Textbooks
-
ఇంకా అందని పుస్తకం.. మొదలవ్వని పాఠం
పాఠశాలలు ప్రారంభించి 15 రోజులవుతోంది. ప్రైవేటు స్కూళ్లలో ఇప్పటికే కొన్ని చాప్టర్లకుసంబంధించిన పాఠాలు పూర్తయ్యాయి. కానీ వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఇప్పటివరకు కనీసం ఒక్క పాఠం కూడా ఉపాధ్యాయులు బోధించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 26 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలుంటే... ఇప్పటికీ 15 వేలకు పైగా స్కూళ్ళలో ఇప్పటికీ పాఠాలు మొదలవ్వలేదు. పాఠ్య పుస్తకాలు అందకపోవడంతో జూలై నెల ప్రారంభమైనా ఇంకా పునఃశ్చరణకే పరిమితం అవ్వాల్సి వస్తోంది. –సాక్షి, హైదరాబాద్ హెచ్ఎంలకు బిల్లులు ఇవ్వకపోవడంతో.. వాస్తవానికి స్కూళ్ళు తెరిచేలోగా పుస్తకాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు తగ్గట్టుగానే పుస్తకాల ముద్రణపైనా దృష్టి పెట్టారు. ముద్రణ పూర్తయిన పుస్తకాలను స్కూళ్ళు తెరిచేలోగానే జిల్లా కేంద్రాలకు పంపారు. కానీ వాటిని వేసవి సెలవులు ముగిసేలోగా స్కూళ్ళకు చేరవేయడంలో సర్కారు విఫలమయ్యింది. ప్రతి ఏటా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు జిల్లా కేంద్రాల నుంచి స్కూళ్ళకు పుస్తకాలు చేరవేసే వాళ్ళు. ఇందుకయ్యే రవాణా ఖర్చులను ప్రభుత్వం భరించేది. అయితే గత ఏడాదికి సంబంధించిన బిల్లులు ఏడాది గడిచినా ఇవ్వకపోవడంతో హెచ్ఎంలు ఈ ఏడాది మొండికేశారు. దీంతో కొద్దిరోజుల క్రితం వరకు పుస్తకాలన్నీ జిల్లా కేంద్రాల్లోనే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో రవాణా కోసం ప్రత్యేకంగా టెండర్లు పిలవాలని విద్యాశాఖ ఆదేశించినా, ఈ ప్రక్రియ కూడా చాలా ఆలస్యం అయ్యింది. టెండర్ల ఖరారులో ఆలస్యం.. పుస్తకాలను స్కూళ్లకు రవాణా చేసేందుకు ప్రతి జిల్లా డీఈవో పరిధిలో టెండర్లు పిలిచారు. అయితే స్కూళ్ళు తెరిచిన తర్వాత టెండర్లు పిలవడంతో వాటిని ఖరారు చేసేవరకే జూన్ నెలాఖరు అయ్యింది. ఈ కారణంగానే రాష్ట్రంలోని సగానికిపైగా స్కూళ్లకు పాఠ్య పుస్తకాలు అందలేదు. పుస్తకాల రవాణా పూర్తి చేసేందుకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని టెండర్లు దక్కించుకున్న సంస్థలు చెబుతున్నాయి. పంపిణీ పూర్తయినా కొరతే.. రాష్ట్రవ్యాప్తంగా 28,77,675 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నారు. వీరికి ఉచితంగా పుస్తకాలు అందించాల్సి ఉంటుంది. సబ్జెక్టులు, లాంగ్వేజీలు కలిపి 1,63,78,607 పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. గత ఏడాది ముద్రించినవి పోను, 1,57,48,270 పుస్తకాలు అందించాల్సి ఉంది. ఇప్పటివరకు 1,35,85,185 పుస్తకాలు ముద్రించి, జిల్లా కేంద్రాలకు కూడా చేరవేశారు. ఇంకా 14 శాతం పుస్తకాలు ముద్రించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న వాటి పంపిణీ పూర్తి చేసినా, కొన్ని స్కూళ్ళకు పుస్తకాల కొరత తప్పేట్టు లేదు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు వచ్చే నెలాఖరు వరకూ కూడా పుస్తకాలు అందే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. రెగ్యులర్ క్లాసులు మొదలు పెట్టాలి.. పుస్తకాల పంపిణీ ఆలస్యమై ఇప్పుడిప్పుడే పాఠశాలలకు చేరుతుండటంతో.. ప్రస్తుతం చాలావరకు ప్రాథమిక పాఠశాలల్లో గతేడాది మొదలు పెట్టిన తొలిమెట్టు కార్యక్రమం కొనసాగుతోంది. ప్రాథమికోన్నత పాఠశాలలు, హైస్కూల్స్లో పునఃశ్చరణ చేస్తున్నారు. కోవిడ్ కాలంలో జరిగిన అభ్యసన నష్టాన్ని పూడ్చడం కోసం ఈ ప్రక్రియ అనివార్యమని విద్యాశాఖ భావించింది. అయితే దీన్ని అదనపు గంటల్లో చేపట్టి, రెగ్యులర్ క్లాసులు మొదలు పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
TS: పాఠశాలకు చేరని ‘పాఠాలు’!
సాక్షి, హైదరాబాద్: స్కూళ్లు తెరిచేలోగా పాఠశా లలకు పాఠ్య పుస్తకాలు చేరుస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన కార్యాచరణకు ఆమడ దూరంలో ఉంది. మరో రెండురోజుల్లో స్కూళ్లు తెరుస్తున్నా ఇప్పటివరకు ఒక్క పుస్తకం కూడా పాఠశాళలకు చేరలేదు. ముద్రణ పూర్తయిన పుస్తకాలు ఎక్కడిక క్కడే ఉండిపోయాయి. వాటిని విద్యార్థులకు అందించే బాధ్యత హెచ్ఎంలదే అని విద్యాశాఖ చెబుతుండగా తమకేం సంబంధం లేదని హెచ్ఎంలు స్పష్టం చేస్తుండటంతో పుస్తకాలు జిల్లా కేంద్రాల్లోనే మగ్గుతున్నాయి. పుస్తకాలను గుట్టలుగా పడేయడంతో కొన్నిచోట్ల ఎలుకలు కొడుతున్నాయి. సరైన సదు పాయం లేని స్కూళ్లలో వర్షం వస్తే తడిసిపోయే ప్రమాదముందని అంటున్నారు. ఈ నెల 12న స్కూళ్లు తెరుచుకోనుండగా ఇప్పుడు హడావుడి చేసినా నెలాఖరుకు కూడా వాటిని పంపడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 100 శాతం పూర్తికాని ముద్రణ విద్యాశాఖ అడకమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 15 నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు ప్రారంభించాలి. రాష్ట్రవ్యాప్తంగా 28,77,675 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నారు. వీరికి ఉచితంగా పుస్తకాలు అందించాల్సి ఉంది. సబ్జెక్టులు, లాంగ్వేజీలు కలిపి 1,63,78,607 పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. గత ఏడాది ముద్రించినవి పోను, ఇంకా 1,57,48,270 పుస్తకాలు అందించాలి. ఇందులో ఇప్పటివరకు 1,35,85,185 పుస్తకాలు ముద్రించారు. వీటిని జిల్లా కేంద్రాలకూ చేరవేశారు. ఇంకా 14 శాతం పుస్తకాల ముద్రణ పూర్తి కావలసి ఉండటంతో.. ఇప్పుడున్నవి పంపిణీ చేసినా, కొన్ని స్కూళ్ళకు పుస్తకాల కొరత ఏర్పడనుంది. రవాణా టెండర్లు ఏమయ్యాయి? ముద్రణ అనంతరం జిల్లా కేంద్రాలకు చేరిన పుస్తకా లను హెచ్ఎంలు తమ పాఠశాలలకు తీసుకు వెళతారు. ఇందుకయ్యే ఖర్చంతా ముందుగా హెచ్ఎంలే భరించి ఆ తర్వాత విద్యాశాఖకు బిల్లులు పెట్టి తీసుకుంటారు. అయితే గత రెండేళ్లుగా బిల్లులు రాలేదని హెచ్ఎంలు అంటున్నారు. ఈ కారణంగా వారు పుస్తకాలు తీసుకెళ్లట్లేదు. దీంతో పుస్తకాల రవా ణాకు టెండర్లు పిలవాలని పాఠశాల విద్య డైరెక్టర్ ఇటీవల అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. టెండర్లు ఆహ్వానించే గడువు కూడా ఈ నెల 15 వరకూ పెట్టారు. అయితే ఇప్పటివరకు ఒకటి, రెండు జిల్లాల్లో తప్ప ఎక్కడా టెండర్లు పిలవలేదు. దీంతో టెండర్లు దాఖలయ్యేదెప్పుడు? ఖరారు చేసేదెప్పుడు? టెండర్ దక్కించుకున్న సంస్థ పుస్తకాలు చేరవేసేదెప్పుడు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బడులు తెరిచాక పుస్తకాలు అందించకపోతే పిల్లలకు పాఠాలు చెప్పేదెలా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పుస్తకాలు లేకుంటే ఎలా..? పుస్తకాల చేరవేతకు టెండర్లు పిలవమని ఉన్నతాధికారులు చెప్పినా, అది అమలుకు నోచుకోవడం లేదు. జూన్ 12న స్కూళ్ళు తెరిచేలోగా పుస్తకాలు అందకపోతే బోధనకు ఇబ్బంది అవుతుంది. డీఈవోలు తక్షణమే ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేయాలి. వంద శాతం పుస్తకాలు ఉంటేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. –పి.రాజా భానుచంద్ర ప్రకాశ్ (తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు) -
కొత్త పాఠాలు.. కొంగొత్త విషయాలు
సాక్షి, అమరావతి: నూతన జాతీయ కరిక్యులమ్ ఫ్రేమ్వర్కు– 2020 ప్రకారం పాఠశాల విద్యలో పాఠ్యాంశాల సవరణ ప్రక్రియను జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) చేపట్టింది. 2024–25 విద్యా సంవత్సరం నుంచి నూతన పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెస్తోంది. ‘నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)కి అనుగుణంగా సవరించిన కొత్త పాఠ్యాంశాలు ఉంటాయని ఎన్సీఈఆర్టీ ప్రకటించింది. కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పాఠ్య పుస్తకాల రూపకల్పనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్సీఈఆర్టీ వినియోగిస్తోంది. విద్యా సంస్థలు తెరిచి ఉన్నా, తెరవలేని పరిస్థితులు వచ్చినా అభ్యసనకు ఆటంకం లేకుండా పాఠ్య పుస్తకాలను రూపొందిస్తోంది. కొత్త పుస్తకాలు ప్రింటుతో పాటు డిజిటల్ రూపంలోనూ అందుబాటులో ఉంటాయని ఎన్సీఈఆర్టీ వివరించింది. ఎవరైనా వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత 2024–25 విద్యా సంవత్సరం నుంచి అన్ని స్థాయిల్లోని పాఠశాల విద్యార్థులకు కొత్త పాఠ్య పుస్తకాలను ఎన్సీఈఆర్టీ రూపొందిస్తోంది. ఇప్పటివరకు ఎన్సీఈఆర్టీ ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో మాత్రమే పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. ఇప్పుడు 22 భారతీయ భాషల్లో వీటిని అందించనుంది. జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం 5వ తరగతి వరకు మాతృ భాషల్లో బోధన సాగాలన్న నిబంధనను అనుసరించి ప్రీప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు 22 భారతీయ భాషల్లో స్టడీ మెటీరియల్ను బాలలకు అందించనున్నట్లు ఎన్సీఈఆర్టీ వివరించింది. ఈ పుస్తకాలు ప్లే బుక్ల మాదిరిగా, నాటక ఆధారితంగా రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ఈ పుస్తకాలు ప్లే–వే పద్ధతిలో ఉంటాయి. విద్యార్థుల్లో సమస్యలను పరిష్కరించే మెళకువలు, సామాజిక భావోద్వేగ సామర్థ్యాలను పెంపొందించేలా వీటిని రూపొందిస్తోంది. ఇప్పటికే ప్రీ–సూ్కల్ నుండి 2వ తరగతి వరకు పుస్తకాల రూపకల్పనకు కరిక్యులమ్ ఫ్రేమ్వర్కును ఎన్సీఈఆర్టీ విడుదల చేసింది. ఇతర తరగతుల కోసం ఫ్రేమ్వర్క్ను రూపొందిస్తోంది. ప్రైవేటు పబ్లిషర్లకూ ఎన్ఈపీ మార్గదర్శకాలు ప్రైవేటు పబ్లిషర్లు ముద్రించే వివిధ విద్యా సంబంధిత పుస్తకాలు జాతీయ విద్యా విధానాని (ఎన్ఈపీ)కి అనుగుణంగా ఉండేలా ఎన్సీఈఆర్టీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొన్ని ప్రైవేటు పబ్లిషర్లు ప్రీసూ్కల్, 1, 2 తరగతుల పుస్తకాలను ఎన్ఈపీకి అనుగుణంగా రూపొందిస్తున్నట్లు వివరించింది. మిగతా పబ్లిషర్లు కూడా ఎన్ఈపీ మార్గదర్శకాల ప్రకారం పుస్తకాలు ప్రచురిస్తున్నారా? లేదా అనే విషయాన్ని ఎన్సీఈఆర్టీ పరిశీలిస్తోంది. -
స్కూళ్లలో ఇకపై రెండు సెమిస్టర్ల విధానంలో పాఠ్య పుస్తకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాఠశాలల విద్యార్థులకు అందించే పాఠ్య పుస్తకాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి 2 సెమిస్టర్ల విధానంలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2023 – 24 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 9 వ తరగతి వరకు ఈ పాఠ్య పుస్తకాలు అందిస్తారు. 2024 – 25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులకు కూడా ఇదే విధానంలో పాఠ్య పుస్తకాలు అందుతాయి. వీటిని మిర్రర్ ఇమేజ్లో బైలింగ్యువల్ (ద్విభాషా) విధానంలో ముద్రించి ఇస్తారు. ఇలా రెండు సెమిస్టర్ల విధానంలో పుస్తకాలు ఇవ్వడం వల్ల విద్యార్థుల బ్యాగు బరువు సగం మేర తగ్గుతుంది. విద్యార్థులు కూడా సులభంగా చదువుకోవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం పాఠశాల విద్యలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎస్సీఈఆర్టీ దశలవారీగా సిలబస్, పాఠ్య పుస్తకాలను సవరిస్తోంది. దీని కోసం దేశ, విదేశాల్లో ఉన్నత విధానాలపై అధ్యయనం చేసింది. ఎన్సీఈఆర్టీ, ఇతర రాష్ట్ర బోర్డుల పాఠ్యాంశాలు, సిలబస్ను సమగ్రంగా అధ్యయనం చేసి ఉన్నత ప్రమాణాలతో కూడిన సంస్కరణలు తీసుకువచ్చారు. 2020 – 2021 విద్యా సంవత్సరం నుండి ’ట్రైమెస్టర్ (మూడు) సిస్టమ్తో ద్విభాషా ఆకృతిలో 1 నుండి 5వ తరగతులకు పాఠ్యపుస్తకాలను, రెండు సెమిస్టర్ విధానంలో 6వ తరగతి పాఠ్య పుస్తకాలను అందించారు. 7, 8 తరగతులకు కూడా 2021 – 22 విద్యా సంవత్సరం నుండి రెండు సెమిస్టర్ విధానంలో పుస్తకాలు ఇచ్చారు. అయితే, వివిధ వర్గాలు, నిపుణుల అభిప్రాయాలను అనుసరించి క్షేత్ర స్థాయిలో కూడా పరిశీలన చేసి టర్మ్ ఆధారిత సిలబస్ పాఠ్య పుస్తకాలలో ఏకరీతి నమూనాను అనుసరించాలని ఎస్సీఈఆర్టీ ఓ నివేదిక ఇచ్చింది. ఈ విధానం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. ఎస్సీఈఆర్టీ నివేదిక అన్ని తరగతులకు రెండు సెమిస్టర్ల విధానంలో పాఠ్య పుస్తకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్ రెడ్డి శనివారం విడుదల చేసిన సర్క్యులర్లో వివరించారు. రెండు సెమిస్టర్ల పుస్తకాలను ఒకేసారి పాఠశాలలు తెరిచే రోజునే విద్యార్థులకు పంపిణీ చేస్తారు. -
పాఠం స్కాన్ చేసేయొచ్చు.. మళ్లీ మళ్లీ వినొచ్చు
సాక్షి, ప్రత్తిపాడు(గుంటూరు జిల్లా): ఒక్క స్కాన్తో పాఠం మళ్లీమళ్లీ వినొచ్చు. దృశ్యరూపంగానూ వీక్షించొచ్చు. అవగతమయ్యే వరకు వినొచ్చు. చూడొచ్చు. అవును ప్రభుత్వం పాఠ్యాంశాల బోధనలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాఠ్యపుస్తకాలకు క్యూఆర్ కోడ్ హంగులు అద్దింది. దీనివల్ల పిల్లలు పాఠ్యాంశాలను ఇళ్ల వద్ద కూడా అర్థమయ్యేవరకూ వినొచ్చు. చూడొచ్చు. గతంలో ఎన్నో ఇబ్బందులు గతంలో విద్యార్థులు తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం అర్థం కాకపోతే చాలా గందరగోళానికి గురయ్యేవారు. ఏం చేయాలో పాలుపోక లోలోన కుమిలిపోయేవారు. అర్థం కాలేదని అడిగితే టీచర్ ఏమంటారోనని భయపడేవారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం క్యూఆర్ కోడ్తో పాఠ్యపుస్తకాలను రూపొందించింది. ఒక్కో పాఠానికి ఒక్కో కోడ్.. గుంటూరు జిల్లాలో 1,113 పాఠశాలలు ఉండగా 1,35,871 మంది విద్యార్థులు, పల్నాడు జిల్లాలో 1,631 పాఠశాలలు ఉండగా 2,12,025 మంది విద్యార్థులు, బాపట్ల జిల్లాలో 807 పాఠశాలలు ఉండగా 59,099 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికోసం సుమారు 25.56 లక్షలకుపైగా పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం దశలవారీగా అందించింది. గతంలో పాఠ్యపుస్తకం మొత్తానికి కలిపి ఒక్కటే క్యూ ఆర్ కోడ్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి పాఠం వద్ద క్యూ ఆర్ కోడ్ను ముద్రించింది. ఈ కోడ్ను స్మార్ట్ఫోన్తో స్కాన్ చేస్తే ఎంచక్కా డిజిటల్ పాఠాలను వినొచ్చు. చూడొచ్చు. దీక్ష యాప్ లేకున్నా.. తొలుత గణితం, భౌతిక, సాంఘిక శాస్త్రాల పుస్తకాలపైనే క్యూఆర్ కోడ్లు ముద్రించారు. అప్పట్లో దీక్ష యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని విద్యార్థి లేదా ఉపాధ్యాయుడు అనే ఆప్షన్ ఇచ్చి ఆ తర్వాత క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే పాఠం వచ్చేది. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని పాఠ్యపుస్తకాలపైనా కోడ్ను ముద్రించారు. ఇప్పుడు దీక్ష యాప్ లేకున్నా నేరుగా గూగుల్ లెన్స్ ద్వారా కోడ్ స్కాన్ చేసి పాఠ్యాంశాలు వినవచ్చు. ఎంతో ఉపయుక్తం క్యూఆర్ కోడ్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పునశ్చరణ సమయంలో బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. దృశ్యరూపంలో పాఠాలు వినడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటాయి. – సీహెచ్ వెంకటరెడ్డి, ఉపాధ్యాయుడు, బీవీఆర్ జెడ్పీ హైస్కూల్, ప్రత్తిపాడు కొత్తగా.. ఆసక్తిగా ఉంది క్లాస్ రూంలో టీచర్ చెప్పిన పాఠం అర్థం కాని సమయంలో ఈ క్యూర్ కోడ్ను స్కాన్ చేసి మళ్లీ పాఠం వినవచ్చు. ఇది మాకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. వీడియో రూపంలో పాఠాలు వినడం కొత్తగా, ఆసక్తిగా ఉంది. – గురుగూరి పూజ, 9వ తరగతి విద్యార్థిని, ప్రత్తిపాడు హైస్కూల్ -
ప్రైవేటు విద్యార్థులకు చౌకగా పాఠ్యపుస్తకాలు
సాక్షి, అమరావతి: ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్కుల పేరిట జరుగుతున్న దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం ముకుతాడు వేసింది. తల్లిదండ్రులపై ఏటా వేలాది రూపాయల భారం పడకుండా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థలకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్కులు తదితరాలను ప్రభుత్వమే ముద్రించి పంపిణీ చేసే విధానానికి ఈ విద్యా సంవత్సరం నుంచి శ్రీకారం చుట్టింది. అతి తక్కువ ధరకు నాణ్యతతో కూడిన పుస్తకాలను పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకు ఈ పాఠశాలల విద్యార్థులకు కావలసిన పుస్తకాలను ఆయా యాజమాన్యాలు ప్రైవేటు పబ్లిషర్ల నుంచి తీసుకొని అందించే విధానాన్ని గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేసింది. దీనివల్ల పబ్లిషర్లు, పాఠశాలల యాజమాన్యాలు ఎక్కువ ధరలకు పుస్తకాలను అమ్మి, తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు దండుకొనేవి. కొన్ని పాఠశాలల విద్యార్థులు షాపుల్లో అధిక ధరలకు కొనేవారు. కొన్ని కార్పొరేట్ పాఠశాలలైతే ఒకటో తరగతి నుంచే పాఠ్య పుస్తకాలకోసం రూ.5 వేల వరకు వసూలు చేసేవి. పై తరగతులకు వెళ్తున్నకొద్దీ ఈ వ్యయం రూ.10వేలకు పైనే ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య పుస్తకాలతో పాటు ఇతర పబ్లిషర్ల పుస్తకాలను కూడా ఈ స్కూళ్లు బలవంతంగా అంటగట్టేవి. ఈ పుస్తకాల నుంచి ఏదైనా బోధిస్తారా అంటే అదీ ఉండదు. ఆయా సంస్థలు రూపొందించే స్టడీ మెటీరియల్ను అనుసరించి బోధన, పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి మళ్లీ అదనంగా వసూలు చేస్తున్నారు. వీటన్నిటికీ ముకుతాడు వేస్తూ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్కులు ఉచితంగా అందిస్తోంది. ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థుల సంఖ్యను అనుసరించి ముందుగా ఇండెంటు తీసుకొని 1 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను ముద్రించింది. ప్రైవేటు పాఠశాలల్లో 24, 44,942 మంది విద్యార్థులుండగా వాటి నుంచి 18,02,879 మంది విద్యార్థులకు సరిపడా ఇండెంటు వచ్చింది. వీరికి ఆయా తరగతులు, టైటిళ్లు, వివిధ మాధ్యమాలకు సంబంధించి 1.83 కోట్ల పాఠ్యపుస్తకాలను విద్యా శాఖ, ప్రభుత్వ పాఠ్య పుస్తక విభాగం సిద్ధం చేశాయి. పంపిణీకి ఏర్పాట్లు చేపట్టాయి. తరగతులు, స్టూడెంట్లవారీగా సెట్ల కింద అందిస్తున్నాయి. స్కూళ్ల యాజమాన్యాలు నిర్దేశిత గేట్వే ద్వారా డబ్బులు చెల్లిం చగానే పుస్తకాలను ఎంఈవోల ద్వారా అం దిస్తారు. పాఠ్య పుస్తకాల ధరలను నిర్ణయిస్తూ శనివారం పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ జారీచేసింది. -
ఈ బరువును ఏం చేద్దాం?
