Reliance Communications
-
అనిల్ అంబానీపై దివాలా చర్యల నిలుపుదల
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) అధినేత అనిల్ అంబానీపై దాదాపు రూ. 1,200 కోట్ల రుణాల ఎగవేతలకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వేసిన కేసులో మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్పీ)ని నియమిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇచ్చిన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. అయితే ఈ కేసులో ఆయన ఆస్తులపై తీవ్ర ఆంక్షలు విధించింది. వాటిని బదలాయించడంగానీ లేక విక్రయించడంగానీ లేదా తాకట్టు పెట్టడంకానీ చేయరాదని స్పష్టం చేసింది. ఆస్తులకు సంబంధించి ఆయన ప్రయోజనాల్లో ఎటువంటి మార్పులూ జరగరాదని ఆదేశించింది. జస్టిస్ విపిన్ సంఘీ, రజ్నీష్లతో కూడిన త్రిసభ్య ధర్మానసం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో తమ వాదనలు తెలియజేయాలని ఇన్సా ల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ), ఎస్బీఐలకు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదావేస్తూ, ఆలోపు తమ వాదనలు తెలపాలని ప్రతివాదులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే కంపెనీలపై ఈ లోపు తగిన న్యాయపరమైన చర్యలు కొనసాగుతాయని, ఐబీసీ పార్ట్ 3 కింద అంబానీ పిటిషన్ విషయంలో మాత్రమే స్టే విధిస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. అనిల్ అంబానీ గ్రూప్ (అడాగ్)లో భాగమైన ఆర్కామ్, రిలయన్స్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్టీఐఎల్)కు 2016 ఆగస్టులో ఎస్బీఐ రుణ సదుపాయం కల్పించింది. ఆర్కామ్కు రూ. 565 కోట్లు, ఆర్టీఐఎల్కు రూ. 635 కోట్లు రుణంగా అందించింది. 2016 సెప్టెంబర్లో అనిల్ అంబానీ వ్యక్తిగత పూరీకత్తునిచ్చారు. అయితే, 2016 ఆగస్టు నుంచి వర్తింపజేస్తూ ఆర్కామ్, ఆర్ఐటీఎల్ ఖాతాలను 2017లో మొండిపద్దుల కింద బ్యాంకులు వర్గీకరించాయి. దీంతో అనిల్ అంబానీ ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తును 2018 జనవరిలో ఎస్బీఐ రుణ బాకీల కింద జప్తు చేసుకోవాలని నిర్ణయించింది. తదుపరి అనిల్ అంబానీకి నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ స్పందన రాలేదు. ఈలోగా ఆర్కామ్నకు ఇచ్చిన రూ. 5,447 కోట్లు వసూలు చేసుకునేందుకు చైనా బ్యాంకులకు బ్రిటన్ కోర్టుల నుంచి అనుమతులు లభించాయి. ఒకవేళ చైనా బ్యాంకులు కూడా అనిల్ అంబానీ ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తులపై చర్యలు ప్రారంభిస్తే పరిస్థితి సంక్లిష్టంగా మారుతుందని ఎస్బీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. దివాలా ప్రక్రియకు సమాంతరంగా గ్యారెంటర్పై కూడా విచారణ జరపవచ్చని నిబంధనల్లో స్పష్టంగా ఉందని తన వాదనల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్పీ)ని నియమిస్తూ ఎన్సీఎల్టీ ఈ నెల 20న ఆదేశాలు ఇచ్చింది. -
స్పెక్ట్రమ్ షేరింగ్ వివరాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలకు సంబంధించి సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్) కేసు విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. దివాలా ప్రక్రియకు వెళ్లిన టెలికం కంపెనీలకు సంబంధించి స్పెక్ట్రమ్ పంపిణీ వివరాలను (షేరింగ్) ఇవ్వాలని శుక్రవారం నాటి విచారణ సందర్భంగా టెలికం శాఖను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దివాలా ప్రక్రియలో ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) రిలయన్స్ జియో మధ్య స్పెక్ట్రమ్ పంపకం జరగ్గా.. ఆర్ కామ్ స్పెక్ట్రమ్ ను వాడుకున్నందుకు, ఆ కంపెనీ స్పెక్ట్రమ్ బకాయిలను జియో ఎందుకు చెల్లించకూడదంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం లోగడ విచారణలో ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్ కామ్ తోపాటు, వీడియోకాన్ దివాలా చర్యలను ఎదుర్కొంటున్న విషయం గమనార్హం. ‘‘వీడియోకాన్ స్పెక్ట్రమ్ బదలాయించాలంటే, దాని కంటే ముందు గత బకాయిలను కంపెనీ చెల్లించాలి’’ అంటూ వీడియోకాన్ విషయమై ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ వీడియోకాన్ చెల్లించకపోతే, ఆ స్పెక్ట్రమ్ ను సొంతం చేసుకున్న భారతీ ఎయిర్ టెల్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి వీడియోకాన్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. కార్పొరేట్ దివాలా చర్యల ప్రక్రియకు వెలుపల తాము ఎటువంటి బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత కలిగిలేమని నివేదించారు. ఏజీఆర్ బకాయిలను ఐబీసీ కింద నిర్వహణ బకాయిలుగా పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్ కామ్ స్పెక్ట్రమ్ ను జియో వినియోగించుకున్నందున ఆ మొత్తానికి సంబంధించి జియో చెల్లించాల్సిన బకాయిల వివరాలను అడిగినా ఇవ్వలేదేమంటూ ధర్మాసనం టెలికం శాఖను ప్రశ్నించింది. అనంతరం దివాలా చర్యల పరిధిలో ఉన్న కంపెనీల స్పెక్ట్రమ్ పంపిణీకి సంబంధించి ఎంత మేర బకాయిలు రావాలన్న వివరాలను సమర్పించాలని టెలికం శాఖను ఆదేశించింది. 1999 నుంచి ఏ కంపెనీలు స్పెక్ట్రమ్ ను వినియోగించుకున్నదీ, వాటి మధ్య వాణిజ్య ఒప్పంద వివరాలను తమ ముందుంచాలని ధర్మాసనం కోరింది. ఏజీఆర్ బకాయిలను ఏటా కొంత చొప్పున కొన్నేళ్ల పాటు చెల్లించేందుకు అనుమతించాలని భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు ధర్మాసనాన్ని అభ్యర్థించాయి. ఈ రెండు కంపెనీలు కలసి రూ.లక్ష కోట్లకు పైగా ఏజీఆర్ బకాయిలను చెల్లించాల్సి ఉంది. టెలికం శాఖ డిమాండ్ ప్రకారం వొడాఫోన్ ఐడియా రూ.58,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.8,000 కోట్లను ఇప్పటి వరకు జమ చేయగలిగింది. భారతీ ఎయిర్ టెల్ రూ.43,000 కోట్ల బకాయిలకు గాను రూ.18,000 కోట్లను చెల్లించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా అధ్యక్షతన గల సుప్రీం ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. -
జియోపై మీ వైఖరి చెప్పండి
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు ప్రభుత్వానికి కట్టాల్సిన లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల వివాదం కేసు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. వివరాల్లోకి వెడితే.. దివాలా తీసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) కట్టాల్సిన బాకీలను ఆ కంపెనీ స్పెక్ట్రంను వాడుకుంటున్నందున రిలయన్స్ జియో సంస్థ కట్టాలని సుప్రీంకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, ఆర్కామ్ దివాలా ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో జియోకు స్పెక్ట్రం విక్రయ అంశంపై కేంద్ర టెలికం శాఖ (డాట్), ఇటు కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. దివాలా ప్రక్రియ జరుగుతుండగా స్పెక్ట్రంను విక్రయించడానికి లేదన్నది డాట్ భావన కాగా, గరిష్ట విలువను రాబట్టేందుకు విక్రయమే సరైన మార్గమని ఎంసీఏ భావిస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సోమవారం సుప్రీం కోర్టులో జరిగిన వాదనల సందర్భంగా తెలిపారు. దీనికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఏ ఉత్తర్వులు ఇచ్చినా సమ్మతమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్కామ్ కట్టాల్సిన బాకీలను జియో చెల్లించే అంశంపై అసలు కేంద్రం వైఖరి ఏమిటన్నది తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఏయేడాదికాయేడు ఆర్కామ్ కట్టాల్సిన బాకీల వివరాలను సమర్పించాలంటూ డాట్కు సూచించింది. తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. -
అంబానీ వద్ద చిల్లి గవ్వ లేదా?!
సాక్షి, న్యూఢిల్లీ : ‘35 మిలియన్ పౌండ్ల యాట్ (దాదాపు 337 కోట్ల రూపాయల విలాసవంతమైన విహార పడవ), 60 మిలియన్ పౌండ్ల (దాదాపు 579 కోట్ల రూపాయల) బోయింగ్ జెట్ ప్రైవేటు విమానంతోపాటు ముంబైలో రెండు బిలియన్ డాలర్ల (దాదాపు 19 వేల కోట్ల రూపాయల) విలాసవంతమైన 27 అంతస్తుల కుటుంబ భవనం కలిగిన అనిల్ అంబానీ చేతిలో చిల్లి గవ్వ లేకపోవడం ఏమిటీ?’ అంటూ లండన్ హైకోర్టులో మూడు చైనా బ్యాంకుల తరఫున న్యాయవాది అనిల్ అంబానీని ఉద్దేశించి వాదించారు. ఈ వాదనను ఆసక్తిగా విన్న హైకోర్టు జడ్జీ డేవిడ్ వాక్స్మన్ జోక్యం చేసుకొని ‘మీది విలాసవంతమైన జీవితం అని మాకు తెలుసు. ఒకప్పుడు ప్రైవేటు హెలికాప్టర్లో తిరిగిన మీరు బొంబార్డియర్ లెగసీ 650 ప్రైవేటు జెట్ విమానంలో తిరుగుతున్నారు. దాదాపు 2.31 మిలియన్ పౌండ్ల (దాదాపు 22 కోట్ల రూపాయలు) విలువైన 11 కార్లు మీ కుటుంబానికి ఉన్నాయి. పైగా మీకు ప్రత్యేకంగా దక్షిణ బొంబాయిలోని అత్యంత ఖరీదైన భవనంలో రెండు అంతస్థులు ఉన్నాయి.(అప్పులు చెల్లించలేను.. వైరాగ్యంలో అనిల్) చెల్లించడానికి మీ వద్ద డబ్బు లేకపోవడం ఏమిటీ? మార్చి 20వ తేదీలోగా 80 మిలియన్ పౌండ్లు (దాదాపు 772 కోట్ల రూపాయలు) బ్యాంకులకు చెల్లించండి’ అంటూ అనిల్ అంబానీని ఆదేశించారు. ఒకప్పుడు ప్రపంచ కుబేరుల్లో ఆరువ వ్యక్తిగా రికార్డు సృష్టించిన అనిల్ అంబానీ 2008లో ఆర్థిక మాంద్యం వల్ల రిలయెన్స్ కమ్యూనికేషన్ల ద్వారా తీవ్రంగా నష్టపోయారు. దాన్ని పునరుద్ధరించడంలో భాగంగా ఆయన 2012లో చైనాకు చెందిన మూడు ప్రభుత్వ బ్యాంకుల నుంచి 550 మిలియన్ పౌండ్లు (దాదాపు 5,310 కోట్ల రూపాయలు) రుణంగా తీసుకున్నారు. నాడు అంబానీ వ్యక్తిగత పూచీకత్తుపైనే అంత మొత్తం తీసుకున్నారు. తీసుకున్న రుణాలకు అసలు సంగతి అటుంచితే వడ్డీ కూడా చెల్లించక పోవడంతో చైనాకు చెందిన మూడు బ్యాంకులు ఓ బృందంగా ఏర్పడి అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల మేరకు లండన్ హైకోర్టులో కేసు పెట్టాయి. గత డిసెంబర్లో ఈ కేసు విచారణ జరగ్గా, నాలుగు రోజుల కిందట మరోసారి కేసు విచారణకు వచ్చింది. కాగా, తన కంపెనీల షేర్ల విలువ మొత్తం 63.7 మిలియన్లు అని, నగదు జీరో అని, తాను రుణాలు చెల్లించే పరిస్థితుల్లో లేనని అనిల్ అంబానీ వాదించారు. ఆ సమయంలో చైనా బ్యాంకుల న్యాయవాది వాదనతో ఏకీభవించిన హైకోర్టు జడ్జీ డేవిడ్ వాక్స్మన్, అంబానీని నిలదీశారు. దానికి సమాధానంగా గతంలో స్వీడన్ కంపెనీ ఎరిక్సన్కు తాను చెల్లించాల్సిన 60 మిలియన్ పౌండ్లను తన సోదరుడు ముకేశ్ అంబానీ చెల్లించారని, ఇంకేమాత్రం తన అప్పులు చెల్లించేందుకు ఆయన సిద్ధంగా లేరని అనిల్ అంబానీ పేర్కొన్నారు. ‘ఫర్వాలేదు. ముందు చెల్లించారు, మొన్న చెల్లించారు, ఇక ముందు కూడా చెల్లిస్తారు. చెల్లించేందుకు ఉమ్మడి ఆస్తులు లేవా?’ అని జడ్జీ ప్రశ్నించారు. తన క్లైయింట్ని డబ్బులు చెల్లించాల్సిందిగా ఒత్తిడి తీసుకరావద్దని, అలా చేసినట్లయితే ఆయన తన కేసును తాను సరిగ్గా వాదించుకునే మానసిక పరిస్థితిలో ఉండరని అంబానీ న్యాయవాది వాదించారు. మార్చి 20లోగా చెల్లించాల్సిందేనంటూ హైకోర్టు జడ్జీ కేసు తదుపరి విచారణను వాయిదా వేశారు. కోర్టు ఆదేశాలను పాటిస్తారా ? అని ఇంగ్లండ్ మీడియా అనిల్ అంబానీ న్యాయవాదిని సంప్రదించగా, చట్టపరంగా తదుపరి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయో పరిశీలించాల్సి ఉందన్నారు. చైనా బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకున్న ఏడాదే స్టీఫెన్ స్పీల్బెర్గ్ దర్శకత్వం వహించిన ‘లింకన్’ హాలివుడ్ చిత్రానికి ఫైనాన్స్ చేయడం ద్వారా అంబానీకి భారీగా డబ్బులు వచ్చినట్లు వార్తలొచ్చాయి. ఆ చిత్రానికి ఉత్తమ చిత్రంతోపాటు ఉత్తమ నటుడిగా రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. -
రూ.700 కోట్లు కట్టండి
లండన్: రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీకి సంబంధించి చైనా ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు గాను వ్యక్తిగత హామీ ఇచ్చిన ప్రమోటర్ అనిల్ అంబానీకి బ్రిటన్ హైకోర్టులో చుక్కెదురు అయింది. ఆరు వారాల్లో 100 మిలియన్ డాలర్లు (రూ.700 కోట్లు) కోర్టులో డిపాజిట్æ చేయాలని న్యాయమూర్తి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంకు ఆఫ్ చైనా ముంబై శాఖ, చైనా డెవలప్మెంట్ బ్యాంకు, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా అనిల్ అంబానీకి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లో కండీషనల్ ఆర్డర్లో భాగంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. -
ఆర్కామ్ ఆస్తుల రేసులో ఎయిర్టెల్, జియో
న్యూఢిల్లీ: రుణభారంతో దివాలా పరిష్కార ప్రక్రియ ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) అసెట్స్ను కొనుగోలు చేసేందుకు 11 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. పోటీ కంపెనీలైన భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో కూడా వీటిలో ఉన్నాయి. ‘ మూడు సంస్థల (ఆర్కామ్, రిలయన్స్ టెలికం, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్) అసెట్స్ను కొనుగోలు చేసేందుకు మొత్తం 11 బిడ్స్ వచ్చాయి. వీటిలో వర్డే క్యాపిటల్, యూవీ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ మొదలైన సంస్థల బిడ్స్ కూడా ఉన్నాయి‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్కామ్ డేటా సెంటర్, ఆప్టికల్ ఫైబర్ వ్యాపారాన్ని కచ్చితంగా కొనుగోలు చేస్తుందని భావించిన ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ సంస్థ.. అసలు బిడ్ దాఖలు చేయలేదని వివరించాయి. బిడ్లను సోమవారమే ఖరారు చేయాల్సి ఉన్నప్పటికీ.. రుణదాతల కమిటీ (సీవోసీ) దీన్ని శుక్రవారానికి వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి. ఆర్కామ్ సెక్యూర్డ్ రుణాలు దాదాపు రూ. 33,000 కోట్ల మేర ఉండగా.. దాదాపు రూ. 49,000 కోట్ల బాకీలు రావాల్సి ఉందని రుణదాతలు ఆగస్టులో క్లెయిమ్ చేశారు. బాకీల చెల్లింపు కోసం అసెట్స్ను విక్రయించేందుకు గతంలో కూడా ఆర్కామ్ ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. స్పెక్ట్రం చార్జీలు, లైసెన్సు ఫీజుల బాకీల కోసం ప్రొవిజనింగ్ చేయడంతో జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ. 30,142 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అటు కంపెనీ చైర్మన్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేసినప్పటికీ.. రుణదాతలు ఆమోదముద్ర వేయలేదు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు (ఎన్సీఎల్టీ) ఆర్కామ్ వ్యవహారం చేరింది. ఎన్సీఎల్టీ ఆదేశాల ప్రకారం పరిష్కార నిపుణుడు (ఆర్పీ) 2020 జనవరి 10లోగా దీన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. స్టాక్ .. అప్పర్ సర్క్యూట్.. బిడ్డింగ్ వార్తలతో సోమవారం ఆర్కామ్ షేర్లు అప్పర్ సర్క్యూట్ను తాకాయి. ఆరు శాతం ఎగిశాయి. బీఎస్ఈలో ఆర్కామ్ షేరు 69 పైసలు పెరిగి రూ. 4.55 వద్ద ముగిసింది. -
