Sri Ram Sagar Project
-
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్లోకి 1,10,960 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో
-
TS: భద్రాచలం వద్ద తగ్గిన నీటిమట్టం.. మిగతా చోట్ల వరద ఉధృతి
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 48 అడుగులకు చేరింది. ఎగువ నుంచి గోదావరిలోకి వస్తున్న 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఇప్పుడిప్పుడే ముంపునకు గురైన కాలనీలలో సాధారణ పరిస్థితిలు కనిపిస్తున్నాయి. దీంతో శానిటేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. వరదలతో సర్వం కోల్పోయిన భద్రాచలం స్థానికులు.. భరించలేని దుర్వాసనతో ఇళ్లలో ఉండలేకపోతున్నారు. ఒక పక్క సిబ్బంది.. మరోవైపు ప్రజలూ మాస్కులు ధరించి రంగంలోకి దిగారు. ఇంకోపక్క గోదావరి వరద లతో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. భద్రాచలం, పినపాక నియోజక వర్గాల్లోని ఏడు మండలాల్లో 630కి పైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బ తిన్నాయి. వారం రోజుల పాటు వరద నీటిలోనే ఉండిపోయింది పర్ణశాల సబ్స్టేషన్. సమారు 16 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారుల అంచనా వేస్తున్నారు. అలాగే 143 గ్రామాల్లో 5,620 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. సహాయక చర్యలు.. భద్రాచలం వరదలు తగ్గుముఖం పట్టాక వేగంగా వ్యర్థాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇతర జిల్లాలో నుంచి వచ్చి విధుల్లో చేరిన 4,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనులు చేస్తున్నారు. శిల్పినగర్, విస్తా కాంప్లెక్స్తోపాటు ఆలయ ఉత్తర ద్వారం వైపునకు వస్తున్న భద్రాచలం కరకట్ట వద్ద ఉన్న స్లూయిస్ల ద్వారా నీరు లీకవుతోంది. దీంతో.. ఇరిగేషన్ శాఖ ఏర్పాటు చేసిన ఐదు మోటార్లకు అదనంగా మరో 15 మోటర్లు తెప్పించించింది సింగరేణి. మొత్తం 20 మోటార్ల ద్వారా వరదనీటిని తోడి తిరిగి గోదావరిలోకి ఎత్తిపోసే ప్రక్రియ నడుస్తోంది. ఉన్నతాధికారిపై వేటు భద్రాచలం డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ డా. కె. రాజ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. గోదావరి వరదల సమయంలో హెడ్ క్వార్టర్లో లేకుండా, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పోవడం సర్కార్ దృష్టికి వెళ్లింది. దీంతో రాజ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి వరదనీరు పొటెత్తింది. డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా.. ప్రస్తుతం 402.40 అడుగులు చేరింది. ఇన్ ఫ్లో 4వేల క్యూసెక్కులు కాగా 4 గేట్లు ఎత్తి 18వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా: శ్రీరాంసాగర్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లోస్ 59 వేల క్యూసెక్కులుగా ఉంది. పద్దెనిమిది గేట్లెత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. మొత్తం 90 టీఎంసీలకుగాను ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 77 టీఎంసీలు.. 1091 అడుగులకుగాను.. నీటిమట్టం 1088 అడుగులుగా ఉంది. భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం వద్ద 12.600 మీటర్ల ఎత్తులో క్రమంగా పెరుగుతూ ప్రవహిస్తోంది గోదావరి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లక్ష్మీ బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి 10,71,720 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 10,71,720 క్యూసెక్కులుగా ఉంది. లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసిలు. అన్నారం సరస్వతీ బ్యారేజ్ సరస్వతీ బ్యారేజ్ మొత్తం 66 గేట్లు ఎత్తి 1,46,,353 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 1,46,353 క్యూసెక్కులు గా ఉంది. సరస్వతీ బ్యారేజ్ పూర్తి నీటి సామర్ధ్యం 10.87 టీఎంసిలు.. ప్రస్తుత నీటి సామర్ధ్యం 0.33 టిఎంసిలుగా ఉంది. నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద. ఇన్ ఫ్లో : 29,365 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో: 4,138 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 312.0450 టిఎంసీ లు, ప్రస్తుత నీటి నిలువ: 173.6640 టిఎంసి లు. పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం: 532.80 అడుగులు, -
సాగరం సగమైంది!
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని, లక్షల ఎకరాలకు సాగునీరు అందించే శ్రీరాం సాగర్ జలాశయానికి గడ్డు రోజులు వచ్చాయి. రిజర్వాయర్లో ఏటేటా పూడిక పెరిగిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నీటి నిల్వ సామర్థ్యం ఇప్పటికే దాదాపు సగానికి తగ్గిపోవ డంతో ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారుతోంది. శ్రీరాంసాగర్ జలాశయం నిర్మించినప్పుడు 112 టీఎంసీలుగా ఉన్న నిల్వ సామర్థ్యం.. ప్రస్తుతం 59.94 టీఎంసీలకు తగ్గిపోయిందని.. దీనికితోడు ఏటా 0.5 టీఎంసీల నుంచి 0.7 టీఎంసీల మేర పూడిక పేరుకుం టోందని తాజాగా నిర్వహించిన అధ్యయనం తేల్చింది. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ), రిమోట్ సెన్సింగ్ డైరెక్టరేట్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా ఈ ‘శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ (ఎస్ఆర్ఎస్)’ సర్వే చేశాయి. 2020 నవంబర్– 2021 మే మధ్య జలాశయంలో గరిష్ట, కనిష్ట నీటి మట్టాల పరిస్థితిని సెంటినల్ 1ఏ/ఏబీ ఉపగ్రహాల మైక్రోవేవ్ డేటా ఆధారంగా పరిశీలించి.. పూడిక పరిస్థితి, నిల్వ సామర్థ్యాన్ని గుర్తించాయి. స్టోరేజీకి ‘డెడ్’.. లైవ్కూ గండి! తెలంగాణలో గోదావరి నదిపై గ్రావిటీ ఆధారంగా నిర్మించిన ఏకైక జలాశయం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు. జలాశయం నిర్మించినప్పుడు గరిష్ట నిల్వ సామర్థ్యం 112 టీఎంసీలు. అందులో డెడ్ స్టోరేజీ (అడుగున ఉండి వినియోగించుకోవడానికి వీల్లేని నీళ్లు) 30 టీఎంసీలు పోగా.. వాడుకోగలిగినవి 82 టీఎంసీలు. ప్రస్తుతం సుమారు 52 టీఎంసీల మేర పూడిక పేరుకుపోయింది. అంటే 30 టీఎంసీల డెడ్ స్టోరేజీతోపాటు వాడుకోగలిగిన 22.06 టీఎంసీల లైవ్ స్టోరేజీ సామర్థ్యాన్ని కూడా జలాశయం కోల్పోయిందని ఎస్ఆర్ఎస్ నివేదిక స్పష్టం చేస్తోంది. పూడిక తొలగించే గేట్లే.. కూరుకుపోయాయ్ గోదావరి నదిలో ఎగువన మహారాష్ట్ర నుంచి జూలై రెండో వారంలో వరదలు మొదలై.. అక్టోబర్ వరకు కొనసాగుతాయి. ఈ సమయంలో నీటిని విడుదల చేయడానికి శ్రీరాంసాగర్ జలాశయానికి 42 వరద గేట్లతోపాటు పూడికను తొలగించే 6 రివర్స్ స్లూయిస్ గేట్లను కూడా ఏర్పాటు చేశారు. డెడ్ స్టోరేజీ జోన్కి మించి చేరిన పూడికను ఈ గేట్లను ఎత్తివేయడం ద్వారా తొలగించవచ్చు. మొదట్లో ఈ స్లూయిస్ గేట్లను ఎత్తడానికి ప్రయత్నించి, విఫలం కావడంతో వదిలేశారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆపరేట్ చేయలేదు. పూడిక పేరుకుపోవడానికి ఇదికూడా ప్రధాన కారణం. ప్రస్తుతం స్లూయిస్ గేట్లు పూర్తిగా మట్టిలో కూరుకుపోయాయి. లక్షల ఎకరాలకు నీరిచ్చేలా.. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడు వద్ద గోదావరి నదిపై 112 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టును చేపట్టారు. 1963 జూలై 26న నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దీనికి శంకుస్థాపన చేయ గా.. 1978లో నిర్మాణం పూర్తయింది. దీనికింద 18 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటల ఆయకట్టును ప్రతిపాదించగా.. 16 లక్షల ఎకరాల స్థిరీకరణ జరి గింది. మరో 2లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాల్సి ఉంది. ఈ రిజర్వాయర్కు అనుబంధంగా 36 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మించారు. రిజర్వాయర్ నుంచి మూడు ప్రధాన కాల్వలు ఉన్నాయి. ∙శ్రీరాంసాగర్ ప్రధాన కాల్వ కాకతీయ కెనాల్. 9 వేల క్యూసెక్కుల సామర్థ్యమున్న ఈ కాల్వ ద్వారా నే నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. దీని ద్వారానే లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ) కి 10 టీఎంసీల మేర నీటిని తరలిస్తున్నారు. ∙500 క్యూసెక్కుల సామర్థ్యమున్న లక్ష్మి కాల్వ ద్వారా నిజామాబాద్ జిల్లాలో 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ∙1000 క్యూసెక్కుల సామర్థ్యమున్న సరస్వతి కాల్వ కింద నిర్మల్ జిల్లాలో 35 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ∙ఎస్సారెస్పీ మిగులు జలాలను తరలించే వరద కాల్వ సామర్థ్యం 24 వేల క్యూసెక్కులు. దీనికింద 2.20లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. పూడిక వేగం పెరుగుతోంది ఈ జలాశయం ఏటా పూడిక వల్ల సగటున 0.5 టీఎంసీల మేర నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతూ వస్తోంది. 1970–1994 మధ్య ఏటా 0.53%, 1994–2013 మధ్య ఏటా 0.4%, 2013– 2021 మధ్య ఏటా 0.71% నిల్వ సామర్థ్యాన్ని నష్ట పోయి నట్టు సర్వేలు గుర్తించాయి. అంటే జలాశయం పూడుకుపోతున్న వేగం కొన్నేళ్లుగా బాగా పెరుగు తోందని తేల్చాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్య త్తులో రాష్ట్రానికి భారీ నష్టమే కలగనుంది. ప్రాజెక్టుపై ఆధారపడిన 18 లక్షల ఎకరాల ఆయకట్టు భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ∙ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఫలాలు సంపూర్ణంగా అందాలన్నా శ్రీరాంసాగర్ జలాశయా న్ని పరిరక్షించుకోవాల్సిందేనని నిపుణులు చెప్తున్నా రు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు సమీపంలోకి.. అక్కడి నుంచి వరద కాల్వ మీదుగా 3 లిఫ్టులతో శ్రీరాంసాగర్ను నింపడానికి ప్రభుత్వం ఎస్సారెస్పీ పునర్జీవన పథకాన్ని చేపట్టింది. శ్రీరాంసాగర్ పూడు కుపోతే ఈ పథకం లక్ష్యం సైతం నెరవేరదు. భవిష్య త్తులో తాగునీటి అవసరాలకే ఈ ప్రాజెక్టు పరిమితం కావాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏటేటా తగ్గుతున్న సామర్థ్యం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం ఏటేటా పడిపోతూనే ఉంది. ప్రాజెక్టు నిర్వహణ రికార్డుల ప్రకారం ఏటా సగటున 0.8 టీఎంసీల పూడిక వచ్చి చేరుతోంది. 1994లో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొ రేటరీస్ (ఏపీఈఆర్ఎల్) సర్వే చేసి.. ఈ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు తగ్గిపోయినట్టు పేర్కొంది. అయితే అంతకుముందు, తర్వాత చేసిన సర్వేల్లో.. నిల్వ సామర్థ్యం మరింతగా పడిపోయినట్టు వెల్లడైంది. ఆ సర్వేలను.. తాజా ఎస్ఆర్ఎస్ గణాంకాలను సీడబ్ల్యూసీ పోల్చి చూసింది. ఆయా సర్వేల్లో తేల్చిన వివరాలివీ.. పూడికను నివారించేదిలా? జలాశయాల్లో పూడికను తొలగించడం అత్యంత ఖర్చుతో కూడిన పని. ఆ ఖర్చుతో కొత్త జలాశయమే నిర్మించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే తక్కువ ఖర్చు, సులువుగా జలాశయాల్లో పూడిక చేరకుండా నివారించవచ్చని సీడబ్ల్యూసీ చెప్తోంది. తమ నివేదికలో పలు సిఫారసులు చేసింది. అడవుల నిర్మూలన, చెట్ల నరికివేతతో వరదల వేగం పెరిగి జలాశయాల్లో పూడిక చేరుతుంది. దీనిని అడ్డుకోవాలి. పరీవాహక ప్రాంతాల్లో విస్తృతంగా అడవులు, చెట్లను పెంచాలి. నదీ తీరాల్లో రివిట్మెంట్లు, చెట్లతో పరీవాహక ప్రాంతం కోతకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలి. నదుల్లో ఎక్కడికక్కడ నీళ్లను నిల్వ చేసేలా కాంటూర్ గుంతలు, చెక్ డ్యాంలు, చిన్న రిజర్వాయర్లు నిర్మిస్తే వరదల వేగం తగ్గి.. పెద్ద జలాశయాల్లోకి పూడిక రాదు. వ్యవసాయ పద్ధతుల్లోనూ మార్పు తేవాలి. భూమిని దున్ని వదిలేస్తే వేగంగా కోతకు గురై నదుల్లోకి మట్టి చేరుతుంది. రిజర్వాయర్లలోకి రాక ముందే మధ్యలోనే ఎక్కడికక్కడ పూడికను తొలగించాలి. నదుల ప్రవాహ మార్గాల్లో భూ ఉపరితలం కోతకు గురికాకుండా చర్యలు చేపట్టాలి. -
సాగుకు పూర్తి.. మిగిలింది తాగుకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టు అయిన శ్రీరాంసాగర్ కింద సాగు అవసరాలకు నీటి విడుదల ప్రక్రియ మరో రెండ్రోజుల్లో ముగియనుంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2 కింద యాసంగిలో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించారు. ఎస్సారెస్పీలో లభ్యత నీటిని వాడుకుంటూ లోయర్ మానేరు డ్యామ్ వరకు ఉన్న ఆయకట్టుకు నీరందించగా దాని దిగువన ఉన్న ఆయకట్టుకు కాళేశ్వరం జలాలతో పారించారు. ఆయకట్టు చరిత్రలోనే తొలిసారి 120 టీఎంసీలను వినియోగించి 14.50 లక్షల ఎకరాలకు నీరు అందించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఎస్సారెస్పీ మొదలు ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరులలో కనీస నీటిమట్టాలను పక్కాగా నిర్వహిస్తూ జూలై వరకు తాగునీటి అవసరాలకు నీటిని పక్కనబెట్టారు. ఒకవేళ సహజ ప్రవాహాల రాక ఆలస్యమైనా కాళేశ్వరం ద్వారా ఎత్తిపోతలు మొదలు పెట్టేలా ప్రణాళికలున్నాయి. గరిష్ట ఆయకట్టు.. గరిష్ట వినియోగం ఎస్సారెస్పీ ప్రాజెక్టులో స్జేజ్–1 కింద 9.60 లక్షల ఎకరాలు, స్టేజ్–2లో 3.97 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. వాటితోపాటే ఎస్సారెస్పీపైనే ఆధారపడ్డ అలీసాగర్, గుత్పా కింద ఉన్న 40 వేల ఎకరాలు, కడెం కింద 40 వేల ఎకరాలు, మిడ్ మానేరు కింద 30 వేల ఎకరాలు, సదర్మట్–గౌరవెల్లి రిజర్వాయర్ల కింద మరో 40 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో ఈ యాసంగిలో 14.50 లక్షల ఎకరాల మేయ ఆయకట్టుకు నీరందించారు. లోయర్మానేరు ఎగువన ఎస్సారెస్పీ, అలీసాగర్, గుత్పా, వరద కాల్వల ఆయకట్టు కలిపి 6.50 లక్షల ఎకరాల మేర ఉండగా 5.70 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించారు. దీనికోసం గరిష్టంగా ఎస్సారెస్పీ ప్రాజెక్టులో లభ్యత నీటిలోంచే 65 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. ఇక లోయర్ మానేరు దిగువన సూర్యాపేట వరకు 8.50 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా తొలిసారి చివరి వరకు నీరందించారు. ఎల్ఎండిలో లభ్యతగా ఉన్న 22 టీఎంసీలను వినియోగించుకోవడంతోపాటు కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా తరలించిన 33 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. దీంతో పూర్తి ఆయకట్టుకు నీరందింది. 7–8 తడుల ద్వారా ఈ నీటిని విడుదల చేశారు. మొత్తంగా ఎస్సారెస్పీ కింద 14.50 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందగా 120 టీఎంసీల మేర గరిష్ట నీటి వినియోగం జరిగింది. ఈ నీటిలోంచే వెయ్యికిపైగా చెరువులు నింపారు. ఇది గతేడాది యాసంగి సీజన్లో చేసిన నీటి వినియోగంకన్నా 35 టీఎంసీల మేర అధికం. -
బాబ్లీ గేట్లు దించేందుకు ‘మహా’ ఎత్తులు
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగాన మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను గడువు కన్నా ముందే దించేందుకు మహారాష్ట్ర సర్కారు ఎత్తులు వేస్తోంది. మహారాష్ట్ర ఇంజనీర్లు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇంజనీర్ల ముందు ఇప్పటికే దీనిపై ప్రతిపాదన చేశారు. బాబ్లీ గేట్లను మూసేయడానికి ఇంకా నెల గడువు ఉంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అధికారికంగా వెలువడాల్సి ఉంది. వరదొస్తుంటే తొందరెందుకు..? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏటా జూలై 1న బాబ్లీ ప్రాజెక్టులో 14 గేట్లు ఎత్తి, అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచాలి. అక్టోబర్ 29న మూసివేయాలి. ప్రతిఏటా ఇదే రీతిన కేంద్ర జల సంఘం అధికారుల సమక్షంలో గేట్లు తెరవడం, మూయడం జరుగుతోంది. ఈ ఏడాది జూలై ఒకటిన గేట్లు తెరిచిన అనంతరం ఇప్పటివరకు ఎస్సారెస్పీలోకి ఏకంగా 225 టీఎంసీల మేర కొత్తనీరు వచ్చి చేరింది. ఆదివారం సైతం ప్రాజెక్టులోకి 96 వేల క్యూసెక్కుల మేర వరదనీరు వస్తుండగా, ప్రాజెక్టు నుంచి లక్ష క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదంతా బాబ్లీని దాటుకుంటూ వస్తోంది. బాబ్లీని దాటుకుంటూ వరదంతా దిగువకు వెళుతుండటం, గోదావరి నదిపై ఉన్న తెలంగాణ రిజర్వాయర్లు ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయర్ మానేరులన్నీ నిండుగా ఉండటంతో బాబ్లీ గేట్ల మూసివేత ప్రతిపాదనను మహారాష్ట్ర ముందుకు తెచ్చింది. గేట్లు మూస్తే బాబ్లీలో 2.74 టీఎంసీల నిల్వ సాధ్యమవుతుంది. దీనివల్ల బాబ్లీపై ఆధారపడి చేపట్టిన ఒకట్రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని మళ్లించుకోవాలని భావిస్తోంది. అయితే దీనిపై తెలంగాణ ఎలాంటి అభిప్రాయమూ చెప్పలేదు. మహారాష్ట్రలోని గైక్వాడ్ నుంచి ఎస్సారెస్పీ వరకు ఉన్న చిన్న, చిన్న రిజర్వాయర్లు, చెక్డ్యామ్లు నిండుగానే ఉన్నాయి. నాందేడ్ వంటి ఎత్తిపోతల పథకాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. గైక్వాడ్ ప్రాజెక్టులోనూ 102 టీఎంసీలకుగానూ 101 టీఎంసీల మేర నిల్వలు ఉండగా 53 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరద అక్టోబర్ వరకూ కొనసాగే అవకాశాలున్నాయని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ మహారాష్ట్ర ముందుగానే గేట్లు మూసే ప్రతిపాదన చేయడం గమనార్హం. గతంలో ఒకసారి అక్టోబర్లో గేట్లు మూశాక, బాబ్లీ నిండి మరింత వరద కొనసాగుతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలేసిన సందర్భాలున్నాయి. దానిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయించే అవకాశాలపై ఇరిగేషన్ శాఖలో అంతర్గత చర్చ జరుగుతోంది. -
శ్రీరాం సాగర్: ఉట్టి పడుతున్న జల కళ
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నీటి శాతం 50 టీఎంసీలకు చేరుకుంది. అల్ప పీడనం ప్రభావంతో ప్రతీ ఏటా ఉండే పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏటా సెప్టెంబర్నేలోనే వచ్చే వరదలతో ఎస్సారెస్పీ నిండేది. కానీ ఈ సారి భారీ వర్షాలతో పెద్ద ఎత్తున ప్రవాహం వస్తుండటతంతో ఇన్ ఫ్లో 65 నుంచి 70 వేల క్యూసెక్కుల మేర వస్తోంది. ఈ నీటిలో మిషన్ భగీరథ అవసరాల కోసం 776 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. (వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష) ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు అంటే 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1079.20 అడుగులు 50.238 టీఎంసీ లుగా ఉంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో జిల్లాలోని త్రివేణి సంగమం కందకుర్తి వద్ద గోదావరి ఉదృతి కొనసాగుతోంది. రెంజల్ మండలం కందకుర్తి వద్దు గోదావరి తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.. అక్కడ మంజీరా హరిద్రా నదులు గోదావరి మూడు నదులూ కలిసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వైపు పరుగులు తీస్తాయి. మూడు నదుల కలయికతో కందకుర్తిలో జల కళ ఉట్టి పడుతోంది.. అక్కడ నది మధ్యలో ఉన్న ప్రాచీన శివాలయం క్రమంగా మునుగుతుంది.. మొత్తానికి ఈ ఏడు ఎస్సారెస్పీ కి ముందే ఆశించిన స్థాయిలో వరదలు రావడంతో ఆరు జిల్లాల్లోని లక్షలాది రైతన్న ల్లో ఆనందం వెల్లవిరుస్తోంది. (కృష్ణా నదిలో పుట్టి మునక.. నలుగురు గల్లంతు) -
నీటి నిర్వహణ కత్తిమీద సామే!
