లీ హైకోర్టు దోషిగా నిర్ధారిస్తూ దిగువ కోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చడంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్పై మండిపడ్డారు. సజ్జన్ కుమార్ను దోషిగా హైకోర్టు తేల్చడం న్యాయం గెలిచితీరుతుందని కాస్త ఆలస్యమైనా వెల్లడైందన్నారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల పాపాలకు కాంగ్రెస్ పార్టీతో పాటు గాంధీ కుటుంబం మూల్యం చెల్లించకతప్పదని వ్యాఖ్యానించారు. 1984 ఘర్షణల బాధితులకు కాంగ్రెస్ ఎలాంటి న్యాయం చేయలేదని, బాధితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం విశ్వసనీయతను పాదుకొల్పిందన్నారు. సిక్కు వ్యతిరేక ఊచకోత ఘటనల్లో అల్లర్లను ప్రేరేపించేలా సజ్జన్ కుమార్ ప్రసంగించారని, మత సామరస్యానికి విఘాతం కల్పించారని ఢిల్లీ హైకోర్టు ఆయనను దోషిగా పేర్కొంటూ జీవిత ఖైదును విధించిన సంగతి తెలిసిందే. -
‘వారిని రెండు వారాల్లో ఉరి తీయాలి’
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ కేసులో దోషులను రెండు వారాల్లో ఉరితీయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు గురువారం తోసిపుచ్చింది. నిర్భయ కేసులో నలుగురు దోషులు ముఖేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్లను ఉరితీయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ముగ్గురు దోషుల మరణ శిక్షపై వారు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను కోర్టు తిరస్కరించి నాలుగున్నర మాసాలైనా వారికి మరణ శిక్ష ఇంతవరకూ అమలు కాలేదని తన పిటిషన్లో శ్రీవాస్తవ అభ్యంతరం వ్యక్తం చేశారు. హత్యాచార కేసుల్లో నిందితుడిపై ఎనిమిది నెలల్లోనే దిగువ కోర్టు నుంచి సర్వోన్నత న్యాయస్ధానం వరకూ చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. మరణ శిక్ష అమలులో జాప్యం చెడు సంకేతాలు పంపుతుందని, ఫలితంగా దేశంలో రోజూ నిత్యం లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నీచమైన నేరాలకు పాల్పడితే తమకు ఎలాంటి హాని జరగదనే తప్పుడు సంకేతాలు రేపిస్టుల మనసులో చెలరేగుతాయని పిటిషన్ పేర్కొంది. హత్యాచార కేసుల్లో మరణ శిక్ష విధించబడ్డ నిందితులను సత్వరమే ఉరితీసేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కూడా పిటిషన్ కోరింది. 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి దేశరాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో 23 సంవత్సరాల పారామెడికల్ విద్యార్ధినిపై సామూహిక లైంగిక దాడి జరిపిన ఆరుగురు వ్యక్తులు ఆమెను బస్సు నుంచి తోసివేయడంతో తీవ్ర గాయాలతో బాదితురాలు అదే నెల 29వ తేదీన సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. నిర్భయ ఘటనగా పేరొందిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. -
‘నిర్భయ’కు ఐదేళ్లు.. వాళ్ల సంగతేంటి?
సాక్షి, న్యూఢిల్లీ : సరిగ్గా ఐదేళ్ల క్రితం. దేశ రాజధాని నడిబొడ్డున దాష్టీకం. 23 ఏళ్ల విద్యార్థినిపై ఆరు మృగాల చేతిలో చిత్రవధలకు గురయిన రోజు. చెప్పుకోటానికి కూడా వీల్లేని రీతిలో కిరాతకంగా అనుభవించి.. నగ్నంగా రోడ్డు పైకి విసిరేశాయి. ఆ వార్తతో యావత్ దేశం ఉలిక్కి పడింది. తల మరియు పేగులకు తగిలిన గాయాలతో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో 2012, డిసెంబర్ 29 న బాధితురాలు తుదిశ్వాస విడిచారు. ‘‘అమానత్, దామిని, నిర్భయ’’ పేర్లతో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నలుమూలల నుంచి హస్తినకు చేరిన యువత గర్జించటంతో ఢిల్లీ పీఠం కదిలింది. దేశం యావత్తునూ నిర్ఘాంతపరచిన ఢిల్లీ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులైన ముఖేష్ (26), అక్షయ్ఠాకూర్ (28), పవన్గుప్తా (19), వినయ్శర్మ (20) లకు ఢిల్లీ కోర్టు విధించిన మరణ శిక్షను సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. ఈ కేసును అరుదైన కేసుల్లోకెల్లా అరుదైన కేసుగా నిలుపుతోందని కోర్టు అభివర్ణించింది. ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఒక నిస్సహాయ మహిళపై దోషుల అమానవీయ, భయానక చర్యలు జాతి అంతరాత్మను నిర్ఘాంతపరచాయని.. మహిళలపై నేరాలను సహించబోమనే సందేశం పంపటానికి వీరికి తీవ్రమైన శిక్ష అవసరమని న్యాయమూర్తి తీర్పులో స్పష్టంచేశారు. కానీ, ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వారికి శిక్ష అమలు కాలేదు. ఐదేళ్ల తర్వాత న్యాయం... మరి శిక్ష అమలు? ఘటన తర్వాత సీసీ పుటేజీ ఆధారంగా బస్సు డ్రైవర్ రామ్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత అతని తమ్ముడు ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ వినయ్ గుప్తా, అక్షయ్ ఠాకూర్లను అరెస్ట్ చేశారు. చివరి నిందితుడు, మైనర్ అయిన రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు జువైనల్ హోంకు తరలించి చివరకు విడిచిపెట్టారు. రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకోగా.. మిగిలిన నలుగురికి మరణ శిక్షలు ఖరారు అయ్యాయి. ‘దోషులు చనిపోయే వరకూ ఉరితీయాలి’ అంటూ కిక్కిరిసిన కోర్టు గదిలో జడ్జి శిక్షను ప్రకటించారు. నిస్సహాయురాలైన బాధితురాలిని చనిపోవటానికి గురిచేసిన చిత్రహింసలు, గాయాల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు దోషులకు మరణశిక్ష విధించింది. సుమారు నాలుగేళ్ల తర్వాత మే 5, 2017న అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ కోర్టు తీర్పుతో ఏకీభవించింది. 8 నెలలు గడుస్తున్నా తీర్పు ఇప్పటిదాకా అమలు కాలేదు. జైలు అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవటంతో మధ్యలో ఓసారి ఆశా దేవీ ఢిల్లీ మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా సంఘం జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది. అయినా ఇంత వరకు స్పందన లేదు. ఇదిలా ఉండగా.. దోషులు వినయ్ శర్మ, పవన్ కుమార్ గుప్తాలు తాజాగా మరణశిక్ష తీర్పుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై విచారణ వచ్చే నెల(జనవరి 2018) 22వ తేదీకి వాయిదా వేసింది. నిర్భయపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి, కిరాతకంగా హింసించి చంపిన నరరూప రాక్షసులను చనిపోయేవరకూ ఉరితీయటమే సరైందన్న వాదన నేడు మరోసారి తెరపైకి వచ్చింది. కాలంలో ఇరుక్కున్నాం.. ఆశాదేవి కిరాతకానికి బలైనా నిర్భయ కొన ఊపిరి ఉన్నంతవరకు కూడా మొక్కవోని ధైర్యం ప్రదర్శించింది. కిరాతకులను ఎదురించింది. కాబట్టే ప్రభుత్వం, అధికారులు ఆమె పేరును దాచి పెట్టాలని చూసినా తల్లి ఆశాదేవి మాత్రం అందుకు నిరాకరించారు. ఢిల్లీ నగర బొడ్డున ఓ సమావేశంలో తమ కూతురు పేరు జ్యోతి సింగ్గా ప్రకటించారు. ‘‘ఘటన జరిగి ఐదేళ్లు గడుస్తున్నా ఆ రాక్షసులు ఇంకా బతికే ఉన్నారు. మా కుటుంబం ఇంకా ఆ ఘటనను, ఈ రోజునే గుర్తు చేసుకుంటూ అక్కడే ఆగిపోయాం. ఇలాంటి సమయాల్లో చట్టాలపై ప్రజలకు గౌరవం పోతుంది. ప్రతీ ఒక్కరి ఆలోచనా ధోరణి మారే విధంగా బలమైన చట్టాల రూపకల్పన జరగాలి. అప్పుడే నిర్భయ ఆత్మకు శాంతి కలుగుతుంది’’ అని ఆశాదేవి చెబుతున్నారు. నిర్భయ ఘటన తర్వాత హడావుడి తప్ప పరిస్థితి ఇప్పటికీ ఏం మారలేదు. కఠిన చట్టాలు చేస్తాయన్న ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభించటం లేదు. అందుకే ఉద్యమంలో ఇంకా నేను కొనసాగుతూనే ఉన్నా. దేశంలో ప్రతిరోజు ఏదో ఒక మూల మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, వాళ్ల భవిష్యత్ తదితర దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు ముందుకు రావటం లేదు. వారిలో అవగాహన పెరిగి.. ముందుకు వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందని అని ఆమె అభిప్రాయపడుతున్నారు. -