అనిల్ అంబానీ రాజీనామా తిరస్కరణ
న్యూఢిల్లీ: దివాలా స్మృతి కింద చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) డైరెక్టర్గా అనిల్ అంబానీ రాజీనామా చేయడాన్ని రుణదాతల కమిటీ (సీవోసీ) తిరస్కరించింది. ఆయనతో పాటు మరో నలుగురు డైరెక్టర్ల రాజీనామాలను కూడా తోసిపుచ్చింది. నవంబర్ 20న జరిగిన సమావేశంలో సీవోసీ ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు కంపెనీ తెలియజేసింది. ఆర్కామ్ డైరెక్టర్లుగా కొనసాగాలని, దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించి పరిష్కార నిపుణునికి అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని సీవోసీ సూచించినట్లు వివరించింది. స్వీడన్కు చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ పిటీషన్ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఆర్కామ్పై దివాలా ప్రక్రియ జరుగుతున్న సంగతి తెలిసిందే. రుణాలిచి్చన బ్యాంకులు, ఆరి్థక సంస్థల క్లెయిమ్ ప్రకారం ఆర్కామ్ దాదాపు రూ. 49,000 కోట్లు బాకీ పడింది. -
అనిల్ అంబానీకి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : పారిశ్రామికవేత్త, రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎరిక్సన్ ఇండియాకు చెల్లించాల్సిన రూ 453 కోట్లు క్లియర్ చేయడంతో ఆయనపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసును సర్వోన్నత న్యాయస్ధానం బుధవారం కొట్టివేసింది. అనిల్ కంపెనీకి ఆయన సోదరుడు ముఖేష్ అంబానీ బాసటగా నిలవడం, కంపెనీ ఆస్తులను జియో కొనుగోలు చేయడంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఎరిక్సన్కు బకాయిలను చెల్లించింది. అంతకుముందు రిలయన్స్ జియోకు ఆస్తులు విక్రయించినప్పటికీ తమ బకాయిలను చెల్లించలేదని ఎరిక్సన్ సుప్రీంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా, అనిల్ అంబానీతో పాటు రిలయన్స్ టెలికం చైర్మన్ సతీష్ సేథ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ చీఫ్ ఛాయా విరానీలను నిందితులుగా సుప్రీం విచారణ సాగింది. నాలుగు వారాల్లోగా ఎరిక్సన్ ఇండియాకు రూ 453 కోట్లను చెల్లించాలని లేనిపక్షంలో మూడు నెలల జైలు శిక్ష ఎదుర్కోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వారికి రూ కోటి చొప్పున జరిమానా కూడా విధించింది. -
ఆర్కామ్ దివాలాకు.. తొలగిన అడ్డంకులు
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) దివాలా ప్రక్రియను ఎదుర్కోనుంది. కంపెనీకి వ్యతిరేకంగా దివాలా చర్యలు చేపట్టేందుకు జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) అనుమతించింది. ఎరిక్సన్ పిటిషన్ మేరకు కంపెనీకి వ్యతిరేకంగా దివాలా ప్రక్రియకు ఎన్సీఎల్టీ లోగడ ఆదేశించగా.., దీన్ని వ్యతిరేకిస్తూ ఆర్కామ్ గతేడాది జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో పిటిషన్ దాఖలు చేసింది. ఆర్కామ్, ఆ సంస్థ అనుబంధ కంపెనీలు రిలయన్స్ ఇన్ఫ్రాటెల్, రిలయన్స్ టెలికాంకు వ్యతిరేకంగా ఎరిక్సన్ దివాలా పిటిషన్ వేయడంతో ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ 2018 మే 15న తీర్పు జారీ చేసింది. తాత్కాలిక పరిష్కార నిపుణుడిని సైతం నియమించింది. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) తాజాగా వెనక్కి తీసుకుంది. సంస్థ పునరుద్ధరణకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో దివాలా ప్రక్రియ మెరుగైనదిగా కంపెనీ బోర్డు భావించింది. దీంతో ఎన్సీఎల్టీ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటామని ఆర్కామ్ కోరడంతో అందుకు ఎన్సీఎల్ఏటీ అనుమతించింది. -
ఆర్కామ్ దివాలా పిటీషన్పై ఎన్సీఎల్ఏటీ దృష్టి
న్యూఢిల్లీ: రుణభారం పేరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) దివాలా అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దివాలా పిటీషన్పై విచారణ కొనసాగించాలా లేదా అన్న దానిపై తానే తుది నిర్ణయం తీసుకుంటామని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. తమకు రావాల్సిన రూ. 550 కోట్ల బాకీల కోసం స్విస్ టెలికం సంస్థ ఎరిక్సన్ గతంలో ఈ పిటీషన్ వేసింది. అయితే, ఆ తర్వాత బాకీలు వసూలు కావడంతో పిటీషన్ను ఉపసంహరించుకుంటామని తెలిపింది. కానీ, ఇతర రుణదాతలకు బాకీలు చెల్లింపులు జరిపే పరిస్థితుల్లో తాము లేమని, దివాలా పిటీషన్పై ప్రొసీడింగ్స్ కొనసాగించాలని ఎన్సీఎల్ఏటీని ఆర్కామ్ కోరుతోంది. ఎరిక్సన్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది. రూ.550 కోట్లు ఎరిక్సన్ తిరిగి ఇచ్చేయాలా? ఈ నేపథ్యంలో ఎన్సీఎల్ఏటీ తాజాగా సోమవారం తన అభిప్రాయం వెల్లడించింది. ఒకవేళ ఆర్కామ్ దివాలా ప్రక్రియకు అనుమతించిన పక్షంలో ఎరిక్సన్ తనకు దక్కిన రూ. 550 కోట్లు కూడా వాపసు చేయాల్సి ఉంటుందని ద్విసభ్య బెంచ్ చైర్మన్ జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ పేర్కొన్నారు. ‘రుణాలిచ్చిన మిగతావారందరినీ కాదని ఒక్కరే మొత్తం బాకీ సొమ్మును ఎలా తీసుకుంటారు‘ అని ప్రశ్నించారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా ప్రొసీడింగ్స్ కొనసాగించడమా లేదా నిలిపివేయడమా అన్నదానిపై ఎన్సీఎల్ఏటీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఎన్సీఎల్ఏటీ ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. ఐఎల్ఎఫ్ఎస్ 4 సంస్థల వివరాలివ్వండి.. మరో నాలుగు గ్రూప్ కంపెనీల వివరాలు సమర్పించాల్సిందిగా రుణ సంక్షోభం ఎదుర్కొంటున్న ఐఎల్అండ్ఎఫ్ఎస్ను ఎన్సీఎల్ఏటీ ఆదేశించింది. వాటిల్లో పెన్షను, ప్రావిడెంట్ ఫండ్స్ పెట్టుబడులు, వాటి రుణాల వివరాలు ఇవ్వాల్సిందిగా సూచించింది. ఉద్యోగులకు చెందాల్సిన పింఛను నిధులను తొక్కిపెట్టి ఉంచకూడదని, ఆ మొత్తాన్ని ముందుగా విడుదల చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. హజారీబాగ్ రాంచీ ఎక్స్ప్రెస్వే, జార్ఖండ్ రోడ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కంపెనీ, మొరాదాబాద్ బరైలీ ఎక్స్ప్రెస్వే, వెస్ట్ గుజరాత్ ఎక్స్ప్రెస్వే సంస్థలు వీటిలో ఉన్నాయి. చెల్లింపులు జరపగలిగే సామర్థ్యాలను బట్టి ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ కంపెనీలను మూడు వర్ణాలుగా వర్గీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా కాషాయ వర్ణం (నిర్వహణపరమైన చెల్లింపులు జరిపే సామర్థ్యం ఉన్నవి) కింద వర్గీకరించిన నాలుగు సంస్థల విషయంలో ఎన్సీఎల్ఏటీ ఆదేశాలిచ్చింది. మొత్తం 13 కాషాయ వర్ణ సంస్థల్లో మిగతా తొమ్మిది సంస్థలు తదుపరి విచారణ తేదీ అయిన ఏప్రిల్ 16లోగా రుణాల చెల్లింపు ప్రణాళికను సిద్ధం చేసే ప్రయత్నాల్లో ఉండాలని పేర్కొంది. -
అనిల్ అంబానీకి తప్పిన ‘కారాగార’ ముప్పు
న్యూఢిల్లీ: బిలియనీర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి ‘కారాగార’ ముప్పు తప్పింది. అత్యున్నత న్యాయస్థానం విధించిన గడువుకు సరిగ్గా ఒక్కరోజు ముందు స్వీడన్ టెలికం పరికరాల తయారీ సంస్థ– ఎరిక్సన్కు ఇవ్వాల్సిన రూ.458.77 కోట్లను రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) చెల్లించింది. సోమవారం ఎరిక్సన్కు బకాయిలు చెల్లించినట్లు ఆర్కామ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆర్కామ్ నుంచి రావాల్సిన మొత్తం అందినట్లు (సోమవారం రూ.458.77 కోట్లు. అంతక్రితం 118 కోట్లు) ఎరిక్సన్ ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. వడ్డీతోసహా రావాల్సిందంతా అందినట్లు ప్రతినిధి పేర్కొన్నారు. సోమవారం రిలయన్స్ కమ్యూనికేషన్స్ షర్ ధర నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్లో 9 శాతం పడి, రూ.4 వద్ద ముగిసింది. కేసు క్రమం ఇదీ... ►ఆర్కామ్ దేశవ్యాప్త టెలికం నెట్వర్క్ నిర్వహణకు అనిల్ గ్రూప్తో 2014లో ఎరిక్సన్ ఇండియా ఏడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. రూ.1,500 కోట్లకుపైగా బకాయిలు చెల్లించలేదని ఆరోపించింది. ►రూ.47,000 కోట్లకుపైగా రుణ భారంలో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, తనకు బకాయిలు చెల్లించలేకపోవడంతో, ఎరిక్సన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. గత ఏడాది మే నెలలో ఈ పిటిషన్ను ట్రిబ్యునల్ అడ్మిట్ చేసుకుంది. ►అయితే ఈ కేసును ఆర్కామ్ సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంది. ఇందుకు వీలుగా రూ.550 కోట్లు చెల్లిస్తానని హామీ ఇచ్చింది. 2018 సెప్టెంబర్ 30 లోపు ఈ చెల్లింపులు జరుపుతామని పేర్కొంది. ►ఈ హామీకి కట్టుబడకపోవడంతో ఎరిక్సన్ సెప్టెంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ►ఎరిక్సన్కు చెల్లించాల్సిన బకాయిలపై గతేడాది అక్టోబర్ 23న ఆర్కామ్కు అత్యున్నత న్యాయస్థానం చివరి అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 15లోపు బకాయిలు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. జాప్యం జరిగితే ఇందుకు సంబంధించి మొత్తంపై 12 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది. ►డిసెంబర్ 15లోపు బకాయిలు చెల్లించలేకపోతే, ఎరిక్సన్ కోర్టు ధిక్కరణ కేసు ప్రొసీడింగ్స్ను ప్రారంభించవచ్చని సూచించింది. ► అయితే ఆ లోపూ బకాయిలు చెల్లించలేకపోవడంతో జనవరి 4న ఎరిక్సన్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ► దీనిపై ఫిబ్రవరి 20వ తేదీన అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును ప్రకటించింది. ► ఈ కేసులో అనిల్ అంబానీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.550 కోట్ల బకాయి చెల్లించకుండా తన ఉత్తర్వులను ఉల్లంఘించారని, ఇది పూర్తిగా ధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ► నాలుగు వారాల్లో రూ.453 కోట్లు కనక ఎరిక్సన్కు చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష తప్పదని స్పష్టం చేసింది. ►ఈ కేసులో ఆర్కామ్ చైర్మన్ అనిల్తో పాటు రిలయన్స్ టెలికం చైర్మన్ సతీశ్ సేథ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ చైర్పర్సన్ చిరహా విరాణి కూడా సుప్రీంకోర్టు ఇదే హెచ్చరికలు చేసింది. ► ధర్మాసనం ఈ హెచ్చరిక చేస్తున్న సమయంలో అనిల్ అంబానీ సహా ముగ్గురూ కోర్టు హాల్లోనే ఉన్నారు. ►తదనంతరం ఆదాయ పన్ను రిఫండ్ ద్వారా తమ బ్యాంక్ ఖాతాకు వచ్చిన రు.260 కోట్లను ఎరిక్సన్కు చెల్లించేందుకు అనుమతివ్వాలంటూ ఆర్కామ్ రుణ దాతలు– బ్యాంకర్లును అభ్యర్థించింది. అయితే ఇందుకు అవి ససేమిరా అన్నాయి. ఆదుకున్న అన్న! ‘‘ఈ క్లిష్ట సమయాల్లో నా వెంట నిలిచిన గౌరవనీయులైన నా అన్న, వదిన ముకేశ్, నీతాలకు హృదయపూర్వక ధన్యవాదములు. సకాలంలో సహకారం అందించడం ద్వారా మా కుటుంబ విలువలకు ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియజేశారు. నేను, నా కుటుంబం గతాన్ని దాటి వచ్చినందుకు కృతజ్ఞులం’’ అంటూ ఆర్కామ్ చైర్మన్ అనిల్ అంబానీ ప్రకటించారు. దీంతో ఎరిక్సన్కు బకాయిల చెల్లింపునకు కావాల్సిన మొత్తాన్ని సోదరుడు ముకేశ్ అంబానీ సమకూర్చి ఆదుకున్నట్టు అనిల్ ప్రకటన ద్వారా తెలుస్తోంది. -
ఆ నిధులపై హక్కులు మాకే...
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్కు (ఆర్కామ్) ఐటీ రిఫండ్ రూపంలో వచ్చిన రూ. 260 కోట్ల నిధులపై పూర్తి హక్కులు తమకే ఉంటాయని బ్యాంకులు స్పష్టంచేశాయి. ఇదే విషయాన్ని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్కు (ఎన్సీఎల్ఏటీ) చెప్పాయి. తమకు చెందాల్సిన నిధులతో ఎరిక్సన్కి ఇవ్వాల్సిన బాకీలను ఆర్కామ్ తీరుస్తానంటే కుదరదని తెగేసి చెప్పాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎరిక్సన్కు చెల్లించడం కోసం రిటెన్షన్, ట్రస్ట్ ఖాతాలో ఉన్న ఐటీ రిఫండ్ నిధులను ఉపయోగించుకునేలా అనుమతించాలంటూ ఆర్కామ్ వేసిన పిటీషన్పై మంగళవారం విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా బ్యాంకుల తరఫున సీనియర్ అడ్వకేట్ నీరజ్ కిషన్ కౌల్ వాదించారు. ఆర్కామ్ దివాలా ప్రక్రియ ప్రారంభానికి ముందే రిటెన్షన్, ట్రస్ట్ ఖాతా ఏర్పాటైందని, దానికి, ప్రస్తుత కేసుకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. ఎరిక్సన్ బాకీల భారాన్ని ఆర్కామ్ బ్యాంకులపై రుద్దడం కుదరదని తెలిపారు. ఈ కేసు విచారణను బుధవారానికి వాయిదాపడింది. -
మీరు చెప్పిందేమిటి... జరిగిందేమిటి!
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) కేసులో నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) బ్యాంకులకు అక్షింతలు వేసింది. అసెట్స్ అమ్మకం ద్వారా రూ. 37,000 కోట్లు రాబట్టేసుకుంటామంటూ ’తప్పుడు అభిప్రాయం’ కలిగించాయని, తీరా చూస్తే అమ్మకం జరగకపోగా.. రూ. 260 కోట్ల ఐటీ రీఫండ్ను రికవర్ చేసుకునేందుకు తంటాలు పడుతున్నాయని వ్యాఖ్యానించింది. ‘రిలయన్స్ జియోకి అసెట్స్ను విక్రయించడం ద్వారా రూ. 37,000 కోట్లు వస్తాయని ఆర్కామ్ అంటే మీరంతా దానికి వంతపాడారు. భవిష్యత్ అంతా బంగారంగా ఉంటుందంటూ భ్రమలు కల్పించారు. కానీ అసలు అసెట్స్ అమ్మకమే జరగలేదు. మీరు విఫలమయ్యారు. జాయింట్ లెండర్స్ ఫోరమ్ విఫలమైంది. అసలు మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పండి‘ అంటూ బ్యాంకులను.. ముఖ్యంగా ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ద్విసభ్య ఎన్సీఎల్ఏటీ బెంచ్ కడిగేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎరిక్సన్ సంస్థకు బాకీలు కట్టుకోవడం కోసం ఐటీ రీఫండ్ నిధులను ఆర్కామ్ వినియోగించుకునేలా ఎందుకు అనుమతించరాదో చెప్పాలంటూ బ్యాంకులను ఆదేశించింది. దీనిపై రెండు పేజీల నోట్ను దాఖలు చేయాలని ఆదేశించిన ఎన్సీఎల్ఏటీ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. టెలికం పరికరాల సంస్థ ఎరిక్సన్కు రూ. 550 కోట్ల బాకీలు తీర్చకపోతే ఆర్కామ్ అధినేత అనిల్ అంబానీతో పాటు ఇద్దరు అధికారులు కోర్టు ధిక్కరణ నేరం కింద జైలుశిక్ష ఎదుర్కోనున్న సంగతి తెలిసిందే. దీంతో ఐటీ రీఫండ్ రూపంలో వచ్చిన రూ. 260 కోట్లను ఇందుకోసం ఉపయోగించుకునేలా తగు ఆదేశాలివ్వాలంటూ ఎన్సీఎల్ఏటీని ఆర్కామ్ ఆశ్రయించింది. -
అనిల్ అంబానీ పని అయిపోయిందా..?
అన్నదమ్ములిద్దరూ దాదాపు ఒకే దగ్గర జర్నీ ప్రారంభించారు. కానీ ఒకరు ఆకాశామే హద్దుగా ఎదుగుతుంటే.. మరొకరు అధఃపాతాళం లోతుల్లోకి జారిపోతున్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో నువ్వా, నేనా అన్నట్లుగా ఒకప్పుడు అన్న ముకేశ్ అంబానీతో పోటీపడిన అనిల్ అంబానీ ప్రస్తుతం ఆ లిస్టులో ఎక్కడో కిందికి పడిపోయారు. అన్న ముకేశ్ అంబానీ 47 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా రాజ్యమేలుతుండగా.. 2 బిలియన్ డాలర్లకు పడిపోయిన సంపదతో తమ్ముడు అనిల్ అంబానీ కనీసం దేశీ కుబేరుల లిస్టులోనూ చోటు కోసం తంటాలు పడే పరిస్థితికి తగ్గిపోయారు. దశాబ్ద కాలంలో అన్న ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.లక్ష కోట్ల నుంచి రూ. 8 లక్షల కోట్లకు ఎగిసినప్పటికీ... అడ్డదిడ్డంగా ఎడాపెడా కంపెనీలు ఏర్పాటు చేస్తూ, సంబంధంలేని రంగాల్లోకి దూరేస్తూ.. అప్పులు పెంచుకుంటూ పోయిన అనిల్ అంబానీ సారథ్యంలోని అడాగ్ గ్రూప్ విలువ వేల కోట్ల స్థాయికి పడిపోయింది. పదేళ్ల క్రితం రూ. 1.7 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో అగ్రశ్రేణి సంస్థగా వెలుగొందిన ఫ్లాగ్ షిప్ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) ప్రస్తుతం దాదాపు రూ. 50,000 కోట్ల పైచిలుకు రుణాల భారంతో కుదేలై.. దివాలా తీసింది. గ్రూప్లోని మిగతా కంపెనీలు నానా తంటాలు పడుతున్నాయి. ఆర్కామ్ దివాలా ప్రకటనతో సోమవారం అడాగ్ గ్రూప్ సంస్థల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. గ్రూప్లో కీలకమైన అయిదు సంస్థల మార్కెట్ విలువ ఒక్క రోజే ఏకంగా రూ.5,831 కోట్ల మేర పడిపోయింది. ఈ నేపథ్యంలో సంక్షోభంలో చిక్కుకున్న అనిల్, అడాగ్ గ్రూప్ కంపెనీలు, కారణాలపై ‘సాక్షి’ బిజినెస్ విభాగం అందిస్తున్న ప్రత్యేక కథనమిది... సరి సమానంగా విభజన... వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ మరణానంతరం సోదరులిద్దరి మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోవటంతో 2005లో దాదాపు రూ.90,000 కోట్ల రిలయన్స్ సామ్రాజ్యం రెండుగా చీలిపోయింది. ఇందులో ముడిచమురు కంపెనీ అన్న ముకేశ్కు రాగా.. టెలికం, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫ్రా, పవర్ వంటి కీలక సంస్థలు అనిల్ చేతికి దక్కాయి. అవిభాజ్య గ్రూప్లో అనిల్ అంబానీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా (సీఎఫ్ఓ) వ్యవహరించేవారు. వ్యాపార భారాన్ని భుజాలపై మోయడం కన్నా.. డీల్స్ కుదర్చడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. కాకపోతే విభజన తరవాత భారీ సామ్రాజ్యాన్ని నిర్వహించాల్సిన బాధ్యత మీద పడటంతో.. ఆయన సామర్థ్యాలకు పరీక్ష మొదలైంది. సవాళ్లూ ఒక్కొక్కటిగా ఎదురవటం మొదలెట్టాయి. వ్యాపార విస్తరణ కాంక్షతో సంబంధం లేని రంగాల్లోకి కూడా చొచ్చుకుపోయారు అనిల్. చివరకు అప్పుల భారం పేరుకుపోయిన ఆర్కామ్ రూపంలో సంక్షోభం బయటపడింది. వచ్చే ఆదాయాలు వడ్డీలు కట్టడానికి కూడా సరిపోని పరిస్థితుల్లోకి గ్రూప్ దిగజారిపోయింది. ముంబైలో తొలి మెట్రో లైన్ నిర్మించిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ... గతేడాది ఆగస్టులో బాండ్లను చెల్లించలేక చేతులెత్తేసింది. 2008లో రికార్డ్ ఐపీవోకి వచ్చిన రిలయన్స్ పవర్ షేరు.. అప్పట్నుంచీ పడుతూనే ఉంది. కాస్త లాభసాటిగా ఉండే ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం రిలయన్స్ క్యాపిటల్కి కూడా కష్టాలు తప్పలేదు. మొత్తానికి సంక్షోభంలోకి పడిపోయిన కొన్ని గ్రూప్ కంపెనీలను చూస్తే.. ఆర్కామ్: కాల్ డిస్కనెక్ట్.. 2010లో 17% మార్కెట్ వాటాతో దేశీ టెలికంలో ఆర్కామ్ రెండో స్థానంలో ఉండేది. 2016లో అన్న ముకేశ్ ఎంట్రీ తర్వాత ఇది పదవ స్థానానికి పడిపోయి.. టాప్ కంపెనీల లిస్టు నుంచి తప్పుకుంది. ఒకప్పుడు రూ.1.7 లక్షల కోట్ల మార్కెట్ విలువతో అగ్రస్థానంలో వెలుగొందిన ఆర్కామ్ ఇప్పుడు రూ.45 వేల కోట్ల పైచిలుకు రుణ భారంలో ఉంది. చివరికి ప్రధానమైన మొబైల్ వ్యాపారాన్ని అన్న కంపెనీకే అమ్మేసినా.. స్పెక్ట్రం బాకీల వివాదంతో డీల్ ముందుకు సాగడం లేదు. బాకీలు ఎగ్గొట్టినందుకు కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ ఎరిక్సన్ వంటి కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి. 1.8 బిలియన్ డాలర్ల విదేశీ రుణాన్ని వసూలు చేసుకునేం దుకు చైనా డెవలప్మెంట్ బ్యాంక్ కూడా దివాలా పిటిషన్ వేసింది. సినిమా... అట్టర్ ఫ్లాప్ ఒకప్పటి సినీతార టీనా మునీమ్ను వివాహం చేసుకున్న అనిల్ అంబానీ .. తన అడాగ్ గ్రూప్ ద్వారా గ్లామర్ ప్రపంచ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు. ఫిలిమ్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్, పంపిణీ రంగాల్లోని యాడ్ ల్యాబ్స్ సంస్థ కొనుగోలుతో ఆరంభంలో భారీగానే విస్తరించారు. 2008 నాటికి దాదాపు 700 స్క్రీన్స్తో దేశంలోనే అతి పెద్ద మల్టీప్లెక్స్ ఆపరేటర్గా అనిల్ ఎదిగారు. కానీ 2014 నాటికి ఈ మీడియా వైభవం తగ్గిపోయింది. రుణాల భారం తగ్గించుకోవడానికి వందల కొద్దీ స్క్రీన్స్ను తెగనమ్ముకోవాల్సి వచ్చింది. సంబంధం లేని గ్లామర్ బిజినెస్లోకి దూకి అనిల్ దానిపై దృష్టి పెట్టడం వల్ల ప్రధాన గ్రూప్ కంపెనీల పనితీరు దెబ్బతిన్నదనే విమర్శలూ ఉన్నాయి. అసెట్స్ అమ్మకాలకు ఆటంకాలు.. మరోపక్క, అప్పుల భారాలను తగ్గించుకోవడానికి అనిల్ అంబానీ పెద్ద ఎత్తున అసెట్స్ను విక్రయిస్తున్నారు. ఇప్పటికే సిమెంట్, టెలికం టవర్స్ మొదలైన వాటిని అమ్మేశారు. కానీ.. ఒక్కో వ్యాపార విభాగంలో ఒక్కో సమస్య కారణంగా అసెట్స్ విక్రయం పూర్తి స్థాయిలో ముందుకు జరగడం లేదు. రూ. 1,00,000 కోట్లు.. 2018 మార్చి ఆఖరు నాటికి అడాగ్ రుణభారం ఇది. ఏటా వడ్డీల కిందే రూ. 10,000 కోట్లు. రూ. 4,00,000 కోట్లు.. గరిష్ట స్థాయిలో అడాగ్ గ్రూప్లోని 5 ప్రధాన సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్. ప్రస్తుతం రూ. 50 వేల కోట్ల కన్నా తక్కువకి పడిపోయింది. రక్షణ... బ్యాక్ ఫైర్! ఉన్న సమస్యలు సరిపోవన్నట్లు.. అనిల్ అంబానీ 2016లో పిపావవ్ మెరైన్ అండ్ ఆఫ్షోర్ (రిలయన్స్ నేవల్గా పేరు మారింది) యాజమాన్య వాటాలను కొనుక్కున్నారు. ఇది భారతీయ నేవీ కోసం యుద్ధనౌకల నిర్మాణం, మరమ్మతుల సర్వీసులు అందిస్తుంది. సమస్యల్లో ఉన్న ఇన్ఫ్రా నుంచి పుష్కలమైన అవకాశాలున్న డిఫెన్స్ వైపుగా వెడితే అడాగ్ను కాపాడుకోవచ్చని అనిల్ భావించారు. కానీ, ఈ ప్రయోగమూ దెబ్బతింది. అయినా.. అసలు భారీ నష్టాలు, అప్పులతో కుదేలైన ఈ సంస్థను ఎందుకు కొన్నారనేది ఎవరికీ అర్థం కాలేదు. రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి ఫ్రాన్స్ కంపెనీ డస్సాల్ట్తో ఈ కంపెనీ జట్టు కట్టడంపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. అనిల్ అంబానీకి మేలు చేసేందుకు ప్రభుత్వమే ఈ రెండింటి మధ్య డీల్ కుదిర్చిందంటూ విపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. 45 బిలియన్ డాలర్ల వ్యత్యాసం.. ఫోర్బ్స్ మ్యాగజైన్ గణాంకాల ప్రకారం 2007లో అనిల్ సంపద 45 బిలియన్ డాలర్లు. అన్న ముకేశ్ సంపద 49 బిలియన్ డాలర్లు. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 2018కి వస్తే ఫోర్బ్స్ ఇండియా కుబేరుల లిస్టులో ముకేశ్ 47.3 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా.. 2.44 బిలియన్ డాలర్ల సంపదతో అనిల్ 66వ స్థానానికి పడిపోయారు. అసలెక్కడ తేడా కొట్టింది..? కేవలం దశాబ్దం కాలంలో అనిల్ సామ్రాజ్యం కుప్పకూలడానికి దారి తీసిన కారణాలేంటి. డీల్ మేకర్గా, వ్యాపార నిర్వహణలో ఇన్వెస్టర్ల నమ్మకం చూరగొన్న అనిల్ అంబానీ గ్రాఫ్ ఎందుకిలా పడిపోయింది? 2008లో రికార్డు స్థాయిలో రిలయన్స్ పవర్ రూ.11,500 కోట్ల నిధుల కోసం ఐపీఓకు వచ్చినపుడు... అది రికార్డు స్థాయిలో 70 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయింది. మరలాంటప్పుడు.. ఎక్కడ తేడా కొట్టింది? నిర్వహణ లోపమా? సమర్థమంతమైన టీమ్ లేకపోవడం వల్లా? లేదా ఒకదానితో మరొక దానికి సంబంధం లేకుండా కుప్పతెప్పలుగా కంపెనీలు పెట్టేయడం వల్లా? లేదా ఎకాయెకిన ఆకాశానికి నిచ్చెనలేసేయాలన్న అత్యుత్సాహంతో దొరికిన చోటల్లా అడ్డగోలుగా అప్పులు చేసేసి.. రుణభారం పెంచేసుకోవడం వల్లా? వ్యాపార పరిస్థితులు పూర్తిగా దెబ్బతినడం వల్లా? తరచి చూస్తే సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ప్రధాన కారణాల గురించి వెతుక్కుంటూ పోతే అంతు ఉండదన్నది పరిశీలకుల అభిప్రాయం. అయితే, అన్నింటికీ వ్యాపార పరిస్థితులు బాగా లేకపోవడం, దురదృష్టం అనుకోవడానికి ఉండదని.. ఆయన ప్రారంభించిన అనేక కంపెనీలే ఒకదాన్ని మరొకటి దెబ్బతీశాయని.. వాటాదారుల ప్రయోజనాలను ఘోరంగా దెబ్బతీశాయని విమర్శలు వస్తున్నాయి. కాస్తంత ఇబ్బందికరమైనదే అయినా.. సోషల్ మీడియా యాప్స్లో అన్నదమ్ములపై ఒక సెటైర్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అన్న ముకేశ్ అంటే ’ము–క్యాష్’ (డబ్బుల మూట) అని, తమ్ముడు అనిల్ అంటే ’అ–నిల్’ (సున్నా) అంటూ వ్యంగ్యోక్తులు కూడా నడిచాయి. -
అనిల్ అంబానీని జైల్లో పెట్టండి!!
న్యూఢిల్లీ: దాదాపు 550 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడంలో పలుమార్లు విఫలమైన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) చీఫ్ అనిల్ అంబానీపై స్వీడన్ టెలికం పరికరాల దిగ్గజం ఎరిక్సన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ బాకీలు చెల్లించడంలో డిఫాల్ట్ అవుతున్న ఆయన్ను కోర్టు ధిక్కరణ నేరం కింద జైలుకు పంపాలని, బాకీలు చెల్లించేదాకా దేశం విడిచి వెళ్లకుండా ఆదేశాలివ్వాలని అభ్యర్థించింది. ఈ మేరకు ఒక ఆంగ్ల ఫైనాన్షియల్ డెయిలీ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆర్కామ్ జరపాల్సిన చెల్లింపులకు సంబంధించి అనిల్ అంబానీ వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వడంతో దీని ఆధారంగానే ఎరిక్సన్ కోర్టును ఆశ్రయించింది. మరోవైపు, స్పెక్ట్రం విక్రయాన్ని జాప్యం చేయడంపై టెలికం శాఖపై (డాట్) ఆర్కామ్ కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేసింది. స్పెక్ట్రం విక్రయంలో డాట్ జాప్యం చేయకుండా ఉండి ఉంటే ఎరికన్స్, ఇతర రుణదాతల బకాయిలు తీర్చేసేందుకు ఉపయోగకరంగా ఉండేదని పేర్కొంది. ఈ రెండు పిటీషన్లపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరపనుంది. ‘ఆర్కామ్తో పాటు తత్సంబంధిత వర్గాలు సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో తాజాగా మరో పిటిషన్ వేయాల్సి వచ్చింది. మేం చాలా కాలంగా బాకీల చెల్లింపు కోసం ఎదురుచూస్తున్నాం. కానీ వారు చెల్లించకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరించారు. కోర్టు ఆదేశాల ధిక్కరణ రుజువైన పక్షంలో ఆరు నెలల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది‘ అని ఎరిక్సన్ తరఫు న్యాయవాది అనిల్ ఖేర్ తెలిపారు. స్పెక్ట్రం విక్రయంపై ఆర్కామ్ ఆశలు.. ఎరిక్సన్కు రూ.550 కోట్ల బకాయిలు చెల్లించడంలో ఆర్కామ్ విఫలం కావడం ఇది రెండోసారి. తొలిసారి డిఫాల్ట్ అయిన తర్వాత ఆర్కామ్కు సుప్రీం కోర్టు మరో అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 15లోగా ఏటా 12 శాతం వడ్డీ రేటుతో బాకీలు చెల్లించాలని ఆదేశించింది. కానీ ఆర్కామ్ రెండో సారి కూడా విఫలమైంది. మరో టెలికం సంస్థ రిలయన్స్ జియోకు వైర్లెస్ స్పెక్ట్రంను విక్రయించడం ద్వారా వచ్చే నిధులతో రుణదాతలకు బకాయిలు చెల్లించేయాలని ఆర్కామ్ ఆశిస్తోంది. అయితే, ఆర్కామ్ బాకీలకు బాధ్యత వహించడానికి జియో సిద్ధంగా లేనందున కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ స్పెక్ట్రం డీల్కు అనుమతించలేమంటూ డిసెంబర్ నెలలో టెలికం శాఖ తోసిపుచ్చింది. ఈ పరిణామాల దరిమిలా ఆర్కామ్, ఎరిక్సన్ వివాదం మరోమారు కోర్టుకెక్కింది. మరోవైపు, ఇరు కంపెనీల మధ్య స్పెక్ట్రం డీల్కు సంబంధించిన ప్రక్రియపై స్పష్టతనివ్వాలంటూ రిలయన్స్ జియో, రిలయన్స్ కమ్యూనికేషన్స్ కలిసి కేంద్ర టెలికం శాఖకు లేఖ రాసినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్పెక్ట్రంనకు సంబంధించిన బకాయీలను తీర్చే బాధ్యత ఆర్కామే తీసుకుంటోందని జియో తెలిపినట్లు వివరించాయి. ఈ నేపథ్యంలో ఆర్కామ్తో స్పెక్ట్రం ట్రేడింగ్ ఒప్పందం కుదుర్చుకోవడానికి తాము సిద్ధమేనని జియో స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి. స్పెక్ట్రం విక్రయం ద్వారా రిలయన్స్ జియో నుంచి వచ్చే రూ. 975 కోట్లలో ఎరిక్సన్కు రూ. 550 కోట్లు, మైనారిటీ వాటాదారైన రిలయన్స్ ఇన్ఫ్రాటెల్కు రూ. 230 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆర్కామ్ యోచిస్తోంది. వివాదమిదీ.. దేశవ్యాప్తంగా ఆర్కామ్ టెలికం నెట్వర్క్ నిర్వహణకు సంబంధించి 2014లో ఎరిక్సన్ ఏడేళ్ల కాంట్రాక్టు దక్కించుకుంది. అయితే, 2016 నుంచి చెల్లింపులు నిల్చిపోవడంతో సెప్టెంబర్ 2017లో ఆర్కామ్తో పాటు ఆ గ్రూప్లో భాగమైన రిలయన్స్ ఇన్ఫ్రాటెల్, రిలయన్స్ టెలికంలపై ఎరిక్సన్.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను (ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ వేసింది. ఆర్కామ్ నుంచి తమకు రూ. 978 కోట్లు రావాలని, నోటీసులిచ్చినా చెల్లింపులు జరపకపోవడంతో ఇది రూ.1,600 కోట్లకు పెరిగిందని ఎరిక్సన్ పేర్కొంది. అయితే, దీనిపై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీని ఆర్కామ్ ఆశ్రయించగా.. దివాలా చర్యలపై స్టే విధించింది. సెటిల్మెంట్ ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ ఆఖరు నాటికి ఎరిక్సన్కు రూ.550 కోట్లు కట్టాలని ఎన్సీఎల్ఏటీ ఆదేశించింది. కానీ, గడువులోగా ఆర్కామ్ కట్టకపోవడంతో ఎరిక్సన్ మళ్లీ కోర్టుకెళ్లింది. దీంతో ఈసారి న్యాయస్థానం డిసెంబర్ 15 దాకా గడువిచ్చింది. ఆర్కామ్ ఈసారి కూడా డిఫాల్ట్ కావడంతో ఎరిక్సన్ మళ్లీ కోర్టునాశ్రయించింది. ప్రస్తుతం ఆర్కామ్ రుణ భారం రూ. 46,000 కోట్ల పైచిలుకు ఉంది. అనిల్ అంబానీ ప్రణాళిక ప్రకారం రిలయన్స్ జియో తదితర సంస్థలకు ఆర్కామ్ అసెట్స్ విక్రయానంతరం ఇది సుమారు రూ.6,000 కోట్లకు తగ్గవచ్చని అంచనా. అయితే, స్పెక్ట్రం ట్రేడింగ్కు సంబంధించి టెలికం శాఖ నుంచి అనుమతులు వీటికి కీలకం. ఆర్కామ్ ప్రభుత్వానికి కట్టాల్సిన స్పెక్ట్రం బకాయిలకు రిలయన్స్ జియో బాధ్యత వహించడానికి ఇష్టపడకపోవడంతో.. డాట్ నుంచి అనుమతులు రావడం లేదు. న్యాయస్థానం ఆదేశాలున్నా డాట్ కావాలనే జాప్యం చేస్తోందని, దీనివల్ల తాము రుణదాతలకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోవడం వల్ల అన్ని వర్గాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్కామ్ వాదిస్తోంది. -
‘టెలికం’కు ఆర్కామ్ గుడ్బై...