సాక్షి, హైదరాబాద్: ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింది కాల్వలన్నీ నిండుగా పారుతున్నా నీటి నిర్వహణ ‘కత్తిమీది సాములా’మారింది. అన్ని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో నీటి నిర్వహణకు అవసరమైన వర్క్ ఇన్స్పెక్టర్లు, ఫిట్టర్లు, లష్కర్లు లేరు. దీంతో నీటి నిర్వహణ ఇరిగేషన్ ఇంజనీర్లకు అగ్ని పరీక్షలా మారింది. సిబ్బందిలేమి.. నీటి పంపిణీకి ఇబ్బంది ఎగువ నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలతో జూరాల, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు భారీ ప్రవాహాలు మొదలయ్యాయి. కాళేశ్వరం మొదలు కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ వంటి ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోతలు ఆరంభమయ్యాయి. కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నీటిపంపిణీ ఆటంకాల్లేకుండా సాగా లంటే ఆపరేటర్లు, ఫిట్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, హెల్ప ర్లు, లష్కర్లు, ఎలక్ట్రీషియన్లు కీలకం. రాష్ట్రంలో మొత్తంగా ఈ తరహా సిబ్బంది 6 వేల మంది అవసరముండగా ప్రస్తుతం1,700 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కాల్వల పరిధిలోని మెయిన్కెనాల్, డిస్ట్రిబ్యూటరీల పరిధిలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక రు, బ్రాంచ్ కెనాల్ల పరిధిలో ప్రతి 6 కిలోమీటర్లకు ఒకరు చొప్పున లష్కర్ ఉండాలి. కానీ, ప్రస్తుతం ప్రతి 25 కిలోమీటర్లకు ఒక్కరు కూడా లేరు. మొత్తం గా 3,800 మంది లష్కర్లు అవసరముండగా, 1,400 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కాల్వలకు గండ్లు పడుతున్నా... గోదావరి జలాల ద్వారా ఎస్సారెస్పీ పరిధిలోని 250 కిలోమీటర్ల మేర కాల్వలు పారుతున్నాయి. దీని పరిధిలో సుమారు 400 మంది లష్కర్లు అవసరముండగా 50, 60 మందితోనే నెట్టుకొస్తున్నారు. కనీసం 200 మంది లష్కర్లను అత్యవసరంగా నియమించాలని ఏడాదిగా ఇంజనీర్లు కోరుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. నాగార్జునసాగర్ పరిధిలోనూ ఇదే పరిస్థితి. కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ల కింద 400 మంది లష్కర్లు, 60 మంది ఆపరేటర్లు, 75 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు, 20 మంది ఎలక్ట్రీషియన్లు, 15 మంది ఫిట్టర్లు కావాలని ఏడాదిగా కోరుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన సరిగాలేదు. దీంతో ఇక్కడ కాల్వలకు గండ్లు పడుతున్నా, కొన్నిచోట్ల అక్రమంగా కాల్వలను తెంచుతున్నా పట్టించుకునేవారులేరు. కిన్నెరసాని, కడెం, జూరాల, మూసీ, సింగూరు వంటి ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలన్నా, దించాలన్నా సరిపడా సిబ్బంది లేరు. గత ఏడాది సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో మూసీ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
జలకళతో ఉట్టిపడేలా మాస్టర్ప్లాన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్న గోదావరి నదిలోని ఒక్క నీటి చుక్కనూ వదలొద్దనే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా నీటిని ఒడిసిపట్టే బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది. గోదావరి నీటిని వినియోగిస్తూ చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న ప్రతి బ్యారేజీ, రిజర్వాయర్లో నీటిని రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తూనే నిరంతరం అవి జలకళతో ఉట్టిపడేలా మాస్టర్ప్లాన్ వేసింది. ఇప్పటికే ఖాళీ అయిన లోయర్మానేరు డ్యామ్కు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తున్న ప్రభుత్వం... మరోపక్క ఎల్లంపల్లిని నింపేందుకు నిండుగా ఉన్న మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ నుంచి పంపింగ్ మొదలుపెట్టింది. ఏప్రిల్లో మేడిగడ్డ మొదలు అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీలను పూర్తిగా ఖాళీ చేసి ఆ నీటితో దిగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించేలా ప్రణాళిక తయారు చేసింది. మొత్తంగా మేడిగడ్డ నుంచి లోయర్ మానేరు వరకు 100 టీఎంసీలు నిరంతరం లభ్యతగా ఉండేలా, జూన్లో ఖరీఫ్ మొదలయ్యే నాటికి ఎస్సారెస్పీలో కనీసం 50 టీఎంసీల నీటి లభ్యత పెంచేలా భారీ ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఎల్ఎండీకి సాగుతున్న తరలింపు... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు మీదుగా ఎల్ఎండీకి నీటి తరలింపు కొనసాగుతోంది. రాత్రి సమయంలో నంది, గాయత్రి పంపులను 8 గంటలపాటు నడుపుతూ ఎల్లంపల్లి నుంచి నీటిని ఎల్ఎండీకి తరలిస్తున్నారు. రోజుకు అర టీఎంసీకి తగ్గకుండా సుమారు 6 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఇప్పటివరకు 2 టీఎంసీల మేర నీటిని తరలించగా ఎల్ఎండీలో ప్రస్తుతం 24 టీఎంసీలకుగాను 8.35 టీఎంసీల నిల్వలున్నాయి. మరో వారంపాటు ఎల్లంపల్లి నుంచి నీటిని తరలించి 13 టీఎంసీల మేర నీటిని నిల్వ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు మిడ్మానేరులో నీటి నిల్వలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిడ్మానేరులో ప్రస్తుతం 25.87 టీఎంసీలకుగాను 24.63 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ఎల్లంపల్లికి మొదలైన ఎత్తిపోత... ఎల్ఎండీకి నీటిని తరలిస్తుండటంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకుగాను 10.98 టీఎంసీ ల మేర నిల్వలున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లికి మరో 5 టీఎంసీల మేర నీటిని తరలించాలని గురువారం కాళేశ్వరం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో నిండుకుండలా ఉన్న మేడిగడ్డ నుంచి నీటిని తరలించేలా శుక్రవారం రాత్రి మేడిగడ్డ పంప్హౌస్లోని మోటార్లను ప్రారంభించి ఎత్తిపోతల మొదలుపెట్టారు. ప్రస్తుతం మేడిగడ్డలో 16.12 టీఎంసీలకుగాను 14.80 టీఎంసీల నిల్వలున్నాయి. ఇక్కడి నుంచి 5 టీఎంసీలను అన్నారం, సుందిళ్ల పంప్హౌస్ల ద్వారా ఎల్లంపల్లికి తరలించనున్నారు. మేడిగడ్డలో 11 మోటార్లు సిద్ధంగా ఉండగా ఎన్ని మోటార్లతో ఎంతమేర నీటిని, ఎన్ని రోజులపాటు నడపాలన్నది విద్యుత్ శాఖ సూచనల మేరకు నిర్ణయించనున్నారు. ఇక అన్నారంలో ఇప్పటికే 10.87 టీఎంసీలకుగాను 6 టీఎంసీలు, సుందిళ్లలో 8.83 టీఎంసీలకుగాను 4.5 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ఏప్రిల్లో మూడు బ్యారేజీలు ఖాళీ... ప్రస్తుతం మేడిగడ్డ మొదలు ఎల్ఎండీ వరకు 100 టీఎంసీలకుగాను సుమారు 70 టీఎంసీల మేర నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఎల్లంపల్లిని ఖాళీ చేస్తూ ఎల్ఎండీని నింపుతుండగా ఎల్లంపల్లిని నింపేందుకు మేడిగడ్డ నుంచి ఎత్తిపోతలు ప్రారంభించారు. దీంతో ఎల్లంపల్లి నుంచి ఎల్ఎండీ వరకు నీటి లభ్యత గణనీయంగా పెరగనుంది. ఇక వర్షాకాలం ప్రారంభమైతే జూన్ 15 నుంచే మేడిగడ్డ వద్ద గోదావరి నీటి లభ్యత పెరుగుతుంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా రోజుకు కనీసం 2 టీఎంసీల మేర మొత్తంగా 530 టీఎంసీలను ఎత్తిపోసేలా ఇప్పటికే మోటార్లు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో లభ్యతగా ఉండే నీటినంతా ఖాళీ చేసి దిగువ ఎల్లంపల్లి, మిడ్మానేరుకు వదలాలని సీఎం కేసీఆర్ సూచించారు. వాటిల్లో లభ్యతగా ఉన్న సుమారు 25 టీఎంసీల మేర నీటిని దిగువకు వదిలి మిగతా రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయనున్నారు. బ్యారేజీలను ఖాళీ చేసి వాటిలో ఏమైనా మరమ్మతులు చేయాల్సి ఉన్నా పగుళ్లు, లీకేజీలు వంటివి ఏమైనా ఉంటే వాటిని గుర్తించి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయనున్నారు. జూన్లో మళ్లీ గోదావరిలో ప్రవాహాలు మొదలయ్యే నాటికి అన్ని పరిశీలనలు, మరమ్మతులు చేసి ఎత్తిపోతలకు వాటిని సిద్ధంగా ఉంచనున్నారు. జూన్లోనే ఎస్సారెస్పీ నుంచి సాగుకు నీళ్లు.. అయితే బ్యారేజీలను ఖాళీ చేసే సమయంలో నీటిని దిగువ ఎల్లంపల్లి, మిడ్మానేరు, ఎల్ఎండీలను నింపుతూనే మరోపక్క కొంత నీటిని ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం దాని కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో 90 టీఎంసీలకుగాను 62 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ప్రస్తుత యాసంగిలో మరో 25 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్లో బ్యారేజీలను ఖాళీ చేసే సమయానికి ఎస్సారెస్పీలో 36–37 టీఎంసీల మేర నిల్వ ఉంటుంది. బ్యారేజీల నుంచి వదిలే 24 టీఎంసీల్లో కనీసం 15–20 టీఎంసీలను ఎస్సారెస్పీకి తరలిస్తే అక్కడ 50 టీఎంసీల మేర లభ్యత పెరుగుతుంది. ఈ లభ్యత నీటితో జూన్ నుంచే ఎస్సారెస్పీ కింది ఆయకట్టుకు నీటిని అందించవచ్చు. నిజానికి ఎస్సారెస్పీకి ఆగస్టు వరకు ఎగువ నుంచి ప్రవాహాలు రావు. కానీ ప్రస్తుతం కాళేశ్వరం నీటితో జూన్ నుంచే లభ్యత పెంచడంతోపాటు సాగుకు నీటి విడుదల సాధ్యమయ్యేలా ప్రణాళిక రచించారు. సమాంతరంగా చెక్డ్యామ్ల నిర్మాణం.. కృష్ణా, గోదావరి నీటిని కాల్వల ద్వారా ఆయకట్టుకు మళ్లిస్తున్న ప్రభుత్వం... వాటి నిర్మాణాలకు సమాంతరంగా రాష్ట్ర పరిధిలో కురిసే ప్రతి నీటి బొట్టునూ ఎక్కడికక్కడ ఒడిసిపట్టేలా భారీగా చెక్డ్యామ్ల నిర్మాణం చేపడుతుండటం తెలిసిందే. తొలి విడతగా ఈ ఏడాది 615 చెక్డ్యామ్లు నిర్మించాలని నిర్ణయించగా ఇందులో గోదావరి పరిధిలో 410, కృష్ణాలో 205 చెక్డ్యామ్ల నిర్మాణాన్ని ఈ ఏడాది వర్షాలు కురిసే నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా కాళేశ్వరం కాల్వల పరిధిలోని 150 చెక్డ్యామ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించగా ఇందులో కరీంనగర్ జిల్లా పరిధిలోవే 32 చెక్డ్యామ్లు ఉన్నాయి. కాళేశ్వరం పరిధిలోని చెక్డ్యామ్లను జూన్ నాటికి పూర్తి చేస్తే వాటి కింద నీటి కట్టడి సాధ్యం కానుంది. -
మూడేళ్ల తర్వాత నిండిన శ్రీరాం సాగర్ ప్రాజెక్టు
సాక్షి, నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90 టీఎమ్సీలు కాగా, ప్రస్తుతం 89 టీఎమ్సీల నీరు నిల్వఉంది. మహారాష్ట్ర, నిజామాబాద్ జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ఇన్ఫ్లో 60 వేల క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1090 అడుగులకు చేరింది. జులై మూడో వారం నాటికి ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజీ ఐదు టీఎమ్సీలకు చేరుకోగా రెండు నెలల కాలంలోనే పూర్తిగా జలకళను సంతరించుకోవడం విశేషం. ఈ సందర్భంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఎస్సారెస్పీకి పొంచి ఉన్న ముప్పు!
సాక్షి, బాల్కొండ (కామారెడ్డి): శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ను కూడా ఇసుక అక్రమ వ్యాపారులు వదలడం లేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆనకట్ట లోపలి వైపు నుంచి ఇసుకను తవ్వేస్తున్నారు. ఆనకట్ట రివిట్మెంట్ బండరాళ్ల మధ్యలో నుంచి ఇసుకను తవ్వి కుప్పలు వేస్తున్నారు. పగలు కుప్పలు చేసి రాత్రివేళల్లో ఇసుకను తరలించి దందాను కొనసాగిస్తున్నారు. నెల రోజుల క్రితం వరకు ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రాకపోవడంతో పెద్ద ఎత్తున ఇసుక దందాను కొనసాగించారు. ఆ సమయంలో ప్రాజెక్ట్ అధికారులు హల్చల్ చేశారు. అయితే మళ్లీ షరా మామూలుగానే ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. ప్రాజెక్ట్లోకి ఇసుకను తవ్వి ఆనకట్టపై కుప్పలు కుప్పలుగా వేసినా అధికారులు పట్టించుకోవడంలేదు. కనీసం ఇసుక ఎవరిది అని కూడా ఇప్పటి వరకు గుర్తించలేదు. మళ్లీ ఇసుక దందా ఆగకుండా సాగుతూనే ఉంది. స్పందించని ఉన్నతాధికారులు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదల కారణంగా నీరు ఆనకట్ట వద్ద అలలుగా తాకుతుంటాయి. దీంతో ప్రాజెక్ట్లోని మట్టి కొట్టుకు వచ్చి ఇసుక మేటలుగా పెడుతుంటుంది. అంతేకాకుండా ఆనకట్ట బలోపేతానికి ఇసుకతో రివిట్మెంట్ చేపట్టారు. ప్రస్తుతం ఆ రివిట్మెంట్లో ఇసుకను, ఆనకట్టకు ఆనుకుని ఇసుక తవ్వకాలు చేపట్టడం ఆనకట్టకు ప్రమాదకరంగా పలువురు పేర్కొంటున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా ప్రాజెక్ట్ అధికారులు పట్టించుకోవడం లేదు. రివిట్మెంట్ కుంగి ఆనకట్టకు గండి ఏర్పడే ప్రమాదం ఉంది. ఇసుక తవ్వకం నిలిపి వేయకుంటే ప్రాజెక్ట్లో భారీ వరదలు వచ్చి అలలు తాకితే ఆనకట్ట కుంగి గండి ఏర్పడే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ రక్షణ కోసం డివిజన్–2 విభాగంలో సబ్ డివిజన్–1 విభాగం ఉంది. అయితే సిబ్బంది లేక పోవడంతో అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఇసుక మాఫియా ఎగబడుతోంది. ఆనకట్టకు ప్రమాదం సంభవించక ముందే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
ప్రమాదపుటంచున పర్యాటకులు
సాక్షి, బాల్కొండ (నిజామాబాద్): ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చే సమయంలో ప్రాజెక్ట్కు జలకళతో పాటు, జనకళ వస్తుంది. ప్రాజెక్ట్ సందర్శనకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. కాని ప్రాజెక్ట్ వద్ద పర్యాటకుల భద్రతను పట్టించుకునే నాథుడే కరువవడంతో పర్యాటకులు ప్రమాదపు అంచుకు వెళ్తున్నారు. అయిన ప్రాజెక్ట్ ఆనకట్టపై ఉన్న సబ్ కంట్రోల్ బూత్ పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నీటి అంచున సెల్ఫీలు పర్యాటకులు నీటి అంచు వరకు వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. ప్రాజెక్ట్ లోపలి వైపు నీటి అంచు వరకు రివీట్మెంట్ మీద వెళ్లడం ప్రమాదకరం. దూర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులకు తెలియక నేరుగా ప్రాజెక్ట్ నీటి అంచుకు వెళ్తున్నారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి సందర్శనకు వచ్చిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి మత్యువాత పడ్డారు. అయిన ప్రాజెక్ట్ వద్ద పర్యాటకుల కోసం ఎలాంటి భద్రత చర్యలు చేపట్టడం లేదు. ప్రాజెక్ట్ వద్ద ప్రమాదాలు జరగక ముంద చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. డ్యాం మీదకి అనుమతి లేదు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ డ్యాంపైకి పర్యాటకులకు అనుమతివ్వడం లేదు. ఆనకట్టపై నుంచే ప్రాజెక్ట్ను సందర్శించి వెళ్లాలి. దీంతో ప్రాజెక్ట్ లోపకి వైపుకు దిగుతు గేట్లను చూస్తున్నారు. ప్రాజెక్ట్ వద్ద డ్యాంపైకి వెళ్లకుండ గేట్లను మూసి వేస్తున్నారు. కేవలం ఆదివారం మాత్రమే డ్యాంపైకి అనుమతిస్తున్నారు. డ్యాంపైకి వెళితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గేట్లు మూసి ఉంచుతున్నారు. -
‘వరద’కు ఇరవై ఆరేళ్లు
సాక్షి, బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వృథా గా పోతున్న మిగులు జలాలను సద్వినియోగం చేసుకునేందుకు నిర్మించిన వరద కాలువ ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ప్రాజెక్టు నుంచి మిగులు జలాలను దిగువ ప్రాంతాలకు తరలించడ మే కాకుండా, అవసరమైన సమయంలో ఎస్సారెస్పీకి నీటిని ఎత్తిపోసేందుకూ ఈ కాలువ ఉపయో గపడనుంది. సుమారు 2.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు జవసత్వాలు కల్పిస్తున్న వరద కాలువ రేపటి (జూన్ 30)తో 26వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరిన తర్వాత వచ్చే వరదను వచ్చినట్లు గోదావరిలోకి వదిలేయాల్సిన పరిస్థితి ఉండేది. అలా గోదావరిలో వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు గాను చేపట్టినదే వరద కాలువ నిర్మాణం. ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల పరిధిలోని 2.20 లక్షల ఎకరాల మెట్ట భూములకు నీరందించేందుకు గాను ఈ వరద కాలువకు రూపకల్పన చేశారు. 1993 జూన్ 30న అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు ముప్కాల్ మండల కేంద్ర శివారులో దీనికి శంకుస్థాపన చేశారు. ఏడేళ్లలో వరద కాలువ పనులు పూర్తి చేసేలా అగ్రిమెంట్తో టెండర్ నిర్వహించి పనులు ప్రారంభించారు. 26 పూర్తి కావొచ్చినా పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. తొమ్మిదేళ్లుగా నీటి విడుదల.. 2010లో ట్రయల్ రన్తో ప్రారంభమైన వరద కాలువ ద్వారా ఏటా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్న తర్వాత అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. 2010లో 54 టీఎంసీలు, 2011లో 22 టీఎంసీలు, 2012లో 5.5 టీఎంసీల నీటిని, 2013లో 60 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా దిగువ మానేరుకు తరలించారు. 2014లో వరద కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగలేదు. 2015లో ఎస్సారెస్పీ ఎడారిగా మారడంతో నీటి విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. 2016లో 58 టీఎంసీలు, 2017లో 5 టీఎంసీల నీటిని విడుదల చేపట్టారు. 2018లో తాగు నీటి అవసరాల కోసం 5 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా విడుదల చేశారు. రివర్స్ పంపింగ్తో.. మిగులు జలాలను సద్వినియోగం చేసుకునేందుకు నిర్మించిన వరద కాలువ ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకానికి ఆధారమైంది. దీంతో వరద కాలువకు ప్రాధాన్యత పెరిగింది. కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి ప్రతి రోజు టీఎంసీ చొప్పున నీటిని రివర్స్ పంపింగ్ చేపట్టడానికి మరో కాలువ కానీ, పైపులైన్ కానీ అవసరం లేకుండా వరద కాలువనే వినియోగించుకునేలా అధికారులు డిజైన్ చేశారు. దీంతో వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ ద్వారా నీరు చేరుతుంది. ప్రాజెక్ట్ నుంచి దిగువకు నీటి విడుదల చేపట్టడానికి నిర్మించిన వరద కాలువ ‘పునరుజ్జీవనం’తో దిగువ నుంచి ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ చేపట్టడానికి ఉపయోగపడుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరదలు రానప్పుడు ఎస్సారెస్పీకి పునరుజ్జీవం తెచ్చేందుకు గాను వరద కాలువ కీలకంగా మారింది. వరద కాలువ 102 కిలో మీటర్ వద్ద క్రాస్ రెగ్యులేటర్ నిర్మించి వరద కాలువ 74వ, 36వ, 0 కిలోమీటర్ల వద్ద పంప్ హౌస్లు నిర్మిస్తున్నారు. వరద కాలువకు గేట్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. నిర్మాణ స్వరూపం.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 1070 అడుగుల వద్ద ఆరు గేట్లతో హెడ్ రెగ్యూలేటర్ నిర్మించారు. అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా పెద్దవాగు–2, అలాగే కోరుట్ల వరకు 22 వేల క్యూసెక్కుల సామార్థ్యంతో కాలువ తవ్వారు. పెద్దవాగు నుంచి నీటిని దిగువ మానేరు డ్యాంకు సరఫరా చేయడంతో పాటు మధ్య మధ్యలో జలాశయాలు నిర్మించి వాటికి నీటి సరఫరా చేసి సాగు నీరందించేలా వరద కాలువను నిర్మించారు. 22 వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో కాలువ నిర్మాణం జరిగింది. ప్రాజెక్ట్లో 1,074 అడుగుల నీటి మట్టం ఉన్నంత వరకు వరద కాలువకు నీటి విడుదల చేసేలా హెడ్ రెగ్యూలేటర్లు నిర్మించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలను వినియోగించుకునేందుకు చేపట్టిన వరద కాలువను వాస్తవానికి ఏడేళ్లలోనే పూర్తి చేయాల్సి ఉంది. కానీ నిర్మాణాని సుమారు 17 ఏళ్లు పట్టింది. చివరకు 2010 జూలై 31వ తేదీన ప్రాజెక్ట్ నుంచి వరద కాలువకు ట్రయల్ రన్ నిర్వహించారు. తొలుత రెండు గేట్ల ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, ట్రయల్ రన్ చేపట్టారు. ఎస్సారెస్పీ నుంచి 122వ కిలో మీటర్ వరకు నీటి విడుదల చేపట్టి వరద కాలువ కరకట్టల నాణ్యతను పరిశీలించారు. అయితే, ఆ ఏడాది ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్లోకి భారీగా వరదలు రావడంతో వరద కాలువ ద్వారా ఆ ఏడాది ఖరీఫ్ సీజన్ ముగింపు వరకు నిరంతరం నీటి విడుదలను కొనసాగించారు. వివాదాలమయం..! మిగులు జలాల తరలింపు కోసమే ఉద్దేశించి న వరద కాలువ కొన్నిసార్లు వివాదాలకు కేం ద్ర బిందువుగా మారింది. పాలకులు, అధికారుల నిర్ణయాల వల్ల కొన్నిసార్లు పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. వాస్తవానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి ఏటా 20 టీఎంసీల నీటిని అందించాలి. ఈ నీటిని ఎస్సారెస్పీ ప్రధాన కాలువ అయిన కాకతీయ కాలువ ద్వారా విడుదల చేయాల్సి ఉంది. అయితే, కాకతీయ ద్వారా కాకుండా మిగులు జలాల కోసం నిర్మించిన వరద కాలువ ద్వారా తరలించడం పలుసార్లు విమర్శలకు తావిచ్చింది. వరదల సమయంలో మాత్రమే ఈ కాలువను వినియోగించాల్సి ఉండగా, మామూలు రోజుల్లోనూ వరద కాలువ ద్వారానే నీటిని విడుదల చేస్తుండడం వివాదాస్పదంగా మారింది. అలాగే, కేవలం వరద నీటిని తరలించేందుకు ఉద్దేశించిన ఈ కాలువను సాగు, తాగునీటి సరఫరా కోసం వినియోగిస్తుండడంతో వరద కాలువ కాస్త వివాదల కాలువగా పేరు గాంచింది. -
డెడ్ స్టోరేజీ చేరువలో ఎస్సారెస్పీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరువైంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరున్న జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 1050.30 అడుగుల (6.37 టీఎంసీ) కు పడిపోయింది. ఎండల తీవ్రతకు ప్రతిరోజూ రెండు వందలకు పైగా క్యూసెక్కుల నీరు ఆవిరవుతుండగా, కాకతీయ కాలువకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో భారీగా పూడిక నిండిపోవడంతో ఐదు టీఎంసీల మట్టానికి తగ్గితే బురద నీరు మారే అవకాశాలున్నాయి. తాగునీటి అవసరాల కోసం ఒకటిన్నర టీఎంసీలే అందుబాటులో ఉంటాయి. ఐదు జిల్లాల తాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టే ఆధారం. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఈ గ్రిడ్ నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. జగిత్యాల, కోరుట్ల తాగునీటి కోసం ప్రతిరోజు 54 క్యూసెక్కులు, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల తాగునీటి కోసం 29 క్యూసెక్కులు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కోసం మరో 54 క్యూసెక్కుల నీటిని పంపు చేస్తున్నారు. ఆవిరి నష్టాలతో కలిపి మొత్తం ప్రతిరోజు 394 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఏటా ఈ ప్రాజెక్టుకు ఆగస్టులో ఇన్ఫ్లో ఉంటుంది. అప్పటి వరకు తాగునీటి అవసరాలకు ఈ నీటినే వినియోగించాల్సి ఉంటుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి మట్టం- 6.37టీఎంసీలు ప్రతిరోజూ తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్న నీరు- 394క్యూసెక్కులు.. ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ నీటి మట్టం- 5టీఎంసీలు ఆగస్టులో భారీగా ఇన్ఫ్లో.. మహారాష్ట్రతో పాటు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిస్తే ఈ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కానీ ఈ ఏడాది ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో సరిగ్గా వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండ లేదు. ఈసారి 2018 ఆగస్టులో వచ్చిన వరద కొంత మేరకు ఊరటనిచ్చింది. ఒక్కోరోజు సుమారు 4లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. కొన్నిరోజులు లక్ష క్యూసెక్కుల చొప్పున వరద జలాలు వచ్చి చేరాయి. ఏడాది మొత్తానికి 77.92 టీఎంసీలు వచ్చాయి. దీంతో 90 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నీటిమట్టం గరిష్టంగా 83 టీఎంసీలకు చేరింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో యాసంగి పంటల కోసం కాకతీయ కాలువ ద్వారా సాగు నీటిని విడుదల చేశారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు నీటిని వదిలారు. ఎగువ ఎల్ఎండీ వరకు ఆయకట్టుకు సుమారు 20 టీఎంసీలు సాగునీరు సరఫరా చేశారు. తాగునీటికి ఏ మాత్రం ఇబ్బంది లేదు.. తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం ప్రాజెక్టు 6.37 టీఎంసీల నీరుంది. దీంతో ఆగస్టు మాసాంతం వరకు తాగునీటిని సరఫరా చేయవచ్చు. ఏటా ఆగస్టు, సెప్టెంబర్లో ప్రాజెక్టు ఇన్ఫ్లో ఉంటుంది. -శ్రీనివాస్రెడ్డి, పర్యవేక్షక ఇంజనీర్ -
వానొచ్చే.. వరదొచ్చే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. శనివారం అర్థరాత్రి నుంచి పలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమయ్యింది. భారీ వర్షాలతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు తోతట్లు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. దక్షిణ ఒడిశా మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 24 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళఖాతంలో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఖమ్మం.. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టు వరద ఉధృతి తీవ్రంగా పెరిగింది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 72.10 మీటర్లకు చెరడంతో అధికారులు 16 గేట్లను ఎత్తివేశారు. ఇన్ఫ్లో 74, 440 క్యూసెక్కుల కాగా, ఔట్ ఫ్లో 75, 440 క్యూసెక్కుల చేరుతోంది. భారీ వర్షాలతో కిన్నెరసాని ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 404 అడుగులకు చేరింది. సత్తుపల్లిలోని జీవీఆర్ సింగరేణి ఓపెన్ కాస్ట్లో నీళ్లు చేరడంతో 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఆదివారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా సత్తుపల్లిలో 5.04 సెం.మీ, పెనుబల్లిలో 5.86 సెం.మీ వేంసూరు 3.64, కల్లూరు 3.58 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో కొమరం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులోని నీటి ప్రవహం ఎక్కువగా ఉండటంతో 5 గేట్లు ఎత్తివేశారు. భారీ వర్షాలతో గుండివాగు, తుంపల్లివాగులు ఉప్పొంగుతున్నాయి. ఆసిఫాబాద్లోని ఎనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో డోర్లి 1, 2 ఖైరిగుడా ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో వరద నీరు చేరడంతో ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నిండు కుండలా ఉంది. ప్రాజెక్టు 13 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కరీంనగర్.. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఎగువను కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 20.175 టీఎంసీలకు కాను ప్రస్తుత నీటి మట్టం 18.50 టీఎంసీలకు చేరింది. మరో రెండు రోజుల్లో ప్రాజెక్టు పూర్తికి నీటి మట్టం చేరనుంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,60,190 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 80,023 క్యూసెక్కులు. జగిత్యాల జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఆత్యధికంగా బీర్పుర్, జైన, కోల్వాయిర్లో 28 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఎండపల్లి, గుల్లోటలో 24 సెం.మీ, ధర్మపురిలో 22.9, సిరికోండ 22 సెం.మీల వర్షపాతం నమోదైంది. ధర్మపురి మండలం ఆయసాయిపల్లె వద్ద వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో 63వ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్.. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీ రాంసాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 16.34 టీఎంసీలకు చేరింది. ఎగువన ఆదిలాబాద్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి వరద మరితం పెరిగే అవకాశం ఉంది. డిచ్పల్లి, భీమ్గల్, వేల్పుర్ మండలాల్లో ఆదివారం ఉదయం భారీ వర్షం నమోదైంది. బాన్సువాడ, బిర్కూర్, నసురుల్లబాద్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. మెండొరా మండలంలో 105.2 మి.మీ, శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో 80 మి.మీ వర్షపాతం నమోదైంది. -
ప్రొ. కోదండరాం అరెస్ట్
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాంను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూడెమోక్రసీ నేత ప్రభాకర్తో ములాకత్ అయ్యేందుకు వెళుతున్న కొదండరాంను అరెస్ట్ చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. తాము ఆందోళనలు చేయడానికి వెళ్లడం లేదని రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్తుండగా అరెస్ట్ చేయడం సరికాదని కోదండరాం అన్నారు. పోచంపాడు నుంచి కనీసం లీకేజి అవుతున్న నీటిని వాడుకుంటామన్న 21 గ్రామాలను పోలీస్ స్టేషన్లను తలపించేలా 144 సెక్షన్ విధించడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రైతుల సమస్యలపై అండగా ఉన్న రైతుసంఘం నాయకుడు, న్యూ డెమోక్రసీ నేత ప్రభాకర్ ను అరెస్ట్ చేసి రిమాండుకు పంపించడం తగదన్నారు. కోదండరాంను హైదరాబాద్కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆయన ప్రతిఘటించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ జన సమితి నేతలను ఉంచారు. శ్రీరాంసాగర్ నుంచి నీటి విడుదల లేదని ప్రజాప్రతినిధులు తేల్చిన సంగతి తెలిసిందే. నీటి నిల్వ తక్కువగా ఉన్నందున తాగునీటి అవసరాల నిమిత్తం వాడాలని, ప్రాజెక్టుకు వరద నీరు వస్తే విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు వైపు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. సదరు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రేపటినుంచి ఐదు రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. నిజామాబాద్, ఆర్మూరు, బోధన్ డివిజన్ పరిధిలో రేపు సాయంత్రం ఏడు గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఆందోళనలకు అనుమతి లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. -
పోచంపాడు సభపై టీఆర్ఎస్ కసరత్తు
► 5 జిల్లాల నుంచి రైతుల తరలింపు ► సమీకరణపై మంత్రులు, నేతలతో నేరుగా సీఎం సంభాషణ ► సభ బాధ్యతలు మంత్రి ఈటలకు సాక్షి, హైదరాబాద్: పోచంపాడు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా పేరున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ఆధునీకరణకు రూ.2 వేల కోట్లతో ప్రభుత్వం పునరుజ్జీవ పథకం చేపడుతున్న నేపథ్యంలో ఈ సభను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 10న సీఎం కేసీఆర్ ఈ పథకానికి ఎస్సారెస్పీ ప్రాజెక్టు వద్ద ఉన్న పోచంపాడులో శంకుస్థాపన చేయనున్నారు. పోచంపాడు వద్దే భారీ బహిరంగ సభను నిర్వహిం చనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని టీఆర్ఎస్ ఆగ్రహంతో ఉంది. దీంతో విపక్షాలకు దీటైన జవాబిచ్చేందుకు పోచంపాడు సభను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ప్రతిష్టాత్మకంగా జన సమీకరణ ఎస్సారెస్పీ ద్వారా లబ్ధి పొందుతున్న నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లా (పూర్వపు)ల రైతాంగాన్ని పోచంపాడు బహిరంగ సభకు సమీకరించాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు ద్వారా ఈ జిల్లాలకు పూర్తి స్థాయిలో నీరు అందడంలేదు. దీంతో ఈ జిల్లాల రైతులకు సాగునీరు అందేలా, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకువచ్చి ఎస్సారెస్పీ జలాశయంలో పోయడం ద్వారా ఆయకట్టు చివ రి భూములకూ నీటిని అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని చేపడుతున్నారని, ఈ విషయాలన్నీ రైతులకు సభ ద్వారా వివరిస్తారని నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జన సమీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో ఇప్పటికే సీఎం కేసీఆర్ నేరుగా మాట్లాడారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా పూర్వపు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి ఎక్కువ మంది రైతులను సమీకరించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు ఎన్ని అవసరం అవుతాయి, ఇతర వాహనాల పరిస్థితి ఏమిటన్న అంశంపైనా సమీక్షించారని సమాచారం సభ బాధ్యతలు మంత్రి ఈటలకు: ఎస్సారెస్పీ పునరుజ్జీవ సభ ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతలను ఆర్థిక మంత్రి ఈటల రాజెందర్కు సీఎం కేసీఆర్ అప్పగించారు. ఎస్సారెస్పీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులను సమన్వయం చేసి సభను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి, ఈటలకు సూచించారని సమాచారం. -
ఎస్సార్ఎస్పీకి 'గ్రీస్' కష్టాలు
బాల్కొండ : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని అంటు గొప్పగా చెప్పుకునే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మేయింటెనెన్స్ పై నిర్లక్ష్య మేళా అంటు ఆయాకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రంలో కూడ ప్రాజెక్ట్ పై పాలకులు చిన్న చూపు చూస్తున్నారని రైతులు విమర్షిస్తున్నారు. ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలు గోదావరిలో వదులుటకు 42 వరద గేట్లను నిర్మించారు. అలానే కాకతీయ కాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లు నాలుగు, లక్ష్మీ కాలువ గేట్లు 2, సరస్వతి కాలువ గేట్లు రెండు వీటన్నింటితో పాటు ప్రస్తుత సంవత్సరం వరద కాలువ ఆరు గేట్లకు ప్రతి ఏటా వేసవి కాలంలో ప్రాజెక్ట్ అధికారులు మేయింటెనెన్స్ చేపడుతారు. గేట్లకు గ్రీస్, గేట్ల రోప్కు ఆయిల్, ప్యూజ్లు తదితర మేయింటెనెన్స్ ఉంటుంది. వరద గేట్ల కొన్నింటిలో గేట్లలో టన్ను బక్కెల్ చెడిపోయింది. ఆ గేట్ల మరమ్మత్తులు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. గేట్ల నిర్వహణ కోసం అధికారులు ప్రస్తుత సంవత్సరం 54 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. కాని ఇప్పటికి చిల్లీ గవ్వ మంజూరు కాలేదు. వర్ష కాలం ప్రారంభమైంది. ఎగువ ప్రాంతాల నుంచి ముదస్తుగా వరద నీరు ప్రాజెక్ట్లోకి వచ్చి చేరితే నిర్వహణ అటకెక్కినట్లే. వేసవి కాలంలో చేపట్ట వలిసిన పనులు ప్రస్తుతం వర్ష కాలం వచ్చిన మొదలు కాలేదు. ప్రతిపాదనాలు చేసి పంపాల్సిన అధికారులు పంపిన, ప్రభుత్వం నిధులు మంజూరు చేయుటకు మీన మేషాలు లెక్కిస్తునే ఉన్నారు. దీంతో అధికారులు గేట్ల మెయింటెనెన్స్ ను మరిచి పోయారు. ప్రాజెక్ట్పై డ్యాం మేయింటెనెన్స్కు ఏఎంఏ( ఏనూవల్ మేయింటెనెన్స్ ఎస్టిమెట్) ఉంటుంది. ప్రభుత్వ మంజూరు చేయాలి. మంజూరు చేసిన బిల్లులను సకాలంలో చెల్లించాలి. కాని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడంతో ప్రాజెక్ట్ పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతుంది. అత్యసరవమైన వరద గేట్ల మేయింటెనెన్స్పైనే అధికారులు , ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తుందంటే ప్రాజెక్ట్ పై పాలకుల చిత్త శుద్ది ఎంటో ఆర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏటా సీజన్కు ముందు... శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు జూన్ మధ్యలో నుంచి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదలు వచ్చి చేరుతాయి. వరదలు వచ్చే ఆధారంగా ప్రాజెక్ట్ నీటి మట్టం ఆధారంగా ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వార నీటి విడుదలను అధికారులు గోదావరిలోకి విడుదల చేపడుతారు. ప్రతి ఏట సీజన్కు మందు గేట్ల మరమ్మత్తులు, మేయింటెనెన్స్ చేపడుతారు. సీజన్లో అత్యవసరంగా గేట్లను ఎత్తి నప్పుడు ఎలాంటి సమస్య తలెత్తకుండ గేట్ల మేయింటెనెన్స్ చేపడుతారు. అంతే కాకుండ గేట్లను ఎత్తుటకు ఉప యోగించే క్రేయిన్ రోప్కు కూడ మేయింటెనెన్స్ చేపడుతారు. మేయింటెనెన్స్ చేపట్టినప్పుడే.. వరద గేట్ల మేయింటెనెన్స్ చేపట్టినప్పుడే సీజన్లో మొరయించేవి. గతరెండేళ్ల క్రితం ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి నీటి విడుదల చేపడుతున్నప్పుడు పలు వరద గేట్లు మొరాయించాయి. గతేడాది ప్రాజెక్ట్నుంచి గోదావరిలోకి నీటి విడుదల చేపట్టినప్పుడు ఆమాత్యుల కళ్ల ముందరనే గేట్లు మొరాయించాయి. అయిన ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. అదికారులు పట్టించు కోవడం లేదని ఆయాకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్న ఇప్పటికి వాటికి పూర్తి స్థాయి మరమ్మత్తులకు దిక్కు లేదు. ఏటా మేయింటెనెన్స్ చేపడుతున్నప్పుడే వరద గేట్లు, కాలువల గేట్లు మొరాయించేవి. ప్రస్తుత సంవత్సరం ఎలాంటి మేయింటెనెన్స్ లేక పోతే వరద గేట్ల పరిస్థితి ఎలా ఉంటుందోనని అధికారులు, ఆయాకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు స్పందించి వెంటనే మెయింటెనెన్స్కు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. నిధులు మంజూరు కాలేదు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల నిర్వహణ కోçసం 54 లక్షల నిధులతో ప్రతి పాదనలు పంపించాం. ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. వారం రోజుల్లో మంజూరవుతాయని ఉన్నత అధికారులు తెలిపారు. నిధులు మంజూరు కాగనే పనులు చేపడుతాం. – జగదీష్, డ్యాం డిప్యూటీ ఈఈ, ఎస్సారెస్పీ -
20న ఆర్మూర్కు సీఎం కేసీఆర్ రాక
►ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన ‘ఎత్తిపోతల’కు మిషన్ భగీరథతో అనుసంధానం ►ఈ నెల 13న ట్రయల్ రన్కు ఏర్పాట్లు ►ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ►ఆర్మూర్లో భారీ బహిరంగ సభ ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని 42 వేల మంది జనాభాకు తాగునీటిని అందించడానికి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులు చివరి దశకు చేరుకోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ నెల 20న ప్రారంభోత్సవం చేయడానికి అధికారులు నిర్ణయించారు. ఈ నెల 13న తాగునీటి పథకం ట్రయల్ నిర్వహించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి మంగళవారం తెలిపారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారని వివరించారు. ‘ఎత్తిపోతల’తో తప్పనున్న నీటి ఇబ్బందులు ఆర్మూర్ పట్టణం రోజురోజుకీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా పట్టణ ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చడానికి సహజ నీటి వనరులు అందుబాటులో లేవు. దీంతో ఏళ్ల తరబడి బోరు బావులపైనే ఆధారపడి తాగునీటి సరఫరా చేస్తున్నారు. వేసవి కాలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటి కొరతతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో తలాపునే ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఎత్తిపోతల పథకం నిర్మించి ఆర్మూర్ పట్టణానికి మళ్లించాలని పాలకులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ఈ పథకం నిర్మాణం చేయడానికి సన్నాహాలు చేశారు. ఏళ్ల తరబడి నిరీక్షణ అనంతరం ప్రపంచ బ్యాంకు రూ. 114 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో రెండు దశల్లో ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. మొదటి విడతలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో జలాల్పూర్ వద్ద ఇన్టెక్ వెల్ నిర్మాణం, ఆర్మూర్ పట్టణం వరకు 19 కిలోమీటర్ల పొడవునా పైప్లైన్ నిర్మాణం, పట్టణంలోని రాజుల గుట్ట వద్ద, జిరాయత్ నగర్లో, టీచర్స్ కాలనీల్లో 4 లక్షల 50 వేల లీటర్ల కెపాసిటితో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. రెండో విడతలో గృహాల వద్ద నల్లాలు, మీటర్ల బిగింపునకు రూ. 2 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ 2013 డిసెంబర్ 10న అగ్రిమెంట్ చేసుకున్నాడు. అగ్రిమెంట్ అయిన రెండేళ్లలోపు పనులు పూర్తి చేయాల్సి ఉండగా 2014లో ఎన్నికల కారణంగా కాంట్రాక్టర్ పనులను ప్రారంభించలేదు. దీంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 ఆగస్టు 7న ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటి సారిగా జిల్లా పర్యటనలో భాగంగా ఆర్మూర్కు వచ్చి తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసారు. ఏడాది కాలంలో స్వయంగా తానే వచ్చి ఇంటింటికీ నల్లాను ప్రారంభిస్తానని పేర్కొన్నారు. ఇంతలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఇంటింటికీ తాగునీటిని అందించడానికి మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించనున్న ఈ ఎత్తిపోతల పథకం డిజైన్లో, ఇన్టెక్వెల్ నిర్మాణంలో పలు మార్పులు చేసి అదనంగా రూ. 41 కోట్లు కేటాయించారు. ఈ మార్పుల కారణంగా పనుల్లో ఆలస్యం జరుగుతూ వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆర్మూర్ పట్టణ ప్రజలకు తాగునీటిని అందించాలంటూ మెగా కన్స్ట్రక్షన్ కంపెనీపై ఒత్తిడి తేవడంతో నిర్మాణం పనులను వేగవంతం చేశారు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ సమీపంలోని జలాల్పూర్ శివారులో ఇన్టెక్వెల్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. 17 మీటర్ల లోతు, 46 మీటర్ల వెడల్పుతో తవ్వకం పనులు పూర్తి చేసి ఇన్టెక్వెల్ నిర్మాణాలు పూర్తి చేశారు. బాల్కొండ మండల కేంద్రం సమీపంలోని గుట్టపై నిర్మించాల్సిన నీటి శుద్ధి ట్యాంక్ నిర్మాణం పూర్తయింది. జలాల్పూర్ ఇన్టెక్ వెల్ నుంచి ఆర్మూర్ వరకు 19 కిలో మీటర్ల పొడవునా పైప్లైన్ నిర్మాణం పూర్తయింది. ఆర్మూర్లోని వీధుల్లో 106 కిలో మీటర్ల పొడవునా పైప్లైన్ నిర్మాణం పనులు జరగాల్సి ఉండగా 95 కిలో మీటర్ల పైప్లైన్ మాత్రమే పూర్తయింది. 90 శాతం పైప్లైన్ నిర్మాణం పనులు పూర్తి కాగా ఈ నెల 13 లోపు మిగతా పనులను సైతం పూర్తి చేయానికి పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. జిరాయత్నగర్, టీచర్స్ కాలనీ, రాజుల గుట్టలో నిర్మించాల్సిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణం సైతం పూర్తయ్యాయి. ఆర్మూర్ పట్టణంలో 9,997 ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎనిమిది వేలకు పైగా నల్లా కనెక్షన్లను బిగించారు. 13న ట్రయల్ రన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన పథకాన్ని ప్రారంభిస్తుండడంతో ఈ నెల 13వ తేదీన ట్రయల్ రన్ నిర్వంహించి లీకేజీలు, చిన్న పాటి మరమ్మతులు ఉంటే పూర్తి చేయడానికి అధికారులు నిర్ణయించినట్లు ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు. ట్రయల్ రన్ విజయంతం కాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా తాగునీటి పథకాన్ని ప్రారంభించనున్నారు. దీంతో ఆర్మూర్ పట్టణ ప్రజల చిరకాల వాంచ అయిన తాగునీటి సమస్య పరిష్కారం కానుంది. -
ఎస్సారెస్పీ ఆయకట్టు కోసం అదనపు పథకం
ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా జలాల తరలింపు ♦ మంత్రివర్గ ఉపసంఘం సూచన ♦ ముఖ్యమంత్రికి సిఫారసు చేయాలని నిర్ణయం ♦ రూ.650 కోట్ల అంచనాతో ఎత్తిపోతలు సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని పూర్తి ఆయకట్టు స్థిరీకరణ కోసం అదనపు (సప్లిమెంటేషన్) పథకాన్ని చేపట్టాలని నీటిపారుదలరంగంపై నియమిం చిన మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయ పడింది. ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి నీటిని తరలించేలా ప్రణా ళికకు ఓకే చెప్పింది. వరద కాల్వపై మూడు ఎత్తిపోతల పథకాలను నిర్మించి, ఎల్లంపల్లి ద్వారా నీటిని తరలించే ప్రతిపాదనను ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావుకు సిఫారసు చేయా లని ఉపసంఘం నిర్ణయించింది. గురువారం సచివాలయంలో ఎస్సారెస్పీ వరద కాలువపై కేబినెట్ సబ్కమిటీ సుదీర్ఘంగా సమీక్షించింది. సబ్ కమిటీ చైర్మన్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. వర్షాలు కురవని సంవత్సరాలలో శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ) పరిధిలోని రైతాంగం ఇబ్బందులకు గురి కాకుండా సాగునీటిని సరఫరా చేయడానికి ప్రత్యామ్నాయాలపై చర్చించారు. అతి తక్కువ భూసేకరణతో వేగంగా పూర్తి చేసే మార్గాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ స్థితిగతులపై ఇంజనీర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రోజుకు 0.75 టీఎంసీల నీరు తరలింపు.. నిజానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టును 112 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించినప్పటికీ పూడిక కారణంగా 80 టీఎంసీలకు తగ్గిపోయింది. ప్రాజెక్టు లక్ష్యం ప్రకారం 9 లక్షల 73 వేల ఎకరాలకు సాగునీరందడానికి 95 టీఎంసీలు కావాలి. ఎగువ ప్రాంతాల్లో బాబ్లీ వంటి ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల శ్రీరాంసాగర్కు ప్రవాహం తగ్గిపోయింది. దీంతో ఎస్సారెస్పీలో 54 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉన్నది. ఫలితంగా పూర్తి ఆయకట్టుకు నీరందించడం కష్టంగా మారిందని ఇంజనీర్లు తెలిపారు. ఈ దృష్ట్యా దాదాపు రూ.650 కోట్ల వ్యయ అంచనాలతో 31 మీటర్ల ఎత్తున లిఫ్ట్ నిర్మించి ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీ వరకు నీటి తరలింపు పథకాన్ని ప్రతిపాదించారు. రోజుకు 0.75 టీఎంసీల నీటిని ఈ పథకం నుంచి సరఫరా చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. దీనిపై కమిటీ స్పందిస్తూ, ఈ పథకాన్ని 10 నెలల్లో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. వరద కాలువలో అవసరమైన చోట్ల లైనింగ్ పనులు జరపాలని సూచించింది. మిడ్ మానేరు ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నందున ఈ సంవత్సరం ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు అనుసంధానం చేస్తున్నట్టు హరీశ్రావు తెలిపారు. ఈ అనుసంధానంలో భాగంగా రోజుకు 0.75 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ లోకి ఎత్తిపోసేందుకు సంకల్పించామన్నారు. ప్రస్తుతం కేబినెట్ సబ్ కమిటీ సూచించిన ఎస్సారెస్పీ సప్లిమెంటు పథకం ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పై ఆధారపడిన కాకతీయ, సరస్వతీ, లక్ష్మి కెనాల్లు సహా ఇతర ఎత్తిపోతల పథకాల ఆయకట్టును స్థిరీకరించడం, ప్రాజెక్టు పరిధిలోని ప్రజల తాగునీటి అవసరాలతో పాటు జగిత్యాల, మెట్పల్లి ప్రాంతాల్లోని మెట్ట భూములకు లక్ష ఎకరాలలో సాగు నీరందే అవకాశం ఉంది. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగరరావు, స్పెషల్ సీఎస్ జోషి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీరాంసాగర్కు తగ్గిన వరద
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్కు వరద ఉధృతి తగ్గింది. ప్రాజెక్ట్పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వదర తగ్గడంతో ప్రస్తుతం ప్రాజెక్ట్ 9 గేట్లు ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీరు కిందకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో కూడా 50 వేల క్యూసెక్కులు స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలో 90 టీఎంసీల నీరు ఉంది. -
ఈ ఏడాది ఎల్లంపల్లి ఫుల్!
20 టీఎంసీల నీటిని నింపాలని ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈ ఏడాది పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పరిధిలో గ్రామాల తరలింపు ప్రక్రియ పూర్తి కావడం, ప్రధాన అడ్డంకిగా ఉన్న రాయపట్నం బ్రిడ్జి పనులు ముగియడంతో 20 టీఎంసీలు నిల్వ చేయాలని కృత నిశ్చయంతో ఉంది. బేసిన్లో కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే ప్రాజెక్టులో 7 టీఎంసీల మేర నీరు చేరింది. ప్రస్తుతం 25 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ఇలాగే ప్రవాహాలుంటే మరో 15 రోజుల్లో ప్రాజెక్టు నిండుతుందని అధికారులు ఆశిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 1,85,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, ఆదిలాబాద్ జిల్లాలోని 30 వేల ఎకరాల స్థిరీకరణ కోసం 20.17 టీఎంసీల సామర్థ్యంతో ఎల్లంపల్లి బ్యారేజీని నిర్మించారు. ప్రాజెక్టు కింద మొత్తంగా 21 గ్రామాలు ముంపునకు గురవుతుండగా ఇందులో ఇప్పటివరకు 12 గ్రామాల తరలింపు పూర్తయింది. మరో 9 గ్రామాల్లో 700 ఇళ్లను ఖాళీ చేయించాల్సి ఉంది. గతేడాది ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో బ్యారేజీలో కేవలం 6.5 టీఎంసీల నీటి నిల్వకు మాత్రమే అవకాశం ఏర్పడింది. అనంతరం ముంపు గ్రామాల్లో ఒకటిగా ఉన్న తాళ్లకొత్తపేట గ్రామాన్ని ఖాళీ చేయించడంతో 144 మీటర్ల ఎత్తులో 10 టీఎంసీ మేర నిల్వ చేయగలిగారు. ఈ నీటితోనే హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చారు. ప్రస్తుతం సహాయ పునరావాస ప్రక్రియ కొలిక్కి రావడంతో 20.18 టీఎంసీల మేర నిల్వ చేసే అవకాశం లభించింది. ప్రాజెక్టులో 7 టీఎంసీల నీరు రాగా.. ఎగువన కడెం గేట్లు ఎత్తడంతో భారీగా నీరు వచ్చి చేరుతోంది. మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల్లోకి వరద భారీవర్షాలకు మధ్య, చిన్నతరహా ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాలకు 4,647 క్యూసెక్కులు, స్వర్ణకు 6,223.45, వట్టివాగుకు 4,202, సుద్దవాగుకు 14 వేలు, మత్తడివాగుకు 7,415, నీల్వాయికి 2,556 క్యూసెక్కుల ప్రవాహాలు నమోదవుతున్నాయి. ఇదే జిల్లాలోని కొమరంభీంకు 3,608 క్యూసెక్కుల ప్రవాహాలుండగా, ఖమ్మం జిల్లాలోని తాలిపేరుకు 14,564 క్యూసెక్కుల ప్రవాహాలున్నాయి. భారీ ప్రాజెక్టుల్లో కడెంకు ఎగువ నుంచి 57,696 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తుండగా.. శ్రీరాంసాగర్లోకి 14,031 క్యూసెక్కుల నీరు వస్తోంది. -
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన కామారెడ్డి, భిక్కనూరు ఏఎంసీ కార్యవర్గాల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఎస్సారెస్పీ లక్ష్మి లిఫ్ట్ పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో 1,045 అడుగుల నీటి మట్టం వద్ద నిర్మిస్తున్న లక్ష్మి ఎత్తిపోతల పథకం పనులను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కాంట్రాక్టర్ను ఆదేశించారు. శుక్రవారం మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి ఆయన లక్ష్మి లిఫ్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఆయకట్టు, పనుల వివరాలను తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న చోట ఒక్క ఇంజినీర్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా లక్ష్మి లిఫ్ట్ పనులు నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. 2007లో పనులు ప్రారంభించారని, 2014 వరకు 20 శాతం పనులనూ పూర్తి చేయలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక పనులను వేగవంతం చేశామని, రెండేళ్లలో తుదిదశకు తీసుకువచ్చామని పేర్కొన్నారు. లిఫ్ట్ నిర్మాణ పనులు పూర్తయితే 50 వేల ఎకరాలకు ఏటా రెండు పంటలకు నీరందుతుందన్నారు. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధిపై ఆగ్రహం లిఫ్ట్ పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కంపెనీ కిర్లోస్కర్ వైస్ చైర్మన్ విజయ్ మాథ్యూస్పై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన లిఫ్ట్ వద్ద నుంచి ఫోనులో మాథ్యూస్తో మాట్లాడారు. పనుల్లో జాప్యంపై ప్రశ్నించారు. ఈ నెలాఖారు వరకు రెండు మోటార్లు, వచ్చే నెలాఖారు వరకు లిఫ్ట్పనులు పూర్తి చేయాలని, లేకపోతే బ్లాక్ లిస్ట్లో చేర్చుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ సీఈ శంకర్, ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ రామారావు, డీఈలు, ఏఈఈలు పాల్గొన్నారు. ఎస్సారెస్పీలో నీరెంతుంది మంత్రి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ను పరిశీలించారు. ఎస్సారెస్పీ చీఫ్ ఇంజినీర్ శంకర్తో మాట్లాడి ప్రాజెక్ట్లో ఇప్పుడెంత నీరుందో తెలుసుకున్నారు. ప్రస్తుతం 4.5 టీఎంసీల నీరుందని చీఫ్ ఇంజినీర్ తెలిపారు. గతేడాది ఇదే సమయంలో 11 టీఎంసీల నీరుందన్నారు. లక్ష ఎకరాలకు నీరందిస్తాం కిసాన్నగర్లో రూ. 4.5 కోట్లతో నిర్మించిన 7,500 మెట్రిక్ టన్నుల గోదాంను, బస్సాపూర్ గ్రామంలో రూ. 6 కోట్లతో నిర్మించే బస్సాపూర్ లిఫ్ట్ నిర్మాణ పనులను మంత్రి హరీశ్రావు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. ప్రాణహిత -చేవెళ్ల 21వ ప్యాకేజీ ద్వారా బాల్కొండ నియోజక వర్గంలో 80 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో జిల్లాలో 600 మెట్రిక్ టన్నుల గోదాంలు నిర్మిస్తే.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 35 వేల మెట్రిక్ టన్నుల గోదాంలను నిర్మించిందన్నారు. రైతు బంధు పథకం ద్వారా రైతులు తమ ధాన్యాన్ని గోదాంలలో నిల్వ చేసుకుని రుణాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్రెడ్డి, సర్పంచ్ లింగస్వామి, ఎంపీపీ అర్గుల్ రాధ, జెడ్పీటీసీ సభ్యురాలు జోగు సంగీత, వైస్ ఎంపీపీ శేఖర్, వేల్పూర్ ఏఎంసీ చైర్మన్ పుట్ట లలిత, ఎంపీటీసీ సభ్యురాలు నిర్మల తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్లో.. మోర్తాడ్ : మండలంలోని గుమ్మిర్యాల్లో రూ. 11.40 లక్షలతో చేపట్టనున్న గోదావరి నది ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు. -
శ్రీరామసాగరం చుట్టొద్దామా..
ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగానూ విలసిల్లుతోంది. ప్రాజెక్టుతోపాటు దిగువన పార్క్, జల విద్యుదుత్పత్తి కేంద్రం, పలు ఆలయాలు ఉన్నారుు. వాటిని చూసేందుకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. - బాల్కొండ ప్రాజెక్ట్ చరిత్ర.. 18 లక్షల ఎకరాలకు సాగునీరు, 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి, చేపల పెంపకం లక్ష్యాలుగా శ్రీరాంసాగర్ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. 1963 జూలై 26 న అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1,091 అడుగుల నీటిమట్టంతో(112 టీఎంసీల నీటి సామర్థ్యంతో ) 175 చదరపు మైళ్ల విస్తీర్ణంతో గోదావరి జన్మ స్థానానికి 326 మైళ్ల దూరంలో సముద్ర మట్టానికి ప్లస్ 980 అడుగుల ఎత్తులో పోచంపాడ్ వద్ద ప్రాజెక్టు నిర్మించారు. 35,425 చదరపు మైళ్ల క్యాచ్మెంట్ ఏరియాతో 16 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునేలా ప్రాజెక్ట్ డ్యాం డిజైన్ చేశారు. 50 అడుగుల వె డల్పు, 33 అడుగుల ఎత్తుతో మొత్తం 42 వరద గేట్లున్నాయి. ప్రాజెక్ట్ నుంచి పూడిక పోవడానికి ఆరు రివర్స్ స్లూయీస్ గేట్లు నిర్మించారు. 1981లో జాతికి అంకితం చేశారు. చూడదగ్గ ప్రదేశాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతోపాటు నదీ తీరాన ఉన్న శ్రీరామ లింగేశ్వరస్వామి ఆలయూన్ని దర్శించుకోవచ్చు. ప్రాజెక్ట్ ఆనకట్టపై నిర్మించిన జవహర్లాల్ నెహ్రూ విగ్రహం ఆకట్టుకుంటోంది. ప్రాజెక్ట్ మిగులు జలాలను గోదావరిలోకి వదలడానికి నిర్మించిన 42 వరద గేట్లు, ప్రాజెక్ట్ దిగువన ఉన్న జలవిద్యుదుత్పత్తి కేంద్రం, గార్డెన్లను తిలకించవచ్చు. ప్రాజెక్ట్ దిగువన ఉన్న పార్కులో సేదతీరవచ్చు. వర్షాకాలంలో సరైన వర్షాలు కురిసి, ఎగువ ప్రాంతాలనుంచి వరద నీరు వచ్చి చేరితే ప్రాజెక్టు నిండుకుండలా మారుతుంది. అప్పుడు నీటిని దిగువకు వదులుతారు. ఆ సమయంలో గోదావరి పరవళ్లను తిలకించడానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. వర్షాకాంలో ప్రతిరోజువేల సంఖ్యలో పర్యాటకులు ప్రాజెక్ట్ను సందర్శిస్తారు. ఆ సమయంలో ప్రాజెక్ట్ వద్ద బోటు షికారు అందుబాటులో ఉంటుంది. ఎలా వెళ్లాలి జిల్లా కేంద్రం నుంచి 52 కిలోమీటర్ల దూరంలో పోచంపాడ్ కూడలి ఉంది. ఇక్కడినుంచి 3 కిలోమీటర్ల దూరంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉంది. ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్లే ప్రతి ఆర్టీసీ బస్సు పోచంపాడ్ కూడలి మీదుగానే వెళ్తుంది. కూడలి నుంచి ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. -
కోటి అందాల తెలంగాణ
అబ్బురపరిచే వేసవి విడుదులెన్నో సాక్షి నెట్వర్క్: తెలంగాణ.. కోటి రతనాల వీణే కాదు.. కోటి అందాల హరివిల్లు కూడా. అబ్బురపరిచే అందాలను ఇముడ్చుకున్న ప్రాంతాలెన్నో వేసవి విడిదికి రా.. రమ్మని పిలుస్తున్నాయి. ఊరిస్తున్న సెలవులను ఉత్సాహంగా గడిపేందుకు సరైన ప్రణాళిక వేసుకుంటే తెలంగాణను ఇట్టే చుట్టేసి రావొచ్చు. ఆదిలాబాద్ జిల్లా అం టేనే అడవులకు పెట్టింది పేరు. జీవవైవిధ్యా నికి ప్రతీకగా నిలిచే జన్నారంలోని అభయారణ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడి కవ్వాల్ అడవులు హైదరాబాద్ నుంచి కేవలం 270 కి.మీ. రైలు ప్రయాణంతో చేరుకోవచ్చు. ఖమ్మం-వరంగల్ జిల్లాల సరిహద్దులోని జూన్ నుంచి డిసెంబర్ వరకు బొగత జలపాతం కనులవిందు చేస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని అందం చూడాలంటే రెండు కళ్లూ చాలవు. పాల్వంచకు 12 కిలోమీటర్ల దూరంలో దండకారణ్యంలో గలాగలా పారుతోంది. హైదరాబాద్ తర్వాత అత్యధిక పర్యాటకులను ఆకర్షిస్తున్న నగరం వరంగల్. కాకతీయుల నాటి ఆనవాళ్లు కట్టిపడేస్తున్నాయి. వేయిస్తంభాల గుడి, ఖిలా వరంగల్, భద్రకాళి ఆలయాలు, లక్నవరం వేటికవే ప్రత్యేకం. మహబూబ్నగర్లోని నల్లమల చూసి తరించాల్సిందే. కృష్ణానది ఒడ్డునున్న సోమశిల, మరో ప్రాంతం సింగోటం అబ్బురపరిచే అందాల నిల యాలు. కరీంనగర్ జిల్లాలోని డీర్పార్క్, ఉజ్వల పార్క్, లోయర్ మానేరు డ్యాం మనస్సును పరవశింపజేస్తున్నాయి. మెతుకు సీమ మెదక్ జిల్లాలోనూ ఎన్నో చూడముచ్చటైన ప్రాంతాలున్నాయి. ఆసియాలోనే పెద్దదైన చర్చి, ఏడుపాయల ఆలయం ప్రసిద్ధి. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని పచ్చదనం కప్పుకున్న దేవరచర్ల గుట్టలు, నాగార్జున సాగర్ డ్యాం, నాగార్జున కొండ అందాల తీరే వేరు. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పర్యాటకులను కట్టిపడేస్తోంది. తెలంగాణ ఊటి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ కొండలు, రాజధానికి అతి సమీపంలోని ఈ కొండలు, కోనలు, ఇక్కడి పచ్చదనాన్ని చూసేందుకు రోజూ వేలల్లో పర్యాటకులు వస్తుంటారు. -
‘వరద కాల్వ’ సవ రించిన అంచనాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా ఉన్న ఇందిరమ్మ వరద కాల్వ పనుల సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర జల వనరుల శాఖ నేతృత్వంలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన సమావేశంలో సవరించిన అంచనా రూ. 5,887.13 కోట్లకు ఓకే చెప్పింది. దీంతోపాటు ప్రాజెక్టులో ఇంకా చేయాల్సి ఉన్న పనులకు సంబంధించి రూ.1,950 కోట్లలో 25 శాతం నిధులను సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద ఇవ్వనుంది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని సుమారు 2.25 లక్షల ఎకరాల ఆయకట్టు నీరిచ్చేందుకు వరద కాల్వ నిర్మాణాన్ని చేపట్టారు. 1996లో కేంద్ర జల వనరుల శాఖకు సమర్పించిన డీపీఆర్ మేరకు రూ. 1,331 కోట్లుగా అంచనా వేశారు. 2005లో ప్రణాళికా సంఘం నుంచి ఆమోదం రాగా... 2006లో ఏఐబీపీ కింద రూ.382.40 కోట్లు విడుదల చేశారు. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులు, భూసేకరణ జాప్యం కారణంగా అంచనా వ్యయం తాజాగా రూ.5,887.13 కోట్లకు చేరింది. ఇందులో ఇంకా రూ.1,950 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉంది. అయితే ప్రాజె క్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపి, ఏఐబీపీ కింద నిధులివ్వాలని మంత్రి హరీశ్రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్రావు పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర జల సంఘం చైర్మన్ పాండ్యా నేతృత్వంలోని టీఏసీ సోమవారం సమావేశంలో సవరించిన అంచనాకు ఆమోదం తెలిపింది. ఇక నిజాంసాగర్ ఆధునీకరణకు రూ. 978కోట్లు, మోదికుంటవాగుకు రూ.456 కోట్లకు సంబంధించిన రాష్ట్ర విన్నపాలను టీఏసీ పరిశీలిస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. -
ముంపు నుంచి తేలిన రత్నాపూర్
ఎస్సారెస్పీలో అడుగంటిన నీరు బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో నీరు లేకపోవడంతో ముంపు గ్రామాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అర్ధ శతాబ్దం క్రితం ముంపునకు గురైన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం రత్నాపూర్ గ్రామ ఆనవాళ్లు బయటపడింది. ఇదివరకే కుస్తాపూర్ రామలింగేశ్వర స్వామి ఆలయం, రత్నాపూర్ గ్రామ ఆరాధ్య దైవం మల్లన్న గుట్ట వరకు రోడ్డు మార్గం బయల్పడింది. ప్రస్తుతం ఆ గ్రామ చెరువు, ఇళ్ల పునాదులు బయట పడ్డాయి. దీంతో మల్లన్న గుట్ట వద్ద పూజలు నిర్వహించేందుకు వస్తున్న ఆ గ్రామస్తులు తాము నివాసం ఉన్న ఇళ్ల ఆనవాళ్లను చూసి ఆవేదన, మరోవైపు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. రత్నాపూర్ గ్రామంలో మల్లన్న గుట్ట చుట్టూ నివాసాలు ఉండేవని చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే గుట్ట చుట్టూ పునాదులు వరుస క్రమంలో కనిపిస్తున్నాయి. మల్లన్న గుట్టకు సమీపంలో వీరన్న గుట్ట ఉంది. ఆ గుట్ట పూర్తిగా ప్రాజెక్ట్లో ముంపునకు గురైంది. ప్రస్తుతం ఆ గుట్ట పూర్తిగా బయటపడింది. అక్కడి వరకు రోడ్డు ఉంది. రత్నాపూర్ గ్రామం మల్లన్న గుట్టకు, వీరన్న గుట్టకు మధ్యలోనే ఉందనడానికి గుర్తులు కనిపిస్తున్నాయి. అలాగే, మల్లన్న గుట్టపై ఉన్న బురుజుపై గండదీపం ముట్టించే వారని చెబుతున్నారు. బురుజుపై గండ దీపం వెలిగిస్తే ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్కు కనిపించేదని వృద్ధులు పేర్కొంటున్నారు. -
తరుముతున్న కరువు
మెట్పల్లి : రెండేళ్లుగా ఆశించిన వర్షాలు లేక జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయి. మంథని డివిజన్లో అడపాదడపా తప్ప మిగతా అన్నిచోట్ల లోటు వర్షపాతమే. భూగర్భజలాలు అడుగంటా యి.బావులు ఎండిపోయాయి. బోర్లు ఎ క్కడికక్కడే వట్టిపోతున్నాయి. అయినా ఆశచావని అన్నదాతలు కొత్తగా బోర్లు వేస్తూ అప్పులపాలవుతున్నారు. ఒక్కోరైతు 5 నుంచి 10 బోర్లు వేయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాకు వరప్రదాయని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీరు లేకపోవడం రైతులకు ఆశనిపాతమైంది. రెండేళ్లుగా కాలువల నీరు రాక భూములన్నీ బీళ్లుగా మారాయి. వర్షాలు లేక చెరువుల్లో చుక్కనీరు చేరక మైదానాలను తలపిస్తున్నాయి. వర్షాలు పడతాయనే ఆశతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. పెట్టుబడి కూడా నష్టపోయే ప్రమాదమేర్పడింది. కరువుతో అప్పులపాలైన రైతన్నలు వలసలబాట పడుతున్నారు. ఉన్న ఊరిలో ఉపాధి కరువై అప్పుల భారంతోపాటు కుటుంబపోషణకు ముంబై, సూరత్, భీవండితోపాటు గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఎకరాల కొద్ది భూమి, పంటలు పడినప్పుడు ఓ వెలుగు వెలిగిన అన్నదాతలు కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు గల్ఫ్లో కూలీల అవతారమెత్తుతున్నారు. భవన నిర్మాణరంగంతోపాటు బల్దియా, హోటళ్లు, ఆఫీసులు, ఇళ్లలో క్లీనింగ్ పనులకు వేల సంఖ్యలో ఖాళీలున్నాయని, వీటికే ఎక్కువగా వెళ్తున్నారని ఏజెంట్లు చెబుతున్నారు. ఈ పనులకు అక్కడ మన కరెన్సీలో నెలకు కంపెనీని బట్టి రూ.8 వేల నుంచి రూ.11 వేల వేతనం మాత్రమే దక్కుతోంది. వేతనం తక్కువగానే ఉన్నా... ఇక్కడ ఆ మాత్రం కూడా ఉపాధి లేకపోవడంతో వలసబాట పట్టక తప్పడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇలాంటి పనులకు అక్కడి కంపెనీలు ఉచితంగానే, మరికొన్ని నామమాత్రపు రుసుంతో వీసాలు మంజూరు చేస్తున్నా... ఇక్కడి ఏజెం ట్లు రూ.50 వేల నుంచి రూ.లక్ష వసూలు చేస్తున్నారు. సౌదీ అరేబియా, దుబయ్, దోహఖతర్, కువైట్, మస్కట్ వెళ్లేందుకు వీసాల కోసం చాలామంది ట్రావెల్ ఏజెంట్ల వద్ద పాస్పోర్టులతో క్యూ కడుతున్నారు. నాలుగు నెలల కాలంలో జిల్లా నుంచి 10 వేల మంది వలసబాట పట్టారని అంచనా. ఇటీవల రంజాన్ నెలతో గల్ఫ్ దేశాల నుంచి వీసాల జారీలో జాప్యం ఏర్పడింది. ఇప్పటికీ ఏజెంట్లకు పాస్పోర్టులు ఇచ్చి వేలాది మంది వీసాల కోసం ఎదురుచూస్తున్నారు. కానరాని వలస నియంత్రణ చర్యలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గల్ఫ్ దేశాలకు వలస పోవక్కరలేదని, ఉన్న ఊరిలోనే బతుకు సాగించేలా ఉపాధి కల్పిస్తామని ఉద్యమ సమయంలో, ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ హామీలు గుప్పించింది. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలవుతున్నా ఆ దిశగా అడుగులు పడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నారుు. తెలంగాణతో బతుకులు బాగుపడుతాయని ఆశించిన వలస జీవులకు నిరాశే మిగులుతోంది. ఖరీఫ్లో సగటు వర్షపాతంకంటే తక్కువగా నమోదైనా ఇప్పటివరకు కరువు మండలాల ఊసే లేకుండా పోయింది. కరువు నేపథ్యం లో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలున్నారుు. ఇప్పటికే 300... మరో 200 మంది రెడీ మెట్పల్లి మండలం ఊటుపల్లిలో 1200 జనాభా ఉంది. 480 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మిర్చి, కందులు, పసుపు పండిస్తారు. వర్షాలు లేక బావులు, బోర్లు ఎండిపోయాయి. కొందరు రైతులు 5 నుంచి 10 బోర్లు వేసినా దుబ్బ వచ్చిందే తప్ప నీటి జాడ లేదు. వ్యవసాయ పనులు లేక ఉపాధి లభించక, అప్పులభారం వెంటాడడంతో గత్యంతరం లేక గ్రామానికి చెందిన 100 మంది రైతులు గల్ఫ్ వెళ్లేందుకు ట్రావెల్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. 5వేల జనాభా గల సాతారం గ్రామంలోనే ఇదే పరిస్థితి. 500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పసుపు, చెరుకు, సోయాబిన్ పండేది. ఈ గ్రామం నుంచి ఇప్పటికే 300 మంది గల్ఫ్లో ఉన్నారు. ఇప్పుడు కరువుతో మరో 200 మంది వలసపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
ఒక్క గ్రామం..నాలుగు టీఎంసీలు!
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న ఎల్లంపల్లి బ్యారేజీలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వకు మరికొన్ని టీఎంసీలు అదనంగా నిల్వ చేసేందుకు నీటిపారుదల శాఖ శరవేగంగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో లక్ష్యం మేరకు ఆయకట్టుకు నీరందించేందుకు వీలుగా నాలుగు టీఎంసీల నీటినైనా నిల్వ చేయాలని నీటి పారుదల శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రాజెక్టులో ముంపు గ్రామమైన తాళ్లకొత్తపేటను తరలించగలిగితే అదనపు నీటి నిల్వ సాధ్యమని భావిస్తున్న అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఖరీఫ్ ల క్ష్యం 93 వేల ఎకరాలు కరీంనగర్ జిల్లాలోని 1,85,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, ఆదిలాబాద్ జిల్లాలోని 30 వేల ఎకరాల స్థిరీకరణ కోసం 20.17 టీఎంసీల నీటి నిల్వ చేయడానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన ఎల్లంపల్లి బ్యారేజీని నిర్మించిన విషయం తెలిసిందే. దీనికోసం మొత్తంగా రూ. 2,871 కోట్లతో కాంట్రాక్టర్లతో ఒప్పందాలు జరగ్గా, ఇప్పటి వరకు రూ. 2,625 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మరో రూ. 889 కోట్ల మేర పనులు పెండింగ్లో ఉన్నాయి. ప్రాజెక్టు కింద మొత్తంగా 21 గ్రామాలు ముంపునకు గురవుతుండగా ఇందులో ఇప్పటివరకు 7 గ్రామాలను తరలించారు. మరో 14 గ్రామాలను ఖాళీ చేయించాల్సి ఉంది. దీంతో పాటే 2 రైల్వే క్రాసింగ్, మరో 13 ఆర్అండ్బీ క్రాసింగ్లకు సంబంధించి అనుమతులు రావాల్సి ఉంది. ముఖ్యంగా రాయపట్నం బ్రిడ్జి పనులు త్వరగా పూర్తిచేస్తే ప్రాజెక్టు పనుల్లో కొంత వేగం పెరిగే అవకాశం ఉంది. కానీ, అందులో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్రామాలను ఖాళీ చేయకపోవడం, భూ సేకరణ జరగకపోవడంతో బ్యారేజీలో కేవలం 6.5 టీఎంసీల నీటి నిల్వకు మాత్రమే అవకాశం ఉంటోంది. ఈ నీటినే ఎన్టీపీసీకి అందించడంతో పాటు గతేడాది మంథని ఎత్తిపోతల కింద మరో 7 వేల ఎకరాలకు సాగునీరందించారు. అయితే ప్రస్తుతం ముంపు గ్రామాల్లో ఒకటిగా ఉన్న తాళ్లకొత్తపేట గ్రామం ఒక్కదాన్ని ఖాళీ చేసినా మరో 4 టీఎంసీలకు నీటి నిల్వ పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రభుత్వం దానిపై దృష్టి కేంద్రీకరించింది. గ్రామం నిర్వాసితులకు త్వరగా ఆర్అండ్ఆర్ (సహాయ పునరావాసం) పూర్తిచేసి ఖాళీ చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కదిలిన అధికారులు ముంపు గ్రామాన్ని ఖాళీ చేయించే దిశగా కసరత్తులు చేస్తున్నారు. అనుకున్న మేరకు అదనంగా నీటిని నిల్వ చేయగలిగితే ప్రస్తుత ఖరీఫ్లో స్టేజ్-2 కింద 50 వేల ఎకరాలు, మంథని ఎత్తిపోతల కింద 13 వేల ఎకరాల కొత్త ఆయకట్టు నీరివ్వడంతో పాటు, మరో 30 వేల ఎకరాలను స్థిరీకరించాలని నిర్ణయించారు. -
ఆశలన్నీ గోదారిపైనే!
♦ ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు.. ♦ జూలై 1న బాబ్లీ గేట్ల ఎత్తివేతతో ఎస్సారెస్పీలోకి చేరే అవకాశం ♦ {తిసభ్య కమిటీలో తెలంగాణకు చోటుపై 6న సుప్రీంలో విచారణ సాక్షి, హైదరాబాద్ : గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్ర నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూలై 1వ తేదీన తెరవనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. బాబ్లీ గేట్లు మూసి ఉంచే గడువు ఈనెల 30వ తేదీతో ముగుస్తుంది. దీంతో అదేరోజు అర్ధరాత్రి గేట్లు తెరుస్తారు. ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నందున గోదావరి నదిలో స్వల్పంగా ప్రవాహం ఉంది. దీంతో ఆ నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరే అవకాశముందని సాగునీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర తెలంగాణ నాలుగు జిల్లాల్లోని ఏడు లక్షల ఎకరాలకు ప్రాణాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన గోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో.. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న కోర్టు గత ఏడాది ఫిబ్రవరిలో తీర్పు వెలువరించింది. ఏటా జూలై ఒకటి నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచే ఉంచాలని మహారాష్ట్రను ఆదేశించింది. అక్టోబర్ 29 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు ప్రాజెక్టు గేట్లు మూసి ఉంచవచ్చని సూచించింది. ఈ మేరకు అక్టోబర్ 29న ప్రాజెక్టు 14 గేట్లు మూసేసిన మహారాష్ట్ర.. వచ్చే నెల 1న తిరిగి తెరవనుంది. 6న సుప్రీంలో విచారణ.. సుప్రీంకోర్టులో బాబ్లీ కేసు వచ్చే నెల 6న విచారణకు రానుంది. బాబ్లీ కేసును పరిష్కరించిన సందర్భంగా ఆ ప్రాజెక్టు నీటి వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఒక త్రిసభ్య కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. ఇందులో కేంద్ర జల సంఘం, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల తరఫున ఒక్కో ప్రతినిధి ఉంటారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఆ కమిటీలో తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ ప్రతివాదులకు నోటీసులిచ్చిన కోర్టు.. తదుపరి విచారణను జూలై 6న చేపడతామని పేర్కొంది. దీనిపై ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. బాబ్లీ పర్యవేక్షణ కమిటీలో తెలంగాణను చేర్చాలని కోరడంతోపాటు ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేని ఏపీని తొలగించాలని నివేదించింది. -
ఎస్సారెస్పీకి భారీ భద్రత
బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల వర ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు భారీ భద్రత ఏర్పాటు చేస్తామని ఎస్పీఎఫ్(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) కమాండెంట్ మాధవరావు అన్నారు. శుక్రవారం ప్రాజెక్ట్ భద్రత ఏర్పాట్లను ఇంటెలిజెన్స్ డీఎస్పీ పద్మనాభ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఆనకట్ట ఎంత పొడువు ఉంది, ప్రాజెక్ట్ నిర్మాణ క్రమం, ప్రాజెక్ట్కు రక్షణ గురించి ఎస్ఈ శ్యాంసుందర్ను అడిగారు. భద్రత కోసం డ్యాంపై గుర్తించిన 8 పాయింట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్సారెస్పీకి తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని 2007లోనే ఇంటెలిజెన్సీ విభాగాలు హెచ్చరించాయని, అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్లకు భారీ భద్రత కల్పించాలని నిర్ణయించిందని చెప్పారు. నాగార్జున సాగార్, శ్రీశైలం ప్రాజెక్ట్ల మాదిరిగా ఎస్సారెస్పీకీ భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు అవసరమైన నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఆయన వెంట ప్రాజెక్ట్ ఈఈ రామారావు, డ్యాం డిప్యూటీ ఈఈ మొయినొద్దీన్ఖాన్, ఆర్మూర్ డీఎస్పీ ఆకుల రాంరెడ్డి, డ్యాం ఏఈ బోజదాసు, ఆర్మూర్ రూరల్ సీఐ నరసింహ స్వామి, బాల్కొండ ఎస్సై సురేశ్ ఉన్నారు. -
‘ఎస్సారెస్పీ వెలుగు’లకు 26 ఏళ్లు
* ఆదివారం నుంచి 27వ వసంతంలోకి.. ‘జల విద్యుదుత్పత్తి కేంద్రం’ * 120 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టాలని లక్ష్యం * నాలుగు సార్లు మాత్రమే చేరిన వైనం బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద నిర్మించిన జలవిద్యుదుత్పత్తి కేంద్రం 26 వసంతాలు పూర్తి చేసుకుని ఆదివారం 27వ వసంతంలోకి అడుగుపెడుతోంది. 1988 డిశంబర్ 21 న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా జల విద్యుత్తు కేంద్రాన్ని ప్రారంభించి, జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ఇక్కడి జల విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ రెండవ ప్రయోజనమే జల విద్యుతుత్పత్తి. దీంతో ప్రభుత్వం కాకతీయ కాలువ ప్రారంభంలో సెప్టెంబర్ ఒకటిన రూ. 23.5 కోట్ల వ్యయంతో నిర్మించడానికి ప్రభుత్వ అనుమతి లభించింది. మొదటి దశలో మూడు టర్బయిన్లు 27 మెగా వాట్ల ఉత్పతి జరిగేలా పనులు ప్రారంభించారు. రెండో దశలో నాల్గో టర్బయిన్ పనులు ప్రారంభించారు. 1987 జూలై లో మొదటి టర్బయిన్ పనులు పూర్తిచేసుకుంది. రెండవ టర్బయిన్ 1987 డిసెంబర్లో, మూడవ టర్బయిన్ 1988 జూలైలో పనులు పూర్తి చేసుకుంది. నాల్గో టర్బయిన్ 2007 డిసెంబర్లో పనులు ప్రారంభమై 2010 ఆగస్టులో పూర్తిచేసుకుంది. అప్పటి నుంచి 36 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి కేంద్రంగా కొనసాగుతోంది. ఈ కేంద్రాన్ని స్విట్జర్లాండ్ పరిజ్ఞానంతో నిర్మించారు. టర్బయిన్ నిమిషానికి 250 సార్లు తిరిగి విద్యుదుత్పత్తిని జరుపుతుంది. ప్రతి టర్బయిన్కు 2200 క్యూసెక్కుల నీరు అవసరం ఉంటుంది. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్తును మండంలోని బుస్సాపూర్ శివారులో ఉన్న 132 కే.వీ సబ్ స్టేషన్ కు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు. 24 గంటలకోసారి విద్యుత్తును లెక్కిస్తారు. ఈ జల విద్యుతుత్పత్తి కేంద్రం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరం 120 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ప్రాజెక్ట్ నీటి ఆధారంగా విద్యుతుత్పత్తి జరుగుతుంది. 26 ఏళ్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే లక్ష్యాన్ని చేరింది. నాల్గు టర్బయిన్లతో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరగలేదు. ప్రాజెక్ట్ అధికారులు వరద కాలువ ద్వారా నీటి విడుదల చేయడంతో కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల పూర్తి స్థాయిలో జరగక నాలుగు టర్బయిన్ల విద్యుదుత్పత్తి జరగడం లేదు. నాల్గు టర్బయిన్లకు 8800 క్యూసెక్కుల నీరు అవసరం ఉంది. అంత స్థాయిలో కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టినా, కాలువకు గండి పడే ప్రమాదమూ లేకపోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం జల విద్యుదుత్పత్తి కేంద్రంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. విద్యుదుత్పత్తికి ‘వరద’ గండం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవడానికి వరద కాలువ జల విద్యుదుత్పత్తికి గండంగా మారింది. కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్ జిల్లాలోని లోయార్ మానేరు డ్యాం నింపే అవకాశం ఉండగా, వరద కాలువ ద్వారానే నీటి విడుదల చేపడుతున్నారు. దీంతో విద్యుదుత్పత్తికి తీవ్ర నష్టం కలుగుతోంది. పాలకులు, అధికారులు పట్టించుకోవడంలేదు. -
సీఎం సారూ.. హామీలు మరిచారా!
ఎస్సారెస్పీపై అదే నిర్లక్ష్యం బాల్కొండ : ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువైన శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్కు నిధుల కేటాయింపులో మళ్లీ అన్యాయమే జరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగునీటిని అందించడమే కాకుండా అనేక గ్రామాల ప్రజల దాహార్తిని తీరుస్తుంది. అలాంటి ప్రాజెక్టుకు ప్రస్తుత బడ్జెట్లో రూ. 63.40 కోట్ల నిధులే కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా పదేళ్లపాటు ఈ నిర్లక్ష్యం కొనసాగితే ప్రాజెక్టు తాగునీటికి మాత్రమే పనికివస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 40.10 కోట్ల అంచనా వ్యయంతో ఐదు దశాబ్దాల క్రితం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం కాగా మూడున్నర దశాబ్దాల క్రితం నిర్మాణం పూర్తయ్యే నాటికి వ్యయం 1,600 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం రూ. 3 వేల కోట్లు ఉంటుందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్ట్లో నిర్మించిన వరద గేట్ల పరి స్థితి దయనీయంగా ఉంది. ఎస్కేప్ గేట్లు సరిగా పనిచేయడం లేదు. కాకతీయ కాలువకు ఏ క్షణాన గండిపడుతుందో అన్నట్లుగా ఉంది. ఆనకట్ట అంతా గుంతల మయంగా మారింది. కాలనీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. రివిట్మెంట్ ఊడిపోతోంది. ప్రాజెక్ట్కు పటిష్టమైన భధ్రత లేదు. పూడిక పేరుకు పో యింది. కాలువల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ఇలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రాజెక్టుకు తెలంగాణ సర్కార్ సైతం భరోసా ఇవ్వలేకపోయింది. కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ లో అరకొర నిధులే కేటాయించడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రాజెక్టును టూరిజంగా అభివృద్ధి చేస్తారని ఆశించినవారికీ భంగపాటే మిగిలింది. నయా పైస కూడా విదల్చలేదు. గల్ఫ్ బాధితులకు భరోసా ఏదీ ? మోర్తాడ్ : బడ్జెట్లో గల్ఫ్ బాధితులకు ఊరట కల్పించే చర్యలేవీ కనిపించలేదు. తెలంగాణలోని గల్ఫ్ బాధితుల కోసం కేరళ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయం లో టీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. పార్టీ ఎన్నికల ప్రణాళికలోనూ ఈ విషయాన్ని చేర్చారు. గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం కేరళప్రభుత్వం బడ్జెట్లో వంద కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్లో గల్ఫ్ బాధితుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని అందరూ ఆశించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏజెంట్ల చేతిలో మోసపోవడం, గల్ఫ్లోని కంపెనీలు వేతనాలను సరిగా చెల్లించకపోవడం, ఉద్యోగాల నుంచి తొలగించడం వంటి కారణాలతో పలువురు అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడ్డారు. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించింది. ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రాజధానిలో ఎన్ఆర్ఐ సెల్ను ఏర్పాటు చేసి, సాధారణ పరిపాలన కింద అరకొరగా నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. గతంలో రూ. 5 కోట్లకు మించి నిధులు కేటాయించలేదు. ఇప్పుడు కూడా గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన బాధితులకు ప్రత్యేకంగా ప్యాకేజీని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా.. దీనిపై స్పష్టత ఇవ్వలేదు. గల్ఫ్ బాధితులను ఆదుకోవాలని ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి.. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ‘పసుపు’.. ఊసే లేదు ! బడ్జెట్లో పసుపు పథకానికి దక్కని చోటు నిధులు కేటాయించని సర్కార్ మోర్తాడ్ : పసుపు రైతుకు అండగా నిలవడానికి పసుపు అభివృద్ధి పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో జిల్లా పర్యటనలో ప్రకటించారు. పసుపు బోర్డు ఏర్పాటు అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. కాగా పసుపు అభివృద్ధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. అయితే ప్రభుత్వం ఈ పథకానికి మొండి చెయ్యి చూపింది. బడ్జెట్లో పసుపు అభివృద్ధి పథకం ఊసేలేకపోవడంతో కర్షకుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. వేల్పూర్ మండలం మోతె, ఆర్మూర్ మండలం అంకాపూర్లలో ఎక్కడో ఒక చోట పసుపు అభివృద్ధి పథకం, బోర్డు ఏర్పాటుకు కృషి చేయడానికి 13 మంది ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సభ్యులు జిల్లాలో పలుమార్లు పర్యటించారు. 40 ఎకరాల స్థలంలో పసుపు అభివృద్ధి పథకానికి సంబంధిం చిన కార్యాలయం ఏర్పాటు, పసుపు పరిశోధనకు ల్యాబ్, కొత్త వంగడాలు సృష్టించడం, గిడ్డంగులు, పసుపు విక్రయానికి యార్డులు, రైతులు సేద తీరడానికి విశ్రాంతి గదులు, రెస్టారెంట్ తదితర నిర్మాణాలను చేపడతామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇందు కోసం మోతె పర్యటనకు సీఎం కేసీఆర్ తొలి ప్రాధాన్యత ఇచ్చారు. అక్కడ అనుకూల పరిస్థితులు లేకపోతే అంకాపూర్ను ఎంపిక చేయాలని భావించారు. మోతెలో పసుపు పరిశోధన కేంద్రం, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు అంశాన్ని గవర్నర్ అప్పట్లో శాసన సభ సమావేశంలో ప్రకటించారు. దీంతో పసుపునకు మంచి రోజులు వస్తాయని అందరూ భావించారు. తీరా బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ను పరిశీలిస్తే.. పసుపు అభివృద్ధి పథకం ఊసేలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. పసుపు అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టిన సర్కార్.. నిధులు ఇవ్వకపోవడం దారుణమని రైతులు పేర్కొంటున్నారు. -
సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
హన్మకొండ చౌరస్తా : ప్రజల సంక్షేమంపై కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆయన మంత్రి వర్గం ఇప్పటికీ జనాకర్షణ కోసమే ప్రయత్నిస్తున్నారు తప్ప.. సంక్షేమ పథకాల అమలు శూన్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి మండిపడ్డారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ పంటలకు నీరందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూడికతీతపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో తన భూములే పోయాయంటూ కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు మార్కెట్ విలువకు నాలుగు రెట్ల నగదును అందజేయాలని డిమాండ్ చే శారు. రాష్ట్ర విభజనలో భాగంగా సీలేరు విద్యుత్ ప్రాజెక్టు ఆంధ్రలో కలిసిందని, అక్కడి నుంచి మనకు రావాల్సిన విద్యుత్పై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఐడీ విచారణ పేరుతో సుమారు 5 లక్షల ఇళ్ల నిర్మాణాలను నిలిపివేశారని, వాటిని మళ్లీ ప్రారంభించాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ప్రజలను గతంలో ఇబ్బంది పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ తెల్లకాగితంపై దరఖాస్తు చేసుకోవాలనడం సబబుకాదన్నారు. భూదందా, ఆక్రమణలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై నవంబర్ 4వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి టీ శ్రీనివాసరావు, మడత కాళీదాసు, మేకల రవి, టి సత్యం తదితరులు పాల్గొన్నారు. -
చివరి ఆయకట్టు వరకూ ఎస్సారెస్పీ నీరు
ప్రాజెక్ట్ కాల్వల ఆధునికీకరణ - కాల్వల సామర్థ్యంపై ఇంజనీర్ల సర్వే పూర్తి - సర్కారుకు నీటిపారుదల శాఖ నివేదిక అందజేత - 94 కి.మీల మేర నిర్మాణం, రూ.600 కోట్ల అంచనా - ప్రభుత్వం ఆదేశిస్తే.. కొత్త కాల్వలపైనా సర్వే - శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అధికారుల వెల్లడి హన్మకొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జలాలను జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు అందించే నివేదిక సిద్ధమైంది. గత నెలలో జరిగిన సాగునీటి శాఖ సమీక్షలో వరంగల్ జిల్లాలోని ఎస్సారెస్పీ కాల్వల పరిస్థితి, సామర్థ్యం పెంపునకు ప్రతిపాదనలివ్వాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. చివరి ఆయకట్టు వరకు పూర్తిస్థారుులో నీరందించేలా కాల్వల ఆధునికీకరణకు సంబంధించి పరిశీలనలు చేపట్టాలని సూచించారు. ఎస్సారెస్పీ జలాలతో మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేసేలా కొత్త కాల్వల నిర్మాణం కోసం సర్వే చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు జిల్లాలో కాల్వల ఆధునికీకరణపై సర్వే చేపట్టారు. 16 రోజులుగా సర్వే చేసి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. నివేదికలోని అంశాలు ప్రస్తుతం ఉన్న కాల్వల నుంచి పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయడం, ఎస్సారెస్పీ రెండో దశకు నీరిందించాలంటే ప్రధాన కాల్వ సామర్థ్యం పెంపు తప్పనిసరి అని ఇంజనీర్లు నివేదికలో స్పష్టం చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కాకతీయ కాల్వ సామర్థ్యాన్ని పెంచి రెండో స్టేజ్ కాల్వలకు లింకు చేయాలంటే... మొదటి విడత కాల్వల సామర్థ్యం పెంచాలని సూచించారు. కొన్ని చోట్ల టన్నెల్ కింది భాగంలో లీకులున్నాయని, వాటిని నిర్మాణ సమయంలో రాయితో నిర్మించారని, వాటిని అధునాతన పద్ధతిలో తిరిగి నిర్మాణం చేయాలని పేర్కొన్నారు. కాకతీయ కాలువ 146 కిలోమీటర్ (జిల్లా సరిహద్దు) నుంచి 284వ కిలోమీటర్ (వర్ధన్నపేట మండలం ఇల్లంద) వరకు 94 కిలోమీటర్ల మేర సామర్థ్యం పెంచాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం కాల్వ సామర్థ్యం 8,500 క్యూసెక్కులని, దాన్ని 12,000 క్యూసెక్కులకు పెంచి, రెండో దశకు లింకు చేస్తే కాల్వ నీరు అందించవచ్చని వివరించారు. ఇప్పుడు కాల్వల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో 3,000 క్యూసెక్కుల నుంచి 3500 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నామని, ఆధునికీకరించిన తర్వాత పూర్తిస్థాయిలో ఇస్తామని ఇంజనీర్లు నివేదికలో పొందుపర్చారు. కాల్వల సామర్థ్యం పెంపునకు రూ. 600 కోట్లు అవసరమని లెక్కలేశారు. ఎస్సారెస్పీ కాకతీయ కాల్వ పరిధిలోని డీబీఎం-48లో 50వ కిలోమీటర్ నుంచి 83వ కిలోమీటర్ వరకు మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో 50 వేల ఎకరాలకు నీరిందించేందుకు కాల్వలను ఆధునికీకరించాలని నివేదించారు. ఇక్కడ కూడా కాల్వల నుంచి నీరు బయటకు లీకవుతోందని, షట్టర్ల ఏర్పాటు సరిగా లేదని పేర్కొన్నారు. ఇప్పుడు వాటిని ఆధునికీకరిస్తేనే నీటిని అందించగల్గుతామని స్పష్టం చేశారు. ఇందుకు మరో రూ. 38 కోట్లు అవసరమని నివేదికల్లో పొందుపరిచినట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. కొత్త కాల్వల నిర్మాణంపైనా... కాకతీయ కాల్వ నుంచి నర్సంపేట, పరకాల, భూపాలపల్లి ప్రాంతాల్లోని కొన్ని మెట్ట ప్రాంతాలకు ఎస్సారెస్పీ నీటిని అందించాలంటే కొత్తగా కాల్వల తవ్వకం చేపట్టాల్సి ఉంటుందని అధికారులు ప్రభుత్వానికిచ్చిన నివేదికలో పేర్కొన్నారు. కొత్త కాల్వలు నిర్మాణం చేసే ప్రాంతాలు, వాటి మ్యాపులను ప్రభుత్వానికి సమర్పించామని, ప్రభుత్వం సర్వేకు అనుమతిస్తే.. వెంటనే ప్రారంభిస్తామని ఎస్సారెస్పీ అధికారులు చెప్పారు. -
స్వర్ణోత్సవ శోభ వచ్చేనా!
బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు పునాది రాయి పడి నేటితో 51 ఏళ్లు పూర్తికాగా, 52వ వసంతం మొదలవుతోంది. 1963 జూలై 26న దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎస్సారెస్పీ నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. గతేడాది 50 ఏళ్లు పూర్తయిన వేళ స్వర్ణోత్సవాల నిర్వహణ కు పంచాయతీ ఎన్నికల కోడ్ అడ్డు తగి లిందని ప్రభుత్వం కుంటిసాకు చెప్పింది. అధికారులు స్వర్ణోత్సవ వేడుకలకు కావాల్సిన నిధుల కోసం ప్రతిపాదనలు పంపినప్పటికీ మోక్షం కలగలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనైనా కొత్త ప్రభుత్వం ప్రాజెక్టు స్వర్ణోత్సవం జరుపుతుం దని అందరూ ఊహించారు. అయితే అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గా నీ ఎలాంటి చర్యలు చేపట్టినదాఖలాలు కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద ప్రాజెక్ట్ ఎస్సారెస్పీ ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాలో 18 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తోంది. అలాంటి ప్రాజెక్ట్ పై ఇన్నాళ్లు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించారనే వచ్చిన విమర్శలు ఇక నుంచి కూడా కొనసాగనున్నాయి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఎస్సారెస్పీని పట్టించుకోవాలని ఆయక ట్టు రైతులు కోరుతున్నారు. స్వర్ణోత్సవ సంబురాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మాయని మచ్చ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో 2007-2010 వరకు జరిగిన పనుల్లో అవినీతి అక్రమాల పంచాయతీ ఎడతెగకుండా సాగడం ప్రాజెక్ట్ అభివృద్ధికే ప్రతి బంధకంగా మారింది. ఎస్సారెస్పీ కాలువల గైడ్ వాల్స్, కాలువల లైనింగ్ పనులు 2007-10 వరకు మూడేళ్లలో రూ. 278 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో డివిజన్-2 నుంచి 227 పనులు, డివిజన్ -5 నుంచి 406 పనులు, డివిజన్-1 నుంచి 1247 పనులు చేపట్టారు. అయితే పనుల్లో అక్రమాలు జరిగాయంటూ,పనులు చేయకుండనే బిల్లులు ఎత్తారని అనేక ఆరోపణాలు వచ్చాయి. దీంతో తీగా లాగితే డొంక కదిలింది. ఏసీబీ దాడులు, విజిలెన్స్ తనిఖీలు జరిగి ప్రాజెక్ట్ అధికారులను ఒక కుదుపు కుదిపాయి. 87 మంది ఇంజినీర్లు నోటీసులు అందుకోగా, 21 మంది ఇంజినీర్లు సస్పెండ్ అయ్యారు అయినా సమస్య తొలిగి పోలేదు. పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లు రాక గుండె పోటుతో మరణించినా, ఆపనుల తాలూకు బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం కరుణించడంలేదు. అందుకు కారణం పనుల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడమే! అధికారులు బంగారు గుడ్లు పెట్టే బాతుల ఎస్సారెస్పీని వాడుకున్నారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. వర్క్ ఆర్డర్ చేయడమంటే ప్రాజెక్ట్ అధికారులకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే చేయని పనులకు కూడ బిల్లులు అందించారని విమర్శలున్నాయి. ఫలితంగా శిక్ష కూడ అనుభవించారు. అయినా ఎస్సారెస్పీని ఆపనులు మచ్చలాగా వెంటాడుతునే ఉన్నాయి. చివరికి పనులు ఎంత వరకు నాణ్యతతో చేపడితే అంతవరకు కొలతలు చేసి బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ముందుగా బిల్లులు మంజూరైన కాంట్రాక్టర్ల నుంచి బిల్లులు రికవరీ చేయాలని లేదంటే క్రిమినల్ కేసులు పెడతామని మూడేళ్ల క్రితం నోటీసులు కూడ ఇచ్చింది. అయితే రికవరీ మాత్రం జరగలేదు. ఇతర పనులు కొలతలు జరగలేదు. దీంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆందోళన చె ందుతున్నారు.రెండేళ్ల క్రితం ఎల్ఎండీలో రూ. 30 లక్షల పనులు చేసి బిల్లులు అందక ఒక నీటి వినియోగ దారుల సంఘం అధ్యక్షుడు గుండె పోటుతో మృతి చెందాడు. కాగా ఎస్సారెస్పీ పనులు అంటేనే ప్రభుత్వాలకు విసుగు వచ్చేల అవినీతి జరిగిందని అంటున్నారు. దీంతో ఏపని చేపట్టినా నిధులు మంజూరు కావడం లేదంటున్నారు. ప్రస్తుతం ఒక పనికి అధికారులు అంచన విలువ తయారు చేసి ప్రతి పాదనలు పంపిణీ చేసేందుకు జంకుతున్నారు. బిల్లులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండటం వలన పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు సైతం ముందుకు రావడంలేదు. కొత్త ప్రభుత్వంలోనైన ఎస్సారెస్పీకి మహర్దశ పట్టాలని రైతులు కోరుతున్నారు. -
నెరవేరనున్న వైఎస్సార్ కల
ఖానాపూర్, న్యూస్లైన్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు దిగువనున్న సదర్మాట్ ఆనకట్టను ఫ్రెంచ్ ఇంజినీర్ జేజే ఒటాలే ఆధ్వర్యంలో 114 సంవత్సరాల క్రితం ఖానాపూర్ మండలం సుర్జాపూర్ పంచాయతీ పరిధి మేడంపల్లి శివారులోని గోదావరి నదిపై నిర్మించారు. ఈ ఆనకట్ట కాలువ ద్వారా కడెం, ఖానాపూర్ మండలాల్లో 26 గ్రామాల్లోని 15 వేల ఎకరాలకు అధికారికంగా, సుమారు 25 వేల ఎకరాలకు అనధికారికంగా నీరందుతోంది. అయితే ఇక్కడ నీటి నిల్వ సామర్థ్యంలేక వర్షాకాలంలో నీరంతా గోదావరిలోకి వృథాగా పోతోం ది. దీంతో ఆనకట్ట పరిధిలో ఖరీఫ్ మినహా మిగతా సీజన్లో సాగుకు అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ నీటి నిల్వ కోసం ఇక్కడ బ్యారేజీ నిర్మించాలని శతాబ్దకాలంగా రైతులు కోరుతున్నారు. బ్యారేజీ నిర్మిస్తే సుమారు 60 వేల ఎకరాలకు సాగునీరు అందడంతోపాటు ఖరీఫ్, రబీ సీజన్లలో కలిసి రెండు, మూడు పంటలు వేసుకునే వీలు కలుగుతుంది. ఇదే డిమాండ్తో శతాబ్దకాలంగా రైతులు, వివిధ సంఘాలు దశలవారీగా ఆందోళనలు నిర్వహించాయి. అయినా వీరి సమస్యను పట్టించుకునేవారు కరువయ్యారు. రైతుబాంధవుడి రాకతో.. 2008-09 ఉప ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పర్యటించారు. ఆ సమయంలో మండల రైతులు సదర్మాట్ బ్యారేజీ నిర్మించాలని వివిధ రూపాల్లో ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సదర్మాట్ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. స్పం దించిన వైఎస్సార్ రైతుల విజ్ఞప్తిని మన్నించి ఒకరోజు ఖానాపూర్లోనే బసచేశారు. మండల కేంద్రం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సదర్మాట్ను సందర్శించారు. బ్యారేజీ నిర్మాణంతో రెండు సీజన్లలో రైతులు పంటలు పండించుకునే వీలుందని గమనించిన ఆయన బ్యారేజీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. సర్వే చేసి ప్రతిపాదనలు పంపాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు బ్యారేజీ నిర్మాణానికి రూ.305 కోట్లు అవసరమని పేర్కొంటూ నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ మేరకు 2009 జనవరి 27న ఖానాపూర్ బ హిరంగ సభ కు వచ్చిన వైఎస్సార్ రూ.305 కోట్లతో బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన అకాల మరణానంతరం ఆర్థికశాఖ క్లియరెన్స్ లేక పనులకు టెండర్లు నిర్వహించలేదు. మళ్లీ విజ్ఞప్తులు.. సదర్మాట్ బ్యారేజీ పనులు ప్రారంభించాలని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బ్యారేజీ నిర్మాణానికి రూ.486.27 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. దీనికి అదనంగా ఐదుశాతం నిధులు కలిపి రూ.514 కోట్లతో అంచనాలు సమర్పించారు. ఎట్టకేలకు బుధవారం భారీ మధ్యతరహా నీటిపారుదలశాఖ మంత్రి సుదర్శన్రెడ్డి రూ.486.27 కోట్లు మంజూరు చేస్తూ జీవో నంబర్ 71 విడుదల చేశాడు. దీంతో బ్యారేజీ నిర్మాణంపై స్థానిక ప్రజల ఆశలు చిగురించాయి. పొన్కల్ వద్ద నిర్మాణం? సదర్మాట్ బ్యారేజీ నిర్మాణాన్ని నిర్మల్ నియోజకవర్గంలోని మామడ మండలం పొన్కల్ గ్రా మ సమీపంలో గోదావరి నదిపై నిర్మించనున్నా రు. గతంలో కేవలం కడెం, ఖానాపూర్ మండలాలకు కాలువ ద్వారా నీరందేది. బ్యారేజీ నిర్మాణం పూర్తయితే మామడ మండలంలోని గ్రామాలకు తాగునీటి సమస్య తీరడంతోపాటు భూగర్భజలాలూ పెంపొందనున్నాయి. దీంతో కడెం ప్రాజెక్టు ఫీడింగ్ సైతం పెరగడంతోపాటు జన్నారం మీదుగా లక్సెట్టిపేట వరకు సాగునీరందే అవకాశముందని అధికారులు పేర్కొం టున్నారు. బ్యారేజీ నిర్మిస్తే ఖరీఫ్, రబీలో పంట లు పండించొచ్చని ఈ ప్రాంత రైతులు ఆశిస్తున్నారు. ఇందుకు మూలకారకుడైన వైఎస్సార్కు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. -
తెలంగాణే లక్ష్యం
ఆర్మూర్, న్యూస్లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అభివృద్ధికి, రైతుల సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేస్తామన్నారు. రాష్ట్రం విడిపోయాక ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఒక్క సింగరేణిలోనే 50 వేల ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అదేవిధంగా వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటినుంచి పాలకులు తెలంగాణ ప్రాంత రైతుల గురించి ఏనాడూ ఆలోచించలేదు. అర్ధశతాబ్దం దాటినా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవడమే ఇందుకు నిదర్శ నం. సీమాంధ్రలో మాత్రం ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేశారు. తెలంగాణ ప్రాంత రైతాంగం కొట్లాడితే గాని పాలకులు స్పందించడం లేదు. ఆర్మూర్ ప్రాంత రైతులు దశాబ్దం పాటు పోరాడితే గుత్ప ఎత్తిపోతల పథకం నిర్మించారు. సమైకాంధ్రలో తెలంగాణ ప్రాంతంలోనే పసుపు పంట ఎక్కువగా పండిస్తారు. అందుకే పసుపు రైతుల గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఏళ్లుగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. సీమాంధ్రలో పండించే ప్రమాదకరమైన పొగాకు పంట కోసం మాత్రం ప్రభుత్వం 1975లో గుంటూరులో పొగాకు బోర్డు ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులున్నారు. వారి గోడును సీమాంధ్ర పాలకులు ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ కార్మికులు ఇతర రాష్ట్రాల యాజమాన్యాలతో కొట్లాడి తమ హక్కులను సాధించుకుంటున్నారు. లక్కంపల్లి సెజ్ భూములను రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు ఆ భూములను తిరిగి ఇవ్వాలి. ఆర్మూర్ ప్రాంత రైతులకు ఎర్రజొన్నల బకాయిల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. రైతులకు రావాల్సిన రూ.10 కోట్ల 83 లక్షలు ఇప్పిం చేందుకోసం కార్యాచరణ రూపొందిస్తాం. -
సాగు నీటి కోసం జాగారం
బాల్కొండ,న్యూస్లైన్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి కోసం ఆయక ట్టు రైతులు కాలువల వద్దనే పగలూ,రాత్రి కాపలా కాస్తున్నారు. తాము సాగు నీటి కోసం అవస్థలు పడుతుంటే పాలకులు మాత్రం ప్రాజెక్టు నుంచి పొరుగు జిల్లాలకు దర్జాగా సరఫరా చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లక్ష్మీ కాలువ ఆధారంగా నిర్మించిన వేంపల్లి, నవాబు ఎత్తిపోతల పథకం వద్ద ఈ పరిస్థితి నెలకొంది. సక్రమంగా నీటి పంపకాలు చేయడంలో అధికారులు విఫలం కావడంతో రైతులు కాలువ వద్ద టెంట్లు వేసుకుని మరీ కాపలా కాస్తున్నారు. తమ వంతు వచ్చే వరకూ ఎదురు చూస్తున్నారు. కాలువ వద్దనే టెంట్లు వేసుకుని జాగారం చేస్తున్నారు. వేంపల్లి ఎత్తి పోతల పథకం నుంచి నీటి పంపకాలను సక్రమంగా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో రైతుల మధ్య అవగాహన కుదరక వారు వంతుల వారీగా నీటి కోసం కాలువ వద్ద కాపలా కాస్తున్నారు. ఎత్తి పోతల నుంచి పది రోజుల పాటు నవాబు లిఫ్ట్కు నీరందించాలని అధికారులు నిర్ణయించారు. అదే కాలువకు ఉన్న మిగతా గ్రామాల ఆయకట్టు రైతులు తూం లను తెరవడం ద్వారా నీరు గమ్యానికి చేరడంలేదు. దీంతో నవాబు లిఫ్ట్ గ్రామాల రైతులు వంతుల వారీగా కాపలా కాస్తున్నారు. కాలువలు సైతం పూడికతో, ముళ్ల పొదలతో నిండి నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నవాబు లిఫ్ట్ గ్రామాలు నవాబు లిఫ్ట్ గ్రామాలు వేల్పూర్, లక్కోర, వెంకటాపూర్, అంక్సాపూర్, సాహెబ్పేట్ ,కుకునూర్, కోమన్పల్లి, అమీనాపూర్, దొన్కల్ గ్రామస్తులు కాలువ వద్ద అక్కడక్కడ ఎనిమిది చోట్ల గ్రామస్తులు నీటి కోసం వంతుల వారీగా కాపలా కాస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందుల నడుమ కాపలా కాస్తూ నీటిని నవాబు లిఫ్ట్కు చేర్చుతున్నారు. నీటి వినియోగదారుల సంఘాలు విఫలం నీటి పంపకాలపై రైతులకు అధికారులకు మధ్య సమన్వయపరచాల్సిన నీటి వినియోగదారుల సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో రైతులు నీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. వేంపల్లి లిప్ట్ రెండో యూని ట్ ఆధారంగా చెరువులు నింపే గ్రామాలకు వంతుల వారీగా నీటిని విభజించి చెరువులు నింపాలి. అలా ఒకరి వంతులో ఒకరు నీటిని వినియోగించుకోకుండా నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు మాట్లాడాలి. కాని వారి పదవీ కాలం కూడా దగ్గర పడటంతో రైతులను వారు పట్టించు కోవడం లేదనే విమర్శలున్నాయి. దీంతో రైతుల మధ్య విభేదాలు తలెత్తే పరి స్థితి ఏర్పండింది. నీళ్ల కోసం కొట్లాడుకునే పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పం దించాలని రైతులు కోరుతున్నారు. -
రబీ పంటలకు నీటి విడుదల
బాల్కొండ,న్యూస్లైన్ : ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్నుంచి రబీ పంటల కోసం సోమవారం అధికారులు నీటినివిడుదల చేశా రు. కాకతీయకాలువద్వారా ఉదయం రెండువే ల క్యూసెక్కులు వదిలిన అధికారులు సాయంత్రానికి మూడు వేల క్యూసెక్కులకు పెంచా రు. కాకతీయ కాలువ ద్వారా వారబందీ ప్రకారం పదిరోజులు నీటివిడుదల, ఐదు రో జులు నిలిపివేయాలని ప్రాజెక్ట్ నీటివిడుదల చే పట్టడానికి ప్రణాళిక రూపొందించినట్లు అధి కారులు పేర్కొన్నారు. ప్రాజెక్ట్నుంచి లక్ష్మీ కా లువ ద్వారా వంద క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతోంది. ప్రాజెక్ట్పూర్తి నీటి సామర్థ్యంతో నిండుకుండల ఉండటంతో ప్రాజెక్ట్ ఆయకట్టు మొత్తానికి రబీలో నీరందిస్తామని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ నుంచి సరస్వతి కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టలేదు. ప్రా జెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1090.90 అడుగుల నీరు నిల్వ ఉంది. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో రెండు టర్బయిన్ల ద్వారా 12 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని జెన్కో అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీపై పర్యాటకుల సందడి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్పై సోమవారం కూడా ప ర్యాటకుల తాకిడి కొనసాగింది. ప్రాజెక్ట్ సందర్శనకు అనేక మంది యువకులు వచ్చారు. డ్యాంపై స్నేహితులతోకలిసి ఫొటోలు దిగారు. -
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూడికపై ప్రారంభమైన సర్వే
భైంసా, న్యూస్లైన్ : జిల్లాలోని ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడికతో నీటినిల్వ సామర్థ్యం నానాటికి తగ్గుతోంది. స్వర్ణ, కడెం, సాత్నాల, వట్టి, గడ్డెన్న, కొమురం భీమ్, ఎన్టీఆర్ సాగర్, గొల్లవాగు, ర్యాలీవాగు ప్రాజెక్టులు జిల్లాలోనే ఉన్నాయి. ప్రధాన ప్రాజెక్టుగా చెప్పుకునే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) పరిధి కూడా జిల్లాలో ఉంది. మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఎస్సారెస్పీ ప్రాజెక్టులో భారీ స్థాయిలో పూడిక పేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1089.50 అడుగుల నీరు ఉంది. 112.02 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదలతో ప్రాజెక్టులో చెత్తాచెదారం చేరి నీటినిల్వ సామర్థ్యం 112.02 టీఎంసీల నుంచి 90.31 టీఎంసీలకు పడిపోయింది. దీంతో ప్రాజెక్టులో నీటినిల్వ సామర్థ్యం తగ్గి సాగు భూములకు నీరందని పరిస్థితి ఏర్పడుతోంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పిలుచుకునే శ్రీరాంసాగర్ జలాశయంలోకి ఏటా పూడిక వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై బాబ్లీ ప్రాజెక్టుతోపాటు మరో 11 ప్రాజెక్టులు నిర్మించింది. ఈ యేడు భారీ వర్షాలు ఉండడంతో ప్రాజెక్టులో నీరు కనిపిస్తుంది. వర్షాలు కురియకపోతే మహారాష్ట్ర ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టులు నిండే వరకు ఎస్సారెస్పీలోకి నీరు రాదు. అదేగనుక జరిగితే ఎస్సారెస్పీ ఎడారిగా మారుతుంది. ఇలాంటి తరుణంలో పేరుకుపోయిన పూడికను తొలగిస్తే ప్రాజెక్టుకు మహర్దశ చేకూరుతుంది. లేదంటే మహారాష్ట్ర నిర్మించే ప్రాజెక్టుల నుంచి ఏటా చెత్తాచెదారం వచ్చి చేరి రైతులకు సాగుకు కష్టమవుతుంది. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ, లక్ష్మీ, సరస్వతీ కాలువల ద్వారా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోని 18 లక్షల ఎకరాలు సాగు నీరు అందుతుంది. ఈ జిల్లాలకు తాగునీరు కూడా అందిస్తుంది. పూడికపై సర్వే.. ఎస్సారెస్పీ పూడికపై ఎట్టకేలకు సర్వే ప్రారంభమైంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టులను నిలువరించకపోయిన సర్కారు పూడిక సర్వేను ప్రారంభించేందుకు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం సోమవారం బాసరకు చేరుకుంది. మంగళవారం బాసరలోని గోదావరినదిలో పూడికపై ఈ బృందం సర్వే ప్రారంభించింది. ఏపీ ఇంజినీరింగ్ రిసెర్చ్ లేబోరేటరీ హైదరాబాద్ బృందం సభ్యులు పాల్గొంటున్నారు. డీఈఈ ఉమాదేవి సారథ్యంలో 12 మంది బృందం సభ్యులు సర్వే నిర్వహిస్తున్నారు. మొదటిరోజు ప్రత్యేకంగా తీసుకొచ్చిన బోటింగ్ ద్వారా గోదావరిలో సర్వే నిర్వహించారు. బాసర చుట్టు పక్కల నదిపరీవాహక ప్రాంతంలో ఈ బృందం సర్వే నిర్వహిస్తుంది. ప్రత్యేక బోటు ప్రయాణిస్తున్న ప్రాంతాల్లో ఐదు మీటర్ల లోతులోని ఛాయాచిత్రాలను శాటిలైట్ ద్వారా తీసుకుని ల్యాబ్కు పంపించనున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. మొదటి రోజు కావడంతో కొంత ఆలస్యంగానే సర్వే ప్రారంభించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే 20 రోజుల్లోనే సర్వే పూర్తి చేసుకుని ల్యాబ్కు వెళ్లి సంబంధిత వివరాలు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుంచి పోచంపాడు వరకు ఈ బృందం పూడికపై సర్వే చేపట్టనుంది. నాలుగోసారి అధికారుల సర్వే.. ఎస్సారెస్పీ పూడికపై నాలుగోసారి అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. 1984లో హైడ్రోగ్రాఫిక్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం నీటి సామర్థ్యం 112.02 టీఎంసీలు ఉంది. 1994లో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ రిసెర్చ్ లేబోరేటరీ నివేదిక ప్రాజెక్టులో 21.17 టీఎంసీల పూడిక పేరుకుపోయిందని నిర్ధారించింది. దీంతో నీటిమట్టం 90.13 టీఎంసీలకు పడిపోయింది. 2006లో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ రిసెర్చ్ లేబోరేటరీ మరోసారి చేసి ప్రాజెక్టులో 32.06 టీఎంసీల పూడిక పేరుకుపోయిందని ధ్రువీకరించింది. ఈ సర్వే నమ్మశక్యంగా లేదని అధికారులు రీ సర్వే కోసం 2008లో ప్రతిపాదనలు పంపించారు. దీనిపై ఇప్పటివరకు స్పందన రాలేదు. ప్రస్తుత నీటి సామర్థ్యం 90 టీఎంసీలుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వారి లెక్కట ప్రకారమే 22 టీఎంసీల నీటి సామర్థ్యం తగ్గినట్టు తెలుస్తోంది. 2013లో మరోసారి సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే చేపట్టాక అధికారులు ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పూడిక తొలగిస్తేనే ఉత్తర తెలంగాణ కష్టాలు తీరుతాయి. లేదంటే ఇప్పుడు చేపట్టే సర్వే కూడా కాగితాలకే పరిమితం అవుతుంది. ప్రాజెక్టులో ఉన్న పూడికతో ఈయేడు భారీ వర్షాలు కురిసినా గేట్లు ఎత్తి బయటకు వదిలేశారు. సర్కారు మేల్కొని ప్రాజెక్టులో పూడిక తీయిస్తే మరింత నీటి నిల్వలు ఈ రబీ సీజన్లో రైతులకు ఉపకరించేవి. రైతుల భూములు సస్యశ్యామలం అయి ఉండేవి. -
అయ్యో..సరస్వతీ..
నిర్మల్, న్యూస్లైన్ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తమ విలువైన భూములు, ఇళ్లు కోల్పోయారు జిల్లా వాసులు. అలాంటి జిల్లావాసుల భూములకు నీరందించే సరస్వతీ కాలువ అధ్వానంగా మారింది. ప్రధాన కాలువతోపాటు డిస్ట్రిబ్యూటరీలు దెబ్బతినగా, పిల్లకాలువలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. దీంతో ఏటా చివరి ఆయకట్టు రైతాంగానికి నీరందడం లేదు. పుష్కలంగా నీరు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగాన ఉన్న మహారాష్ట్రలో, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఆశించిన స్థాయిలో వర్షాలు కురియడంతో జలాశయం నీటితో కళకళలాడింది. ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన నాడే ప్రాజెక్టు గేట్లు ఎత్తి మిగులు జలాలు గోదావరిలోకి వదిలారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అడపాదడపా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో నీరు ఉంటూ వచ్చింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో అంటే 1091 అడుగులు ఉంది. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని భూములకు రబీలో పుష్కలంగా నీరందే అవకాశాలు ఉన్నాయి. అధ్వానం.. ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నా జిల్లా రైతాంగానికి మాత్రం అది అందని ద్రాక్షగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. దీనికి ప్రధాన కారణం జిల్లా రైతాంగ భూములకు నీరందించే సరస్వతీ కాలువే. నిర్మల్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం మండలాల్లో మొత్తం 47 కిలోమీటర్ల పొడవుతో 28 డిస్ట్రిబ్యూటరీలు కలిగి 35వేల ఎకరాలకు సాగునీరందించడంతోపాటు దాదాపు 52 చెరువులు నింపే సరస్వతీ కాలువ అధ్వానంగా మారింది. ప్రధాన కాలువతోపాటు, డిస్ట్రిబ్యూటరీలు దెబ్బతినగా పిల్లకాలువలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని అనవాళ్లు లేకుండా పోయాయి. లక్ష్మణచాంద మండలం బాబాపూర్, వడ్యా ల్, వెల్మల్ నుంచి నర్సాపూర్(డబ్ల్యు) వరకు, మామడ మండలం కొరిటికల్, చందారం, నల్దుర్తిల వద్ద ప్రధాన కాలువ, లక్ష్మణచాంద మండలం మల్లాపూర్, కొరిటికల్ వద్ద డిస్ట్రిబ్యూటరీలు దెబ్బతిన్నాయి. ఇక పిల్లకాలువలు శిథిలావస్థకు చేరుకొని ఆనవాళ్లు లేకుండాపోయాయి. శాశ్వత మరమ్మతు కరువు.. సరస్వతీ కాలువ మరమ్మతులు ఆరేడేళ్ల క్రితం చేపట్టారు. అయితే పనుల పర్యవేక్షణ సరిగా లేక చేసిన పనులు అధ్వానంగా మారాయి. దీంతో భారీ వర్షాలకు తోడు, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వంటి వాటి వల్ల ప్రధాన కాలువ కోతకు గురవుతోంది. గతంలో మామడ మండలం చందారం వద్ద, కొరిటికల్ వద్ద, లక్ష్మణచాంద మండలం బాబాపూర్ వద్ద, నిర్మల్ మండలం సోఫీనగర్ శివారులో ప్రధాన కాలువ కోతకు గురైంది. దీంతో కాలువ కింద ఉన్న పంట భూముల్లోకి నీరంతా వెళ్లి దెబ్బతిన్నాయి. ఇక కోతకు గురైన చందారం, కొరిటికల్ వద్ద పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టలేదు. తాత్కాలికంగా సంచులు వేసి పనులు కానిచ్చేశారు. ఏటా చివరి ఆయకట్టుకు ప్రశ్నార్థకమే.. ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీలతోపాటు పిల్లకాలువలు దెబ్బతినడంతో ఏటా చివరి ఆయకట్టు రైతాంగానికి నీరందడం ప్రశ్నార్థకంగా మారింది. లక్ష్మణచాంద మండలం పార్పెల్లి, చామన్పల్లి, మాచాపూర్, ధర్మారం గ్రామాల రైతులకు కాలువలు సక్రమంగా లేక నీరందడం లేదు. దీంతో రైతులు తీవ్ర వేదనలో పడిపోతున్నారు. మామడ మండలం పొన్కల్ గ్రామ రైతులైతే తమ పంటపొలాలకు నీరందించుకునేందుకు రేయింబవళ్లు కాలువ వద్దే ఉంటూ నీటిని మళ్లించుకునే పరిస్థితి ఎదురవుతోంది. ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్నా పంట పొలాలకు మాత్రం నీరందకపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువలు ఇలా ఉండడంతో ఈ రబీలో కూడా రైతులకు మళ్లీ కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. దెబ్బతిన్న కాలువలకు మరమ్మతులు చేయించి రబీలో తమ పంటపొలాలకు నీరందించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని తమ కష్టాలను గట్టెక్కించాలని రైతులు కోరుతున్నారు. -
మళ్లీ పెరుగుతున్న గోదావరి
వాజేడు,న్యూస్లైన్: గోదావరి వరద మరోసారి ఉధృతంగా పెరుగుతోంది. ఎగువనున్న శ్రీరామ్సాగర్ నుంచి వరదనీరు విడుదల చేస్తుండడంతో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. గోదావరి ఎగపోటు కారణంగా మండల పరిధిలోని చీకుపల్లి వద్ద రహదారిపైకి వదర నీరు చేరింది. ఆదివారం ఉదయం 6 గంటలకు రహదారిపైకి వరద నీరు చేరటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చప్టాకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. చీకుపల్లివాగుకు అవతలిపై వైపు ఉన్న 25 గ్రామాలకు రాకపోకలు స్తంభిం చాయి. నాటుపడవలు ఏర్పాటు చేసి ప్రయాణికులను తరలిస్తున్నారు. కొందరు వరదనీటి నుంచే దాటుతున్నారు. కూలీలను ట్రాక్టర్ల ద్వారా దాటించారు. గోదావరికి ఎగువ ప్రాం తం నుంచి వరద నీరు ఇంకా వస్తుండటంతో మరింత పెరిగే అవకాశం ఉంది. ఆదివారం రాత్రి మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి నీటి మట్టం 9.750 మీటర్లుగా ఉంది. గోదావరి ఉధృతితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
‘కాకతీయ’కు నిలిచిన నీటి విడుదల
బాల్కొండ, న్యూస్లైన్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా అధికారులు ఆదివారం నీటి విడుదలను నిలిపి వేశారు. ఆయకట్టుకు నీటి అవసరం లేకపోవడంతో ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 6 రోజులు నీటి విడుదల నిలిపివేత, 9 రోజులు విడుదల కొనసాగించేల అధికారులు నిర్ణయించారు. ప్రాజెక్ట్ నుంచి సరస్వతి కాలువ ద్వారా 550 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుంది. కాలువల ద్వారా నీటి విడుదల నిలిచి పోవడంతో ప్రాజెక్ట్ నీటి మట్టం నిలకడగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1090.70 అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు. నిలిచిన విద్యుదుత్పత్తి.. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల నిలిచిపోవడంతో ప్రాజెక్ట్ వద్ద ఉన్న జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15.24 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందని జెన్కో అధికారులు తెలిపారు. నిలకడగా రామడుగు ప్రాజెక్ట్ నీటిమట్టం ధర్పల్లి : మండలంలోని రామడుగు ప్రాజెక్ట్ నీటి మట్టం నిలకడగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1278.50 అడుగుల వద్ద ఉంది. ఎగువ ప్రాంతం నుంచి స్వల్పంగా 100 క్యూసెక్కులు ఇన్ఫ్లో కొనసాగుతుంది. కుడి కాలువ ద్వారా 100 క్యూసెక్కుల సాగునీటిని వదులుతున్నారు. దీనికింద వాడి, చెంగల్, పచ్చల నడ్కుడ చెరువుల్లోకి నీటిని నింపుతున్నారు. ఎడుమ కాలువ ద్వారా కలిగోట్ గ్రామ చెరువును నింపుతున్నారు. 20 క్యూసెక్కూల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ ఆయకట్టు కింద చెరువులను నింపేందుకు కుడి, ఎడుమ కాలువల ద్వారా నీటిని వదులుతున్నట్లు ఇరిగేషన్ ఏఈ దేవేందర్ తెలిపారు. -
ఎస్సారెస్పీకి భద్రత పెంచుతాం ఎస్పీ మోహన్రావు
బాల్కొండ, న్యూస్లైన్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భద్రత పెంచుతామని ఎస్పీ మోహన్రావు పేర్కొన్నారు. పర్యాటకులకు భద్రత కల్పించడంలో పోలీసుల వైఫల్యంపై సోమవారం ‘సాక్షి’లో ‘విహారం.. ఓ విషాదం’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎస్పీ శుక్రవారం ప్రాజెక్టు వద్ద ఉన్న సబ్ కంట్రోల్ బూత్ను తనిఖీ చేశారు. పర్యాటకులు ప్రమాదకర స్థలాలకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు ఆయన ఫ్లడ్ కంట్రోల్ రూంలో ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. భద్రత సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. డ్యాంపై కలియ తిరిగి భద్రతను పరిశీలించారు. అనంతరం సబ్ కంట్రోల్ బూత్ వద్ద విలేకరులతో మాట్లాడా రు. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా సిబ్బంది సంఖ్యను పెంచుతామన్నారు. ప్రధానంగా ఖరీఫ్ సీజన్ లో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటుందని, దీంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చే రోజుల్లో భద్రత సిబ్బందిని పెంచుతామన్నారు. ఎస్సారెస్పీకి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ను నియమించాలని ప్రభుత్వానికి నివేదిక పంపామని తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నట్లుగా ఎస్సారెస్పీకి కూడా భద్రత కల్పించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. సబ్కంట్రోల్ రూం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెట్రోలింగ్ పెంచుతాం.. ప్రాజెక్టు ఆనకట్టపై అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడానికి పెట్రోలింగ్ పెంచనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఆనకట్టపై మద్యం సేవించే, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరెస్టు చేసి, కేసులు నమోదు చేయాలని ఆదేశించామన్నారు. జలవిద్యుదుత్పత్తి కేంద్రం సందర్శన ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న జలవిద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఎస్పీ సందర్శించారు. విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న తీరును పరిశీలించారు. టర్బయిన్ల గురించి తెలుసుకున్నారు. ఆయన వెంట ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ నరేశ్, ఏఈలు భోజదాసు, ర వీందర్, జెన్కో ఏడీ కిషోర్కుమార్, ఏఈ సతీశ్, ఆర్మూర్రూరల్ సీఐ సంక్రాంతి రవికుమార్, ఎస్సై ప్రతాప్ లింగం తదితరులున్నారు