Waiver of loans
-
తొమ్మిదేళ్లలో ఖాతాల్లోంచి రూ.14.56 లక్షల కోట్ల రద్దు!
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ 2014–15 నుంచి గడచిన తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో రూ.14,56,226 కోట్ల మొండి బకాయిలను మాఫీ (రైటాఫ్) చేశాయని ప్రభుత్వం సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది. ఇందులో భారీ పరిశ్రమలు, సేవల రంగం వాటా రూ. 7,40,968 కోట్లని ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ ఒక లోక్సభలో ఇచి్చన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. రైటాఫ్ అంటే ఖాతాలు, లెక్కల నుంచి మొండిబకాయిలను తొలగించడం. అయితే అటువంటి ఖాతాదారులపై చట్టబద్ధమైన, రికవరీకి సంబంధించిన చర్యలు కొనసాగుతాయి. ఆయా అంశాలకు సంబంధించి ఆర్బీఐ నుంచి అందిన తాజా గణాంకాలను ఉటంకిస్తూ, కరాద్ లోక్సభలో చేసిన లిఖితపూర్వక ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు.. ► 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ రంగ బ్యాంకుల నికర రైటాఫ్ రుణాలు రూ.73,803 కోట్లు. ► 2017–18 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు రంగ బ్యాంకుల స్థూల రుణాల్లో నికర రైటాఫ్లు 1.25 శాతం. 2022–23లో ఇది 1.57 శాతంగా ఉంది. ప్రభుత్వం రంగ బ్యాంకుల విషయంలో ఈ అంకెలు వరుసగా 2 %, 1.12 శాతాలుగా ఉన్నాయి. ► మొండిబకాయిలు దిగిరావడానికి ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లు సమగ్ర చర్యలు తీసుకుంటున్నాయి. ఫలితంగా 2018 మార్చి 31 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు రూ.8.96 లక్షల కోట్లు ఉంటే, 2023 మార్చి 31వ తేదీ నాటికి ఈ విలువ రూ.4.28 లక్షల కోట్లకు తగ్గింది. గత తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీలు)రూ. 10,16,617 కోట్ల మొత్తాన్ని రికవరీ చేశాయి. ► రుణగ్రహీతల డేటాను సేకరించడం, నిర్వహించడం, ప్రచురించడం కోసం ఆర్బీఐ ఏర్పాటు చేసిన సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సీఆర్ఐఎల్సీ)డేటా ప్రకారం, 2023 మార్చి 1వ తేదీ నాటికి రూ. 1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ బకాయి ఉన్న మొత్తం రూ. 1,03,975 కోట్లు. ► రూ. 5 కోట్లు అంతకంటే ఎక్కువ రుణం తీసుకున్న సంస్థలు ఏదైనా డిఫాల్ట్ అయితే, బ్యాంకులు ఈ సమాచారాన్ని ప్రతి వారం సీఆర్ఐఎల్సీకి నివేదించాలి. ► షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లలో రూ.20 కోట్లకు పైగా ఉన్న ఎన్పీఏలు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో తగ్గుదలని నమోదు చేసుకున్నాయి. పటిష్ట రికవరీ చర్యలు... రుణ నిష్పత్తిని తగ్గించడంలో సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రస్ట్ యాక్ట్, 2002 సవరణ కీలక పాత్ర పోషిస్తోంది. డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ (డీఆర్టీ) ఆర్థిక అధికార పరిధిని రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచడం వల్ల అవి అధిక–విలువ కేసులపై దృష్టి సారించేందుకు వీలు కలిగింది. ఇది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అధిక రికవరీకి దోహదపడింది. రూ. 500 కోట్లకు పైగా ఒత్తిడిలో ఉన్న ఆస్తులను పరిష్కరించే లక్ష్యంతో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ను (ఎన్ఏఆర్సీఎల్) కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి కరాద్ వివరించారు. ఒత్తిడితో ఉన్న రుణ ఆస్తులను స్వా«దీనం చేసుకునేందుకు రుణ సంస్థలకు ఎన్ఆర్సీఎల్ జారీ చేసిన సెక్యూరిటీ రసీదులకు మద్దతుగా రూ. 30,600 కోట్ల వరకు గ్యారెంటీని పొడిగించడానికి ప్రభుత్వం ఆమోదించిందని ఆయన చెప్పారు. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు ఎటువంటి అదనపు సౌలభ్యతలను మంజూరు చేయడం లేదు. వారి యూనిట్ ఐదేళ్లపాటు కొత్త వెంచర్లను నిర్వహించకుండా నిషేధం కూడా ఉంది. ఉద్దేశపూర్వక డిఫాల్టర్లు లేదా కంపెనీలు నిధుల సమీకరణకు క్యాపిటల్ మార్కెట్లనూ ఎంచుకోడానికి వీలుండకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. వాటి ప్రమోటర్లు, డైరెక్టర్లు ఉద్దేశపూర్వక ఎగవేతదారులతో కలిసి నిధులను సేకరించేందుకు వీలుండదు. అంతేకాకుండా, ఒత్తిడికి గురైన ఆస్తులను ముందస్తుగా గుర్తించడం, నివేదించడం, సమయానుకూలంగా పరిష్కరించడం కోసం ఒక ఫ్రేమ్వర్క్ను అందించడానికి 2019లో ఆర్బీఐ ప్రుడెన్షియల్ ఫ్రేమ్వర్క్ ఫర్ స్ట్రెస్డ్ అసెట్స్ను విడుదల చేసింది. ఒత్తిడిలో ఉన్న రుణాలకు సంబంధించి రిజల్యూషన్ ప్లాన్ను ముందస్తుగా అనుసరించిన బ్యాంకర్లకు ప్రో త్సాహకాలను కూడా అందించడం జరుగుతోంది. పీఎంఎంవై దేశ వ్యాప్త అమలు ఇదిలావుండగా, 2015 ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభించిన ప్రధాన్ మంత్రి ముద్రా యోజనను దేశ వ్యాప్తంగా పటిష్టంగా అమలు చేస్తున్నట్లు మరో సమాధానంలో మంత్రి కరాద్ పేర్కొన్నారు. 2023 జూన్ 30 నాటికి ఈ పథకం కింద రుణగ్రహీతలకు దాదాపు రూ. 24.34 లక్షల కోట్ల రుణాల మంజూరు జరిగినట్లు వివరించారు. -
రైతుల రుణమాఫీ కోసం పోరాటం
కామారెడ్డి : రైతుల రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసి అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్ మోసం చేశాడని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్అలీ విమర్శించారు. రుణమాఫీ అయ్యేదాక కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. బుధవారం కామారెడ్డిలోని సత్యగార్డెన్లో నిర్వహించిన రైతుగర్జన సభలో ఆయన మాట్లాడారు. 74 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి బతుకుతుంటే వారి కష్టాలను పట్టించుకోకుండా వాస్తుపేరిట సెక్రటేరియట్ను కూలగొట్టడానికి పూనుకున్నాడని ఆరోపించారు. రైతుల రుణమాఫీకి అవసరమైన డబ్బులు లేవనే సీఎం సెక్రటేరిట్ నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తాడని ప్రశ్నించారు. సీఎం ఫామ్ హౌజ్కే పరిమితమై మంత్రులు, ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ప్రజల సమస్యలు ఎక్కడ పట్టించుకుంటాడన్నారు. అరవై ఏండ్లలో రాష్ట్ర అప్పులు రూ. 60 వేల కోట్లు అయితే, కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్ర ప్రభుత్వం 70 వేల కోట్ల అప్పులు చేసిందన్నారు. ఉద్యోగాలని ఊరించి నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నాడని దుయ్యబట్టారు. 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ను చెల్లించకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు. కమీషన్ల కోసమే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తున్నాడని అన్నారు. రైతులు పండించిన ధాన్యం, సోయా, మక్క పంటలకు సరైన ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ దిక్కులేదని, కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వాడుకున్నాడన్నారు. గల్ఫ్ దేశాల్లో తెలంగాణకు చెందిన ఎందరో అనేక కష్టాల్లో ఉంటే బతుకమ్మ పేరుతో ఎంపీ కవిత తొమ్మిది దేశాలు తిరిగొచ్చారే తప్ప, గల్ఫ్లో ఇబ్బందులు పడుతున్న వారిని పట్టించుకోలేదని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే దళితుల భూములను ఆక్రమించుకున్నాడని, ఇప్పుడు గుట్టలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. అధికారులకు టార్గెట్లు విధించి అధికార పార్టీ నేతలు వసూలు చేసుకుంటున్నారని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రం అయిన నేపథ్యంలో జిల్లాలోని ఏ నియోజక వర్గానికి చెందిన వారైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తన ఇంటిలో వసతులు కల్పిస్తానని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా పార్టీ అండగా ఉంటుందన్నారు. పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని కోరారు. సభలో మాజీ ఎంపీ సురేశ్షెట్కార్, మాజీ ఎమ్మెల్యే గంగారాం, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తాహెర్బిన్ హందాన్, పార్టీ నేతలు కాసుల బాల్రాజు, నల్లమడుగు సురేందర్, ప్రతాప్రెడ్డి, జమునా రాథోడ్, కైలాస్ శ్రీనివాస్, నిమ్మ మోహన్రెడ్డి, ఎల్.నర్సింగ్రావ్, గూడెం శ్రీనివాస్రెడ్డి, నల్లవెల్లి అశోక్, ఎంజీ వేణుగోపాల్గౌడ్, పండ్ల రాజు, ఇంద్రకరణ్రెడ్డి, ఎడ్ల రాజిరెడ్డి, చంద్రకాంత్రెడ్డి, తాన్సింగ్, పంపరి శ్రీనివాస్, భీంరెడ్డి, విజయ్కుమార్రెడ్డి, తిర్మల్గౌడ్, తిరుపతిగౌడ్, నర్సాగౌడ్, పూల్చంద్, తదితరులు పాల్గొన్నారు. సఫాలా కర్మాగారాన్ని అడ్డుకోవాలని వినతి... బ్రహ్మాజీవాడి శివారులో ఏర్పాటు చేయతలపెట్టిన సఫాలా కెమికల్ ఫ్యాక్టరీ వల్ల ఎంతో నష్టం జరిగే ప్రమాదం ఉందని, దాన్ని అడ్డుకోవాలని గ్రామస్తులు షబ్బీర్అలీకి వినతిపత్రం అందజేశారు. అలాగే గల్ఫ్ బాధితుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం నేత ఎర్రం రాజు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. -
దారుణ మాయ
రైతున్నపై ప్రకృతి పగబట్టింది. వరుణుడు కరుణించలేదు. పంటలు భూముల్లోనే ఎండిపోయాయి. సాగుకోసం చేసిన అప్పులు మిగిలాయి. బ్యాంకులో నగలు కుదవ పెట్టిన బంగారు నగలు విడిపించుకోలేకపోయాడు. బ్యాంకుల్లో రుణానికి వడ్డీ తోడు కావడంతో అప్పుల కుప్పలు మిగిలాయి. ఆడబిడ్డకు పెళ్లి చేయాలని, కొడుకును పెద్ద చదువులు చదివించాలనేఆశలు తీరలేదు. పదుగురికి పట్టెడన్నం పెట్టే రైతన్న పరువు కాపాడుకునేందుకు పరితపించాడు. ఇదే సమయంలో ఎన్నికలొచ్చాయి. అధికారం కోసం చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చారు. పదవి చేపట్టగానే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్నారు. బ్యాంకులకు అప్పులు కట్టవద్దన్నాడు. గుడ్డిగా నమ్మిన జనం రుణాల చెల్లింపులో జాప్యం చేశారు. మాఫీ ప్రకటనకు రకరకాల నిబంధనలు పెట్టారు. మొదటి రెండు విడతల్లో ప్రభుత్వం జమ చేసిన మొత్తం వడ్డీకి కూడా చాలలేదు. ఈ క్రమంలో రెండేళ్లు గడిచాయి. ఇక ఆగడం తమ వల్ల కాదని బ్యాంకులు కొరడా ఝుళిపించాయి. అప్పు చెల్లించకుంటే నగలు వేలం వేస్తామని నోటీసులు జారీ చేశాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు రైతుల బంగారాన్ని వేలం వేసేశాయి. కాగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు బుధవారం శాసనసభలో చేసిన ప్రకటనతో రైతులు ఆగ్రహోదగ్రులయ్యారు. ‘బ్యాంకుల్లో రైతులు బంగారం తాకట్టు రుణాలకు సంబంధించిన బంగారు నగలు వేలం వేస్తున్నట్లు మాకు సమాచారంలేదు.’ ఇదీ అసెంబ్లీలో వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రకటన. ‘రుణమాఫీలో పేరుందో? లేదో? మాకు సంబంధం లేదు. ముందు అసలు, వడ్డీతో అప్పు తీర్చాల్సిందే.’ ఇదీ బ్యాంకర్ల నైజం. రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలతో రైతులు రుణాల చెల్లింపులో కాస్త ఉదాసీనంగా వ్యవహరించారు. దీంతో వడ్డీలకు వడ్డీలు పడి, రుణ భారం పెరిగింది. ప్రస్తుతం ఆ రుణాలు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. అయితే బ్యాంకర్లు బంగారు రుణాలకు సంబంధించి వేలం నోటీసులు జారీ చేస్తుండడంతో రుణమాయలో పడి దారుణంగా మోసపోయామని బాధపడుతున్నారు తిరుపతి: బాబు మాటలు నమ్మి అన్నదాతలు నట్టేట మునిగారు.. ఎవరూ రుణాలు చెల్లించవద్దు.. బంగారు రుణాలు విడిపించే పూచి నాది చెల్లెమ్మలు అంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అందరూ నమ్మారు. రుణాలపై వడ్డీ చెల్లించలేదు. అసలుతో కలిసి అప్పు మొత్తం కొండలా పెరిగిపోయింది. ఇప్పుడు ఏకంగా అప్పుతీర్చమని నోటీసులు, వేలం వేస్తామంటూ పత్రికల్లో ప్రకటనలు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కళ్ల ముందే బంగారం వేలం వేయడాన్ని అన్నదాతలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో సాక్షాత్తు వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అన్నదాత గుండెకు గాయాన్ని చేశాయి. పంట రుణాలు తీసుకున్న రైతుల బంగారు నగలను బ్యాంకులు వేలం వేస్తున్న సమాచారం లేదని చెప్పడం చూసి రైతన్నలు నివ్వెర పోతున్నారు. తమకు వచ్చిన నోటీసులు చేత బట్టుకుని ఇవేంటని ప్రశ్నిస్తున్నారు. బంగారు రుణాలు ఇలా... 2013-14వరకు బంగారు రుణాలు తీసుకున్న రైతులు: 2,01,751 రుణం మొత్తం: రూ.1682 కోట్లు అన్నదాతకు కష్టాలు జిల్లాలో 2013 డిసెంబరు వరకు 8,70,321 మంది రైతులు రూ.11,180 కోట్ల రుణం తీసుకున్నారు. ఇందులో 5.63 లక్షల మంది రైతుల రుణాలను బ్యాంకర్లు అనుసంధానం చేశారు. తొలి విడతలో 3,06,544 మంది, రెండో విడతలో 1,42,229 మొత్తం 4,53,773 మంది రైతులు రుణమాఫీ పొందారు. వీరంతా కేవలం రూ.600 కోట్ల మాత్రమే రుణమాఫీ పొందడం గమనార్హం. పెరిగిన బంగారు రుణాలు వ్యవసాయ రుణాలకు సంబంధించి రెన్యూవల్స్ చేయకపోవడంతో అమాంతం వడ్డీ భారం పెరిగింది. దీంతో చేసేదీమి లేక పంటల సాగు కోసం ఉన్న అరకొర బంగారు నగలను సైతం అన్నదాతలు బ్యాంకులో కుదవ పెట్టారు. 2014-15లో 2.05,012 మంది రైతులు రూ.1553.15 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఈ ఏడాది ఏకంగా బంగారు రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య మరింత పెరిగింది. 2015-16లో 3,41,283 మంది రైతులు రూ 2504.32 కోట్ల రుణాన్ని తీసుకోవడం గమనార్హం. నోటీసు ఇవ్వకుండా వేలం వేశారు వాల్మీకిపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 47 గ్రాముల బంగారం తాకట్టు పెట్టి రూ.70 వేలు అగ్రికల్చరల్ గోల్డ్లోన్ తీసుకున్నాను. రూ.19,202.94 మాఫీ అయినట్లు రుణ విముక్తి పత్రం కూడా అందింది. బ్యాంక్కు వెళ్లి మిగతా సొమ్ము చెల్లించి బంగారాన్ని తీసుకుందామంటే వేలం వేసేశామని చెబుతున్నారు. నోటీసులు కూడా పంపకుండా వేలం ఎలా వేస్తారని అడిగితే పేపర్ ద్వార సమాచారం ఇచ్చామని బుకాయిస్తున్నారు. -సి.రమణ, సరిమడుగు, గుర్రంకొండ (మం) చెప్పకుండానే వేలం వేసేశారు రెండేళ్ల క్రితం అంగళ్లు ఎస్బీఐలో 125 గ్రాముల బంగారం తాకట్టుపెట్టి రూ.1.25 లక్షలు పంట రుణం తీసుకున్నా. అసలు వడ్డీ కలిపి రూ.1.85 లక్షలు అయ్యింది. రుణమాఫీ అవుతుందని ఆశపడ్డాను. కానీ మాఫీ కాలేదు. పెరిగిన వడ్డీతో కట్టలేకపోయా. రూ.3 లక్షలకు పైగా విలువచేసే నగలను నాకు తెలియకుండానే వేలం వేసేశారు. -ఎం.నాగిరెడ్డి, అంగళ్లు, కురబలకోట (మం) -
‘రెండో’ సగానికి గ్రీన్సిగ్నల్
రెండో విడత రుణమాఫీపై తెలంగాణ సర్కారు నిర్ణయం ఒకటి రెండు రోజుల్లో బ్యాంకుల్లో జమ రూ.2,043 కోట్లు లెక్కతేల్చిన ప్రభుత్వం మొత్తం రూ.4,086 కోట్లకు చేరనున్న రెండో విడత రూ.5వేల కోట్లకే పరిమితమైన ఖరీఫ్ పంట రుణాలు హైదరాబాద్: పంట రుణాల మాఫీకి సంబంధించి రెండో విడతలోని మిగతా సగం నిధుల విడుదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో రూ.2,043 కోట్లను బ్యాంకుల్లో జమ చేయనుంది. ఈ సొమ్ము విడుదలైతే రెండో విడత సొమ్ము మొత్తం రూ.4,086 కోట్లకు చేరనుంది. సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సర్కారు ఈ మేరకు హామీ ఇచ్చింది. అర్హులకే రుణమాఫీ సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ సొమ్ము విడుదలైతే రైతులకు కొత్త రుణాలు ఇచ్చే ప్రక్రియను బ్యాంకులు వేగవంతం చేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. రెండు సార్లు.. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దాని ప్రకారం మొత్తంగా 35.82 లక్షల రైతులకు చెందిన రూ.17 వేల కోట్ల రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేయనున్నట్లు సర్కారు గత ఏడాది తెలిపింది. మొదటి విడతగా గత ఏడాది రూ.4,230 కోట్లను జిల్లాల్లోని బ్యాంకులకు అందజేసింది. ఆ సొమ్ములో రూ.4,086.22 కోట్లను రైతుల ఖాతాల్లోంచి మాఫీ చేసిన బ్యాంకులు.. మిగతా సుమారు రూ.143 కోట్లను వెనక్కి ఇస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతనే ప్రామాణికంగా తీసుకొని రెండో విడత సొమ్ము విడుదలకు ఏర్పాట్లు చేసింది. రెండో విడతకు సంబంధించి సగం రూ.2,043 కోట్లను గత నెలలో విడుదల చేసింది కూడా. కానీ మిగతా సగం నిధులను విడుదల చేయకపోవడంతో.. రైతుల ఖాతాల్లోంచి రెండో విడత రుణమాఫీ కాలేదు. దీంతో రైతులకు కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు తిరస్కరించాయి. దీనిపై ఆందోళన చెలరేగడంతో రెండో విడత రుణమాఫీలోని మిగతా సగం రూ.2,043కోట్లను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పా ట్లు చేసింది. సంబంధిత ఫైలు ఆర్థికశాఖకు చేరినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. మూడో వంతుకే పరిమితం ఈ ఏడాది ఖరీఫ్ పంట రుణాల లక్ష్యం రూ.15,087కోట్లుకాగా బ్యాంకులు ఇప్పటివరకు రూ.5వేల కోట్లు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు. అయితే ఖరీఫ్ పంటల సాగు 60 శాతానికి చేరగా.. కొత్త రుణాల మంజూరు మాత్రం 33 శాతానికే పరిమితమైంది. మరోవైపు మొదటి విడత రుణమాఫీలో అక్రమాలు, బోగస్ రైతులు, బినామీలకు సంబంధించి రెవెన్యూ యంత్రాంగం విచారణ పూర్తయినట్లు తెలిసింది. అయితే ఎందరు అక్రమాలకు పాల్పడ్డారన్న విషయాన్ని సర్కారు బయటకు వెల్లడించలేదు. -
'రైతుల రుణాలు మాఫీ చేయాలి'
-
ఆడవారంటే అలుసా..?
డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేస్తారా... వడ్డీల భారం మాపై మోపి మూలధనంతో సరిపెడతారా... బకాయిలు పేరుకుపోయి డిఫాల్టర్లుగా మారిన డ్వాక్రాసభ్యులు ప్రశాంతంగా సాగుతున్న సంఘ కార్యకలాపాల్లో దేశం చిచ్చు రుణభారంతో నిర్వీర్యమవుతున్న సంఘాలు వారంతా దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు... గుట్టుగా కాపురం చేసుకుంటూ పైసాపైసా పొదుపు చేసి అందులోనే కొంత మొత్తాన్ని కుటుంబ అవసరాలకు రుణం తీసుకుంటున్నారు... బ్యాంకర్లు వారి నిజాయితీకి ముచ్చటపడి రుణాలివ్వడం మొదలుపెట్టారు... సంఘటితంగా ఉంటూ రుణాలు పొందడం, నిర్ణీత వ్యవధిలో వాటిని చెల్లించడం... ఇలా సాఫీగా సాగిపోతున్న తమ పొదుపు వ్యవహారానికి చంద్రబాబు రాక అపశ్రుతిగా మారింది. ఆయన ఎన్నికల ముందు చేసిన మోసపూరిత హామీ నమ్మిన వారంతా బ్యాంకులకు బకాయిలు చెల్లించడం మానేశారు. వడ్డీలు పెరిగాయి... కొత్త రుణాలు రాలేదు... పైగా బ్యాంకుల్లో వారు డిఫాల్టర్లుగా ముద్రపడ్డారు. వారి గౌరవం కాస్తా మంటగలిసింది. ఇదీ డ్వాక్రా రుణమాఫీ హామీ విని మోసపోయిన మహిళల కథ. శ్రీకాకుళం పాతబస్టాండ్ :ఎన్నికలపుడు అక్కచెల్లెళ్ల అప్పులు తీర్చేసి వారి వారిని రుణవిముక్తులను చేస్తామంటూ విపరీతమైన హామీలు గుప్పించిన తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలయ్యాక ఏరుదాటిన చందాన వ్యవహరిస్తోంది. ఎన్నికల ప్రచార సభల్లో డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని హమీలు గుప్పించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆధికారంలోకి వచ్చాక మాట మార్చారు. నాడు కొండంత ఆశతో అందలం ఎక్కిస్తే... ఇప్పుడు తమకు తగిన శాస్తి జరిగిందంటూ మహిళలంతా పశ్చాత్తాప పడుతున్నారు. ఏ మహిళను కదిపినా బాబు మోసాలపై దుమ్మెత్తిపోస్తోంది. మళ్లీ ఎన్నికలంటూ వస్తే కక్షతీర్చుకుంటామని శపథం చేస్తోంది. జిల్లాలో 44,255 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి జిల్లాలో 33,900 గ్రూపులకు సంబంధించి రూ. 629 కోట్లు రుణాలు ఉన్నాయి. ఎన్నికల్లో చంద్రబాబు చేసిన హామీలు నమ్మిన మహిళాసంఘాలు సుమారు ఆరునెలల పాటు నెలవారీ రుణ బకాయిలు చెల్లించలేదు. ఫలితంగా వాటిపై వడ్డీ కాస్తా రూ. 69కోట్లు పెరిగింది. ఇప్పుడు వారికి పేరుకుపోయిన అప్పులతోపాటు... వడ్డీలు గుదిబండలా మారాయి. తెలుగుదేశం ఆదికారంలోకి వచ్చాక షరామామూలుగా సీఎం మాట మార్చారు. వడ్డీ మాపీ ఉండదని, సంఘంలో సభ్యులకు పదివేలు ప్రోత్సాహకంగా అందజేస్తామని చెప్పారు. కానీ దానినీ చెల్లించకపోగా ఆ మొత్తాన్ని మూడు వాయిదాల్లో చెల్లించాలంటూ నిర్ణయించింది. తొలి విడదతో సంఘంలో ఒక్కో సభ్యురాలికి రూ. మూడు వేలు వంతున వారి సంఘం బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటూ ప్రకటించారు. దీనికీ వడబోత లెక్కలేనన్ని నిబంధనలు పెట్టి వడపోత చేపట్టారు. దీనివల్ల జిల్లాలో 4.99.724 మంది సభ్యులకు 20,004 మందిని అనర్హులుగా ప్రకటించారు. వీరికి ఆధార్, రేషన్కార్డు, మైగ్రేషన్ ఇతర కారణాలతో కుదించారు. కేవలం 4.79.715 మందికి మాత్రమే ఈ మూడు వేలు ప్రోత్సాహం ఆందజేసేందుకు చర్యలు తీసుకుంటుంన్నారు. ఏ ‘మూల’కు...? సర్కారు అట్టహాసంగా హామీలు అమలు చేసేశామంటూ చెబుతూ మూలధన పేరిట ఇస్తున్న రూ. మూడువేలు కనీసం వడ్డీకి కూడా రావడంలేదని సభ్యులు గగ్గోలు పెడుతున్నారు. బాబును నమ్మి నిండా మునిగామనీ, ఇప్పుడు సభ్యులుగా ఉండి డిఫాల్టర్లమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తమ్మీద సర్కారు పుణ్యమాని డ్వాక్రా సంఘాలు నిర్వీర్యమవుతున్నాయి. అంతేనా... హామీ మూడువేలకే పరిమితమవుతుందా.. మిగిలిన మొత్తాన్ని వాయిదాల రూపంలోనైనా చెల్లిస్తారా.. అన్నది సందేహంగా మారుతోంది. వడ్డీలేని రుణాలన్నారు.. మోసం చేశారు వడ్డీ లేని రుణాలని చెప్పి మమ్మల్ని మోసగించారు. సక్రమంగా ప్రతి నెలా వాయిదాలు చెల్లించినప్పటికీ నా దగ్గర నుంచి రూ.1650 వడ్డీ వసూలు చేశారు. ఇప్పుడేమో పెట్టుబడి నిధి కింద రూ.10 వేలు ఇస్తామని చెప్పి కేవలం రూ.3 వేలు మాత్రం ఇస్తామంటున్నారు. ఆ డబ్బులూ ఇంకా జమ కాలేదు. - రౌతు తవిటమ్మ, జోజప్ప గ్రూప్, వీరఘట్టం కొత్తగా ఖాతాలు తెరవడం కష్టంగా ఉంది మా ఊళ్లో రాజరాజేశ్వరి స్వయం శక్తి సంఘంలో సభ్యురాలిగా ఉంటూ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఏడాది క్రితం 40 వేల రూపాయల రుణం తీసుకున్నాను. టీడీపీ అధికారంలోకి వస్తే రుణమాఫీ జరుగుతుందని ఆశించాను. మాఫీ పేరుతో ఇప్పుడు 3 వేల రూపాయలు అందజేస్తామని చెప్తున్నారు. దానికోసం కొత్త ఖాతాలు తెరవాలంటున్నారు. అది తెరవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నాం. - డి.శ్రీనమ్మ, విక్రంపురం, టెక్కలి మండలం. రుణ మాఫీకై ఇచ్చింది వడ్డీకే సరిపోదు సంఘంలో 10 నుంచి 20 మంది సభ్యులం ఉన్నాం. సుమారు రెండు లక్షల వరకూ డబ్బులు అప్పు చేశాం. రుణ మాఫీ మొత్తం అంటే వాడినది వడ్డీ అంతా కలిపి 2.30 లక్షలు మాఫీ అవుతుందనుకున్నాం. ఇప్పుడు ఇచ్చిన మూడు వేలు భవ్యిష్యనిదికి జమ అంటే వడ్డీకే సరిపోదు. - అల్లు అప్పమ్మ, బలగ అప్పమ్మ, తర్రచిన్నమ్మడు, మాకియవలస, నరసన్నపేట మండలం మోసపోయాం.. వడ్డీలు కడుతున్నాం హరిపురం గ్రామీణ వికాస బ్యాంకులో అప్పు తీసుకున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ అని హామీ ఇవ్వడంతో తీసుకున్న అప్పు కట్టలేదు. ముఖ్యమంత్రి అయి ఏడాది గడుస్తున్నా.. ఇంత వరకు రుణమాఫీ చేయలేదు. తీసుకున్న బకాయి తీర్చేద్దామంటే వడ్డీ మీద వడ్డీలు వేస్తున్నారు. రుణమాఫీ కాలేదు కాని వడ్డీలు భారం పడింది. - బల్ల లీలాకుమారి, డ్వాక్రా సంఘం సభ్యురాలు, హరిపురం. మందస మండలం -
ఈ ఏడాదీ రైతులకు ప్రైవేటు రుణాలే దిక్కా?
సందర్భం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు షరతులతో మాఫీ మొత్తాన్ని తగ్గించటంలో చూపిన శ్రద్ధను వాటిని బ్యాంకులకు చెల్లించటంలో చూపలేదు. దీంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించిన రైతులు అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. 2014 శాసనసభ ఎన్నికల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తా మంటూ నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం చలాయి స్తున్న పాలక పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఆ నినాదంతోనే రైతులను అవి ఆకట్టుకున్నాయి. అధికారం లోకి రాగానే మొదటి సంతకం రుణమాఫీపైనేనని ఇద్దరు అధినేతలూ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక వారి చేతలు చెప్పిన దానికి విరు ద్ధంగానే సాగుతున్నాయి. అధికారంలోకొచ్చిందే తడవుగా రుణమాఫీ మొత్తా న్ని తగ్గించుకునేందుకు రెండు ప్రభుత్వాలూ అనేక నిబంధనలు, షరతులు విధించాయి. ఏపీ ప్రభుత్వం 2007-2013 వరకు రుణం పొందినవారికి మాత్రమే మాఫీ వర్తింపుచేస్తామన్నది 50 వేలలోపు రుణం తీసు కున్న రైతులకు పూర్తి రుణమాఫీ, అంతకంటే ఎక్కువ రుణం ఉన్నవారికి ఏటా 20 శాతం రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 82.66 లక్షల ఖాతాలకుగాను 40.43 లక్షల ఖాతాలకు మాఫీ ప్రకటించి, 26.77 లక్షల మందికి మాఫీ చేసినట్టు ప్రభుత్వ నివేదికల్లో పేర్కొన్నారు. రుణమాఫీకి మొదటి విడతగా 5 వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు. 2015-16 బడ్జెట్లో కేటాయించిన రూ.4,300 కోట్లను నేటికీ బ్యాంకులకు విడుదల చేయలేదు. రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలకుగానూ రూ.12,274 కోట్లు ఇస్తా మని ప్రకటించి... రూ.2,179 కోట్లు మాత్రమే విదిలిం చారు. కుటుంబంలో ఒకరికే రుణమాఫీ, రుణ మొత్తాన్ని బట్టి మాఫీ, రూ.1.50 లక్షల లోపు రుణాలకే మాఫీ వంటి నిబంధనలతో రూ.87,612 కోట్ల రుణమాఫీని కేవలం రూ.14,322 కోట్లకు పరిమితం చేశారు. పైగా పంట రుణాలు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీనీ ప్రభుత్వం తగ్గించింది. విభజన నాటికి ఏపీ రాష్ట్ర వ్యవ సాయ, డ్వాక్రా రుణాలు రెండూ కలిసి రూ.1,01,816 కోట్లు కాగా, రెంటికీ ప్రభుత్వం ప్రకటించిన మాఫీ రూ.18 వేల కోట్లు మాత్రమే. ఇక తెలంగాణ ప్రభుత్వం కుటుంబానికి లక్ష రూపాయల వరకే మాఫీ నిబంధనతో రూ. 38 వేల కోట్ల రుణాలను రూ.17 వేల కోట్లకు తగ్గించింది. రెండో విడ త 2015-16 బడ్జెట్ నిధులు రూ.4,250 కోట్లు నేటికీ బ్యాంకులకు చేరలేదు. దీంతో రూ.18,717 కోట్ల పంట రుణాలు, రూ.6,238 కోట్ల దీర్ఘకాలిక రుణాలు మం జూరు చేయడానికి బ్యాంకులు ఆసక్తి చూపడంలేదు. ఈ పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాల రైతులు రూ.15 వేల కోట్ల మేరకు కొత్తగా ప్రైవేటు రుణాలు తీసుకున్నట్టు అంచనా. ప్రకృతి వైపరీత్యాలతో పంట చేతికందలేదు. దీంతో వడ్డీ వ్యాపారుల ఒత్తిడికి తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణలో 870 మంది, ఆంధ్రప్రదేశ్లో 150 మంది రైతులు ఆత్మహత్య లకు పాల్పడినట్టు పత్రికల సమాచారం. బ్యాంకు నిబంధనలు ప్రభుత్వాలకు తెలియనివా? బాకీదారునికి ఏ బ్యాంకూ కొత్త రుణం ఇవ్వదు. బాకీ తీర్చడమో లేక రీషెడ్యూల్ చేయడమో జరగాలి. లేదా ఆ బాకీని ప్రభుత్వం తన పేరుకు మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే రుణమాఫీ జరిగినట్టు గుర్తించి బ్యాంకులు కొత్త రుణాలు ఇస్తాయి. ప్రభుత్వం బాండ్లు ఇచ్చి వాటికి వడ్డీ చెల్లిస్తామంటోంది. బ్యాంక్లు బాండ్లను స్వీకరిం చవు. కాబట్టి బాండ్లు ఉన్నా రైతులు బ్యాంకులకు రుణం చెల్లించాల్సిందే. మాటల గారడీతో చివరికి రైతుల ను బలి పశువులను చేశారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులిచ్చే రుణాలవల్ల అధిక వడ్డీ భారం మోయడమే కాదు, పంట కాలం పూర్తవ గానే మొత్తం చెల్లించాల్సిందే. అసలే ఆర్థిక భారంతో కుంగిపోతున్న రైతుకు ఇది మరింత భారం. బ్యాంకు రుణాలనైతే వడ్డీ చెల్లించి కొత్త రుణాలుగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రైవేటు రుణాలకు అసలు, వడ్డీ మొత్తం అణా పైసలతో సహా గడువు ముగియగానే చెల్లించాల్సిందే. ఇది ైరె తుకు కష్టసాధ్యమైన పని. కొత్త రుణం ఇవ్వలేని పరిస్థితిలో బ్యాంకులు రుణ పరిమితిని పెంచి కొంత సొమ్మును రైతుల చేతికి ఇస్తాయి. పాల కుల నిర్వాకంతో ఆ అవకాశమూ రైతుల చేజారింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వాలు రైతుల నోటి దగ్గరి కూడు తీశాయి. గతేడాదిలాగే రైతులు మళ్లీ ప్రైవే టు వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడి దివాలా తీయ కుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు 2015 మే నాటికి మొత్తం రుణ మాఫీ చే యాలి. అది జరిగితేనే బ్యాంకులు రానున్న ఖరీఫ్ సీజన్కు జూన్లో రుణాలు ఇస్తాయి. ఆ దిశగా ప్రభుత్వాలు సత్వర చర్యలకు ఉపక్రమించాలి. లేకుంటే రైతులు గతేడాదిలాగే మళ్లీ ప్రైవేటు రుణాల ఊబిలోకి దిగక తప్పదు. రైతాంగ రుణాలు - నగ్న సత్యాలు (రుణాలు, కేటాయింపులు రూ.కోట్లలో) తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంట రుణాలు 34,000 87,612(మార్చి 2013) ఖాతాలు 38 లక్షలు 40 లక్షలు ప్రకటించిన మాఫీ 17,000 14,322 2014-16 కేటాయింపులు 8,500 9,300 2014-15 పంట రుణ లక్ష్యాలు 18,717 56,019 2014-15లో ఇచ్చిన రుణాలు 6,000 7,263 (వ్యాసకర్త రైతాంగ ఉద్యమ నేత) మొబైల్ నం 94900 98666 సారంపల్లి మల్లారెడ్డి -
వాటికన్నా ముఖ్యమైన అంశముందా?