స్కూల్లో టీచర్గానీ హెడ్మాస్టర్ గానీ ఎవరైనా పిల్లవాడి స్కూల్బ్యాగ్ వీపున తగిలించుకుని ఒక పదిహేను నిమిషాలు నిలబడగలరా? అన్నీ టెక్స్›్టలు అన్ని నోట్సులూ రోజూ తేవాలంటే పిల్లల వీపున పెరుగుతున్న బరువు ఎంత? టెక్ట్స్బుక్కుల పేజీలు పెరిగితే చదువు భారం. వీపున ఈ బరువు భారం. తల్లిదండ్రులు, న్యాయస్థానాలు పదే పదే చెప్పినా స్కూలు యాజమాన్యాలు మాత్రం ఈ బరువును పట్టించుకోవడం లేదు. పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ఈ బరువును ఏం చేద్దాం? నైట్ డ్యూటీ చేసి వచ్చే ఆ తండ్రి ఉదయాన్నే లేవక తప్పదు. ఇద్దరు కూతుళ్లను స్కూల్ బస్ ఎక్కించాలి. ఒకరు ఆరు, ఒకరు ఎనిమిది. వాళ్లు వెళ్లి ఎక్కగలరు. కాని వాళ్ల స్కూల్ బ్యాగులను మోస్తూ మాత్రం వెళ్లి ఎక్కలేరు. వాళ్ల ఇంటి నుంచి ఒక ఫర్లాంగు దూరంలో ఉన్న రోడ్డు మీద బస్సు ఆగుతుంది. సెకండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ నుంచి వాళ్లు బ్యాగులను మోసుకుంటూ బస్ దగ్గరకు వెళ్లి ఎక్కేసరికి వాళ్ల పని అయిపోతుంది. నాలుగు రోజులు ఇలా చేస్తే ఐదో రోజు ఒళ్లు నొప్పులు అని స్కూల్ ఎగ్గొడతారు. అందుకే తండ్రి లేచి ఆ స్కూల్ బ్యాగులను స్కూటర్ మీద పెట్టుకుని బస్ వరకు వెళ్లి ఎక్కిస్తాడు. మళ్లీ స్కూల్లో బస్ ఆగిన చోటు నుంచి క్లాస్ రూమ్ వరకూ వారు ఆ బ్యాగ్ మోయాల్సిందే. ఏం అంత బరువా? అనంటే ఆరో క్లాసు అమ్మాయి బ్యాగు బరువు 8 కిలోలు ఉంటుంది. ఎనిమిదో క్లాసు అమ్మాయి బ్యాగు బరువు పది కిలోలు ఉంటుంది. నిజం! వెన్ను వంచే బరువు స్కూలుకు పిల్లలు చదువుకోవడానికే వెళతారు. కాని చదువు పేరుతో బరువు లెత్తే కూలీలుగా వారు వెళ్లకూడదు. జాతి తన వెన్నుముక మీద నిలబడాలని కోరుకునే మనం చిన్న వయసు నుంచి పిల్లల వెన్ను వంచేస్తున్నాం. శాస్త్రీయ సూచన ప్రకారం ఒక విద్యార్థి స్కూల్ బ్యాగ్ బరువు అతని శరీర బరువులో పది శాతం ఉండాలి. అంటే 20 కిలోల అమ్మాయి/ అబ్బాయి కేవలం రెండు కిలోల స్కూల్ బ్యాగ్ను మోయాలి. 30 కిలోల బరువుంటే మూడు కిలోలే మోయాలి. ఒక అంచనా ప్రకారం ఇవాళ ప్రైమరీ లెవల్లో అంటే 5 వ తరగతి వరకూ పిల్లలు 6 నుంచి 12 కిలోల బరువున్న స్కూల్ బ్యాగులు మోస్తున్నారు. హైస్కూలు పిల్లలు 12 నుంచి 17 కిలోల బరువు స్కూల్ బ్యాగులు మోస్తున్నారు. ఎన్.సి.ఇ.ఆర్.టి. తాజా స్కూల్ బ్యాగ్ పాలసీ ప్రకారం 5 వ తరగతి లోపు పిల్లలకు రెండున్న కేజీలకు మించి బరువు ఉండరాదు. 6 నుంచి 10 చదివే పిల్లలకు నాలుగున్నర కేజీలకు మించి బరువు ఉండరాదు. ఈ పాలసీను స్కూళ్లు గౌరవిస్తున్నాయా? ఆరోగ్య సమస్యలు స్కూల్ బ్యాగును మోయడం కూడా తప్పేనా అని కొందరు వితండంగా మాట్లాడవచ్చు గాని అవసరానికి మించిన బరువు వీపు మీద పిల్లలు రోజూ మోయడం వల్ల వారికి వెన్ను సమస్యలు వస్తాయి. పాదంపై పట్టు మారుతుంది. నడక తీరు మారుతుంది. భుజం నొప్పి వంటివి బాధిస్తాయి. రోజూ ఆ బరువు మోసుకెళ్లే విషయం వారికి ఆందోళన గురి చేస్తుంది. కొంతమంది పిల్లలు ఈ మోత మోయలేక ఏదో ఒక వంక పెట్టి స్కూల్ ఎగ్గొడుతున్నారన్న సంగతి నిపుణులు గమనించారు కూడా. ఇంత బరువు ఎందుకు? ప్రభుత్వం కాని/ ప్రయివేటు కాని/ ఛారిటీ స్కూళ్లుగాని పిల్లలు బాగా చదవాలని ఆరు నుంచి ఎనిమిది పిరియడ్లు చెబుతున్నారు. ప్రతి సబ్జెక్ట్ ప్రతిరోజూ ఉండేలా చూస్తున్నారు. ఆ సబ్జెక్ట్కు టెక్స్›్టబుక్, నోట్ బుక్, వర్క్బుక్... ఇవిగాక స్పెషల్ నోట్బుక్కులు... ఇన్ని ఉంటున్నాయి. నీటి వసతి లేకపోయినా తల్లిదండ్రుల జాగ్రత్త వల్ల వాటర్ బాటిల్ ఒక బరువు. లంచ్ లేని చోట లంచ్ బ్యాగ్. ఒక్కోసారి స్పోర్ట్స్ అని బ్యాట్లు కూడా మోసుకెళతారు. ఇన్ని బరువులు 15 ఏళ్ల లోపు పిల్లలు మోయడం గురించి ఎన్నోసార్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, కోర్టులు మందలించినా పరిస్థితిలో మార్పులేదు. ఏం చేయాలి? స్కూళ్లల్లో ప్రతి పిల్లవాడూ టెక్స్›్టబుక్ తేవాల్సిన అవసరం లేని విధానం ఉండాలి. కొన్ని టెక్ట్స్›బుక్కులను క్లాసుల్లో ఉంచాలి. అలాగే ప్రతి క్లాస్లో తాళాలు ఉన్న బుక్షెల్ఫ్లను ఏర్పాటు చేసి విద్యార్థులు తమకు ఆ రోజుకు అవసరం లేని పుస్తకాలను అందులో పెట్టుకుని వెళ్లేలా చూడాలి. పిరియడ్లను తగ్గించాలి. రోజూ అన్ని సబ్జెక్ట్లు చెప్పాల్సిన అవసరం లేని రీతిలో టైంటేబుల్ వేయాలి. టైంటేబుల్లో లేని సబ్జెక్ట్ పుస్తకాలు తేవాల్సిన పని లేదని పిల్లలకు చెప్పాలి. అలాగే ప్రభుత్వాల వైపు నుంచి ఒక క్లాసు విద్యార్థికి అన్ని క్లాసుల టెక్స్›్టబుక్కులు ఎంత బరువు అవుతున్నాయో, ఏ సబ్జెక్ట్కు ఎన్ని పేజీల పాఠ్యపుస్తకాలు ఉన్నాయో అంచనా వేయించాలి. ఒక సబ్జెక్ట్తో సంబంధం లేకుండా మరొక సబ్జెక్ట్ వారు పాఠ్యపుస్తకాలను తయారు చేసేలా కాకుండా అన్ని సబ్జెక్ట్ల వారూ ఆ ఫలానా క్లాసుకు మొత్తం ఎన్ని పేజీల పాఠ్యపుస్తకాలు తయారు చేస్తున్నారో చూసుకోవాలి. అసలు ‘ఎక్కువ సిలబస్సే మంచి చదువు’ భావన పై చర్చ జరగాలి. ఇక తల్లిదండ్రులైతే ఎప్పటికప్పుడు పిల్లల బ్యాగులు చెక్ చేస్తూ వాటిలో అనవసరమైన వస్తువుల బరువు లేకుండా చూసుకోవాలి. టైమ్టేబుల్ చెక్ చేసి ఆ పుస్తకాలే ఉంచాలి. బస్ ఎక్కేప్పుడు దిగేప్పుడు ఆ బరువును అందుకునే వీలుంటే తప్పక అందుకోవాలి. పిల్లల భుజాలకు అనువైన సరైన బ్యాగ్లు కొనివ్వాలి. -
కావాల్సినవి 3.50 కోట్లు ముద్రించింది 20 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు బడిబాట మొదలైంది.. స్కూళ్లు తెరిచే సమయం సమీపిస్తోంది. మరోవైపు పాఠ్యపుస్తకాల కోసం కుస్తీ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 3.50 కోట్ల పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకూ ముద్రించింది కేవలం 20 లక్షలే. ఈ అరకొర పుస్తకాలను పంచాలో, భద్రంగా దాచిపెట్టాలో ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వడంలేదని, ఇవి తరగతిలో కనీసం పదిమందికి కూడా అందే అవకాశం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇలా చేస్తే స్థానికంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలకు వచ్చిన పుస్తకాలను ముం దుగా సొంత డబ్బులతో స్కూళ్లకు తీసుకెళ్లాల్సి వస్తోందని టీచర్లు చెబుతున్నారు. దీంతో ఆ పుస్తకాలను జిల్లా కేంద్రాల నుంచి పాఠశాలలకు చేరవేసేందుకు హెచ్ఎంలు ముందుకురావడం లేదు. పేపర్ వచ్చేదెప్పుడు? రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 24 లక్షల మందికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. ప్రైవేటు స్కూళ్లల్లో చదువుతున్న మరో 30 లక్షల మంది విద్యార్థులకు నిర్ణయించిన ధరకు పుస్తకాలు అందించాలి. అన్ని ప్రభుత్వస్కూళ్లల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెడుతున్నారు. దీంతో పుస్తకంలో ఒకవైపు ఇంగ్లిష్లో, మరోవైపు తెలుగులో పాఠాన్ని ముద్రించాల్సి ఉంది. ఇలా పుస్తకం బరువు పెరుగుతుండటంతో దాన్ని రెండు భాగాలుగా విడగొట్టి సమ్మెటివ్ అసెస్మెంట్స్ ఒకటి, రెండుగా ముద్రిస్తున్నారు. ఉచితంగా పంపిణీ చేసే పుస్తకాలు 2.10 కోట్లు, ప్రైవేటు స్కూళ్లకు అమ్మే పుస్తకాలు 1.40 కోట్లు ముద్రించాలి. అంటే గతంలో కంటే పేపర్ను అధికంగా వాడాలి. వర్షాకాలం మొదలైతే పేపర్ రవాణా కూడా కష్టమవుతుందని అధికారులు అంటున్నారు. తమిళనాడు, చండీగఢ్ ప్రాంతాల నుంచి పేపర్ రావాల్సి ఉంది. పేపర్ ఎప్పుడు వస్తుందనేది కచ్చితంగా చెప్పలేకపోతున్నామని పేర్కొంటున్నారు. నిధుల కొరతే కారణమా? పాఠ్యపుస్తకాలకు పేపర్ అందించే మిల్లు యజమానులు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ధరపై పెద్దగా ఆసక్తి చూపడంలేదని తెలిసింది. దీంతో నాణ్యతలేని పేపర్ను తెలంగాణ ముద్రణాలయానికి పంపుతున్నారని తెలుస్తోంది. పుస్తకాల ఖర్చు గతంలో రూ.60 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.120 కోట్లు అవుతుందని అంచనా వేశారు. కోవిడ్ మూలంగా మిల్లుకు సరిపడా గుజ్జు రావడం తగ్గిందని, దీంతో రెండేళ్లుగా వ్యాపారం పడిపోయి, నిర్వహణ ఖర్చులు పెరిగాయనేది మిల్లర్ల వాదన. అయితే, వారు కోరిన మొత్తం ఇవ్వడానికి విద్యాశాఖకు నిధుల సమస్య ఉందని అధికారులు చెబుతున్నారు. పేపర్ వల్లే ఆలస్యం.. ప్రింటింగ్కు వాడే పేపర్ రాష్ట్రానికి రావడం ఆల స్యం అవుతోంది. అందుకే ముద్రణ ప్రక్రియ ఇంకా పూర్తవ్వలేదు. ఇప్పటివరకూ 20 లక్షల మేర ముద్రించి జిల్లాలకు పంపాం. వీలైనంత వరకూ ఈ నెలాఖరుకు అన్ని పుస్తకాలు ముద్రించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ముద్రణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే పంపిణీ ప్రారంభించడం మంచిది. – ఎస్.శ్రీనివాసాచారి, డైరెక్టర్ ప్రభుత్వ పుస్తకాలు, స్కూల్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ లేకపోవడం వల్లే.. ఇంగ్లిష్ మీడియం విద్య అందించాలని తెలిసిన ప్పుడు పుస్తకాల ముద్రణ ముందే చేపట్టాలని అధికారులకు తెలియాలి. సరైన ప్రణాళిక లేకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదు రవు తాయి. స్కూళ్లు తెరిచినా, పుస్తకాలు లేకు ంటే ప్రయోజనం ఏమిటి? అసలెప్పుడొస్తా యో స్పష్టంగా చెప్పగలిగే పరిస్థితి ఉండాలి. – బి.రాజాభానుచంద్ర ప్రకాశ్, ప్రభుత్వ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ఏపీ పథకాల వైపే అందరి అడుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఏపీని సందర్శించి ఆయా పథకాలు అమలవుతున్న విధానాన్ని అధ్యయనం చేసి వెళ్లాయి. ఆయా రాష్ట్రాల్లో కూడా అమల్లోకి తెస్తున్నాయి. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మెచ్చుకోవడమే కాకుండా ఆ రాష్ట్రంలోనూ అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇదే కోవలో ఏపీలో అమలవుతున్న బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్ (ద్విభాషా పాఠ్యపుస్తకాలు)ను మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరించడానికి సిద్ధమైంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ద్విభాషా పాఠ్య పుస్తకాలను తమ రాష్ట్రంలోని పాఠశాలల పిల్లలకు పంపిణీ చేయనున్నట్లు మహారాష్ట్ర విద్యా శాఖ మంత్రి వర్షా గైక్వాడ్ ఇటీవల వారి అసెంబ్లీలో ప్రకటించారు. ఏపీలో ఇంతకు ముందు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం మాత్రమే అమల్లో ఉండేది. దీంతో ఆ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఉన్నత విద్యలో, ఉద్యోగావకాశాల్లో వెనుకబాటుకు గురయ్యేవారు. ఆంగ్ల భాష పరిజ్ఞానం లేనందున ఆయా సంస్థలు వీరివైపు దృష్టి సారించేవి కావు. ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలోని పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి. ఈ తరుణంలో సీఎం వైఎస్ జగన్.. దూర దృష్టితో ఆలోచించి, ప్రభుత్వ స్కూళ్లన్నింటిలో ఆంగ్ల మాధ్యమానికి శ్రీకారం చుట్టారు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ కింద అందించే కిట్లలో డిక్షనరీని కూడా చేర్పించారు. ఆంగ్ల భాషా పదాలు సులభంగా అర్థమవ్వడంతో పాటు ఆ సబ్జెక్టు అంశాలను విద్యార్థులు సంపూర్ణంగా అవగాహన చేసుకొనేందుకు తెలుగు మాధ్యమంలో కూడా అవే పాఠాలు ఒకే పుస్తకంలో అందేలా ఏర్పాట్లు చేయించారు. టెక్టŠస్ పుస్తకంలో పాఠ్యాంశం ఒక పేజీలో ఆంగ్లంలో, మరోవైపు తెలుగులో (మిర్రర్ ఇమేజ్) ఉండేలా ఈ పుస్తకాలను తీర్చిదిద్దారు. ఇవి విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా మారాయి. పాఠ్య పుస్తకాలు తక్కువ బరువుతో ఉండేలా ఇంజనీరింగ్, డిగ్రీ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో మాదిరిగా పాఠశాల స్థాయిలోనూ సెమిస్టర్ విధానంలో ముద్రించి ఇస్తున్నారు. 2020–21లో ఒకటి నుంచి 6వ తరగతి వరకు, 2021–22లో ఏడవ తరగతి వరకు ద్విభాషా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం (2022–23)లో 8వ తరగతి విద్యార్థులకు కూడా అందించనున్నారు. డిగ్రీలోనూ ద్విభాషా పాఠ్య పుస్తకాలు రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్విభాషా (ఇంగ్లిష్–తెలుగు) పాఠ్య పుస్తక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ కోర్సులకు సంబంధించి మొత్తం 13 సబ్జెక్టుల్లో ద్విభాషా పాఠ్య పుస్తకాలను అందిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో మొదటి సెమిస్టర్ పుస్తకాలను ఈ విధానంలో ముద్రించారు. మన నాడు–నేడుపై తెలంగాణ మక్కువ పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రంలో మనబడి నాడు–నేడు పథకాన్ని ప్రారంభించారు. తద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగు పడడమే కాకుండా, సర్వాంగ సుందరంగా రూపురేఖలు మార్చుకున్నాయి. ఈ పథకాన్ని ఇప్పుడు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ అనుసరిస్తోంది. ఈ పథకానికి వినియోగించిన సాఫ్ట్వేర్ ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అందించాలని ఆ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఏపీ ప్రధాన కార్యదర్శికి కొద్ది రోజుల క్రితం లేఖ రాశారు. ఏపీ ఆ సాఫ్ట్వేర్ను తెలంగాణకు అందించడమే కాకుండా ఇతరత్రా సహకారం అందించేలా సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. ఈ ఏడాది మార్చి 22న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మన ఊరు – మనబడి పేరుతో వనపర్తి జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పథకాన్ని ప్రారంభించారు. 26,065 స్కూళ్లలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాడు–నేడుతో మహర్దశ రాష్ట్రంలో నాడు–నేడు కింద రూ.16,450.69 కోట్లతో 61,661 స్కూళ్ల రూపు రేఖల మార్పునకు ప్రణాళిక రూపొందించారు. తొలిదశలో 15,713 స్కూళ్లను రూ.3,697.86 కోట్లతో సర్వాంగ సుందంగా తీర్చిదిద్దారు. మిగతా వాటిలో రెండో దశ కింద పనులు చేపట్టారు. మొత్తంగా ఈ పథకం కింద పనులు చేపట్టనున్న స్కూళ్లు, వ్యయం వివరాలు ఇలా ఉన్నాయి. -
నాణ్యమైన బోధన అందేలా పాఠ్యపుస్తకాలు
సాక్షి, అమరావతి: విద్యార్థులకు నాణ్యమైన, సరళమైన బోధన అందేలా పాఠ్య పుస్తకాలను రూపొందించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు. సచివాలయంలో ఎనిమిదో తరగతి పాఠ్య పుస్తకాల రూపకల్పనపై జరిగిన ప్రాథమిక సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర విద్యా రంగంలోని సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా బైలింగువల్ లాంగ్వేజ్లో రూపొందిస్తున్న పాఠ్యపుస్తకాలు భవిష్యత్తులో పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. అమ్మ ఒడి, నాడు–నేడు ఇంగ్లిష్ మీడియం విద్య తదితర పథకాలతో పేదలకు మెరుగైన విద్య అందుతోందన్నారు. సీబీఎస్ఈ సిలబస్కు తగ్గట్టుగా విద్యార్థులను సంసిద్ధం చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని చెప్పారు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో భాగస్వాములైన 13 జిల్లాలకు చెందిన దాదాపు 130 మంది రచయితలు, పాఠశాల విద్యా కమిషనర్ చిన వీరభద్రుడు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ వెట్రిసెల్వి, ఎస్ఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. -
