south asia
-
కొత్తగా మరో 2,835 విమానాలు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణానికి నానాటికీ పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి.. వచ్చే 20 ఏళ్లలో భారత్, దక్షిణాసియాలోని పౌర విమానయాన సంస్థలు కొత్తగా 2,835 విమానాలను సమకూర్చుకునే అవకాశం ఉందని యూఎస్కు చెందిన విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ వెల్లడించింది. గురువారం విడుదల చేసిన కమర్షియల్ మార్కెట్ ఔట్లుక్ ప్రకారం.. భారత బలమైన ఆర్థిక వ్యవస్థ, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ మార్కెట్ మద్దతు, 2043 నాటికి ఏటా 7 శాతం కంటే వార్షిక ట్రాఫిక్ వృద్ధి ఇందుకు దోహదం చేయనుంది. అలాగే మెరుగైన కనెక్టివిటీ, విమాన రంగానికి మద్దతు ఇచ్చే విధానాలు వృద్ధికి ఆజ్యం పోస్తాయి. భారత ట్రావెల్ మార్కెట్లో అతిపెద్ద, అభివృద్ధి చెందుతున్న సెగ్మెంట్గా దేశీయ విమాన ట్రాఫిక్ ఉంటుంది. లో–కాస్ట్ ఎయిర్లైన్స్ మరిన్ని కొత్త మార్గాలకు చేరుకోవడంతోపాటు, నూతన గమ్యస్థానాలను అనుసంధానిస్తాయి. అలాగే కార్గో విమానాల సంఖ్య అయిదింతలకు పెరుగుతుంది. అంతర్జాతీయంగా సరఫరా విస్తరణ, తయారీ, ఈ–కామర్స్ రంగం జోరు ఇందుకు కారణం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా.. బలమైన ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య వృద్ధి, పెరుగుతున్న గృహ ఆదాయాలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధిలో పెట్టుబడులు.. వెరశి భారత్, దక్షిణాసియా ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాణిజ్య విమానయాన మార్కెట్గా కొనసాగుతోందని బోయింగ్ భారత్, దక్షిణాసియా కమర్షియల్ మార్కెటింగ్ ఎండీ అశ్విన్ నాయుడు తెలిపారు. ‘ప్రజలకు విమాన ప్రయాణం ఎక్కువ అందుబాటులో వస్తుంది. రాబోయే రెండు దశాబ్దాలలో పెరిగిన డిమాండ్ను తీర్చడానికి ఈ ప్రాంతంలోని విమానయాన సంస్థలకు ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించే ఆధునిక విమానాల అవసరం. వీటిలో న్యారో బాడీ విభాగంలో 2,445, వైడ్ బాడీ సెగ్మెంట్లో 370 విమానాలకు డిమాండ్ ఉండొచ్చు. పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, టెక్నీషియన్ల డిమాండ్ నాలుగు రెట్లు పెరిగి 1,29,000కి చేరుతుంది’ అని చెప్పారు. -
వచ్చే రెండేళ్లూ 6.7 శాతం వృద్ధి
వాషింగ్టన్: భారత్ ఎకానమీ వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2025–26, 2026–27) 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక పేర్కొంది. దక్షిణాసియా వృద్ధికి సంబంధించి బహుళజాతి సంస్థ ఒక నివేదిక విడుదల చేస్తూ, 2025–26లో దక్షిణాసియా వృద్ధి అంంచనా 6.2 శాతంగా పేర్కొంది. సేవలు, తయారీ రంగాలు పటిష్ట వృద్ధిని నమోదుచేసుకుంటాయని పేర్కొంది. 2024–25లో వృద్ధి రేటును 6.5 శాతంగా సంస్థ అంచనా వేసింది. -
విదేశాల వైపు ‘టీ–హబ్’ చూపు
సాక్షి, హైదరాబాద్: భారత స్టార్టప్ రంగంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తున్న ‘టీ–హబ్’... విదేశాల్లోనూ తనదైన ముద్ర వేసే దిశగా దూసుకువెళుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ స్టార్టప్ల కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విదేశీ మార్కెట్లలోకి భారతీయ స్టార్టప్ల ప్రవేశం, కార్యకలాపాలకు ఊతమివ్వడం, అక్కడి నిపుణుల మార్గదర్శనం, నిధుల సేకరణ లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇదే సమయంలో విదేశీ స్టార్టప్లు భారత్తోపాటు దక్షిణాసియా దేశాల్లో కార్యకలాపాలు విస్తరించుకునేందుకు సాయం అందిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ‘టీ–బ్రిడ్జ్’అనే అనుబంధ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. భారతీయ స్టార్టప్ల ఆవిష్కరణలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేసి వ్యాపారపరంగా విజయవంతం అయ్యేలా తీర్చిదిద్దడంలో ‘టీ–బ్రిడ్జి’క్రియాశీలకంగా పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పోరేట్ సంస్థలు, స్టార్టప్లు, ఇంక్యుబేటర్లు, యాక్సిలేటర్లు (ప్రోత్సాహక సంస్థలు), విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలను ‘టీ–బ్రిడ్జి’అనుసంధానం చేసి... భారతీయ స్టార్టప్లు అంతర్జాతీయ మార్కెట్లో కార్యకలాపాలు విస్తరించేందుకు అనువైన వాతావరణాన్ని సిద్ధం చేసింది. 42 దేశాల్లో మార్కెట్తో అనుసంధానం.. భారతీయ, అంతర్జాతీయ స్టార్టప్ల ఆవిష్కరణలు, మార్కెటింగ్, నిధుల సేకరణకు వీలుగా టీ–హబ్ 42 దేశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పటివరకు 300కు పైగా భారతీయ స్టార్టప్లు, మరో 200కుపైగా అంతర్జాతీయ స్టార్టప్లు తమ ఆవిష్కరణలను మార్కెటింగ్ చేసుకునేందుకు టీ–హబ్ అంతర్జాతీయ ఒప్పందాలు దోహదం చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయంగా భారతీయ స్టార్టప్లను విస్తరించేందుకు ‘ఇండియా మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ (ఐమ్యాప్), గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ (జీమ్యాప్)’వంటి కార్యకలాపాలను చేపట్టింది. అమెరికా మార్కెట్లోకి భారతీయ స్టార్టప్ల ప్రవేశం, అక్కడి నిపుణుల మార్గనిర్దేశనం కోసం సిలికాన్ వ్యాలీలోని ‘ఫాల్కన్ ఎక్స్’సంస్థతో టీ–హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ‘కొరియాకు చెందిన చిన్న, మధ్యతరహా సంస్థల స్టార్టప్ ఏజెన్సీ (కొస్మె)’తోనూ టీ–హబ్కు భాగస్వామ్య ఒప్పందం ఉంది. అంతర్జాతీయ సంస్థ రెడ్బెర్రీతో కుదిరిన భాగస్వామ్య ఒప్పందం ద్వారా ఉత్తర అమెరికాలో ఆవిష్కరణల ఔట్పోస్ట్ను ఏర్పాటు చేసింది. గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ ద్వారా పేమాట్రిక్స్, ఆన్కానీ విజన్, డేటావెర్స్ వంటి భారతీయ స్టార్టప్లు అంతర్జాతీయంగా మార్కెట్ను విస్తరించుకోవడంతోపాటు అనేక భాగస్వామ్యాలు, పెట్టుబడులను సాధించగలిగాయి.టీ–హబ్ప్రయాణంలో మైలు రాళ్లు ఇవీ..» వివిధ రంగాలకు చెందిన 2వేలకుపైగా స్టార్టప్లకు మార్గదర్శనం, నిధుల సేకరణ, నెట్వర్కింగ్లో ఊతం అందించింది. » పెట్టుబడి సంస్థలు, కార్పోరేట్ సంస్థలు తదితరాల నుంచి స్టార్టప్లకు రూ.1,300 కోట్లకు పైగా నిధుల సేకరణలో సాయం చేసింది. » ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు, పైలట్ ప్రాజెక్టులు తదితర అంశాల్లో 200కుపైగా కార్పోరేట్ సంస్థలతో స్టార్టప్లు భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంలో కీలకంగా వ్యవహరించింది. » ఎంట్రప్రెన్యూర్షిప్, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం పరస్పర బదిలీ తదితరాల కోసం 100కు పైగా కార్యక్రమాలు, వర్క్షాప్లను నిర్వహించింది. » అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ స్టార్టప్లకు అవకాశాల కోసం విదేశీ సంస్థలు, ఇంక్యుబేటర్లు తదితరాలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. నేపాల్సంస్థలతోనూ ఒప్పందాలునేపాల్, భారత్ నడుమ ఆవిష్కరణలు, వాణిజ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా టీ–హబ్ ఇటీవల నేపాల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖతోపాటు అక్కడి మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంస్థ ‘డోల్మె’తోనూ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఎంఎస్ఎంఈలకు సంబంధించిన స్టార్టప్లను ప్రోత్సహించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక బదిలీ, రెండు దేశాల నడుమ దృఢమైన ఆర్థిక బంధం ఏర్పడేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంటోంది. -
మైక్రోసాఫ్ట్కు భారత్ కీలకం
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) ఉపయోగాల గురించి తెలిసే కొద్దీ, దానిపై సాధారణంగా నెలకొన్న వ్యతిరేకత స్థానంలో క్రమంగా సానుకూల ధోరణి పెరుగుతోందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా విభాగం ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తెలిపారు. తమ ’కోపైలట్’ ఏఐ అసిస్టెంట్ ప్రస్తుతం కృత్రిమ మేథకు దాదాపు పర్యాయపదంగా మారుతోందని పేర్కొన్నారు. ఇటీవలి అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురు ఏఐ డెవలపర్లలో ఒకరు భారత్ నుంచి ఉంటున్నారని చందోక్ తెలిపారు. మైక్రోసాఫ్ట్తో పాటు అన్ని టెక్ కంపెనీలకు భారత్ అత్యంత కీలకమైన మార్కెట్లలో ఒకటిగా ఉందని ఆయన పేర్కొన్నారు. తమ సంస్థపరంగా చూస్తే అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో భారత్ కూడా ఒకటని చందోక్ చెప్పారు. పటిష్టంగా డిమాండ్, సరఫరా.. ఇటు డిమాండ్ అటు సరఫరాపరంగా భారత మార్కెట్ పటిష్టంగా ఉందని చందోక్ చెప్పారు. ‘డిమాండ్పరంగా చూస్తే భారత్లో 7,000 పైగా లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థ ఉంది. సరఫరాపరంగా చూస్తే మైక్రోసాఫ్ట్కి చెందిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్లాట్ఫాం ’గిట్హబ్’లో అమెరికా తర్వాత అత్యధికంగా భారత్ నుంచి దాదాపు 1.5 కోట్ల మంది డెవలపర్లు ఉన్నారు. మరో రెండు మూడేళ్లలో ఈ సంఖ్య అమెరికాను కూడా దాటిపోతుంది‘ అని చందోక్ పేర్కొన్నారు. -
చరిత్రలో సువర్ణాధ్యాయం
రోమ్కు, ఆ తరువాత మధ్యధరా, యూరప్కు గ్రీస్ ఎలాంటిదో... దక్షిణాసియా, మధ్యఆసియా, ఆ మాటకొస్తే చైనాకూ భారత్ అలాంటిదని అంటారు విలియం డార్లింపిల్. క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 12, 13 శతాబ్దాల కాలం ఇండియాలో సువర్ణాధ్యాయం అని చెబుతారు తన తాజా పుస్తకంలో. భారతీయ గణిత, ఖగోళ శాస్త్ర భావనలు అరబ్ దేశాలకు, అక్కడి నుంచి యూరప్కు వ్యాప్తి చెందిన వైనం గురించి రాశారు. ప్రాచీన భారతదేశం విశ్వగురు అని, 12వ శతాబ్దంలో ముస్లిం పాలకుల రాకతో ఆ బంగారు కాలం అంతరించడం మొదలైందని వాదించే హిందుత్వవాదులకు ఈ పుస్తకం మద్దతుగా నిలుస్తుందన్న విమర్శలను డార్లింపిల్ కొట్టేస్తారు. ‘‘అది యాదృచ్ఛికం’’ అంటారు.విలియం డార్లింపిల్ తాజా పుస్తకం భారతీయ చదువరులకు బాగా నచ్చుతుందనుకుంటున్నాను. ఎందుకంటే... మనలాంటి వాళ్లు చాలాకాలంగా నమ్ముతున్న విషయాన్ని ఆయన మరోసారి రూఢి చేశారు. అయితే అదేమిటన్నది ఆయన మాటల్లో వినడమే మేలు. డార్లింపిల్ రాసిన పుస్తకం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 12 – 13 శతాబ్దాల మధ్య కాలం నాటి పరిణామాలకు సంబంధించినది. ఈ కాలానికి సంబంధించి ఆయన ఏమంటారంటే... ‘‘రోమ్కు, ఆ తరువాత మధ్యధరా, యూరప్కు గ్రీస్ ఎలాంటిదో... దక్షిణాసియా, మ««ధ్య ఆసియా, ఆ మాటకొస్తే చైనాకూ భారత్ అలాంటిది’’ అని!ప్రాచీన భారతదేశం ప్రపంచంలో తీసుకొచ్చిన మార్పుల గురించి డార్లింపిల్ ‘ద గోల్డెన్ రోడ్: హౌ ఏన్షియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్డ్ ద వరల్డ్’’ పేరుతో రాసిన పుస్తకంలో అక్షరబద్ధం చేశారు. భారతీయల చెవులకు ఇంపైన ఇంకో మాట కూడా ఇందులో ఉంది. ఇది చైనాతో భారత్ పోలికకు సంబంధించినది. చైనా తనను తాను ఈ ప్రపంచానికి కేంద్రంగా చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి పాశ్చాత్య దేశాలకు ప్రత్యక్ష వ్యాపారం ఉన్న ఆనవాళ్లేమీ లేవంటారు ఆయన. ఆ కాలంలో ‘‘ఒకరి గురించి మరొకరికి చూచాయగా మాత్రమే తెలుసు’’ అని ఆయన యూరప్, చైనాల గురించి నాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మరోవైపు భారత్, రోమన్ సామ్రాజ్యాల మధ్య వాణిజ్య విస్తృతి చాలా ఎక్కువ. భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై వసూలు చేసే సుంకం రోమన్ సామ్రాజ్య ఖజానాలో మూడో వంతు వరకూ ఉండేది. ఇంకో రుజువు ఏమిటంటే... భారతీయ సంగ్రహాలయాల్లో రోమ్ సరిహద్దుల్లోని దేశాల్లోనూ లేనన్ని రోమన్ నాణేలు ఉండటం. ఇది భారత్– చైనాల మధ్య శత్రుత్వాన్ని కొత్త రూపంలో రాజేసినట్టుగా లేదూ?ఇవన్నీ డార్లింపిల్ పుస్తకంలో మూడు రకాల కథనాల్లో కనిపిస్తాయి. చైనా, మధ్యాసియాలకు ఆపై సైబీరియా, మంగోలియాల వరకూ విస్తరించిన బౌద్ధం తాలూకూ కథనం ఒకటైతే... భారతీయ గణిత, ఖగోళ శాస్త్ర భావనలు అరబ్ దేశాలకు, అక్కడి నుంచి యూరప్కు వ్యాప్తి చెందిన వైనం రెండో కథనం. హిందూయిజ, సంస్కృతాలు దక్షిణాసియాలో కంబోడియా, లావోస్, జావాల వరకూ వ్యాపించిన కథనం చివరిది. బాగ్ధాద్ మంత్రుల మొదలుకొని ఇటలీ గణిత శాస్త్రవేత్తల వరకూ రకరకాల పాత్రల ద్వారా ఈ కథనాలు నడుస్తాయి. టొలెడో మతాధికారి, చైనాలోని ఏకైక మహిళ సామ్రాజ్ఞి, కంబోడియాలోని అంగ్కోర్వాట్, జావాలోని బోరోబుడుర్, బిహార్లోని నలందాల వెనుక దాగి ఉన్న ఎన్నో కథలను వివరిస్తుందీ పుస్తకం. టొలెడో మతాధికారి 1068లో ప్రపంచంలోని మే«ధా చరిత్ర గురించి రాస్తూ... అది భారత కాలమని వర్ణించాడు. ‘విలియం ద కాంకరర్’ తొలిసారిగా బ్రిటిష్ గడ్డపై అడుగుపెట్టిన ఈ కాలంలోనే రాసిన ఈ చరిత్రలో భారత్ తన వరాలకు పేరొందిందని రాశాడు. ‘‘శతాబ్దాలుగా విజ్ఞానానికి సంబంధించిన అన్ని శాఖల్లో భారతీయుల సామర్థ్యాన్ని రాజులు అందరూ గుర్తించారు. జ్ఞానవంతులు వాళ్లు. జ్యామితి, అంక గణితాల్లో ఎంతో పురోగతి సాధించారు. వైద్యం విషయంలో మానవులందరి కంటే ముందున్నారు’’ అని కీర్తించాడు. ఈ పుస్తకం ద్వారా నాకు మూడు విషయాలు స్పష్టమయ్యాయి. పుస్తక శీర్షికలోని బంగారు దారి నేల మార్గం కాదు. సముద్రాల పైది. శక్తిమంతమైన వానాకాలపు గాలులు భారతీయ వర్తకులను పశ్చిమాన అరేబియాకు, తూర్పున సుమత్రా, జావా వరకు చేరేలా చేశాయి.దక్షిణాసియాకు హిందూయిజం, సంస్కృత సంబంధిత సంస్కృతి విస్తరించేందుకు యుద్ధాలు కారణం కాదు. ఇందులో బ్రాహ్మణ మిషనరీలు ముందుంటే... తరువాతి కాలంలో వ్యాపారులు వ్యాప్తి చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... భారత్లోని అన్యాయ కుల వ్యవస్థ ఇక్కడకు విస్తరించకపోవడం. దురదృష్టం కొద్దీ డార్లింపిల్ ఈ విషయంపై ఎక్కువగా వివరించలేదు.అన్నింటికంటే ఆసక్తికరమైన అంశం, ఇది మనం ఆశించేది అయినప్పటికీ చారిత్రక వాస్తవం కాకపోవచ్చు... సోర్బోన్ , ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాన్నీ నలందా విశ్వవిద్యాలయ స్ఫూర్తితో ఏర్పాటు చేశారని అనిపిస్తుంది. చివరగా... ప్రాచీన భారతదేశం విశ్వగురు అని, 12వ శతాబ్దంలో ముస్లిం పాలకుల రాకతో ఆ బంగారు కాలం అంతరించడం మొదలైందని వాదించే హిందుత్వవాదులకు ఈ పుస్తకం మద్దతుగా నిలుస్తుందని కొంతమంది విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. డార్లింపిల్ రెండింటికీ సంబంధమే లేదని స్పష్టం చేస్తారు. ‘‘అది యాదృచ్ఛికం, అసంగతం.’’ ఆయన పుస్తకంలో చెప్పే ఇంకా ఆసక్తికరమైన సంగతులు చాలానే ఉన్నాయి. వాటిని మీ కోసమే వదిలేస్తాను.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఐఎఫ్ఎఫ్ఎస్ఏలో షబానా సినీ స్వర్ణోత్సవం
బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ కెరీర్లో గోల్డెన్ ఇయర్లోకి అడుగు పెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సౌత్ ఆసియా (ఐఎఫ్ఎఫ్ఎస్ఏ) టొరంటో’ షబానా ఆజ్మీ సినీ స్వర్ణోత్సవాన్ని జరపనుంది. 13వ ఐఎఫ్ఎఫ్ఎస్ఏ–టొరంటో వేడుకలు కెనడాలో ఈ ఏడాది అక్టోబరు 10 నుంచి 20 వరకు జరగనున్నాయి. 22 భాషల్లోని 120 చిత్రాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమవుతాయని అలాగే సినిమా రంగానికి విశేష సేవలు అందించిన సీనియర్ నటి షబానా ఆజ్మీ స్వర్ణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటారని, ‘ఐఎఫ్ఎఫ్ఎస్ఏ–టొరంటో ఫెస్టివల్’ నిర్వాహక అధ్యక్షుడు సన్నీ గిల్ పేర్కొన్నారు. ఇక 1950 సెప్టెంబరు 18న కైఫీ ఆజ్మీ (దివంగత ప్రముఖ గీత రచయిత), దివంగత నటి షౌకత్ కైఫీ దంపతులకు హైదరాబాద్లో జన్మించారు షబానా ఆజ్మీ. 150పైగా చిత్రాల్లో నటించారామె. షబానా ఆజ్మీ తొలి చిత్రం ‘అంకుర్’ 1974లో విడుదలైంది. దాంతో నటిగా షబానా ఫిల్మ్ ఇండస్ట్రీలో 50 ఏళ్ల జర్నీని పూర్తి చేసుకున్నట్లయింది. ‘అంకుర్, అర్థ్ (1982), కందార్ (1984), పార్ (1984), గాడ్ మదర్ (1999) వంటి సినిమాలకు గాను షబానా జాతీయ ఉత్తమ నటి అవార్డులను అందుకున్నారు.ఇంకా ‘శత్రంజ్ కే ఖిలాడీ – 1977 (ది చెస్ ప్లేయర్స్), మండీ (1983), ఫైర్ (1996), మక్డీ (2002)’ వంటి ఎన్నో హిట్ ఫిల్మ్స్లో నటించారామె. అంతేకాదు... అమెరికన్ మిలటరీ సైన్స్ ఫిక్షన్ టెలివిజన్ సిరీస్ ‘హాలో’ (2022–2024)లోనూ నటించి, హాలీవుడ్ ప్రేక్షకుల మెప్పు పొందారు. సినీ రంగానికి షబానా అందించిన సేవలకుగాను 1998లో పద్మశ్రీ, 2012లో పద్మభూషణ్ పురస్కారాలు ఆమెను వరించాయి. -
దక్షిణాసియాలోనే అధిక కాలుష్యం ఎందుకు? కట్టడి ఎలా?
శీతాకాలం రాగానే ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా దేశంలోని అనేక నగరాలు వాయు కాలుష్యానికి లోవుతుంటాయి. పొగ మంచు దుప్పటిలో దూరిన విషపూరిత వాయు కాలుష్యం ప్రజల జీవనాన్ని అవస్థలపాలు చేస్తోంది. కాలుష్యం కారణంగా ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలలో పరిస్థితి చాలా దారుణంగా మారింది. అయితే చలికాలంలో కాలుష్యం అంతలా ఎందుకు తీవ్రమవుతుందని, దీని ప్రభావం దక్షిణాసియాపైనే ఎందుకు అధికంగా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిపుణుల అభిప్రాయం ప్రకారం గత రెండు దశాబ్దాలలో దక్షిణాసియా ప్రాంతంలో వేగంగా పారిశ్రామికీకరణ జరిగింది. ఆర్థికాభివృద్ధి ఊపందుకుంది. జనాభా కూడా అంతే వేగంగా పెరిగింది. వీటన్నింటి కారణంగా డీజిల్,పెట్రోల్, ఇతర ఇంధన వనరుల వినియోగం అత్యధికం అయ్యింది. ఫలితంగా కాలుష్య స్థాయి కూడా పెరిగింది. వీటన్నింటికీతోడు దక్షిణాసియాలో దారుణమైన కాలుష్యం వెనుక మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి.ఢిల్లీ-ఎన్సిఆర్లో శీతాకాలపు కాలుష్యానికి అతిపెద్ద కారణం పంజాబ్, హర్యానాలో రైతులు పంటలను కాల్చడం. ఈ ప్రాంతంలో 38 శాతానికి పైగా కాలుష్యం వరి పొలాల్లోని వృథా గడ్డిని కాల్చడం కారణంగానే ఏర్పడుతోంది. దీనికితోడు గత కొన్నేళ్లుగా ఢిల్లీలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వీటి నుంచి వెలువడే పొగ కూడా కాలుష్యానికి కారణంగా నిలుస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఢిల్లీ రోడ్లపై దాదాపు 80 లక్షల వాహనాలు నడుస్తున్నాయి. ప్రతి వెయ్యి మందికి 472 వాహనాలు ఉన్నాయి. అంటే ఢిల్లీలో ప్రతి ఇద్దరికి సగటున ఒక వాహనం ఉంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వాలు అనేక పద్ధతులను అవలంబిస్తున్నప్పటికీ అవేవీ తగినంతగా లేవని తేలింది. భారతప్రభుత్వం హరిత ఇంధనాలపై దృష్టి సారించింది. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రోత్నాహాన్ని అందిస్తోంది. అయినా కాలుష్య నియంత్రణకు అడ్డుకట్ట పడటం లేదు. ఢిల్లీ-ఎన్సిఆర్తో సహా దక్షిణాసియాలోని ప్రధాన నగరాల్లో కాలుష్య సమస్య నుండి బయటపడటం కష్టమైన పని కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం విధాన రూపకర్తలు తమ సంకల్ప శక్తిని ప్రదర్శించాలంటున్నారు. ప్రభుత్వాలు స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని చట్టాలను రూపొందించాలని, వ్యవసాయం, ఇతర కార్యకలాపాల నుండి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను తగిన విధంగా పారవేయాలని సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: పాక్కు చైనా అందిస్తున్న ఆయుధ సహకారమెంత? -
బుకింగ్లపై బ్లూడార్ట్ భారీ డిస్కౌంట్లు
ముంబై: దక్షిణాసియాలో ప్రముఖ ఎక్స్?ప్రెస్ ఎయిర్ రవాణా, ఏకీకృత లాజిస్టిక్స్ సంస్థ బ్లూడార్ట్ ఎక్స్?ప్రెస్ లిమిటెడ్ దీపావళి పండుగ సందర్భంగా బుకింగ్లపై ఆఫర్లను ప్రకటించింది. ఇందుకోసం ‘దివాలి ఎక్స్?ప్రెస్’ను తీసుకొచి్చంది. ఈ ప్రత్యేక ఆఫర్ నవంబరు 19 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దేశీయ లేదా అంతర్జాతీయ ప్రదేశాలకు పంపించే అన్ని దీపావళి బహుమతుల షిప్మెంట్లపై డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. 2 నుంచి 10 కిలోల బరువు ఉన్న దేశీయ షిప్మెంట్లపై 40 శాతం తగ్గింపు, 3 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలో లు, 20 కిలోలు, 25 కిలోల బరువు ఉన్న అంతర్జాతీయ నాన్–డాక్యుమెంట్ షిప్మెంట్స్పై 50 శాతం తగ్గింపును పొందొచ్చని తెలిపింది. -
భారత్ను మాల్దీవులు వదులుకోగలదా?