కోప్రాది గ్యాంగ్ రేప్: నిందితులకు ఉరి శిక్ష
సాక్షి, ముంబై : కోప్రాది గ్యాంగ్రేప్, హత్య కేసులో ముగ్గురు నిందితులకు అహ్మద్నగర్ జిల్లా సెషన్సు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా గత ఏడాది సంచలనం సృష్టించిన కోప్రాది గ్యాంగ్రేప్, హత్య కేసులో జితేంద్ర బాబూలాల్ షిండే, సంతోష్ గోర్కా బవాల్, నితిన్ గోపీనాథ్ భలూమే నిందితులుగా ఉన్నారు. ఈ కేసు విచారించేందుకు 2016 డిసెంబర్ 20న స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర్లలోని అహ్మద్ నగర్ జిల్లా కోప్రాదిలో 2016 జులై 13న 15 ఏళ్ల మైనర్ బాలికను ముగ్గురు దుండుగులు గ్యాంగ్రేప్ చేసి, ఆపై హత్య చేశారు. రక్తమోడుతున్న బాలిక మృతదేహాన్ని గ్రామానికి దగ్గర్లోని ఒక చెట్టు దగ్గర ప్రజలు గుర్తించారు. బాధిత బాలిక మారాఠా వర్గానికి చెందినది. కేసు తీర్పు వెలువడ్డాక.. నిందితుల తరపు న్యాయవాది బాలాసాహెబ్ ఖోప్డే.. నేరం చేసినా ఇంతటి తీవ్రమైన శిక్ష విధించడం భావ్యం కాదని ఆయన కోర్టుకు తెలిపారు. ప్రాసిక్యూషన్ తరఫున కేసు వాదించిన న్యాయవాది ఉజ్వల్ నికమ్ మాత్రం తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అత్యంత అరుదైన కేసుల్లో ఒకటని.. నిందితులకు ఉరి శిక్షే సరైన శిక్ష అని అన్నారు. -
నిర్భయ కేసులో 'ఐరన్ రాడ్ థియరీ' నిరూపిస్తే 10 లక్షలిస్తా..!!
న్యూఢిల్లీః నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో ఢిఫెన్స్ లాయర్ కొత్త వాదనకు తెరతీశారు. నిర్భయ కేసులో నిందితుల తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఎంఎల్ శర్మ సంచలన ప్రకటన చేశారు. కేసులో ఐరన్ రాడ్ థియరీని నిరూపిస్తే 10 లక్షలిస్తానంటూ బహుమతిని ప్రకటించారు. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు ఆమె శరీరంలోకి ఇనుపరాడ్ ను దించి, అవయవాలను బయటకు లాగారన్న పోలీసుల వాదదను ఆయన కొట్టిపారేశారు. అదో కట్టు కథ అని, అది నిరూపిస్తే పదిలక్షలు ఇస్తానంటూ న్యాయవాది శర్మ ప్రకటించడం.. కేసు మరో ట్విస్ట్ గా మారింది. 2012 లో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రపంచదేశాలను కుదిపేసిన నిర్భయ ఘటనలో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు సుప్రీంలో చివరి దశలో ఉండగా... విచారణలో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కదులుతున్న బస్సులోనే 23 ఏళ్ళ ట్రైనీ ఫిజియోథెరపిస్ట్.. నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె శరీరంలోకి ఇనుపరాడ్ ను గుచ్చి, అవయవాలను బయటకు లాగారని, తీవ్రమైన గాయాలు అవ్వడంతోనే అనంతరం ఆమె మరణించినట్లు పోలీసులు కోర్టుకు నివేదించారు. అయితే దీనిపై విచారణ పూర్తి చేసిన ప్రత్యేక కోర్టు నిందితులకు మరణశిక్ష విధించగా, ఢిల్లీ హైకోర్టు సైతం ఆ తీర్పును సమర్థించింది. దీంతో దోషులు సుప్రీంను ఆశ్రయించారు. మొత్తం ఆరుగురు నిందితుల్లో రామ్ సింగ్ అనే వ్యక్తి తీహార్ జైల్లో మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మరొక నిందితుడు.. జువైనల్ కావడంతో మూడేళ్ల పాటు రిఫామ్ హోమ్ లో ఉంచి, అనంతరం విడుదల చేశారు. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ముందు కేసుపై విచారణ జరిగిన అనంతరం.. దోషుల తరపు న్యాయవాది కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. సుప్రీంకోర్టులో దోషుల తరపున వాదించిన అనంతరం బయటకు వచ్చిన న్యాయవాది ఎంఎల్ శర్మ.. ఇనుప రాడ్ థియరీని నిరూపించినవారికి 10 లక్షల బహుమానం ఇస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. బాధితురాలు అత్యాచారం అనంతరం ఆసుపత్రిలో పూర్తి స్పృహలో ఉండగానే వాంగ్మూలం ఇచ్చిందని... ఆమె గానీ, ఆమె స్నేహితుడుగానీ ఇనుపరాడ్ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. పోలీసులే ఈ కట్టుకథను అల్లినట్లుగా ఆయన ఆరోపించారు. బాధితురాలు చికిత్స పొందిన సింగపూర్ ఆస్పత్రి ఇచ్చిన పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ప్రకారం బాధితురాలి యుటెరస్ గానీ, ఓవరీస్ గానీ డ్యామేజ్ అయినట్లు ఎక్కడా లేదని న్యాయవాది శర్మ వాదిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలంలో ఇనుపరాడ్ ప్రస్తావన లేకున్నా.. పోలీసుల వాదన ఎలా చేరుస్తారని శర్మ ప్రశ్నించారు. నిర్భయ కేసు నిందితుల్లో ముఖేశ్, పవన్ ల తరపున శర్మ.. సుప్రీంలో వాదనలు వినిపించారు. -
‘యావజ్జీవం’పై స్పష్టత
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసు దోషుల విడుదల వ్యవహారంలో కేంద్రానికీ, తమిళనాడు ప్రభుత్వానికీ మధ్య తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఇచ్చిన తీర్పు ఆ మాదిరి కేసులన్నిటి విషయంలో ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన తీరుతెన్నులపై స్పష్టత నిచ్చింది. ఇన్నాళ్లుగా ఆ తరహా కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగిస్తున్న అధికారాలకు కళ్లెం వేసింది. యావజ్జీవ శిక్ష పడిన ఖైదీల, వారి కుటుంబసభ్యుల ఆశలపై చన్నీళ్లు చల్లిన ఈ తీర్పు అనేక ప్రశ్నలు కూడా లేవనెత్తింది. ఈ తీర్పునకు కారణమైన రాజీవ్ హత్య కేసు తిరిగిన మలుపులు అన్నీ ఇన్నీ కాదు. తమిళ టైగర్లు 23 ఏళ్లక్రితం జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్గాంధీ బలయ్యారు. ఆ కేసులో నలుగురు దోషులు-శాంతన్, మురుగన్, నళిని, పేరరివలన్లకు మరణశిక్ష పడింది. నలుగురికి యావజ్జీవ శిక్ష పడింది. నళిని మరణశిక్షను తమిళనాడు గవర్నర్ యావజ్జీవ శిక్షగా మార్చారు. మిగిలిన ముగ్గురు దోషుల క్షమాభిక్ష పిటిషన్లనూ తోసిపుచ్చడంతో వారు రాష్ట్రపతికి విన్నవించుకున్నారు. అక్కడ సైతం తిరస్కరణ ఎదురైంది. అయితే దీనంతటికీ 11 ఏళ్ల సమయం తీసుకోవడాన్ని ప్రశ్నిస్తూ వారు సుప్రీంకోర్టు గడప తొక్కారు. అలవిమాలిన జాప్యం జరిగినందున ఈ ముగ్గురి శిక్షనూ యావజ్జీవ శిక్షగా మారుస్తూ నిరుడు సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆ తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే అన్నాడీఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వ కేబినెట్ హుటాహుటీన సమావేశమై మొత్తం ఏడుగురు దోషుల్నీ విడుదల చేయాలని తీర్మానించింది. మూడురోజుల్లోగా అందుకు అనుమతించాలని, ఆలోగా స్పందించకపోతే తామే విడుదల చేస్తామని స్పష్టంచేసింది. ఇంత వేగంగా తీసుకున్న నిర్ణయం వెనక ఆ రాష్ట్రంలో అన్నా డీఎంకే, డీఎంకేల మధ్య ఏర్పడిన రాజకీయ పోటీ.... మరికొన్నాళ్లలో జరగబోయే లోక్సభ ఎన్నికలు ప్రధానకారణాలని వేరే చెప్పనవసరం లేదు. రాజకీయంగా లబ్ధిపొందాలని జయలలిత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సరిగ్గా ఆ ఉద్దేశంతోనే కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దానికి అడ్డుపడింది. యావజ్జీవ శిక్ష పడిన ఖైదీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకూ, కేంద్ర ప్రభుత్వానికీ ఉండే అధికారాలు ఎలాంటివో...అనుసరించాల్సిన మార్గమేమిటో తాజా తీర్పులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించింది. అయిదుగురు న్యాయమూర్తులున్న ధర్మాసనం 3-2 మెజారిటీతో ఈ తీర్పునిచ్చింది. అయితే రెండు తీర్పులూ యావజ్జీవ శిక్ష అంటే జీవితాంతం జైల్లో ఉండటమేనన్న అంశంలోనూ, ఆ శిక్షలో మినహాయింపూ లేదా వెసులుబాటు కోరడానికి రాజ్యాంగంలోని అధికరణలకింద ఖైదీలకుండే హక్కుల విషయంలోనూ ఏకీభావం ప్రకటించాయి. కానీ ఒకసారి మరణశిక్ష పడి, అది యావజ్జీవశిక్షగా మారిన ఖైదీలను జస్టిస్ దత్తు నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులూ ప్రత్యేక కేటగిరీగా పరిగణించి...అలాంటివారికి యావజ్జీవ శిక్షలో మినహాయింపు కోరే హక్కు ఇక ఉండబోదని తేల్చి చెప్పారు. మిగిలిన ఇద్దరు న్యాయమూర్తులు మాత్రం అలాంటి విచక్షణను ప్రదర్శించే అధికారం న్యాయస్థానాలకు ఉండదని అభిప్రాయపడ్డారు. అయితే రాజీవ్గాంధీ హంతకుల విషయంలో జయలలిత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలోని గుణదోషాల జోలికి న్యాయమూర్తులు వెళ్లలేదు. ఆ అంశాన్ని ముగ్గురు న్యాయమూర్తుల నేతృత్వంలోని మరో ధర్మాస నం వేరేగా విచారిస్తున్నది. కానీ ఇప్పుడిచ్చిన తీర్పు జయ ప్రభుత్వానికి విఘాతమనే చెప్పాలి. వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఏడుగురి విడుదలనూ తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునే పక్షంలో వారి విడుదలకు సహకరించాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉంది. ఇక నేర శిక్షాస్మృతిలోని నిబంధనల కింద ఖైదీల శిక్షలో మినహాయింపునిచ్చేందుకు ప్రభుత్వాలకుండే అధికారానికి పరిమితులు విధించడం సబబుకాదని ఇద్దరు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు...శిక్షలో మినహాయింపు ఇచ్చే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానిదేనన్న మెజారిటీ అభిప్రాయంతోనూ వారు విభేదించారు. నేర శిక్షాస్మృతిలోని 432(7) నిబంధన ప్రకారం కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపిన కేసుల విషయంలో ఖైదీలకు మినహాయింపు ఇవ్వాలో లేదో నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని సొలిసిటర్ జనరల్ వాదనకే మెజారిటీ న్యాయమూర్తులు మొగ్గుచూపారు. శిక్షాకాలానికి ముందే విడుదల కావొచ్చునన్న ఖైదీల ఆశలపై న్యాయస్థానాలు నీళ్లు చల్లరాదని తమిళనాడు ప్రభుత్వం తరఫు న్యాయవాది చేసిన వాదనను తోసిపుచ్చుతూ దోషుల చేతుల్లో హత్యకు గురైనవారిపై ఆధారపడిన వ్యక్తులకు కూడా అలాంటి ఆశలుంటాయని, వారి మాటేమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ఇలా రెండు ప్రయోజనాలమధ్య పోటీ పెట్టే పక్షంలో ఖైదీల ముందస్తు విడుదల ఎప్పుడూ తప్పే అవుతుంది. అయితే నేరస్తులను సమాజంనుంచి వేరుపరిచి ఖైదు చేయడంలోని ఉద్దేశం వారిలో పరివర్తన తీసుకురావడం, వారిని సంస్కరిం చడం. అందువల్లే మారారనుకునేవారికి శిక్ష తగ్గింపునిచ్చే అధికారాన్ని మన రాజ్యాంగమూ, చట్టాలూ ప్రభుత్వాలకు కల్పించాయి. ఈ అధికారాలు దుర్వి నియోగమవుతున్నాయనే విషయంలో వేరే వాదనకు తావులేదు. ప్రస్తుత కేసులో ఖైదీల పరివర్తన అంశంకాక వారి ముందస్తు విడుదలవల్ల కలిగే ప్రయో జనాలే పాలకులకు ముఖ్యమయ్యాయి. ఇలాంటి రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఖైదీల ముందస్తు విడుదలపై తటస్థంగా వ్యవహరించగల యంత్రాంగాన్ని ఏర్పరిచి, దాని సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వాలు తుది నిర్ణయం తీసుకునే విధానం అమల్లో పెడితే బాగుంటుంది. సుప్రీంకోర్టు తాజా తీర్పు వెలుగులో దీనిపై కేంద్రం ఆలోచించాలి. -
12 మంది దోషులుగా నిర్ధారణ
- ముంబై రైలు పేలుళ్ల కేసులో మహారాష్ట్ర మోకా కోర్టు తీర్పు - శిక్షల ఖరారుపై సోమవారం నుంచి వాదనలు.. ఐదుగురికి మరణశిక్ష పడే అవకాశం ముంబై: ముంబైలోని రైళ్లలో వరుస పేలుళ్లకు పాల్పడి 188 మందిని బలితీసుకున్న కేసులో 12 మందిని మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ (మోకా) కోర్టు శుక్రవారం దోషులుగా నిర్ధారించింది. సిమీ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్న వీరిలో ఐదుగురికి మరణశిక్ష పడే అవకాశం ఉంది. 2006 జూలై 11న సిమీ, లష్కరే తోయిబాతో సంబంధాలున్న ఉగ్రవాదులు ముంబైలోని సబర్బన్ రైళ్లలో వరుసగా ఏడు పేలుళ్లకు పాల్పడ్డారు. పది నిమిషాల వ్యవధిలో ఖర్రోడ్, బాంద్రా, శాంతాక్రజ్, జోగేశ్వరి, మాహిమ్ జంక్షన్, మిరారోడ్, మతుంగ, బొరివలి ప్రాంతాల మధ్య ప్రయాణిస్తున్న రైళ్లలో పేలుళ్లు జరిగాయి. 188 మరణించగా... 829 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మోకా చట్టంతో పాటు ఐపీసీ, పేలుడు పదార్థాల చట్టం, రైల్వే యాక్ట్ తదితర చట్టాల కింద 30 మందిపై మహారాష్ట్ర యాంటీ టైజం స్క్వాడ్ కేసులు నమోదు చేసింది. 13 మందిని అరెస్టు చేయగా.. పాకిస్తాన్కు చెందిన మిగతా 17 మంది పరారీలో ఉన్నారని పేర్కొంటూ మోకా కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. తొమ్మిదేళ్ల పాటు విచారణ జరగగా శుక్రవారం మోకా కోర్టు న్యాయమూర్తి యతిన్ డి షిండే 12 మందిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చారు. కమల్ అహ్మద్ అన్సారీ(37), తన్వీర్ అహ్మద్ అన్సారీ (37), మహ్మద్ ఫైసల్ షేక్(36), ఇస్తెహాం సిద్ధిఖీ(30), మహమ్మద్ మాజిద్ షఫీ(32), షేక్ ఆలం షేక్ (41), మహ్మద్ సాజిద్ అన్సారీ (34), ముజమిల్ షేక్(27), సోహైల్ మెహమూద్ షేక్(43), జమీర్ అహ్మద్ షేక్(36), నవీద్ హుస్సేన్ ఖాన్(30), ఆసిఫ్ ఖాన్(38)లను దోషులుగా నిర్ధారించగా.. మరొకరిని నిర్దోషిగా వదిలిపెట్టారు. అయితే వీరిలో ఐదుగురిని ఐపీసీ 302(హత్య), మోకాలోని సెక్షన్ 3(1) కింద దోషులుగా పేర్కొన్నారు. ఈ సెక్షన్ల ప్రకారం వారికి మరణశిక్ష పడే అవకాశం ఉంది. శిక్షల ఖరారుపై సోమవారం నుంచి వాదనలు జరిగే అవకాశం ఉంది. -
శిక్ష వద్దు.. 60 కోట్లు చెల్లించండి
ఉపహార్ కేసులో అన్సాల్ సోదరులకు సుప్రీం కోర్టు ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ఉపహార్ సినిమా హాలు అగ్నిప్రమాదం కేసులో బాధిత కుటుంబాలకు సుప్రీం కోర్టు నిరాశ మిగిల్చింది. ఈ కేసులో దోషులుగా నిర్ధారణ అయిన హాలు యజమానులు సుశీల్ అన్సాల్, గోపాల్ అన్సాల్లు జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. అయితే వారు చెరో రూ. 30 కోట్లను మూడు నెలల్లో ఢిల్లీ ప్రభుత్వానికి జరిమానా కింద జమ చేయాలని, ఆ మొత్తాన్ని ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు వాడాలని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. దక్షిణ ఢిల్లీలోని ఉపహార్ హాల్లో 1997, జూన్ 13న ‘బోర్డర్’ సినిమా ప్రదర్శిస్తుండగా భారీ అగ్నిప్రమాదం జరిగి 59 మంది సజీవదహనం అయ్యారు. అన్సాల్ సోదరులకు ఢిల్లీ కోర్టు ఏడాది జైలు శిక్ష వేసింది. విచిత్రమేమంటే వీరిలో ఒకరు అయిదు నెలలు, మరొకరు నాలుగు నెలలు మాత్రమే కేసు ప్రాథమిక విచారణ దశలో జైల్లో ఉండి వచ్చారు. ఇప్పుడు వారి అప్పీలుపై సుప్రీం ధర్మాసనం తాజా తీర్పును వెలువరించింది. సుప్రీం తీర్పు తీవ్ర నిరాశ కలిగించిందని బాధితుల పక్షాన 18ఏళ్లుగా పోరాడుతున్న నీలం కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ధనవంతులు ఏం చేసినా చెల్లుతుందనే అభిప్రాయాన్ని ఈ తీర్పు కలిగించిందన్నారు. న్యాయం కోసం సుప్రీంకు రావడం తమ పొరపాటన్నారు. డబ్బున్న వ్యక్తి ఎవరినైనా కారు కింద పడేసి చంపి కోటి రూపాయలు ఇస్తే చాలన్నట్లుగా కోర్టు తీర్పు ఉందన్నారు. న్యాయం కోసం ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న తమ ఆవేదనను కోర్టు పట్టించుకోలేద న్నారు. ఇటువంటి కేసులలో చట్టం ప్రకారం గరిష్ట శిక్ష రెండేళ్లే అయినా తమ నిర్లక్ష్యంతో 59 మందిప్రాణాలను బలిగొనడానికి కారణమైనవారికి మరింత కఠిన శిక్ష విధించి కోర్టు కొత్త దారి చూపి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. ఉపహార్ ఘటనలో కృష్ణమూర్తి దంపతులు తమ ఇద్దరు పిల్లలను కోల్పోయారు. అప్పటి నుంచి నీలం న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. అసోసియేషన్ ఆప్ విక్టిమ్స్ ఆఫ్ ఉపహార్ ట్రాజెడీగా ఏర్పడి ఇన్నేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
గంటల్లోనే పట్టుబడ్డారు
నెల్లూరు(కావలి): బంగారు వ్యాపారుల వద్ద నుంచి రూ.82 లక్షలు దోపిడీ చేసి వెళ్లిన నలుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు గంటల తేడాలోనే పట్టుకున్నారు. వారు ముగ్గురు ప్రకాశం జిల్లాలో పోలీస్ కానిస్టేబుళ్లగా పనిచేస్తున్నట్లు సమాచారం. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన బంగారు వ్యాపారులు వేమూరి రాము, సునీల్ రూ.82 లక్షల నగదుతో కావలి రైల్వే స్టేషన్ నుంచి నవజీవన్ ఎక్స్ప్రెస్లో నెల్లూరు వెళ్తున్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు వారి వద్దకు వచ్చి తాము పోలీసులమని తుపాకిని చూపి బెదిరించారు. మీపై అనుమానంగా ఉందని చెప్పి పడుగుపాడు స్టేషన్ సమీపంలో రైలు నెమ్మదిగా వెళుతున్న సమయంలో ఇద్దరు వ్యాపారులను కిందకు దించారు. వారిని నెల్లూరు ఆత్మకూరు బస్టాండు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి అంబాసిడర్ కారును బాడుగకు తీసుకుని, దగదర్తి మండలం దామవరం వద్ద వ్యాపారులను వదిలేశారు. అక్కడ నుంచి నలుగురు వ్యక్తులు వెళ్లిపోయారు. బంగారు వ్యాపారులు కావలి ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు విచారణ చేపట్టి వారు ప్రయాణించిన అంబాసిడర్ కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద ఓ కారులో వెళ్తుండగా వారిని వెంబడించి ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. స్టువర్టుపురానికి చెందిన మరో నిందితుడు పరారయ్యాడు. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాలకు చెందిన ఏఆర్కానిస్టేబుళ్లుగా అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
బడాయి కోసం... ప్రాణం పణం పెట్టారు
-
తల్లిదండ్రుల నిర్లక్ష్యం, బడాయిలే.. హత్యకు కారణం
హైదరాబాద్ : తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం, యువకుల మధ్య ఎచ్చులు, బడాయిల వల్లే నబీల్ మహ్మద్ హత్యకు కారణమని డీసీపీ వి. సత్యనారాయణ తెలిపారు. పాతబస్తీ మీరాలంమండికి చెందిన నబీల్ అహ్మద్ స్ట్రీట్ ఫైట్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను...పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి వద్ద నుంచి 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ గురువారం మీడియా సమావేశంలో వివరించారు. బడాయి మాటలు, ఎచ్చులతో యువకులు సైటెర్లు వేసుకుని... ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించుకునేలా ప్రవర్తించడం.. అది కాస్తా ముదిరి స్ట్రీట్ ఫైట్కు దారి తీసినట్లు చెప్పారు. అలాగే యువకుల తల్లిదండ్రులకు పిల్లల్ని గారాభం చేయటం, వారిని పట్టించుకోకపోవటం జరిగిందన్నారు. స్ట్రీట్ఫైట్లో నబీల్ మహ్మద్ మృతి చెందగా, స్నేహితులు ఆ విషయాన్ని దాచిపెట్టి సాక్ష్యాలను తారుమారు చేసినట్లు చెప్పారు. అయితే వైద్యుల నివేదికలో తలకు బలమైన దెబ్బలు తగలడం వల్లే నబీల్ మృతి చెందినట్లు నివేదిక రావటంతో తాము అన్ని కోణాల్లో విచారణ జరిపినట్లు డీసీపీ వెల్లడించారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను కూడా తమ సిబ్బంది పరిశీలించి, విచారణ జరపడంతో అసలు విషయం బయటపడిందన్నారు. నబీల్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు తొమ్మిదిమందిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. వీరందర్ని కోర్టుకు హాజరు పరచనున్నట్లు చెప్పారు. -
పోలీసుల అదుపులో స్ట్రీట్ ఫైట్ నిందితులు
హైదరాబాద్: స్ట్రీట్ ఫైట్లో మృతి చెందిన నబీల్ కేసులో మీర్చౌక్ పోలీసులు బుధవారం తొమ్మిది మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. మీరాలంమండి పోలీసు లైన్ ప్రాంతానికి చెందిన నబీల్ మహ్మద్ (17) స్ట్రీట్ ఫైట్లో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తొమ్మిది మంది యువకులపై కేసులు నమోదు చేశారు. మహ్మద్ ఒవేస్ అలియాస్ పటేల్ (19), మహ్మద్ ఉమర్ బేగ్ (20), ఇర్ఫాన్ పఠాన్ (22), సుల్తాన్ మీర్జా (22), ఎం.ఎ. కవి ఆలియాస్ ఓబేద్ (18), షహబాజ్ అలియాస్ వసీం డాలర్ (20), అబుబాకర్ (19), సులేమాన్ (18), సయ్యద్ యూసుఫ్ అహ్మద్ (19)లపై పోలీసులు ఐపీసీ 302, 201, 109, ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. -
‘సత్యం’ దోషుల అప్పీళ్లపై నేడు విచారణ
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేయాంటూ దోషులు రామలింగరాజు సహా ఇతరులు దాఖలు చేసుకున్న పిటిషన్లను ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు గురువారం విచారించనుంది. ఈ కేసును కొట్టివేయాలంటూ దాఖలైన అప్పీళ్లపై విచారణను కోర్టు జూన్ 30కి వాయిదా వేసింది. -
సెషన్స్ కోర్టులో ‘సత్యం’ దోషుల అప్పీళ్లు
హైదరాబాద్: ‘సత్యం’ కేసులో ప్రత్యేక కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆ సంస్థ మాజీ అధినేత రామలింగరాజు సహా దోషులు సోమవారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్జే) కోర్టును ఆశ్రయించారు. ఎంఎస్జే కోర్టుకు అప్పీళ్లను విచారించే అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. దోషుల తరఫు న్యాయవాదులు సోమవారం పిటిషన్లను దాఖలు చేశారు. వీటిపై కోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది. -
దోషులెవరో తేల్చండి
కొనకనమిట్ల : భూవివాదం నేపథ్యంలో మంగళవారం హత్యకు గురైన మండలంలోని పుట్లూరివారిపల్లెకు చెందిన కుమ్మిత నరసింహారెడ్డి మృతదేహంతో బంధుమిత్రులు బుధవారం నిరసనకు దిగారు. సుమారు గంట పాటు స్థానిక తహశీల్దార్ కార్యాలయం, పోలీసుస్టేషన్ల ఎదుట మార్కాపురం-పొదిలి రహదారిపై మృతదేహం ఉంచి రాస్తారోకో నిర్వహించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. పోస్టుమార్టం అనంతరం నరసింహారెడ్డి మృతదేహాన్ని ట్రాక్టర్పై ఉంచి ఊరేగింపుగా కొనకనమిట్ల తీసుకెళ్లారు. భారీగా వచ్చిన ప్రజలు రోడ్డుపై బైఠాయించి బిగ్గరగా నినాదాలు చేశారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పోలీసులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నినదించారు. నరసింహారెడ్డి భార్య రమాదేవి న్యాయం చేయాలని వేడకుంటూ పోలీసుస్టేషన్ ఎదుట సొమ్మసిల్లింది. దీంతో మరింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాస్తారోకోతో గంట పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పొదిలి సీఐ రవిచంద్ర, కొనకనమిట్ల, తాడివారిపల్లి, మర్రిపూడి ఎస్సైలు మస్తాన్ షరీఫ్, శివనాగిరెడ్డి, సుబ్బారావులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. హ ంతకులను పట్టుకొని అరె స్టు చేస్తామని, చట్టపరంగా న్యాయం చేస్తామని పోలీసు అధికారులు హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. తహశీల్దార్పై కేసు నమోదు చేయాలి బీడు భూములకు సంబంధించి బ్రోకర్ల మాటలు విని ఎన్ని అక్రమాలు చేయాలో అన్ని అక్రమాలకు పాల్పడిన తహశీల్దార్పై కేసు నమోదు చేయాలని నరసింహారెడ్డి బంధువులు డిమాండ్ చేశారు. తహశీల్దార్ను అరె స్టు చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అక్రమ పాసు పుస్తకాల మంజూరులో చేతివాటం ప్రదర్శించిన కొనకనమిట్ల రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పుట్లూరివారిపల్లి మహిళలు డిమాండ్ చేశారు. -
పాక్ లో మరో ఇద్దరికి ఉరి
ఓ ఇద్దరు ఖైదీలకు ఉరితీత సంబంధించిన నోటీసులను పాకిస్థాన్ ఉగ్రవాద కేసుల పరిష్కరణ న్యాయస్థానం జారీ చేసింది. మార్చి 5న వారిని ఉరితీయనున్నట్లు అందులో పేర్కొంది. 1998లో మహమ్మద్ ఫైజల్, మహమ్మద్ అఫ్జల్ అనే ఇద్దరు నేరస్థులు కోరంగి అనే ప్రాంతంలో దొంగతనానికి పాల్పడి ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. దీంతో వారికి 1999లో కింది స్థాయి కోర్టు మరణ శిక్ష విధించింది. మరణ శిక్షను సవాల్ చేస్తూ వారు... పై కోర్టులకు వెళ్లినా కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించాయి. అంతేకాకుండా రాష్ట్రపతి కూడా వారి క్షమాభిక్షను ఈ నెల 17న తోసిపుచ్చారు. దీంతో వారిని ఉరి తీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
దౌలాకువా గ్యాంగ్ రేప్ కేసు ఐదుగురూ దోషులే
సాక్షి, న్యూఢిల్లీ : దౌలాకువా సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులను దోషులుగా పేర్కొంటూ ద్వారకా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ నెల 17న శిక్షలను ఖరారు చేయనుంది. ఈశాన్య ప్రాంతానికి చెందిన కాల్ సెంటర్ ఉద్యోగినిపై గ్యాంగ్రేప్ కేసులో షంషద్ అలియాస్ ఖుట్కన్, ఉస్మాన్ అలియాస్ కాలే, షంషీద్ అలియాస్ చోటా బిల్లి, ఇక్బాల్ అలియాస్ బడా బిల్లి, కమ్రయిద్దీన్లను దోషులుగా తేల్చింది. కాగా 2010 నవంబర్ 24 నాటి రాత్రి కాల్ సెంటర్కు చెందిన ఇద్దరు ఉద్యోగినులు తాము నివసించే కాలనీ గేటు వద్ద వాహనం దిగి ఇంటికి వెళుతున్నారు. అదే సమయంలో ఓ వాహనంలో అక్కడికి వచ్చిన ఐదుగురు బాధితురాలిని అపహరించి మంగోల్పురి ప్రాంతానికి తీసుకెళ్లి అదే వాహనంలో సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత వారు ఆమెను మంగోల్పురిలోని రోడ్డుపై వదిలేసి పారిపోయారు. మరోవైపు సహోద్యోగిని కొందరు అపహరించుకునిపోయారని బాధితురాలి స్నేహితురాలు పోలీస్ కంట్రోల్రూంకు ఫోన్చేసింది. దీంతో అప్రమత్తమై రంగంలోకి దిగిన పోలీసులు బాధితులి జాడను కనుగొని ఆస్పత్రికి తరలించారు. సరిగ్గా ఏడురోజుల తర్వాత నిందితులందరినీ హర్యానాలోని మేవాత్ ప్రాంతంలో అరెస్టు చేశారు. తాము అమాయకులమని, అన్యాయంగా తమను ఈ కేసులో ఇరికించారని నిందితులు కోర్టులో వాదించారు. కాగా పోలీసులు జరిపిన ఐడెంటిఫికేషన్ పరేడ్లో బాధితురాలు.. షంషద్, ఉస్మాన్లను బాధితురాలు గుర్తించింది. అయితే కమరుద్దీన్, షహీద్, ఇక్బాల్లు మాత్రం ఈ పరేడ్లో పాల్గొనడానికి నిరాకరించారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని, కమ్రుద్దీన్ పశ్చాతాపం కూడా వ్యక్తం చేశాడని పోలీసులు తమ అభియోగపత్రంలో పేర్కొన్నారు. ఎంతో సమయం పట్టింది : బృందాకారత్ న్యూఢిల్లీ: న్యాయం జరిగేందుకు ఎంతో సమయం పట్టిందని ఐద్వా సంస్థ మాజీ ప్రధాన కార్యదర్శి బృందాకారత్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ న్యాయం జరగబోతోందన్నారు. హర్షం వ్యక్తం చేసిన మహిళా హక్కుల సంఘాలు న్యూఢిల్లీ: దౌలాకువాన్ సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులను న్యాయస్థానం దోషులుగా ప్రకటించడంపట్ల మహిళా హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చే శాయి. ‘ఇటువంటి తీర్పులు దేశవాసుల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచుతాయని అఖిల భారత ప్రజాస్వామిక మహిళా సంఘం (ఐద్వా) ప్రధాన కార్యదర్శి జగ్మతి సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘బాధితురాలిని హింసించినవారికి కఠిన శిక్ష పడేలా మనం చూడాల్సి ఉంది. అలా జరిగితే ఇటువంటి హింస మళ్లీ పునరావృతం కాదు’ అని అన్నారు. ఈ సందర్భంగా అన్నీ రాజా అనే మహిళా హక్కుల కార్యకర్త మాట్లాడుతూ ‘అటువంటి తీర్పు ఇటువంటి నేరాలను కచ్చితంగా తగ్గేలా చేస్తుంది. పోలీసులు, న్యాయవ్యవస్థ సరిగా పనిచేయకతే నేరాలు చేసి తప్పించుకుపోవచ్చని నిందితులంతా అనుకుంటారు. పోలీసులు, న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరిగితే నేరాలు వాటంతట అవే తగ్గిపోతాయి’ అని అన్నారు. -
అలిపిరి కేసులో ముగ్గురు దోషులుగా నిర్థారణ
తిరుపతి : అలిపిరి బాంబు దాడికేసులో ముగ్గురిని న్యాయస్థానం దోషులుగా నిర్థారించింది. నిందితులు రాంమ్మోహన్ రెడ్డి, నర్సింహారెడ్డి, కేశవ్లను కోర్టు దోషులుగా తేల్చింది. మరికాసేపట్లో వారికి శిక్షలు ఖరారు చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై 2003 అక్టోబర్ ఒకటో తేదీన అలిపిరి సమీపంలో బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. కేసులో మొత్తం 33మంది నిందితులు ఉన్నారు. వీరిలో ఇదివరలో నలుగురిపై కేసు విచారణ జరగ్గా ఇద్దరిపై తిరుపతి నాల్గో అదనపు జిల్లా జడ్జి కోర్టు కేసు కొట్టివేస్తూ 2012 నవంబర్ 8న తీర్పు చెప్పింది. మరో ఇద్దరికి కోర్టు శిక్ష విధించటంతో వారు హైకోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నారు. కేసులో మొత్తం 96మంది సాక్షులు ఉండగా ఇదివరలోనే చాలామందిని కోర్టు విచారించింది. మొత్తం 33మంది నిందితుల్లో 29 మందిని మావోయిస్టులుగా పోలీసులు పేర్కొన్నారు. -
రాజీవ్ హంతకుల విడుదలను అడ్డుకోండి
సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ న్యూఢిల్లీ, చెన్నై: రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారిని విడుదల చేయడాన్ని అడ్డుకోవాలన్న కేంద్రం పిటిషన్ను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం.. 27న దీనిపై విచారణ చేస్తామని తెలిపింది. క్షమాభిక్ష పిటిషన్పై నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం కారణంగా రాజీవ్ హంతకులకు విధించిన ఉరిశిక్షను.. యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీం నిర్ణ యం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర చట్టాల కింద శిక్షపడిన వారిని విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కేంద్రం తన పిటిషన్లో పేర్కొం ది. దాంతోపాటు మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్పు చేయడంపై రివ్యూ పిటిషన్ విచారణలో ఉండగా.. వారిని విడుదల చేయడం తగదంది. ఖైదీల విడుదలకు సంబంధించి కేంద్రం పిటిషన్పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తమిళనాడు సీఎం జయలలిత పేర్కొన్నారు. ‘ఈ విషయం లో మేం అప్రమత్తంగా ఉన్నాం. చట్టపరంగానే ఎదుర్కొంటాం. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున చర్చించదలచుకోలేదు’ అని ఆమె చెన్నైలో చెప్పారు. -
'ప్రధానిని హత్య చేసినవారిని విడిచిపెడతారా?'
న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి రాజీవ్గాంధీ హత్యకేసు దోషుల విడుదలను అడ్డుకోడానికి యుపిఏ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ కేసులో హంతకులు ఏడుగురుని విడుదల చేయడానికి సిద్ధమైన తమిళనాడు సర్కార్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. రాజీవ్ హత్యకేసును టాడావంటి కేంద్ర చట్టాల కింద, సిబీఐ విచారించినందున, హంతకులను విడుదల చేసే అంశంలో కేంద్రానికి తెలపకుండా, కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్ణయం తీసుకోకూడదని కేంద్రం చెబుతోంది. ఇదే అంశం మీద భారత ప్రధాన న్యాయమూర్తి ముందు గురువారం పిటిషన్ వేయడానికి సిద్ధమయినట్లు యూపిఏ వర్గాలు చెబుతున్నాయి. ఒక ప్రధానిని హత్య చేసిన వారిని ఎలా విడిచిపెడతారు? న్యాయం ఇలా ఉంటే ఇక సామాన్యులకు దిక్కేంటి అంటూ రాజీవ్గాంధీ తనయుడు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన వెంటనే మన్మోహన్సింగ్ ప్రభుత్వం.. హంతకుల విడుదలను అడ్డుకునేందుకు సిద్ధమయింది. రాజీవ్ హంతకులను విడుదల చేయకూడదని ప్రధాని కూడా పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు దోషుల బంధువులు రాహుల్ ను క్షమాభిక్ష కోరేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. -
రాజీవ్ హంతకులకు విముక్తి !
మూడు రోజుల్లోగా విడుదల చేయాలని నిర్ణయించిన తమిళనాడు సర్కారు కేంద్రానికీ అదే గడువు.. లేదంటే తామే విడుదల చేస్తామన్న జయ {పభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన తమిళనాడు ప్రతిపక్షాలు ఈలం మద్దతుదారుల సంబరాలు సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులకు 23 ఏళ్ల జైలు జీవితాన్నుంచి విముక్తి లభించనుంది. ముగ్గురు ఖైదీలకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 24 గంటల్లోపే ఖైదీలందర్నీ విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం బుధవారం అనూహ్యంగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఉరిశిక్ష నుంచి యావజ్జీవ శిక్షకు మారిన శంతనన్, మురుగన్ (ఈ ఇద్దరూ శ్రీలంకకు చెందిన తమిళులు), పెరారివాలన్లతో పాటు వేలూరు జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న నళిని, రాబర్ట్ పయస్, జయకుమార్, రవిచంద్రన్ల విడుదలకు మార్గం సుగమమైంది. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి జయలలిత కేబినెట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రాజీవ్ హంతకులను మూడు రోజుల్లో విడుదల చేయాలనే డెడ్లైన్ విధించుకోవడంతో పాటు కేంద్రానికి కూడా అదే గడువునిస్తూ తీర్మానించారు. దీనిపై జయ అసెంబ్లీలో మాట్లాడుతూ.. సీఆర్పీసీ సెక్షన్ 435 ప్రకారం కేంద్ర అనుమతి కోసం తీర్మానాన్ని పంపుతున్నామని, మూడు రోజుల్లోగా కేంద్రం అనుమతివ్వకపోతే సెక్షన్ 432 ప్రకారం రాష్ట్రానికి ఉన్న అధికారాల్ని వినియోగించి ఖైదీలందర్నీ విడుదల చేస్తామన్నారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ మినహా డీఎంకే, సీపీఐ, ఎండీఎంకే పార్టీలు స్వాగతించాయి. ప్రకటన అనంతరం తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఈలం మద్దతు దారులు సంబరాలు చేసుకున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి, కాంగ్రెస్ నేత జ్ఞానదేశికన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ఆందోళన చెందాల్సిన విషయమేనని రాజ్యసభలో బీజేపీ డిప్యూటీ నేత రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. కాగా, ఖైదీల విడుదలపై లోక్సభలో డీఎంకే నేత టీఆర్ బాలు మాట్లాడుతున్నపుడు.. ఏఐఏడీఎంకే సభ్యుడు తంబిదురై కలగజేసుకుని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున దీనిపై చర్చ అనవసరం అని చెప్పారు. ‘అమ్మ’కు అభివందనం: అమ్మాళ్ ఖైదీలందర్నీ విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఖైదీ పెరారివాలన్ తల్లి అర్పుతమ్మాళ్ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘నిన్న నాకు కొంత సంతోషం కలిగింది. ప్రభుత్వ నిర్ణయం తర్వాత పట్టలేని ఆనందంతో ఉన్నాను. మరో తల్లి అనుభవిస్తున్న బాధని అమ్మ (జయలలిత) పరిగణనలోకి తీసుకున్నారు. నా బాధకు ఆమె ముగింపు పలికా రు’’ అని పీటీఐ వార్తా సంస్థకు అమ్మాళ్ చెప్పారు. అదో వికృత నిర్ణయం: కాంగ్రెస్ రాజీవ్ హంతకుల విడుదలపై జయలలిత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ప్రజాకర్షణ కోసం బాధ్యతారాహిత్యంతో కూడిన వికృత నిర్ణయమని ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి మండిపడ్డారు. హోం మంత్రి షిండే మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని క్షుణ్నంగా పరిశీలించాలన్నారు. మరో మంత్రి చిదంబరం మాట్లాడుతూ.. తాను సంతోషంగా ఉన్నానో, విచారంగా ఉన్నానో చెప్పలేనని అన్నారు. రాజీవ్ లేని లోటు పూడ్చలేనిదన్నారు. దోషులు అమాయకులు అని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. అయితే శిక్ష తగ్గిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుకు కేంద్రం కట్టుబడి ఉంటుందని న్యాయమంత్రి కపిల్ సిబల్ చెప్పారు. ఈ విషయంలో బీజేపీ మౌనం పాటిస్తోందంటూ మండిపడ్డారు. రాజీవ్ హత్య దుర్ఘటనలో గాయాలతో బయటపడ్డ కాంగ్రెస్ నేత సులేమాన్ మాట్లాడుతూ.. దోషులను విడుదల చేయడంలో తప్పు లేదన్నారు. సామాన్యుడు న్యాయాన్ని ఆశించగలడా?: రాహుల్ తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం పట్ల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ‘‘ మా తండ్రి బలయ్యారు. మేము ఉరిశిక్షకు వ్యతిరేకులం. అయినా మాజీ ప్రధానిని చంపిన వాళ్లు విడుదల అవుతుంటే.. సామాన్యులు ఎలాంటి న్యాయాన్ని ఆశించాలి’’ అని రాహుల్ ప్రశ్నించారు. దోషులను ఉరి తీసినా తన తండ్రి తిరిగిరాడన్నారు. ఇది తన తండ్రికో, కుటుంబానికో సంబంధించిన విషయం కాదని, దేశానికి సంబంధించినదని ఉత్తర్ప్రదేశ్లోని జగ్దీష్పూర్లో చెప్పారు. -
ప్రమాదకర ధోరణి!
నిర్భయ కేసు నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ, వారికి మరణశిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చిన తర్వాత రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దోషులకు మరణదండన సరైందా, కాదా అన్న చర్చ సంగతలా ఉంచి ఆ కేసులో నిందితుల తరఫున వాదించిన న్యాయవాది ఒకరు ఆ తీర్పుపై నిప్పులు కక్కిన తీరు, ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు అందర్నీ దిగ్భ్రాంతిపరిచాయి. దాన్నుంచి దేశం ఇంకా తేరుకోకముందే కర్ణాటక ప్రభుత్వం సెక్రటేరియట్లో పనిచేస్తున్న సిబ్బందికి ‘డ్రెస్ కోడ్’ విధిస్తూ వెలువరించిన సర్క్యులర్ అలజడి సృష్టించింది. తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ సర్క్యులర్ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందిగానీ... అసలు అలాంటి సర్క్యులర్ జారీచేయడం వెనకున్న ధోరణి ప్రమాదకరమైనది. నిర్భయ కేసు నిందితుల తరఫున వాదించిన న్యాయవాది ఆలోచనలకూ, ఈ సర్క్యులర్ రచయిత ఆలోచనాధోరణికి మధ్య పెద్దగా తేడా ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. లైంగిక నేరాలు నానాటికీ పెరిగిపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. నిర్భయ ఉదంతానికి ముందూ, ఆ తర్వాత కూడా ఎన్నో అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది మొత్తంగా మహిళలపై 2,45,000 నేరాలు జరిగాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఆ సంఖ్య చాలా ఎక్కువ. పోలీసులు శ్రద్ధపెట్టక పోవడం వల్లా, దర్యాప్తు సంవత్సరాల తరబడి సాగుతుండటంవల్లా న్యాయ స్థానాల్లో నేరనిరూపణ అవకాశాలు తగ్గిపోయి నిందితులు తేలిగ్గా తప్పించుకో గలుగుతున్నారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖే ఆమధ్య తెలియజేసింది. ఇలాంటి లోపాల నివారణకు మార్గం సూచిస్తే ఈ దుస్థితిని సరిదిద్దినవారవుతారు. కానీ, నిర్భయ తరఫు న్యాయవాదైనా, కర్ణాటక ప్రభుత్వం జారీచేసిన సర్క్యులర్ అయినా చేసింది అది కాదు. నేరం జరిగినప్పుడల్లా బాధితులనే దోషులుగా చూసే సాధారణ మనస్తత్వమే అందులో కనబడుతుంది. న్యాయవాది ఏపీ సింగ్ తన క్లయింటులకు ఉరిశిక్ష విధించడంపై తీవ్రంగా స్పందించారు. ‘నా కూతురే గనుక వివాహానికి ముందు మగ స్నేహితుడితో తిరిగితే నిలువునా తగలబెట్టేవాడిన’ని నోరుపారేసుకున్నారు. నిర్భయకు జరిగినలాంటిది తన బిడ్డకు జరగనివ్వనని, అలా వెళ్లినట్టు తెలిసిన వెంటనే తానే చంపేస్తానని చెప్పారు. దేశంలో తల్లిదండ్రులందరూ అలాగే చేయాలని కూడా ఆయన కోరారు. అంతక్రితం తీర్పు వెలువడిన రోజున కూడా ఆయన మాటల తీరు ఇలాగే ఉంది. ‘ఈ కేసులో అప్పీల్కు రెండు నెలలు వేచిచూస్తా... ఈ తీర్పు ప్రభావంతో అప్పటివరకూ దేశంలో ఎక్కడా అత్యాచారాలు జరగకుండా ఉంటే అసలు అప్పీలే చేయను’ అంటూ నిప్పులు కక్కారు. సమాజం అభివృద్ధి చెందుతున్నదని, మహిళలకు అన్నిరంగాల్లోనూ సమానావకాశాలు లభిస్తున్నాయని... చదువు ల్లోనూ, ఉద్యోగాల్లోనూ వారు రాణిస్తున్నారని అందరూ అనుకుంటున్నా వివక్ష కొత్త కొత్త రూపాల్లో విస్తరిస్తోంది. మహిళలకు సంబంధించి పురుషుల ఆలోచనాధోరణిలో ఉన్న వెనకబాటుతనం పెరుగుతున్నదే కానీ తగ్గటం లేదు. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా దీర్ఘకాలంనుంచి తన వృత్తిలో ఉంటున్న వ్యక్తి నుంచే అలాంటి మాటలు వెలువడ్డాయంటే అది సాధారణ విషయం కాదు. ఆయన దృష్టిలో ఈ కేసులో నిర్భయే నేరస్తురాలు. ఆమె ఆరోజు ‘ఎవరితోనో’ సినిమాకు వెళ్లడంవల్లా, ఆ ఆరుగురి వ్యక్తుల కంటబడటంవల్ల వారు నేరం చేయాల్సివచ్చిందని ఆయన భావన. గెలిచితీరగలమన్న కేసు ఓడిపోవడంవల్ల కలిగిన నిరాశా నిస్పృహల్లోంచి మాట్లాడిన మాటలు కావవి... మగ దురహంకారంతో, పితృస్వామిక భావజాలం నరనరానా జీర్ణించుకోవడంవల్ల పలికిన పలుకులవి. కర్ణాటక ప్రభుత్వం గత గురువారం ఇచ్చిన సర్క్యులర్ వెనకున్న ధోరణి కూడా ఇదే. కాకపోతే, మహిళలకు మాత్రమే డ్రస్కోడ్ చెబితే వివాదం తలెత్తుతుందనుకున్నారో, ఏమోగానీ పురుషులకు కూడా డ్రస్ కోడ్ విధించారు. మహిళలు ‘రెచ్చగొట్టే తరహా’ దుస్తులు వేసుకోకూడదని చెబుతూ, అవేమిటో ఏకరువు పెట్టారు. అందులో డిజైనర్ బ్లౌజుల నుంచి రకరకాలవి ఉన్నాయి. చీర లేదా సల్వార్ కమీజ్ మాత్రమే ధరించాలని సూచించారు. పురుషులు జీన్స్, టీషర్టులు వేసుకోవడం నిషిద్ధమన్నారు. అత్యాచార ఘటనలు జరిగినప్పుడల్లా వినవచ్చే వాదనే ఇది. ఆమధ్య ఒక టీవీ చానెల్ సర్వే చేసినప్పుడు మహిళలు ధరించే దుస్తులవల్లే వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయని 53 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు. అయితే, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. మూడు, నాలుగేళ్ల పసిపిల్ల నుంచి పెద్ద వయసువారి వరకూ అందరిపైనా ఇలాంటి నేరాలు జరిగాయి. ధరించిన దుస్తులను బట్టి నేరం జరిగిందనడానికి ఎలాంటి దాఖలా లభించలేదు. ధరించే దుస్తులనుబట్టే నేరం జరుగుతున్నదనడమంటే నేరానికి అసలు కారకులు మహిళలని చెప్పడమే కాదు... పురుషులందరూ తమను తాము అదుపుచేసుకోలేనివారని, నేరపూరిత మనస్తత్వం కలవారని చెప్పడం కూడా. ఇంతటి మతిమాలిన సర్క్యులర్పై సహజంగానే మహిళల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అటుతర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు. అందుకు బదులుగా ‘ప్రభుత్వ ప్రతిష్టకు అనుగుణ మైన’ రీతిలో దుస్తులు ధరించాలని కొత్త సర్క్యులర్ విడుదలైంది. ఏ ఉద్యోగైనా ముందు వ్యక్తిత్వమున్న మనిషి. ఆ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. వేసుకునే దుస్తులు కూడా అందులో ఒక భాగం. సమాజంలో ఉండే దురభిప్రాయాలను పారదోలడానికి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు ఆ పని చేయకపోగా వాటిని మరింత పెంచేలా వ్యవహరిస్తున్నాయన డానికి ఇలాంటి సర్క్యులర్లు ఉదాహరణ. ప్రభుత్వాలే ఇలా వెనకబాటుతనాన్ని ప్రదర్శిస్తుంటే సుప్రీంకోర్టు న్యాయవాది అలా మాట్లాడటంలో వింతేముంది? -
ఆ నలుగురికీ ఉరికంబం!
సంపాదకీయం: దేశం నలుమూలలా ఆగ్రహావేశాలు రగిలించిన, ఆందోళన కలిగించిన ఢిల్లీ అత్యాచార ఉదంతంలో దోషులుగా నిర్ధారించిన నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ ఢిల్లీ ఫాస్ట్ట్రాక్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. పట్టుబడిన మరో నిందితుడు విచారణ కాలంలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, ఇంకొక నిందితుడిని బాలనేరస్థుడిగా పరిగణించి జువైనల్ బోర్డు మూడేళ్ల శిక్ష విధించింది. నిరుడు డిసెంబర్ 16 రాత్రి ఢిల్లీ వీధుల్లో నడుస్తున్న బస్సులో 23 ఏళ్ల యువతిపై వీరంతా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించిన యువతిపై అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. ఆమెతోపాటు ఆమె స్నేహితుణ్ణి కూడా తీవ్రంగా గాయపరిచారు. నెత్తురోడుతున్న ఆ ఇద్దరినీ ఒంటిపై దుస్తులు కూడా మిగల్చకుండా నడుస్తున్న బస్సులో నుంచే బయటకు నెట్టేశారు. ఆ నిశిరాతిరి వణికించే చలిలో ఆ ఇద్దరూ అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. ఢిల్లీలో అత్యాచారాలు కొత్త కాదు. ఈ ఘటన తర్వాత కూడా అవి నిత్యమూ కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, ఈ కేసులో నిందితులందరూ ఆ ఇద్దరిపై, ప్రత్యేకించి ఆమెపై సాగించిన దుర్మార్గం అందరినీ కలచివేసింది. కేవలం క్రూరమృగాలతో మాత్రమే పోల్చగల ప్రవర్తనతో నిందితులందరూ సమాజం మొత్తాన్ని దిగ్భ్రాంత పరిచారు. అందువల్లే ఈ ఘటనపై దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి. వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ప్రతిచోటా ధర్నాలు, ర్యాలీలు జరిగాయి. దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలంతా ముక్తకంఠంతో డిమాండు చేశారు. దోషులకు ఉరిశిక్ష విధించాలన్న డిమాండు వచ్చింది. ఈ కేసులో ఒకరిని బాలనేరస్థుడిగా నిర్ధారించి మూడేళ్ల శిక్షతో సరిపెట్టడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే వెలుపల ఆనందోత్సాహాలు వ్యక్తం కావడమైనా, మిఠాయిలు పంచుకోవడమైనా చూస్తే ఇన్ని నెలలు గడిచినా ఆ ఘటన ప్రభావం ఏ స్థాయిలో ఉన్నదో అర్ధమవుతుంది. నిర్భయ ఉదంతం తర్వాత ప్రభుత్వం చురుగ్గానే కదిలింది. వెనువెంటనే జస్టిస్ జేఎస్ వర్మ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించడం, దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచీ వచ్చిన సుమారు 80,000 సూచనలను క్రోడీకరించి వారు సవివరమైన నివేదికను సమర్పించడం చకచకా పూర్తయ్యాయి. వాటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. అటు తర్వాత జరిగిన పార్లమెంటు సమావేశాల్లో దాని స్థానంలో బిల్లు ప్రవేశపెట్టి చట్టం కూడా చేశారు. దేశ రాజధాని నగరంలో ఎడతెగకుండా జరిగిన ఆందోళనవల్లా, దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబకడంవల్లా ఇదంతా సాధ్యమైంది. ఈ అత్యాచారం కేసును ఫాస్ట్ట్రాక్ కోర్టుకు అప్పగించడం, పోలీసులు కూడా దర్యాప్తును వేగవంతం చేయడం, సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానం ముందు పెట్టి విచారణ సాధ్యమైనంత త్వరగా ముగిసేందుకు దోహదపడటం వంటివన్నీ ఆ నిరసనల పర్యవసానమే. కింది నుంచి మీది వరకూ ఇలా ఎవరికి వారు తమ తమ పనుల్ని చురుగ్గా చేయడమనేది మహిళలకు సంబంధించిన అన్ని కేసుల్లోనూ సాధ్యమైతే ఆ తరహా నేరాలు చాలా వరకూ తగ్గిపోతాయి. దురదృష్టవశాత్తూ ఆ పరిస్థితి లేదు. ఢిల్లీ ఘటనకు మీడియాలో వచ్చిన విస్తృత ప్రచారం వల్లా, ఆ ఘటన ప్రపంచ దేశాలన్నిటా మన దేశ పరువు ప్రతిష్టలను దిగజార్చడం వల్లా ప్రభుత్వ విభాగాలన్నీ ఒక్కటై కదిలాయి. దేశాన్ని ఏలుతున్నవారు వాటినలా కదిలించారు. మిగిలిన కేసుల విషయంలో అంతటి శ్రద్ధ లేదు. నిర్భయ ఉదంతానికి ముందూ, తర్వాతా దేశవ్యాప్తంగా జరిగిన వేలాది అత్యాచార ఘటనలు యథాప్రకారం నత్తనడక నడుస్తున్నాయి. నిరుడు వివిధ కోర్టుల్లో అత్యాచారం ఘటనలకు సంబంధించిన కేసులు లక్ష పెండింగ్లో ఉండగా ఈ ఎనిమిది నెలల్లో శిక్ష పడినవి 14.5 శాతం మాత్రమే. అంటే కేవలం 14,700 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. వీటిలో 11,500 మంది నిర్దోషులుగా బయటికొస్తే... కేవలం 3,563 మందికి మాత్రమే శిక్షపడింది. నిర్భయ ఉదంతం జరిగిన ఢిల్లీలో ఆ ఏడాది 2,007 కేసులు నమోదైతే 1,404 పెండింగ్లో ఉన్నాయి. 15 శాతం కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షపడింది. మిగిలిన రాష్ట్రాల పరిస్థితి మరీ ఘోరం. ఉదాహరణకు పశ్చిమబెంగాల్లో 0.7 శాతం కేసుల్లోనూ, మహారాష్ట్రలో 1.1 శాతం కేసుల్లోనూ నిందితులకు శిక్షలు పడ్డాయి. ఇవన్నీ కింది కోర్టులకు సంబంధించిన లెక్కలు. వీటిలో అత్యధికం అప్పీల్కు వెళ్తాయి. అవి తేలడానికి మరిన్ని సంవత్సరాలు పడతాయి. మన రాష్ట్రంలో నిరుడుతో పోలిస్తే తొలి ఆరు నెలల్లోనూ అత్యాచారాలు 19.62 శాతం పెరిగాయి. నిర్భయ చట్టం అమల్లోకి తేవడంలో చూపిన వేగం... దాన్ని అమలు చేయడంలో ఇంకా కనబరచడంలేదని, సంబంధిత వ్యవస్థలను అవసరమైనంతగా కదిలించడంలేదని దీన్నిబట్టి అర్ధమవుతుంది. ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి నిర్భయ కేసు తీర్పు దోహదపడుతుందనుకునేవారికి ఈ స్థితి విచారం కలిగిస్తుంది. దోషులను దండించడం, చట్టమంటే అందరిలోనూ భయం కలిగేలా చేయడం అవసరమే. కానీ, అలాంటి నేరాలకు దోహదం చేస్తున్న పరిస్థితులను మార్చకుండా, అందుకవసరమైన చైతన్యాన్ని ఏ స్థాయిలోనూ కలిగించకుండా... నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందా? జస్టిస్ వర్మ కమిటీ ఆ అంశాల్లో ఇచ్చిన సిఫార్సులపైనా ప్రభుత్వం దృష్టిపెట్టాలి. మహిళలపై నేరాల విషయంలో పోలీసులు, అధికార యంత్రాంగం సున్నితంగా ఆలోచించేలా, చురుగ్గా కదిలేలా, బాధితులకు సత్వర న్యాయం లభించేలా చూడాలి. అప్పుడు మాత్రమే పరిస్థితులు చక్కబడటానికి మార్గం సుగమం అవుతుంది.