రైతు, డ్వాక్రా రుణ మాఫీలపై వాయిదా తీర్మానమిచ్చిన వైఎస్సార్ సీపీ చర్చ కోసం పట్టు: అనుమతించని స్పీకర్ హైదరాబాద్: ‘రైతు, డ్వాక్రా రుణాల మాఫీ కంటే ముఖ్యమైన అంశం ఏమైనా ఉందా? రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు అవస్థలు పడుతుంటే.. రుణమాఫీ మీద చర్చించకుంటే ఎలా? ఈ నెల 10న 344 నిబంధన కింద రైతు, డ్వాక్రా రుణాల మాఫీ అంశంపై చర్చకు నోటీసిచ్చాం. ఈ అంశం మీద చర్చ జరగాలని బీఏసీ సమావేశంలో చెప్పాం. అదేమిటని అడిగితే.. మేం(విపక్షం) సభలో లేనప్పుడు చర్చించామంటారు. మేం సభలో లేనప్పుడు.. అన్నీ అబద్ధాలతో సీఎం ప్రకటన చేసి, మీకు మీరే(అధికార పక్షమే) మాట్లాడుకుంటే సరిపోతుందా? విపక్షం లేకుండా మీరే మాట్లాడుకుని చర్చ అయిపోయిందనడం సరైన పద్ధతేనా?’ అని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో గురువారం ప్రశ్నించారు. రైతులు, డ్వాక్రా రుణాల మాఫీపై చర్చించాలని కోరుతూ.. విపక్షం వాయిదా తీర్మానం ఇచ్చింది. గురువారం సభ ప్రారంభంకాగానే ఈ తీర్మానాన్ని తిరస్కరించినట్టు స్పీకర్ కోడెల శివప్రసాద్రావు ప్రకటించారు. దాంతో విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘5 కోట్ల మంది ప్రజలు సభా సమావేశాలను చూస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే రుణమాఫీపై చర్చకు రావాలి. చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో అర్థం కావడం లేదు. ప్రజల ఆవేదన గురించి పట్టించుకోకుంటే ఎలా? రైతులు, డ్వాక్రా మహిళలు ఏమైనా ఫర్వాలేదా? వారి చావు వారు చావాల్సిందేనా? మనకు బాధ్యత లేదా? ప్రజల సమస్యలు మాట్లాడడానికే ఈ సమావేశాలకు వచ్చాం. సీఎం నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతారు. రూ.86 వేల కోట్ల రుణాలు ఉండగా, 2014-15లో రుణమాఫీకి ప్రభుత్వం ఇచ్చింది రూ.4,600 కోట్లు. రైతుల రుణాలు వడ్డీలతో తడిసి మోపెడై రూ.99 వేల కోట్లకుపైగా పెరిగాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం కేటాయించింది రూ.2,100 కోట్లు. ప్రభుత్వం కేటాయించింది వడ్డీలకే సరిపోదు. రైతుల కంటే ముఖ్యమైన అంశం మరొకటి ఉంటుందా? రుణం కోసం బ్యాంకుల గడప కూడా రైతులు తొక్కలేకపోతున్నారు. అప్పు పుట్టక అల్లాడిపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మల మీద కనికరం చూపించండి’ అని కోరారు. స్పందించని స్పీకర్.. రుణమాఫీపై చర్చించాలని విపక్ష నేత వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు సానుకూలంగా స్పందించలేదు. అయినప్పటికీ అత్యం త ముఖ్యమైన దీనిపై చర్చకు అనుమతించాలంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టారు. రుణమాఫీ అంశంపై సీఎం ఇప్పటికే ప్రకటన చేశారని, చర్చ కూడా జరిగిందని ఈ సందర్భంగా స్పీకర్ చెప్పారు. సభ నుంచి వెళ్లమని విపక్షానికి ఎవరూ చెప్పలేదన్నారు. హాయిగా సభలో ఉండాల్సిందన్నారు. చర్చ జరిగి న అంశంపై మళ్లీ చర్చకు అనుమతించే సంప్రదాయం లేదన్నారు. దీంతో వైఎస్సార్ సీపీ సభ్యులు.. స్పీకర్ పోడి యం వద్ద నిలబడి నినాదాలు చేశారు. వారి నినాదాలు కొనసాగుతుండగానే.. అధికార పక్షానికి చెందిన కాలవ శ్రీనివాసులు, ధూళిపాళ్ల నరేంద్రలు విపక్షంపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో 9.15 గంటలకు స్పీకర్ సభను వాయిదా వేశారు. -
ప్రచార పటాటోపం
కోట్లు కుమ్మరిస్తున్న ప్రభుత్వం జిల్లా అంతటా హోర్డింగ్లు ఆర్థిక లోటులోనూ వృథా ఖర్చు ప్రచార ఆర్భాటంపై విమర్శల వెల్లువ విశాఖపట్నం: అధికారం చేపట్టి తొమ్మిది నెలలవుతున్నా అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనలకు, సెమినార్లలో సావనీర్లు విడుదలచేసి పంపిణీకి డబ్బులు మంంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ప్రచారం పేరుతో వృథా ఖర్చు ప్రారంభించారు. జిల్లాలో ఏ మూలకెళ్లినా బాబు ప్రచార హోర్డింగ్లే కనిపిస్తున్నాయి. బస్సులపైనే కాదు..బస్షెల్టర్లు, ప్రధాన,మారుమూల కూడళ్లలో సైతం భారీ హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఈ ప్రచార హోర్డింగ్ల కోసం ఒక్క విశాఖ జిల్లాలోనే అక్షరాల కోటిన్నర ఖర్చు చేస్తున్నారు. ఇక రాష్ర్టవ్యాప్తంగా ఎన్ని కోట్లు ఈ రూపంలో తలగేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ర్టంలో రైతులకు రూ.87వేల కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా మొదటివిడతలో కేవలం నాలుగున్నరవేల కోట్లతో సరిపెట్టింది. రెండోవిడత కోసం బడ్జెట్లో మరో 5వేల కోట్లు మాత్రమే కేటాయించింది. కానీ రెండువిడతల్లో 82.66లక్షల మందిరైతులకు రుణవిముక్తి కల్పించినట్టుగా ప్రచార హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ఇవేకాదు..ఇలాంటి లేనిగొప్పలు చెప్పుకుంటూ వెలిసిన హోర్డింగ్ల పట్ల సర్వత్రా విమర్శలువెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 544 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. సుమారు 2,75,980 చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్ల కోసం రూ.89,42,690లు ఖర్చు చేస్తున్నారు. ఇక సుమారు 160 బస్షెల్టర్లలో 36,557 చదరపు అడుగుల హోర్డింగ్ల కోసం రూ. 52,51, 570 ఖర్చు చేస్తున్నారు. ఇలా ప్రచారహోర్డింగ్ల కోసం ఏకంగా కోటి 41 లక్షల 94 వేల 260 చెల్లించాలని ప్రతిపాదించారు. ఈ విధంగా రాష్ర్ట వ్యాప్తంగా 13 జిల్లాల్లో తమ ప్రభుత్వ గొప్పతనం ప్రచారం కోసం సర్కార్ అక్షరాల రూ.20కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలియవచ్చింది. ఇక బస్సులపై ఏర్పాటు చేసిన హోర్డింగ్ల కోసం మరో నాలుగైదు కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రచారార్భాటం కోసం గత నెలలో జిల్లాకు మూడు ప్రచార రథాలను కేటాయించారు. ఒక్కొక్క రథం ప్రతీరోజు రెండు గ్రామాలను సందర్శించే విధంగా డిజైన్ చేసిన ఈ కార్యక్రమం కోసం రాష్ర్టంలో రూ.4కోట్ల వరకు ఖర్చు చేశారు. మళ్లీ ఇప్పుడు ఈ హోర్డింగ్ల పేరుతో మరో రూ.20కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక లోటు సాకుతో ట్రెజరీ ద్వారా చెల్లింపులపై కూడా ఆంక్షలు విధించిన ప్రభుత్వం బొటాబొటీగా జీతభత్యాలు మాత్రమే చెల్లిస్తూ మిగిలిన చెల్లింపులకు సవాలక్ష కొర్రీలు వేస్తోంది. ట్రెజరీల్లో వందల కోట్లకు చెందిన వేలసంఖ్యలో బిల్లులు పెండింగ్లో పడిపోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులున్న సమయంలో ప్రచారం కోసం ఈ వృథా ఖర్చు లెందుకని విపక్షాలు.. మేధావులు విమర్శలు గుప్పిస్తున్నారు. -
రైతు ద్రోహి చంద్రబాబు
అనంతపురం అర్బన్: అధికారం కోసం వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత హామీలను విస్మరించిన చంద్రబాబు నాయుడు చరిత్రలో రైతు ద్రోహిగా మిగిలారని వైఎస్సార్కాంగ్రెస్ పార్టీనాయకులు విమర్శించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. యోగేశ్వర్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పోరెడ్డి శ్రీకాంత్రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, ట్రేడ్ యూనియన్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా మాట్లాడారు. ముఖ్యమంత్రి రైతుల సమస్యలను పట్టిం చుకోకుండా విదేశీ యాత్రలతో కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి, రైతన్న కన్నీళ్లను తుడుస్తానని చెప్పిన చంద్రబాబు సమాజంలో రైతులు మర్యాద లేకుండా చేశారన్నారు. మరో వైపు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూనే సవాలక్ష నిబంధనలతో మహిళలను మోసం చేశారన్నారు. కోస్తా ప్రాంతంలో బంగారు పంటలు పండే భూములను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెడుతున్నారన్నారు. కార్పొరేట్ శక్తులైన మంత్రి నారాయణ, సుజానాచౌదరి, సీఎం రమేష్ చేతుల్లో బాబు కీలుబొమ్మగా మారారన్నారు. కరువు జిల్లాలో రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు సమస్యలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న ‘రైతు దీక్ష’తో టీడీపీ ప్రభుత్వం గుండెల్లో గుబులు రేగుతోందన్నారు. రైతు దీక్షకు తరలిరండి: రైతన్న సమస్యలపై పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 31, ఫిబ్రవరి 1న చేపట్టనున్న 48 గంటల రైతు దీక్షకు వేలాదిగా రైతులు తరలి రావాలని బి. యోగేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. రైతులు, డ్వాక్రా మహిళలు, అన్ని వర్గాల వారు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా కార్యవర్గ సభ్యులు గౌస్ బేగ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, నగర యువజన విభాగం అధ్యక్షులు ఎల్లుట్ల మారుతి నాయుడు, విద్యార్థి విభాగం నగర అధ్యక్షులు జంగాలపల్లి రఫీ, గోపాలమోహన్, నగర అనుబంధ సంఘం నాయకులు శంకర, జయపాల్, పాల్గొన్నారు. -
రైతుల రుణ మాఫీపై 20 నుంచి ఆందోళన
ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రే వెల్లడి {పభుత్వ పనుల స్తంభన - మంత్రుల పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిక ముంబై: కరువు కారణంగా అప్పుల్లో కూరుకుపోయిన రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20 తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రే ప్రకటించారు. రైతుల రుణాను మాఫీ చేయడంతోపాటు హెక్టారుకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి చేయనున్నామని చెప్పారు. ఆందోళనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పనులు స్తంభింపజేయడంతోపాటు ఒక్క మంత్రిని కూడా పర్యటించకుండా అడ్డుకుంటామని ఠాక్రే హెచ్చరించారు. మరాఠ్వాడ ప్రాంతంలో నెలకొన్న కరువు పరిస్థితులపై సమీక్షించేందుకు స్థానిక పదాధికారులతో ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించారు. మాణిక్రావ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, మాజీ మంత్రులు అబ్దుల్ సత్తార్, సిరాజ్ షేఖ్, ఓంప్రకాశ్ పోకర్ణ, ఎమ్మెల్యేలు బసవరాజ్ పాటిల్, అమర్ రాజుర్కర్, మాజీ ఎమ్మెల్యేలు సురేశ్కుమార్ జెతలియా, కైలాస్ గోరంట్యాల్, మాధవ్రావ్ పాటిల్, మాజీ ఎంపీ తుకారాం రేంగే పాటిల్, కాదీర్ మౌలానా, జిల్లాధ్యక్షుడు కేశవ్రావ్ ఔతాడే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాణిక్రావ్ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వ పాలన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1972లో వచ్చిన కరువు కంటే ప్రస్తుత పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అంగీకరించారని చెప్పారు. దీన్ని బట్టి రాష్ట్రంలో కరువు ఏ స్థాయిలో ఉందో ప్రభుత్వానికి తెలుసునని, కానీ బాధితులను మాత్రం ఆదుకోలేకపోతోందని మాణిక్రావ్ దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ఆత్మహత్య చేసుకోవల్సిన అవసరం రాదని, వారు కనీసం 50 శాతం లాభపడే పథకాలను ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్ర మోదీ యావత్మాల్లో జరిగిన సభలో ఉద్ఘాటించారని గుర్తు చేశారు. కాని మోదీ ప్రభుత్వం ఎగుమతులను నిలిపివేసి రైతులకు కనీస ధర రాకుండా చేసిందని ఆరోపించారు. దీంతో రైతులు రెండు విధాలుగా ఇబ్బందుల్లో పడిపోయారని అన్నారు. రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఎక్కడ ప్రారంభం కాలేదపి, రైతులకు ఆర్థిక సాయం చేయాలంటే కేంద్రంపై వేలెత్తి చూపుతున్నారని అన్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలల్లో మరాఠ్వాడలో 107 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. జాయ్క్వాడీ జలాశయంలోకి నీరు విడుదల చేయాలని వాటర్ అథారిటీ అనుమతి ఇచ్చిందని, అయినా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మరాఠ్వాడ ప్రాంత ప్రజలు సంయమనం కోల్పోతే పరిస్థితులు మరో విధంగా ఉంటాయని చవాన్ హెచ్చరించారు. -
బాబు నిర్వాకం.. రైతుకు శాపం