జిల్లాలకు 1.12 కోట్ల పాఠ్య పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ మొదలైంది. ఆన్లైన్ క్లాసులు కొనసాగుతున్నా, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసే పనిలో విద్యా శాఖ నిమగ్నమైంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 25 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా, వారికి 1.42 కోట్ల పాఠ్య పుస్తకాలు అవసరం. అందులో 1.12 కోట్ల పుస్తకాలు జిల్లాలకు పంపినట్లు విద్యా శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇంకా 30 లక్షల పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. రాజమండ్రి నుంచి పుస్తకాలకు అవసరమైన పేపర్ హైదరాబాద్కు రాకపోవడంతో పుస్తకాల ముద్రణ ఆలస్యమైందని పాఠశాల విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే పేపర్ తెప్పించి నెలాఖరులోగా ముద్రించి జిల్లాలకు పంపుతామని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలకు పంపించిన పుస్తకాలు ఆయా పాఠశాలలకు చేరినట్లు చెబుతున్నారు. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం విద్యార్థులు పాఠశాలలకు రావట్లేదు. దీంతో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రధానోపాధ్యాయులను ప్రభుత్వం ఆదేశించింది. 9, 10వ తరగతి విద్యార్థులందరికీ వేగంగా పుస్తకాలు అందజేయాలని కోరింది. దీంతో కొన్నిచోట్ల టీచర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు 1.25 కోట్ల పుస్తకాలు.. ప్రైవేట్ పాఠశాలలకు కూడా ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రకారమే పుస్తకాల ముద్రణ చేస్తారు. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు 32 లక్షల మంది ఉంటారు. వారికోసం 1.25 కోట్ల పాఠ్య పుస్తకాలు అవసరమవుతాయి. వాటిని ప్రైవేట్ ముద్రణా సంస్థలు సిద్ధం చేస్తాయి. ఆరు శాతం రాయల్టీతో ముద్రణా సంస్థలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఆ రూపేణా ప్రభుత్వానికి ఈ ఏడాది దాదాపు రూ.4 కోట్లు ఆదాయం సమకూరింది. ప్రైవేట్ స్కూళ్లు పుస్తకాలను ఆయా ముద్రణా సంస్థల వద్ద నిర్ణీత ధరకు కొనుగోలు చేస్తాయి. అయితే ఈసారి చాలా స్కూళ్లు పూర్తిస్థాయిలో పుస్తకాలు కొనట్లేదని ముద్రణా సంస్థలు చెబుతున్నాయి. విద్యార్థులు ఆన్లైన్లోనే వింటుండటంతో చాలామంది స్కూళ్లకు వచ్చి కొనుగోలు చేయట్లేదు. 9, 10 తరగతుల విద్యార్థులు తప్ప మిగిలిన వారు అంతగా ఆసక్తి చూపించట్లేదు. తమ పాఠశాలలో ఇంకా పుస్తకాలు రాలేదని ఓ ప్రైవేట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని బి.సహన చెబుతోంది. -
బడిసంచి ఇక తేలిక
సాక్షి, అమరావతి: పాఠశాలల్లో విద్యార్థులపై పెనుభారంగా మారిన స్కూలు బ్యాగు బరువు ఇక తగ్గనుంది. వారికి శారీరక సమస్యలతో పాటు ఒత్తిడికి, అలసటకు కారణమవుతున్న స్కూలు బ్యాగ్కు సంబంధించి కీలకమైన విధాన నిర్ణయాన్ని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. మద్రాస్ హైకోర్టు తీర్పుమేరకు కేంద్ర విద్యాశాఖ.. ఎన్సీఈఆర్టీ, కేవీఎస్, ఎన్వీఎస్, సీబీఎస్ఈ సంస్థల నిపుణుల సూచనల మేరకు ‘స్కూలు బ్యాగ్ పాలసీ–2020’ని వెలువరించింది. దీన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని పేర్కొంది. ఈ పాలసీ ప్రకారం విద్యార్థి కేంద్రంగా బోధనాభ్యసన ప్రక్రియలు సాగే పద్ధతి ద్వారా పిల్లల్లో ఒత్తిడి, స్కూలు బ్యాగ్ బరువు తగ్గుతాయి. అనేక సర్వేల్లో స్కూళ్లలో విద్యార్థి కేంద్ర అభ్యసనం కన్నా పుస్తకాలు, టీచర్ల బోధన కేంద్రంగా మారిపోతుండడమే బ్యాగ్ బరువు పెరగటానికి కారణంగా తేలింది. బ్యాగ్ల బరువును తగ్గించడానికి పలు రాష్ట్రాలు సెమిస్టర్ పద్ధతి, పుస్తకాలను స్కూళ్లలోనే ఉంచేలా చేయడం వంటి విధానాలు అవలంభిస్తున్నా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. విద్యార్థుల స్కూలు బ్యాగ్కు తరగతుల వారీగా పరిమితులు విధిస్తూ న్యాయస్థానాలు తీర్పులు వెలువరించినా సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. స్కూలు బ్యాగ్ బరువు కారణంగా పిల్లలు వెన్నెముక సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు కారణంగా శారీరక సమస్యలు రావడంతో వారి చదువులపై ప్రభావం చూపుతోంది. దీంతో కేంద్రం స్కూల్ బ్యాగ్ పాలసీని ప్రకటించి అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సూచించింది. అంతర్జాతీయ అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే.. పిల్లల శరీర బరువును అనుసరించి స్కూలు బ్యాగ్ బరువు ఉండాలని పలు శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. 2009లో అమెరికన్ ఆక్యుపేషనల్ థెరపీ అసోసియేషన్ (ఏవోటీఏ), అమెరికన్ ఫిజియోథెరపీ అసోసియేషన్ (ఏపీటీఏ)లు విద్యార్థుల శరీర బరువులో 15 శాతం మేర మాత్రమే స్కూలు బ్యాగ్ ఉండాలని సూచించాయి. ద అమెరికన్ చిరోప్రాక్టీస్ అసోసియేషన్ (ఏసీఏ) పిల్లల శరీర బరువులో 5 నుంచి 10 శాతానికి మించి ఉండరాదని పేర్కొంది. మన దేశంలో పరిస్థితి ఇలా.. స్కూల్ బ్యాగ్ బరువుకు సంబంధించి దేశంలోని పరిస్థితిపై కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించి పలు సమస్యలను గుర్తించాయి. 1 నుంచి 5వ తరగతి చదువుతున్న పిల్లల బరువులో పదిశాతానికి సమానంగా 2 నుంచి 3 కిలోల బరువు మాత్రమే ఉండాల్సి ఉన్నా వారి బ్యాగ్లు 5 కిలోలకు మించిన బరువుతో ఉంటున్నాయి. 6వ తరగతి విద్యార్థులకు 6 కిలోల బరువు వరకు ఇబ్బంది లేదు. కానీ వీరి బ్యాగ్లలోని వస్తువుల బరువు ఇలా ఉంటోంది. పాఠ్యపుస్తకాలు – 1 నుంచి 3.5 కిలోలు నోట్సులు – 1 నుంచి 2.5 కిలోలు లంచ్బాక్స్ – 250 గ్రా. నుంచి 1 కిలో వాటర్ బాటిల్ – 200 గ్రా. నుంచి 1 కిలో బ్యాగు బరువు – 150 గ్రా. నుంచి 1 కిలో ఇక పైతరగతులకు వెళ్లేకొద్దీ ఈ బ్యాగ్ బరువు ఇంకా పెరుగుతోంది. దీంతో విద్యార్థులు అలసటకు గురవడమే కాకుండా శారీరక సమస్యలతో చదువులపై శ్రద్ధ చూపలేకపోతున్నారు. మంచినీటి సదుపాయం, మధ్యాహ్న భోజనం అమలయ్యే స్కూళ్లకు వెళ్లేవారికి ఆ రెండింటి బరువు తగ్గుతున్నా చాలా ప్రయివేటు పాఠశాలల్లో ఆ సదుపాయాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కొన్ని స్కూళ్లు పిల్లలతో బడిలోనే హోంవర్కు చేయిస్తూ నోట్సులు, వర్కు పుస్తకాలను స్కూల్లోనే ఉంచుతున్నాయి. ఇంటి దగ్గర హోంవర్కు చేయాల్సి వస్తే ఒకే పుస్తకంలో అన్ని సబ్జెక్టులవి చేయిస్తున్నాయి. కొన్ని స్కూళ్లు రోజు విడిచి రోజు స్కూలు బ్యాగ్ తెచ్చేలా ఏర్పాట్లు చేశాయి. సెకండరీ, హయ్యర్ సెకండరీ తరగతులకు వచ్చేసరికి వివిధ సబ్జెక్టులతో పాఠ్యపుస్తకాలు, నోట్సులు, వర్కు పుస్తకాలు పెరిగిపోతున్నాయి. కొత్త విధానంలో పలుసూచనలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానం స్కూలు బ్యాగ్ బరువు తగ్గించేందుకు పలు సూచనలు చేసింది. – బ్యాగ్ను రెండు వైపులా భుజాలపై ఉండేలా రూపొందించాలి. – స్కూళ్లలో విద్యార్థులకు లాకర్లు, దివ్యాంగుల కోసం బుక్బ్యాంక్ ఏర్పాటు చేయాలి. – నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్వర్క్ సూచనల ప్రకారం లైఫ్స్కిల్స్, కంప్యూటర్, మోరల్ ఎడ్యుకేషన్, జనరల్ నాలెడ్జి వంటి పాఠ్యపుస్తకాలు స్కూళ్లలోనే ఉంచేలా ఏర్పాట్లు చేయాలి. – స్కూలు బ్యాగ్ బరువు తగ్గేందుకు వీలుగా తరగతుల టైమ్టేబుల్ను మార్చుకోవాలి. – ఒకే సబ్జెక్టు వరుసగా రెండు పీరియడ్లు ఉండేలా చూడడం వంటి విధానలు పాటించాలి. – పాఠ్యపుస్తకాలు, నోట్సులు, వర్కుపుస్తకాల బరువును అనుసరించి నిర్ణీత పరిమితి మేరకు మాత్రమే బ్యాగ్ బరువు ఉండేలా టైమ్టేబుల్ రూపొందించాలి. – 1, 2 తరగతులకు ఒకే నోట్ పుస్తకం అమలుచేయాలి. – 3, 4, 5 తరగతులకు రెండు నోట్ పుస్తకాలు పెట్టాలి. ఒకదాన్ని బ్యాగ్లో ఉంచి, రెండోది స్కూల్లోనే ఉండేలా చూడాలి. – 6, 7, 8 తరగతుల వారికి లూజ్ పేపర్లలో క్లాస్వర్క్ చేసేలా ఫైల్ను ఏర్పాటుచేయాలి. 6వ తరగతి నుంచే ఈ వర్కు పేపర్లను ఒక పద్ధతిలో రాసేలా చేయాలి. – పాఠ్యపుస్తకాలకు మించి ఇతర పుస్తకాలను స్కూలులో అనుమతించరాదు. – స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అమలు, మంచినీటి సదుపాయం ఏర్పాటు ద్వారా విద్యార్థులు వాటిని ఇళ్లనుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. తద్వారా ఆ బరువు తగ్గుతుంది. ఈ సూచనలు అమలైతే విద్యార్థులకు మేలు స్కూలుకు వెళ్లే పిల్లల బ్యాగ్ వారు మోసే శక్తికి మించి ఉంటోంది. దీనివల్ల విద్యార్థులు విపరీతమైన శారీరక శ్రమ, అలసటకు గురవుతున్నారు. ఇది వారి చదువుపై వ్యతిరేక ప్రభావం చూపిస్తోంది. ప్రయివేటు విద్యాసంస్థలు పాఠ్యపుస్తకాలకు అదనంగా ఇతర పుస్తకాలు ఇవ్వడం వారిని మరింత ఇబ్బంది పెడుతోంది. కేంద్రం ప్రకటించిన స్కూల్ బ్యాగ్ పాలసీ సమగ్రంగా అమలవ్వాలి. విద్యార్థి శక్తిని అనుసరించి స్కూలు బ్యాగ్ బరువు ఉండాలి. వారి శరీర బరువును అనుసరించి ఈ బ్యాగ్ బరువు నిర్ణయించడం మంచి పద్ధతి. ఈ పాలసీలోని ఇతర సూచనలను కూడా అన్ని విద్యా సంస్థలు పాటించాలి. – ప్రొఫెసర్ జీ జానకిరామయ్య, ఎడ్యుకేషన్ విభాగాధిపతి, ఎస్వీ యూనివర్సిటీ ఈ పాలసీ మేరకు ముందుకెళ్లాం విద్యార్థులపై బ్యాగుల బరువు లేకుండా చేయాలన్న చర్చ చాలాకాలంగా ఉంది. పలు సంస్థలు, కమిటీలు అధ్యయనాలు జరిగి అనేక సిఫార్సులు ఇచ్చాయి. మన రాష్ట్రంలో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. నో బ్యాగ్డేను అమలు చేయడంతో పాటు పాఠ్యపుస్తకాల బరువు తగ్గేందుకు సెమిస్టర్ విధానాన్ని అనుసరిస్తున్నాం. విద్యార్థులు అవసరమైన పుస్తకాలు మాత్రమే ఇళ్లకు తీసుకువెళ్లి తక్కిన వాటిని స్కూళ్లలోనే ఉంచుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం హోమ్ వర్కుతో పాటు ముఖ్యమైన పుస్తకాలు మాత్రమే ఇళ్లకు తీసుకువెళ్లేలా చర్యలు చేపడుతున్నాం. కేంద్రం ఇచ్చిన విధానపత్రాన్ని అనుసరించి ముందుకు వెళ్తాం. – డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి, డైరెక్టర్, రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి -
ఒకవైపు ఆంగ్లం.. మరోవైపు తెలుగు
సాక్షి, అమరావతి: విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలకు వీలుగా అనేక సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి సిలబస్ను మార్పు చేయడంతోపాటు పాఠ్యపుస్తకాలను సైతం వినూత్నంగా తీర్చిదిద్దింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆంగ్ల నైపుణ్యం తప్పనిసరైన నేపథ్యంలో దాన్ని పిల్లలకు నేర్పేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఆంగ్లం/తెలుగు మాధ్యమాలు కోరుకునేవారికి రెండు మాధ్యమాలు ఒకే పాఠ్యపుస్తకంలో ఉండేలా ‘మిర్రర్ ఇమేజ్’ పాఠ్యపుస్తకాలను రూపొందించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఆంగ్ల పాఠాలు అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఆంగ్ల మాధ్యమ పాఠాల సిలబస్ రూపకల్పనకు ప్రత్యేక ప్రాజెక్టు అధికారిగా ఐఏఎస్ అధికారిణి వెట్రిసెల్విని నియమించారు. ఇతర రాష్ట్రాలతోపాటు సింగపూర్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాల సిలబస్తోనూ తులనాత్మక పరిశీలన చేశారు. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రా యూనివర్సిటీకి చెందిన విద్యావేత్త మాయా గుణవర్థన నేతృత్వంలో నిపుణుల బందాన్ని, మైసూరులోని రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, హైదరాబాద్లోని ఇఫ్లూలను పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వాములుగా చేశారు. పాఠ్యాంశాలకనుగుణంగా బొమ్మలు, అందమైన లేఔట్ డిజైన్లను రూపొందించారు. సులువుగా అర్థమయ్యేలా పేజీకి ఒకవైపు ఆంగ్లం, రెండోవైపు తెలుగులో ఉండేలా పుస్తకాలు సిద్ధం చేయించారు. సిలబస్లో అనేక మార్పులు 1 నుంచి 6వ తరగతి వరకు ఆయా సబ్జెక్టుల సిలబస్లో మార్పులు చేశారు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇకపై మూడో తరగతి నుంచే ఉంటుంది. తొలిసారిగా ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు వర్క్బుక్స్ను అందించనున్నారు. తెలుగులో గతంలో 25 మంది కవుల రచనలే ఉండగా ఈసారి అన్ని ప్రాంతాలు, అన్ని మాండలికాలు, సంస్కృతులకు పెద్దపీట వేస్తూ 116 మందికిపైగా కవుల రచనలను పాఠ్యంశాలుగా తీసుకోవడం విశేషం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నిటిలోనూ తెలు గును తప్పనిసరిగా అభ్యసించాల్సి ఉంటుంది. తెలుగు భాషా సామర్థ్యాలను పెంచుకోవడం, భాషా సౌందర్యాన్ని తెలుసుకునేలా పాఠ్యపుస్తకాలు రూపొందాయి. సెమిస్టర్ విధానంలో పాఠ్యపుస్తకాలు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పాఠశాల స్థాయి నుంచే సెమిస్టర్ విధానం పెట్టి పాఠ్యపుస్తకాలను కూడా సెమిస్టర్ల వారీగానే విద్యార్థులకు అందిస్తాం. దీనివల్ల పాఠ్యపుస్తకాల బరువు చాలా తగ్గుతుంది. విద్యార్థులు ఏయే సెమిస్టర్లలో ఏమేరకు రాణిస్తున్నారు? ఎక్కడ వెనుకబడి ఉన్నారో సులభంగా అంచనా వేయొచ్చు. మిర్రర్ ఇమేజ్ పాఠ్యపుస్తకాల వల్ల టీచర్లకు, విద్యార్థులకు బోధనాభ్యసనం సులువుగా ఉంటుంది. – డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి, డైరెక్టర్, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఇష్టంగా చదువుకునేలా పాఠాలున్నాయి.. గతంలో పాఠాలు చెప్పి అభ్యాసాల్లోని వ్యాకరణం, ఇతర ప్రక్రియలను విద్యార్థులతో చేయించేవారు. ఇప్పుడు కృత్యాధారిత అభ్యసనం ద్వారా నేర్చుకోనున్నారు. పాఠాల వెనుక ప్రశ్నలు, జవాబులు, అభ్యాసాలు ఉండవు. అవన్నీ పాఠంలో అంతర్భాగంగానే ఉంటాయి. ఇష్టంగా చదువుకునేలా ప్రస్తుత పాఠ్యాంశాలున్నాయి. – డాక్టర్ డి.చంద్రశేఖరరెడ్డి, పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వామి అన్ని మాండలికాలకు పెద్దపీట తెలుగు భాషను మరింత పరిపుష్టం చేసే దిశగా ప్రభుత్వం మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. 1 నుంచి 6వ తరగతి వరకు తెలుగు భాషా సంస్కృతి, సంప్రదాయాల మేలు కలయికతో పాఠ్యాంశాలు రూపుదిద్దుకున్నాయి. అన్ని ప్రాంతాల మాండలికాలు, అన్ని కులాలు, మతాలకు సంబంధించిన అంశాలకూ పెద్దపీట వేశాం. – డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్, పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వామి -
చదివే బొమ్మ.. పాఠం చెప్పెనమ్మ
ఈ చిత్రంలో కనిపిస్తున్నది మామూలు డాల్ఫిన్ బొమ్మ కాదండోయ్...ఇదో ‘చదివే’ బొమ్మ! దీని పేరు డాల్ఫియో. 6, 7, 8వ తరగతి తెలుగు, ఆంగ్ల పాఠ్య పుస్తకాలను ఇది అనర్గళంగా, ఉచ్ఛారణ లోపాల్లేకుండా చదివేయగలదు! ఏమిటిది ? ఇదో టాకింగ్ పెన్, మల్టీమీడియా ప్రింట్ రీడర్. ఇందులో ముందే లోడ్ చేసిన ఆడియో ఫైళ్లతో కూడిన మెమొరీ చిప్ ఉంటుంది. బ్యాటరీ చార్జింగ్ ద్వారా పనిచేసే డాల్ఫియోలో పాఠాలు వినబడేలా ఓ స్పీకర్ కూడా ఉంటుంది. ఎలా పనిచేస్తుంది.. డాల్ఫియోలో ఒక సెన్సర్ ఉంటుంది. దీన్ని పాఠ్య పుస్తకం తాలూకూ బార్కోడ్లపై ఉంచితే సెన్సర్ వాటిని స్కాన్ చేసి సంబంధిత ఆడియో ఫైళ్లను యాక్టివేట్ చేస్తుంది. పాఠంలోని అక్షరాలపై డాల్ఫియోను కదుపుతూ వెళ్తుంటే వాటిని అది చదువుతూ వెళ్తుంది. ఎందుకు, ఎవరు తెచ్చారు...? విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు పాఠశాల విద్యాశాఖ ‘టాకింగ్ బుక్స్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యునిసెఫ్ సహకారంతో రాష్ట్రంలోని 600 పాఠశాలలకు వీటిని అందించేందుకు చర్యలు చేపట్టింది. పుస్తకాల్లోని పాఠ్యాంశాలపై రీడింగ్ డివైస్ పెడితే ఆ పాఠ్యాంశాలు వాయిస్ రూపంలో విద్యార్థులకు వినిపిస్తాయి. అంతేకాదు బొమ్మలపై పెట్టినా ఆ బొమ్మకు సంబంధించిన కథనాన్ని మొత్తం వివరిస్తుంది. అందుకే వాటికి లైఫ్ స్కిల్ టాకింగ్ బుక్స్గా యునిసెఫ్ పేరు పెట్టింది. ఏయే స్కూళ్లకు? డాల్ఫియో బొమ్మలను 417 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ),35 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 37 ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు, ఉట్నూరులోని 111 ఆశ్రమ పాఠశాలలకు అందించనున్నారు. లాభం ఏమిటి? బాలికల్లో జీవన నైపుణ్యాలను మెరుగు పరుచడం ద్వారా వారిలో మార్పు తీసుకొచ్చేందుకు తెలుగు, ఇంగ్లిషు భాషల్లో వంద కథలతో ఈ టాకింగ్ పుస్తకాలను యునిసెఫ్ పాఠశాలలకు అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు యునిసెఫ్ ప్రతినిధి సుకన్య సుబ్రమణ్యన్ సహకారంతో వీటిని పాఠశాలలకు అందించినట్లు పాఠశాల విద్యా కమిషనర్ విజయ్కుమార్ వెల్లడించారు. కథలతో పాఠాలు... పర్యావరణ సమస్యలు, పారిశుద్ధ్యం, నీటి సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ, బాలికల సమస్యలు, ఆరోగ్యం, పౌష్టికత, బాల కార్మిక, బాలల హక్కులు తదితర అంశాలకు సంబంధించిన పాఠాలను మంచి కథలతో రూపొందించినట్లు విజయ్కుమార్ వివరించారు. ముఖ్యంగా గ్రామాల్లోని విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సులభశైలిలో ఈ కథలు ఉన్నట్లు వెల్లడించారు. 6, 7,8 తరగతులకు చెందిన బాలికలకు వీటితో జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. వీటి ద్వారా జీవన నైపుణ్యాలతోపాటు తెలుగు, ఇంగ్లిషు భాషల్లో మాట్లాడటం, చదవడం, రావడం నేర్పించడానికి ఎంతో ఉపయోగపడుతాయని యూనిసెఫ్ కన్సల్టెంట్ సదానంద్ వివరించారు. – సాక్షి, హైదరాబాద్ -
వడివడిగా.. బడి ఒడికి..
సాక్షి, అమరావతి: విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగైదు నెలలు దాటినా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందేవి కావు. తరగతిలో 20 మంది ఉంటే.. పది మందికి మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉండేది. మిగిలిన వారికి ఆ తరువాత ఎప్పుడో వస్తే ఇచ్చేవారు. ఒక పుస్తకాన్ని నలుగురైదుగురు కలిపి చదువుకునే పరిస్థితి. ఇదంతా గతం. ఇప్పుడా పరిస్థితులు మారాయి. పాఠశాలలు తెరిచే నాటికే పాఠ్య పుస్తకాలు సిద్ధం చేశారు. తరగతుల్లోని ప్రతి విద్యార్థి చేతిలో అన్ని సబ్జెక్టుల పుస్తకాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది జూన్ 12 నుంచి పాఠశాలలు తెరవగా.. ఇప్పటికే రాష్ట్రంలోని 95 శాతానికి పైగా పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు చేరాయి. అమ్మ ఒడి పథకం, ఇతరత్రా కారణాలతో ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యా శాఖ 5 శాతం పుస్తకాలను అదనంగా అందిస్తోంది. 46 వేలకు పైగా స్కూళ్లు.. 39 లక్షలు దాటిన విద్యార్థులు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో ప్రస్తుతం 46,786 పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో 39,04,141 మంది విద్యార్థులు వివిధ తరగతుల్లో విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం దాదాపు రూ.96 కోట్లు వెచ్చిస్తోంది. ఇందులో రూ.65 కోట్ల వరకు నిధులను పేపర్ కొనుగోలు, సరఫరాకు వెచ్చిస్తుండగా మిగతా మొత్తాన్ని పాఠ్య పుస్తకాల ముద్రణకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వమే పేపర్ కొనుగోలు చేసి ప్రింటర్లకు అందిస్తోంది. వీటి ముద్రణను ఏటా డిసెంబర్ లేదా జనవరి నెలల్లోనే ప్రారంభించాల్సి ఉంటుంది. గతంలో ముద్రణ టెండర్ల వ్యవహారాన్ని ఏప్రిల్, మే వరకు ఖరారు చేసేవారు కాదు. పేపర్ కొనుగోలు, ముద్రణ టెండర్లకు సంబంధించి లోపాయికారీ ఒప్పందాలు తేలిన అనంతరం కానీ అనుమతి వచ్చేది కాదు. గడచిన విద్యా సంవత్సరంలో ఏకంగా మే మూడో వారంలో కానీ ముద్రణ టెండర్లను ఖరారు చేయలేదు. పుస్తకాల పంపిణీకి అధికారులు నానాయాతన పడాల్సి వచ్చింది. ఈసారి ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా పాఠశాల విద్యాశాఖ ముందుగానే ఏర్పాట్లు చేపట్టింది. ఫలితంగా గతంలో లేనివిధంగా పాఠశాలలు తెరవటానికి ముందే పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. 7 మాధ్యమాల్లో.. 329 పీఠికలు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ, ఒరియా మాధ్యమాలకు సంబంధించి 329 పీఠిక (టైటిల్స్)లతో 2,27,77,774 పుస్తకాలు అవసరమని అంచనా వేశారు. ప్రింటర్ల నుంచి ఇప్పటికే 2,02,83,760 పాఠ్య పుస్తకాలు అందగా.. పాత స్టాకు 14,16,899 కలిపి మొత్తం 2,17,00,659 పాఠ్య పుస్తకాలను మండలాలకు తరలించారు. అక్కడి నుంచి గతంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వీటిని తీసుకెళ్లాల్సి వచ్చేది. దీనికి సమయం పడుతుండటంతో ఈసారి ఆర్టీసీతో ఒప్పందం చేసుకుని బస్సుల్లో పాఠశాలలకు పంపించారు. ఇప్పటికే ప్రధానోపాధ్యాయుల చెంతకు 2,02,74,313 పాఠ్య పుస్తకాలు చేరాయని పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరక్టర్ కృష్ణారెడ్డి వివరించారు. విద్యార్థుల చేరికలు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలకు అదనంగా 5 శాతం పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయిస్తున్నామని ఆయన వివరించారు. జిల్లాల వారీగా పాఠ్య పుస్తకాల వివరాలు -
బాలగంగాధర్ తిలక్.. ‘ఫాదర్ ఆఫ్ టెర్రరిజం’!
జైపూర్: గణపతి, ఛత్రపతి ఉత్సవాలతో భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరి పోసిన బాలగంగాధర్ తిలక్ను ‘ఉగ్రవాదానికి మూలపురుషుడు’గా పేర్కొనటం వివాదమైంది. రాజస్తాన్ ప్రభుత్వం హిందీలో ప్రచురించే పాఠ్యపుస్తకాలను మథురలోని ఓ సంస్థ ఇంగ్లిష్లోకి అనువదించి ప్రచురిస్తుంది. వీటిని ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో బోధిస్తున్నారు. అయితే, 8వ తరగతి పాఠ్య పుస్తకం 22వ చాప్టర్లోని 18,19వ శతాబ్దాల్లో జాతీయోద్యమ ఘటనలు అనే పాఠ్యాంశంలో ‘తిలక్ జాతీయోద్యమానికి ఒక బాటను చూపారు. అందుకే ఆయన్ను ఫాదర్ ఆఫ్ టెర్రరిజం అంటారు’ అని ఉంది. -
త్వరలో పాఠ్య పుస్తకాలపై క్యూఆర్ కోడ్
న్యూఢిల్లీ: జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్సీఈఆర్టీ) ప్రచురించే పాఠ్యపుస్తకాలపై వచ్చే ఏడాది నుంచి క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ను ముద్రించనున్నట్లు కేంద్ర మంత్రి జవదేకర్ చెప్పారు. ఈ కోడ్ను విద్యార్థులు స్మార్ట్ఫోన్తో స్కాన్ చేయడం ద్వారా ఇంటర్నెట్లో ఆయా పాఠ్యాంశాలకు సంబంధించి ఉన్న వీడియోలు, సబ్జెక్టుల సమాచారాన్ని పొందవచ్చన్నారు. దీంతో విద్యార్థులు పాఠ్యాంశాలను క్షుణ్నంగా అర్థం చేసుకునే వీలుంటుందని చెప్పారు. విద్యా రుణాలు తీసుకునే విద్యార్థులు తాము చదివే కోర్సు కాలపరిమితితోపాటు తర్వాతి ఏడాది వరకు ఆ రుణాలకు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వ విద్యకు సంబంధించి సర్వ శిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్ష అభియాన్, టీచర్ ఎడ్యుకేషన్లను కలిపి ఒకే కార్యక్రమంగా రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
అమెరికాలో హిందువుల విజయం
వాషింగ్టన్ : అమెరికాలోని హిందూ బృందాలు కాలిఫోర్నియా కేసులో కీలక విజయాన్ని సాధించాయి. అమెరికాలోని పాఠ్యాంశాల్లో భారతదేశం, హిందూమతం గురించి ఖచ్చితమైన, విశాల దృక్ఫథంతో, శాస్త్రీయంగా ఇవ్వాలని హిందూ వర్గాలు చేస్తున్న పదేళ్ల పోరాటం ఫలించింది. హిందుత్వం, భారతదేశం గురించి అమెరికా పాఠ్యాంశాల్లో ఖచ్చితమైన సమాచారాన్ని అందించేందుకు కాలిఫోర్నియా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎస్బీఈ) అంగీకారం తెలిపింది. రెండు పాఠ్యాంశాల పద్దతిని సైతం కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తిరస్కరించింది. అంటే గ్రేడ్స్ కే6-గ్రేడ్స్ 6-8 వరకూ అన్ని పాఠ్యాంశాల్లోనూ హిందువులు, భారత దేశ చరిత్రను సమగ్రంగా అందించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేసింది. కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదని అమెరికా హిందూ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అధ్యక్షుడు శాంతారామ్ అన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయ నాగరికత, హిందుత్వం గురించిన నిజానిజాలు అమెరికన్లకు తెలుస్తాయని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా.. కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది. -
పుస్తకం లేని చదువులు
కర్నూలు సిటీ: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ఫలితాలు సాధిస్తామనే అధికారుల మాటలకు.. చేతలకు పొంతన కుదరడం లేదు. ఇప్పటికే అరకొర సౌకర్యాల మధ్య చదువులు కొనసాగిస్తున్న విద్యార్థులకు కనీసం పాఠ్య పుస్తకాలు కూడా పంపిణీ చేయని పరిస్థితి నెలకొంది. కళాశాలలు తెరిచి ఐదు నెలలు గడుస్తున్నా విద్యార్థుల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందించేది. అయితే ఈ ఏడాది ఇంత వరకు కాలేజీల్లో పాఠ్యాంశాలు అధ్యాపకులు బోధిస్తున్నా ఇంటి దగ్గర చదువుకునేందుకు పుస్తకాలు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పుస్తకాలు లేని కారణంతో చాలా కాలేజీల్లో కర్నూలు సిటీ: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ఫలితాలు సాధిస్తామనే అధికారుల మాటలకు.. చేతలకు పొంతన కుదరడం లేదు. ఇప్పటికే అరకొర సౌకర్యాల మధ్య చదువులు కొనసాగిస్తున్న విద్యార్థులకు కనీసం పాఠ్య పుస్తకాలు కూడా పంపిణీ చేయని పరిస్థితి నెలకొంది. కళాశాలలు తెరిచి ఐదు నెలలు గడుస్తున్నా విద్యార్థుల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందించేది. అయితే ఈ ఏడాది ఇంత వరకు కాలేజీల్లో పాఠ్యాంశాలు అధ్యాపకులు బోధిస్తున్నా ఇంటి దగ్గర చదువుకునేందుకు పుస్తకాలు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పుస్తకాలు లేని కారణంతో చాలా కాలేజీల్లో అధ్యాపకులు కూడా తాము బోధించిన అంశాలకు నోట్స్ ఇవ్వకపోవడంతో స్లిప్ టెస్ట్లు రాసేందుకు సైతం విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయివేటు పబ్లిషర్స్ పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులున్న వారు వాటిని కొనుగోలు చేయలేక పరీక్షలకు సరిగా ప్రిపేర్ కాలేకపోతున్నారు. దీంతో తక్కువ మార్కులు రావడం, ఫెయిల్ అవుతుండడంతో కొందరు విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొన్ని కళాశాలల్లో మాత్రమే సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేసిన వారి నుంచి తిరిగి ఇప్పించుకుని అందజేశారు. మొదటి ఏడాది విద్యార్థులకు గత ఏడాది మిగిలిన పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ రూపంలో 20 శాతం మంది విద్యార్థులకు మాత్రం పుస్తకాలు అందాయి. ప్రతిపాదనలు కోరని ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 42 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 10 వేల మంది పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరికి రెండేళ్లుగా ప్రభుత్వం సకాలంలో పుస్తకాలు పంపిణీ చేయడం లేదు. ఈ కారణంతోనే ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించే పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీలు వెనుకబడుతున్నాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరం మొదలై ఐదు నెలలవుతున్నా నేటికీ ఈ ఏడాది పాఠ్యపుస్తకాల కోసం విద్యాశాఖ ఇండెంట్ కోరలేదు. ఆర్ట్స్ విద్యార్థులు ఇతర పుస్తకాలను చదువుతూ కొంత మేరకు గడుపుతున్నా సైన్సు గ్రూప్ల వారు మాత్రం ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలపైనే ఆధారపడుతుండడం, ఇంత వరకు పుస్తకాలు అందకపోవడంతో ఉత్తీర్ణత శాతంపై తీవ్ర ప్రభావం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠ్య పుస్తకాల ముద్రణ నిలిపివేత! వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ మీడియట్ సిలబస్లో సమూలమైన మార్పులు చేయాలని గతేడాది ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగానే ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వం పుస్తకాల ముద్రణకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని సమాచారం. ఈ కారణంతో కొన్ని పబ్లిషర్స్ అడ్డగోలుగా పాఠ్యపుస్తకాల ధరలు పెంచి విద్యార్థులను దోచుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. పాత పుస్తకాలతో సర్దుబాటు చేశాం ఇంటర్ మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కావాలని ప్రభుత్వాన్ని అడిగాం. గతేడాది మిగిలిన పుస్తకాలతోపాటు ద్వితీయ సంవత్సరం విద్యార్థుల నుంచి సేకరించి మొదటి సంవత్సరం విద్యార్థులకు కొంత మేరకు సర్దుబాటు చేశాం. వచ్చే ఏడాది నుంచి సిలబస్ మార్పులు జరుగుతుండడంతోనే పాఠ్య పుస్తకాలను ఇవ్వలేదు. – సుబ్రమణ్యేశ్వరరావు, డీవీఈఓ -
విద్యార్థుల కోసం పుస్తకాలపై ‘1098’
వేధింపులపై ఫిర్యాదులు చేసేందుకు హెల్ప్లైన్ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో, బయట విద్యార్థులను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తే చర్యలు తప్పవని విద్యా శాఖ హెచ్చరించింది. వేధింపులకు గురి చేసే వారిపై ఫిర్యాదు చేసేందుకు పాఠ్య పుస్తకాల వెనుక భాగంలో టోల్ ఫ్రీ నంబర్ ‘1098’ను ముద్రించినట్లు తెలిపింది. పాఠశాలల్లో సమస్యలపై విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు 18004257462 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. సర్వ శిక్షా అభియాన్, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో సమస్యలపై 18004253525 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. -
పాఠాలు లేటేనా...!
⇒ఇంకా 10 శాతం కూడా జిల్లాకు రాని పాఠ్యపుస్తకాలు ⇒ సకాలంలో పంపిణీపై సందిగ్ధత ⇒ఆలస్యంతో ఏటా తిప్పలే.. ప్రతి సంవత్సరం లాగానే.. ఈ ఏడాదీ ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉచిత పాఠ్యపుస్తకాలు ఈసారి కూడా సకాలంలో జిల్లాకు వచ్చే అవకాశాలు కనిపించపోవడమే. విద్యాశాఖ అంచనాల మేరకు ఈ సంవత్సరంలో 15 లక్షల పైచిలుకు పుస్తకాలు జిల్లాకు అవసరం కాగా.. కేవలం 80 వేలు మాత్రమే ఇప్పటి వరకు అందాయి. గతేడాది పుస్తకాలు ఆలస్యం కావడం వల్ల పాఠ్యాంశాలు డిసెంబర్ నాటికి పూర్తి కాలేదు. ఈసారైనా పుస్తకాలు సమయానికి వస్తాయో..? రావో..? అన్న సందిగ్ధం నెలకొంది. తిరుపతి ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఈఏడాది కూడా ఉచిత పాఠ్యపుస్తకాలు సకాలంలో అందే సూచనలు కనిపించడం లేదు. తరగతులు, మీడియంల వారీగా జిల్లాకు ఈ ఏడాది 15 లక్షలకు పైగా పుస్తకాలు అవసరమవుతాయని విద్యాశాఖ నివేదిక పంపింది. అయితే ఇప్పటి వరకు దాదాపు 80 వేల బుక్స్ మాత్రమే అందాయి. ఇంకా 14 లక్షలకుపైబడి పాఠ్యపుస్తకాలు అందాల్సి ఉండడంతో ఎదురుచూపులు తప్పలేదు. సరఫరా ఇలా.. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేస్తుంది. దీనికోసం వేసవి సెలవులకు ముందస్తుగానే తరగతి, మీడియంల వారీగా ఎన్ని పుస్తకాలు అవసరమవుతాయో అన్న అంచనాలతో జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపిస్తుంది. పాఠ్యపుస్తకాల అచ్చుకు ప్రభుత్వం టెండర్ను పిలిచి ప్రింటింగ్ ప్రెస్కు కేటాయిస్తుంది. ప్రింటింగ్ అయిన పాఠ్యపుస్తకాలను జిల్లాలోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విక్రయ కార్యాలయానికి విడతల వారీగా సరఫరా చేస్తుంది. వీటిని జిల్లాలోని 66మండలాల్లో ఉన్న మండల వనరుల కేంద్రాలకు తరలించి, అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేస్తారు. ఇవన్నీ పాఠశాలలు పునఃప్రారంభం(జూన్ 13వ తేదీ)లోపు పూర్తి స్థాయిలో సరఫరా చేయాలి. ఇది ఏటా జరిగే ప్రక్రియ. విద్యాశాఖ నివేదిక ఇలా.. జిల్లాలో తెలుగు, ఇంగ్లీష్, తమిళం, ఉర్దు మీడియం పాఠశాలలున్నాయి. దీనికితోడు సంస్కృత మీడియం పాఠశాలలు ఒకట్రెండు ఉన్నట్టు సమాచారం. అన్ని తరగతులు, మీడియాలకు సంబంధించి జిల్లాకు మొత్తం 18,55,583 పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయని విద్యాశాఖ అంచనా వేసింది. గత ఏడాది పుస్తక విక్రయ కేంద్రంలో 3,25,571పాఠ్యపుస్తకాలు మిగులులో ఉన్నాయి. ఇవి పోను 15,30,012పాఠ్యపుస్తకాలు సరఫరా చేయాలని విద్యాశాఖ నివేదిక పంపింది. అయితే ఇప్పటి వరకు 9వ తరగతి తెలుగు మీడియానికి సంబంధించిన బయాలజి, ఫిజిక్స్, 8వ తరగతికి సంబంధించి తెలుగు రీడర్, 10వ తరగతి ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి మ్యాథ్స్ బుక్స్ సహా మొత్తం 79,627 పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. 14,50,385 పాఠ్యపుస్తకాలు ఇంకా రావాల్సి ఉంది. అనుకున్న తేదీలోపు దశల వారీగా పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు సరఫరా అవుతాయనిని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దీంతో సకాలంలో పంపిణీపై సందిగ్ధత నెలకొంది. ప్రతియేటా ఇబ్బందులే.. పాఠశాలల పునఃప్రారంభంలోపే పుస్తకాలను చేరవేస్తామని ప్రభుత్వం ఏటా ఇస్తున్న హామీలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా గత ఏడాది నుంచి నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విధానంలో విద్యార్థులకు అర్థమయ్యేలా విద్యాబోధన అందించాలంటే తప్పనిసరిగా ప్రతి విద్యార్థికీ పాఠ్యపుస్తకాలు ఉండి తీరాలి. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే విద్యాబోధన జరిగితేనే డిసెంబరు ఆఖరుకల్లా పాఠ్యాంశాలను పూర్తి చేసి రివైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా జరగాలంటే పాఠశాలల పునఃప్రారంభం నాటికే ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలను అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పుస్తకాలు రాలేదా.. ఫోన్ చేయండి..
సాక్షి, హైదరాబాద్: పాఠ్య పుస్తకాల సరఫరాకు సంబంధించిన సమస్యలు, సమా చారాన్ని అందించేందుకు 18004257462 టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు రాకపోయినా, ఏమైనా సబ్జెక్టుల పుస్తకాలు రావాల్సి ఉన్నా ఈ నంబర్ ని సంప్రదించాలని కోరారు. మండల కేంద్రాలకు వచ్చే పాఠ్య పుస్తకాల్లో తమకు అవసరమైన పుస్తకాలను తీసుకెళ్లాల్సిన బాధ్యత హెడ్మాస్టర్లదేనన్నారు. -
హత్నూర పాఠశాలకు పూర్వ విద్యార్థుల చేయూత
- ప్రతి నెలా విద్యార్థులకు స్కాలర్షిప్లు - హాస్టల్ సమస్యల పరిష్కారానికి విరాళాలు -పూర్వ విద్యార్థుల కన్వీనర్ పల్లె నరేందర్ సంగారెడ్డి మున్సిపాలిటీ : తాము చదువుకున్న పాఠశాల నేడు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. పాఠశాలలో చదవడం వల్లే తాము ఈ రోజు వివిధ రంగాల్లో స్థిరపడ్డాం.. మనకు జీవితం ఇచ్చిన స్కూల్కు చేయూత నివ్వాలనే ఆలోచన పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులకు వచ్చింది. అంతే 1991 నుంచి 2005 వరకు చదువుకున్న 1257 మంది పూర్వ విద్యార్థుల సమాచారం సేకరించారు. అంతటితో ఆగకుండా ఐదుగురు సభ్యుల (హత్నుర సర్పంచ్)ను కలుపుకోని కమిటీ నియమించారు. అందులో భాగంగా ఆదివారం సంగారెడ్డిలోని ఓ హోటల్లో సమావేశం నిర్వహించారు. హత్నూరలో పాఠశాల ఏర్పాటై 30 సంవత్సరాలు పూర్తయినందున అందులో చదువుతున్న విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఆరు నెలలకు ఒక సారి హాస్టల్ను సందర్శించి సమస్యలు తెలుసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వ పరంగా హాస్టల్ అభివృద్ధికి వచ్చే నిధులుపై ఆధార పడకుండా విద్యార్థులు ఎదుర్కొంటున్నా ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు గాను 1991 నుంచి 2005 వరకు చదువుకున్న విద్యార్థుల ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని బట్టి విరాళాలను సేకరించాలని నిర్ణయించారు. అంతేకాకుండా విద్యార్థుల్లో నైపుణ్యం పంపొందేలా అవసరమైన అవగాహన సదస్సులు చేపట్టాలని తీర్మానం చేశారు . ప్రతి సంవత్సరం 25 మంది విద్యార్థులకు ప్రతి నెలా స్కాలర్ షిప్ ఇవ్వాలని, ఇందుకోసం కార్పస్ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్యక్షుడు రవీందర్ తెలిపారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్.. 30 సంవత్సరాల క్రితం ప్రారంభించిన హత్నూర గురుకుల పాఠశాల ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉంది.. అక్కడ ఎటువంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు ఎలా సేకరించాలి తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పూర్వ విద్యార్థులు సమీక్ష నిర్వహించారు. ఇందుకు గాను వివిధ హోదాల్లో ఉన్న వారితో పాటు కింది స్థాయిలో ఉద్యోగం చేస్తున్న వారు సైతం తాము చదువుకున్న పాఠశాల ఆభివృద్ధి కోసం నెలనెలా తమకు తోచినంత ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. జమ చేసిన డబ్బులతో పాఠశాలను, సర్పంచ్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని ఐఎఎస్ అధికారి శంకరన్ జయంతి రోజు నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. పూర్వ విద్యార్థుల కన్వీనర్లు రాహుల్, కిరణ్, ప్రధాన కార్యదర్శి మోజెస్తో పాటు పలువురు పూర్వ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పుస్తకాలు ఎప్పుడిస్తారు సారూ..
సర్కారు స్కూళ్లకు ఇంకా అందని దైన్యం పాఠశాలలు తెరిచి రెండున్నర నెలలు పూర్తి బోధించడం కష్టమంటున్న ఉపాధ్యాయులు చదువులో వెనుకబడుతున్న విద్యార్థులు నర్సాపూర్: ప్రస్తుత విద్యాసంవత్సరంలో పాఠశాలలు తెరిచి రెండున్నర నెలలు గడుస్తున్నా ఇంత వరకు పలు తరగతులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు సర్కారు బడులకు అందలేదు. దీంతో ఒకటి నుంచి పదో తరగతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని మెజార్టీ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు అందించడం లేదు. కొన్ని మండలాల్లోని పాఠశాలలకు అన్ని సబ్జెక్టుల పుస్తకాలు వచ్చారుు. మిగతా చోట్ల మాత్రం అరకొరగానైనా ఇవ్వలేదు. ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యేనా? ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ కానందున పదవ తగరతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యేనా అనే అనుమానాలు కలుగుతున్నారుు. ఉత్తమ ఫలితాల సాధనకు ఆటంకం కలుగుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో పాఠ్యపుస్తకాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, నెలలు గడుస్తున్నా పుస్తకాలు రాకపోతే ఫలితాలెలా సాధ్యమంటున్నారు. ఇప్పటికీ అందని పాఠ్య పుస్తకాలు ఇవే.. పాఠశాలలు తెరిచి రెండున్నర నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలకు అందని పాఠ్య పుస్తకాలు లిస్టు భారీగానే ఉంది. పదవ తరగతి గణితం, బయో సైన్సు, ఫిజికల్ సైన్సు పాఠ్య పుస్తకాలు ఇంత వరకు జిల్లాలోని అనేక మండలాలకు సరఫరా కాలేదు. 9వ తరగతి ఆంగ్లం, గణితం, బయో మెడికల్ సైన్సు, సాంఘీకం, ఈవీఎస్ పాఠ్య పుస్తకాలు అందలేదు. 8వ తరగతి బయో సైన్సు, సాంఘీక శాస్త్రం పాఠ్యాంశాలు, 6, 7వ తరగతుల హిందీ, 5వ తరగతి ఎన్విరాల్మెంట్ సైన్సు పుస్తకాలతోపాటు ఒకటి నుంచి మూడు తరగతులకు చెందిన పలు రకాల పుస్తకాలు సైతం రాలేదని తెలిసింది. ఇదిలా ఉండగా ఆయా తరగతుల్లో పాసైన విద్యార్థుల పాత పుస్తకాలు సేకరించి పలువురు విద్యార్థులకు అందచేయడంతోపాటు ఉపాధ్యాయులు సైతం పాత పుస్తకాలతోనే పాఠాలు బోధిస్తున్నారు. పాత పుస్తకాలు అందరికీ సరిపడా దొరకడం లేదు. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో పుస్తకాలు తప్పనిసరి ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి నిరంతర సమగ్ర మూల్యాంకనం పద్ధతిని కొనసాగిస్తున్నారు. ఈ విధానంలో ఉపాధ్యాయులు ఏ రోజుకారోజు పాఠం బోధించగానే దానికి సంబంధించిన ప్రశ్నలను విద్యార్థులనడిగి జవాబులు రాబట్టేందుకు చర్యలు తీసుకుంటారు. అప్పటి వరకు బోధించిన పాఠంపై విద్యార్థులకు ఏ మేరకు అవగాహన కలిగిందో తెలుసుకుంటారు. అంతేగాక ప్రాజెక్టు వర్కును సైతం ఇస్తారు. ఈ విధానంలో పాఠ్య పుస్తకాలు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. పాఠ్య పుస్తకాలు లేకుంటే విద్యార్థులు ఇంటి వద్ద హోం వర్కు పూర్తి చేయలేరని, ప్రాజెక్టు వర్క్లను సైతం పూర్తి చేయలేరని చెబుతున్నారు. ప్రాజెక్టు వర్క్లకు మార్కులు వేసే విధానం అమలులో ఉండడంతో పుస్తకాలు లేక ప్రాజెక్టు వర్క్లు పూర్తి చేయకపోతే మార్కులు వేయలేని పరిస్థితులు ఉత్పన్నమవడంతో విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నది కాదనలేని వాస్తవం. కాగా పాఠ్య పుస్తకాలు సరఫరా చేయకుండా ప్రభుత్వం పరోక్షంగా విద్యార్థులకు నష్టం కలిగిస్తోందనే ఆరోపణలు వస్తున్నారుు. -
ఒక్క బుక్కు వచ్చింటే ఒట్టు
♦ బుధవారం నుంచి కళాశాలలు ప్రారంభం ♦ అందని పాఠ్యపుస్తకాలు ఆందోళనలో విద్యార్థులు కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వం విద్యార్థుల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నా.. సకాలంలో వారికి పాఠ్యపుస్తకాలు అందించలేకపోతున్నారు. ఫలితంగా విద్యార్థులు అనుకున్న స్థాయిలో ఫలితాలను సాధించలేకపోతున్నారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రైవేట్ విద్యార్థులతో పోటీపడలేక వెనుకబడిపోతున్నారు. ఇంటర్కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలతోపాటు ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలలు తెరుచుకున్నాయి. కానీ అవసరమైన పాఠపుస్తకాలు మాత్రం ఇంత వరకు జిల్లాకు చేరుకోలేదు. ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా ఎన్ని పుస్తకాలు కావాలంటే జిల్లావ్యాప్తంగా ఇంటర్కు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు గాను 1,00,118 పుస్తకాలు అవసరమని అధికారులు ఇంటర్మీడియట్ బోర్డుకు నివేదికిచ్చారు. అక్కడి నుంచి ఇంతవరకు అతీగతీ లేదు. నేరుగా గోడౌన్కు ప్రభుత్వం నుంచి వచ్చే ఇంటర్కు సంబంధించిన పాఠ్యపుస్తకాలు నేరుగా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల గోదాంకు చేరుకుంటాయి. సంబంధిత పుస్తకాలను అక్కడి నుంచి ఆర్ఐవో కార్యాలయానికి తరలించుకుని ఇక్కడ నుంచి కళాశాలల వారికి పంపిణీ చేయనున్నారు. ఈ తతంగమంతా జరగాంటే కొంత సమయం పడే అవకాశాలున్నాయి. రాగానే పంపిణీ చేస్తాం ప్రభుత్వం నుంచి పాఠపుస్తకాలు రాగానే కళాశాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటాం. దాదాపుగా వారంలోపే పుస్తకాలు వచ్చే అవకాశం ఉంది. పాఠ్యపుస్తకాలు రాగానే అలస్యం లేకుండా కళాశాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటాం. - చంద్రమౌళి, డివీఈవో, కడప. -
'కన్హయ్యలాగా ఎవరూ పుట్టొద్దు'
జైపూర్: జేఎన్యూ విద్యార్థి కన్హయ్య కుమార్పై రాజస్థాన్ బీజేపీ ఎంపీ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్హయ్య కుమార్లాగా మరొకరు పుట్టకూడదని తమ పాఠ్య పుస్తకాల్లో సమూల మార్పులు చేస్తున్నామని విద్యాశాఖ సహాయక మంత్రి వాసుదేవ్ దేవ్ నాని అన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు తాము పాఠ్యపుస్తకాలను దేశభక్తితో నిండిన అంశాలను చేరుస్తున్నామని, భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన యోధుల చరిత్రను, ఫొటోలను పుస్తకాల్లో పెడుతున్నామని తెలిపారు. జేఎన్యూ ఘటనను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో జెండాను ఎగురవేయాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తాము రాష్ట్ర పుస్తకాల్లో దేశభక్తి అంశాలను చేరుస్తున్నట్లు చెప్పారు. -
పాత పుస్తకం.. కొత్త పాఠం!
♦ ఈ విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే కొత్త తరగతులు ♦ పుస్తకాలు సమకూర్చడంపై విద్యాశాఖ మల్లగుల్లాలు ♦ ప్రస్తుతం ముద్రణ షురూ, పంపిణీకి మరింత సమయం ♦ పాతపుస్తకాల సేకరణకు సిద్ధమవుతున్న అధికారులు ♦ జిల్లాలో అవసరమైన పుస్తకాలు: 20,62,012 ♦ ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి: 43,954 ♦ మార్చి 21లోపు అందాల్సినవి: 20,18,058 ♦ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విద్యావిధానం ఉపాధ్యాయులను, విద్యార్థులను అయోమయంలో పడేసింది. సాధారణంగా జూన్ రెండో వారంలో విద్యాసంవత్సరం మొదలయ్యేది. కానీ ప్రస్తుతం మార్చి 21 నుంచే కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలని స్పష్టం చేసింది. మార్చి 15లోపు పరీక్షలు పూర్తిచేస్తే ఈ ప్రక్రియ సులభమవుతుందని ఆదేశించింది. ఈక్రమంలో అటు వార్షిక పరీక్షల నిర్వహణతోపాటు కొత్త విద్యాసంవత్సర ప్రారంభానికి పాఠశాల యాజమాన్యాలు సమాయత్తమవుతున్నాయి. అయితే కొత్త తరగతిని ప్రారంభించేలోపు విద్యార్థులకు అందే పాఠ్య పుస్తకాలపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇదిలాఉంటే ఈ ఏడాది తరగతులు పూర్తి చేసుకున్న వారి పుస్తకాలను కింది తరగతి విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నం పూర్తిస్థాయిలో ఫలిస్తుందో లేదోనని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో 2,369 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1,594 ప్రాథమిక పాఠశాలలు, 250 ప్రాథమికోన్నత పాఠశాలలు, 525 ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, ఎయిడెడ్ పాఠశాలలున్నా యి. వీటి పరిధిలో 3.45 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ప్రతి సంవత్సరం సగటున 20.62 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ వద్ద కేవలం 43,954 పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. యేటా ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తోంది. సాధారణంగా జూన్ రెండో వారంలో పాఠశాలలు పునఃప్రారంభం కాగా.. మూడో వారం నాటికి విద్యార్థుల చేతిలో కొత్తపుస్తకాలు కనిపించేవి. ఈ ఏడాది విద్యాసంవత్సరం మూడు నెలల ముందుకు జరగడంతో పాఠ్యపుస్తకాల పంపిణీపై సందిగ్ధం నెలకొంది. మరో పక్షం రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. సాధారణంగా పుస్తకాల స్టాకు జిల్లా గోదాములకు చేరితే వాటిని కనిష్టంగా పక్షం రోజుల్లో మండలాలకు చేర్చవచ్చు. ప్రస్తుతం పాఠపుస్తకాల ముద్రణ కొనసాగుతోంది. ముద్రణ పూర్తయి.. జిల్లా గోదాములకు చేరడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో కొత్త విద్యాసంవత్సరం మొదలయ్యే నాటికి నూతన పాఠ్య పుస్తకాలు అందడం కష్టమే. పాత పుస్తకాలే దిక్కు.. ఈనెల 15వ తేదీతో విద్యాసంవత్సరం ముగియనుంది. ఆ తర్వాత వారం రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఆలోపు పాఠ్యపుస్తకాలు అందడం కష్టమని భావించిన విద్యాశాఖ పాతపుస్తకాల సేకరణ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈమేరకు మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం విద్యాసంవత్సరం ముగించుకున్న విద్యార్థుల నుంచి పాఠ్యపుస్తకాలు సేకరించి.. వాటిని కొత్త తరగతిలో అడుగుపెట్టే వారికి అందజేయాలని ఆయన సూచించారు. దీంతో కొత్త విద్యాసంవత్సరం పాత పుస్తకాలతోనే ప్రారంభం కానున్నట్లు అవగతమవుతోంది. -
పుస్తకాలు లేవు.. పంతుళ్లూ లేరు
చదువు సాగేదెట్లా.. పూర్తిగా అందని పాఠ్యపుస్తకాలు వేధిస్తున్న సబ్జెక్టు టీచర్ల కొరత రెగ్యులర్ ఎంఈఓలు లేక కొరవడిన పర్యవేక్షణమూడు నెలల్లో పదోతరగతి పరీక్షలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన విద్యారణ్యపురి మరో నాలుగు నెలల్లో విద్యా సంవత్సరం పూర్తికానుంది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పూర్తిస్థారుులో అందలేదు. జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా పుస్తకాలు సరఫరా కాలేదు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారికి మార్చిలో వార్షిక పరీక్షలు జరగనున్నారుు. అంటే మధ్యలో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. పాఠ్యపుస్తకాలు అందకపోవడంతో పాటు సబ్జెక్టు టీచర్ల కొరత కూడా ఉంది. దీంతో ఈ విద్యా సంవత్సరం వార్షిక పరీక్షలు ఎలా రాయూలని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విద్యాసంవత్సరాని(2015-2016)కి జిల్లాలోని 3,260పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం అన్ని రకాల టైటిల్స్ కలిపి 21లక్షల 50వేల పాఠ్యపుస్తకాలు కావాలని విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అరుుతే, 2014 సెప్టెంబర్ డైస్ లెక్కల ప్రకారం పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ 180 టైటిల్స్కు చెందిన 15,95,545 పుస్తకాలనే పంపించారు. అరుుతే, గతంలో ఉన్న లెక్కలతో పోలిస్తే.. ఈసారి కొన్ని పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరగగా, మరికొన్నింట్లో తగ్గింది. అలాగే, పలు పాఠశాలల్లో ప్రాథమిక స్థారుు నుంచే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో విద్యార్థుల సంఖ్య పెరిగిన కారణంగా.. పాఠ్యపుస్తకాల కొరత ఏర్పడింది. రెండో దశలో 5.94 లక్షల పాఠశాల పుస్తకాల కోసం.. మొదటి దశలో పంపించిన పాఠ్యపుస్తకాలు సరిపోని కారణంగా అన్ని టైటిళ్లు కలిపి 5,93,530 పాఠ్యపుస్తకాలు రెండో దశలో అందజేయూలని ఈ ఏడాది ఆగస్టులో పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్కు ఇక్కడి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అరుుతే, ప్రతిపాదనలు పంపించిన ఐదు నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు పుస్తకాలు అందలేదు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నారుు. ఇలా పాఠ్యపుస్తకాలు లేకుండానే సమ్మిటివ్-1 పరీక్షలు రాసేశారు. కాగా, ఎస్సె స్సీ విద్యార్థులకు మార్చి 1నుంచి 10వ తరగతి వరకు ప్రీ ఫైనల్, 21వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠ్యపుస్తకాలు అందని కారణంగా పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో అర్థం కాక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సమగ్ర మూ ల్యాంకన విధానంలో పరీక్షలు నిర్వహించనున్నందున పాఠ్యపుస్తకాలు కాకుండా టెస్ట్ పేప ర్లు, గైడ్లు చదివి పరీక్షలు రాసే పరిస్థితి లేదు. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్, ఎరుుడెడ్, రెసిడెన్షియల్, మోడల్, కేజీబీవీల పాఠశాలల్లో కలిపి 52,075మంది విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలు రాయనున్నారు. ఇందులో 40శాతం ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులుగా అనుకున్నా, మిగతా వారందరూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఉంటారు. వీరిలో ఎక్కువ మందికి పాఠ్యపుస్తకాలు అందనందున వార్షిక పరీక్షలు ఎలా రాస్తారన్నది అధికారులకే తెలియాలి. సబ్జెక్టు టీచర్ల కొరత.. వర్క్ అడ్జస్ట్మెంట్ ఆదేశాలు బేఖాతర్ జిల్లాలోని 530వరకు ప్రభుత్వ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నారుు. ఇందులోని కొన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉండడంతో విద్యాబోధన సాగడం లేదు. అరుుతే, కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీలు ఎక్కువగా ఉండగా... వర్క్ అడ్జెస్ట్మెంట్ కింద ఏ మండల పరిధి ఎస్జీటీలను అదే మండలంలో ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను కేటారుుస్తూ కలెక్టర్ అనుమతితో డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఇలా 499మంది పీఎస్లు, యూపీఎస్ల్లోని ఎస్జీటీలను హైస్కూళ్లకు కేటారుుంచగా.. ఇందులో 50నుంచి 60శాతం మందే విధుల్లో చేరారు. మిగతా వారందరూ హైస్కూళ్లకు వెళ్లకుండా అధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నట్లు సమాచారం. పాలకుర్తి మండలం మల్లంపెల్లి హైస్కూల్, కొండపర్తి హైస్కూళ్లకు కేటారుుంచిన ఇద్దరేసి ఎస్జీటీలు ఇప్పటి వరకు విధుల్లో చేరకపోవడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. అరుుతే, వర్క్ అడ్జెస్ట్మెంట్లో భాగంగా కేటారుుంచిన ఉపాధ్యాయులు ఎందరు విధుల్లో చేరారన్న సరైన సమాచారం డీఈఓ కార్యాలయూనికి అందకపోవడం గమనార్హం. పాఠ్యపుస్తకాల కోసం డెరైక్టర్ దృష్టికి తీసుకెళ్లా ఈ విద్యాసంవత్సరంలో వచ్చిన పాఠ్యపస్తకాలు విద్యార్థులందరికీ సరిపోలేదు. రెండో దశలో మరికొన్ని పుస్తకాలు కావాలని ప్రతిపాదించగా ఇంత వరకూ రాలేదు. ఈ విషయూన్ని వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ దృష్టికి తీసుకెళ్లాను. అరుునా, మరోసారి మాట్లాడుతాను. ఇక ఉన్నత పాఠశాలల్లోని సబ్జెక్టు టీచర్ల కొరత తీర్చేందుకు ఇటీవలే వర్క్ అడ్జస్ట్మెంట్ కింద 499మంది ఎస్జీటీలను పంపిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా 60 నుంచి 70శాతమే విధుల్లో చేరారు. మిగతా వారు కూడా విధులకు హాజరయ్యేలా చూస్తాం. అలాగే, ఎస్సెస్సీ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాం. - పి.రాజీవ్, డీఈఓ ఇద్దరే రెగ్యులర్ ఎంఈఓలు జిల్లాలో 51మండలాలు ఉండగా హన్మకొండ, నల్లబెల్లి మండలాలకే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగతా 49 మండలాల్లో సీనియర్ పీజీ హెచ్ఎంలే ఇన్చార్జి ఎంఈఓలుగా వ్యవహరిస్తుండడంతో పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడింది. తరచూ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్ తదితర పనుల్లో ఎంఈఓలు నిమగ్నమవుతున్న కారణంగా స్కూళ్లను పరిశీలించడం సాధ్యం కావడం లేదు. పీజీ హెచ్ఎంలు తమ పాఠశాలలను కూడా చూసుకోవాల్సి ఉండడం దీనికి మరో కారణమని చెప్పొచ్చు. -
పాఠం.. ఇక ఏకరూపం
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయి పోటీ పరీక్షలకు అనుగుణంగా ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వాలే ఇంటర్మీడియెట్ పాఠ్యపుస్తకాలను మార్పు చేసుకునేవి. ఇప్పుడు కేంద్రమే వీటిని జాతీయస్థాయిలో ఒకేలా ఉంచేందుకు కసరత్తు చేపట్టింది. ప్రధానంగా సైన్స్, మ్యాథ్స్ వంటి సబ్జెక్టులన్నీ రాష్ట్రాల బోర్డులు, కేంద్రీయ బోర్డుల్లోనూ ఏకరూపంలో ఉండాలని నిర్ణయించింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్/12వ తరగతి వరకు ఆయా సబ్జెక్టులకు సంబంధించి ఒకే రకమైన సిలబస్తో ఆధారిత పుస్తకాలను తీసుకురావాలని పేర్కొంది. ఈ బాధ్యతను జాతీయ ఉపాధ్యాయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ)కి అప్పగించింది. దీంతో ఎన్సీఈఆర్టీ అన్ని రాష్ట్రాల రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండళ్ల (ఎస్సీఈఆర్టీ) అధికారులతో ఢిల్లీలో సమావేశమైంది. పుస్తకాల్లోని అంశాలే కాకుండా పాఠ్యపుస్తకాల నాణ్యత కూడా ఒకేలా ఉండేలా మార్పులు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో రాష్ట్రంలోనూ విద్యాశాఖ ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే 8, 9, 10 తరగతులు, ఇంటర్ సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులను జాతీయస్థాయిలో పరీక్షలకు అనుగుణంగా మార్పు చేశారు. ఇప్పుడు ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు పుస్తకాల్లో మార్పులపై కసరత్తు చేస్తోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తరహాలో సిలబస్లో మార్పులు చేస్తోంది. 11 విభాగాల్లో మార్పులు అవసరం పాఠ్య పుస్తకాల్లో ప్రధానంగా 11 విభాగాలకు చెందిన వివిధ అంశాల్లో మార్పులు అవసరమని ఎన్సీఈఆర్టీ పేర్కొంది. ఉదాహరణకు ఒకటి, రెండు తరగతుల్లో గణితం సబ్జెక్టుకు సంబంధించిన విభాగాలు, అంశాలు, పుస్తక నిర్మాణం ఎలా ఉండాలన్న విషయాలను స్పష్టంగా వివరించింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఉన్న పుస్తకాలు ఎలా ఉన్నాయి.. వాటిల్లో ఏయే మార్పులు చేయాలో స్పష్టం చేసింది. 11 రకాల విభాగాలు ఇవే.. 1. జనరల్ ఇన్ఫర్మేషన్: తరగతి, పేరు, రచయిత, పబ్లికేషన్, పేజీలు, పాఠాలు, రివ్యూలు, పుస్తకం ధర. 2. పుస్తక స్వరూపం: ఇందులో పేపరు నాణ్యత, బైండింగ్, కవర్పేజీ, ముద్రణ నాణ్యత, ఫాంట్ సైజ్, లేఅవుట్, పుస్తకంలో కాన్సెప్టులు, ప్రాబ్లం సాల్వింగ్, లాజికల్ ఆర్గ్యుమెంట్, కమ్యూనికేషన్ అంశాలు. 3. కంటెంట్ ఆర్గనైజేషన్: వాస్తవ అంశాలు, విధానాలు. అదనపు సమాచారం. విధానాల సమగ్రత. గణితం టెర్మినాలజీ. 4. విద్యార్థి కేంద్రీకృత యాక్టివిటీస్: యాక్టివిటీస్ విద్యార్థి నిత్య జీవితంలో చూసినవై ఉండాలి. పుస్తకాల్లో చదివిందే కాదు వాటిని మించి ఆలోచించగలిగేలా ఉండాలి. 5. ప్రశ్నల విధానం: రీజనింగ్ ఆధారిత, యాక్టివిటీ ఆధారిత, సమస్యాపూరక, సృజనాత్మకంగా, లోపాలను గుర్తించేలా ఉండాలి. 6. విజువల్స్: కనిపించే బొమ్మల్లో స్పష్టత. వాటి స్టైల్. పాఠ్యాంశంతో బొమ్మల అనుసంధానం, రంగులు, లేఅవుట్. 7. ఆసక్తి పెంచేవి: ఆయా అంశాల్లో విద్యార్థుల ముందుండే చాలెంజెస్, అందులో విద్యార్థి స్వయంగా పాల్గొనేలా చేయడం. సృజనాత్మకంగా, సొంతంగా ఆలోచించేలా చేసేవి. టెక్నాలజీని వినియోగింపజేసేవి. 8. టీచర్స్ సపోర్ట్: పాఠ్య పుస్తకాల వినియోగ మార్గదర్శకాలు, భాషా మార్గదర్శకాలు. కంటెంట్ కేంద్రీకృత సమాచారం. బొమ్మలు, ఇతర గ్రూపులతో చర్చించడం, బోధన సామగ్రి వినియోగం. 9. నేషనల్ కన్సర్న్: లౌకికత్వం, ఐకమత్యం, పరస్పర మర్యాద, విలువలు, మానవత్వం. రాజ్యాంగ విలువలు, స్త్రీపురుష సమానత్వం. 10. భాష: పాఠ్యాంశాల్లో విద్యార్థి వయసు మేరకు భాష ఉండాలి. 11. ఇతర అంశాలు: వర్క్బుక్, ఇతర మెటీరియల్, రెఫరెన్స్, నేర్చుకునే విధానం. -
బుక్కుల్లేవ్.. పాఠాల్లేవ్!
♦ ఇంటర్ విద్యార్థులకు అరకొరగా పుస్తకాలు ♦ ఒకేషనల్ పుస్తకాలు అసలే లేవు ♦ ఎదురుచూస్తున్న విద్యార్థులు ప్రయివేటు కాలేజీలకు దీటుగా విద్య అందిస్తామన్నారు.. ఫలితాల విషయంలో పోటీ పడతామన్నారు.. ఆచరణకు వచ్చేసరికి షరామామూలే. జూనియర్ కాలేజీలు ప్రారంభమై నెల గడిచిపోయినా విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలే అందించలేని అధికారులు ఫలితాల సాధనలో లక్ష్యాలెలా సాధిస్తారో వేచి చూడాల్సిందే. కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఇంటర్ ఉచిత పుస్తకాలు కొంతమందికే అందాయి. సాధారణ కోర్సుల్లో తెలుగు మీడియం పుస్తకాలు అరకొరగా రాగా ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు రానేలేదు. కళాశాలలు గత నెల 8వతేదీ ప్రారంభమయ్యాయి. నెల రోజులు గడిచినా పుస్తకాలు అందక పోవడంతో విద్యార్థులు వాటికోసం ఎదురుచూస్తుండగా వస్తాయంటూ అధికారులు పొద్దెళ్లబుచ్చుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 42 ప్రభుత్వ, 10 ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, వాటికి అనుబంధంగా 14 కళాశాలల్లో ఒకేషనల్ కోర్సులున్నాయి. ఈ ఏడాది ఎప్పుడు లేనివిధంగా ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కళాశాలలు ప్రారంభమయ్యేనాటికే పుస్తకాల పంపిణీని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆచరణలో మాత్రం అలాంటి చర్యలేవీ కనిపించలేదు. ఒకేషనల్కు 3 టైటిల్సే పంపిణీ ఒకేషనల్ కోర్సులో ఏఅండ్టీ, ఓఏ, సీఎస్ఈ, ఈఈటీ, సీజీటీ, ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ(ఎఫ్), సీటీ, ఏఈటీ, సీజీటీ, ఈటీ, సెరికల్చరర్ విభాగాలున్నాయి. ప్రతి విభాగానికి ఇంగ్లీషు కామన్గా ఉంటుంది. ఇందులో రెండో సంవత్సరానికి సంబంధించి ఇంగ్లీషు, ఏఅండ్టీ, ఓఏ విభాగాల్లోని కామర్స్ పాఠ్య పుస్తకాలను మాత్రమే పంపిణీ చేశారు. మొదటి సంవత్సరానికి సంబంధించి కామర్స్ పాఠ్యపుస్తకం మాత్రమే వచ్చింది. అరకొరగా తెలుగు మీడియం పుస్తకాలు ఫస్టియర్కు సంబంధించి 22 టైటిల్స్కుగాను 13 టైటిల్స్ పుస్తకాలే వచ్చాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు మొత్తం 19,779 పుస్తకాలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 15,144 మాత్రమే వచ్చాయి. సెకండియర్కు సంబంధించి 22 టైటిల్స్కుగాను 15 టైటిల్స్ పుస్తకాలు మాత్రమే వచ్చాయి. జిల్లావ్యాప్తంగా రెండో సంవత్సరం విద్యార్థులకు 32,935 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా 23,933 పుస్తకాలు మాత్రమే మిగిలిన 9002 పుస్తకాల్లో కూడా తెలుగు మీడియం పుస్తకాలే అధికంగా రావాల్సి ఉంది. రావాల్సిన పుస్తకాల వివరాలు మొదటి సంవత్సరానికి సంబంధించి హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సివిక్స్, ఎకనామిక్స్, ఇంగ్లీషు, హిస్టరీ, జువాలజీ, బాటనీ, రెండో సంవత్సరానికి సంబంధించి తెలుగు, జువాలజీ, సంస్కృతం, సివిక్స్, మ్యాథ్స్2ఏ, కెమి స్ట్రీ పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. రెండు రోజుల్లో వస్తాయన్నారు రెండు, మూడు రోజుల్లో పుస్తకాలు వస్తాయనే సమాచారం ఉంది. ఇప్పటి వరకు సెకండియర్కు సంబంధించి ఇంగ్లీషు, కామర్స్ పుస్తకాలు ఇచ్చాయి. ఫస్టియర్లో కామర్స్ పుస్తకాలను మాత్రమే ఇచ్చాం. మిగతా పుస్తకాలు రాగానే ఇస్తాం. - గాంధీ, ప్రిన్సిపాల్, ఒకేషనల్ కాలేజీ, కర్నూలు జనరల్ కోర్సులకు సంబంధించిన పుస్తకాలే వస్తున్నాయి ఇంటర్ ఉచిత పుస్తకాలు జనరల్ కోర్సులకు సంబంధించే వస్తున్నాయి. వాటిని ఇప్పటికే పంపించేశాం. ఒకేషనల్లో అకౌంట్స్కు సంబంధించిన పుస్తకాలు మాత్రమే వచ్చాయి. మిగతావి రాగానే కాలేజీలకు పంపిస్తాం. వెంకటరావు, డీవీఈఓ, కర్నూలు -
పుస్తకాల్లేవ్.. చదువెలా!
నేటికీ పంపిణీ కాని పాఠ్యపుస్తకాలు విజయవాడ : ప్రింటింగ్ ప్రెస్ల ముద్రణలో తీవ్ర జాప్యం, అధికారుల మధ్య కొరవడిన సమన్వయం వెరసి విద్యార్థుల పాలిట శాపంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు 20 రోజులు దాటినా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో పంపిణీ కాలేదు. విద్యా సంవత్సరం ప్రారంభానికి వారం ముందే పాఠశాలలకు పుస్తకాలు చేరతాయని, జూన్ 15 నాటికల్లా వాటిని పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ ఆచరణలో అది జూలై 20 నాటికి కూడా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 3,340 ఉన్నాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులందరికీ పుస్తకాలను ప్రభుత్వమే పంపిణీ చేయాల్సి ఉంది. జిల్లాలో ఈ విధంగా 20 లక్షల 21 వేల 305 పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా, దశలవారీగా పంపిణీ ప్రారంభించారు. రాష్ట్ర విభజనకు ముందు అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలు హైదరాబాద్లోని ప్రభుత్వ ముద్రణాలయంలో ప్రింట్ అయ్యి.. జిల్లాలోని మెయిన్ స్టోర్స్కు వచ్చేవి. వాటిని మండలాల వారీగా పోస్టల్ శాఖ ద్వారా సరఫరా చేసేవారు. విద్యా సంవత్సరం మొదలైన వారం రోజుల కల్లా పంపిణీ ప్రక్రియ పూర్తయ్యేది. ఈ ఏడాది రాష్ట్ర విభజనతో హైదరాబాద్ ముద్రణాలయం నుంచి పుస్తకాలు సరఫరా కాలేదు. దీంతో ప్రభుత్వం పుస్తకాల ప్రింటింగ్ బాధ్యతలను ఆరు జిల్లాల్లోని ప్రింటింగ్ ప్రెస్లకు అప్పగించి వాటి ద్వారా 13 జిల్లాలకు సరఫరా చేస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 20 లక్షల 21 వేల పుస్తకాలకు గాను 18 లక్షల 95 వేల 939 పుస్తకాలు విజయవాడ ఆటోనగర్లోని స్టోర్స్కు వచ్చాయి. వాటిలో ఇప్పటి వరకు 17 లక్షల 77 వేల 767 పుస్తకాలు పంపిణీ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలకే ప్రాధాన్యం... మిగిలిన పుస్తకాల పంపిణీకి మరికొంత సమయం పట్టే అవకాశముంది. ప్రెస్ల నుంచి రావాల్సిన పుస్తకాలు ఆలస్యమవుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కావటంతో ప్రైవేట్ ప్రెస్లు వివిధ కార్పొరేట్ విద్యా సంస్థల పుస్తకాలు ముద్రణ చేసే బిజీలో ఉండి ప్రభుత్వ ఆర్డర్లను పక్కన పెడుతున్నాయి. కలెక్టర్ అసంతృప్తి...: శనివారం జిల్లా కలెక్టర్ బాబు.ఎ విజయవాడ ఆటోనగర్లో ఉన్న పుస్తకాల స్పోర్ట్స్ను పరిశీలించారు. పుస్తకాల పంపిణీ జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. విద్యాసంవత్సరం మొదలై 20 రోజులు దాటినా ఇంకా పంపిణీ చేయకపోవటమేమిటని జిల్లా విద్యాశాఖాధికారిని ప్రశ్నించారు. దీనిపై దృష్టి సారించి వెంటనే పుస్తకాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటర్ పుస్తకాలదీ అదే పరిస్థితి... ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియెట్ పుస్తకాలను కూడా ప్రభుత్వమే పంపిణీ చేస్తోంది. దీనిలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో రెండు లక్షల వరకు ఇంటర్మీడియెట్ పుస్తకాలు అవసరం కాగా, వాటిలో ఇప్పటి వరకు 60,647 పుస్తకాలు మాత్రమే అందాయి. మిగిలిన పుస్తకాలు దశలవారీగా అందనున్నాయి. -
సర్కారీ ఇంటర్ ఉచితం
-
సర్కారీ ఇంటర్ ఉచితం
* ఫీజుల రద్దు, పుస్తకాలతో బోర్డుపై ఏటా రూ. 16 కోట్ల భారం * ఉప ముఖ్యమంత్రి కడియం వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఇకపై ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ విద్య పూర్తిగా ఉచితం కానుంది. ప్రభుత్వ కళాశాలలో చేరే విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజుల పేరుతో ఏటా వసూలు చేస్తున్న (ఒక్కొక్కరి నుంచి రూ. 533 నుంచి 893) కనీస మొత్తాన్ని కూడా తీసుకోవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తిగా ఉచిత విద్యను అందించాలని ఇంటర్మీడియెట్ బోర్డు పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ప్రతి విద్యార్థికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. బుధవారం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో సమావేశం అనంతరం కడియం శ్రీహరి విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠ్యపుస్తకాలు కూడా కొనుక్కోలేని విద్యార్థులు ఉన్నందున, ప్రిన్సిపాళ్ల ద్వారా జూలై నెలాఖరులోగా ఉచితంగా అందించాలని నిర్ణయించామన్నారు. విద్యార్థి తన ఐడీ కార్డు ద్వారా పుస్తకాలను పొందవచ్చన్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని విలేకరులు కడియం దృష్టికి తీసుకెళ్లగా.. ‘ముందుగా నా ఇంటిని పటిష్టం చేస్తా. ప్రభుత్వ జూనియర్ కాలేజీలను అభివృద్ధి చేస్తా. నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు చర్యలు చేపడతాం. అసలు ప్రైవేటు కాలేజీలకు వెళ్లకుండా చేయాలన్నదే నా మొదటి ప్రాధాన్యం. వాటి నియంత్రణ తరువాత అంశం’ అని వివరించారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలోని 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1.15 లక్షల మంది విద్యార్థులున్నారు. ఈసారి ఈ సంఖ్య 1.30 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. వారంతా ఈసారి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సైన్స్ విద్యార్థుల నుంచి ఏటా రూ. 893, ఆర్ట్స్ విద్యార్థుల నుంచి రూ.533 వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే చెల్లించిన వారికి తిరిగిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఇలా 1.30 లక్షల మంది విద్యార్థులు చెల్లించాల్సిన దాదాపు రూ. 9 కోట్లు ఇంటర్ బోర్డే ఇకపై భరిస్తుంది. అలాగే పాఠ్యపుస్తకాలకు అయ్యే రూ.7 కోట్లను కూడా బోర్డే భరించనుంది. అని కడియం వివరించారు. అన్ని కాలేజీలకు పక్కా భవనాలు, మౌలిక సదుపాలు కల్పిస్తామని చెప్పారు. క్రమబద్ధీకరణ తరువాత పోస్టుల భర్తీ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ తరువాత మిగిలిన పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడతామని కడియం శ్రీహరి తెలిపారు. ప్రభుత్వం భర్తీ చేయనున్న 25 వేల పోస్టుల్లో లెక్చరర్ పోస్టులు ఉండేలా చూస్తున్నామన్నారు. కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఎంసెట్కు శిక్షణ ఇస్తామని ఆయన వివరించారు. 2 రోజుల్లో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఒకటి రెండు రోజుల్లో వెల్లడించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఫలితాల వెల్లడికి సంబంధించిన పనులను పూర్తి కావ చ్చాయని వెల్లడించారు. కాగా అఫిలియేషన్లపై ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయని విలేకరులు ప్రస్తావించగా.. తప్పు చేసిన వారు భయపడతారని, తప్పు చేయనపుడు ఎందుకు భయమని పేర్కొన్నారు. దీనిపై తామేమీ చేసేది లేదని చెప్పారు. -
పుస్తకాలేవీ...?
