rajamahedravaram
-
పాస్టర్ ప్రవీణ్ శరీరంపై గాయాలు.. ప్రమాదమా? లేక హత్యా?
సాక్షి, రాజమండ్రి: ఏపీలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రి సమీపంలోని జాతీయ రహదారిలో గామన్ బ్రిడ్జ్పై ప్రవీణ్ మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండటంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ శరీరంపై గాయాలు కనిపించడంతో ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పాస్టర్లు ఆందోళనకు దిగారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన చోట ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ను విడుదల చేయాలని పాస్టర్లు కోరుతున్నారు. బైక్ మీద వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఢీకొట్టి, దాడి చేసి ఉంటారంటూ ప్రవీణ్ పగడాల సన్నిహితులు, అనుచరులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ ఒంటిపై గాయాలు ఉండటంతో సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు. -
ఏపీ బీజేపీలో కలకలం!
సాక్షి, రాజమహేంద్రవరం: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (daggubati purandeswari), మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) మధ్య తూర్పుగోదావరి జిల్లా బీజేపీ (bjp) అధ్యక్షుడి నియామకం అంశంలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎవరికి వారు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేశారు. తన మాట నెగ్గాలంటే.. తన మాట నెగ్గాలంటూ పావులు కదిపారు. చివరకు వీర్రాజు జాతీయ నేతలను ఒప్పించి తన అనుచరుడైన కొవ్వూరుకు చెందిన పక్కి నాగేంద్రకు జిల్లా అధ్యక్షుడి పగ్గాలు అప్పగించడం.. పురందేశ్వరి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా, రాజమహేంద్రవరం సిట్టింగ్ ఎంపీగా ఉండీ కూడా తన అనుచరురాలైన ఎన్.హారికను జిల్లా అధ్యక్షురాలిగా నియమించలేక పోవడం చర్చనీయాంశమైంది. అధిష్టానం వద్ద పురందేశ్వరి మాట చెల్లుబాటు కాకపోవడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా పిక్కి నాగేంద్ర ఉత్తర్వులు స్వీకరించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి సోము వీర్రాజు, పురందేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడచినట్లు సమాచారం. బీజేపీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని నూతన అధ్యక్షుడికి సోము వీర్రాజు సూచించారు. ఇదే విషయమై పురందేశ్వరి స్పందిస్తూ.. పార్టీ ఇప్పటికే క్షేత్ర స్థాయిలో బలంగా ఉంది కాబట్టే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారని స్పష్టం చేశారు. ఈ పరిణామంతో పార్టీ శ్రేణులు విస్మయానికి గురైనట్లు సమాచారం. టీడీపీతో అంటకాగుతున్నందుకేనా? పురందేశ్వరి బీజేపీలో ఉన్నా, ఆమె మనసంతా టీడీపీలోనే ఉందన్న ఆరోపణలున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి టీడీపీ బలోపేతం, అధికారంలోకి తీసుకురావడానికి సొంత పార్టీ ప్రయోజనాలను సైతం తాకట్టు పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల సమయంలో అనపర్తి ఎమ్మెల్యే స్థానానికి కూటమి అభ్యరి్థగా బీజేపీ నేత శివరామకృష్ణంరాజును బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ నిర్ణయంతో టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే నల్లమిల్లి వర్గంలో అప్పట్లో అలజడి రేగింది. నల్లమిల్లి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో సొంత పార్టీ అభ్యర్థి శివరామకృష్ణం రాజుకు మద్దతు ఇవ్వాల్సింది పోయి.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పక్షాన పురందేశ్వరి నిలబడటం అప్పట్లో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా తన మరిది (సీఎం చంద్రబాబు) ప్రయోజనాల కోసమే చేశారని అప్పట్లో చర్చ జరిగింది. అందువల్లే ఆమె సిఫారసులను కమలం పెద్దలు పట్టించుకోవడం లేదని తెలిసింది. పురందేశ్వరి, సోము వీర్రాజుల మధ్య ఆది నుంచి సయోధ్య కుదరడం లేదు. ఎన్నికల సమయంలో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్లో ఏ స్థానం ఇచ్చినా ఫర్వాలేదని వీర్రాజు కోరారు. ఇందుకు టీడీపీ అధినేత నిరాకరించారు. ఈ నిర్ణయం వెనుక చిన్నమ్మ ఉన్నట్లు భావించిన సోము వర్గం అప్పటి నుంచి ఆమెను విభేదిస్తోంది. -
AP: పోలీసులు బకరా.. సినీ ఫక్కీలో దొంగ నోట్ల ముఠా డాన్ పరారీ
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో సినీ ఫక్కీలో దొంగ నోట్ల ముఠా సభ్యులు పోలీసుల నుంచి తప్పించుకున్నారు. ముఠా సభ్యులు పోలీసుల అదుపులోకి ఉన్న నిందితుడి తప్పించారు. దీంతో, నడిరోడ్డుపై అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది.వివరాల ప్రకారం..దొంగ నోట్ల కేసులో భీమవరంలో ఉన్న ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు శుక్రవారం రాత్రి శ్రీకాకుళం బయలుదేరారు. అదే సమయంలో పోలీసు వాహనాన్ని రెండు కార్లు, నాలుగు బైకులు వెంబడించాయి. కొంత దూరం వరకు వెళ్లిన తర్వాత అర్ధరాత్రి సమయంలో రాజమండ్రిలోని వీఎల్పురం వద్ద నిందితుడిని తీసుకెళ్తున్న శ్రీకాకుళం పోలీసుల వాహనాన్ని వారు అడ్డుకున్నారు. సినిమా ఫక్కీలో ఈకేసులో ఉన్న నిందితుడిని వారు తప్పించి.. తమ కారులో తీసుకెళ్లారు.అనంతరం, సదరు పోలీసులు.. 100కు కాల్ చేసి ఈ విషయాన్ని రాజమండ్రి పోలీసులకు చెప్పారు. దీంతో, కేసు నమోదు చేసిన రాజమండ్రి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను వెంబండించిన కార్ల నెంబర్లను సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక, దొంగ నోట్ల ముఠా డాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అంతర్జాతీయ తెలుగు మహాసభలకు విచ్చేయనున్న హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ
రాజమహేంద్రవరం: ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ , చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంధ్రమేవ జయతే! అన్న నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా తేదీలు 5,6,7 జనవరి 2024 శ్రీ రాజరాజనరేంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్ది సందర్భంగా సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం, గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహా సభలకు హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ విచ్చేయనున్నారని పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల అధినేత శ్రీ చైతన్యరాజులు తెలిపారు. వారిని హైదరాబాద్ లో మహా సభల సమన్వయకర్త శ్రీ కేశిరాజు రామప్రసాద్ ,ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కలసి ఆహ్వానించినట్లు తెలిపారు. 6 జనవరి 2024 సాయంత్రం 6 గంటలకు జరిగే తెలుగు తోరణం సభకు వారు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రముఖులకు "రాజరాజ నరేంద్ర విశిష్ట పురస్కారాలను" ప్రదానం చేసి వారి ఆత్మీయ సందేశాన్ని ఇవ్వనున్నారని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. -డా.గజల్ శ్రీనివాస్, అధ్యక్షులు, 9849013697 -
అంతర్జాతీయ తెలుగు మహా సభలకు విచ్చేయన్ను నాగలాండ్ గవర్నర్
రాజమహేంద్రవరం: ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ , చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంధ్రమేవ జయతే! అన్న నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా తేదీలు5,6,7 జనవరి 2024 శ్రీ రాజరాజనరేంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్ది సందర్భంగా సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం, గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహా సభలకు నాగాలాండ్ గవర్నర్ శ్రీ లా గణేషన్ విచ్చేయనున్నారని పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ చైతన్య రాజులు తెలిపారు. 7 జనవరి 2024 మధ్యాహ్నం 2 గంటలకు జరిగే "ఆంధ్రమేవ జయతే " సభలో వారు ముఖ్య అతిధిగా పాల్గొంటారు. అంధ్ర వాఙ్మయ వైజయంతి ప్రత్యేక సంచికను ఆవిష్కరించి, సౌజన్యం అందించిన వదాన్యులను సత్కరిస్తారని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. -డా.గజల్ శ్రీనివాస్,అధ్యక్షులు,9849013697 -
‘స్కిల్ స్కామ్ కేసుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది’
సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ స్కామ్ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరగాలన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్ స్కాం జరిగిందని జీఎస్టీ డీజీ తేల్చినట్టు ఉండవల్లి చెప్పుకొచ్చారు. కాగా, ఉండవల్లి అరుణ్కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ స్కామ్ కేసును జీఎస్టీ అధికారులు వెలికితీశారు. ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరగాలి. స్కిల్ స్కామ్లో ఫైళ్లు మాయం చేశారని చెబుతున్నారు. స్కిల్ స్కామ్ కేసుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. పూణే జీఎస్టీ అధికారుల విచారణలో ఇది బయటపడింది. స్కిల్ స్కామ్ కేసును జీఎస్టీ అధికారులు వెలికితీశారు. ఈ ప్రాజెక్ట్తో సంబంధంలేదని సీమెన్స్ కంపెనీ చెప్పింది. ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని సీమెన్స్ తెలిపింది. ఒప్పందంపై సంతకం పెట్టిన వ్యక్తి తమ కంపెనీలో పనిచేయడం లేదని వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే జీఎస్టీ లేఖ రాసింది. చంద్రబాబు ఎందుకు ఎవరి మీదా చర్యలు తీసుకోలేదు?. బెయిల్ ఇవ్వలేదని జడ్జిపై ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడారు. ప్రాథమిక సాక్ష్యాధారాలతో రిమాండ్కు పంపించారు. సీబీఐ విచారణ చేస్తే ఫైళ్లు ఎలా తగటబడ్డాయో తెలుస్తుంది. టీడీపీలో మంత్రులుగా చేసిన వాళ్లు కూడా చౌకబారుగా విమర్శలు చేశారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ దేశం వదిలి పారిపోయారు. బెయిల్పై పిటిషన్ వేయకుండా కేసు కొట్టేయాలని వాదిస్తున్నారు. స్కిల్ స్కామ్లో వాస్తవాలు బయటకు రావాలి. ఈ కేసులో సీబీఐ ఎంక్వైరీ అడిగితే తప్పేంటి?. నేను సీబీఐ విచారణ కోరితే టీడీపీకి ఎందుకు కోపం వస్తోంది?. స్కిల్ స్కాంలో ఉన్నవి సూటుకేసు కంపెనీలు. చంద్రబాబుకు సౌకర్యాలు కావాలంటే కోర్టు ద్వారా అడగొచ్చు. రాజమండ్రి జైలులో చాలా సౌకర్యాలు ఉన్నాయి. లైబ్రరీ ఉంది.. వాకింగ్ చేయవచ్చు. కేసు ఒక పద్దతిలో వెళ్తోంది. స్కిల్ స్కామ్లో అవినీతి జరిగిందనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబుకు తెలియకుండా స్కామ్ జరిగిదంటే ఎవరూ నమ్మరు. చంద్రబాబు తనకు తాను సీఈవో అనుకుంటాడు’ అంటూ కామెంట్స్ చేశారు. -
రాజమహేంద్రవరానికి సీఎం జగన్
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ తొలి రోజు సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం వైఎస్ జగన్ సోమవారం సాయంత్రం 6.24 గంటలకు హెలికాప్టర్లో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడ సీఎం వైఎస్ జగన్కు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్కు చేరుకొన్నారు. రాత్రి అక్కడే బస చేశారు. బాధితులకు అండగా.. హెలిపాడ్ నుంచి గెస్ట్ హౌస్కు వచ్చే మార్గంలో సీఎం వైఎస్ జగన్ను చూసేందుకు ప్రజలు బారులు తీరారు. రోడ్లకు ఇరువైపులా నిలుచొని ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. సీఎం జగన్ వారికి అభివాదం చేశారు. దారిలో ఇద్దరు అనారోగ్య బాధితులను పలకరించారు. వారి సమస్య విని తక్షణం సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ మాధవిలతను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్ ఆ కుటుంబాలకు వైద్య సేవల నిమిత్తం ఒక్కొక్కరికీ రూ. లక్ష సాయం అందజేశారు. కోనసీమ జిల్లాలో పర్యటన ఇలా.. సీఎం జగన్ మంగళవారం ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి అర్ట్స్ కళాశాలకు చేరుకుంటారు. 9.10కి ఆర్ట్స్ కళాశాల వద్ద హెలికాప్టర్లో బయలుదేరి 9.40కి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గురజపులంక చేరుకుంటారు. 10.25 వరకు గ్రామంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. 10.35కు రామాలయపేటకు రోడ్డు మార్గానికి చేరుకుని, 11.10 వరకు రామాలయపేటలో వరద బాధితులతో మాట్లాడతారు. 11.10 గంటలకు అక్కడి నుంచి అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామానికి చేరుకుంటారు. 11.20 నుంచి 11.50 గంటల వరకు అక్కడ వరద బాధితులతో మాట్లాడతారు. 11.50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో గురజపు లంక గ్రామానికి 12.15 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో తాడేపల్లికి వెళతారు. -
రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ, రాజానగరం, కాకినాడలలో మంత్రులు రజిని, చెల్లుబోయిన వేణు, తానేటి వనిత సోమవారం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాజమహేంద్రవరంలో రూ.475 కోట్లతో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాల భవనాలు, ప్రభుత్వాస్పత్రిని పరిశీలించి రోగులకు అందుతున్న సేవలను మంత్రి రజిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలోనే రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్లు ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, నంద్యాలల్లో మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. వీటిలో 750 సీట్లకు గాను 300 సీట్లకు అనుమతులు మంజూరు కాగా, మిగతా 450 సీట్లకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు రావాల్సి ఉందన్నారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళలను చిన్నచూపు చూడటం మానుకోవాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి రజిని సూచించారు. గోదావరి గట్టుపై జ్యోతిరావుపూలే, అంబేడ్కర్ భవన నిర్మాణానికి మంత్రులు రజిని, చెల్లుబోయిన వేణు, తానేటి వనితలు శంకుస్థాపన చేశారు. రాజానగరం నియోజకవర్గం కోటికేశవరంలో రూ.1.54 కోట్లతో నాడు–నేడులో నిర్మించిన పీహెచ్సీ భవనాన్ని మంత్రి రజిని ప్రారంభించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీరంగపట్నం కళాకారులు నలుగురి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన 8 మందికి రూ.లక్ష వంతున సీఎం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని రజిని, వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అందించారు. కాకినాడ జీజీహెచ్లో రంగరాయ పూర్వ విద్యార్థులు సమకూర్చిన రూ.50 కోట్లతో మదర్ అండ్ చైల్డ్బ్లాక్, గాంధీనగర్లో రూ.1.20 కోట్లతో అర్బన్ హెల్త్ సెంటర్, ఆర్ఎంసీలో మెన్స్ హాస్టల్ను మంత్రి రజిని ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంపీలు వంగా గీత, మార్గాని భరత్ రామ్, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి) -
రాజమండ్రి జైలు చూశారా? ఎంతలో ఎంత మార్పు.?