రైతులకు అప్పులివ్వబోమని చెబుతున్న బ్యాంకులు సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు రుణాలు మాఫీ చేస్తామంటూ రైతుల్లో ఆశలు కల్పించి, అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల నిబంధనలు, మెలికలతో అన్నదాతను ముప్పు తిప్ప లు పెడుతోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికీ అరకొరగానే రుణాలు మాఫీ చేసింది. చంద్రబాబు నిర్వాకం ఫలితంగా ఇప్పుడు రైతులకు కొత్త రుణాలు కూడా రాకుండా పోతున్నాయి. సర్కారు ఇప్పటికీ రుణాల మాఫీ సవ్యంగా చేయకపోవడంతో బ్యాంకులు రైతులకు కొత్తగా అప్పులు ఇవ్వడంలేదు. ఖరీఫ్ ముగిసిపోయి రబీ సీజన్ వచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. గత ఆర్థిక సంవత్సరం ఖరీఫ్లో రైతుల రుణాలకు పావలా వడ్డీ, వడ్డీ లేని నిధులను బ్యాంకులకు ప్రభుత్వం విడుదల చేయలేదు. రూ. లక్ష వరకు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లిస్తే వడ్డీ లేని రుణం వర్తిస్తుంది. లక్ష రూపాయలకుపైగా రుణం తీసుకుని సకాలంలో చెల్లిస్తే పావలా వడ్డీ వర్తిస్తుంది. సకాలంలో రుణాలు చెలిచిన వారి వడ్డీల నిధులను ఇవ్వాలని బ్యాంకులు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ, స్పందన రాలేదు. ప్రభుత్వం వడ్డీ చెల్లించకపోవడం వల్ల ఆ భారమూ బ్యాంకులపై పడిందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అంటోం ది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజ న్లలో కలిపి రూ.56,019 కోట్లు వ్యవసాయ రుణాలుగా మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటివరకు రూ. 13,789 కోట్లు మాత్రమే ఇచ్చాయి. ఇది రుణ లక్ష్యంలో 24.16 శాతమే. ఇదే సమయానికి గత ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యంలో 54.17 శాతం బ్యాంకులు మంజూరు చేశాయి. ఎస్సీ, ఎస్టీ,, బీసీ సంక్షేమ ఆర్థిక సహకార సంఘాల ద్వారా రుణాల మంజూరు కూడా ఇదే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన 188వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. దీంట్లో బ్యాంకులు పలు అంశాలు ప్రస్తావించనున్నాయి. -
అన్నీ అబద్ధాలే
సీఎం ప్రసంగంపై రైతుల మండిపాటు వ్యవసాయ రుణాల మాఫీపై శాసనసభలో అబద్ధాలు చెప్పిన సీఎం చంద్రబాబు రూ.50వేలలోపు పంటరుణాలను ఒకేసారి మాఫీ చేశామని, ఆ రుణాలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేయలేదని చెప్పిన బాబు 2007లో ఉన్న ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ ధరల ఆధారంగానే రుణ మాఫీ చిన్న, సన్నకారు రైతులను నిలువునా ముంచిన ముఖ్యమంత్రి తిరుపతి: శాసనసభలో సోమవారం నిర్వహించిన చర్చలో రుణమాఫీపై సీఎం చంద్రబాబు చెప్పిన వివరాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేయడంలో తనను మించిన వారు లేరని సీఎం చంద్రబాబు మరోసారి నిరూపించారని మండిపడు తున్నారు. అంతర్గత సమావేశాల్లోనైనా బహిరంగసభలోనైనా.. చివరకు శాసనసభలోనైనా పబ్లిగ్గా పచ్చి అబద్ధాలు చెప్పడంలో తానే మేటి అని మరోసారి ఆయన చాటి చెప్పారని నిప్పులు కక్కుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఒక్క సంతకంతో వ్యవసాయ రుణాలను మాఫీ చేసి.. రైతులకు ఉపశమనం కల్పిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. కానీ.. అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీ అమలును నీరుగార్చుతూ వచ్చారు. ఒక్కో కుటుంబానికి గరి ష్టంగా రూ.1.5 లక్షల పంట రుణం మాఫీ చేస్తానని పేర్కొన్నారు. ఐదు విడతల్లో రుణాన్ని మాఫీ చేస్తానని సెలవి చ్చారు. రూ.50 వేలలోపు రుణాలను ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’తో నిమిత్తం లేకుండా ఒకేసారి మాఫీ చేస్తామని ప్రకటించారు. ఆ మేరకే రుణమాఫీ మార్గదర్శకాలను రూపొందించి.. లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని బ్యాంకర్లను ఆదేశిం చారు. జిల్లాలో 8,70,321 మంది రైతులు డిసెంబర్ 31, 2013 నాటికి రూ.11,180.25 కోట్ల వ్యవసాయ రుణాల రూపంలో బ్యాంకర్లకు బకాయిపడ్డారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు 5.63 లక్షల మంది రైతులకు సంబంధించిన ఆధార్కార్డులు, రేషన్కార్డులు, బ్యాంకు ఖాతా నంబర్లు, భూమి రికార్డులను అనుసంధానం చేసి.. ఆ రైతులందరూ మాఫీకి అర్హులుగా తేల్చిన బ్యాంకర్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. కానీ.. ప్రభుత్వం తొలి విడత 3,06,544, రెండో విడత 1,42,229 మొత్తం 4,53,773 మంది రైతులకే మాఫీ వర్తింపజేసింది. తక్కిన 4,16,548 మంది రైతులకు మొండిచేయి చూపింది. రూ.11,180.25 కోట్లకుగానూ రూ.600 కోట్ల మేర మాత్రమే మాఫీ చేసినట్లు బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ఎండగట్టిన విపక్ష నేత.. రుణ మాఫీలో రైతులకు చేసిన అన్యాయంపై వైఎస్సార్సీపీ శాసనసభలో సోమవారం చర్చకు పట్టుబట్టింది. ఈ చర్చలో రైతులకు చేసిన అన్యాయాన్ని ప్రతిపక్షనేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. భేషరతుగా రుణ మాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం చంద్రబాబు.. రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను వర్తింపజేసి పొట్టకొట్టారు. ఒకే విడత ఆ రైతులకు రుణ మాఫీ చేయలేదు. ఏరుదాటాక తెప్ప తగలేసినట్లు వ్యవహరిస్తోన్న చంద్రబాబుకు రైతులు తగిన రీతిలో బుద్ధిచెబుతారు. అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు ఒకేసారి రుణ మాఫీ వర్తింపజేశామని.. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను వర్తింపజేయలేదని పబ్లిగ్గా పచ్చి అబద్ధాలు చెప్పారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం చేయలేదని.. అన్యాయం చేసిన రైతు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. చట్టసభ సాక్షిగా అబద్ధాలా..? రుణ మాఫీపై సీఎం చంద్రబాబు శాసనసభను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని బ్యాంకర్లు.. ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 2013-14లో ఆర్బీఐ నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఎకరంలో చెరకు పంటకు రూ.50 వేలు, వరి పంటకు రూ.24 వేలు, వేరుశనగ పంటకు రూ.12 వేలు రుణం ఇచ్చేలా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను రూపొందించారు. పంట రుణాలు ఇచ్చేటపుడు బ్యాంకర్లు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మేరకే రుణాలు ఇస్తారు. బంగారు ఆభరణాలను తనఖా పెట్టినప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను పాటించాలన్న నిబంధన లేదు. ప్రభుత్వం రుణ మాఫీ చేసేటపుడు రైతులందరికీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను వర్తింపజేసింది. అదీ 2007లో అమల్లో ఉన్న ధరలను వర్తింపజేయడం గమనార్హం. 2007లో చెరకు పంటకు ఎకరానికి రూ.28 వేలు, వరి పంటకు రూ.17 వేలు, వేరుశనగ పంటకు రూ.ఎనిమిది వేలు స్కేల్ ఫైనాన్స్గా ఉండేది. రుణ మాఫీలో అవే ధరలను వర్తింపజేసి చిన్న, సన్నకారు రైతులను సైతం ముంచేశారు. పలమనేరు మండలం కన్నమాకులపల్లెకు చెందిన వెంకటాచలం అనే సన్న కారు రైతు ఉదంతమే అందుకు తార్కాణం. వెంకటచాలం ఒక్క రైతుకే కాదు.. లక్షలాది మంది రైతులకు ప్రభుత్వం ఇదే రీతిలో మాఫీ పేరుతో నిలువునా మోసం చేసింది. శాసనసభలో రుణ మాఫీపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పడంపై రైతులు మండిపడుతున్నారు. రైతుల పాలిట శాపంగా మారిన బాబు సీఎం చంద్రబాబు నాయుడు రైతుల పాలిట శాపంగా మారారు. బ్యాంకుల్లో రుణాలు తోసేస్తామని చెప్పారు. ఆచరణలో మాత్రం శూన్యం. బ్యాంకర్లు మాత్రం రుణాలు చెల్లించాలని చెబుతున్నారు. బ్యాంకులో రూ.50 వేల రుణం తీసుకున్నాను. రుణమాఫీపై బ్యాంకు అధికారులను అడిగాను. ఇప్పుడు కాదు తర్వాత చూస్తామంటున్నారు. ప్రస్తుతానికి తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టమని చెబుతున్నారు. దిక్కుతోచని పరిస్థితిలో ఆత్మహత్యే శరణ్యం. -నాగరాజు, గట్టు గ్రామం, పుత్తూరు మండలం పలమనేరు మండలం మొరం పంచాయతీ పరిధిలోని కన్నమాకులపల్లెకు చెందిన ఎస్.వెంకటాచలం (ఖాతా నంబర్ 24187 978) రెండెకరాల సన్నకారు రైతు. కొలసమాసనపల్లి సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో పట్టాదారు పాసుపుస్తకం తనఖా పెట్టి ఫిబ్రవరి 11, 2013న రూ.49 వేలు పంట రుణం గా పొందాడు. వెంకటాచలం ఆధార్కార్డు నంబర్ 282870625380. ఇప్పుడు వడ్డీతో సహా ఆయన అప్పు రూ.53,955.09కు చేరుకుంది. సీఎం చంద్రబాబు సోమవారం శాసనసభలో చెప్పిన ప్రకారం వెంకటాచలం రుణం ఒకేసారి మాఫీ కావాలి. కానీ.. ఆ రైతుకు కేవలం రూ.30,831.48 మాత్రమే మాఫీ చేస్తున్నట్లు ధ్రువపత్రం ఇచ్చారు. తొలి విడతగా 2014-15లో రూ.6,166.30ను రుణ మాఫీ కింద జమా చేస్తున్నట్లు ఆ ధ్రువపత్రంలో పేర్కొన్నారు. రూ.50వేలలోపు రుణం తీసుకున్న రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేయనట్లు సోమవారం శాసనసభలో సీఎం పేర్కొన్నారు. కానీ.. ఆ రైతుకు 2007లో ఉన్న స్కేల్ ఆఫ్ పైనాన్స్ను వర్తింపజేసినట్లు అదే ధ్రువపత్రంలో ఉంది. 2013-14లో చెరకు పంటకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధన మేరకు ఎకరానికి రూ.40 నుంచి రూ.50 వేలకు రుణం ఇవ్వవచ్చు. ఆ మేరకు వెంకటాచలానికి బ్యాంకు రూ.49 వేలను రుణంగా ఇచ్చింది. కానీ.. రూ.21 వేలను స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కన్నా అధికంగా రుణం ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. వ్యవసాయ రుణాల మాఫీపై సీఎం చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదని చెప్పడానికి ఇదో తార్కాణం. సోమవారం శాసనసభలో రుణమాఫీపై నిర్వహించిన చర్చలో సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారనడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. -
రుణమాఫీలో బినామీలు
కొక్కిరాపల్లి సొసైటీలో వెలుగులోకి అక్రమాలు కార్యదర్శిని నిలదీసిన బాధితులు యలమంచిలి : బినామీ, కాలపరిమితి తీరిన రుణాలకు సంబంధించిన కుంభకోణంతో గతంలో కుదేలైన కొక్కిరాపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో ప్రస్తుతం రుణమాఫీలోనూ అక్రమాలు చోటు చేసుకున్నట్టు శనివారం బయటపడింది. సమగ్ర విచారణ జరిపితే ఈ వ్యవహారం వెనుక ఉన్న సూత్రధారులు బయటపడే అవకాశం ఉందని సభ్యరైతులు డిమాండ్ చేస్తున్నారు. రెండో విడత రుణమాఫీ జాబితాలో పేర్లున్న పలువురు రైతులు శనివారం ఇంటర్నెట్ కేంద్రాల్లో తమ స్టేటస్ను తెలుసుకున్నారు. షేకిళ్లపాలేనికి చెందిన రాయి నూకరాజు ఈ సొసైటీలో రూ.4,193లు రుణం తీసుకున్నాడు. యలమంచిలి ఎస్బీఐలో కూడా రూ.43వేల వరకు పంటరుణం మంజూ రైంది. ఇవి కాకుండా అతని పేరుతో కొక్కిరాపల్లి సొసైటీలో రూ.1.8లక్షలు తీసుకున్నట్టు ఉంది. ఇది చూసి కంగారుపడిన నూకరాజు కుమార్తె లక్ష్మి శనివారం సొసైటీకి వచ్చి కార్యదర్శి రామకృష్ణ, సిబ్బందిని నిలదీశారు. తమకు సంబంధం లేని రుణాలు తమ పేరుతో ఎలా ఉన్నాయని ప్రశ్నించా రు. ఆమెకు మద్ధతుగా సభ్యరైతులు ఆడారి రమణబాబు, ఆడారి ఆదిమూర్తి కార్యదర్శిని నిలదీయడంతో కంప్యూటర్లో తప్పు వచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కొత్తపాలెంకు చెందిన రాపేటి అప్పలనాయుడు తన ఆధార్కార్డు నంబరుతో వివరాలు చూస్తే ఊడా నర్సింహమూర్తి పేరుతో రూ.76,477 రుణం తీసుకున్నట్టు వచ్చింది. రిపోర్టుతో అతడు సొసైటీ కార్యాలయానికి వచ్చి వాపోయాడు. తాను రూ.40వేలు రుణం తీసుకున్నానని, తన ఆధార్, రేషన్ కార్డుల వివరాలతో మరో వ్యక్తి పేరుతో వివరాలు రావడమేమిటని కార్యదర్శిని నిలదీశారు. పెదపల్లికి చెందిన మరిశావెంకటేశ్వరులు యలమంచిలి ఎస్బీఐలో రుణం తీసుకున్నారు. అతని కుమారుడు మరిసా రాము ఈ సొసైటీలో పంటరుణం పొందారు. వెంకటేశ్వరులు కొక్కిరాపల్లి సొసైటీలో ఎలాంటి రుణం తీసుకోలేదు. అయినప్పటికీ వెంకటేశ్వరులు ఆధార్ నంబర్తో కొఠారు మంగతల్లి, పండూరి నాగభూషణం, బోజా సోమునాయుడు పేర్లతో రుణాలు తీసుకున్నట్టు బయటపడింది. ఇవన్నీ బినామీ రుణాలుగానే వెంకటేశ్వరులు భావిస్తున్నారు. పైడాడ వెంకటేశ్వరులు అనే రైతు రూ.9,484 పంటరుణం సొసైటీ నుంచి తీసుకున్నారు. ఇతని ఆధార్, రేషన్ వివరాలు నమోదు చేస్తే గొల్లవిల్లి రాంబాబు పేరుతో రుణం తీసుకున్నట్టు సూచిస్తోంది. ఇదే తరహాలో పలువురు రైతుల పేర్లతో స్టేటస్ రిపోర్డులు వస్తున్నట్టు పలువురు రైతులు విలేకరులకు చెప్పారు. ఈ సొసైటీలో గతంలో తీసుకున్న బినామీ రుణాలు మాఫీ అయ్యేందుకు కొందరు వివరాలు తప్పుగా నమోదు చేయించినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే భారీ స్థాయిలో అక్రమాలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు. -
నిలువునా ముంచారు..