సాక్షి, మంచిర్యాల : ఊహించినట్టే జరిగింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ఒక రోజు మాత్రమే మిగిలి ఉన్నా.. ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు ఇంకా చేరనే లేదు. చాలా చోట్ల.. కనీసం మండల వనరుల కేంద్రాలకూ చేరుకోలేదు. స్కూళ్లు తెరిచేలోగా.. పుస్తకాలు పాఠశాలలకు చేర్చి విద్యార్థులందరికీ అదే రోజు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. జిల్లాకు 17.40 లక్షల పుస్తకాలు అవసరముండగా.. ఇప్పటి వరకు జిల్లా ప్రభుత్వ పాఠ్య పుస్తకాల గోదాముకు 16 లక్షల పుస్తకాలు మాత్రమే వచ్చాయి. ఇటు.. జిల్లాకు వచ్చిన పుస్తకాలను మండలాలకు చేరవేయడంలోనూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 10 లక్షల పుస్తకాలు మాత్రమే మండల వనరుల కేంద్రం (ఎమ్మార్సీ)లకు వెళ్లాయి. వాటిలో 4 లక్షలకు మించి పుస్తకాలు స్కూల్ పాయింట్లకు చేరలేదు. మరోపక్క.. జిల్లాలో 270 స్కూళ్లలో ఆంగ్ల మాద్యమం అమలవుతున్నా.. అందులో చదువుతున్న విద్యార్థులకు ఇవ్వాల్సిన లక్ష పాఠ్యపుస్తకాల్లో ఒక్కటీ జిల్లాకు రాలేదు. దీంతో విద్యార్థులు తొలి రోజు ఖాళీ చేతులతోనే ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. మరోపక్క.. ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిన పుస్తకాలన్నీ తెలుగు మాద్యమానికి సంబంధించినవే. ఇంగ్లిష్.. హిందీ.. మరాఠీ.. ఉర్దూ మాద్యమాలకు సంబంధించిన పుస్తకాలు ఇంకా జిల్లాకే రాలేదు. అవి వచ్చి.. ఎమ్మార్సీలకు అక్కడి నుంచి స్కూల్ పాయింట్లకు వెళ్లే వరకు ఇంకెన్ని రోజులు పడుతుందో తమకే తెలియదని అధికారులే చెప్పడం గమనార్హం. ఈ విషయమై పాఠ్య పుస్తక గోదాము జిల్లా మేనేజర్ రమేశ్ వివరణ ఇస్తూ.. ‘తెలుగేతర పాఠ్య పుస్తకాలు ఇంకా జిల్లాకు రాలేదు. వచ్చిన వెంటనే స్కూళ్లకు పంపిస్తాం’ అని అన్నారు. అరకొరగా పంపిణీ జిల్లాలో అన్ని యాజమాన్యాల్లో కలుపుకుని 4,200 ప్రభుత్వ ప్రాథమిక, 750 ప్రాథమికోన్నత, 540 ఉన్నత పాఠశాలలున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ఎయిడెడ్, కస్తూర్బా పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేస్తోంది. ఈ క్రమంలో గత విద్యా సంవత్సరం అక్టోబర్ నెలలోనే ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల సంఖ్యకనుగుణంగా వచ్చే సంవత్సరానికి అవసరమయ్యే పాఠ్య పుస్తకాలను సబ్జెక్టుల వారీగా జిల్లా విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపారు. అవి డీఈవో ఆమోదముద్ర తర్వాత విద్యాశాఖ డెరైక్టర్కు వెళ్లాయి. అప్పుడే పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రారంభం కావల్సి ఉండగా.. ఈసారి 6 నుంచి పదో తరగతి వరకు సాంఘిక శాస్త్రంలో తెలంగాణ చరిత్ర.. ఉద్యమకారుల జీవిత విశేషాలు, తెలుగు, హిందీ పాఠ్యాంశాల్లో తెలంగాణ సాహిత్యం-కవులు, కళాకారుల జీవిత విశేషాలు చేర్చడంతో కొంత ఆలస్యమైనట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. కానీ.. జిల్లాకు వచ్చిన పుస్తకాలు మండలాలకు పంపడంలో ఎందుకు జాప్యమవుతోందో చెప్పలేకపోతున్నారు. పాఠ్యపుస్తకాల గోదాము ‘తూర్పు’ ప్రాంతంలోనే ఉన్నా.. ఈ ప్రాంత పరిధిలోని సమీప మండలాలకూ ఇంత వరకు పుస్తకాలు పూర్తి స్థాయిలో చేరలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాగజ్నగర్లో 54 వేల పుస్తకాలు అవసరముంటే.. కేవలం 24 వేలు మాత్రమే వచ్చాయి. చెన్నూరులో 32 వేలకు 27 వేలు, జైపూర్కు 31,300లకు 27,600, కాసిపేటలో 21 వేలకు 11,580, నెన్నెలలో 22 వేలకు 11 వేలు, కౌటాలలో 41 వేలకు 31 వేల పుస్తకాలు మాత్రమే వచ్చాయి. ఆందోళనలో ‘ప్రైవేట్’ విద్యార్థులు.. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇలా ఉంటే.. ఈ సారి ప్రైవేట్ విద్యార్థులకూ పాఠ్య పుస్తకాల బెంగ పట్టుకుంది. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలనే ప్రైవేట్ స్కూళ్లలో అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. కానీ.. ప్రైవేట్ విద్యా సంస్థలు దీనికి ఒప్పుకోలేదు. తాము తయారు చేసిన సిలబస్ అమలు చేస్తామనే మంకుపట్టుతో ఉన్నారు. మరోపక్క.. జిల్లాలోని పలు పట్టణాల్లోని దుకాణాల్లో ప్రభుత్వ పుస్తకాలను అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం ఇంత వరకు చేరవేయకపోవడంతో ప్రైవేట్ విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా ఈ విద్యా సంవత్సరం తొలి నెల రోజుల వరకు విద్యార్థులకు చదువు కష్టాలు తప్పేలా లేవు. -
అందుబాటులో లేని ఇంటర్ పుస్తకాలు
♦ ‘ద్వితీయ’ ఆర్ట్స్ విద్యార్థులకు ప్రారంభం కాని బోధన ♦ సిలబస్లో మార్పుతో ఇంకా ప్రారంభం కాని ముద్రణ ♦ పరిశీలనలోనే నమూనా పుస్తకాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కాలేజీలు ఈనెల 1న ప్రారంభం అయినా పాఠ్య పుస్తకాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. పుస్తకాల ముద్రణ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆర్ట్స్ గ్రూపుల్లో పాఠ్యాంశాల బోధన జరగడం లేదు. దీంతో విద్యార్థులు కాలేజీలకు వచ్చి కూర్చొని వెళ్లిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఈసారి ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్ గ్రూపుల పుస్తకాల్లో సిలబస్ను మార్చేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. కానీ, ఈ మార్పులను సకాలంలో పూర్తి చేయకపోవడంతో దాదాపు 3 లక్షల మంది ద్వితీయ సంవత్సర ఆర్ట్స్ గ్రూపు విద్యార్థులకు పుస్తకాలు లేని పరిస్థితి ఏర్పడింది. విద్యాశాఖ సిలబస్ను ఏప్రిల్ నెలలో ఖరారు చేసింది. ఆ తరువాత పుస్తకాల రచన కోసం తెలుగు ఆకాడమీకి పంపించింది. అకాడమీ నెల రోజుల్లో పుస్తకాలను రాయించి, ఇంటర్మీడియెట్ బోర్డు, విద్యాశాఖ ఆమోదం కోసం పంపించింది. వారు అనుమతి ఇచ్చాకే ముద్రణను ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో ఇంకొన్నాళ్లు విద్యార్థులు పుస్తకాలు లేకుండానే కాలేజీలకు ఊరకే వెళ్లి రావాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులకు ఏదో ఒకటి చెబుతున్నా.. ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం బోధన ప్రారంభమే కాలేదు. మరోవైపు పాఠశాలల పుస్తకాల్లో చేసిన మార్పుల తరహాలోనే ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర ఆర్ట్స్ గ్రూపుల పుస్తకాల్లోనూ మార్పులు చేశారు. అంతర్జాతీయ, జాతీయ చరిత్రతోపాటు తెలంగాణ చరిత్రపైనా కొత్తగా పాఠాలు పెట్టారు. పొలిటికల్ సైన్స్, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు, తెలంగాణలో పంటలు, వాణిజ్య పరిస్థితులపై పాఠ్యాంశాలను పొందుపరిచినట్లు తెలిసింది. ప్రస్తుతం నమూనా పుస్తకాలను విద్యాశాఖ పరిశీలన జరుపుతోంది. వివాదాలకు తావులేకుండా పాఠ్యాంశాలను క్షుణ్ణంగా పరిశీలన జరుపుతోందని, అందుకే ఆలస్యం అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
రెక్కల పుస్తకం
అనగనగా ఓ రాజు. ఆ రాజ్యం అంతా కాగితంతోనే కట్టారు. రాజుగారి ప్యాలెస్ నుంచి వాచ్మెన్గారి ఇల్లు దాకా అంతా కాగితమే. సోఫాలు, కుర్చీలు, బల్లలు, ప్లేట్లు, కప్పులు, స్పూన్లు... ఎవ్రీథింగ్ ఈజ్ పేపర్. కార్లు, బస్లు, ట్రైన్లు... విమానాలు కూడా. అంతే కాదు ఆ రాజ్యంలో అందరి డ్రీమ్స్ కూడా కాగితపు కట్టడాలే. మమ్మీ డాడీ చాలా హ్యాపీ... ఎందుకంటే పిల్లలు టీవీలూ సెల్ఫోన్లూ కంప్యూటర్లతో కాకుండా ఎప్పుడూ కాగితాల్లో మునిగి క్రియేటివిటీలో తేలుతుంటారు. చూసింది చదవలేం కానీ... చదివింది చూడగలం... ఊహల్లో చూడగలం. పిల్లల ఊహాశక్తిని ఆవిష్కరించేవే ఈ కాగితపు రెక్కలు... మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు. మంచి పిల్లాడికి? ఒక పుస్తకం. చెడ్డ పిల్లాడికైనా ఒక పుస్తకమే. అవే వారిని దారిన పెడతాయి. దారి చూపిస్తాయి. పిల్లలను ఉన్నచోటే ఉంచుతూ కాల్పనిక, వాస్తవిక జగత్తులో ఏకకాలంలో విహరింపజేసే మహత్తు పుస్తకాలకే ఉంది. విజ్ఞానం కావాలంటే వాటినే ఆశ్రయించాలి. వినోదం కావాలంటే వాటి అట్ట తెరవాలి. ‘నా చదువుకు నా విద్య ఎప్పుడూ ఆటంకం కాకుండా జాగ్రత్త పడ్డాను’ అన్నాడు ఐన్స్టీన్. పాఠశాలలో చదివే పాఠ్యపుస్తకాల ద్వారా అందే విద్య ఎలాగూ అందుతుంది. కాని పిల్లలకు చదువు కావాలి. వారికి తెలివి, యుక్తి, ధైర్యం, పట్టుదల, రుజుమార్గం, సందర్భాలను ఎదుర్కొనే పరిణతి ఇవన్నీ సాహిత్యం నుంచే అబ్బుతాయి. శత్రువుకు భయపడి గుహలో దాక్కున్న తైమూర్ రాజు ఒక చీమ తన కంటే మూడింతలు బరువున్న ఆహారతుంటను అతికష్టం మీద మోసుకెళ్లడం చూసి స్ఫూర్తి పొంది, ఒక చీమ చేయగలిగిన పని ఒక మనిషిని చేయలేనా అని పట్టుదల తెచ్చుకుని, శత్రువును ఓడించి తన రాజ్యం తిరిగి దక్కించుకున్నాడు. ఇలాంటి కథలు పిల్లలకు అవసరం. భారతదేశం అదృష్టవశాత్తూ కథల భాండాగారం. కాని తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఆ భాండాగారాన్ని వారికి దూరం చేస్తోంది. పిజా, బర్గర్, సినిమా, వీడియోగేమ్స్... అడిగితే ఇవ్వొచ్చు. తప్పు లేదు. కాని తోడుగా పుస్తకం కూడా ఇవ్వాలి. అప్పుడే పిజ్జా, బర్గర్, వీడియోగేమ్స్ ఇవ్వలేని ఒక అంతఃజ్ఞానం దాని ద్వారా అందుతుంది. రేపో మాపో స్కూళ్లు తెరవబోతున్నారు. వారి కోసమని నోటు పుస్తకాలు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు కొనడమే ముఖ్యమనుకోవద్దు. ఈ పుస్తకాలు కొనడం, చదివించడం కూడా ముఖ్యమే. హార్లిక్స్, బూస్ట్, పిడియాషూర్లలాగే పుస్తకాలు కూడా బలవర్థకమైన ఆహారం. కాకుంటే మేధకు. బొమ్మల రామాయణం, భారతం పిల్లలకు ఇవి ఉగ్గుపాల వంటివి. కథ పట్ల తొలి కుతూహలం కలిగించే రామాయణ, భారతాలను పిల్లలు వాటి నాయకులైన రాముడు, కృష్ణుడు కోసమే కాకుండా ఆంజనేయుడు, కుంభకర్ణుడు, భీముడు, అర్జునుడు, బకాసురుడు, ఘటోత్కచుడు కోసం కూడా ఇష్టపడతారు. విలువలను నేర్పడంలో రామాయణం ముందుంటే విలువలను ఉల్లంఘిస్తే జరిగే పెను పరిణామాలను భారతం తెలియచేసి హెచ్చరిస్తుంది. అరేబియన్ నైట్స్ మొత్తంగా ఈ పేరుతో తెలుగులో పుస్తకాలు లేవు. కాని అరేబియన్ నైట్స్లో విస్తృతంగా ఖ్యాతి పొందిన సింద్బాద్, అల్లావుద్దీన్ అద్భుతదీపం, ఆలీబాబా నలభై దొంగలు, బాగ్దాద్ గజదొంగ, ఎగిరే కంబళి వంటి కథలన్నీ పుస్తకాలుగా అందుబాటులో ఉన్నాయి. వీటి మూలం భారతదేశమే అని అంటారు. కాని అరేబియా ప్రాంతంలో బహుళ ప్రచారం పొంది తిరిగి భారతదేశం చేరాయి. పంచతంత్రం కథలతో కూడా పాఠాలు నేర్పించవచ్చు అని నిరూపించిన తొలి వరుస కథలివి. ప్రపంచానికి భారతదేశం అందించిన ఘనసంపద. ఈ సంగతి పిల్లలకు తెలియచేయాలి. వీటిని వారి చేత చదివించాలి. మిత్రలాభం, మిత్రభేదం ఈ రెంటి మర్మం తెలుసుకోకపోతే అడుగు ముందుకు పడేదెలా? మహా పండితుడు విష్ణుశర్మ అజ్ఞానులైన రాజకుమారులకు విజ్ఞానం నేర్పే క్రమంలో జంతువులను ప్రధాన పాత్రలుగా తీసుకుని వాటి ద్వారా సకల శాస్త్రాలు వివరించాడు. లోకం పన్నే ఎరలు తెలియాలంటే ఈ కథలు తప్పనిసరి కదా. వీటిని సంస్కృతం నుంచి తెలుగుకు తెచ్చిన చిన్నయసూరి, కందుకూరి వీరేశలింగం గురించి కూడా పిల్లలకు తెలపాలి. కాశీ మజిలీ కథలు ప్రయాణంలో కథకు మించిన కాలక్షేపం లేదు. ఆ విధంగా ఇవి తెలుగులో జర్నీ స్టోరీస్. మధిర సుబ్బన్న దీక్షితులు వీటి సృష్టికర్త. ఒక గురువు తన శిష్యులతో కాశీ ప్రయాణమై దారిలో ఆగిన ప్రతిచోట ఒక కథ చెప్పేవారుట. ఆ కథల ద్వారా విద్యార్థులకు జ్ఞానబోధ జరిగేది. ఈ కథల్లో హాస్యంతో పాటు చతురత, విజ్ఞత కూడా ఉంటాయి. ఈ కథల ఆధారంగా గులేబకావళికథ, సహస్రశిరచ్ఛేద అపూర్వ చింతామణి, పాతాళభైరవి, నవ్వితే నవరత్నాలు... వంటి సినిమాలు రూపొందాయి. పెద్దబాలశిక్ష అసలేం చదవకపోయినా పెద్దబాల శిక్ష చదివినా చాలు అనంటారు పెద్దలు. తెలుగువారి సారస్వత సర్వసాన్ని రేఖామాత్రంగా ఒక్కచోటే చేర్చి తెలిపే విలువైన కూర్పు ఇది. తెలుగు భాషలోని అక్షరాల దగ్గర నుంచి చిన్న చిన్న పదాలు, నీతి వాక్యాలు, పది పంక్తులలో వచ్చే కథలు, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, గణిత శాస్త్రం... వంటి అన్ని విషయాలకూ నెలవైన ఒక విజ్ఞాన సర్వస్వం. ఈ పుస్తకం ఎప్పటికప్పుడు కాలానుగుణంగా కొత్త కొత్త అంశాలను సైతం ఇందులో చేరుస్తోంది. బుడ్డిగ సుబ్బరాయన్, గాజుల సత్యనారాయణ ఈ కూర్పుతో ప్రసిద్ధి చెందారు. నీతి శతకాలు ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండు రాని బాలలు మన ఇంట్లో ఉన్నారంటే మనం తెలుగువారు కాదనే లెక్క. నీతి శతకాల నుంచి కనీసం ఇరవై ముప్పై పద్యాలు కంఠతా పట్టడం వల్ల నీతి, ధర్మం, మర్మం తెలియడమేగాక వాక్శుద్ధి కూడా కలుగుతుంది. సుమతీ, వేమన, భర్తృహరి ఈ శతకాలు తప్పనిసరిగా పిల్లల షెల్ఫుల్లో ఉండాలి. తళుకుబెళుకుల రాళ్లు తట్టడేల అన్నాడు వేమన. నీతి శతకాలు పిల్లలను నిక్కమైన నీలాల్లా మారుస్తాయి. నిండైన వ్యక్తిత్వాన్ని కలిగిస్తాయి. తెనాలి రామలింగడు, మర్యాద రామన్న కథలు, పరమానందయ్య కథలు ఈ కథలన్నీ యుక్తి కథలు. ఆపద కలిగినప్పుడు తెలివిగా తప్పించుకోవడానికి మార్గాలు చూపే కథలు. తెనాలి రామలింగడు తన తెలివితేటలు, చమత్కార ధోరణితో శ్రీకృష్ణదేవరాయలను ఎన్నోమార్లు రక్షించాడు. మర్యాద రామన్న కథలలో రామన్న చెప్పే తీర్పు వల్ల ప్రతిసారీ న్యాయం జరుగుతూ, చెడ్డవారికి శిక్షలు పడుతుంటాయి. పరమానందయ్య గారి శిష్యుల కథలో వారు తెలివితక్కువగా చేసే పనుల వల్ల గురువుగారికి ప్రతిసారి గండం తప్పుతూ ఉంటుంది. ఒక్కసారి అలవాటు చేస్తే పిల్లలు వీటిని వదలరు. అక్బర్- బీర్బల్ కథలు, ముల్లా నస్రుద్దీన్ కథలు ఉత్తరాది నుంచి దక్షణాదికి ఆ తర్వాత ప్రపంచమంతటికీ పరిచమైన ఉల్లాసకరమైన కథలు ఇవి. అక్బర్ ఒక పొడుపు కథ వేయడం, ఆయన స్నేహితుడు, మంత్రి అయిన బీర్బల్ ఆ పొడుగు కథను విప్పడం పిల్లలకు ‘పజిల్ను సాల్వ్’ చేసే తర్ఫీదును ఇస్తాయి. ఇక ముల్లా నస్రుద్దీన్కు మన తెనాలి రామలింగడుకు పోలికలు ఉన్నాయి. ఇద్దరూ తుంటరి పనులతో చెడును సంస్కరించడానికి ప్రయత్నించినవారే. ముల్లా గాడిద మీద వెనక్కు తిరిగి కూచుని ఊరూరా తిరుగుతూ చేసే చమత్కారాలు బాలలకు అత్యంత ఇష్టం. బుడుగు బాపు రమణలు తెలుగువారికి అందించిన అమూల్యమైన పాత్ర బుడుగు. అంతవరకూ ప్రతి ఇంట్లో అల్లరి పిల్లవాణ్ణి బాల కృష్ణుడితో పోల్చేవారు. ఈ పాత్ర వచ్చాక బుడుగుతో పోల్చడం మొదలెట్టారు. బాల్యంలో ఉండే అమాయకత్వం, ఆరిందాతనం, ముద్దుమాటలు అందరినీ అలరిస్తాయి. ఈ పుస్తకం చదివితే హాస్య స్ఫోరకమైన భాష అలవడుతుంది. టామ్సాయర్, హకల్బరీ ఫిన్ ఆంగ్లంలో మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయర్, హకల్బరీ ఫిన్ కథలను ప్రముఖ సంపాదకులు నండూరి రామ మోహనరావుగారు తెలుగులో రచించారు. ఈ కథలు పిల్లలకు చాలా థ్రిల్ కలిగిస్తాయి. మనం కూడా సాహసం చేద్దాం అని చదవగానే పిల్లలకు అనిపిస్తుంది. - డా. వైజయంతి, సాక్షి, చెన్నై -
‘సొంత’ బోధనతో గుర్తింపు రద్దు!
{పైవేటు ప్రాథమిక స్కూళ్లపై సర్కారు కొరడా {పభుత్వ పాఠ్య పుస్తకాలను వినియోగించాల్సిందేనని స్పష్టీకరణ దీనిపై డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ జారీ హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు సొంత పాఠ్య పుస్తకాలు, ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలతో విద్యా బోధన చేపడుతుండటంపై పాఠశాల విద్యాశాఖ కన్నెర్రజేసింది. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలతో కాకుండా ఇతర పాఠ్య పుస్తకాలతో బోధన చేపట్టినా, ప్రభుత్వ పాఠ్య ప్రణాళికను అమలు చేయకున్నా, ప్రభుత్వం తెచ్చిన నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అమలు చేయకున్నా ఆయా పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ప్రైవేటు పాఠశాలలు కరస్పాండెంట్లు, హెడ్మాస్టర్లకు తెలియజేయాలంటూ పాఠశాలల విద్యాశాఖ డీఈవోలకు సర్క్యులర్ (ఆర్సీ నెంబరు 419/డి/సీ అండ్ టీ/ఎస్సీఈఆర్టీ/2015) జారీ చేసింది. అలాగే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో వీటన్నింటిపై ఉప విద్యాధికారులు, మండల విద్యాధికారులు, ఇతర అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ పాఠ్య ప్రణాళిక, పరీక్షల సంస్కరణలు అమలు చేసేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. మరోవైపు ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణాలయం పాఠ్య పుస్తకాలను వెంటనే మార్కెట్లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. సర్క్యులర్లోని ముఖ్యాంశాలు విద్యార్థుల్లో విశ్లేషణ, సృజన, ఆలోచనశక్తిని పెంపొందించేలా చర్యలు చేపట్టాల్సిన ఉపాధ్యాయులు వాటిని దెబ్బతీసేలా గైడ్లు, వర్క్బుక్లు, స్టడీ మెటీరియల్ను కొనుక్కోవాలని విద్యార్థులకు సూచిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. దీనిపై డీఈవోలు, ఇతర క్షేత్రస్థాయి అధికారులు దృష్టి పెట్టాలి. విద్యార్థులు ైగె డ్లు, వర్క్బుక్లు ఉపయోగిస్తే పాఠశాలల ప్రధానోపాధ్యాయులతోపాటు సంబంధిత పర్యవేక్షణ అధికారులే బాధ్యులు. వారిపై కఠిన చర్యలు తప్పవు. పాఠ్య పుస్తకాల బరువు తగ్గించేందుకు డీఈవోలు చర్యలు చేపట్టాలి. పాఠశాలల యాజమాన్యాలకు సూచనలివ్వాలి. కొన్ని జిల్లాల్లో ప్రాథమిక స్థాయిలో 10 నుంచి 12 కిలోల వరకు పాఠ్యపుస్తకాల బరువు ఉంటోంది. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పుస్తకాల బరువు 15 నుంచి 17 కిలోలు ఉంటోంది. వీటి నియంత్రణపై డీఈవోలు దృష్టి సారించాలి. ప్రతి పాఠశాలలో సహ పాఠ్య కార్యక్రమాలు కచ్చితంగా అమలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలి. ఆర్ట్, కల్చర్ ఎడ్యుకేషన్, వ్యాల్యూ ఎడ్యుకేషన్, లైఫ్ స్కిల్స్, వర్క్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, హెల్త్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నీ పక్కాగా అమలు అయ్యేలా చూడాలి. క్షేత్ర స్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. ఇందుకోసం జిల్లా రిసోర్సు పర్సన్లను గుర్తించాలి. ప్రతి సబ్జెక్టుకు 15 మంది చొప్పున గుర్తించి పంపాలి. -
పోస్ట్... పుస్తకాలొచ్చాయ్
బడులకు బుక్స్ బట్వాడా చేయనున్న తపాలాశాఖ తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనకు యోచన లాజిస్టిక్ విభాగాన్ని పటిష్టం చేసుకునే దిశగా ముందుకు బట్వాడాపై ఆంధ్రప్రదేశ్తో త్వరలో ఒప్పందం సాక్షి, హైదరాబాద్: ఆదరణ కోల్పోతున్న తపాలాశాఖ మనుగడ కోసం సరికొత్త ఆలోచనలతో ముందుకుసాగుతోంది. ఉత్తరాల బట్వాడా ప్రధాన విధిగా ఉన్నప్పటికీ... దాన్నే అట్టిపెట్టుకుని ఉంటే క్రమంగా ప్రజలకు దూరం కావటం తథ్యంగా మారటంతో ఇతర రంగాల్లోకి అడుగుపెడుతోంది. కొంతకాలం కిందట లాజిస్టిక్ రంగంలోకి అడుగుపెట్టిన తపాలాశాఖ ఇప్పుడు మెల్లగా దాన్నే ప్రధాన విధిగా చేసుకుంటోంది. ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలను సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు వాటిని తరలించేందుకు నిర్ణయించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకోబోతోంది. తొలుత ఏపీ ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టింది. దీనికి సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వానికి కూడా ప్రతిపాదన అందజేయాలని భావిస్తోంది. యూనిఫామ్.. మందుల తరహాలో... ప్రస్తుతం తపాలాశాఖ ప్రత్యేకంగా లాజిస్టిక్స్ విభాగాన్ని ప్రారంభించింది. దీనికి విడిగా వాహనాలు సమకూర్చుకుంది. ప్రైవేటు సరుకు రవాణా సంస్థల్లాగా అవకాశం ఉన్న అన్నిరకాల వస్తువులను తరలించేందుకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ కోవలో ప్రభుత్వ విభాగాలకు సరుకు రవాణా చేసిపెట్టే అనుబంధ సంస్థగా ఎదిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పదమూడు జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫామ్స్ను సరఫరా చేసింది. ఆప్కోతో ఉన్న అవగాహన మేరకు ఆ సంస్థ రూపొందించిన యూనిఫామ్స్ను స్కూళ్లకు తరలించింది. ఇప్పుడు పాఠ్యపుస్తకాల తరలింపుపై దృష్టి సారించింది. మరోవైపు గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మందులను సరఫరా చేసే ఆర్డర్నూ అమలు చేస్తోంది. నిరంతర మందుల సరఫరా పేరుతో ఏపీ పరిధిలో దాన్ని కొనసాగిస్తున్న తపాలాశాఖ త్వరలో తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకోబోతోంది. ఈ క్రమంలో వచ్చే విద్యాసంవత్సరంలో పాఠ్యపుస్తకాల తరలింపు బాధ్యత కూడా తపాలాశాఖకు దక్కే అవకాశం కనిపిస్తోంది. -
పాఠ్య పుస్తకాలేవీ?