(డెస్క్–రాజమహేంద్రవరం): చదువు దారి చూపుతుంది. దారి తప్పిన వారిని సన్మార్గంలోనూ నడుపుతుంది. రాజమహేంద్రవరంలోని కేంద్రకారాగారంలోని కొందరు ఖైదీల గురించి తెలుసుకుంటే ఇది అక్షర సత్యమని అర్థమవుతుంది. వివిధ పరిస్థితుల నేపథ్యంలో.. క్షణికావేశంలో కొందరు నేరానికి పాల్పడుతుంటారు. వీరంతా జైలుకు వచ్చి శిక్ష అనుభవిస్తారు. అయితే ఇక్కడి కారాగారం అధికారులు మాత్రం వీరి శిక్షను శిక్షణగా మారుస్తున్నారు. ఇందులో భాగంగా వీరిలో విద్యావెలుగులు నింపుతున్నారు. జైలులో జీవితం వృథా కాకుండా ఖైదీలను విద్యాబాట పట్టిస్తున్నారు. పరివర్తన దిశగా అడుగులు వేయిస్తున్నారు. ఆగిన చదువకు నడక సెంట్రల్ జైలుకు రాకమునుపు ఆపేసిన విద్యను చాలామంది ఇక్కడికి వచ్చాక కొనసాగించగలుగుతున్నారు. డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ ద్వారా వీరంతా పట్టభద్రులవుతున్నారు. కొందరు పోస్టు గ్రాడ్యుయేషన్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం 135 మంది డిగ్రీ చదువుతుండగా 87మంది ఎంఏ చదువుతున్నారు. 638 మంది ఇప్పటికే డిగ్రీ పూర్తి చేయడం విశేషం. వీరికోసం జైలు ప్రాంగణంలోనే పరీక్ష సెంటరు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్గా వీరికి క్లాసులు చెప్పడానికి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుంచి ఫ్యాకల్టీ సేవలను వినియోగించుకుంటున్నట్లు సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. పెద్ద వయసుండీ నిరక్షరాస్యులైన ఖైదీలకు సైతం రాయడం చదవడం నేర్పుతున్నారు. ప్రస్తుతం 28మంది ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి అనంతలక్ష్మి అనే టీచరు బోధిస్తున్నారు. అబ్బురపరిచే లైబ్రరీ ఖైదీలు చదువుకునేందుకు లైబ్రరీ ఉంది. ఇందులో 4,300 పుస్తకాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు..ఆధ్మాత్మిక భావన కలిగించేందుకు దోహదపడే పుస్తకాలు ఉన్నాయి. లక్ష రూపాయల విలువైన పుస్తకాలను జైలు అధికారులు కొనుగోలు చేశారు. చదువుతోపాటు వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచేందుకు ఒక సెంటరును నిర్వహిస్తున్నారు. వెల్డింగ్..ప్లంబింగ్ కోర్సులకు ఇందులో శిక్షణ ఇస్తున్నారు. ఖరీదైన శిక్షణ పరికరాలను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం 30 మంది వంతున ఖైదీలు ఈ కోర్సులు నేర్చుకుంటున్నారు. గోల్డు మెడలిస్టులూ ఉన్నారు సెంట్రల్జైలులో శిక్షను అనుభవిస్తూ పట్టభద్రులైన కొందరు విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. షేక్ అజారుద్దీన్ బీఏలో స్వర్ణ పతకాన్ని సాధించారు. షేక్ సుభానీ ..టి వెంకటేశ్వరరావులు కూడా ఇదీ డిగ్రీలో గోల్డు మెడల్ సాధించారు. విజయవాడకు చెందిన జీ విజయరామ్ జైలులోనే పీజీ చదివి విడుదలయ్యాక వీఆర్ఓ ఉద్యోగాన్ని పొందారు. సారేపల్లి శ్రీనివాస్ మూడు డిగ్రీలు చదివారు. రంపచోడవరానికి చెందిన శ్రీనివాస్ కూడా మూడు పీజీలు చేశారు. ఇక్కడ పీజీ చదివాను మాది గుంటూరు. 30సంవత్సరాలుగా ఇక్కడ జైలులో ఉంటున్నాను. జైలుకు రాకమునుపు కరస్పాండెన్స్ కోర్సు డిగ్రీ చేయాలనుకున్నాను. ఇక్కడకు వచ్చాక పూర్తిగా చదువుపై దృష్టి పెట్టాను. ఎంఏ చదివాను. ఇక్కడి అధికారుల ప్రోత్సాహం నాలో ఉత్సాహాన్ని పెంచింది. నాకు ఇప్పుడు 54 సంవత్సరాల వయసు వచ్చింది. చదవడం వల్ల చాలా తెలుసుకున్నాను. విద్య మనిషిలో సత్ప్రవర్తనను పెంచుతుందని గ్రహించాను. విడుదల కోసం ఎదురుచూస్తున్నాను. – గంటెల విజయవర్దన్ మూడు ఎంఏలు చేశాను మాది రంప చోడవరం. నేను జైలుకు వచ్చి 11 సంవత్సరాలు అవుతోంది. ఓ హత్య కేసులో నాకు శిక్ష పడింది. జైలుకు వచ్చే ముందు ఎమ్మెస్సీ బీఈడీ చదివాను. ఇప్పుడు మూడు ఎంఏలు చేశాను. పాలిటిక్స్..పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్..సోషియాలజీలతో ఈ పీజీలు చదివాను. ఈ శిక్షా కాలం నా జీవితంలో ఊరికే పోలేదని భావిస్తున్నాను. జైలు అధికారుల తోడ్పాటుతో మళ్లీ చదువుకోగలిగాను. చదువు వల్ల ఆత్మవిశ్వాసం పెరిగింది. గౌరవమూ పొందగలుగుతుండటం నాకు సంతోషం కలిగిస్తోంది. – శ్రీనివాస దొర పరివర్తనే ధ్యేయంగా.. ఖైదీలలో పరివర్తనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. శిక్షాకాలంలో విద్య లేదా నైపుణ్య కోర్సు నేర్చుకునో బయటకు వెళ్లాక ఉపాధిబాట పట్టేలా తీర్చిదిద్దేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. ఈ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలను రూపొందించి అనుసరిస్తున్నాం. మళ్లీ నేరాల వైపు మనసు మళ్లకుండా ఉద్యోగం లేదా ఉపాధి వైపు దృష్టి పెట్టాలనేది మా అభిమతం. అందుకే జైలులో శిక్షాకాలం వృథా కానీయడం లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఇందుకు మంచి సహకారం లభిస్తోంది. ఖైదీలు చదువుకోడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిని ఉత్సాహపరిచేలా సహకారం అందిస్తున్నాం. – రాజారావు, జైలు సూపరింటెండెంట్ -
అతివల ఆర్థికాభివృద్ధికి ‘ఆసరా’!
సాక్షి, రాజమహేంద్రవరం: స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో జీవించేలా ప్రోత్సహించేందుకు ‘వైఎస్సార్ ఆసరా’ పథకానికి రూపకల్పన చేశారు. సంఘాల్లో మహిళలు తీసుకున్న రుణాలను విడతల వారీగా మాఫీకి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ. 485 కోట్లు అక్కచెల్లెమ్మలకు అందజేశారు. తాజాగా శనివారం మూడో విడతలో రూ.242.85 కోట్లు రుణమాఫీ చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను డీఆర్డీఏ అధికారులు పూర్తి చేశారు. ఆదివారం నుంచి ఆసరా సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్దేశం ఇదీ.. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలో తాను అధికారంలోకి వస్తే దశల వారీగా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 11, 2019 నాటికి వారు తీసుకున్న రుణాలను ఎంతైతే అప్పు నిల్వ మిగిలి ఉంటుందో వాటిని నాలుగు విడతలుగా ఆయా సంఘాలకు చెల్లించేందుకు ఆసరా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఆచరణలోకి తీసుకొచ్చారు. తూర్పు గోదావరిలో ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల పరిధిలో 19 మండలాలున్నాయి. తొలి దశలో 27,297 సంఘాలకు రూ.241.98 కోట్లు, రెండో దశలో 27,417 సంఘాలకు రూ.244.04 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరింది. వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా శనివారం మూడో విడత కింద జిల్లాలో 27,413 స్వయం సహాయక సంఘాలకు లబ్ది చేకూరనుంది. రూ.242.85 కోట్ల నగదు మహిళల ఖాతాల్లో జమ కానుంది. సీఎం జగన్ నేరుగా బటన్ నొక్కి ప్రక్రియ ప్రారంభిస్తారు. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం కృషి చేసింది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా జాబితా రూపకల్పన చేశారు. సచివాలయాల వద్ద జాబితాను అందుబాటులో ఉంచారు. సభ్యులు చనిపోయినా నామినీ వివరాలు అధికారులకు అందజేస్తే పరిష్కరించి సొమ్ము అందజేసేలా చర్యలు తీసుకుంటారు. రేపటి నుంచి వారోత్సవాలు ఆదివారం నుంచి వాడవాడలా ఆసరా సంబరాలు నిర్వహించేందుకు డీఆర్డీఏ సన్నద్దం చేస్తోంది. గ్రామం, మండల కేంద్రం, పట్టణం, నగరం మెదలు అన్ని ప్రాంతాల్లో ‘గడప గడపకు ఆసరా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 25 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ప్రజలకు, మహిళలకు వివరించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళలకు చేస్తున్న ఆర్థిక సాయంపై అవగాహక కల్పించనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారు. టీడీపీ హయాంలో మోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాలకు తీరని అన్యాయం జరిగింది. 2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని ప్రకటించారు. దీంతో మహిళలు రుణాలు చెల్లించలేదు. అనంతరం అధికారంలోకి వచ్చిన బాబు హామీ ఊసే ఎత్తలేదు. చేసేది లేక మహిళలు చేసిన అప్పుకు వడ్డీతో సహా చెల్లించాల్సిన దుస్థితి తలెత్తింది. అప్పుకోసం బ్యాంకర్ల ద్వారా వేధింపులకు గురయ్యారు. తిరిగి 2019 ఎన్నికల సమంయలో మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకునేందుకు బాబు కొత్త పన్నాగం పన్నారు. ఎన్నికల సమయంలో తాయిలాలుగా పసుపూకుంకుమ కింద నగదు అందజేసి చేతులు దులుపుకున్నారు. గ్రహించిన డ్వాక్రా మహిళలు ఎన్నికల్లో బాబును దూరం పెట్టారు. వైఎస్సార్సీపీకి అధికారం కట్టబెట్టారు. స్వయం ఉపాధి దిశగా అడుగులు ప్రభుత్వం అంజేస్తున్న ఆసరా సొమ్ముతో మహిళలు స్వయం ఉపాధి దిశగా దృష్టి సారిస్తున్నారు. దీంతో పాటు స్త్రీనిధి ద్వారా వచ్చిన సొమ్మును జమ చేసుకుని పాడి పశువుల పెంపకం, కిరాణా దుకాణం, గుడ్లు విక్రయించడం, టెంట్లు అద్దెకు ఇస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. జీవన ప్రమాణాల మెరుగునకు కృషి మహిళల జీవన ప్రమాణాలు, ఆర్థిక ప్రగతి సాధించేందుకు ఆసరా పథకం ఎంతగానో దోహదం చేస్తుంది. రుణమాఫీ ద్వారా వచ్చే నగదుతో పాడి పరిశ్రమ, చిరు వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నాం. స్వయం ఉపాధి పొందేలా అవగాహన కల్పిస్తున్నాం. ఫలితంగా మహిళలు కుటుంబ పోషణకు భర్తకు చేదోడుగా నిలుస్తున్నారు. ఇప్పటికే రెండు దశల్లో ఆసరా నిధులు విడుదలయ్యాయి. ఆసరా వారోత్సవాల సందర్భంగా అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రతి గ్రామంలో వివరిస్తాం. –ఎస్.సుభాషిణి, పీడీ డీఆర్డీఏ. -
Viral Wedding Card: వి‘వాహ్’ శుభలేఖ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ లవ్
రెండు వేల రూపాయల నోటు తరహాలో పెళ్లి శుభలేఖ అచ్చు వేయించి అందర్నీ ఆశ్చర్యపరిచారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఏడిద వెంకటేష్. తన చిన్న కుమార్తె పెళ్లికి పరిమాణంలో.. రూపంలో అచ్చం రెండు వేల రూపాయల నోటును పోలినట్లుంది పెళ్లి కార్డు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అక్షరాలుండే చోట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ లవ్ అనే పదముంది. ‘మేము ఇరువురం వివాహం చేసుకుంటున్నాం.. జీవితపు చివరి శ్వాసవరకూ కలసి ఉంటామని వాగ్దానం చేస్తున్నాం’ అని సింపుల్గా సారాంశం ఉంది. నోటుకు మరోవైపు పెళ్లి వివరాలు ముద్రించారు. కొందరికి శుభలేఖ చేతిలో పెడుతుంటే నిజంగా రెండు వేల నోటు అనుకుని నోటు తీసుకునేందుకు మొహమాటపడ్డారు. శుభలేఖేనని తెలుసుకుని వారి సృజనశైలిని మెచ్చుకున్నారు. కాగా, 2017లో వెంకటేష్ తన పెద్ద కుమార్తె పెళ్లికి ఆహ్వాన పత్రికను బ్యాంక్ ఏటీఎం కార్డు తరహాలో ముద్రించి ఆకట్టుకున్నారు. తక్కువ ఖర్చు, సృజనాత్మకత కోసమే తాను ఇలా చేశానని వెంకటేష్ ‘సాక్షి’కి తెలిపారు. – రాజమహేంద్రవరం సిటీ -
నేను విన్నాను.. నేను ఉన్నాను...