* చంద్రబాబు అన్ని రుణాలు మాఫీ చేస్తామన్నందుకే ఓట్లేశాం * ఇపుడేమో సవాలక్ష కొర్రీలేస్తున్నారు * రూల్స్ పేరుతో బ్యాంకర్లు కూడా అన్యాయం చేస్తున్నారు * ఏపీజీబీ ఎదుట ధర్నాలో మండిపడిన రైతులు అనంతపురం అగ్రికల్చర్ : అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తానంటూ ఓట్లేయించుకున్న చంద్రబాబునాయుడు గెలిచిన తర్వాత రైతుల నెత్తిన రాళ్లేశాడని రైతులు మండిపడ్డారు. రుణాలు కట్టొద్దని ఆయన చెప్పినందునే కట్టలేదని, ఇపుడేమో మాఫీ కాలేదని వాపోయూరు. చంద్రబాబునాయుడు ఓ రకంగా మోసం చేస్తుంటే బ్యాంకర్లు మరోలా ఇబ్బందులకు గురిచేస్తూ రుణమాఫీ వర్తించకుండా చేస్తున్నారని పలువురు రైతులు సోమవారం స్థానిక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) ఎదుట ఆందోళనకు దిగారు. అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం, రాప్తాడు, ఆత్మకూరు, గార్లదిన్నె మండలాలకు చెందిన రైతులు స్థానిక ఏపీబీజీలో పంట రుణాలు, బంగారు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమాఫీ ప్రకటించడంతో తమ రుణాలన్నీ మాఫీ జాబితాలో ఉంటాయని ఆశించారు. బంగారు కుదువపెట్టి తీసుకున్న రుణాలు మాఫీ జాబితాలో లేకపోగా బంగారు నగలు వేలం వేస్తామంటూ నోటీసులు జారీ చేయడంతో రైతులు పెద్ద సంఖ్యలో బ్యాంకు వద్దకు చేరుకున్నారు. బంగారు నగలు పెట్టి తీసుకున్న రుణాలు పంట కింద కాకుండా మామూలుగా తీసుకున్నట్లు రికార్డుల్లో ఉందని బ్యాంకర్లు చెప్పడంతో నిర్ఘాంతపోయారు. తమ చేతుల్లో ఏమీ లేదని, ఎల్డీఎం లేదా మీ-సేవలో అడగండంటూ ఉచిత సలహా ఇవ్వడంతో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మరికొందరి రైతులకు సంబంధించిన రుణాలు రూ.50 వేలు లోపున్నా పూర్తిగా మాఫీ కాకపోవడంతో నిలదీశారు. అందులో తమ ప్రమేయం లేదంటూ స్కేల్ ఆఫ్ పైనాన్స్ ప్రకారం మాఫీ జరిగిందని అధికారులు జవాబిచ్చారు. బంగారు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నపుడు పట్టాదార్ పాస్పుస్తకం నకలు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రైతులు పసలూరు ఆంజనేయులు, పొడరాళ్ల శ్రీనివాసులు, తోపుదుర్తి శాంతమ్మ, చియ్యేడు వెంకటరెడ్డి, కాటికానికాలువ రామానాయుడు తదితరులు ప్రభుత్వం చేసిన అన్యాయం, బ్యాంకర్లు వ్యవహరించిన తీరుపై దుమ్మెత్తిపోశారు. రుణాలు తీసుకున్నపుడు ఎలాంటి షరతులు లేకున్నా మాఫీకి వచ్చే సరికి సవాలక్ష నిబంధనలు పెట్టి రైతులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. అసలే కరువుతో కుదేలై అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమకు ఇలాంటి పరిస్థితి కల్పించడం దారుణమన్నారు. -
దారుణాలపై రణ భేరి
ధర్మాగ్రహం... ధర్నాగ్రహం... రుణాలు మాఫీ చేస్తామని చెప్పి బురిడీ కొట్టించిన బాబు దారుణాలపై రణ భేరి... ఇది దగాపడ్డ అన్నదాతల పక్షాన జగనన్న చేపట్టిన నిరసన దీక్ష... అందుకే విశాఖ కలెక్టరేట్ వద్ద శుక్రవారం ప్రతిపక్ష నేత తలపెట్టిన ధర్నాకు రైతులు, డ్వాక్రా మహిళలు వెల్లువలా వచ్చారు. భారీ పోలీసు బలగాలు మోహరించి, ఇనుప కంచెలతో అడ్డగించినా నినాదాల హోరుతో దూసుకొచ్చారు. పింఛన్లు కోల్పోయిన బాధితుల కోసం, నిరుద్యోగ భృతి కోరుతున్న యువత కోసం గొంతెత్తిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో గొంతు కలిపారు. ఎన్నో ఆశలు కల్పించి, ఇప్పుడు ఎన్నికల హామీలనే మాఫీ చేస్తున్న మాయదారి చేష్టలపై యుద్ధం ప్రకటించారు. -సాక్షి, విశాఖపట్నం -
చంద్రబాబు మాటలు నీటి మూటలు
కూడేరు: ఎన్నికల హామీ మేరకు రైతు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయకుండా రోజుకొక ప్రకటనల తో మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నీటి మూటలని తేలిందని ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆయనను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మండల కేంద్రంలో శనివారం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన స మావేశమయ్యారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 5న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాపై ఎమ్మెల్యే చర్చించారు. మం డలం నుంచి వెయ్యి మందికి పైగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, రైతులు, మహిళలు ధర్నాకు తర లి రావాలని పిలుపు నిచ్చారు. అపద్ధాలు చెప్పడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని ఎద్దేవా చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు, పింఛన్లు కోల్పోయిన బాధితులు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న డ్వా క్రా మహిళలు, చేనేత కార్మికుల కష్టాలు ముఖ్యమంత్రికి కనిపించడం లేదన్నారు. ఆయనకు సింగపూర్ ధ్యాస తప్ప ఏమి పట్టడం లేదన్నారు. చంద్రబాబు నిర్వాహకంతో రుణాలు పొందిన రైతులు బ్యాంక్ మెట్లు ఎక్కలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలు రుణాలు చెల్లించలేక డిఫాల్ట్ర్లు మా రిపోయారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతుందని భరోసా ఇచ్చారు. ధర్నాతో ప్రభుత్వం దిగిరావాలన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, మండల వైఎస్ ఎంపీపీ రాజశేఖర్, సర్పంచ్లు రామ్మోహన్, క్రిష్టప్ప, వెంకటేశులు, మండల నాయకులు మాదన్న, తిమ్మారెడ్డి, శశికాంత్ రెడ్డి, మలోబులేసు, రాచనగౌడ్, భాస్కర్రెడ్డి, చితంబరం, నారాయణరెడ్డి, శంకర్రెడ్డి, తిమ్మారెడ్డి, ఓబులేసు, మల్లిఖార్జున, గోవింద్, శంకర్ నాయక్, శ్రీనివాసులు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బాబు ఎన్నికల హామీలన్నీ నెరవేర్చాలి
సంగం: అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబునాయుడు ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా నెరవేర్చాలని ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని వెంగారెడ్డిపాళెం,అనసూయనగర్, సిద్దీపురం, తరుణవాయి గ్రామాల్లో వారు శుక్రవారం పర్యటించారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని అక్కడికక్కడే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేశారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో వారు మాట్లాడుతూ రూ.87 కోట్ల మేర రైతు రుణాలను, రూ.14 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని అప్పట్లో బాబు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ రుణాలన్నింటినీ మాఫీ చేసి అందరినీ ఆదుకోవాలన్నారు. రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇస్తే అధికారంలోకి వస్తావని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి ఎందరో సూచించారని, అయినప్పటికీ అది సాధ్యకాని ప్రక్రియ అనే ఉద్దేశంతో ఆయన నిరాకరించారన్నారు. అయితే చంద్రబాబు ఆపద మొక్కులు మొక్కినట్లు కుప్పలుతెప్పలుగా వాగ్దానాలు కురిపించారన్నారు. వితంతువులకు, వృద్ధులకు రూ.200 నుంచి రూ.1,000 పింఛన్ పెంచారని, వికలాంగులకు రూ.1,500 పెంచారని, ఈ పరిణామంతో పేదలకు మేలు జరుగుతుంది కాబట్టి తాము అభినందిస్తున్నామన్నారు. అదే సందర్భంలో 10.12 లక్షల మంది పింఛన్లు రద్దయ్యాయని వాటిని కూడా పునఃపరిశీలించి అర్హులైన వారందరికీ అందజేయాలన్నారు. అధికారాన్ని చేపట్టి ఐదు నెలలు గడిచినా ఇంతవరకు గృహాలు మంజూరు చేయకపోవడంతో పేదలు ఎందరో గూడు కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇదే తరహాలో అర్హులైన వారందరికి రేషన్కార్డులు, ఇళ్ల స్థలాలు, భూములు పంపిణీ చేసేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ప్రధానమంత్రి మోదీ గ్రామాలను దత్తత తీసుకొనే విధానాన్ని ప్రారంభించారని, దీని మూలంగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు ఇప్పటివరకు కొన్ని పూర్తయ్యాయని రాబోయే రోజుల్లో పలు గ్రామాల్లో ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కమిటీలపై త్వరలోనే న్యాయం కేవలం పింఛన్ల కోసమేనంటూ ఏర్పాటైన కమిటీలు, ప్రస్తుతం రుణమాఫీలో సైతం కీలక భూమిక పోషిస్తున్నాయని, ఆ కమిటీలు నియామకం అప్రజాస్వామికమని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్రెడ్డి అన్నారు. గ్రామసభల్లో ఆయన మాట్లాడుతూ ఈ కమిటీలు నియమించిన విధానంపై హైకోర్టులో వాజ్యం వేసి ఉన్నారని, దీని ద్వారా త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు లేని ప్రాధాన్యం కమిటీలకు ఇచ్చారని ఇది సమంజసం కాదన్నారు. సమస్యలు తెలుసుకునేందుకే గ్రామాల్లో పర్యటిస్తున్నామని, అర్హులైన వారికి పింఛన్లు, రేషన్కార్డులు, ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు అధికారులతో మాట్లాడతామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మల్లు సుధాకర్రెడ్డి, జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు భాస్కర్ గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు దేవసహాయం, ఎంపీపీ దగ్గుమాటి కామాక్షమ్మ పాల్గొన్నారు. -
హామీల బాబు
సాక్షి, గుంటూరు రైతు, డ్వాక్రా, చేనేత రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట మార్చడంపై జిల్లా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవు తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు అండగా వారి పక్షాన నిలిచి పోరాటం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలువు మేరకు అన్ని మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల ఎదుట బుధవారం ధర్నాలు చేపడుతున్నారు. జిల్లాలోని ముఖ్యనేతలతో మంగళవారం సమావేశమైన పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ బుధవార ం చేపట్టనున్న ధర్నా కార్యక్రమంపై చర్చించారు. పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలతో పాటు రైతులు, మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఒక్క హామీ నెరవేర్చలేదు చిలకలూరిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు చేప్పేవన్నీ అబద్ధాలేనని, ఒక్క హామీ కూడా నెరవేర్చ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మండిపడ్డారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు, డ్వాక్రా, చేనేత రుణాలు మాఫీ చేస్తామని, తొలి సంతకం వాటిపైనే ఉంటుందని చెప్పి కమిటీల పేరుతో కాలయాపన చేశారని విమర్శించారు. అధికారం చేపట్టి ఐదు నెలలైనా ఏ ఒక్క హామీ అమలు కాలేదని ఆరోపించారు. నిరుద్యోగభృతి, ఇంటికొక ఉద్యోగం అంటూ నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఫించన్లు ఐదు రెట్లు పెంచుతామని చెప్పి టీడీపీ కార్యకర్తలను సామాజికి కార్యకర్తలుగా నియమించి వైఎస్సార్ అభిమానుల ఫించన్లు తొలగించారన్నారు. మాటల ద్వారా ప్రజలను మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజల పక్షాన నిలబడి పోరాడడానికి పార్టీ సంసిద్ధమై ఉందన్నారు. నియోజవర్గంలోని నాదెండ్ల, యడ్లపాడు తహశీల్దార్ కార్యాలయాల ఎదుట, చిలకలూరిపేట మండల, పట్టణ ప్రాంతాలకు సంబంధించి చిలకలూరిపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు ధర్నా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. సమావేశంలో పార్టీ పట్టణ, నాదెండ్ల, చిలకలూరిపేట మండల కన్వీనర్లు ఏవీఎం సుభానీ, కాట్రగడ్డ మస్తాన్రావు, చాపమడుగు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
పోరుబాట పట్టండిపార్టీని బలోపేతం చేయండి
సాక్షి, విజయవాడ : రైతులకు రూ. 87 వేల కోట్ల రుణాలు మాఫీ అయ్యేంతవరకు వైఎస్సార్ సీపీ వారి పక్షాన నిలిచి పోరాటం చేస్తుందని ఆ పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా వచ్చే నెల ఐదో తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసి గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని సమన్వయకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం ఐలాపురం హోటల్లో వైఎస్సార్ సీపీ జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు వై.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజుతో పాటు పార్టీ జిల్లా పరిశీలకులు, పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి అధ్యక్షత వహించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టేందుకు చంద్రబాబు అడ్డదారులు వెతుకుతున్నారని మండిపడ్డారు. రైతు సాధికార సంస్థ ద్వారా రైతులకు బాండ్లు జారీ చేస్తామని చెబుతున్నారని, అయితే దానికి అధికారిక గుర్తింపు లేదని చెప్పారు. అందువల్ల అది రైతులకు ఏ విధంగానూ ఉపయోగపడదన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అధికారమే లక్ష్యంగా ప్రజలకు హామీలిచ్చారని, వారు నమ్మి ఓట్లు వేసి అధికారం అప్పగిస్తే ఇప్పుడు తప్పించుకునే దారులు వెతుకుతున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీ శ్రేణులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. సాగి ప్రసాదరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల ఉత్తరాంధ్ర రైతులు వేల కోట్ల పంట బీమా నష్టపోయారని చెప్పారు. వైఎస్సార్ ఫౌండేషన్ ద్వారా హుదూద్ బాధితులకు తమ పార్టీ సహాయం చేస్తుందని చెప్పారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారం చేపట్టాక మనిషిగా మారారని అందరూ అనుకున్నారని... కానీ ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదని విమర్శించారు. మరో ముఖ్య నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టిన ఆరు నెలలకే ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని చెప్పారు. పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు పార్థసారథి మాట్లాడుతూ.. నవంబర్ 15 కల్లా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి అధినేతకు పంపుతామని చెప్పారు. పార్టీ ఉత్తర కృష్ణా అధ్యక్షుడు కొడాలి నాని మాట్లాడుతూ.. వంచన చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. బాబు మాయమాటల్ని ప్రజలు నమ్మడం లేదని విమర్శించారు. సమీక్షలో పార్టీ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, మేకా వెంకట ప్రతాప అప్పారావు, జలీల్ఖాన్, రక్షణనిధి, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు వంగవీటి రాధాకృష్ణ, పి.గౌతంరెడ్డి, మేరుగ నాగార్జున, ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, పార్టీ నేతలు దూలం నాగేశ్వరరావు, ఉప్పాల రాంప్రసాద్, తాతినేని పద్మావతి, సింహాద్రి రమేష్బాబు, కార్పొరేటర్లు, నగర నేతలు, మండల నాయకులు పాల్గొన్నారు. -
గంగ ఉన్నా.. రుణాల బెంగ
ప్రారంభమైన రబీ.. ఇంతవరకు అందని బ్యాంక్ రుణాలు తూర్పు మండలాల్లో పంటల సాగు ప్రశ్నార్థకమే శ్రీకాళహస్తి: జిల్లాలోని తూర్పుమండలాల్లో కరువు ఛాయలు కనిపించడంలేదు. ఓ పక్క తెలుగుగంగ.. మరో పక్క స్వర్ణముఖి.. ఎంతోకొంత భూగర్భజలాలు ఉండడంతో రైతులు రబీ సాగుకు రెడీ అయిపోయారు. దుక్కులు దున్ని.. నార్లు పోసేందుకు సిద్ధమయ్యారు. గంగ ఉంటే బెంగ ఎందుకు? తెలుగంగ నీరు శ్రీకాళహస్తితోపాటు సత్యవేడు ని యోజకవర్గాలకు సాగునీటినందిస్తోంది. మూడు రో జుల క్రితం గంగ నీరు విడుదల కావడంతో శ్రీకాళహ స్తి, తొట్టంబేడు, కేవీబీపురం, వరదయ్యపాళెం, సత్యవేడు మండలాల్లోని 150 గ్రామాల ప్రజలు రబీ సా గుకు సమాయత్తమయ్యారు. 6.25 లక్షల ఎకరాల్లో సాగుచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు దుక్కులు దున్ని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి నార్లుపోసేందుకు ఉరకలు వేస్తున్నారు. పెట్టుబడే ప్రధాన సమస్య శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో మొత్తం 11 మండలాలున్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని రైతు లు సింగిల్విండోలు, బ్యాంకుల్లో ఇప్పటికే చాలా అప్పులు చేశారు. గత ఖరీఫ్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పంట దిగుబడి తగ్గిపోయింది. చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి. ఇదీగాక వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని టీడీపీ నాయకులు గత ఎ న్నికల్లో హామీ ఇవ్వడంతో రైతులు రుణాలు కట్టడం మానేశారు. దీంతో ఆయా బ్యాంకులు, సింగిల్ విండోలకు రుణాల చెల్లింపులు దాదాపుగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొత్త రుణాలు ఇచ్చేందుకు ముందుకురావడంలేదు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చేతిలో చిల్లిగవ్వలేక.. ప్రయివేటు వ్యక్తుల వద్ద అప్పులు చేయలేక కుమిలిపోతున్నారు. ఎరువులు కొనలేం ఐదు ఎకరాల్లో నాట్లు వేసేందుకు దుక్కిసిద్ధం చేశాను. పెట్టుబడులకు రూ.1.25 లక్షల వరకు అవసరం. ముందస్తుగా పంట పెడితే ఆశించిన దిగుబడి వస్తుందనే చిన్న ఆశ ఉంది. అయితే చేతిలో చిల్లిగవ్వలేదు. బ్యాంకులు రుణాలిస్తేనే సేద్యం చేయగలను.. లేదంటే రబీలో బీడుగా వదిలేయాల్సిందే. -బాలాజీరెడ్డి, కొత్తకండ్రిగ గ్రామం పెట్టుబడి లేదు ఆరెకరాల్లో వరి పంట సాగుచేయాలి. చేతిలో చిల్లిగవ్వలేదు. దుక్కి దున్నలేదు. చేతిలో డబ్బులుంటే ఈపాటికే దుక్కిదున్ని నారుపోసుండేవాడ్ని. ఎరువులు, విత్తనాలకే ఇబ్బందులెదురవుతున్నాయి. గతంలో చేసిన అప్పులు తీరక కొంత భూమి అమ్మాను. ఈసారీ..అంతేనేమో.. -గురవయ్య, గురప్పనాయుడుకండ్రిగ రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నా పంటసాగుకు సమయం ఆసన్నమైంది. పెట్టుబడికి డబ్బుల్లేదు. రుణమాఫీ చేస్తారని ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు మాఫీ చేయలేదు. ప్రయివేటు వ్యక్తుల వద్ద అప్పు తెద్దామంటే వడ్డీ ఎక్కువడుగుతున్నారు. పంట రాకపోతే పొలం అమ్మాల్సిందే. -సుబ్బరామయ్య, ఇలగనూరు గ్రామం -