ముంబై: ఒకప్పుడు టెలికం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) మొత్తానికి ఆ వ్యాపారం నుంచే పూర్తిగా వైదొలగనుంది. ఇకపై భవిష్యత్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. మంగళవారం జరిగిన ఆర్కామ్ 14వ వార్షిక సాధారణ సమావేశంలో .. రిలయన్స్ గ్రూప్ (అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. అన్నింటికన్నా ముందుగా ఆర్కామ్కు ఉన్న రూ. 40,000 కోట్ల రుణభారాన్ని పరిష్కరించుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ’ టెలికం రంగం భవిష్యత్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రంగంలో ఇక కొనసాగరాదని నిర్ణయించుకున్నాం. ఇంకా చాలా కంపెనీలు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాయి. భవిష్యత్లో రిలయన్స్ రియల్టీ ఈ సంస్థకు వృద్ధి చోదకంగా ఉండనుంది’ అని అనిల్ అంబానీ పేర్కొన్నారు. ముంబై శివార్లలో ఉన్న 133 ఎకరాల ధీరుభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీ (డీఏకేసీ) గురించి ప్రస్తావిస్తూ.. ఈ సైట్ ద్వారా దాదాపు రూ. 25,000 కోట్ల మేర విలువను సృష్టించేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని అంబానీ చెప్పారు. అన్న ముకేశ్కు థ్యాంక్స్.. కంపెనీ రుణభారానికి మరికొద్ది నెలల్లో తగు పరిష్కార మార్గం లభించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టెలికం ఇన్ఫ్రా, ఫైబర్ వ్యాపారాలను రిలయన్స్ జియోకి విక్రయించే ప్రక్రియ తుది దశలో ఉందని.. ఇలాగే ఇతరత్రా విభాగాల విక్రయం తదితర చర్యలతో నిధులు సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉన్నామని అనిల్ అంబానీ చెప్పారు. స్పెక్ట్రం షేరింగ్, ట్రేడింగ్కు సంబంధించి టెలికం శాఖ నుంచి తుది అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. అప్పట్లో అవిభాజ్య రిలయన్స్ గ్రూప్ను టెలికం రంగం వైపు నడిపించడంతో పాటు ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న ఆర్కామ్ అసెట్స్ను కొనుగోలు చేయడం ద్వారా ఇప్పుడు కూడా ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్న పెద్దన్న ముకేశ్ అంబానీకి అనిల్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ’వ్యక్తిగతంగా నాకు, ఆర్కామ్కు, .. మార్గనిర్దేశనం చేసి, తోడ్పాటు అందించిన నా సోదరుడు ముకేశ్ భాయ్ అంబానీకి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఇది సరైన సమయం’ అని అనిల్ పేర్కొన్నారు. టెలికం రంగంలో సృజనాత్మక విధ్వంసం జరుగుతోందని.. సాముదాయిక గుత్తాధిపత్యానికి దారి తీసిందని అనిల్ చెప్పారు. తర్వాత రోజుల్లో ఇది ద్విదాధిపత్యం (రెండే కంపెనీల ఆధిపత్యం), అటు పైన పూర్తి గుత్తాధిపత్యానికి కూడా దారితీయొచ్చని అనిల్ అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్ సామ్రాజ్యం విభజన అనంతరం టెలికంతో పాటు కొన్ని విభాగాలు అనిల్ అంబానీకి, రిఫైనరీ తదితర వ్యాపార విభాగాలు ముకేశ్ అంబానీకి లభించిన సంగతి తెలిసిందే. ముకేశ్ అంబానీ తాజాగా మళ్లీ రిలయన్స్ జియోతో.. టెలికం రంగంలోకి ప్రవేశించారు. రిలయన్స్ రియల్టీ.. మొబైల్ వ్యాపార విభాగాన్ని జియోకి విక్రయించేసిన తర్వాత ఆర్కామ్ ప్రస్తుతం ఎంటర్ప్రైజ్, డేటా సెంటర్స్, అండర్సీ కేబుల్స్ మొదలైన వ్యాపార విభాగాల ద్వారా 35,000 సంస్థలకు సర్వీసులు అందిస్తోందని అనిల్ అంబానీ చెప్పారు. వీటన్నింటి నుంచి వైదొలగడంతో పాటు బ్యాంకులకు రుణాలను తిరిగి చెల్లించడానికి కూడా ఆర్కామ్ కట్టుబడి ఉందని.. దీనిపై తగు సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆర్కామ్కు అనుబంధ సంస్థగా ఏర్పాటైన రిలయన్స్ రిటైల్.. నవీ ముంబైలోని డీఏకేసీని అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. కంపెనీకి ముప్పై లక్షల చ.అ.ల బిల్టప్ స్పేస్ ఉందని.. దీన్ని బహుళజాతి సంస్థలకు లీజుకివ్వనున్నామని అనిల్ చెప్పారు. తొలి ఏడాది నుంచే వీటిపై ఆదాయాలు రాగలవన్నారు. ఆర్థికేతర వ్యాపారాల నుంచి రిలయన్స్ క్యాపిటల్ నిష్క్రమణ.. రిలయన్స్ క్యాపిటల్ వచ్చే 12–18 నెలల్లో ఆర్థికేతర వ్యాపార విభాగాల నుంచి వైదొలగడం ద్వారా రుణభారం తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు కంపెనీ 32వ వార్షిక సాధారణ సమావేశంలో చైర్మన్ అనిల్ అంబానీ తెలిపారు. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ను ఈ ఆర్థిక సంవత్సరంలోనే లిస్టింగ్ చేయాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. రిలయన్స్ క్యాపిటల్కి ప్రస్తుతం అసెట్ మేనేజ్మెంట్, బీమా, గృహ.. వాణిజ్యరుణాలు, ఈక్విటీలు.. కమోడిటీల బ్రోకింగ్ వ్యాపారాలు ఉన్నాయి. తమ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థలో గణనీయమైన వాటాల కొనుగోలు కోసం వ్యూహాత్మక భాగస్వామితో చర్చలు జరుగుతున్నాయని.. మరికొద్ది నెలల్లో ఈ డీల్ పూర్తి కాగలదని అనిల్ పేర్కొన్నారు. మరోవైపు ఈ త్రైమాసికంలో రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ను కూడా ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ ఈడీ అన్మోల్ అంబానీ తెలిపారు. మరోవైపు, ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఉత్తర్వుల తర్వాత కూడా చెల్లింపులు జరపకుండా ప్రభుత్వ విభాగాలు జాప్యం చేస్తున్నాయంటూ రిలయన్స్ ఇన్ఫ్రా వార్షిక సాధారణ సమావేశంలో పాల్గొన్న అనిల్ అంబానీ ఆరోపించారు. దీనివల్ల తమకు రావాల్సిన దాదాపు రూ. 8,000 కోట్ల బకాయిలు నిల్చిపోయాయని ఆయన పేర్కొన్నారు. -
అన్నకు 2వేల కోట్ల ఆస్తులు అమ్మేసిన తమ్ముడు
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. తన తమ్ముడు రిలయన్స్ కమ్యూనికేషన్ ఆస్తులను ఇతరుల చేతుల్లోకి వెళ్లనీయకుండా తానే దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలో అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న అనిల్ అంబానీ.. ప్రణాళిక ప్రకారం మీడియా కన్వెర్జెన్స్నోడ్స్(ఎంసీఎన్)ను, సంబంధిత మౌలిక సదుపాయాలను తన అన్న కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్కు అమ్మేసినట్టు ప్రకటించారు. వీటి విలువ 2000 వేల కోట్ల రూపాయలు. మొత్తం రూ.2000కోట్ల విలువైన ఆస్తులను ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు అమ్మే ప్రక్రియ పూర్తయినట్లు అనిల్ అంబానీ గురువారం వెల్లడించారు. 248 నోడ్స్ దాదాపు 5 మిలియన్ల చదరపు అడుగుల ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. వీటిని టెలికాం మౌలిక వసతుల కోసం ఉపయోగిస్తున్నారు. వీటన్నింటిన్నీ ప్రస్తుతం జియోకు బదిలీ చేసినట్లు ఆర్కామ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల మొదట్లో కూడా తన రూ.250 బిలియన్(రూ.25000 కోట్ల) ఆస్తుల అమ్మకపు ప్రణాళిక ప్రక్రియ నడుస్తుందని ఆర్కామ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘మా ఎంసీఎన్, సంబంధిత మౌలిక సదుపాయల ఆస్తులను రూ.20 బిలియన్లకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్కు అమ్మే ప్రక్రియ పూర్తయిందని రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ నేడు ప్రకటిస్తుంద’ని ఆర్కామ్ పేర్కొంది. గత ఏడాది అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్.. రిలయన్స్ జియోతో ఒప్పందం కుదర్చుకుంది. భారీగా తనకున్న అప్పులను తగ్గించుకునేందుకు ఆర్కామ్ వైర్లెస్ స్పెక్ట్రమ్, టవర్, ఫైబర్ అండ్ ఎంసీఎన్ ఆస్తులను జియోకు అమ్మేందుకు అంగీకరించింది. 2017 డిసెంబరులోనే ఈ డీల్ ప్రకటించారు. 122.4 మెగా హెడ్జ్ 4జీ స్పెక్ట్రమ్, 43000కు పైగా టవర్లు, 1,78,000 కిలోమీటర్ల ఫైబర్, 248 మీడియా కన్వర్జెన్స్ నోడ్స్ ఈ అమ్మకపు డీల్లో ఉన్నాయి. అతిపెద్ద ఈ డీల్లో ప్రణాళిక ప్రకారం నేడు నోడ్స్ అమ్మకం పూర్తయినట్టు రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రకటించింది. -
సుప్రీంలో ఆర్కామ్కు చుక్కెదురు!
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తుల విక్రయ ప్రయత్నాలకు గండిపడింది. తీవ్ర రుణ భారంతో ఉన్న ఆర్కామ్, తనకున్న టెలికం ఆస్తులను విక్రయించి అప్పులు తీరుద్దామనే ప్రణాళికతో ఉంది. అయితే, ఆస్తుల విక్రయంపై బోంబే హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయడానికి జస్టిస్ ఆదర్శ్ గోయెల్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ యూయూ లలిత్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. యథాతథ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేస్తూ ఆర్కామ్, ఆ సంస్థకు రుణాలిచ్చిన ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కూటమి దాఖలు చేసిన పిటిషన్లపై తుది విచారణను ఏప్రిల్ 5న నిర్వహిస్తామని పేర్కొంది. ఆర్కామ్ బ్యాంకులకు రూ.42,000 కోట్లు బకాయి పడి ఉంది. ఎస్బీఐ, 24 ఇతర దేశీయ రుణ దాతలు ఆర్కామ్కు రుణాలివ్వడంతో అవన్నీ కూటమిగా ఏర్పడి ఆర్కామ్ కన్సాలిడేటెడ్ ఆస్తులను విక్రయించే ప్రక్రియను చేపట్టాయి. ఆర్కామ్కు చెందిన స్పెక్ట్రం, సెల్ టవర్లు, ఇతర సదుపాయాలను కొనుగోలు చేస్తానని రిలయన్స్ జియో ఆసక్తి చూపింది. ఇంతలోనే ఎరిక్సన్ సంస్థ ఆర్కామ్ రూ.1,150 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉందని, ఆస్తుల విక్రయాలు జరగకుండా నిరోధించాలంటూ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్కు వెళ్లి స్టే తెచ్చుకుంది. ఆ తర్వాత బోంబే హైకోర్టు స్టే ఆదేశాలను సమర్థించింది. దీంతో ఆర్కామ్, బ్యాంకుల కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రుణదాతల తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, బ్యాంకులు ఇచ్చింది సెక్యూర్డ్ రుణాలు కనుక వారి క్లెయిమ్కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఎరిక్సన్ తరఫు న్యాయవాది మాత్రం స్టే ఎత్తివేస్తే తాము బకాయిలు వసూలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని కోర్టుకు తెలిపారు. దీంతో ఇది చాలా పెద్ద అంశం అయినందున, వాదనలు వినాల్సి ఉందని, అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది. ఆస్తుల విక్రయాన్ని వేగంగా పూర్తి చేస్తాం: ఆర్కామ్ సుప్రీంకోర్టులో తక్షణ ఉపశమనం లభించకపోయినప్పటికీ, ఆస్తుల విక్రయాన్ని వేగవంతం చేస్తామని ఆర్కామ్ తెలిపింది. ఆర్బీఐ నిర్దేశించినట్టు ఆగస్ట్ 31లోపు తమ ఆస్తుల విక్రయాన్ని పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. -
జియో చేతికి ‘ఆర్కామ్’
న్యూఢిల్లీ: అందరి అంచనాలకు అనుగుణంగానే తమ్ముడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తులను అన్న ముకేశ్ అంబానీ టెలికం కంపెనీ రిలయన్స్ జియో కొనుగోలు చేయనుంది. ఆర్కామ్కు చెందిన స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్, మీడియా కన్వర్జన్స్ నోడ్స్ను (ఎంసీఎన్) రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కొనుగోలు చేయబోతోంది. ఈ మేరకు ఒక నిశ్చయాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని రిలయన్స్ జియో తెలిపింది. ఇరు కంపెనీలు ఈ డీల్కు సంబంధించిన ఆర్థిక వివరాలను వెల్లడించనప్పటికీ, ఈ డీల్ విలువ రూ.24,000 – 25,000 కోట్ల శ్రేణిలో ఉండొచ్చని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఆస్తుల విక్రయం రూ.45,000 కోట్ల రుణ భారంతో కుదేలైన ఆర్కామ్కు ఊరటనిచ్చే విషయమే. ఈ డీల్ వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనా. అనిల్ అంబానీ తాజా రుణ పునర్వ్యవస్థీకరణను ప్రకటించిన రెండు రోజుల్లోనే ఈ డీల్ కుదరడం, రిలయన్స్ వ్యవస్థాపకులు, ధీరూభాయ్ అంబానీ 85వ జయంతి రోజున (గురువారం) వెల్లడి కావడం విశేషం. సరైన సమయంలో అదనపు వివరాలు... ఆర్కామ్ ఆస్తుల విక్రయ ప్రక్రియను నిర్వహించడానికి ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ సంస్థను ఆర్కామ్ నియమించినట్లు రిలయన్స్ జియో తెలిపింది. ఈ ఆస్తుల కొనుగోళ్లకు గాను రెండు దశల బిడ్డింగ్ ప్రక్రియలో తమ కంపెనీకే విజయం దక్కిందని పేర్కొంది. ఈ ఆస్తుల కొనుగోళ్ల కారణంగా తాము భారీ స్థాయిలో వైర్లెస్, ఫైబర్–టు–హోమ్, ఎంటర్ప్రైజెస్ సేవలందించడానికి వీలవుతుందని వివరించింది. ఈ కొనుగోళ్లకు ప్రభుత్వం నుంచి, వివిధ అధికారిక సంస్థల నుంచి రుణ దాతల నుంచి ఆమోదాలు పొందాల్సి ఉంది. ఒప్పందం ప్రకారం కొన్ని విషయాల్లో గోప్యత పాటించాల్సి వస్తుందని, సరైన సమయంలో ఇతర అదనపు వివరాలను వెల్లడిస్తామని పేర్కొంది. కాగా రిలయన్స్ జియోకు 16 కోట్ల మంది వినియోగదారులున్నారు. ఆర్కామ్ ఆస్తుల కొనుగోలు ప్రక్రియలో వివిధ సంస్థలు రిలయన్స్ జియోకు సలహా సేవలనందించాయి. గోల్డ్మన్ శాక్స్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, జేఎమ్ ఫైనాన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, డేవిస్పాక్ అండ్ వార్డ్వెల్ ఎల్ఎల్పీ, సిరిల్ అమర్చంద మంగళ్దాస్, ఖైతాన్ అండ్ కో, ఎర్నస్ట్ అండ్ యంగ్లు సలహాదారులుగా వ్యవహరించాయి. రుణభారం తగ్గించుకుంటాం... ఈ డీల్లో భాగంగా రిలయన్స్ జియో నగదు చెల్లిస్తుందని, దీంతో పాటు టెలికం డిపార్ట్మెంట్కు చెల్లించాల్సిన వాయిదా పడిన స్పెక్ట్రమ్ వాయిదాలను కూడా చెల్లిస్తుందని ఆర్కామ్ తెలిపింది. ఈ డీల్ ద్వారా వచ్చిన సొమ్ములను రుణ భారం తగ్గించుకోవడానికే వినియోగిస్తామని పేర్కొంది. నిర్వహణ వ్యయాలు భరించే స్తోమత లేకపోవడంతో నెల క్రితం ఆర్కామ్ మొబైల్ వాయిస్ వ్యాపారాన్ని మూసేసింది. కాగా గతంలో రూపొందించిన కొంత వాటాను బ్యాంక్లకు ఈక్విటీగా మార్చే రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను రద్దు చేస్తున్నామని ఈ వారం మొదట్లోనే ఆర్కామ్ వెల్లడించిన విషయం తెలిసిందే. రుణదాతలకు ఎలాంటి ఈక్విటీ కేటాయింపుల్లేని తాజా రుణ ప్రణాళికను అనిల్ అంబానీ ప్రకటించారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఆర్కామ్కు వ్యతిరేకంగా దివాలా పిటిషన్ను దాఖలు చేసిన చైనా డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఈ తాజా రుణప్రణాళికకు ఆమోదం తెలిపింది. షేరు... పరుగో పరుగు స్టాక్ మార్కెట్లో ఆర్కామ్ షేరు జోరు కొనసాగుతోం ది. అనిల్ అంబానీ రుణ ప్రణాళికను ప్రకటించిన రోజు నుంచి ఈ షేర్ పెరుగుతూనే ఉంది. గత రెండు రోజుల్లో 60 శాతానికి పైగా ఎగసిన ఈ షేర్ గురువారం మరో 8 శాతం లాభపడి రూ.31 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 18 శాతం లాభంతో రూ.34ను తాకింది. మొత్తం మీద గత మూడు రోజుల్లో ఈ షేర్ దాదాపు 70 శాతం పెరిగింది. గత వారంలో రూ.3,000 కోట్ల మేర మాత్రమే ఉన్న ఆర్కామ్ మార్కెట్ విలువ గురువారం రోజు రూ.8,562 కోట్లకు ఎగసింది. జియో పరమవుతున్న ఆర్కామ్ ఆస్తులు ►43,000 టెలికం టవర్లు ►1,78,000 కి.మీ. ఫైబర్ నెట్వర్క్ ►5 మిలియన్ చదరపుటడుగుల స్థలంలో విస్తరించిన 248 మీడియా కన్వర్జన్స్ నోడ్స్, ►800/900/1800/2100 మెగాహెట్జ్ బాండ్స్లో 122.4 మెగాహెడ్జ్ 4జీ స్పెక్ట్రమ్ -
2జీ ఆపరేషన్స్ క్లోజ్: ఆర్కామ్ ఢమాల్
ముంబై : అప్పులతో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్, తన 2జీ ఆపరేషన్స్కు గుడ్బై చెబుతున్న క్రమంలో ఈ కంపెనీ షేర్లు అతలాకుతలమవుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఆర్కామ్ షేర్లు కుప్పకూలాయి. నేటి ట్రేడింగ్లో సుమారు 5 శాతం మేర ఆర్కామ్ షేర్లు కిందకి పడిపోయాయి. ప్రారంభంలోనే బలహీనంగా ఎంట్రీ ఇచ్చిన ఆర్కామ్ షేర్లు, బీఎస్ఈ ఎక్స్చేంజ్లో మరింత కిందకి దిగజారి 52 వారాల కనిష్ట స్థాయిల్లో 4.55 శాతం నష్టంలో రూ.15.70 వద్ద ట్రేడవుతున్నాయి. అంతేకాక ఎన్ఎస్ఈలో 4.86 శాతం నష్టంలో ఏడాది కనిష్ట స్థాయిలను నమోదుచేస్తున్నాయి. నిన్నటి ట్రేడింగ్లో కూడా ఆర్కామ్ షేర్లు 3 శాతం నష్టాలను గడించాయి. నవంబర్ 30 వరకు తమ టెలిఫోనీ వ్యాపారలను మూసివేయాలని ఆర్కామ్ ప్లాన్స్ వేస్తోంది. కేవలం 4జీ ఇంటర్నెట్ సర్వీసులపైనే ఇది దృష్టిసారించనుంది. దీంతో వేల మంది ఉద్యోగులు కూడా రోడ్డున పడబోతున్నారు. 1200 మంది ఉద్యోగులను తీసివేయాలని ఆర్కామ్ చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యాపారాల మూత 5000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుందని హెడ్హంటర్స్ ఇండియా అంచనావేస్తోంది. తమ నవంబర్ వేతనాలను నెలన్నర ఆలస్యం చేస్తున్నట్టు ఉద్యోగులు కూడా తెలిపారు. జనవరి 15న ఫుల్ సెటిల్మెంట్తో ఉద్యోగులకు వేతనాలను ఇవ్వనున్నట్టు రిలయన్స్ టెలికాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుర్దీప్ సింగ్ తెలిపారు. -
అంబానీకి భారీ ఊరట
ముంబై: అనీల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ లో భాగమైన టెలికమ్యూనికేషన్స్ క్యారియర్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ టెలికం టవర్ల బిజినెస్ విక్రయంలో విజయం సాధించింది. మొబైల్ ఫోన్ టవర్ వ్యాపారంలో వాటాను కెనడా ఆధారిత బ్రూక్ ఫీల్డ్ కంపెనీ విక్రయానికి ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఆమోదం లభించింది. దీంతోపాటు ఎయిర్సెల్ విలీనానికి కూడా అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు భారతి ఇన్ ఫ్రాటెల్, ఎరిక్సన్, జీటీఎల్ అభ్యంతరాలను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. దీంతో అప్పుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్కాంకు భారీ ఊరట లభించింది. మరోవైపు ఈ వార్తలతో స్టాక్మార్కెట్ లోఆర్కాం కౌంటర్ 17శాతం ఎగిసింది. కాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) సంస్థ టెలికం టవర్ వ్యాపారంలో 51 శాతం వాటాను కెనడాకు చెందిన బ్రూక్ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్కు విక్రయించనుంది. ఈ డీల్ విలువ రూ.11,000 కోట్లు. ఈ వాటాను రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ నుంచి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)కు బదిలీ చేస్తామని, ఈ ఎస్పీవీపై యాజమాన్య హక్కులు బ్రూక్ఫీల్డ్కు ఉంటాయని ఆర్కామ్ వివరించింది. ఈ డీల్ ద్వారా వచ్చే నిధులను రుణభారాన్ని తగ్గించుకోవడానికి వినియోగిస్తామని పేర్కొంది. ఎయిర్ సెల్ ఆర్కాం విలీనానాకి రెగ్యులేటరీ సంస్థల ఆమోదం ఇప్పటికే లభించింది. -
టెల్కోల గుట్టు రట్టు చేసిన కాగ్
న్యూఢిల్లీ : భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ల వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీల గట్టును కాగ్ రట్టు చేసింది. 2010-11, 2014-15 మధ్య కాలంలో వీరు తక్కువ చేసి చూపించిన రెవెన్యూ విలువపై కాగ్ ఓ నివేదిక రూపొందించి పార్లమెంట్కి సమర్పించింది. ఈ రిపోర్టులో ఆరు ప్రైవేట్ టెలికాం కంపెనీలు రూ.61,064.5 కోట్ల రెవెన్యూలను తక్కువ చేసి చూపించినట్టు తెలిపింది. దీంతో ప్రభుత్వానికి రూ.7,697.6 కోట్ల చెల్లింపులు తగ్గిపోయాయని కాగ్ పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) శుక్రవారంపార్లమెంట్లో సమర్పించింది. కాగ్ తన ఆడిట్లో ఆరు ఆపరేటర్లు అడ్జెస్టడ్ గ్రాస్ రెవెన్యూలు మొత్తం రూ. 61,064.56 కోట్లకు తగ్గించి చూపించాయని పేర్కొంది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్సెల్ వంటి ఐదు ఆపరేటర్లకు సంబంధించిన 2010-11 నుంచి 2014-15 కాల ఆడిట్ రిపోర్టులో ఇవి బయటపడగా.. సిస్టెమా శ్యామ్ అనే కంపెనీ 2006-07 నుంచి 2014-15 ఈ చర్యకు పాల్పడిందని తెలిసింది. రెవెన్యూ షేరును తక్కువ చేసి చూపించడంతో ప్రభుత్వం భారీ మొత్తంలోనే చెల్లింపులను పోగట్టుకుందని కాగ్ రిపోర్టు తేల్చింది. -
అన్ని కోట్లు పోయినా..అంబానీయే...
దిగ్గజ టెలికం సంస్థగా వెలుగొందిన రిలయన్స్ కమ్యూనికేషన్ కుప్పకుప్పలుగా రుణభారం పెరిగిపోయిందని, ప్రత్యర్థి కంపెనీల నుంచి విపరీతమైన పోటీ వాతావరణం నెలకొందని ఇటీవల విపరీతంగా వార్తలొచ్చాయి. దీంతో రేటింగ్ ఏజెన్సీలు కూడా కంపెనీ బాండ్ల రేటింగ్ ను డౌన్ గ్రేడ్ చేశాయి. వీటన్నంటికీ తోడు నిరాశజనమైన ఆర్థిక ఫలితాలు.. కంపెనీ మార్కెట్ విలువను భారీగా దెబ్బతీశాయి. వైర్ లెస్ యూనిట్ షేర్లు 39 శాతం మేర పడిపోవడంతో దాన్ని మార్కెట్ విలువ రూ.3,310 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఆర్ కామ్ దెబ్బతో ఇన్ని పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ మాత్రం ఇంకా ధనవంతుడిగానే కొనసాగుతున్నారని బ్లూమ్ బర్గ్ రిపోర్టు చేసింది. ఆయన నికర సంపద ఏకంగా 82 మిలియన్ డాలర్ల(రూ.528కోట్లు) నుంచి 2.7 బిలియన్లకు(రూ.17,400కోట్లకు) పెరిగినట్టు బ్లూమ్ బర్గ్ బిలీనియర్ ఇండెక్స్ లో వెల్లడించింది. అంబానీకి చెందిన వైర్ లెస్ బిజినెస్ లు పడిపోయినప్పటికీ, రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ భారీగా వృద్ధి చెందినట్టు పేర్కొంది. ఇవి టెలికాం యూనిట్ బిజినెస్ లనుంచి వచ్చే ప్రభావాన్ని అధిగమించాయని తెలిపింది. అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ బిజినెస్ లు కూడా భారీగా ఆయుధాల కాంట్రాక్టులు పొందుతూ కొత్త లాభాదాయక పిల్లర్ గా మారుతున్నాయని రిపోర్టు చేసింది. అయితే ఈ విషయంపై రిలయన్స్ గ్రూప్ అధికారప్రతినిధి ఇంకా స్పందించలేదు. 2002లో అంబానీ కుటుంబం టెలికాం పరిశ్రమలోకి ప్రవేశించింది. అనంతరం అనిల్, ముఖేష్ లు తమ ఆస్తులను పంచుకున్నారు. ప్రస్తుతం వీరు భారత్ లో అత్యంత ధనవంతులుగా వెలుగొందుతున్నారు. కానీ ఇటీవల అన్న ముఖేష్ కు చెందిన జియోతో తమ్ముడి ఆర్ కామ్ బిజినెస్ లు దెబ్బతింటున్నాయి. -
అంబానీకి భారీ రుణభారం, జియో షాక్
ముంబై: బడా పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ గ్రూప్ నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్ కాం) సోమవారం నాటిమార్కెట్ లో భారీ నష్టాల్లో కూరుకుపోయింది. టెలికాం సేవల్లోకి జియో ఎంట్రీ, భారీ రుణ భారం కారణంగా బిలియనీర్ అనిల్ అంబానీకి భారీ షాక్ తగిలింది. దాదాపు 10కి పైగా దేశీయ బ్యాంకులకు భారీగా బకాయిపడిందన్న వార్తలతో భారీ నష్టాలు నమోదు చేసింది. యాక్సిస్ , ఎస్, ఎస్బీఐ బ్యాంకు తదితర బ్యాంకులకు అప్పులను చెల్లించడంలో వెనకబడిందని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. భారీ అప్పల్లో కూరుకుపోయిందన్న ఆందోళనల నేపథ్యంలో అడాగ్ గ్రూపునకు చెందిన పలు కౌంటర్లలో భారీ అమ్మకాలకు తెరలేచింది. ప్రధానంగా ఆర్కామ్ 23శాతం కుప్పకూలింది. అంబానీకి చెందిన మరో ప్రధాన కంపెనీ రిలయన్స్ కేపిటల్ 8 శాతం, రిలయన్స్ డిఫెన్స్ 6 శాతం రిలయన్స్ ఇన్ఫ్రా 8 శాతం, రిలయన్స్ పవర్ 7 శాతం పతనం కావడం గమనార్హం. ముఖ్యంగా సోదరుడు ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ జియో 4 జి సేవల్లో గత ఏడాది వాయిస్ అండ్ డేటా సేవలతో సునామీలా దూసుకు రావడంతో ఆర్కాం భారీ నష్టాలతో రికార్డ్ కనిష్టాన్ని నమోదు చేసింది. అలాగే జియోకి పోటీగా ఇతర టెలికాం కంపెనీలు భారతి, ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ లు డేటా సేవలను సమీక్షించుకుంటూ వస్తుండగా, ఈ విషయంలో ఆర్కాం వెనుకబడింది. వినియోగదారులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఫలితంగా మార్చి 31 నాటికి దాదాపు రూ.42 వేలకోట్ల అప్పులను ఆర్కాం మూటగట్టుకుంది. మరోవైపు రేటింగ్ సంస్థ ఇక్రా కూడా ఆర్ కాం రేటింగును బీబీబీ నుంచి బీబీ డౌన్ గ్రేడ్ చేసింది. 10 బ్యాంకులకు పైగా రుణాల చెల్లింపు ఆలస్యమైందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. మొండిబకాయిల(ఎన్పీఏలు) సమస్యలతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉపశమనాన్ని కల్పించే బాటలో కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుతో సంప్రదింపుల ద్వారా కొత్త చట్టాన్ని తీసుకు రానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు దిగారు. దీంతో అడాగ్ గ్రూపునకు చెందిన పలు కౌంటర్లు భారీ అమ్మకాలతో కుదేలయ్యాయి. అయితే ఈ నివేదికపై వ్యాఖ్యానించడానికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ నిరాకరించింది. కాగా వైర్ లెస్ వ్యాపారాన్ని ప్రత్యర్థి ఎయిర్ సెల్లో విలీనం చేస్తున్నట్టు రిలయన్స్ కమ్యూనికేషన్స్ గతంలో ప్రకటించింది. అలాగే టవర్ బిజినెస్లో రూ. 10,000 కోట్లవిలువైన 51 శాతం వాటాలను కెనడా బ్రూక్ఫీల్డ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ గ్రూపునకు విక్రయించింది. ఈ అమ్మకంద్వారా రూ .25,000 కోట్లు (3.9 బిలియన్ డాలర్లు) విలువైన రుణాలను తిరిగి చెల్లించాలని కంపెనీ భావిస్తోంది. దీంతో గతవారం ఆర్ కాం భారీగా నష్టపోయింది. గత ఏడాది మార్చి నాల్గవ త్రైమాసికంలో రూ. 966 కోట్ల నష్టాన్ని నమోదుచేసిన సంగతి తెలిసిందే. -
జియో దెబ్బ: ప్రత్యర్థులు మరింత కుదేలు
జియో దెబ్బకు మేజర్ టెలికాం రంగ దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఒక్కసారిగా మూడో క్వార్టర్లో భారీగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే నాలుగో క్వార్టర్లోనూ ఈ దిగ్గజాలకు పరిస్థితి ఇదే మాదిరే ఉంటుందని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ జియో ఉచిత డేటా ఆఫర్లు కొనసాగించినంత వరకు టెలికాం దిగ్గజాలు మార్జిన్లకు భారీగానే గండికొడుతూ ఉంటుందని పేర్కొన్నారు. ఎప్పుడైతే జియో తన ఉచిత ఆఫర్లను విత్ డ్రా చేసుకుని, డేటా సర్వీసులపై ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభిస్తుందో అప్పటినుంచి టెలికాం దిగ్గజాల పరిస్థితి కొంత మెరుగుపడవచ్చని టెలికాం ఇండస్ట్రి ప్రాక్టిస్, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఇండియా అర్పితా పాల్ అగర్వాల్ చెప్పారు. 2016 సెప్టెంబర్ నుంచి వెల్ కమ్ ఆఫర్ కింద జియో ఉచిత ఆఫర్లు ఇవ్వడం ప్రారంభించింది. అనంతరం డిసెంబర్లో జియో తమ ఉచిత డేటా ఆఫర్లను 2017 మార్చి వరకు పొడిగిస్తున్నామని పేర్కొంది. దీంతో టెలికాం దిగ్గజాలు రెవెన్యూలు భారీగా కోల్పోతున్నాయి. భారతీ ఎయిర్ టెల్ 55 శాతం, ఐడియా సెల్యులార్ రూ.478.9కోట్లను, రిలయన్స్ కమ్యూనికేషన్ రూ.531 కోట్ల నష్టాలను నమోదుచేశాయి. మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జియో దోపిడీ ధరల విధానం వల్లనే తాము రెవెన్యూలను భారీగా కోల్పోతున్నామని టెలికాం కంపెనీలు ఆరోపిస్తున్నాయి. రిలయన్స్ జియో ఉచిత డేటా ఆఫర్ల దూకుడే టెలికాం కంపెనీలకు భారీగా దెబ్బకొడుతుందనే దానికి ఎలాంటి సందేహం లేదని టెలికాం కన్సల్టెన్సీకి చెందిన ఓ సంస్థ డైరెక్టర్ మహేష్ ఉప్పల్ చెప్పారు. ధరల విధానంపై భారత మార్కెట్ ఆధారపడి ఉంటుందని, అలాంటి ఆఫర్లు మార్కెట్ లో విధ్వంసం సృష్టించేలా ఉన్నాయని గార్టనర్ టెలికాం బిజినెస్ స్ట్రాటజీ ప్రిన్సిపల్ రీసెర్చ్ అనలిస్టు రిషి తేజ్ పాల్ చెప్పారు. -
అనిల్ అంబానీ భారీ డీల్
ముంబై: అనీల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ లో భాగమైన , టెలికమ్యూనికేషన్స్ క్యారియర్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ టెలికం టవర్ల బిజినెస్ విక్రయంలో విజయం సాధించింది. మొబైల్ ఫోన్ టవర్ వ్యాపారంలో వాటాను బ్రూక్ ఫీల్డ్ కు విక్రయించింది. ఈ మేరకు కెనడా కు చెందిన బ్రూక్ఫీల్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఒక ఒప్పందంపై కుదుర్చుకుంది. టవర్ల విభాగాన్ని కొనుగోలు చేసేందుకు బ్రూక్ఫీల్డ్ సంస్థతో తప్పనిసరి (రెండు వైపులా బైండింగ్) ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు బుధవారం తెలియజేసింది. దీంతో బ్రూక్ఫీల్డ్ నుంచి ముందస్తు చెల్లింపుగా రూ. 11,000 కోట్లను అందుకోనున్నట్లు వెల్లడించింది. ఈ బైండింగ్ ఒప్పందం ప్రకారం టవర్ల బిజినెస్ను ప్రత్యేక కంపెనీగా విడదీయనుంది. ఈ తాజా ఒప్పందం ద్వారా తన రుణ భారాన్ని తగ్గించుకోనుంది. మరోవైపు అనిల్ అంబానీ గ్రూప్ కు చెందిన మరో సంస్థ రిలయన్స్ కేపిటల్ కూడా నిధుల సమీకరణ చేపట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది.హోమ్ ఫైనాన్స్ ద్వారా అన్సెక్యూర్డ్ ఎన్సీడీల జారీ ద్వారా రూ, 1,000 కోట్లను(14.7 మిలియన్ డాలర్లు) సమీకరించనున్నట్లు తెలిపింది. కాగా ఆర్ కాం మొబైల్ టవర్ వ్యాపార వాటా విక్రయానికి ఇటీవల ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చివరికి కెనడా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో మార్కెట్లో ఆర్కామ్ షేరు దాదాపు 8 శాతానిపై దూసుకెళ్లింది. -
ముఖేష్ పోటీగా అనిల్ టెలికాం టారీఫ్లు
-
వినియోగదారులకు ఆర్కామ్ బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ : ఓ వైపు అన్న ముఖేష్ అంబానీ టెలికాం రంగంలో దూసుకెళ్తుండగా.. తమ్ముడు సైతం అన్నకు బలమైన పోటీని ఇస్తున్నారు. వినియోగదారుల కోసం కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నారు. అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) రూ. 149కే అపరిమిత కాలింగ్ ప్లాన్ను మంగళవారం లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా ఏ టెలికాం నెట్వర్క్కైనా, ఏ మొబైల్ నుంచైనా అపరిమిత కాలింగ్ టాక్ టైమ్ సద్వినియోగం చేసుకునేలా ఈ ప్లాన్ దోహదం చేయనుంది. ఎక్కువ దూరం చేసే కాల్స్కు కూడా ఈ ఫ్లాన్ ఉపయోగపడనుంది. దీనికోసం వినియోగదారులు నెలకు రూ.149 చెల్లిస్తే చాలని కంపెనీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 2జీ, 3జీ, 4జీ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్లో అన్ని నెట్వర్క్లకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. 2జీ, 3జీ, 4జీ హ్యాండ్సెట్ ఓనర్లను టార్గెట్గా చేసుకుని ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ ద్వారా, వారిని ఆర్కామ్ నెట్వర్క్లోకి మరల్చడానికి ఈ ప్లాన్ దోహదం చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్పై 300 ఎంబీ డేటా వాడకాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొంది. ఇప్పటికీ భారత్లో వందల లక్షల మంది 2జీ హ్యాండ్సెట్ ఓనర్లు ఉన్నారని ఆర్కామ్ చెప్పింది. యూజర్లను యూనిట్ రేట్ చార్జింగ్ విధానం నుంచి సింగిల్ రీచార్జ్తో, అపరిమిత వాడక పద్ధతిలోకి టెలికాం మార్కెట్ను తీసుకురావడానికి తమ కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ సహకరించనుందని ఆర్కామ్ కన్సూమర్ బిజినెస్ సీఈవో, రిలయన్స్ కమ్యూనికేషన్స్ కో-సీఈవో గుర్దీప్ సింగ్ చెప్పారు. లక్షల కొలదీ భారతీయులు తమ అన్లిమిటెడ్ ప్లాన్తో లబ్దిపొందనున్నట్టు ఆశాభావం వ్యక్తంచేశారు. -
ఆర్కామ్ టవర్ల వ్యాపారంలో బ్రూక్ఫీల్డ్కు 51% వాటా
డీల్ విలువ రూ.11,000 కోట్లు న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) సంస్థ టెలికం టవర్ వ్యాపారంలో 51 శాతం వాటాను కెనడాకు చెందిన బ్రూక్ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్కు విక్రయించనున్నది. డీల్ విలువ రూ.11,000 కోట్లు. ఈ వాటాను రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ నుంచి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)కు బదిలీ చేస్తామని, ఈ ఎస్పీవీపై యాజమాన్య హక్కులు బ్రూక్ఫీల్డ్కు ఉంటాయని ఆర్కామ్ వివరించింది. ఈ నిధులను రుణభారాన్ని తగ్గించుకోవడానికి వినియోగిస్తామని పేర్కొంది. టవర్ల వ్యాపారంలో ఆర్కామ్కు ఇంకా 49 శాతం వాటా ఉందని, భవిష్యత్తులో ఈ వాటాను విక్రయించే ఆలోచన ఆర్కామ్కు ఉందని సంబంధిత వర్గాలంటున్నాయి. రెండేళ్లలో టవర్ల అద్దెల్లో మంచి వృద్ది ఉంటుందని, ఫలితంగా తమ వాటాకు మరింత విలువ వస్తుందని ఆర్కామ్ భావిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీర్ఘకాలిక మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్(ఎంఎస్ఏ) ప్రకారం తమ టెలికం వ్యాపారం కోసం ఈ టవర్ ఆస్తుల్లో యాంకర్ టెనంట్గా కొనసాగుతామని ఆర్కామ్ పేర్కొంది. ఈ టవర్ల వ్యాపారంలో వాటా విక్రయం, ఎయిర్సెల్ విలీనం కారణంగా ఆర్కామ్ రుణ భారం రూ.42,000 కోట్ల నుంచి దాదాపు 60% వరకూ తగ్గి రూ.17,000 కోట్లకు దిగివస్తుందని అంచనా. కాగా రియల్ ఎస్టేట్ వ్యాపార విక్రయం ద్వారా మరో రూ.5,000 కోట్లు సమీకరించాలని ఆర్కామ్ భావిస్తోంది. దీంతో కంపెనీ రుణ భారం రూ.12,000 కోట్లకు తగ్గొచ్చని అంచనాలున్నాయి. -
కలిసిపోయిన అంబానీలు
-
కలిసిపోయిన అంబానీలు
సోదరుడు ముకేశ్ అంబానీతో ఉన్న విభేదాలను వదిలి బిలియనీర్ అనిల్ అంబానీ(57) ముందడుగు వేశారు. ముకేశ్ తాజా సంచలనం జియోతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ను వర్చువల్ మెర్జ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ముంబైలో షేర్ హోల్డర్లతో సమావేశమైన అనిల్ ఈ మేరకు ప్రకటన చేశారు. ధీరూభాయ్ కలలను సాకారం చేసేందుకు తాము ఇద్దరు కలిసి శ్రమిస్తామని పేర్కొన్నారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ 4జీ సేవలను మొదలుపెట్టిన మూడు నెలల్లోపు మిలియన్ వినియోగదారులు మార్క్ ను దాటినట్లు వెల్లడించారు. 2జీ, 3జీ, 4జీ సర్వీసులను అందించేందుకు కావలసిన స్పెక్ట్రమ్ తమ వద్ద ఉందని సమావేశంలో అనిల్ పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం.. జియో మొబైల్ స్పెక్ట్రమ్ ను రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ మొబైల్ టవర్స్ ను జియో ఇన్ఫోకామ్ లు వినియోగించుకోనున్నాయి. ఈ ఒప్పందంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారీగా(స్పెక్ట్రమ్ కొనుగోలు ఖర్చు తగ్గుతుంది)లాభపడనుంది. వచ్చే ఏడాదిలోపు కంపెనీ పేరిట ఉన్న 75శాతం అప్పులను తీర్చేయాలనే యోచనలో ఉన్నట్లు అనిల్ చెప్పారు. ఈ నెల ప్రారంభంలో ఎయిర్ సెల్ తో విలీనం అయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారత్ లోని 12 టెలికాం సర్కిల్స్ లో ముందుకు దూసుకెళ్లినట్లు పేర్కొన్నారు. కాగా ధీరూభాయ్ అంబానీ మరణానంతరం ముకేశ్ అంబానీని అనిల్ మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. -
ఎయిర్సెల్ విలీనం 15 రోజుల్లో: ఆర్కామ్
అధిక స్పెక్ట్రమ్ ఉన్న కంపెనీగా విలీన సంస్థ న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్లో ఎయిర్ సెల్ విలీనం దాదాపు పూర్తి కావచ్చింది. ఈ మేరకు ఎయిర్సెల్తో రెండు సార్లు చర్చలు జరిపామని, విలీన చర్చలు తుది దశకు చేరాయని, 10-15 రోజుల్లో ఎయిర్సెల్ విలీనాన్ని ప్రకటిస్తామని రిలయన్స్ కమ్యూనికేషన్స్ గురువారం వెల్లడించింది. ఎయిర్సెల్ వాటాదారులైన మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హాద్, సింధ్య సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్లతో నిశ్చయాత్మకమైన ఒప్పందాన్ని వీలైనంత త్వరలో కుదుర్చుకుంటామని పేర్కొంది. ప్రభుత్వ సంస్థల, వాటాదారుల ఆమోదం పొం దాల్సి ఉందని వివరించింది. ఆర్కామ్లో ఎయిర్సెల్ విలీనమైతే, మొత్తం టెలికం పరిశ్రమకు కేటాయించిన స్పెక్ట్రమ్లో 19.3% ఈ విలీన సంస్థకు ఉంటుంది. దేశంలో ఇంత అధిక స్పెక్ట్రమ్ ఉండే కంపెనీ ఇదే. 2జీ, 3జీ, 4జీ సర్వీసులందజేయడానికి ఉపయోగపడే అన్ని రకాల బ్యాండ్ల స్పెక్ట్రమ్ ఈ సంస్థకు ఉంటుంది. రూ.25వేల కోట్ల వ్యాపారం.. విలీనం పూర్తయిన తొలి రోజు నుంచే రూ.25వేల కోట్ల వ్యాపారం ఈ విలీన సంస్థకు ఉంటుందని అంచనా. ఈ విలీన సంస్థ ఇబిట(క్యాష్ ఫ్లో) రూ.7,000 కోట్లు, వడ్డీ వ్యయాలు రూ.3,000 కోట్లు ఉంటాయని అంచనా. మార్చి నాటికి ఆర్కామ్ నికర రుణ భారం రూ.41,362 కోట్లుగా ఉంది. కాగా విలీన వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఆర్కామ్ షేర్ 4.1 శాతం లాభపడి రూ.49.7 వద్ద ముగిసింది. -
ఇంకా 30 రోజులూ విలీన చర్చలే
ముంబై : దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్ కామ్), ఎయిర్ సెల్ లు విలీనానికి సంబంధించి చర్చల గడువును మరో 30 రోజులు పొడిగించాయి. చర్చల గడువును పొడిగిస్తున్నట్టు రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ కంపెనీ ప్రకటించింది. ఈ విలీన చర్చల గడువును పొడిగించడం ఇది రెండోసారి. మొదటిసారి మార్చి 22న విలీన చర్చల గడువును 60 రోజులుకు పెంచుతున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. మరింత గణనీయమైన పురోగతి కోసం ఆర్ కామ్, మాక్సిస్ కమ్యూనికేషన్ బెర్హడ్(ఎమ్ సీబీ), సింద్యా సెక్యురిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్ సెల్ పెట్టుబడిదారులు పరస్పరం ఈ ప్రత్యేక సమయ వ్యవధిని 2016 జూన్ 22 వరకు పెంచాలని నిర్ణయించినట్టు ఆర్ కామ్ తెలిపింది. అయితే ఈ విలీన ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. షేర్ హోల్డింగ్ గురించి ప్రస్తుత చర్చలు జరుగుతున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కొత్త సంస్థలో ఆర్ కామ్ ఎక్కువ షేరును ఆశిస్తున్నట్టు సమాచారం. ఆర్ కామ్ టవర్, ఆప్టికల్ ఫైబర్ ఆస్తులను వదిలేసి, విలీన చర్చలను 90 రోజుల ప్ర్యతేక సమయ వ్యవధితో ప్రారంభిస్తున్నట్టు డిసెంబర్ 22న ఈ కంపెనీలు ప్రకటించాయి. అయితే మార్చి 22న మరో 60 రోజులు ఈ విలీన చర్చల గడువును పొడిగిస్తున్నట్టు పేర్కొన్నాయి. ఆర్ కామ్, ఎయిర్ సెల్ చర్చలు సఫలమైతే, మొత్తం స్పెక్ట్రమ్ పరిశ్రమలో ఈ రెండు 19.3శాతం వాటాను కలిగి ఉంటాయి. 2జీ, 3జీ, 4జీ సర్వీసుల కొరుకు 800 ఎమ్ హెచ్ జడ్, 900ఎమ్ హెచ్ జడ్ ,1800ఎమ్ హెచ్ జడ్,2100ఎమ్ హెచ్ జడ్,2300 ఎమ్ హెచ్ జడ్ స్పెక్ట్రమ్ లను ఇవి పొందనున్నాయి. -
ఐడియా, రిలయన్స్ డేటా యూజర్లకు న్యూ స్కీమ్స్
న్యూఢిల్లీ : కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించే లక్ష్యంతో, రెండు అతిపెద్ద టెలికాం సర్వీసు ప్రొవైడర్లు కొత్త స్కీమ్ లను ప్రవేశపెట్టాయి. రిలయన్స్ కమ్యూనికేషన్ తన 3జీ, 2జీ నెట్ వర్క్ ప్రీ పెయిడ్ కస్టమర్ల కోసం డేటా లోన్ సర్వీసును ఆవిష్కరించగా... ఐడియా సెల్యులార్ రాత్రిపూట నెట్ వాడుకునే యూజర్లకు 4జీ, 3జీ డేటా ధరలను 50శాతం తగ్గించనుందని ప్రకటించింది. డేటా యూజర్లకు ఈ స్కీమ్ లు ఎంతో సహకరించనున్నట్టు ఆ కంపెనీలు పేర్కొన్నాయి. డేటా లోన్ సర్వీసు ద్వారా తక్కువ డేటా ఉన్న ప్రీఫైడ్ కస్టమర్లు టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి, వెంటనే 60ఎమ్ బీ వరకూ డేటా లోన్ పొందవచ్చని రిలయన్స్ కమ్యూనికేషన్ తెలిపింది. రిలయన్స్ ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ద్వారా కస్టమర్లకు డేటా సర్వీసులు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు, ఏ సమయంలో కూడా (రాత్రిపూట కూడా) డేటా సర్వీసులకు ఆటంకం వాటిల్లకుండా ఉంటుందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గుర్ దీప్ సింగ్ తెలిపారు. ఐడియా ప్రకటించిన స్కీమ్ ద్వారా నెలకు రూ.125 కే 1జీబీ డేటాను రాత్రిపూట అందుబాటులోకి తేనున్నారు. దీనివల్ల మామూలు ధరల కంటే తక్కువగా 50శాతం పొదుపు చేసుకోవచ్చని ఐడియా సెల్యులార్ తెలిపింది. అదేవిధంగా డే అండ్ నైట్ ట్విన్ ప్యాక్ నూ ఐడియా ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్ ద్వారా నెలకు 500 ఎమ్ బీ డేటా నుంచి 40జీబీ డేటా రీఛార్జ్ వరకూ 30శాతం డిస్కౌంట్ పొందవచ్చని ప్రకటించింది. -
రూ. 5,600 కోట్లు కట్టాలి
స్పెక్ట్రం ‘సరళీకరణ’పై ఆర్కామ్కు డాట్ ఆదేశం న్యూఢిల్లీ: పదహారు సర్కిళ్లలో 800 మెగాహెట్జ్ స్పెక్ట్రంను ట్రేడింగ్, షేరింగ్ మొదలైన వాటికి ఉపయోగించుకునేందుకు వీలుగా షరతులు సడలించడం కోసం రూ. 5,600 కోట్లు చెల్లించాలని రిలయన్స్ కమ్యూనికేషన్స్కు (ఆర్కామ్) టెలికం విభాగం (డాట్) సూచించింది. అలాగే వన్ టైమ్ స్పెక్ట్రం చార్జ్ (ఓటీఎస్సీ) కింద రూ. 1,569 కోట్లకు బ్యాంకు గ్యారంటీని నెలరోజుల్లోగా సమర్పించాలని పేర్కొంది. -
‘సిమ్’ ఇంట్లో హోరాహోరీ!
భారీ వ్యయంతో కంపెనీల ప్రణాళికలు * విలీనాలకు తెరలేపిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ * వినూత్న వ్యూహాలతో వస్తున్న రిలయన్స్ జియో * రూ.60 వేల కోట్లతో ఎయిర్టెల్ ప్రాజెక్ట్లీప్ * ఐడియా, టెలినార్, వొడాఫోన్ వ్యూహాలకూ పదును * మాట నుంచి డేటాకు... 2015లో స్పష్టమయిన ట్రెండ్ * 2016లో ఈ దార్లోనే దూసుకెళ్లనున్న సంస్థలు బండికి పెట్రోల్, డీజిల్ ఎలాంటివో... మొబైల్కు సిమ్ అలాంటిదే. టెలికం కంపెనీలు ఏ సేవలందించినా ఈ సిమ్తోనే. అందుకే.. సిమ్ను చాక్లెట్ కన్నా చీప్గా ఒకోసారి ఉచితంగానే ఇచ్చేస్తున్నాయి. దీనిద్వారా అందిస్తున్న సేవల మార్కెట్ విలువ... రూ.3.3 లక్షల కోట్లు కావటంతో సిమ్ కార్డును గుప్పిట పెట్టుకోవటానికి పెద్ద యుద్ధమే చేస్తున్నాయి. 2జీ, 3జీ, 4జీ... డేటా, వాయిస్ అంటూ రకరకాల వ్యూహాలు అనుసరిస్తున్నాయి. 2015లో కొందరు తెరమరుగైపోగా... మరికొందరు చేతులు కలపటానికి సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది మాత్రం యోధుల రాకతో పోరాటం కొత్త మలుపు తిరగబోతోంది. ప్రాజెక్ట్ లీప్.. అంటూ ఎయిర్టెల్ పెద్ద అడుగే వేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్... సిస్టెమా శ్యామ్కు చెందిన ఎంటీఎస్ను కైవసం చేసుకోవటమే కాక... టవర్ల వ్యాపారాన్ని అమ్మేస్తోంది. ఎయిర్సెల్ను కొనబోతున్నట్లూ ప్రకటించింది. యూపీ, గుజరాత్ సర్కిళ్లలో 4జీ తరంగాలను రూ.3,310 కోట్లకు వీడియోకాన్ నుంచి ఐడియా కొంటోంది. బీఎస్ఎన్ఎల్ తన టవర్ల వ్యాపారాన్ని వేరు చేస్తోంది. * ఇవన్నీ... 2016 ఆరంభానికి నాలుగురోజుల ముందు ఆరంగేట్రం చేసిన ముకేశ్ అంబానీ రిలయన్స్ జియోను ఎదుర్కొనే సన్నాహాలే. ఏడేళ్ల కిందట దేశీ మార్కెట్లో 16 కంపెనీలు పోటీ పడగా... ఇపుడు 10 మిగిలాయి. 4జీ మార్కెట్లో మాత్రం ఎయిర్టెల్, రిలయన్స్ జియో, ఐడియా, వొడాఫోన్ మధ్యే పోటీ ఉంటుందనేది మార్కెట్ వర్గాల అంచనా. * దేశవ్యాప్తంగా నవంబరు నాటికి 75 కోట్ల జీఎస్ఎం చందాదారులున్నారు. 17 కోట్ల మంది వద్ద స్మార్ట్ఫోన్లున్నాయి. వీరిలో 3జీ కస్టమర్ల సంఖ్య 9 కోట్లని ఐడియా సెల్యులర్ ఎండీ హిమాన్షు కపానియా చెప్పారు. 2019-20 నాటికి 3జీ, 4జీ వినియోగదార్ల సంఖ ్య 40-50 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. * ఈ ఏడాది దేశంలో సగటున నెలకు 40 లక్షల మందికి పైగా కొత్త చందాదారులు నమోదయ్యారు. అంటే 2015లో కొత్తగా చందాదారులైన వారి సంఖ్య 7.5 కోట్ల పైనే. జూలై-సెప్టెంబరు మధ్య దేశంలో కొత్త యూజర్లు 1.3 కోట్ల మంది కాగా... చైనాలో 70 లక్షలు. అమెరికాలో 60 లక్షలు. ఇదీ మన టెలికం జోరు. * కస్టమర్లను ఆకట్టుకోవడానికి 2009-10లో కంపెనీలు కాల్ రేట్లను 50% దాకా తగ్గించాయి. ఇప్పుడు ఇలాంటి యుద్ధం డేటా చార్జీలపై ఉండబోతోంది. ప్రస్తుతం పలు కంపెనీలు 3జీ స్థాయి ధరల్లోనే 4జీని ఆఫర్ చేస్తున్నాయి. రిలయన్స్ జియో పెట్టబోయే ధరల ఆధారంగా మరిన్ని మార్పులు జరగవచ్చు. * టెలికం రంగంలో తిరిగి కొత్త నియామకాల జోష్ ఉండనుంది. వచే ్చ ఆరు నెలల్లో సుమారు 30,000 మంది రిక్రూట్ అయ్యే అవకాశం ఉందని టీమ్లీజ్ అంచనా వేస్తోంది. మొత్తంగా వచ్చే ఐదేళ్లలో భారత టెలికం పరిశ్రమ రూ.4.29 లక్షల కోట్లకు ఎగుస్తుందన్నది మార్కెట్ వర్గాల అంచనా. * డేటా చార్జీలు తగ్గిస్తే వినియోగం మరింత పెరుగుతుంది కనుక కంపెనీల ఆదాయమూ పెరుగుతుందనేది పరిశ్రమ అంచనా. స్మార్ట్ఫోన్లు, సామాజిక మాధ్యమాలు దీన్ని నిజం చేస్తున్నాయి. సెప్టెంబరు త్రైమాసికంలో ఎయిర్టెల్ డేటా ఆదాయం కిందటేడాది ఇదే కాలంతో పోలిస్తే 14.5 శాతం నుంచి 21.5 శాతానికి చేరింది. బీఎస్ఎన్ఎల్ డేటా ఆదాయం 92 శాతం ఎగసి 2014-15లో రూ.1,380 కోట్లుగా నమోదైంది. 3జీ కన్నా 4జీ వేగం ఎక్కువ కనక డేటా వినియోగం ఇంకా పెరుగుతుంది. ఇవీ... భవిష్యత్ ప్రణాళికలు ప్రాజెక్ట్ లీప్ పేరిట... నెట్వర్క్ విస్తరణకు మూడేళ్లలో ఎయిర్టెల్ రూ.60,000 కోట్లు వెచ్చిస్తోంది. ప్రస్తుతం సుమారు 300 పట్టణాల్లో 4జీ సేవలందిస్తోంది. ఐడియా వచ్చే మూడేళ్లకుగాను రూ.18,000 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైంది. ఈ కంపెనీ దక్షిణాదిన 4జీ సేవలు అందుబాటులోకి తెచ్చింది. 2016 జూన్ నాటికి 750 పట్టణాల్లో అడుగు పెట్టనుంది. 2015-16లో వొడాఫోన్ రూ.8,500 కోట్లు వెచ్చిస్తోంది. దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో 18,000 పట్టణాలు, నగరాల్లో 4జీ సర్వీసులను పరిచయం చేయనుంది. ఇప్పటికే సంస్థ రూ.95,000 కోట్ల దాకా ఖర్చుచేసింది. అర కిలోమీటరుకు ఒక టవర్ను ఏర్పాటు చేస్తోంది. రూ.7,700 కోట్లు వెచ్చిస్తున్న బీఎస్ఎన్ఎల్... ప్రైవేటు కంపెనీల్లా మార్కెటింగ్ చేస్తే వాటా పెంచుకోవటం ఖాయం. టెలినార్ త్వరలో హై స్పీడ్ ఇంటర్నెట్ను ప్రవేశపెడుతోంది. నెట్వర్క్ ఆధునికీకరణ బాధ్యతను హువావె టెక్నాలజీస్కు అప్పగించింది. -
ఫ్రీ బేసిక్స్ సర్వీసును ఆపండి..
► రిలయన్స్ కమ్యూనికేషన్స్కు ట్రాయ్ ఆదేశం న్యూఢిల్లీ: ఫ్రీ బేసిక్స్ సేవల చార్జీల అంశం తేలేంత వరకూ ఈ సర్వీసులను వాణిజ్యపరంగా ప్రవేశపెట్టడాన్ని నిలిపివేయాల్సిందిగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ను (ఆర్కామ్) ట్రాయ్ ఆదేశించింది. ఈ సర్వీసులకు సంబంధించిన నియమ, నిబంధనల వివరాలు ఇవ్వాలంటూ కంపెనీని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంటర్నెట్ మాధ్యమానికి ప్రాచుర్యంలోకి తెచ్చేదిగా పేర్కొంటూ... సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్బుక్.. డేటా చార్జీల ప్రసక్తి లేకుండా కొన్ని వెబ్సైట్లను ఉచితంగా అందించేందుకు ఫ్రీ బేసిక్స్ సర్వీసును తెరపైకి తీసుకొచ్చింది. ఇందుకోసం భారత్లో ఆర్కామ్తో చేతులు కలిపింది. అయితే, ఫ్రీ బేసిక్స్ అనేది నెట్ న్యూట్రాలిటి (వెబ్సైట్ల విషయంలో వివక్ష చూపకుండా తటస్థంగా వ్యవహరించడం) నిబంధనకు విరుద్ధంగా ఉందని వివాదం రేగిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ఈ సేవలకు సంబంధించి వివిధ కస్టమర్ల నుంచి వివిధ రకాలుగా వసూలు చేసే చార్జీలు, నియమ నిబంధనలు, షరతుల వివరాలు ఇచ్చే దాకా ఈ సేవలను ఆపేయాలంటూ డిసెంబర్ 1న ఆర్కామ్కు ట్రాయ్ సూచించింది. డిసెంబర్ 7న ట్రాయ్కి లేఖ రాసిన ఆర్కామ్.. డిసెంబర్ 9 దాకా గడువు కోరింది. కానీ ఆ తర్వాత స్పందించలేదు. దీంతో ట్రాయ్ మరోసారి లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, ట్రాయ్ ఆదేశాల మేరకు అనుమతులు వచ్చేదాకా ఫ్రీ బేసిక్స్ వాణిజ్యపరమైన సర్వీసుల ప్రారంభాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు ఆర్కామ్ వర్గాలు తెలిపాయి. -
సిస్టెమా శ్యామ్పై ఆర్కామ్ కన్ను
విలీనంపై కొనసాగుతున్న చర్చలు న్యూఢిల్లీ: రష్యా టెలికం కంపెనీ ఏఎఫ్కే సిస్టెమా భారత వ్యాపార విభాగం సిస్టెమా శ్యామ్ను కొనుగోలు చేయడంపై రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) దృష్టి సారించింది. విలీన అవకాశాలపై ఏఎఫ్కే సిస్టెమాతో చర్చలు జరుపుతోంది. డీల్ కింద తొమ్మిది టెలికం సర్కిల్స్లో సిస్టెమా శ్యామ్ టెలీకి (ఎస్ఎస్టీఎల్) ఉన్న కస్టమర్లు, స్పెక్ట్రంను ఆర్కామ్ కొనుగోలు చేస్తుంది. దీనికి ప్రతిగా షేర్ల రూపంలో ఆర్కామ్ చెల్లింపులు జరుపుతుంది. విలీనానంతరం సంస్థలో 10 శాతం వాటా కావాలని ఎస్ఎస్టీఎల్ కోరుతుండగా, దీన్ని 7-8 శాతానికి పరిమితం చేయాలని ఆర్కామ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. విలీనం సాకారమైన పక్షంలో దేశీయంగా నాలుగో అతి పెద్ద టెలికం కంపెనీగా ఆర్కామ్ స్థానం పటిష్టమవుతుంది. ఎస్ఎస్టీఎల్ ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు తదితర తొమ్మిది టెలికం సర్కిళ్లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవల మార్చిలో జరిగిన స్పెక్ట్రం వేలంలో కంపెనీ పాల్గొనకపోవడంతో భారత్లో వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు ఇతర పోటీ సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్కామ్తో చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 4జీ సేవలు మెరుగ్గా అందించేందుకు ఉపయోగపడే సీడీఎంఏ స్పెక్ట్రంను ఆర్కామ్ 11 సర్వీస్ ఏరియాల్లో దక్కించుకుంది. ఒకవేళ ఎస్ఎస్టీఎల్ విలీనమైతే మొత్తం 15 టెలికం సర్కిళ్లలో ఆర్కామ్కు సీడీఎంఏ స్పెక్ట్రం ఉన్నట్లవుతుంది. భారీ ఎత్తున కొత్తగా రాబోయే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మార్చిలో జరిగిన వేలంలో 11 సర్కిళ్లలో సీడీఎంఏ స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. మార్చి ఆఖరు నాటికి ఆర్కామ్కి 10.94 కోట్ల మంది, సిస్టెమా శ్యామ్కి 88 లక్షల మంది యూజర్లు ఉన్నారు. -
ఆర్కామ్.. ఉచిత ఫేస్బుక్
- మరో 30కిపైగా ఇతర సమాచార వెబ్సైట్లు కూడా... - ఇరు కంపెనీల భాగస్వామ్యంతో అందుబాటులోకి... ముంబై: టెలికం దిగ్గజం రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) వినియోగదారులకు ఇక సామాజిక నెట్వర్క్ వెబ్సైట్ ఫేస్బుక్ సౌకర్యం ఉచితంగా అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా మరో 30కి పైగా సమాచార ఆధారిత వెబ్సైట్లను కూడా ఎలాంటి ఇంటర్నెట్ చార్జీలూ లేకుండా వాడుకోవచ్చు. ఈ సేవలను అందించేందుకుగాను ఆర్కామ్తో ఫేస్బుక్ జట్టుకట్టింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఇంటర్నెట్ వినియోగదార్ల మార్కెట్గా అవతరించిన భారత్లో ఫేస్బుక్ను మరింత మందికి చేరువ చేయడమే లక్ష్యంగా ఈ సేవలను ప్రారంభించింది. అంతేకాకుండా.. ఆసియాలో తొలిసారిగా భారతీయ మొబైల్ ఫోన్ యూజర్లకు ఈ కొత్త ఇంటర్నెట్.ఆర్గ్ యాప్ను వినియోగంలోకి తీసుకొస్తుండటం గమనార్హం.కాగా, ఈ ఒప్పందం ప్రకారం ఫేస్బుక్, ఆర్కామ్ యూజర్లు వాతావరణానికి సంబంధించిన వార్తలు-సమాచారం, ఉద్యోగాలు, ప్రభుత్వ సేవలు, ఆరోగ్యం ఇతరత్రా అంశాలకు సంబంధించిన 33 వెబ్సైట్లకు ఎలాంటి డేటా(నెట్) చార్జీలూ లేకుండా కనెక్ట్కావచ్చు. భారత్లో 70 శాతం మందికి ఇంకా ఇంటర్నెట్ అందుబాటులో లేదని.. ఫేస్బుక్తో కలిపి ఈ ఉచిత సేవలను అందించడం ద్వారా మరింత మందికి ఇంటర్నెట్ను చేరువచేస్తున్నామని ఆర్కామ్ సీఈఓ(కన్సూమర్ బిజినెస్) గుర్దీప్ సింగ్ పేర్కొన్నారు. ఉచిత వెబ్సైట్లలో ఫేస్బుక్తోపాటు ఓఎల్ఎక్స్, క్లియర్ట్రిప్, టైమ్స్జాబ్స్, బాబాజాబ్, ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో వెబ్సైట్లు కూడా ఉన్నాయి. ఈ సేవలను ముందుగా ముంబై, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్(ఏపీ, తెలంగాణ), చెన్నై, తమిళనాడు, కేరళల్లో ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. 90 రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ ఉచిత సర్వీసులను అందిస్తామన్నారు. ప్రపంచంలో ఇంటర్నెట్ వాడకం తక్కువగా ఉన్న దేశాల్లో ఉచితంగా ఇంటర్నెట్ (బేసిక్ సర్వీసులు) అందించేందుకుగాను ఫేస్బుక్ ఈ ఇంటర్నెట్.ఆర్గ్ను ప్రారంభించింది. ఆర్కామ్ కస్టమర్లు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇంటర్నెట్.ఆర్గ్ వెబ్సైట్ ద్వారా లేదా ఇంటర్నెట్.ఆర్గ్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఎలాంటి డేటా చార్జీలూ లేకుండానే ఆయా వెబ్సైట్లను వాడుకోవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానానికి భారత్ కీలకం: జుకర్బర్గ్ ప్రపంచమంతా ఇంటర్నెట్తో అనుసంధానం కావాలంటే భారత్ కీలకమని ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ పేర్కొన్నారు. ‘భారత్లోని 120 కోట్ల మంది జనాభాలో 94.4 కోట్ల మందికి ఫోన్లు ఉన్నాయి. కానీ, 100 కోట్ల మందికి ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. ఇంటర్నెట్ వినియోగాన్ని పెంచడానికి ఇంకా చాలా చేయాల్సి ఉంది. ముందుగా ప్రాథమిక(బేసిక్) సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా.. రానున్న కాలంలో విప్లవాత్మకమైన మార్పులకు ఆస్కారం ఉందనేది నా నమ్మకం’ జుకర్బర్గ్ వీడియో సందేశంలో పేర్కొన్నారు. -
ఆర్కామ్లో టీఐఎఫ్పీఎల్ వాటాల పెంపు
న్యూఢిల్లీ: టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ కమ్యూనికేషన్స్లో (ఆర్కామ్) ప్రమోటర్ గ్రూప్ సంస్థ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ (టీఐఎఫ్పీఎల్) వాటాలను 59.70 శాతానికి పెంచుకుంది. ఇందుకోసం రూ. 650 కోట్లు చెల్లించింది. ఇందులో భాగంగా టీఐఎఫ్పీఎల్కి జారీ చేసిన వారంట్లను 8,66,66,667 షేర్ల కింద బదలాయించినట్లు ఆర్కామ్ వెల్లడించింది. ప్రస్తుతం ఆర్కామ్లో టీఐఎఫ్పీఎల్ 58.25 శాతం వాటాలు ఉన్నాయి. గతేడాది జులైలో టీఐఎఫ్ఎల్కు ఆర్కామ్ వారంట్లను జారీ చేసింది. ఇందుకు గాను అప్పట్లో రూ. 650 కోట్లు, తాజాగా షేర్ల కింద బదలాయించుకుని మరో రూ. 650 కోట్లు టీఐఎఫ్ఎల్ చెల్లించింది. ఈ నిధులను రుణ భారం తగ్గించుకునేందుకు ఆర్కామ్ వినియోగించుకోనుంది. సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ రుణ భారం రూ. 36,334 కోట్ల మేర ఉంది. -
‘రిలయన్స్’ మూగబోయింది
అద్దంకి: రిలయన్స్.. ఈ పేరు వినగానే బ్రాండ్ ఇమేజ్ గుర్తుకొస్తుంది. ఆ సంస్థకు చెందిన ఎలాంటి ఉత్పత్తులైనా నాణ్యంగా ఉంటాయని అందరి నమ్మకం. అయితే దీనికి రివర్స్గేర్ పడినట్లయింది. 15 రోజులుగా రిలయన్స్ మొబైల్, నెట్ కనెక్షన్కు సంబంధించిన నెట్వర్క్లు నిలిచిపోవడమే దీనికి కారణం. గతంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్కు సంబంధించిన ప్రతినిధులు అద్దంకిలో విస్తృత ప్రచారం చేపట్టారు. రిలియన్స్ సిమ్ కార్డులు, నెట్ మోడెమ్లను ఏజెంట్ల సాయంతో.. కొన్ని చోట్ల సంస్థ తరఫునే నేరుగా విక్రయించారు. సంస్థకు మంచిపేరు ఉండటంతో అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రీపెయిడ్ కార్డులు, మోడెమ్లు వేలాదిగా అమ్ముడుపోయాయి. కొంతమంది అయితే నెల, మూడు నెలలు, ఏడాది ప్యాకేజీలున్న మోడెమ్లకు ఎక్కువ మొత్తం ఖర్చు చేసి తీసుకున్నారు. ఇలా నియోజకవర్గంలోని 103 గ్రామాల్లో రిలయన్స్ నెట్వర్క్ విస్తరించింది. మొదట్లో బాగానే ఉన్నా.. ఏడాది నుంచి సిగ్నల్ వ్యవస్థలో లోపాలు తలెత్తడం ప్రారంభమైంది. నెల రోజులు నెట్వర్క్ బాగుంటే.. ఆ తర్వాత నాలుగైదు రోజులు సమస్యరావడం, మళ్లీ సర్దుకోవడం జరుగుతోంది. అప్పటి నుంచే వినియోగదారులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అత్యవసర సమాచారం ఫోన్లో చేరవేయాలన్నా.. నెట్ ఉపయోగించాలన్నా ఇబ్బందులు ఎదుర్కోవడం మామూలైంది. సమస్య ఎవరికి చెప్పుకోవాలో.. ఎవరు పరిష్కరిస్తారో తెలియని పరిస్థితి. ఇప్పుడైతే ఏకంగా 15 రోజుల నుంచి సిగ్నల్స్ లేక ఫోన్లు, మోడెమ్లు మూగబోయాయి. ఈ దెబ్బకు ఇతర నెట్వర్క్ సేవలు వినియోగించుకొనేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. టవర్స్ తొలగిస్తున్నారా? పక్షం రోజులుగా రిలయన్స్తో విసిగిపోయిన ప్రజలు.. ఆ సంస్థకు చెందిన సిగ్నల్ టవర్లను ఎత్తివేస్తున్నారంటూ చర్చించుకుంటున్నారు. ఈ వార్త దావానంలా వ్యాపించింది. ఎవరికివారు గుసగుసలాడుకుంటున్నారు. దీంతో ఎక్కువ మొత్తం చెల్లించి ప్యాకేజీలు తీసుకున్నవారు లబోదిబోమంటున్నారు. దీనిపై రిలయన్స్ సంస్థ ఒంగోలు బాధ్యుడు రమణను ఫోన్లో సంప్రదించగా.. టవర్స్ బాగానే పని చేస్తున్నాయన్నారు. ఆ తర్వాత తేరుకొని.. అద్దంకిలోనే కాకుండా, మొత్తంమీద 74 టవర్లు పని చేయడంలేదని తెలిపారు. అందుకే సిగ్నల్స్ సరిగా రావడంలేదని రెండు రోజల్లో మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. -
దేశమంతటికీ ఒకటే మొబైల్ టారిఫ్
లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్కు ఒకే రేటు ఆర్కామ్ వన్ ఇండియా-వన్ రేట్ ప్లాన్స్ న్యూఢిల్లీ: లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్కు అన్నింటికీ ఒకటే రేటు వర్తించే వన్ ఇండియా వన్ రేట్ ప్లాన్స్ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ సోమవారం ప్రారంభించింది. భారత్లో లోకల్ కాల్స్, ఎస్టీడీ కాల్స్, రోమింగ్కు ఉన్న వివిధ టారిఫ్లన్నింటిని తొలగించి అన్నింటికి ఒకే రేటు ఉండే వన్ ఇండియా, వన్ ప్లాన్స్ను అందిస్తున్నామని ఆర్కామ్ సీఈవో(కన్సూమర్ బిజినెస్) గుర్దీప్ సింగ్ తెలిపారు. ఈ ప్లాన్ల్లో భాగంగా పోస్ట్-పెయిడ్ యూజర్ల కోసం రూ.350, రూ.599 ప్లాన్లను, ప్రి-పెయిడ్ కస్టమర్లకు రూ.45 ప్యాక్ను ఆఫర్ చేస్తున్నామని చెప్పారు. ఈ ప్లాన్లలో రోమింగ్లో ఉన్నప్పుడు ఇన్కమింగ్ కాల్స్ ఉచితమని, లోకల్, ఎస్టీడీ కాల్స్కు ఒకే టారిఫ్ ఉంటుందని పేర్కొన్నారు. రూ.599 ప్లాన్లో 1,200 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్(రోమింగ్, ఎస్టీడీ, లోకల్) ఉచితమని, 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు కూడా ఉచితమని వివరించారు. ఉచిత నిమిషాలు అయిపోయిన తర్వాత నిమిషానికి 30 పైసలు కాల్చార్జీ ఉంటుందని వివరించారు. ఇక రూ.350 ప్లాన్లో 700 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్, 200 నిమిషాలు ఇన్కమింగ్ నేషనల్ రోమింగ్, అలాగే 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు..ఇవన్నీ ఉచితమని పేర్కొన్నారు. ఉచిత కాల్స్ అయిపోయిన తర్వాత నిమిషానికి 40 పైసలు చార్జ్ చేస్తామని వివరించారు. ఇక రూ.45 ప్యాక్ ఒక నెల వ్యాలిడిటీ ఉంటుందని, రోమింగ్లో ఉన్నప్పుడు ఇన్కమింగ్ కాల్స్ ఉచితమని, అవుట్ గోయింగ్ కాల్స్కు నిమిషానికి 40 పైసలు చార్జ్ చేస్తామని వివరించారు. -
ఆర్కామ్ లాభం 48% క్షీణత
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో టెలికం దిగ్గజం రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) నికర లాభం ఏకంగా 48.5 శాతం క్షీణించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 156 కోట్లకు పరిమితమైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో రూ. 303 కోట్ల లాభం నమోదు చేసింది. అప్పట్లో వ్యాపార పునర్వ్యవస్థీకరణతో రూ. 550 కోట్ల మేర వన్టైమ్ ఆదాయం రావడం వల్ల గత గణాంకాలు భారీగా ఉన్నాయని, అది మినహాయిస్తే వ్యాపార పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని ఆర్కామ్ సీఈవో గుర్దీప్ సింగ్ తెలిపారు. త్రైమాసికాల వారీగా చూస్తే మూడో క్వార్టర్తో పోలిస్తే లాభం రూ. 108 కోట్ల నుంచి 44 శాతం మేర పెరిగినట్లయిందని వివరించారు. మొత్తం మీద నాలుగో త్రైమాసికం సంతృప్తికరంగానే సాగిందని సింగ్ పేర్కొన్నారు. ఆదాయం 5 శాతం పెరిగి రూ. 5,130 కోట్ల నుంచి రూ. 5,405 కోట్లకు చేరింది. నికర రుణ భారం 3.3 శాతం పెరిగి రూ. 40,178 కోట్లకు చేరింది. వడ్డీ వ్యయాలు 21 శాతం ఎగిసి రూ. 907 కోట్లుగా నమోదయ్యాయి. ఇక మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఆదాయం 3 శాతం పెరిగి రూ. 21,238 కోట్లుగాను, నికర లాభం 55 శాతం పెరిగి రూ. 1,047 కోట్లుగాను నమోదైంది. పెరుగుతున్న ముడి వస్తువుల ధరల సమస్యను అధిగమించే ప్రణాళికలో భాగంగానే ఉచిత టాక్టైమ్ తగ్గింపు, టారిఫ్ల పెంపు చేపట్టినట్లు సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం మొత్తం ఆదాయంలో జీఎస్ఎం వైర్లెస్ డేటా వాటా 72 శాతంగా ఉందని తెలిపారు. -
82 లక్షలు పెరిగిన జీఎస్ఎం కనెక్షన్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జీఎస్ఎం మొబైల్ కనెక్షన్ల సంఖ్య మార్చ్లో 82.6 లక్షలు పెరిగి 72.19 కోట్లకు చేరుకుంది. క్రితం నెలతో పోలిస్తే ఇది 1.16 శాతం పెరుగుదల. సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలీ సబ్స్క్రయిబర్స్ వివరాలు లేవు. ఈ రెండూ కూడా జీఎస్ఎం సర్వీసులు ఇస్తున్నప్పటికీ.. గణాంకాలను సీవోఏఐకి నివేదించకపోవడమే ఇందుకు కారణం. అత్యధికంగా ఐడియా సెల్యులర్ కనెక్షన్లు 22.3 లక్షలు) పెరగ్గా, వొడాఫోన్ (22.2 లక్షలు), ఎయిర్టెల్ (18.9 లక్షలు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. గతేడాది నవంబర్ నుంచి జీఎస్ఎం కనెక్షన్లు పెరుగుతూ వచ్చినా.. మార్చ్లో మాత్రం తగ్గడం గమనార్హం. ఫిబ్రవరిలో సుమారు 1.02 కోట్ల కొత్త కనెక్షన్లు వచ్చాయి -
ఆర్కామ్ కాల్ రేట్లు పెరిగాయ్
ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ ప్రధాన టారిఫ్ల కాల్ రేట్లను 20 శాతం పెంచింది. ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ రేట్ల పెంపు వర్తిస్తుందని కంపెనీ బుధవారం తెలిపింది. ఈ నెల 25 నుంచి ఈ పెరుగుదల అమల్లోకి వస్తుందని కంపెనీ సీఈవో (కన్సూమర్ బిజినెస్)గుర్దీప్ సింగ్ చెప్పారు. సెకన్కు 1.5 పైసలుగా ఉన్న టారిఫ్ను 1.6 పైసలకు పెంచామని వివరించారు. దీంతో డిస్కౌంటెడ్ టారిఫ్లు పొందే వినియోగదారుల బిల్లులు 20 శాతం పెరుగుతాయని వివరించారు. అంతే కాకుండా రూ.43, రూ.148, రూ.259 స్పెషల్ టారిఫ్ వోచర్లకు ఆఫర్ చేసే నిమిషాల సంఖ్యను కూడా తగ్గించామని పేర్కొన్నారు. పెరుగుతున్న వ్యయాలను తట్టుకోవడానికి, ఉచిత, డిస్కౌంట్ మినిట్స్ను తగ్గించే వ్యూహాంలో భాగంగా ఈ టారిఫ్లను పెంచామని తెలిపారు. ఈ టారిఫ్ల పెంపు కారణంగా ఆదాయం మెరుగుపడుతుందని, లాభదాయకతపై సానుకూల ప్రభావం పడుతుందన్నారు. ఇతర కంపెనీలదీ అదే దారి భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీలూ కాల్ రేట్లను పెంచాయి. డిస్కౌంట్ స్కీమ్లకు సం బంధించిన టారిఫ్లను పెంచడమే కాకుండా కొన్ని ఉచిత ప్రయోజనాలను తగ్గించాయి. వొడాఫోన్, ఐడియా సెల్యులార్ కంపెనీలు వోచర్ల వ్యాలిడిటీని 30 రోజుల నుంచి 24కు తగ్గించాయి. మొబైల్ ఇంటర్నెట్ సేవలందించడానికి భారీగానే పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందని, రేట్లను పెంచడం మినహా మరో మార్గమేదీ లేదని భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విట్టల్ గత నెలలోనే పేర్కొన్నారు. -
నల్లధనంపై పోరుకు కొత్త యంత్రాంగం
పారిస్/లండన్/బాసెల్: పన్ను ఎగవేతలు, విదేశాల్లో అక్రమంగా దాచుకుంటున్న నల్లధనంపై పోరాటానికి పటిష్టమైన యంత్రాంగం ఇక అమల్లోకి రానుంది. అంతర్జాతీయ సంస్థ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఓఈసీడీ) ఈ సరికొత్త ప్రమాణాలను గురువారం ఆవిష్కరించింది. ఈ నెల 22-23 తేదీల్లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరగనున్న సమావేశంలో జీ-20 దేశాల ఆర్థిక మంత్రుల ఆమోదముద్ర కోసం అధికారికంగా దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఓఈసీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సంస్థ విధానాలను ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాలు పాటిస్తుండటం గమనార్హం. పన్నుల విషయంలో వివిధ దేశాలు సమాచారాన్ని ఆటోమేటిక్గా ఇచ్చిపుచ్చుకునే యంత్రాంగానికి ప్రపంచస్థాయి ప్రమాణాలను రూపొందించాల్సిందిగా ఓఈసీడీని జీ20 కూటమి గతేడాది ఆహ్వానించింది. అంతర్జాతీయంగా మరింత పారదర్శక పన్ను విధానాల కోసం దీన్ని ప్రతిపాదించారు. కాగా, ఆటోమేటిక్ సమాచార మార్పిడి అంశంపై భారత్ రెండేళ్ల క్రితమే సంతకాలు చేసింది. ఇందులో తాజాగా అమలు చేయనున్న కొత్త ప్రమాణాలను కూడా భారత్తో సహా 42 దేశాలు అనుసరించనున్నాయి. బ్యాంకులు ఇతరత్రా ఆర్థిక సంస్థల నుంచి సేకరించే సమాచారాన్ని వార్షిక ప్రాతిపదికన ఆటోమేటిక్గా సభ్యదేశాలన్నీ ఇచ్చిపుచ్చుకునేలా ఈ కొత్త ప్రమాణాలతో వీలవుతుందని ఓఈసీడీ వెల్లడించింది. ఎలాంటి ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని మార్పిడి చేసుకోవాలి... విబిన్నమైన బ్యాంకు ఖాతాలు, పన్ను చెల్లింపుదార్లకు సంబంధించి ఆర్థిక సంస్థలు నివేదించాల్సిన వివరాలతో పాటు అవి అనుసరించాల్సిన ఉమ్మడి పరిశీలన(డ్యూ డెలిజెన్స్) విధివిధానాలను ఈ కొత్త యంత్రాంగంలో పొందుపరిచినట్లు వివరించింది. ఇవి కొత్త ఒరవడి సృష్టించగలిగే(గేమ్ చేంజర్) విధానాలని ఓఈసీడీ సెక్రటరీ జనరల్ ఏంజెల్ గురియా అభివర్ణించారు. కాగా, ఈ కొత్త ప్రమాణాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయని, భారీ ఖర్చుతో కూడుకున్నవని స్విట్జర్లాండ్ బ్యాంకులు వ్యాఖ్యానించాయి. అయితే, పన్నుల ఎగవేతదార్లకు చెక్చెప్పేందుకు ఉద్దేశించిన ఈ యంత్రాంగాన్ని తాము ఆహ్వానిస్తున్నామని అక్కడి బ్యాంకింగ్ అసోసియేషన్(ఎస్బీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. భారతీయులు నల్లధనాన్ని దాచుకోవడానికి స్విట్జర్లాండ్ సహా కొన్ని దేశాల బ్యాంకులు స్వర్గధామంగా మారాయంటూ దేశంలో రాజకీయంగా దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నల్ల ధనం అంశాన్ని ప్రతిపక్షాలు ఒక అస్త్రంగా చేసుకోనున్నాయి కూడా. -
ఎయిర్టెల్, రిలయన్స్ జియో జట్టు
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు చెందిన టెలికం వెంచర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్లు జట్టుకట్టాయి. మౌలికసదుపాయాలను పంచుకోవడం కోసం ఒక సమగ్ర భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు మంగళవారం ఇరు కంపెనీలు ప్రకటించాయి. టెలికం రంగంలోకి అడుగుపెట్టేందుకు సర్వం సన్నద్ధం చేసుకుంటున్న రిలయన్స్ జియో ఇప్పటికే దేశవ్యాప్త వైర్లెస్ బ్రాండ్ బ్యాండ్(4జీ) స్పెక్ట్రం లెసైన్స్ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా వాయిస్ కాల్ సేవలను అందించేందుకు సైతం ఏకీకృత టెలికం లెసైన్స్ను ఈ కంపెనీ సొంతం చేసుకుంది. తాజా ఒప్పందం వల్ల ఇరు కంపెనీలకు తమ నెట్వర్క్ల నిర్వహణలో వ్యయాలు తగ్గించుకునేందుకుం దోహదం చేస్తుందని పేర్కొన్నాయి. ఇంటర్, ఇంట్రా సిటీ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్, సబ్మెరైన్ కేబుల్ నెట్వర్క్, టెలికం టవర్లు, ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ సేవలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను పంచుకునేందుకు తమ భాగస్వామ్యం వీలుకల్పిస్తుందని సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. భవిష్యత్తులో ఇతరత్రా షేరింగ్ అవకాశాలను అన్వేషించేందుకు సైతం దీనివల్ల వీలవుతుందని తెలిపాయి. పంజాబ్లో 4జీ సేవల కోసం టెలికం నెట్వర్క్ను మెరుగుపరిచేందుకు భారతీ ఎయిర్టెల్తో చేతులుకలిపేందుకు సిద్ధంగా రిలయన్స్ గ్రూప్ సిద్ధంగా ఉన్నట్లు ముకేశ్ అంబానీ తాజాగా పేర్కొన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సెప్టెంబర్లో తగ్గిన మొబైల్ యూజర్లు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య సెప్టెంబర్లో తగ్గిందని నియంత్రణ సంస్థ ట్రాయ్ తెలిపింది. గత 5 నెలల్లో ఈ వినియోగదారుల సంఖ్య తగ్గడం ఇదే మొదటిసారి. ట్రాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఈ ఏడాది ఆగస్టు నాటికి 87.67 కోట్లుగా ఉన్న మొబైల్ వినియోగదారుల సంఖ్య 0.70%తగ్గి 87.05 కోట్లకు పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్లో యూజర్ల సంఖ్య 10 లక్షలు తగ్గింది. ఆర్కామ్ సంస్థ 1.04 కోట్ల వినియోగంలోలేని కనెక్షన్లను తొలగించింది. దీంతో మొత్తం 11.62 కోట్ల యూజర్లతో(13.35 మార్కెట్ వాటా)తో ఈ కంపెనీ నాలుగో స్థానానికి పడిపోయింది. మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య కూడా 90.61 కోట్ల నుంచి 0.70% తగ్గి 89.98 కోట్లకు పడిపోయింది. ఐడియా సెప్టెంబర్లో 12.07 లక్షల మంది కొత్త యూజర్లను జతచేసుకోవడంతో మొత్తం యూజర్ల సంఖ్య 12.72 కోట్లకు పెరిగింది. 12.05 లక్షల కొత్త మొబైల్ యూజర్లతో వొడాఫోన్ మొత్తం సబ్స్క్రయిబర్ల సంఖ్య 15.55 కోట్లకు పెరిగింది. భారతీ ఎయిర్టెల్కు 11.64 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. 22.21% మార్కెట్ వాటా(19.33 కోట్ల మంది వినియోగదారుల)తో అగ్రస్థానంలో నిలిచింది. మొబైల్ నంబర్ పోర్టబిలిటి(ఎంఎన్పీ) కోసం 22.9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దేశంలో బ్రాడ్బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 1.52 కోట్ల నుంచి 0.52 శాతం వృద్ధితో 1.53 కోట్లకు పెరిగింది. -
భారత్ మార్కెట్లోకి యాపిల్ ఐఫోన్ 5ఎస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్రే మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 5ఎస్ గోల్డ్ కలర్ మోడల్ హవా నడుస్తోంది. ఎంతగా అంటే.. రూ.53,500 ఖరీదున్న ఫోన్ను రూ.1.2 లక్షలు వెచ్చించడమేకాదు, అదీ భారత్లో విడుదల కాకముందే చేజిక్కించుకునేంతగా. దీనికంతటికీ కారణమేమంటే ఆపిల్ తొలిసారిగా బంగారు వర్ణంలో ఐఫోన్ 5ఎస్ను పరిచయం చేయడమే. సహజంగానే ఆపిల్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది. అందరూ ఈ కలర్ ఫోన్కే ఎగబడడంతో కొరత ఏర్పడింది. ఇంకేముంది గోల్డ్ మేనియాకు పెట్టింది పేరైన మన దేశంలోనూ డిమాండ్ ఊహించనంతగా ఉంది. దీంతో రెండింతల ధర వెచ్చించేందుకూ ఐఫోన్ అభిమానులు వెనుకాడడం లేదు. అంతర్జాతీయంగా నెలన్నర క్రితం కొత్త మోడళ్లు విడుదలయ్యాయి. విడుదలైన మూడు రోజులకే గ్రే మార్కెట్లో ఉత్తరాదికి చెందిన ఒక కస్టమర్ రూ.1.2 లక్షలు వెచ్చించి గోల్డ్ కలర్ ఫోన్ను కైవసం చేసుకున్నాడట. సిమెంటు వ్యాపారంలో ఉన్న హైదరాబాద్ యువ వ్యాపారి ఒకరు రూ.1 లక్ష చెల్లించినట్టు సమాచారం. సరఫరా 200 పీసులే..: ఆపిల్ భారత్లో అధికారికంగా నవంబర్ 1న ఐఫోన్ 5ఎస్, 5సీ మోడళ్లను దేశవ్యాప్తంగా విడుదల చేసింది. ఐఫోన్ 5ఎస్ ధర 16 జీబీ మోడల్ రూ.53,500, 32 జీబీ రూ.62,500, 64 జీబీ రూ.71,500 ఉంది. అలాగే ఐఫోన్ 5సీ 16 జీబీ రూ.41,900 కాగా, 32 జీబీ రూ.53,500గా నిర్ణయించింది. గోల్డ్, సిల్వర్(వైట్), స్పేస్ గ్రే(బ్లాక్) రంగుల్లో ఐఫోన్ 5ఎస్ రూపొందింది. బ్లూ, గ్రీన్, పింక్, యెల్లో, వైట్ రంగుల్లో ఐఫోన్ 5సీ లభిస్తోంది. వైట్ మినహా మిగిలిన రంగులన్నీ ఆపిల్ తొలిసారిగా విడుదల చేసినవే. అయితే భారత్కు సరఫరా అయిన గోల్డ్ కలర్ 5ఎస్ ఫోన్ల సంఖ్య 200 మాత్రమేనని విశ్వసనీయ సమాచారం. ఐఫోన్ కొత్త మోడళ్ల డిమాండ్ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 10 వేల పీసులుంటుందని ఒక రిటైలర్ తెలిపారు. 30 శాతం మంది గోల్డ్ కలర్నే కోరుకుంటున్నారు. ఆ తర్వాతి స్థానం స్పేస్ గ్రే(బ్లాక్), సిల్వర్(వైట్) రంగులది. ఆర్కాం ప్రత్యేక ఆఫర్..: రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కాం) ఐఫోన్ కస్టమర్ల కోసం నెలవారీ వాయిదా పథకాన్ని ప్రకటించింది. కాల పరిమితి 24 నెలలు. లోకల్, ఎస్టీడీ కాల్స్, ఎస్ఎంఎస్ అపరిమితం. నేషనల్ రోమింగ్ ఉచితం. 3జీ డేటా అపరిమితంగా వినియోగించుకోవచ్చు. 16 జీబీ ఐఫోన్ 5సీ, 5ఎస్ను ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండా అందిస్తోంది. నెలవారీ వాయిదా 5సీ మోడళ్లు అయితే రూ.2,599, 5ఎస్ మోడళ్లు రూ.2,999. -
90 కోట్లు దాటిన ఫోన్ కనెక్షన్లు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలిఫోన్ కనెక్షన్లు మరోసారి 90 కోట్ల మార్కు ను అధిగమించాయి. ఏప్రిల్తో పోలిస్తే మే లో కనెక్షన్లు స్వల్పంగా 0.34 శాతం పెరిగి 90.005 కోట్లుగా నమోదయ్యాయి. చివరిసారిగా గతేడాది జూన్లో కనెక్షన్లు ఏకంగా 96.55 కోట్లుగా ఉండేవి. అప్పట్నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చాయి. శుక్రవారం ట్రాయ్ ఈ గణాంకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం ఏప్రిల్ ఆఖర్లో కనెక్షన్లు 89.70 కోట్లుగా ఉన్నాయి. మే లో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 86.7 కోట్ల నుంచి 87 కోట్లకు పెరిగింది. 12 లక్షల కొత్త కస్టమర్లతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ అగ్రస్థానంలో ఉండగా, 9 లక్షలతో వొడాఫోన్, 8.67 లక్షలతో ఐడియా సెల్యులార్, 8.51 లక్షలతో ఎయిర్టెల్, 2.77 లక్షల కొత్త కస్టమర్లతో ఎయిర్సెల్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు 9 లక్షలు తగ్గాయి. మొత్తం కనెక్షన్లపరంగా చూస్తే 18.96 కోట్ల సబ్స్క్రయిబర్స్తో ఎయిర్టెల్ అగ్రస్థానంలో ఉంది.