సాక్షి, రాజమహేంద్రవరం: తమ ప్రియతమ నేత.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ కష్టం చెప్పుకుంటే పరిష్కారమవుతుందని వారంతా భావించారు. ఈ నెల 3న రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాలలో పింఛన్ వారోత్సవాలకు వచ్చిన సీఎంకు తమ సమస్యలను నివేదించారు. వారి సమస్యలను విన్న జగన్ వెంటనే స్పందించారు. కలెక్టర్ మాధవీలతను పిలిచి పరిష్కరించాలని ఆదేశించారు. కాన్వాయ్ ఆపించి కిందకు దిగి మరీ సమస్యను విన్నారు. తక్షణమే న్యాయం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సీఎంకు ఇచ్చిన వినతులపై కలెక్టర్ వెంటనే కసరత్తు ప్రారంభించారు. నాలుగు రోజుల వ్యవధిలోనే చకచకా పరిష్కారం చూపారు. బాధితులకు కలెక్టర్ మాధవీలత శనివారం ప్రభుత్వ సాయం అందజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలు, చెక్కులను, ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. తమ కష్టం చెప్పగానే సీఎం స్పందించి పరిష్కారం చూపడంతో బాధిత కుటుంబీకుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. మా అబ్బాయి ఆరోగ్యానికి భరోసా రాజమహేంద్రవరం లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 16 ఏళ్ళ సాయి గణేష్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. వైద్యం చేయించడానికి పడుతున్న ఇక్కట్లను సీఎంను కలిసి బాధితుడి తండ్రి వివరించాడు. జగన్ ఆదేశాల మేరకు తక్షణ ఆర్థిక సహాయం కింద రూ.లక్ష కలెక్టర్ అందజేశారు. ప్రతినెలా రూ.5 వేలు పెన్షన్ అందేలా ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం జగనన్నను కలిసినప్పుడు మా అబ్బాయి ఆరోగ్యానికి భరోసా ఇచ్చారు. ఆయన చెప్పడంతో కలెక్టర్ రూ.5 వేలు పెన్షన్ సౌకర్యం కల్పించారు. ఆరోగ్యశ్రీ కింద వైద్య సహయం అందిస్తామన్నారు. ముఖ్యమంత్రికి, కలెక్టర్కు కృతజ్ఞతలు. – గులిన శ్రీ సాయి గణేష్ తండ్రి, లాలాచెరువు సీఎం జగన్కు కృతజ్ఞతలు.. నిడుదవోలు శెట్టిపేటకు చెందిన రెండేళ్ల డయానా శాంతి స్పైనల్ మసు్క్యలర్ వ్యాధితో బాధపడుతోంది. ఈ బాలిక కష్టం గురించి తెలుసుకున్న సీఎం చలించిపోయారు. ఆయన ఆదేశాల మేరకు బాలిక తల్లి సూర్యకుమారికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ అందజేశారు. సూర్యకుమారికి నిడదవోలు పీహెచ్సీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం, పాపకి ప్రత్యేక కేటగిరీ కింద నెలకు రూ.5 వేలు పెన్షన్ సౌకర్యం మంజూరు చేశారు. మా అమ్మాయి శాంతి వైద్య సహాయం కోసం సీఎం హామీ ఇచ్చారు. కానీ ఇంత తొందరగా ఆ హామీ నేరవేరుస్తారనుకోలేదు. మా కుటుంబ జీవనానికి భరోసా ఇచ్చేలా ఉద్యోగం కూడా ఇచ్చారు. నిడదవోలు మండలంలో ఇంటి స్థలం ఇస్తామన్నారు. సీఎం జగనన్న చల్లగా ఉండాలి. – సి. సూర్యకుమారి, బాధితురాలి తల్లి, నిడదవోలు పాప ఆరోగ్యానికి ఆర్థిక సాయం రాజమహేంద్రవరం దేవిచౌక్కు చెందిన సిరికొండ దుర్గా సురేష్ కుమార్తె గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లో దుర్గా సురేష్కు ఉన్న చిరుద్యోగం కూడా ఇటీవల పోయింది. ఆయన సీఎం జగన్ దృష్టికి తన సమస్య నివేదించారు. సీఎం ఆదేశాల మేరకు దుర్గా సురేష్కు ఆర్ఎంసీలో డ్రైవర్ ఉద్యోగం కల్పిస్తూ పునర్ నియామక ఉత్తర్వులు కలెక్టర్ అందచేశారు. పాప ఆరోగ్యం కోసం రూ.లక్ష ఆర్థిక సహాయంతో ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. చాలామంది అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం కలుగలేదు. సీఎం జగనన్నను కలిశాను. ఆయన వెంటనే స్పందించి కలెక్టరమ్మకు ఆదేశాలు ఇచ్చారు. ఆమె వెంటనే మనసు పెట్టి మా సమస్యలు పరిష్కరించారు. జగనన్న ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను. – సిరికొండ దుర్గా సురేష్, రాజమహేంద్రవరం జగనన్న మాటతోఉద్యోగం వచ్చింది... రాజానగరం నామవరానికి చెందిన కాశాని దుర్గా శ్రీదేవి భర్త గతేడాది మార్చిలో మరణించాడు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పిల్లల్ని చదువులు చదివించేందుకు ఆర్థిక భరోసా కల్పించాలని దుర్గా శ్రీదేవి సీఎం జగన్ను కలిసి కోరింది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో కడియం మండలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆమెకు డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉద్యోగమిస్తూ నియామక ఉత్తర్వులను కలెక్టర్ శనివారం అందజేెశారు. 3వ తేదీన ముఖ్యమంత్రి జగనన్నను కలిసే అదృష్టం వచ్చింది.నాకు కష్టాలను చెప్పాను. పెద్ద మనసుతో ముఖ్యమంత్రి జగనన్న స్పందించారు. ఇంత త్వరగా నాకు ఉద్యోగం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాను. – కాశాని దుర్గా శ్రీదేవి, నామవరం జగనన్న మనసున్న మారాజు... రాజమహేంద్రవరం చర్చిపేటకు చెందిన క్రిస్టఫర్ 25 సంవత్సరాలుగా ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసి ఇటీవల కలిశారు. సీఎం తెలుసుకుని న్యాయం చేయాలని ఆదేశించారు. వెలుగుబంద జగనన్న కాలనీలో ప్లాట్ నంబర్ 53లో 77 చదరపు గజాల స్థలానికి చెందిన పట్టాను కలెక్టర్ మాధవీలత అందచేశారు. ఒంటరిగా ఉంటున్న నాకు గతంలో ఎవరూ ఇంటి స్థలం ఇవ్వలేదు. జగనన్నను కలిసి కష్టం చెప్పుకున్నాను. ఆయన అంతా విన్నారు. ఇంటి స్థలమిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెళ్లిన వెంటనే నాకు ఇంటి స్థలం వస్తుందని అనుకోలేదు. ముఖ్యమంత్రి‡ జగనన్నకు ధన్యవాదాలు. – కె. క్రిస్టఫర్, రాజమహేంద్రవరం (చదవండి: మసకబారుతున్న ‘స్వర్ణ’కారుల బతుకులు) -
నిత్యసాహితీ ప్రవాహి
ఒకసారి నలభయ్యేళ్లు వెనక్కి వెడితే... విశాఖ సాహితిలో పనిచేసిన ప్రముఖ కథారచయిత మల్లాప్రగడ రామారావు ఉద్యోగరీత్యా రాజ మహేంద్రవరం వచ్చారు. అంతలో కొడవటిగంటి కుటుంబరావు (కొ.కు.) కన్ను మూసినట్టు వార్త వచ్చింది. ఒకనాటి తెలుగువారి సాహిత్య రాజధాని అయిన రాజమహేంద్రవరంలో కొ.కు. సంతాప సభ జరగక పోవడం ఆయనకు తలవంపుగా అనిపించింది. ఒక సాహితీ సంస్థను ఏర్పరచాలన్న వారి ఆలోచనకి మరికొందరు ఔత్సాహికులు కలిశారు. 1980 డిసెంబర్ 25న ‘సాహితీ వేదిక’ అవతరించింది. ఆ తర్వాత నాతో సహా మరెందరో చేరికతో అది మరింత వైశాల్యాన్ని తెచ్చుకుని యేడెనిమిదేళ్లు ఉనికిని చాటుకుంది. సభ్యుల్లో అనేకమంది తలోవైపుకీ చెదిరిపోవడంతో వేదిక క్రమంగా కనుమరుగై ఒక తీపి జ్ఞాపకంగా మిగిలింది. ఇప్పుడు మళ్ళీ ఈ నెల 25, 26 తేదీల్లో వేదిక సభ్యులం వేదిక ప్రస్థానాన్ని పునశ్చరణ చేసుకునేందుకు కలుసుకోబోతున్నాం. అనేక ప్రత్యేకతలున్న సంస్థ ‘సాహితీవేదిక’. అందరూ వక్తలు, శ్రోతలుగా ఉండే ఒక ప్రజాస్వామిక వేదికగా ఉండేది. భిన్న భావాలు, సిద్ధాం తాలు, ఆచరణలు, ఆకాంక్షలు ఉన్న... రచయితలూ, చదువరులతో, ‘నూరు ఆలోచనలు సంఘర్షించనీ వెయ్యి పువ్వులు వికసించనీ’ అన్నట్టుగా భావప్రకటనా స్వేచ్ఛతో ప్రభాత గౌతమిలా తళతళలాడుతుండేది. ఉత్తమ సాహిత్య ప్రమాణాలను పాటించడంలో వేదిక ఎన్నడూ రాజీపడలేదు. వామపక్షవాదులు మొదలు కొని సాంప్ర దాయవాదుల వరకూ సభ్యులుగా ఉండేవారు. ఒకరినొ కరం సహనంగా చెవొగ్గి వినటం, గౌరవించాల్సిన విష యాల్ని గౌరవించటం, విమర్శించాల్సిన వాటిని విమర్శించే పద్ధతిని పాటించాం. వేదిక కార్యక్రమాలు ఎంతో ఆసక్తిగొలిపేవి. వాటి కోసం ఉత్సాహంగా ఎదురు చూసే వాళ్ళం. ‘నిరుడు కురిసిన హిమ సమూహములు’ అనే విభాగం కింద వెనుకటి తరం రచయితల కథో, కవితో చదవడంతో సమావేశాన్ని ప్రారంభించేవారం. ప్రతినెలా రెండవ ఆదివారం జరిపే ‘సమాలోచన’ కార్యక్రమంలో ఆయా విశిష్ట రచనలపై ప్రసంగ వ్యాసాలు చదివేవారం. ఉగాది రోజున సాయంత్రం ‘ఇష్ట కవితా పఠనం’లో తనకి ఇష్టమైన కవి నుండి తాము ఎన్నుకున్న కవితని గోదావరి నదీతీరంలో మెట్ల మీద కూర్చుని పఠించే వాళ్ళం. వేదిక తొలి కథాసంకలనం ‘కథావేదిక’ను ఆర్ఎస్ సుదర్శనం, రెండవ కథాసంకలనం ‘కథాగౌతమి’ని కె. వాసమూర్తి, మొదటి ‘కవితావేదిక’ను గుంటూరు శేషేంద్ర శర్మ, ‘ఆర్కెష్ట్రా’ను వేగుంట మోహనప్రసాద్ ఆవిష్కరించడం వేదిక సభ్యులకి విలువైన జ్ఞాపకం. రెండవ వార్షికో త్సవ సభకు ముఖ్య అతిథిగా కాళీపట్నం రామారావు పాల్గొనటం ఓ మధురస్మృతి. నేటి పునస్సమాగమాన్ని పురస్కరించుకుని వేదిక గురించిన ఒక విశేష సంచికను, కొంతమంది సభ్యుల పుస్తకాలను ఆవిష్కరించుకోబోతున్నాం. ‘సాహితీ వేదిక’ అందమంతా తన విశాలత్వమే. అది మా తలపుల్లో గోదావరిలా నిత్యప్రవాహి. కుప్పిలి పద్మ వ్యాసకర్త కవయిత్రి, కథకురాలు -
ఆ రైళ్లను ఆపండి.. రైల్వే బోర్డు ఛైర్మన్కు ఎంపీ భరత్ విజ్ఞప్తి
సాక్షి, ఢిల్లీ: రాజమండ్రి, కొవ్వూరు రైల్వే స్టేషన్లలో పలు ప్రధానమైన రైళ్లు హాల్టులు, స్టాప్లకు అనుమతి ఉత్తర్వులు జారీ చేయాలని రైల్వే బోర్డు ఛైర్మన్ అండ్ సీఈవో వీకే త్రిపాఠిని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ కోరారు. ఢిల్లీలో రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవోలను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. రాజమండ్రి నగర ప్రాధాన్యత, సుదూర ప్రాంతాల నుండి నిత్యం ఇక్కడకు వచ్చే వ్యాపార, వాణిజ్య, యాత్రికులకు కావలసిన రైళ్లు అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారని ఎంపీ భరత్ త్రిపాఠికి తెలిపారు. హౌరా టు శ్రీ సత్య సాయి నిలయం ఎక్స్ప్రెస్, భువనేశ్వరం టు రామేశ్వరం ఎక్స్ప్రెస్, భువనేశ్వరం - పూణే ఎక్స్ప్రెస్, చెన్నై-జాల్పిగురి సూపర్-ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కామాక్య యశ్వంత్ పూర్ ఎక్స్ప్రెస్, పాండిచ్చేరి హెచ్ డబ్ల్యూ హెచ్ ఎక్స్ప్రెస్లు హాల్ట్స్, స్టాప్స్కు అనుమతి కోరారు. విమానాశ్రయం, ఓఎన్జీ బేస్ కాంప్లెక్స్, ఏపీ పేపర్ మిల్స్, జీఎస్కే హార్లిక్స్, మూడు గ్యాస్ పవర్ ప్రాజెక్ట్స్ తదితర అనేక పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కూడా రాజమండ్రికి చేరువలోనే ఉందన్నారు. విశాఖపట్నం- విజయవాడ నగరాలకు మధ్యలో ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన కేంద్రంగా రాజమండ్రి నగరం అన్ని రంగాలలోనూ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. టూరిజం హబ్ గా శరవేగంగా రాజమండ్రి, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అయితే ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వచ్చే యాత్రికులకు, టూరిస్టులకు, వ్యాపార, వాణిజ్య, వివిధ రంగాల వారికి అనువైన విధంగా రైళ్లు సదుపాయం లేకపోవడంతో చాలా కష్టంగా ఉంటోందని రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో త్రిపాఠికి వివరించినట్టు ఎంపీ భరత్ తెలిపారు. అలాగే కొవ్వూరు రైల్వే స్టేషన్లో కొన్ని రైళ్లకు హాల్ట్స్, స్టాప్స్ ఆపివేశారని, వాటిని కూడా పునరుద్ధరించాలని త్రిపాఠిని కోరినట్లు ఎంపీ భరత్ తెలిపారు. బొకారో, సింహాద్రి, తిరుమల, తిరుపతి-పూరి, సర్కార్, కాకినాడ- తిరుపతి, మచిలీపట్నం- విశాఖ, రాయగడ-గుంటూరు, బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ లను పునరుద్ధరించాల్సిందిగా ఎంపీ భరత్ కోరారు. కొవ్వూరు, గోపాలపురం, తాళ్ళపూడి, పోలవరం మండలాలకు చెందిన సుమారు 60 గ్రామాల ప్రజలు కొవ్వూరు రైల్వే స్టేషను నుండి ప్రయాణం చేయాలని, అటువంటిది రైళ్ల హాల్ట్స్, స్టాప్స్ లేకపోవడంతో మరో 15 కిలోమీటర్లు అదనపు దూరం ప్రయాణించి రాజమండ్రి రైల్వే స్టేషన్కు రావలసి వస్తోందన్నారు. నిలిచిపోయిన రైళ్లను పునరుద్ధరించి, ఆరు నెలలు పరిశీలించాలని.. అప్పటికీ రైల్వే శాఖకు తగిన ఆదాయ వనరులు రాకుంటే మీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవచ్చని త్రిపాఠికి ఎంపీ భరత్ సూచించారు. అలాగే అనపర్తి, నిడదవోలులో జన్మభూమి ఎక్స్ప్రెస్, రాజమండ్రి నుండి లోకల్ ఎక్స్ప్రెస్ సర్వీసులు కొనసాగించమని కోరినట్టు ఎంపీ భారత్ వివరించారు. తన అభ్యర్థనలపై రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో త్రిపాఠి సానుకూలంగా స్పందించారని ఎంపీ భరత్ తెలిపారు. చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం? -
రాజమండ్రి: గూడ్స్ ప్రమాదం ఎఫెక్ట్.. 9 రైళ్లు రద్దు
సాక్షి, రాజమండ్రి: బాలాజీపేట వద్ద గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. విశాఖ నుంచి విజయవాడవైపు వెళ్తున్న గూడ్స్ రైలు భోగి పట్టాలపై పడిపోయింది. దీంతో, పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు 9 రైళ్లను రద్దు చేశారు. 2 రైళ్లను పాక్షికంగా రద్దుచేసినట్టు తెలిపారు. రైళ్ల వివరాలు ఇవే.. - విజయవాడ-విశాఖ, విశాఖ-విజయవాడ రైళ్లు రద్దు. - గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు. - గుంటూరు-విజయవాడ, కాకినాడ పోర్టు-విజయవాడ రైళ్లు రద్దు - కాకినాడ పోర్టు-విజయవాడ రైలు పాక్షికంగా రద్దు. - విజయవాడ-రాజమండ్రి రైలు పాక్షికంగా రద్దు. ఇక, పలు ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
పట్టాలు తప్పిన రైలు.. విశాఖ వైపు వెళ్లే పలు ట్రైన్స్ ఆలస్యం!
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి బాలాజీపేట వద్ద గూడ్స్ రైలు పట్టింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, బుధవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు భోగి పూర్తిగా పట్టాలపై పడిపోయింది. ఇక, ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని భోగిని పట్టలాపై నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం కారణంగా విశాఖ వైపునకు వెళ్లు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అత్తిలి వద్ద పలు రైళ్లు నిలిచిపోయాయి. -
మీసం మెలేసి.. చెప్పులు విసిరి
సాక్షి, రాజమహేంద్రవరం: అమరావతి యాత్ర ముసుగులో టీడీపీ, జనసేన నేతలు రాజమహేంద్రవరంలో బీభత్సం సృష్టించారు. వికేంద్రీకరణకు మద్దతుగా శాంతియుతంగా సభ నిర్వహించి నిరసన వ్యక్తంచేస్తున్న స్థానికులపై ఆ పార్టీల శ్రేణులు విరుచుకుపడ్డారు. మీసం మెలేసి మరీ రెచ్చగొట్టారు. ‘యాత్రను ఆపేదెవరు’ అంటూ పాటలు పెట్టుకుని మరీ రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించారు. వాటర్ ప్యాకెట్లు, చెప్పులు విసిరి రౌడీయిజానికి తెర తీశారు. రాళ్ల దాడికీ తెగబడ్డారు. మురికినీళ్ల బాటిళ్లు విసిరారు. అప్పటివరకు సహనంగా ఉన్న స్థానికులు ఒక్కసారిగా ప్రతిఘటించడంతో నగరంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ చేపట్టిన పాదయాత్ర మంగళవారం రాజమహేంద్రవరం నగరంలోకి ప్రవేశించింది. దేవీచౌక్ మీదుగా ఆజాద్ చౌక్ వద్దకు యాత్ర చేరుకుంది. అప్పటికే ఆజాద్ చౌక్ వద్ద యాత్ర వెళ్లే ప్రాంతానికి కొంతదూరంలో వికేంద్రీకరణకు మద్దతుగా స్థానికులు శాంతియుతంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. పాదయాత్ర ఆజాద్ చౌక్ వద్దకు చేరుకోగానే స్థానికులు నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. ‘వికేంద్రీకరణ ముద్దు.. ఒకే రాజధాని వద్దు’ అని నినదించారు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన అమరావతి పాదయాత్రలోని కొందరు టీడీపీ, జనసేన నేతలు యాత్ర వెంట తెచ్చుకున్న వాటర్ ప్యాకెట్లను స్థానికులపైకి విసిరారు. మీసం మెలేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ప్రత్యేక వాహనాన్ని అక్కడ నిలిపి ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేక పాటలతో హోరెత్తించారు. బాణాసంచా కాలుస్తూ హంగామా సృష్టించారు. దీంతో ఒక్కసారిగా స్థానికులు ప్రతిఘటించి నిరసన వ్యక్తం చేశారు. యాత్ర ముసుగులో వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లు, చెప్పులు విసురుతున్న వాటిని పట్టుకుని తిరిగి వాళ్లపైకి విసిరారు. టీడీపీ బినామీలు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇలా సుమారు గంటపాటు ప్రతిఘటన ఎదురైంది. అక్కడే ఉన్న టీడీపీ రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి సైతం దాడిని ప్రోత్సహించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు కలగజేసుకుని పాదయాత్రను ముందుకు కదలనివ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇద్దరు కార్యకర్తలకు తీవ్రగాయాలు.. మరోవైపు.. అమరావతి రైతుల ముసుగులో టీడీపీ, జనసేన నేతలు జరిపిన రాళ్ల దాడిలో కొండా సాయి, కె. నూకరాజు అనే వ్యక్తులకు తలపై, ఎడమ కంటి వద్ద బలమైన గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని ఎంపీ మార్గాని భరత్ వైద్యులకు సూచించారు. రాజమహేంద్రవరం చరిత్రలో ఇది చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. అలాగే, దాడిని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు దాడిని ఖండించారు. -
లోన్ యాప్ ఘటనలో ఏడుగురి అరెస్ట్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): లోన్ యాప్ వేధింపులకు బలైన దంపతుల సంఘటనలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. రాష్ట్రంలో రుణ యాప్ బాధితులు పెరుగుతుండటంతో సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. లోన్ యాప్లతో వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ నెల ఏడో తేదీన రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి, వారంలోనే నిందితుల్ని పట్టుకున్నారు. స్థానిక దిశా పోలీస్ స్టేషన్లో సోమవారం మీడియాకు జిల్లా ఇన్చార్జి ఎస్పీ సుధీర్కుమార్రెడ్డి వివరాలు తెలిపారు. భార్యాభర్తల ఆత్మహత్యకు కారణమైన హాండీ లోన్, స్పీడ్ లోన్ యాప్లపై పోలీసులు ఆరా తీశారు. దీనికి సంబంధించి మూడు పోలీసు బృందాలు పనిచేశాయి. యాప్లకు, లోన్ తీసుకునే వారికి మధ్యవర్తులుగా పని చేస్తున్న వారిని గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం గండిపేట మండలం మానికొండకు చెందిన లంబాడీ నరేష్, మియాపూర్కు చెందిన కొల్లూరు శ్రీనివాస్యాదవ్, కాకినాడ జిల్లా తిమ్మాపురానికి చెందిన మేడిశెట్టి పృథ్వీరాజ్, ఏలేశ్వరానికి చెందిన నక్కా సుమంత్, అన్నవరానికి చెందిన మండా వీరవెంకటహరిబాబు, విశాఖ జిల్లా కేకే అగ్రహారానికి చెందిన కోరుపోలుత రామకృష్ణ, అనకాపల్లి సమీపంలోని సిరసపల్లికి చెందిన దానబోయిన భాస్కర్లు నిందితులని పోలీసులు గుర్తించారు. వీరి బ్యాంకు ఖాతాలను పరిశీలించగా నెలలోనే రూ.కోటి లావాదేవీలు చేసినట్టు గుర్తించారు. బ్యాంకు అధికారులకు అనుమానం రాకుండా ప్రతి నెలా వేర్వేరు ఖాతాలను వీరు నిర్వహిస్తున్నారు. పోలీసులకు ఇతర రాష్ట్రాల్లోని యాప్ నిర్వాహకుల సమాచారం కూడా లభిం చడంతో ఆ దిశగా కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. త్వర లోనే వీరిని కూడా పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. -
AP: మంత్రి విశ్వరూప్కు అస్వస్థత.. హైదరాబాద్కు తరలింపు
సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం మైల్డ్ స్ట్రోక్కు గురికావడంతో కుటుంబ సభ్యులు విశ్వరూప్ను వెంటనే రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. అనంతరం, విశ్వరూప్ను హెల్త్ కండీషన్ను పరిశీలించిన వైద్యులు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎన్ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందించారు. కాగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈరోజు(శుక్రవారం) వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా మంత్రి విశ్వరూప్.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన చేయి లాగుతుందని నాయకులకు చెప్పడంతో విశ్వరూప్ను వెంటనే రాజమహేంద్రవరంకి తీసుకు వెళ్లారు. ఇది కూడా చదవండి: బయటకు పొక్కని ‘రహస్యం’.. ఆ విషయంలో చేతులెత్తేశారా? -
ఖైదీలపై అనంతబాబు దాడి పూర్తి అవాస్తవం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నించాలని, అవాస్తవాలతో కట్టుకథలు అల్లి, లేనిని ఉన్నట్టు చెప్పడం సరికాదని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు అన్నారు. జైల్లోని ఖైదీలను ఎమ్మెల్సీ అనంతబాబు కొట్టారని, జైల్లో రాచమర్యాదలు.. అని కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు పూర్తి అవాస్తవమని పేర్కొంటూ జైళ్ల శాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును కేంద్ర కారాగారంలోని ఓ బ్లాకులో సింగిల్ సెల్లో ఉంచినట్టు రాజారావు తెలిపారు. సెక్యూరిటీ రీత్యా సెల్లో 24 గంటలూ సిబ్బంది పహారా, నిత్య పర్యవేక్షణ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అందువలన తోటి ఖైదీలతో ఎలాంటి వివాదాలు, ఘర్షణలు పడే అవకాశమే లేదన్నారు. ఇతర ఖైదీలకు కల్పించే సదుపాయాలనే ఆయనకూ కల్పించామని.. పడుకునేందుకు పరుపు ఏర్పాటు చేశామన్నది పూర్తి అబద్ధమన్నారు. నిబంధనల ప్రకారం అందరు ఖైదీల మాదిరే దిండు, డర్రీ, వులెన్ బ్లాంకెట్, దుప్పటి ఇచ్చామని, మెనూ ప్రకారమే ఆహారం అందిస్తున్నామని తెలిపారు. అనంతబాబును కలిసేందుకు వస్తున్న వారికి నిబంధనల ప్రకారమే ములాఖత్, ఇంటర్వ్యూ అవకాశాలిస్తున్నట్టు చెప్పారు. అలా వచ్చిన వారి పూర్తి వివరాలు, ఆధార్ కార్డు పరిశీలించాకనే అనుమతిస్తున్నట్టు వెల్లడించారు. ములాఖత్కు వస్తున్న వారి ఫోన్తో అనంతబాబు మాట్లాడారనేది కూడా పూర్తి అవాస్తవమని రాజారావు స్పష్టం చేశారు. -
సీఎంపై అభిమానంతో.. 2,745 మంది రక్తదానం
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2,745 మంది సోమవారం రక్తదానం చేసి రాష్ట్ర చరిత్రలో రికార్డు సృష్టించారు. రక్తదానం చేయడం ద్వారా జననేత జగన్పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జగన్ అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి వరుసగా మూడో ఏడాది కూడా ఒరవడిని కొనసాగించారు. మంగళవారం సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు కావడంతో ఒకరోజు ముందే సోమవారం రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ప్రతినిధి జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శిబిరాన్ని ప్రారంభించగా సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, శాప్ చైర్మన్ బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్రహౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దివంగతనేత జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, శాప్చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి తొలుత రక్తదానం చేశారు. జగన్ సీఎం అయ్యాక తొలుత 2019లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 2,043 మంది రక్తదానం చేయగా, 2020లో 2,143 మంది రక్తదానం చేశారు. ఈ ఏడాది 2,745 మంది రక్తదానం చేసి రికార్డు నెలకొల్పారు. ఉభయ గోదావరి జిల్లాల జెడ్పీ చైర్మన్లు విప్పర్తి వేణుగోపాలరావు, కౌరు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
బుచ్చిరాజ్యంలో.. ఆదిపత్య పోరు
వందల ఏళ్ల చరిత్ర కలిగి.. రాజరాజనరేంద్రుడు ఏలిన పురాతన రాజమహేంద్రవరం నగరంలో ఆధిపత్యం కోసం ఇద్దరు సామంతులు ‘ఎత్తుల’ కత్తులు దూస్తున్నారు. ఒక సామంతుడు ‘బుచ్చి’రాజు. మరొకరు ‘ఆది’రాజు. రాజులు పోయినా.. రాజ్యాలు పోయినా రాచరికపు వాసనలు వారిని వీడటం లేదు. బుచ్చిరాజును సైన్యంతో సహా పదేళ్ల క్రితమే పొరుగు రాజ్యానికి ఆదిరాజు తరిమేశారు. అప్పటి నుంచీ కోల్పోయిన రాజ్యంలో పట్టు సాధించాలనే ఆరాటంతో.. అవకాశం వచ్చినప్పుడల్లా అలక పాన్పు ఎక్కేస్తున్నారు బుచ్చిరాజు. వందిమాగధులతో రకరకాల తంత్రాలు పన్నుతున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవంతో రాజకీయ మాయోపాయాలు పన్ని, ఆదిరాజును ఇరుకున పెట్టి, రాజ్యంలో పట్టు సాధించాలన్నది ఆయన వ్యూహం. సాక్షి,రాజమహేంద్రవరం: ఉత్తరాంధ్ర పరగణాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన ఆజానుబాహుడైన ఓ నాయుడికి స్వయానా బంధువైన ఆదిరాజు ఏమైనా తక్కువ తిన్నారా? బుచ్చిరాజు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తన రాజ్యంలో వేలు పెడితే యుద్ధం తప్పదని వేగుల ద్వారా బుచ్చిరాజుకు సందేశం పంపించారు. అలనాడు దుర్యోధనుడు చెప్పినట్టు ‘‘సూది మొన మోపినంత స్థలం కూడా వదులుకోన’’ని స్పష్టంగా చెప్పాడు. విషయం ఆ నోటా ఈ నోటా రాజ్యం నలుమూలలా పాకడంతో సామంతులు, ఆంతరంగికుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. భటుల ద్వారా ఇది తెలుసుకున్న బుచ్చిరాజు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అలాగని వందిమాగధులతో యుద్ధానికి సై అని సాహసించడం లేదు. తన రాజ్యంలోని సైనిక సంపత్తి, మంత్రాంగం సరిపోదనే కారణంతో.. అలకబూని.. రాజప్రసాదం తలుపులు తెరవకుండా మూడు రోజులుగా అంతఃపురానికే పరిమితమైపోయారు. ఈ తరహా రాజకీయ తంత్రం బుచ్చిరాజుకు కొత్తేమీ కాదు. రాజమహేంద్రవర రాజ్యాన్ని కోల్పోయిన గాయం ఇంకా మానకున్నా.. ‘చంద్ర’వంశ రాజదర్బార్లో కనీస మర్యాద కూడా దక్కడం లేదని ఏడు పదుల వయస్సులో ఉన్న ఈ సామంతరాజు కుమిలిపోతున్నారు. గతంలో కూడా ఇలానే కనీసం వయస్సుకు కూడా విలువ ఇవ్వడం లేదంటూ అంతఃపురంలో ఏకాంతంగా అంతర్మధనం చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయని ఆంతరంగికులు గుసగుసలాడుకుంటున్నారు. దాదాపు పదేళ్లుగా అవమాన భారంతో రగిలిపోతున్న బుచ్చిరాజు కోల్పోయిన చోటే వెతుక్కోవాలనే సూత్రాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ ఆయన ఎత్తులు ఆదిరాజు రాజకీయ తంత్రం ముందు చిత్తవుతున్నాయి. భవిష్యత్లో రాజమహేంద్రవరంలోని 52 పరగణాలకు జరిగే పోరు కోసమే సామంతుల మధ్య ఇంతటి రాజ్యకాంక్ష నెలకొందనే చర్చ రాజదర్బారులో నడుస్తోంది. బుచ్చిరాజు రాజ్యంలోకి వచ్చే తొమ్మిది పరగణాలతో పాటు, మిగిలిన 43 పరగణాల్లో తన సుబేదారులకే పట్టు ఎక్కువ ఉండటంతో.. వారిని యుద్ధరంగంలోకి దింపాలనేది బుచ్చిరాజు వ్యూహం. అయినప్పటికీ ఆదిరాజు సిక్కో లు రాజుల బంధుత్వం దన్నుతో ధీమాగా ఉన్నారని ఆ రాజప్రసాదంలోని భటులు చెప్పుకొంటున్నారు. సామంతుల మధ్య సంధి కోసం ‘చంద్ర’వంశ రాజు పంపించిన దూతలు బుచ్చిరాజు అంతఃపురంలో గంటన్నర చర్చించినా చివరకు తలలు పట్టుకుని వచ్చిన దారినే పలాయనం చిత్తగించారు. పైకి మాత్రం సామంతుల మధ్య యుద్ధ వాతావరణం లేదని, బుచ్చిరాజుకు అసలు అసంతృప్తే లేదని చెప్పారు. ‘చంద్ర’వంశ సామంతులు నిమ్మకాయల చినరాజు, బెజవాడలో ‘గద్దె’నెక్కిన రామ్మోహనరాజు, రాజమహేంద్రవరం రాజ్యంలో గోదావరి అవతల ఒడ్డున ప్రజలకు చుక్కలు చూపించిన హర్రర్రాజు, అనపర్తి రెడ్డి రాజు వంటి దూతల సంధి విఫలమైంది. అసలు సామంతుల మధ్య చిచ్చు పెట్టిందే ‘చంద్ర’వంశ రాజు. సంధి కోసం వెళ్లిన దూతలు మధ్యలో అంతఃపురం బయట చెప్పుకొన్న మాటలను రహస్యంగా విన్న రాజభటులు బుచ్చిరాజు చెవిన వేశారు. నాడు పిల్లనిచ్చి, మంత్రిని చేసిన మామ రాజ్యాన్నే కూల్చేసి, సింహాసనం అధిíÙ్ఠంచి, ఇన్నేళ్లవుతున్నా.. తన వ్యతిరేక కూటమితో చేతులు కలిపిన బుచ్చిరాజును ఒకప్పటి ‘చంద్ర’వంశ రాజు ఇప్పటికీ వదిలిపెట్టలేదని వేగుల ద్వారా వచ్చిన సమాచారం. అందుకే ఈ సంధి యత్నాలు ‘చంద్ర’వంశ అంతఃపురం సాక్షిగా రక్తి కట్టిస్తున్న ఎత్తుగడగా కనిపిస్తున్నాయి. చక్రవర్తిగా బుచ్చిరాజు చలామణీ అయ్యే రోజుల్లో అతడికి ఆదిరాజు సామంతుడు కావడమే విచిత్రం. సామంతుల మ«ధ్య చిచ్చు చివరకు ఏ తీరానికి చేరుతుందోనని ఇరుగు, పొరుగు రాజ్యాల్లోని నాయకులు, ప్రజలు కోటగోడలెక్కి మరీ ఆసక్తిగా చూస్తున్నారు. -
అధిష్టానంపై ‘గోరంట్ల’ తీవ్ర అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి గోరంట్ల రాజీనా మా చేస్తున్నట్లు గురువారం సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. ఈ సమాచారంపై మీడియా వద్ద స్పందించేం దుకు గోరంట్ల తొలుత నిరాకరించారు. సీని యర్ అయిన తనను పార్టీ అధిష్టానం అవ మానానికి గురిచేస్తోందనే ఆవేదనతో రాజమ హేంద్రవరంలో ఇంటికే పరిమిత మయ్యారు. విషయం తెలుసుకుని ఆ పార్టీ మరో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీమంత్రి జవహర్ ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. చంద్రబాబుతో మాట్లాడి సర్దుబా టు చేస్తామని, గోరంట్ల రాజీనామా ప్రస్తావన రాలేదని, అసంతృప్తి మాత్రమేనని చిన రాజప్ప, జవహర్ ప్రకటించారు. అయినా.. అలక వీడని గోరంట్ల పార్టీలో తాను ఒంటరినని, చంద్రబాబును మాత్రం కలిసేది లేదని, నాయకులే కలుస్తారని స్పష్టంచేశారు. పార్టీ పదవులు, పీఏసీ చైర్మన్లో ప్రాధాన్యం ఇవ్వక పోవడంతో చంద్రబాబుపై గోరంట్ల తీవ్ర అసంతృప్తితో రాజీనామాకు సిద్ధపడుతు న్నట్లు సమాచారం. దీనిపై గోరంట్ల స్పందిస్తూ.. రాజీనామా విషయంపై వారం, పది రోజుల్లో స్పష్టతనిస్తానని చెప్పారు. -
బాలికపై సామూహిక అత్యాచారం
రాజమహేంద్రవరం క్రైం: ఆవారాగా తిరుగుతూ దోపిడీలు చేసే బ్లేడ్ బ్యాచ్ ఓ బాలికను బంధించి, చిత్ర హింసలకు గురిచేస్తూ నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన తూర్పుగోదావరిలో జరిగింది. శనివారం రాజమహేంద్రవరం నార్త్జోన్ డీఎస్పీ టీఎస్ఎన్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. ► కోరుకొండ మండలం మధురపూడికి చెందిన ఓ మహిళకు ముగ్గురు కుమార్తెలు. భర్త చాలాకాలం క్రితం మృతి చెందాడు. ► టెన్త్ పాసయిన రెండో కుమార్తెకు రాజమహేంద్రవరంలోని ఓ దుకాణంలో పని ఇప్పిస్తానని స్థానికంగా ఉండే అనిత ఈ నెల 12న తీసుకెళ్లింది. సాయంత్రం అనిత మాత్రమే తిరిగిరావడంతో తన కుమార్తె గురించి తల్లి ఆరా తీసింది. ► తనకు తెలియదని అనిత చెప్పడంతో ఆ తల్లి కోరుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి 16వ తేదీ రాత్రి బాలిక ఆచూకీ గుర్తించారు. ► అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ► కోలుకున్న తర్వాత ఆ బాలిక జరిగిన ఘటనను వివరించింది. ► మత్తు మందుకు అలవాటు పడ్డ అనితకు క్వారీ మార్కెట్ ప్రాంతానికి చెందిన బ్లేడ్ బ్యాచ్తో పరిచయాలు ఉన్నాయి. ► బాలికను ఆ బ్లేడ్ బ్యాచ్ యువకులకు అప్పగించింది. ► రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద ఓ రూమ్కు బాలికను తీసుకుని వెళ్లిన ఆ బ్యాచ్ యువకులు బాలికకు మత్తు మందు ఇచ్చి, ఆమెను బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా చిత్రహింసలకు గురి చేసినట్లు బాలిక ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ► అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులు ఎంతమంది ఉన్నా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. (ప్రేమకు లాక్డౌన్ అడ్డంకి.. ఆపై ప్రియురాలి హత్య..) -
‘నేను స్పెషలాఫీసర్ని.. ఇది నా ఐడీ’
సాక్షి, సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం) : సచివాలయాల పరిశీలనకు వచ్చిన ప్రత్యేక అధికారినంటూ ఓ వ్యక్తి స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, వార్డు సచివాలయాల్లో సోమవారం హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి బాలాజీపేటకు చెందిన 40వ వార్డు సచివాలయ కార్యదర్శులను వెంటబెట్టుకుని ఓ వ్యక్తి వచ్చాడు. నేరుగా తహసీల్దార్ గదిలోకి వెళ్లి ఆయన సీట్లో కూర్చున్నాడు ‘‘నేను సీఎం కార్యాలయం నుంచి వచ్చిన స్పెషలాఫీసర్ను, ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది’’ ఇది నా ఐడీ అని చూపించాడు. తన పేరు ఉపేంద్ర రోషన్ అని తన సెల్ నంబర్: 6301814060గా చెప్పాడు. తహసీల్దార్ సుస్వాగతం అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజును పిలిచి వివరాలు అడిగాడు. బుధవారం మళ్లీ వస్తానని అప్పటికి అన్ని రికార్డులు సిద్ధం చేసి ఉంచాలని చెప్పి వెళ్లిపోయాడు. (టార్గెట్ వైఎస్సార్సీపీ! ) సందేహం కలిగిన డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజు ప్రభుత్వ కార్యాలయానికి ఫోన్ చేసి ఆరా తీయగా అటువంటి వ్యక్తి ఎవరూ లేరని చెప్పారు. దీంతో సాయంత్రం ఆ వ్యక్తికి ఫోన్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి రావాలని కోరగా, తొలుత వీలుపడదని చెప్పాడు. అయితే డిప్యూటీ తహసీల్దార్ గట్టిగా చెప్పడంతో రాత్రి ఏడు గంటలకు కార్యాలయానికి వచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న టూటౌన్ పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇతడు రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామానికి చెందిన వాడని, బీఎడ్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడని టూటౌన్ సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. నాలుగురోజులుగా రాజమహేంద్రవరంలో పలు సచివాలయాలకు వెళ్లి, తాను సీఎం పేషీ నుంచి వచ్చానని అక్కడి సిబ్బందిపై హడావుడి చేస్తూ వస్తున్నాడని తెలిపారు. జిల్లాలోని రెవెన్యూ, కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన వారి ఫోన్ నంబర్లన్నీ అతడి ఫోన్లో ఉండడం కొసమెరుపు. నకిలీ అధికారిని అరెస్ట్ చేసిన పోలీసులు -
జగన్కు ప్రజల్లో 51 శాతం ఆదరణ
రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర ప్రజల్లో జగన్కు 51 శాతం ఆదరణ ఉందని, అతనిని ఎవరూ ఏమీ చేయలేరని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజమహేంద్రవంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. మాజీ సీఎం రాజశేఖరరెడ్డి తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు జగన్ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యంగా ఉండాలన్నారు. రాజశేఖరరెడ్డి చొరవతో కాలువల నిర్మాణం జరగడం వల్లనే చంద్రబాబు పట్టిసీమ ద్వారా నీరు ఇవ్వగలిగాడన్నారు. వైఎస్సార్ ఆలోచనను 14 ఏళ్ల తరువాత జగన్ నిజం చేశారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయమై జగన్కు బుధవారం లేఖ రాశానని చెప్పారు. -
పెన్నుల్లో రాజా..‘రత్నం’!
ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన జర్మన్ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్కు ప్రధాని నరేంద్ర మోదీ ఓ పెన్ను బహుమతిగా ఇచ్చారు. అది ఏ అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన మాంట్ బ్లాంక్, పార్కర్ పెన్నో కాదు.. పూర్తి స్వదేశీది. పైగా.. అచ్చమైన తెలుగు నేలపై తయారైన ‘రత్నం’ పెన్ను అది. ఎనిమిది దశాబ్దాలకు పైగా చరిత్ర.. మూడు తరాల వారసత్వం దీని ఘనత. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదికగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఈ కలం పుట్టుపూర్వోత్తరాలు ఇవిగో.. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం : దేశంలో సిరా పెన్నుల తయారీకి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తొలి అడుగు పడింది. ఈ ఘనత రత్నం పెన్నుకే దక్కింది. మూడు తరాలుగా రత్నం పెన్నులు తయారై దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ పెన్నుల తయారీ కేంద్రం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కోటగుమ్మం రంగిరీజు వీధిలో ఉంది. స్వాతంత్య్ర సమరానికి ముందు దేశీయంగా పెన్నుల తయారీ రంగంపై తనదైన ముద్ర వేసిన రత్నం సన్స్ కుటీర పరిశ్రమగా ఉంది. ఇక్కడ తయారైన ‘గైడర్’, ఫౌంటెన్ పెన్నులు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించాయి. అనేక మోడల్ పెన్నులు మార్కెట్లోకి వస్తున్నా రత్నం సన్స్ పెన్నుకున్న ప్రాచుర్యం ఇప్పటికీ తగ్గలేదు. భారతావనిలో ప్రప్రథమంగా రత్నం పెన్ను రాజమహేంద్రవరంలో 1932లో కోసూరి రత్నం ఆవిష్కరించారు. రత్నం మరణానంతరం అతని రెండో కుమారుడు కోసూరి వెంకటరమణమూర్తి, మూడో తరంలో రత్నం మనుమలు గోపాలరత్నం (గోపీ), చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పెన్నుల తయారీని కొనసాగిస్తున్నారు. రత్నం పెన్ను పుట్టుపూర్వోత్తరాలు.. స్వాతంత్య్రానికి పూర్వం సిరా పెన్నులు విడిభాగాలు విదేశాల నుంచి రప్పించుకుని కొంతమంది తయారుచేసే వారు. ఒకసారి అప్పటి ఉమ్మడి గోదావరి జిల్లాకు కృష్ణమాచార్య అనే సబ్ జడ్జి కలం కిందపడి పాళీ వంగిపోయింది. 14 క్యారెట్ల బంగారంతో చేసిన పాళీ అది. స్వర్ణకారుడైన కేవీ రత్నం, సోదరుడు సత్యం కొత్త పాళీని తయారుచేసి ఇచ్చారు. వీరి ప్రతిభను చూసి సబ్జడ్జికి ముచ్చటేసింది. ముడిసరుకు తాను తెప్పిస్తానని కలాల తయారీ చేపట్టమని సబ్జడ్జి రత్నంను ప్రోత్సహించారు. అలా 1932లో రత్నం పెన్నులు మార్కెట్లోకి ప్రవేశించాయి. కాలక్రమంలో వెండి, బంగారంతో పెన్నులు తయారుచేస్తూ రత్నం పెన్నులకు ఒక బ్రాండ్ను తీసుకువచ్చారు. గాంధీ మెచ్చిన పెన్ను అప్పట్లో అఖిల భారత గ్రామీణ పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు జేసీ కుమారప్ప రాజమహేంద్రవరంలో మూడు రోజులు మకాం చేసి దగ్గరుండి రెండు పెన్నులు తయారుచేయించుకుని తీసుకువెళ్లారు. ఒక పెన్నును ఆయన గాంధీజీకి బహూకరించారు. పెన్నును వాడి చూసిన గాంధీ మెచ్చుకుని స్వదస్తూరితో అభినందనల లేఖ రాసి 1935 జూలై 16న రత్నంకు పంపించారు. ‘‘ప్రియమైన రత్నం.. కుమారప్ప ద్వారా ఫౌంటెన్ పెన్ను పంపినందుకు మీకు కృతజ్ఞతలు తెలపాలి. బజారులో దొరికే విదేశీ కలాలకు ఇది మంచి ప్రత్యామ్నాయం’’.. అంటూ అభినందిస్తూ వార్ధా నుంచి రత్నంకు లేఖ పంపించారు. అంతేకాదు.. ప్రముఖులు బాబూ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి, జవహర్లాల్ నెహ్రు, లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ.. సినీ నటులు ఎన్టీరామారావు నుంచి చిరంజీవి వరకు రత్నం పెన్ను వినియోగించి ఆయన్ను అభినందించిన వారే. విదేశాల నుంచి యంత్రాల దిగుమతి 1930లో ఇంగ్లాండ్ నుంచి రత్నం దిగుమతి చేసుకున్న లెగ్ ఆపరేటర్ మెషిన్, జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న మైఫోర్డ్ మెషీన్లనే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. అలాగే, పెన్నుల తయారీకి రబ్బర్ చెట్టు పాలు నుంచి తయారుచేసే మెటీరియల్ గుజరాత్ నుంచి, ఇరిడియమ్ను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మార్పులకు అనుగుణంగా పెన్నుల తయారీలోను మార్పులు తీసుకురావాలని డిమాండ్ వచ్చిందని రత్నం మనుమడు గోపీ చెప్పారు. కానీ, నాడు తాత జాతీయభావంతో ఏర్పాటుచేసిన ఈ పెన్నులో ఎటువంటి మార్పులు చేయకూడదనే ఉద్దేశంతో అదే ఒరవడిని కొనసాగిస్తున్నామన్నారు. వ్యాపారాత్మక ధోరణితో కాకుండా పెట్టుబడి, రెక్కల కష్టం చేతికొస్తే చాలని సరిపెట్టుకుంటున్నామని ఆయన వివరించారు. కాగా, ఈ పెన్నుల కోసం ఇప్పటికీ దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. 1948లో తొలిసారి యునైటెడ్ కింగ్డమ్ హై కమిషనర్ సర్ ఆల్డ్బాల్క్ పెన్నుకు ఆర్డర్ రావడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల ప్రధాని కార్యాలయం నుంచి 10 పెన్నుల ఆర్డర్ రాగా వాటిని పంపించారు. అందులో ఒక పెన్ను జర్మనీ చాన్సలర్కు ప్రధాని అందజేశారు. ప్రపంచంలోనే తొలి సూక్ష్మ పెన్నుకూ శ్రీకారం 3.5సెం.మీ.ల పొడవు, 1.7 గ్రాముల బరువుతో రత్నం సన్స్ తయారుచేసిన పెన్ను ప్రపంచంలో అతిచిన్న పెన్నుగా 2012 అక్టోబర్లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. ఈ పెన్నులో 2.22 క్యారెట్ల బంగారం పాళీ వాడారు. 5 గ్రాముల బంగారుతో తయారుచేసిన పెన్నుపై భరతమాత, జాతీయ జెండా, జాతిపిత గాంధీ చిత్రాలను చెక్కి భారతీయతను ప్రతిబింబింపజేశారు. రత్నం సన్స్లో అంగుళం మొదలు 36 అంగుళాల సైజు వరకూ రత్నం పెన్నులు తయారుచేస్తున్నారు. విభజనకు ముందున్న కోస్తా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల సంస్కృతిని అద్దంపట్టేలా గోదావరి వంతెన, తిరుపతి గోపురం, కాకతీయుల శిలాతోరణంతో ఒక కలాన్ని తయారుచేశారు. రూ.300లు నుంచి రూ.35వేల వరకూ.. స్టీల్ పాళీతో తయారుచేసిన రత్నం పెన్ను తొలినాళ్లలో రూ.2.25లు ఉండేది. ప్రస్తుతం రూ.300 నుంచి రూ.3,500 వరకూ లభిస్తోంది. బంగారం పాళీలతో తయారుచేసిన పెన్ను రూ.3,000 నుంచి రూ.35వేలు వరకూ లభిస్తున్నాయి. కాగా, మార్కెట్లో తక్కువ ధరలకు లభించే బాల్ పెన్నుల పోటీని తట్టుకుని ఇప్పటికీ రత్నం పెన్ను నిలుస్తోంది. జర్మనీ చాన్సలర్కు మోదీ కానుక ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన జర్మనీ చాన్సలర్ యాంజిలా మార్కల్కు ప్రధాని మోదీ.. రత్నం సన్స్ తయారుచేసిన సిరా పెన్నును ఢిల్లీలో బహూకరించారు. స్వాతంత్య్రానికి పూర్వం స్వదేశీ వస్తువులను మాత్రమే వినియోగించాలనే తలంపుతో నాడు గాంధీజీ కూడా రత్నం తయారుచేసిన స్వదేశీ పెన్నును ఉపయోగించారని ప్రధాని ఆమెకు వివరించడం విశేషం. పెన్నుల తయారీలో మూడోతరం గోపి, చంద్రశేఖర్ ప్రోత్సాహం కావాలి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన రత్నం పెన్నుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కాస్త గుర్తింపు, ప్రోత్సాహం కావాలి. ఇప్పటివరకూ ఎవరిపై ఆధారపడకుండా సొంతంగానే దీనిని నిర్వహించుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఇప్పుడు ప్రోత్సహించి విద్యుత్, పన్ను మినహాయింపుల్లో రాయితీలు ఇస్తే బాగుంటుంది. అలాగే, మేం ఎలాంటి మార్కెటింగ్ పద్ధతులను అవలంబించం. కావల్సిన వారు నేరుగా వచ్చి పట్టుకెళ్తారు. విదేశాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి. మాకు ఎలాంటి వెబ్సైటూ లేదు. కొనుగోలుదారుల మౌఖిక ప్రచారమే మాకు వెబ్సైటు. – వెంకటరమణమూర్తి, రత్నం కుమారుడు -
ఆ ‘ పిచ్చితల్లి’ శిశువును సాకేదెట్టా..
రాజమహేంద్రవరం: మతిస్థిమితం లేని మహిళ.. ఒక చంటిపాపకు జన్మనిచ్చింది. ఆ శిశువును సాకలేని మహిళ.. ఎవరైనా తీసుకునే ప్రయత్నం చేస్తే వారిని తోసేస్తుంది. ఆ పిచ్చితల్లి చేతిలో చంటిపాప భవిష్యత్తు ఏమిటోనని స్వధార్ నిర్వహకులు భయాందోళన చెందుతున్నారు. వివరాలు.. ఈనెల 18వ తేదీన ప్రత్తిపాడు రూరల్ మండలం ధర్మవరం జాతీయ రహదారిపై మతిస్థిమితంలేని మహిళ ప్రసవవేదనతో బాధపడుతుంటే ట్రాఫిక్ నియంత్రణ బోర్డు వద్ద స్థానిక మహిళలు పురుడుపోశారు. తల్లి బిడ్డలను వారు ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కాకినాడ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘సఖి వన్స్టాప్సెంటర్’ నిర్వహకుల ద్వారా ఈనెల 24న బొమ్మూరులోని మహిళాప్రాంగణం ఆవరణలో ఉన్న స్వధార్ హోమ్కు తరలించారు. అక్కడి నుంచి వారిని చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం వారిని తిరిగి స్వధార్హోమ్కు తీసుకువచ్చారు. ఆ శిశువుపై కాళ్లు వేసి పడుకోవడం, తలుపులపై శిశువు చేతిని గట్టిగా కొట్టడం చూస్తుంటే.. హోమ్లోని సిబ్బంది కంగారు పడిపోతున్నారు. శిశువును పక్కకు తీసేందుకు ప్రయత్నిస్తే ఆ పిచ్చితల్లి అడ్డుకుంటోంది. ఈ పరిస్థితిని శనివారం స్వధార్హోమ్ సందర్శనకు వచ్చిన రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమశాఖామంత్రి తానేటి వనిత దృష్టికి నిర్వాహకులు తీసుకువెళ్లారు. ఆ తల్లిని అలాగే వదిలేస్తే.. శిశువు ప్రాణాలకు ముప్పు ఉంటుందని మంత్రికి వారు వివరించారు. ఈ తల్లిబిడ్డలను సురక్షితమైన ప్రాంతానికి తరలిస్తే బాగుంటుందని ఐసీడీఎస్ సీడీపీఓలను మంత్రి వనిత ఆదేశించారు. -
పందెం కోళ్లు, నగదు ఓ పోలీస్ స్వాహా.. అరెస్టు
సాక్షి, రాజమహేంద్రవరం: తనకు సంబంధంలేని పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న కోడిపందేలపై దాడి చేసి, అక్కడ కోళ్లను, నగదును స్వాహా చేయడానికి ప్రయత్నించాడు ఓ కానిస్టేబుల్. వివరాల్లోకి వెళితే.. బొమ్మూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రమణ గురువారం త్రీటౌన్ పరిధి లోని లూథరన్ గిరి వెనుక వైపు జరుగుతున్న కోడిపందేలపై దాడి చేశాడు. అతడిని చూసి పందెగాళ్లు పారిపోయారు. అక్కడే ఉన్న కోళ్లు, నగదును కానిస్టేబుల్ రమణ స్వాహా చేసేందుకు ప్రయత్నించాడు. ఇది తెలుసుకున్న త్రీటౌన్ కానిస్టేబుళ్లు అతడిని పట్టుకొని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతడిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై త్రీటౌన్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబును వివరణ కోరగా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కానిస్టేబుల్ రమణపై అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. చదవండి : ఏటీఎం కార్డులు మార్చడంలో ఘనుడు -
టీడీపీ నాయకుల తీరు దారుణం
-
టీడీపీ నాయకుల కుట్రలను తిప్పికొడతాం
సాక్షి, రాజమహేంద్రవరం సిటీ : తనను భూకబ్జాదారుడిగా చిత్రీకరించి బురదజల్లే ప్రయత్నం చేస్తున్న టీడీపీ నాయకుల కుట్రలను తిప్పికొడతామని కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో తన తాతయ్య, జడ్జి కొమ్మాల చక్రపాణి తనకున్న ఆస్తిలోని ఎకరా 70 సెంట్ల భూమిని 80–15ఏ సర్వే నంబర్ ద్వారా తన తల్లి జక్కంపూడి విజయలక్ష్మి పసుపు కుంకుమ మాన్యంగా వచ్చిందన్నారు. దాన్ని 1994లో చెల్లుబోయిన వీరరాఘవులు, బాబూరావు అనే ఇద్దరు అన్నదమ్ములకు అమ్మి వేశామన్నారు. తాతయ్యకు చెందిన మిగిలిన భూమి అమ్మివేయగా ప్రస్తుతం 1.23 ఎకరాలు 80–15బి, 80–20ఏ, 80–20బి సర్వే నెంబర్లలో ఉందన్నారు. తమ భూమిని కోనుగోలు చేసిన వ్యక్తులు అదే సర్వే నెంబర్లలో ఇప్పటికి వ్యవసాయం ఫలాలు పొందుతున్నారు. అయితే టీడీపీ మాత్రం వైఎస్సార్ సీపీపైనా, తన పైనా బురదజల్లే ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టిందన్నారు. తన తల్లి జక్కంపూడి విజయలక్ష్మి 25 ఏళ్ల క్రితం అమ్మిన భూమి సర్వే నెంబర్లు వేరని, తన అమ్మమ్మ పేరున ఉన్న సర్వే నెంబర్లు వేరని ఆయన రికార్డులను విలేకరులకు ప్రదర్శించారు. కానీ అమ్మ అమ్మిన భూమి.. అమ్మమ్మ వద్ద ఉన్న భూమి సర్వే నెంబర్లలో ఉందని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఈ విషయంపై తహసీల్దార్ సర్వే జరిపి ఎవరి భూమి ఎక్కడ ఉందో స్పష్టం చేశారు. టీడీపీ నాయకుల తీరు దారుణం టీడీపీ నాయకులు వ్యక్తిగత సమస్యను వైఎస్సార్ సీపీకి, తనకు అంటగట్టే ప్రయత్నం చేస్తూ కోనసీమలో ఫ్లెక్సీలు కట్టారని జక్కంపూడి రాజా అన్నారు. శెట్టిబలిజలకు అన్యాయం చేస్తున్నారని టీడీపీ ప్రచారం చేస్తోందన్నారు. ఈ విధానం సరికాదని హెచ్చరించారు. తన తండ్రి బీసీలకు పెద్దపీట వేశారన్నారు. చెల్లుబోయిన వేణుకు ఉన్నతస్థానం కల్పించింది తన తండ్రి రామ్మోహనరావు అని గుర్తు చేశారు. ఇదే భూమిపై గతంలో తన మామయ్య ఫిర్యాదులపై మూడు కేసులు నమోదు అయ్యాయని, అప్పటి ప్రభుత్వం ఏమాత్రం చర్యలు చేపట్టలేదన్నారు. ఇటీవల 20 రోజుల క్రితం తన మావయ్యపై దాడి చేసి అక్కడ షెడ్ను తగులబెట్టారని దీనిపై కేసు నమోదైందన్నారు. ఇదే విషయంపై గత నెల 23న కాకినాడలో శెట్టి బలిజ పెద్దగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోష్ వద్ద సంప్రదింపులకు ఏర్పాటు చేశామని, కానీ ఆ వర్గం నుంచి ఎవ్వరూ హాజరు కాలేదన్నారు. తనపై కుట్రలు ఆపకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని జక్కంపూడి రాజా హెచ్చరించారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై ప్రకాశ్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలి పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు లంక సత్యనారాయణ, మాసా రామజోగ్, మాజీ కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, పిల్లి నిర్మల, ఈతకోట బాపన సుధారాణి, న్యాయవాది ధర్మ పాల్గొన్నారు. -
కీచక ప్రిన్సిపాల్: రెండున్నరేళ్లుగా వేధింపులు
ప్రిన్సిపాల్... కళాశాలలో విద్యార్థుల నుంచి అధ్యాపకులకు, సిబ్బందికి దిశా,నిర్దేశం చేస్తూ క్రమశిక్షణతో, ఏకతాటిపై ముందుకు తీసుకువెళ్లాల్సిన వ్యక్తి. ఇందులో ఏ ఒక్కరు తప్పు చేసినా మందలించి, అవసరమైతే చర్యలు తీసుకొని కళాశాలను అభివృద్ధి పథంలో నడిపించాలి. మంచి ఉత్తీర్ణతా ఫలితాలతో వందలాది మంది విద్యార్థులను తన కళాశాల వైపు అడుగులు వేయించి ఇతర కళాశాలలకు ఆదర్శంగా నిలపాలి. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన ఆయన ‘పచ్చ’ రంగు పులుముకొని...ఆ అండతో మహిళలపై వేధింపులకు దిగితే...అదే రాజమహేంద్రవంలోని ఓ ప్రభుత్వ కళాశాలలో జరిగింది ... సాక్షి, తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్కు సమీపాన ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాలే కీచకుడుగా మారి మహిళా అధ్యాపకులపై గత రెండున్నరేళ్లుగా వేధింపులకు దిగుతున్న ఘటన ఇది. వందల మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఈ కళాశాలలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది 60 మంది పని చేస్తున్నారు. రెండువేల మంది పైచిలుకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇలాంటి పవిత్రమైన విద్యాలయంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రిన్సిపాల్ నీచ చర్యలకు దిగడమేమిటని మహిళా సంఘాల ప్రతినిధులు విద్యావేత్తలు మండిపడుతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందనేందుకు ఇదో ఉదాహరణ. ఎదురైన అవమానాలపై మహిళా అధ్యాపకులు రెండున్నరేళ్లుగా పోరాడినా న్యాయం దక్కకపోగా అప్పటి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అండదండలు ప్రిన్సిపాల్కు తోడవడంతో ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరించారు. మొదట రాజమహేంద్రవరం పోలీసులకు, రెండోసారి ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు..ఇలా ఫిర్యాదులపై ఫిర్యాదులు చేసినా న్యాయం దక్కకపోగా తిరిగి రివర్స్లో ఫిర్యాదు చేసిన 17 మందిపై వేధింపులు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం కుప్పకూలి వైఎస్సార్సీపీ సర్కారు రావడంతో బాధితుల్లో ఆత్మస్థైర్యం పెరిగి నేరుగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత, విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్లకు బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బహిర్గతమైంది. వివరాలు ఇలా ఉన్నాయి...రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజు. 14 ఏళ్లుగా ఇక్కడ అధ్యాపకునిగా పనిచేస్తున్న ఈయన మధ్యలో రెండేళ్లు కొత్తపేట జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా వెళ్లారు. ఆ తరువాత తిరిగి 2016లో ఇక్కడికే ప్రిన్సిపాల్గా వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ టీడీపీకి వీరాభిమానిగా సహాయ, సహకారాలు అందిస్తూ వచ్చాడు. దీంతో ఇంటర్మీడియట్ బోర్డులో కూడా ఇతని హవానే కొనసాగింది. తన కార్యకలాపాలకు అడ్డుపడే మహిళా అధ్యాపకులను తన ఆఫీసు రూమ్కి పిలిపించి ఏకవచనంతో, వెకిలి చేష్టలతో అవమానించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తరగతి గదిలో, విద్యార్థుల ఎదుటే ఏకవచనంతో అవమానిస్తుండడంతో గత ఫిబ్రవరిలో జనరల్ ఫౌండేషన్ కోర్సుకు కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేసే ఉదయశాంతి రాజమహేంద్రవరం టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాలేజీలో పనిచేస్తున్న వారిలో సుమారు 40 మంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఆమెకు అండగా నిలిచారు. అధికార పార్టీ అండదండలు, ఎమ్మెల్యేకు సానుభూతిపరుడిగా ఉండటంతో పోలీసులు ఆ కేసును నీరుగార్చేశారు. ఆ తరువాత గత మార్చి 3న అమరావతి వెళ్లి ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయినా ప్రిన్సిపాల్పై చర్యలు లేకపోగా, తిరిగి కాలేజీకి వచ్చాక ప్రిన్సిపాల్ వేధింపులు మరింత ఎక్కువయ్యాయని మహిళా అధ్యాపకులు కన్నీరుపెట్టుకున్నారు. ఇలాంటి వ్యక్తిపై చర్యలు లేకపోగా ఇంటర్బోర్డుకు పిలిపించి ప్రిన్సిపాల్కు జోన్–3, జోన్–4లకు ఇన్చార్జి హోదా ఇవ్వడం విశేషం. ఈ పరిణామంతో ఈ ప్రభుత్వంలో తమకు న్యాయం జరగదనే అభిప్రాయానికి వచ్చిన మహిళా అధ్యాపకులు మరోసారి ఫిర్యాదు చేయడానికి ధైర్యం కూడా చేయలేకపోయారు. కనీసం ఇంటర్బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మి మహిళ అయి ఉండి కూడా సహచర మహిళా అధ్యాపకులకు భరోసా నివ్వకపోవడమేమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కళాశాలలో కొరవడిన ప్రశాంతత.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది మధ్య తరుచూ కీచులాట, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు, కమిషనర్కు ఫిర్యాదులతో కళాశాలలో ప్రశాంత వాతావరణం కొరవడిందనే చెప్పవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ వీర్రాజును ‘సాక్షి’ వివరణ కోరగా కాలేజీలో అటువంటి వాతావరణం ఏమీ లేదన్నారు. సక్రమంగా పనిచేయమన్నందుకే పనిగట్టుకుని కొందరు కేసులు పెడుతున్నారని చెప్పారు. -
జాతీయ ‘రక్త’దారి..
సాక్షి, తూర్పుగోదావిరి : జాతీయ రహదారులు రోడ్డు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. జిల్లాలో గోపాలపురం నుంచి తుని వద్ద గల పాయకరావు పేట వరకు 140 కిలో మీటర్లు ఉన్న జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవే అథారిటీ అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. జాతీయ రహదారి గోతులమయం కావడం, రహదారుల వెంబడి మద్యం షాపుల ఏర్పాటు, ప్రమాదకర మలుపులు, గ్రామాలను కలుపుతూ వెళ్లిన జంక్షన్ల వద్ద సరైన రక్షణ ఏర్పాటు చేయకపోవడం, మద్యం మత్తులో, నిద్ర మత్తులో, లైసెన్స్ లేని డ్రైవర్లు సైతం జాతీయ రహదారులపై హేవే వాహనాలు డ్రైవింగ్ చేయడం వంటి కారణాల వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేయాలనే నిబంధనలున్నా గత టీడీపీ ప్రభుత్వం మద్యం వ్యాపారమే ప్రధాన ఆదాయంగా నిబంధనలు తుంగలో తొక్కి లైసెన్స్లు ఇచ్చేసింది. దీంతో మద్యం సేవించి లారీ డ్రైవర్లు, హే టెక్ బస్సు డ్రైవర్లు, ఇతర వానం డ్రైవర్లు వాహనాలు నడుపుతున్నారు. హైవేలపై పర్యవేక్షణ చేయాల్సిన రోడ్డు ట్రాన్స్పోర్టు అధికారులు మాముళ్ల మత్తులో వాహనాలు తనిఖీలు నిర్వహించకుండానే వదిలి వేయడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చే సమయంలో ఆర్టీఏ అధికారులు నిబంధనలు పాటించకుండా జారీ చేయడంతో రోడ్డు ప్రమాదాలకు అవి కూడా కారణమవుతున్నాయి. గత మూడేళ్లలో 1,490 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 419 మంది మృతి చెందారు. 1,653 మందికి గాయాలయ్యాయి. ఏటా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని వందలాది మంది ప్రజాలు ప్రాణాలు కోల్పోతున్నా హైవే అథారిటీ అధికారులు కళ్లు తెరవడం లేదు. గోతులను తప్పించే క్రమంలో రోడ్డు ప్రమాదాలు జాతీయ రహదారిలో గోతులు పడడంతో వేగంగా వెళ్లే వాహనాలు వాటిని తప్పించుకునే క్రమంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముందు వాహనం గోతుల నుంచి తప్పించేందుకు కొంత పక్కకు తిప్పడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనం ఢీ కొని రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈనెల ఐదో తేదీ సోమవారం దివాన్చెరువు ఆటోనగర్ వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కొత్త వెలుగు బంద గ్రామానికి చెందిన మరుకుర్తి శ్రీనివాస్, లక్ష్మి దంపతులు ప్రాణాలు కోల్పోయారు. గోతులను తప్పించే క్రమంలో వెనుక వైపు నుంచి లారీ వచ్చి వారిని ఢీ కొని ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వారి పిల్లలు అనాథలయ్యారు. తాజాగా ఆదివారం జరిగిన రాజానగరం శివారు శ్రీరామనగర్ వద్ద హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాజానగరం మండలం తోకాడకు చెందిన భార్యాభర్తలు రాయుడు నరసింహ మూర్తి, అతడి భార్య సత్యవతి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. తమ కుమారుడు గోవింద్తో కలిసి బైక్పై శ్రీరామ్నగర్లోని బంధువుల ఇంట జరిగే ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా.. వీరిని జగ్గంపేట వైపు నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న గోవిందుతో పాటు వెనుక కూర్చున భార్యాభర్తలు ఎగిరి కిందపడడంతో వారి తలలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఇటువంటి ప్రమాదాలు నిత్యం హైవేలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. డేంజర్ జంక్షన్లు జిల్లాలో జాతీయ రహదారి 140 కిలో మీటర్లు ఉండగా జాతీయ రహదారిపై నుంచి పట్టణాలు, నగరాలకు వేళ్లే మార్గాలు, అప్రోచ్ రోడ్లు, ఇతర జంక్షన్లలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తుని పరిధిలో జగన్నాథగిరి, గవరయ్య కోనేరు సెంటర్, తేటగుంట సెంటర్, సి.ఇ చిన్నాయ పాలెం, బెండపూడి, కత్తిపూడి, రామవరం, గండేపల్లి, మల్లేపల్లి, రాజానగరం, రాజమహేంద్రవరం లాలా చెరువు, మోరంపూడి సెంటర్, బొమ్మూరు జంక్షన్, కడియం, రావుల పాలెం తదితర ప్రాంతాల్లో డేంజర్ జంక్షన్లు ఉన్నాయి. హైవేకు అప్రోచ్ రోడ్లు ఉండడం వలన నగరాల నుంచి హైవేకు వెళ్లే మార్గాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సెంటర్లలో సరైన రక్షణ చర్యలు చేపకట్టకపోవడం, జాతీయ రహదారికి సంబంధం లేకుండా బ్రిడ్జిలు నిర్మించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. గోతులు పూడుస్తున్నాం జాతీయ రహదారిలో ప్రతిరోజూ రోడ్ల మరమ్మతులు చేస్తున్నాం. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో నీటిపారుదల శాఖ వారు బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్లు అప్రోచ్ డైవర్షన్లు లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కడియపు లంక నుంచి దివాన్ చెరువు వరకూ ఐదు టీమ్లు ఏర్పాటు చేసి వర్షానికి ఏర్పడిన గోతులు యుద్ధప్రాతిపదికన పూడుస్తున్నాం. – శ్రీనివాసరావు, జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ గోతులతో రోడ్డు ప్రమాదాలు జాతీయ రహాదారి పై ఏర్పాడిన గోతుల వలన రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటితో పోటు అప్రోచ్ రోడ్లు, జంక్షన్లు వద్ద ఒక్క సారిగా రోడ్డు పైకి వాహనాలు వేగంగా వచ్చేయడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జంక్షన్లలో ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నాము. డ్రంకన్ డ్రైÐŒ , వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నాము. – ఎస్. వెంకట్రావు, ట్రాఫిక్ డీఎస్పీ,రాజమహేంద్రవరం అర్బన్ -
దారుణం: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి
సాక్షి, తూర్పుగోదావరి(రాజమహేంద్రవరం) : జాతీయరహదారిపై అడుగడుగునా ఉన్న గోతులు భార్యభర్తల ప్రాణాలను హరించాయి. త్రుటిలో మరొకరు ఈ ప్రమాదం నుంచి గట్టెక్కారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో రాజానగరం మండలం దివాన్చెరువు ఆటోనగర్ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాజానగరం మండలం కొత్త వెలుగుబంద గ్రామానికి చెందిన మరికుర్తి శ్రీను(32), మరికుర్తి లక్ష్మి(28)లు భార్యాభర్తలు. రాజమహేంద్రవరంలో మరికుర్తి లక్ష్మికి దంతాన్ని తీయించేందుకు వీరిద్దరూ సోమవారం ఉదయం ఇంటి నుంచి మోటర్ బైక్పై వచ్చారు. దంతాన్ని తీయించిన అనంతరం కొత్త వెలుగుబంద గ్రామానికి బయలుదేరారు. ఆటోనగర్ సమీపానికి వచ్చేసరికి లాలాచెరువు నుంచి రాజానగరం వైపు యాసిడ్లోడుతో వెళుతున్న ట్యాంకర్ జాతీయరహదారి గోతిలో పడి స్పీడుగా లాగేందుకు ప్రయత్నించి బైక్ను ఢీకొట్టింది. దీంతో ఆ బైక్ జాతీయరహదారిపై ఉన్న మరో గోతిలో పడడంతో శ్రీను, లక్ష్మిలు బైక్తో సహా కిందపడి ట్యాంకర్ మధ్య చక్రాల కింద నలిగిపోయారు. లారీ వారిని, బైక్ను ఈడ్చుకుంటూ ముందు మరో స్కూటర్పై వెళుతున్న దివాన్చెరువు గ్రామానికి చెందిన బొంగా స్టాన్లీపాల్ను ఢీకొట్టింది. అతడు డివైడర్పైన ఉన్న గడ్డిలో పడిపోయాడు. త్రుటిలో పెనుప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ట్యాంకర్ చక్రాల కింద పడిన మరుకుర్తి శ్రీను, మరుకుర్తి లక్ష్మి అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. ఈ ప్రమాదంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. సంఘటన స్థలానికి బొమ్మూరు పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.లక్ష్మణరెడ్డి చేరుకుని పరిశీలించగా, ఈ లోపు అర్బన్ జిల్లా తూర్పు మండల డీఎస్పీ ఏటీవీ రవికుమార్, ట్రాఫిక్ డీఎస్పీ ఎస్.వెంకట్రావు చేరుకుని సిబ్బందితో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలు ట్యాంకర్ చక్రాల కింద ఇరుక్కుపోవడంతో లక్ష్మి మృతదేహం బయటకు రాగా, శ్రీను మృతదేహాన్ని రెండు క్రేన్ల సహాయంతో ట్యాంకర్ను జరిపి బయటకు తీశారు. భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బొమ్మూరు ఇన్స్పెక్టర్ కె.లక్ష్మణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైవేపై ఉన్న గోతులతోనే ప్రమాదాలు జాతీయరహదారిపై ఉన్న గోతులతోనే తరచూ ప్రమాదాలు జరిగి వాహనచోదకులు మృత్యువాత పడుతున్నారని ట్రాఫిక్ డీఎస్పీ ఎస్.వెంకట్రావు పేర్కొన్నారు. సోమవారం ఆటోనగర్ ప్రమాద సంఘటన స్థలం వద్ద విలేకరులతో మాట్లాడుతూ భార్యభర్తలు మృత్యువాత కూడా జాతీయరహదారిపై ఉన్న గోతుల వలనే జరిగిందన్నారు. గతంలో జరిగిన రోడ్డుప్రమాదాలకు ఇవే కారణమని తెలిపారు. తూర్పు మండల డీఎస్పీ ఏటీవీ రవికుమార్ మాట్లాడుతూ జాతీయరహదారిపై గోతులను పూడ్చితే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. సంబంధిత అధికారులకు, జాతీయరహదారి అధికారులకు గోతులను పూడ్పించాలని లిఖితపూర్వకంగా ఇస్తామన్నారు. స్వగ్రామాల్లో విషాద వాతావరణం రాజానగరం: పంటి సమస్యతో బాధపడుతున్న భార్యకు వైద్యం చేయించేందుకని వెళ్లిన తన కొడుకు భార్యతో సహా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడంటూ దివాన్చెరువు సమీపంలోని ఆటోనగర్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందిన మరుకుర్తి శ్రీనివాస్ తల్లిదండ్రులు మరుకుర్తి వీర్రాజు, లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్యకు పంటి వైద్యం చేయించి, బైకుపై తిరిగి ఇంటి వస్తున్న వారిద్దరినీ మృతువు లారీ రూపంలో కబలించిన విషయం తెలియడంతో శ్రీనివాస్ స్వగ్రామమైన కొత్తవెలుగబంద, లక్ష్మి స్వగ్రామమైన దివాన్చెరువులో విషాదవాతావరణం నెలకొంది. శ్రీనివాస్, లక్ష్మిలను పోగొట్టుకుని దుఃఖసాగరంలో కుమిలిపోతున్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. పాడి గేదెలను మేపుకొంటూ తీరిక సమయాల్లో వ్యవసాయ పనులకు కూడా వెళుతూ కుటుంబాన్ని పోషించుకు రావడంతో చేదోడుగా ఉన్న తన తమ్ముడు, మరదలు ఇక లేరనే విషయాన్ని శ్రీనివాస్ హారిబాబు, వదిన నూకరత్నం తట్టుకోలేక పడిపడి విలపిస్తున్నారు. మమ్మీ, డాడీ ఎక్కడ? శ్రీనివాస్, లక్ష్మిల అకాల మరణంతో వారి ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథలయ్యారు. అబ్బాయి రామశ్రీదుర్గాగణేష్, అమ్మాయి దుర్గాభవానీలిద్దరూ దివాన్చెరువులోని ఒక ప్రైవేట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్, నర్సరీ చదువుతున్నారు. స్కూల్ అయ్యాక సాయంత్రం ఆ చిన్నారులు స్కూల్ బస్సులో కొత్తవెలుగుబందలోని తమ ఇంటికి చేరుకున్నారు. అయితే అక్కడ జనమంతా గుమిగూడి ఉండడంతో ఏమి జరిగిందో తెలియని అయోమయంలో అందరినీ చూస్తూ.. మమ్మీ, డాడీ ఏరీ.. అంటూ అమాయకంగా వేసిన ప్రశ్న అక్కడ ఉన్న వారి హృదయాలను కలచివేసింది. అక్కడనే రోదిస్తూ ఉన్న పెదనాన్న, పెదమ్మలు ఆ చిన్నారులను అక్కున చేర్చుకుంటుంటే అందరి కళ్లు చెమర్చాయి. దీంతో అక్కడ ఉంటే ఆ చిన్నారులకు విషయం అర్థమై బెంగపెట్టుకుంటారనే భావంతో దివాన్చెరువులో ఉంటున్న అమ్మమ్మ వాళ్లింటికి తీసుకువెళ్లారు. -
చోరి చేశాడనే అనుమానంతో బాలుడిపై...
సాక్షి, తూర్పుగోదావరి(రాజమహేంద్రవరం) : పాచి పని చేసుకొని జీవించే తల్లి వెంట వెళ్లడమే ఆ బాలుడి చేసిన నేరమైంది. ఇంట్లో నగదు, సెల్ఫోన్ చోరీ చేశావంటూ పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే తెల్లవారు జామున ఇంటికి వచ్చి తీసుకువెళ్లి ఊచ కాల్చి వాతలు పెట్టిన అమానుష సంఘటన రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం, లక్ష్మి వారపు పేటకు చెందిన మేడబోయిన సీత, అదే ప్రాంతానికి చెందిన రాణి అనే మహిళ ఇంట్లో పాచిపని చేసుకుని జీవిస్తోంది. సీత కుమారుడైన బాలుడు అప్పుడప్పుడూ తల్లితో కూడా రాణి ఇంటికి వెళ్తుంటాడు. ఈ నేపథ్యంలో గురువారం రాణి ఇంట్లో రూ.ఐదు వేల నగదు, ఒక సెల్ ఫోన్ పోవడంతో సీత కుమారుడే తీశాడనే అనుమానంతో శుక్రవారం తెల్లవారు జామున సీత ఇంటికి వచ్చి ఆమె కుమారుడిని తీసుకువెళ్లి నగదు, సెల్ ఫోన్ ఏం చేశావంటూ రాణి, ఆమె అన్నయ్య, తల్లి, పక్కన ఉండే మరో వ్యక్తి కర్రలతో కొట్టారు. అంతటితో ఆగకుండా ఊచ కాల్చి వాతలు పెట్టారు. తనకు ఏమీ తెలియదని చెప్పినా ఆ బాలుడుని విడిచిపెట్టకుండా అమానుషంగా ప్రవర్తించారని అతడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్లైన్ జిల్లా కో ఆర్డినేటర్ బి.శ్రీనివాసరావు త్రీటౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకొని జువైనల్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ చోరీ జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అలా కాకుండా చట్టాన్ని చేతులోకి తీసుకుని బాలుడిని హింసించడం తగదని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాత పెట్టినా.. పాత బుద్ధే..
‘వాత పెట్టినా పాత బుద్ధి మారని చందం’గా టీడీపీ నేతల దందా కొనసాగుతోంది. టీడీపీ సర్కారు హయాంలో జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగిపోయి.. కోట్ల రూపాయలు కొల్లగొట్టిన తీరును గమనించిన ప్రజలు.. సార్వత్రిక ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పారు. అయినప్పటికీ అవకాశం దొరికితే అదే పంథాను అవలంబిస్తామంటున్నారు ‘పచ్చ’నేతలు. ఇందుకు తాజాగా సాగిస్తున్న ఇసుక అక్రమ రవాణాయే ఉదాహరణగా నిలుస్తోంది. సాక్షి, రాజమహేంద్రవరం : ఇసుక దోపిడీని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. దీనిపై త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఈలోగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు నిర్మించుకునే ఇళ్లకు, ప్రభుత్వ పరంగా సాగే నిర్మాణాలకు ఇసుక కొరత రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ పరిమిత సంఖ్యలో ర్యాంపులకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా మన జిల్లాలోని రాజమహేంద్రవరంలో 2, తాళ్లరేవు మండలం పిల్లంకలో 1 చొప్పున ఇసుక ర్యాంపులకు అనుమతి ఇచ్చా రు. పిల్లంక ఇసుక ర్యాంపును తన గుప్పెట్లో పెట్టుకున్న ఓ బడా కాంట్రాక్టర్.. ఇదే అదునుగా టన్నుల కొద్దీ ఇసుకను అడ్డగోలుగా దోచుకుపోతున్నాడు. టీడీపీ ప్రభుత్వంలో హోం మంత్రిగా పని చేసిన నిమ్మకాయల చినరాజప్పకు బినామీగా వ్యవహరించిన సదరు కాంట్రాక్టర్ గుత్తాధిపత్యమే పిల్లంక రేవులో ఇంకా నడుస్తోంది. వాస్తవానికి పిల్లంక ర్యాంపును గోవలంక బోట్స్మెన్ సొసైటీ మత్స్యకారులకు అప్పగించారు. గోదావరిలో ఇసుక తీసేందుకు, లారీల్లో ఎగుమతికి అయ్యే ఖర్చుల వరకూ తీసుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ మాజీ మంత్రి బినామీ ఈ ర్యాంపు నుంచి నిత్యం 25 పడవల ద్వారా ఇసుకను తరలిస్తూ దోపిడీకి పాల్పడుతున్నాడు. పర్మిట్ ఒకచోటకు.. తరలింపు మరోచోటకు.. కాకినాడ పోర్టు సమీపాన దేవీ ఇంజినీరింగ్ వర్క్స్ అవసరాల కోసమంటూ 5 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకకు ఈ నెల 17న కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారులు పర్మిట్ ఇచ్చారు. దీనిని అవకాశంగా తీసుకున్న సదరు బినామీ.. నిర్దేశించిన ప్రాంతానికి మొక్కుబడిగా ఇసుక తరలించి, మూడు వంతులు పైగా ఇసుకను బయటి మార్కెట్లో అమ్మేస్తున్నాడు. ఇలా నిత్యం రూ.లక్షల విలువైన ఇసుకను అక్రమంగా కొల్లగొడుతున్నారు. ఈవిధంగా గడచిన ఆరేడు రోజులుగా రూ.అర కోటి విలువైన ఇసుక దోపిడీ జరిగినట్టు తెలుస్తోంది. మరోపక్క తాము పర్మిట్ తెచ్చుకున్నా ఇసుక దొరకడం లేదని ప్రభుత్వ కాంట్రాక్టులు చేస్తున్న వారు లబోదిబోమంటున్నారు. ఇసుక కోసం వచ్చి, గంటల తరబడి వేచిచూసి చూసి, ఖాళీ లారీలతో తిరిగి వెళ్లిపోవాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ఇసుక దోపిడీపై పలువురు ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా రాజమహేంద్రవరం రీచ్లలో ఇసుకకు అధికంగా డబ్బులు అడుగుతున్నారని, దీనిపై ప్రజలు గొడవ చేశారు. ఇసుక దోపిడీపై విచారణ జరిపిస్తాం పిల్లంక రీచ్లో ప్రజలకు ఇసుక ఇవ్వడం లేదనే ఫిర్యాదు వచ్చింది. దీనిపై విచారణ జరిపిస్తాం. ఈ రీచ్ను గోవలంక బోట్స్మెన్ సొసైటీ నిర్వహిస్తోంది. సొసైటీ సభ్యులే పడవల్లో ఇసుకను తీసుకొచ్చి అమ్ముకుంటారు. తహసీల్దార్ పర్యవేక్షణలో వీఆర్వోను ఏర్పాటు చేసి ఇసుక ఇస్తున్నాం. – బి.రాజకుమారి, జిల్లా జాయింట్ కలెక్టర్–2 -
ప్రభుత్వాస్పత్రులే అడ్డాగా.. పిల్లల అక్రమ రవాణా!
రాజమహేంద్రవరం క్రైం: తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వాస్పత్రులే అడ్డాగా పిల్లల అక్రమ రవాణా సాగుతోందా అంటే.. జరుగుతున్న పరిణామాలు అవుననేలాగానే ఉన్నాయి. ఓ బాలుడి అదృశ్యం వ్యవహారంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి గుత్తుల వెంకటసుబ్బారావు(సుభాష్)ను హైదరాబాద్ చాంద్రాయణగుట్ట (తెలంగాణ) పోలీసులు అరెస్టు చేశారు. గతంలోనూ కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పసికందు కిడ్నాప్ ఘటన తెలిసిందే. ఆడుకుంటూనే అదృశ్యం చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని ఖుబా కాలనీలో నివసిస్తున్న షేక్ ఫజల్కు ఇద్దరు కుమారులు. రెండున్నరేళ్ల చిన్న కుమారుడు షేక్ సోఫియన్ మార్చి 25న ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. దీనిపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు అదే రోజు కేసు నమోదు చేశారు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితులు తొలుత రాజమహేంద్రవరం, అక్కడి నుంచి విశాఖపట్నం తిరిగి ఏలూరు ప్రాంతాలకు తరలించినట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ సుభాష్ను నిందితుల్లో ఒకడిగా గుర్తించారు. ఈ నెల 17న అతడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం హైదరాబాద్ తరలించారు. బాలుడిని అమలాపురంలో రూ.3 లక్షలకు అమ్మినట్లు తెలిసింది. బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించినట్లు సమాచారం. దీనిపై ఇక్కడి పోలీసులకు ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదు. ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రి అడ్డాగా పిల్లల అక్రమ రవాణా సాగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో సుభాష్కు మరింతమంది ఆస్పత్రి సిబ్బంది సహకరించినట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సుభాష్ పనిచేస్తున్న ల్యాబ్లోని కొంతమందిని కూడా పోలీసులు విచారించారు. మరింతమందిని విచారిస్తే పిల్లల అక్రమ రవాణా ముఠాలో ఎంతమంది ఉన్నారో బయటపడే అవకాశాలున్నాయి. గతంలో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పసికందును కిడ్నాప్ చేసిన ఘటన తర్వాత.. రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి అడ్డాగా పిల్లల అక్రమ రవాణా సాగుతున్నట్లు వెల్లడి కావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానిక వైద్య సిబ్బంది హస్తం ఉండొచ్చు.. పిల్లల అక్రమ రవాణా వెనుక సుభాష్ ఒక్కడే కాకుండా ఇతర వ్యక్తులు కూడా ఉండే అవకాశం ఉంది. మొదటి నుంచీ సుభాష్ వివాదాస్పద వ్యక్తి. ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తూనే గతంలో బయట బ్లడ్ బ్యాంక్ పెట్టి ఇక్కడి రోగులకు రక్త పరీక్షలు బయటే చేసి డబ్బులు తీసుకునేవాడు. దీనిపై ఫిర్యాదు కూడా చేశాం. విచారణ జరిపిన అధికారి అతడికి అనుకూలంగా నివేదిక ఇచ్చారు. దీంతో సుభాష్పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ప్రస్తుత ఘటనపై కూడా విచారణ సాగుతోంది. – డాక్టర్ టి.రమేష్ కిషోర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, తూర్పు గోదావరి జిల్లా -
ఆదర్శంగా తీర్చిదిద్దుతా
సాక్షి, ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): తనను రాజమహేంద్రవరం ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని ‘నవ’ ప్రణాళికలతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని వైఎస్సార్ సీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ హామీ ఇచ్చారు. షెల్టాన్ హోటల్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాలను ప్రకటించిన మాదిరిగా రాజమహేంద్రవరం ఎంపీ నియోజకవర్గ అభివృద్ధికి తాను ‘నవ’ ప్రణాళికలను రూపొందించుకున్నట్టు చెప్పారు. వీటి అమలుకు పార్టీ అధినేత అనుమతి పొందినట్టు చెప్పారు. ఎంపీగా గెలిస్తే వంద రోజుల్లోనే నగరంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులకు శ్రీకారం చుడతానన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇండోర్ స్టేడియం కూడా నిర్మిస్తామని, దాదాపు 10 రకాల క్రీడలకు వీలుగా ఉండే అకాడమీగా తీర్చిదిద్దుతామన్నారు. అన్ని పాఠశాలలను భాగస్వామ్యం చేసి, ఏడో తరగతి నుంచే పిల్లలకు వారికి ఇష్టమైన ఏదో ఒక ఆటలో తర్ఫీదు ఇచ్చే ఏర్పాటు చేస్తానన్నారు. టూరిజమ్ హబ్గా.. గోదావరి పరివాహక ప్రాంతాన్ని టూరిజం హబ్గా రూపుదిద్దే ప్రణాళికను సిద్ధం చేశానని ఆయన తెలిపారు. గోదావరిలోని లంకల ఎత్తు పెంచి ఫైవ్ స్టార్ రిసార్ట్స్ను నిర్మిస్తామని, ఇరిగేషన్ శాఖ అనుమతితో కృత్రిమ సరస్సుగా వృద్ధి చేసి, వాటర్ వరల్డ్గా అభివృద్ధి చేస్తానన్నారు. గోదావరిలో స్పీడ్ బోట్లు, పారాచూట్ రైడింగ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. హేవ్లాక్ బ్రిడ్జికి అనుసంధానంగా పర్యాటక కేంద్రంగా, పాదచారులకు, సైక్లింగ్కు వీలుగా ఈట్ స్ట్రీట్గా, ఫ్యాషన్ స్ట్రీట్గా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. హేవ్లాక్ బ్రిడ్జి స్తంభం దగ్గర సెల్ఫీ పాయింట్గా తీర్చిదిద్దుతామన్నారు. అన్ని గ్రామాలకూ రక్షిత నీటి సరఫరా గోదావరి తీరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉందని, వీటిలోని అన్ని గ్రామాలకు వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి రక్షిత నీరు అందేలా కృషి చేస్తానన్నారు. గోదావరిలోకి డ్రైనేజీ వాటర్ కలవకుండా సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి, ఆ నీటిని కడియం నర్సరీలకు వినియోగించాలనేది తన ప్రణాళిక అని చెప్పారు. ద్వారకా తిరుమలలో ద్వారకను తలపించేలా ఎమ్యూజ్మెంట్ పార్కుగా తీర్చిదిద్దే యోచన ఉందన్నారు. మోరంపూడి, వేమగిరి, బొమ్మూరు, లాలాచెరువు ఫ్లైవర్ బ్రిడ్జిలు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటానన్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న డిజైన్లకు ప్రత్యామ్నాయంగా ఆయా సెంటర్ల ఉనికి కోల్పోకుండా ఉండేలా హైదరాబాద్ పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ మాదిరిగా సింగిల్స్కెచ్గా తీసుకురావాలని భావిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం హెరిటేజ్ని కాపాడేలా హేవ్లాక్బ్రిడ్జి, బొమ్మూరు కాటన్గృహం, ధవళేశ్వరం కాటన్ మ్యూజియం ఇలా అన్నింటిని క్రోడీకరించి సాంస్కృతిక వైభవాన్ని పరిరక్షించే చర్యలు చేపడతామని చెప్పారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమల స్థాపనకు యువతను ప్రోత్సహించి, యువతకు పెద్ద ఎత్తున ఉపాధిఅవకాశాలు లభించే విధంగా తీసుకుంటామని, ఇక్కడ ఇంజినీరింగ్ కళాశాల్లో చదివిన విద్యార్థులు ఇక్కడే ఉపాధి పొందేలా చూస్తామని చెప్పారు. రాజమహేంద్రవరం–కాకినాడ జంటనగరాలుగా అభివృద్ధి చేయడానికి తమ వద్ద ప్రణాళిక ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కొక్క జిల్లా చేస్తామని జగన్ ప్రకటించిన విషయాన్నీ ఆయన గుర్తుచేస్తూ రాజమహేంద్రవరం జిల్లాను ఓ మోడల్ జిల్లాగా అభివృద్ధి చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా తన అభివృద్ధి ప్రణాళికను ఆడియో విజువల్గా రూపొందించి, సినీ నటుడు రాజారవీంద్ర చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పిల్లంగోళ్ల లక్ష్మి, కానుబోయిన సాగర్, గుర్రం గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
రాజమహేంద్రవరం క్రైం : క్రికెట్ బెట్టింగ్ ముఠాను రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారికి వచ్చిన సమాచారం మేరకు అడిషనల్ ఎస్పీ రజనీకాంత్ రెడ్డి పర్యవేక్షణలో సౌత్ జోన్ డీఎస్పీ పురేటి నారాయణ రావు సమక్షంలో టూ టౌన్ సీఐ ముక్తేశ్వరరావు, ఎస్సైలు కె.నాగరాజు, నాగబాబు దాడులు నిర్వహించి నిందితులను అరెస్ట్ చేశారు. గురువారం రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దక్షిణ మండలం డీఎస్పీ పి.నారాయణ రావు బెట్టింగ్ ముఠా వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఐపీఎల్ 11వ సీజన్లో రాజస్ధాన్ రాయల్, కోల్కత్తా నైట్ రైడర్స్ క్రికెట్ మ్యాచ్కు సంబంధించి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రాజమహేంద్రవరం ఆల్కట్ తోట కన్నమాంబా వారి వీధిలో చింతా కనకరత్నం అనే మహిళకు చెందిన ఇల్లును అద్దెకు తీసుకొని ఆమె చెల్లెల కుమారుడు చింతా జాన్పాల్ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ బెట్టింగ్ ముఠాలో సభ్యులు ఆల్కట్ తోటకు చెందిన చింతా జాన్ పాల్, నీలపు దామోదరరావు, సావాడ ప్రసాద్ రెడ్డి, లంకె చిరంజీవి, సీరాపు పాపారావు, మద్ది దుర్గారావులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.1.30 లక్షల నగదు, వీడియోకాన్ టీవీ, సెటప్ బాక్స్, రెండు మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం 14 మంది ఉన్నారని తెలిపారు. వారిలో ఆరుగురిని అరెస్ట్ చేశామని, మిగిలిన ఎనిమిది మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. నిందితులు రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నం, కొవ్వూరు ప్రాంతాలకు చెందిన వారని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్పై నిరంతర నిఘా.. క్రికెట్ బెట్టింగ్పై నిరంతర నిఘా ఉందని, రాజమహేంద్రవరంలో ఈ సీజన్లో నాలుగు కేసులు పట్టుకున్నట్టు వివరించారు. కడియం మండలంలో ఒక క్రికెట్ ముఠాను పట్టుకొని వారి వద్ద నుంచి రూ.నాలుగు లక్షలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్, వన్టౌన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టూ టౌన్ సీఐ ముక్తేశ్వరరావు, ఎస్సైలు కె. నాగరాజు, నాగబాబు పాల్గొన్నారు. -
రాజమహేంద్రవరంలో ప్లాట్ఫాం టికెట్ ధర పెంపు
సాక్షి, రాజమహేంద్రవరం సిటీ : సంక్రాంతి సందర్భంగా రైల్వే ప్లాట్ఫామ్ టిక్కెట్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పటివరకు సికింద్రాబాద్ స్టేషన్కే పరిమితమైన ఈ పెంపు ఇపుడు రాజమహేంద్రవరంతోపాటు విజయవాడ, నెల్లూరుల్లోనూ అమలులోకి రానున్నది. సంక్రాంతి సెలవుల సందర్భంగా వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి వీడ్కోలు పలికేందుకు, ఇతర ప్రాంతాల నుంచి తమవద్దకు వచ్చేవారిని తోడ్కొని వెళ్లేందుకు వారి సంబంధీకులు అనేకమంది స్టేషన్కు వస్తుంటారు. ప్రయాణికేతర ప్రజల రద్దీని తగ్గించేందుకు, ఆదాయం పెంచుకునేందుకు దాదాపు ప్రతి పెద్ద స్టేషన్లో రైల్వే శాఖ ప్లాట్ఫాం టిక్కెట్ ధరను ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు వారం రోజులపాటు రూ.10ల నుంచి రూ.20లకు పెంచింది. ఈమేరకు సికింద్రాబాద్లోని రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పండుగ సమయాల్లో రోజుకు 2500 మంది ప్లాట్ఫామ్ టిక్కెట్ కొనుగోలుదారులు ఉంటారని, ఆ టిక్కెట్ ధర పెంపుతో రోజుకు రూ.25 వేల చొప్పున వారం రోజులకు రూ.1,75,000ల ఆదాయం సమకూరనుందని రైల్వే శాఖ అంచనా. కాగా, ఇది తమకు భారమే కాగలదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బింగ్ జానకికి సత్కారం
రాజమహేంద్రవరం కల్చరల్ : నేటితరం నటీనటులు ఎటువంటి శిక్షణా లేకుండా కెమెరాల ముందుకు రావడంతో నటనలో ప్రమాణాలు తగ్గిపోతున్నాయని డబ్బింగ్ జానకి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నారాయణపురంలోని విశ్రాంత హిందీ అధ్యాపకురాలు పార్వతి గృహంలో ఆమెను నగరానికి చెందిన కళాకారులు, గాయకులు, ప్రముఖులు సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాటి తరం నటీమణులు వాణిశ్రీ, శారదలకు తాను సమకాలీనురాలినని, కళాతపస్వి విశ్వనాథ్ దర్శకత్వం వహించిన పలు సినిమాల్లో నటించానని తెలిపారు. ప్రముఖ దర్శకుడు జంధ్యాలకూడా తనను ప్రోత్సహించేవారన్నారు. దక్షిణాది భాషలన్నింటిలో సుమారు వేయిచిత్రాలలో నటించానన్నారు. ‘ఎస్ బ్యాంక్’ మేనేజర్ ఘంటసాల శ్యామలాకుమారి, గాయకుడు రాయుడు చంద్రకుమార్, పాత్రికేయుడు సన్నిధానం శాస్త్రి, కొప్పర్తి రామకృష్ణ తదితరులు జానకిని సత్కరించారు.