రుణ మాఫీ కాదు..వడ్డీ బాదుడు
పంట రుణాల మాఫీ హామీతో రైతులను నమ్మించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక రోజుకో షరతు విధిస్తూ వంచిస్తున్నారు. రుణాల మాఫీ ఎప్పుడన్నది తేల్చని ప్రభుత్వం.. రైతులపై భారాన్ని మోపడంపై మాత్రం స్పష్టమైన ప్రకటన చేస్తోంది. డిసెంబర్ 31, 2013లోపు తీసుకున్న పంట రుణాలు, వడ్డీని మాత్రమే మాఫీ చేస్తామని సోమవారం ప్రకటించింది. ఆ రుణాలపై జనవరి, 2014 నుంచి ఇప్పటిదాకా వడ్డీని రైతులే చెల్లించాలంది. ఆ మెలిక ఆధారంగా వడ్డీ కట్టాలని రైతులకు బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికల్లో పంట రుణాల మాఫీ హామీని ప్రధానాస్త్రంగా చంద్రబాబు సంధించారు. మార్చి 31, 2014 నాటికి ఉన్న పంట రుణాలన్నింటినీ ఒక్క సంతకంతో మాఫీ చేస్తానని బీరాలు పలికారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని నీరుగార్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచే ఆ కుట్రను అమలుచేస్తున్నారు. రుణ మాఫీ విధి విధానాల ఖరారుకు కోటయ్య కమిటీని నియమించిన చంద్రబాబు.. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను సాకుగా చూపి ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్ష మాఫీ చేస్తామన్నారు. ఆ తర్వాత ఆ రుణ మాఫీకి మార్గదర్శకాలను జారీచేశారు. వీటికి సవరణ చేస్తూ సోమవారం మరో ఉత్తర్వు జారీచేశారు. ఆ ఉత్తర్వు ప్రకారం డిసెంబర్ 31, 2013 నాటికి అసలు, వడ్డీ కలిపి రూ.1.50 లక్ష మాత్రమే ఒక్కో కుటుంబానికి మాఫీ చేస్తారు. డిసెంబర్ 31 తర్వాత ఆ రుణంపై వడ్డీని రైతులే భరించాలన్నది ఆ ఉత్తర్వుల సారాంశం. అయితే రుణ మాఫీ అవుతుందనే ఆశతో రైతులు అప్పులు చెల్లించలేదు. వడ్డీ బాదుడు.. బ్యాంకర్లు ఏడు శాతం వడ్డీపై రైతులకు పంట రు ణాలు ఇస్తున్నారు. రూ.లక్ష లోపు రుణాలను వడ్డీ లేకుండా.. రూ.3లక్షల వరకూ రుణాలపై పావలా వడ్డీని ప్రభుత్వం వర్తింపజేస్తోంది. వాయిదా లోపు రుణాలు చెల్లించిన రైతులకే వడ్డీ రాయితీ వర్తిస్తుం ది. చంద్రబాబు రుణమాఫీ హామీతో రైతులు వా యిదాలోగా రుణాలు చెల్లించలేదు. దీంతో బ్యాం కర్లు 11.75 శాతం వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఉత్తర్వుల వల్ల తొమ్మిది నెలల వడ్డీ రైతులు భరించాల్సిందే. జిల్లాలో 8.56 లక్షల మంది రైతులు రూ.11,180.28 కోట్ల మేర పంట రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వ తాజా మెలిక వల్ల రైతులపై రూ.320 కోట్ల మేర వడ్డీ భారం పడనుంది. మాఫీపై తేల్చరేం.. పంట రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీపై ప్రభుత్వం తేల్చడం లేదు. ఎప్పటిలోగా మాఫీ చేస్తామన్నది చెప్పడం లేదు. దాంతో ఏ ఒక్క బ్యాంకరూ కొత్తగా పంట రుణంగానీ.. డ్వాక్రా రుణంగానీ మంజూరు చేయడం లేదు. రుణ మాఫీ కోసం మార్గదర్శకాలను జారీచేసిన ప్రభుత్వం.. వాటి ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూ చించింది. ఈ లబ్ధిదారుల ఎంపికలో ఏమైన సమస్యలు వస్తే పరిష్కరించడానికి జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కన్వీనర్గా ఓ కమిటీని ఈనెల 10లోగా నియమించాలని కలెక్టర్ను ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆ కమిటీలో లీడ్ బ్యాంక్ మేనేజర్ కన్వీనర్గానూ.. వ్యవసాయశాఖ జేడీ, డీఆర్డీఏ పీడీ, జిల్లా రెవెన్యూ అధికారి సభ్యులుగా ఉండే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి. లబ్ధిదారుల ఎంపికలో సమస్యలను మాత్రమే ఆ కమిటీ పరిష్కరిస్తుంది. కానీ.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పటిలోగా పూర్తిచేయాలి.. ఎప్పటిలోగా ఆ లబ్ధిదారులకు రుణ మాఫీని వర్తింపజేస్తామన్న అంశంపై ప్రభుత్వం నోరుమెదపడం లేదు. -
బాబు మోసాలను ప్రజలు గుర్తించారు
శ్రీకాళహస్తి: టీడీపీ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నీరుగార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గుర్తించారని, నెల రోజుల్లోనే ఆయన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్రావు అన్నారు. రుణాలు మాఫీ చేస్తే రిజర్వు బ్యాం కుకు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడతానని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పట్టణంలోని ఆర్ఆర్బీ కల్యాణ మండపంలో ఆదివారం ఆయన శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల సర్పంచ్లతో సమావేశమయ్యారు. ఎంపీ మాట్లాడుతూ పనిచేస్తేనే సర్పంచ్లకు గౌరవం దక్కుతుందన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి గ్రామాభివృద్ధికి కలసికట్టుగా పనిచేయాలని పిలువునిచ్చారు. మన్నవరం, శ్రీసిటిలో స్థానికులకు ఉద్యోగాలు, రేణిగుంటను అంతర్జాతీయ విమానాశ్రయం, నడికుడి-గుంటూ రు రైలుమార్గం, రేణిగుంట-నాయుడుపేట ఫోర్లైన్ రోడ్డు, తిరుపతి రైల్వేస్టేషన్కు జాతీయ స్థాయి తదితర అంశాలను మంత్రుల దృష్టికి తీసుకుపోయినట్లు వెల్లడిం చారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పార్టీని మరింత పటిష్టంగా ముందు కు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చంద్రబాబు అబద్దాలను ప్రజలు గుర్తించారని, భవి ష్యత్తు మనదేనని అన్నారు. సభాధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నాయకుడు గుమ్మడి బాలకృష్ణయ్య వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సర్పం చ్లు ఎంపీని దుశ్శాలువతో సత్కరించారు. పార్టీ నాయకులు అంజూరు శ్రీనివాసులు, మిద్దెల హరి, వయ్యాల కృష్ణారెడ్డి, చిందేపల్లి మధుసూదన్రెడ్డి, పొనుగోటి భక్తవత్సలనాయుడు, హరిప్రసాద్రెడ్డి, సుధాకర్, రామచంద్రారెడ్డి, పాక్యముత్తుసభాపతి, గోవింద్రెడ్డి, సుబ్రమమణ్యం, లీలాప్రసాద్, రఘురామిరెడ్డి, విద్యానందరెడ్డి, కృష్ణయ్య, అన్నదొరై, రామచంద్రయ్య, మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఓటు’ దాటాక..!
పంట రుణాల మాఫీపై బాబు రోజుకో మెలిక 33 మండలాల్లోనే పంట రుణాల రీషెడ్యూలు ఒక కుటుంబంలో ఒక్కరికే రుణ మాఫీ పంట రుణాల మాఫీలో అలసత్వంపై రైతుల ఆగ్రహం సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఓటు దాటాక హామీలను తగలెయ్యడం అంటే ఇదే..! ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక ఒక్క సంతకంతో పంట రుణాలను మాఫీ చేసి రైతులకు ఉపశమనం కల్పిస్తానని ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఊదరగొట్టారు. ఆ హామీతోనే టీడీపీ గద్దెనెక్కింది. కానీ.. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తక్షణమే ఆ హామీకి నీరుగార్చేందుకు శ్రీకారం చుట్టారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. పంట రుణాల మాఫీపై బాబు రోజుకో మాట మాట్లాడటమే అందుకు తార్కాణం. జిల్లాలో 7,55,570 మంది రైతులు పంట రుణాల రూపంలో రూ.5,810.84 కోట్లు తీసుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా బంగారు నగలను తనఖా పెట్టి 4,53,162 మంది రైతులు రూ.3,486.50 కోట్లు రుణంగా తీసుకున్నారు. 68,761 మంది రైతులు స్వల్పకాలిక పంట రుణాల రూపంలో రూ.1,129.75 కోట్లు అప్పుగా పొందారు. 45,780 మంది రైతులు వ్యవసాయ పరోక్ష రుణాల రూపంలో రూ.753.16 కోట్లు అప్పుగా తీసుకున్నారు. మొత్తమ్మీద బ్యాంకర్లకు రూ.11,180.25 కోట్లను పంట రుణాల రూపంలో రైతులు బకాయిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి.. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే ఒక్క సంతకంతో తమ రుణాలను మాఫీ చేస్తారనుకున్న రైతుల ఆశలను అడియాశలు చేశారు. పంట రుణాల మాఫీకి తొలి సంతకం చేస్తారని భావిస్తే.. విధి విధానాల రూపకల్పనకు కోటయ్య నేతృత్వంలో కమిటీని నియమిస్తూ సంతకం చేయడం రైతులను నిరాశకు గురిచేసింది. కోటయ్య కమిటీ 45 రోజుల్లోగా నివేదిక ఇస్తుంది.. ఆ నివేదిక ఆధారంగా రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. కానీ.. ఇప్పటికీ కోటయ్య కమిటీ ప్రాథమిక నివేదికను కూడా ఇవ్వకపోవడం గమనార్హం. కరవు మండలాల్లోనే రీషెడ్యూలు.. రుణాలను రీషెడ్యూలు చేయించి.. కొత్తగా పంట రుణాలు ఇచ్చేలా చూస్తామని.. రీషెడ్యూలు చేసిన రుణాలను ప్రభుత్వం చెల్లిస్తుందని.. ఇందుకు ఆర్బీఐ అనుమతి కోసం లేఖ రాశామని చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ.. కరవు ప్రభావిత మండలాల్లో అదీ 2013-14 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణాలనే రీషెడ్యూలు చేస్తామని, ఆ రుణాలను కూడా మూడేళ్లలోగా చెల్లించాల్సిందేనని మంగళవారం ప్రభుత్వానికి ఆర్బీఐ మార్గదర్శకాలు పంపింది. ఈ నిబంధనకు అంగీకరిస్తే రుణాల రీషెడ్యూలు చేస్తామని ప్రకటించింది. మన జిల్లాలో 66 మండలాలకుగానూ ప్రభుత్వం 33 మండలాలనే కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. 2013-14లో కరవు ప్రభావిత 33 మండలాల్లో 1.69 లక్షల మంది రైతులు రూ.1,438 కోట్లను పంట రుణాలుగా పొందారు. అంటే.. ఆర్బీఐ జారీచేసిన మార్గదర్శకాలకు ప్రభుత్వం అంగీకరిస్తే కేవలం 1.69 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.1,438 కోట్ల పంట రుణాలు మాత్రమే రీషెడ్యూలు చేస్తారన్న మాట. కరవు, తుఫాను వంటివి సంభవించి, పంటలు నష్టపోయినప్పుడు రుణాలను రీషెడ్యూలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు ఆ ఆనవాయితీలో భాగంగానే ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది తప్ప.. చంద్రబాబు కృషి ఏమీ లేదన్నది స్పష్టమవుతోంది. ఆర్బీఐ నిబంధనలకు ప్రభుత్వం అంగీకరిస్తే.. తక్కిన 7.50 లక్షల మంది రైతులు పంట రుణాల రూపంలో తీసుకున్న రూ.9,642.25 కోట్ల మాటేమిటన్న అంశంపై స్పష్టత లేదు. అదునులో వర్షాలు పడినా పెట్టుబడులకు డబ్బుల్లేక పంటలను సాగుచేయలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట రుణాల మాఫీలో ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై రైతన్నలు మండిపడుతున్నారు. -
మాఫీ చేయకుంటే సత్తా చూపుతాం
పుంగనూరు: తమ రుణాలు మాఫీ చేయకుంటే సత్తా చూపుతామని ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) సంఘాల మహిళలు పుంగనూరులో శుక్రవారం ఆందోళనకు దిగారు. పుంగనూరు మున్సిపాలిటీలోని 2వ వార్డుకు చెందిన మార్కెట్యార్డు రోడ్డు, మేలుపట్ల రోడ్డు, దుళ్లవాళ్లఇండ్లకు చెందిన 18 ఐకేపీ సంఘాలకు చెందిన మహిళలు మున్సిపాలిటీలో రుణాలు పొందారు. చంద్రబాబు ఎన్నికల హామీ మేరకు రుణాలు రద్దు చేస్తారని ఆశపడ్డారు. రెండు నెలలు కావస్తున్నా రుణాల మాఫీపై ఉత్తర్వులు రాకపోవడంతో బ్యాంకు అధికారులు మహిళలను రుణాలు చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు. దిక్కుతోచని మహిళలు శుక్రవారం మహిళా నేతలు రాజసులోచన, లక్ష్మిదేవి, రేష్మ, నాగరత్న, చిన్ని ఆధ్వర్యంలో సాయంత్రం మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కారణంగా తాము అధిక వడ్డీల బారిన పడుతున్నామన్నారు. పాత రుణాలు తీర్చడం లేదని ప్రస్తుతం బ్యాంకుల్లో ఇతర రుణాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రుణాలు మాఫీ చేయకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. -
పొగాకు రైతులకూ రుణమాఫీ
వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి ఒంగోలు టూటౌన్ : చిన్నసన్నకారు రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాల మాఫీపై ఇంత వరకు సర్కార్ స్పష్టత ఇవ్వకముందే రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పొగాకు రైతుల రుణాలు కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కట్టినా.. వాటిని తిరిగి రైతులకు చెల్లిస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రీయ కృషి విజ్ఞాన కేంద్రం(దర్శి), నాబార్డు సంయుక్తంగా శుక్రవారం ఒంగోలులోని ఆచార్య ఎన్జీ రంగాభవన్లో శాస్త్రవేత్తలు, రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమానికి వ్యవసాయశాఖ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి తెస్తామన్నారు. గొర్రెల పెంపకం రైతులకు రాయితీలు ఇస్తామని చెప్పారు. కోల్డ్ స్టోరేజీల్లో ధాన్యం నిల్వ చేసుకున్న రైతులకు వడ్డీ లేని రుణాలను రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి మండలంలో భూసార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను దశలవారీగా అమలు చేస్తామన్నారు. సాగర్, గుండ్లకమ్మ ఆయకట్టు చివరి భూములకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం వ్యవసాయ శాఖ రూపొందించిన యాక్షన్ ప్లాన్ను ఆవిష్కరించారు. ముందుగా రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు, పర్చూరు, కొండపి శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయస్వామి, కరణం బలరాం, కలెక్టర్ విజయకుమార్ మాట్లాడారు. ప్రాంతీయ పరిశోధన సంస్థ(గుంటూరు) అధికారి డాక్టర్ ఈ నారాయణ అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రిని ఘనంగా సన్మానించారు. సమావేశంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్, డీసీసీబీ చైర్మన్ బీరం వెంకటేశ్వరరెడ్డి, ఉద్యానశాఖ ఉన్నతాధికారి విజయలక్ష్మి, వ్యవసాయశాఖ జేడీ జే మురళీకృష్ణ, ఉద్యానశాఖ ఏడీఏలు రవీంద్రబాబు, జెన్నమ్మ, పశుసంవర్ధక శాఖ జేడీ రజనీకుమారి, పట్టుపరిశ్రమ శాఖ అధికారి చిత్తరంజన్ శర్మ, నాబార్డు అధికారిణి జ్యోతి శ్రీనివాస్, మార్కెటింగ్ జేడీ శ్రీనివాస్, ఏపీఎంఐపీ పీడీ మోహన్కుమార్, మత్స్యశాఖ ఏడీ రంగనాథ్, ప్రాంతీయ ఉద్యానశాఖ ట్రైనింగ్ ప్రిన్సిపాల్ రామారావు, ఏఎంసీ చైర్మన్ ఘనశ్యామ్, రైతు సంఘ నాయకులు దుగ్గినేని గోపీనాథ్, చుంచు శేషయ్య, చుండూరి రంగారావు, కేవీవీ ప్రసాద్, ఆత్మ పీడీ, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. ఆహార పదార్థాల ప్రదర్శన సేంద్రియ ఎరువులతో పండించి, తయారు చేసిన ఆహార పదార్థాలు, విత్తనాలను సభ వేదిక వద్ద వ్యవసాయాధికారులు ప్రదర్శనగా ఉంచారు. రాగి ముద్దలు, అరిశలు, చెక్కలు, పలురకాల విత్తనాలు, రెడ్గ్రామ్, గ్రీన్గ్రామ్, నాణ్యమైన ఇతర కూరగాయలను ప్రదర్శనగా ఉంచారు. వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందుబాటులో ఉంచారు. -
రుణాలు మాఫీ చేయాలి
డ్వాక్రా సంఘాల సభ్యుల రాస్తారోకో రెబ్బెన : తాము గతంలో తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని డ్వాక్రా సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం డ్వాక్రా సంఘాల మహిళలంతా మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి ఆందోళనలో పాల్గొని సభ్యులనుద్దేశించి మాట్లాడారు. రైతుల పంటరుణాల మాఫీ నేపథ్యంలో డ్వాక్రా సంఘాల సభ్యుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న డ్వాక్రా సంఘాల సభ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో రైతులతోపాటు మహిళలు సైతం ఓట్లు వేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాల రుణ పరిమితి పెంచే బదులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తే సభ్యులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే మహిళలందరూ రుణమాఫీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. డ్వాక్రా సంఘాల సభ్యుల రుణాలు మాఫీ చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్ పెసరి వెంకటమ్మ, డ్వాక్రా సంఘాల సభ్యులు అనిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రుణమో రామచంద్రా!
మృగశిర కార్తె ప్రవేశించింది. వర్షాకాలం ప్రారంభమైంది. ఖరీఫ్ సీజన్కోసం రైతన్న సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ప్రస్తుతం రుణమో రామచంద్రా అని అన్నదాత ఎదురు చూస్తున్నాడు. రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం, కొత్తగా రుణాలివ్వడానికి బ్యాంకర్లు ముందుకు రాకపోవడంతో ఈసారి ఖరీఫ్కు పెట్టుబడి గండం పట్టుకుంది. దీంతో మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు వచ్చాయి. కామారెడ్డి : జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 3.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. 4.42 లక్షల మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో అధిక శాతం మంది చిన్న, సన్నకారు రైతులే కావడం వల్ల పెట్టుబడుల కోసం వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లకు అవసరమైన పెట్టుబడులను ఆయా బ్యాంకుల ద్వారా పొందేవారు. ఈసారి రుణాల మాఫీ వ్యవహారం ముందుకు రావడంతో పెట్టుబడులకు అప్పు సమస్యగా మారింది. ఇప్పటికే పంటల సాగుకు అయ్యే వ్యయం విపరీతంగా పెరిగి ఇబ్బందులు పడుతున్న రైతులు.. అవసరమైన పెట్టుబడులు ఎక్కడి నుంచి తెచ్చేదని ఆవేదన చెందుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు నుంచే రాజకీయ పార్టీలన్నీ పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో చాలా మంది రుణాలను చెల్లించలేకపోయారు. దానికి తోడు గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో కరెంటు సమస్యలు, ఆపై అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని కర్షకులు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రుణాలు మాఫీ అవుతాయని, ఖరీఫ్ సాగుకు కొత్త రుణాలు అందుతాయని ఆశించారు. అయితే రుణ మాఫీ విషయంలో ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం మూలంగా కొత్త రుణాలు అం దే పరిస్థితి లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు ఎక్కడి నుంచి తెచ్చేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో... పెట్టుబడుల కోసం రైతులు బ్యాంకుల్లో అప్పులు పొందారు. మరికొందరు రైతులు పెట్టుబడులు సరిపోని పరిస్థితుల్లో భార్య, పిల్లల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. రుణాలు మాఫీ అవుతాయన్న ఆశతో ఎక్కడి బాకీలు అక్కడే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పెట్టుబడుల సమస్య రైతులను వేధిస్తోంది. ఖరీఫ్ పనులకు శ్రీకారం చుట్టిన రైతులు పెట్టుబడుల వేటలో పడ్డారు. బ్యాంకులకు వెళితే లాభం లేకపోవడంతో మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. గతంలో వడ్డీ వ్యాపారుల వలలో పడి ఆర్థికంగా చితికిపోయిన రైతులు గత కొన్నేళ్లుగా వారికి దూరమయ్యారు. తిరిగి పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే పంట రుణ మాఫీ విషయంలో స్పష్టమైన ప్రకటన చేసి, ఖరీఫ్ పెట్టుబడుల సమస్యను తీర్చాలని కర్షకులు కోరుతున్నారు. -
తొలి వంచన!
సంపాదకీయం: తనకూ, విశ్వసనీయతకూ... తనకూ, నిజాయితీకీ... తనకూ, ఇచ్చిన మాటకూ సహస్రయోజనాల దూరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించారు. తరలివచ్చిన అతిరథమహారథుల సాక్షిగా, వేలాదిమంది పార్టీ కార్యక ర్తల సమక్షంలో ఎంతో ఆర్భాటంగా ఆదివారంనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బాబు.... ఇంతమంది ఉన్నారు కదానన్న వెరపైనా లేకుండా ఇచ్చిన మాటేమిటో, చేసిన బాసేమిటో మరచి రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణమాఫీ ఫైలుపై కాకుండా అందుగురించిన విధివిధానాల కమిటీ ఏర్పాటు ఫైలుపై తొలి సంతకం చేశారు. అంతేకాదు... ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టే తొలి సంతకం చేశానని నదురు బెదురూ లేకుండా నిండు పేరోలగంలో స్వోత్కర్షకు పోయారు. రుణమాఫీకీ, రుణమాఫీపై విధివిధానాల కమిటీ ఏర్పాటుకూ మధ్య ఉన్న తేడాను జనం పోల్చలేరన్న భరోసానన్నమాట... ఎంత వంచన! ‘వస్తున్నా... మీకోసం’ అంటూ రెండేళ్లనాడు చేసిన పాదయాత్రలో ఆయన తొలి సారి రైతు రుణాలు, ఇతర రుణాల మాఫీపై ప్రకటనచేశారు. ‘వ్యవ సాయం దండగ’న్న నోటినుంచి ఇలాంటి మాట వచ్చేసరికి రైతులె వరూ నమ్మలేదు. అందువల్లే ఆయన పదే పదే అదే మాటను వల్లెవే శారు. ఎన్నికల మేనిఫెస్టోలో సైతం దానికి చోటిచ్చారు. రుణ మాఫీని ఖచ్చితంగా అమలు చేసితీరుతామని, కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారని నమ్మబలికారు. తీరా ఎన్నికల ఫలితాలు వెలువడిననాటినుంచీ ఆయన స్వరం మారిం ది. పాదయాత్ర సమయంలో ప్రజల బాధలు చూసి రుణ మాఫీ హామీ ఇచ్చానని నసిగారు. అప్పటికింకా రాష్ట్ర విభజన నిర్ణయం జరగలేద న్నారు. ‘ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో, ఎంత బడ్జెట్ ఉందో నాకే కాదు... ఎవరికీ తెలియని పరిస్థితి’ అంటూ తన నిజరూపం బయటపెట్టారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా గత ఏడాది జూలైలో సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానంచేశారు. అటు తర్వాత అంచెలంచెలుగా తదుపరి పరిణామాలు సంభవించాయి. చివరకు పార్లమెంటు తుది సమావేశాల్లో విభజన నిర్ణయానికి ఆమోద ముద్రపడింది. ఆ తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఈ కాల మంతటా ఎక్కడా, ఎప్పుడూ బాబు తన రుణమాఫీ వాగ్దానాన్ని సవ రించుకోలేదు. విభజన అయిపోయింది గనుక దానికి ఫలానా మార్పు లు తెస్తామని చెప్పలేదు. పైగా ఆ ఫైలు పైనే తొలి సంతకం పెడతానని హోరె త్తారు. బంగారం రుణాలతో సహా వ్యవసాయ రుణాల్లో ఒక్క పైసా కూడా చెల్లించవద్దని ప్రచారం చేశారు. వాటన్నిటినీ అణాపైస లతో సహా రద్దుచేస్తామని స్పష్టంగా చెప్పారు. పార్టీ తరఫున ఎలక్ట్రా నిక్ మీడియాలో మోత మోగించిన వాణిజ్య ప్రకటనల్లో కూడా ఇల్లాళ్ల పుస్తెలు, పొలం దస్తావేజులు వెనక్కొస్తాయని ఆశపెట్టారు. కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి లక్ష లోపు రుణాలు రద్దుచేస్తామని పరిమితైనా పెట్టుకున్నారు. బాబు ఆ పనీ చేయలేదు. బాధ్యతగల నాయకుడెవరూ ఉత్తుత్తి హామీలివ్వరు. ప్రజలను వంచించి పబ్బం గడుపుకోవాలనుకోరు. ఒకపక్క ఖరీఫ్ సీజన్ వచ్చే సింది. రైతులు కొత్తగా రుణాలు తీసుకునే సమయమిది. బాబు వాగ్దా నాలు నమ్మి ఈ ఏడాది రైతన్నలెవరూ బ్యాంకు బకాయిలు చెల్లించ లేదు గనుక కొత్తగా వారికి రుణాలు మంజూరయ్యే అవకాశం లేదు. సమస్య ఇంత జటిలంగా మారిందని తెలిసికూడా బాబు బాధ్యత మరిచారు. కనీసం తాను జూన్ మొదటివారంలో ప్రమాణస్వీకారం చేసి, బ్యాంకులను ఒప్పించే బాధ్యతనైనా స్వీకరించివుంటే ఈపాటికి కొంతైనా కదలిక ఉండేది. కానీ, వారంరోజుల సమయాన్ని వృథా చేసి ఇప్పుడు ఎందుకూ కొరగాని కమిటీ ఏర్పాటు ఫైలుపై సంతకం చేయ డంలో ఆంతర్యం ఏమిటి? ఆ కమిటీ కూడా పక్షం రోజుల్లో ప్రాథమిక నివేదికను, మరో 45 రోజుల్లో తుది నివేదికనూ అందిస్తుందట. అంత వరకూ ఖరీఫ్ సీజన్ ఆగుతుందా? ఆ కమిటీ సిఫార్సుల తర్వాత బ్యాంకులు రుణాలిచ్చేవరకూ అది వేచిచూస్తుందా? ఇది రైతాంగానికి మాత్రమే కాదు...మొత్తంగా వ్యవసాయానికి, పల్లెసీమలకూ, ఆహార భద్రతకూ జరుగుతున్న దగా. అన్నం పెట్టే చేతులకు ఆసరా కల్పిస్తే ఆ రంగంపై ఆధారపడిన లక్షలమందికి పని దొరుకుతుంది. రైతును సకాలంలో పంట వేయనిస్తే ప్రతి మనిషికీ ఇంత అన్నం ముద్ద దొరుకు తుంది. అసలే ఎల్నినో పొంచివున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వానలు సరిగా పడక కరువు రాజ్యమేలవచ్చునని భయపెడుతున్నారు. ఈ తరుణంలో కమిటీల పేరుతో కాలయాపన చేయడం క్షమార్హం కాదు. బాబు రుణమాఫీ పథకం ఆచరణ సాధ్యంకాదని ఎన్నికల ప్ర చార సమయంలోనే నిపుణులు చెప్పివున్నారు. చాలా పార్టీలు ఓటర్లను తప్పుడు వాగ్దానాలతో వంచిస్తున్నాయన్న కారణంతో ఎన్నికల సం ఘం ఈసారి మేనిఫెస్టోల విషయంలో జవాబుదారీతనాన్ని నిర్దేశిం చింది. చేసే వాగ్దానాలకు హేతుబద్ధత లేకపోతే చర్య తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్నికల సంఘం నిర్ణయంతో చాలామంది విభేదిం చారు. మేనిఫెస్టోలు సక్రమంగా లేకపోతే, అందులోని వాగ్దానాలను గాలికొదిలేస్తే ప్రజలే తగిన చర్య తీసుకుంటారని చెప్పారు. అది ఎలాగూ జరుగుతుంది. కానీ, ఇప్పుడు బాబు చేసిన వాగ్దానం పర్యవ సానంగా రాష్ట్రంలో సాగు మొత్తం తలకిందులయ్యే స్థితి ఏర్పడింది. అందువల్ల కమిటీల పేరుతో కాలయాపనకు స్వస్తిచెప్పి తన వాగ్దా నాన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టడమే బాబు తక్షణ కర్తవ్యం. అందుకోసం కేంద్రంలో తన పలుకుబడిని ఉపయోగించాలి. ఈ విషయంలో ఏ కొంచెం జాప్యంచేసినా రైతాంగానికే కాదు... మొత్తం రాష్ట్ర ప్రజలకే ద్రోహంచేసినట్టవుతుందని గుర్తించాలి. -
రుణమాఫీపై అనుమానాలొద్దు
తాండూరు, న్యూస్లైన్ : రుణాల మాఫీ విషయంలో రైతులు అనుమానపడాల్సిన అవసరం లేదని, ఆందోళన చెందరాదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆదివారం ఆయన తాండూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీ ప్రకారం సీఎం కేసీఆర్ రూ.లక్ష లోపు రుణాలను కచ్చితంగా మాఫీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. రుణాల మాఫీ విషయంలో ప్రతిపక్షాలు రైతులను అయోమయానికి గురి చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నాయని విమర్శించారు. రుణాల మాఫీ విషయంమై ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్లతో ప్రభుత్వం చర్చించిందన్నారు. సీఎం కేసీఆర్ మాట తప్పరని, రైతులకు తప్పకుండా న్యాయం చేస్తారని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 500 జనాభా కలిగిన తండాలను పంచాయతీలుగా మారుస్తామని, పింఛన్ మొత్తాన్ని రూ.1500కి పెంచుతామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని, ప్రమాదాలకు బాధ్యులైన వారు ఎంత పెద్దవారైనా సరే కఠినచర్యలు తప్పవనీ, అధికారులను కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. షాపింగ్ కాంప్లెక్స్లు... తెలంగాణలోని పది జిల్లాల్లో ఆర్టీసీ డిపోలు శంకుస్థాపనలు జరిగి కొన్ని, సగంలోనే మరికొన్ని ఆగిపోయాయని మంత్రి చెప్పారు. వీటి నిర్మాణాలు పూర్తిచేస్తే తెలంగాణలో 50 ఆర్టీసీ డిపోలు అందుబాటులోకి వస్తాయన్నారు. కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీలు తక్కువగా ఉన్నాయని, అయినా బస్సు చార్జీలను పెంచే ఆలోచన లేదని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం కన్నా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఆదాయం కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ సంస్థ నష్టాల్లో ఉందన్నారు. ఆదాయ వనరులను పెంపొందించుకోవడానికి పది జిల్లాల్లో ఆర్టీసి బస్టాండ్లు, డిపోల పరిధిలోని ఖాళీ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. రహదారులను మెరుగుపరిచి తెలంగాణలోని 1200 గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని యోచిస్తున్నట్టు చెప్పారు. మరింత పారదర్శకం... రవాణా శాఖ కార్యక్రమాలన్నీ మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి చెప్పారు. తాండూరులో ఆర్టీఏ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలల బస్సుల తనిఖీలు, 16వ తేదీ నుంచి పెండింగ్ పైళ్ల క్లియరెన్స్తోపాటు ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల 1వతేదీన ఫేస్ టు ఫేస్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు మంత్రి వివరించారు. రెండు జిల్లాల్లో తెలంగాణవారికే పోస్టింగ్లు రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సీమాంధ్రకు చెందిన మూడు వేల మంది ఉపాధ్యాయులు, అలాగే 80శాతం మంది పోలీసు ఉద్యోగాల్లో నియుక్తులైనందున తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే ఈ రెండు జిల్లాలోని సీమాంధ్ర ఉపాధ్యాయులు, పోలీసులను నిబంధనల ప్రకారం వారి ప్రాంతానికి పంపిస్తామని, వారి స్థానంలో తెలంగాణ ప్రాంతం వారికి పోస్టింగ్ ఇస్తామని.. ఇందుకు కొంత సమయం పడుతుందన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పదవులు మావే.. తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీల చైర్పర్సన్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. తాండూరులో మద్దతు కోసం ఎంఐఎం పార్టీతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఇక్కడ చైర్పర్సన్ పదవి కోసం ఐదుగురు పోటీలో ఉన్నా అందరితో చర్చించి ఏకాభిప్రాయానికి వస్తామన్నారు. ఎన్నికల తేదీ ఖరారు కాగానే చైర్పర్సన్ల ఎంపిక వ్యవహారాన్ని కొలిక్కి తెస్తామని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకుడు కరణం పురుషోత్తంరావు పాల్గొన్నారు. -
రైతుకు దిక్కేది
సాక్షి, ఒంగోలు: ఖరీఫ్ సాగుకు పెట్టుబడుల్లేవు.. రుణాలు మాఫీ అవుతాయో, లేదోననే అనుమానం వెంటాడుతుండగా, బ్యాంకర్ల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అమలవుతోన్న పథకాలు కొత్తప్రభుత్వంలో కొనసాగిస్తారా..? రద్దుచేస్తారా..? అనేది తెలియక రైతులు తికమకలో ఉన్నారు. వ్యవసాయశాఖ పథకాల అమలుకు సంబంధించి నేటి వరకు అధికారులకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఏటా అమలుచేసే పథకాలైనా.. ప్రస్తుత కొత్తరాష్ట్రంలో యథాతథంగా ఉంచుతారా.. లేదా..? అనేది సందేహంగానే ఉంది. దీనిపై రైతులు అడిగినా.. అధికారులు మాత్రం సమాధానం దాటవేస్తున్నారు. మరోవైపు ఖరీఫ్ సీజన్ పనులకు రైతులు కసరత్తు చేస్తున్నారు. మృగశిర కార్తె ప్రవేశిస్తే..వాతావరణం అనుకూలించి వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. విత్తనాలు, ఎరువులు, జింకు, జిప్సం, జీలుగలు ఇలా అన్నిరకాల రాయితీ వస్తువులపై రైతులు దృష్టి సారిస్తారు. యంత్రలక్ష్మి, పొలంబడి, రైతుచైతన్య యాత్రల ప్రత్యామ్నాయం, క్షేత్ర ప్రదర్శనలు, తదితర కార్యక్రమాల నిర్వహణపై స్పష్టత లేదు. జిల్లా పరిస్థితి ఇదీ.. = జిల్లావ్యాప్తంగా 7.5 లక్షల మంది రైతులుం డగా.. ఇందులో కౌలు రైతులు 1.50 లక్షల మంది ఉన్నారు. వీరందరిలో 3 లక్షల మంది రైతులు వివిధ జాతీయ బ్యాంకులతో పాటు జిల్లా సహకార, అర్బన్ బ్యాంకుల్లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్నారు. మొత్తం వాయిదాల మీదనున్న బకాయిలు ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా రూ.3 వేల కోట్లుండగా, కిందటేడాది ఖరీఫ్ పంట రుణాల కింద రూ.2600 కోట్లు రైతులకు పంపిణీ చేశారు. అంటే, మొత్తం రూ.5,600 కోట్లు విలువైన రైతు రుణాలు మాఫీకావాల్సి ఉంది. అయితే, బ్యాంకర్లు మాత్రం రైతు రుణమాఫీ పథకం గడువు మీరిన బకాయిలకే వర్తిస్తుందని.. రెగ్యులర్ బకాయిల మాఫీ కుదరదని చెబుతున్నారు. దీంతో రైతులు కిందటేడాది పంట రుణాలను చెల్లిస్తేనే.. ప్రస్తుత ఖరీఫ్ సాగు పెట్టుబడికి రుణం తీసుకోవాల్సి ఉంటుంది. = జిల్లాలో 2010 సంవత్సరం నుంచి వరుసగా సంభవించిన ప్రకృతి వైపరీత్యాల ధాటికి రైతులు తీవ్రంగా పంటనష్టాన్ని చవిచూస్తూనే ఉన్నారు. 2010 నవంబర్లో సంభవించిన ‘జల్’ తుపాను, ఆ తర్వాత ఏడాది అధిక వర్షాలు, 2011లో థానే తుపాను, అదే ఏడాది చివరన సంభవించిన కరవు పరిస్థితులు, 2012లో ‘నీలం’ తుపాను తదితర వైపరీత్యాల కారణంగా వాటిల్లిన పంట నష్టానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా రూ.68.38 కోట్ల ఇన్పుట్ సబ్సిడీగా విడుదల కావాల్సి ఉంది. మొత్తం 1.89 మంది బాధిత రైతులు వాటి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. = గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శ రైతులను నియమించింది. పంటల సాగుపై అవగాహన, రుణాలు తీసుకోవడంపై బ్యాంకర్లతో మాట్లాడి సాయపడటం వంటి పనులను ఆదర్శ రైతులు చేసేవారు. అయితే, అరకొరగా ఉన్న వారి వేతనాలు పెంచి సేవలు విస్తృతపరిచి రైతులకు చేరువ చేస్తారా..లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. క్షేత్ర స్థాయిలో ఆదర్శ రైతుల సేవలు అవసరమని అధికారులు చెబుతున్నారు. = తాజాగా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఆదర్శ రైతులు, ఏవో, ఏఈవోలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాల నిర్వహణకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు ఎదురు చూస్తున్నారు. = కిందటేడాది వరకు విత్తనాలకు రాయితీ ఉంది. కొత్తగా కేంద్రం రాయితీ తొలగించడంతో అధికారులు, రైతులు అయోమయంలో పడ్డారు. కేంద్రం తొలగించినా.. రాష్ట్రం రాయితీని భరించి పథకాలను అమలు చేయాలని ..తద్వారా సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని రైతుసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. = ప్రధానంగా జిల్లాలో సాగయ్యే వరి, వేరుశనగ విత్తనాల నిల్వకు కొరత ఉంది. బీపీటీ 5204 సాంబా మసూరికి ప్రత్యామ్నాయ విత్తనాలు అందుబాటులో లేవు. ఎక్కడైనా ఉన్నా.. రైతులకు అందని ద్రాక్షగానే ఉన్నాయి. = పదేళ్లుగా ‘యంత్రలక్ష్మి’ పథకం పేరిట కొత్త యంత్రాలను రైతులకు చేరువ చేయడానికి ప్రభుత్వం రాయితీతో పరికరాలు అందజేస్తోంది. కిందటేడాది ఈ పథకం కింద రూ.13 కోట్లు మంజూరు చేశారు. అయితే, కేవలం రూ.4 కోట్లు మాత్రమే వినియోగించి, అధికారులు పట్టించుకోకపోవడంతో కిందటేడాది రూ.9 కోట్ల నిధులు ప్రభుత్వానికి వెనక్కు వెళ్లాయి. ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. -
కొనసాగుతున్న నిరసన జ్వాలలు
రుణాల మాఫీకి సంబంధించి కాలపరిమితి షరతును ఎత్తివేయాలంటూ రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. పలుచోట్ల సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేసి రాస్తారోకోలకు దిగారు. వారికి పలు పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. అన్నదాతల బతుకులతో ఆటలాడొద్దు : వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్గౌడ్ ఇబ్రహీంపట్నం రూరల్: రైతు రుణాల మాఫీపై ప్రభుత్వం మాట మార్చిందంటూ వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామంటూ అధికారంలోకి వచ్చి ఇప్పుడు కొత్త నిబంధనలు విధించడం సబబు కాదన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పార్టీ నాయకులు, రైతులు ఆందోళన చేపట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈసీ శేఖర్గౌడ్ మాట్లాడుతూ.. గద్దెనెక్కి వారం కూడా కాకముందే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమమని వేలాదిమంది యువకులను ఉసిగొల్పి వారి ఆత్మబలిదానాల సాక్షిగా ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ పదవిలోకి వచ్చినాక అన్నీ మర్చిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే అన్ని వసతులు సమకూరుస్తాం.. రుణాలు మాఫీ చేస్తాం.. ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిచ్చి ఇప్పుడు కేసీఆర్ చేతులెత్తేశారన్నారు. ప్రభుత్వం అసమర్థత వల్ల అన్నదాతల జీవితాలు ఆగమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికే పలుచోట్ల రుణాలు మాఫీ అవుతాయో లేదో అని కొన్ని రైతన్నల గుండెలు ఆగిపోయాయని.. ప్రభుత్వం మాటమారిస్తే మరిన్ని అన్నదాతల గుండెలు ఆగిపోయే అవకాశాలు కల్పించినట్లవుతుందని పేర్కొన్నారు. ఏ హామీల పేరుతో అధికారాన్ని చేపట్టారో.. ఆ హామీలను నెరవేర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ సభ్యులు నాయిని సుదర్శన్రెడ్డి, మండల అధ్యక్షుడు పల్లె సాయిబాబగౌడ్, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాల పార్టీ నాయకులు తాళ్ల క్రిష్ణగౌడ్, బాబులు, చిత్రం జంగయ్య, ముత్యాల శ్రీహరి, దార నర్సింహా, సుధీర్రెడ్డి, సుజాత, శ్రీనివాస్రెడ్డి, సుగుణమ్మ, జయరాజ్, రత్న మ్మ, సంగీత, అనసూయ తదితరులున్నారు. రైతులను వంచించారు ధారూరు, న్యూస్లైన్: రైతుల రుణ మాఫీపై టీఆర్ఎస్ ప్రభుత్వం మాట తప్పిందంటూ అన్నదాతలు ఆగ్రహించారు. ప్రభుత్వ నిర్ణయానిన నిరసిస్తూ ఆందోళనకు దిగారు. 2010 ఏప్రిల్ నుంచి 2014 మే 31 వరకు రైతులు తీసుకున్న పంటల రుణాలన్నింటినీ మాఫి చేయాలని డిమాండు చేస్తూ ధారూరు మండలం కేరెళ్లి గ్రామ రైతులు తాండూరు-హైదరాబాద్ ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసిన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా రైతు నాయకుడు చెన్నారెడ్డి మాట్లాడుతూ.. అతివృష్టి, అనావృష్టిలతో పంటలు చేతికందక అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టి కేసీఆర్ మాట మార్చడం తగదన్నారు. రుణమాఫీతో తమ అప్పులు తీరుతాయని గంపెడాశతో ఉన్న తమను ప్రభుత్వం వంచించిదన్నారు. రైతుల ఉసురు పోసుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని గుర్తు చేశారు. వ్యవసాయానుబంధ రంగాల రైతులు తీసుకున్న రూ. లక్షలోపు రుణాలను కూడా మాఫీ చేయాలన్నారు. లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దాదాపు మూడు గంటల పాటు ప్రధాన రోడ్డుపై కొనసాగిన రైతుల ధర్నాతో తాండూరు-హైదరాబాద్ రోడ్డుపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేరెళ్లి గ్రామానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు. -
అందరిచూపు రుణ‘మాఫీ’ వైపే..
ముదినేపల్లి రూరల్, న్యూస్లైన్ :అధికారంలోకొస్తే రుణాలు మాఫీ చేస్తానన్న టీడీపీ అధినేత చంద్రబాబు వాగ్ధానాన్ని నమ్మి ఓటేసిన వారంతా ప్రస్తుతం ఆ వైపే చూస్తున్నారు. సాగు చేస్తున్న రైతులంతా సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకుల్లో భూములు తనఖా పెట్టి పంట రుణాలు పొందారు. రుణాలు రద్దు చేస్తే అప్పుల ఊబి నుంచి బైటపడి సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కించాలనే ఆలోచనలో రైతులున్నారు. అయితే రుణమాఫీ పథకం అమలులో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వడ్డీ రూపేణా నష్టం... వ్యవసాయ రుణాలపై రూ.లక్షవరకు గతప్రభుత్వం వడ్డీ మాఫీ చేసింది. రుణం పొందిన తేదీ నుంచి ఏడాది ముగిసే లోపు చెల్లిస్తేనే వడ్డీ మాఫీ అవుతుంది. అయితే రుణాలు రద్దుచేస్తామన్న టీడీపీ హామీతో వడ్డీ బకాయిల గడువు మీరినా రైతులు ఇప్పటి వరకు చెల్లించలేదు. దీంతో వడ్డీ పూర్తిగా చెల్లించిన వారికే రుణమాఫీ వర్తింపచేస్తే మిగిలిన రైతులు వడ్డీ రాయితీని కోల్పోవడంతో పాటు అపరాధపు వడ్డీతో సహా రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సహకార సంఘాల్లో రుణాలు పొందిన రైతులు మార్చి నెలాఖరు లోపు రుణం చెల్లిస్తేనే పావలా వడ్డీ అమలు చేస్తున్నారు. రుణమాఫీ ప్రచారం వల్ల ఇప్పటి వరకు సంఘాలకు రైతులు బకాయిలు చెల్లించలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం లేనందున పావలా వడ్డీపై ఎలాంటి ఉత్తర్వులు సంఘాలకు అందలేదు. రైతులంతా రుణమాఫీపై ఆశలు పెట్టుకున్నారు. రుణమాఫీ పథకం కొందరికే వర్తిస్తే ఇతర రైతులు ఆశాభంగం చెందక తప్పదు. బంగారు రుణాలు? బ్యాంకులు బంగారం తనఖాపై రెండు రకాల రుణాలిస్తాయి. బ్యాంకు యాజమాన్యాలను బట్టి ఇతర రుణాలకు 13శాతం, వ్యవసాయ రుణాలకు 7శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. గడువు తేదీలోగా చెల్లించకుంటే అపరాధపు వడ్డీ వసూలు చేస్తాయి. రైతులు చెల్లించిన శిస్తు రశీదుల ఆధారంగా వ్యవసాయ రుణాలిస్తున్నాయి. రుణమాఫీ అమలు చేస్తే బంగారంపై పొందిన రుణాలకు వర్తిస్తుందా లేదా అనేది పలువురిలో ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఇలాంటి రుణాలు పొందిన రైతులు గడువు మీరుతున్నా బకాయిలు చెల్లించడంలేదు. ఆక్వా రుణాలు... మండలంలో విస్తారంగా చేపల, రొయ్యల చెరువులున్నాయి. వీటిని తనఖాగా ఉంచి రైతులు సహకార సంఘాలు, బ్యాంకుల్లో రుణాలు పొందారు. ఆక్వాసాగులో రైతులు నష్టపోయిన సమయాల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందడంలేదు. అదే వరిసాగు రైతులకు మాత్రం ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం నుంచి అందుతోంది. వ్యవసాయ రుణాల రద్దు పథకం -2008లో సైతం వీరి రుణాలు రద్దు కాలేదు. ఇటు వ్యవసాయంగానూ, అటు పరిశ్రమగానూ ఆక్వా సాగును గుర్తించనందువల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని రెతులు వాపోతున్నారు. రుణాలు పొందిన కౌలు రైతుల పరిస్థితి ఇదే విధంగా డోలాయమానంలో పడింది. హామీ నిలబె ట్టుకోవాలి రెండెకరాలు బ్యాంకులో తనఖాపెట్టి రూ.40వేలు రుణం పొందా. సార్వా, దాళ్వాలో అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయా. రుణాలు రద్దు చేసి చంద్రబాబు హామీ నిలబెట్టుకోవాలి. సీెహ చ్ వెంకటేశ్వరరావు, రైతు. రద్దు చేస్తేనే సేద్యం నాలుగెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తూ అప్పుల్లో మునిగిపోయా. జేఎల్జీ గ్రూపుతో బ్యాంకు నుంచి రూ.20వేలు రుణం పొందా. కౌలు రైతులు రుణాలు రద్దు చేస్తేనే నాలాంటి వారు తిరిగి సేద్యం చేసే అవకాశం ఉంది. రామకృష్ణ, కౌలు రైతు. -
రైతులకు రుణ మాఫీ...యువతకు ఉపాధి
భూపాలపల్లి సభలోబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి హామీ భూపాలపల్లి, న్యూస్లైన్ : బీజేపీ అధికారంలోకి వస్తే రూ.లక్షలోపు రైతు రుణాలు మాఫీ, యువతకు ఉపాధి కల్పించడంతోపాటు మహిళలపై అత్యాచారాలు, ఉగ్ర వాదాన్ని అరికడతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి చెప్పారు. భూపాలపల్లి పట్టణంలోని సంఘమిత్ర డిగ్రీ కళాశాల సమీప మైదానంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికులకు ఇన్కాంట్యాక్స్ రద్దు, భూపాలపల్లిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులను తగ్గించి భూగర్భగనులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. కేటీపీపీలోని క్యాజు వల్, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు మరో 4వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు నెల కొల్పుతామన్నారు. బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఏర్పా టు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చా రు. బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి రామగళ్ల పరమేశ్వర్, భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావులను గెలిపించాలని కిషన్రెడ్డి కోరారు. పార్టీ రాష్ట్ర నేతలు, సినీ నటులు రాజశేఖర్, జీవిత మాట్లాడుతూ నరేంద్రమోడీ ప్రధాని అయితే పేద, మధ్యతరగతి ప్రజల బాధలు తీరుతాయని చెప్పారు. బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మాందాడి సత్యనారాయణరెడ్డి, టీడీపీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎడబోయిన బస్వారెడ్డి, ఎడ్ల అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డ్వాక్రా రుణాలు మాఫీ
తోట్లవల్లూరు రోడ్షోలో తాతినేని పిల్లల చదువు కోసం అమ్మఒడి పథకం ముగిసిన మొదటి విడత ప్రచారం మచిలీపట్నం, న్యూస్లైన్ : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జె డ్పీ చైర్మన్ అభ్యర్థి తాతినేని పద్మావతి చెప్పారు. తోట్లవల్లూరు మండలంలో శుక్రవారం ఆమె విసృ్తతంగా పర్యటించారు. ప్రచారానికి ఆఖరిరోజు కావడంతో మండలంలోని పలు గ్రామాల్లో రోడ్షో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అధిక ధరల నేపథ్యంలో కుటుంబం గడవటమే కష్టంగా మారిందన్నారు. దీంతో డ్వాక్రా సంఘాల్లోని సభ్యులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించలేక సతమతమవుతున్నారన్నారు. ఈ ఇబ్బంది నుంచి మహిళలను బయటపడవేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలన్నింటినీ రద్దు చేస్తామని చెప్పారు. 150 యూనిట్లు కరెంటు వాడినా రూ. 100 బిల్లు వసూలు చేసేలా చూస్తామని వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహనరెడ్డి హామీ ఇచ్చారని, ఈ హామీని తప్పకుండా అమలు చేస్తామన్నారు. కృష్ణానది వెంబడి ఉన్న లంక గ్రామాల్లో సౌకర్యాలు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. తోట్లవల్లూరు మండలంలోని బద్రిరాజుపాలెం, దేవరపల్లి, గురివిందపల్లి, ఐలూరు, పాలంకిపాడు తదితర గ్రామాల్లో ఆమె పర్యటించారు. మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కళ్లం వెంకటేశ్వరరెడ్డి, జొన్నల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తోట్లవల్లూరు మండలంలోని గరికపాడులో పామర్రు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన విసృ్తత ప్రచారం నిర్వహించారు. బందరు మండలంలో నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య (నాని), జెడ్పీటీసీ అభ్యర్థి లంకే వెంకటేశ్వరరావు, ఆయా సెగ్మెంట్ల ఎంపీటీసీ అభ్యర్థులు కోన, పోలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెం, తుమ్మలచెరువు, పెదయాదర, ఎన్ గొల్లపాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు. పేర్ని నాని మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు, అర్హులందరికీ పింఛన్లు ఇచ్చేందుకు సముద్రతీర ప్రాంతాల్లో తాగునీటి వసతిని మెరుగుపరుస్తామని తెలిపారు. వైఎస్ కుటుంబాన్ని ఆదరించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వైఎస్.జగన్ ముఖ్యమంత్రి అయితే వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదల దరికి చేరుతాయన్నారు. ఘంటసాల మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల చంద్ర మండలంలోని పలు గ్రామాల్లో రోడ్షో నిర్వహించారు. నాగాయలంకలో అవనిగడ్డ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్బాబు విసృ్తత ప్రచారం నిర్వహించారు. అవనిగడ్డ జెడ్పీటీసీ అభ్యర్ధి దిడ్ల ప్రసాద్ పాత ఎడ్లలంక తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. చల్లపల్లి జెడ్పీటీసీ అభ్యర్థి కైతేపల్లి కుమారి, కోడూరు జెడ్పీటీసీ అభ్యర్థి సీహెచ్.చినవెంకటేశ్వరరావు తదితరులు విసృ్తత ప్రచారం నిర్వహించారు. బంటుమిల్లి, పెడన మండలాల్లో నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్, జెడ్పీటీసీ అభ్యర్థులు జీవీ ప్రసన్నకుమారి, బుంగా నాగవెంకటశ్రీనబాబు రోడ్షో నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. మొవ్వ మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థి విజయశాంతి నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన పెడసనగల్లు, నిడుమోలు తదితర ప్రాంతాల్లో రోడ్షో నిర్వహించారు. మైలవరం, వెల్వడం, చంద్రాల, ఎదురువీడు, పోరాటనగర్, తుళ్లూరు తదితర గ్రామాల్లో నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్, జెడ్పీటీసీ అభ్యర్థి కంభంపాటి ఏసుబాబు రోడ్షో నిర్వహించి ఓట్లు అభ్యర్ధించారు. జి.కొండూరు జెడ్పీటీసీ అభ్యర్ధి కాజబ్రహ్మయ్య రోడ్షో నిర్వహించారు. నందిగామలో జెడ్పీటీసీ అభ్యర్థి ప్రమీలారాణి కంచికచర్ల జెడ్పీటీసీ అభ్యర్థి కాలువ వాసుదేవరావు, చందర్లపాడు జెడ్పీటీసీ అభ్యర్థివెలగపూడి వెంకటేశ్వర్లు, వీరులపాడు జెడ్పీటీసీ అభ్యర్థి షహనాజ్బేగం, ఆగిరిపల్లి జెడ్పీటీసీ కాజా రాంబాబుయాదవ్ వివిధ గ్రామాల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు.