plastic wastage
-
Khushboo Gandhi: బీ గుడ్.. డూ గుడ్!
మనదేశంలో ఏడాదికి 9,400 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ కాలువలు, నదుల్లోకి చేరుతోంది. ఇందులో ఎక్కువ భాగం ప్యాకింగ్కు ఉపయోగించినదే ఉంటోంది. ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం. ఓ చిన్న హెయిర్ ఆయిల్ బాటిల్ని ప్యాక్ చేయడానికి దానికంటే నాలుగురెట్లు బరువున్న ప్యాకింగ్ మెటీరియల్ని ఉపయోగిస్తారు. అందులో కాగితంతో చేసిన అట్టపెట్టె ఉంటుంది. బాటిల్ పగలకుండా ప్లాస్టిక్ బబుల్ రేపర్ ఉంటుంది. కాగితం ఇట్టే మట్టిలో కలిసిపోతుంది. దాంతో ఇబ్బంది ఉండదు. మరి ప్లాస్టిక్ బబుల్ ర్యాపర్ ఎన్నేళ్లకు మట్టిలో కలుస్తుంది. ‘వస్తువులు రవాణాలో పగలకుండా ఉండాలంటే బబుల్ ర్యాపర్ ప్లాస్లిక్తోనే చేయాలా? కొబ్బరిపీచుతో బబుల్ ర్యాప్ చేసాను చూడండి’ అంటూ కుషన్ను పోలిన కాయిర్ పౌచ్ను చూపించింది ఖుష్బూ గాంధీ. అలాగే కాయిర్ బోర్డ్లో ఒక పొరలోకి గాలిని చొప్పించి బుడగలు తెప్పించింది. ముంబయిలో పుట్టి పెరిగిన ఖుష్బూ గాంధీ నిఫ్ట్లో మెటీరియల్ డెవలప్మెంట్ కోర్సు చేసింది.‘గో డూ గుడ్’ స్టార్టప్ ద్వారా ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ మెటీరియల్ని తయారు చేస్తోంది. ప్లాస్టిక్కి వ్యతిరేకంగా తనదైన శైలిలో ఉద్యమిస్తోన్న ఖుష్బూ... ‘ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి’ అని మైకులో గొంతుచించుకుంటే సరిపోదు, ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయం చూపిస్తే ఆటోమేటిగ్గా ప్లాస్టిక్ని దూరం పెట్టేస్తారు’ అంటోంది. ఇంకా...‘నా ప్రయోగాలు నాకు లాభాలను తెచ్చిపెడతాయో లేదో తెలియదు, కానీ సస్టెయినబుల్ లైఫ్ స్టయిల్ వైపు సమాజాన్ని నడిపించడంలో మాత్రం విజయవంతం అవుతాను’ అంటోంది ఖుష్బూ గాంధీ. ఎకో ఫ్రెండ్లీ సిరా!‘‘ప్లాస్టిక్ బబుల్ ర్యాపరే కాదు, పేపర్ మీద ప్రింటింగ్ కోసం ఉపయోగించే ఇంక్ కూడా అంత త్వరగా నేలలో ఇంకదు. పైగా మట్టిని కలుషితం చేస్తుంది. సీ వీడ్ (సముద్ర నాచు), నాచురల్ కలర్ పిగ్మెంట్స్తో ఇంకు తయారు చేశాం. ఒకసారి ఉపయోగించి పారేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్కు బదులు వ్యవసాయ వ్యర్థాలతో ప్లేట్లు తయారు చేస్తున్నాం. ఇక్కడ మరో విషయం చె΄్పాలి. ఒకసారి వాడిపారేసే పేపర్ ప్లేట్లు, గ్లాసులకు ల్యామినేషన్తో కోటింగ్ వేస్తుంటారు. నేను దానికి కూడా ప్రత్యామ్నాయం కనుక్కున్నాను. ఎకో ఫ్రెండ్లీ కోటింగ్ చేస్తున్నాం. ‘గో డూ గుడ్’ ద్వారా మేము పది టన్నుల ప్లాస్టిక్ వాడకాన్ని నివారించగలిగాం. అలాగే ఎకో ఫ్రెండ్లీ ఇంక్తో ఒకటిన్నర లక్షల ఉత్పత్తులు అక్షరాలద్దుకున్నాయి. ఏడు టన్నుల బయో డీగ్రేడబుల్ బబుల్ ర్యాపర్లను వాడుకలోకి తెచ్చాం. ఈ ప్రయత్నంలో ఐదు టన్నుల వ్యవసాయ వ్యర్థాలు వినియోగంలోకి వచ్చాయి. లధాక్లో ప్లాస్టిక్ వేస్ట్! నేను ఈ రంగలోకి అడుగు పెట్టడానికి కారణం పదేళ్ల కిందటి లధాక్ పర్యటన. మారుమూల ప్రదేశాలు ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయి ఉన్నాయి. షాంపూ సాషే నుంచి లేస్ ర్యాపర్ వరకు అవీ ఇవీ అనే తేడా లేకుండా ప్రతి పదార్థమూ ప్లాస్టిక్లోనే ప్యాక్ అవుతోందని నాకు తెలిసిందప్పుడే. ఆ చెత్త కాలువల్లోకి చేరకుండా అంతటినీ ఒకచోట పోగు చేసి తగలబెడుతున్నారు. వాళ్లకు చేతనైన పరిష్కారం అది. ఇంతకంటే పెద్ద పరిష్కారమార్గాన్ని కనుక్కోవాలని అప్పుడు అనిపించింది. ఆ తర్వాత నేను మెటీరియల్ డెవలప్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం స్పెయిన్కెళ్లాను. కోర్సు పూర్తయ్యేలోపు నా ఆలోచనకు ఒక స్పష్టమైస రూపం వచ్చింది. బయోడీగ్రేడబుల్ వస్తువులతో ప్లాస్టిక్కి సమాధానం చెప్పవచ్చనే ధైర్యం వచ్చింది. పీజీ పూర్తయి తిరిగి ఇండియాకి రాగానే మా తమ్ముడు, మా వారితో కలిసి పూణేలో నా డ్రీమ్ ్రపాజెక్ట్ ‘గో డూ గుడ్’కు శ్రీకారం చుట్టాను. ఇది విజయవంతంగా నడుస్తోంది’’ అని వివరించిందామె. ఖుష్బూ పేరుకు తగినట్లు పరిమళభరితంగా తన విజయ ప్రస్థానాన్ని రాసుకుంటోంది. మరి... మనం మన చరిత్రను ఏ సిరాతో రాసుకుందాం... మట్టిని కలుషితం చేసే ఇంకుతోనా లేక మట్టిలో కలిసిపోయే ఇంకుతోనా. మనమే నిర్ణయించుకోవాలి. -
ఫీజుకు బదులు ప్లాస్టిక్!
ఈ భూగోళం మీద ప్లాస్టిక్ తొడుగు ఉంది. అది నీటిలో నానదు. మట్టిలో కలవదు. నిప్పులో కాల్చితే విషంగా మారుతుంది. అలాంటి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. లేదా రీసైకిల్ చేయాలి. అందుకే అసోంలోని ఆ స్కూల్ 2016లో వృథా ప్లాస్టిక్కే స్కూల్ ఫీజ్గా ప్రారంభమైంది. ఏడేళ్లు గడిచినా దిగ్విజయంగా నడిచి పర్యావరణ హితమైన స్కూల్గా ప్రశంసలు అందుకుంటోంది.ఫీజుకు బదులు ప్లాస్టిక్ వేస్ట్ను ఎవరైనా తీసుకుంటారా? ఆ స్కూల్లో తీసుకుంటారు. ఎంత వేస్ట్ తెస్తే అంత మెచ్చుకుంటారు కూడా. పర్మితా శర్మ, మజిన్ ముక్తార్ అనే పర్యావరణ ప్రేమికుల, బాలల హితుల వినూత్న ఆలోచన ఇది. అసోంలోని పమోహీలో ‘అక్షర్’పేరుతో వీరిద్దరూ ఒక పాఠశాల స్థాపించారు 2016లో. దీనిని భిన్నంగా నడపాలని నిశ్చయించుకున్నారు.చదువు, స్కిల్స్, పర్యావరణ స్పృహ సిలబస్గా ఉండాలనుకున్నారు. అందుకే ఫీజు కట్టాలంటే నోట్లు తేవద్దు వేస్ట్ ప్లాస్టిక్ తెండి అని చెప్పసాగారు. వీలైనన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకెళ్తే ఫీజు కట్టినట్లు రసీదు ఇస్తారు. మరో విషయం ఏమిటంటే ఇక్కడ విద్యార్థులను వారి వయసును బట్టి కాకుండా అవగాహన స్థాయిని బట్టి తరగతుల్లో వేస్తారు. ఎనిమిదేళ్లు వచ్చిన వారు 3వ క్లాస్లో ఉండాలని రూల్ లేదు. నాలుగులో ఉండొచ్చు లేదా రెండులోనూ ఉండొచ్చు.ప్లాస్టిక్ భూతం నుంచి కాపాడాలని..మనుషులు బాగా చలి పుడితే దేనితోనైనా చలిమంట వేసుకోవడానికి వెనుకాడరు. అసోంలో చలి ఎక్కువ. కాని కట్టెలు ఖర్చు. అందుకే చలిమంటల కోసం ప్రజలు ప్లాస్టిక్ బాటిళ్లను, కవర్లను తెచ్చి మంటల్లో వేయసాగారు. ప్లాస్టిక్ వ్యర్థాలను బహిరంగంగా తగులబెట్టడం పర్యావరణానికి తీవ్రమైన హాని. దీనిపై అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం రాలేదు.దానికి తోడు ప్లాస్టిక్ తగులపెట్టడం వల్ల వెలువడే విష వాయువులు పీల్చి పిల్లలు జబ్బు పడసాగారు. దీంతో సామాజిక కార్యకర్త అయిన పర్మితా శర్మకు ఓ ఆలోచన తట్టింది. తన మిత్రుడు, అమెరికాలో బాలల విద్యారంగంలో పని చేస్తున్న నిపుణులు మజిన్తో తన ఆలోచనను పంచుకుంది. అసోం భౌగోళిక పరిస్థితుల గురించి, అక్కడ నెలకొన్న సవాళ్ల గురించి మజిన్కు వివరించింది. అలా వారిద్దరి ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ‘అక్షర్’ విద్యాలయం.ప్లాస్టిక్ను రీసైకిల్ చేస్తున్న విద్యార్థులుఎవరు చేరుతారు?స్కూలంటే డబ్బు తీసుకుని చదువు చెప్పాలి. ప్లాస్టిక్ తెండి స్కూల్లో చేరండి అంటే ఎవరు చేరతారు. పైగా సంప్రదాయ విద్యకు, వృత్తి విద్యకు మధ్య వారధిగా ప్రారంభించిన ఈ పాఠశాలకు విద్యార్థులను రప్పించడం మొదట్లో సవాలుగానే మారింది. ఇక అక్కడి పేద పిల్లలు దగ్గర్లోనే ఉన్న రాళ్ల క్వారీలలో పనిచేస్తారు. వారిని బడికి పంపిస్తే ఆదాయం కోల్పోతామని తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపేందుకు ససేమిరా అన్నారు. దీంతో తల్లిదండ్రుల అవసరాలకు తగిన విధంగా స్కూల్ సమయాన్ని, బోధనను ‘అక్షర్’ లో రూపకల్పన చేశారు.ప్లాస్టిక్ ఇటుకలు..‘అక్షర్’లో నెదర్లాండ్స్ నుంచి తెప్పించిన మెషినరీ ద్వారా ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తారు. పాత ప్లాస్టిక్తో ఇటుకలు తయారు చేస్తారు. వీటిని నిర్మాణాల్లో వాడొచ్చు. పిల్లలు స్కూల్ అయ్యాక ఈ ఇటుకల తయారీ నేర్చుకుంటున్నారు. అలాగే పూలకుండీలు, బౌల్స్ వంటివి ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు రెండున్నర వేల ప్లాస్టిక్ బాటిళ్లు, ఏడు లక్షల ప్లాస్టిక్ కవర్లు ఇక్కడ రీసైకిల్ అయ్యాయి.అసోంను ప్లాస్టిక్ పీడ నుంచి విముక్తం చేయాలంటే తమ స్కూల్ మోడల్ని ఫాలో కావాలని పర్మిత, మజిన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికి 5 స్కూళ్లు ఈ విధానాన్ని అవలంబిస్తున్నాయి. అంటే ఫీజుగా ప్లాస్టిక్ను తీసుకుంటున్నాయి. మరో వంద స్కూళ్లు ఇలా చేస్తే బాగుంటుందని పర్మిత, మజిన్ భావిస్తున్నారు. అసోంలో మాత్రమే కాదు దేశమంతా ఈ మోడల్ను ఉపయోగిస్తే ప్లాస్టిక్ వ్యర్థాలను కచ్చితంగా తరిమికొట్టడం వీలవుతుంది.ఇవి చదవండి: Kalaiyarasi: తను ఒక ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్’.. -
వేస్ట్ నుంచి ‘బంగారం’: అదిరిపోయే కళ
‘వ్యర్థాల గురించి మాట్లాడుకోవడం పరమ వ్యర్థం’ అనుకోవడం లేదు యువతరం. ఎలక్ట్రానిక్స్ నుంచి ప్లాస్టిక్ వ్యర్థాల వరకు రకరకాల వ్యర్థాలను కళాకృతులుగా రూపొందించి పర్యావరణ సందేశాన్ని అందించడం ఒక కోణం అయితే, ఎలక్ట్రానిక్ వ్యర్థాలలోని విలువైన వాటితో నగలు రూపొందించే ఎమర్జింగ్ ఆర్ట్ ట్రెండ్ లోతుపాతులు తెలుసుకోవడం మరో కోణం... కోల్కతాలోని శ్రీశ్రీ అకాడమీ విద్యార్థులు తమ పాఠశాల అవరణలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలతో అద్భుతాన్ని సృష్టించారు. ‘ట్రాష్ ఇన్స్టాలేషన్’ ప్రాజెక్ట్లో భాగంగా స్టూడెంట్స్ యుతిక, ఇషాని, రజనీష్, మంజరీ, అదిత్రిలు ప్లాస్టిక్తో తయారుచేసిన డాల్ఫిన్ స్టాచ్యూను పాఠశాల ఆవరణలోని వర్టికల్ గార్డెన్లో ఏర్పాటు చేశారు. నెలరోజుల వ్యవధిలో తయారు చేసిన ‘డాల్ఫిన్ ఇన్ పెరిల్’ అనే ఈ ఆర్ట్ ఇన్స్టాలేషన్ పాఠశాలకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ‘ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, సముద్ర జీవులకు తీవ్రహాని కలుగుతుందనే విషయాన్ని ప్రచారం చేయడానికి కళను ఒక మాధ్యమంలా ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. భవిష్యత్లో ఇలాంటివి మరిన్ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అంటుంది అదిత్రి. కేరళలోని తిరువనంతపురంలో ‘కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’కు చెందిన యంగ్ టీమ్ 20,000 ప్లాస్టిక్ బాటిల్స్ను ఉపయోగించి 90 అడుగుల పాము ఇన్స్టాలేషన్ను రూపొదించింది. ప్లాస్టిక్ అనే విషసర్పం భూగోళాన్ని కాటు వేస్తున్నట్లుగా కనిపించే ఈ ఇన్స్టాలేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటిని దృష్టిలో పెట్టుకొని ‘ఫ్యాషన్ ఆఫ్ ది న్యూ ఎరా 100 శాతం ట్రాష్ అండ్ ప్లాస్టిక్!’ అంటూ ఒక యువ ఆర్టిస్ట్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ముంబైలో ఉంటున్న హరిబాబు ఇ–వేస్ట్ కళలో ఎంతోమంది యూత్కు ఇన్స్పైరింగ్గా నిలుస్తున్నాడు. ఇ–వేస్ట్ కళారూపాలతో ప్రముఖ ఆర్ట్ గ్యాలరీలలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. కేరళలో పుట్టిన హరిబాబు చెన్నైలో పెరిగాడు. చెన్నై గవర్నమెంట్ ‘కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’లో చదువుకున్నాడు. ఇ–వ్యర్థాలతో కళాకృతుల తయారీకి ప్రశంసల మాట ఎలా ఉన్నా బ్యాంకు బ్యాలెన్స్ మాత్రం ఎప్పటికప్పుడూ ఖాళీ అవుతుండేది. ‘నీకేమైనా పిచ్చి పట్టిందా?’ అని తిట్టేవారు మిత్రులు. అయితే బజాజ్ ఆర్ట్ గ్యాలరీ ఫెలోషిప్ అవార్డ్ అందుకున్న తరువాత హరిబాబుకు బ్రేక్ వచ్చింది. ఏడాది తరువాత ‘స్టేట్–ఆఫ్–ది–ఆర్ట్ స్టూడియో’ ముంబైలో ప్రారంభించాడు. టన్నుల కొద్దీ ఇ–వ్యర్థాల నుంచి ఎన్నో శిల్పాలు రూపొందించిన హరిబాబు దగ్గరికి సలహాలు, సూచనల కోసం ఎంతోమంది యంగ్ ఆర్టిస్ట్లు వస్తుంటారు. భువనేశ్వర్కు చెందిన మ్యూరల్ ఆర్టిస్ట్ దిబూస్ జెనా, ఆర్టిస్ట్ సిబానీ బిస్వాల్ ఆర్గానిక్ స్క్రాప్, రీయూజ్డ్ మెటల్లతో ఆర్ట్ ఇన్స్టాలేషన్లను సృష్టించారు. మానవ తప్పిదాల వల్ల సముద్రానికి జరుగుతున్న హాని గురించి తెలియజేసేలా ఉంటుంది జెనా రూపొందించిన తిమింగలం. ‘ఒషాబా బ్రాండ్ గురించి తెలుసుకున్న తరువాత ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై ఆసక్తి పెరిగింది. వృథా అనుకునే వాటి నుంచి ప్రయోజనం సృష్టించాలి అనే వారి ఫిలాసఫీ నాకు నచ్చింది’ అంటుంది భో΄ాల్కు చెందిన ఇరవై రెండు సంవత్సరాల రీతిక. కళ తప్పి మూలన పడ్డ ఎలక్ట్రానిక్ వ్యర్థాలకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి గత సంవత్సరం లండన్ కేంద్రంగా ఒషాబా బ్రాండ్కు అంకురార్పణ జరిగింది. వాడి పారేసిన స్మార్ట్ఫోన్ సర్క్యూట్ బోర్డులు, ప్లగ్, యూఎస్బీ కేబుల్స్, చార్జింగ్ కేబుల్స్..మొదలైన వాటిలోని విలువైన వాటిని ఈ బ్రాండ్ ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. నిజానికి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఆభరణాల తయారీలో ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. 2018లో అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ‘డెల్’ కాలం చెల్లిన తమ కంప్యూటర్ విడి భాగాల నుంచి సేకరించిన విలువైన వాటితో నగలు రూపొదించడానికి లైఫ్స్టైల్ బ్రాండ్ ‘బాయూ విత్ లవ్’తో కలిసి భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విలువైన పదార్థాల వృథాను నివారించడానికి, ఎలక్ట్రానిక్ వ్యర్థాల గురించి వినియోగదారులలో అవగాహన కలిగించే సృజనాత్మక విధానాన్ని ‘డెల్’ ఎంచుకుంది. ‘జువెలరీ బ్రాండ్స్ రీ–సైకిల్డ్ అల్టర్నేటివ్స్పై ఆసక్తి చూపుతున్నాయి. వాడిపాడేసిన స్మార్ట్ఫోన్లు, లాప్టాప్లు... మొదలైన వాటిలో గోల్డ్ మైన్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మూలకు పడి ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలలో దాగి ఉన్న విలువైన లోహలు, ఒక టన్ను ఇ–వేస్ట్ నుంచి ఎన్ని గ్రాముల బంగారం వస్తుంది... లాంటి వివరాలు నాకు ఆసక్తికరంగా మారాయి’ అంటుంది ముంబైకి చెందిన నవీన. 23 సంవత్సరాల నవీనకు పాత, కొత్త అనే తేడా లేకుండా నగల డిజైనింగ్ ఐడియాలపై ఆసక్తి. ఈ ఆసక్తి ఆమెను ఎలైజా వాల్టర్లాగే నలుగురు మెచ్చిన డిజైనర్గా మార్చవచ్చు. నగ దరహాసం ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి నగలు తయారు చేసే బ్రాండ్గా బ్రిటన్లో మంచి పేరు సంపాదించింది లైలీ జువెలరి. ఎలైజా వాల్టర్ 24వ యేట ఈ బ్రాండ్ను ప్రారంభించింది, యువతలో ఎంతోమందిలాగే ఇ–వ్యర్థాలలోని అపురూప అంశాలపై ఆసక్తి పెంచుకుంది. ‘ప్రపంచంలోని బంగారంలో ఏడు శాతం నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్స్లో దాగి ఉన్నందున ఆభరణ బ్రాండ్లు వాటిని ముఖ్యమైన వనరుగా చూస్తున్నాయి’ అంటున్న ఎలైజా వాల్టర్ ప్రయాణం యువతలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇ–వ్యర్థాల నుంచి రూపొందించిన ఈ ఆభరణాన్ని ఎలైజా వాల్టర్ డిజైన్ చేసింది. -
వాడేసిన ప్లాస్టిక్తో వండర్స్
మనింట్లో చాలా ప్లాస్టిక్ కవర్స్ పోగవుతాయి. వాటిని చెత్తలో పడేస్తాము. అవి ఎప్పటికీ మట్టిలో కలవక అలాగే కాలుష్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాని ఈ ప్లాస్టిక్ కవర్లనే రాజిబెన్ దారాలుగా చేసి బ్యాగులు అల్లుతుంది. బుట్టలు చేస్తుంది. పర్సులు చేస్తుంది. డోర్మ్యాట్లు సరేసరి. అందుకే ఆమెకు చాలా గుర్తింపు వచ్చింది. ఆమె వల్ల ఎందరికో ఉపాధి కలుగుతోంది. కొత్త ఆలోచన చేసిన వారే విజేతలు. గుజరాత్ కచ్ ప్రాంతంలోని కోటె అనే చిన్న పల్లెలో ఏమీ చదువుకోని అమ్మాయి – రాజి బెన్ పెరిగి పెద్దదయ్యి లండన్ వెళ్లి అక్కడ పెద్దవాళ్లతో తాను చేసిన కృషిని వివరించింది. ఆమె తన జీవితంలో ఇంత పెద్ద ప్రయాణం చేసి, గుర్తింపు పొందేలా చేసింది ఏమిటో తెలుసా? వృధా ప్లాసిక్. వాడేసిన ప్లాస్టిక్ రోడ్ల మీద, ఇళ్ల డస్ట్బిన్లలో, చెత్త కుప్పల మీద అందరూ ప్లాస్టిక్ కవర్లను, రేపర్లను పారేస్తారు. వాటిని ఏం చేయాలో ఎవరికీ ఏమీ తోచదు. అవి తొందరగా మట్టిలో కలిసిపోవు. కాని రాజిబెన్ వాటిని ఉపయోగంలోకి తెచ్చింది. వాటిని సేకరించి, కట్ చేసి పీలికలుగా మార్చి, కలిపి నేసి అందమైన వస్తువులు తయారు చేసింది. బ్యాగులు, సంచులు, పర్సులు... వాటి మన్నిక కూడా ఎక్కువ. ఎలా చేస్తారు? వాడేసిన ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ను సేకరించి సర్ఫ్ నీళ్లతో కడుగుతారు. ఆ తర్వాత వాటిలోని మలినాలు పోవడానికి వేడి నీళ్లలో నానబెడతారు. తర్వాత రెండు రోజులు ఎండలో ఆరబెడతారు. ప్లాస్టిక్ మందంగా ఉంటే అర ఇంచ్ వెడల్పు రిబ్బన్లుగా; పలుచగా ఉంటే ముప్పావు ఇంచ్ రిబ్బన్లుగా కట్ చేస్తారు. ఈ ముక్కలను నాణ్యమైన జిగురుతో అంటించి పొడవైన ఉండగా మారుస్తారు. అంటే మగ్గం మీద నేయడానికి దారం బదులు ఈ ప్లాస్టిక్ ఉండనే ఉపయోగిస్తారు. ఈ ప్లాస్టిక్ దారాలతో నేస్తే దళసరి వస్త్రం తయారవుతుంది. దానిని కట్ చేసుకుని రకరకాల వస్తువులుగా చేతి నైపుణ్యంతో తీర్చిదిద్దుతారు. హ్యాండ్ బ్యాగ్లు, కూరగాయల బ్యాగ్లు, ఫోన్ బాక్సులు, పర్సులు.. ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి. మన్నికతో ఉంటాయి. ఎలా వచ్చింది ఐడియా? రాజి బెన్ నేత కుటుంబంలో పుట్టింది. అయితే తండ్రికి నేత మీద విసుగుపుట్టి వ్యవసాయం చేసేవాడు. అదీగాక ఆడపిల్లలు మగ్గం మీద కూచోవడం నిషిద్ధం. కాని రాజి బెన్కి మగ్గం మీద పని చేయాలని 12 ఏళ్ల వయసు నుంచే ఉండేది. అందుకని మేనమామ కొడుకు దగ్గర రహస్యంగా మగ్గం పని నేర్చుకుంది. 14 ఏళ్లు వచ్చేసరికి మగ్గం పనిలో ఎక్స్పర్ట్గా మారింది. అయితే ఆమెకు పుట్టింటిలో కాని మెట్టినింటిలో గాని మగ్గం మీద కూచునే అవకాశమే రాలేదు. ఏడేళ్లు కాపురం చేశాక భర్త హటాత్తుగా మరణించడంతో రాజి బెన్ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాల్సి వచ్చింది ముగ్గురు పిల్లల కోసం. కచ్లో ఒక ఎన్.జి.ఓ ఉంటే అక్కడ మగ్గం పని ఖాళీ ఉందని తెలిస్తే వెళ్లి చేరింది. అందమైన వస్త్రాలు అల్లి వాటిని ఆకర్షణీయమైన వస్తువులుగా తీర్చిదిద్దే స్థానిక కళలో ఆమె ప్రావీణ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఎన్.జి.ఓ వారు ఆమె చేసిన ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ సేల్ నిర్వహించేవారు. 2012లో జరిగిన ఎగ్జిబిషన్లో ఒక విదేశీ డిజైనర్ ప్లాస్టిక్ను రీసైకిల్ చేసి తయారు చేసిన బ్యాగ్ను చూపించి ‘ఇలాంటిది తయారు చేయగలవా?’ అని అడిగాడు. అది ఎలా తయారయ్యిందో అర్థమయ్యాక రాజి బెన్కు నాలుగు రోజులు కూడా పట్టలేదు అలాంటి బ్యాగులు తయారు చేయడానికి. ఆ డిజైనర్ వాటిని చూసి సంతృప్తిగా కొనుక్కుని వెళ్లాడు. మరికొన్ని బ్యాగులు జనం క్షణాల్లో ఎగరేసుకుపోయారు. అప్పటి నుంచి వేస్ట్ ప్లాస్టిక్ నుంచి రాజి బెన్ హస్తకళా ఉత్పత్తులను తయారు చేస్తోంది. స్వచ్ఛ్ సుజల్ శక్తి సమ్మాన్ రాజి బెన్ ఖ్యాతి ఎంత దూరం వెళ్లిందంటే అమృత మహోత్సవం సందర్భంగా ‘స్వచ్ఛ్ సుజల్ శక్తి సమ్మాన్’ పురస్కారం ఆమెకు ప్రకటించారు. అలాగే యూరప్ దేశాల నుంచి ఆమె ఉత్పత్తులకు ఆర్డర్లు వస్తున్నాయి. ‘ప్లాస్టిక్ పీడ విరగడ అవ్వాలంటే దానిని ఎన్ని విధాలుగా రీసైకిల్ చేయవచ్చో అన్ని విధాలుగా చేయాలి. రాజి బెన్ కొత్త తరాన్ని తనతో కలుపుకుంటే ఆమె ఉత్పత్తులు చాలా దూరం వెళ్లడమే కాక పర్యావరణానికి మేలు కూడా జరుగుతుంది’ అని విదేశీ ఎంట్రప్రెన్యూర్లు అంటున్నారు. రాజి బెన్ ప్రస్తుతం 90 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. 2018 నుంచి సొంత సంస్థ పెట్టుకోవడంతో దాని టర్నోవర్ ఇప్పుడు సంవత్సరానికి 10 లక్షలు దాటిపోయింది. ఆమె గెలుపు గాథ మరింత విస్తరించాలని కావాలని కోరుకుందాం. -
గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ పాత్రల్లో తింటున్నారా?దీనిలోని బిస్ఫినాల్ వల్ల..
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి.గత కొన్నేళ్లుగా ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఓవైపు ప్లాస్టిక్ను నిర్మూలించాలని చెబుతున్నా మరింత ఎక్కువగా వాడుతున్నాం. ఇప్పటికే ప్లాస్టిక్ ఉత్పత్తి సంవత్సరానికి 40 కోట్ల టన్నులకు చేరుకుందని అంచనా. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో సమస్య సంక్షోభంగా మారే అవకాశం తొందర్లోనే ఉంది. ప్లాస్టిక్ కవర్ల వల్ల కలిగే నష్టాలివే పర్యావరణ_కాలుష్యం: ►సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు పర్యావరణ కాలుష్యానికి ప్రధాన మూలం. ఎందుకంటే అవి భూమిలో ఇంకిపోవడానికి చాలా సమయం పడుతుంది.ప్లాస్టిక్ కవర్లు వన్యప్రాణులకు హాని కలిగిస్తాయి. జంతువులు వాటిని ఆహరంగా భావించి తినేస్తున్నాయి. ఇది ఎక్కువైతే, మరణానికి కూడా దారితీయొచ్చు. ► ప్లాస్టిక్ కవర్లు అనేక రసాయనాలు కలిగి ఉంటుంది. వీటిని నీటిలో వదలడం వల్ల అవి కూడా కలుషితం అయ్యి ప్రమాదాన్ని కలిగిస్తాయి. ► కొన్ని ప్లాస్టిక్ కవర్లలో మానవ ఆరోగ్యానికి హాని కలిగించే బిస్ఫినాల్ A (BPA), థాలేట్స్ ,ఫ్లేమ్ రిటార్డెంట్స్ వంటి రసాయనాలు ఉండవచ్చు. ఈ రసాయనాలు ప్లాస్టిక్ నుండి బయటకు వెళ్లి ఆహారం లేదా పానీయాలలోకి వెళ్లి, హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి సమస్యలు మరియు క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ► ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తి, పారవేయడం గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు దోహదం చేస్తుంది. ఇది వాతావరణ మార్పు, ఇతర పర్యావరణ సమస్యలకు దోహదం చేస్తుంది. ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారం తింటున్నారా? మీరు రోజూ ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారం తీసుకుంటున్నారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే. వేడి పదార్థాలను ప్లాస్టిక్ లేదా డిస్పోజబుల్ ప్లేట్లలో ఉంచడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని పరాశోధకులు ప్లాస్టిక్ (Plastic) తయారు చేసేందుకు బిఎస్ ఫినాల్ను ఉపయోగిస్తారు. ప్రధానంగా పాలికార్బోనేట్ లేదా రీసైకిల్ కోడ్7గా పిలువబడే ఇది ప్లాస్టిక్లో కలుస్తుంది. ఇది విషపూరితమైనది. దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ పొంచివుండే ప్రమాదం ఉంది. బీపీఏ అనేది మానవ శరీరంలోని ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను అసమతుల్యత చేసే రసాయనమని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి మొదలైన వాటికి దారి తీస్తుంది. అలాగే అలెర్జీలు, గుండెకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ తీవ్రతను పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గుతుంది ఎక్కువగా ప్లాస్టిక్ పాత్రల్లో తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ పాత్రలలో ఆహారం తినడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మైక్రోవేవ్లో ప్లాస్టిక్ పాత్రలలో ఆహారాన్ని వేడి చేయడం కూడా హానికరమంటున్నారు. మీరు మైక్రోవేవ్ ఉపయోగించాల్సి వస్తే ప్లాస్టిక్కు బదులుగా మీరు పేపర్ టవల్, గ్లాస్ ప్లేట్ లేదా సిరామిక్ వస్తువులను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఓవైపు ప్లాస్టిక్ను నిషేధించాలని పదేపదే చెబుతున్నా, ఇంకా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. ప్లాస్టిక్ కవర్స్ని నిషేధించే విధంగా చర్యలు చేపట్టినా, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్లాస్టిక్ భూమిలో కరగడానికి కొన్ని వందల ఏళ్లు సమయం పట్టడం, అందులో ప్లాస్టిక్ తయారీలో కలిసే పదార్థం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఎంతో మంది నిపుణులు చెబుతున్నా.. ఇంకా ప్లాస్టిక్ రూపుమాపడం లేదు. ప్లాస్టిక్ కవర్ల హానికరమైన ప్రభావాలను తగ్గించడానికి, సింగిల్-యూజ్ ప్లాస్టిక్ల వినియోగాన్ని తగ్గించడం, కంటైనర్లు, పత్తి లేదా బీస్వాక్స్ వంటి సహజ పదార్థాలతో తయారు చేయబడిన ర్యాప్ల వంటి మరింత స్థిరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్లాస్టిక్ కవర్లను రీసైక్లింగ్ చేయడం సరైన పరిష్కారం కాదు. దానికంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే సమస్యను పరిష్కరించడానికి ఉత్తతమైన మార్గం. -నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు -
మొలకెత్తే పెన్ను.. పర్యావరణానికి దన్ను
గుంటూరు (ఎడ్యుకేషన్): సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, వినియోగంపై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే పెన్నులను సైతం పర్యావరణ అనుకూల విధానంలో ఉపయోగిస్తోంది. యూజ్ అండ్ త్రో (వాడిపారేసే) ప్లాస్టిక్ పెన్నులు భూమిలో కలిసిపోయేందుకు వందల ఏళ్లు పడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా వందలు, వేల సంఖ్యలో పెన్నులను వాడి పారేస్తుండటంతో పర్యావరణానికి హాని కలిగించని పెన్నుల తయారీ, వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తొలుత విద్యాశాఖలో ప్రయోగాత్మకంగా పర్యావరణ అనుకూల పెన్నుల వినియోగాన్ని అమల్లోకి తెచ్చింది. కాగితం పొరలతో.. కాగితం పొరలతో తయారు చేసిన పెన్నులకు మందపాటి అట్టతో రూపొందించిన క్యాప్ ఉంచిన పెన్నులను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాల వారీగా నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు ఉచితంగా అందజేస్తున్నారు. ప్యాడ్తో పాటు పేపర్ పెన్నులను ఇస్తూ.. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిస్తున్నారు. ప్రత్యేకంగా పేపర్ పెన్నుల ఉత్పత్తిదారులకు ఆర్డర్ ఇచ్చి పెన్నులు తయారు చేయిస్తున్నారు. వీటిని వాడిన తరువాత పడేస్తే అవి మట్టిలో కలిసిపోతాయి. మరో విశేషం ఏమిటంటే.. ఆ పెన్నుల వెనుక భాగంలో అమర్చిన చిన్న గొట్టంలో నవ ధాన్యాలు, వివిధ దినుసులు, పూల మొక్కల విత్తనాలను అమర్చారు. బీన్స్, సన్ఫ్లవర్, మెంతులు తదితర విత్తనాలను కూడా అమర్చుతున్నారు. పెన్నును వాడి పారేసిన తరువాత ఇంటి పెరట్లోనో, రోడ్డు పక్కన మట్టిలోనో పారవేస్తే పెన్ను భూమిలో కరిగిపోయి.. అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి. ప్రస్తుతం బల్క్ ఆర్డర్లపై తయారు చేస్తున్న ఈ ఎకో ఫ్రెండ్లీ పెన్నును కేవలం రూ.20కే కొనుగోలు చేయవచ్చు. గురువారం గుంటూరు నగరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులకు ఎకో ఫ్రెండ్లీ పెన్నులను విద్యాశాఖ అధికారులు పంపిణీ చేశారు. -
పంట పొలాల్లో తిష్టవేసుకొని కూర్చున్న ప్లాస్టిక్ భూతం
పంట పొలాల్లో ప్లాస్టిక్ భూతం తిష్టవేసుక్కూచుంది. వ్యవసాయంలో చాలా పనుల కోసం ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకం గత 70 ఏళ్లుగా అనేక రెట్లు పెరిగింది. మల్చింగ్ షీట్లు, ఫామ్పాండ్ లైనింగ్, ప్లాస్టిక్ డ్రిప్ లేటరల్స్, పీవీసీ పైపులు, గ్రీన్ హౌస్ల పైకప్పులు, సైలేజీ గడ్డి బేల్స్ కోసం ఫిల్మ్ల తదితర పనుల కోసం వ్యవసాయంలో ప్లాస్టిక్ వాడకం అంతకంతకూ పెరుగుతోంది. వీటిల్లో ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ ముఖ్యమైనది. ఒక పంట కాలంలో చిరిగిపోయే పల్చటి షీట్ ఇది. కలుపును నివారించడం ద్వారా కలుపు తీత శ్రమతో పాటు ఖర్చును లేదా రసాయనిక కలుపు మందుల ముప్పును/ వాటి కొనుగోలు ఖర్చును తగ్గించడం.. మట్టిలో నుంచి నీటి తేమ ఆరిపోకుండా చూడటం ద్వారా నీటిని ఆదా చేయటం ద్వారా దిగుబడి పెరుగుదలకు ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు ఉపయోగపడుతున్నాయి. కోటి 25 లక్షల టన్నుల ప్లాస్టిక్ సేద్యం 2019వ సంవత్సర కాలంలో ప్రపంచవ్యాప్తంగా పంటల సాగు, ఆక్వా సాగు, చేపల వేట దగ్గరి నుంచి ఆయా ఆహారోత్పత్తులను వినియోగదారులకు చేర్చే వరకు ఉన్న దశలన్నిటిలో కలిపి సుమారు కోటి 25 లక్షల టన్నుల ప్లాస్టిక్ను వినియోగించినట్లు ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా పంటలు/ఉద్యాన తోటల సాగులో, పశువుల పెంపకంలో ఏడాదికి కోటి టన్నుల ప్లాస్టిక్ వాడుతుండగా.. ఇందులో మల్చింగ్ ఫిల్మ్ వాటా 34 లక్షల టన్నులు. చేపల వేట, ఆక్వా సాగులో 21 లక్షల టన్నులు, అటవీ ఉత్పత్తులకు సంబంధించి మరో 2 లక్షల టన్నుల ప్లాస్టిక్ సామగ్రి వాడుతున్నారు. 2030 నాటికి వ్యవసాయంలో ప్లాస్టిక్ వాడకం 50% పెరగనుందని వ్యాపారుల అంచనా. ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేకపోయినప్పటికీ, వ్యవసాయ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ప్లాస్టిక్లో సింహభాగం అంటే 60 లక్షల టన్నుల ప్లాస్టిక్ (ప్రపంచ వినియోగంలో సగం)ను ఆసియా దేశాల్లో రైతులే వాడుతున్నారని ఎఫ్.ఎ.ఓ. చెబుతోంది. ప్లాస్టిక్ అవశేషాలతో ముప్పేమిటి? పంట భూముల్లో మిగిలిపోయే ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ అవశేషాల వల్ల ఆయా భూములు కాలుష్యం బారిన పడినందున సూక్ష్మజీవరాశి నశించి పంట దిగుబడులు తగ్గిపోతున్నట్లు ఎఫ్.ఎ.ఓ. పేర్కొంది. ఇలా భూమిలో కలిసిన ప్లాస్టిక్ (ముఖ్యంగా మల్చింగ్ ఫిల్మ్ అవశేషాల) ద్వారా వెలువడే మైక్రోప్లాస్టిక్స్ (సూక్ష్మప్లాస్టిక్ కణాలు) ఆహారోత్పత్తులు, నీటి ద్వారా తిరిగి మనుషులకు చేరి వారికి అనారోగ్యం కలిగించడం కూడా జరుగుతోందని ఎఫ్.ఎ.ఓ. ఆందోళన వ్యక్తం చేసింది. పెద్ద ఎత్తున పోగుపడే వ్యవసాయ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల వన్యప్రాణులు, మూగజీవాలు కూడా అనారోగ్యం పాలువుతున్నాయి. కొన్ని ప్లాస్టిక్ కణాలలో ఉండే థాలేట్స్, బిస్పినాల్స్ వంటి విషతుల్య పదార్థాలు మనుషుల హార్మోన్ వ్యవస్థను అస్థవ్యస్థం చేసి ఆనారోగ్యాల బారిన పడేస్తాయి. ఈ ప్లాస్టిక్ వస్తువులు, సూక్ష్మప్లాస్టిక్ కణాలు వాగులు, కాలువల ద్వారా సముద్రంలోకి చేరి జలచరాలకు దీర్ఘకాలం హాని చేస్తున్నాయి. వ్యవసాయ ప్లాస్టిక్ వ్యర్థాలను ఒక పద్ధతి ప్రకారం సేకరించి, పునర్వినియోగించే పటిష్ట వ్యవస్థ కొరవడింది. సేకరించి పొలాల్లోనే తగటబెడుతున్నారు. ఒక వేళ చెత్త కుప్పల్లో వేసినా.. అక్కడ వాటికి నిప్పు పెడుతున్నారు. తగలబడిన ప్లాస్టిక్ నుంచి పాలీక్లోరినేటెడ్ డిబెన్జో–పి–డయాక్సిన్లు, ఫ్యురాన్లు వంటి విషతుల్య వాయువులు వెలువడుతూ ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్నాయి. ఒక వైపు ఆహారోత్పత్తి పెరుగుదలకు దోహదపడుతున్న ఈ ప్లాస్టిక్.. మరోవైపు ఆహారభద్రతపై, ఆహార నాణ్యత, పౌష్టికాహార శోషణపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. అదేవిధంగా, సాంఘిక, ఆర్థిక పరంగా నష్టాలకు కారణభూతమవుతోంది. అందువల్ల, వ్యవసాయంలో ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని గాడిన పెట్టి, ప్రత్యామ్నాయాలపై సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటూ ఎఫ్.ఎ.ఓ. శాస్త్రవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు, పాలకులకు అనేక సూచనలు చేసింది. కిలో షీట్తో 700 చ.అ.ల భూమి కలుషితం పంట పూర్తయిన తర్వాత చీలికలు పేలికలయ్యే మల్చింగ్ ప్లాస్టిక్ షీట్ ముక్కలను ఏరివేయటం పెద్ద సమస్యగా మారింది. వీలైనంత వరకు ఏరి తగులబెట్టడం లేదా చెత్తకుప్పలో వేస్తున్నారు. మిగతా ప్లాస్టిక్ ముక్కలు భూమిలో అలాగే ఉండిపోతున్నాయి. వీటితో పాటు డ్రిప్ లేటరల్స్ ముక్కలు తదితర ప్లాస్టిక్ వస్తువులను సక్రమంగా ఏరి తిరిగి ఉపయోగించే పరిస్థితి లేనందున భూమి ప్లాస్టిక్ కాలుష్యం బారిన పడుతోంది. ఆసియా దేశాల్లో 10 శాతాన్ని మాత్రమే సేకరించి, తిరిగి వాడగలుగుతున్నామని అంచనా. మట్టిలో కలిసే సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు మట్టిలోని సూక్ష్మజీవరాశిని నాశనం చేస్తున్నాయి. దీంతో భూసారం దెబ్బతింటున్నది. ఒక కిలో పల్చటి ప్లాస్టిక్ షీట్ 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యవసాయ భూమిని కలుషితం చేస్తోందని అంచనా. చమురు, సహజవాయువు లేదా బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను శుద్ధిచేసి 99% ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇవి ఒక వైపు ఉపయోగపడుతూనే నిర్వహణ లోపం వల్ల మనుషులు, పశు పక్ష్యాదుల ఆరోగ్యానికి, పర్యావరణానికి తీరని హాని కలిగిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యామ్నాయాలున్నప్పటికీ..! రసాయనిక కలుపు మందులు వాడకుండా, కలుపు మొలవకుండా చూసేందుకు వ్యవసాయంలో వాడుతున్న ప్లాస్టిక్ మల్చింగ్ ఫిల్మ్కు ప్రత్యామ్నాయాలు అనేకం. పంటల మార్పిడి పాటించడం, పంట పొలంలో ఖాళీ లేకుండా అంతర పంటలు వేయటం(సజీవ ఆచ్ఛాదన) లేదా ఎండుగడ్డి వంటి పంట వ్యర్థాలను మల్చింగ్గా వాడటం వంటి మార్గాలున్నాయి. త్వరగా చివికి భూమిలో కలిసిపోయే పర్యావరణహితమైన (బయోడీగ్రేడబుల్) మల్చింగ్ ఫిల్మ్లను సంపన్న దేశాల్లో వాడుతున్నారు. అదేవిధంగా, మన కాయిర్ బోర్డు రూపొందిస్తున్న కొబ్బరి పీచుతో తయారు చేసే ‘భూవస్త్రాలు’ కూడా పంటల మధ్య ఆచ్ఛాదనకు ఉపయోగపడతాయి. కొద్ది నెలల్లో మట్టిలో కలిసిపోతాయి. అయితే, వీటితో వచ్చిన చిక్కేమిటంటే.. ప్లాస్టిక్ మల్చింగ్ ఫిల్మ్ కన్నా వీటి ధర 2–3 రెట్లు ఎక్కువగా ఉండటమే. ఈ ప్రతిబంధకాలను అధిగమించేందుకు ముఖ్యంగా ఆసియా దేశాలు పరిశోధనలకు ఊతమివ్వాలి. శాస్త్ర సాంకేతిక పరిశోధనలు ఫలించి, ధర అందుబాటులోకి వస్తే బయోడీగ్రేడబుల్ మల్చింగ్ ఫిల్మ్లు మన దేశంలోనూ రైతులకు అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ప్లాస్టిక్ ముప్పు ఇంతింత కాదయా!
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) ద్వారా పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ యేడు ప్లాస్టిక్ మీద దృష్టి పెట్టాలని నిర్ణయం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2023... ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రజలు చేపట్టే చర్యలు ముఖ్యమైనవని గుర్తు చేస్తున్నది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు తీసుకునే చర్యలు ప్రజల ఆకాంక్షల మేరకే ఉంటాయని నొక్కి చెబుతున్నది. ప్రజా చైతన్యంతో ఒక ‘వృత్తాకార ఆర్థిక వ్యవస్థ’కు నాంది పలికే సమయం ఆసన్నమైంది. ప్లాస్టిక్ కాలుష్యంతో ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి భూమిని, మానవ సమాజాన్ని, సహజ ప్రకృతి వ్యవస్థలను రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి. ఇప్పటికే బిలియన్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయింది. జీవవైవిధ్యంతో పాటు మానవ ఆరోగ్యం మీద కూడా ప్లాస్టిక్ దుష్ప్రభావం చూపుతుంది. ౖఆహారంలో, నీటిలో మెక్రో ప్లాస్టిక్ చేరి నేరుగా మనుష్యుల ఆరోగ్యంపై త్వరగా ప్రభావం చూపే దశకు చేరుకున్నాం. ప్లాస్టిక్ వస్తువు లను కాల్చడంవల్ల విష వాయువులు వెలువడి ఆహారం, నీరు కలు షితం అవుతున్నాయి. అయినా ప్లాస్టిక్ ఉత్పత్తి పెరుగుతున్నది. సంవత్సరానికి 40 కోట్ల టన్నులకు చేరుకుందని అంచనా. ఈ ఉత్పత్తిని అరికట్టడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టకుంటే 2040లోపే ఇది రెట్టింపు అవుతుందని అంచనా. ప్లాస్టిక్ కాలుష్య సమస్య భౌగోళికంగా ఏదో ఒక దేశానికి పరిమిత మైనది కాదు. నదులు, మహాసముద్రాల ద్వారా, గాలి ద్వారా, వివిధ సరఫరా గొలుసు వ్యవస్థల ద్వారా, ఎగుమతులు, దిగుమతుల ద్వారా ఈ కాలుష్యం ఎల్లలు దాటుతున్నది. ముఖ్యంగా మైక్రో, నానోప్లాస్టి క్ల విషయంలో ఇది కచ్చితం! మొత్తం సముద్ర వ్యర్థాలలో ప్లాస్టిక్ 85 శాతం ఉందని అంచనా. ఈ వ్యర్థాలు సముద్ర జలచరాలకు ప్రాణ సంకటంగా మారాయి. జీవాల మనుగడ, సుస్థిర పునరుత్పత్తి సమస్యగా మారింది. సముద్రంలో చేరడం కాకుండా, 46 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి మీద గుట్టలుగా మిగులుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాల్లో 17 శాతం కాల్చేస్తున్నారు. కేవలం 15 శాతం పునర్వినియోగం అవుతోంది. ఈ రెండు ప్రక్రియల ద్వారానూ గాలి కాలుష్యం అవుతున్నది. ప్లాస్టిక్ ఉపయోగం క్రమంగా తగ్గించుకోవడమే సుస్థిర మార్గం. దీర్ఘకాలిక పరిష్కారం అంటే ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ పదార్థాలను వాడటం. మైక్రో ప్లాస్టిక్ ఇంకా తీవ్ర సమస్య ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోవడానికి వందల ఏండ్లు పడుతుందని మనందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా గమనించిన విషయం ఆందోళన కలిగిస్తున్నది. ఈ వ్యర్థాలు ఎండకు, వానకు, గాలికి, సముద్రంలో ఉప్పు నీటికి పగిలిపోతూ, చిన్న సూక్ష్మ పరి మాణంలోకి మారి, కంటికి కనపడని కణాలుగా, ఫైబర్గా మారు తున్నాయి. ఈ మైక్రో ప్లాస్టిక్... కణాలుగా, ఫైబర్ (నూలు)గా తాగే నీటిలో, జలచరాల శరీరాలలో చేరి, తరువాత క్రమంగా మనుష్యు లలో చేరుతున్నది. ప్లాస్టిక్ ఉత్పత్తిలో మైక్రో ప్లాస్టిక్ ఉత్పత్తి కూడా ఉన్నది. పెళ్లిళ్లలో ఒకరి మీద ఒకరు పోసుకునే చమ్కీలు, పుట్టిన రోజు కేకు కట్ చేసేటప్పుడు వాడుతున్న ప్లాస్టిక్ గోలీలు మైక్రో ప్లాస్టిక్ ఉత్పత్తులే. ఒకసారి వాడి పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్తో పాటు, అసలు అవసరం లేని (జీరో యూజ్) ప్లాస్టిక్ కూడా ఉత్పత్తి అవు తున్నది. అరటి పండు తొక్క తీసేసి ప్లాస్టిక్ కవర్ ప్యాక్ చేయడం, కొబ్బరి బోండాం ప్లాస్టిక్ కవర్లో పెట్టి అమ్మడం, పళ్లను ‘ఫోమ్’తో చేసిన తొడుగుల మీద పెట్టడం వంటివి అనవసర ప్లాస్టిక్ వినియోగంలోకి వస్తాయి. ప్యాకేజింగ్ పరిశ్రమ పూర్తిగా ప్లాస్టిక్ మీద ఆధారపడి, అనవసర వినియోగాన్ని ప్రజల మీద రుద్దుతున్నది. ఇటువంటి అనవ సర ప్లాస్టిక్ వినియోగం మీద ప్రభుత్వ నియంత్రణ అవసరం. మన జీవన శైలి వల్ల కూడా ప్లాస్టిక్ వినియోగం పెరుగుతున్నది. ప్లాస్టిక్ బాధ పోవాలంటే ఉత్పత్తి తగ్గడంతో పాటు దాని వినియోగం తగ్గాలి. అన్నింటికీ ప్లాస్టిక్ వాడే బదులు అవసరమైన వాటికే వాడితే వ్యర్థాలు తగ్గుతాయి. ప్రతి మనిషీ తన ప్లాస్టిక్ వినియోగం మీద దృష్టి పెట్టి, ప్రణాళిక ప్రకారం చేస్తే, వినియోగం తగ్గించవచ్చు. ప్రతి ఇంటిలో స్వల్ప మార్పులతో, భారీ త్యాగాలు చేయకుండా ప్లాస్టిక్ వినియోగం తగ్గించవచ్చు. అపార్ట్మెంట్ సంస్కృతి వల్ల కూడా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ అవుతున్నది. ప్రతి బహుళ అంతస్థుల నివాస సముదాయాలలో, గేటెడ్ కమ్యునిటీలలో ప్లాస్టిక్ ఆడిట్ చేసుకుని, పునర్వినియోగ పద్ధతులు అవలంబిస్తే ప్లాస్టిక్ డిమాండ్ తగ్గుతుంది. ప్రభుత్వం కూడా ప్రజా రవాణా వ్యవస్థను విస్తృత పరిస్తే ప్రైవేటు కార్ల వినియోగం తగ్గుతుంది. కార్లు తగ్గాయంటే, ఆ మేరకు విని యోగం ఉండదు. మనం ప్లాస్టిక్ వాడకున్నా ప్లాస్టిక్ భూతం స్పష్టమైన ప్రభావం చూపుతుంది. కర్బన ఉద్గారాల వల్ల భూతాపం పెరుగు తున్నట్లు, ప్లాస్టిక్ ఎవరో ఎక్కడో వాడినా దాని దుష్ప్రభావం వారితో పాటు మనం కూడా ఎదుర్కోవచ్చు. ఎవరి బాధ్యత ఎంత? 2022 ఫిబ్రవరిలో ఐక్యరాజ్యసమితి ‘పర్యావరణ అసెంబ్లీ’ ప్లాస్టిక్ కాలుష్యంపై అంతర్జాతీయ, చట్టబద్ధమైన ఒడంబడిక అభివృద్ధి చేయ డానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ‘ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్’ కమిటీ (ఐఎన్సీ) ద్వారా, ఈ ఒప్పందం 2024 చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. మొత్తం ప్లాస్టిక్ జీవిత చక్రంపై దృష్టి సారించి, సుస్థిరమైన ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఒక సమగ్ర విధానాన్ని ఈ ఒప్పందం ద్వారా సాధించవచ్చని ఆశిస్తు న్నారు. వనరుల సామర్థ్యం పెంచడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల సమ స్యను పరిమాణ పరంగా తగ్గిస్తూ చక్రాకార ఆర్థిక వ్యవస్థ వంటి పరిష్కరాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. 2022 డిసెంబర్లో ‘ఐఎన్సీ–1’ మొదటి సమావేశాల్లో చర్చలు జరిగాయి. ఒకసారి వాడి పడేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ను నిషేధించడం, ఉత్పత్తి మీద ఆంక్షలు విధించడం, మెరుగైన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలకు సంబంధించిన విధానాల కూర్పు పైన దృష్టి సారించారు. వివిధ వ్యక్తులు, వర్గాలకు సంబంధించి ఎవరికి ఎంత బాధ్యత ఉంటుంది అనే ప్రశ్నలపై కూడా దృష్టి పెట్టారు. ఉత్పత్తిదారుల మీద కూడా బాధ్యత ఉంది. అదనంగా వ్యర్థాల నిర్వహణలో సాధించాల్సిన మార్పులో సామాజిక న్యాయ కోణం కూడా చర్చించారు. వ్యర్థాల నిర్వహణ మీద ఆధారపడిన జీవనోపాధులకు నష్టం వాటిల్లకుండా చేపట్టవలసిన చర్యలు ఆలోచిస్తున్నారు. ఇక్కడ కొంత సున్నితత్వం అవసరం అని భావిస్తున్నారు. పారదర్శక పర్యవేక్షణ యంత్రాంగాల అవసరం, పర్యావరణానికి హాని కలిగించని ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ వంటివి ఈ ఒప్పందంలోని కీలక అంశాలు కానున్నాయి. ప్రపంచ ప్లాస్టిక్ ఒప్పందం, కాలుష్యం తగ్గించే చర్యల అమలుకు తీసుకునే నిర్ణ యాలు, చేపట్టే ప్రక్రియలలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యం. ప్రజలు పాల్గొనే విధంగా ఒప్పంద ప్రక్రియలను రూపొందించడం అవసరం. ఈ ఒప్పందం తయారీలో, అన్ని దేశాలు ఆమోదించే దశలలో ఎదు రయ్యే సవాళ్లు, తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజలలో అవగాహన పెరగాలని ఈ ఒప్పందం మీద ఆశ పెట్టుకున్నవాళ్ళు భావిస్తున్నారు. ప్లాస్టిక్ మీద ఈ ఒప్పందాన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి ప్రక్రియలతో అనుసంధానించేలా ముడిపెడితే బాగుంటుంది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి శిలాజ ఇంధనాలను తగ్గిస్తూ, ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం పెంచే క్రమంలో ప్లాస్టిక్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ప్లాస్టిక్ ఉత్పత్తి ముడి చమురు శుద్ధి నుంచి వస్తుంది కనుక. ముడి చమురు విని యోగం తగ్గితే ప్లాస్టిక్ వినియోగం తగ్గవచ్చు. ప్రత్యామ్నాయ ఇంధ నాలతో పాటు ప్లాస్టిక్కు కూడా ప్రత్యామ్నాయం తేవాలి. అయితే ఇదంత సులువు కాదు. కాగా, మనుషులు ధరించే దుస్తులలో పత్తి, పట్టు, ఉన్ని వంటి సహజమైనవి ప్రోత్సహిస్తే, వేల టన్నుల పాలిస్టర్ వస్త్ర వ్యర్థాలు తగ్గుతాయి. ఎక్కడ వీలైతే అక్కడ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులకు ప్రభుత్వం పెట్టుబడులు పెంచి, తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. భారతదేశంలో చేనేత రంగానికి ఊతం ఇస్తే ప్లాస్టిక్ తగ్గించవచ్చు. కాలుష్యం తగ్గుతుంది, ఉపాధి పెరుగుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థ లాభపడుతుంది. దొంతి నరసింహా రెడ్డి ,వ్యాసకర్త విధాన విశ్లేషకులు ‘ 90102 05742 (ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ కోసం ఐరాస ‘ఐఎన్సీ’ రెండో సమావేశాలు మే 29 నుంచి జూన్ 2 వరకు ఫ్రాన్స్లో జరగనున్నాయి.) -
ఏపీ: రాష్ట్రంలో సేకరించే ప్లాస్టిక్ చెత్తతో రహదారులు
-
గ్రామాల్లో రీసైక్లింగ్ రోడ్లు.. సేకరించే ప్లాస్టిక్ చెత్తతో రహదారులు
గ్రామాల్లో సిమెంట్, తారు రోడ్లను మాత్రమే ఇప్పటివరకు చూశాం. ఇకపై ప్లాస్టిక్ రోడ్లనూ చూడబోతున్నాం. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించిన ఏపీ సర్కారు.. ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్పైనా ప్రత్యేక దృష్టి సారించింది. వాడి పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలకు అర్థాన్ని.. ప్రయోజనాన్ని చేకూర్చేలా ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణానికి అనువుగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. సిమెంట్ పరిశ్రమల్లో వినియోగించే విధంగానూ రీసైక్లింగ్ యూనిట్లను సిద్ధం చేస్తోంది. సాక్షి, అమరావతి: పర్యావరణంతో పాటు భూగర్భ జలాలకు ప్రమాదకరంగా తయారైన ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు సేకరించి.. వాటిని రోడ్ల నిర్మాణంలో ఉపయోగించేలా రీసైక్లింగ్ చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. నియోజకవర్గానికి ఒకచోట ఈ తరహా రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా 160 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు గ్రామాల ఎంపిక సైతం పూర్తయింది. పట్టణాల తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతి ఇంటినుంచీ నేరుగా చెత్త సేకరణ ప్రక్రియను ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇలా సేకరించిన చెత్తను ఆయా గ్రామాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న చెత్త సేకరణ కేంద్రాల (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ల)లో ప్లాసిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు వేరు చేసి ఉంచుతారు. గ్రామాల వారీగా ఇలా వేరు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను వారానికి ఒకటి లేదా రెండు విడతలుగా ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్కు తరలించేలా ఒక వాహనాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతివారం రూట్ల వారీగా ఆ వాహనంతో అన్ని గ్రామాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తారు. అనంతరం ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను మెషిన్ల సాయంతో బండిల్స్ రూపంలో అణచివేసి.. ఆ తర్వాత చిన్నచిన్న ముక్కలు ముక్కలుగా మార్చి నిల్వ చేస్తారు. రోడ్ల నిర్మాణంలో వినియోగించేలా.. ప్లాస్టిక్ బాటిల్స్ వంటివి మట్టిలో కలవడానికి కనీసం 240 సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలు వర్షం నీటిని భూమిలో ఇంకిపోకుండా అడ్డుపడుతుంటాయి. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో పీఎంజీఎస్వై (గ్రామీణ సడక్ యోజన) కింద చేపట్టే రోడ్ల నిర్మాణంలో కంకరతో పాటు కొంతమేర ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్లాస్టిక్ కవర్లు వంటి వాటిని సిమెంట్ పరిశ్రమలలో మండించడానికి ఉపయోగించేలా ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే రీసైక్లింగ్ యూనిట్లలో సిద్ధం చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్ల నిర్మాణంలో ఉపయోగించాల్సి ఉంటుంది. రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా రోడ్డ నిర్మించే కాంట్రాక్టర్లకు ఎక్కడికక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను విక్రయించే ఆలోచన చేస్తున్నారు. రానున్న రోజుల్లో రోడ్ల నిర్మాణంలో వీటి వాడకం పెరిగే పక్షంలో జిల్లాల వారీగా ప్రత్యేక వేలం కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 232 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా 2021 అక్టోబర్ నుంచి క్లీన్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 232 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. వాటిలో స్థానికంగా అమ్మడానికి వీలున్న వాటిని గ్రామ పంచాయతీల స్ధాయిలోనే చిరు వ్యాపారులకు అమ్మేశారు. అమ్మకానికి పనికి రాని ప్లాస్టిక్ వ్యర్థాలను పర్యావరణానికి హాని కలిగించని రీతిలో నాశనం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి గ్రామాల్లొ సేకరించే ప్లాస్టిక్ వ్యర్థాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా రోడ్ల నిర్మాణం లేదా సిమెంట్ పరిశ్రమలో మండించడానికి ఉపయోగించేలా రీసైక్లింగ్ ప్రాసెస్ చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. -
ప్లాస్టిక్ రహితానికి మేము సైతం..!
మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగమనేది విడదీయలేని భాగమైపోయింది. తక్కువ ఖర్చుతో పాటు సులభంగా అన్ని అవసరాలకు ఉపయోగపడేవి కావడంతో వాటిపై పూర్తిగా ఆధారపడడం బాగా పెరిగిపోయింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వివిధ రూపాలు, రకాల్లో ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోవడంతో పలుచోట్ల కొత్త చిక్కులు మొదలయ్యాయి. దేశంలో ప్రతి నిమిషం దాదాపు 12 లక్షల ప్లాస్టిక్ బ్యాగులు ఉపయోగిస్తుండగా, కరోనా కాలంలో వీటి వినియోగం మరింతగా పెరిగింది. కోవిడ్ వ్యాప్తి భయాలు ప్రజల్లో విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్లాస్టిక్ కట్లరీ, కప్స్, కంటైనర్లు, లో–మైక్రాన్ కౌంట్ క్యారీ బ్యాగ్లు, గార్బేజ్ బ్యాగ్లు, మినరల్ వాటర్ బాటిళ్లు, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్న వస్తువుల ప్యాకేజింగ్ మెటీరియల్ వినియోగం ఎన్నో రెట్లు పెరిగింది. ఇప్పటికే యాభై మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న కవర్లు, వస్తువుల వినియోగంపై నిషేధం అమలుతో పాటు దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం లేదా ఒకసారి ఉపయోగించి పారేసే సింగిల్యూజ్ ప్లాస్టిక్స్ నియంత్రణకు కొంచెం నెమ్మదిగానైనా చర్యలు ప్రారంభమయ్యాయి. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణ లేదా ఆ వస్తువుల వినియోగం తగ్గించుకునే దిశలో కొన్ని స్వచ్ఛంద సంస్థలతో పాటు వ్యక్తులు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ప్రకృతికి, పర్యావరణానికి మేలు కలిగించే పద్ధతులు, విధానాల వ్యాప్తికి సామాజిక కార్యకర్తలు,సంస్థలు కృషిచేస్తున్నాయి. వారి అనుభవాలు, ప్లాస్టిక్ వినియోగం కట్టడికి వారు చేస్తున్న కృషి వివరాలు... ప్లాస్టిక్ నియంత్రణే ఆశయం మానసిక వికాసం సరిగా లేని ‘స్పెషల్ కిడ్స్’ కోసం హైదరాబాద్లోని మౌలాలిలో ఏర్పాటు చేసిన ‘ఆశయం’ స్కూల్ ద్వారా పర్యావరణ హితంగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్నామ్నాయంగా కొన్ని పర్యావరణహిత వస్తువుల తయారీకి ‘ఆశయం’ సంస్థాపకురాలు లక్ష్మి కృషి చేస్తున్నారు. న్యూస్పేపర్, బ్రౌన్పేపర్ ఉపయోగించి పేపర్ బాగ్స్ తయారు చేస్తున్నారు. ఆయా సంస్థలు, వ్యక్తుల అవసరాలకు తగ్గట్టుగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లకు ప్రత్యామ్నాయంగా వివిధ సైజుల్లో బ్యాగులు, ఇతర ఉత్పత్తులను అందిస్తున్నారు. ఇక్కడి పిల్లలతోనే వీటిని తయారు చేయడం, బయటి నుంచి తీసుకొచ్చిన మట్టి దివ్వెలపై కలర్స్, పెయింటింగ్స్ వేయించడం, డెకరేట్ చేయించడం వంటివి చేస్తున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలతో పాటు బట్టల స్టోర్లు, ఫుట్వేర్ షాపులు, కూరగాయలు, కిరాణా దుకాణాల వారు వీరి నుంచి పేపర్ బ్యాగ్లు కొనుగోలు చేస్తూ తమ వంతు చేయూతను ఇస్తున్నారు. అలవాట్లలో మార్పులతోనే అరికట్టగలం రోజువారీ మన అలవాట్లలో చిన్న చిన్న మార్చులు చేసుకోగలిగితే తప్పకుండా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నియంత్రించవచ్చు. గతం నుంచి మనది పర్యావరణహిత సమాజం. జీవనశైలిని మార్చుకుంటే చాలు గణనీయమైన మార్పులు తీసుకురావొచ్చు. పాత రోజుల్లోలాగా బయటికి వెళ్లేపుడు చేతిసంచి వెంట తీసుకెళ్లడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. మేము నిర్వహించే చేనేత సంతల్లో పాత న్యూస్పేపర్లను రీసైకిల్ చేసి తయారు చేసిన పేపర్బ్యాగ్లనే వాడుతున్నాం. దాదాపు పదేళ్ల నుంచి టూత్పేస్ట్ మానేసి పళ్లపొడి ఉపయోగిస్తున్నాం. బయటికి వెళ్లేపుడు స్టీల్ వాటర్బాటిళ్లు తీసుకెళతాం. ప్లాస్టిక్ టూత్బ్రష్ బదులు ‘బాంబూ బ్రష్’ వాడుతున్నాము. ప్లాస్టిక్ నియంత్రణకు ప్యాకేజ్డ్ ఫుడ్ మానేయడం ఆరోగ్యానికి కూడా మంచిది. పెళ్ళిళ్లు ఫంక్షన్లు, ఒకసారి ఉపయోగించి పడవేసే వస్తువుల వినియోగానికి సంబంధించి అరటిబెరడుతో తయారు చేసిన ఆకుప్లేట్లు, విస్తరాకుల వాడకాన్ని అలవాటు చేయొచ్చు. – సరస్వతి కవుల, సామాజిక కార్యకర్త పర్యావరణహిత మార్గంలో... ఇంజనీరింగ్ పట్టభద్రుడైన స్వర్గం భరత్ కుమార్ మంచి ప్యాకేజీతో వచ్చిన ఐటీ, ఇతర ఉద్యోగాలను కాదనుకుని 2018 నుంచి ‘ఎకో మేట్’– డెస్టినేషన్ ఫర్ ఎసెన్షియల్ అల్టర్నేటివ్స్–డీల్– పేరిట ‘ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ బిజినెస్ స్టార్టప్’ నిర్వహిస్తున్నారు. స్వచ్ఛందసంస్థలో పనిచేసిన అనుభవంతో ప్లాస్టిక్స్ ప్రత్యామ్నాయాలపై విస్తృత అధ్యయనంతో పర్యావరణహిత వస్తువుల తయారీపై ఇష్టం పెంచుకున్నారు. ప్లాస్టిక్ రహిత వస్తువులు, ప్రకృతి సహజమైన పద్ధతులు, సేంద్రియ వ్యవసాయం, సుస్థిర జీవనశైలి విధానాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు తనవంతు కృషి చేయాలని నిర్ణయించారు. పేపర్తో, చెక్కతో తయారు చేసిన పెన్సిళ్లు, పెన్స్, స్టేషనరీ ఐటెమ్స్, బాంబూ టూత్బ్రష్లు, గిన్నెలు తోమేందుకు కొబ్బరి పీచు స్క్రబ్బర్లు , బాడీ స్క్రబ్బర్లు, గుళ్లల్లో ఉపయోగించిన పువ్వులతో తయారు చేసిన అగరువత్తులు, క్లాత్ బ్యాగ్లు, జూట్ బ్యాగ్లు, ఆకుప్లేట్లు ఇలా ప్రతిదానికీ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా ఇతరత్రా రూపాల్లో ఇప్పుడిప్పుడే ప్రజల్లో ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన పెరుగుతోందని భరత్ చెబుతున్నారు. కార్పొరేట్, ఐటీ సెక్టర్ ఉద్యోగుల్లో కొంత అవగాహన ఏర్పడినా, మిగతా వర్గాల్లో ఇంకా మార్పు రావాల్సి ఉందని అంటున్నారు. వారి వారి సర్కిళ్లు, వాట్సాప్గ్రూప్ల ద్వారా ప్రచారంతో కొంతవరకు మార్పు వస్తోందని చెప్పారు. ఎకోఫ్రెండ్లీ లైఫ్స్టయిల్, సస్టయినబుల్ లివింగ్లో బెంగళూరు, పుణె నగరాలు దేశంలోనే ముందువరసలో ఉన్నాయన్నారు. ప్రకృతిసహజ వస్తువుల వ్యాప్తికి కృషి రోజువారీ ప్లాస్టిక్ వస్తువులు, రసాయనాల వినియోగం తగ్గింపు విషయంలో ప్రజల్లో మార్పు చాలా నెమ్మదిగా వస్తోంది. ప్లాస్టిక్ రహితం చేయడం లేదా ఆ వస్తువుల వినియోగం తగ్గించడమనేది క్షేత్రస్థాయి నుంచే మొదలు కావాలి. గత రెండేళ్లలో ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా దీపావళి సందర్భంగా లక్ష దాకా మట్టిదివ్వెలను అమ్మగలిగాను. గణేష్చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను తయారు చేశాం. కాలేజీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్గా విద్యార్థులతో టూర్ల సందర్భంగా మార్పు కోసం ప్రయత్నించాను. ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా మేమే స్వయంగా స్వచ్ఛమైన దేశీ ఆవుపేడతో తయారుచేసిన గొబ్బెమ్మలు, భోగిదండలు, పిడకలు, నవధాన్యాలు, సేంద్రియ పసుపు, కుంకుమ, రంగోలీ రంగులు, సేంద్రియ నువ్వులు, బెల్లం లడ్డూలు వంటివి సరసమైన ధరలకే అందుబాటులోకి తెస్తున్నాం. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా ప్లాస్టిక్, రసాయనాలతో కూడిన వస్తువులు ఉపయోగించకూడదని భావించాను. పళ్లు తోముకునే బ్రష్, పేస్ట్ స్థానంలో పళ్లపొడితో మొదలుపెట్టి సున్నిపిండి, ఇతర సహజ సేంద్రియ వస్తువులతో తయారుచేసిన సబ్బులు, పూజగదిలో రసాయనాలు లేని కుంకుమ, పసుపు, అగరవత్తులు వినియోగంలోకి తెచ్చాను. ఆర్గానిక్ పంటలు సొంతంగా పండించి వాటినే తింటున్నాం. గత ఐదేళ్లుగా గోరక్షకు ‘మురళీధర గోధామం గోశాల’ ఏర్పాటు చేసి ఆవులను కాపాడే ప్రయత్నంతో గో ఆధారిత వస్తువుల వినియోగం వ్యాప్తికి కృషి చేస్తున్నాం. – డా.సీహేచ్ పద్మ వనిత కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్, – కె.రాహుల్మురళీధర అనుసంథాన గో విజ్ఞానకేంద్రం -
15 లక్షల ఖాళీ బీరు సీసాలతో ఆలయం
ప్లాస్టిక్తోనే కాదు, గాజుతోనూ పర్యావరణానికి ముప్పే! ప్లాస్టిక్ ఎంతకాలమైనా మట్టిలో కలవదు. గాజు కొంతకాలానికి మట్టిలో కలిసిపోతుంది. ఆ లెక్కన ప్లాస్టిక్ కంటే గాజు మెరుగైనదే అయినా, గాజు తయారీ ప్రక్రియలో గాజును కరిగించడానికి అత్యధిక ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి. ఫలితంగా పెద్దమొత్తంలో కర్బన ఉద్గారాలు గాలిలోకి విడుదలై, పరిసరాల్లోని వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. వాడేసిన గాజుసీసాలను పునర్వినియోగంలోకి తేవడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని కొంతవరకైనా అరికట్టవచ్చని థాయ్లాండ్ శాస్త్రవేత్తలు భావించారు. వారి ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఫొటోల్లో కనిపిస్తున్న సీసాల ఆలయం. థాయ్లాండ్లోని సిసాకేత్ ప్రావిన్స్ ఖున్హాన్ ప్రాంతంలో ఉంది ఈ సీసాల ఆలయం. ఈ ఆలయ నిర్మాణం కోసం 1984 నుంచి ఖాళీ బీరుసీసాల సేకరణ మొదలుపెట్టారు. ఆలయ నిర్మాణానికి అంచనా వేసిన మేరకు 15 లక్షల ఖాళీసీసాలను సేకరించి, రెండేళ్లలో దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ ప్రాంగణంలో ఇదేరీతిలో 2009 నాటికి ఇరవై కట్టడాలను నిర్మించారు. వీటిలో ప్రార్థన మందిరాలు, శ్మశాన వాటిక, పర్యాటకుల కోసం స్నానపు గదులు, ఫౌంటెన్లు వంటివి ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా సీసాలతో నిర్మించినవే! ‘మిలియన్ బాటిల్ టెంపుల్’గా వార్తలకెక్కిన ఈ ఆలయం పేరు ‘వాట్ పా మహా చేది కేవ్’. సీసాలతో ఆలయం నిర్మించడానికి ముందు ఇక్కడ ఒక పురాతన బౌద్ధాలయం జీర్ణావస్థలో ఉండేది. దానిని ఇలా సీసాలతో జీర్ణోద్ధరణ చేశారు. ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించగానే, స్థానికులే కాకుండా థాయ్ ప్రభుత్వం కూడా తనవంతుగా లక్షలాది ఖాళీసీసాలను ఈ ఆలయానికి పంపింది. ఈ సీసాల ఆలయం థాయ్లాండ్లో పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారింది. థాయ్లాండ్కు వచ్చే పర్యాటకుల్లో చాలామంది ప్రత్యేకించి ఇక్కడకు వచ్చి, ఈ ఆలయం వద్ద నిలబడి ఫొటోలు దిగుతుంటారు. ఎందుకు నిర్మించారంటే..? పనిగట్టుకుని మరీ ఖాళీసీసాలతో ఆలయ జీర్ణోద్ధరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనుకుంటున్నారా? నిజానికి పర్యావరణాన్ని రక్షించుకోవలసిన అవసరం తీవ్రంగానే ఏర్పడింది. చుట్టూ సముద్రతీరం ఉండే థాయ్లాండ్ బీచ్లలో పర్యాటకుల కోలాహలం నిరంతరం ఉంటూనే ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణానికి ముందు– అంటే, 1984 నాటికి ముందు థాయ్ బీచ్లలో ఎక్కడ చూసినా వాడి పారేసిన ఖాళీ బీరుసీసాలు గుట్టలు గుట్టలుగా కనిపించేవి. సముద్రాన్నే మింగేసేంతగా ఖాళీ సీసాల గుట్టలు ఏర్పడటంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. థాయ్ ప్రభుత్వానికి కూడా ఇదో తలనొప్పి వ్యవహారంగా మారింది. సముద్రం కలుషితం కాకుండా ఉండేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకుంటే పరిస్థితి చెయ్యిదాటిపోయే ప్రమాదం ఉందని గుర్తించింది. అయితే, ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. తీరంలో గుట్టలుగా పేరుకుపోతున్న ఖాళీసీసాలను ‘ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. ఈ సమస్య పరిష్కారానికి మీ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోండి’ అని ప్రజలను కోరింది. బౌద్ధభిక్షువులను కూడా ఇదే కోరిక కోరింది. ప్రభుత్వం పిలుపుతో బౌద్ధభిక్షువులు ముందుకొచ్చారు. ‘ఖాళీసీసాలను మాకిచ్చేయండి. మేము ఇక్కడ ఆలయం నిర్మించుకుంటాం’ అని అడిగారు. ‘ఇవ్వడమేంటి? తీరానికి వెళ్లి మీరే కావలసినన్ని సీసాలను తీసుకెళ్లండి’ అని బదులిచ్చింది ప్రభుత్వం. లక్షలాది సీసాలను తెచ్చుకోవడం కొద్దిమంది బౌద్ధభిక్షువుల వల్ల సాధ్యమయ్యే పనికాదు. దీంతో ఆలయ ధర్మకర్తలు బాగా ఆలోచించి, సీసాల సేకరణ కోసం ప్రజల సహాయాన్ని కోరారు. ఒక్కరూ స్పందించలేదు. కొన్నాళ్లు ఓపికగా ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో మరో ప్రకటన చేశారు. ‘పరిశుభ్రతే పరమాత్మ. అందువల్ల అందరూ తలా ఓ చెయ్యి వేసి, దైవకార్యానికి మీ వంతు సహాయం చెయ్యండి. ఆలయ నిర్మాణానికి కలసిరండి. పర్యావరణ పరిరక్షణకు సహాయపడండి’ అని ప్రకటించడంతో ప్రజల్లో నెమ్మదిగా స్పందన మొదలయ్యింది. ఒక్కొక్కరే సీసాలు సేకరించి, ఆలయానికి ఇవ్వసాగారు. థాయ్ తీరంలో నెమ్మదిగా సీసాల గుట్టలు తరిగిపోసాగాయి. అలాగే ఆలయ నిర్మాణం వేగం పుంజుకుంది. రెండేళ్ల వ్యవధిలోనే ఇలా చక్కని సీసాల ఆలయం తయారైంది. వనరుల పునర్వినియోగానికి ఈ ఆలయం ఒక అద్భుతమైన ఉదాహరణ. - దినేష్ రెడ్డి -
Funday Cover Story: ఆర్.. ఆర్.. ఆర్
చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు కానీ ఇది కలియుగం! భూమికి మనమందరం కలిసి చేస్తున్న ద్రోహం ఎంత చెప్పుకున్నా తీరేది కానేకాదు. గాలి, నీరు.. భూమి.. ఖనిజాలు.. ఇలా భూమ్మీది వనరులన్నింటినీ... విచ్చలవిడిగా వాడేసిన ఫలితంగా ముంచుకొస్తున్న.... భూతాపోన్నతి, వాతావరణ మార్పుల ముప్పును ఎదుర్కోవాలంటే... ఒట్టిమాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టాల్సిందే! మానవాళి మొత్తం... మన మనుగడ కోసమే చేస్తున్న ఈ యుద్ధంలో.. అందరి తారక మంత్రం ఒకటే కావాలి. అదేమిటంటారా.... వాతావరణ మార్పుల గురించి కానీ... పెరిగిపోతున్న భూమి సగటు ఉష్ణోగ్రతల గురించి కానీ ఈ రోజు కొత్తగా చెప్పుకోవాల్సిందేమీలేదు. కనీసం రెండు దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు, ఐక్యరాజ్య సమితి నియమించిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ క్లైమేట్ చేంజ్ తరచూ అధ్యయన పూర్వకంగా విడుదల చేసిన నివేదికల్లో హెచ్చరిస్తూనే ఉంది. భూమి సగటు ఉష్ణోగ్రతలను ఈ శతాబ్దం అంతానికి 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ పెరిగితే పెనుముప్పు తప్పదని, సముద్ర తీర నగరాలన్నీ మునిగిపోవడం మొదలుకొని అకాల, తీవ్ర ప్రకృతి వైపరీత్యాలతో భూమిపై మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ఇప్పటివరకూ వెలువడిన ఆరు ఐపీసీసీ నివేదికలు స్పష్టం చేశాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విపత్తు ముంచుకొస్తోందని తెలిసినా.. జంతుజాతి వినాశనం అంచున కొట్టుమిట్టాడుతోందన్నా ప్రపంచదేశాలు ఇప్పటికీ వీటిని ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగకపోవడం!! బాధ్యులెవరు? ఖర్చులు ఎవరు భరించాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతూనే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు నెపం ఇంకొకరిపైకి నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇది మరెంతో కాలం కొనసాగే సూచనలు లేవు. నిరుడు యూరప్ మొత్తం కరవు చుట్టుముట్టింది. అలాగే ఎన్నడూ లేనంత తీవ్రమైన వరదలు పాకిస్థాన్ను పలకరించాయి. ఈ ఏడాది మొదట్లోనూ వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో అమెరికా మంచులో కూరుకుపోయింది. ఈ వైపరీత్యాలన్నీ వాతావరణ మార్పుల ప్రభావమేనని స్పష్టమైతేనైనా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రపంచదేశాలు ముందుకు కదులుతాయి. ఈ అంశం అలా పక్కనుంచితే... వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు శాస్త్రవేత్తలు చిరకాలంగా సూచిస్తున్న తారక మంత్రం రెడ్యూస్.. రీసైకిల్.. రీ యూజ్! క్లుప్తంగా ఆర్ఆర్ఆర్ అని పిలుచుకుందాం. వ్యక్తుల స్థాయిలో... ప్రభుత్వాలూ చేపట్టగల ఈ మూడు పద్ధతులను అమలు చేయగలిగితే.. ఒకవైపు వనరుల సమర్థ వినియోగం సాధ్యమవడమే కాకుండా... భూమి పది కాలాల పాటు పచ్చగా ఉండేందుకు అవకాశం ఎక్కువ అవుతుంది. ఎలా మొదలైంది? ఆర్ ఆర్ ఆర్ గురించి దశాబ్దాలుగా మనం వింటున్నాం. కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు తమదైన ప్రయత్నాలు చేస్తున్నాయి. చెత్తను తగ్గించుకునేందుకు, వనరులను ఆదా చేసుకునేందుకు, ఒక వస్తువు లేదా పదార్థాన్ని ఇంకో రూపంలోకి మార్చి మళ్లీ మళ్లీ వాడేందుకు తమదైన రీతుల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు అవసరమైన టెక్నాలజీ, పరికరాల రూపకల్పన సరేసరే. అంతా బాగుంది కానీ.. ప్రపంచమంతా ఒక ఉద్యమంలా సాగుతున్న ఈ ఆర్ ఆర్ ఆర్ ఎలా మొదలైంది? ఊహూ.. స్పష్టంగా ఎవరికీ తెలియదు. అయితే ఏటా ఏప్రిల్ 22న నిర్వహించే ఎర్త్ డేకు ఈ ఆర్ ఆర్ ఆర్కూ కొంత సంబంధం ఉందని చాలామంది అంగీకరిస్తారు. 1970లో అమెరికాలోని విస్కాన్సిన్ సెనేటర్ గేలార్డ్ నెల్సన్ ఈ ఎర్త్ డేను ప్రారంభించినప్పుడు ఆ దేశంలో సుమారు రెండు కోట్ల మంది వేర్వేరు ప్రాంతాల్లో పాల్గొన్నారు. జాతరలు, ప్రదర్శనలు, ఊరేగింపుల్లాంటివి నిర్వహించారు. తద్వారా పర్యావరణ పరంగా భూమికి జరుగుతున్న నష్టాన్ని, ప్రమాద నివారణకు వ్యక్తిగత స్థాయిలో చేయగల పనులను ఈ సందర్భంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించే సమయానికి అమెరికా మొత్తమ్మీద వాడి పారేసే వస్తువులతో పెద్ద సమస్యగా ఉండేదట. 1950లలో ఆర్థికంగా బాగా వృద్ధి చెందడంతో మొదలైన ఈ సమస్య 1970ల నాటికి పతాక స్థాయికి చేరుకుందన్నమాట. కుప్పల్లోనూ చెత్త పేరుకుపోయి ఉండేది. ఎర్త్ డే సందర్భంగా చెత్త సమస్యపై ప్రజల దృష్టి పడటంతో ప్రభుత్వం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ను సిద్ధం చేసింది. ఈ చట్టం కారణంగా వస్తువులను రీసైకిల్ చేయాల్సిన అవసరాన్ని తెలియజెప్పే రిసోర్స్ రికవరీ యాక్ట్ కూడా సిద్ధమైంది. ఈ సందర్భంలోనే అమెరికాలో ఈ రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ అనే పదం ప్రజల నోళ్లల్లో నానడం మొదలైంది. క్రమేపీ ఒక ఉద్యమంలా మారిందని అంటారు. ఆర్ ఆర్ ఆర్...ఇంతకీ వీటి పరమార్థం? ఆర్ ఆర్ ఆర్ పరమార్థం ఒక్క ముక్కలో చెప్పాలంటే దేన్నైనా అవసరమైనంత మేరకు మాత్రమే వాడుకోమ్మని. పిసినారిగా ఉండమని చెప్పినా తప్పేమీ కాదు. దీనివల్ల ఆర్థికంగా మనకు కొంచెం లాభం చేకూరడమే కాకుండా... భూమి మొత్తాన్ని కాపాడేందుకు మన వంతు సాయం చేసినట్టూ ఉంటుంది. అయితే ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి. భూమ్మీద ఉన్న వారందరూ చేయిచేయి కలిపినా రాగల ప్రమాదాన్ని పూర్తిగా నివారించలేము. తీవ్రత కొంచెం తగ్గవచ్చు అంతే. ప్రజలతోపాటు ప్రభుత్వాలు తగు విధానాలు సిద్ధం చేసి, తగినన్ని నిధులు, టెక్నాలజీలను సమకూర్చి కార్యాచరణకు దిగితేనే ప్రయోజనం. ఈ దిశగా ప్రభుత్వాలు ఇప్పటికే కొన్ని ప్రయత్నాలైతే చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్లలో మొదటిదైన రెడ్యూస్ విషయాన్ని పరిశీలిద్దాం. చెత్తకుప్పల్లోకి చేరే వ్యర్థాలను తగ్గించుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. ఇలా చెత్త తగ్గాలంటే మనం వాడే వనరులను కూడా మితంగా అవసరమైనంత మేరకే వాడుకోవాలి. అది కరెంటు కావచ్చు.. నీళ్లు కావచ్చు. ఇంకేదైనా వనరు, పదార్థం కావచ్చు. మితంలోనే పరమార్థమన్నమాట. వ్యక్తులుగా దీన్ని సాధించేందుకు కొన్ని చిట్కాలున్నాయి. మీలో కొందరు ఇప్పటికే వీటిని పాటిస్తూండవచ్చు కూడా. అవేమిటంటే... ఇంటికి కావాల్సిన వస్తువులను చిన్న చిన్న మొత్తాల్లో కాకుండా... నెలకు లేదా కొన్ని నెలలకు సరిపడా ఒకేసారి కొనేయడం. దీనివల్ల ప్యాకేజింగ్ కోసం వాడే ప్లాస్టిక్ గణనీయంగా తగ్గుతుంది. ఎక్కువ మోతాదుల్లో కొంటే ఖర్చులూ కలిసివస్తాయి. మళ్లీమళ్లీ వాడుకోగల సంచులను దగ్గరుంచుకుంటే మరికొంత ప్లాస్టిక్ను చెత్తకుప్పలోకి చేరకుండా నిలువరించవచ్చు. వాడి పారేసే వస్తువుల కంటే మళ్లీమళ్లీ వాడుకోగలవాటికే ప్రాధాన్యమివ్వండి. ఇంట్లో అవసరమైనప్పుడు.. అవసరమైన చోట మాత్రమే ఫ్యాన్లు, లైట్లు వాడటం ద్వారా విద్యుత్తును తక్కువగా వాడవచ్చు. కుళాయిల్లో, బాత్రూమ్ సింక్లలో లీకేజీలు లేకుంటే బోలెడంత నీళ్లు మిగుల్చుకోవచ్చు. వారంలో ఒక్క రోజు మాంసాహారం మానేసినా పాడి పశువుల పెంపకానికయ్యే వనరులు తగ్గి భూమికి మేలు జరుగుతుందంటారు నిపుణులు. విమాన ప్రయాణాలను తగ్గించుకోవడం, వీలైనప్పుడల్లా కాళ్లకు పనిచెప్పడం లేదా సైకిళ్లను ఉపయోగించడమూ రెడ్యూస్ కిందకే వస్తుంది. కర్బన ఉద్గారాలు మరింత ఎక్కువ కాకుండా ముందుగానే అడ్డుకోవడం అన్నమాట. ► 98 %: వాడిపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో (క్యారీబ్యాగుల్లాంటివి) చమురులాంటి శిలాజ ఇంధనాలతో తయారయ్యేవి. ► 7.5 – 19.9 కోట్ల టన్నులు: సముద్రాల్లోకి చేరి కాలుష్యం సృష్టిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల పరిమాణం. ► 450 ఏళ్లు: ప్లాస్టిక్ బాటిళ్లు నశించేందుకు పట్టే సమయం. ► 2800 కోట్లు: ఏటా చెత్తకుప్పల్లోకి చేరుతున్న గాజు బాటిళ్ల సంఖ్య. వీటిల్లో మూడొంతులు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి. ► 2021లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల టన్నుల కాగితాన్ని రీసైకిల్ చేశారు. చెత్తకుప్పల్లోకి చేరిన కాగితాల్లో ఇది 68 శాతం మాత్రమే. ఈ ఏడాది తయారైన కార్డ్బోర్డులో 91.4 శాతం రీసైకిల్ చేసిన కాగితం. ఒకే ఒక్క శాతం చెత్తకుప్పల్లోకి చేరే చెత్తలో అల్యూమినియం మోతాదు ఇది. అలసిపోయేంతవరకూ రీసైకిల్ చేసుకోగలగడం ఈ లోహపు ప్రత్యేకత కూడా. కానీ.. ఏటా దాదాపు 70 లక్షల టన్నుల అల్యూమినియం రీసైకిల్ కావడం లేదు. వాడి వాడి.. మళ్లీ వాడి... పర్యావరణ పరిరక్షణ తారక మంత్రం ఆర్ ఆర్ ఆర్లో రెండోది రీ యూజ్. పేరులో ఉన్న మాదిరిగానే వస్తువులను వీలైనంత ఎక్కువగా వాడటమే ఇది. నిజానికి ఈ విషయం భారతీయులకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో. చిరిగిన చీరలిక్కడే బొంతలవుతాయి.. అలాగే వాడేసిన తువ్వాలు తుండుగుడ్డ అయిపోతుంది. ప్లాస్టిక్ డబ్బాలు... పచారీ సామాను నిల్వకు వాడేదీ ఇక్కడే మరి!! మోజు తీరిన దుస్తులు అనా«థ శరణాలయాలకు చేరడమూ మనం చూస్తూంటాం. రీ యూజ్ వల్ల కలిగే అతిపెద్ద లాభం వాడదగ్గ వస్తువులు చెత్తగా కుప్పల్లోకి చేరకుండా నిలువరించడం. ఉన్నవాటినే ఎక్కువ కాలం వాడటం వల్ల కొత్తవి కొనే అవసరం తప్పుతుంది. తద్వారా డబ్బు ఆదాతోపాటు భూమికీ మేలు జరుగుతుంది. టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు సెకెండ్ హ్యాండ్ వస్తువులు కూడా విస్తృతంగా అందుబాటులో ఉంటున్నాయి. అవసరానికి తగ్గట్టు కొత్త ఉత్పత్తులను కాకుండా.. సెకెండ్ హ్యాండ్వి కొనగలిగితే వనరులను మిగుల్చుకోగలం. ప్రపంచమంతా.... ఆర్ ఆర్ ఆర్లలో ఇది చాలా పాపులర్. తరచూ అందరికీ వినిపించే రీసైక్లింగ్. వాడేసిన వస్తువుల రూపం, తీరుతెన్నులు మార్చి ఇంకో అవసరానికి వాడుకోవడాన్ని రీసైక్లింగ్ అనవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే వ్యర్థానికి కొత్త అర్థం చెప్పడమన్నమాట. ఈ రీసైక్లింగ్ జాబితాలోకి రాని వస్తువు అంటూ ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్లాస్టిక్, కాగితం, కాంక్రీట్, మానవ, జంతు, పశు, పక్షి వ్యర్థాలు ఇలా దేనైన్నా రీసైకిల్ చేసి వాటి నుంచి ప్రయోజనం పొందవచ్చు. ప్లాస్టిక్ లాంటి పదార్థాలను రీసైకిల్ చేయడం వల్ల గాలి, నేల, నీటి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. కొన్ని రకాల ప్లాస్టిక్ పదార్థాలు నశించిపోయేందుకు కొన్ని వందల సంవత్సరాల సమయం పడుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్లాస్టిక్ రీసైక్లింగ్, ప్రత్యామ్నాయాల కోసం విస్తృతస్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. రీసైక్లింగ్ విభాగంలోకి ఇటీవలే వచ్చి చేరిన కొత్త రకం వ్యర్థం ఈ–వేస్ట్. యూఎస్బీ డ్రైవ్లు మొదలుకొని, ఎయిర్పాడ్స్, స్మార్ట్ఫోన్స్, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తమ జీవితకాలం తరువాత వృథా అయిపోతూండటం వల్ల ప్లాటినమ్ వంటి విలువైన లోహాలకు డిమాండ్ పెరిగిపోతోంది. ఇక సేంద్రీయ వ్యర్థాల విషయానికి వస్తే... పొలాల్లోని వ్యవసాయ వ్యర్థాలు మొదలుకొని ఇళ్లలో మిగిలిపోయిన ఆహారం వరకూ చాలావాటిని కుళ్లబెట్టి సహజసిద్ధమైన ఎరువులు లేదా వంటగ్యాస్లను తయారు చేసుకోవచ్చు. గ్యారీ ఆండర్సన్ సృష్టి.. ఈ లోగో! ఆర్ ఆర్ ఆర్లు మూడు వేర్వేరు అంశాలు కావచ్చు కానీ.. వీటిని సూచించేందుకు వాడే గుర్తు లేదా సింబల్ మాత్రం ఒక్కటే. మూడు ఆరో గుర్తులతో ఒక వృత్తంలా ఉండే ఈ గుర్తును దాదాపు ప్రతి ప్యాకేజ్పైనా చూడవచ్చు. ఆసక్తికరమైన అంశం ఈ లోగోను రూపొందించింది ఎవరన్న విషయం. ఒక ప్రైవేట్ సంస్థ కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ అమెరికా పెట్టిన డిజైన్ పోటీల్లో పాల్గొన్న యూఎస్సీ గ్రాడ్యుయేట్ విద్యార్థి గ్యారీ అండర్సన్ దీన్ని డిజైన్ చేశారు. అప్పట్లో సీసీఏ రీసైక్లింగ్ పనిలోనూ ఉండటం వల్ల దాన్ని సూచించేందుకు లోగోను రూపొందించాలని పోటీ పెట్టారు. పోటీలో నెగ్గిన తరువాత ఆ లోగోతోపాటు గ్యారీ కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. ఎందరో మహానుభావులు... ఎనెన్నో ప్రయత్నాలు! భూతాపోన్నతి, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, వ్యక్తులు, సంస్థల స్థాయిల్లో పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విషతుల్యమైన కాలుష్యాలను వాతావరణం నుంచి తొలగించేందుకు, వాడకాన్ని తగ్గించేందుకు కొత్త టెక్నాలజీలూ అందుబాటులోకి వస్తున్నాయి. వాటిల్లో మచ్చుకు కొన్నింటి గురించి స్థూలంగా చూస్తే... ఓషన్ క్లీనప్ ప్రాజెక్టు... చెత్తకుప్పల్లోంచి నదుల్లోకి.. అటు నుంచి సముద్రాల్లోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి కొత్త రూపంలో ఆ వ్యర్థాలను వాడుకునేందుకు బోయన్ స్లాట్ అనే యువ ఔత్సాహిక శాస్త్రవేత్త చేపట్టిన ప్రాజెక్టు ఇది. సముద్రాల్లోని ప్లాస్టిక్లో అధికభాగం జల ప్రవాహాల ఫలితంగా పసిఫిక్ మహా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ ఎత్తున పోగుపడ్డాయి. ‘ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్’ అని పిలిచే ఈ చెత్తకుప్ప సైజు ఎంత ఉందో తెలుసా? ఫ్రాన్స్ దేశ వైశాల్యానికి మూడు రెట్లు... లేదా టెక్సస్ వైశాల్యానికి రెండు రెట్లు ఎక్కువ. అంకెల్లో చెప్పాలంటే కొంచెం అటు ఇటుగా 16 లక్షల చదరపు కిలోమీటర్లు! 2017 నాటి లెక్కల ప్రకారమే ఇక్కడ పోగుపడ్డ ప్లాస్టిక్ బరువు సుమారు 29.7 కోట్ల టన్నులని అంచనా. ఈ నేపథ్యంలో సముద్ర జీవులకు పెను ప్రమాదంగా పరిణమించిన ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ను తొలగించేందుకు 2013లో బోయన్ స్లాట్ అనే నెదర్లాండ్ కుర్రాడు ఓ వినూత్న ప్రయత్నం మొదలుపెట్టాడు. సముద్రపు అలల సాయంతోనే చెత్తను పోగుచేసి బయటకు తరలించేందుకు అవసరమైన టెక్నాలజీలను సిద్ధం చేశాడు. బోయన్స్లాట్ స్థాపించిన ఓషన్ క్లీనప్ సంస్థ ఐదేళ్ల కాలంలో ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్లో సగాన్నైనా ఖాళీ చేయాలని సంకల్పిస్తోంది. గత 30 రోజుల్లో ఓషన్ క్లీనప్ సంస్థ ఎనిమిది ఇంటర్సెప్టర్ల సాయంతో 1,11,804 కిలోల ప్లాస్టిక్ చెత్తను తొలగించింది. ఇప్పటివరకూ తొలగించిన చెత్త 20,68,237 కిలోలు. సముద్రాల్లో మాత్రమే కాకుండా... నదుల్లోకి చేరుతున్న ప్లాస్టిక్ను కూడా అక్కడికక్కడే ఒడిసిపట్టేందుకు బోయన్ స్లాట్ ప్రయత్నిస్తున్నాడు. డైరెక్ట్ కార్బన్ క్యాప్చర్... భూతాపోన్నతికి ప్రధాన కారణం? గాల్లో కార్బన్డైయాక్సైడ్ వంటి విష వాయువుల మోతాదు ఎక్కువ కావడం. అందుకేనేమో కొందరు ఈ సమస్యను నేరుగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే... గాల్లోని కార్బన్ డైయాక్సైడ్ను నేరుగా తొలగించేందుకు డైరెక్ట్ కార్బన్ క్యాప్చర్ పేరుతో పలు ప్రాజెక్టులు చేపట్టారు. పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టి గాలిని పోగు చేయడం.. అందులోని కార్బన్ డైయాక్సైడ్ను రసాయనాల సాయంతో తొలగించి వేరు చేయడం స్వచ్ఛమైన గాలిని మళ్లీ వాతావరణంలోకి వదిలేయడం ఈ ప్రాజెక్టుల పరమోద్దేశం. వేరు చేసిన కార్బన్ డైయాక్సైడ్ను భూమి అట్టడుగు పొరల్లో భద్రపరచడం లేదా కొన్ని ఇతర టెక్నాలజీ సాయంతో విలువైన ఇంధనం, ఇతర పదార్థాలుగా మార్చి వాడుకోవడం చెప్పుకోవాల్సిన అంశం. చిన్నా చితక కంపెనీలను వదిలేస్తే డైరెక్ట్ క్యాప్చర్ టెక్నాలజీలో చెప్పుకోవాల్సిన కంపెనీలు క్లైమ్వర్క్స్ ఒకటి. దీంతోపాటు కార్బన్ ఇంజినీరింగ్, గ్లోబల్ థెర్మోస్టాట్లు అనే రెండు కంపెనీలు కలిపి మొత్తం 18 చోట్ల ఫ్యాక్టరీలను స్థాపించి గాల్లోని కార్బన్ డైయాక్సైడ్ను వేరు చేస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీల్లో ఏడాది ఒక టన్ను నుంచి నాలుగు వేల టన్నుల సామర్థ్యమున్నవి ఉన్నాయి. అత్యధిక సామర్థ్యమున్న కంపెనీ ఏడాదికి ఎనిమిది వేల టన్నుల కార్బన్ డైయాక్సైడ్ను వాతావరణం నుంచి తొలగిస్తోంది. అమెరికాలో ఇప్పుడు ఏడాదికి పది లక్షల టన్నుల సామర్థ్యమున్న ఫ్యాక్టరీ ఒకటి వచ్చే ఏడాదికల్లా ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా... మరికొన్ని సంస్థలు కూడా గాల్లోని కార్బన్ డైయారక్సైడ్ను సమర్థంగా పునర్వినియోగించుకునేందుకు కొన్ని టెక్నాలజీలను సిద్ధం చేశాయి. వీటిల్లో రెండు మన దేశంలోనే ఉండటం విశేషం. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న చక్ర ఇన్నొవేషన్స్ సంస్థ డీజిల్ జనరేటర్లు, బస్సుల పొగ గొట్టాల నుంచి వెలువడే కాలుష్యం నుంచి కర్బనాన్ని వేరు చేసి ప్రింటింగ్ ఇంక్గా మారుస్తూంటే... పుణె కేంద్రంగా పనిచేస్తున్న ఇంకో కంపెనీ కార్బన్ క్రాఫ్టస్ డిజైన్ వాటితో భవన నిర్మాణాల్లో వాడే టైల్స్గా మారుస్తోంది. రీసైకిల్కు బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి. కానీ.. రీయూజ్, రెడ్యూస్లకు సంబంధించినవి తక్కువే. అలాగని ప్రయత్నాలు జరగడం లేదని కాదు. ముంబైలో ఓ యువకుడు చెత్తకుప్పల్లోకి చేరిన తెల్లటి క్యారీబ్యాగులను సేకరించి వాటితో సరికొత్త కాలిజోళ్లు సిద్ధం చేస్తూండటం రీయూజ్కు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే.. టెట్రాప్యాకులను చిన్న చిన్న ముక్కలు చేసి వాటితో కుర్చీలు, బల్లలు తయారు చేసి ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తోంది ముంబైలోని ఓ స్వచ్ఛంద సంస్థ. ఇలా ప్రతి దేశంలో, ప్రతి సమాజంలోనూ వ్యక్తులు, సంస్థలు కూడా ఉడతాభక్తి చందంగా ఈ భూమిని రక్షించుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి!! -గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
అద్భుత సృష్టి.. ప్లాస్టిక్ స్పూన్లతో దుర్గామాత విగ్రహం
డిస్పూర్: ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు అస్సాంలోని దుబ్రీ జిల్లాకు చెందిన సంజీవ్ బాసక్ అనే వ్యక్తి దుర్గా నవరాత్రులను వేదికగా చేసుకున్నాడు. పరిశ్రమలు, మెడికల్ వ్యర్థాలను ఉపయోగించి వివిధ కళాకృతులతో అవగాహన కల్పిస్తున్నాడు. వ్యర్థాలను తగ్గించాలని చెప్పేందుకు వివిధ ఆకృతులతో దుర్గా మాత విగ్రహాలను తయారు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు బాసక్. 2015 తొలుత థర్మకోల్తో 14 అడుగుల దుర్గమాత విగ్రహాన్ని రూపొందించారు బాసక్. అప్పటి నుంచి ప్రతిఏటా ఇలా వివిధ వ్యర్థ పదార్థాలతో విగ్రహాలు రూపొందిస్తూ అవగాహన కల్పిస్తున్నాడు. అందులో భాగంగానే ఈఏడాది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్పూన్లతో దుర్గమాత విగ్రహాన్ని తయారు చేశాడు బాసక్. ప్రస్తుతం ఈ దుర్గామాత విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్పూన్లతో అస్సాంలో రూపొందించిన దుర్గామాత విగ్రహం ఇదీ చదవండి: టైమ్ బ్యాడ్ అంటే ఇదేనేమో.. సీఎం గెహ్లాట్కు ఊహించని షాక్! -
1,000 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలతో మహాత్ముడి విగ్రహం
లక్నో: జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్రంతో పాటు స్వచ్ఛభారత్ మిషన్పైనా ప్రజల్లో అవగాహన కల్పించారు. స్వచ్ఛాభారత్ మిషన్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహాత్ముడి విగ్రహంతోనే అవగాహన కల్పిస్తంది ఉత్తర్ప్రదేశ్లోని నోయిడా నగరపాలక సంస్థ. క్విట్ ఇండియా ఉద్యమం 80వ వార్షికోత్సవం సందర్భంగా 20 అడుగుల మార్చింగ్ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి రూపొందించారు. హెచ్సీఎల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో నోయిడా అడ్మినిస్ట్రేషన్ సుమారు 1,000 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి విగ్రహం తయారు చేసింది. ఈ విగ్రహాన్ని సెక్టార్ 137లో ఏర్పాటు చేశారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు గుర్తు చేసేలా మహాత్ముడి విగ్రహాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు. ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్పై జులై 1వ తేదీ నుంచి నిషేధం విధించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు కృషి చేస్తూనే ఉన్నారు. మరోవైపు.. రాజస్థాన్లో ఖాళీ పాల ప్యాకెట్లు తీసుకొస్తే లీటర్ పెట్రోల్పై డిస్కౌంట్ ఇస్తున్నారు ఓ పెట్రోల్ పంపు యజమాని. ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలను ఇష్టారీతిలో ఎక్కడపడితే అక్కడ పడేయకుండా అవగాహన కల్పించేందుకే ఇలా చేస్తున్నట్లు చెప్పారు అశోక్ కుమార్ ముంద్ర. Unveiled 20ft tall statue of #MarchingBapu installed by HCL Foundation at Sec-137 Noida. The Structure has been made using 1000 kg of Plastic Waste as a tribute to Mahatma Gandhi's #SwachhBharat Mission. @PankajSinghBJP @tejpalnagarMLA @noida_authority @CeoNoida @Manojguptabjp pic.twitter.com/LaTvpK4aQ8 — Dr. Mahesh Sharma (@dr_maheshsharma) August 8, 2022 ఇదీ చదవండి: Viral: 16 ఏళ్ల బాలుడి ముక్కు కొరికేసిన రాజకీయ నేత.. అంత కోపం దేనికో? -
వామ్మో కోవిడ్ వ్యర్థాలు
కోవిడ్–19.. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి. దాని నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా జనం మాస్కులు, చేతికి ప్లాస్టిక్ తొడుగులు, పీపీఈ కిట్లు, కరోనా టెస్టింగ్ కిట్లు, ప్లాస్టిక్ శానిటైజర్ సీసాలు విపరీతంగా ఉపయోగించారు. వీటిలో చాలావరకు ఒకసారి వాడి పారేసేవే. ఇవన్నీ చివరికి ఏమయ్యాయో తెలుసా? వ్యర్థాలుగా మారి సముద్రాల్లో కలిసిపోయాయి. ఎంతగా అంటే ఏకంగా 25,000 టన్నులకుపైగా పీపీఈ కిట్లు, ఇతర కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలు, నదులు, చెరువుల్లోకి చేరుకున్నాయి. ఇంకా చేరుతూనే ఉన్నాయి. ఇవి జల వనరుల్లోని జీవజాలం పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. జీవ జాతులకు ప్రత్యక్ష ముప్పు 2019 డిసెంబర్లో కరోనా మహమ్మారి జాడ తొలుత చైనాలో బయటపడింది మొదలు 2021 ఆగస్టు వరకే 193 దేశాల్లో ఏకంగా 84 లక్షల టన్నుల కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడినట్లు అంచనా. వీటిలో ఏకంగా 70 శాతం జల వనరుల్లోకి చేరుకున్నాయని చెబుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సురక్షితంగా నిర్వీర్యం చేయడానికి సరైన సదుపాయాలు లేకపోవడమే ప్రధాన సమస్య అంటున్నారు. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ప్రపంచమంతటా నెలకు ఏకంగా 129 బిలియన్ల మాస్కులు, 65 బిలియన్ల గ్లౌజ్లు వాడేసినట్టు అంచనా. వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో ఇవి వ్యర్థాలుగా మారిపోయాయి. మాస్కు.. ప్లాస్టిక్ బాంబు ఒకసారి వాడి పారేసే ఫేస్ మాస్కులను ప్లాస్టిక్ బాంబుగా పరిశోధకులు అభివర్ణించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మాస్క్లు, పీపీఈ కిట్లు, టెస్టింగ్ కిట్ల ముప్పు ఇప్పటికిప్పుడు ప్రత్యక్షంగా అనుభవంలోకి రాకున్నా రానున్న దశాబ్దాల్లో మాత్రం వాటి ప్రభావం దారుణంగా ఉంటుందని చెప్పారు. భూమిపై, సముద్రంలో ఉంటే జీవజాలానికి ప్రమాదం తప్పదని, వ్యర్థాల నిర్వహణపై ప్రపంచదేశాలు ఇప్పటికైనా దృష్టి పెట్టాలని సూచించారు. వేస్ట్ మేనేజ్మెంట్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవాలని, సామర్థ్యం పెంచుకోవాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారులు దాడి చేస్తే పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఇప్పటి నుంచి సన్నద్ధం కావాలని ప్రభుత్వాలకు హితవు పలికారు. వాడి పారేసిన పీపీఈ కిట్లు, మాస్క్ల కుప్పల్లో పక్షులు చిక్కుకుపోయి విలవిల్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాల్లో అత్యధికంగా ఆసుపత్రుల నుంచి వెలువడినవే కావడం గమనార్హం. ఇవీ ప్రత్యామ్నాయాలు... ► చేతులు శుభ్రం చేసుకోవడానికి ప్లాస్టిక్ సీసాల్లో వచ్చే శానిటైజర్ కంటే వేడినీరు, సబ్బు వాడుకోవడం ఉత్తమం. సబ్బులు ఇప్పుడు భూమిలో సులభంగా కలిసిపోయే ప్యాకేజింగ్లో వస్తున్నాయి. ప్లాస్టిక్ సీసాల్లోని హ్యాండ్ శానిటైజర్లు కాకుండా సబ్బులు వాడుకుంటే పర్యావరణానికి ఎంతోకొంత మేలు చేసినట్టే. ► సింగిల్ యూజ్ ఫేస్మాస్క్లు వాడితే ప్రతి ఏటా కోట్లాది టన్నుల వ్యర్థాలు పేరుకుపోతాయి. వీటికంటే పునర్వినియోగ మాస్క్లు మంచివి. అంటే శుభ్రం చేసుకొని పలుమార్లు వాడుకునేవి. వీటిని వాషబుల్ మాస్క్లు అని పిలుస్తున్నారు. వీటిని పర్యావరణహిత మెటీరియల్తో తయారు చేస్తున్నారు. ► ప్లాస్టిక్ ముప్పు తెలిసినవారూ కరోనా సమయంలో వైరస్ భయంతో ప్లాస్టిక్ బ్యాగ్లు వాడారు. కానీ కాగితపు సంచులు, బట్ట సంచులు మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. ► హోటళ్లలో వాడే ప్లాస్టిక్ పొర ఉన్న కాగితపు కప్పులు లక్షల టన్నుల వ్యర్థాలుగా మారుతున్నాయి. గాజు, పింగాణి గ్లాసులను వేడి నీరు, సబ్బుతో శుభ్రం చేసి వాటిని మళ్లీ ఉపయోగించుకోవడం దీనికి మంచి ప్రత్యామ్నాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పుడమికి ప్రాణాంతకంగా ప్లాస్టిక్
సాక్షి, అమరావతి: నేలను, నీటిని, గాలిని కలుషితం చేస్తూ అత్యంత ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ ప్రపంచాన్ని వదలనంటోంది. మన దేశంలో ఒక వ్యక్తి ఏడాదికి సగటున నాలుగు కిలోల ప్లాస్టిక్ను వాడి పారేస్తున్నాడు. ఈ ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి 1000 సంవత్సరాలు పడుతుందని అంచనా. ప్లాస్టిక్ బాటిళ్లకు 450 ఏళ్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులు కుళ్లిపోవడానికి 30 ఏళ్లకు పైగా పడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కానీ అది మట్టిలో కలిసే లోపు అపార నష్టాన్ని కలిగిస్తుంది. ఇలా వాడి పారేసే ప్లాస్టిక్ ఇంటింటా, వీధుల్లో, రోడ్లపైన, చెత్తకుప్పల్లో, కాలువల్లో, చెరువుల్లో, నదుల్లో, చివరికి సముద్ర తీరాల్లో కూడా పేరుకుపోతోంది. సమస్త జీవరాశికి ప్రాణాంతకంగా పరిణమించింది. ప్లాస్టిక్ వాడకంపై నిషేధం ఉన్నప్పటికీ, అమలు, ఆచరణలో వైఫల్యం వల్ల రోజురోజుకు దీని బెడద పెరిగిపోతోంది. గతేడాది దేశంలో 35 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడినట్టు కేంద్ర ప్రభుత్వం లెక్క తేల్చింది. గత ఐదేళ్లలో వీటి ఉత్పత్తి రెట్టింపయిందని, సగటు వార్షిక పెరుగుదల 21.8 శాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. 2015–16లో 15.89 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తయితే, 2018–19లో 30.59 లక్షల టన్నులు, 2019–20లో 35 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి అయ్యాయని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి ఇటీవల పార్లమెంట్లో చెప్పారు. ప్రపంచంలో ఉత్తమ నియంత్రణ దేశాలు ప్రపంచంలో ప్లాస్టిక్ బ్యాగులు, సీసాలు, కట్లర్స్, స్ట్రాలు, కాఫీ స్టిరర్స్ వంటి వాటిని నిషేధించిన మొట్టమొదటి దేశం కోస్టారికా. ఇది యూఎన్వో అందించే అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ను 2019లో అందుకుంది. ఈ దేశంలో 2021 నుంచి 80 శాతం ప్రకృతికి హాని చేయనివి, పునర్ వినియోగించదగ్గ వస్తువులను మాత్రమే వినియోగిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ► జమైకా 2019 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దిగుమతిని నిషేధించింది. ఈ దేశంలో పర్యావరణ అనుకూలం వస్తువులనే తయారు చేస్తున్నారు. ► ఆఫ్రికాలోని దాదాపు 34 దేశాలు ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించాయి. రువాండా పదేళ్ల క్రితమే ప్లాస్టిక్ సంచులను నిషేధించింది. ► ఇండోనేసియా 2018 నుంచి ప్లాస్టిక్ బ్యాగ్లు, స్ట్రాలను నిషేధించింది. 2025 నాటికి ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం 70 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ► న్యూజిలాండ్ దేశం 2019లోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులను పూర్తిగా నిషేధించింది. లోరల్, కోకొకోలా, నెస్లే వంటి 12 అంతర్జాతీయ కంపెనీలు 2025 నాటికి 100 శాతం కంపోస్ట్ చేయదగిన ప్యాకేజింగ్ను అమలు చేస్తామని ఆ ప్రభుత్వానికి హామీనిచ్చాయి. ► జర్మనీ 56.1 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 53.8 శాతం, దక్షిణ కొరియా 53.7 శాతం, వేల్స్ 52.2 శాతం, స్విట్జర్లాండ్ 49.7 శాతం రీసైక్లింగ్ చేస్తున్నాయి. ఢిల్లీదే అగ్రస్థానం ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ఢిల్లీ మహానగరం మొదటి స్థానంలోఉంది. ఇక్కడ ఏటా 2,51,850 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. 1,56,767 టన్నులతో కోల్కతా రెండో స్థానంలో ఉంది. చెన్నై 1,56,731 టన్నులతో తర్వాతి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2020–21 నాటికి ప్లాస్టిక్ వ్యర్థాలు 70 వేల టన్నులుగా గుర్తించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద 124 ప్లాస్టిక్ తయారీ యూనిట్లు, ఆరు రీసైక్లింగ్ పరిశ్రమలు నమోదు చేసుకున్నాయి. కానీ అనధి కారిక తయారీ సంస్థలు 400 వరకు ఉంటాయని అంచనా. పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతు న్న సరుకుపై లెక్కలు లేవు. అనధికారిక ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలు బీహార్లో అత్యధికంగా 43 శాతం, తమిళనాడులో 26 శాతం, మహరాష్ట్రలో 13 శాతం ఉన్నాయి. ఇవి విచ్చలవిడిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను ఉత్పత్తి చేస్తున్నాయి. 12 శాతమే రీసైక్లింగ్ ప్లాస్టిక్ వ్యర్థాలలో 12 శాతం మాత్రమే రీసైక్లింగ్ చేస్తున్నారని, 20 శాతం బహిరంగ ప్రదేశాల్లో తగులబెడుతున్నట్టు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) నివేదిక తెలిపింది. మిగిలిన 68 శాతం భూమిలో, నీటిలో కలుస్తున్నట్టు తేల్చింది. చట్ట ప్రకారం ప్లాస్టిక్ తయారీ సంస్థలు అవి ఉత్పత్తి చేస్తున్న వాటిలో 70 శాతం వ్యర్థాలను రీసైక్లింగ్ చేయాలి. కానీ ఈ నిబంధన సరిగా అమలు కావడంలేదు. దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం ఉన్నప్పటికీ, దాని వాడకంపై నియంత్రణ లేదు. దీంతో జూలై 1వ తేదీ నుంచి 75 మైక్రాన్లు, ఆపై మందం గల ప్లాసిక్ సంచులు, బయో డిగ్రేడబుల్ కవర్లను మాత్రమే ఉత్పత్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి 120 మైక్రాన్లు, ఆపై మందం గలవాటినే ఉత్పత్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్తో కొన్ని నష్టాలివీ.. ► భూసారం పెరగకుండా అడ్డుపడుతుంది ► క్లోరినేటెడ్ ప్లాస్టిక్తో మట్టిలో విష రసాయనాలు చేరుతున్నాయి. అ వి భూగర్భ జలాల్లో కలిసి మానవాళి, ప్రాణికోటికి హానిచేస్తున్నాయి. ► ఏటా పక్షులు, చేపలు, జంతువులు ప్లాస్టిక్ వల్ల చనిపోతున్నాయి. అంతరించిపోతున్న ప్రాణుల్లో దాదాపు 700 జాతులు ప్లాస్టిక్ వల్ల ప్రభావితమైనట్లు గుర్తించారు. ► మనం తినే జలచరాల్లో మైక్రో ప్లాస్టిక్, నానో ఫైబర్ వ్యర్థాలను కూడా కనుగొన్నారు. ► బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను మండించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉత్పత్తి అవుతోంది. ఇది 60 లక్షల మంది మరణాలకు కారణమ వుతున్నట్టు అంచనా. బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం వల్ల శ్వాసకోశ రుగ్మతలు వస్తున్నాయి. ప్లాస్టిక్ పాలిమర్ అవశేషాలతో క్యాన్సర్, ఎండోక్రైన్ గ్రంధి దెబ్బతినడం, చర్మవ్యాధులు సోకుతున్నాయి. ► ప్లాస్టిక్లో బిస్ఫినాల్–ఏ, థాలేట్స్, డయాక్సిన్స్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ (పీఏహెచ్), పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్ (పీసీబీస్), స్టైరిన్ మోనోమర్, నానిల్ఫెనాల్ వంటి విష పదార్థాలు ఉంటాయి. ఇవి మానవుల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తిని నిరోధిస్తాయి. పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. దేశానికి సిక్కిం ఆదర్శం ప్లాస్టిక్ నిషేధంలో సిక్కిం రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. దేశంలోనే మొదటిసారిగా సిక్కిం రాష్ట్రం 1998లోనే ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ను నిషేధించింది. ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించిన మొదటి రాష్ట్రం కూడా ఇదే. 2016లో ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాలలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వాడకాన్ని నిషేధించింది. దీంతో ఈ రాష్ట్రంలో ప్యాస్టిక్ వ్యర్థాలు 5.99 టన్నులకు తగ్గిపోయింది. దీని తర్వాత మిజోరాం(13.30 టన్నులు), త్రిపుర 26.2 టన్నులు), మేఘాలయ (1,263 టన్నులు) ఉన్నాయి. -
ఈ 'రోబో చేప'తో సముద్రాలు క్లీన్.. ప్లాస్టిక్ను తినేస్తుందటా!
బీజింగ్: సముద్రాల్లో మాటువేసిన ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ దేశాలకు ఇప్పుడొక పెద్ద సమస్యగా మారిపోయింది. భూమిపై అన్ని సముద్రాల్లో 19.90 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు నిపుణుల అంచనా. వీటిని తొలగించి, మహాసాగరాలను పరిశుభ్రంగా మార్చడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. సముద్రాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ సమస్యకు ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు చైనా శాస్త్రవేత్తలు. మెక్రోప్లాస్టిక్ను తినే రోబో చేపను తయారు చేశారు. ప్రపంచంలోని కలుషితమైన సముద్రాలను శుభ్రపరిచేందుకు ఏదో ఒకరోజు తమ రోబో ఉపయోగపడుతుందని నైరుతి చైనాలోని సిచువాన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. స్పర్శకు మృదువుగా, కేవలం 1.3 సెంటీమీటర్లు (0.5 అంగుళాలు) పరిమాణంలోని ఈ రోబోలు ఇప్పటికే తక్కువ లోతైన నీటిలోని మైక్రోప్లాస్టిక్లను పీల్చుకుంటున్నట్లు తేలింది. అయితే.. అత్యంత లోతైన నీటిలోని మెక్రోప్లాస్టిక్ను సేకరించటమే లక్ష్యంగా పరిశోధకుల బృందం కృషి చేస్తోంది. అంతే కాదు ఈ రోబోల ద్వారా ఎప్పటికప్పుడు సముద్రాల కాలుష్యంపై వివరాలు తెలుసుకునేలా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు వాంగ్ యుయాన్ అనే శాస్త్రవేత్త. 'మేము అత్యంత తేలికపాటి సూక్ష్మీకరించిన రోబోట్ను తయారు చేశాం. దీనిని చాలా విధాలుగా ఉపయోగించవచ్చు. బయోమెడికల్, ప్రమాదక పనుల్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. అయితే.. మేము ప్రధానంగా మెక్రోప్లాస్టిక్ను సేకరించటంపైనే దృష్టి సారించాం. ఇది ఒక నమూనా రోబో మాత్రమే. దీనిని పలుమార్లు ఉపయోగించవచ్చు. ' అని తెలిపారు. ఈ బ్లాక్ రోబోట్ చేప కాంతి ద్వారా వికిరణం చెంది.. దాని రెక్కలను తిప్పడం, శరీరాన్ని కదిలిస్తుంది. ఇతర చేపలతో ఢీకొట్టకుండా కాంతి ద్వారా ఆ రోబో చేపను శాస్త్రవేత్తలు నియంత్రించవచ్చు. ఒకవేళ ఏదైనా చేప దానిని మింగేస్తే సులభంగా జీర్ణమయ్యేలా పోలియురెథేన్తో తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. కాలుష్యకారకాలను ఈ చేపలు ఆకర్షిస్తాయి. అలాగే.. ఏదైన ప్రమాదం జరిగినప్పుడు వాటిని అవి పునరుద్ధరించుకుంటాయి. సాధారణ రోబోల కన్నా ఇవి 2.76 రెట్లు వేగంగా ఈదుతాయి కూడా. ఇదీ చూడండి: భూగోళమంతటా ప్లాస్టిక్ భూతం.. సవాళ్లు ఎన్నున్నా.. స్వచ్ఛ సాగరం -
పర్యావరణహితం.. ప్లాస్టిక్ రహితం
వెనకటికి ఒక నక్క భూమి దగ్గర అప్పు చేసిందట. తీసుకున్న అప్పును తీర్చలేకపోయింది. ఇక అప్పటి నుంచి భూమి నుంచి తప్పించుకోవడానికి ఎక్కడెక్కడికో వెళుతుంది. ఎక్కడికి వెళ్లి ఏంలాభం? ఎక్కడ దాక్కున్నా... భూమే కనిపిస్తుంది! పర్యావరణం పట్ల బాధ్యతారాహిత్యం కూడా అలాంటిదే. ఎంత తప్పించుకోవాలని చూసినా, ఎన్ని సాకులు వెదుక్కున్నా... భూమి కనిపిస్తుంది. బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తుంది. కొందరు మాత్రం భూమాతతో శభాష్ అనిపించుకుంటారు. ఆ కోవకు చెందిన మహిళ అహుజ... ఒకసారి వాడి పారేసే(సింగిల్ యూజ్) ప్లాస్టిక్పై నిషేధం అమల్లోకి వచ్చింది. పర్యావరణప్రేమికులలో హర్షం వ్యక్తం అయింది. ఎంతోమంది, ఎన్నో విధాలుగా వ్యక్తిగత స్థాయిలో పర్యావరణహిత ఉద్యమాలకు, జీవనశైలులకు ఊపిరిపోయడం వల్లే ఇలాంటి నిషేధం ఒకటి సాధ్యం అయింది. ఇలాంటి వారిలో ముంబైకి చెందిన చైట్సీ అహుజ ఒకరు. మార్కెటర్, ఎర్త్ అడ్వోకెట్ అయిన అహుజ గత అయిదు సంవత్సరాలుగా ప్లాస్టిక్–రహిత జీవనశైలిని అనుసరిస్తుంది. తాను అనుసరించడమే కాదు మిగిలిన వారిని కూడా తన మార్గంలో తీసుకువెళుతుంది. ‘బ్రౌన్ లివింగ్’ స్థాపకురాలైన అహుజ దేశంలో తొలిసారిగా ప్లాస్టిక్–ఫ్రీ మార్కెట్కు శ్రీకారం చుట్టింది. బ్రౌన్ లివింగ్లో అన్ని ఆర్డర్ల ప్యాక్లు ప్లాస్టిక్ మెటీరియల్కు దూరంగా ఉంటాయి. ‘బ్రౌన్ లివింగ్ అనేది బ్రాండ్స్, కంపెనీలకు సంబంధించిన సేంద్రీయ, పర్యావరణహిత ఉత్పత్తులను విక్రయించే వేదిక మాత్రమే కాదు, మన జీవనశైలిలో బలమైన మార్పు తీసుకువచ్చే నిర్మాణాత్మక విధానం కూడా’ అనే పరిచయ వాక్యాలు ఆకట్టుకుంటాయి. ‘బ్రౌన్ లివింగ్’ కంపెనీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని చెట్లు నాటడానికి సంబంధించిన కార్యక్రమాలకు వెచ్చిస్తారు. ప్లాస్టిక్ వస్తువుల నిషేధంపై అహుజ ఇలా స్పందించారు... ‘ప్లాస్టిక్–రహిత ప్రపంచం అనేది రాత్రికి రాత్రి జరిగే అద్భుతం కాదు. ఒక ప్రయాణం మొదలైంది. కొంతమందిగా మొదలైన ప్రయాణం, ఎంతోమందిని కలుపుకుంటూ వెళుతుంది.ఈ ప్రయాణమే ఉద్యమం అవుతుంది. మన జీవనశైలిని పూర్తిగా మార్చివేస్తుంది’ అంటున్న అహుజ ‘ప్లాస్టిక్–రహిత జీవన విధానాన్ని అనుసరించడం ఖరీదైన వ్యవహరం’లాంటి అపోహలను ఖండిస్తుంది. ప్లాస్టిక్ బదులుగా ప్రత్యామ్నాయాలకు రూపకల్పన చేసిన కంపెనీలకు ప్రభుత్వం అవసరమై ఆర్థిక సహాయం అందించాలని, సబ్సిడీలు ఇవ్వాలని ఆమె కోరుకుంటుంది. ‘ప్లాస్టిక్–రహిత దారి వైపు అడుగులు వేయడానికి ఇప్పుడు ఎన్నో ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉన్నాయి’ అంటున్న అహుజ ప్లాస్టిక్ వాడని కిరాణషాపులకు అండగా ఉండాలని చెబుతుంది. తన ప్రయాణంలో ‘మార్పు అసాధ్యమేమో’ అని కొన్ని సందర్భాలలో అనిపించేది. అంతలోనే ‘మార్పు అనివార్యం కూడా’ అనిపించి తనను పట్టుదలగా ముందుకు నడిపించేది. పరిమితమైన వనరులతోనే మన పూర్వీకులు రకరకాల మార్గాలలో పర్యావరణహితమైన కార్యక్రమాలకు రూపలకల్పన చేశారు. ఒకసారి వెనక్కి వెళ్లి అలాంటి కార్యక్రమాలు మళ్లీ ఉనికిలో ఉండేలా చూడాలంటుంది అహుజ. ‘బ్రౌన్ లెన్స్ మెథడ్ (ప్రతి ఉత్పత్తిని, పనిని పర్యావరణ దృష్టి కోణం నుంచి చూడడం) అనుసరిద్దాం’ అని పిలుపునిస్తున్న అహుజాకు మర్రిచెట్టు అంటే ఇష్టం.ఆదర్శం.‘బలంగా వేళ్లూనుకుపోయిన మర్రిచెట్టును చూస్తే మహాయోధుడిని చూసినట్లుగా ఉంటుంది. ఎంతో స్ఫూర్తి ఇస్తుంది’ అంటుంది. -
ఆశయం మంచిదే కానీ...
ప్రమాదం పొంచి ఉందని అర్థమైనప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ప్రపంచాన్ని, అందులోనూ మన దేశాన్ని పీడిస్తున్న ప్లాస్టిక్ దుర్వినియోగంపై కొరడా జుళిపించడం అర్థం చేసుకోదగినదే. ఈ జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ‘తక్కువ ఉపయోగం, ఎక్కువగా వ్యర్థాలు పేరుకొనే’ కొన్ని రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ, అమ్మకం, వినియోగాలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. అలాగే, ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తిదారులు, ఎగుమతి దారులు, బ్రాండ్ ఓనర్లు తప్పనిసరిగా నిర్ణీతస్థాయిలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయాలని షరతు పెట్టింది. గత ఫిబ్రవరిలోనే రీసైక్లింగ్ నిబంధనలు ప్రకటించిన సర్కారు ఇప్పుడు నిషేధపుటుత్తర్వులు అమలులోకి తెచ్చింది. ప్లాస్టిక్కు చౌక ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేవంటూ వ్యతిరేకులు వాదిస్తున్న వేళ ప్రభుత్వం తన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు బోలెడన్ని కసరత్తులు చేయక తప్పదు. ప్రభుత్వ ఉత్తర్వులతో ఇకపై ప్లాస్టిక్ ప్లేట్లు, స్పూన్లు, గ్లాసులు, స్ట్రాలు, స్వీట్ బాక్సులు, ఐస్క్రీమ్ పుల్లలు, సిగరెట్ ప్యాక్లు, పీవీసీ బ్యానర్లు, కొన్ని ప్లాస్టిక్ ప్యాకేజింగ్ సామగ్రి – ఇలా 19 రకాల ఉత్పత్తులు నిషిద్ధం. ప్రస్తుతం 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ సంచీలపైనే నిషేధం పెట్టారు. డిసెంబర్ కల్లా 120 మైక్రాన్ల కన్నా తక్కువున్న అన్నిటినీ నిషేధించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతానికైతే, ప్యాకింగ్ కోసం ప్లాస్టిక్ వినియోగించవచ్చంటూ త్వరితగతిన అమ్ముడయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్ఎంసీజీ) రంగాన్ని కొన్ని నిబంధనలతో ప్రభుత్వం అనుమతించింది. ప్లాస్టిక్ నిషేధ నిర్ణయాన్ని ఉల్లఘించినవారికి పర్యావరణ పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 15 కింద, దాని ఆధారంగా వివిధ నగరపాలక సంస్థలు చేసుకున్న చట్టాల కింద శిక్ష తప్పదని సర్కారు హెచ్చరిక. ప్రభుత్వ కఠిన నిర్ణయం వెనుక పెద్ద కథే ఉంది. మన దేశంలో వార్షిక తలసరి ప్లాస్టిక్ వ్యర్థాల సృష్టి దాదాపు 4 కిలోలు. ప్రపంచంలోని మిగిలిన అనేక దేశాలతో పోలిస్తే, ఇది కొంత తక్కువగా అనిపించవచ్చు. కానీ, మొత్తంగా చూస్తే మాత్రం ప్రపంచంలో చైనా, అమెరికాల తర్వాత అత్యధికంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నది మన దేశమే. కచ్చితమైన లెక్కలు లేవు కానీ, 2015లో 95 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలకు కారణమయ్యామని సర్కారు మాట. ఇక, 2019–20 లెక్కల ప్రకారం ప్లాస్టిక్ వ్యర్థాల్లో 12 శాతాన్నే మన దేశం రీసైకిల్ చేస్తోంది. మరో 20 శాతాన్ని కాల్చేస్తోంది. మిగతా 68 శాతం చెత్త రూపంలో, భూమిలో కలిసీ కలవక హాని కలిగిస్తున్నాయి. అలాగే, మన దేశంలో సగటున ప్రతి వ్యక్తీ ఏటా 9.5 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలవడానికి కారణమవుతున్నాడు. ఇది ఆందోళనకరం. ఇకనైనా మేల్కొనకుంటే– కూర్చున్న కొమ్మనే నరుక్కుంటూ, మనం నివసిస్తున్న పుడమి విధ్వంసానికి మనమే కారణమవుతాం. నిజానికి, 2022 కల్లా దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా చేస్తామంటూ 2018లోనే ప్రపంచ పర్యావరణ దినాన మన దేశం ప్రకటించింది. దానికి తగ్గట్టే ఇప్పుడీ నిషేధపు చర్య. ఈ నిర్ణయం వెనుక ఉన్న సదుద్దేశాన్ని స్వాగతిస్తూనే, అమలులో ఉన్న సాధకబాధకాలనూ గ్రహించాల్సి ఉంది. ఆ మాటకొస్తే, గత అయిదేళ్ళలో దేశంలో కనీసం 20కి పైగా రాష్ట్రాలు తమ తమ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగంపై ఏదో ఒక నియంత్రణ పెడుతూనే వచ్చాయి. ఆశయం మంచిదే అయినా, ఆశించినంతగా ఆ నియంత్రణలు అమలు కాలేదన్నది చేదు నిజం. విధులే తప్ప నిధులు, తగినంత సిబ్బంది కొరవడిన వివిధ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్ళు, మునిసిపాలిటీలు క్షేత్రస్థాయిలో చతికిలబడ్డాయి. ఈసారి ఆ పరిస్థితి రాకుండా చూడడానికి ఏం చేయాలో ఆలోచించాలి. బలంగా, బరువు తక్కువగా, దీర్ఘకాలం మన్నే ప్లాస్టిక్ వినియోగాన్ని మాన్పించడం ఒక సవాలే. ఏటా 18 శాతం వంతున వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్న ప్యాకేజింగ్ రంగంలో మరీ కష్టం. కాబట్టి, కేవలం నిషేధాలను నమ్ముకోకుండా పలు యూరోపియన్ దేశాల్లో లాగా ప్లాస్టిక్పై బాధ్యతగా వ్యవహరిస్తున్న సంస్థలకు ప్రోత్సాహకాలివ్వాలి. ఆ పని చేయని సంస్థలు అందుకు తగిన మూల్యం చెల్లించేలా నిబంధన పెట్టాలి. అలాగే, నిషేధాన్ని పర్యవేక్షించడానికి కంట్రోల్ రూమ్లు పెడితే సరిపోదు. ఆరోగ్యానికీ, పర్యావరణానికీ కలుగుతున్న నష్టం, మన వంతు బాధ్యతపై ప్రజా చైతన్యం పెంచాలి. నిషేధం అమలుకు భాగస్వామ్య పక్షాలన్నిటినీ కలుపుకొనిపోవాలి. ఉదాహర ణకు ప్లాస్టిక్తో పోలిస్తే, కాగితం స్ట్రాలకు ఖర్చు అయిదు రెట్లు ఎక్కువట. అసలే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న తయారీదార్లు, చిన్న వ్యాపారులపై ఇది పెనుభారం. కాబట్టి, పర్యావరణ హితంగా కంపోస్ట్ అయ్యే ప్లాస్టిక్ తయారీ లాంటివి పరిశ్రమతో కలసి ప్రభుత్వమూ అన్వేషించాలి. ఒక్కమాటలో నాలుగైదు దశాబ్దాలుగా నిత్యజీవితంలోకి పూర్తిగా జొరబడిన ప్లాస్టిక్ను వద్దంటే సరిపోదు. ప్రత్యామ్నాయాలు చూపించాలి. ప్లాస్టిక్ బదులు కాగితం, జనపనార, ఖాదీ సంచీలు, స్టీలు బాక్సులు వాడాలన్నది ప్రభుత్వ సూచన. అయితే, ఈ ప్రత్యామ్నాయాలు విస్తృతంగా అందు బాటులో ఉండేలా చూడడం కీలకం. ప్లాస్టిక్ బదులు కాగితం, వెదురుబొంగుల వినియోగం పెరిగితే, అది మళ్ళీ చెట్ల నరికివేతకు కారణమవుతుంది. అందుకే, చౌకగా ఉంటూనే పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాల వైపు ప్రజల్ని మళ్ళించాలి. ఈ మధ్య దీపావళి టపాసులపై ప్రజల్లో చైతన్యం తెచ్చినట్టే, ప్లాస్టిక్పైనా తీసుకురాగలిగితేనే ఫలితం ఉంటుంది. పర్యావరణానికీ, ప్రజారోగ్యానికీ మేలు కలుగుతుంది. ఆశయం మంచిదైనా, ఆచరణమార్గాలు కీలకమంటున్నది అందుకే! -
ప్లాస్టిక్ భూతానికి చెక్..
సాక్షి, అమరావతి: ఉదయం పాలు, కూరలు తేవాలంటే ప్లాస్టిక్ కవర్లు.. టీ తాగాలంటే ప్లాస్టిక్ కప్పు.. వాటర్ బాటిల్ ప్లాస్టిక్.. కూల్డ్రింక్ బాటిల్ ప్లాస్టిక్.. టిఫిన్ లేదా ఏదైనా పార్సిల్ తేవాలంటే ప్లాస్టిక్.. దుస్తులు కొన్నా ప్లాస్టిక్ కవర్లోనే ఇంటికి వస్తాయి.. నిత్య జీవితంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకొనే వరకు అనేక ప్లాస్టిక్ వస్తువులు వాడుతుంటాం. కానీ, రసాయనాలతో కూడిన ఈ ప్లాస్టిక్ ఉత్పత్తులు మానవుడితో సహా సమస్త జీవజాలానికి, పర్యావరణానికి అత్యంత హాని కలుగజేస్తున్నాయి. వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్ధాలు చేస్తున్న చేటు అంతా ఇంతా కాదు. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి (డీకంపోజ్) ఏకంగా 400 ఏళ్లు పడుతుంది.ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగాన్ని నివారించాలని ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నిస్తున్నా, సాధ్యమవడంలేదు. పైగా, వీటి వినియోగం ఏటికేడాది పెరుగుతూనే ఉందని కేంద్ర పర్యావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. గత నాలుగేళ్లలో ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం రెట్టింపైందని, ఇది మరింత వేగంగా విస్తరిస్తుందని తాజా నివేదికలో పేర్కొంది. 2015–16 సంవత్సరంలో దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం 15.89 లక్షల టన్నులు కాగా, 2019–20 నాటికి 35 లక్షలకు చేరింది. రోజుకు 25,940 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే అందులో సుమారు 10,376 టన్నుల వ్యర్థాలను సేకరించకుండా వదిలేస్తుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. 2050 నాటికి 12 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ దేశ భూ భాగంపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో ప్లాస్టిక్ వినియోగం తక్కువే. అమెరికాలో తలసరి ప్లాస్టిక్ వినియోగం 109 కేజీలు , చైనాలో 38 కేజీలుంటే ఇండియాలో 11 కేజీలే. అయినప్పటికీ ప్లాస్టిక్ వినియోగం వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆన్లైన్ డెలివరీ విస్తరిస్తుండటంతో ప్లాస్టిక్ వినియోగం కూడా భారీగా పెరుగుతోంది. కేవలం జుమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ప్రతి నెలా అదనంగా 22,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తున్నట్లు అంచనా. ప్రభుత్వం తక్షణం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, లేకపోతే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగంపై కేంద్రం ఆంక్షలు ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు ఆ ఉత్పత్తులపై ఆంక్షలు విధిస్తూ 2016లో కేంద్రం నిబంధనలు విధించగా, తాజాగా వాటిని సవరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఒకసారి మాత్రమే వినియోగించే (సింగిల్ యూసేజ్) ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించింది. దీని ప్రకారం కూల్డ్రింక్ల్లో వినియోగించే స్ట్రాలు, ఐస్క్రీం స్టిక్లు, ప్లాస్టిక్ గ్లాసులు, కప్పులు, చెంచాలు, బెలూన్స్, క్యాండీ స్టిక్స్ వంటి వాటిలో సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ప్లాస్టిక్ కట్టడిలో ఏపీ చొరవ ప్లాస్టిక్ వినియోగం, నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరుస్తోందని కేంద్ర పర్యావరణ శాఖ తాజా నివేదికలో పేర్కొంది. పట్టణాల నుంచి సేకరించిన వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ నిర్వహణ పద్ధతులను పాటిస్తోందని పేర్కొంది. రాష్ట్రంలో ఏటా 46,222 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ తయారీలో, రోడ్ల నిర్మాణంలో వినియోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 131 ప్లాస్టిక్ సంబంధ యూనిట్లు ఉండగా అందులో 117 ప్లాస్టిక్ ఉత్పత్తి చేసేవి. 14 ప్లాస్టిక్ రీ–సైక్లింగ్ యూనిట్లు. తాడిపత్రి, బొబ్బిలి, తిరుపతి, విజయవాడ వంటి మునిసిపాలిటీల్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల వినియోగంపై పాక్షిక నిషేధం అమలవుతోంది. కేంద్ర నిబంధనలను అతిక్రమించిన వారిపై దాడులు చేయడం ద్వారా రాష్ట్ర అధికారులు 235 టన్నల ప్లాస్టిక్ బ్యాగులను సీజ్ చేశారు. రూ.1.64 కోట్లు జరిమానాగా విధించారు. తాజాగా ప్లాసిŠట్క్ వ్యర్థాల నుంచి సముద్ర తీరప్రాంతాన్ని రక్షించేలా అమెరికాకు చెందిన పార్లే ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతంలో ఏటా ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేయనున్నట్లు పార్లే ఫర్ ది ఓషన్స్ ఫౌండర్ సైరిల్ గట్చ్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 500 పార్లే ఎయిర్ స్టేషన్లు, 10 ఎకో ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటుతోపాటు 20 వేల మంది సముద్రపు వారియర్స్ను నియమిస్తామని వివరించారు. ఆయన ఈ నెల 5న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేసే ఉత్పత్తులను వివరించి, రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు. -
సుస్థిర ప్రగతిలో హరిత విధానాలు
సాక్షి, అమరావతి: సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతోంది. సుస్థిర ప్రగతిలో హరిత విధానాలకు పెద్దపీట వేయడం ద్వారా అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించేలా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టెయిన్బుల్ ప్లానెట్ (జీఏఎస్పీ) సంస్థ ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విస్తృతంగా చర్చించారు. వ్యర్థాల నుంచి విలువైన వస్తువుల తయారీని పైలట్ ప్రాజెక్టు కింద విశాఖలో చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంతో అనుసంధానించి దీన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. తద్వారా బీచ్లను అత్యంత పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవడంతోపాటు ఇతర అంశాలపైనా తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. హరిత విధానాలకు పెద్దపీట ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, రీ సైక్లింగ్పై అనుసరిస్తున్న వివిధ పద్ధతుల గురించి జీఏఎస్పీ ప్రతినిధి, ప్రముఖ అంతర్జాతీయ డిజైనర్, పార్లీ ఫర్ ది ఓషన్స్ ఫౌండర్ సైరిల్ గట్చ్ సమావేశంలో వివరించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో తీవ్రంగా కలుషితమవుతున్న సముద్రాలను, భూగోళాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ అనుకూల విధానాలతో వ్యర్థాల రీ సైక్లింగ్ చాలా కీలకమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 150 మిలియన్ టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు ఉత్పత్తి అవుతుండగా కేవలం 9% మాత్రమే రీ సైక్లింగ్ జరుగుతున్నాయని, మిగతావన్నీ కాలుష్యానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయన్నారు. వ్యర్థాలను విలువైన ఉత్పత్తులుగా మార్చడంలో హరిత విధానాలకు పెద్దపీట వేయడం ద్వారా కొత్త ఆర్థిక వ్యవస్థకు దారులు వేయవచ్చన్నారు. జీఏఎస్పీ అనుబంధ సంస్థ పార్లే ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేస్తున్న పలు ఉత్పత్తుల గురించి ముఖ్యమంత్రికి తెలియజేశారు. బ్రాండింగ్ భవన నిర్మాణ మెటీరియల్, ఫర్నిచర్, వస్త్రాలు, బూట్లు తదితర వస్తువులను తయారు చేస్తున్నట్లు తెలిపారు. మన్యంలో ఎకో టూరిజం ఎకో టూరిజంపై ఉత్తరాఖండ్లో చేపడుతున్న ప్రాజెక్టు వివరాలను జీఏఎస్పీ ప్రతినిధులు ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రంలో అరకు, అనంతగిరి, రంపచోడవరం ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. స్థానికులకు మంచి ఆదాయాన్ని సమకూర్చేలా ప్రణాళిక ఉండాలన్నారు. కర్బన వ్యర్థాలతో నిరుపయోగ భూములను సారవంతంగా మార్చడంతోపాటు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు, అంతర్జాతీయ మార్కెటింగ్ తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. విశాఖలో పైలట్ ప్రాజెక్టు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ కోసం జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి సేకరిస్తున్న వ్యర్థాల ప్రాసెసింగ్ విధానాన్ని పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి జీఏఎస్పీ ప్రతినిధులకు వివరించారు. వ్యర్థాల నుంచి విలువైన వస్తువుల తయారీకి విశాఖను పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేయాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో అనుసంధానించి విలువైన ఉత్పత్తుల తయారీని చేపట్టడంతోపాటు బీచ్ను పరిశుభ్రంగా ఉంచడంపై దృష్టి పెట్టాలన్నారు. విశాఖలో పైలట్ ప్రాజెక్టు అనంతరం మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ తరహా విధానాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. -
ప్లాస్టిక్ను తింటది ఈ ఎంజైమ్..!
చావుని తింటది కాలం.. కాలాన్ని తింటది కాళి.. అన్నాడో కవి ఇటీవలి ఒక పాటలో! దీనికి కొనసా గింపు గా ప్లాస్టిక్ను తింటది ఈ ఎంజైమ్... అంటున్నారు సైంటిస్టులు. భూకాలుష్యానికి కారణమైన ప్లాస్టిక్ నియంత్రణలో ముందడుగు పడిందంటున్నారు. జీవజాతుల మనుగడకు పెనుముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్ వేస్ట్ నియంత్రణ మనిషికి పెనుసవాలుగా మారుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా భూమిపై ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇతర వ్యర్థాలతో పోలిస్తే ప్లాస్టిక్ డీకంపోజ్ (క్షీణించడం) అవడానికి చాలా కాలం పడుతుంది. ఒక అంచనా ప్రకారం ప్లాస్టిక్ సంపూర్ణంగా డీకంపోజ్ కావడానికి సుమారు 500– 1000 సంవత్సరాలు పడుతుంది. ఇంతటి కలుషితాన్ని ఎలా కట్టడి చేయాలా? అని మనిషి మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ తరుణంలోనే మోంటానా, పోర్ట్స్మౌత్ యూనివర్సిటీలకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఒక గుడ్న్యూస్ వినిపిస్తున్నారు. ప్లాస్టిక్ను గుట్టుచప్పుడుకాకుండా కనుమరుగు చేసే ఒక ఎంజైమ్ను వీరు గుర్తించారు. వీరి పరిశోధనా వివరాలు పీఎన్ఏఎస్ (ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్)లో ప్రచురించారు. పీఈటీ (పాలీ ఇథిలీన్ టెలిఫ్తాలేట్) ప్లాస్టిక్లో ఉండే టీపీఏ (టెరిఫ్తాలేట్)ను డీకంపోజ్ చేసే శక్తి ఈ ఎంజైమ్కు ఉందన్నారు. పీఈటీ ప్లాస్టిక్ను డిస్పోజబుల్ సీసాలు, బట్టలు, కార్పెట్ల తయారీలో ఉపయోగిస్తారు. 2018లోనే ప్రొఫెసర్ జెన్ డుబోయిస్, ప్రొఫెసర్ జాన్ మెక్గెహాన్లు ఈ ఎంజైమ్ తయారీపై పరిశోధనలు ఆరంభించారు. తాజాగా దీని పూర్తి వివరాలను వెల్లడించారు. బ్యాక్టీరియాలో ఉత్పత్తి టీపీఏను డీకంపోజ్ చేయడం కష్టమని, చివరకు బ్యాక్టీరియా కూడా దీన్ని అరిగించుకోలేదని జెన్, జాన్ చెప్పారు. కానీ పీఈటీని తినే బ్యాక్టీరియాలో ఒక ఎంజైమ్ మాత్రం టీపీఏను గుర్తుపడుతుందని తెలిసిందన్నారు. టీపీఏడీఓ అని పిలిచే ఈ ఎంజైమ్పై మరిన్ని పరిశోధనలు చేయగా, ఇది టీపీఏను పూర్తిగా శి«థిలం (బ్రేక్డౌన్) చేస్తుందని గుర్తించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయి. తాజాగా కనుగొన్న టీపీఏడీఓ ఎంజైమ్తో ఎటువంటి రసాయనాలు వాడకుండా జైవిక పద్ధతుల్లోనే ప్లాస్టిక్ను డిగ్రేడ్ చేయవచ్చు. పీఈటీ ప్లాస్టిక్లో అణువులను విచ్ఛిన్నం చేసే ఒక ఎంజైమ్ను గుర్తించడం కీలకమలుపని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ఎంజైమ్ ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా కేవలం సదరు ప్లాస్టిక్ను డీకంపోజ్ చేయడమే కాకుండా పలు రకాల ఉపయోగకర రసాయనాలను కూడా ఉత్పత్తి చేస్తుందని సైంటిస్టులు వివరించారు. డైమండ్ లైట్ సోర్స్లో ఎక్స్ కిరణాలను ఉపయోగించి టీపీఏడీఓ ఎంజైమ్ 3డీ నిర్మితిని రూపకల్పన చేయడంలో విజయం సాధించినట్లు మెక్గెహాన్ చెప్పారు. దీనివల్ల ఈ ఎంజైమ్ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేయవచ్చన్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
Tharagai Aradhana: శెభాష్.. 9 నెలలకే ఈత నేర్చుకుని... ఇప్పుడు సముద్రంలో ఈదుతూ..
తారాగై ఆరాధన సముద్రంలో ఈదడానికే పుట్టినట్లుంది. సముద్రంతో మమకారం పెంచుకుంటూ పెరుగుతోంది. సముద్ర జీవులను కాపాడడానికే పని చేస్తోంది. సముద్రంలో చెత్త వేయవద్దని చెప్తోంది. చేపపిల్లలా నీటిలో మునిగి వ్యర్థాల అంతుచూస్తోంది. తారాగై ఆరాధన స్కూబా డైవింగ్ ఎక్విప్మెంట్ ధరించి పడవలో నుంచి సముద్రపు నీటిలోకి దూకిందంటే మరో క్షణంలో కంటికి కనిపించదు. పడవలో నుంచి ముందుకు ఉరికిన దేహం నీటిని తాకడమే ఆలస్యం... బుడుంగున మునక వేస్తుంది. చేపపిల్లలాగ నీటి అడుగుకు చేరుతుంది. పాన్పరాగ్ సాషేలు, పాలిథిన్ కవర్లు... అవీ ఇవీ అనే తేడా లేకుండా సముద్రంలో ఉండకూడని వ్యర్థాలన్నింటినీ ఏరి వేస్తుంది. నిజానికి సముద్రానికే ఆ లక్షణం ఉంటుంది. ప్రాణం లేని వస్తువును సముద్రం తన గర్భంలో దాచుకోదు. తనలో రూపుదిద్దుకున్న ప్రాణులకు ఇబ్బంది కలిగించే ఏ వస్తువునూ నిలవనీయదు. వీలయినంత త్వరగా బయటకు తోసేస్తుంది. అలలతోపాటు నిమిషాల్లో తీరానికి కొట్టుకు వచ్చేస్తుందా వస్తువు. కానీ పలుచటి ప్లాస్టిక్ కవర్లు, చిన్న చిన్న వక్కపొడి కవర్ల వంటివి సముద్రంలో నీటి అడుగున ఇసుకలో కూరుకుపోతుంటాయి. అలాంటి వ్యర్థాలు ఎక్కువైపోతున్నాయి. వాటిని తనంతట తానుగా ప్రక్షాళన చేసుకోవడం సముద్రానికి చేతకావడం లేదు. అలలకు శక్తి చాలడం లేదు. అందుకే... ఆ పని సముద్రం మీద ప్రేమ ఉన్న మనుషుల బాధ్యత అయింది. అంతటి బృహత్తర బాధ్యతను తలకెత్తుకున్న సాహసి మన తారాగై ఆరాధన. ఈ పాప వయసు ఎనిమిదేళ్లు. ఇప్పటి వరకు ఆమె సముద్ర తీరంలోనూ, సముద్రంలోనూ కూరుకుని పోయి ఉన్న 600 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరిపారేసింది. సముద్రపు అలలతో ఆడుకునే వయసులో ఇంత పెద్ద పర్యావరణహితమైన బాధ్యతను తలకెత్తుకుంది. ఏ పని చేస్తున్నా తన వెంట తండ్రి ఉంటాడని, అందుకే ధైర్యంగా చేసేస్తున్నానని చెప్తోంది ఆరాధన. నీటిలోనే పెరిగింది తమిళనాడు రాష్ట్రం, కరప్పగమ్లో పుట్టిన ఆరాధనకు సముద్రంతో అనుబంధం ఐదేళ్ల వయసులోనే ఏర్పడింది. ఆరాధన తండ్రి అరవింద్ తరుణ్శ్రీ స్కూబా డైవింగ్ ఎక్సపర్ట్ మాత్రమే కాదు, ఇన్స్ట్రక్టర్ కూడా. చెన్నై, పాండిచ్చేరిల్లో శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నాడు అరవింద్. తన కూతురిని చిన్న వయసులోనే ఏదైనా సాధించేలా తీర్చిదిద్దాలని అనుకున్నాడు. నవజాత శిశువుకు ఈత నేర్పించడం చాలా సులువు కూడా. ఆరాధనకు మూడు రోజుల పాపాయిగా ఉన్నప్పుడే నీటిలో తేలడం అలవాటు చేశాడు. తొమ్మిది నెలలకు నీటి తొట్టిలో వదిలితే ఎవరి సహాయమూ లేకుండా సొంతంగా ఈదేది. రెండేళ్లు నిండినప్పటి నుంచి ప్రొఫెషనల్ స్విమ్మర్గా తయారైంది. ఐదేళ్ల వయసు నుంచి స్కూబా డైవింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఏడేళ్లు వచ్చేటప్పటికి స్విమ్మింగ్, స్కూబా డైవింగ్లో ఆరితేరింది. తండ్రి నేర్పిన విద్య అరవింద్ ఇరవై ఏళ్లుగా ఇదే రంగంలో ఉండడం, సముద్ర జలాలకు జరుగుతున్న హానిని కూడా దగ్గరగా చూడడంతో మెరైన్ పొల్యూషన్ని అరికట్టాలనే నిర్ణయానికి వచ్చారాయన. ఆరాధనకు స్కూబా డైవింగ్ నేర్పించడంతోపాటు సముద్ర జలాల పరిరక్షణ పట్ల కూడా అవగాహన కల్పించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆరాధన సముద్ర జలాలను ప్రక్షాళన చేయడంతోపాటు సముద్రజలాలు కలుషితమైతే సముద్రంలో నివసించే జీవులకు ఎదురయ్యే ప్రాణహాని గురించి చెబుతోంది. అంతరించిపోతున్న సముద్ర జీవుల పరిరక్షణ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇస్తోంది. ఇందుకోసం స్కూళ్లకు వెళ్లి తన వయసు పిల్లలకు తనకంటే పెద్ద పిల్లలకు మెరైన్ కన్జర్వేషన్ గురించి అవగాహన కల్పిస్తోంది. ఇటీవల ఆరాధన ‘సేవ్ ద ఓషన్’ కార్యక్రమంలో భాగంగా ఏకబిగిన పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఈది వరల్డ్ రికార్డు సాధించింది. ‘‘మా నాన్న గడచిన పదిహేడేళ్లుగా పదివేల కిలోల వ్యర్థాలను వెలికి తీశాడు. నేను ఆరువందల కిలోలు తీశాను. ఇలా సాగర ప్రక్షాళన చేయడమే కాదు, ఇకపై ఎవరూ ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలో పారవేయకుండా చైతన్యవంతం చేస్తున్నాం. మా తరం పెద్దయ్యేటప్పటికి సముద్ర పరిరక్షణ కోసం ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఉండకూడదు’’ అంటోంది తారాగై ఆరాధన. చదవండి: సముద్రం నుంచి సముద్రానికి -
వారు చేసిన పనికి ఆనంద్ మహీంద్రా ఫిదా!
గ్లోబల్ కంపెనీలకు ఇండియన్లు సీఈవోలుగా అవడాన్ని సీఈవో వైరస్ ఫ్రం ఇండియా అంటూ చమత్కరించిన ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. సమకాలిన సామాజిక అంశాలపై సోషల్ మీడియా వేదికగా నిత్యం స్పందిస్తుంటారు. దేశంలో ఏ మూలన అయినా సరే ఏదైనా మంచి కార్యక్రమం జరిగినట్టు ఆయన దృష్టికి వస్తే చాలు.. ప్రశంసలు కురిపించేందుకు ఏ మాత్రం ఆలస్యం చేయరు. తాజాగా నేషనల్ కేడెట్ కార్ప్ (ఎన్సీసీ) వాలంటీర్లు చేసిన పనిని ఆయన మెచ్చుకున్నారు. ముంబై నగరంలోని ఓ బీచ్లో పునీత్ సాగర్ అభియాన్ సంస్థ ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాడెట్లు ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత కార్యక్రమం చేపట్టారు. బీచ్లో పేరుకు పోయిన ప్లాస్టిక్ బాటిళ్లు ఇతర వ్యర్థాలను తొలగించారు. ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ సెంటర్లకు పంపించారు. ఈ ఫోటోలను ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ఎన్సీసీ బాధ్యత కలిగిన పౌరులను తయారు చేస్తుందంటూ కొనియాడారు. Even as I participate in a committee to revamp the NCC I’m delighted to see & applaud this initiative. Under the PuneetSagar Abhiyan, the NCC has undertaken the cleaning of beaches & collection of plastic waste for recycling. The NCC produces good Citizens! pic.twitter.com/mvIOibX3cv — anand mahindra (@anandmahindra) December 17, 2021 చదవండి: లీనా నాయర్ సీఈవో ఘనత.. తన శైలిలో మహీంద్రా స్పందన -
ముంచుకొస్తున్న ముప్పు
సమస్త జీవన రంగాలనూ ఇప్పటికే చుట్టుముట్టిన ప్లాస్టిక్ వ్యర్థాలు మున్ముందు మరింత ముప్పుగా పరిణమించబోతున్నాయని పర్యావరణ మంత్రిత్వ శాఖ నివేదిక చేస్తున్న హెచ్చరిక అందరి కళ్లూ తెరిపించాలి. ఈ బెడద నుంచి బయటపడాలన్న ప్రయత్నాలు నత్తనడకనే ఉండటం ఆందోళన కలి గిస్తోంది. దేశంలో ఏటా 33 లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పుట్టుకొస్తున్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) ఎన్నడో అంచనా వేసింది. అయిదేళ్లలో ఇది రెట్టింపుకన్నా ఎక్కువైందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. సగటున ఏడాదికి 21.8 శాతం వ్యర్థాలు కొత్తగా వచ్చిపడుతున్నాయి. ఇందుకు ఆధునిక జీవనశైలిని, ప్రభుత్వాల నిర్లిప్త ధోరణిని ప్రధానంగా తప్పుబట్టాలి. ఏడాదిన్నరగా పట్టి కుదుపుతున్న కోవిడ్ మహమ్మారి కూడా ఈ వ్యర్థాల పెరుగుదలకు కారణమే. అయినా కదలికేది? ప్లాస్టిక్ వ్యర్థాల్లో 66 శాతం వాటా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బెంగాల్, తమిళనాడులదే. ఆ రాష్ట్రాలు అమలు చేసే చర్యలు, వాటి లోటుపాట్లు సమీక్షించి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తగిన సలహాలివ్వాలి. ఆ పని చురుకందుకోవాలి. ఇతర వ్యర్థాలతో పోలిస్తే దీన్ని వదుల్చుకోవడం అంత సులభం కాదు. ప్లాస్టిక్ వాడకం సదుపాయంగా ఉంటుందని చాలామంది చూస్తారు తప్ప, వాడి పడేశాక ఆ వ్యర్థాలు ఏమవుతాయన్న స్పృహ ఉండదు. పునర్వినియోగ ప్రక్రియతో అవి కొత్త రూపు సంతరించుకోవడం అంతంత మాత్రమే. దాని వాటా కేవలం 9 శాతం మాత్రమే. మిగతాదంతా నేలపై, డ్రైనేజీల్లో, నదులు, సముద్ర జలాల్లో చేరుతుంది. అవగాహన కొరవడి 12 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను తగలబెడుతున్నారు. అది మరింత ముప్పుగా మారుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతోపాటు పశుపక్ష్యాదులకు సైతం ప్రాణాంతకంగా పరిణమిస్తాయని, వందల ఏళ్లపాటు పర్యావరణాన్ని దెబ్బతీస్తాయనే చైతన్యం జనంలో కొరవడుతోంది. ఒకసారికి మాత్రమే వినియోగపడే ప్లాస్టిక్ను క్రమేపీ నిషేధించాలని మన దేశం చాన్నాళ్లక్రితమే అనుకుంది. అందుకు సంబంధించిన నిబంధనలు సైతం 2016లో ఖరారయ్యాయి. మరో రెండేళ్లకు పూర్తి స్థాయి నిషేధం దిశగా చర్యలుండాలని కూడా సంకల్పించుకున్నారు. కానీ ఆచరణ అంత మెరుగ్గా లేదు. వచ్చే ఏడాది జూలైకల్లా ఒకసారి వాడే ప్లాస్టిక్ను నిషేధించాలనుకుంటున్నట్టు 3 నెలల క్రితం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్లాస్టిక్ అనగానే అందరికీ ప్లాస్టిక్ సీసాలు, డబ్బాలు వంటివి ఎక్కువగా గుర్తుకొస్తాయి. కానీ 320 మైక్రాన్ల నుంచి 50 మైక్రాన్లకన్నా తక్కువుండే ప్లాస్టిక్ సంచులవరకూ అన్నీ పర్యావరణాన్ని నాశనం చేసేవే. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా కేంద్ర రసాయనాలు, పెట్రో కెమికల్స్ విభాగం మార్గదర్శకాలను రూపొందించి రాష్ట్రాలకు పంపింది. కానీ వాటిని ఒక్కో రాష్ట్రం ఒక్కోవిధంగా అర్థం చేసుకుని నిబంధనలు తీసుకొచ్చాయి. ఏ రెండు రాష్ట్రాల మధ్యా సారూప్యత లేకుండా నిబంధనలుండటం వల్ల ఉత్పత్తిదారులు సులభంగా తప్పించుకుంటున్నారు. చర్యలు తీసుకునే విషయంలోనూ వివక్ష కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ప్రభుత్వాలు ఎంతసేపూ చిన్న, మధ్యతరహా ఉత్పత్తిదారులపై ప్రతాపం చూపుతాయి తప్ప ప్లాస్టిక్ సీసాలు, ఇతరత్రాు ఉత్పతతుŠుతలు చేసే భారీ సంస్థల జోలికిపోవు. ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ను ప్రపంచంలో అధికంగా ఉత్పత్తి చేసే సంస్థలేమిటో ఆరాతీయగా అందులో 90 శాతం కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయని తేలింది. మనదేశానికి సంబంధించినంతవరకూ గెయిల్, ఇండియన్ ఆయిల్, హల్దియా పెట్రో కెమికల్స్, రిలయన్స్ తదితర సంస్థలు ఆ జాబితాలో ఉన్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల్లో ప్యాకేజింగ్ వాటా 60 శాతం ఉంటుందని లెక్కేస్తున్నారు. కానీ దాన్ని అరికట్టడంపై ఇంతవవరకూ సరైన అవగాహన లేదు. 2016లో రూపొందిన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ ఉత్పత్తిదారు, దిగుమతి చేసుకునే సంస్థ, దాన్ని వినియోగించే సంస్థ ఆ వ్యర్థాల నిర్వహణకు జవాబుదారీతనం వహించాలి. ఇంతవరకూ అది అమల్లోకి రాలేదు. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ చెత్తలో కలిసిపోయి, నదీజలాల్లోకి చేరి పర్యావరణం కాలుష్యమయం అవుతోంది. వాటిని తిని మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగానికి అనువుగా మార్చుకునే సాంకేతికత అందుబాటులోకొచ్చినా వినియోగించుకునేవారు స్వల్పం. ఆమధ్య భారతీయ వాణిజ్య, పారిశ్రామిక సంస్థల సమాఖ్య వెలువరించిన నివేదిక ప్రకారం దేశంలో కేవలం 7,500 రీసైక్లింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయి. వీటిలో అధికంగా చిన్నతరహా పరిశ్రమలే. మహమ్మారిలా విస్తరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను అదుపు చేయడం వీటివల్ల సాధ్యమేనా? మరింత మెరుగైన సాంకేతికత, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేయడంలో శాస్త్రీయ విధానాల అమలు, బడా సంస్థలు సైతం రీసైక్లింగ్ యూనిట్లు స్థాపించేలా చర్యలు తీసుకోవడం వంటివి చేస్తేగానీ లక్ష్యసాధన నెరవేరదు. ప్రభుత్వాలు చురుగ్గా కదలకపోతే సమస్య అదుపు తప్పుతుంది. కొన్ని రాష్ట్రాలు ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి రహదార్లు నిర్మించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. వీటికి నిర్మాణ వ్యయం తగ్గడంతోపాటు, మన్నిక కూడా అధికమంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడటానికి, ప్రాణాంతక వ్యాధులు విస్తరించడానికి పర్యావరణ విధ్వంసమే కారణమని పదేపదే రుజువవుతోంది గనుక ఈ సమస్యను ఇంకెంతమాత్రమూ ఉపేక్షించడానికి లేదు. గాలి, నీరు, నేల... ఇలా అన్నిటినీ సర్వనాశనం చేసే ప్లాస్టిక్ వినియోగంపై అందరినీ చైతన్యవంతం చేసే కార్యాచరణ తక్షణావసరం. -
మృత్యుసాగరం?
సాక్షి, విశాఖపట్నం/కొమ్మాది: ఆహ్లాదకర వాతావరణానికి నిలయంగా ఉండే విశాఖ సముద్ర తీరం మృత్యు కుహరంగా మారిపోతోంది. నిత్యం కడలి కెరటాల ఘోష వినిపించే ప్రాంతం.. సముద్ర జీవరాశుల మృత కబేళాలతో నిండిపోతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సాగర గర్భంలో ఉండే జీవరాశులు సైతం ఒడ్డుకు కొట్టుకొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత కొంత కాలంగా విభిన్న జీవరాశులు విశాల విశాఖ తీరంలో ఎక్కడో ఒక చోట నిర్జీవంగా దర్శనమిస్తున్నాయి. లోతైన ప్రాంతాల్లో నివసించే సీ స్నేక్లతోపాటు విశాఖ తీరంలో అరుదైన డాల్ఫిన్లు ఆలివ్ రిడ్లే తాబేళ్లు, స్టింగ్రే(టేకు చేప), ముళ్లచేప మొదలైన జీవరాశులు మరణిస్తున్నాయి. సముద్ర జలాలు కలుషితం అవుతున్న కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్యమే ప్రధాన శత్రువు వాతావరణంలో మార్పులను మానవ నివాసానికి అనుకూలంగా మార్చేవి సముద్రాలే. ఇందులోని జలాలు ఆవిరై వర్షాలుగా కురిసి నీటివనరులు అందేందుకు దోహదపడుతున్నాయి. మనిషి తీసుకునే ప్రోటీన్లలో సింహభాగం సముద్రం ఇస్తున్నదే. ఇన్ని ఇస్తున్న సాగరానికి.. తిరిగి మనమేం ఇస్తున్నామంటే కాలుష్య రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలే. పర్యావరణ నిపుణుల అంచనా ప్రకారం విశాఖ సాగర తీరంలో 350 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఏటా సముద్ర గర్భంలో కలుస్తున్నాయి. ప్లాస్టిక్ సీగా మార్చేస్తున్నారు.. అందాల సముద్ర తీరాన్ని ఆస్వాదించేందుకు వస్తున్న పర్యాటకులే ప్రధాన సమస్యగా మారుతున్నారు. బీచ్ ఒడ్డున కూర్చొని.. తినుబండారాల్ని తినేసి ప్లాస్టిక్ వ్యర్థాలు, పాలిథిన్ కవర్లు సముద్రంలో పారేస్తున్నారు. ఇలా వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కార్బన్ డయాక్సైడ్ మోతాదుకి మించి సముద్రాల్లో చేరుతుండటంతో ఆమ్లగాఢత పెరుగుతోంది. దీనికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి విడుదలవుతున్న హైడ్రో క్లోరిక్ యాసిడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు చేపలకు హాని చేస్తోంది. అడుగున ఉన్న ఆకర్షణీయమైన ప్లాస్టిక్ వ్యర్థాలు ఆహారంగా భావిస్తున్న జలచరాలు.. వాటిని తిని మృత్యువాతపడుతూ ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. సముద్ర జీవులు మనుగడ సాధించేందుకు జలాల్లో ఆక్సిజన్, ఉప్పు శాతాలు సక్రమంగా ఉండాలి. 8 నుంచి 10 పీపీటీ వరకూ ఆక్సిజన్ అవసరంకాగా.. 30 నుంచి 33 శాతం వరకూ లవణీయత ఉండాలి. కానీ విషపూరిత రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు కలుస్తుండటంతో అసమతుల్యత ఏర్పడి.. సరైన స్థాయిలో ఆక్సిజన్ అందక ప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ వెలికితీస్తున్న స్వచ్ఛంద సంస్థలు సముద్ర జలాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు జలచరాలకు ఎలాంటి హాని తలపెడుతున్నాయనే విషయంపై ప్రజల్లో అవగాహన శూన్యమనే చెప్పుకోవాలి. అందుకే.. సముద్ర లోతుల్లో పోగుపడ్డ ప్లాసిక్ వ్యర్థాల్ని తొలగించేందుకు లివిన్ అడ్వెంచర్ సంస్థతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. సముద్ర గర్భంలో ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత కోసం ఈ బృందాలు 3 కిలో మీటర్ల దూరం వరకూ వెళ్తున్నాయి. ప్రతి రోజూ 100 నుంచి 200 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాల్ని సముద్రం నుంచి వెలికితీస్తున్నారు. మరోవైపు సాగర జలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు విడిచిపెట్టకుండా తీరానికి వస్తున్న సందర్శకులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినా.. పర్యాటకుల నుంచి స్పందన కరువవడంతో జలచరాల ఉనికికి ముప్పు వాటిల్లుతోంది. జీవవైవిధ్యాన్ని కాపాడటం అందరి బాధ్యత ప్రజలు విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్థాల్ని సముద్రంలో విసిరేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. సముద్రంలో ఉన్న ప్రాణులు చనిపోతూ కనిపిస్తుంటే మనసు తరుక్కుపోతోంది. అందుకే వెలికితీస్తున్నాం. మన సముద్రాన్ని మనం పరిరక్షించుకుందాం. ప్రజలు, సందర్శకులు కూడా దీనికి సహకరించాలి. ప్లాస్టిక్ సముద్ర ప్రాణుల్ని అంతరించిపోయేలా చేస్తోంది. ఇది జాతి మనుగడకే చాలా ముప్పు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పర్యాటకుల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. – బలరాంనాయుడు, లివింగ్ అడ్వెంచర్స్ సంస్థ ప్రతినిధి చేపల శరీరాల్లోకి ప్లాస్టిక్ వ్యర్థాలు నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్స్ సంస్థతో కలిసి ఎన్ఐవో చేసిన ఓ పరిశోధనలో ప్లాస్టిక్ వ్యర్థాలు చేపల శరీరాల్లోకి వెళ్తున్నట్లు తెలిసింది. ఇది ఎంత ప్రమాదకరమో ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మెరైన్ పొల్యూషన్ అనేది కేవలం జలచరాలకే కాదు.. మానవాళి ఉనికికే పెను ముప్పు. ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాల వల్లే ఈ పరిస్థితి దాపురిస్తోంది. పరిశ్రమల వ్యర్థాలపై కాలుష్య నియంత్రణ మండలితో పాటు జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ (ఎన్ఐఓ) కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. తీరాన్ని కాపాడుకునే దిశగా విశాఖ ప్రజలు అడుగులు వేయాలి. – డా. కె.ఎస్.ఆర్.మూర్తి, ఎన్ఐవో విశ్రాంత శాస్త్రవేత్త -
ఎంత మంచి పని ! ఈ స్టార్టప్కి నేను అండగా ఉంటా - ఆనంద్ మహీంద్రా
Ashay Bhave Who made Thealy Brand shoes from Plastc covers and bottles: ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ని నివారిద్దాం అనే స్లోగన్లు ఎన్నిసార్లు వింటున్న వాటి వాడకం ఆపడం లేదు. కానీ ఢిల్లీకి చెందిన ఈ 23 ఏళ్ల కుర్రాడు మాటలు కట్టి పెట్టి చేతల్లోకి దిగాడు. ఇంత గొప్ప ఐడియాను అమలు చేస్తున్న వ్యక్తి గురించి నేనింకా ఎందుకు తెలుసుకోలేకపోయానంటూ సాక్షత్తూ ఆనంద్ మహీంద్రాలాంటి బిజినెస్ టైకూన్ బాధపడేంతంగా ఫలితాలు సాధిస్తున్నాడు. ఆశయ్ భావే నెలకొల్పిన స్టార్టప్ కంపెనీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. పాలబుగ్గల పసివాడిగా కనిపస్తున ఓ మేనేజ్మెంట్ స్కూల్ విద్యార్థి నెలకొల్పిన కుటీర పరిశ్రమ వందల మందికి ఉపాధిని ఇస్తోంటే లక్షల మందిని ఆలోచనలో పడేసింది. స్టార్టప్ ఐడియా ప్లాస్టిక్ నివారించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితాలు అంతంతగానే ఉంటున్నాయి. ప్రతీ ఊరిలో ప్రతీ విధీలో చెత్త కుప్పల నిండా ప్లాస్టిక్ కవర్లు, పెట్ బాటిల్స్ ఆక్రమించేస్తున్నాయి. డ్రైనేజీలకు అడ్డం పడుతున్నాయి. ఇలాంటి చెత్త నుంచి ఓ అద్భుతమైన పరిశ్రమకు ఊపిరి పోశాడు ఢిల్లీకి చెందిన ఆశయ్ భావే. చెత్తకుప్పల్లో పడేసిన ప్లాస్టిక్ కవర్లు, పెట్బాటిల్స్తో ప్రొఫెషనల్ షూ తయారీ కంపెనీని ఏర్పాటు చేశాడు. వాటిని ఆన్లైన్ వేదికగా టిక్టాక్గా అమ్మేస్తున్నాడు. ఢిల్లీ టూ గురుగ్రామ్ చెత్త సేకరించే ఏజెన్సీలతో మొదట ఒప్పందం చేసుకున్నాడు ఆశయ్.ఢిల్లీ నగర వ్యాప్తంగా ఉన్న రాగ్పికర్స్ (చెత్త ఏరుకునే వాళ్లు)కి ప్లాస్టిక్ కవర్లు, పెట్ బాటిల్స్ తీసుకురావాలంటూ ఏజెన్సీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అంతే వారం రోజుల వ్యవధిలోనే టన్నుల కొద్ది చెత్త సేకరించేందుకు గురుగ్రామ్లో ఓ యూనిట్ ఏర్పాటు చేశారు. నలుదిశల నుంచి వచ్చి పడిన ప్లాస్టిక్ కవర్లు, పెట్ బాటిల్స్ని శుభ్రంగా నీటితో కడిగి తేమ పోయే వరకు ఆరపెడతారు. ఆ తర్వాత ప్లాస్టిక్ కవర్లను ఒకదాని మీద ఒకటిగా ఎనిమిది లేయర్లుగా పేర్చుతారు. కావాల్సిన డిజైన్లో కట్ చేస్తారు. ఆ తర్వాత ప్రత్యేక పద్దతిలో దాన్ని వేడి చేసి.. షూ తయారీకి అవసరమైన తేలే టెక్ట్స్ అనే రా మెటీరియల్గా మారుస్తారు. ఢిల్లీ టూ జలంధర్ గురగ్రామ్ ఫ్యాక్టరీలో తయారైన షూ మెటీరియల్ని పంజాబ్లోని జలంధర్లో ఉన్న షూ తయారీ యూనిట్కి పంపిస్తారు. అక్కడ ఈ మెటీరియల్తో స్నీకర్ షూకి తగ్గట్టుగా కట్ అండ్ స్టిచ్ వర్క్ జరుగుతుంది. ఇండస్ట్రియల్ వేస్ట్ రబ్బరు నుంచి తయారు సోల్ని ఉయోగించి షూని రెడీ చేస్తారు. షూకి సంబంధించిన లేస్, ప్యాకింగ్కు ఉపయోగించే కవర్లు సైతం పూర్తిగా ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్తో హ్యాండ్ మేడ్గా తయారు చేస్తారు. బ్రాండ్ తేలే ప్లాస్టిక్ నుంచి తయారు చేస్తున్నా.. క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు. అందువల్లే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా బ్రాండింగ్ , మార్కెటింగ్ చేస్తున్నారను. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేసిన షూస్ని తేలే బ్రాండ్ పేరుతో మార్కెట్ చేస్తున్నారు. దీని కోసం thaely.com అనే వెబ్సైట్ని అందుబాటులో ఉంచారు. తేలే బ్రాండ్లో వివిధ మోడళ్ల షూస్ ధర 110 యూఎస్ డాలర్లకు అటు ఇటుగా ఉన్నాయి. ఆన్లైన్లో పేమెంట్ చేసి షూస్ పొందవచ్చు. డెలివరీ అందగానే షూ ప్యాక్ చేసిన కవర్ని భూమిలో పాతితే పది రోజుల్లో ఓ తులసి మొక్క మొలిచేలా బ్యాగ్ని రూపొందించారు. అదిరిపోయే సేల్స్ ఆశయ్ భావే తేలే షూ తయారీని 2021 జులైలో ప్రారంభించారు. ప్రస్తుతం వారానికి 15 వేల జతల షూస్ ఇక్కడ తయారవుతున్నాయి. మొదటి వారం 300 షూలు తయారు చేయగా ఇప్పుడా సంఖ్య 15 వేలకు చేరుకుంది. రెడీ అయిన షూ రెడీ అయినట్టే అమ్ముడైపోతుంది. జలంధర్, గురుగ్రామ్లో ఉన్న ఫ్యాక్టరీలో ఉద్యోగుల సంఖ్య 170కి చేరుకుంది. ఢిల్లీ నగరంలో ఉన్న రాగ్ పికర్స్కి ఆదాయం పెరిగింది. చెత్త కుప్పల్లో ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు క్రమంగా కనుమరుగు అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి. Embarrassed I didn’t know about this inspiring startup. These are the kinds of startups we need to cheer on—not just the obvious unicorns. I’m going to buy a pair today. (Can someone tell me the best way to get them?) And when he raises funds-count me in! https://t.co/nFY3GEyWRY — anand mahindra (@anandmahindra) November 17, 2021 సిగ్గుపడుతున్నా ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి షూ తయారు చేస్తున్న ఆశయ్ భావే సక్సెస్ స్టోరి ఇటీవల ప్రసారం అయ్యింది. అది చూసిన వెంటనే ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఇలాంటి స్టార్టప్ గురించి ఇంత కాలం తెలుసుకోనందుకు సిగ్గుపడుతున్నాను. ఈ రోజే నేను ఓ జత షూ కొనుక్కుంటాను అంటూ చెప్పుకొచ్చారు. తన ట్విట్టర్ పేజీలో సక్సెస్ స్టోరీని షేర్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి షూస్ని ప్రముఖ కంపెనీలు కూడా గతేడాది నుంచి తయారు చేస్తున్నాయి. 2020 జూన్ నుంచి స్పేస్ హైవే సిరీస్తో నైక్ సంస్థ ప్రత్యేకంగా మార్కెట్లోకి షూస్ని తెచ్చింది. సముద్రంలో పోగుపడిన ప్లాస్టిక్ వ్యర్థాలతో అడిడాస్ సంస్థ షూస్ తయారు చేస్తోంది. ఈ రెండు బ్రాండ్ల నుంచి ఇప్పటి వరకు కోటి జతలకు పైగా షూస్ ప్రపంచ వ్యాప్తంగా విక్రయించారు. - సాక్షివెబ్, ప్రత్యేకం చదవండి:బిల్గేట్స్ పేరెత్తితే ఆనంద్ మహీంద్రాకి చిరాకు.. కారణం ఇదే? -
జూలై నుంచి ప్లాస్టిక్పై నిషేధం
సాక్షి, అమరావతి: పర్యావరణానికి ఎంతో హాని చేసే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ (ఒకసారి వాడి పడవేసేవి) వస్తువుల వాడకాన్ని ప్రజలు స్వచ్ఛందంగా ఆపివేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కోరింది. వచ్చే ఏడాది జూలై ఒకటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించనుందని తెలిపింది. దీన్ని అంతా పాటించాలని అందుకోసం దశల వారీగా వాటిని వినియోగించడం మానివేయాలని కోరింది. నిషేధం అమల్లోకి వచ్చేలోగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిందని కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఈ ప్లాస్టిక్ వస్తువుల తయారీదారులపై జరిమానా విధించే అధికారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి కల్పించినట్లు తెలిపింది. వాడకూడనివి ఇవే.. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల నిబంధనల ప్రకారం అలంకరణ కోసం వాడే థర్మాకోల్, స్వీట్ బాక్సులు, ఆహ్వాన పత్రికలు, సిగరెట్ ప్యాకెట్లలో వాడే ప్యాకింగ్ ఫిల్ములు, ప్లాస్టిక్ స్టిక్స్ ఉండే ఇయర్ బడ్స్, బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్ ఐస్క్రీం పుల్లలు, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు, వంద మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే పీవీసీ లేదా ప్లాస్టిక్ బ్యానర్లు వాడకూడదు. ప్రత్యామ్నాయాలివే.. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ బదులుగా సేంద్రీయ పత్తి, వెదురు, చెక్క, మట్టి, పింగాణీ, త్వరగా ప్రకృతిలో కలిసిపోయే (కంపోస్టబుల్) ప్లాస్టిక్స్తో చేసిన వస్తువులు వాడాలి. మట్టిపాత్రలు, పింగాణీ పాత్రలను ఆహారం నిల్వ చేయడానికి వాడవచ్చు. చెత్త బుట్టలో వాడే సంచులు, కాగితపు కప్పులకు వాడే పైపూత, దుకాణాల్లో వాడే సంచులు, పండ్లు, ఆహార పదార్థాలను కప్పి ఉంచే పారదర్శక కవర్లు, ప్యాకేజింగ్, పంట పొలాల్లో మట్టిని కప్పడానికి వాడే కవర్లను కంపోస్టబుల్ ప్లాస్టిక్స్తో తయారు చేయవచ్చు. -
ప్లాస్టిక్ వ్యర్థాలకు అడ్డాగా వైజాగ్ బీచ్
-
నో మోర్ ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా కట్టడి చేసేందుకు కేంద్రప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ ఈనెల 12న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సవరణ నియమాలు–2021ను ప్రకటించింది. ఇందులో భాగంగా అధిక చెత్తకు కారణమయ్యే ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులను వచ్చే ఏడాది జూలై నుంచి నిషేధించింది. ‘ప్లాస్టిక్ ఇయర్బడ్స్’పై నిషేధం: వచ్చే ఏడాది జూలై 1వ తేదీ నుంచి దేశంలో గుర్తించిన కొన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ప్లాస్టిక్ స్టిక్స్తో చేసిన ఇయర్ బడ్స్, బెలూన్లకు ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీస్కు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, డెకరేషన్కు వాడే థర్మోకోల్ వస్తువులపై నిషేధం అమలులోకి రానుంది. వీటితోపాటు ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు, స్వీట్ బాక్సులకు వాడే ప్యాకింగ్ పేపర్, ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్లకు తక్కువగా ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లను నిషేధిత జాబితాలో చేర్చింది. 120 మైక్రాన్లకు పెంపు ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నుంచి దేశంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల మందాన్ని 50 నుంచి 75 మైక్రాన్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2022 డిసెంబర్ 31 నుంచి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల కనీస మందం 120 మైక్రాన్లకు పెంచింది. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల మందం పెరిగిన కారణంగా వాటిని తిరిగి ఉపయోగించేందుకు అనుమతించనుంది. రాష్ట్రాలు చీఫ్ సెక్రటరీ స్థాయిలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని కోరింది. -
ఫీజు కట్టడానికి డబ్బు లేదా.. అయితే ప్లాస్టిక్ ఇవ్వండి!
చాలా దుకాణాల్లో మనమిచ్చిన నోట్లకు చిల్లర లేకపోతే బదులుగా చాక్లెట్లు చేతిలో పెట్టడం ట్రేడ్ ట్రెండ్ అయింది!అసోంలోని ఓ బడిలో.. ఫీజు కట్టడానికి డబ్బులేకపోతే పోగేసిన ప్లాస్టిక్ను ఇచ్చి బడిలో పాఠాలు నేర్చుకోవచ్చు అనేది పాలసీగా మారింది! ఆ పాఠశాల పేరు అక్షర్.. గువాహటిలో ఉంది. అదెలా మొదలైందంటే.. న్యూయార్క్లో ఉండే మజిన్ ముఖ్తార్ విభిన్నమైన స్కూల్ ప్రాజెక్ట్తో 2013లో ఇండియాకు తిరిగి వచ్చాడు. అదే సమయంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో మాస్టర్స్ చేస్తున్న పర్మిత శర్మను అనుకోకుండా కలిశాడు. విద్యారంగంలో పనిచేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటోన్న పర్మిత..ముఖ్తార్తో కలసి 2016లో అక్షర్ స్కూల్ను ఏర్పాటు చేశారు. చక్కటి కరిక్యులమ్తో సాఫీగా సాగిపోసాగింది. ఒకరోజు బడి ఆవరణలో పోగైన ప్లాస్టిక్ వ్యర్థాలను తగలబెట్టారు. తరగతి గదుల్లోకి పొగవాసన రావడంతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు పిల్లలు. అది విద్యార్థుల ఆరోగ్యానికీ, పర్యావరణ హితానికి ఎంత హానికరమో గ్రహించారు పర్మిత, ముఖ్తార్లు. ఆ ప్లాస్టిక్ను ఇటు బడిలోని పిల్లలకు ఉపయుక్తంగా.. అటు పర్యావరణానికి క్షేమంగా మార్చాలని నిర్ణయించుకున్నా రిద్దరూ. ఫీజుకు బదులుగా ప్లాస్టిక్ను తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆలస్యం చేయకుండా అమల్లో పెట్టారు. ఇప్పుడు అక్షర్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులంతా ప్రతిరోజూ పుస్తకాల సంచితోపాటు ప్లాస్టిక్ వ్యర్థాల సంచినీ పట్టుకొని బడికెళ్తున్నారు. వాళ్లందరికీ అక్కడ చదువు ఉచితం. ఆ ప్లాస్టిక్ను ఏం చేస్తున్నారు? ఇరవై మంది విద్యార్థులతో ప్రారంభమైన ఆ స్కూలు స్ట్రెన్త్.. ప్లాస్టిక్ను ఫీజుగా తీసుకోవడం మొదలుపెట్టేప్పటికి వందకు పైనే దాటింది. తమ పరిసరాల్లోంచి తెచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలను విద్యార్థులు బడి ఆవరణలో పోగేస్తారు. వాటిని ఎలా రీసైకిల్ చేయాలి? చేసిన వాటిని తిరిగి ఎలా ఉపయోగించాలో ప్రాక్టికల్స్ ద్వారా నేర్చుకుంటున్నారు ఒకేషనల్ ట్రైనింగ్లో భాగంగా. ఇదివరకే ఉన్న ఆటలు, పాటలు, నృత్యం, సోలార్ ప్యానెలింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఎంబ్రాయిడరీ, కాస్మెటాలజీ, కార్పెంటరీ, గార్డెనింగ్, ఎలక్ట్రానిక్స్తో పాటు ఇప్పుడు ప్లాస్టిక్ రీసైకిలింగ్ కూడా స్కూల్ కరిక్యులమ్లో భాగమైంది. ఈ రీసైకిల్ ప్లాస్టిక్ను తరగతి గదులు, టాయ్లెట్ల నిర్మాణానికి మెటీరియల్గా వాడుతున్నారట. టాయ్మనీ.. ‘మా ప్రతిపాదనను తొలుత అయిష్టంగానే ఒప్పుకున్నారు స్థానికులు. వీళ్లలో ఎక్కువ మంది క్వారీల్లో కూలికి వెళ్తూ రోజుకి 150 నుంచి 200 రూపాయలు సంపాదించేవాళ్లే. ఆ డబ్బుతో ఇల్లు గడవడమే గగనం. బడి ఫీజులేం కట్టగలరు? అందుకే చాలా మంది పిల్లలు స్కూల్కి వచ్చేవారు కాదు. ఫీజుకు బదులు ప్లాస్టిక్ను తీసుకుంటే ఇటు పిల్లలనూ బడికి రప్పించిన వాళ్లమవుతాం.. అటు పర్యావరణ పరిరక్షణ మీద అవగాహనా కల్పించిన వాళ్లమవుతాం అనిపించింది. ఊహించినట్టుగానే రెండూ జరుగుతున్నాయి. పిల్లలు చదువు పూర్తిచేసిన వెంటనే ఉద్యోగం తెచ్చుకునేలా వాళ్లను ట్రైన్ చేస్తున్నాం. హైస్కూలు పిల్లలతో ట్యూషన్స్ చెప్పించి వాళ్లకు కొంత డబ్బులు (టాయ్మనీ) ఇస్తున్నాం. అవి వాళ్లకు స్నాక్స్, బట్టలు, బొమ్మలు, షూలు వంటివి కొనుక్కోవడానికి ఉపయోగపడుతున్నాయి’ అని చెప్పారు పర్మిత, ముఖ్తార్. అక్షర్ ఫౌండేషన్ ద్వారా త్వరలోనే మరో వంద స్కూళ్లను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నట్టూ తెలిపారు. – విజయాదిలీప్ -
ఆవిష్కరణ: ప్లాస్టిక్ అవుతుంది వెనీలా ఫ్లేవర్!
లండన్: మనిషికి ప్రియమైన శత్రువుగా పిలిచే ప్లాస్టిక్ సీసాలను వెనీలా ఫ్లేవర్గా రీసైకిల్ చేసేందుకు శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని కనుగొన్నారు. బ్రిటన్లోని ఎడిన్బరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకేసి.. ప్లాస్టిక్ చెత్తను కాస్తా ఉపయోగకరమైన పదార్థంగా మార్చేశారు. ఇందుకోసం వారు ఈ–కోలి బ్యాక్టీరియాలో కొన్ని మార్పులు చేశారు. ఇలా మార్పులు చేసిన బ్యాక్టీరియా ప్లాస్టిక్ చెత్తను జీర్ణం చేసుకుని వెనీలా ఫ్లేవర్ ముడి పదార్థమైన వనిల్లిన్గా మార్చేశాయి. బ్యాక్టీరియా సాయంతో ప్లాస్టిక్ చెత్తకు విరుగుడు కనిపెట్టేందుకు చాలాకాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా పెట్బాటిళ్లలోని టెరిఫ్తాలిక్ యాసిడ్ అనే పదార్థాన్ని నాశనం చేసేలా ఈ–కోలి బ్యాక్టీరియాలోఎడిన్బరో శాస్త్రవేత్తలు మార్పులు చేశారు. కొన్ని మార్పులు, చేర్పుల తర్వాత ఈ డిజైనర్ ఈ–కోలి బ్యాక్టీరియా అందించిన ప్లాస్టిక్లో 79 శాతాన్ని వనిల్లిన్గా మార్చేయగలిగాయి. సాధారణంగా వనిల్లిన్ను వనీలా గింజల నుంచి వేరు చేస్తారు. ఆహారంతో పాటు దీన్ని కీటకనాశినులు, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్ల వంటి వాటి తయారీలోనూ వాడుతుంటారు. ప్లాస్టిక్ బాటిళ్ల నుంచే దీన్ని నేరుగా తయారు చేయగలిగితే ఏటా వేల టన్నుల వనిల్లిన్ ఉత్పత్తికి వనీలా గింజలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. చిటికెలో నానో వజ్రాలు... పెన్సిల్కు.. వజ్రాలకు మధ్య చాలా దగ్గరి సంబంధం ఉంది. రెండూ కర్బనంతోనే తయారవుతాయి. అయితే అణువుల అమరికలో తేడా ఉంటుంది. ఈ తేడాల వల్లనే ఒకటి పెన్సిల్ (గ్రాఫైట్)గా మారిపోతే.. ఇంకోటి విలువైన వజ్రమవుతుంది. ఈ గ్రాఫైట్ పొరను అదేనండి.. గ్రాఫీన్ను చిటికెలో వజ్రాలుగా మార్చేసే కొత్త టెక్నిక్ ను అమెరికాలోని రైస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అదెలాగో తెలుసా కార్బన్కు కరెంట్ షాకిస్తే.. అది వజ్రంగా మారిపోతుంది. ఎంత మోతాదులో ఇవ్వాలి? ఎంత సమయం ఇవ్వాలన్న దానిపై వజ్రం తుదిరూపు ఆధారపడి ఉంటుంది. ఫ్లాష్ జౌల్ హీటింగ్ అని పిలిచే ఈ కొత్త పద్ధతి గత ఏడాది జనవరిలోనే ప్రపంచానికి పరిచయమైంది. ఇందులో కార్బన్తో కూడిన పదార్థాన్ని 2,727 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలకు వేడి చేస్తారు. దాంతో కార్బన్ కాస్తా.. గ్రాఫీన్ పొరలుగా మారిపోతుంది. రైస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పద్ధతికి మరికొంత మెరుగుపరిచారు. పది మిల్లీ సెకన్ల స్థానంలో 10 నుంచి 500 మిల్లీ సెకన్ల వరకు వేడిచేస్తే.. కార్బన్ ఇతర రూపాల్లోకి అంటే నానోస్థాయి వజ్రాలుగా రూపాంతరం చెందుతాయని వీరు గుర్తించారు. అంతేకాదు.. నానో వజ్రాల చుట్టూ కర్బన అణువుల కవచం ఉండే ‘కాన్సెంట్రిక్ కార్బన్’ను కూడా ఈ పద్ధతిలో తయారు చేయొచ్చని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జేమ్స్ టూర్ తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఉపయోగపడే ఫ్లోరిన్తో కూడిన నానో వజ్రాలను పెద్ద ఎత్తున తయారు చేసేందుకూ ఫ్లాష్ జౌల్ హీటింగ్ను వాడుకోవచ్చని వివరించారు. బోరాన్, ఫాస్ఫరస్, నైట్రోజన్ వంటి రసాయనాలతోనూ ఈ పద్ధతిని పరీక్షించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. మూలకణాలతో కండలు వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలోని కండరాలు బలహీనపడటం సహజం. కొన్ని రకాల వ్యాధులున్నా.. మందుల వాడినా కూడా కండరాలు బలహీనపడిపోతుంటాయి. వ్యాయామం వంటి వాటితో ఈ నష్టాన్ని కొంతవరకు ఆలస్యం చేయవచ్చు. అయితే... శరీరంలోని ఏ కణంగానైనా మారిపోగల శక్తి ఉన్న మూలకణాలతో ఈ సమస్యను అధిగమించవచ్చని గుర్తించారు అమెరికాలోని సాల్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు. గాయాల ద్వారా లేదా మరే ఇతర కారణాల వల్లనైనా బలహీనపడ్డ కండరాలను మళ్లీ పూర్వస్థితికి తీసుకెళ్లేందుకు మూలకణాలు ఉపయోగపడతాయని వీరు అంటున్నారు. మూలకణ చికిత్సలపై జరుగుతున్న పరిశోధనల్లో భాగంగా యమనాక ఫ్యాక్టర్స్ అని పిలిచే కొన్ని ప్రొటీన్లపై చాలాకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సాధారణ కణాలను కూడా ఈ ప్రొటీన్లు మూలకణాలుగా మార్చగలవు. ఇలా చర్మకణాలను మూలకణాలుగా మార్చి.. వాటి ద్వారా కండర కణజాలాన్ని వృద్ధి చేసేందుకు ఉపయోగిస్తుంటారు. అయితే ఇదంతా ఎలా జరుగుతుందో.. ఇప్పటికీ అస్పష్టమే. ఈ మిస్టరీని విప్పేందుకు సాల్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త ఛావ్ వాంగ్ పరిశోధనలు చేసినప్పుడు కొన్ని కొత్త సంగతులు తెలిశాయి. యమనక ఫ్యాక్టర్ ప్రొటీన్లు బాసల్ లామినా అనే పొరలో ఉండే శాటిలైట్ కణాలపై ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. కండరాల పోగుల్లోకి యమనక ఫ్యాక్టర్లను చేర్చినప్పుడు ఈ కణాలు చైతన్యవంతమై కండరాల వృద్ధికి సంకేతాలు ఇస్తున్నట్లు స్పష్టమైంది. నిశిత పరిశీలన తరువాత తేలిందేమిటంటే.. ఈ యమనక ఫ్యాక్టర్లు డబ్ల్యూఎన్టీ4 పేరున్న ప్రొటీన్ల మోతాదును తగ్గిస్తున్నాయి అని. ఈ ప్రొటీన్ను అర్థం చేసుకోగలిగితే కండరాల పునరుజ్జీవానికి కొత్త మందులు తయారుచేయొచ్చని ఛావ్ వాంగ్ అంటున్నారు. -
World Oceans Day: ‘ప్లాస్టిక్’ సముద్రాలు!
ప్లాస్టిక్ మన జీవితంలో భాగమైపోయింది. వాడే ప్రతి వస్తువూ ప్లాస్టిక్ మయం అయిపోతోంది. అదంతా ఎటు పోతోందో మీకు తెలుసా?.. చెత్తగా మారి అటు భూమిలో, ఇటు సముద్రాల్లో చేరి కలుషితం చేసేస్తోంది. మనం తినే తిండి, తాగే నీళ్లు.. ఓ లెక్కన చెప్పాలంటే మన శరీరం కూడా మైక్రో ప్లాస్టిక్తో నిండిపోతోంది. మంగళవారం ‘ప్రపంచ సముద్రాల దినోత్సవం’ సందర్భంగా.. సముద్రాల్లో ప్లాస్టిక్ పరిస్థితి ఏమిటో తెలుసుకుందామా? లక్షల కిలోమీటర్ల చెత్త దీవులు నదుల ద్వారా, నేరుగా డంపింగ్ చేయడం ద్వారా భారీ స్థాయిలో ప్లాస్టిక్ చెత్త సముద్రాల్లోకి చేరుతోంది. సముద్ర అంతర్గత ప్రవాహాల కారణంగా ఆ ప్లాస్టిక్ అక్కడక్కడా గుంపుగా చేరుతోంది. అలాంటి ఓ ప్లాస్టిక్ చెత్త ప్యాచ్ను 1990లోనే అమెరికాలోని హవాయి, కాలిఫోర్నియాల మధ్య పసిఫిక్ మహా సముద్రంలో గుర్తించారు. ప్రస్తుతం ఆ చెత్త ప్యాచ్ వైశాల్యం సుమారు 16 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నట్టు ఇటీవల గుర్తించారు. ఇంత భారీగా కాకున్నా.. మిగతా సముద్రాల్లోనూ పలుచోట్ల ఇలాంటి ప్లాస్టిక్ ప్యాచ్లు ఏర్పడ్డాయి. ఏటా లక్షల టన్నులు ప్రతి సంవత్సరం సముద్రాల్లో ఎంత ప్లాస్టిక్ కలుస్తోందో తెలుసా?.. సుమారు 80 లక్షల టన్నులు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్, అందులో రీసైకిల్ అవుతున్నది, భూమిపై డంప్ చేస్తున్నది, సముద్రాల్లో కలుస్తున్నది ఎంతనే దానిపై శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధన చేశారు. సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్లో ఒకట్రెండు శాతం మాత్రమే చెత్త ప్యాచ్లుగా చేరుతోందని గుర్తించారు. మిగతా అంతా ఏమైపోతోందని పరిశీలన చేపట్టారు. అన్నీ ఆ చెత్తలోనే.. సముద్రాల్లో చేరుతున్న ప్లాస్టిక్ చెత్తలో మనం నిత్యం వాడే అన్ని రకాల సామగ్రి ఉంటున్నాయి. పసిఫిక్ ప్యాచ్లో శాస్త్రవేత్తలు పరిశీలించినప్పుడు.. ప్లాస్టిక్ బాటిళ్లు, గ్లాసులు, పాత్రలు, బొమ్మలు, టాయిలెట్ సీట్లు, చేపల వలలు, ఎలక్ట్రానిక్ పరికరాల ప్లాస్టిక్ భాగాలు, ఇంట్లో వాడే ఇతర ప్లాస్టిక్ వస్తువుల ముక్కలు, థర్మాకోల్ ముక్కలు.. ఇలా చాలా రకాలు కనిపించాయి. నీటి లోతుల్లోకి.. ఇటీవల ఆర్కిటిక్ సముద్రం అడుగున పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు సుమారు 2,500 మీటర్ల (రెండున్నర కిలోమీటర్ల) లోతులో ప్లాస్టిక్ బ్యాగ్, బాటిల్స్ వంటివి కనిపించాయి. ఆ ఒక్కచోటే కాదు.. జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు ఇలా సముద్రపు లోతుల్లో ప్లాస్టిక్ చెత్త కనిపించిన 2,100 ఫొటోలను సేకరించారు. ప్లాస్టిక్ చెత్తలో కొంత భాగం సముద్రాల అడుగున లోతైన భాగాల్లోకి చేరుతోందని తేల్చారు. సముద్ర తీరాల మట్టి, ఇసుకలో.. అమెరికా సహా పలు దేశాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో మట్టి, ఇసుకను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. వాటిల్లో ప్లాస్టిక్ అవశేషాలు గణనీయంగా ఉన్నట్టు గుర్తించారు. 1945 నుంచి 2009 మధ్య ఏటా ప్లాస్టిక్ అవశేషాల శాతం రెండింతలు అవుతూ వచ్చిందని తేల్చారు. దాక్కుని ఉండేదెంతో.. 2010లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఓ అధ్యయనం ప్రకారం.. ఇప్పటివరకు సుమారు పది కోట్ల టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లో కలిసినట్టు అంచనా. ఇందులో సగందాకా.. భూమధ్యరేఖకు ఇరువైపులా కాస్త దూరంలోని (సబ్ ట్రాపికల్) సముద్రాల్లోనే చేరిందని ఓషియనోగ్రాఫర్ లారెంట్ లెబ్రెటన్ ఇటీవల వెల్లడించారు. తీర ప్రాంతాలకు, సముద్రంలో రవాణా మార్గాలకు దూరంగా.. ప్లాస్టిక్ ప్యాచ్లు ఉండటంతో మనకు కనిపించడం లేదని పేర్కొన్నారు. మన చుట్టూరా.. మనలోనూ భాగంగా.. విపరీతంగా పెరిగిపోయిన ప్లాస్టిక్ వినియోగంతో భూమ్మీద దాదాపు అన్నింటిలోనూ భాగంగా మారిపోయిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అది ఎంతలా అంటే.. అసలు మైక్రో ప్లాస్టిక్ (సూక్ష్మస్థాయి ప్లాస్టిక్ ముక్కలు) లేని ప్రదేశమే లేకుండా పోయిందని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పరిశోధనల్లో గుర్తించిన ప్రకారం.. గాలిలోని దుమ్ములో, తాగే మంచినీళ్లలో, సముద్ర జీవుల కడుపుల్లో, చివరికి తల్లి గర్భంలోని శిశువులకు అన్నీ అందించే.. బొడ్డుతాడు (ప్లెసెంటా)లో కూడా మైక్రో ప్లాస్టిక్ను గుర్తించారు. చదవండి: Elephanta Caves: ఎలిఫెంట్ లేదు! కేవ్స్ ఉన్నాయి!! -
Australia: ఎంత చెత్త దొరికితే.. ఈ దీవిని అంత పెంచుతారట
వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, వస్తువులను ఏం చేస్తాం?.. బయట చెత్తలో పడేస్తాం.. మరి ఈ ప్లాస్టిక్ చెత్తంతా ఎక్కడికిపోతోంది?.. అటూ ఇటూ తిరిగి అంతా సముద్రాల్లోకి చేరుతోంది. ఇటు మనుషులకు, అటు సముద్ర జీవులకు ఇదో పొల్యూషన్ సమస్య. ఈ ఇబ్బందిని ఎంతో కొంత తగ్గిస్తూనే.. అదే సమయంలో ఆహ్లాదం కలిగించేలా.. ప్లాస్టిక్ చెత్తతో సముద్రంపై ఓ రిసార్ట్ కట్టేస్తే..! అలలపై అలా అలా తేలుతూ ఎంజాయ్ చెయ్యగలిగితే..! భలే ఐడియా కదా. ఆ్రస్టేలియాకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ మార్గోట్ క్రసోజెవిక్ నీటిమీద తేలుతూ ఉండే ఈ సరికొత్త ఐలాండ్ రిసార్ట్ను డిజైన్ చేశారు. దీనికి ‘రీసైకిల్డ్ ఓసియన్ ప్లాస్టిక్ రిసార్ట్’గా పేరు పెట్టారు. ఆస్ట్రేలియా ఖండానికి కాస్త దూరంలో ఉన్న కీలింగ్ (కొకోస్) దీవుల దగ్గర సముద్రంలో దీన్ని కట్టేందుకు ఇప్పటికే ప్లానింగ్ మొదలుపెట్టారు. హిందూ మహా సముద్రంలో చేరిన ప్లాస్టిక్ చెత్తతో దీన్ని నిర్మించనున్నామని.. 2025 నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. చెత్త దొరికే కొద్దీ.. దీవి పెరుగుతూ.. ‘ఫ్లోటింగ్ ఐలాండ్ రిసార్ట్’ కోసం.. ముందు కలప, బయో డీగ్రేడబుల్ ఫైబర్ కాంక్రీట్ మెష్ (మెల్లగా క్షీణిస్తూ పర్యావరణంలో కలిసిపోయే ఫైబర్ వల)తో ప్రధాన నిర్మాణాన్ని కడతారు. దానికి చుట్టూ మెష్తో వాక్ వేలు (నడిచే దారులు) నిర్మిస్తారు. ఐలాండ్ రిసార్ట్ నీటిపై తేలుతూ, స్థిరంగా ఉండటానికి ఆయిల్ రిగ్స్ (చమురు తవ్వితీసే కేంద్రాల) తరహాలో ప్రత్యేక పరికరాలను అమర్చుతారు. ఈ ఐలాండ్ సముద్రంలో తేలుతూ కదులుతున్న కొద్దీ ఈ వలలో ప్లాస్టిక్ చెత్త చిక్కుతూ ఉంటుంది. దానిని గట్టిగా సంచుల్లో నింపి.. ఈ వాక్వేలలోనే గట్టిగా బిగిస్తారు. వాటిపై కాస్త ఇసుక, మట్టి వంటివి పరిచి, దారుల్లాగా మార్చుతారు. ఈ వాక్వేలు పూర్తయ్యాక చుట్టూ మరిన్ని మెష్లు ఏర్పాటు చేస్తారు. వాటిల్లో చిక్కుకునే ప్లాస్టిక్ చెత్తతో వాక్వేలను రూపొందిస్తారు. ఇలా దీవిని విస్తరించుకుంటూ వెళ్లవచ్చని రూపకర్తలు చెప్తున్నారు. చదవండి: అగ్నిపర్వతంలో పడిపోయిన డ్రోన్ కెమెరా.. దానికి ముందు -
ఈ కుక్క రోడ్ల పై ఎవరినీ చెత్త వేయనివ్వడం లేదు
-
వైరల్: ఈ కుక్కకి రోడ్ల పై చెత్త వేస్తే నచ్చదు..
సాధారణంగానే కుక్కలకు మానవులు ఎలా ప్రవర్తించాలి, ఏది ఎలా చేయాలి అనే అంశాలపై శిక్షణను ఇచ్చినప్పుడు అవి తూచా తప్పకుండా పాటించడం మనకి తెలుసు. ఒక్కోసారి మనం మర్చిపోయినా అవి మర్చిపోవు. ఇదే క్రమంలో ఈ కుక్క రోడ్ల పై ఎవరినీ చెత్త వేయనివ్వడం లేదు. అసలు ఎవరు ఈ కుక్క ఇలా ట్రైనింగ్ ఇచ్చారో గానీ ఇది చేసిన పని చూస్తే మాత్రం ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు. అదే మున్సిపాలిటీ అధికారులు గనుక చూస్తే స్వచ్ఛ భారత్కు దీన్నే బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేస్తారేమో.. అసలు ఇంతకీ ఏం చేసిందో ఈ శునకం తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే.. కారు లోపల కూర్చున్న ఓ వ్యక్తి రోడ్డుపై పేపర్ విసురుతాడు. అకస్మాత్తుగా, ఆ కారు గుండా వెళుతున్న ఒక కుక్క, ఆ వ్యక్తి కారోలోంచి నిర్లక్ష్యంగా పారేసిన ప్లాస్టిక్ కవర్ని తన నోటితో ఎత్తుకొని తిరిగి కారులోకి వదిలేస్తుంది. ఇదే కుక్క స్థానంలో మనిషే ఉండుంటే చూసి చూడనట్లు వెళ్లిపోయేవాడు. కానీ ఆ కుక్క మాత్రం అందుకు భిన్నంగా శుభ్రతకు సంబంధించిన ఓ పాఠాన్నే మనకు నేర్పిందనే చెప్పాలి. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుధా రామెన్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. “ప్రియమైన మానవులారా, ఇది మనకు ఒక పాఠం.. ఈ కుక్క తనకిచ్చిన శిక్షణను అనుసరిస్తున్నందుకు అభినందించాల్సిందే ” అని తన పోస్ట్కు ఈ శీర్షికను పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ కుక్క చేసిన పనికి నెటిజన్లు మనం ఇలాంటివి చూసైనా మారాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ( చదవండి: హమ్మా! కాకికే షాకిచ్చిందిగా..!! వైరల్ వీడియో ) -
వైరల్: చేప కడుపులో 10 కేజీల ప్లాస్టిక్ బ్యాగ్
బెంగళూరు : చేప కడుపులో పేపర్లతో కూడిన 10 కేజీల(10 కేజీలకు సరిపోయే) ప్లాస్టిక్ బ్యాగ్ బయటపడింది. ఈ సంఘటన కర్ణాటకలోని మంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. గత సోమవారం మంగళూరు, అట్టవర్లోని చేపల మార్కెట్లోని ఓ షాపులో ఓ వ్యక్తి రీఫ్ కోడ్ చేపను కోస్తున్నాడు. ఈ నేపథ్యంలో దాని కడుపులో ప్లాస్టిక్ బ్యాగ్ ఉండటం గుర్తించి షాక్కు గురయ్యాడు. ఈ విషయాన్ని తన యజమానికి చెప్పాడు. దీంతో అతను దాన్ని వీడియో తీసి, ఆన్లైన్లో షేర్ చేద్దామని నిశ్చయించుకున్నాడు. పనివాడు వ్యక్తి చేప కడుపు కోసి ప్లాస్టిక్ బ్యాగ్ను బయటకు తీశాడు. అనంతరం దాన్ని ఓపెన్ చేసి చూడగా కొన్ని పేపర్లు బయటపడ్డాయి. అది 10 కేజీల ప్లాస్టిక్ బ్యాగ్గా వారు గుర్తించారు. దీనిపై షాపు యజమాని మాట్లాడుతూ.. ‘‘నేనిలాంటిది చూడటం ఇదే ప్రథమం. మనుషులు ఇలాగే ప్లాస్టిక్ను సముద్రాలలో పడేయటం వల్ల చేపల సంతానోత్పత్తి బాగా దెబ్బ తింటుంది. చేపలు తినే వాటిపై చాలా శ్రద్ధ వహిస్తాయి. అయితే సముద్రపు తీర ప్రాంతాలు ఎక్కువగా ప్లాస్టిక్తో నిండి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో 40-50 శాతం చేపల వలలు ప్లాస్టిక్ను పట్టుకుంటున్నాయి. కానీ, ఈ సంఘటనలో ప్లాస్టిక్ తిన్న చేపను వలలు బంధించాయి. చేపలు మామూలుగా చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలను తింటుంటాయి. అవి వాటి శరీరాన్ని విషమయం చేస్తున్నాయి. చాలా వరకు ప్లాస్టిక్ చెత్త కాలువలు, నదుల ద్వారా సముద్రాల్లో కలుస్తోంది. ఆ చెత్తను సముద్రాల్లో కలవకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. చదవండి, చదివించండి : వ్వావ్! 4 వేల ఏళ్ల క్రితమే మల్టీ గ్రేయిన్ లడ్డూలు.. -
వైరల్గా మత్స్యకన్య ‘మెసేజ్’
ఇండోనేషియాలో భూమధ్య రేఖ మీద ఎనిమిది డిగ్రీల దగ్గర లంబాక్ – జావా దీవుల మధ్య కేంద్రీకృతమై ఉంది బాలి ద్వీపం. ప్రపందవాసులంతా ఆనందంగా జనవరి 1, 2021 ఉత్సవాలు జరుపుకుంటుంటే, ఈ తీరవాసులు మాత్రం అందుకు విరుద్ధంగా కొంచెం బాధలో మునిగి ఉన్నారు. బాలిలో ప్రసిద్ధి చెందిన కుటా సముద్ర తీరమంతా టన్నులకొలదీ వ్యర్థాలతో నిండిపోయింది. అందువల్ల తీర ప్రాంత వాసులంతా ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను పరిశుభ్ర పరచటంలో మునిగిపోయారు. అక్కడ ఒక మహిళ అందరికీ ఆకర్షణగా నిలిచారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో మత్స్యకన్యలా వస్త్రాలు ధరించి, అక్కడే బీచ్లో నేలమీద పడుకుని, అందరికి బాధ్యతను గుర్తుచేస్తూ, ఆకర్షిస్తున్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఆ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. డ్రోన్ కెమెరాల ద్వారా ఈ చిత్రాలను చిత్రీకరించారు వయాన్ సుయాద్న్య అనే ఔత్సాహిక ఫొటోగ్రాఫర్. బెల్జియంకి చెందిన లౌరా అనే సముద్ర వకీలు, కుటా బీచ్ పరిస్థితులను అందరికీ అర్థమయ్యేలా ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలను ధరించారు. బాలిలో ఉన్న బెల్జియం వాసి అయిన లౌరాకి ఆ సముద్ర తీరం మనసుకు బాధ కలిగించడంతో, తనే స్వయంగా ఆ ప్రాంతాన్ని శుభ్రపరచాలనుకున్నారు. చెత్తనంతటినీ ఒకచోటికి తీసుకువచ్చారు. ఆ ప్రాంతంలో తీసిన వందలకొలదీ ఫొటోలలో, మత్స్యకన్యలా ఉన్న లౌరా ఫొటోలో... ఆమె చుట్టూ ప్లాసిక్ వ్యర్థాలు టిన్నులు చిందరవందరగా పడి ఉండటం అందరిలోనూ చైతన్యం కలిగిస్తోంది. చదవండి: వాషింగ్టన్లో 15 రోజులు ఎమర్జెన్సీ -
ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్
సాక్షి, పటాన్చెరు: అనారోగ్యంతో ఉన్న ఆవుకు ఆపరేషన్ చేసిన పశువైద్యులు దాని పొట్టలో నుంచి 80 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. వివరాల్లోకి వెళితే.. అనారోగ్యంతో ఉన్న 2 ఆవులను జీహెచ్ఎంసీ సిబ్బంది 20 రోజుల క్రితం అమీన్పూర్ గోశాలకు తరలించారు. వాటిలో ఒక ఆవు మూడ్రోజుల క్రితం మృతి చెందగా.. మరో ఆవు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో అమీన్పూర్ పశువైద్యాధికారి విశ్వచైతన్య ఆ ఆవుకు శస్త్ర చికిత్స చేసి దాని పొట్టలో పేరుకుపోయిన 80 కిలోల ప్లాస్టిక్, కాటన్ బట్టలు బయటకు తీశారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తెలిపారు. -
ప్రపంచ జలాల్లోకి 5.30 కోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలు
ఒట్టావా : ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని నివారించేందుకు అటు ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం ఉండడం లేదు. దీంతో చెరువులు, కుంటలు, నదులు, నదాలు, సరస్సులు, సముద్ర జలాలు ప్యాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ఐక్యరాజ్య సమితికి ఇచ్చిన హామీలన్నింటినీ ప్రపంచ దేశాలు నెరవేర్చినప్పటికీ 2030వ సంవత్సరం నాటికి ప్రపంచ జలాల్లో 5.30 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతాయని ఓ కెనడా బృందం అంచనా వేసింది. ఇది 2005 సంవత్సరం నాటి ప్లాస్టిక్ వ్యర్థాలకు ఏడింతలు ఎక్కువ. ప్రస్తుతం ప్రపంచ జలాల్లోకి ఏటా 2.40 నుంచి 3.40 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతున్నాయని అధ్యయనంలో తేలింది. (శుక్రుడి మీద జీవం: రష్యా సంచలన ప్రకటన) ప్లాస్టిక్ ఉత్పత్తులను తక్షణం సంపూర్ణంగా ఆపేయడంతోపాటు, ప్లాస్టిక్ వ్యర్థాలను నూటికి నూరు శాతం రీసైక్లింగ్ చేయాలని, ప్లాస్టిక్ వాడకాన్ని క్రమంగా తగ్గించాలని అప్పుడే పరిస్థితి మెరగుపడుతుందని టొరాంటో యూనివర్శిటీకి చెందిన కన్జర్వేషన్ బయాలజిస్ట్ స్టీఫెనీ బొరెల్లీ హెచ్చరించారు. 2015లో ప్లాస్టిక్ వ్యర్థాల్తో 80 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు రీసైక్లింగ్కు పనికి రానివని తేలిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. సముద్ర తీర ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను ఏటా ఏరివేయడంలో ఎన్జీవో సంస్థల తరఫున కొన్ని లక్షల మంది కార్యకర్తలు పాల్గొంటున్నారని, 2030 నాటికి కనీసం వంద కోట్ల మంది కార్యకర్తలు వ్యర్థాల ఏరివేతలో పాల్గొంటే తప్పా పరిస్థితి మెరగుపడే అవకాశమే లేదని ఆమె హెచ్చరించారు. -
ఔను లాక్డౌన్లో ప్రజలు మారారు..!
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్–19 నగర ప్రజల్లో ఎంతోమార్పు తెచ్చింది. కరోనా వైరస్ ప్రభావం బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన పలు జాగ్రత్తలు తీసుకుంటుండటంతో పాటు అనవసర వ్యర్థాలు, ఇంట్లోని చెత్తాచెదారాల్ని వదిలించుకుంటున్నారు. అంతే కాదు..అనవసరంగా దుబారా చేయకుండా అవసరమైన మేరకే వంట చేసుకుంటున్నారు. ఇంటి పని, వంట పనితో పాటు మొక్కల సంరక్షణపై తగు చర్యలు తీసుకుంటూ అనవసరమైన పనికిరాని, ఎండిపోయిన మొక్కల్ని ఏరిపారేస్తున్నారు. అంతేకాదు.. ఇంట్లో ఎంతోకాలంగా ఉన్నపాత, పనికిరాని చెక్కవస్తువులు, సామాగ్రి తదితరమైన వాటిని సైతం పారేస్తున్నారు. ఇంట్లో కుప్పలుగా పేరుకుపోయిన ప్లాస్టిక్ క్యారీబ్యాగుల్ని, వాడి పారేసిన ప్లాస్టిక్ బాటిల్స్ను, సాచెట్లు తదిరతమైనవాటిని వదిలించుకుంటున్నారు. (మల్లన్నా.. గిదేందన్నా!) కోవిడ్–19 నేపథ్యంలో లాక్డౌన్కు ముందు..లాక్డౌన్ తరుణంలో రెండు నెలల్లో ఇళ్ల నుంచి జవహర్నగర్ డంపింగ్ యార్డుకు చేరిన చెత్తను, వాటిలోని వ్యర్థాలను అంశాల వారీగా పరిశీలిస్తే ఈ విషయాలు వెల్లడయ్యాయి. హోటళ్లు వంటివి లేకపోవడంతో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం తగ్గినప్పటికీ, వాటి వ్యర్థాలు వాటితోపాటు ప్లాస్టిక్ బాటిల్స్ సాచెట్స్ ఎక్కువ శాతం డంపింగ్యార్డుకు చేరడం, తోటపనులు చేస్తుండటం వల్ల వాటికి సంబంధించిన వ్యర్థాల శాతం పెరగడం కూడా ఇందుకు నిదర్శనం. చెక్క, పేపర్ వ్యర్థాలు సైతం ఇదే కోవలో ఉన్నాయి. వంటింట్లో అవసరానికి మించి వంటలు చేయకపోవడం వంటివాటితో భూమిలో కలిసే ఆకు, కాయగూరల వ్యర్థాల శాతం తగ్గింది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం, నీరసించి పోకుండా ఉండేందుకు వేసవి కారణంగానూ కొబ్బరి బొండాలను ఎక్కువగా తాగడంతో వాటి వ్యర్థాల శాతం యాభై శాతం కంటే పెరిగింది. ప్రైవేట్ ఆస్పత్రులో ఆపరేషన్లు బాగా తగ్గించడం తదితర కారణాలతో బయోమెడికల్ వ్యర్థాల శాతం బాగా తగ్గింది. (ప్లాస్టిక్ను ఇలా కూడా వాడొచ్చు..) ♦ లాక్డౌన్కు ముందు రెండు నెలల్లో రోజుకు సగటున డంపింగ్యార్డుకు చేరిన వ్యర్థాలు: 6200 మెట్రిక్ టన్నులు ♦ లాక్డౌన్లో రెండునెలల్లో రోజుకు సగటున డంపింగ్యార్డుకు చేరిన వ్యర్థాలు: 4800 మెట్రిక్ టన్నులు ♦ సగటున తగ్గిన వ్యర్థాలు రోజుకు : 1400 మెట్రిక్ టన్నులు -
కడలిని కప్పేస్తున్న ప్లాస్టిక్ భూతం
సాక్షి, అమరావతి: సముద్రం ప్లాస్టిక్ యార్డుగా మారింది. ప్రపంచంలో నివాసముంటున్న ప్రజల బరువుతో సమానంగా ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తి అవుతుండగా.. ఏటా 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరుతున్నట్లు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ఈపీ) అధ్యయనంలో తేలింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. 2050 నాటికి సముద్రంలో జలచరాల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయని ఆ అధ్యయనం స్పష్టం చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల్ని తిని చేపలు, తాబేళ్లు వంటి జలచరాలు అంచనాలకు అందని రీతిలో చనిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్లాస్టిక్ వ్యర్థాలే కారణమని.. ఇది రుతు పవనాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని స్పష్టం చేసింది. అధ్యయనంలో తేలింది ఏమిటంటే.. ► ఏటా వివిధ రూపాల్లో 300 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మనుషుల బరువుతో సమానం. ► ఇందులో ఏటా 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్ మీదుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలిసే గంగా, బ్రహ్మపుత్ర, మేఘ్నా నదుల ద్వారానే 70 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరుతున్నాయి. ► ప్లాస్టిక్ వ్యర్థాల్లో 90 శాతం వ్యర్థాలు ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచే వస్తుండటం గమనార్హం. ► సముద్రంలో నాచు (ఫైటో ప్లాంక్టన్)ను చేపలు, తాబేళ్లు ఎక్కువగా తింటాయి. ఈ నాచు డై మిథైల్ సల్ఫైడ్ అనే వాయువును విడుదల చేసింది. ఆ వాసన ఆధారంగానే నాచును పసిగట్టి చేపలు, తాబేళ్లు తింటాయి. ► ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరాక నాచు లాంటి వాయువునే విడుదల చేస్తుండటం వల్ల.. చేపలు, తాబేళ్లు ప్లాస్టిక్ వ్యర్థాలను తిని జీర్ణ క్రియ వ్యవస్థ దెబ్బతినడంతో మృత్యువాత పడుతున్నాయి. ► ఇలా అంచనాకు అందనంత భారీ స్థాయిలో జలచరాలు మరణించడంతో మత్స్య సంపద విపరీతంగా తగ్గిపోతోంది. ఫలితంగా చేపల వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటోంది. ► ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగి రుతు పవనాల గమనం తీవ్రంగా దెబ్బతింటోంది. అనావృష్టి పరిస్థితులకు ఇదే కారణమవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి సముద్రంలో జలచరాల పరిమాణం కంటే ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. -
శాస్త్ర, సాంకేతికతలే చోదక శక్తి
బెంగళూరు, సాక్షి: ‘సృజనాత్మక ఉత్పత్తులను రూపొందించడం, వాటికి పేటెంట్ సాధించడం, పరిశ్రమ స్థాయిలో వాటిని ఉత్పత్తి చేయడం, అభివృద్ధి సాధించడం (ఇన్నోవేట్, పేటెంట్, ప్రొడ్యూస్, ప్రాస్పర్)’ అనే నాలుగు మార్గాలు దేశ పురోగతిని శీఘ్రతరం చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువ శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించే పురోగతి పైననే దేశాభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం 107వ ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ను ప్రధాని ప్రారంభించారు. అనంతరం, ప్రారంభోపన్యాసం చేస్తూ.. దేశ శాస్త్ర సాంకేతిక ముఖచిత్రాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ప్రధాని ఆకాంక్షించారు. ప్రజల చేత, ప్రజల కొరకు సృజనాత్మక ఆవిష్కరణలు జరగడమే నవభారత నిర్మాణానికి కొత్త దిక్సూచి అన్నారు. ప్రపంచ సృజనాత్మక సూచీలో భారత్ స్థానం 52కి చేరడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు 60 ఏళ్ల కన్నా.. గత ఐదేళ్లలో స్టార్ట్ అప్స్, బిజినెస్ టెక్నాలజీ ఇంక్యుబేటర్ల విషయంలో భారతగణనీయ ప్రగతి సాధించిందన్నారు. ఇందుకు కారణమైన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. ‘సైన్స్, టెక్నాలజీ, గ్రామీణాభివృద్ధి’ని ఈ సంవత్సరం సైన్స్ కాంగ్రెస్ థీమ్గా ఎంపిక చేసుకోవడం ముదావహమన్నారు. పరిపాలనలోనూ సైన్స్ అండ్ టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నామని ప్రధాని తెలిపారు. ఈ గవర్నెన్స్ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరువ చేశామన్నారు. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఈ – కామర్స్ తదితర సేవలను గ్రామీణ, పట్టణ ప్రజలు కూడా పొందగలుగుతున్నారని ప్రధాని వివరించారు. డిజిటల్ సేవలను మునుపెన్నడూ లేనంత స్థాయిలో విస్తరించామన్నారు. వాతావరణ వివరాలను రైతులు ఇప్పుడు సులువుగా తెలుసుకోగలుగుతున్నారన్నారు. శాస్త్ర సాంకేతిక ఆధారిత పాలన రానున్న దశాబ్దంలో కీలకంగా మారనుందన్నారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయం చూడండి ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్ను నిషేధించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆ ప్లాస్టిక్కు చవకైన, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలని శాస్త్రవేత్తలను కోరారు. 2022 నాటికి ముడి చమురు దిగుమతిని 10% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందువల్ల బయో ఇంధనం, ఇథనాల్ రంగాల్లో విస్తృతంగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందేందుకు పరిశ్రమల అవసరాలకు తగ్గ పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్, కర్ణాటక సీఎం యడియూరప్ప, యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ వైస్ చాన్స్లర్ డాక్టర్ ఎస్.రాజేంద్ర ప్రసాద్, సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.ఎస్.రంగప్ప తదితరులు పాల్గొన్నారు. ప్రధాని ప్రసంగంలోని ఇతర ముఖ్యాంశాలు.. ► ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు టెక్నాలజీ ద్వారానే పరిష్కారం సాధ్యం. ► స్మార్ట్ఫోన్లు, చౌకైన ఇంటర్నెట్, డేటా లభ్యత కారణంగా ఇప్పుడు కోట్లాది మంది రైతులు, మహిళలకు ప్రభుత్వ పథకాల లబ్ధిని నేరుగా అందించగలుగుతున్నాం. ► స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్ పథకాలు గ్రామీణాభివృద్ధిలో మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ► ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే జల్జీవన్ మిషన్ను ప్రారంభించాం. ► పట్టణాలు, నగరాల్లో మురుగునీటిని శుద్ధి చేసి వ్యవసాయానికి ఉపయోగించేందుకు వీలుగా శాస్త్రవేత్తలు తగిన టెక్నాలజీలను అభివృద్ధి చేయాలి. తక్కువ నీటిని వినియోగించి ఎదిగే విత్తనాలను సృష్టించండి. ► ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాన్ని రూపొందిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించవచ్చు. ► మొబైల్ఫోన్లు, కంప్యూటర్ల నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి విలువైన లోహాలను సమర్థంగా, చౌకగా వెలికితీయగల పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. -
ప్లాస్టిక్ను ఇలా కూడా వాడొచ్చు..
సాక్షి, అమరావతి : మానవాళి మనుగడకే పెను సవాల్ విసురుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన పెద్ద సమస్యగా పరిణమించిన తరుణంలో వాటితో ఇటుకలు తయారు చేసి, నిర్మాణాల్లో ఉపయోగించ వచ్చనే విషయం పర్యావరణ పరిరక్షణ పరంగా ఊరట కలిగిస్తోంది. మట్టి, బూడిద (ఫ్లైయాష్).. సిమెంట్, ఇసుక మిశ్రమంతో తయారైన ఇటుకలతో నిర్మించే కట్టడాల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారయ్యే ఇటుకలే పది కాలాలపాటు చెక్కు చెదరకుండా బలంగా ఉంటాయంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులు, పరిశోధకులు. ప్లాస్టిక్ ఇటుకలతో నిర్మించే కట్టడాలకు నీటిని పీల్చుకునే స్వభావం చాలా తక్కువగా ఉంటుందని.. ఉష్ణోగ్రత, శబ్దాలను నియంత్రిస్తాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. ఈ ఇటుకల ఉత్పత్తి వ్యయం కూడా తక్కువే. ఈ దృష్ట్యా కొంత కాలంగా పలు దేశాల్లో ప్లాస్టిక్తోనూ ఇటుకలు తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలిసిపోవడానికి కనీసం 500 ఏళ్లు పడుతుంది. ప్రపంచంలో ప్లాస్టిక్ వినియోగం నానాటికీ పెరిగిపోతుండటం, ఆ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గాలి, ఉపరితల, భూగర్భ జలాలు, భూమి, ఆకాశం కలుషితం అవుతున్నాయి. దీని వల్ల ఏటా కోట్లాది పక్షులు, జంతువులు, చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఉభయతారకంగా వ్యర్థాల నిర్మూలన ప్రపంచంలో ప్లాస్టిక్ వినియోగంలో యూరోపియన్ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో చైనా, అమెరికా, భారతదేశం ఉన్నాయి. ఏడాదికి సగటున ఒక యూరోపియన్ పౌరుడు 36 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను బయట పడేస్తున్నాడు. తలసరి ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం చైనాలో 28 కేజీలు, అమెరికాలో 24 కేజీలు, మన దేశంలో 11 కేజీల వరకు ఉంటుందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) అంచనా వేసింది. ఈ లెక్కన ఏడాదికి 26 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు దేశంలో పోగుపడుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో గాలి, నీరు, భూ కాలుష్యానికి దారితీస్తోంది. వీటి నిర్మూలనకు తొలుత అర్జెంటీనా విస్తృత పరిశోధనలు చేసింది. ఇటుకల తయారీలో ప్లాస్టిక్ను వినియోగించి.. మట్టి, ఫ్లైయాష్, సిమెంట్ ఇటుకల కంటే ఐదు శాతం పటిష్టంగా ఉంటాయని తేల్చింది. నీటిని పీల్చుకునే స్వభావం చాలా తక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఉష్ణోగ్రత, శబ్ద తరంగాలను నిరోధించే స్వభావం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ దృష్ట్యా ప్లాస్టిక్ ఇటుకలతో నిర్మించిన కట్టడాల మన్నిక అధికంగా ఉంటుంది. వీటి ఉత్పత్తి వ్యయం కూడా తక్కువ. దీంతో అర్జెంటీనాలో తొలిసారిగా భారీగా ప్లాస్టిక్ ఇటుకల తయారీ, వినియోగం మొదలైంది. ఆ తర్వాత యూరోపియన్.. అమెరికా, చైనా తదితర దేశాల్లోనూ ప్లాస్టిక్ ఇటుకల వినియోగం పెరిగింది. ఇటుకల తయారీ ఇలా.. ప్లాస్టిక్ వ్యర్థాలైన బాటిళ్లు, కవర్లను ఒక పెద్ద బాయిలర్లో వేసి 105 నుంచి 110 డిగ్రీల వరకు వేడి చేసి, ద్రవరూపంలోకి మారుస్తారు. ఈ ద్రావకాన్ని గది ఉష్ణోగ్రత వద్ద అంటే 27 డిగ్రీలకు వచ్చేలా చల్చార్చుతారు. ఒక శాతం ప్లాస్టిక్ ద్రావకానికి మూడు, నాలుగు లేదా ఐదు శాతం మట్టి లేదా ఫ్లైయాష్ (బూడిద) లేదా సిమెంట్ను చేర్చి మిశ్రమంగా మారుస్తారు. ఇటుక కావాల్సిన పరిమాణంలో రూపొందించిన దిమ్మల్లో ఆ మిశ్రమాన్ని పోసి ఇటుకలు తయారు చేస్తారు. వారం రోజులపాటు ఈ ఇటుకలపై నీటిని చల్లాక (క్యూరింగ్) నిర్మాణాల్లో వినియోగిస్తారు. దేశంలో కొచ్చిలో శ్రీకారం కేరళలోని కొచ్చిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు ఇంజనీరింగ్ విద్యార్థులు నడుంబిగించారు. 500 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సమీకరించి.. 2,500 టన్నుల పరిమాణంలో ఇటుకలను తయారు చేసి, భవన నిర్మాణాల్లో వినియోగించేలా ప్రజలను చైతన్యవంతం చేశారు. ఒక టన్ను ప్లాస్టిక్ వ్యర్థాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే 800 కేజీల ప్లాస్టిక్ ద్రావకం వస్తుంది. ఒక శాతం ప్లాస్టిక్ ద్రావకానికి మూడు శాతం మట్టిని కలిపి తయారు చేసిన ఇటుక కంటే.. ఒక శాతం ప్లాస్టిక్ ద్రావకానికి నాలుగు శాతం మట్టిని కలిపి తయారు చేసిన ఇటుకలు బలంగా ఉంటాయని తేలింది. దేశంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్లాస్టిక్ వ్యర్థాలు భారీ ఎత్తున పేరుకుపోయి, పర్యావరణానికి పెను సవాల్ విసురుతున్న తరుణంలో ప్లాస్టిక్ ఇటుకల తయారీ, వినియోగంపై ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ ఇటుకల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించాలి ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుకల తయారీ పర్యావరణహితమైనది. భారీగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను సరైనరీతిలో రీసైక్లింగ్ చేసి, ప్రత్యామ్నాయ అవసరాలకు సద్వినియోగం చేసుకోవచ్చు. ఇతర ఇటుకలతో పోలిస్తే వీటి తయారీ వ్యయం, బరువు తక్కువ. నాణ్యత ఎక్కువ. మట్టి, ఫ్లైయాష్ ఇటుకల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారయ్యే ఇటుకలు నిర్మాణ రంగంలో మరింత అనువుగా ఉంటాయి. వీటిని భిన్న ఆకృతుల్లో తయారు చేసి అలంకృతంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ప్లాస్టిక్ ఇటుకల తయారీతో పాటు నిర్మాణ రంగంలో వీటి వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. – ఎస్పీ అంచూరి, ఆర్కిటెక్ట్, స్ట్రక్చరల్ ఇంజనీర్, హైదరాబాద్ -
ప్లాస్టిక్ తెస్తే పావు కేజీ స్వీటు
జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నియంత్రణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటి వరకు పలుమార్లు ఈ తరహా చర్యలు తీసుకున్నా సత్ఫలితాలు రాలేదు. దీంతో తాజాగా వినూత్న తరహాలో పర్యావరణానికి, ప్రజలకు హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలపై సమరభేరికి కార్పొరేషన్ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం రోటరీ క్లబ్ విజయనగరంతో కలిసి పని చేయాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు నిషేధించిన 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్తో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణకు చర్యలు తీసుకోనుంది. ఈనెల 17న జొన్నగుడ్డి ప్రాంతం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – విజయనగరం సాక్షి, విజయనగరం : నగరంలో ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధంపై ఈ విడత వినూత్న పంధాతో కార్పొరేషన్ ముందడుగు వేస్తోంది. రోటరీ క్లబ్ విజయనగరం అనుసంధానంతో నిర్వహించనున్న ఈ వినూత్న కార్యక్రమంలో భాగంగా కేజీ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇస్తే వారికి పావు కిలో స్వీట్బాక్స్ ఇస్తారు. మరింత మంది దాతలు ముందుకొస్తే అర డజను గుడ్లను ప్యాక్ చేసి అందించాలని భావిస్తున్నారు. అదే పెద్ద పెద్ద సంస్థలు, పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులు ఒకేసారి 250 కిలోల ప్లాస్టిక్ను ఇస్తే వారికి భారీ నజరానా చెల్లించనున్నారు. ఇలా ఇంట్లో ఉండే హానికరమైన ఒక్కసారి వినియోగించే పారేయాల్సిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రయోగాత్మకంగా రాజీవ్నగర్ కాలనీ, దాసన్నపేట ప్రాంతాల్లో నిర్వహించగా.. మంచి స్పందన లభించింది. ఈ స్పందనతో వారిలో మరింత చైతన్య నింపేందుకు ఇంటింటికి ప్రత్యేకంగా డస్డ్బిన్లు పంపిణీ చేశారు. అపార్ట్మెంట్లలో నివసించే వారైతే హోమ్ కంపోస్ట్ను తయారు చేసుకునే దిశగా చైతన్యపరుస్తున్నారు. ఈసారైన విజయవంతమయ్యేనా? ఈ ఏడాదిలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో 50 మైక్రాన్ల మందం కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ విక్రయాలపై ప్రజారోగ్య విభాగం అధికారులు గట్టిగానే కొరఢా ఝళిపించారు. దాదాపు 80 శాతం ఈ తరహా ప్లాస్టిక్ను వినియోగించేందుకు భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. కానీ పలు కారణాలతో అధికారులు దాడులు నిలిపివేయటంతో మళ్లీ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. కోలగట్లతో ప్రారంభం జొన్నగుడ్డి ప్రాంతంలో తొలుత ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, రోటరీ క్లబ్ అధ్యక్షుడు రవి మండాలు వెల్లడించారు. వారు గురువారం కార్పొరేషన్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో చేపట్టబోయే ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయా ప్రాంతీయులకు ముందుగా సమాచారం అందజేస్తామన్నారు. 250 కిలోలకు పైగా ప్లాస్టిక్ను అందజేసిన వారిని జనవరి 26న కలెక్టర్తో సన్మానించనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రక్రియ అమలుకు వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటామని తెలిపారు. నలభై వేల ఇళ్లకు గుడ్డ సంచులను ఉచితంగా పంపిణీ చేయనున్నామని వివరించారు. -
పుట్టిన చోటుకే ప్లాస్టిక్ చెత్త
మట్టిలో కలిసిపోయేందుకు వందల ఏళ్లు పడుతుందని ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపేస్తే... ఈ క్షణమే బతుకు బండి ఆగిపోయేంతగా మనుషులు ప్లాస్టిక్కి అలవాటు పడిపోయారు. అయితే ప్లాస్టిక్ ఏ ఇంధనంలోంచి తయారవుతోందో ఆ ఇంధనంలోకే తిరిగి తీసుకెళ్లడం ద్వారా పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు చెన్నైలో ఉంటున్న విద్య. విద్య కామర్స్ గ్రాడ్యుయేట్. వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ నిర్వహిస్తూ ఉన్నట్లుండి తన ప్రయాణాన్ని వేస్ట్ మేనేజ్మెంట్ వైపు మలుపు తిప్పుకున్నారు. ‘ఎ జర్నీ ఫ్రమ్ వెల్త్ టూ వేస్ట్’ అని నవ్వుతారామె. ఞ్ఞ్ఞఅంతేకాదు, ‘‘చెన్నైలో తాగడానికి పనికి వచ్చే నీటి చుక్క కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. వ్యర్థాలను విడుదల చేసే ఫ్యాక్టరీలు ఆ వ్యర్థాల మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టడం లేదు. నిజానికి వాళ్లు ఆ పని చేస్తే సమాంతరంగా రెండు రకాల ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతాం. ఇందుకోసం పర్యావరణ పరిరక్షణ మీద కనీస స్పృహ కల్పించాల్సిన అవసరం ఉంది’’ అంటారు విద్య. తప్పదు నిజమే ఏడాదికి దేశంలో దాదాపు అరవై లక్షల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ వస్తోంది. అందులో 20 శాతం మాత్రమే రీసైకిల్ అవుతోంది. మిగిలిన ప్లాస్టిక్ భూమిని, తాగునీటిని, సముద్రాలను కలుషితం చేస్తోంది. ప్లాస్టిక్ వాడకాన్ని నివారించమని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హెచ్చరిస్తూనే ఉంది. అయితే క్యారీ బ్యాగ్ల బదులు క్లాత్ బ్యాగ్ వాడకం తప్ప మరేదీ మన చేతిలో ఉండదు. ఉదయం పాలప్యాకెట్ నుంచి రాత్రి వేసుకునే మందుల డబ్బా వరకు ప్లాస్టికే. ఏ వస్తువు అయినా భద్రంగా రవాణా చేయాలంటే ప్యాకింగ్కి ప్లాస్టిక్ మీదనే ఆధారపడాల్సి వస్తోంది. వాడటం తప్పనిసరి అయినప్పుడు ప్లాస్టిక్ను డీ కంపోజ్ చేయడానికి సరైన పద్ధతి ఉంటే సమస్య నివారణ అయినట్లే. సరిగ్గా ఆ సామాజిక బాధ్యతనే తలకెత్తుకున్నారు విద్య, ఆమె భర్త అమర్నాథ్. వీళ్లేం చేస్తున్నారంటే..! విద్య దంపతులు ప్లాస్టిక్ వేస్ట్తో పర్యావరణ హితమైన ఇంధనాన్ని తయారు చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... ప్లాస్టిక్ని తిరిగి మూలరూపానికి తెస్తారు. ప్లాస్టిక్ వస్తువుల తయారీకి మూలవస్తువు క్రూడ్ ఆయిల్. వీళ్లు వేస్ట్ ప్లాస్టిక్ని ఐదువందల సెల్సియస్ వేడిలో కరిగించి పూర్వ రూపమైన క్రూడ్ అయిల్ను తీసుకువస్తారు. పైరోలిసిస్ అనే రియాక్టర్.. ప్లాస్టిక్ వేస్ట్ని పైరోసిలిస్ ఆయిల్, హైడ్రో కార్బన్ గ్యాస్, నల్లటి కార్బన్ పౌడర్లుగా మారుస్తుంది. గ్యాస్ని తిరిగి ప్లాస్టిక్ను వేడి చేయడానికి ఉపయోగిస్తారు. పౌడర్ని పెయింట్ కంపెనీలు, సిమెంట్ పరిశ్రమలు తీసుకుంటాయి. ఈ ఇంధనం మార్కెట్లో దొరికే మామూలు ఇంధనం కంటే 25 శాతం తక్కువ ధరకే లభిస్తోంది. వేస్ట్ మేనేజ్మెంట్ ఒక టన్ను ప్లాస్టిక్ వేస్ట్ నుంచి 500 లీటర్ల ఆయిల్ వస్తుంది. గ్యాస్, పౌడర్ వంటి బై ప్రోడక్ట్స్ కాకుండా ఆయిల్ లెక్క ఇది. ఇలాంటి పరిశ్రమలను దేశమంతటా స్థాపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు విద్య. ‘‘ప్లాస్టిక్ని తప్పు పట్టడం మానేయాలి. మనిషి సృష్టించిన అద్భుతాల్లో ప్లాస్టిక్ ఒకటి. ఇరవయ్యో శతాబ్దం పారిశ్రామికాభివృద్ధి వేగవంతం కావడంలో ప్లాస్టిక్ పాత్ర ముఖ్యమైనది. అయితే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న అసమతుల్యతకు కారణం... రీసైకిల్ చేసి మరీ వాడుకోగలిగిన ఈ మెటీరియల్ని నిర్లక్ష్యం చేయడమే. విలువైన ప్లాస్టిక్ వస్తువులను మాత్రమే రీసైకిల్ చేస్తున్నారు. మిగిలిన వాటిని వదిలేస్తున్నారు. అందుకే ఆ విలువలేని ప్లాస్టిక్ వేస్ట్ని ఇలా రీసైకిల్ చేస్తున్నాం’’ అని వివరించారు విద్య. – మను -
ప్లాస్టిక్ తీసుకొస్తే గుడ్లు ఫ్రీ
కామారెడ్డి క్రైం: జిల్లాలో ప్లాస్టిన్ను పూర్తిగా నిర్మూలించేందుకు అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఇందుకోసం త్వరలోనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రెండు కిలో ల ప్లాస్టిక్ను సేకరించి ఇస్తే అర డజన్ గుడ్లు ఉచితంగా అందించనున్నట్లు కలెక్టర్ సత్యనారాయ ణ ప్రకటించారు. శనివారం అధికారులతో స మావేశమయ్యారు. జిల్లాలో ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించేందుకు ఈ కార్యక్రమాన్ని ఈ నెల 4 నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ప్రతి గ్రామపంచాయతీతో పాటు మున్సిపాలిటీల పరిధిలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. మండల రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను బ్యానర్లు సిద్ధం చేసి ప్రదర్శించాలని అధికారులకు సూ చించారు. రెండు కిలోల ప్లాస్టిక్ను ఏరివేసిన వారికి స్థానికంగా ఉండే కిరాణ షాపుల ద్వారా గుడ్లను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తహసీల్దార్లు, ఎం పీడీవోలు, పోలీసు, రెడ్క్రాస్ సభ్యులు బృందాలుగా ఏర్పడి పర్యవేక్షించాలని సూచించారు. -
ప్లాస్టిక్పై యుద్ధం
సాక్షి, ములుగు: ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే రాజ్యమేలు తోంది. పల్లె లేదు.. పట్నం లేదు.. ఇల్లు లేదు.. వాకిలి లేదు.. ఎక్కడ చూసినా ఈ మహమ్మారే కనిపిస్తోంది. చివరకు పచ్చని అడవులు, ఆహ్లాదపరిచే పర్యాటక ప్రాంతాలు, భక్తి తన్మయత్వాన్ని పంచే ఆలయాలకు నెలవైన ములుగు ఏజెన్సీ జిల్లాలో సైతం ప్లాస్టిక్ భూతం బెంబేలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఈ మహమ్మారిని అరికట్టాలని నిర్ణయించారు. అయితే, ప్లాస్టిక్ వస్తువు లను ఇవ్వాలని అడిగితే ప్రజలు ముందుకురారని భావించిన ఆయన.. ఇందుకు ఓ ఉపాయం కని పెట్టారు. కేజీ ప్లాస్టిక్ అందించేవారికి కేజీ ఫైన్ రైస్ ఇస్తామని ప్రకటించారు. దీంతో భారీగా స్పందన వచ్చింది. జిల్లాలో గతనెల 16 నుంచి 26 వరకు చేపట్టిన కార్యక్రమం ద్వారా తొమ్మిది మండలాల్లోని 174 గ్రామపంచాయతీల పరిధిలో ఏకంగా 48,849 కేజీల ప్లాస్టిక్ సేకరణ జరగడం విశేషం. పైగా వరుస వర్షాలతో పనిలేక ఇబ్బందులు పడిన వారికి దీనివల్ల ఉపాధి కూడా కలిగినట్లయింది. ఇప్పటి వరకు సేకరించిన ఈ ప్లాస్టిక్ను డిస్పోజ్ చేయడానికి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లను సిమెంట్ ఫ్టాక్టరీలకు తరలిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో మేడారం జాతర వరకు దీనిని కొనసాగించాలని నిర్ణయించారు. జాకారం నుంచి మొదలు... 30 రోజుల ప్రణాళిక పనుల్లో భాగంగా ములుగు కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ సంగ్రాంసింగ్ పాటిల్ ములుగు మండలంలోని జాకారం గ్రామాన్ని పరిశీలించారు. ఆదివారం సెలవు దినం కావడంతో చిన్నారులు అక్కడ తిరుగుతూ కనిపించారు. దీంతో ఎస్పీ సంగ్రాంసింగ్ వారికి సరదాగా ప్లాస్టిక్ సేకరణ టాస్క్ ఇచ్చారు. దీంతో వారు మూడు బృందాలుగా విడిపోయి గంట సమయంలోనే ఏకంగా 996 ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించారు. వాటిని చూసిన నారాయణరెడ్డి.. ఒక్క గ్రామంలోనే ఇన్ని బాటిళ్లు ఉంటే జిల్లాలో ఎన్ని ఉంటాయో అని భావించి ప్లాస్టిక్పై సమరభేరి పూరించాలని నిర్ణయం తీసుకుని, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బియ్యం కొనుగోలుకు విరాళాలు... ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ సిబ్బంది తరపున ప్రతీ గ్రామం నుంచి పాత, కొత్త బట్ట సంచులను సేకరించారు. స్థానిక టైలర్ల సహాయంతో సుమారు 40వేల బట్ట సంచులను సేకరించి ప్రజలకు పంపిణీ చేశారు. ఇక ప్లాస్టిక్ గ్లాసులకు బదులుగా వెదురు బొంగులతో తయారు చేయించిన కప్పుల వాడకంపై జిల్లా సంక్షేమ శాఖ అవగాహన కల్పించింది. ప్లాస్టిక్కి అడ్డుకట్టగా మంగపేట మండల కేంద్రానికి చెందిన చికెన్ వ్యాపారి ఇంటి నుంచి టిఫిన్ బాక్సులు తీసుకొస్తే కేజీకి రూ.10 తక్కువ తీసుకుంటానని ప్రకటించాడు. ఇక ఫైన్ రైస్ కొనుగోలుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, వ్యాపారులు తమ వంతుగా విరాళాలు అందించారు. ఇలా అన్ని రంగాల ప్రజల చేయూతతో ఇతర జిల్లాలకు ఆదర్శంగా ములుగులో ప్లాస్టిక్ నిషేధం పకడ్బందీగా అమలవుతోంది. ఇది నిరంతర కార్యక్రమంగా కొనసాగుతుందని కలెక్టర్ ప్రకటించారు. ప్లాస్టిక్ వాడితే రూ.5వేల జరిమానా... జిల్లా యంత్రాంగం ఆదేశాలను పట్టించుకోకుండా ఎవరైనా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగిస్తే రూ.5వేల జరిమానా విధిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలకు వచ్చే వారు బయటి ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వస్తువులు, గ్లాసులు, ప్లేట్లు తీసుకురాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ములుగు మండలం గట్టమ్మ ఆలయంతో పాటు జిల్లా సరిహద్దుల్లో నాలుగు చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద వాహనాలు తనిఖీ చేసి వారి దగ్గర ఉన్న ప్లాస్టిక్ని తీసుకొని ప్రత్యామ్నాయంగా బట్ట సంచులు, ప్లాస్టిక్ రహిత గ్లాసులు, పేపర్ ప్లేట్లు అందిస్తారు. ఇందుకయ్యే ఖర్చును భక్తులు, పర్యాటకుల నుంచి వసూలు చేస్తారు. మేడారంపై ప్రత్యేక దృష్టి కోటిమందికి పైగా హాజరయ్యే మేడారం మహాజాతర వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది. ఈ నేపథ్యంలో జాతరలో ప్లాస్టిక్ని పకడ్బందీగా నిషేధించేందుకు జిల్లా యంత్రాంగం సమయత్తమవుతోంది. జాతర జరిగే సమయంలో వెయ్యి మంది వలంటీర్లను ప్రత్యేకంగా నియమిస్తారు. వీరంతా భక్తులను పరిశీలించి ప్లాస్టిక్ వాడకుండా చర్యలు తీసుకుంటారు. ప్లాస్టిక్ నియంత్రణ కొనసాగుతుంది జిల్లాలో చేపట్టిన ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహాయం అందించారు. ప్లాస్టిక్ నియంత్రణ నిత్యం కొనసాగుతుంది. గ్రామాల్లో ప్లాస్టిక్ సేకరణ దాదాపుగా పూర్తిచేశాం. అలాగే ప్లాస్టిక్ వస్తువులు విక్రయించకుండా నోటీసులిచ్చాం. జిల్లాలోని దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల్లోనూ అమలు చేస్తున్నాం. బయటి నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులు ప్లాస్టిక్ వస్తువులను తీసుకు రాకుండా ములుగు మండలం గట్టమ్మ ఆలయం వద్దే కాకుండా నలుమూలల చెక్పోస్టులు ఏర్పాటుచేస్తాం. ముఖ్యంగా మేడారం మహా జారతను ప్లాస్టిక్ ప్రీ జాతరగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నాం. – చింతకుంట నారాయణరెడ్డి, కలెక్టర్, ములుగు జిల్లా -
ప్లాస్టిక్ వేస్ట్లో నంబర్వన్ ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ : ‘కోకాకోలా’ కూల్ డ్రింక్కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణకు అత్యంత ప్రమాదకారిగా మారింది కూడా ఈ బ్రాండ్ ప్లాస్టిక్ సీసాలే. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్లాస్టిక్ వేస్టేజ్ని సృష్టిస్తున్నది జార్జియా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న కోకాకోలా కూల్ డ్రింక్స్ కంపెనీ అని ఓ అధ్యయనంలో తేలింది. ఆ తర్వాత స్థానాల్లో నెస్లే, పెప్సికో, మాండెలెజ్ ఇంటర్నేషనల్ కంపెనీలు ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు సృష్టిస్తున్న ప్లాస్టిక్ వేస్టేజ్కి సమానంగా ఒక్క కోకాకోలా కంపెనీయే సృష్టిస్తున్నట్లు ‘బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్స్’ అంతర్జాతీయ సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ ఇటీవల తన 72 వేల మంది కార్యకర్తలతో ప్రపంచవ్యాప్తంగా బీచ్ల వద్ద, కాల్వలు, చెరువుల వెంట, రోడ్ల పక్కన ప్లాస్టిక్ బాటిళ్లు, కప్పులు, ర్యాపర్లు, బ్యాగ్స్, ఇతర ప్లాస్టిక్ను ఏరించింది. దొరికిన ఇతర ప్లాస్టిక్కులతో దొరికిన కోకాకోలా, ఇతర కూల్ డ్రింక్ల ప్లాస్టిక్ బాటిళ్లను లెక్కపెట్టిచ్చింది. సరాసరిన 4,75,000 ప్లాస్టిక్లను సేకరించగా, వాటిలో 11,732 కోకాకోలా ప్లాస్టిక్ బాటిల్లే ఉన్నాయి. వీటిలో ఎనిమిది వేల బ్రాండ్లకు చెందిన 50 రకాల ప్లాస్టిక్లను బయట పడ్డాయి. నెస్లే, పెప్సికో, మాండెలెజ్ల తర్వాత యూనిలివర్, మార్స్, పీఅండ్జీ, కాల్గేట్–పామోలివ్, ఫిలిప్ మోరీస్ బ్రాండ్లు ఉన్నాయి. ఆఫ్రికా, యూరప్లలో అత్యధిక వేస్టేజ్లో కోకాకోలా నెంబర్ వన్ స్థానంలో ఉండగా, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాల్లో రెండో స్థానంలో ఉంది. నెస్టిల్ బ్రాండ్ ఉత్తర అమెరికాలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత ఎరుపు రంగు కప్పులను తయారు చేసే సోలో కంపెనీ రెండో స్థానంలో ఉండగా, స్టార్ బక్స్ మూడో స్థానంలో ఉంది. ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్కు బదులు రీసైక్లింగ్కు ఉపయోగించే ప్లాస్టిక్ను వాడడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, మొత్తంగానే ప్లాస్టిక్ను వదిలేసి ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాలని ప్రపంచ కార్పొరేట్ సంస్థలకు ఈ సందర్భంగా ‘బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్’ సంస్థ పిలుపునిచ్చింది. (చదవండి: రాజధానిలో హెల్త్ ఎమర్జెన్సీ) -
ప్లాస్టిక్కే.. పెనుభూతమై..
ప్లాస్టిక్ భూతం మానవాళికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.. నదీ, సముద్ర జలాలను కలుషితం చేస్తూ జీవరాశి ప్రాణాలను హరిస్తోంది.. భూగర్భ జలాలను విషతుల్యం చేస్తూ మనకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతోంది భూమిలో వందల ఏళ్లపాటు తిష్ట వేసి భూసారాన్ని పీల్చి పిప్పి చేస్తూ పంటల దిగుబడిని దెబ్బతీస్తోంది.. కాలుస్తుంటే గాలిని కలుషితం చేస్తూ వ్యాధులకు దారితీస్తోంది.. ఆకాశాన్నంటుతున్న కాలుష్యంతో భూతలం మీద జీవుల ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తోంది.. మన దైనందిన జీవితంలో భాగంగా మారిన ప్లాస్టిక్ కలిగిస్తున్న పెనుముప్పు ఇది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) లెక్కల ప్రకారం.. దేశంలో ప్రతి ఒక్కరు ఏడాదికి సగటున 11 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడుతున్నారు. ఈ లెక్కన మన దేశంలో 130 కోట్ల జనాభా ఏడాదికి 1,430 కోట్ల కిలోల ప్లాస్టిక్ను వినియోగిస్తున్నారు. దేశంలో తలసరి ప్లాస్టిక్ వినియోగం ఏడాదికి 2022 నాటికి 20 కిలోలకు, 2025 నాటికి 25 కిలోలకు చేరుతుందని అంచనా. కాగా.. అమెరికాలో ప్రతి ఒక్కరూ ఏడాదికి సగటున 109 కిలోలు, చైనాలో 38 కిలోలు వినియోగిస్తున్నారు. సాక్షి, అమరావతి: ఉదయం లేచాక ఇంటికి టిఫిన్ తెచ్చుకోవడం నుంచి ఇంటికి కావాల్సిన సరుకులు, కూరగాయలు, పండ్లు, పిల్లలకు చిరుతిండ్లు, ఆన్లైన్ షాపింగ్ల వరకు.. మరెన్నో రకాలుగా లెక్కకు మిక్కిలిగా సింగిల్ యూజ్ (ఒకసారి వాడి పారేసేది) ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు మన ఇంటిలో చేరుతున్నాయి. మన దేశంలో రోజుకు 26 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడుతున్నాయని అంచనా. ఇందులో మున్సిపాలిటీలు, పంచాయతీలు సేకరించని వ్యర్థాలు దాదాపు 10 వేల టన్నులు. అంటే.. ఆ వ్యర్థాలన్నింటినీ రీసైక్లింగ్ చేయడం లేదు. వీటికి అదనంగా ఆన్లైన్ మార్కెటింగ్, ఆహార పదార్థాల డెలివరీ యాప్ల ద్వారా నెలకు 22 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు అదనంగా చేరుతున్నాయి. ఈ వ్యర్థాలన్నీ మన కాలనీల్లో, ఊళ్లల్లో, రోడ్ల పక్కన, పర్యాటక ప్రదేశాల్లో.. ఇలా ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి కొన్నాళ్లకు కాలువలు, చెరువులు, నదులు, సముద్రాల్లో చేరుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రోజూ 8 మిలియన్ల ప్లాస్టిక్ ముక్కలు సముద్ర జలాల్లో కలుస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి సముద్రంలో చేపల బరువు కంటే ప్లాస్టిక్ వ్యర్థాల బరువే ఎక్కువగా ఉంటుందని ఎలన్ మెక్థన్ ఫౌండేషన్ అంచనా వేసింది. చట్టాలు ఏం చెబుతున్నాయంటే.. 2016లో కేంద్రం రూపొందించిన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం.. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు స్థానిక సంస్థలు బాధ్యత వహించాలి. రోజువారీ వచ్చే చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా విభజించి ఇంటింటికీ వెళ్లి సేకరించడం, వాటిని రీసైక్లింగ్ చేయడం, అనంతరం మిగిలిన వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం చేయాలి. ఈ నిబంధనలకు 2018లో కేంద్రం సవరణలు చేసి ప్లాస్టిక్ వ్యర్థాలు వెదజల్లే సంస్థలనే బాధ్యులను చేసింది. రీసైక్లింగ్ చేయడానికి వీలులేని మల్టీలేయర్ ప్లాస్టిక్ (చిప్స్ ప్యాకెట్లకు వాడేది)ను రెండేళ్లలో పూర్తిగా నిషేధించాలి. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను కేంద్రం రెండేళ్లపాటు వాయిదా వేసింది. దేశంలో సింగిల్యూజ్ ప్లాస్టిక్, 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ను నిషేధించినా అమలు సక్రమంగా లేదు. చాలా రాష్ట్రాల్లో తూతూమంత్రంగా సాగుతోంది. ప్రభుత్వాలు ఏం చేయాలి? - సింగిల్యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తిని నిషేధించాలి. ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. - ప్లాస్టిక్ వ్యర్థాలతో కొత్త ఉత్పత్తులను ప్రోత్సహించాలి. ప్లాస్టిక్తో పర్యావరణానికి హాని కలిగించే సంస్థలకు భారీ జరిమానాలు విధించాలి. ప్యాకింగ్ అవసరాల కోసం ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలి. - సిక్కిం దేశంలోనే తొలిసారిగా 1998లోనే సింగిల్యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి.. సమర్థంగా అమలు చేస్తోంది. సిక్కింను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలి. ప్రజలు ఏం చేయాలి? - ఇళ్లల్లో సింగిల్యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానుకోవాలి. రాగి, గాజు నీళ్ల సీసాలు వాడాలి. - పాలు, ఇతర పదార్థాలు, వస్తువుల ద్వారా వచ్చే ప్లాస్టిక్ కవర్లను చెత్తతో కలిపి పారేయకుండా ఒకచోట ఉంచి నెలకోసారి వాటిని పాత సామాన్లు, పాత పేపర్లు కొనేవారికి విక్రయించాలి. ఇలా చేస్తే వాటి రీసైక్లింగ్ సాధ్యమవుతుంది. - మార్కెట్కు వెళ్లేటప్పుడు చేతి సంచీ తీసుకెళ్లడంతోపాటు వాహనాల్లోనూ ఓ సంచీ పెట్టుకోవాలి. సంప్రదాయ, దేశీయ విధానాలే ఉత్తమం.. ప్లాస్టిక్ భూతాన్ని పారదోలాలి అంటే మనం పాత పద్ధతులనే అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో ఫంక్షన్లలో భోజనాలకు ఆకులతో చేసిన విస్తర్లు/అరటి ఆకులు వేసేవారు. సరుకుల ప్యాకింగ్కు పాత పత్రికలు, చిత్తు కాగితాలు వాడేవారు. విస్తర్లు, పేపర్ కవర్ల తయారీ కుటీర పరిశ్రమగా ఉండి ఎంతోమందికి స్వయం ఉపాధి లభించేది. అదేవిధంగా జనపనార ఉత్పత్తుల వాడకాన్ని కూడా పెంచాలి. కొద్ది రోజుల కిందట తమిళనాడులో ఒక ఆవు అనారోగ్యంతో ఉండటంతో దాని యజమాని వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించగా పరిశీలించిన వైద్యులు దాని కడుపులో భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయని తేల్చారు. ఏకంగా ఐదు గంటలపాటు ఆవుకు శస్త్రచికిత్స నిర్వహించి ఆ వ్యర్థాలను బయటకు తీశారు. అవి ఏకంగా 52 కిలోలు ఉండటం చూసి నివ్వెరపోయారు. రోడ్లపై ప్లాస్టిక్ వ్యర్థాలు ఎలా పెరిగిపోతున్నాయనేదానికి, ఎలాంటి అనర్ధాలు సంభవిస్తాయి అనేదానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. ప్లాస్టిక్తో నష్టాలెన్నో.. - నదులు, సముద్ర జలాల్లో కలిసే ప్లాస్టిక్ వ్యర్థాలను చేపలు, కొన్ని అరుదైన తాబేళ్లు, తిమింగలాలు తిని మరణిస్తున్నాయి. విషతుల్యమైన చేపలను తిని ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. - వేడి ఆహార పదార్థాలు, పానీయాలను తినడానికి, తాగడానికి వాడే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల నుంచి కరిగిన ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్తోంది. దీనివల్ల చర్మ, జీర్ణకోశ సమస్యలు, థైరాయిడ్, గొంతు నొప్పి సంభవిస్తున్నాయి. - ప్లాస్టిక్ను కాలుస్తుండటంతో తీవ్ర వాయు కాలుష్యం విడుదలై శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో చేరడంతో భూగర్భ జలాలు కలుషితమై మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. - ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి పొరల్లో వందల ఏళ్లు ఉండిపోతుండటంతో భూసారం తగ్గి పంటల దిగుబడులు తగ్గుతున్నాయి. ఏటా 8 లక్షల తాబేళ్లు, 10 లక్షల సముద్ర పక్షులు, మరెన్నో చేపలు మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ రహిత జిల్లాయే లక్ష్యం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో సింగిల్యూజ్ ప్లాస్టిక్ను నిషేధిస్తూ మూడు నెలల క్రితం నోటిఫికేషన్ ఇచ్చాం. క్రెడాయ్ వంటి సంస్థల భాగస్వామ్యంతో రైతు బజార్లు, మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సింగిల్యూజ్ ప్లాస్టిక్ రహిత జిల్లాగా కృష్ణా జిల్లాను తీర్చిదిద్దడమే మా లక్ష్యం. – ఇంతియాజ్, కలెక్టర్, కృష్ణా జిల్లా సింగిల్యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తి నిషేధించాలి సింగిల్యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తిని ప్రభుత్వం నిషేధించాలి. అన్ని రాష్ట్రాల్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్కు తగిన మౌలిక సదుపాయాల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ వస్తువుల ఉత్పత్తిని, మార్కెటింగ్ను పెంచాలి. – మనోజ్ నలనాగుల, పర్యావరణ శాస్త్రవేత్త ప్రత్యామ్నాయ వస్తువులను ప్రోత్సహించాలి సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించాలి. అడ్డాకులతో చేసిన విస్తర్లు, ప్లేట్లు, కాగితాల కవర్లు, జనపనార ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడంతోపాటు వాటి మార్కెటింగ్కు ప్రభుత్వాలు కృషి చేయాలి. దీంతో ఎంతోమందికి స్వయం ఉపాధి కూడా లభిస్తుంది. – జేవీ రత్నం, గ్రీన్ క్లైమేట్ సంస్థ ప్రతినిధి సమన్వయంతోనే సమర్థంగా.. బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ నిషేధం కోసం 2008లో అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాం. విద్యాసంస్థలు, మార్కెట్లు, కూరగాయల బజార్లతోపాటు ఇంటింటికీ తిరిగి పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. మూడేళ్లలోనే బొబ్బిలి మున్సిపాలిటీని ప్లాస్టిక్ రహితంగా చేయగలిగాం. ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల సహకారంతో పనిచేస్తే రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేదాన్ని సమర్థంగా అమలు చేయొచ్చు. – రాజగోపాల్ నాయుడు, అమ్మ ఫౌండేషన్, బొబ్బిలి ప్లాస్టిక్ను తినేసే బ్యాక్టీరియా ప్లాస్టిక్ వ్యర్థాల ముప్పును శాశ్వతంగా తొలగించడానికి ప్రపంచ శాస్త్రవేత్తలు పరిశోధనలు ముమ్మరం చేశారు. స్పెయిన్లోని కాంటాబ్రియా యూనివర్సిటీలో బయోమెడిసిన్– బయోటెక్నాలజీ విభాగం శాస్త్రవేత్తలు సింగిల్యూజ్ ప్లాస్టిక్ను తినే చిన్న పురుగులను గుర్తించారు. అయితే.. ఆ పురుగులపై ఎంతవరకు ఆధారపడొచ్చు.. వాటితో ఇతర సమస్యలేమైనా తలెత్తుతాయా అనే అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు. -
మానవ రక్తంలోనూ ‘ప్లాస్టిక్’ గంటలు!
-
మానవ రక్తంలోనూ ‘ప్లాస్టిక్’ గంటలు!
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారా, లేదా ? నిషేధిస్తే ఏ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు ? ఎందుకు ? అసలు ప్లాస్టిక్లు ఎన్ని రకాలు, వాటిని ఎలా తయారు చేస్తారు ? అన్న విషయాల్లో ప్రజల్లో గందరగోళం నెలకొని ఉంది. దేశంలో ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ను జాతిపతి మహాత్మా గాంధీ 150 జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నిషేధించానుకున్నారు. అధికారుల సూచనల మేరకు ఆయన తన నిర్ణయాన్ని తుది దశలో వాయిదా వేసుకున్నారు. అయితే ప్రజల్లో చైతన్యం తీసుకరావడానికి ఒక్కసారి మాత్రమే ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ను వినియోగంచరాదంటూ ప్రచారం చేస్తున్నారు. 2020 సంవత్సరలో నిషేధ ఉత్తర్వులు వెలువడుతాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు సూచన›ప్రాయంగా చెబుతున్నారు. మరి రెండేళ్లు జాప్యం కూడా కావచ్చు. దేశ ఆర్థిక పరిస్థితి అంతగా బాగా లేదని, ఈ సమయంలో ప్లాస్టిక్పై నిషేధం విధిస్తే దేశంలోని అనేక చిన్న పరిశ్రమలు దెబ్బతింటాయని, ప్లాస్టిక్ బ్యాగ్స్, కప్పులు, ప్లేట్లు, స్ట్రాలు, వాటర్ బాటిళ్లు, పెప్ సోడాలను ఉపయోగించే చిన్న చిన్న హోటళ్లపైనా భారం పడుతుందని, తద్వారా నిరుద్యోగ సమస్య పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించడంతో మోదీ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. దేశంలో ఏటా 30 కోట్ల టన్నుల ఉత్పత్తి దేశంలో ఏటా దాదాపు 30 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో 50 శాతం మాత్రమే రీసైక్లింగ్కు పనికొచ్చేది. అంటే 50 శాతం ప్లాస్టిక్ను ఒక్కసారి ఉపయోగించి పడేయాల్సిందే. ప్రçపంచ వ్యాప్తంగా రీసైక్లింగ్కు పనికొచ్చే 50 శాతం ప్లాస్టిక్లో కేవలం 10–13 శాతం మాత్రమే రీసైక్లింగ్ జరుగుతోంది. అందుకనే ప్రతి దేశంలో వధా ప్లాస్టిక్ గుట్టలుగా పేరుకుపోతోంది. అవి తిన్న జీవ జాతులు చనిపోతున్నాయి. ప్లాస్టిక్ ఎప్పుడూ ‘జీవ శైథిల్యం’ చెందదు. కాకపోతే చిన్న చిన్న ముక్కలుగా మారి కాల్వల్లో, నదుల్లో, సముద్రాల్లో కలవడమే కాకాండా భూగర్భ జలాల్లో కూడా కలుస్తోంది. చేపల కడుపుల్లోనే కాకుండా రక్తంలో కూడా ప్లాస్టిక్ ఆనవాళ్లు కనిపించాయని ఆ మధ్య వైద్యులు చెప్పగా, మానవుల రక్తంలో కూడా ప్లాస్టిక్ కణాలు చేరాయని ఇటీవల లండన్ వైద్యులు ధ్రువీకరించారు. ప్లాస్టిక్ కణాలు శరీరంలోని వివిధ అంతర్గత అవయవాలకు చేరుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ప్లాస్టిక్ కణాల వల్ల మనుషుల్లో ‘ఎండోక్రైన్’ వ్యవస్థ దెబ్బతిని క్యాన్సర్లు, సంతాన వైఫల్యాలు కలగడమే కాకుండా పుట్టుకతో వచ్చే అవలక్షణాలు, చెముడు సంక్రమించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ అంటే ఏమిటీ ? వివిధ రకాల వస్తువులు, ఆహార పదార్థాల ప్యాకేజీకి ఉపయోగించే దళసరి ప్లాస్టిక్తోపాటు ప్లాస్టిక్ బ్యాగ్లు, కప్పులు, ప్లేట్లు, స్ట్రాలు, కాఫీ కలుపుకునే పుల్లలు, వాటర్ బాటిళ్లు, పెప్ సోడా బాటిళ్లు అన్ని కూడా ఒకసారి ఉపయోగించి రీసైకిలింగ్కు పనికిరాని ప్ల్రాస్టిక్ వస్తువులే (కొన్ని రకాల ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు రీసైక్లింగ్కు పనికొస్తాయి). శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ ప్లాస్టిక్ను కరిగిస్తే.. ద్రవరూపానికి మారదు. ఇవన్నీ కూడా పెట్రోలియం ద్వారా తయారవుతాయి కనుక ‘జీవ శైథిల్యం’ చెందవు. అంటే బ్యాక్టీరియా, క్రిమికీటాదులు తినేయడం వల్ల అంతరించిపోవడం. ప్లాస్టిక్ మూడు రకాలు పెట్రోలియంతో తయారయ్యే ప్లాస్టిక్. వీటిలో పొలిథిలిన్, పోలిప్రాపిలిన్, పోలిస్టర్, పొలిస్టరిన్, నైలాన్, ఆక్రిలిక్ రకాలు ఉన్నాయి. ఇవేవీ ‘బయో డీగ్రేడబుల్’ కావు. మొక్కలతో తయారయ్యేవి రెండోరకపు ప్లాస్టిక్. చెరకు గడలు, మొక్కజొన్న గింజలు, బంగాళ దుంపలు, మరొకొన్ని రకాల మొక్కలతో తయారు చేస్తారు. మూడో రకం బయోప్లాస్టిక్. ప్రధానంగా బ్యాక్టీరీయా, కొన్ని రకాల క్రిములతో తయారు చేస్తారు. ఈ రెండు రకాల ప్లాస్టిక్ ‘బయో డీగ్రేడబుల్’. ఈ రోజుల్లో ఏ వస్తువైన కుళ్లి పోవడం, జీవ శైథిల్యం చెందడం అంత తొందరగా జరిగే ప్రక్రియ కాదు. అందుకు కొన్నేళ్లు పడుతుంది. అటవి సంపద తగ్గిపోవడం, జీవ వైవిధ్యం అంతరించి పోతుండడం కారణం. బయో డీగ్రేడబుల్కు కూడా పరిశ్రమలను స్థాపించడమే ప్రత్యామ్నాయ మార్గం. పెట్రోలియంతో తయారయ్యే ప్లాస్టిక్ను ఉపయోగించి క్రూడాయిల్ను తయారు చేయవచ్చు. చేస్తున్నారు కూడా. ప్లాస్టిక్ గుట్టలను కరిగించినా వచ్చే ఇంధనం తక్కువే. పేరుకుపోతున్న ప్లాస్టిక్ను అన్ని విధాల రీ స్లిక్లింగ్ చేయడంతోపాటు ఒకేసారి ఉపయోగించే పారేసే ప్లాస్టిక్నే కాకుండా పెట్రోలియంతో తయారయ్యే ప్రతి ప్లాస్టిక్ను క్రమంగా నిషేధించాల్సిందే. ఇందుకు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరం. -
ప్లాస్టిక్ భరతం పట్టే కొత్త టెక్!
వీధుల్లో, చెరువుల్లో, సముద్రాల్లో చేరిపోయి మనిషిని రకరకాలుగా ముప్పు తిప్పలు పెడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు ఓ పరిష్కారం దొరికిందని అంటున్నారు స్వీడన్ లోని చామర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. భూమ్మీద ఉన్న ప్లాస్టిక్ చెత్తనంతా కరిగించేయడమే కాకుండా.. దాన్ని మళ్లీ తాజా ప్లాస్టిక్లా వాడుకునే అద్భుత టెక్నాలజీని వీరు అభివృద్ధి చేశా రు. ఆవిరితో కరగబెట్టడం ద్వారా ప్లాస్టిక్ను అణుస్థాయిలో విడగొట్టడం ద్వారా ఈ సాంకేతికత పని చేస్తుందని ఈ పద్ధతిని ఆవిష్కరించిన శాస్త్రవేత్త హెన్రిక్ థున్మన్ తెలిపారు. ప్లాస్టిక్ను సుమారు 850 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేయడం ద్వారా వచ్చే వాయువును కొన్ని పద్ధతుల ద్వారా మళ్లీ తాజా ప్లాస్టిక్ మాదిరిగా వాడుకోవచ్చని వివరించారు. ఇప్పుడున్న ఫ్యాక్టరీల్లోనే ఈ సరికొత్త రీసైక్లింగ్ ప్రక్రియను చేసుకోవచ్చని చెప్పారు. ప్రయోగాల్లో తాము 200 కిలోల ప్లాస్టిక్ చెత్తను గంటలో మళ్లీ ప్లాస్టిక్ను ఉత్పత్తి చేయగల వాయురూపంలోకి మార్చేశామని తెలిపారు. ఏడాదికి 35 కోట్ల టన్నులు.. 2015 నాటి లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తమ్మీద ఏడాదికి ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ దాదాపు 35 కోట్ల టన్నులు. ప్రస్తుతం చాలావరకు ప్లాస్టిక్ చెత్తను మండించి ఆ వేడితో విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఉపయోగిస్తున్నారు. లేదా వ్యర్థాలు ఎక్కువ స్థలం ఆక్రమించకుండా చూసేందుకు కాల్చేయడాన్ని ఒక మార్గంగా పరిగణిస్తున్నారు. దీనివల్ల కార్బన్ డయాక్సైడ్తోపాటు అనేక ఇతర విషవాయువులు గాల్లోకి చేరి పరిసరాలను కలుషితం చేస్తున్నాయి. మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల్లో సుమారు 60 శాతం చెత్త కుప్పల్లోకి చేరుతోంది. రీసైక్లింగ్ కోసం సేకరిస్తోంది 14 శాతం మాత్రమే. మొత్తం వ్యర్థాల్లో 8 శాతాన్ని చౌకరకం ప్లాస్టిక్గా రీసైకిల్ చేస్తుండగా 2 శాతం కొంచెం నాణ్యమైన పదార్థంగా అందుతోంది. ఒక శాతం వ్యర్థాలు మాత్రం వీధుల్లో, నదుల్లో, ఇతర ప్రాంతాల్లో పేరుకుపోయి సమస్యగా మారుతోంది. కర్బన పరమాణువులతో మ్యాజిక్.. ప్లాస్టిక్ను చెత్తగా పడేశాక దాన్ని రీసైకిల్ చేసినా నాణ్యత పెరగదు. ఈ కారణంగానే హెన్రిక్ బృందం ప్లాస్టిక్ పునర్వినియోగానికి ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. పదార్థంలోని కర్బన పరమాణువులను సేకరించి వాడుకునేందుకు ప్రయత్నించింది. వాటిద్వారా మళ్లీ సరికొత్త, నాణ్యమైన ప్లాస్టిక్ను ఉత్పత్తి చేయడం ద్వారా ముడిచమురుతో ప్లాస్టిక్ను తయారు చేయాల్సిన అవసరాన్ని గణనీయంగా తగ్గించొచ్చు. ‘మా ఆలోచనలను పరీక్షించుకునేందుకు 200 కిలోల ప్లాస్టిక్ను రీసైకిల్ చేశాం. అది కాస్తా విజయవంతమవడంతో ప్రస్తుతం మొత్తం ప్రక్రియను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. చమురు శుద్ధి కేంద్రాలనే రీసైక్లింగ్ ప్లాంట్లుగాను మార్చేందుకు ఏం కావాలో పరిశీలిస్తున్నాం’అని హెన్రిక్ తెలిపారు. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
చేతులు కలిపారు... చెరువును శుభ్రం చేశారు..
సాక్షి, హైదరాబాద్: ‘పరుగు పెట్టండి.. ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించండి’ ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం మన్కీ బాత్ కార్యక్రమంలో చెప్పిన మాట. శరీర ఆరోగ్యానికి పరుగు ముఖ్యమని, అదే సమయంలో రోడ్డుపై కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాలను తీసి చెత్తకుండీలో వేయాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకు రిపుదమన్ బెల్వి అనే యువకుడు చేపట్టిన ఈ తరహా ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ స్వయంగా అతడికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. దానిని ఆదర్శంగా తీసుకోవాలని మోదీ పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే తరహాలో నగరానికి చెందిన 10 మందితో కూడిన యువ బృందం ఓ చెరువును తమ స్థాయిలో శుభ్రపరిచి ఆకట్టుకున్నారు. ‘యానిమల్ వారియర్స్ కన్సర్వేషన్ సొసైటీ’ సభ్యులు నగర శివారులోని అమీన్పూర్ చెరువుకు చేరువలో ఉన్న కింగ్ఫిషన్ చెరువును శుభ్రం చేశారు. సొసైటీ ఫౌండర్ ప్రదీప్ నాయర్ ఆధ్వర్యంలో సంజీవ్ వర్మ, సంతోషి, ప్రభు, మనీష్, పవన్, అనిరుధ్, అనురుధ్ సహదేవ్, నమ్రత, పూజిత, రాఘవ్ తదితరులు చెరువు నుంచి 12 బస్తాల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఉదయపు వ్యాయామంలో భాగంగా ఆ చెరువు వద్దకు వెళ్లిన వారు అది ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయినట్లు గుర్తించారు. దీంతో జాలరులకు చెందిన రెండు తెప్పలను తీసుకుని చెరువులోకి వెళ్లి ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించారు. ‘ఈ చెరువు సహజ అందాలకు నెలవు. ఇక్కడికి విదేశీ పక్షులు క్రమం తప్పకుండా వలస వస్తాయి. అయితే దీనిపై అవగాహన లేక స్థానికులు ప్లాస్టిక్ వ్యర్ధాలను అందులో డంప్ చేస్తుండటంతో చెరువు కాలుష్య కాసారంగా మారింది. ఇది వలస పక్షుల రాకపై ప్రభావం చూపనుంది. అందుకే మాకు చేతనైన స్థాయిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించాం’ అని సొసైటీ సభ్యుడు సంజీవ్ వర్మ పేర్కొన్నారు. కొందరు తాగుబోతులు ఈ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని మద్యం తాగేందుకు ప్లాస్టిక్ గ్లాసులు తెచ్చి నిత్యం చెరువులో పడేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిని అరికట్టాలని సంబంధిత అధికారులను కోరారు. అమీన్పూర్ శివారులోని చిట్టడివిలో సమీపంలోని ప్రాంతాల చిన్నారులతో సభ్యులు మోగ్లీ వాక్ నిర్వహించారు. పర్యావరణం, ప్రకృతి, జీవవైవిధ్యం, పక్షులపై చిన్నారులకు అవగాహన కల్పించారు. గతంలో మన చుట్టూ పక్షులు ఎలా ఉండేవో, ఇప్పుడు ఎందుకు తగ్గిపోయావో, అవి అంతరించకుండా మనం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. -
చెంబురాజు..చెత్తరాజు...దొంగరాజు!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో అమలు చేస్తున్న 30 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం నుంచి సోమవారం (30వ తేదీ) వరకు ‘స్వచ్ఛసర్వేక్షణ్ ’కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా చెత్తసేకరణ, నిర్వహణ, తడి, పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుచేస్తారు. అధికారులు పల్లెల్లో బృందాలుగా విడిపోయి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఇంట్లో చెత్తబుట్టలు ఉండేలా చర్యలతో పాటు, ట్రాక్టర్ల ద్వారా చెత్తను డంప్ యార్డులను తరలిస్తారు. ఈ యార్డుల్లో కంపోస్ట్ ఎరువు తయా రీ, బహిరంగ మలవిసర్జన చేయకుండా చూడడం వంటివి అమలు చేస్తారు. దాతలకు వైవిధ్య గుర్తింపు.. గ్రామాల అభివృద్ధికి రూ.లక్ష అంతకు మించి డబ్బు లేదా వస్తు రూపేణా ఇచ్చిన దాతల పేరును ఏడాదిపాటు నోటీస్ బోర్డుపై ఉంచడంతో పాటు వారికి ‘మా ఊరి మహారాజపోషకులు’గా పరిగణించాలని వివిధ గ్రామ పంచాయతీలు నిర్ణయించాయి. రూ.10 వేల నుంచి రూ.లక్ష ఆపైనా డబ్బు లేదా వస్తురూపేణా ఇచ్చే దాతల పేర్లను నోటీస్ బోర్డుపై నెలరోజులపాటు ఉంచి ‘మా ఊరి మహారాజు’గా గుర్తిస్తారు. రూ.5 నుంచి రూ.10 వేలు ఆపైనా ఇచి్చన దాతల పేరును నోటీసుబోర్డుపై వారం పాటు ఉంచడంతో పాటు‘మా ఊరి రాజు’గా వ్యవహరిస్తారు. ఇక బహిరంగ మల విసర్జనకు పాల్పడే వారికి రూ.500 వరకు జరిమానా విధించాలని వివిధ గ్రామపంచాయతీలు, గ్రామసభలు నిర్ణయించాయి. ఈ పనికి పాల్పడేవారికి ‘చెంబురాజు’గా పిలుస్తారు. రోడ్లపై, బహిరంగస్థలాల్లో చెత్తాచెదారం పారవేసే వారికి ‘చెత్తరాజు’గా నిర్ణయించారు. చెత్తా చెదారం, వ్యర్థాలు ఆరుబయట, రోడ్లపై, బహిరంగస్థలాల్లో వేసే వారికి కూడా రూ.500 వరకు జరిమాన వేస్తారు. విద్యుత్ దొంగతనానికి పాల్పడేవారికి ‘దొంగరాజు’గా వ్యవహరించనున్నారు. బుధవారం నుంచే ఇవి అమలులోకి వచ్చాయి. -
ప్లాస్టిక్పై బదులు తీర్చుకుందాం!
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలంటే ప్రభుత్వం, అధికార యంత్రాంగమే కాదు.. ప్రజలు కూడా నడుం బిగించాలి. అప్పుడే ఈ మహమ్మారిని మన దరిదాపుల్లో కూడా లేకుండా తరిమేయడం సాధ్యం అవుతుంది. అందుకోసం ప్రజల్లో అవగాహన ఎంతో అవసరం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలంటూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ను రీసైకిల్ చేయడంలో భాగంగా వ్యర్థాల సేకరణ పాలక వర్గాలకు సవాలుగా మారుతోంది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు వినూత్న ప్రయోగాలు చేస్తున్నాయి. వస్తు వినిమయ పద్ధతిలో ప్లాస్టిక్ను పాతరేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇండొనేసియాలో సముద్రంలో ప్లాస్టిక్ కాలుష్యం చాలా ఎక్కువ. దీన్ని అడ్డుకునేందుకు పది ప్లాస్టిక్ కప్పులు, ఐదు ప్లాస్టిక్ బాటిళ్లు ఇస్తే.. దానికి బదులుగా బస్సులో గంట పాటు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది అక్కడి ప్రభుత్వం. అచ్చం మన దేశంలో కూడా కొన్ని చోట్ల ఇలా వస్తు వినిమయ పద్ధతిలో ప్లాస్టిక్ను సేకరిస్తున్నారు.. ఎక్కడెక్కడో తెలుసుకుందామా మరి..! ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్ మున్సిపాలిటీలో అధికారులు మరో రకంగా ఆలోచించారు. చెత్త ఏరుకునే వారు 500 గ్రాముల ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొస్తే.. దానికి బదులుగా వారికి భోజనం పెడుతున్నారు. ఈ నిర్ణయంతో అటు ప్లాస్టిక్ను రీసైకిల్ చేయొచ్చు.. ఇటు భోజనం చేయలేని వారి కడుపు నింపినట్లు అవుతుందని మున్సిపల్ కమిషనర్ మనోజ్ సింగ్ వివరించారు. స్కూల్ ఫీజుగా.. అసోంకు చెందిన మజిన్ శర్మ, పారమితలు 2016లో ‘అక్సర్’పేరుతో ఓ పాఠశాలను ప్రారంభించారు. ఆ స్కూల్లో చేరిన పిల్లలకు ఫీజు ఏంటో తెలుసా.. ప్లాస్టిక్. అవును స్కూల్ ఫీజుకు బదులు 25 ప్లాస్టిక్ వస్తువులు తీసుకురావాలి. ఈ స్కూల్లో ఉన్న దాదాపు వంద మంది పిల్లలు రోజూ తీసుకొచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు స్కూల్ సిబ్బంది వేరు పరిచి.. రీసైకిల్ చేస్తారు. ఉదాహరణకు.. ప్లాస్టిక్ బాటిళ్లను సగానికి కోసి.. మొక్కల కుండీలుగా వాడుతారు. ఉచిత భోజనం.. పశ్చిమ బెంగాల్ 500 గ్రాముల ప్లాస్టిక్ తీసుకొచ్చిన ఎవరికైనా ఉచిత భోజనం అందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి జిల్లాలో గోథెల్స్ మెమోరియల్ స్కూల్ పూర్వ విద్యార్థులు, నిష్కామ ఖల్సా సేవా సంఘం వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రతి శనివారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ప్లాస్టిక్ ఇవ్వండి.. రీచార్జ్ చేసుకోండి.. ప్లాస్టిక్ను రీసైకిల్ చేసేందుకు మన రైల్వే కొత్త పంథాలో వెళ్తోంది. దేశంలోని 128 రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ను క్రష్ చేసేందుకు దాదాపు 160 మెషీన్లు ఉన్నాయి. ఇంకా 400 మెషీన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేకమేంటంటే.. మనం ప్లాస్టిక్ బాటిళ్లను ఇస్తే వాటికి తగ్గట్టు మన మొబైల్ ఫోన్లో రీచార్జ్ చేస్తారు. సేకరించిన ఆ బాటిళ్లను క్రష్ చేసి.. రీసైకిల్ చేస్తారు. చాయ్ చటుక్కున తాగేయ్.. ప్రయాగరాజ్లో ఏటా జరిగే కుంభమేళాలో టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతుంటాయి. ఈ సమస్య పరిష్కారానికి ప్రయాగరాజ్ నగర నిగమ్ (మున్సిపాలిటీ) అక్క డక్కడా చిన్న చిన్న టీ యంత్రాలను ఏర్పాటు చేసింది. అయితే ఆ యంత్రాల్లో డబ్బులు కాకుండా.. ప్లాస్టిక్ వ్యర్థాల ను వేస్తే వేడి వేడి చాయ్ అందిస్తాయి. రోజూ సాయంత్రం ఆ ప్లాస్టిక్ను పారిశుధ్య కార్మికులు సేకరించి రీసైకిల్ చేస్తారు. -
ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫుట్పాత్ టైల్స్, టాయిలెట్లు
గచ్చిబౌలి: ప్లాస్టిక్ భూతం మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చెత్తలో పేరుకుపోయిన ప్లాస్టిక్ భూసారంతో పాటు భూగర్భ జలాలు కలుషితం చేస్తూ మానవాళిని ఆందోళనకు గురి చేస్తోంది. అలాంటి ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేసి టైల్స్ను తయారు చేశారు. ఆ టైల్స్తో ఫుట్పాత్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ వెస్ట్ జోనల్ అధికారులు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ప్లాస్టిక్ రీసైక్లింగ్తో తయారు చేసిన వాల్, రూఫ్ షీట్స్తో టాయిలెట్ల నిర్మాణం చేపట్టడం విశేషం. మియాపూర్ మెట్రో వద్ద ప్లాస్టిక్ రీసైక్లింగ్తో తయారు చేసిన షీట్స్తో ఫైర్ ప్రూఫ్ గదిని నిర్మించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రీసైక్లింగ్తో ప్లాస్టిక్ వ్యర్థానికి ఓ అర్థం చెబుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. అయ్యప్ప సొసైటీలో ఫుట్పాత్ల నిర్మాణం.. ఆర్డర్ చేసి ఇండోర్ నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ టైల్స్ను తెప్పిస్తున్నారు. శేరిలింగంపల్లి సర్కిల్– 20లోని డాగ్ పార్క్, శిల్పారామం ముందు, చందానగర్ సర్కిల్ 21లోని అయ్యప్ప సొసైటీ 100 అడుగుల రోడ్డులో ఫుట్పాత్ల నిర్మాణం పైలట్ ప్రాజెక్ట్గా చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ, బ్యాంబూ హౌస్ ఇండియా సంయుక్తంగా ఫుట్పాత్ల నిర్మాణం చేస్తున్నాయి. 6 నెలలకోసారి ఈ టైల్స్ను మార్చాల్సిన అవసరం లేకపోవడంతో ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. 600 పాలీబ్యాగ్స్ను రీసైక్లింగ్ చేస్తే 300 గ్రాముల బరువైన ఒక టైల్ను తయారు చేయవచ్చు. దృఢంగా ఉండే ఈ టైల్స్ డ్యామేజ్ కావు. అంతేకాకుండా వర్షపు నీటిని భూమిలోకి ఇంకేందుకు వీలుంటుంది. భూగర్భ జలాలు పెంపొందేందుకు అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ టైల్స్ను బెస్ట్ ప్రాక్టీస్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఇలాంటి టైల్స్ను వాడాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఎకో ఫ్రెండ్లీ టైల్స్ వాడకంతో ప్లాస్టిక్ వ్యర్థాలను డంప్ యార్డ్కు చేరకుండా చేయవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ గుర్తించింది.. ప్లాస్టిక్ రిసైక్టింగ్ టైల్స్తో ఫుట్పాత్లు వేయడాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అర్బన్ అఫైర్స్ గుర్తించింది. ఇలాగే దేశవ్యాప్తంగా అమలు చేయాలని మార్గదర్శకాలు పంపించింది. రీసైక్లింగ్తో డంప్ యార్డ్లకు ప్లాస్టిక్ తగ్గే అవకాశం ఉంది. మన దగ్గర ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసి 3000 చెత్త డబ్బాలు ఉత్పత్తి చేసి జోనల్ పరిధిలో పెట్టాం. ఇప్పుడు 21 చెరువుల వద్ద రిసైక్లింగ్ షీట్స్తో టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్లాస్టిక్ రిసైక్లింగ్ వాల్, రూఫ్ టాప్ షీట్లతో ఫైర్ ప్రూఫ్, సేఫ్టీ గదిని మియాపూర్ మెట్రో వద్ద ప్రయోగాత్మకంగా నిర్మించాం. – హరిచందన దాసరి, వెస్ట్ జోనల్ కమిషనర్ ఫైర్ ప్రూఫ్ గది నిర్మాణం.. మియాపూర్ మెట్రో స్టేషన్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్తో చేసి షీట్స్తో వాచ్మెన్ ఉండేందుకు ఫైర్ప్రూఫ్ గదిని నిర్మించారు. రూ.1.50 లక్షల వ్యయంతో ఈ హౌస్ను ఏర్పాటు చేశారు. ఐరన్ రాడ్లతో నిర్మాణం చేపడితే ఖర్చు రెట్టింపు కానుంది. టెట్రాప్యాక్స్, బాటిల్ క్యాప్స్, పాలీబ్యాగ్స్ను రీసైక్లింగ్ చేసిన వాల్, రూఫ్ షీట్స్తో గదిని నిర్మించారు. ఈ మెటీరియల్ వాడి హీట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ డ్యామేజ్ ఫ్రీ హౌస్లను తయారు చేయవచ్చు. చెరువుల వద్ద టాయిలెట్ల నిర్మాణం.. ప్లాస్టిక్ రీసైక్లింగ్తో చేసిన షీట్స్తో చెరువుల వద్ద టాయిలెట్ల నిర్మాణం చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ వెస్ట్ జోనల్ పరిధిలోని 21 చెరువుల వద్ద ప్లాస్టిక్ టాయిలెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే చందానగర్లోని గంగారం చెరువుతో పాటు రామసముద్రం, గుర్నాథం చెరువు, మల్కం చెరువు సమీపాల్లో టాయిలెట్ల నిర్మాణం చేపడుతున్నారు. వినాయక నిమజ్జనం నాటికి 21 చెరువుల వద్ద టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇప్పటికే వెస్ట్ జోనల్ పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారైన బిన్స్ను వాడుకలోకి తెచ్చారు. డంపింగ్ యార్డ్తో వేరు చేసిన ప్లాస్టిక్ను సేకరించి సనత్నగర్లోనే రీసైక్లింగ్ చేసి వాల్షీట్స్, చెత్త బిన్స్ను తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్తో చేసిన టైల్స్తో వేసిన ఫుట్పాత్ -
విజయనగరంలో ప్లాస్టిక్ భూతం..
పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్లాస్టిక్ వ్యర్థాలు ముంచెత్తుతున్నాయి. వీధుల్లో... బహిరంగ ప్రదేశాల్లో... ఎక్కడ చూసినా చెత్తమయమై కనిపిస్తోంది. ఇళ్లల్లో వినియోగించే చెత్తను సైతం నిర్లక్ష్యంగా పారబోస్తుంటే వాటిని చక్కదిద్దాల్సిన యంత్రాంగం కిమ్మనడం లేదు. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలనీ... తడి చెత్తనుంచి సంపద సృష్టించాలనీ... వ్యర్థాలను సమర్థంగా నిర్వహించాలనీ... సర్కారు చేస్తున్న యత్నాలకు స్థానికంగా గండిపడుతోంది. జనంలో చైతన్యం లేకపోవడం... అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడటం... రాబోయే తరానికి కాలుష్యాన్నే మనం మిగిల్చేలా కనిపిస్తోంది. సాక్షి , విజయనగరం: పురపాలక సంఘాల్లో తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించాలన్న ఆదేశాలు అమలు కావడం లేదు. జీవ ఔషధ వ్యర్థాలు, భవన నిర్మాణ వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో మున్సిపాలిటీలు నిండిపోయాయి. వాతావరణం కలుషితం అవుతోంది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజుకు 125 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. 40 వార్డుల్లో విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య సిబ్బంది ఈ చెత్తను సేకరించి వాహనాల ద్వారా గుణుపూరుపేట డంపింగ్యార్డుకు తరలిస్తుంటారు. తడి, పొడి చెత్త సేకరణ ప్రక్రియ ఇప్పటికీ కార్పొరేషన్లో అమలు కు నోచుకోవటం లేదు. ఉత్పత్తవుతున్న మొత్తం 125 టన్నుల చెత్తలో విజయనగరంలోని ప్రధా న కూరగాయాల మార్కెట్తోపాటు రైతు బజా ర్ల నుంచి సేకరించే 14 టన్నుల వరకు వ్యర్థాలను మాత్రమే వేరుగా తీసుకువెళ్లి కంపోస్టు ఎరువుగా మారుస్తున్నారు. కొద్ది నెలలుగా చేపడుతున్న ప్రక్రియ ద్వారా 3 టన్నుల కంపోస్టు ఎరువును తయారు చేస్తుండగా... ఆ ఎరువును కిలో రూ.15ల చొప్పున విక్రయించనున్నారు. మరో 111 టన్నుల చెత్తను సేకరించి నేరుగా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తడి పొడి చెత్తను వేరుగా నిల్వ ఉంచేందుకు అవసరమైన బుట్టలను కార్పొరేషన్ అధికారులు ఉచితంగా అందివ్వాలని ప్రజలు అడుగుతుండగా, అందుకు రూ.70లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఖర్చువుతుండటంతో వారు వెనకడుగు వేస్తున్నారు. గతంలో ఇదే తరహాలో రెండు బుట్టలు విధానాన్ని అమలు చేయాలని ప్రజలకు ఉచితంగా అందజేయగా ఇప్పుడు అవెక్కడా కానరావడం లేదు. నగరంలో ఇటీవల కొన్ని రోజులు ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నిషేధించామం టూ హడావుడి చేశా రు. వారం తిరక్కుం డానే ఆ విషయాన్ని పక్కనపెట్టేశారు. అవార్డులు వచ్చాక పడకేసిన చెత్తశుద్ధి బొబ్బిలి మున్సిపాలిటీలో తడిచెత్త పొడి చెత్తల సేకరణలో భాగంగా పట్టణానికి దూరంగా ఉన్న రామన్నదొరవలసలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కును నిర్వహిస్తున్నారు. చెత్త సేకరణ, ఎరువుల తయారీకి గతంలో బొబ్బిలి మున్సి పాలిటీకి నాలుగు అవార్డులు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ విధానం పడకేసింది. మున్సిపాలిటీలో నివసించే కుటుం బాలు 14,500 ఉన్నా తడి చెత్త, పొడి చెత్త సేకరణకు అన్ని ఇళ్లకూ చెత్త బుట్టలు ఇవ్వలేదు. నాలుగింట ఒక వంతు మాత్రమే సరఫరా చేశారు. అవీ నాసిరకంవి కావడంతో చాలా వరకూ పాడయ్యాయి. ఇంటింటి చెత్త సేకరణ కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయింది. మున్సిపాలిటీలోని 30 వార్డులుండగా వాటి నుంచి రోజుకు 17.5 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. ఇందులో ఇందులో తడి చెత్త 6.7 టన్నులు కాగా పొడి చెత్త 4.3 టన్నుల వరకూ ఉంటుంది. చెత్తనుంచి ఎరువు తయారుచేసేందుకు రామన్నదొర వలస వద్ద నిర్వహిస్తున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కులో ఎరువు ఇప్పుడు తయారు కావడం లేదు. ఇక్కడి పల్వనైజర్వంటి మెషీన్లు పాడయ్యాయి. తీరని చెత్త సమస్య పార్వతీపురం పురపాలక సంఘంలో 30 వార్డులున్నాయి. 200 వీధుల్లో చెత్త సేకరణకు కాంపెక్టర్లు 2, ఐదు ట్రాక్టర్లున్నాయి. రోజూ 38 మంది పారిశుద్ధ్య కార్మికులు 25 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తున్నారు. పార్వతీపురంలో వాణిజ్య సముదాయం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి చెత్త ఎక్కువగా ఉత్పన్న మౌతోంది. రోజూ మున్సిపల్ పారిశుద్ధ్య విభాగం అధికారులు 25 మెట్రిక్ టన్నుల వరకు చెత్తను సేకరిస్తున్నారు. పురపాలక శాఖ తడి, పొడి చెత్తలను వేరు వేరుగా ఇవ్వాలని చెబుతున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో కార్య రూపం దాల్చడం లేదు. ఈ చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి సేగ్రిగేషన్ చేయాల్సి ఉన్నప్పటికి అక్కడ అధికారులు ఆ పనిచేయడంలేదు. సాలూరు మున్సిపాలిటీలో తడి, పొడి చెత్త సేకరణ కొంతవరకూ ఫరవాలేదనిపించేలా జరుగుతోంది. సుమారు 132 మంది సిబ్బంది ఈ పనిచేస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై మాత్రం మున్సిపల్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. -
ప్లాస్టిక్ వ్యర్థాలతో ఒలింపిక్ పోడియాలు
టోక్యో: వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్కు గాను నిర్వాహకులు మరో స్ఫూర్తిదాయక నిర్ణయం ప్రకటించారు. ఈ విశ్వక్రీడల్లో విజేతలకు ఇచ్చే స్వర్ణ, రజత, కాంస్య పతకాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో తయారుచేయనున్నట్లు ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా విజేతలకు పతకాలను అందించేందుకు ఏర్పాటు చేయనున్న పోడియంలను ప్లాస్టిక్ వ్యర్థాలతో రూపొందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గృహ, సముద్రాల్లో లభించే ప్లాస్టిక్ వ్యర్థాలను పోడియంల రూపకల్పనకు వాడనున్నారు. టోర్నీలో భాగంగా మొత్తం 100 పోడియంలు నిర్మించాల్సి ఉన్నందున ఆ మేరకు 45 టన్నుల వ్యర్థాలు అవసరం కానున్నాయి. గృహ ప్లాస్టిక్ వ్యర్థాలను టోర్నీ ఆతిథ్య దేశమైన జపాన్ నుంచి మాత్రమే సేకరిస్తారు. దీనికోసం ఇక్కడ దాదాపు 2వేలకు పైగా ఉన్న సూపర్ మార్కెట్ల ద్వారా వ్యర్థాలను సమీకరిస్తారు. స్థానికుల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు ఈ సూపర్ మార్కెట్ల వద్ద కొన్ని డబ్బాలను ఒలింపిక్ నిర్వాహకులు ఉంచుతారు. అలాగే సముద్రాల నుంచి వ్యర్థాలను వెలికితీసే కంపెనీల ద్వారా ప్లాస్టిక్ను సేకరిస్తారు. కాగా, ఈ ప్రతిష్టాత్మక విశ్వక్రీడల్లో పాల్గొనే జపాన్ క్రీడాకారులు ప్లాస్టిక్ వ్యర్థాలతో రూపొందించిన దుస్తులను ధరించనుండడం మరో విశేషం! -
ప్లాస్టిక్ వ్యర్థాలే స్కూలు ఫీజు
ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు అస్సాం దిస్పూర్లోని అక్షర్ ఫోరం స్కూలు వినూత్న పథకాన్ని ప్రారంభించింది. తమ స్కూలు విద్యార్థులు ఫీజుకు బదులు ప్లాస్టిక్ వ్యర్థాలను ఇవ్వాలని ఆదేశించింది. ప్రతి విద్యార్థి ప్రతీవారం కనీసం 20 పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు తెచ్చివ్వాలని, అలా తెస్తే వారికి ఉచితంగా చదువు చెప్తామని ప్రకటించింది. దీంతో విద్యార్థులు తమ ఇళ్లు లేదా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను తెచ్చి స్కూల్లో ఇస్తున్నారు. కిందటేడాది వరకు ఈ స్కూల్లో ఉచితంగానే చదువు చెప్పేవారు. అయితే, ఈ సంవత్సరం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు తెస్తేనే ఉచితంగా చదువు చెబుతామని స్కూలు యాజమాన్యం స్పష్టం చేసింది. పిల్లల నుంచి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిలింగ్ చేసి ఉపయోగిస్తున్నట్టు స్కూలు యాజమాన్యం తెలిపింది. విద్యార్థుల చేత ప్లాస్టిక్ సీసాల్లో ప్లాస్టిక్ కవర్లను నింపిస్తున్నారు. దాంతో అవి పర్యావరణానుకూల ఇటుకలుగా(ఎకో బ్రిక్స్) తయారవుతున్నాయి. ఇలా చేసినందుకు విద్యార్థులకు కొంత సొమ్ము కూడా చెల్లిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ ఇటుకలతో స్కూలు భవనాలు, మరుగుదొడ్లు, ఫుట్పాత్లు నిర్మిస్తున్నారు. -
వద్దంటే వినరే..!
సాక్షి, నరసాపురంరూరల్: వారపు సంతల నుంచి బస్టాండ్ల వరకు ఎవరి వద్ద చూసినా ప్లాస్టిక్ కవర్లే దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్ల నిషేధం ఉన్నా వాటి అమలు మాత్రం కాగితాలకే పరిమితమవుతుంది. పర్యావరణానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నా ప్రజల్లో మాత్రం అవగాహన కరువైంది. అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్లాస్టిక్ వినయోగం వల్ల కలిగే దుష్ప్రయోజనాలు గురించి అవగాహన కల్పిస్తే వాటి వాడకాన్ని తగ్గించవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగితాలు అయితే కొద్ది రోజులకు వస్త్రాలయితే కొద్ది నెలల్లోనే మట్టిలో కలిసిపోతాయి. ప్లాస్టిక్ కవర్లు మాత్రం ఏళ్లు గడిచినా కరగవు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేయకపోవడంతో వాటి వాడకం రోజురోజుకూ పెరిగిపోతుందని పలువురు స్పష్టం చేస్తున్నారు. 2012లోనే ప్లాస్టిక్ వాడకం నిషేధించినట్లు ప్రకటను వచ్చినప్పటికీ ప్రస్తుతం అవి (ప్లాస్టిక్ వ్యర్థాలు) ఆక్రమించే స్థలం సాధారణ చెత్త కంటే అధికంగా ఉంటుంది. దుకాణాలకు వెళ్లి ప్లాస్టిక్ కవర్లలో సరుకులు తీసుకుని అనంతరం వాటిని ఎక్కడ బడితే అక్కడ పారవేస్తున్నారు. ముఖ్యంగా మురికి నీటి కాలువల్లో ఎటు చూసినా ప్లాస్టిక్ కవర్లే ఉండడంతో అవీ కాస్తా నిండిపోతున్నాయి. ప్లాస్టిక్ వాడకాలను తగిచడానికి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకువచ్చినా ఫలితం లేకపోయింది. ప్లాస్టిక్ కవర్లకు బదులు పేపర్ బ్యాగులు వాడుకలోకి తీసుకురావాలని ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే ముప్పుపై ప్రజలకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. అవగాహన కల్పించడంలో విఫలం ప్లాస్టిక్ కవర్లు నియంత్రించడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమవుతున్నారు. ఒక్కోసారి గ్రామాల్లో సైతం ఇంటింటికీ ప్రచారం నిర్వహించడంతోపాటు పలువురు కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ క్యాంపిన్లు జరిపిన సందర్భంలో ర్యాలీలు నిర్వహించడం, పంచాయతీ వారు టాంటాం వేయడం, అన్నీ జరిగాయి. అయితే నిషేధం అమలు ఎక్కడా మచ్చుకైనా కనిపించడం లేదు. - ముద్దాల ప్రశాంతి, లక్ష్మణేశ్వరం అవగాహన కల్పించాలి ప్లాస్టిక్ కవర్లు పర్యావరణానికి ఎంతో ముప్పు అని మేధావులు, అధికారులు పదే పదే చెబుతున్నారు. అయితే తరచూ వ్యాపారస్తులు, వినియోగదారులు ప్లాస్టిక్ కవర్లనే వినియోగించడం పరిపాటిగా మారింది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం, సమతుల్యత లోపించడం వంటి వాటికి కవర్ల వినియోగం ప్రధాన కారణమని చెపుతున్నప్పటికీ ఎవరూ వినే పరిస్థితి లేకపోవడం దారుణం. పర్యావరణానికి ముప్పు కలిగించే కవర్ల నిషేదంపై శ్రద్ధ చూపాలి. – కడలి ఆదినారాయణ, నరసాపురం -
నిషేధం.. నిస్తేజం! వ్యర్థ అనర్థమిదీ...
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ప్లాస్టిక్ కవర్ల నిషేధం నిస్తేజంగా మారింది. దీని అమలు ఒకడుగు ముందుకు...రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. దాదాపు ఐదారేళ్ల క్రితమే నగరంలో ప్లాస్టిక్ కవర్ల వాడకంపై నిషేధం విధించాలనే ప్రయత్నాలు మొదలైనప్పటికీ... ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి కొరవడింది. కవర్ల నిషేధంపై ప్రజలను చైతన్యం చేసే దిశగా పూర్తిస్థాయిలో కృషి చేయకపోవడం, వీటికి ప్రత్యామ్నాయంగా జూట్, క్లాత్ బ్యాగుల తయారీపై శ్రద్ధ చూపకపోవడం ఇందుకు కారణమవుతోంది. ఫలితంగా ప్లాస్టిక్ కవర్ల దందాయథేచ్ఛగా కొనసాగుతోంది. తిరుపతి టెంపుల్ సిటీలో ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలవుతుండగా... మహానగరంలో కనీసం మోడల్గానైనా ఒక్క సర్కిల్/డివిజన్లోనైనా నిషేధించలేకపోయారు. అడపాదడపా ఆర్నెళ్లకో, ఏడాదికో ప్లాస్టిక్ కవర్ల నిషేధమంటూ ప్రకటించడం.. ఉత్పత్తిదారులు, విక్రేతలపై దాడులు నిర్వహించి పెనాల్టీలు విధించడంతో మమ అనిపిస్తున్న అధికారులు.. ఆపై అంతా మరిచిపోతున్నారు. దీంతో తిరిగి ప్లాస్టిక్ కవర్ల వినియోగం పెరిగిపోతోంది. ఐదారేళ్ల క్రితం తొలిసారిగా 40 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ కవర్లపై నిషేధం విధించినప్పుడు ప్రజల్లో అవగాహన పెరిగే సమయానికే నిషేధానికి తూట్లు పొడిచారు. అదే అనుభవం ప్రతిసారీ పునరావృతమవుతోంది. గతేడాది సైతం ప్లాస్టిక్ నిషేధంపై విస్తృత ప్రచారాలతో ప్రజల్లో కొంతమేర అవగాహన రాగానే కార్యక్రమం మళ్లీ అటకెక్కింది. పండ్లు, కూరగాయల వ్యాపారులు మొదలు మాంసం విక్రేతలు, ఫంక్షన్హాళ్ల నిర్వాహకులకు సైతం అవగాహన కల్పించే కార్యక్రమాలు ఒక దశకు చేరుకోగానే చరమగీతం పాడారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధిస్తామని ప్రతిజ్ఞలు చేసి కొద్దికాలం పకడ్బందీగానే అమలు చేసినా.. ఆ తర్వాత విస్మరించారు. ఒక దశలో మైక్రాన్లతో సంబంధం లేకుండా ప్లాస్టిక్ కవర్లను సంపూర్ణంగా నిషేధించేందుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ.. ఆ మేరకు స్టాండింగ్ కమిటీలో తీర్మానించి అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆ తర్వాత ఆ అంశాన్ని పట్టించుకోకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. నాలాల్లో 40శాతం... జీహెచ్ఎంసీలో రోజుకు సగటున 5వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, వాటిలో దాదాపు 400 మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలే. అవి క్రమేపీ పెరుగుతూ ప్రస్తుతం 500 మెట్రిక్ టన్నులకు చేరినట్లు తెలుస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి పెను ముప్పుతో పాటు చెరువులు, నీటి వనరులు కలుషితమవుతున్నాయి. నగరంలో కురిసే భారీ వర్షాలకు నాలాలు, సివరేజీ లైన్లు ప్లాస్టిక్ వ్యర్థాలతో పేరుకుపోయి నీరు రోడ్లపైకి చేరి ట్రాఫిక్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాకాలంలో నాలాలు పొంగి రోడ్లు చెరువులుగా మారడానికి ప్రధాన కారణం నాలాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలేనని వెల్లడైంది. నాలాల్లో 40శాతానికి పైగా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నట్లు ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. తిరిగి వర్షాకాలం లోపు ఆ వ్యర్థాలను తొలగించడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేసి జరిమానాలు విధిస్తామన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అధికారులు డిసెంబర్ 18 నుంచి ఏప్రిల్ 23వరకు 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ కవర్ల విక్రేతలు, ఉత్పత్తిదారులపై తనిఖీలు నిర్వహించి రూ.1,16,600 జరిమానాలు విధించారు. 81 కేసులు నమోదు చేశారు. ‘సంపూర్ణం’ సాధ్యమిలా... జన జీవితంలో నిత్యావసరంగా మారిన ప్లాస్టిక్ను నిషేధించడం అంత తేలికేమీ కాదు. అందువల్లే 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తామని గతేడాది పర్యావరణ దినోత్సవం సందర్భంగా అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ సమక్షంలో అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఆలోగా సింగిల్యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించడం, సంపూర్ణ నిషేధానికి ప్రణాళిక రూపొందించాల్సి ఉంది. దశల వారీగానే అమలు సాధ్యమవుతుందని ఆయా నగరాల్లోని ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమాలను పరిశీలిస్తే అవగతమవుతుంది. ♦ తొలుత 50 మైక్రాన్లలోపు విజయవంతమైతే ఆ తర్వాత సంపూర్ణ నిషేధం చేయవచ్చుననే అభిప్రాయాలున్నాయి. ♦ అన్ని స్థాయిల్లో ఆయా వర్గాల ప్రజలకు ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కల్పించాలి. ♦ బస్తీల్లోని స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ఇంటింటికీ అవగాహన కల్పించడం, వారు ఉపాధి పొందేలా క్లాత్, జూట్ బ్యాగుల తయారీలో శిక్షణనిచ్చి వారి ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ కల్పించాలి. వాటిని వినియోగంలోకి తెస్తూ క్రమేపీ ప్లాస్టిక్ వాడడం మానేలా చేయాలి. ♦ విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా విషయం కుటుంబానికి చేరుతుంది. ♦ ఫంక్షన్హాళ్లు, కల్యాణ మండపాలు తదితర ప్రాంతాల్లో వాడే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కప్పుల స్థానంలో స్టీల్, పింగాణీ, గాజు రకం వాడేలా చర్యలు తీసుకోవాలి. ♦ సరుకులు, కూరగాయల కోసం జూట్, క్లాత్ బ్యాగులు వాడేలా, మాంసం కోసం టిఫిన్ బాక్సులు వినియోగించేలా చర్యలు చేపట్టాలి. ♦ ప్లాస్టిక్ కవర్ల తయారీ, రవాణా, అమ్మకం, పంపిణీ వంటివి పూర్తిగా ఆగిపోవాలి. ♦ హోల్సేలర్, రిటైలర్, ట్రేడర్, హాకర్, సేల్స్మెన్తో సహా ఎవరూ ప్లాస్టిక్ కవర్లు అమ్మడం గానీ చేస్తే జరిమానాలు విధించాలి. వరుసగా మూడుసార్లు చేస్తే దుకాణాన్ని సీజ్ చేయాలి. -
మచ్చ తొలగితేనే మంచి పేరు!
‘మనిషి సాంఘిక జంతువు’ అని రెండు వేల సంవత్సరాల కింద ఆరిస్టాటిల్ అన్న మాటకీ, ‘ప్రతిచోట విధ్వంసం సృష్టిస్తున్న జంతువు మనిషి’ అన్న హైకోర్టు తాజా వ్యాఖ్యకి ఎంతో తేడా ఉంది. మొదటిది, బుద్ధికలిగి సకల జీవులతో పరస్పర సహజీవనం సాగిస్తున్న ఉన్నతుడిగా మనిషికి ప్రశంస అయితే, రెండోది, స్వార్థంతో బుద్ధి మందగించి బాధ్యత మరచిన మనిషి ఇతర జీవులకు హాని చేస్తున్నాడనే అభిశంస! ఇందులో వ్యక్తులుగా, సమూహాలుగా, జాతులుగా, సంస్థలుగా, ప్రభుత్వాలుగా అందరి బాధ్యతా ఉంది. ‘మనిషి విధ్వంసకారి’అనే మాటను చెరిపేయాలి. ‘బుద్ధిజీవి’అనే మాటను నిలబెట్టాలి. అప్పుడే పృథ్వికి రక్ష, భవితకు భరోసా! ‘మనిషన్న జంతువు ప్రతిచోటా విధ్వంసం సృష్టిస్తోంది’ అంటూ హైకోర్టు ధర్మాసనం వెలి బుచ్చిన ధర్మాగ్రహం ప్రతి మనిషికీ తగలా ల్సిన పోటు! ఎక్కడో తగిలే ఉంటుంది, ఎవరికి అది ఎంత వరకు తగి లింది అనేదానికి కొలతలు లేవు. కానీ, పర్యావరణం అన్నది ఇక ఏ మాత్రం న్యాయస్థానాలకో, పరిశోధనాలయాలకో, శాస్త్రజ్ఞులకో, హరిత కార్యకర్తలకో మాత్రమే పరిమితమైన పదం కాదు. ఇది సామాన్యుల నుంచి రాజకీయ పార్టీల మేనిఫెస్టోల వరకు అత్యంత కీలకమైన ఎజెం డాగా మారిందనేది సత్యం. మన దేశ రాజధాని «ఢిల్లీలో ముప్పిరిగొం టున్న వాయు కాలుష్యం అత్యంత దుర్భరంగా తయారయింది. ఇది జీడీపీపై వ్యతిరేక ప్రభావం చూపడమే కాకుండా అక్కడ నివసించే ప్రతి మనిషి సగటు పదేళ్ల ఆయుర్ధాయాన్ని హరిస్తోందని అధ్యయనాలు చెబు తున్నాయి. ముఖ్యంగా భూతాపం, వాయుకాలుష్యం వంటివి అంచనా లకు మించిన వేగంతో దూసుకువస్తూ తెచ్చిన ‘వాతావరణ మార్పు’ల ప్రతికూల ప్రభావం ఇపుడు ప్రతి జీవినీ తడుముతోంది. ఇది విశ్వ పరి ణామం! ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పర్యావరణం భూమ్మీది జీవుల న్నింటి బతుకునీ ప్రభావితం చేస్తోంది. పరిణామ క్రమంలో ఉత్కృష్ట జీవిగా అవతరించిన ‘మనిషి’తన చర్యలవల్లో, చర్యల లేమివల్లో పర్యా వరణ విధ్వంసానికి కారణమవుతున్నాడు. ఇతర జీవులనీ నానా యాత నకి గురిచేస్తున్నాడు. తాను నియంత్రించి, నివారించ గలిగిన వాటిని కూడా నిర్లక్ష్యం చేస్తూ జీవుల మనుగడకు ముప్పు తెస్తున్నాడు. సహజ వనరుల్ని సర్వనాశనం చేసి భవిష్యత్తరాలకు ఓ భగ్న పృథ్విని అందించ నున్నాడు. ఇదే విషయాన్ని హైకోర్టు నొక్కి చెప్పింది. ‘మనిషి సాంఘిక జంతువు’ అని రెండు వేల సంవత్సరాల కింద ఆరిస్టాటిల్ అన్న మాటకీ, ‘ప్రతిచోట విధ్వంసం సృష్టిస్తున్న జంతువు మనిషి’ అన్న హైకోర్టు తాజా వ్యాఖ్యకి ఎంతో తేడా ఉంది. మొదటిది, బుద్ధికలిగి సకల జీవులతో పర స్పర సహజీవనం సాగిస్తున్న ఉన్నతుడిగా మనిషికి ప్రశంస అయితే, రెండోది, స్వార్థంతో బుద్ధి మందగించి బాధ్యత మరచిన మనిషి ఇతర జీవులకు హాని చేస్తున్నాడనే అభిశంస! ఇందులో వ్యక్తులుగా, సమూహా లుగా, జాతులుగా, సంస్థలుగా, ప్రభుత్వాలుగా అందరి బాధ్యతా ఉంది. అన్ని స్థాయిల్లో ఎవరి బాధ్యత వారెరిగి, జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన అవసరం మనందరి పైనా ఉందనేది తిరుగులేని వాస్తవం. ఇది ఓటర్లముందున్న సవాల్ సగటు మనిషి జీవితపు ప్రతి పార్శా్వన్నీ శాసించే అధికారాన్ని తెలిసో, తెలియకో మనం మన రాజకీయ వ్యవస్థకు ధారాదత్తం చేశాం. అన్నీ వారు చెప్పినట్టు నడవాల్సిందే! పాలకులుగా అవతరించే రాజకీయ పార్టీలను ప్రజలు నిలదీసే, ప్రశ్నించే ఒకే ఒక సందర్భం ఎన్నికలు. అయి దారు మాసాల వెనకా, ముందు... ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఎన్నికల ముంగిట్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనయితే పక్షం రోజుల్లోనే ఎన్ని కలు. ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తు న్నాయి. కానీ, వాటిల్లో నిర్దిష్టత లోపిస్తోంది. ఓట్లనాకర్షించే ఆర్థికాంశాల కిచ్చే ప్రాధాన్యత ఇతర ముఖ్య అంశాలకు ఇవ్వటం లేదు. ‘పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం’ అనే సాధారణ ప్రకటన ఇవ్వడం, ఇతరే తర అంశాల కింద ప్రకటించే విధానాల్లో అస్పష్టత అంతిమంగా పర్యా వరణానికి భంగం కలిగించే సందర్భాలెన్నో! ఉదాహరణకి, పర్యావ రణం గురించి సదరు పద్దు కింద సానుకూల ప్రకటన చేసినా, ‘పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూ వినియోగ విధానం’ లోని అస్పష్టత చివరకు పర్యావరణానికి హాని కలిగించేదిగా ఉంటోంది. పరిశ్రమల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టుల కల్పన, రవాణా వ్యవస్థ, భూసేకరణ... ఇలా చాలా అంశాలూ పర్యావరణాన్ని ప్రభావితం చేస్తాయి. వీటిని నిశితంగా పరి శీలించి, విశాల జనహితంలో విపులంగా చర్చించాల్సిన అవసరం ఉంది. సామాజిక మాధ్యమాల విస్తృతి వల్ల వచ్చిన జనచేతన క్రమంగా వేర్వేరు అంశాల్లోకి వ్యాపించడమొక మంచి పరిణామం! పర్యావరణ విషయా ల్లోనూ ఆ జాగ్రత్త అవసరం. దీపావళి టపాసులు పండుగరోజు రాత్రి 8–10 గంటల మధ్యే కాల్చాలన్న సుప్రీం ఇటీవలి తీర్పు పదేళ్లకింద అయితే ఎలా ఉండేదో! అన్న సందేహం కలుగుతుంది. తెలంగాణలో కూటమికట్టి ఎన్నికల్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్, రేపో మాపో ప్రకటించ నున్న తన ఎన్నికల ప్రణాళికలో పర్యావరణాన్ని ఒక అంశంగా చేర్చింది. జీహెచ్ఎంసీ పరిధి ప్రతి కొత్త నిర్మాణాలకూ ‘ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్’ ప్రమాణాల్ని తప్పనిసరి చేస్తామని, కొత్తగా నిర్మించే ప్రతి వాణిజ్య, గృహ నిర్మాణాల్లో ఇంకుడు గుంతల్ని నిర్బంధం చేస్తామని, సోలార్ రూఫ్టాప్ రాయితీ పథకాన్ని కొనసాగిస్తామని, షెంజెన్ తర హాలో ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ క్యాబులు, ఎలక్ట్రిక్ ఆటోల విధానం తీసుకువస్తామని, ప్లాస్టిక్ను నియంత్రించి జూట్, బట్ట సంచుల వాడ కాన్ని తప్పనిసరి చేస్తూ సంబంధిత పరిశ్రమల్ని అభివృద్ధి పరుస్తామని... ఇలా ప్రకటించారు. పాలక తెరాస 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రకటించ నప్పటికీ ‘హరితహారం’ ద్వారా విస్తృతంగా మొక్కలు నాటే పెద్ద కార్య క్రమాన్ని గత నాలుగేళ్లుగా అమలుపరచింది. హైదరాబాద్ను విశ్వనగ రంగా తీర్చిదిద్దుతామనే హామీలో భాగంగా మూసీనది, హుస్సేన్సాగర్ జలశుద్ది గురించి ఎంతో చెప్పింది. నగరంలోని చెరువుల పునరుద్ధరణ చేస్తామనీ ప్రకటించింది. కానీ, అవేవీ జరగలేదు. అప్పుడు జరిగిన ఉమ్మడి ఎన్నికలకు తమ ప్రణాళికను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ పలు పర్యావరణ హామీలతో పాటు ప్లాస్టిక్ పైనా నిర్దిష్ట హామీ ఇచ్చింది. ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిషేధం విధిస్తాం, భూగర్భ మురుగు నీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. శిలాజ ఇంధనాల బదులు పునర్వినియోగ యోగ్యమైన శుద్ధ ఇంధనాల వినియోగాన్నే అభివృద్ధి పరుస్తామని బీజేపీ తన జాతీయ ఎన్నికల విధాన ప్రకటనలో తెలిపింది. సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా పర్యావరణ విధాన ప్రకటన చేశాయి. ఎవరెన్ని మాటలు చెప్పినా అమలులో చిత్తశుద్ధి అంతంతే! సమాజ శ్రేయస్సుకు పాలకులను నిలదీసి ఫలితాలు సాధించుకోవాల్సిన బాధ్యత పౌరులదే! ప్లాస్టిక్ వినియోగంపై నిర్దిష్ట చర్యలేవి? ప్రపంచ పర్యావరణాన్ని ఈ రోజు ప్లాస్టిక్ గడగడలాడిస్తోంది. వాడి విసిరి పారేశాక మట్టిపొరల్లోకి జారిపోయీ, వెయ్యేళ్లయినా నశించని దాని లక్షణం పెనుసవాల్ విసురుతోంది. నేల పైన, భూమి పొరల్లోనే కాకుండా అటు ఇటు తిరిగి సముద్రంలోనూ కోట్ల టన్నుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఎన్నెన్నో జీవుల మనుగడనే ఈ ప్లాస్టిక్ కల్లోల పరుస్తోంది. ప్రాణాలనూ హరిస్తోంది. ఇండోనేషియాలోని ఓ దీవి తీరానికి ప్రాణాలు కోల్పోయి ఇటీవల కొట్టుకొచ్చిన తిమింగలం సంచ లనం సృష్టించింది. తీరం నుంచి తొలగించేందుకు యత్నించినపుడు దాని పొట్టపగిలి ఎన్నెన్నో ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడ్డాయి. బాటిల్స్, కప్పులు, చెప్పులు, స్ప్రింగులు.. ఇలా లెక్కలేనంత ప్లాస్టిక్ కడుపులో పేరుకుపోయింది. అదే దాని చావుకు కారణమయిందని అధికారులు తేల్చారు. ఆసియా ఖండంలో ఉన్న 60 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్లాండ్ దేశాల్లోనే నిక్షిప్తమ య్యాయని ‘మెక్నెసీ సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ ఎన్విరాన్మెంట్’ అనే సంస్థ అధ్యయనం చేసి నివేదించింది. ‘ప్లాస్టిక్ నియంత్రణ, నివారణకు మీరెలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకుంటున్నారో తెలుపండ’ని రెండు తెలుగు రాష్ట్రాలను హైకోర్టు అడిగింది. తదుపరి విచారణ లోపు ఆయా ప్రభుత్వాలు ఏం చెబుతాయో చూడాలి. దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వ హణ సంక్లిష్టమవుతూ వస్తోంది. రోజూ సగటున 15000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు జమ అవుతున్నాయి. 60 శాతం పునర్వినియోగం(రీసైకిల్) అవుతుండగా 40 శాతం వ్యర్థాల్ని అభద్ర విధానంలో పారవేస్తున్నారు. అది ప్రమాదకరంగా పరిణమిస్తోంది. సరైన సేకరణ, నిర్వహణ పద్ధ తులు లేకపోవడం, విధానాల అమలు లోపాల వల్లే ఈ దుస్థితి! అభి వృద్ధి చెందిన దేశాల తలసరి ప్లాస్టిక్ వినియోగంతో పోల్చి చూస్తే మనది నామమాత్రమే! ప్రపంచ సగటు తలసరి ప్లాస్టిక్ వినియోగం 28 కిలోలు కాగా అమెరికా (109), ఐరోపా (65), చైనా (38), బ్రెజిల్ (32)ల ముందు భారత్ (11కిలోలు) వినియోగం ఎంతో తక్కువ. అయినా, పద్ధతిగా వాడటం, వ్యర్థాల్ని పోగుచేయడం, నిర్వహణ ఘోరంగా ఉండ టం వల్లే ఇబ్బందులు. 2022 నాటికి మనదేశంలోనూ తలసరి విని యోగం 20 కిలోలకు చేరవచ్చని ఇంధన శాఖ అంచనా. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016లో కొన్ని మార్పులు చేయాలని, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయిన ఓ ఉన్నతస్థాయి కమిటీ కొన్ని సిఫార సులు చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, నిర్వహణ స్థానిక సంస్థలకు అప్పగించాలని, ఉత్పత్తి–వినియోగం చేసే వారి నుంచి సదరు ఫీజు వసూలు చేయాలనీ ఈ కమిటీ సిఫారసు చేసింది. మన దేశంలో అత్యధి కంగా ప్యాకేజింగ్ (35 శాతం), బిల్డింగ్స్–నిర్మాణం (23), రవాణా (8), ఎలక్ట్రానిక్స్ (8), వ్యవసాయ (7), ఇతర (19శాతం) రంగాల్లో ప్లాస్టిక్ వినియోగమవుతోంది. పాలనా వ్యవస్థను జవాబుదారీ చేయాలి పర్యావరణ పరిరక్షణకు మూడేళ్ల కింద సరిగ్గా ఇవే రోజుల్లో ‘ప్యారిస్ ఒప్పందం’ జరిగింది. మనదేశం కూడా పలు వాగ్దానాలు చేసింది. ఆ దిశలో గొప్పగా అడుగులు పడటం లేదు. వచ్చేనెల క్యాటోవైస్ (పోలాం డ్)లో భాగస్వాముల సదస్సు (కాప్) జరుగనుంది. ప్యారిస్ ఒప్పందం అమలుకు అక్కడ బ్లూప్రింట్ తయారు చేస్తారు. ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరుస్తున్నారో 2020 నుంచి లెక్కలు మొదలవుతాయి. జాతీయ స్థాయిలో విధానాల పరంగా, స్థానిక స్థాయి ఆచరణ పరంగా చర్యలుండాలి. ప్రజలు నిబద్ధత చూపాలి. అప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమౌతుంది. న్యాయస్థానం పేర్కొన్నట్టు ప్రభుత్వాలు బాధ్యత తీసు కోవాలి. ఖచ్చితత్వం పాటించాలి. ఎక్కడికక్కడ స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యంలో చర్యలు చేపట్టాలి. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ వంటి విషయాల్లో వ్యక్తులుగా పౌరులూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ‘మనిషి విధ్వంసకారి’అనే మాటను చెరిపేయాలి. ‘బుద్ధిజీవి’అనే మాటను నిలబెట్టాలి. అప్పుడే పృథ్వికి రక్ష, భవితకు భరోసా! దిలీప్ రెడ్డి, ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
‘95% ప్లాస్టిక్ వ్యర్థాలకు పది నదులే కారణం’
బెర్లిన్: ప్రపంచవ్యాప్తంగా కేవలం పది నదుల ద్వారానే 88–95 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తున్నాయని తేలింది. ఈ జాబితాలో గంగా, సింధు సహా 8 నదులు ఆసియాలో ఉండగా, మరో రెండు నదులు ఆఫ్రికా ఖండంలో ప్రవహిస్తున్నాయి. సరైన వ్యర్థాల నిర్వహణ పద్ధతులు పాటించకపోవడంతో ఏటా 5 ట్రిలియన్ పౌండ్ల ప్లాస్టిక్ సముద్రంలో చేరుతోందని ఈ పరిశోధనలో పాల్గొన్న డా.క్రిస్టియన్ ష్మిత్ తెలిపారు. తమ పరిశోధనలో భాగంగా 57 నదుల్లో, 79 చోట్ల నమూనాలు సేకరించామన్నారు. 5 మి.మీ కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రాల్లో కనుగొన్నామనీ, ఇది అక్కడి పర్యావరణానికి చాలా ప్రమాదకరమన్నారు. వీటిని నీటి నుంచి తొలగించడం కూడా అసాధ్యమన్నారు. ఇదే పరిమాణంలో వ్యర్థాలు చేరుతూపోతే 2050 నాటికి సముద్రాల్లో చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఈ వ్యర్థాల వల్ల 10 లక్షల సముద్రపు పక్షులు, లక్ష క్షీరదాలతో పాటు అసంఖ్యాకంగా చేపలు మృత్యువాత పడుతున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్లో చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, శ్రీలంకల వాటాయే 50 శాతానికిపైగా ఉంటుందన్నారు. జాబితాలోని తొలి 20 స్థానా ల్లో అమెరికా (1%) కూడా ఉందన్నారు. మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల్లో 28% చైనా నుంచే సముద్రాల్లోకి చేరుతున్నాయన్నారు. వ్యర్థాలను చేరవేస్తున్న తొలి 10 నదులు: యాంగ్జీ, సింధు, యెల్లో రివర్, హైహీ (ఆసియా); నైలు (ఆఫ్రికా); గంగా, పెరల్, అముర్ (ఆసియా); నైజర్ (ఆఫ్రికా), మెకాంగ్ (ఆసియా). -
ప్లాస్టిక్ మహా సముద్రాలు
మనం కొన్ని నిమిషాలు వాడి పారేసే క్యారీ బ్యాగులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలిసిపోవాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా? సుమారుగా వెయ్యి సంవత్సరాలు! భూమిపైనే కాదు.. సముద్రాల్లోనూ ప్లాస్టిక్ వేల ఏళ్లపాటు చెక్కుచెదరదు. అయితే, ప్లాస్టిక్ వ్యర్థాలను ఇలాగే వదులుతూ పోతే.. భవిష్యత్తులో ఇక ప్లాస్టిక్ మహాసముద్రాలు అని పిలుచుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2010 నాటి గణాంకాల ప్రకారమే.. ఏటా దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరుతోంది. ఇదిలాగే సాగితే.. ఇక సముద్రాలన్నీ ప్లాస్టిక్మయమే! ఇటీవల ‘అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్’ సదస్సులో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా శాస్త్రవేత్త డాక్టర్ జెన్నా జాంబెక్ బృందం ఈ మేరకు తమ అధ్యయన వివరాలను వెల్లడించింది. వాటిలో కొన్ని ఆసక్తికర సంగతులు... సముద్ర ప్లాస్టిక్లో చైనా వదులుతున్న చెత్తే అధికం. మూడో వంతున అంటే.. ఏటా 35లక్షల మెట్రిక్టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చైనా నుంచే సముద్రాన్ని చేరుతున్నాయి. ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, శ్రీలంక కూడా మొదటి వరుసలోనే ఉన్నాయి. మరో 20 వర్ధమాన దేశాలూ సముద్ర చెత్తకు కారణమవుతున్నాయి. సముద్ర ప్లాస్టిక్ వ్యర్థాల్లో అమెరికా వాటా 1 శాతమే కావడం విశేషం. ఏటా 77 వేల టన్నుల ప్లాస్టిక్ను వదులుతున్న ఆ దేశం 20వ స్థానంలో ఉంది. సముద్రాల్లోని ప్లాస్టిక్నంతా తీరప్రాంతాల్లో పరిస్తే.. ప్రతి అడుగు స్థలంలో ప్లాస్టిక్ చెత్తను నింపిన ఐదు క్యారీబ్యాగులను ఉంచాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్లోనే ఏటా ఒక్కో వ్యక్తి సగటున 150 క్యారీబ్యాగులను వాడి పారేస్తున్నారు. చర్యలు తీసుకోకపోతే 2025 నాటికి ఏటా 15.5 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాలను ముంచెత్తుతుంది. అప్పుడు ప్రతి అడుగు తీరప్రాంతంలో వంద క్యారీబ్యాగులను పేర్చినంత చెత్త పోగవుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు తిని సముద్రపక్షులు, చేపలు, తాబేళ్లు సహా 690 జాతులకు చెందిన లక్షలాది జీవరాశులు మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ తిన్న సముద్ర చేపల్ని తినడం వల్ల మనుషులూ అనారోగ్యం బారినపడుతున్నారు. చైనా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, శ్రీలంకలే 50 శాతం సముద్ర ప్లాస్టిక్ చెత్తకు కారణమవుతున్నాయి. ఈ ఐదు దేశాలూ సరైన మౌలిక వసతులు ఏర్పాటుచేసుకుని, ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థంగా నిర్వహిస్తే సమస్య మూడో వంతు వరకూ పరిష్కారమైపోతుంది. - సెంట్రల్ డెస్క్