దక్షిణాసియాలో చిట్టచివరగా బ్రిటిష్ పాలకుల నుండి స్వాతంత్య్రం పొందిన దేశం మాల్దీవులు. 1965లో స్వతంత్ర దేశంగా అవతరించినప్పటి నుండి ఆర్థిక, శాస్త్రీయ–సాంకేతిక అభివృద్ధిలో, సముద్ర భద్రతా విషయాల్లో మాల్దీవులకు భారత్ చేయూత అందించింది. 1988లో ఆపరేషన్ కాక్టస్ ద్వారా ప్రభుత్వాన్ని తీవ్రవాదుల చెర నుండి కాపాడింది. అయినా కొన్నేళ్లుగా భారత్ ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. రెండు మూడేళ్లుగా ఏకంగా ‘ఇండియా అవుట్’ ప్రచారానికి కేంద్రం అయింది. దీని వెనక ఐఎస్ఐ, చైనా ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. అలాగని అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకగా తన వాణిని బలంగా వినిపిస్తున్న భారత్ను దూరం చేసుకోవడం మాల్దీవులకు కూడా అంత తేలిక కాదు. మాల్దీవుల్లో కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో భారత వ్యతిరేక రాజకీయాలు నెరిపిన మొహమ్మద్ ముయిజ్యూ సుమారు 54 శాతం ఓట్లతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో ఇరు దేశాల సంబంధాలు ఎలా వుండబోతున్నాయో అంచనా వేసే ముందు, భారత్ పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణాలు ఏమిటో తెలుసుకోవాలి. మాల్దీవ్స్లో 12వ శతాబ్దంలో ఇస్లాం అడుగుపెట్టినప్పటికీ అది స్థానిక సంప్రదాయాలు, ఆచారాల సమ్మిళితంతో ఉదారవాదంగా ఉండేది. 1970ల్లో ఉదార మత విధానాలను అవలంబించిన మాల్దీ వులు, క్రమంగా గల్ఫ్ దేశాల ప్రభావానికి లోనయ్యింది. చమురు ఉత్పాదిత గల్ఫ్ దేశాలు అరబ్, ముస్లిం ప్రపంచంలో ముఖ్యమైన భూమికను పోషించడం మొదలుపెట్టాయి. సున్నీ ముస్లిం వహాబీజం పాటించే గల్ఫ్ దేశాలు సంప్రదాయవాదాన్ని బలంగా ప్రచారం చేయడం, మొహమ్మద్ అబ్దుల్ గయూమ్ నేతృత్వంలోని ప్రభుత్వం 1980, 90ల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి మతాన్ని అస్త్రంగా ఉపయోగించుకోవడం, గల్ఫ్ దేశాల నుండి వచ్చే చమురు, ఆర్థిక సహాయాన్ని పొందేందుకు సాంప్రదాయవాదాన్ని, ఇస్లామిక్ షరియా చట్టాల్ని ప్రవేశపెట్టడం వరుసగా జరిగాయి. ఆఫ్గనిస్తాన్ను సోవియట్ ఆక్రమించడంతో దానికి వ్యతిరేకంగా సంప్రదాయవాద వర్గాల ఏకీకరణ జరిగింది. ఇరవై ఒక్కటవ శతాబ్దం మొదట్లో జరిగిన ప్రపంచ పరిణామాల ప్రభావం మాల్దీవుల యువత మీద తీవ్రంగా పడింది. ఆ దేశంలోని చాలామంది యువత అల్–ఖాయిదాలో చేరినట్టుగా వార్తలు వచ్చాయి. 2007లో జరిగిన వరుస బాంబు పేలుళ్లు ప్రమాద ఘంటికలు మోగించాయి. 2008లో మాల్దీవులు ఏక పార్టీ వ్యవస్థ నుండి బహుళ పార్టీ వ్యవస్థగా రూపాంతరం చెందింది. మతపరమైన సాంప్రదాయ పార్టీలు ఏర్పాటు కావడానికీ, అవి మత రాజకీయాలు నెరప డానికీ ఇది దారి తీసింది. 2012లో షరియా చట్టాల అమలు కోసం అనేక ఉద్యమాలు ఈ పార్టీలు చేపట్టాయి. చాలామంది యువత ‘ఐసిస్’లో చేరడానికి సిరియా వెళ్లినట్టు అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. ఇస్లామిక్ ఛాందసవాదాన్ని ఎగదోయడంలో, ముఖ్యంగా భారత్ పట్ల వ్యతిరేకతను పెంచడంలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ పాత్ర చాలా ఉంది. 1990ల్లో జరిగిన ఇస్రో ‘హనీ ట్రాప్’ కేసులో మాల్దీవులకు చెందినవారు ఉన్నట్టుగా బయట పడటం ఆ దేశంలో వేళ్లూనుకున్న ఐఎస్ఐ పాత్రకు ఒక ఉదాహరణ మాత్రమే. 1978 నుండి 2008 వరకు సుమారు ముప్పయ్యేళ్లు మాల్దీవులను ఏకధాటిగా పాలించిన మౌమూన్ అబ్దుల్ గయూమ్, అయన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్, 2018లో అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహీం సోలీహ్ భారత్ పట్ల సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. కానీ 2013 నుండి 2018 మధ్యకాలంలో అధికారంలో ఉన్న అబ్దుల్లా యామీన్ ప్రభుత్వం భారత్ వ్యతిరేక విధానాలను అనుసరించింది. తాజాగా ఆయన వారసుడిగా మొహమ్మద్ ముయిజ్యూ భారత్ పట్ల అంతే తీవ్ర వ్యతిరేక ప్రచారాలతో ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించారు. యామీన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో మాల్దీవ్స్లో చైనా కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయి. 2014లో చైనీస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో మాల్దీవ్స్ చేరడమే కాకుండా అనేక మౌలిక వసతుల నిర్మాణ బాధ్యతలను చైనీస్ కంపెనీలకు అప్పగించింది. మాలె, హుల్హులే, హుల్హుమాలే దీవులను కలిపే సినిమాలే బ్రిడ్జితో పాటు, వెలనా అంతర్జాతీయ విమానాశ్రయం, హుల్హులే ద్వీపంలోని నివాస సముదాయ నిర్మాణాలు, టూరిజం, ఎనర్జీ తదితర రంగాల్లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. మాల్దీవుల ఆర్థిక శాఖ అంచనా ప్రకారం, 2022 చివరికల్లా ఆ దేశ అప్పులు జీడీపీలో 110 శాతం. అందులో చైనా వాటా సుమారు 70 శాతం. ప్రతి సంవత్సరం చైనాకు చెల్లించే వడ్డీలు సుమారు 92 మిలియన్ల అమెరికన్ డాలర్లు. మాల్దీవుల వార్షిక బడ్జెట్లో ఇది సుమారు 10 శాతం. యామీన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం, విదేశీయులు ఆ దేశంలో స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు. దీని ఆసరాగా చైనీస్ కంపెనీలు ఫెయిదూ ఫింహులు ద్వీపాన్ని 50 ఏళ్ల కాలానికి లీజుకు తీసుకున్నాయి. ఈ లెక్కలు చైనా ప్రభావం మాల్దీవుల పైన ఎంతవుందో, చైనా అప్పుల ఊబిలో ఎంతగా చిక్కుకుందో తెలియజేస్తాయి. చైనా ఈ పరిస్థితులను భారత వ్యతిరేక శక్తులను పెంచడానికి ఉప యోగించుకుంది. చైనా అనుసరిస్తున్న వైఖరిని గ్రహించిన ఇబ్రహీం సోలీహ్ ప్రభుత్వం ‘ఇండియా ఫస్ట్’ విధానాన్ని పాటించింది. అయితే భారత వ్యతిరేక శక్తులు ఒక క్రమ పద్ధతిలో ప్రచారాన్ని సాగించాయి. ఆ దేశంలో ఉన్న నిరుద్యోగానికి ముఖ్య కారణం, భారతీయులు టూరిజం తదితర రంగాల్లో ఉద్యోగాలు ఎగరేసుకు పోవడమేననీ, భారత్లో ముస్లింల పట్ల అణచివేతకు పాల్పడుతున్నా రనీ, భారత్ తన సైనిక కార్యక్రమాలు సాగిస్తూ మాల్దీవుల సార్వభౌ మత్వాన్ని ఉల్లంఘిస్తోందనీ, ఇబ్రహీం సోలీహ్ ప్రభుత్వం దేశ సంపదను భారత్కు ధారాదత్తం చేస్తోందనీ ఇలా అనేక రకాలుగా విష ప్రచారం చేశాయి. ఇదే రకమైన రాడికలైజేషన్, యువతలో భారత వ్యతిరేక భావజాల వ్యాప్తి బంగ్లాదేశ్లోనూ గమనించవచ్చు. ఈ ప్రచారం వెనక అటు ఐఎస్ఐ, ఇటు చైనా ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని భారత వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగించకుండా చేయడం, విదేశాంగ విధానానికి ఒక సవాలు. ఇప్పటికే హిందూ మహాసముద్రంలో మయాన్మార్ నుండి జిబౌటి వరకు తన ఆర్థిక, సైనిక, వ్యూహాత్మక ప్రభావాన్ని విపరీతంగా పెంచుకున్న చైనాను కట్టడి చేయడం అంత తేలిక కాదు. భారత్, చైనా మధ్య ఈ ప్రాంతంలో నెలకొన్న పోటీలో మాల్దీవులు ముఖ్య భూమికను పోషిస్తాయి, 2013లో అమెరికా మాల్దీవులతో సైనిక ఒప్పందాలు చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలను, భారత్ అడ్డుకుంది. దక్షిణాసియాలో ప్రాంతీయేతర శక్తుల ప్రభావాన్ని అడ్డు కోవడం భారత విదేశీ విధానంలో ముఖ్య భాగం. కానీ అది క్రమంగా మారడం గమనించవచ్చు. 2020లో కుదిరిన అమెరికా, మాల్దీవుల సైనిక ఒప్పందానికి భారత్ సానుకూలత వ్యక్తం చేసింది. మాల్దీవులకు సుమారు 1,800 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిగో గరిసియ అమెరికా మిలిటరీ స్థావరాన్ని గతంలో వ్యతిరేకించిన భారత్ ప్రస్తుత పరిస్థి తుల్లో తన స్వరం మార్చింది. ఈ ఒప్పందాలు చైనా ప్రభావాన్ని నిలువరించడంలో సహాయపడతాయని భావిస్తోంది. భారత వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడబోతున్నందుకు మరీ ఆందోళన చెందకుండా ఇదివరకే ఆ దేశంతో కుదిరిన అనేక ఒప్పందాలు, ముఖ్యంగా 500 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన థిలమలే సముద్ర వంతెన ప్రాజెక్ట్, తాగునీరు పైపులైన్ ప్రాజెక్ట్, విద్య, అరోగ్య సేవల వసతుల నిర్మాణ ప్రాజెక్టులు, వివిధ ఇతర పనులకు సంబంధించిన దాదాపు 300 బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులు కొనసా గించాలి. ఇవి మాల్దీవులకు చాలా ముఖ్యమైనవి. ఇవి కొనసాగించేందుకు నూతన ప్రభుత్వాన్ని ఒప్పించడం, భారత వ్యతిరేక ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తక్షణ కర్తవ్యాలు. అభివృద్ధి చెందు తున్న దేశాల గొంతుకగా తన వాణిని బలంగా వినిపిస్తున్న భారత్ను దూరం చేసుకోవడం మాల్దీవులకు కూడా అంత తేలిక కాదు. ‘ఇండియా అవుట్’ ప్రచారం అక్కడి భారత సైనిక బలగాలకు వ్యతి రేకంగానో, భావోద్వేగ రాజకీయాల కోసమో తప్ప, పూర్తిగా భారత్ను ఆ దేశానికి దూరం చేయాలని కాదని మనం అనుకోవలసి ఉంటుంది. డా‘‘ గద్దె ఓంప్రసాద్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన విభాగం, ఎస్ఐఎస్, జేఎన్యూ -
సూపర్డ్రైతో రిలయన్స్ జత
న్యూఢిల్లీ: దక్షిణాసియా మేధో హక్కుల(ఐపీ ఆస్తులు) విక్రయానికి రిలయన్స్ రిటైల్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూకే ఫ్యాషన్ రిటైలర్ సూపర్డ్రై తాజాగా పేర్కొంది. ఇందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ) ద్వారా రిలయన్స్ రిటైల్ 4 కోట్ల పౌండ్లు(రూ. 402 కోట్లు) వెచి్చంచనున్నట్లు వెల్లడించింది. ప్రధానంగా స్వెట్షర్టులు, హుడీస్, జాకెట్స్ తదితర ఫ్యాషన్ ప్రొడక్టులను రూపొందిస్తున్న సూపర్డ్రై.. జేవీలో 24 శాతం వాటాను పొందనుంది. మిగిలిన 76 శాతం వాటా రిలయన్స్ రిటైల్ చేతిలో ఉంటుంది. ఒప్పందం ప్రకారం సూపర్డ్రై బ్రాండ్ ఐపీ ఆస్తులు కొత్తగా ఏర్పాటు చేయనున్న జేవీకి శాశ్వతంగా బదిలీకానున్నాయి. రిలయన్స్ బ్రాండ్స్ హోల్డింగ్ యూకేతో ఐపీ జేవీ ఏర్పాటుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సూపర్డ్రై పీఎల్సీ.. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీకి తెలియజేసింది. తద్వారా భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్లలో సూపర్డ్రై బ్రాండుసహా.. సంబంధిత ట్రేడ్మార్క్లను జేవీకి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. నిధుల ఆవశ్యకత: సూపర్డ్రై ఇటీవల హోల్సేల్ కస్టమర్ల నుంచి బలహీన ఆర్డర్ల కారణంగా స్టాక్ నిల్వలు, లిక్విడిటీ తదితర అంశాలలో సవాళ్లు ఎదుర్కొంటోంది. దీంతో జేవీకి తెరతీసింది. దీంతో స్థూలంగా 3.04 కోట్ల పౌండ్ల నగదు లభించనుందని అంచనా వేస్తోంది. కాగా.. తాజా ఒప్పందంతో రిలయన్స్ దక్షిణాసియాలోని మూడు దేశాలలో కార్యకలాపాలు చేపట్టనున్నట్లు సూపర్డ్రై తెలియజేసింది. జేవీలో సూపర్డ్రై వాటాను కొనసాగించడంతోపాటు.. తమ నైపుణ్యం ద్వారా బ్రాండ్ డెవలప్మెంట్, డిజైన్, మార్కెటింగ్లలో మద్దతిస్తుందని రిలయన్స్ బ్రాండ్స్ ఎండీ దర్శన్ మెహతా చెప్పారు. భారత్ భారీ అవకాశాల మార్కెట్కాగా.. రిలయన్స్తో పటిష్ట బంధమున్నట్లు సూపర్డ్రై వ్యవస్థాపకుడు, సీఈవో జూలియన్ డంకెర్టన్ పేర్కొన్నారు. -
అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నా.. భారత్ భేష్
న్యూఢిల్లీ: రాజకీయ, ఆర్థిక అస్థిరతల మధ్య వచ్చే సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని చాలా మంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే 90 శాతం కంటే ఎక్కువ మంది దక్షిణాసియా, ముఖ్యంగా భారతదేశంలో మధ్య తరహా లేదా బలమైన వృద్ధి నమోదవుతుందని విశ్వసిస్తున్నారు. ఈ మేరకు తమ అధ్యయనంలో అభిప్రాయాలు వ్యక్తం అయినట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తాజా ‘చీఫ్ ఎకనమిస్ట్ ఔట్లుక్’ నివేదిక పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో తీవ్ర ప్రతికూలతల నేపథ్యంలో చైనా అవుట్లుక్ మసకబారింది. ► ప్రపంచం రాజకీయ, ఆర్థిక అస్థిరతతో పోరాడుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి నిర్దేశిస్తున్న సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) చేరుకోవడంలో పురోగతి బలహీనంగా ఉంటుందని దాదాపు 10 మందిలో ఆరుగురు విశ్వస్తున్నారు. ► ప్రత్యేకించి ఆహార భద్రత, వాతావరణ పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణతో సహా ఎస్డీజీకి సంబంధించి పలు లక్ష్యాల్లో మందగమనం ఉంటుంది. 2030లో అర బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు తీవ్ర పేదరికంలో జీవిస్తారు. ► ఇటీవల అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినప్పటికీ కఠిన ఫైనాన్షియల్ పరిస్థితులు కొనసాగుతాయని మెజారిటీ (86 శాతం) అంచనా. ఆయా అంశాల నేపథ్యంలో వ్యాపార రుణాలపై ఒత్తిడి, కార్పొరేట్ రుణ ఎగవేతలలో పెరుగుదల, ఆస్తి–ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర దిద్దుబాట్లు తప్పదు. ► 74 శాతం మంది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరికొన్ని సంవత్సరాలు తప్పదని భావిస్తున్నారు. ► అమెరికాలో మే నుండి అవుట్లుక్ బలపడింది. ప్రతి 10 మందిలో ఎనిమిది మంది 2023, 2024 అమెరికా ఒక మోస్తరు లేదా లేదా బలమైన వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నారు. ► యూరోప్ విషయంలో ఎకానమీ బలహీనం లేదా మరీ బలహీన పరిస్థితులు ఈ ఏడాది ఉంటాయని 77 శాతం మంది భావిస్తున్నారు. 2024లో పరిస్థితులు కొంత మెరుగుపడవచ్చని అంచనా. -
భారత్ అగ్రరాజ్యం అవ్వాలంటే... 20 ఏళ్లలో 8 నుంచి 9 శాతం వృద్ధి అవశ్యం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నట్లు భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే వచ్చే 20 ఏళ్లలో 8–9 శాతం వృద్ధిని సాధించాల్సి ఉంటుందని డెలాయిట్ దక్షిణాసియా సీఈవో రోమల్ శెట్టి అన్నారు. పెట్టుబడులకు సంబంధించి ‘చైనా ప్లస్ వన్’ వ్యూహం (చైనాతో పాటు మరో దేశంలో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ఆలోచనలు) నుండి భారతదేశం ప్రయోజనం పొందగలదని ఆయన అన్నారు. భారత్ పెద్ద మార్కెట్ అని, ఇక్కడ అందుబాటులో ఉన్నంత స్థాయి, కార్యకలాపాల పరిమాణాన్ని మరే ఇతర దేశం అందించలేదని అన్నారు. ఒక వార్తా సంస్థకు ఆయన ఇచి్చన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. ► అంతరిక్ష రంగం విషయానికి వస్తే, భారతదేశంలో ఇప్పటికే 200 స్టార్టప్లు ఉన్నాయి. 2040 నాటికి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఈ రంగం ఆకర్షించే అవకాశం ఉంది. ► అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా భారత్ మారాలంటే కనీసం 2047 వరకు 8–9 శాతం వృద్ధిని సాధించాలి. మధ్య ఆదాయ స్థాయి పెరగడం, వేగంతో ఎదగడం అంత సులభం కాదు. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు ఏడాది ప్రాతిపదికన 8–9 శాతం వేగం వృద్ధిని నమోదుచేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ► వ్యవసాయం, అంతరిక్ష పరిశోధనలు, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్ వెహికిల్సహా ఇతర పురోగతి చెందుతున్న భారత్ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను అన్వేíÙంచవచ్చు. దేశం సంవత్సరానికి 16,000–18,000 కిలోమీటర్ల (వేగంతో)మేర రోడ్లను నిర్మిస్తోంది. ఇది మౌలిక రంగం పురోగతికి, ఆర్థికాభివృద్ధికి, వాణిజ్యాన్ని పెంపొందించడానికి దోహదపడే అంశం. ► బహుళజాతి కంపెనీలు ’చైనా ప్లస్ వన్’ విధానం వైపు చూస్తున్నాయి. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కంపెనీలు తమ తయారీని చైనా కాకుండా వేరే చోటికి తరలించాలని నిర్ణయించినప్పుడు ప్రయోజనం పొందే ఇతర దేశాలు ఉన్నప్పటికీ భారత్ మినహా మరే ఇతర దేశానికి అంత స్థాయి, పరిమాణం లేదు. ► ముడిచమురు దిగుమతుల బిల్లే భారత్ అతిపెద్ద సవాలు. సాంకేతికంగా దేశం పురోగమన పథంలో ఉన్నప్పటకీ.. కృత్రిమ మేధస్సు (ఏఐ)లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. ► ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఎస్అండ్పీ గ్లోబల్ గత నెలలో ఒక నివేదిక విడుదల చేస్తూ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత 3.4 ట్రిలియన్ డాలర్ల నుండి 2031 నాటికి 6.7 ట్రిలియన్ డాలర్లకు రెట్టింపు అవుతుందని అంచనా వేసింది. -
దక్షిణాసియాపై ఉగ్ర పంజా
ఉగ్రవాద బెడద ఇంకా సజీవంగానే ఉన్నదని మన పొరుగునున్న పాకిస్తాన్లో తరచు జరిగే దాడులు నిరూపిస్తుండగా మన దేశంతోపాటు బంగ్లాదేశ్, మయన్మార్లలో తన కార్యకలాపాలు విస్తరించుకోవటానికి అల్ కాయిదా పథకరచన చేస్తున్నదని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అనుబంధ నివేదిక హెచ్చరిస్తోంది. ఉగ్రవాద సంస్థల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ అవస రమైన ఆంక్షలను సిఫార్సు చేసే విభాగం ఈ నివేదికను రూపొందించింది. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అఫ్గానిస్తాన్లో అడుగుపెట్టి రెండు దశాబ్దాలపాటు సాగించిన పోరాటం చెప్పుకోదగ్గ ఫలితం ఇవ్వకపోగా, అన్నివిధాలా దెబ్బతిన్న అమెరికా రెండేళ్ల క్రితం అక్కడినుంచి వెనుదిరిగింది. దేశంలోని అన్ని వర్గాల మధ్యా సామరస్య సాధనకు ప్రయత్నించటం, అఫ్గాన్ సమస్యతో సంబంధంవున్న దేశాలకు శాంతిప్రక్రియలో చోటీయటం వంటివేమీ చేయకుండానే అమెరికా కాడి కింద పారేసింది. దాని ఫలితంగానే ఆ దేశంలో మహిళలను దారుణంగా అణిచేయటం, ప్రత్యర్థులను కున్నవారిని తుదముట్టించటం కొనసాగుతూనే ఉంది. ఆఖరికి తమ గడ్డపై నుంచి ఎటువంటి ఉగ్ర వాద కార్యకలాపాలనూ అనుమతించబోమని అమెరికాకు ఇచ్చిన హామీని సైతం తాలిబన్ పాల కులు తుంగలో తొక్కారు. భద్రతా మండలి తాజా నివేదిక దాన్నే ధ్రువీకరిస్తోంది. తమ భూభాగంలో అల్ కాయిదా లేనేలేదని తరచు బుకాయిస్తున్న తాలిబన్ల తీరుకు భిన్నంగా అడపా దడపా ఆ ఉగ్ర సంస్థ జాడల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో అల్ కాయిదా ముఖ్యులు దాదాపు 60 మంది వరకూ ఉండగా, ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే మరో 400 మంది ఉన్నారని భద్రతామండలి నివేదిక తెలిపింది. వీరికి మద్దతుగా నిలబడే బంధువర్గాన్నీ, సన్నిహితులనూ పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 2,000 మంది ఉంటా రని ఆ నివేదిక అంచనా వేసింది. అల్ కాయిదా నేతృత్వంలో రూపుదిద్దుకున్న మరో ఉగ్ర సంస్థ భారత ఉపఖండ అల్ కాయిదా (ఏక్యూఐఎస్)కు ప్రస్తుతం 200 మంది ఉగ్రవాదులున్నారని, ఈ సంస్థ పాకిస్తాన్లోని తెహ్రీక్–ఏ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)తో విలీనమై మన దేశంలోని జమ్మూ, కశ్మీర్తోపాటు మయన్మార్, బంగ్లాదేశ్లలో కార్యకలాపాలకు సిద్ధమవుతున్నదని భద్రతామండలి నివేదిక అంటున్నది. టీటీపీ ఆనుపానులు కనిపెట్టడంలో, ఆ సంస్థను నియంత్రించటంలో పాకిస్తాన్ పదే పదే విఫలమవుతోంది. టీటీపీతో పాకిస్తాన్ ప్రభుత్వం జరుపుతున్న చర్చలు నిరుడు నవంబర్లో విఫలమయ్యాక ఉగ్ర దాడులు మళ్లీ పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో ఒక మసీదుపై దాడిచేసి 95 మంది ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు, తాజాగా ఆదివారం ఖైబర్ ఫక్తున్ఖ్వా రాష్ట్రంలో ఆత్మా హుతి దాడి జరిపి, 40 మంది మరణానికి కారకులయ్యారు. అయితే ఈ దాడుల వెనక తాము లేమని టీటీపీ చెబుతోంది. ఆ సంస్థకు దన్నుగా నిలుస్తున్న అఫ్గాన్ ప్రభుత్వం కూడా ఖండిస్తోంది. ఇరుగు పొరుగుకు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశంగా ముద్రపడిన పాకిస్తాన్ చివరకు అదే ఉగ్రవాదం సాలెగూటిలో చిక్కుకుని విలవిల్లాడటం, దాడుల కారకులెవరో కూడా గుర్తుపట్టలేని నిస్సహాయ స్థితిలో పడటం వింతేమీ కాదు. దేశంలో లెక్కకు మించిన ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలు సాగిస్తు న్నాయని పాక్ సైన్యం అంచనా వేస్తోంది. ఇవన్నీ అటు సైన్యం పైనా, ఇటు పౌరుల పైనా తరచు దాడులు సాగిస్తున్నాయి. ఉగ్రవాద సంఘటనలు జరిగినప్పుడు ఏ సంస్థా తన ప్రమేయం ఉన్నదని ప్రకటించటం లేదు. ఇప్పుడు టీటీపీ, అల్ కాయిదాలు విలీనం కాబోతున్న వార్త నిజమే అయిన పక్షంలో దక్షిణాసియా ప్రాంత దేశాలతోపాటు పాకిస్తాన్కు కూడా మరింత ముప్పు ఖాయం. ఈ రెండు సంస్థలూ అఫ్గాన్లో ఇప్పటికే శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. ఆ సంస్థలను అన్నివిధాలా కట్టడి చేస్తున్నామని భ్రమల్లో కూరుకుపోయిన ప్రపంచ దేశాలు ఒకసారి సమీక్షించుకోవటం మంచిది. తమ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించబోమని గతంలో ఇచ్చిన హామీకి తాలిబన్లు కట్టుబడటం లేదని ఈ పరిణామాలన్నీ నిరూపిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలేమిటన్న అంశంపై ఐక్యరాజ్యసమితి దృష్టి పెట్టాలి. తగినన్ని నిధులు లేకుండా, ఎవరి అండదండలూ లేకుండా ఉగ్రవాద సంస్థలు వర్ధిల్లటం ఉత్తమాట. దాదాపు 20 ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో తిష్ఠ వేసి, కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తాలిబన్ పాలకులకు తెలియదనుకోవటం భ్రమ. తమతోపాటు కలిసినడుస్తున్నట్టు కనిపిస్తున్న నేతల్లో కొందరు వేరే ఉగ్ర సంస్థలకు విధేయులుగా మసులుకుంటున్నారని, వారు వివిధ ప్రభుత్వ విభాగాల్లోకి ప్రవేశిస్తున్నారని తాలిబన్లకు తెలియదనుకోవటం అమాయకత్వం. ఆ సంస్థల నేత లను ఉద్దేశపూర్వకంగానే అధికారిక వ్యవస్థల్లోకి ప్రవేశపెడుతున్నారని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. పాకిస్తాన్ సైతం మొదట్లో టీటీపీకి, అల్ కాయిదాకు సహాయ సహకారాలందించిన మాట వాస్తవం. టీటీపీ నాయకత్వం తనకు ఎదురుతిరగటం మొదలయ్యాక దానిపై దాడులు సాగిస్తోంది. ఒక బ్రిగేడియర్ను కోల్పోవటంతో సహా ఎన్నో నష్టాలను చవిచూస్తోంది. అటు అమె రికాకు తప్పుడు సమాచారం అందించి తాలిబన్లను అఫ్గాన్లో పునఃప్రతిష్ఠించటంలో కీలక పాత్ర పోషించి దెబ్బతింది. ఏ విలువలకూ కట్టుబడని పాలకుల చేతుల్లో అఫ్గాన్ ఉండటం దక్షిణాసియా ప్రాంత దేశాలకు మాత్రమే కాదు... ప్రపంచానికే ముప్పు తెస్తుంది. కనుక తాజా నివేదికపై భద్రతా మండలి దృష్టి సారించాలి. ఇతరత్రా అంశాల్లో ఎలాంటి విభేదాలున్నా ఉగ్రవాదాన్ని కట్టడి చేయ టంలో అన్ని దేశాలూ ఏకాభిప్రాయానికి రావాలి. -
రూపీ ట్రేడ్పై దక్షిణాసియా దేశాలతో చర్చలు
న్యూఢిల్లీ: రూపాయి మారకంలో సీమాంతర వాణిజ్య లావాదేవీలు నిర్వహించడంపై దక్షిణాసియా దేశాలతో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ చర్చలు జరుపుతోంది. యూపీఐ విధానం ద్వారా ప్రాంతీయంగా సీమాంతర చెల్లింపులను సులభతరం చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా యూపీఐకి సంబంధించి ఇప్పటికే భూటాన్, నేపాల్ తదితర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. శుక్రవారం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సదస్సులో కీలకోపన్యాసం చేసిన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాలు తెలిపారు. అలాగే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ప్రస్తుతం ప్రయోగదశలో ఉందని ఆయన చెప్పారు. క్లోనింగ్వంటి రిస్కులు ఉన్న నేపథ్యంలో డిజిటల్ రూపీని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టడంపై ఆర్బీఐ ఆచితూచి వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వంతో కలిసి అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో సెటిల్ చేసుకునే విధానంపై ఆర్బీఐ కసరత్తు చేస్తోంది. ప్రాంతీయంగా ఇప్పటికే కొన్ని దేశాలతో చర్చలు జరుపుతోంది‘ అని దాస్ వివరించారు. ద్రవ్యోల్బణ కట్టడికి ప్రాధాన్యం .. కోవిడ్, ద్రవ్యోల్బణం, ఆర్థిక మార్కెట్ల నిబంధనలు కఠినతరం కావడం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి సవాళ్ల నేపథ్యంలో దక్షిణాసియా ప్రాంత దేశాలు విధానపరంగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయన్నారు. భారత్ వంటి దక్షిణాసియా దేశాలు ద్రవ్యోల్బణ కట్టడిపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ఇందుకోసం విశ్వసనీయమైన ద్రవ్యపరపతి విధానాలతో పాటు సరఫరాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవడం, ద్రవ్య.. వాణిజ్య విధానాలు, పాలనాపరమైన చర్యలు అవసరమని ఆయన వివరించారు. ఇటీవల కమోడిటీ ధరలు, సరఫరాపరమైన సమస్యలు కొంత తగ్గడం వల్ల రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టవచ్చని పేర్కొన్నారు. అయితే ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో కొనసాగిన పక్షంలో వృద్ధికి, పెట్టుబడులకు రిస్కులు ఏర్పడవచ్చని దాస్ చెప్పారు. దక్షిణాసియా ప్రాంత దేశాలు ఇంధనాల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుండటం వల్ల, ఇంధన దిగుమతిపరమైన ద్రవ్యోల్బణంతో సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. దక్షిణాసియా దేశాలు వాణిజ్యం విషయంలో పరస్పర సహకరించుకుంటే ప్రాంతీయంగా వృద్ధికి, ఉపాధికి మరిన్ని అవకాశాలు లభించగలవని దాస్ చెప్పారు. -
అక్షర లక్షలు
దక్షిణాసియా సాహిత్యపు ప్రతిష్ఠను పెంచుతూ ఈ ఏటి బుకర్ పురస్కారాన్ని శ్రీలంకకు చెందిన సెహన్ తిలకరత్న గెలుచుకున్నారు. మరణానంతర థ్రిల్లర్ ‘ద సెవన్ మూన్స్ ఆఫ్ మాలీ అల్మీదా’ ఆయనకు ఈ పురస్కారం తెచ్చిపెట్టింది. ఉన్నట్టుండి ఒకరోజు చావు నుంచి మేల్కొన్న ఫొటోగ్రాఫర్ మాలీ అల్మీదా తను దాచిన ఛాయాచిత్రాలను సరైన మనిషి చేతుల్లో పెట్టడానికి చేసే ప్రయత్నం ఈ నవల. దానికిగానూ అతడికి ఉన్న కాలం కేవలం ఏడు చంద్రులు. ఈ ప్రయాణంలో భాగంగా 1980–90ల నాటి శ్రీలంక సంక్షుభిత కాలాన్ని, అంతర్యుద్ధం వల్ల జరిగిన మానవ నష్టాన్ని నవల చిత్రిస్తుంది. ఇంత కల్లోలంలోనూ ప్రతి మానవ జీవితమూ విలువైనదేనన్న ఒక ఆదర్శం కోసం అన్వేషించడం బుకర్ న్యాయనిర్ణేతలను కదిలించింది; షార్ట్లిస్టులో ఉన్న ఆరుగురు రచయితల్లోంచి కరుణతిలక వైపు మొగ్గేలా చేసింది. ఒక శ్రీలంక రచయిత ఈ బహుమతిని పొందడం ఇది రెండోసారి. మొదటి రచయిత కెనడాలో స్థిరపడిన మైకేల్ ఆండాట్జీ. 1992లో ‘ది ఇంగ్లిష్ పేషెంట్’ నవలకుగానూ ఆయన ఈ గౌరవం పొందారు. అక్టోబర్ నెలంతా సాహితీ మాసంగా గడిచిపోయింది. ఈ నెలలోనే అంతా ఎదురుచూసిన ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌను వరించింది. ఆంగ్లంలో రాసిన, యునైటెడ్ కింగ్డమ్ లేదా ఐర్లాండ్లో ప్రచురించిన పుస్తకాలు మాత్రమే అర్హమయ్యే బుకర్ ప్రై జ్ ‘పరిధి’ పరిమితమైనది అయినప్పటికీ, దీని కోసం కూడా సాహిత్య లోకం ఆసక్తిగా చూసింది. ఆంగ్ల భాషా వ్యాప్తి పెరుగుతూండటమూ, ఇతర భాషల సాహిత్యాలు కుంచించుకుపోతుండటమూ, ఇతర భాషీయులు కూడా ఆంగ్లాన్ని తమ మాతృభాషలాగే స్వీకరించి సాహిత్యపరమైన ఆలోచనను కూడా ఆ భాషలోనే చేస్తూండటమూ, ఆంగ్ల సాహిత్యం నిత్యనూతనంగా ఉంటుండటమూ, ఇలా చాలా కారణాల వల్ల బుకర్ ప్రైజ్ అచ్చమైన అంతర్జాతీయ అవార్డు స్థాయిని పొందింది. ఈ పురస్కార విజేతకు 50 వేల పౌండ్ల నగదు లభిస్తుంది. బ్రిటిష్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, దీని విలువ సుమారు 47 లక్షల రూపాయలు! బుకర్ ప్రైజ్ పేరుతో ఇస్తున్నప్పటికీ 1969–2001 వరకు మాత్రమే బ్రిటిష్ ఫుడ్ హోల్సేల్ ఆపరేటర్ అయిన ‘బుకర్ గ్రూప్ లిమిటెడ్’ ఈ అవార్డుకు నిధులు సమకూర్చింది. అది తప్పుకొన్న తర్వాత, 2002–19 వరకు ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ‘మ్యాన్ గ్రూప్’ ఇచ్చినందున మ్యాన్ బుకర్ ప్రైజ్ అని వ్యవహరించారు. 2019 నుంచి వెల్‡్ష శ్రీమంతుడు మైకేల్ మోరిట్జ్ ఛారిటీ సంస్థ ‘క్రాంక్స్టార్ట్’ దీనికి నిధులు ఇస్తోంది. దాతలు మారుతున్నప్పటికీ, ‘అత్యధిక పారితోషికం గల సాహిత్య పురస్కారాల్లో ఇదీ ఒక’టన్న ప్రతిష్ఠకు మాత్రం లోటురావడం లేదు. తమాషా ఏమిటంటే, దీన్ని తలదన్నే మొత్తాన్ని ఇస్తున్న పురస్కారాలు కూడా ఉన్నాయి. యూఏఈకి చెందిన ‘మిలియన్స్ పొయెట్’ పోటీకి 50 లక్షల ధీరమ్స్ (సుమారు 11 కోట్ల రూపాయలు) ఇస్తున్నారు. అరబిక్ దేశాల్లోని అత్యుత్తమ కవులను వెతికే ఈ రియాలిటీ టెలివిజన్ కవితల పోటీ ప్రసారమైనప్పుడు, టీఆర్పీ రేటింగ్స్లో ఫుట్బాల్నే వెనక్కి నెట్టేస్తుంది. నగదును టాప్–5 కవులకు పంచుతారు. ఇక స్పెయిన్ లో ఇచ్చే ‘ప్రీమియో ప్లానెటా దె నావెలా’ ప్రైజ్మనీ పది లక్షల యూరోలు. అంటే సుమారు 8 కోట్ల రూపాయలు. ప్రపంచంలో ఆర్థిక పరంగా ప్రస్తుతం ఇదే అత్యంత ఘనత వహించిన అవార్డు. 1952లోనే ఇది మొదలైంది. పుస్తకాల ప్రచురణ కర్త ‘గ్రూపో ప్లానెటా’ దీన్ని బహూకరిస్తుండటం గమనార్హం. ఇక ‘ఆస్ట్రిడ్ లిండ్గ్రెన్ మెమోరియల్ అవార్డు’ పేరుతో స్వీడన్ లో ఇచ్చే పురస్కార విలువ 50 లక్షల స్వీడిష్ క్రోనాలు(సుమారు 37 లక్షల రూపాయలు). గుర్తుంచుకోవాల్సింది స్వీడన్ జనాభా అక్షరాలా ఒక కోటి నలభై లక్షలు మాత్రమే. ఇక అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ విజేతకు ఒక కోటి స్వీడిష్ క్రోనార్ల నగదు (సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు)తోపాటు 18 క్యారెట్ల బంగారు పతకం బహూకరిస్తారు. మళ్లీ బుకర్ వద్దకే వస్తే– ఆంగ్లంలోకి అనువాదమైన ఇతర భాషా పుస్తకాల కోసం ప్రత్యేక విభాగంగా నెలకొల్పిన ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పురస్కార నగదు కూడా 50,000 పౌండ్లు. దీన్ని రచయిత, అనువాదకులకు సమంగా పంచుతారు. పోయినేడాది హిందీ నవలా రచయిత్రి గీతాంజలి శ్రీ, అనువాదకురాలు డైసీ రాక్వెల్తో పాటు గెలుచుకున్నది ఇదే. ఇంతేసి పారితోషికాలు, ఒక పుస్తకం కోసం సాహిత్య లోకం ఎదురుచూడటాలు తెలుగు నేలకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంగా కనిపించడం లేదూ! ఉమ్మడిగా రెండు రాష్ట్రాల జనాభా సుమారు తొమ్మిది కోట్లు. అయినా ఒక రచయిత తన సొంత ఖర్చుతో వేసుకునే వెయ్యి కాపీలు అమ్మడం కూడా దుర్భరం. ఇలాంటి వాతావరణానికి కారణాలు ఏమిటి? పఠనాన్ని తగ్గించాయని చెప్పే అన్ని కారణాలూ అన్ని దేశాలకూ వర్తిస్తాయి కదా. మరెక్కడుంది లోపం? మన సంస్కృతిలో. ‘చదవడం’ అంటే మనకు అర్థం వేరే. ‘ఒక దేశం తన కథకులను కోల్పోయిందంటే, తన బాల్యాన్ని కోల్పోయినట్టే’ అన్నాడు పీటర్ హాండ్కే. మన జీవితమంతా మన చిన్నతనంలోనే ఉండిపోయిందని పెద్దయినకొద్దీ అర్థమవుతూ వస్తుంది. డబ్బులు మాత్రమే సర్వస్వమా అంటే– అది మన సారస్వత నిర్మాతలను మనం ఎలా గౌరవించుకుంటున్నాం అన్నది తెలియజేస్తుంది. బాక్సాఫీస్ కలెక్షన్లలో వెయ్యి కోట్లు దాటే సినిమాలు తీస్తున్న తెలుగు నేల మీద, ఒక తెలుగు రచయితకు కోటి రూపాయల బహుమతి ఇచ్చే ఊహయినా చేయగలమా? -
భారత్ సహా 5 దేశాలపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత
సింగపూర్: కోవిడ్–19 నేపథ్యంలో వివిధ దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను సింగపూర్ సడలిస్తోంది. తాజాగా, భారత్ సహా ఐదు దక్షిణాసియా దేశాలను బుధవారం నుంచి ఆంక్షల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. భారత్తోపాటు బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, పాకిస్తాన్, శ్రీలంకకు చెందిన అన్ని రకాల ప్రయాణికులు తమ దేశానికి రావచ్చు, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లవచ్చని సింగపూర్ ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే, ఈ ప్రయాణికులు 10 రోజులపాటు తమ ఇళ్లలోనే క్వారంటైన్లో గడపాల్సి ఉంటుందని తెలిపింది. మరో ఆరు దక్షిణా సియా దేశాలకు సంబంధించిన ప్రయాణ ఆం క్షలను సమీక్షిస్తున్నట్లు కూడా వివరించింది. -
South Asia Football Tournament: ఫైనల్లో భారత్
మాలీ: దక్షిణాసియా ఫుట్బాల్ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్కు చేరింది. టైటిల్ పోరుకు చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో సునీల్ ఛెత్రి బృందం 3–1తో మాల్దీవులు జట్టును ఓడించింది. లీగ్ దశలో టాప్–2లో నిలిచిన భారత్, నేపాల్ జట్లు శనివారం జరిగే ఫైనల్లో తలపడతాయి. -
ఐసిస్–కెతో భారత్కూ ముప్పు!
న్యూఢిల్లీ: మధ్య, దక్షిణాసియాల్లో జీహాద్ లక్ష్యంగా ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ ఐసిస్–కె భారత్పైనా దృష్టి సారించినట్టుగా ఇంటెలిజెన్స్కు సమాచారం అందింది. మధ్య ఆసియా దేశాల తర్వాత భారత్నే లక్ష్యంగా చేసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. భారత్లో దాడులు చేయడం, యువతపై గాలం వేసి తమ సంస్థలోకి లాగడం వారి ముందున్న లక్ష్యమని, భారత్లో ముస్లిం పాలన తీసుకురావాలన్న ఎజెండాతో వారు పని చేస్తున్నట్టుగా తమకు సమాచారం ఉందని ప్రభుత్వ అధికారి తెలిపారు. కేరళ, ముంబైకి చెందిన ఎందరో యువకులు ఇప్పటికే ఈ సంస్థలో చేరారని చెప్పారు. ఈ ఉగ్రవాద సంస్థ క్రమంగా బలం పెంచుకుంటూ పోతే భారత్లో ఎన్నో స్లీపర్ సెల్స్ చురుగ్గా మారే అవకాశం ఉందని ఆ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్ను తాలిబన్లు కైవశం చేసుకున్న తర్వాత ఉగ్రవాద సంస్థల గురి భారత్పైనే ఉందని అన్నారు. కేరళ టు కాబూల్ టు కశ్మీర్ అది 2016 సంవత్సరం, జూలై 10. కేరళలోని కాసర్గోడ్కు చెందిన ఓ వ్యక్తి తన 30 ఏళ్ల కుమారుడు అబ్దుల్ రషీద్, ఆయన భార్య అయేషా (సోనియా సెబాస్టియన్) ముంబైకి వెళ్లిన దగ్గర్నుంచి కనిపించకుండా పోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసులు తీగ లాగితే ఐసిస్–కె డొంక కదిలింది. వారు దేశాన్ని వీడి ఉగ్ర సంస్థలో చేరడానికి కాబూల్ వెళ్లారని తేలింది. కేరళ నుంచి కాబూల్కి వెళ్లిన వారు తిరిగి కశ్మీర్కు వచ్చి దాడులకు పన్నాగాలు పన్నారు. అప్పట్నుంచి ఈ సంస్థపై భారత్ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. ఇక కాబూల్లోని గురుద్వారాపై 2020 మార్చి 25న జరిగిన దాడిలో కూడా ఐసిస్–కెలోని భారతీయుల ప్రమేయం ఉన్నట్టు తేలింది. -
ఇండియా చేతికి ఇజ్రాయెల్ డ్రోన్గార్డ్ వ్యవస్థ?!
దక్షిణాసియాకు చెందిన ఒక దేశానికి తమ ఈఎల్ఐ–4030 డ్రోన్ గార్డ్ వ్యవస్థను(సీ–యూఏఎస్)ను విక్రయించినట్లు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్(ఐఏఐ) చేసిన ప్రకటన సంచలనం కలిగిస్తోంది. సదరు దేశం పేరును సంస్థ వెల్లడించకున్నా, అది భారతేనని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల భారత ఎయిర్ఫోర్స్ స్టేషన్ల వద్ద డ్రోన్లు కలకలం సృష్టించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ సంస్థ ప్రకటన ప్రాముఖ్యం సంతరించుకుంది. కొన్ని కోట్ల డాలర్లకు డ్రోన్ గార్డ్ విక్రయాన్ని పూర్తి చేశామని మాత్రమే ఈనెల 2న ఐఏఐ ప్రకటించినట్లు డిఫెన్స్ వార్తల ప్లాట్ఫామ్ జానెస్ తెలిపింది. ఎప్పటికల్లా సదరు దేశానికి ఈ వ్యవస్థను డెలివరీ చేసేది వెల్లడించలేదు. తమ డోమ్ వ్యవస్థపై భారత్ ఆసక్తి చూపుతోందని గతేడాది ఇజ్రాయెల్కు చెందిన ఒక ఉన్నతాధికారి ప్రకటించిన సంగతి తెలిసిందే! దీన్ని దృష్టిలో ఉంచుకొనే, తాజాగా ఐఏఐ చేసిన ప్రకటనలోని దేశం ఇండియా అని పలువురు అంచనా వేస్తున్నారు. భారత్ వద్ద ప్రస్తుతం ఎలాంటి యాంటీ డ్రోన్ వ్యవస్థ లేదని రక్షణ నిపుణుడు అభిజిత్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. జమ్మూ ఘటనల నేపథ్యంలో ఈ డోమ్ వ్యవస్థకు ప్రాధాన్యం పెరగడం, భారత్కు ఇజ్రాయెల్ నమ్మకమైన రక్షణ భాగస్వామి కావడం వల్ల సీ–యూఏఎస్ను భారత్ కొనుగోలు చేసేందుకు అభ్యంతరాలు ఉండవని భావిస్తున్నట్లు చెప్పారు. ఇలా పనిచేస్తుంది ఒకవైపు నుంచి వచ్చే దాడులనే కాకుండా పలువైపుల నుంచి వచ్చే దాడులను సైతం డ్రోన్ గార్డ్ అడ్డుకోగలదు. ఇందులో షార్ట్, మీడియం, లాంగ్ రేంజ్ (3, 4.5, 6కిలోమీటర్ల రేంజ్)వేరియంట్లుంటాయి. ఇందులో వివిధ విభాగాలుంటాయి. ఒక్కో విభాగంలో సెన్సర్లు ఒక్కో పని నిర్వహిస్తాయి. ఏఈఎస్ఏ, మల్టి మిషన్ 3డీ ఎక్స్ బాండ్ రాడార్, కామిన్ట్ జామర్, ఈఓ మరియు ఐఆర్ సెన్సర్ అనే విభాగాలు డ్రోన్ గార్డ్లో ఉంటాయని ఐఏఐ తెలిపింది. వచ్చిన డ్రోన్లను అడ్డుకొని వెనక్కు పంపడాన్ని సాఫ్ట్ కిల్ అని, డీకేడీ(డ్రోన్ కిల్ డ్రోన్) వ్యవస్థను ఉపయోగించి వచ్చిన డ్రోన్లను పేల్చేయడాన్ని హార్డ్ కిల్ అని అంటారు. తమ సీ– యూఏఎస్ చిన్న, సూక్ష్మ డ్రోన్ల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని, ఒక రక్షణ వలయాన్ని కల్పిస్తుందని ఐఏఐ అధికారి ఎలి అల్ఫాసి వివరించారు. తమ వ్యవస్థలోని జామింగ్ ఫీచర్ దాడికి వచ్చిన డ్రోన్స్ వెనక్కు వెళ్లేలా లేదా క్రాష్ అయ్యేలా చేస్తుందన్నారు. ఇప్పటికే పలువురు కస్టమర్లకు దీన్ని విక్రయించామని, భారత్ కూడా దీనిపై ఆసక్తి చూపిందని గతంలో ఆయన చెప్పారు. తాజా దాడుల ప్రభావం? జమ్మూలో ఎయిర్ఫోర్స్ స్టేషన్ పై ఇటీవల డ్రోన్ దాడి జరిగింది. దాని తర్వాత పాక్లోని భారత రాయబారి కార్యాలయ సమీపంలో డ్రోన్లు తచ్చాడాయి. జమ్మూ ఎయిర్ఫోర్స్ స్టేషన్పై దాడికి వచ్చిన డ్రోన్లో జీపీఎస్ అడ్రస్ను లాక్ చేశారు. అంతేకాకుండా పేలుడు పదార్థాలను సైతం డ్రోన్ జారవిడిచింది. ఫలితంగా ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. దేశ మిలటరీ చరిత్రలో ఇది తొలి డ్రోన్ అటాక్గా భావిస్తున్నారు. దాడిలో పాక్ టెర్రరిస్టుల పాత్ర ఉంటుందని జాతీయ భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది ఉగ్రదాడిగా జమ్మూ పోలీసు చీఫ్ ప్రకటించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని భవిష్యత్లో మరిన్ని డ్రోన్ దాడులు జరగకుండా నివారించేందుకు సిద్ధమైంది. ఇటీవలే ప్రధాని హోం, రక్షణ మంత్రులతో పాటు భద్రతా సంస్థలు, మిలటరీ అధికారులతో సమావేశమయ్యారు. అత్యున్నత రక్షణ విధానాన్ని రూపొందించాలని çనిర్ణయించారు. దీన్లో భాగంగానే డ్రోన్ గార్డ్ను భారత్ కొనుగోలు చేసి ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం. -
5.5 కోట్ల యూజర్లకు ఎయిర్టెల్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: 5.5 కోట్ల యూజర్లకు ఎయిర్టెల్ శుభవార్త అందించింది. కరోనా మహమ్మరి విజృంభిస్తున్న తరుణంలో ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. తన నెట్వర్క్లోని తక్కువ-ఆదాయం గల 5.5 కోట్ల వినియోగదారులకు రూ.49 ప్యాక్ను ఒకసారి ఉచితంగా అందించనున్నట్లు పేర్కొంది. రూ.49 ప్యాక్ కింద 100 ఎంబి డేటా, 38 విలువైన టాక్ టైమ్ రూ.28 రోజుల చెల్లుబాటు కానున్నట్లు తెలపింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న తమ వినియోగదారులకు అత్యవసర సమయాల్లో క్లిష్టమైన సమాచారాన్ని పంచుకోవడానికి ఇది కొంత సహాయ పడనున్నట్లు పేర్కొంది. అలాగే, ఈ సమయంలో ప్రజలు తమ కుటుంబం, స్నేహితులతో కనెక్ట్ అవ్వడానికి అవసరం ఉందని గ్రహించిన ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.79తో రీఛార్జ్తో రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చని వివరించింది. ఈ కూపన్ల వల్ల క్లిష్ట సమయాల్లో వారి కుటుంబంతో కనెక్ట్ అవ్వొచ్చని పేర్కొంది. ఈ రెండు ప్రయోజనాలు రాబోయే వారం రోజుల్లో ప్రీపెయిడ్ వినియోగదారులకు అందుతాయని సంస్థ ప్రకటించింది. దక్షిణ ఆసియా, ఆఫ్రికాలోని 18 దేశాలలో 45.8 కోట్లకు పైగా కస్టమర్లు కలిగి ఉన్న భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఎయిర్టెల్ ఒకటి. ఇది ఆఫ్రికన్ మార్కెట్లో రెండవ అతిపెద్ద మొబైల్ ఆపరేటర్. ప్రస్తుతం మనదేశంలో భారతీ ఎయిర్టెల్కు 34కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. చదవండి: హీరో మోటోకార్ప్ ప్రియులకు తీపికబురు -
సహకరించుకుందాం.. సవాళ్లను ఎదిరిద్దాం..
న్యూఢిల్లీ: దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ద్వీప దేశాలు తమ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పని చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆయా దేశాల మధ్య పరస్పర సహకారం పెరగాలని ఆకాంక్షించారు. కరోనా వ్యాప్తిని నియంత్రించే విషయంలో ఈ దేశాలన్నీ సహకరించుకున్నాయని హర్షం వ్యక్తం చేశారు. దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ద్వీప దేశాల మధ్య అనుసంధానం పెరగకపోతే 21వ శతాబ్దం ఆసియా శతాబ్దం కాబోదని తేల్చిచెప్పారు. 10 ఇరుగు పొరుగు దేశాలతో కలిసి ‘కోవిడ్–19 మేనేజ్మెంట్: ఎక్స్పీరియన్స్, గుడ్ ప్రాక్టీసెస్, వే ఫార్వర్డ్’ పేరిట గురువారం నిర్వహించిన వర్క్షాప్లో ఆయా దేశాల ప్రతినిధులను ఉద్దేశించి మోదీ ఆన్లైన్లో మాట్లాడారు. ప్రత్యేక వీసా పథకం తీసుకొద్దాం.. వర్క్షాప్లో మోదీ కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. దక్షిణాసియా దేశాలు ప్రత్యేక వీసా పథకాన్ని తీసుకురావాలని కోరారు. దక్షిణాసియా ప్రాంతంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో సేవలందించడానికి వీలుగా డాక్టర్లు, నర్సులు ఒక దేశం నుంచి మరో దేశానికి సులభంగా, వేగంగా ప్రయాణించేలా వీసాలు ఇవ్వాలని అన్నారు. అలాగే ఎయిర్ అంబులెన్స్ ఒప్పందంపైనా దక్షిణాసియా దేశాల పౌర విమానయాన శాఖ మంత్రులు దృష్టి పెట్టాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్లు చూపుతున్న ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఉమ్మడిగా ఒక స్థానిక వేదికను సృష్టించుకుంటే బాగుంటుందని అన్నారు. ‘పరీక్ష పే చర్చ’ ఆన్లైన్లోనే.. సాక్షి, న్యూఢిల్లీ: వార్షిక పరీక్షల ముందు విద్యార్థుల్లో భయాందోళనలను దూరం చేయడానికి మోదీ ప్రతిఏటా ‘పరీక్ష పే చర్చ’ నిర్వహిస్తున్నారు. 9–12 తరగతుల విద్యార్థులతో మాట్లాడేవారు. కోవిడ్ కారణంగా ‘పరీక్ష పే చర్చ’ను ఈ ఏడాది ఆన్లైన్లోనే నిర్వహించాలని నిర్ణయించారు. చర్చలో పాల్గొనేందుకు ఎంపికైన వారికి ప్రత్యేకంగా పీపీసీ(పరీక్ష పే చర్చ) కిట్ ఇస్తారు. విద్యుత్ సంస్కరణల్లో ముందడుగు విద్యుత్ పంపిణీ, నియంత్రణ రంగాల్లో సంస్కరణలు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యుత్ పంపిణీ రంగంలో ఇబ్బందులను తొలగించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. డిస్కమ్లకు రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ను రూపొందిస్తున్నామని వెల్లడించారు. విద్యుత్, పునరుత్పాదక ఇంధన రంగానికి బడ్జెట్లో కేటాయించిన నిధుల సమర్ధ వినియోగానికి సంబంధించి గురువారం జరిగిన ఒక వెబినార్ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఇతర నిత్యావసరాలను నచ్చినవారి నుంచి కొనుక్కునే వీలున్నట్లే.. విద్యుత్ను కూడా వినియోగదారులు తమకు నచ్చిన పంపిణీదారు నుంచి కొనుగోలు చేసుకునే వీలుండాలని ప్రధాని వ్యాఖ్యానించారు. విద్యుత్ రంగాన్ని ప్రభుత్వం ప్రత్యేక రంగంగా పరిగణిస్తుందని, పరిశ్రమ రంగంలో భాగంగా చూడదని వివరించారు. గత ఆరేళ్లలో దేశ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్ధ్యం రెండున్నర రెట్లు, సౌర విద్యుదుత్పత్తి సామర్ధ్యం 15 రెట్లు పెరిగిందని వెల్లడించారు. 139 గిగావాట్ల అదనపు సామర్థ్యాన్ని సాధించి ‘వన్ నేషన్.. వన్ గ్రిడ్.. వన్ ఫ్రీక్వెన్సీ’లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. దేశీయ తయారీ కంపెనీలు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నది తమ అభిమతమన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు రంగం మధ్య నెలకొన్న విశ్వాసానికి ఈ వెబినార్ ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ‘పీఎం కుసుమ్’పథకం ద్వారా, రైతులు తమ క్షేత్రాల్లో చిన్న, చిన్న సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా చూస్తామన్నారు. అలా, 30 గిగావాట్ల సౌర విద్యత్ ఉత్తత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. -
దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని సహించం
వాషింగ్టన్: అమెరికాలో తమ ప్రభుత్వం ఏర్పాటైతే దక్షిణాసియాలో టెర్రరిజాన్ని సహించబోదని బైడెన్ ఎన్నికల ప్రచార నిర్వాహకులు చెప్పారు. భారత దేశం అమెరికా సహజ భాగస్వాములని నమ్ముతున్నామని తెలిపారు. భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తామని తెలిపారు. అమెరికాలోని హిందూ, అమెరికన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వివిధ అంశాలతో ఒక ప్రశ్నావళి తయారుచేసి, తమ తమ అభిప్రాయాలను తెలపాల్సిందిగా అధ్యక్షస్థానానికి పోటీ చేస్తోన్న పార్టీలకు పంపించింది. మొట్టమొదటిగా ఆ ప్రశ్నావళికి బైడెన్ రాతపూ ర్వకం గా సమాధానమిచ్చారు. ఇరువురూ ఈ ప్రశ్నావళికి ఇచ్చిన సమాధానాలను బట్టి, నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో కమిటీ నిర్ణయిస్తుంది.(చదవండి: బైడెన్కే భారతీయుల బాసట) -
కోవిడ్ పేదలు వంద కోట్లు
న్యూయార్క్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది పేదరికం బారిన పడతారని, అందులోనూ దక్షిణాసియాలో భారీ స్థాయిలో పేదలుగా మిగులుతారని ఓ సర్వేలో తేలింది. కింగ్స్ లండన్ కాలేజీ, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ సంయుక్తంగా ఐక్యరాజ్యసమితిలోని యూనివర్సిటీ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనమిక్ రీసెర్చ్ కలసి ఓ సర్వే చేశాయి. ఈ సర్వే నివేదిక తాజాగా వెల్లడైంది. 100 కోట్ల మంది కలసి రోజుకు 50 కోట్ల డాలర్ల రాబడి కోల్పోతున్నారని నివేదిక పేర్కొంది. మున్ముందు పరిస్థితులు ఇంతకంటే దిగజారవచ్చని తెలిపింది. దక్షిణాసియాలో భారీగా పేదలు పెరగనున్నారని పేర్కొంది. భారత్, సబ్ సహారన్ ఆఫ్రికాలోనే పేదరికం 30 శాతం వరకూ ఉంటుందని నివేదిక వెల్లడించింది. తూర్పు ఆసియా, పసిఫిక్, చైనాలు కలిపి 41 శాతం పేదలకు ఆవాసాలుగా మారనున్నాయంది. అల్పాదాయ దేశాలైన నైజీరియా, ఇథియోపియా, బంగ్లాదేశ్, ఇండోనేíసియాలు కలిపి 18 శాతం పేదరికాన్ని చవి చూస్తాయని అంచనా వేసింది. డీఆర్ కాంగో, టాంజానియా, పాకిస్తాన్, కెన్యా, ఉగాండా, ఫిలిప్పీన్స్ దేశాలు 11–12 శాతం పేదలకు కేంద్రాలుగా ఉంటాయని తెలిపింది. అత్యంత నిరుపేదలు ఉండే దేశాల్లో ఇథియోపియా, భారత్, నైజీరియా దేశాలు టాప్ 10లో ఉంటాయంది. -
అక్కడి నుంచే భారత్లోకి కరోనా
సాక్షి, బెంగళూరు : కరోనా మన దేశానికి యూరప్, దక్షిణ ఆసియా దేశాల నుంచి వచ్చి ఉంటుందని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ తాజా అధ్యయనం వెల్లడించింది. దేశంలోని 294 కరోనా వైరస్ జన్యుక్రమాలపై కుమార్ సోమసుందరం, మైనక్ మండల్, అంకిత లావార్డ్లతో కూడిన ఐఐఎస్సీ బృందం చేసిన అధ్యయనం గుర్తించిన విషయాల్లో ఇది ఒక అంశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్స్–కోవిడ్–2 వైరస్కీ, భారతదేశంలోని వైరస్కీ మధ్య ఉన్న జన్యుపరమైన తేడాలను నిర్ధారించడంలో భాగంగా ఈ అధ్యయనం నిర్వహించారు. భారత్తో ఎక్కువ రాకపోకలు జరిగే, కోవిడ్ విస్త్రుతంగా వ్యాప్తి చెందిన దేశాలైన యూరప్, తూర్పు మధ్య ఒషియేనా, దక్షిణ ఆసియా ప్రాంతాల నుంచి మన దేశంలోకి ఈ వైరస్ వచ్చి ఉండొచ్చన్నది పరిశోధకుల అభిప్రాయం. (చైనాలో ఆగస్టులోనే కరోనా విజృంభణ!) ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పీపీఈ కిట్లు న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. దళంలోని ప్రతి సభ్యుడికి ఐదేసి పీపీఈ కిట్లు అందజేస్తామని ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్.ఎన్. ప్రధాన్ తెలిపారు. వీటిలో రెండు కోవిడ్కు, మిగతా మూడు ఎండ, ఇతర కలుషితాలు సోకకుండా రక్షణ కల్పించేవన్నారు. రక్షణ, సహాయక చర్యల్లో పాల్గొనే బృంద సభ్యులకు పీపీఈ కిట్లు, హైడ్రో క్లోరోక్విన్ మాత్రలు అందించడంతోపాటు వ్యాధినిరోధక శక్తి పెంపునకు ఆయుష్ శాఖ సూచించిన విధంగా చర్యలు తీసుకుంటా మని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల సంభవించిన అంఫన్ తుపాను సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిలో 51మందికి కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. వీరిలో ఎవరికీ కోవిడ్ లక్షణాలు లేనందున, మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. 15 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కేసుల ప్రభావం అధికంగా ఉన్న 15 రాష్ట్రాల్లోని 50కి పైగా జిల్లాలు, మున్సిపాలిటీలకు కేంద్ర ఆరోగ్య శాఖ కేంద్ర బృందాలను పంపింది. అత్యధిక కేసులు ఉన్న ప్రాంతాలు, అధికంగా వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు సాయంగా హైలెవల్ మల్టీ డిసిప్లినరీ సెంట్రల్ టీమ్స్ పనిచేస్తాయి. తెలంగాణకు నాలుగు, మహారాష్ట్రకు 7, తమిళనాడుకు 7, రాజస్తాన్కు 5, అసోంకు 6, హరియాణాకు 4, గుజరాత్కు 3, కర్ణాటకకు 4, ఉత్తరాఖండ్కు 3, మధ్యప్రదేశ్కు 5, పశ్చిమబెంగాల్కు 3, ఢిల్లీకి 3, బిహార్కు 4, యూపీకి 4, ఒడిశాకు 5 బృందాలను పంపినట్టు తెలిపింది. ప్రతీ త్రిసభ్య బృందంలో ఇద్దరు ఆరోగ్య నిపుణులు, ఒక సీనియర్ సంయుక్త కార్యదర్శి స్థాయి నోడల్ అధికారి ఉంటారు. -
8.8లక్షల కోట్ల డాలర్లు!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 5.8–8.8 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లనుంది. ఇందులో దక్షిణాసియా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై సుమారు 142–218 బిలియన్ డాలర్ల దాకా ప్రతికూల ప్రభావం పడనుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఏప్రిల్ ప్రారంభంలో వెలువరించిన అంచనాలకు కొనసాగింపుగా ఏడీబీ తాజా నివేదికను రూపొందించింది. ఏప్రిల్ 3న నాటి ఆసియా అభివృద్ధి అంచనాల (ఏడీవో) నివేదికలో ప్రపంచ ఎకానమీకి కరోనా వైరస్పరమైన నష్టాలు సుమారు 2 లక్షల కోట్ల డాలర్ల నుంచి 4.1 లక్షల కోట్ల డాలర్ల దాకా ఉండొచ్చని పేర్కొంది. తాజాగా.. ‘కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ ఎకానమీ సుమారు 5.8 – 8.8 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో నష్టపోనుంది. ఇది గ్లోబల్ జీడీపీలో 6.4–9.7 శాతానికి సమానం. అటు దక్షిణాసియా జీడీపీ కూడా 3.9–6.0 శాతం మేర క్షీణించవచ్చు. భారత్ సహా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తుండటం ఇందుకు కారణం‘ అని వివరించింది. ఈ అధ్యయనంలో విధానపరమైన చర్యల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఏడీబీ తెలిపింది. గ్లోబల్ జీడీపీ 2–4 శాతం తగ్గొచ్చంటూ ప్రపంచ బ్యాంకు వేసిన అంచనాల కన్నా ఏడీబీ అంచనాలు రెట్టింపు కావడం గమనార్హం. ఈ క్షీణత 6.3 శాతం స్థాయిలో ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. చైనాకు 1.6 లక్షల కోట్ల డాలర్ల నష్టాలు .. ఆంక్షలను స్వల్పకాలికంగా మూడు నెలల పాటు కొనసాగించిన పక్షంలో ఆసియా, పసిఫిక్ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ నష్టాలు 1.7 లక్షల కోట్ల డాలర్ల మేర, ఆరు నెలల పాటు అమలు చేస్తే 2.5 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలోనూ ఉంటాయని ఏడీబీ పేర్కొంది. మొత్తం గ్లోబల్ ఉత్పత్తి క్షీణతలో ఈ ప్రాంత వాటా దాదాపు 30 శాతం ఉంటుంది. చైనా నష్టాలు సుమారు 1.1–1.6 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉండొచ్చని ఏడీబీ అంచనా. ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ కరోనా వైరస్ కట్టడిపై వేగంగా స్పందించాయని, ద్రవ్యపరమైన చర్యలతో ఆదాయ నష్టాలను తగ్గించే ప్రయత్నం చేశాయని ఏడీబీ తెలిపింది. ఈ చర్యలను ఇలాగే కొనసాగించిన పక్షంలో కరోనాపరమైన ప్రతికూల ప్రభావాలు 30–40 శాతం దాకా తగ్గొచ్చని వివరించింది. జీతాల్లో కోతలు.. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్లలో వేతన ఆదాయాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండొచ్చని ఏడీబీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆదాయాలు 1.2 లక్షల కోట్ల డాలర్ల నుంచి 1.8 లక్షల కోట్ల డాలర్ల దాకా తగ్గొచ్చని పేర్కొంది. ఆసియాలో వేతన ఆదాయాలు 359–550 బిలియన్ డాలర్ల స్థాయిలో క్షీణించవచ్చని వివరించింది. ఏడీబీ నివేదిక -
మనదగ్గర కరోనా కేసులు తక్కువెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక జన సాంద్రత కలిగిన ప్రాంతం దక్షిణాసియా. దాదాపు రెండు వందల కోట్ల మంది నివసించే ఈ ప్రాంతం ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యరంగంలోనూ వెనకబడింది. అయినా ఆరోగ్యరంగంతోపాటు ఆర్థికంగా బాగున్న చైనా, యూరప్, ఉత్తర అమెరికా ప్రాంతాలకన్నా కరోనా వైరస్ బాధితులు తక్కువగా ఉండడం ఎంతో విశేషం. ఏప్రిల్ 20వ తేదీ నాటికి భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్ దేశాల్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 28,446 కాగా, మృతుల సంఖ్య 817. అమెరికాలోని ఒక్క న్యూయార్క్ సిటీలోనే 1,34,436 మంది కరోనా బాధితులుకాగా, 10,022 మంది మరణించారు. ప్రపంచ జనాభాలో 20 శాతానికి పైగా జనాభా కలిగిన దక్షిణాసియాలో కరోనా కేసుల శాతం 1.2 శాతం మాత్రమే. ఇక మృతుల సంఖ్య 0.5 శాతానికన్నా తక్కువ. దక్షిణాసియాలోని మొత్తం 28,446 కేసుల్లో భారత్లో 17,265, పాకిస్థాన్లో 8,418, బంగ్లాదేశ్లో 2,456, శ్రీలంకలో 271, నేపాల్లో 31, భూటాన్లో ఐదు కేసులు నమోదయ్యాయి. (చదవండి: 80 శాతం రోగులకు కరోనా లక్షణాలు లేవు) అలాగే మృతుల సంఖ్యలో భారత్లో 543 మంది, పాకిస్థాన్లో 176, బంగ్లాదేశ్లో 91, శ్రీలంకలో ఏడుగురు మరణించగా, నేపాల్, భూటాన్లో ఒక్కరు కూడా మరణించలేదు. నిర్ధారిత కరోనా కేసుల్లో మృతుల సంఖ్య దక్షిణాసియాలో సరాసరి 2.87 శాతంకాగా, అమెరికాలో 5,34 శాతం, బ్రిటన్లో 13,38 శాతం. ప్రపంచ సరాసరి శాతం 6.87 శాతం. ఈ విషయంలో బంగ్లాదేశ్ 3.71 శాతంతో ముందుండగా, 3.15 శాతంతో భారత్ స్థానంలో ఉంది. 2.09 శాతంతో పాకిస్థాన్ చివరి స్థానంలో ఉంది. దక్షిణాసియాలో ఎంత మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో ఎంత మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలిందనే విషయంలోనూ దక్షిణాసియా రికార్డు బాగానే ఉంది. అందుకనే తాము నిర్వహిస్తున్న కరోనా పరీక్షల సంఖ్య సముచితంగా ఉందంటూ భారత్ వాదిస్తోంది. భారత్లో పరీక్షలు జరిపిన వారిలో నిర్ధారిత కేసులు 25.9 శాతం కాగా, పాకిస్థాన్లో 13.2 శాతం, బంగ్లాదేశ్లో 11.6 శాతం ఉంది. ఈ విషయంలో ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ దక్షిణ కొరియాలో 52.4 శాతం కాగా, అమెరికాలో 5,3, బ్రిటన్లో 3.3 శాతం ఉంది. తక్కువగా ఉండడానికి కారణాలేమిటీ? దక్షిణాసియాలో కరోనా బాధితుల సంఖ్య తక్కువగా ఉండడానికి పలు సిద్ధాంతాలు ప్రచారంలోకి వచ్చాయి. టీబీ కోసం బెసిల్లస్ కాల్మెట్టీ గెరిన్ వ్యాక్సిన్ (బీసీజీ) కారణమని చెబుతున్నారు. దక్షిణాసియాలోని అన్ని దేశాలు వ్యాక్సిన్ను వాడుతున్నాయి. ఉష్టమండల ప్రాంతమవడంతో వేడి ఎక్కువగా ఉండడం వల్ల కరోనా మనుగడ సాగించలేక పోతోందన్నది మరో సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలను నమ్మడానికి సరైన కారణాలు కనిపించడం లేదని వెల్లూర్లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్, ఎపిడిమిమాలజిస్ట్ జయప్రకాష్ ములియిల్ అన్నారు. ఓ ఆశను పట్టుకొని చర్యలు తీసుకోలేమని చెప్పారు. ‘ఆ సిద్ధాంతాలు నిజమైనా వాటిని పరిగణలోకి తీసుకోలేం. మనం లాటరీ గెలిస్తే మంచిదే. అలా అని లాటరీ టిక్కెట్లను కొనేందుకు సగం జీతం ఖర్చు పెట్టడం వధా అవుతుంది’ అని ప్రముఖ వైరాలజిస్ట్ జాకబ్ జాన్ తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి భారత ప్రభుత్వం వద్ద సరైన డేటా లేదని, దేశంలో ఎంత మంది చనిపోయారో, వారు ఏ కారణంతో చనిపోయారో స్పష్టంగా తెలియజేసే గణాంకాలు లేవని జయప్రకాష్ తెలిపారు. కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న సంఖ్య కూడా తక్కువగా ఉందని అన్నారు. (చదవండి: కోవిడ్-19 : ఆ మందు ప్రభావంపై షాకింగ్ సర్వే..) -
కౌలాలంపూర్ నుంచి అంటుకుందా?
సాక్షి, న్యూఢిల్లీ: మలేసియా రాజధాని కౌలాలంపూర్లో జరిగిన ఒక్క సదస్సు దక్షిణాసియాలోని అనేక దేశాలు ఇప్పుడు వణికిపోయేలా చేస్తోంది. దక్షిణాసియాలోని పలు దేశాల్లో కరోనా సోకిన వారిలో అత్యధికులు తబ్లిగి జమాత్ సదస్సులకు హాజరైన వారే ఉన్నారు. నిజాముద్దీన్ మర్కజ్ కేంద్రంగా అంతర్జాతీయంగా ఇస్లాం మత బోధన చేస్తున్న తబ్లిగి జమాత్ సంస్థకు వందేళ్ల చరిత్ర ఉంది. ప్రవక్త చెప్పిన ఇస్లాం జీవనశైలి కలిగి ఉండాలని బోధిస్తుంది. ఈ సంస్థ కౌలాలంపూర్లోని పెటాలింగ్ మసీదులో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకు 16 వేల మందితో సదస్సు నిర్వహించింది. దీనికి 1500 మంది విదేశీయులు హాజరయ్యారు. సదస్సుకు హాజరైన 34 ఏళ్ల మలేసియన్ 17న మృతిచెందాడు. అక్కడి పాజిటివ్ కేసుల్లో మూడో వంతు కేసులు జమాత్తో సంబంధాలు ఉన్న వ్యక్తులవేనని వార్తలొచ్చాయి. సదస్సుకు హాజరైనS ప్రతినిధులు తమ సొంత దేశాల్లో, ఇతర దేశాల్లో ఆ వైరస్ వ్యాప్తికి కారణమయ్యారు. కౌలాలంపూర్ సదస్సుకు హాజరైన ఇండోనేసియన్లలో 31 మంది ఢిల్లీలోని నిజాముద్దీన్æ సమావేశాల్లో పాల్గొన్నారు. నిజాముద్దీన్ మర్కజ్కు ఇలా.. ఢిల్లీలోని నిజాముద్దీన్లో ఉన్న తబ్లిగి జమాత్ మర్కజ్కు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇది ఏడాది పొడవునా జరుగుతుంది. తబ్లిగి జమాత్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జనవరి 1 నుంచి మన దేశానికి 2,100 మంది ప్రతినిధులు రాగా.. మార్చి 21 నాటికి 1040 మంది ప్రతినిధులు దేశంలోనే ఉన్నారని, మిగిలిన వారు లాక్ డౌన్కు ముందే వెళ్లిపోయి ఉంటారని కేంద్ర హోం శాఖ తెలిపింది. మార్చి 21 నాటికి దేశవ్యాప్తంగా 824 మంది విదేశీ ప్రతినిధులు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉండగా.. మర్కజ్లో 216 మంది ఉన్నారని ప్రకటించింది. 1500 మంది స్వదేశీ ప్రతినిధులు మర్కజ్లో ఉన్నట్టు తెలిపింది. 2,100 మంది స్వదేశీ ప్రతినిధులు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించే పనిలో ఉన్నట్టు తెలిపింది. ఢిల్లీలో మార్చి 13–15తేదీల్లో ‘ఇజ్తెమా’ పేరుతో జరిగిన సమావేశాలకు నాలుగైదు వేల మంది స్వదేశీ, విదేశీ ప్రతినిధులు హాజరైనట్టు తెలుస్తోంది. ఈ సమావేశాలకు ముందే కౌలాలంపూర్ సదస్సులో పాల్గొన్న 31 మంది ఇండోనేసియా దేశస్తులు, ఇతర దేశస్తులు ఢిల్లీ చేరుకుని మర్కజ్లో సమావేశాలకు హాజరైనట్టు తెలుస్తోంది. దేశం నలుమూలలకు.. : ‘ఇజ్తెమా’ ముగిసిన తరువాత మార్చి 16 నుంచి అనేకమంది తమ స్వస్థలాలకు వెళ్లడం ప్రారంభించారు. మార్చి 22 నాటి జనతా కర్ఫ్యూ అనంతరం మార్చి 23న 1500 మంది స్వస్థలాలకు వెళ్లిపోయారని, లాక్డౌన్ ప్రకటనతో సమావేశాలు నిలిపి వేశామని, కానీ విధిలేని పరిస్థితుల్లో వెయ్యి మంది అందులోనే ఉండిపోవాల్సి వచ్చిందని తబ్లిగి జమాత్ వెల్లడించింది. వీరిని స్వస్థలాలకు చేర్చేందుకు వాహనాలను అనుమతించాల్సిందిగా తాము సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్కు లేఖ రాశామని, ఇదే విషయాన్ని హజ్రత్ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో ఇచ్చిన నోటీస్కు జవాబులో తెలిపామని వివరించింది. చట్టబద్ధమైన ఆదేశాలను తాము ఉల్లంఘించలేదని పేర్కొంది. అయితే తాజాగా వీరిలో 24 మందికి కరోనా పాజిటివ్ తేలిందని, కరోనా లక్షణాలు ఉన్న 411 మందిని ఆసుపత్రులకు పంపామని ఢిల్లీ సీఎం ప్రకటించారు. ఢిల్లీలో ఇప్పటివరకు 1339 మంది జమాత్ ప్రతినిధులను క్వారంటైన్కు తరలించామని హోం శాఖ ప్రకటించింది. టూరిస్ట్ వీసాపై వచ్చి మతపరమైన మిషనరీ పనుల్లో పాల్గొనరాదని ఇదివరకే హోం శాఖ ఆదేశాలు ఉన్నాయని, వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఆయా ప్రతినిధుల వీసా కేటగిరీని తనిఖీ చేయాలని రాష్ట్రాల పోలీస్ యంత్రాంగానికి సూచనలు ఇచ్చామని తెలిపింది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 824 మంది విదేశీ ప్రతినిధులను, వారికి జిల్లాల వారీగా, స్థానికంగా సమన్వయం చేస్తున్న 2,137 మంది స్వదేశీ ప్రతినిధులను స్క్రీనింగ్ చేసి క్వారంటైన్కు తరలించినట్టు తెలిపింది. వీరందరూ ఎక్కడెక్కడ తిరిగారో వారి కదలికలను గుర్తించాలని రాష్ట్రాలను మార్చి 29న ఆదేశించినట్టు తెలిపింది. పాజిటివ్ కేసులు ఇలా వెలుగులోకి.. నిజాముద్దీన్æ సమావేశాలకు హాజరై స్వస్థలాలకు వెళ్లిన వారిలో పలువురికి కరోనా సోకింది. ఢిల్లీ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో రామగుండంకు వచ్చిన ఇండోనేసియన్లలో 10 మందికి మార్చి 20నే పాజిటివ్ అని తేలింది. ఈ సదస్సుకు హాజరైన కశ్మీర్కు చెందిన ఓ వ్యక్తి మార్చి 26న తన స్వస్థలంలో కరోనాతో మరణించారు. మార్చి 27న మర్కజ్ నుంచి ఆరుగురిని, 28న 33 మందిని క్వారంటైన్కు తరలించారు. ఈ సమావేశాలకు హాజరైన వారిలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. అండమాన్లో బయటపడ్డ పాజిటివ్ కేసులకు మర్కజ్ సమావేశాలకు సంబంధం ఉన్నట్టు తేలింది. ఇతర దేశాల్లోనూ ఇదే తీరు.. దక్షిణాసియాలోని వివిధ దేశాల్లో కేసులకు కౌలాలంపూర్ సదస్సుకు లింక్ ఉన్నట్టు స్పష్టమవుతోంది. మలేషియాలో 2,400 కేసుల్లో మూడో వంతు కేసులకు ఈ సదస్సుకు సంబంధం ఉందని అక్కడి వార్తా సంస్థలు చెబుతున్నాయి. లాహోర్ సమీపంలో గల రాయ్విండ్లో తబ్లిగీ జమాత్ అక్కడి మర్కజ్లో వార్షిక సదస్సు నిర్వహించినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడ సభ్యులు 27 మంది కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఏ ప్రాంతాల వారు హాజరయ్యారు మర్కజ్కు గడిచిన రెండు నెలలుగా ఇండోనేసియా, నేపాల్, మలేసియా, థాయ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, మయన్మార్, అల్జీరియా, కిర్గిస్తాన్, ఇంగ్లండ్, సింగపూర్ దేశాలకు చెందిన 2,100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే మన దేశం నుంచి 20కి పైగా రాష్ట్రాలకు చెందిన దాదాపు ఐదారు వేలకు మందికి పైగా ప్రతినిధులు హాజరైనట్టు ప్రాథమిక అంచనా. తబ్లిగి సమావేశాలకు హాజరైన వారిని గుర్తించేందుకు పశ్చిమ బెంగాల్, అసోం, మణిపూర్లతోపాటు కర్ణాటక, గుజరాత్ ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కర్ణాటక నుంచి 54 మంది పాల్గొనగా 13 మందిని గుర్తించామని వీరందరికీ వైరస్ సోకలేదని పరీక్షల ద్వారా స్పష్టమైందని ఆ రాష్ట్రం తెలిపింది.హిమాచల్ ప్రదేశ్ నుంచి 17 మంది ఈ సమావేశాలకు హాజరయ్యారని అంచనా. కాగా దేశవ్యాప్తంగా తబ్లిగి జమాత్ సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తున్న 824 మంది విదేశీ ప్రతినిధుల వివరాలను కేంద్రం సేకరించింది. ఇలా తెలంగాణలో 82 మంది, ఆంధ్రప్రదేశ్లో 24 మంది విదేశీ ప్రతినిధులు ఉన్నట్టు తెలిపింది. -
కథనాలే కాదు మాటా పదునే
‘దక్షిణాసియాలో మానవ హక్కులు’ అనే అంశం మీద మంగళవారం యు.ఎస్.లో సదస్సు జరుగుతోంది. ఆ సదస్సును ఏర్పాటు చేసింది యు.ఎస్. హౌస్ కమిటీ. హౌస్ అంటే ‘హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్’. ప్రతినిధుల సభ. ఆ సభ నేతృత్వంలో విదేశీ వ్యవహారాల మీద చర్చలకు, తీర్మానాలకు ‘హౌస్ కమిటీ ఆన్ ఫారిన్ అఫైర్స్’ పని చేస్తుంటుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే మంగళవారం నాటి సదస్సు జరిగింది. అందులో మాట్లాడ్డం కోసం ఆసియా దేశాల్లోని జర్నలిస్టులు కొందరికి ప్రత్యేక ఆహ్వానాలు వెళ్లాయి. ఇండియా నుంచి ప్రముఖ పాత్రికేయురాలు ఆర్తిసింగ్కు ఆహ్వానం అందింది. ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. వారిలో ఎక్కుమంది కశ్మీర్ గురించి మాట్లాడుతున్నారు. వారి మాటల్ని బట్టి.. ఆర్టికల్ 370 తర్వాత కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని బయటిదేశాల్లో ఇప్పటికే బాగా ప్రచారం అయిందని ఆర్తికి అర్థమైంది. ఏ ప్రచారంలోనైనా ప్రపంచ మీడియా పాత్ర బలంగా ఉంటుంది. అందుకని ఆర్తి తన ప్రసంగంలో.. ప్రచారం జరుపుతున్న వారి బాధ్యతారాహిత్యం మీద ప్రశ్నలు గుప్పించారు. ‘‘ముప్పై ఏళ్లుగా కశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విషయంపై ప్రపంచ మీడియా ఒక్కసారైనా నోరు మెదిపిందా? కశ్మీర్లో పాక్ ఉగ్రవాద బాధితుల గురించి గళమెత్తడం తమ కనీస ధర్మం అని ప్రపంచ మీడియాతో పాటు, ప్రపంచ మానవ హక్కుల కార్యకర్తలు ఏనాడైనా అనుకున్నారా?’’ అని ఆర్తి విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై పాక్ స్పందన, పాక్ను సమర్థించే దేశాల ప్రతిస్పందన ఎలా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల నుండి ఆర్తిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆర్తి ప్రస్తుతం ఒక జాతీయ దినపత్రికలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్నారు. న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ వ్యవహారాలలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆర్తి, గతంలో జమ్మూకశ్మీర్లో ఏడేళ్లపాటు న్యూస్ కరస్పాండెంట్గా పని చేశారు. -
విజేత యువ భారత్
కఠ్మాండు: భారత యువ ఫుట్బాల్ జట్టు దక్షిణాసియా టోర్నీలో సత్తా చాటింది. మెరుగైన ప్రదర్శనతో అండర్–18 ‘శాఫ్’ చాంపియన్షిప్లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో భారత్ 2–1తో బంగ్లాదేశ్పై గెలుపొందింది. భారత ఆటగాళ్లు విక్రమ్ ప్రతాప్ సింగ్, రవి బహదూర్ రాణా చెరో గోల్తో మెరిశారు. బంగ్లా తరఫున ఏకైక గోల్ను యాసిన్ అరాఫత్ నమోదు చేశాడు. ఆట ఆరంభంమైన రెండో నిమిషంలో విక్రమ్ బంతిని గోల్ పోస్టులోకి నెట్టి భారత్కు బ్రేక్ అందించాడు. అయితే 40వ నిమిషంలో బంగ్లా ఆటగాడు యాసిన్ స్కోర్ను సమం చేశాడు. మొదటి అర్ధభాగం అదనపు సమయంలో బహదూర్ రాణా 90 అడుగుల దూరం నుంచి కళ్లు చెదిరే షాట్తో గోల్ చేసి జట్టుకు 2–1 ఆధిక్యాన్నిచ్చాడు. రెండో అర్ధభాగంలో రెండు జట్లు గోల్ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో భారత్ టైటిల్ను సొంతం చేసుకుంది. -
హింసను రెచ్చగొట్టేలా ఇమ్రాన్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై తీవ్రంగా మండిపడ్డారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ఈ సంభాషణలో మోదీ మాట్లాడుతూ..‘ఈ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు భారత్కు వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది శాంతిస్థాపనకు ఎంతమాత్రం సహాయకారి కాదు. దక్షిణాసియాలో శాంతిస్థాపన కోసం ఉగ్రవాదం, హింసలేని వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరముంది. అందులోభాగంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా నియంత్రించాలి. దీంట్లో ఎలాంటి మినహాయింపులు ఉండకూడదు’ అని వ్యాఖ్యానించారు. ఉగ్రబాటను వీడి పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధులపై పోరాడే ఏ దేశానికైనా భారత్ పూర్తి సహాయసహకారాలు అందజేస్తుందని ట్రంప్కు మోదీ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య, స్వతంత్ర, సురక్షితమైన అఫ్గానిస్తాన్ కోసం తాము కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో భారత ప్రభుత్వాన్ని ఫాసిస్టు, జాత్యహంకారిగా ఇమ్రాన్ అభివర్ణించడం తెల్సిందే. భారత అణ్వాయుధాలపై దృష్టి సారించాలని ఆయన ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. దీంతో ఇమ్రాన్ ఖాన్కు ఫోన్చేసిన ట్రంప్ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇది జరిగిన రెండ్రోజులకే ట్రంప్ భారత ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. మరోవైపు, ఈ విషయమై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. మోదీ, ట్రంప్ల మధ్య చర్చలు సహృద్భావ వాతావరణంలో, ఫలప్రదంగా సాగాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఇరుదేశాల అధినేతలు దాదాపు 30 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారని వెల్లడించింది. ‘ఈ టెలిఫోన్ సంభాషణ సందర్భంగా జపాన్లోని ఒకాసాలో గత జూన్లో జరిగిన జీ–20 భేటీని మోదీ గుర్తుచేశారు. ఈ సమావేశంలో కుదిరిన అంగీకారం మేరకు భారత్–అమెరికాలకు చెందిన వాణిజ్య మంత్రులు త్వరగా సమావేశమై ఇరు దేశాలకు లబ్ధి కలిగేలా ఒప్పందాలను కుదుర్చుకోవాలని మోదీ ఆకాంక్షించారు’ అని విదేశాంగ శాఖ పేర్కొంది. అఫ్గాన్కు అండగా నిలుస్తాం.. అఫ్గానిస్తాన్లో శాంతి, సుస్థిరత, భద్రత కోసం అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని మోదీ తెలిపారు. సోమవారం అఫ్గానిస్తాన్ 100వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో అఫ్గాన్ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. -
అమెరికా డ్రీమ్స్ కరిగిపోతాయా?
అమెరికాలో హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు (హెచ్–4 వీసాదారులు) వర్క్ పర్మిట్ రద్దుతో భారతీయుల ఆశలు నీరుగారిపోవడంతో పాటుగా అగ్రరాజ్యాన్ని బాగా దెబ్బ తీస్తుందని తాజా సర్వేలో వెల్లడైంది. సౌత్ ఏషియన్ అమెరికన్ పాలసీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎస్ఏఏపీఆర్ఐ) అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో హెచ్–4 వర్క్ పర్మిట్ రద్దు ప్రభావం అమెరికా ఐటీ ఇండస్ట్రీపై తీవ్రంగా ఉంటుందని తేలింది. అమెరికాలో హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు కూడా పని చేయాలంటే హెచ్4–ఈఏడీ (ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) వీసా ఉండాలి. ఈ వీసాలను రద్దు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలు తుది దశకు చేరుకుంటున్న సమయంలో ఎస్ఏఏపీఆర్ఐ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. దక్షిణాసియా దేశాలకే అత్యధిక లబ్ధి 1997– 2017 మధ్య కాలంలో హెచ్–4 ఈఏడీ వీసాల మంజూరు బాగా పెరిగింది. వాటితో దక్షిణాసియా దేశాలకు చెందిన మహిళలే ఎక్కువగా లబ్ధి పొందారు. 1997 నాటికి ఏటా 18, 979 మందికి ఈ వీసాలు మంజూరు చేస్తే, 2017 నాటికి వాటి సంఖ్య 1.18 లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం హెచ్–4 వీసాదారుల్లో 93 శాతం మంది దక్షిణాసియా దేశాల వారే. ఇక భారత్కు చెందిన మహిళా ఇంజనీర్లు కూడా బాగా లబ్ధి పొందారు. 2015 నుంచి మంజూరు చేసిన వీసాల్లో 90 శాతానికి పైగా భారత్కు చెందిన మహిళలే దక్కించుకున్నారు. ప్రమాదంలో భారత మహిళల ఉద్యోగాలు 2017లో ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక వలస విధానాలను కఠినతరం చేశారు. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారికే హెచ్–1బీ వీసాలు మంజూరు చేయడానికి ప్రాముఖ్యతనిచ్చారు. హెచ్–1బీ వీసా గడువు పొడిగింపుల్ని కూడా తిరస్కరిస్తున్నారు. ప్రస్తుతం హెచ్–4 ఉన్న వారిలో ఎక్కువ మంది అమెరికాలోనే మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ చేసిన వారే. దాదాపుగా 80 శాతం మంది వీసాదారులు అత్యంత ప్రతిభావంతులు. వీటిని రద్దు చేయడం వల్ల ఎంతో మంది నిపుణులైన భారతీయ మహిళలు ఉద్యోగాలు కోల్పోతారు. సగం మందికిపైగా ఉద్యోగాల్లేవు ట్రంప్ అనుసరిస్తున్న అమెరికా ఫస్ట్ విధానం కారణంతో హెచ్–4 వీసా కింద వర్క్ పర్మిట్ వచ్చినప్పటికీ 63 శాతం మంది వీసాదారులకు ఉద్యోగాలే దొరకడం లేదు. ట్రంప్ సర్కార్ అన్నంత పని చేసి ఈఏడీని రద్దు చేస్తే జీవిత భాగస్వాములు మరో పదేళ్ల పాటు ఇంటిపట్టునే ఉండాల్సి వస్తుంది. ఇది భారతీయ మహిళా నిపుణులకు ఆందోళన కలిగిస్తోంది. హెచ్–4 వీసా దారుల్లో 75 శాతం పైగా పిల్లలు ఉన్నవారే. వారిలో 85 శాతం మంది పిల్లలు అమెరికా పౌరులు కావడంతో ఏం చేయాలో తెలియని గందరగోళంలో భారత్కు చెందిన తల్లిదండ్రులు ఉన్నారు. అమెరికాకు రావద్దని సలహా ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వలస విధానాలతో అక్కడ భారతీయులు విసిగిపోయారు. 80 శాతానికి పైగా హెచ్–4 వీసాదారులు అమెరికా రావద్దంటూ తమ సన్నిహితులకు సలహా ఇస్తున్నారు. ఇతర దేశాలకు వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నామని సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది వెల్లడించారు. అమెరికాకు చెందిన వారు కాకుండా ఇతర దేశాలకు చెందిన వారే 30 శాతం అధికంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తూ ఆ దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారు. సిలికాన్ వ్యాలీలో స్టార్టప్ కంపెనీలను స్థాపించిన వారిలో 25 శాతం మంది వలసదారులే. బరాక్ ఒబామా హయాంలో ఇచ్చిన ఈ వర్క్ పర్మిట్లను ఎత్తివేయడం వల్ల అమెరికాకే అత్యధికంగా నష్టం జరుగుతుందని ఎస్ఏఏపీఆర్ఐ సర్వే అంతిమంగా హెచ్చరించింది. -
ఇఇఎఫ్-2019 అతిథి జాబితాలో లేని పాక్ ప్రధాని
రష్యా : ఈ ఏడాది వ్లాడివోస్టాక్లో ఈస్ట్రన్ ఎకనమిక్ ఫోరమ్ 2019ను సెప్టెంబర్ 4 నుంచి మూడు రోజుల పాటు రష్యా నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి దక్షిణాసియా దేశ ప్రధానులను అతిధులుగా రష్యా ఆహ్వనించింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వనించారని పాక్ మీడియా పెర్కొంది.అయితే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అతిథుల జాబితాలో లేడని ఓ రష్యన్ పత్రిక మోస్కో పేర్కొంది. ఈ ప్రకటనపై రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ఇఇఎఫ్-2019కు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గౌరవ అతిధిగా ఆహ్వనించనట్టు రష్యాలోని ఓ పత్రిక తప్పుడు ప్రకటన ఇచ్చిందని వివరణ ఇచ్చింది. మోస్కొ పొరపాటున ఆ ప్రకటనను ఇచ్చిందని రష్యా సమాఖ్య భారత రాయబారి ఎక్స్ట్రార్డినరీ అండ్ ప్లీనిపోటెన్షియరీ వెంకటేష్ వర్మ తెలిపారు. -
దక్షిణాసియాలో విస్తరిస్తున్న ఉగ్రవాదం
అంతర్జాతీయ న్యాయశాస్త్రం పరిధి చాలా విస్తృతమైనది. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రస్తుతం సంభవిస్తున్న మార్పులను క్రమబద్ధీకరిస్తూ దేశాలమధ్య నెలకొన్న సామాజిక, ఆర్థిక, భద్రతాపరమైన సమస్యలకు అంతర్జాతీయ న్యాయశాస్త్రం పరిష్కార మార్గాలను సూచిస్తుంది. ముఖ్యంగా యుద్ధ సమయంలో పాటించాల్సిన నియమాలను, యుద్ధ పరిస్థితులలో శాంతిని నెలకొల్పే సూచనలను, దౌత్యపరమైన సంప్రదింపులను, దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య లావాదేవీల సంబంధిత అంశాల గురించి, అంతరిక్ష న్యాయ విషయాలపై, మానవ హక్కులు. అంతర్జాతీయ సంస్థల విధులు, బాధ్యతలపై ఇది విస్తృతంగా చర్చిస్తుంది. దేశసరిహద్దుల భద్రతా విషయాలపై, ఉగ్రవాద నిర్మూలనపై, దేశసార్వభౌమత్వ అధికారాలు, ప్రకృతి పర్యావరణ సమతుల్యత, పైరసీ, గగన అంతరిక్ష సంబంధిత విషయాలు, సముద్ర న్యాయాలు, విమాన హైజాకింగ్, అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్య పరిష్కార మార్గాలు, మానవహక్కులు వంటివన్నీ కూడా అంతర్జాతీయ న్యాయశాస్త్ర పరిధిలోవే. దక్షిణాసియా 48 ఏళ్లుగా టెర్రరిస్టు హబ్గా మారుతోంది. శ్రీలంకలో తాజా ఉగ్రవాద దాడి సౌత్ ఆసియాలో టెర్రరిజం పెరుగుదలకు సూచిక. 2017లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉగ్రవాద దాడుల్లో 31 శాతం దక్షిణాసియాలో నమోదైనవే. వీటిల్లో మరణించిన వారిలో 29 శాతం మంది ఇక్కడివారే. శ్రీలంకలో జరిగిన దాడి గత 15 ఏళ్లలో అతిపెద్దది. 290 మంది చనిపోగా.. 500 మందికిపైగా గాయపడ్డారు. 2008లో ముంబై దాడుల్లో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2014లో పాకిస్తాన్లోని పెషావర్లో ఆర్మీస్కూల్పై జరిగిన దాడిలో 150 మందికి పైగా స్కూలు పిల్లలు బలైపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14లో జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడిలో 40 మంది భారత సైనికులు చనిపోయారు. ఇవేకాదు దక్షిణా సియాలో తరచుగా జరుగుతున్న దాడుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. గ్లోబల్ టెర్రర్ డేటాబేస్(జీటీడీ) గణాంకాల ప్రకారం.. 1970 నుంచి 2017 వరకూ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద దాడులను పరిశీలించినట్లయితే ఎక్కువ దాడులు జరిగిన ప్రాంతాల్లో దక్షిణాసియా రెండో స్థానంలో ఉంది. 1970లో 651 ఉగ్రవాద దాడులు జరిగితే.. 2014లో 17 వేల ఉగ్ర దాడులు నమోదయ్యాయి. 2002 నుంచి 2017 మధ్యకాలంలో దక్షిణాసియాలో 31,959 దాడులు జరిగితే 59,229 మంది చనిపోయారు. ఎంఈఎన్ ఈ విషయంలో ముందుంది. ఆ ప్రాంతంలో 33,126 దాడుల్లో 91,311 మంది మృతి చెందారు. ఐక్యరాజ్యసమితితో ఫలించిన భారత్ దౌత్యం: జైషే మహమ్మద్ సంస్థ అధినేత, పుల్వామా దాడి సూత్రధారి సయ్యద్ మసూద్ అజార్ను ఐక్యరాజ్యసమితి 1–5–2019 నాడు అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం శుభపరిణామం. సుదీర్ఘకాలంగా భారత్, తదితర దేశాలు ప్రతిపాదించిన తీర్మానాన్ని తాత్సారం చేస్తూ వచ్చిన చైనా తుదకు అంతర్జాతీయ ఒత్తిడిలకు తలొగ్గి తన అభ్యంతరాలను ఉపసంహరించుకుంది. ఐక్యరాజ్య సమితి తీసుకున్న ఈ కీలక నిర్ణయం వలన ఉగ్రవాదుల ఆర్థిక వనరులపై, ఆయుధాల కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం కలగనుంది. తీవ్రవాదం ముఖ్యంగా ఈ కింద పేర్కొన్న విషయాల చుట్టూ తిరుగుతున్నది. 1. జాతీయవాద ఉగ్రవాదం 2. మతపరమైన ఉగ్రవాదం 3. దేశాలు ప్రోత్సహిస్తున్న కుడి, ఎడమ విభాగాలకు సంబంధించిన తీవ్రవాదం. ఐక్యరాజ్యసమితి, ఇంటర్ పోల్, సీఐఏ, ఎఫ్బీఐ, రా లాంటి వ్యవస్థలు ఉన్నప్పటికీ తీవ్రవాద మూలాలు ఇప్పటికీ ఎందుకు నిర్వీర్యం కావడం లేదో సమగ్ర విశ్లేషణ చేసుకోవాల్సిన తరుణమిది. మూడు దశాబ్దాల కిందట బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఏర్పాటైన 8 సభ్య దేశాలతో కూడిన దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంఘం సార్క్ తీవ్రవాద దురాగతాలపై ఎన్నోసార్లు చర్చించినప్పటికీ ఇంకా ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు దక్షిణాసియాలో జరగటం దిగ్భ్రాంతికరం. తీవ్రవాదం కట్టడికి భద్రతాపరమైన చర్యలు: దక్షిణాసియా దేశాలు పరస్పర సహాయ సహకారంతో, సమన్వయంతో ప్రాంతీయ భద్రత పేరిట రూపొందించుకున్న చట్టాలను, నియమాలను ఉల్లంఘించకుండా పాటిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శం కావాలి. విమానాశ్రయాలలో భద్రతాపరమైన పరిశీలనలను పటిష్ట పరచాలి. నైతిక విద్యను ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయిదాకా అన్ని కోర్సులలో ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టి, పర్యవేక్షించే బాధ్యత ఉపాధ్యాయులు, అధ్యాపకులపై ఎంతగానో ఉంది. వ్యాసకర్త: కె. శివచరణ్, న్యాయశాస్త్ర పరిశోధకులు, నల్సార్ విశ్వవిద్యాలయం మొబైల్ : 95158 90088 -
ప్రమాదంలో స్విమ్మర్ బాలకృష్ణన్ మృతి
చెన్నై: దక్షిణాసియా క్రీడల్లో పతకం సాధించిన యువ స్విమ్మర్ ఎంబీ బాలకృష్ణన్ మృతి చెందాడు. మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 29 ఏళ్ల స్విమ్మర్ అక్కడికక్కడే కన్నుమూశాడు. ద్విచక్రవాహనంపై తన ఇంటికి వెళ్తున్న సమయంలో బాలకృష్ణన్ ముందున్న లారీని ఢీకొట్టాడు. బండిపై అదుపు కోల్పోయిన అతను లారీ టైర్ల కింద పడటంతో దుర్మరణం పాలయ్యాడు. చెన్నైలోని గిండీ ఇంజినీరింగ్ కాలేజి విద్యార్థి అయిన అతను అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడ్డాడు. కొన్నిరోజుల క్రితమే ఇండియాకు వచ్చిన బాలకృష్ణన్ రోడ్డు ప్రమాదానికి బలయ్యాడు. 2007లో గువాహటిలో జరిగిన జాతీయ స్విమ్మింగ్లో స్వర్ణంతో పాటు, 2010 సీనియర్ నేషనల్ చాంపియన్షిప్ (ఢిల్లీ)లో 50మీ. బ్యాక్స్ట్రోక్ విభాగంలో జాతీయ రికార్డును నెలకొల్పాడు. అదే ఏడాది దక్షిణాసియా క్రీడల్లో 100మీ., 200మీ. బ్యాక్స్ట్రోక్ ఈవెంట్లలో పసిడి పతకాలను సాధించాడు. అతని మృతి పట్ల కోచ్ టి. చంద్రశేఖరన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. -
లక్షదీవుల్లోని మానవులు దక్షిణాసియాకు చెందిన వారే
సాక్షి, హైదరాబాద్: కేరళ రాష్టానికి పశ్చిమ దిశగా ఉన్న లక్షదీవుల్లోని మానవులు దక్షిణాసియా ప్రాంతానికి చెందిన వారేనని హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీతో (సీసీఎంబీ) పాటు బెనారస్ హిందూ యూనివర్సిటీ, మంగళూరు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆధునిక మానవులు ఆఫ్రికా నుంచి విస్తరించే క్రమంలో భారత పశ్చిమ తీరం వెంబడి ప్రయాణించినట్లు ఇప్పటికే తెలిసినప్పటికీ ఈ మార్గంలో లక్షదీవులు ఉన్నాయా లేదా అన్నది అస్పష్టం. అంతేకాకుండా ఈ 36 ద్వీప సముదాయంలో మానవ ఆవాసం ఎప్పుడు మొదలైందో కూడా తెలియదు. ఈ నేపథ్యంలో సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త తంగరాజ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ దీవుల్లోని ప్రజలపై కొన్ని జన్యు పరిశోధనలు చేపట్టారు. 8 దీవుల్లోని 557 మంది మైటోకాండ్రియల్ డీఎన్ఏ, 166 మంది క్రోమోజోమ్లను పరిశీలించారు. ఈ వివరాలను విశ్లేషణ చేసినప్పుడు జన్యు వైవిధ్యత తక్కువని స్పష్టమైంది. కాలక్రమంలో ఈ ప్రాంతాలను పలువురు రాజులు పాలించినా తక్కువ జన్యు వైవిధ్యత ఉండటం తమను ఆశ్చర్య పరిచిందని బెనారస్ హిందూ యూనివర్సిటీ శాస్త్రవేత్త జ్ఞానేశ్వర్ చౌబే తెలిపారు. -
దక్షిణాసియాలో మనమే టాప్
ఐక్యరాజ్యసమితి: 2017లో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం జోరందుకుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. గతేడాది రికార్డు స్థాయిలో 132.3 కోట్ల మంది పర్యాటకులు వివిధ దేశాల్లో పర్యటించినట్లు పేర్కొంది. 2016తో పోలిస్తే.. ఈ సంఖ్య 8.4 కోట్లు అదనం. కాగా, దక్షిణాసియా ప్రాంతంలో పర్యాటకులను ఆకర్షించిన జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉంది. భారత్లో పర్యాటకం సానుకూల వృద్ధితో ముందుకెళ్తోందని నివేదిక పేర్కొంది. సరళీకృతమైన వీసా విధానాల కారణంగా భారత్కు పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని వెల్లడించింది. 2017లో దక్షిణాసియాలో 2.6కోట్ల మంది విదేశీయులు పర్యటించగా అందులో 1.54 కోట్ల మంది భారత్కు వచ్చిన వారే. 2016లో భారత్లో విదేశీ పర్యాటకుల సంఖ్య 1.45కోట్లు కాగా.. వీరి ద్వారా దాదాపు రూ. 1.6లక్షల కోట్ల లాభం వచ్చింది. అదే 2017లో 1.54కోట్ల మంది ద్వారా దాదాపు రూ. 1.94లక్షల కోట్ల లబ్ధి జరిగిందని నివేదిక తెలిపింది. అటు ప్రపంచవ్యాప్తంగానూ పర్యాటక రంగం జోరందుకుంది. యూరప్, ఆఫ్రికా దేశాల్లో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది. యూరప్లో 8%, ఆఫ్రికాలో 9% పెరుగుదల కనిపించింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్డబ్ల్యూటీవో) లెక్కల ప్రకారం 2017లో పర్యాటకం ద్వారా ఆయా దేశాలకు రూ.1.3 ట్రిలియర్ డాలర్ల (రూ.92.3 లక్షల కోట్లు) లాభం జరిగిందన్నారు. ఇది గతేడాదితో పోలిస్తే ఐదుశాతం పెరుగుదలని పేర్కొంది. కాగా టాప్–10 పర్యాటక కేంద్రాల్లో చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, అమెరికాలున్నాయి. -
'మా వ్యూహం విజయానికి కారణం ఇండియానే'
వాషింగ్టన్ : భారత్పై అమెరికా మరోసారి ప్రశంసలు కురిపించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్ చేస్తున్న కృషి చాలా గొప్పదని పేర్కొంది. తమ దక్షిణాసియా వ్యూహంలో భారత్దే కీలక పాత్ర అని వెల్లడించింది. ఉగ్రవాదంపై పోరాటం విషయంలో భారత్ పాత్ర ఏ మేరకు ఉందని భావిస్తున్నారని పెంటగాన్ చీఫ్ అధికారిక ప్రతినిధి దానా వైట్ను ప్రశ్నించగా ఆమె పై విధంగా స్పందించారు. 'భిన్న విధాలుగా ఉపయోగించుకునేలా భారత్తో మాకు అనుబంధాలు ఉన్నాయి. చాలా హుందాగా దక్షిణాసియా వ్యూహానికి భారత్ సహాయం చేస్తోంది. దీని అభివృద్ధి కోసం గొప్ప నిధిని కేటాయించింది. ఏవియేషన్ మెయింటెన్స్ విషయంలో కూడా భారత్ అద్భుతంగా సాయం చేస్తోంది. ఉగ్రవాదాన్ని ఎలాన్ని నిర్మూలించాలనే విషయంలో భారత్నే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భాగస్వామ్యులను భారత్ ఏకం చేస్తున్న తీరునే తాము కొనసాగిస్తే లక్ష్యం నెరవేరుతుంది. ఈ రోజు మా దక్షిణాసియా స్ట్రాటజీ విజయవంతంగా అమలవుతుందంటే దానికి కారణం భారతే' అని ఆమె పేర్కొన్నారు. -
'అణుయుద్ధం తప్పకపోవచ్చు'
సాక్షి, ఇస్లామాబాద్ : దక్షిణాసియా ప్రాంత స్థిరత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని, అది ప్రమాదపుటంచుల్లో వేలాడుతుందంటూ పాకిస్థాన్ భద్రతా సలహాదారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ నజీర్ ఖాన్ జాంజువా ఆందోళన వ్యక్తం చేశారు. అణుయుద్ధం జరిగే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) విషయంలో భారత్తో కలిసి అమెరికా కుట్ర చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇస్లామాబాద్లో జాతీయ భద్రత అనే అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలన్నింటిని సమకూర్చుకొని స్టాక్ పెట్టుకుంటుందని, వాటితో ప్రతిసారి పాక్ను బెదిరిస్తూ వస్తోందని చెప్పారు. 'దక్షిణాసియా స్థిరత్వం ప్రమాదపుటంచున వేలాడుతోంది. అణుయుద్ధం జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం' అని ఆయన వ్యాఖ్యానించారు. అఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల ప్రభావం పెరుగుతుండటంతో అమెరికా వైఫల్యాలను పాకిస్థాన్పై నెడుతోందంటూ ఆరోపించారు. అప్ఘనిస్థాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశం అమెరికా భారత్కు కల్పిస్తోందంటూ మండిపడ్డారు. -
ఎస్వీఆర్ తరువాత బ్రహ్మానందానికే..!
ప్రముఖ హాస్యనటుడు బ్రహానందానికి మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏసియా సెంటర్ వారు బ్రహ్మీని సత్కరించనున్నారు. అక్టోబర్ 6న జరగనున్న ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. 1964లో జకార్తాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో మహానటుడు ఎస్వీ రంగారావుకు ఇదే తరహా సత్కారం దక్కింది. తరువాత ఇన్నేళ్లకు అదే సత్కారం బ్రహ్మానందం అందుకోనుండటం విశేషం. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో పాటు మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న ఆచారి అమెరికా యాత్ర సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు బ్రహ్మానందం. -
దక్షిణాసియాకిది చరిత్రాత్మక దినం: మోదీ
-
దక్షిణాసియాకిది చరిత్రాత్మక దినం: మోదీ
న్యూఢిల్లీ: జీఎస్ఎల్వీ ఎఫ్09 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందిస్తూ.. దక్షిణాసియాకిది చరిత్రాత్మక దినమని అభివర్ణించారు. నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి ఇస్రో ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన అనంతరం.. ఆయన ఢిల్లీ నుంచి సార్క్ దేశాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పరిధులు లేని స్నేహానికి ఇవాళ నాంది పడిందని, సార్క్ దేశాలకు ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చామని మోదీ అన్నారు. మన ప్రాంత ప్రజల అవసరాలు తీర్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుందని మోదీ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో దక్షిణాసియా దేశాల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంపై దక్షిణాసియా దేశాల ప్రతినిధులు, పలువురు రాజకీయ ప్రముఖులు.. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులు దేశాలకు ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలందించనుంది. జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 11వది కావడం విశేషం. -
నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్09
-
నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్09
శ్రీహరికోట : జీఎస్ఎల్వీ ఎఫ్09 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం సాయంత్రం 4.57 నిమిషాలకు జీఎస్ఎల్వీ ఎఫ్09 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించారు. దీనికి సంబంధించి గురువారం మధ్యాహ్నం 12.57 నిమిషాలకు కౌంట్డౌన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ప్రయోగాన్ని 20మంది సభ్యులతో కూడిన పార్లమెంటరీ కమిటీ షార్ నుంచి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి మీడియాను దూరంగా ఉంచారు. కాగా ఈ రాకెట్ ద్వారా 2,230 కిలోల బరువు కలిగిన విశాట్–9(దక్షిణాసియా దేశాల శాటిలైట్) ఉపగ్రహాన్ని భూమికి 36వేల కి.మీ ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహంలో 12 కేయూ బ్రాండ్ ట్రాన్స్ఫార్మర్స్ను అమర్చారు. దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులు దేశాలకు ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలందించనుంది. జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 11వ ప్రయోగం కావడం విశేషం. ఇప్పటివరకు నిర్వహిం చిన 10 ప్రయోగాల్లో 3 విఫలం కాగా 7 విజయవం తమయ్యాయి. జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఎంతో సంక్లిష్టమైన క్రయోజనిక్ దశను స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. కాగా షార్ శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. -
‘ఐదేళ్లలోపు’ మరణాల్లో భారత్ టాప్
న్యూఢిల్లీ: ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు 2015లో భారత్లోనే ఎక్కువ సంభవించాయని బ్రిటన్ వైద్య జర్నల్ ‘లాన్సెట్’ అధ్యయనం ద్వారా తెలిసింది. క్షయ, ప్రసవకాల మరణాలను అరికట్టడంలో భారత్ పేలవమైన ప్రదర్శన కనబరిచిందని అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. గుండె నాళాలకు సంబంధించిన జబ్బుల వల్ల భారత్లో ఎక్కువ మంది చనిపోతున్నారని లాన్సెట్ తెలిపింది. దక్షిణాసియాలోని అన్ని దేశాలు చిన్న పిల్లల మరణాలను అరికట్టడంలో విఫలమయ్యాయనీ, అత్యధికంగా భారత్లో 2015లో 13 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులు మృత్యువాత పడ్డారని అందులో పేర్కొన్నారు. తాగునీరు, శుభ్రతలో పురోగతి సాధించినా ఊబకాయం, ఔషధాల సమస్యలు పెరుగుతున్నాయని నివేదిక తెలిపింది. -
సగం ప్రపంచ జనాభా దక్షిణాసియాలోనే
ఈ చిత్రం భూమిపై జనాభా వ్యాప్తిని సూచిస్తోంది. ప్రపంచంలోని సగం జనాభా చిత్రంలో నల్లగా కనిపిస్తున్న ప్రాంతంలో నివసిస్తుండగా... మిగతా సగం పసుపుగా కనిపిస్తున్న ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆశ్చర్య పరిచే వాస్తవమేంటంటే ప్రపంచంలో అత్యధిక జనాభా ఆసియా ఖండంలోని కొన్ని పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. నాసా పరిశోధక విభాగం సూచించిన గణాంకాల ఆధారంగా ఈ మ్యాప్ రూపొందించారు. కనిపిస్తున్న ఈ చిత్రంలో ప్రపంచం మొత్తాన్ని మూడు కోట్ల చిన్న గదులుగా విడగొట్టారు. ఒక్కో గది వైశాల్యాన్ని మూడు మైళ్లుగా నిర్ధారించారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న జనాభా ఆధారంగా ఆ గదికి నలుపు, పసుపు రంగులను కేటాయించారు. ఎనిమిది వేల పైచిలుకు జనాభా నివసించే ప్రాంతానికి పసుపు రంగు, ఎనిమిది వేల లోపు జనాభా నివసించే ప్రాంతానికి నలుపు రంగు ఇస్తే ప్రపంచంలో జనాభా వ్యాప్తి చిత్రంలో చూపిన విధంగా వచ్చింది. గంగా సింధు మైదానం, తూర్పు చైనాలోని కొన్ని ప్రాంతాలు భూగోళం మొత్తం మీద అత్యధిక జన సాంద్రత గల ప్రాంతాలుగా నిలిచాయి. అమెరికాలో పట్టణ జనసాంద్రతతో పోల్చితే ఆఫ్రికా ఖండంలో తీరప్రాంతంలోని కొన్ని పట్టణాలు, నైలు నదీ పరీవాహక ప్రాంతంలో జనసాంద్రత అధికంగా ఉంది. 2100 సంవత్సరానికి ప్రపంచ జనాభా పదకొండు వందల కోట్లకు చేరుకుంటుందని, ఇందులో 400 కోట్లు ఆఫ్రికా ఖండంలోనే నివసిస్తారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. -
ప్రపంచ శాంతి దినోత్సవం
‘శాంతి’ అన్న పదం వినటానికి కరువైన రోజులు దాపురించాయా? అనే ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం మన దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా దాపురించింది. అంతర్గత కల్లోలాలు, పొరుగు దేశం పాకిస్తాన్ కలిగిస్తున్న ఇబ్బందులపై మన దేశం పెట్టిన ఖర్చు 2013లో 177 బిలియన్ల డాలర్లకి చేరింది. అంటే సుమారు 90% హెచ్చు ఒక సంవత్సరంలోనే జరిగింది. ఈ ఖర్చు మన జీడీపీలో సుమారు 4.7%. భద్రతా దళాల మోహరింపు ఈ పెరిగిన ఖర్చులకి కారణం. ఇటీవల ‘ప్రపంచ శాంతి సూచీ’పై సిడ్నీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్, పేస్(ఐఈపీ) నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశం మొత్తం 163 దేశాల్లో 143వ స్థానంలో ఉంది. దక్షిణ ఆసియాలో 5వ స్థానంలో ఉంది. 2008లో 138వ స్థానంలో ఉన్న మనం ప్రస్తుతం 143వ స్థానానికి దిగజారి పోయాం. ఇక మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా పరిస్థితి ఇంకా దయనీయంగా మారింది. శాంతి సూచీలో చిట్టచివరి దేశంగా సిరియా మిగిలింది. కానీ, అత్యంత శాంతియుత దేశాలుగా ఉన్న నార్వే, స్వీడెన్లే ప్రపంచంలో ఎక్కువగా ఆయుధాలు ఎగుమతి చేసే దేశాలుగా ఉండటం బాధాకరం. ఇక ప్రపంచ శాంతి సూచీ ప్రకారం అమెరికా 94వ స్థానంలో ఉంది. ఓ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన హింస-అశాంతి అనేవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద సుమారు 14.3 ట్రిలియన్ల ఆర్థిక భారం మోపుతున్నాయి. అంటే ప్రపంచ జీడీపీలో సుమారు 13.4% అన్నమాట. ఈ ఖర్చు ఇంచుమించు బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, బ్రిటన్ల ఆర్థిక బడ్జెట్కు సమానం. 2010లో సుమారు 49వేల మంది అశాంతి, హింస కొట్లాటలలో మరణిం చగా, 2014 నాటికి లక్షా 80వేల మందికి చేరింది. శాంతియుత ప్రపంచం లేకుంటే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రస్తుతం అందరికీ బోధపడుతోంది కాబట్టి ప్రపంచశాంతికి ప్రతి దేశం కట్టుబడి ఉండాలి. (నేడు ప్రపంచ శాంతి దినోత్సవం) - డాక్టర్ పోటు భగత్కుమార్, రంగాపురం, నల్లగొండ జిల్లా -
వాళ్లాపితే దక్షిణాసియా ప్రశాంతం: రాజ్నాథ్
జైపూర్: ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ సహాయసహకారాలు అందించకుంటే దక్షిణాసియా మొత్తం ప్రశాంతంగా ఉంటుందని, అభివృద్ధిలో దూసుకుపోతుందని కేంద్ర హోంమంత్రి రాజ్నాధ్ సింగ్ అన్నారు. ఉగ్రవాద చర్యలు నిరోధించే అంశంపై గురువారం జైపూర్లో ఏర్పాటుచేసిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను ప్రారంభించిన ఆయన మాట్లాడారు. ఉగ్రవాదంలో మంచి ఉగ్రవాదం చెడు ఉగ్రవాదం అని రెండు విధాలుగా ఉండదని, ఈవిషయాన్ని పాక్ అర్థం చేసుకోవాలని తెలిపారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చర్యలు నిరోధించడంలో కొంత విఫలమవుతున్నామని, దేశ సమైక్యతకు ఇదొక అడ్డంకిగా మారిందని తెలిపారు. ముస్లింలు సాధారణంగా స్వాభిమానంగలవారని.. అలాంటివారు తీవ్రవాదాన్ని బోధించేవారి చేతుల్లోకి వెళ్లకూడదని సూచించారు. ఉగ్రవాదం అనేది ఈ ప్రకృతికి ఒక ఏలియన్లాంటిదని చెప్పారు. ఐఎస్ఐ, పాకిస్థాన్ ఆర్మీ పలు ఉగ్రవాద సంస్థలకు తమ మద్దతును నిలిపివేస్తే దక్షిణాసియా బ్రహ్మాండమైన పురోగతిని సాధిస్తుందనే విషయం చెప్పడంలో తానేమాత్రం శంకించబోనని స్పష్టం చేశారు. ఈ విషయాలు గుర్తుంచుకొని పాక్ ఉగ్రవాదులకు సహాయ చర్యలు నిలిపివేయాలని కోరారు. -
‘అణు బంధం’పై పాక్ ఆందోళన
దక్షిణాసియాలో సుస్థిరతకు దెబ్బ: సర్తాజ్ అజీజ్ ఇస్లామాబాద్: అమెరికా - భారత్లు అణు ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడంపై పాకిస్తాన్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇది ప్రాంతీయ సుస్థిరతను అస్థిరపరచేలా ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది. ‘‘భారత్ - అమెరికాల మధ్య అణు ఒప్పందాన్ని రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం అమలుచేయటం.. దక్షిణాసియాలో సుస్థిరతపై హానికరమైన ప్రభావం చూపుతుంది’’ అని పాక్ జాతీయ భద్రతా సలహా దారు సర్తాజ్ అజీజ్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నట్లు షిన్హువా వార్తా సంస్థ తెలిపింది. మరోపక్క అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన తర్వాత పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పందించారు. భారత్తో పరస్పర గౌరవం, సార్వభౌమత్వం కోరుకుంటున్నామని వెల్లడించారు. బుధవారం ప్రధాని కార్యాలయంలో భారత్లో పాక్ హైకమిషనర్ అబ్దుల్బాసిత్ షరీఫ్తో భేటీ అయి పాక్-భారత్ సంబంధాలను షరీఫ్కి వివరించారు. పాక్- అఫ్ఘాన్ ఐఎస్ఐఎస్ చీఫ్గా హఫీజ్ కాగా, పాకిస్తాన్- అఫ్ఘానిస్థాన్ ఐఎస్ఐఎస్(ఇస్లామిక్ స్టేట్) ఛీఫ్ గా తాలిబన్ మాజీ కమాండర్ హఫీజ్ సయీద్ ఖాన్ను నియమించినట్లు ఐఎస్ఐఎస్ కమాండర్ అబు ముహమ్మద్ అల్ అద్ని ప్రకటించాడు. -
ఉగ్రవాదమే అతిపెద్ద సవాల్
సార్క్ విదేశాంగ మంత్రుల సమావేశంలో సుష్మాస్వరాజ్ కఠ్మాండు: దక్షిణాసియా ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఉగ్రవాదమేనని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. ఉగ్ర భూతాన్ని తరిమేందుకు సార్క్ దేశాలు ఉమ్మడి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. దక్షిణాసియా శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లేందుకు దేశాల మధ్య అనుసంధానం కీలకమన్నారు. నేపాల్ రాజధాని కఠ్మాండులో మంగళవారం జరిగిన సార్క్దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో సుష్మ ప్రసంగించారు. అఫ్ఘానిస్థాన్లో రెండు రోజుల కిందట ఆత్మాహుతి దాడికి పాల్పడి 50 మందికిపైగా హతమార్చడం దక్షిణాసియాకు ఉగ్రవాదమే అతిపెద్ద సవాల్ అని నిరూపించిందన్నారు. కాగా, ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్...పాకిస్తాన్ జాతీయ భద్రత సలహాదారు సర్తాజ్ అజీజ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
ఉగ్రవాదంతో దక్షిణాసియాకు సవాళ్లు!
కఠ్మాండు: అఫ్ఘానిస్థాన్ నుంచి విదేశీ బలగాలు వైదొలగిన తర్వాత దక్షిణాసియాకు ఉగ్రవాదులనుంచి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని భారత్ ఆందోళన వ్యక్తంచేసింది. ఉగ్రవాదుల బెడదను అరికట్టేందుకు కొత్త వ్యూహాలు రూపొందించుకోవలసిదిగా దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) సభ్య దేశాలకు సూచించింది. నేపాల్ రాజ ధాని కఠ్మాండులో శుక్రవారం సార్క్ అంతర్గత వ్యవహారాల, హోం మంత్రుల ఆరవ సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. అప్ఘానిస్థాన్నుంచి విదేశీ సేనలు వైదొలగడంతో దక్షిణాసియాకు ఎదురయ్యే ఉగ్రవాదం బెడదను దక్షిణాసియా దేశాలు జాగ్రత్తగా అంచనా వేయాలన్నారు. ఉగ్రవాదాన్ని, హింసాకాండను రెచ్చగొట్టే వ్యక్తులు, సంస్థలు, ప్రచురణల విషయంలో కఠినమైన శిక్షలు విధించేందుకు అనుగుణంగా దక్షిణాసియా దేశాలన్నీ తగిన చట్టాలు చేయాలన్నారు. ప్రజల సంక్షేమంకోసం కలసికట్టుగా పనిచేయడమే తొలి ప్రాధాన్యమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారని, హిమాలయాల్లోని రెండు పొరుగుదేశాల్లో ఆయన తొలిపర్యటన జరిపారని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. -
డిమాండ్ను మించి హోటల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశ ఆతిథ్య రంగం ఇంకా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్థిక వృద్ధిరేటు తగ్గడానికి తోడు డిమాండ్ను మించి హోటల్ గదులు అందుబాటులోకి రావడమే దీనికి ప్రధాన కారణమని రాడిసన్ హోటల్ పేర్కొంది. నాలుగేళ్ళ క్రితం దేశంలో బ్రాండెడ్ హోటల్ గదుల సంఖ్య 45,000గా ఉంటే ఇప్పుడు అది 1,10,000 దాటిందని, వచ్చే ఐదేళ్ళలో ఈ సంఖ్య 1.60 లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు కార్లిసన్ రెజిడర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సౌత్ ఏషియా) రాజ్ రాణా ‘సాక్షి’కి తెలిపారు. కాని దేశీయ పర్యాటక రంగం వేగంగా విస్తరిస్తుండటంతో భవిష్యత్తు బాగుంటుందని పరిశ్రమ అంచనా వేస్తోందని, ఎన్నికల తర్వాత స్థిరమైన ప్రభుత్వం వస్తే ఆతిథ్య రంగానికి పూర్వ వైభవం వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కార్లిసన్ రెజిడర్ హోటల్స్ ప్రపంచవ్యాప్తంగా రాడిసన్, రాడిసన్ బ్లూ ఐదు రకాల బ్రాండెడ్ హోటల్స్ను నిర్వహిస్తోంది. హైదరాబాద్లో హైటెక్ సిటీ సమీపంలో ఏర్పాటు చేసిన రెండో హోటల్ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. గతంలో దీన్ని ఆదిత్య సరోవర్ ప్రీమియం హోటల్గా వ్యవహరించేవారు. ఈ సందర్భంగా రాణా ‘సాక్షి’తో మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా దేశీయ ఆతిథ్య రంగం ముఖ్యంగా రాష్ట్రంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని, ఇప్పుడు రాష్ట్ర విభజన అంశం ఒక కొలిక్కి రావడంతో కోలుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశీయ హోటల్స్ సగటు ఆక్యుపెన్సీ రేషియా 60 శాతం వద్ద స్థిరంగా ఉందన్నారు. టారిఫ్లు, ఆక్యుపెన్సీ రేషియోలో ఇంకా ఎటువంటి వృద్ధి కనిపించడం లేదన్నారు. కాని ఈ మధ్యనే విదేశీ నిధుల ప్రవాహంతో పాటు విదేశీ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటం కొంత ఆశావహ వాతావరణం కనిపిస్తోందన్నారు. విశాఖలో రాడిసన్ దక్షిణ భారతదేశంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు కార్ల్సన్ రెజిడర్ హోటల్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా విశాఖపట్నం, కొచ్చి, మైసూర్ వంటి పట్టణాల్లో కొత్తగా హోటల్స్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 66 హోటల్స్ను నిర్వహిస్తుండగా, 44 హోటల్స్ నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఏటా కొత్తగా 8-9 హోటల్స్ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దేశంలో బడ్జెట్ హోటల్స్కి డిమాండ్ బాగుండటంతో ఈ రంగంపై దృష్టి సారిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
హైదరాబాద్ నుంచి లండన్కు ఇక ప్రతిరోజు విమానం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో/న్యూస్లైన్: విమానయాన సేవల సంస్థ బ్రిటిష్ ఎయిర్వేస్ హైదరాబాద్ నుంచి లండన్కు ప్రతి రోజు విమాన సర్వీసులు ప్రారంభించింది. వారంలో 5 సర్వీసులు కాస్తా 787 డ్రీమ్లైనర్ రాకతో ఏడుకు చేరాయి. బ్రిటిష్ ఎయిర్వేస్ తొలి 787 డ్రీమ్లైనర్ లండన్ నుంచి హైదరాబాద్కు సోమవారం(మార్చి 31) ఉదయం 4.45కు శంషాబాద్ విమానాశ్రయంలో అడుగు పెట్టింది. కంపెనీ ప్రచారంలో భాగంగా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ను ఈ విమానంలో తీసుకొచ్చింది. లండన్ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుకు వారంలో 48 సర్వీసులను నడుపుతున్నట్టు బ్రిటిష్ ఎయిర్వేస్ దక్షిణాసియా ప్రాంత వాణిజ్య మేనేజర్ క్రిస్టఫర్ ఫోర్డిస్ సోమవారమిక్కడ తెలిపారు. ప్రతిరోజు ఢిల్లీ, ముంబైలకు రెండు, హైదరాబాద్, బెంగళూరుకు ఒకటి, చెన్నైకి వారంలో 6 సర్వీసులు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రత్యేక వంటకాలు, బాలీవుడ్ సినిమాలు భారతీయ ప్రయాణికులకు ప్రత్యేకమన్నారు. భారీ విహంగం ఏ380ని ఎప్పుడు పరిచయం చేస్తారన్న ప్రశ్నకు.. తొలుత విదేశాల్లోని ప్రధాన నగరాలకు ప్రారంభిస్తామని వెల్లడించారు. సంస్థకు ఉత్తర అమెరికా తర్వాత రెండో అతిపెద్ద మార్కెట్గా భారత్ నిలిచింది. దూర ప్రయాణాలకు అనువైన బోయింగ్ 787 డ్రీమ్లైనర్లో 210 నుంచి 330 మంది ప్రయాణికులు కూర్చునే వీలుంది. డ్రీమ్లైనర్ విమానాన్ని ప్రారంభించిన బిగ్-బి.. హైదరాబాద్లో 787 బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాన్ని ఉగాది పర్వదినం నాడు తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని బిగ్-బి అమితాబ్ బచ్చన్ అన్నారు. సోమవారం రాత్రి ఫలక్నుమా ప్యాలెస్ ఆవరణలో బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాన్ని ప్రారంభించారు. ‘నమస్కారం... మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు...’ అంటూ తెలుగులో ఉపన్యాసాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ... ‘హైదరాబాద్ సంసృ్కతి, సంప్రదాయమంటే నాకెంతో ఇష్టం. ఇక్కడి ఆచార వ్యవహారాలు బాగుంటాయి. అందుకే నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్తో పాటు లండన్ నగరంతో కూడా మా కుటుంబానికి ఎన్నో ఏళ్ల నుంచి విడదీయరాని బంధం ఏర్పడింది. తాత ముత్తాతలతో పాటు మా కుటుంబానికి లండన్ నగరం ఎంతో ఇష్టమైంది. జయబచ్చన్తో వివాహం అనంతరం హనీమూన్కు లండన్కే వచ్చాం. నా సినిమాల షూటింగ్లు కూడా అప్పుడప్పుడు లండన్ నగరంలో జరుగుతుంటాయి. ఏ మాత్రం సెలవులు దొరికినా లండన్ నగరంలోనే గడుపుతాం. ఇలాంటి లండన్ నగరానికి చెందిన బ్రిటీష్ ఎయిర్వేస్ విమానాన్ని తాను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నాను... అని బిగ్-బి అమితాబ్ బచ్చన్ లండన్ నగరంతో ఉన్న అనుబంధాన్ని తన చిన్ననాటి జ్ఞాపకాలతో విలేకర్లకు వివరించారు. -
అఫ్ఘాన్లో ఆపదమొక్కులు!
అఫ్ఘానిస్థాన్లో ఎలాగైనా ఎన్నికలను నిర్వహించి, అక్కడ తమ సైన్యాన్ని నిలిపి ఉంచగలిగేలా కొత్త ప్రభుత్వంతో ఒప్పందం కోసం అమెరికా ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడు కర్జాయ్ 2014 తదుపరి కొత్త ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య మధ్యవర్తిగా నిలవాలని యత్నిస్తున్నారు. దీంతో అఫ్ఘాన్లో అమెరికా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ‘తప్పుల నుంచి నేర్చుకునే వాడివైతే అసలు ఓడిపోయేవాడివే కావు’ అని అంటే అన్నారేమో. అమెరికాకు అది వర్తించాలని లేదు. తప్పులు చేయడమే తప్ప నేర్చుకోవడమన్నది ఎరగని అమెరికా తప్పులు చేస్తూనే గెలిచి చూపించగలనని అఫ్ఘానిస్థాన్లో రుజువు చేసి చూపిస్తానంటోంది. ఏప్రిల్ 5న జరగనున్న అఫ్ఘాన్ ఎన్నికల బరిలోకి దిగిన ఐదుగురు ప్రధాన అభ్యర్థుల మధ్యన ఈ నెల 4న టీవీ చర్చ జరిగింది. తాలిబన్లకు, నాటో బలగాలకు మధ్య యుద్ధం సాగుతుండగానే, బాంబు దాడులు, ఆత్మాహుతి దాడుల విధ్వంస కాండ జోరు తగ్గకుండానే ఎన్నికలేమిటి? అని అనుమానం అక్కర్లేదు. అమెరికా తలిస్తే ఏమైనా జరుగుతుంది. అధ్యక్ష అభ్యర్థులు విడి విడిగా ఎవరు ఏం మట్లాడినా అంతా ఒక్క గొంతుకతో చెప్పింది ఒక్కటే. అమెరికాతో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుని, దాని సేనలను నిలిపి ఉంచుతామని. ఆ ఒప్పందం కోసమే అమెరికా, అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కాళ్లూ, గడ్డం పట్టి ఒప్పించాలని తంటాలు పడింది. 13 ఏళ్లుగా యుద్ధం సాగిస్తున్న తాలిబన్ ‘ఉగ్రవాదు’లతో సయోధ్య కోసం నానా అగచాట్లు పడింది అందుకోసమే. అదంతా వృధా ప్రయాసే అయినా... కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడ తాడన్నట్టు జరిగింది. రేపు ఎవరు అధ్యక్షులైనా అమెరికా ‘రక్షణ’ను కోరేవారే కావడానికి మించి దానికి కావాల్సింది ఏముంది. అమెరికా ఆశీర్వాద ‘బలం’తో 2001లో దేశాధ్యక్షుడైన ఒకప్పటి అనామకుడు కర్జాయ్ గతి ఏమిటి? ఆయన ఏ అథోగతి పాలైనా అమెరికాకు చింతలేదు. కానీ అధ్యక్ష భవనంలోనే రక్షణ లేక బిక్కుబిక్కుమని బతికే ఆయన కాబూల్లో నిర్మిస్తున్న భారీ నివాస భవనం అమెరికా కంటికి కనుకు లేకుండా చేస్తోంది. ఏప్రిల్ తర్వాత దేశం విడిచి పారిపోవడానికి బదులుగా ఆయన అఫ్ఘాన్ రాజకీయాల్లో సూత్రధారిగానో లేక అధికారానికి అతి సన్నిహితునిగానో ఉండగలనని విశ్వసిస్తున్నారని దాని అర్థం. కర్జాయ్ ‘మధ్యవర్తి’ అవతారం అఫ్ఘాన్ ‘వాతావరణ పరిస్థితుల’ను అంచనా కట్టడంలో కర్జాయ్ని మించిన వారు లేరు. అమెరికా, నాటో బలగాల సత్తా ఏ పాటిదో కర్జాయ్ 2007లోనే గ్రహించారు. అమెరికాతో ఎలాంటి రక్షణ ఒప్పందాన్నైనా తిరస్కరిస్తామన్న తాలిబన్ల వైఖరికి అనుగుణంగానే ఆయన దానితో ద్వైపాక్షిక రక్ష ణ ఒప్పందాన్ని ‘ఆమోదించారు.’ దానిపై సంతకాలు చేసే సర్వాధికారాలున్నా కొత్త అధ్యక్షుడే ఆ పని చేస్తాడంటూ తిరకాసు పెట్టారు. తాలిబన్లతో అమెరికా సాగించిన ఏకపక్ష చర్చలపై కన్నెర్ర చేసిన కర్జాయ్ ఏకపక్షంగా తాలిబన్లతో చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల తదుపరి లేదా ఈ ఏడాది చివరికి అమెరికా సేనల ఉపసంహరణ జరిగాక కొత్త ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య మధ్యవర్తిగా నిలవాలని ఆయన భావిస్తున్నారు. కర్జాయ్ తాలిబన్లతో రహస్యంగా చర్చలు జరుపుతుండటం నిజమేనని అమెరికా ప్రభుత్వ అధికారిక ప్రతినిధులు ఫిబ్రవరి 3న అంగీకరించారు. ‘ఈ చర్చలను మేం వ్యతిరేకిస్తున్నామనడం సరైనది కాదు’ అని అసత్యం చెప్పారు. అదే రోజున అధ్యక్షుడు బరాక్ ఒబామా అఫ్ఘాన్లోని తమ సేనాధిపతి జనరల్ జోసెఫ్ డన్ఫోర్డ్, రక్షణ మంత్రి చుక్ హ్యాగెల్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మార్టిన్ డెంప్సీలతో సమావేశమయ్యారు. త్వరలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో కుదుర్చుకోబోయే ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని కాపాడుకోవడమెలాగని వ్యూహ రచన గురించి చర్చించారు. జరుగుతాయో లేదో తెలియని ఎన్నికలు, ఆ తదుపరి ఎవరు అధ్యక్ష పీఠం ఎక్కుతారో తెలియకముందే వారితో కుదుర్చోకోబోయే ఒప్పందం, దానికి ఇప్పుడే ముప్పు వచ్చి పడ్డం, దాన్ని కాపాడుకోడానికి వ్యూహం! అఫ్ఘాన్తో ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుని 2014 తర్వాత అక్కడ కనీసం 10,000 సైన్యాన్ని నిలిపి ఉంచాలని అమెరికా భావిస్తోంది. సేనలను పూర్తిగా ఉపసంహరించడానికి ముందు అమెరికాతో ఒప్పందం కాదుగదా, చర్చలు సైతం వీల్లేదని తాలిబన్లు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలను జరగనిచ్చేది లేదని, రక్తపాతం తప్పదని పదేపదే హెచ్చరిస్తున్నారు. చేసి చూపిస్తున్నారు. కానీ తుపాకులతో ఎలాగోలా ఎన్నికలు జరిగాయనిపించేసి, ఎవరో ఒకరికి అధ్యక్ష పీఠం కట్టబెట్టేసి ఒప్పందంపై సంతకాలు పెట్టించేయాలనే వ్యూహం ఎప్పుడో తయారు చేశారు. తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని, అది చేసుకునే ఒప్పందాలను తిరస్కరిస్తారని, తాలిబన్లతో పోరు కొనసాగక తప్పదని కూడా ముందే తెలుసు. ఇంకా కొత్తగా వచ్చే ముప్పేమిటి? కర్జాయ్ ‘మధ్యవర్తి’ అవతారానికి ముస్తాబవుతుండటమే! తాలిబన్లతో రహస్య మంతనాలు కొలిక్కి వస్తే కర్జాయ్ మధ్యవర్తిగా మారతారు. తాలిబన్లతో సయోధ్య కోసం కొత్త ప్రభుత్వం అమెరికాతో ఒప్పందాన్నిన రద్దు చేసుకునే త్యాగం చేయక తప్పదని ఒప్పిస్తారనే భయం ఇప్పుడు అమెరికాను పట్టి పీడిస్తోంది. చేతికి, నోటికి మధ్య అతి పెద్ద అగాధంగా కర్జాయ్ మారగలరని అమెరికా ఊహించలేదు. కథ అడ్డం తిరిగింది కాబట్టి త్రిమూర్తులతో అధ్యక్షుని సమావేశం తదుపరి విడుదల చేసిన అధికారిక ప్రకటన ‘2014 తర్వాత అఫ్ఘాన్లో అమెరికా పాత్రపై ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు’ అని ముక్తసరిగా ముగించింది. తాలిబన్ రాజ్యం నాటో బలగాలు తాలిబన్లపై పైచేయి సాధించలేవని అమెరికా కంటే చాలా ముందుగా 2007లోనే కర్జాయ్ గ్రహించారు. సంప్రదాయకమైన పాకిస్థాన్ వ్యతిరేక వైఖరిని చేపట్టారు. ఒకవంక అమెరికాతో నెయ్యం సాగిస్తూనే పాక్లోని వాయవ్య ప్రాంతంలోని తెగల ప్రాంతంలోని పష్తూన్ల దుస్థితిపై ధ్వజమెత్తారు. అఫ్ఘాన్, పాక్లలో ఉన్న ఫష్తూ ప్రజల ఐక్యతను చాటే పష్తూన్ దినోత్సవాన్ని అట్టహాసంగా జరపడం ప్రారంభించారు. ఒప్పందానికి మోకాలడ్డి అమెరికా వ్యతిరేకి గుర్తింపు కోసం పాకులాడుతున్నారు. గత డిసెంబర్లో అమెరికా రక్షణ మంత్రి హ్యాగెల్ అఫ్ఘాన్ పర్యటనకు వచ్చి వెళ్లిన వెంటనే ఆయన హఠాత్తుగా ఇరాన్కు వెళ్లి అధ్యక్షుడు హస్సన్ రుహానీతో రహస్య మంతనాలు సాగించారు. ప్రస్తుతం అమెరికా, నాటోల బలగాలు ముమ్మరంగా సైనిక చర్యలు సాగిస్తున్న పర్వాన్ రాష్ట్రంలో వందల మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేసి అమెరికాకు పుండు మీద కారం రాసినంత పని చేశారు. గత ముప్పయ్యేళ్లుగా రెండు అగ్రరాజ్యాలు రష్యా, అమెరికాలతో పాటూ పాకిస్థాన్ కూడా అఫ్ఘాన్ లో నెత్తుటి విధ్వంస క్రీడను సాగించింది. అది మెజారిటీ జాతి పష్తూన్లలో బలంగా నాటుకుపోయింది. 2014 తర్వాతి అఫ్ఘాన్కు అంతర్గతంగా తాలిబన్ల నుంచి ముప్పు కంటే బయటి నుంచే ముప్పే ఎక్కువని చాలా మంది అఫ్ఘాన్లలాగే కర్జాయ్ కూడా భావిస్తున్నారు. ఇరాన్, చైనా, భారత్లలో ఎవరితో వ్యూహాత్మక బంధం లాభసాటి అనే విషయాన్ని అతి జాగ్రత్తగా బేరీజు వేస్తున్నారు. దక్షిణ ఆసియాలో అత్యంత దౌత్య చాతుర్యం ప్రదర్శిస్తున్న నేత కర్జాయేననడంలో సందేహం లేదు. తాలిబన్లు ఆయన ఎత్తుగడలను వ్యతిరేకించడం లేదు. సమర్థిస్తున్నట్టు కనిపిస్తున్నారు. అలా అని 2014 తర్వాతికి ఆయన రూపొం దిస్తున్న ‘శాంతి’ పథకం ప్రకారం నడవాలని భావిస్తున్న దాఖలాలు లేవు. అతి తెలివిగా ఆయన్ను వాడుకోవాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుత తాలిబన్, అల్కాయిదా ఎత్తుగడలను కర్జాయ్ కంటే బాగా బుష్, ఒబామా ప్రభుత్వాల్లో రక్షణ మంత్రిగా పనిచేసిన రాబర్ట్ గేట్స్ అర్థం చేసుకున్నట్టుంది. ‘శత్రువులు (తాలిబన్లు) ఇప్పుడు ఏమీ చేయనవసరం లేదు. కేవలం వేచి చూస్తే సరిపోతుంది.’ అమెరికా బలగాల నిష్ర్కమణ ప్రకటన వారికి కొత్త ఊపిరులూదిందని గేట్స్ భావిస్తున్నారు. ‘అఫ్ఘాన్లో ఓటమి పాలైనామన్న అపప్రథ’ను అల్కాయిదా తనకు అనుకూలంగా మలుచుకొని మధ్యప్రాచ్యంలో చెలరేగిపోతోందని వాపోయారు. ఏది ఏమైనా 2014 తర్వాతి తాలిబన్ల పాలనను అందరూ కలిసి ఇప్పుడే అమలులోకి తెచ్చారు. ప్రస్తుతం అఫ్ఘాన్ పార్లమెంటు ముందున్న ఒక చట్టం ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంది. అది ఆమోదం పొందితే అఫ్ఘాన్ పురుషులకు తమ బంధువులైన మహిళలను హింసించే, అత్యాచారం చేసే హక్కులు లభిస్తాయి. అయినా కొత్త చట్టాలతో పనేముంది? అత్యాచారాలకు గురైన మహిళలను వ్యభిచార నేరం కింద శిక్షించి హంతకులకు వేసే శిక్షల కంటే కఠిన శిక్షలను విధిస్తూనే ఉన్నారు. 1917లోనే 18 ఏళ్ల లోపు వివాహాలను, బురఖాలను నిషేధించిన దేశంలో పాతికేళ్ల అమెరికా జోక్యం సాధించిన ప్రగతి ఇది. - పిళ్లా వెంకటేశ్వరరావు -
యూనిసెఫ్ ప్రచారకర్తగా సచిన్
-
యూనిసెఫ్ ప్రచారకర్తగా సచిన్
అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇటీవలే వీడ్కోలు తీసుకున్న సచిన్ టెండూల్కర్- యూనిసెఫ్ దక్షిణాసియా బ్రాండ్ అంబాసిడర్గా నియమితుడయ్యాడు. రెండేళ్ల పాటు అతడీ హోదాలో కొనసాగుతాడు. ఈ హోదాలో పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై అవగాహన పెంచే కార్యక్రమాల్లో సచిన్ పాల్గొననున్నాడు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో భారత్లో యూనిసెఫ్ ప్రతినిధి కరీన్ హల్షోఫ్ నుంచి సచిన్ నియామకపత్రం స్వీకరించాడు. యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు సచిన్ ఈ సందర్భంగా అన్నాడు. -
యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్గా సచిన్
ముంబై: యూనిసెఫ్ (ఐక్యరాజ్య సమితి బాలల నిధి) బ్రాండ్ అంబాసిడర్గా భారత క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్ నియమితులయ్యారు. దక్షిణాసియా విభాగానికి సచిన్ ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించినట్లు యూనిసెఫ్ గురువారం ప్రకటించింది. పిల్లల హక్కులతో పాటు వారి పౌష్టికాహారం అంశాలపై ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కోసం వివిధ దేశాల నుంచి సెలబ్రిటీలు ఎంపిక కాగా, ఈ సంవత్సరం భారత్ నుంచి సచిన్ ఎంపికయ్యాడు. యూనిసెఫ్ తరుపున రెండు సంవత్సరాల పాటు సేవలు అందించేందుకు సచిన్ సన్నద్ధమయ్యాడు. తనను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం పట్ల సచిన్ సంతోషం వ్యక్తం చేశాడు. క్రికెట్ కెరీర్ను ముగించిన అనంతరం తన రెండో ఇన్నింగ్స్ నుఈ రకంగా ఆరంభించడం చాలా ఆనందంగా ఉందన్నాడు. దేశంలోని 36 శాతం మంది సురక్షితమైన మరుగుదొడ్లు లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. సామాన్యునికి కనీస అవసరమైన మరుగుదొడ్లపై సరైన అవగాహన లేకపోవడం చాలా బాధాకరమన్నాడు. ఈ అంశాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టతరమైందిగా పేర్కొన్నాడు. శక్తి సామర్థ్యల మేర తనకు లభించిన ఈ అవకాశానికి వంద శాతం న్యాయం చేస్తానని సచిన్ తెలిపాడు చాలా కుటుంబాల్లో పిల్లల అవసరాల్ని తీర్చడంలో తల్లి కీలక పాత్ర పోషింస్తుదన్నాడు. పిల్లల విసర్జించిన మల మూత్రాల గురించి దేశంలోని చాలా మంది తల్లులకు సరైన అవగాహన లేక వారి ప్రాణాలకు ముప్పువాటిల్లుతుందన్నాడు. పిల్లల మల మూత్రాలను తీసివేసిన అనంతరం తల్లులు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోకుండా ఆహారాన్ని అందించకూడదన్నాడు. చిన్నారులు బంగారు భవిత ఇటువంటి చిన్న చిన్న కారణాల వల్లే భారంగా మారుతుందని సచిన్ ఆవేదన వ్యక్తం చేశాడు. రకరకాల వ్యాధులతో ప్రతీరోజూ 1600 పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని మాస్టర్ తెలిపాడు. -
ఓటమి కూడా గెలుపే కదా!
మాల్దీవుల్లో సైన్యానికి, న్యాయవ్యవస్థకు మధ్యన పెనవేసుకున్న ఈ అపవిత్ర బంధం దక్షిణ ఆసియాలో ఒక ధోరణిగానే బలపడుతోంది. మయన్మార్ ‘ప్రజాస్వామ్యా’నికి భిన్నంగా మాల్దీవుల్లో కొత్త మొహంతో పాత నియంత పాలన సాగుతుంది. అపురూపమైన పగడపు దిబ్బల దేశం మాల్దీవులు చరి త్రగా మిగలనుంది. భూతాప ప్రకోపానికి సముద్ర మట్టా లు పెరుగుతుండటం వల్ల జలసమాధి కానున్న ద్వీప దేశాల్లో అది ముందు వరుసలో ఉంది. రెండు రోజుల క్రితం వార్సాలో ముగిసిన వాతావారణ మార్పుల అంతర్జాతీయ సదస్సుకు దాని గోడు వినిపించలేదు. కానీ ఈ నెల 16న జరిగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో మన విదేశాంగశాఖకు ‘ప్రజాస్వామ్య’ విజయం కనిపించింది. మాల్దీవులు ‘మార్పు’నకు పట్టం గట్టిందని మన జాతీయ మీడియాకు తోచింది. లండన్ నుంచి వెలువడే ‘టెలి గ్రాఫ్’ పత్రికకు మాత్రం... సెప్టెంబర్ 7 ఎన్నికల్లో ఆధిక్యతను సాధించిన (47 శాతం ఓట్లు) మాజీ అధ్యక్షుడు మొహ్మద్ నషీద్ ‘గెలుపును సుప్రీంకోర్టు దురాక్రమిం చింది’ అని అది రాసింది. అత్యంత నిష్పాక్షికంగా, అవకతవకలకు తావులేని విధంగా జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ సుప్రీంకోర్టు ఆ ఎన్నికను కొట్టి పారేసింది. వాయిదాల మీద వాయిదాలతో సెప్టెంబర్ 28న జరగాల్సిన రెండో రౌండు ఎన్నికలతో ఎట్టకేలకు ఈ వ్యవహారం 16న కొలిక్కి వచ్చింది. మనం మరచినంత తేలిగ్గా ఆ పత్రిక... ఈ రద్దుల, వాయిదాల చరిత్రను మరచిపోలేక పోయినట్టుంది. గత ఫిబ్రవరిలో మొహ్మద్ వహీద్ హస్సన్ అకారణంగా సైన్యం సహాయంతో మొట్టమొదటి ప్రజాస్వామిక అధ్యక్షుడు నషీద్తో బలవంతంగా రాజీనామా చేయించి స్వయంగా అధ్యక్షుడయ్యాడు. నషీద్తో పాటూ భారత్సహా ప్రపంచ దేశాలన్నీ తక్షణమే ఎన్నికలను నిర్వహించాలని కోరాయి. 2013 జూలైలో ఎన్నికలను నిర్వహిస్తానన్న వహీద్ ఇప్పటి వరకు నెట్టుకొచ్చారు. నవంబర్ 9న తిరిగి జరిపిన ఓటింగ్లో సెప్టెంబర్ ఫలితాలే పునరావృతమయ్యాయి. ఏ అభ్యర్థికీ 50 శాతం ఓట్లకు మించలేదు. మరో వాయిదాతో 16న జరిగిన రెండో రౌండు ముఖాముఖి ఎన్నికలో యమీన్ 51 శాతం ఓట్లతో గెలిచాననిపించుకోగలిగారు. సుప్రీంకోర్టు పాత్రధారిగా కొట్టివేత, సాగదీతలతో వహీద్ను ముందుంచి సైన్యం ఆడిన నాటకం రక్తికట్టింది. ఇంతకూ నషీద్ను ఓడించిన యమీన్ అబ్దుల్ గయూమ్ ఎవరు? మాల్దీవులను మూడు దశాబ్దాల పాటూ, 2008 వరకు నిరంకుశ నియంతృత్వానికి గురిచేసిన నియంత మహ్మద్ అబ్దుల్ గయూమ్కు తమ్ముడు, ఆయన పార్టీ పీపీఎం నేత. గయూం బంటు యమీన్ ప్రజాస్వామ్యవాదేననున్నా... గెలిచే అభ్యర్థి ఓడిపోయేంత వరకు ఎన్నికల ప్రక్రియను సాగదీయడం ఎలాంటి ప్రజాస్వామిక ప్రక్రియ? మాల్దీవుల్లో సైన్యానికి, న్యాయవ్యవస్థకు మధ్యన పెనవేసుకున్న ఈ అపవిత్ర బంధం దక్షిణ ఆసియా ప్రాం తంలో నేడు ఒక ధోరణిగానే బలపడుతోంది. శ్రీలంకలో అధ్యక్షుడు మహింద రాజపక్స ఒకవంక దేశాన్ని సైనికీకరణకు గురిచేస్తున్నారు. మరోవంక న్యాయవ్యవస్థను గుప్పి ట పెట్టుకుంటున్నారు. తానే నియమించిన ఒక సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించి మరీ అడ్డు తొలగిం చుకున్నారు. పాకిస్థాన్లో కూడా న్యాయవ్యవస్థకు సైన్యానికి మధ్యన ఇలాంటి అనుబంధం బలపడుతోంది. ఈ అపవిత్ర బంధానికి ఉన్న మరో కోణం... మత ఛాందసవాద ఉన్మాదం. మలుపులు తిరిగిన మాల్దీవుల ఎన్నికల కథను కంచికి చేర్చినది కూడా అదే. మూడో స్థానంలోని అభ్యర్థిగా నిలిచిన మాల్దీవుల కుబేరుడు అబ్దుల్ ఖాసీంకు అవి మద్దతు పలికాయి. రెండో రౌండ్లో మతోన్మాదశక్తులు గయూం సోదరునివైపు మొగ్గు చూపాయి. ఈ వాయిదాల కాలమంతా పీపీఎమ్ మతోన్మాద ఛాందసవాద శక్తులను బుజ్జగిస్తూనే గడిపింది. మయన్మార్ ‘ప్రజాస్వామ్యా’నికి భిన్నంగా మాల్దీవుల్లో కొత్త మొహంతో పాత నియంత పాలన సాగుతుంది. శ్రీలంక, మయన్మార్లలో బౌద్ధ మతోన్మాదం, పాక్, మాల్దీవుల్లో ఇస్లామిక్ మతోన్మాదం నిజమైన ప్రజాస్వామ్యానికి ఆ దేశాలను ఆమడ దూరంలో ఉంచడానికి హామీని కల్పించడానికి ప్రయత్నిస్తునాయి. నేడు ఎన్నికల ఆటలో ఓడిన నషీద్ దేశాధ్యక్షునిగా 2009లో విలక్షణమైన ప్రపంచ రికార్డును నెలకొల్పారు. సముద్రం అట్టడుగున మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు! మాల్దీవులను సముద్రం మింగేయబోతున్నవిషయాన్ని సముద్రంలో మునిగి చెపితేనన్నా అంతర్జాతీయ సమాజానికి పడుతుందేమోనని ఆశించారు. పట్టలేదు. నేడు మాల్దీవుల ప్రజాస్వామ్యం గంగలో కలుస్తున్నా ఎవరికీ పట్టదు. యమీన్తో సత్సంబంధాలకోసం తాపత్రయం తప్ప మనకు మరేమీ పట్టదు గాక పట్టదు. చైనా బూచి మనకు నిద్ర పట్టనీయదు. - పిళ్లా వెంకటేశ్వరరావు -
భారత్కు 10 బిలియన్ డాలర్ల రుణం
న్యూఢిల్లీ: భారత్కు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఐదు సంవత్సరాల కాలంలో (2013-17) 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.62,000 కోట్లు) రుణ సహాయాన్ని చేయనుంది. 2017 వరకూ వార్షికంగా 2 బిలియన్ డాలర్ల చొప్పున బ్యాంక్ ఈ సహాయాన్ని అందజేస్తుంది. ఏడీబీ-కేంద్ర ప్రభుత్వాలు ఈ మేరకు ఒక వ్యూహాత్మక భాగస్వామ్య వ్యూహాన్ని కుదుర్చుకున్నాయి. మనీలా కేంద్రంగా పనిచేస్తున్న ఏడీబీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. లక్ష్యాలు ఇవీ...: 12వ పంచవర్ష ప్రణాళికా లక్ష్యాలను నెరవేర్చడంలో ఈ నిధులు కొంత దోహదపడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉపాధి అవకాశాల కల్పన, పెట్టుబడుల సంస్కరణల అమలు, మౌలిక రంగం పురోభివృద్ధి లక్ష్యంగా ఇంధనం, రవాణా, పట్టణాభివృద్ధి సేవలు, జలవనరుల సరఫరా, అభివృద్ధి వంటి అంశాల్లో ఈ నిధులను వెచ్చించనున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. భారత్ చర్యలు భేష్...: ఆర్థిక స్థిరత్వం, రూపాయి స్థిరీకరణ, మౌలిక రంగ అభివృద్ధి, సామాజిక కార్యక్రమాల అమలు వంటి అంశాల్లో భారత్ విశ్వసనీయ చర్యలు తీసుకుంటోందని ఏడీబీ దక్షిణ ఆసియా అభివృద్ధి వ్యవహారాల డెరైక్టర్ జనరల్ జూయిన్ మిరాందా పేర్కొన్నారు. కాగా, కొన్ని క్లిష్టమైన విధాన సమస్యలు పరిష్కారమయితే భారత్ అధిక వృద్ధి సాధ్యమేనని ఏడీబీ పేర్కొంది. పారిశ్రామిక భూ సేకరణ, సహజ వనరులకు సంబంధించి లెసైన్సుల మంజూరుల్లో ఇబ్బందులు తొలగిపోవాల్సిన ఉందని సూచించింది. -
మన్మోహన దౌత్య విషాదం
బైలైన్: ఏదైనా దేశంతో సమస్య ఉంటేనే భారత్ దాన్ని పట్టించుకుంటుంది, అంతేగానీ స్నేహ హస్తాన్ని చాపితే మాత్రం కాదు. దక్షిణాసియా అంతటా భారత్పట్ల కనిపించే మూతి విరుపు ధోరణికి కారణం ఇదే. ఈ వ్యవహారం చూసి లోతుగా ఆలోచించే చైనా, భారత ప్రభుత్వం నుంచి తాను రాబట్టగలిగినదంతా రాబట్టుకుంటుంది, కోరుకున్నప్పుడల్లా అవమానిస్తుంటుంది. అది చూసి పాకిస్థాన్ సంతోషంతో నవ్వుకుంటుంది. ప్రతి దేశానికి దాని సొంత ఇరుగుపొరుగులు ఉండనే ఉంటా రు. దేశ భూభాగంతో పాటే దానికి ఆ ఇరుగుపొరుగులు కూడా సంక్రమిస్తారు. భౌగోళిక రాజకీయాలు ముడిపడి ఉన్నప్పుడు ఒక దేశపు ఇరుగుపొరుగులు మరొక దేశానికి ఆత్మీయులు కావడం జరుగుతుం టుంది. అలాంటప్పుడే సమస్య సంక్లిష్టంగా మారుతుంది. శత్రుత్వమే వాస్తవానికి అత్యంత సూటిగా ఉంటుంది. రెచ్చగొట్టడమనే దానికి స్పష్టమైన కొలబద్దలు ఉంటాయి. దానికి ప్రతిస్పందన కూడా సాధారణంగా ఊహించదగినదిగానే ఉంటుంది. భారత్, పాకిస్థాన్ల మధ్య సంబంధాలు ఇందుకు అత్యుత్తమ ఉదాహరణ. ఇంతపాటి అతిక్రమణకు ఈ మోతాదు మందుగుండు అంటూ రెండు దేశాల విదేశాంగశాఖల కార్యాలయాలు, సైన్యాలు కచ్చితమైన కొలమానాలతో కూడిన సూత్రాలను రూపొందించుకున్నాయి. ఖడ్గం ఖంగున మోగుతుంది, ఒక్కోసారి ఓ వేటును కూడా వేస్తుంది. అయితే గాటు మాత్రం ఎప్పుడూ ముందుగా నిర్ణయించుకున్న మేరకు మాత్రమే పడుతుంది. తప్పు ఎవరిదైనా గానీ అంతకు మించిన గాయం మాత్రం చేయరు. విరామచిహ్నాల్లాగా అప్పుడప్పుడూ మృత్యువు దర్శనమిస్తున్నా జీవితం సాగిపోతూనే ఉంటుంది. అధిక సందర్భాల్లో బాధిత దేశంగా ఉండే భారత్ గతి తప్పిన గడియారపు లోలకం డోలనాలను పరిగణనలోకి తీసుకుంటుంది. శాంతి ప్రయత్నాల వల్ల నెలకొనే సానుకూల వాతావరణం కంటే భారత పటాన్ని మార్చాలనే సంకల్పంతో ఉన్నవారు ప్రేరేపించే సంఘర్షణ ఎక్కువ కావడం జరుగుతూనే ఉంటుంది. అలా అని ఇరు దేశాల మధ్య వైషమ్య భావన ప్రబలంగా ఉండటానికి అది కారణం కాదు. ఇరువైపులా ఉండే బాధ్యతాయుత ప్రభుత్వాలు ఆత్మవిశ్వాసంతోనే ఉంటాయి. అయినాగానీ ఏ పరిస్థితిలోనైనాగానీ తిరుగులేని విజయంతో ఆటకట్టింపు జరగదని ఇరుపక్షాలు గుర్తిస్తాయి. కాబట్టే ప్రతిష్టంభన ప్రమాదకర యుద్ధంగా దిగజారిపోకుండా జాగ్రత్తవహిం చటానికి అవి బాధ్యత వహిస్తాయి. మిత్రులతో అనుబంధం విషయంలోనే ఊహాశక్తి, కఠోర శ్రమ రెండూ ఎక్కువగా అవసరమవుతాయి. మన దౌత్యవేత్తలు ఉపఖండంలోని ఉన్నతాధికారుల నుంచి ఆశించదగినంత స్థాయిలో వళ్లు వంచి పనిచేసేవారే. అయినాగానీ గత ఐదేళ్ల కాలంలో వాళ్లు ఎలాంటి ప్రయోజనమూ లేకుండానే పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రయోజనం అనేది ఎప్పుడూ విధానపు పర్యవసానమే. భారత ప్రభుత్వం తన విదేశాంగ విధానాన్ని దాటుళ్లు, గెంతులు, దుంకుళ్ల క్రీడగా మార్చింది. ఫలితాలు కళ్లకు కడుతూనే ఉన్నాయి. మనకు మిత్రులు కాదగినవాళ్లలో లేదా కావాల్సినవాళ్లలో కలవరపాటును లేదా సంశయం కలగడం కనిపిస్తూనే ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్లు అందుకు కొట్టవచ్చినట్టుగా కనిపించే రెండు ఉదాహరణలు. ఆ రెండు పొరుగు దేశాలతో ఒకప్పుడు మన సంబంధాలు చరిత్రలోనే అత్యంత అధ్వాన్న స్థితిలో ఉండేవి. అలాంటిది ఐదేళ్ల క్రితం ఆ దేశాలతో సంబంధాలు మునుపెన్నడూ ఎరుగనంతటి స్నేహపూర్వకమైనవిగా మారడానికి చేరువయ్యాయి. రాజీవ్గాంధీ ఆదేశాలపై అరకొర సన్నాహాలతో మన దేశం శ్రీలంకలో చేపట్టిన సైనిక జోక్యంతో రెండు దేశాల మధ్య సంబంధాలు అథఃపాతాళానికి దిగజారాయి. ఇంది రాగాంధీ ప్రభుత్వం ప్రభాకరన్ నేతృత్వంలోని తమిళ వేర్పాటువాద ఉద్యమానికి ఆయుధాలను, శిక్షణను అం దించినప్పటి లక్ష్యానికి పూర్తిగా విరుద్ధమైన లక్ష్యంతో రాజీవ్గాంధీ ఆ సైనిక చర్యను చేపట్టారు. ఆ విరోదాభాసాత్మకత తారస్థాయికి చేరి భారత్ భయానకమైన ఉచ్చు లో ఇరుక్కుపోయింది. అటు సింహళులు, ఇటు తమిళులు కూడా భారత్ను ద్వేషించారు. ఆ విషమ పరిస్థితి నుంచి 2009లో నాటి విదేశాంగ మంత్రి ప్రణబ్ముఖర్జీ మార్గదర్శకత్వంలో మనం బయటపడగలిగాం. తమిళ వేర్పాటువాదులకు వ్యతిరేకంగా శ్రీలంక ప్రభుత్వం చేపట్టిన చివరి నిర్ణయాత్మకమైన పోరాటానికి ప్రణబ్ దృఢంగా, సుస్పష్టంగా, పూర్తిగా మద్దతును తెలిపారు. ఏ ప్రచారార్భాటం లేకుండానే అది జరిగింది. శ్రీలంక సైన్యం ఎల్టీటీఈని ఓడిస్తున్నా, ప్రభాకరన్ను హతమారుస్తున్నా యూపీఏ ప్రభుత్వం మౌనం వహించింది. తన ముఖ్య మిత్రపక్షమై న డీఎంకే ఎంతగా వత్తిడి తెస్తున్నా అది పట్టించుకోలేదు. ఆనాడు మనం శ్రీలంక ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతు రెండు దేశాల మధ్య పరస్పరం లాభసాటియైన సంబంధాలను విస్తరింపజేసుకోడానికి గొప్ప పెట్టుబడిగా ఉపయోగపడాల్సింది. అందుకు బదులుగా దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రధాని మన్మోహన్సింగ్ నవంబర్లో జరగనున్న కామన్వెల్త్ దేశాధినేతల సమావేశానికి హాజరుకాకుండా ఉండాలేమో అనిపించేంత దుస్థితి నెలకొంది. కారణం? శ్రీలంక మానవ హక్కుల ఉల్లంఘన చర్చకు వచ్చే ఆ సమావేశానికి ప్రధాని హాజరుకావడం తమిళనాడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని యూపీఏ ఆందోళన చెందుతుండటమేనని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఎల్టీటీఈపై యుద్ధంలో లంక సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిందన్న ఆరోపణల విషయమై తమిళనాట భావోద్వేగాలు వ్యాపించి ఉన్నాయి. మన్మోహన్ వైఖరి ఏమంత అర్థవంతమైనది కాదు అనిపిస్తుంది. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, లంక యుద్ధం చివరి దశలో ఏమైతే జరిగిందో ఆ విషయంలో భారత్కు భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే ఏమి జరుగుతుందో తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే మన ప్రభుత్వం ఏమీ చేయరాదని నిర్ణయించింది. రెండోది, దేశంలోని ఎన్నికల లెక్కలకు విదేశాంగ విధానం బందీ అయ్యేట్టయితే ఓటర్లకు లేదా జాతీయ ప్రయోజనాలను ఎన్నటికీ మేలు కలగదు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా తిరిగి ప్రధానిగా ఎన్నిక కావడం కూడా అంతే నాటకీయమైన విస్తృతిగల అవకాశాలను కల్పించింది. బంగ్లాదేశ్లో మనకు షేక్ హసీనా కంటే ఉత్తమమైన మిత్రులు దొరకరు. ఎందుకంటే ఆమె 1971 బంగ్లాదేశ్ విముక్తి నేత ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె. అయినాగానీ అవకాశాల నుంచి అనర్థాలను రాబట్టడం ఎలాగనే పాఠ్యపుస్తకంలోని పాఠంలాగా మన ప్రభుత్వం సున్నితమైన నదీ జలాల సమస్యపై హసీనాను వంచించింది. మన్మోహన్ ఏమి వాగ్దానం చేశారనేదే తప్ప షేక్ హసీనా ఏం కావాలని కోరారు అనేది ఇక్కడ గీటురాయి కానేకాదు, అటు ఢాకాలోనూ, ఇటు కోల్కతాలోనూ కూడా భారత ప్రభుత్వ నిర్వహణ నైపుణ్యం దయనీయమైనంత అధ్వాన్నంగా ఉండటం వల్లనే మన్మోహన్ ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. కాబట్టి భారత్ పట్ల శ్రీలంక ఆందోళనకు, బంగ్లాదేశ్ సంశయానికి తగిన కారణమే ఉంది. అయితే అవి భారత్పట్ల ఆగ్రహంతో లేకపోవచ్చుననేది వేరే సంగతి. భారత్ అనుసరిస్తున్నది తుపాకీని ఎటుబడితే అటు విచక్షణారహితంగా గురిపెట్టే వైఖరి. భారత్కు సర్వకాల సర్వావస్థల మిత్ర దేశం ఏదైనా ఉందంటే అది భూటానే. ఆ దేశంతో సంబంధాలలోని శాశ్వతమైన వసంతం కాస్తా ఎప్పుడూ ఉరుములతో భయపెట్టే తుఫానుల వానాకాలంగా దిగజారిపోయింది. అయితే అది ఇంతవరకు ఎప్పుడూ కుంభవృష్టిగా మారింది లేదనే మాట నిజమే. ఏదేమైనా భూటాన్తో సంబంధాలను చెడగొట్టుకోడానికి అసాధారణమైన నేర్పు ఎంతో అవసరం. గత కొన్నేళ్లుగా మనం దాన్ని సైతం సాధించగలిగాం. మన్మోహన్ ప్రభుత్వం ఏ పొరుగు దేశం కోసమైనా సమయం వెచ్చించగలుగుతోందంటే అంటే అది అమిత్ర వైఖరిగల పాకిస్థాన్ లేదా నిరాశావహమైన చైనాల కోసం మాత్రమే. మిగతా దేశాలకు మన ప్రభుత్వం పంపే సందేశం సరళమైనది: ఏదైనా సమస్య ఉంటేనే భారత్ దాన్ని పట్టించుకుంటుంది, అంతేగానీ స్నేహ హస్తాన్ని చాపితే మాత్రం కాదు. దక్షిణ ఆసియా అంతటా భారత్పట్ల కనిపించే మూతి విరుపు ధోరణికి కారణాలను ఇది విశదం చేయగలుగుతుంది. ఈ వ్యవహారం చూసి లోతుగా ఆలోచించే చైనా, భారత ప్రభుత్వం నుంచి తాను రాబట్టగలిగినదంతా రాబట్టుకుంటుంది, కోరుకున్నప్పుడల్లా అవమానిస్తుంటుంది. అది చూసి సంతోషించే పాకిస్థాన్ నవ్వుకుంటూ సార్క్ దేశాల సౌహార్ద్రతను కూడగట్టుకుంటుంది.