జిల్లాకు రాని పుస్తకాలు 15,60,090 అవసరం ఇప్పటివరకు రాని వైనం గతేడాది ఇదే సమయూనికి 70 శాతం చేరిక విద్యారణ్యపురి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ ఏడాది కూడా పాఠ్యపుస్తకాలు సకాలంలో అందే పరిస్థితులు కనిపించడం లేదు. గతేడాది తొందరగా వచ్చినా.. ఏటా పాఠ్యపుస్తకాలు అందడం ఆలస్యం అవుతూనే ఉంది. వేసవి సెలవులు ముగిసిన అనంతరం జూన్ 12న పాఠశాలలు తెరుచుకుంటారుు. అంటే జూన్ మాసంలో పుస్తకాలు విద్యార్థులకు అందించాలి. కానీ, ఇప్పటివరకు జిల్లాకే చేరుకోలేదు. కనీసం ముద్రణ కూడా కాలేదని సమాచారం. విద్యార్థులకు పుస్తకాలు అందాలంటే రాష్ట్ర ప్రభుత్వ గోదాముల నుంచి జిల్లా అధికారులకు, ఈ అధికారుల నుంచి మండల గోడౌన్లకు.. అక్కడి నుంచి ఉపాధ్యాయులకు.. వీరు విద్యార్థులకు పంపిణీ చేయూలి. ఇదంతా జరగాలంటే మార్చిలోనే పుస్తకాలు జిల్లాకు చేరుకుని ఉండాలి. కానీ, రాలేదు. పుస్తకాలు అందడం అనుమానమే.. కాగా, జిల్లాలో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం 183 టైటిల్ పుస్తకాలు, 17,16,099 పాఠ్యపుస్తకాలు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో 15,60,090 పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడానికి, మిగితావి అమ్మకాల కోసం ప్రతిపాదించారు. గతేడాది 26 లక్షల పాఠ్యపుస్తకాలు ప్రతిపాదించగా.. ఇందులో గత ఏప్రిల్ 1 వరకు 70 శాతం పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నారుు. ఏప్రిల్ 23 తేదీ వరకు విద్యార్థులకు పంపిణీ అయ్యూరుు. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ 1 వచ్చినా పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకోలేదు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగినా అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపలేదని సమాచారం. 2014 సెప్టంబర్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారని తెలుస్తోంది. గతేడాది జిల్లాకు వచ్చిన పాఠ్యపుస్తకాల్లో వివిధ టైటిల్స్ కలిపి 2 లక్షల పాఠ్యపుస్తకాలు జిల్లాకేంద్రంలోని విద్యాశాఖ డిపోలోనే మిగిలి ఉన్నారుు. ఇవి అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం పేరిట ఉన్నారుు. ఈ పుస్తకాలు కూడా పనికిరావు. జూన్ నాటికి పాఠ్యపుస్తకాలు అందేలా చూడాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రైవేటు విద్యార్థులకు కూడా శాపం జిల్లాలో 1,637 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి అందు లో 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు 3,19,250 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠ్య పుస్తకాలు మార్కెట్లోకి వస్తేనే ఆయా విద్యార్థులు కూడా పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఆలస్యానికి కారణాలు.. తెలంగాణ రాష్ట్రానికి అనుగుణంగా సిలబస్ను మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశాలలో తెలంగాణ గురించి, మహనీయుల చరిత్ర అంశాలను చేర్చాలని చూస్తోంది. తెలంగాణ రాష్ర్టం పేరిట పాఠ్యపుస్తకాలను ముద్రించాల్సి ఉంది. మార్పుల కోసం సంబంధిత కమిటీ నివేదిక అందజేసినా ప్రభుత్వం ఆమోద ముద్ర వేయలేదు. ఆమోదం తర్వాతే ముద్రణ ప్రారంభమవుతుంది. -
స్క్రాప్ దుకాణానికి పాఠ్యపుస్తకాలు
పరిగి: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా ఇచ్చే పాఠ్యపుస్తకాలను విక్రయించేందుకు ఓ వ్యక్తి పరిగి లోని స్క్రాప్ దుకాణానికి తీసుకొచ్చాడు. గమనించిన స్థానికులు.. వీటిని ఎక్కన్నుంచి తెచ్చావంటూ సదరు వ్యక్తిని నిలదీశారు. దోమ మండల విద్యావనరుల కేంద్రం సిబ్బంది అమ్మారని, మూడు క్వింటాళ్ల బరువున్నాయని చెప్పాడు. ఇదంతా చూస్తున్న చెత్త దుకాణం యజమాని వాటినికొనేందుకు నిరాకరించాడు. తిరిగి తీసుకెళ్దామంటే ఆటోవాలా సైతం నేను రానన్నాడు. ఇంతలో విషయం పోలీసులకు చేరింది. దీంతో వారు వచ్చి పుస్తకాలను పోలీస్స్టేషన్కు చేర్చారు. పుస్తకాలపై ప్రభుత్వం పంపిణీ చేసినట్టు ముద్రణ కూడా ఉంది. ఇంత పెద్దమొత్తంలో ఎక్సెస్ పుస్తకాలు ఎక్కడివ న్న విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్లాక్ మార్కెట్లో అమ్మేందుకు ఎక్కువ ఇండెంట్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ విషయమై డిప్యూటీ ఈఓ హరిశ్చందర్ను వివరణ కోరగా.. సిబ్బంది విక్రయించినట్టు అనుమానం ఉందని, విచారణ చేస్తామని చెప్పారు. ఏ ఏడాది పుస్తకాలైనా ఇలా అమ్మడానికి వీలులేదని చెప్పారు. -
ప్రైవేటు స్కూళ్లలో అంతా డొల్లే!
విద్యా ప్రమాణాలు అంతంతే తెలుగు మినహా ప్రభుత్వ పాఠ్య పుస్తకాల అవులే లేదు 40 శాతం విద్యార్థులకు చదవడం, రాయుడం రావట్లేదు 25 శాతం విద్యార్థులకు లెక్కలే రావు గైడ్లు, సొంత సిలబస్ ఇస్తూ విద్యార్థులతో బట్టీ పట్టిస్తున్న వైనం ప్రైవేటు స్కూళ్లలో విద్యా శాఖ సర్వే ప్రారంభం తొలిరోజే వెలుగులోకి విస్తుపోయే విషయాలు హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో పాటిస్తున్న ప్రమాణాలపై విద్యా శాఖ చేపట్టిన సర్వేలో తొలి రోజే విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. బుధవారం పేరున్న స్కూళ్లలో అధికారులు పలు అంశాలపై సర్వే నిర్వహించా రు. ఏ ఒక్క పాఠశాలలోనూ విద్యా శాఖ జారీ చేసే ఉత్తర్వులు అవులు కావడం లేదని ఈ సం దర్భంగా బయటపడింది. పాఠ్యపుస్తకాలు మెుదలుకొని పని వేళల వరకు ఇదే పరిస్థితి. ఇక విద్యా బోధనపరంగానూ డొల్లతనం వెల్లడైంది. పదో తరగతిలోనే 25 శాతం విద్యార్థులకు గుణకారం, భాగాహారం రావడం లేదని తేలింది. 40 శాతం వుంది విద్యార్థులకు చదవడం రావట్లేదు. కాగా, స్కూళ్లలో ఒక్క తెలుగు మినహా ప్రభుత్వం ముద్రిస్తున్న వురే పాఠ్య పుస్తకాలను వినియోగించడం లేదని తేలింది. జిల్లాల్లోని డైట్ సంస్థల ప్రిన్సిపాళ్లు, రాష్ట్ర విద్యా పరిశోధ న, శిక్షణ వుండలి అధికారుల నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఈ సర్వేలో పాల్గొంటున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అడుగడుగునా ఉల్లంఘనలే..! పదో తరగతి విద్యార్థులను కేవలం బట్టీ విధానానికే పరిమితం చేస్తున్నట్లు వెల్లడైంది. జీవో 17 ప్రకారం గైడ్లు వినియోగించవ ద్దనే నిబంధన ఉ న్నా ప్రైవేటు స్కూళ్లు యుథేచ్చగా ఉల్లంఘిస్తున్నా యి. విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసేందుకు గైడ్లు, స్టడీ మెటీరియుల్ అందజేసి బట్టీని ప్రోత్సహిస్తున్నాయి. పదో తరగతి పరీక్షల్లో కొత్తగా ఇంటర్నల్స్కు 20 శాతం వూర్కులు కేటాయిం చిన సంగతి తెలిసిందే. దీని అనుగుణంగా చదవడం, రాయుడం, ఆట, పాటలు, క్రీడలు వంటి సహ పాఠ్యాంశాలకు సంబంధించిన వుూల్యాం కనమే జరగడం లేదు. విద్యా సంవత్సరంలో వీటిపై నాలుగుసార్లు వుూల్యాంకనం చేసి వూ ర్కులు వేయూల్సి ఉంది. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా దీన్ని చేపట్టలేదు. ఏ పాఠశాలలోనూ విద్యా హక్కు చట్టం ప్రకారం అవులు చేయూల్సిన సవుగ్ర నిరంతర వుూల్యాంక నం అవులుకే నోచుకోవడం లేదు. అసలు సహ పాఠ్యాంశాల అవులునే పట్టించుకోవడం లేదు. ఇక త్రైవూసిక పరీక్షలను విద్యా శాఖ ఆదేశాల ప్రకారం వచ్చే నెల 13 నుంచి నిర్వహించాల్సి ఉంది. కానీ ఇప్పుడే ఆ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలోనైతే ఇష్టారాజ్యంగా సొంత సిలబస్, సొంతంగా వుుద్రించిన పాఠ్య పుస్తకాలతోనే బోధన కొనసాగిస్తున్నాయి. ఇన్ని ఉల్లంఘనలు జరుగుతున్నా అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కొన్ని స్కూళ్లలో తనిఖీలు చేసినా వుుడుపులు పుచ్చుకొని చర్యలు చేపట్టకుండా మిన్నకుండిపోరుునట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
తీరని ‘టెన్’షన్
పదో తరగతి పరీక్షలపై స్పష్టతలేని సర్కారు చోడవరం రూరల్: ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులతో చెలగాటమాడుతోందనే చెప్పాలి. ఈ ఏడాది సిలబస్ మార్చారు. సీబీఎస్ఈ తరహాలో పాఠ్య పుస్తకాలు సరఫరా చేశారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ నూతన విధానం అమల్లోకి వచ్చింది. సీసీఈ (నిరంతర సమగ్ర మూల్యాంకనం) పద్ధతి అంటూ పుస్తకాలలో సమాచారం ఇచ్చారు. విద్యార్థులు సాధించాల్సిన ప్రమాణాలను కూడా ఆయా సబ్జెక్టుల వారీగా పుస్తకాలలోనే పొందుపరిచారు. ఉపాధ్యాయులకు సీసీఈపై అవగాహన కల్పించే తరగతులు కూడా నిర్వహించారు. గడచిన రెండేళ్లలో 6, 7 తరగతులకు ఒకసారి, 8, 9 తరగతులకు గత ఏడాది నూతన్ సిలబస్ రూపొందించారు. ఈ ఏడాది 10వ తరగతి సిలబస్ మార్చారు. రెండేళ్ల నాటి ఎల్ఈపీ స్థానంలో సీసీఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. బట్టీ చదువులు కాకుండా విద్యార్థుల్లో స్వీయ రచన, ఆలోచన, బహిరంగ పర్చడం, చర్చించడం, ప్రాజెక్టు పని వంటి ప్రామాణిక అంశాల్లో నైపుణ్యం వచ్చేలా పుస్తకాలలో అంశాలు పొందుపరిచారు. ఈ పద్ధతిలోనే వార్షిక పరీక్షలు జరుగుతాయని గతంలో ప్రకటించారు. దీనికి అనుగుణంగా రెండు నెలలుగా ఈ విధానంలోనే బోధన, విద్యార్థులకు ప్రాజెక్టు పనులు పాఠశాలలో చేయిస్తున్నారు. సిలబస్ కూడా పాత పరీక్ష విధానంతో ఏ మాత్రం పోలిక లేదు. ఈ పరిస్థితుల్లో పాత విధానంలోనే పరీక్షలన్న వార్తలు తల్లిదండ్రులు, విద్యార్థల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. ఏమి చదవాలో, ఏ విధంగా చదవాలో అర్థంకాని సందిగ్ధ పరిస్థితి విద్యార్థుల్లో నెలకొంది. ఇది తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్న అంశమే. వాస్తవానికి పాతపద్ధతిలో పరీక్షలు నిర్వహించడమంటే గతంలో మాదిరి 11 పేపర్లు నిర్వహించడంతోబాటు, పాత నమూనాలోనే 100 మార్కులకు పేపర్ ఉండాలి. ఇలాగే ఉంటుందా లేక నూతన సిలబస్ ఆధారంగా నమూనా మారుతుందా అన్న విషయం స్పష్టం కాలేదు. ప్రస్తుత సిలబస్ పాత నమూనాకు అనుగుణంగా లేదు. నూతన సిలబస్లో ప్రశ్నలకు విద్యార్థి ఆలోచనలకు తగ్గట్టుగా సమాధానాలు రాసే విధంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఏ పద్ధతిలో పరీక్షలు సిద్ధం కావాలన్నదే పెద్ద పరీక్షగా మారింది. ప్రభుత్వం ఇకనైనా పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో స్పష్టంగా ప్రకటన చేయడం, నమూనా పరీక్ష పేపర్ విడుదల చేయడం ద్వారా విద్యార్థుల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించాలి. పాతపద్ధతిలోనే పరీక్షలు పదో తరగతి పరీక్షలు పాత పద్ధతిలో 11 పేపర్లు ఉంటాయి. పాత విధానాన్ని ఈ విద్యా సంవత్సరానికి కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మోడల్ పేపర్ విషయంలో నెట్ ద్వారా ఉపాధ్యాయుల నుంచి సూచనలు నేరుగా ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ సమాచారం ఉపాధ్యాయులకు అందించడం జరిగింది. పేపర్ విధానం ఎలా ఉంటుందన్నది ప్రభుత్వమే విడుదల చేయాల్సి ఉంది. - కృష్ణారెడ్డి, డీఈఓ -
ముందుగానే పాఠ్యపుస్తకాల రాక
విద్యారణ్యపురి, న్యూస్లైన్ : వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు ఈసారి ముందుగానే జిల్లాకు వచ్చాయి. ఇప్పటివరకు జిల్లాకు 80 శాతం పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. జిల్లా గోదాం నుంచి సోమవారం వరకు 51 మండలాలకు 70 శాతం పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. జిల్లాకు 27,41,000 పాఠ్యపుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ సంబంధిత ఉన్నతాధికారులకు ప్రతిపాదించింది. అందులో ఇప్పటివరకు 24 లక్షల 54వేల 9 పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రంలోని పాఠ్యపుస్తకాల గోదాంనకు చేరుకున్నాయి. వీటిలో 21,87,845 పాఠ్యపుస్తకాలను మండల కేంద్రాలకు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు పుస్తకాలను రవాణా చేయడానికి జిల్లా విద్యాశాఖ టెండర్లు ఆహ్వానిస్తే కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రవాణా బాధ్యతలను ఎంఈఓలకే అప్పగించారు. జిల్లా కేంద్రంలోని గోదాం నుంచి మండల విద్యాశాఖాధికారులు రెండు దశలుగా ఇప్పటికే ఎంఆర్సీ భవనాలకు పుస్తకాలు తరలించారు. మూడో దశలో కూడా పుస్తకాలను తీసుకెళ్తున్నారు. ఎంఆర్సీ భవనాల నుంచి పాఠశాలల హెచ్ఎంలు పాఠ్యపుస్తకాలను తీసుకెళ్లి విద్యార్థులకు ఇవ్వాలి. రవాణాకు సంబంధించిన వ్యయాన్ని జిల్లా విద్యాశాఖ చెల్లించనుంది. మిగిలిన పుస్తకాలు కూడా కొద్దిరోజుల్లోనే రానున్నాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 123 టైటిల్ పాఠ్యపుస్తకాల్లో 122 టైటిల్స్ వచ్చాయి. కేవలం ఉర్దూ మీడి యానికి సంబంధించిన ఒక టైటిల్ పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. ఏది ఏమైనా వచ్చే విద్యాసంవత్సరంలో పాఠ్యపుస్తకాల కోసం విద్యార్థులు నిరీక్షించనవ సరం లేదు. 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు రేపే అందించాలి.. 6,7,8,9,10 తరగతుల విద్యార్థులకు విద్యాసంవత్సరం ముగింపు రోజు బుధవారం పాఠ్యపుస్తకాలు అందించాలని పాఠశాల విద్యాశాఖ డెరైక్టరేట్ నుంచి జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు అందాయి. దీంతో జిల్లా విద్యాశాఖాధికారులు కూడా ఎంఈఓలను ఆదేశించారు. మండల కేంద్రాలకు చేరుకున్న పాఠ్యపుస్తకాలను హెడ్మాస్టర్లు తమ స్కూల్ పాయింట్లకు తీసుకెళ్లి విద్యార్థులకు ఇవ్వాలి. దీంతో విద్యార్థులు వేసవిలో ఇంటివద్ద చదువుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు మాత్రం జూన్ 12న అందించాలని ఆదేశాలు అందాయి. -
పాఠ్యపుస్తకాలు రెడీ
సెలవులకు ముందే పంపిణీకి చర్యలు జిల్లాకు చేరిన 21 శాతం పుస్తకాలు వచ్చే నెల నుంచి మండల కేంద్రాలకు బుక్ బ్యాంక్ నిర్వహించని హెచ్ఎంలపై చర్యలు: డీఈవో సాక్షి, విశాఖపట్నం: పాఠ్యపుస్తకాల పంపిణీపై విద్యాశాఖ అప్రమత్తమైంది. సెలవులకు ముందే పూర్తి స్థాయిలో జిల్లా కేంద్రాలకే చేర్చేందుకు తొలి సారిగా కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగం గా ఇప్పటికే 21 శాతం పుస్తకాలను జిల్లాకు చేరవేసింది. మిగిలినవాటిని కూడా వీలైనంత వేగంగా జిల్లాలకు చేర్చి, భారం దించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చిన పాఠ్యపుస్తకాలను జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు చేరవేసేందుకు జిల్లా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. తరలింపునకు టెండర్లను ఆహ్వానించింది. 24.44 లక్షల పుస్తకాలు అవసరం వచ్చే విద్యా సంవత్సరంలో జిల్లాకు 24,44,325 పాఠ్యపుస్తకాలు అవసరం. గతేడాది పంపిణీకాగా మిగిలినవి(గ్రౌండ్ బ్యాలెన్స్) 63,997 పాఠ్యపుస్తకాలున్నాయి. నికరంగా 23,81,328 పుస్తకాలు రావాలి. ఇందులో ఇప్పటి వరకు సుమారు 5 లక్షలు జిల్లాకు చేరాయి. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు మినహా మిగిలిన జిల్లాలకు ఇప్పటికే 50 శాతం పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరాయి. ఈ నాలుగు జిల్లాలకు పంపిణీ బాధ్యతలు తీసుకున్న కాంట్రాక్టరు లారీల ఏర్పాటులో నిర్లిప్తత వల్లే కేటాయించిన సుమారు 13 లక్షల్లో కేవలం ఐదు లక్షలు మాత్రమే జిల్లాకు చేరినట్టు అధికారులు పేర్కొంటున్నారు. నిల్వ ఉన్న 8 లక్షలు వీలైనంత వేగంగా తరలించే అవకాశాలున్నట్టు అధికారులు చెబుతున్నారు. టెన్త్ సిలబస్ మారింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పాఠ్యపుస్తకాలు మారనున్నాయి. ఈమేరకు టెన్త్పాఠ్యపుస్తకాల ముద్రణ కూడా పూర్తయింది. కొన్ని టైటిల్స్ జిల్లాకు చేరాయి. ఇప్పటి వరకు తెలుగు మాధ్యమం విద్యార్థులకే పరిమితమైన పర్యావరణ విద్య, ఇక మీదట ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకూ తప్పనిసరి చేశారు. మారిన సిలబస్ మేరకు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకే ఈ ఏడాది ముందుగానే పాఠ్యపుస్తకాల పంపిణీ బాధ్యతల్ని చేపట్టినట్టు అధికారులు చెప్తున్నారు. వేసవిలో మారిన సిలబస్పై పూర్తి స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించేలా జిల్లా విద్యాశాఖకు ఇప్పటికే ఆదేశాలు కూడా వచ్చినట్టు తెలిసింది. బుక్ బ్యాంక్ తప్పనిసరి జిల్లాకు చేరిన పాఠ్యపుస్తకాలను మండల కేంద్రాలకు చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఏప్రిల్ నెలాఖరుకు వందశాతం పాఠ్యపుస్తకాల్ని మండలాలకు చేరవేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రధానోపాధ్యాయులంతా పైతరగతులకు ప్రమోట్ అయ్యే విద్యార్థుల పాఠ్యపుస్తకాలను స్వాధీనం చేసుకోవాలి. వాటిని కొత్తగా ఆ తరగతులకు వచ్చే విద్యార్థులకు అందజేయాలి. ఏ విద్యార్థీ పాఠ్యపుస్తకాల్లేకుండా తరగతులకు హాజరయ్యే దుస్థితి ఉండకూడదు. బుక్ బ్యాంక్ నిర్వహించని హెచ్ఎంలపై కఠిన చర్యలు తప్పవు. - బి.లింగేశ్వరరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి