YSRCP Plenary 2022
-
విజయమ్మ ఎపిసోడ్: టీడీపీకి, ఆ వర్గం మీడియాకు నిరాశే మిగిల్చిందా!
ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏమి చేసినా విన్నూత్నంగా , పారదర్శకంగా ఉండేలా చేస్తుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ సందర్భంగా ఆయన అనుసరించిన విదానం అలాగే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి మాతృమూర్తి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పార్టీ నుంచి తప్పుకుంటున్న ప్రకటించిన వైనం సంచలనంగా ఉంది. ఈ ఉదంతం దేశంలోనే అరుదైన ఘట్టంగా చెప్పాలి. ఒక కుటుంబం అందులోను రాజకీయ కుటుంబంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయన్న ప్రచారం జరిగినప్పుడు ,వాటిని వివాదాస్పదం చేయాలని ప్రత్యర్ధి వర్గాలు ప్రయత్నిస్తున్నప్పుడు ఒక రాజకీయ నేత ఇంత బహిరంగంగా తేల్చేస్తారని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. తల్లి,కుమారుల మధ్య ఏదో జరిగిందని విస్తారంగా చెప్పడం ద్వారా వైసీపీకి నష్టం చేయాలని అటు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా ప్రయత్నిస్తున్నప్పుడు జగన్ వ్యూహాత్మకంగా ఈ వైఖరి అనుసరించడం ఆసక్తికరమైన విషయమే. బహుశా దేశ చరిత్రలో ఎక్కడా ఒక పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు అదే పార్టీ ప్లీనరీలో ప్రకటించడం జరిగి ఉండదు. ఒకవేళ అలా జరిగితే పెద్ద గొడవగా మారుతుంది. కానీ అందుకు భిన్నంగా విజయమ్మ వ్యవహరించిన శైలి, జగన్ ఆమెను గౌరవించిన తీరు కచ్చితంగా అభినందనీయం. వైఎస్ కుటుంబంలో ఏది పెద్ద రహస్యం కాదని, చెప్పేదేదో ఫెయిర్ గా చెబుతామని వారు స్పష్టం చేసినట్లుగా ఉంది. అంతకుముందు జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన తర్వాత స్పందించిన తీరు కూడా అందరిని ఆకట్టుకుంది. షర్మిల పార్టీ పెట్టడం తమకు ఆమోదయోగ్యం కాదని, అయినా ఆమె తన అభీష్టం ప్రకారం పెట్టుకున్నారని , ఆమెకు ఆల్ ద బెస్ట్ చెబుతామని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ప్రకటింపచేశారు. దాంతో ఆ వ్యవహారం అక్కడితో ముగిసింది. షర్మిల కూడా అంతే హుందాగా వ్యవహరించి తనకు సోదరుడితో విభేదాలు లేవని తెలిపారు. ఒక మీడియా ఆమెను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆ విషయంలో చాలా సమయస్పూర్తిగా సమాధానాలు ఇచ్చారు. ఈ విషయాలపై చిలవలు,పలవలుగా కధనాలు వండి వార్చడానికి కొన్ని మీడియా సంస్థలు సహజంగానే ప్రయత్నిస్తుంటాయి. వార్త ఇవ్వడం వరకు ఎవరూ ఆక్షేపించారు. కాని ఉన్నవి,లేనివి చెప్పి వక్రీకరించడమే దారుణంగా ఉంటుంది. అమ్మ అవుట్ అని, బలవంతంగా రాజీనామా చేయించారని , ఇక మరో టార్గెట్ ఫలానా అని తమకు తోచిన కథనాలు రాశారు. వీటన్నిటికి చెక్ పెడుతూ విజయమ్మ చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. ఆమె ఎక్కడా తొణకలేదు. బెణకలేదు. వ్యతిరేకార్దం వచ్చేలా మాట్లాడలేదు. ప్లీనరీలో మెదటి రోజు పాల్గొన్న సుమారు రెండు లక్షలమందికే కాక, టీవీల ద్వారా చూసే లక్షలాది ప్రజలకు అర్దం అయ్యేలా తన ఉపన్యాసం చేశారు.తన మధ్దతు ఎల్లవేళలా జగన్ కు ఉంటుందని, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణలో షర్మిల పార్టీకి అండగా నిలవాలని అనుకున్నప్పుడు అనవసర వివాదాలు తలెత్తకుండా ఉండడానికే తాను ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటున్నానని విస్పష్టంగా వివరించారు. విజయమ్మ పార్టీకి అదే హోదాలో ఉండాలని ఎక్కువ మంది కార్యకర్తలు కోరుకుని ఉండవచ్చు. కాని ఆమె తన కారణాలను తెలియచేశారు. కాగా విజయమ్మ ప్రసంగం ఆద్యంతం జగన్ తో సహా సభికులంతా ఆసక్తిగా విన్నారు. ఆ తర్వాత ఆమె తన సీటు వద్దకు వెళ్లినప్పుడు జగన్ ఆమెను సాదరంగా రిసీవ్ చేసుకుని కూర్చోబెట్టారు. అంటే దీని అర్ధం ఏమిటి? తమ మధ్య విబేధాలు లేవని, ప్రేమాభిమానాలు తగ్గలేదని వారు రుజువు చేసుకున్నారు. సాధారణంగా ఒక పార్టీ నుంచి తప్పుకున్నానని చెప్పిన తర్వాత వారు అక్కడ నుంచి వెళ్లిపోతారు. కానీ విజయమ్మ అలా చేయకుండా తన కుమారుడి పక్కనే సాయంత్రం వరకు కూర్చోవడం గమనించదగ్గ అంశం. అక్కడితో ఆగలేదు. మరుసటి రోజు కూడా ప్లీనరీలో పాల్గొని ఒక వర్గం మీడియాకు సమాధానం చెప్పారు. విజయమ్మ ఉపన్యాసంలోని కొన్ని అంశాలను చూద్దాం. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులుగా జగన్, షర్మిల.. ఇద్దరూ ఆయన భావాలను పుణికి పుచ్చుకున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నా కుమారుడికి తోడుగా ఉన్నా. ఇక్కడ సంతోషంగా ఉన్న సమయంలో తెలంగాణలో వైఎస్సార్ ఆశయ సాధన కోసం షర్మిల పోరాడుతోంది. ఇప్పడు ఆమెకు తోడుగా ఉండమని నా మనస్సాక్షి చెబుతోంది. రెండు రాష్ట్రాల్లో రాజకీయ వివాదాలకు తావులేకుండా వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నా’’ అని ఆమె ప్రకటించారు. ఇక్కడ ఎక్కడా ఆమె ఇద్దరు పిల్లల మధ్య తేడా చూపించాలని అనుకోలేదు. జగన్ ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఎన్నికై ప్రజల మద్దతు పొందుతున్నందున ఆమె షర్మిలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు భిన్నంగా షర్మిల గురించి ఎక్కువగా మాట్లాడి ఉంటే అది చర్చనీయాంశం అయి ఉండేది. అలాంటి అవకాశం ఆమె ఇవ్వలేదు. ఈ సందర్భంగా ఎల్లో మీడియా ద్వేషపూరిత ప్రచారం చేస్తోందని ఆమె కుండబద్దలు కొట్టారు. తెలంగాణలో ముందుగా ఎన్నికలు వస్తాయి. అక్కడ షర్మిల ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమె తెలంగాణ ప్రయోజనాలపై మాట్లాడుతోంది. ఇక్కడ జగన్ ఏపీ ప్రజల కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో సీఎంగా జగన్కు ఒక స్టాండ్ ఉంటుంది. అదే సమయంలో ఇద్దరికీ వేర్వేరు విధానాలు తప్పవు. ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాల ప్రతినిధులుగా ఉండే పరిస్థితులు వస్తాయని ఊహించలేదు. ఇది ప్రజాహితం కోసం దేవుడు జరిపిస్తున్నాడని నమ్ముతున్నా.జగన్ తనను తాను నిరూపించుకుంటూ మంచి సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మీ అందరి దయతో, తిరుగులేని మెజార్టీతో రెండోసారీ సీఎం అవుతారనే నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. ఈ రోజు ప్రజలందరి ప్రేమ, అభిమానాన్ని సంపాదించిన నా బిడ్డ జగన్ను చూసి చాలా గర్వపడుతున్నా. మనసుతో చేసే ప్రజా పరిపాలనను కళ్లారా చూస్తున్నాఅని అన్నారు. ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా విజయమ్మ ఏదో జగన్ కు వ్యతిరకంగా ఉన్నారనో, లేక జగన్ తన తల్లిని విస్మరించారనో ప్రచారం చేస్తే ఎవరైనా నమ్ముతారా? ఒక్కసారి గత చరిత్రను చూద్దాం. విజయమ్మ తన రాజకీయ సరళి మార్చుకుంటూ చేసిన ప్రసంగంలో జగన్ పై ప్రశంసల జల్లు కురిపిస్తే, తెలుగుదేశం వ్యవస్థాపకుడు , మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు తన అల్లుడు చంద్రబాబును ఉద్దేశించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసింది గుర్తుకు తెచ్చుకుంటే వీరి మద్య ఉన్న వ్యత్యాసం తేలికగా అర్ధం అవుతుంది. తన మామ ఎన్.టి.ఆర్.ను పదవీచ్యుతుడిని చేసే క్రమంలో వైస్రాయి హోటల్ వద్ద ఆయనపై చెప్పలు వేయడం మొదలు , తాను మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఎన్.టి.ఆర్.నిస్సహాయంగా నిండు శాసనసభలో నిలబడిన వరకు జరిగిన ఘటనలు చూస్తే ఎవరు ఎలా వ్యవహరించారో విదితమవుతుంది. ఆనాటి స్పీకర్ గా ఉన్న యనమల రామకృష్ణుడు పదే,పదే మైక్ కట్ చేసి ఎన్ టి.ఆర్.ను పరాభవిస్తుంటే, చంద్రబాబు నిశ్శబ్ద ప్రేక్షకుడిగా ఉండిపోయారేకాని వారించలేదు. ఆ తర్వాత ఎన్.టి.ఆర్.ను పార్టీ నుంచి తొలగించి, అధ్యక్ష పదవిని కూడా చంద్రబాబు కైవసం చేసుకున్నారు మరో వైపు విజయమ్మ పార్టీ ప్లీనరీలో మాట్లాడి పూర్తి గౌరవం పొందారు.ముఖ్యమంత్రి పక్కన కూర్చుని సభను ఆలకించారు. అయినా చంద్రబాబు మాత్రం వైఎస్ కుటుంబంలో ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా అయితే శరభ,శరభ అంటూ పూనకం వచ్చినట్లుగా వ్యవహరిస్తోంది. ఇక్కడ మరో విషయం చెప్పాలి. టిడిపిని తన అధీనంలోకి తీసుకున్న తర్వాత చంద్రబాబు తో ఆయన బావమరుదులు జయకృష్ణ, హరికృష్ణ, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, స్వయంగా తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు వంటివారికి ఆయా సందర్భాలలో ఏర్పడిన విబేధాల సంగతి ఇప్పటి తరం వారికి తెలియకపోవచ్చు. దగ్గుబాటి పుస్తకంలో ఏమి రాశారో చూస్తే పలు విషయాలు తెలుస్తాయి. రాజకీయాలలో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతుంటాయి. పలు రాష్ట్రాలలో ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. కాని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్లీనరీలో మాత్రం ఎలాంటి గొడవలు,గందరగోళాలు లేకుండా ఈ ఉదంతం ముగియడం విశేషమే. టిడిపికి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాకు మాత్రం అది తీవ్ర నిరుత్సాహం కలిగించే విషయమే. -కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
‘కుప్పంలో సత్తా చూపిస్తాం.. రాజీనామా చెయ్యి’.. బాబుకు నాగార్జున సవాల్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్లీనరీలో జన ప్రభంజనాన్ని చూసిన చంద్రబాబు, ఆయన తాబేదార్లకు మతి తప్పిందని, అందుకే అవాకులు చవాకులు పేలుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. ఈసారి కుప్పంతో సహా 175 స్థానాల్లోనూ ఓడిపోతారనే విషయం వారికి అర్థమైందని అన్నారు. జగన్ జన ప్రభంజన రథ చక్రాల కింద చంద్రబాబు, ఆయన అనుయాయులు నలిగిపోవడం ఖాయమన్నారు. ఇప్పటికీ టీడీపీకి గెలుస్తామనే నమ్మకం ఉంటే కుప్పం ఎమ్మెల్యే సీటుకు చంద్రబాబు రాజీనామా చేసి వస్తే తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. కుప్పంలో మీరైనా, మీ కొడుకైనా సరే మా సత్తా చూపిస్తామన్నారు. మంత్రి నాగార్జున సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఒక తల్లిగా వైఎస్ విజయమ్మ సీఎం వైఎస్ జగన్ ఉజ్వల భవిష్యత్తుపై మాట్లాడిన మాటలను కూడా ఎల్లో గ్యాంగ్ వక్రీకరిస్తోందని చెప్పారు.14 ఏళ్ల పాటు సీఎంగా చేసిన చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏం చేశారని ప్రజలు మళ్లీ ఆదరిస్తారని ప్రశ్నించారు. ఆయన మార్కు పథకం ఒక్కటైనా చెప్పగలరా అని నిలదీశారు. ఎన్టీఆర్ 2 రుపాయలకు కిలో బియ్యం పథకాన్ని పెడితే, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో గొప్ప పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా, అమ్మఒడి, విద్యా కానుక, విద్యా దీవెన లాంటి లెక్కలేనన్ని పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. కష్టాల్లో ఉన్నప్పుడే వైఎస్ జగన్ను ఆదరించిన ప్రజలు ఆయనకు కంచుకోటలా అండగా నిలిచారన్నారు. ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్ను అస్సలు వదులుకోరని చెప్పారు. చంద్రబాబు, ఆయన తాబేదార్లు ఎన్ని వేషాలేసినా, అబద్ధాలు ప్రచారం చేసినా రాబోయే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు అన్ని వర్గాల ప్రజలు సత్తా చూపిస్తారన్నారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యాకే అసెంబ్లీలోకి అడుగుపెడతానని ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబును ఈసారి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వరని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ స్థాయికి దిగజారి మాట్లాడలేమని ఓ ప్రశ్నకు సమాధానంగా నాగార్జున చెప్పారు. -
‘విమర్శలు చేస్తారు.. చర్చకు రమ్మంటే పారిపోతారు..’
సాక్షి, తాడేపల్లి: ప్లీనరీతో వైఎస్సార్సీపీ కేడర్లో నూతనోత్సాహం వచ్చిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏ ప్రాంతీయ పార్టీకి దేశంలో ఇంత ఆదరణ లేదని.. అంచనాలకు మించి పార్టీ కార్యకర్తలు ప్లీనరీకి వచ్చారన్నారు. చదవండి: తన సలహాలు ఎవరు తీసుకోవడం లేదు: కేఏ పాల్ చంద్రబాబు నాయుడు చెప్పుకోడానికి ఒక్క పథకం ఉందా.? విమర్శలు చేయడం కాదు.. సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు రమ్మంటే పారిపోతాడంటూ మంత్రి ఎద్దేవా చేశారు. ‘‘లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి నేరుగా చేరింది నిజం కాదా..? సామాజిక న్యాయం గురించి టీడీపీకి మాట్లాడే అర్హత లేదు. సామాజిక న్యాయంపై మీరు చర్చకు సిద్దమా..? మేము 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మంత్రి పదవులు ఇచ్చాం. మీరు 18 మందికి ఇస్తాం అని మహానాడులో తీర్మానం చేయగలిగారా? అంటూ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. -
YSRCP PLenary 2022: కదనోత్సాహం.. టార్గెట్ 175
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత నిర్వహించిన ప్లీనరీ అంచనాలకు మించి విజయవంతం కావడంతో వైఎస్సార్సీపీలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. 26 జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు ప్లీనరీకి పోటెత్తాయి. గుంటూరు–విజయవాడ మధ్య జన మహా సముద్రాన్ని తలపించింది. జడివానను లెక్క చేయకుండా కిలోమీటర్ల కొద్దీ నడిచి వచ్చారు. ప్లీనరీ ప్రాంగణం వద్ద గంటల తరబడి కాలుకదపకుండా నిల్చొని నాయకుల ప్రసంగాలు విన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో భోజనం చేస్తున్న వారు కూడా మధ్యలో వదిలేసి వచ్చి, ప్రసంగాన్ని వినడం పట్ల శ్రేణుల్లో పార్టీ పట్ల నిబద్ధత రెట్టింపైనట్లు స్పష్టంగా కన్పిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టెంట్ బయట ఉన్న వారు వర్షం పడుతున్నప్పటికీ లెక్కచేయక జగన్ ప్రసంగం ఆద్యంతం వినడమూ కనిపించింది. ప్లీనరీ ప్రాంగణంలో నాలుగున్నర లక్షలు.. ట్రాఫిక్లో వాహనాలు చిక్కుకుపోవడంతో అంతే స్థాయిలో రహదారులపై ఉండిపోయారు. కాలరెగరేసే పరిస్థితి.. నవరత్న పథకాలన్నీ అమలు చేయడం.. ఎన్నికల హామీల్లో 95 శాతం అమలు చేయడం.. అన్ని వర్గాల ప్రజలు సీఎం వైఎస్ జగన్ పాలనను ఆదరిస్తుండటంతో రాష్ట్రమంతా మేం వైఎస్సార్సీపీ అని కాలరెగరేసే పరిస్థితి ఉండటం వల్లే.. ప్లీనరీకీ అభిమానసంద్రం పోటెత్తిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసేలా కార్యక్రమాలను ఉధృతం చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. కర్తవ్య బోధతో కదనోత్సాహం వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలనూ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పని చేయాలని సీఎం వైఎస్ జగన్ ప్లీనరీలో శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. మూడేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న మంచి వల్ల కుప్పం ప్రజలు కూడా ఆశీర్వదించి.. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసేలా గెలిపించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో 175 స్థానాలూ గెలవడం అసాధ్యం కాదని.. సుసాధ్యమేనంటూ శ్రేణుల్లో స్ఫూర్తి నింపారు. చంద్రబాబు, ఎల్లో మీడియా, దత్తపుత్రుడితో కూడిన గజ దొంగల ముఠా చేస్తున్న దుష్ఫ్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టడానికి గ్రామ గ్రామాన సైన్యంగా ఏర్పడాలని సూచించారు. టీడీపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని ప్రజలకు వివరించాలని చెప్పారు. చంద్రబాబుతో కూడిన కౌరవ సైన్యంపై గెలిచేందుకు అర్జునుడి పాత్ర పోషించాల్సింది మీరేనని శ్రేణులకు కర్తవ్య బోధ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నింపిన స్ఫూర్తి, కర్తవ్య బోధతో శ్రేణుల్లో కదనోత్సాహం నెలకొంది. మరింత నిబద్ధతతో గడప గడపకూ.. మూడేళ్లలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల ద్వారా చేకూర్చిన ప్రయోజనాన్ని వివరించి.. ఆశీర్వదించాలని కోరేందుకు మే 11న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సర్కార్ చేపట్టింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లు ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల ద్వారా చేకూర్చిన లబ్ధిని వివరిస్తూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖను అందిస్తూ.. ఆ పథకాలన్నీ వచ్చాయా? లేదా? అని ఆరా తీస్తూ ముందుకు సాగుతున్నారు. ప్లీనరీ గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో కదనోత్సాహం తొణికిస లాడుతుండటంతో దాన్ని మరింత పెంచేందుకు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మరింత నిబద్ధతతో నిర్వహించడానికి సిద్ధమయ్యారు. మీ ఆత్మీయతకు మరోసారి సెల్యూట్ వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలకు పెద్ద ఎత్తున హాజరై, ప్రభుత్వానికి మద్దతు తెలిపిన కార్యకర్తలు, అభిమానులకు సీఎం వైఎస్ జగన్ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ‘నిరంతరం.. దేవుని దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల హృదయాలు.. ఇవే నాకు శాశ్వత అనుబంధాలు. కార్యకర్తలు, అభిమానుల సముద్రంగా మారిన ప్లీనరీలో.. చెక్కు చెదరని మీ ఆత్మీయతకు, మనందరి పార్టీకి, ప్రభుత్వానికి మీరిస్తున్న మద్దతుకు.. మీ జగన్ మరోసారి సెల్యూట్’ అని ట్వీట్ చేశారు. -
చరిత్ర సృష్టించిన సీఎం జగన్.. ప్రత్యర్థుల గుండెల్లో వణుకు
-
సీఎం జగన్ స్పీచ్ ప్రారంభం కాగానే..
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ చివరి ఘట్టానికి చేరుకుంది. ఇక ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రసంగించడమే తరువాయి . ఆ తరుణంలో పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఒక విజ్ఞప్తి చేశారు. భోజనశాలలో ఉన్న కార్యకర్తలు కూడా తిరిగి సభా స్థలికి వచ్చి ,ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని కోరారు. ఆశ్చర్యం వేసింది. జగన్ స్పీచ్ ప్రారంభం అయ్యేసరికి నిజంగానే ఎక్కడెక్కడి కార్యకర్తలు వచ్చి తమ సీట్లో ఆసీనులవడంతో ఆ శిబిరంలో ఎక్కడా ఖాళీ కుర్చీనే దాదాపుగా కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. ఒక రాజకీయ పార్టీ కార్యకర్తల సమావేశం పెడితే , ఇంత శ్రద్దగా సభలో కూర్చుంటారా? వక్తల ఉపన్యాసాలు వింటారా? అందులోను పార్టీ అధినేత స్పీచ్ వినడానికి అంతలా ఆసక్తి కనబరుస్తారా? అన్న భావన కలిగింది. జగన్ తన స్పీచ్లో ఎక్కడా కార్యకర్తలను విసిగించేలా మాట్లాడలేదు. వారిలో స్పిరిట్ నింపే విధంగా మాట్లాడారని చెప్పాలి.జగన్ ప్రసంగాన్ని విశ్లేషిస్తే ఆయన హుందాగా మాట్లాడడానికి ప్రాధాన్యం ఇస్తూనే, తను చెప్పవలసిన విషయాలను కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. నవరత్నాల గురించి ఎన్నికలకు ముందు ఏమి చెప్పింది వివరిస్తూ, ప్రతి అక్క, ప్రతి చెల్లికి చెప్పండి.. ప్రతి అన్న ..ప్రతి తమ్ముడికి చెప్పండి ..జగనన్న రెండు నెలల్లో అధికారంలోకి వస్తాడు. కచ్చితంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తారని చెప్పమన్నాను . అని అంటూ..ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నామా?లేదా అని ప్రశ్నించారు. పార్టీ చరిత్రను తెలియచేస్తూ ఒక ఎమ్మెల్యేతో ఆరంభం అయిన పార్టీ ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేల స్థాయికి చేరిందని, వచ్చే ఎన్నికలలో 175 సీట్లకు, 175 గెలుచుకోవడం అసాధ్యం ఏమి కాదని స్పష్టం చేయడం ద్వారా పార్టీ కార్యకర్తలలో జోష్ నింపే యత్నం చేశారు. తాను చేసిన పనుల గురించి వివరించడం ఒక ఎత్తు అయితే, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును ఉద్దేశించి ఆయన చేసిన ఒక కామెంట్ అందరిని ఆకర్షించింది. చంద్రబాబు తన చేతి వేలికి ఉన్న ఉంగరంలో చిప్ ఉందని చెప్పడాన్ని ప్రస్తావిస్తూ, చిప్ ఉండాల్సింది వేలికి కాదని, మెదడుకు, హృదయానికి అని ఆయన ఎద్దేవా చేశారు. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తన నియోజకవర్గమైన కుప్పం ను రెవెన్యూ డివిజన్ చేయాలని తమ ప్రభుత్వానికి విజ్ఞప్తి పంపారని, దానిని కూడా తాము ఆమోదించామని జగన్ చెప్పినప్పుడు జనం నుంచి విశేష స్పందన వచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్యూడల్ పెత్తందార్లకోసం పనిచేస్తుందని, చంద్రబాబుది వెన్నుపోట్ల సిద్దాంతం అయితే, తమది నిబద్దతతో కూడిన విధానం అని,పేద, దిగువ మధ్యతరగతి వారికోసం పనిచేసే పార్టీ అని ఆయన పోల్చి చెప్పారు. ఇందుకు ఉదాహరణ ఇస్తూ చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణల పిల్లలు, మనుమళ్లు ఆంగ్ల మీడియంలో చదవాలి కాని, పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని వారు చెబుతున్నారని, ఇది ప్యూడల్ ధోరణి కాక మరేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు వారెవ్వరూ సమాధానం ఇవ్వలేకపోతున్న మాట వాస్తవం. రాజకీయ ప్రత్యర్ధుల వీక్ పాయింట్ మీద బలంగా కొట్టడం ఒక సూత్రం. దానిని జగన్ సమర్ధంగా పాటించారని అనిపిస్తుంది. ప్రత్యేకించి విద్యారంగంపై ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారు. కార్పొరేట్ స్కూళ్ల కోసం చంద్రబాబు పనిచేస్తే, తాను పేదలు వెళ్లే ప్రభుత్వ స్కూళ్ల కోసం పనిచేస్తున్నానని ఆయన వివరించారు. విద్యారంగంలో తాను తీసుకు వచ్చిన సంస్కరణల నేపధ్యంలో జగన్ ఈ అంశాన్న పదే,పదే ప్రస్తావించినట్లు అనిపిస్తుంది.ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కి ఎంత ప్రాధాన్యం ఇచ్చింది. ఆస్పత్రులను ఎలా మార్చుతున్నది, కొత్తగా 16వైద్య కళాశాలలను నెలకొల్పడానికి యత్నిస్తున్నది తదితర విషయాలను ఆయన వివరించారు. ఆరోగ్యశ్రీలో 2466 వ్యాధులను చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తదుపరి ఆయన రైతు భరోసా అంశానికి, ఆర్బికె లలో జరుగుతున్న కార్యక్రమాలను కార్యకర్తలకు వివరించారు. పేదలకు నేరుగా లబ్దిదారులకు లక్షా ఏభైవేల కోట్ల రూపాయలను నగద బదిలీ ద్వారా అవినీతిలేకుండా స్కీములు అమలు చేసిన విషయాన్ని ఆయన వివరించారు. ఉపన్యాసంలోని పలు అంశాలు గత కొంతకాలంగా చెబుతున్నవే అయినా, వాటిని వివరించిన తీరు పార్టీవారిని ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి. కోనసీమ జిల్లాకు రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ పేరు జత చేస్తే టీడీపీ, జనసేనలు ఎస్సి మంత్రి ఇంటిని, ఒక బీసీ ఎమ్మెల్యే ఇంటిని దగ్దం చేస్తారా అని ప్రశ్నించినప్పుడు సభికులలో వచ్చిన స్పందనను బట్టి ఆ విషయానికి ఉన్న ప్రాముఖ్యత తెలుసుకోవచ్చు. ఈ వ్యవహారం తమకు రాజకీయంగా లాభం చేస్తుందని ఆశించిన టీడీపీ, జనసేనలకు వీరి రియాక్షన్ చూశాక, వారికి తీవ్ర ఆశాభంగం తప్పదని తేలుతుంది. అమరావతి రాజధాని గురించి మాట్లాడుతూ చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అక్కడ పెట్టారని అన్నారు. దుష్టచతుష్టం అంటూ చంద్రబాబు, ఈనాడు, ఆంద్రజ్యోతి , టివి5ల తీరును ఆయన దుయ్యబడుతూ ఎల్లోమీడియా అబద్దాలు చెప్పినంతమాత్రాన అవి వాస్తవాలు కావని, గట్టిగా మొరిగినంత మాత్రాన గ్రామసింహాలు అసలు సింహాలు కాలేవని ఎద్దేవా చేశారు. పనిలో పని ఆయన దత్తపుత్రుడిని కూడా వదలలేదు. ఒక వైపు ప్రభుత్వపరంగా చేసినవాటిని చెబుతూనే, మరో వైపు రాజకీయంగా ప్రత్యర్ధులపై దాడి తీవ్రతను తగ్గించకుండా జాగ్రత్తపడ్డారని చెప్పాలి. అంతిమంగా 175 స్థానాలు గెలుపే లక్ష్యమని ఆయన పిలుపు ఇవ్వడం పార్టీ కార్యకర్తలలో జోష్ నింపే యత్నం చేశారు. విశేషం ఏమిటంటే జగన్ స్పీచ్ అయిపోయిన తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది పార్టీ కార్యకర్తలు సభాస్థలికి చేరుకుంటూనే ఉన్నారు. సుమారు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఒంగోలులో టీడీపీ నిర్వహించిన మహానాడుకు పెద్ద ఎత్తున జనం వచ్చారని ప్రచారం చేసిన టీడీపీ మీడియాకు ఒకరకంగా ఈ ప్లీనరీ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ప్లీనరీకే ఇన్ని లక్షల మంది వస్తారని వారు ఊహించి ఉండకపోవచ్చు. దీంతో మహానాడు వెలవెల పోయినట్లయింది. ఎన్నికల సమయంలో ఇలా జనం తరలివస్తే ఎన్నికల మూడ్ అనుకోవచ్చు.కాని ఇంకా రెండేళ్లు సమయం ఉండగా జరిగిన ఈ ప్లీనరీకి ఇంత భారీగా కార్యకర్తలు వచ్చారంటే,దాని అర్ధం ప్రజలలో వైసీపీకి ఆదరణ చెక్కుచెదరలేదనే తేలుతుంది. ఇంత భారీగా వచ్చినంత మాత్రాన గెలవాలని ఉందా అన్న ప్రశ్న రావచ్చు. కాని వచ్చినవారు స్పందించిన తీరు ముఖ్యం. ఆ విషయంలో జగన్ స్పీచ్కి కాని , మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, అనిల్కుమార్ యాదవ్ వంటివారు మాట్లాడినప్పుడు కాని జనం హర్షద్వానాలు చేసిన తీరు కూడా గమనించవలసి ఉంటుంది. అందులో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి వందకు,వంద శాతం మార్కులు పడతాయి.పార్టీ ప్రధాన వేదిక ఉన్న శిబిరంలో ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో, అంతకు పలురెట్ల మంది బయట ఉండడం, రోడ్లన్ని జనం తో కిక్కిరిసిపోవడం స్పష్టంగా కనిపించింది. మాజీ మంత్రి పేర్ని నాని జరగబోయే ఎన్నికలు జగన్ కేంద్రంగా జరుగుతాయని, ఎమ్మెల్యేలు ఎవరూ శాశ్వతం కాదని, కార్యకర్తలే కీలకం అని, వారిలో అసంతృప్తి ఉండబోదని చెప్పడం ద్వారా పార్టీ శ్రేణులకు ఒక స్పష్టమైన సందేశం పంపించారని అనిపించింది. అదే సమయంలో పైర్ బ్రాండ్ గా పేరొందిన మరో మాజీ మంత్రి కొడాలి నాని ప్రసంగించనున్నారని ప్రకటించగానే , సభికులలో వచ్చిన రియాక్షన్ చూస్తే ఈయనకు ఇంత ఫాలోయింగ్ ఉందా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. తొలి రోజు పార్టీ గౌరవాద్యక్షురాలు విజయమ్మ రాజీనామా ప్రకటన సంచలనత్మాకంగా ఉందని చెప్పాలి. అయితే ఆమె చెప్పిన తీరు, వివరించిన కారణాలు, రెండు రోజుల పాటు సమావేశాలలో జగన్ చెంతనే కూర్చోవడం ద్వారా తమ కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేని తేటతెల్లం చేశారు. ఇది కూడా టిడిపి మీడియాకు నిరాశ మిగిల్చింది. విజయమ్మ ప్లీనరీకి రాకుండా రాజీనామా ప్రకటన చేస్తారేమోనని, ఒకవేళ వచ్చినా ఆమె రాజీనామా పార్టీలో ప్రకంపనలు రేపుతుందని వారు ఆశించినా, ఆమె మాత్రం చాలా హుందాగా, కుమారుడిపట్ల తన ప్రేమాభిమానాలు కనబరుస్తూనే, తెలంగాణలో తన కుమార్తె షర్మిలకు అండగా ఉండడానికే అని వివరించడంతో పార్టీకి సమస్య రాకుండా పోయింది. జగన్ ను పార్టీ శాశ్వత అద్యక్షుడిగా నియమావళి సవరించుకోవడం కూడా ఆసక్తిగా ఉంది. గతంలో కరుణానిధి కూడా తమిళనాడులో ఇలాంటి పదవిలోనే ఉన్నారు. నిజానికి ప్రాంతీయ పార్టీలలో అధ్యక్షుడు సాధారణంగా చాలాకాలం ఒకరే ఉంటారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో సోనియాగాంధీ గత 23 ఏళ్లుగా అద్యక్ష స్తానంలో ఉన్నారు. ఇది దాదాపు శాశ్వత అధ్యక్ష పదవి అన్నట్లుకాకుండా మరొకటి అవుతుందా? అంతదాకా ఎందుకు ఎన్.టి.ఆర్. తన కుటుంబమే తనను దారుణంగా అవమానించి తొలగించేంతవరకు ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమించిన చంద్రబాబు ఉమ్మడి ఎపి విభజన వరకు టిడిపి అధ్యక్ష పదవిలోనే ఉన్నారు. విభజన తర్వాత జాతీయ అధ్యక్ష పదవి క్రియేట్ చేసుకుని కొనసాగుతున్నారు. అంటే 27 సంవత్సరాలుగా ఆయన అధినేతగా కొనసాగుతున్నారు. కాని చంద్రబాబు మాత్రం వైసిపిలో శాశ్వత అధ్యక్ష పదవి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు తానేమో ఎన్నికైనట్లు, రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను నియమించినట్లు నాటకీయత నడుపుతున్నారే తప్ప, తానేమీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తప్పుకోవడం లేదు. ఇక్కడే చంద్రబాబుకు , జగన్ కు తేడా తెలుస్తుంది. చంద్రబాబు ప్రతిదానిని మాయ చేయాలని అనుకుంటారు. జగన్ పెయిర్ గా ,పారదర్శకంగా ఉండాలని అనుకుంటారు. అందుకే బహుశా ఈ శాశ్వత అధ్యక్ష పదవిని ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు. ఇక తీర్మానాల గురించి వస్తే నవరత్నాల గురించి బాగా పోకస్ పెట్టారు. అదే సమయంలో వక్తలంతా సహజంగానే ముఖ్యమంత్రి జగన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడారు. ఇది సహజంగా అన్ని పార్టీలలో జరిగేది. సమయాభావం వల్ల అన్ని తీర్మానాలపై వక్తలు పూర్తి స్థాయిలో మాట్లాడలేకపోయారు. ఏది ఏమైనా తమ పార్టీ మహానాడు హిట్ అయిందని టిడిపి నేతలు చంకలు గుద్దుకుంటున్న సమయంలోనే వైసిపి ప్లీనరీ సూపర్ హిట్ అవడం ద్వారా ప్రజలు ఎటు వైపు ఉన్నది మరోసారి తేలిందని అనుకోవచ్చేమో! -కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
2024 తర్వాత చంద్రబాబు ఏమైపోతాడో అని భయమేస్తుంది
-
పార్టీ క్యాడర్లో కొత్త జోష్.. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ప్లీనరీ: విజయసాయిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: జూలై 8,9 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్లీనరీని సక్సెస్ చేసిన అందరికీ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 'జనసంద్రంగా ప్లీనరీ మారటం అందరూ చూశారు. పార్టీ క్యాడర్లో కొత్త జోష్ వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ప్లీనరీ జరిగింది. అణగారిన వర్గాలు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఆర్బీకేలు, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను తెచ్చాం. ఈ విషయాల్లో ప్రపంచమే మెచ్చుకుంటుంటే చంద్రబాబు భావదారిద్రంతో విమర్శలు చేస్తున్నారు. 4 లక్షల మంది ప్లీనరీ దగ్గర, 4 లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు. కానీ ఆంధ్రజ్యోతి, విగ్గురాజుకి మాత్రం జనం కనపడలేదు. ఈనాడు సైతం నిజం రాయక తప్పలేదన్నారు. చదవండి: (శభాష్ భాస్కర్!.. చెవిరెడ్డిని అభినందించిన సీఎం జగన్) బాబు ఏమవుతాడోననే భయంగా ఉంది చంద్రబాబుకి మెదడులో ఉండాల్సిన చిప్ వేలికి వచ్చింది. తరువాత కాలికి వస్తుంది. అల్జీమర్స్తో బాధ పడుతున్న బాబు 2024 తర్వాత ఏమవుతాడోననే భయంగా ఉంది. టీడీపీ మహానాడులో వైఎస్సార్సీపీని తిట్టడం, తొడ గొట్టడమే జరిగాయి. కానీ మా ప్లీనరీలో మేము ఏం చేశామో? ఇంకా ఏం చేయాలో చర్చించాం. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు జగన్ని ఎదుర్కోగలడా?. నవరత్నాలు ఎలా అమలు చేశామో ప్రజలకి తెలుసు. నవరత్నాలను విమర్శించిన వారి నవరంధ్రాలు మూసుకుపోయేలా ప్లీనరీకి జనం వచ్చారు. పవర్లో లేమనే బాధతో చంద్రబాబు ప్రస్టేషన్లోకి వెళ్లి ఒక శాడిస్టుగా మారాడు. చంద్రబాబు, ఆయన కుల మీడియా జగన్ని విమర్శించటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. జగన్ని ఎప్పుడు దించేసి చంద్రబాబును సీఎం చేద్దామా అని కుట్రలు పన్నుతున్నారు. కానీ జగన్ వెన్నుపోటుతో అధికారంలోకి రాలేదు అని విమర్శించారు. చదవండి: (నాదంటే.. నాదే: కడప టీడీపీలో రగులుతున్న చిచ్చు) వర్షం పడితే బాగుండని చంద్రబాబు అనుకున్నాడు అమరావతి అనేది ప్రపంచంలో అతి పెద్ద స్కాం. దేనికి ఎంత ఖర్చు పెట్టాడో ఇప్పటికీ లెక్క చెప్పలేదు. నెగెటివ్ భావాలతో బాధ పడుతున్న చంద్రబాబు ఇక రిటైర్ అవటమే బెటర్. చేతగాని వాళ్లు గోబెల్స్ ప్రచారాన్ని ఎన్నుకుంటారు. జగన్ ధైర్యంగా చేసిందే చెప్పుకుంటాడు. ప్లీనరీ జరగకుండా వర్షం పడితే బాగుండని చంద్రబాబు అనుకున్నాడు. అలాంటి శాడిస్టు మనస్తత్వం చంద్రబాబుదన్నారు. దినేష్ కుటుంబానికి అండగా ఉంటాం ప్లీనరీకి వచ్చిన దినేష్ చనిపోయారు. పోయిన ప్రాణం తీసుకు రాలేకపోయినా అండగా ఉంటాం, సాయం అందిస్తాం. వేమూరు ఎమ్మెల్యే, మంత్రి మేరుగ నాగార్జున పార్టీ తరపున ఐదు లక్షలు సాయం చేస్తున్నారు. ప్లీనరీకి ఆటంకం కలగకుండా పోలీసులు బాగా పని చేశారు. ప్రజాస్వామ్య బద్దంగా జగన్ని ఎన్నుకున్నాం. అంతర్గత ప్రజాస్వామ్యం లేదనటం కరెక్టు కాదు. ఏకగ్రీవంగా ప్రతి ఒక్కరూ జగన్ని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అది పబ్లిక్గానే జరిగింది' అని విజయసాయిరెడ్డి అన్నారు. -
శభాష్ భాస్కర్!.. చెవిరెడ్డిని అభినందించిన సీఎం జగన్
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాల విజయవంతానికి తనవంతు కృషి చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే, పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. రెండు రోజుల పాటు ప్లీనరీ సమావేశాల నిర్వహణలో భాగంగా ప్రభుత్వ విప్ హోదాలో చెవిరెడ్డి వారం రోజుల ముందే అక్కడికి చేరుకున్నారు. సమావేశాల నిర్వహణలో తనకున్న అనుభవం దృష్ట్యా అన్నీతానై వ్యవహరించారు. రెండో రోజు శనివారం ప్లీనరీ ప్రాంగణం చేరుకున్న సీఎంను మంత్రి పెద్దిరెడ్డితో పాటు చెవిరెడ్డి కలిశారు. ఆ సందర్భంగా ‘శభాష్.. భాస్కర్’ అంటూ చెవిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. చదవండి: (సీఎం వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు) -
మీ మద్దతుకు.. మరోసారి సెల్యూట్: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు అత్యంత ఘనంగా జరిగాయి. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలతో ప్లీనరీ ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది. ప్లీనరీ జరుగుతున్న ప్రాంతంలో జాతీయ రహదారి వెంట ఇరువైపులా దాదాపు 20 కి.మీ. మేర ఎటు చూసినా జన ప్రవాహం, బారులు తీరిన వాహనాలే కనిపించాయి. ట్రాఫిక్లో చిక్కుకుపోయిన వేలాది మంది కాలి నడకన వేదిక వద్దకు వచ్చారంటే జన ప్రవాహాన్ని ఊహించవచ్చు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉరిమే ఉత్సాహంతో వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆటోలు, ద్విచక్రవాహనాలపై చేరుకున్నారు. ప్లీనరీ సమావేశాలు విజయవంతంగా ముగియడంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా సంతోషాన్ని పంచుకున్నారు. ‘నిరంతరం-దేవుని దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల హృదయాలు.. ఇవే నాకు శాశ్వత అనుబంధాలు.. కార్యకర్తలూ అభిమానుల సముద్రంగా మారిన ప్లీనరీలో.. చెక్కు చెదరని మీ ఆత్మీయతలకు, మనందరి పార్టీకి, ప్రభుత్వానికి మీ మద్దతుకు... మీ జగన్ సెల్యూట్, మరోసారి!’ అని ట్వీట్ చేశారు. చదవండి: అమర్నాథ్ వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసులు.. సీఎం జగన్ ఆరా.. కీలక ఆదేశాలు నిరంతరం– దేవుని దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల హృదయాలు... ఇవే నాకు శాశ్వత అనుబంధాలు! కార్యకర్తలూ అభిమానుల సముద్రంగా మారిన ప్లీనరీలో... చెక్కు చెదరని మీ ఆత్మీయతలకు, మనందరి పార్టీకి, ప్రభుత్వానికి మీ మద్దతుకు... మీ జగన్ సెల్యూట్, మరోసారి! — YS Jagan Mohan Reddy (@ysjagan) July 10, 2022 -
YSRCP Plenary: జడి వానలోనూ అభిమాన ప్రవాహం
వైఎస్సార్ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ సీపీ ప్లీనరీ జరుగుతున్న ప్రాంతంలో జాతీయ రహదారి వెంట ఇరువైపులా దాదాపు 20 కి.మీ. మేర ఎటు చూసినా జన ప్రవాహం, బారులు తీరిన వాహనాలే కనిపించాయి. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలతో ప్లీనరీ ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది. సీఎం జగన్ ప్రసంగాన్ని వినేందుకు 20 కి.మీ. మేర నడిచి ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నట్లు నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం చంద్రాపల్లెకు చెందిన రంగయ్య ‘సాక్షి’కి తెలిపారు. ఆయన ఒక్కరే కాదు.. ట్రాఫిక్లో చిక్కుకుపోయిన వేలాది మంది కాలి నడకన వేదిక వద్దకు వచ్చారంటే జన ప్రవాహాన్ని ఊహించవచ్చు. కోల్కతా–చెన్నై జాతీయ రహదారిపై దక్షిణాన చిలకలూరిపేట నుంచి ఉత్తరాన విజయవాడ వరకూ కిలోమీటర్ల మేర ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ప్లీనరీ తొలి రోజైన శుక్రవారం జరిగిన ప్రతినిధుల సభకు 1.50 లక్షల మంది వస్తారని వైఎస్సార్సీపీ అగ్రనేతలు అంచనా వేయగా దాదాపు రెట్టింపు స్థాయిలో తరలివచ్చారు. రెండో రోజైన శనివారం విస్తృత స్థాయి సమావేశానికి నాలుగు లక్షల మంది రావచ్చని భావించగా అంతకు మించి హాజరయ్యారు. అంచనాలకు మించి జనం పోటెత్తడంతో పోలీసులు నియంత్రించలేకపోయారు. రెండు రోజుల పాటు జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సందర్భంగా మొత్తం పది తీర్మానాలపై సమావేశాల్లో చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. వైఎస్సార్ సీపీ జీవిత కాల జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనం మెచ్చిన పరిపాలన..: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఎన్నికల హామీల్లో 95 శాతం తొలి ఏడాదే సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా మూడేళ్లలో రూ.1.60 లక్షల కోట్లను నగదు బదిలీ రూపంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. మంత్రివర్గం నుంచి నామినేటెడ్ పదవుల వరకూ సింహభాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చి రాజ్యాధికారంలో వాటా కల్పించడం ద్వారా పాలకులుగా చేశారు. విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే చేరవేసి అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారు. తాము కాలరెగరేసుకుని తిరిగేలా సీఎం జగన్ జనరంజకంగా పాలిస్తుండటంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉరిమే ఉత్సాహంతో ప్లీనరీ విస్తృత స్థాయి సమావేశానికి కదలి వచ్చారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆటోలు, ద్విచక్రవాహనాలపై చేరుకోవడం గమనార్హం. ఉదయం 7 గంటలకే..: శుక్రవారం రాత్రి ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. శనివారం ఉదయం 7 గంటల నుంచే చిరు జల్లులు ప్రారంభమయ్యాయి. కర్ణాటక సరిహద్దున ఉన్న శ్రీసత్యసాయి జిల్లా, ఒడిశా సరిహద్దున ఉన్న శ్రీకాకుళం వరకూ 26 జిల్లాల నుంచి కదలివచ్చిన శ్రేణులు ఉదయం 7 గంటలకే ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నాయి. 11.30 గంటలకే ప్లీనరీ ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసిపోయింది. చిరు జల్లులతో ప్రారంభమైన వాన ఉద్ధృతి అంతకంతకు పెరిగినా కదలలేదు. వాన ఉద్ధృతితో పోటీ పడుతూ ఉప్పెనలా పోటెత్తారు. వర్షం జోరున కురుస్తుండటంతో సాయంత్రం 4 గంటలకు ప్రసంగించాల్సిన సీఎం వైఎస్ జగన్ మధ్యాహ్నం రెండు గంటలకే ప్రారంభించారు. ఉత్సాహపరుస్తూ దిశానిర్దేశం..: మహానేత వైఎస్సార్ 2009 సెప్టెంబరు 2న హఠాన్మరణం చెందినప్పటి నుంచి 2019లో అధికారంలోకి వచ్చే వరకూ అవమానాలను సహిస్తూ.. కష్టాలను భరిస్తూ తన వెన్నంటి నిలిచిన కార్యకర్తలు, అభిమానులకు సెల్యూట్ చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించగానే.. శ్రేణుల నుంచి విశేష స్పందన లభించింది. పార్టీ జీవిత కాల అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటన వెలువడిన అనంతరం శ్రేణుల హర్షధ్వానాల మధ్య సీఎం జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలతో పాటు తిరుపతి లోక్సభ, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో వైఎస్సార్సీపీని గెలిపించారని.. ఘోర పరాజయంతో సైకిల్ చక్రాలు ఊడిపోయాయని టీడీపీపై చెణుకులు విసిరినప్పుడు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈలలతో ప్రతిస్పందించారు. చక్రాలు లేని సైకిల్ను తొక్కలేక.. కొడుకుతో తొక్కించలేక చంద్రబాబు అరువుకు దత్తపుత్రుడిని తెచ్చుకున్నారన్న సెటైర్కు ఈలలు, కేకలతో ప్లీనరీ ప్రాంగణం ప్రతిధ్వనించింది. అర్జునులు మీరే..: ‘మన ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మంచిని జీర్ణించుకోలేక చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లతో కూడిన దుష్ట చతుష్టయం దుష్ప్రచారం చేస్తోంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇంకా ఎక్కువ చేస్తుంది. గడప గడపకూ వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరిస్తూ సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టాలి. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని ప్రజలను చైత్యన పరచండి’ అని శ్రేణులకు సీఎం జగన్ నిర్దేశించారు. ‘చంద్రబాబు కౌరవ సైన్యాన్ని ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర మీదే..’ అంటూ సీఎం జగన్ బాధ్యత అప్పగించగా.. తాము తీసుకుంటామని కార్యకర్తలు ప్రతిస్పందించారు. ‘వచ్చే ఎన్నికల్లో మనం 175కి 175 స్థానాలూ గెలవాలి. అది అసాధ్యమేమీ కాదు సుసాధ్యమే. మనం చేస్తున్న మంచితో కుప్పం ప్రజలు కూడా ఆశీర్వదించారు. పంచాయతీ ఎన్నికల్లో, మండల పరిషత్, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం. అదే రీతిలో 175 స్థానాలు గెలవాలన్నదే మన లక్ష్యం’ అని సీఎం జగన్ లక్ష్యాన్ని నిర్దేశించారు. సీఎం జగన్ ప్రసంగం ముగిశాక కూడా చాలాసేపు శ్రేణులు ప్లీనరీ ప్రాంగణం నుంచి కదల్లేదు. జాతీయ గీతాలాపన అనంతరం వెనుతిరిగాయి. గుండెల నిండా అభిమానం.. వైఎస్సార్సీపీ పట్ల కార్యకర్తల్లో ఎంత అభిమానం ఉందంటే ప్లీనరీ ముగిశాక పలువురు సీఎం జగన్ కటౌట్లను తమ వెంట భద్రంగా తీసుకెళ్లారు. ఒకవైపు కార్యకర్తలు తిరుగు ప్రయాణం కాగా మరోవైపు చాలా వాహనాలు ఇంకా ప్లీనరీకి వస్తూనే ఉన్నాయి. -
చరిత్రకెక్కిన సామాజిక విప్లవం
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని రీతిలో, ఊహకు అందని స్థాయిలో సామాజిక మహా విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని వైఎస్సార్ సీపీ ప్లీనరీలో పలువురు మంత్రులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సామాజిక సాధికారత గురించి మాట్లాడుకుంటే వైఎస్ జగన్ అధికారంలోకి రాక ముందు.. జగన్ వచ్చాక అనే తరహాలో చరిత్రలో నిలుస్తుందని చెప్పారు. శనివారం ప్లీనరీ సమావేశాల్లో సామాజిక సాధికారతపై హోంమంత్రి తానేటి వనిత ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు అగ్రవర్ణ పేదలకు సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేలు చేస్తున్నారని తెలిపారు. అంతకు మించి అవకాశాలు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాంగం ప్రసాదించిన దానికంటే అధికంగా సీఎం జగన్ అవకాశాలిచ్చారు. తొలి మంత్రివర్గంలో 60 శాతం, మలి విడత మంత్రివర్గంలో 70 శాతం పదవులను ఆయా వర్గాలకే కేటాయించారు. బలహీనవర్గాలను బలవంతులుగా తీర్చిదిద్దుతున్నారు. దళితులు దర్జాగా బతికేలా చేస్తున్నారు. ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తాం.. తోలు తీస్తాం అని చంద్రబాబు బెదిరిస్తే, టీడీపీ నేతలు మీకెందుకురా రాజకీయాలు? అంటూ ఎస్సీలను గేలి చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని చంద్రబాబు కనీసం ఆలోచన కూడా చేయలేదు. – తానేటి వనిత, హోంమంత్రి మానవత్వం చాటుకున్నారు సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన గొప్ప దార్శనికుడు ముఖ్యమంత్రి జగన్. గత మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఎంతో మేలు జరిగింది. అట్టడుగు వర్గాలను ఉద్ధరించాలంటే ఆయా వర్గాల్లోనే పుట్టాల్సిన పనిలేదు. ఏ వర్గంలో జన్మించినా సమాజం పట్ల బాధ్యత, పేదల పట్ల కరుణ, మానవత్వం ఉంటే చాలని సీఎం జగన్ నిరూపించారు. మానవత్వమే నా కులం, మాట నిలబెట్టుకోవడమే నా మతం అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఆయనే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 2014లో టీడీపీ ఇచ్చిన 200 వాగ్దానాల్లో పది శాతాన్ని కూడా అమలు చేయలేదు. సీఎం జగన్ చేసిన వాగ్దానాల్లో నూటికి 96 శాతం అమలయ్యాయి. మనుషులనే కాదు.. చివరకు దయ్యాలను కూడా చంద్రబాబు మోసం చేయగలరు. – మేరుగ నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సామాజిక విప్లవకారుడు సామాజిక సాధికారతను సీఎం జగన్ చేతల్లో చాటి చెప్పారు. బీసీలకు రాజ్యాంగ పరంగా దక్కాల్సిన వాటాకు మించి పదవులు, ఫలాలు అందించారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే బీసీలు తలెత్తుకుని నిలబడగలిగారు. దేశంలో సామాజిక విప్లవకారుడు ఒక్క వైఎస్ జగన్ మాత్రమే. ఇతర రాష్ట్రాలే కాకుండా కేంద్రానికి సైతం ఆయన పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. బీసీల ఎదుగుదల చూసి ఓర్వలేక చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారు. ఆ విష ప్రచారాన్ని గడప గడపకు వెళ్లి తిప్పికొడతాం. – చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి ఓటు వేయని వారికి కూడా.. తనకు ఓటు వేయని వారికి కూడా అర్హతే ప్రామాణికంగా మేలు చేకూర్చాలని సీఎం జగన్ ఆదేశించారు. సామాజిక న్యాయం అక్కడే మొదలైంది. సంక్షేమ ఫలాలు అందుకుంటున్న వారిలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన వారు ఎంతోమంది ఉన్నారు. మంత్రి పదవులే కాకుండా రాజ్యాంగ పదవుల్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కూర్చోబెట్టి గౌరవించిన గొప్ప నాయకుడు సీఎం జగన్. ఓ రిక్షా కార్మికుడి కుమారుడు దివంగత వైఎస్సార్ తెచ్చిన ఫీజుల పథకం వల్ల అమెరికాలోని చికాగోలో ఏడాదికి రూ.24 లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తండ్రి బాటలోనే నడుస్తూ సంక్షేమ కార్యక్రమాలతో సీఎం జగన్ సామాజిక విప్లవం తెస్తున్నారు. – కారుమూరి నాగేశ్వరరావు, పౌర సరఫరాలశాఖ మంత్రి -
మూడు రాజధానులకు మోకాలడ్డు
ఎల్లో పేపర్లు, ఎల్లో టీవీలు, ఎల్లో సోషల్ మీడియా రాసినంత మాత్రాన, చూపినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు. గట్టిగా మొరిగినంత మాత్రాన గ్రామ సింహాలు సింహాలు అయిపోవు. గ్రామ సింహాలన్నీ తమ బాబు మంచి చేశాడని చెప్పడం లేదు. ఎందుకంటే ఆయన చేసిన మంచి ఏమీ లేదు కాబట్టి. మనం ఇంటింటికీ ఈ మూడేళ్లలో చేసిన మంచిని చూపిస్తుంటే గ్రామ సింహాలు తట్టుకోలేకపోతున్నాయి. మనం బటన్ నొక్కి ప్రజలకు నేరుగా లబ్ధి కలిగిస్తుంటే.. వాళ్ల బాబుకు డిపాజిట్లు కూడా దక్కవు అనే భయంతో, దురుద్దేశంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని రోజూ అరుస్తున్నాయి. బాబు హయాంలో రాష్ట్రం ఏమైనా అమెరికా అయ్యిందా? వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి : ‘రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారికి న్యాయం జరిగేలా మూడు రాజధానులు ఇస్తామంటున్నాం. అందులో అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామన్నాం. కానీ చంద్రబాబు అండ్ కో, దుష్టచతుష్టయం కొనుగోలు చేసిన బినామీ భూముల రేట్ల కోసం అడ్డుపడుతున్నారు. ఇదీ టీడీపీకి, దుష్టచతుష్టయానికి తెలిసిన ప్రాంతీయ న్యాయం’ అని వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. శనివారం ఆయన వైఎస్సార్సీపీ ప్లీనరీ ముగింపు సమావేశంలో మాట్లాడారు. ‘రాష్ట్రంలో మూడు ప్రాంతాలు ఉన్నాయి. మూడు ప్రాంతాల ప్రజలకు ఆత్మగౌరవం ఉంది. మన రాష్ట్రంలో మరోసారి ఎలాంటి ఉద్యమాలు రాకుండా, అన్యాయం జరిగిందనే వాదనలకు అవకాశం ఇవ్వకుండా మూడు ప్రాంతాలకు న్యాయం చేస్తున్నాం. ఇలా చేస్తే బాబు అండ్ కో వారి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దెబ్బ పడుతుందని కుట్రలకు తెర లేపారు’ అన్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అంబేడ్కర్ పేరును వ్యతిరేకిస్తారా! రాష్ట్రంలో 75 ఏళ్లలో కేవలం రెండు జిల్లాలు మాత్రమే అదనంగా ఏర్పడితే.. మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 13 జిల్లాలు ఏర్పాటు చేసి.. మొత్తంగా 26 జిల్లాలను చేశాం. అందులో ఒక జిల్లాకు మన రాజ్యాంగ నిర్మాత, దళిత శిఖరం అంబేడ్కర్ పేరు పెట్టినందుకు ఏకంగా ఎస్సీ మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇళ్లను తగులబెట్టించిన దుర్మార్గం చంద్రబాబుది, ఆయన దత్తపుత్రుడిది. పగటి కలలు కంటున్నారు అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న పథకాలకు డబ్బు పుట్టేందుకు వీల్లేదని వీరంతా ఒక్కటయ్యారు. సంక్షేమ పథకాలన్నీ ఆపేయాలని తెలుగుదేశం పార్టీ గజెట్ పేపర్ ఈనాడు.. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని వక్రీకరించి చెప్పింది. అమ్మ ఒడి బూటకం, విద్యా దీవెన నాటకం అని వీటన్నింటినీ ఎత్తేసేందుకు స్కెచ్లు కూడా గీస్తున్నారు. వీళ్లను ఎవరో నమ్మినట్టుగా.. అధికారంలోకి వస్తారని పగటి కలలు కంటున్నారు. ఎన్నికలకు సన్నద్ధం కండి వార్డు, గ్రామ, మండల, నియోజకవర్గ, బూత్ కమిటీలు కూడా గడువులోగా పూర్తి చేయండి. ఎన్నికలకు సన్నద్ధం కండి. ప్రజలు ఏమైనా సమస్యలు చెబితే వెంటనే పరిష్కరించేలా పార్టీ నాయకత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటూ కార్యకర్తలు, అభిమానులు చొరవ చూపాలి. మారుతున్న మన గ్రామాన్ని చూపించండి.. వారితో కలిసి వివరించండి. సోషల్ మీడియా సైన్యాన్ని తయారు చేయాలి బూత్ కమిటీల్లో సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 50 శాతం ఉండేలా.. అందులో 50 శాతం అక్కచెల్లెమ్మలు ఉండేలా చూడండి. టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారాలు, దుష్టచతుష్టయం పన్నాగాలను తిప్పికొట్టేలా ప్రతి గ్రామంలోనూ సోషల్ మీడియా సైన్యాన్ని తయారు చేయండి. మీ భవిష్యత్ బాధ్యత నాదీ మీ తోడు, మీ అండ నన్ను ఇంతటి వాడిని చేశాయి. అలాంటి కార్యకర్తలకు ఈ రోజు ఒక్కటే చెబుతున్నా.. ఈ పార్టీ మీది. జగన్ మీ వాడు. అని జగన్ అనే నేను చెబుతున్నా.. ఈ రాష్ట్ర భవిష్యత్తుకు, కార్యకర్తల భవిష్యత్తుకు నాదీ బాధ్యత. మీ కష్టాల్లో, సుఖాల్లో పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మరింత ఆత్మవిశ్వాసంతో జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోవాలి. 175 సీట్లు సుసాధ్యమే ► ఈ దుష్టచతుష్టయం రేపు ఎన్నికల కోసం దుర్బుద్ధితో దొంగ వాగ్దానాలు చేస్తారని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ► మన కార్యకర్తలు,అభిమానులు, మన సంక్షేమ పథకాలు అందుకుంటున్న కుటుంబ సభ్యులే మన సైన్యం. ఇంటింటికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ఎలా అందిస్తున్నామో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు ఇంటింటా వివరిస్తున్నారు. ప్రతి ఇంటికి అందిన ప్రయోజనాలను లెటర్ల రూపంలో చూపిస్తున్నారు. ► ఈ కార్యక్రమంలో ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త, ప్రతి వలంటీర్ మమేకం కావాలి. మంచి చేస్తున్న జగనన్న ప్రభుత్వానికి అండగా నిలబడదామని చెప్పండి ► మీ అండదండలు, దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు 175కు 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేద్దాం. ఇది అసాధ్యం కానే కాదు. ఎందుకంటే చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం ప్రజలు కూడా మనం చేసిన మంచిని గుర్తించి స్థానిక ఎన్నికల్లో మనల్ని గెలిపించారు. -
తల్లిని మించిన స్థానం ఇంకొకటి ఉందా?
(వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి): రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు తన ఇద్దరు పిల్లలు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఎవరికీ ఇబ్బందిలేకుండా గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేసి తల్లిగా కొనసాగనున్నట్లు విజయమ్మ ప్రకటించారని మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కానీ, తల్లి విలువ తెలియని దుష్టచతుష్టయం దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఈ ప్రపంచంలో తల్లికి మించిన స్థానం ఇంకొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. రెండోరోజు వైఎస్సార్సీపీ ప్లీనరీలో ‘ఎల్లో మీడియా–దుష్టచతుష్టయం’ తీర్మానంపై జరిగిన చర్చలో ఆయనతోపాటు మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లతోపాటు మాజీమంత్రి పేర్ని నాని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 420 బ్యాచ్ రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, చంద్రబాబులకు రాజకీయ సమాధి చేసి తీరుతామని.. వారికి పిచ్చిపట్టడం ఖాయమన్నారు. ఈ క్రమంలో ‘శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం’ను అమరావతిలో ఐదు ఎకరాల్లో ఏర్పాటుచేసి అందులో వీరందరినీ చేర్పించి, అక్కడే వీరికి శాశ్వతంగా చికిత్స ఇప్పించే బాధ్యత తీసుకుంటామని వివరించారు. కొడాలి నాని ఇంకా ఏమన్నారంటే.. తల్లి విలువ తెలియని 420లు గతరెండు, మూడ్రోజులుగా విజయమ్మపై డిబేట్లు పెడుతున్నారు. జగన్ తన కుమార్తెను కలిసేందుకు స్పెషల్ ఫ్లైట్లలో వెళ్తున్నారని చంద్రబాబు మాట్లాడుతున్నాడు.. లోకేష్ అమెరికాలో ఉన్నప్పుడు నువ్వు, నీ కుటుంబ సభ్యులు అమెరికాకు నడుచుకుంటూ వెళ్లారా లేక సముద్రంలో ఈదుకుంటూ వెళ్లారా? బాబును తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు సీఎం జగన్ను రాజకీయాల నుంచి సమూలంగా తీసేయాలనే కుట్రకు తెరలేపారు. రాష్ట్రంలో పేద పిల్లలు చదవాలన్నా, పేదల సొంతింటిæ కల నెరవేరాలన్నా, వారు ఆర్థికంగా పైకి రావాలన్నా సీఎం జగన్ను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ సింహం జగన్ కుళ్లు, కుతంత్రాలు తెలియని రాజకీయ సింహం వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలో ఏ గడప ఎక్కినా, ఏ గుండె తట్టినా జగన్ జగన్ అనే నినాదమే మార్మోగుతోంది. చంద్రబాబుతో యుద్ధమైతే 5నిమిషాల్లో పూర్తి చేస్తాం.. కానీ, ఆయన వెనకున్న దుష్టచతుష్టయం రామోజీరావు, చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడులతో యుద్ధం. వీరు జగన్ నుంచి అధికారాన్ని లాక్కునేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. ఈ దుష్టచతుష్టయం నిత్యం కట్టుకథలు రాసి జగన్పై బురదజల్లుతున్నారు. వాటిని ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంకావాలి. చంద్రబాబు అధికారంలోకి రావాలని కోరుకుంటున్న ఆయన దత్తపుత్రుడికి కావాల్సింది ప్యాకేజీ మాత్రమే. మీటింగుల్లో ఆయనను సీఎం సీఎం అంటుంటే, ఆయన మాత్రం చంద్రబాబు సీఎం అంటున్నాడు. పార్టీ శ్రేణులంతా గడపగడపకు వెళ్లి జగనన్న సందేశాన్ని వినిపించాలి. – అంబటి రాంబాబు,జలవనరుల శాఖమంత్రి జగన్ అంటే తగ్గేదేలే.. సోనియా వంటి మహా నాయకురాలికే జగన్ భయపడలేదు. ఇక చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడు ఎంత? భూదేవికి ఉన్నంత సహనం జగన్కు ఉంది. జగన్ అంటే తగ్గేదేలే. నలుగురు దొంగలు, మేకపిల్ల కథలోలా మొదటి దొంగ చంద్రబాబు, రెండో దొంగ రామోజీరావు అయితే మూడో దొంగ రాధాకృష్ణ, నాలుగో పిల్లదొంగ టీవీ5 నాయుడు. తమ వాడే అధికారంలో ఉండాలి, ఆయన కూడా తమ చెప్పుచేతల్లో ఉండాలనే దుర్మార్గమైన ఆలోచన వీరిది. కానీ, మా నాయకుడు ఆ నలుగురు దొంగలకు బుద్ధిచెప్పే ధైర్యశాలి. ‘సాక్షి’ ఉద్భవానికి కేవలం ఈ దుర్మార్గుల రాక్షస క్రీడే కారణం. ప్రజలకు నిజం చెప్పడానికే ఈ పత్రిక పుట్టింది. ఆ నలుగురిది కుల ఉన్మాదం. విజయమ్మ ఎంతో హుందాగా మాట్లాడితే విషం చిమ్మారు. పవన్, చంద్రబాబు వగైరా అంతా కట్టకట్టుకుని వచ్చినా జగన్ పొట్లాం కట్టి పంపిస్తారు. కార్యకర్తలు జగన్ కోసం పనిచేయాలి. ఆయనే శాశ్వతం. జగన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. – పేర్ని నాని, మాజీమంత్రి అభివృద్ధి చూసి ఎల్లో మీడియా ఓర్వలేకపోతోంది ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఎల్లో మీడియా ఓర్వలేకపోతోంది. చంద్రబాబు, రామోజీ, ఏబీఎన్ రాధాకృష్ణ, బీఆర్ నాయుడుకి ఇక్కడ ఇళ్లు కూడా లేవు. వైఎస్సార్సీపీ సైన్యం ధాటికి 2024 ఎన్నికల్లో దుష్టచతుష్టయం పారిపోవాల్సిందే. మాట్లాడితే మమ్మల్ని పీకుతామంటున్నారు.. కానీ, ఇప్పటికే వాళ్లని ప్రజలు పీకిపాతరేశారు. చంద్రబాబు హయాంలో వీళ్లంతా గజదొంగల ముఠాలా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారు. జగన్ పాలనలో వాళ్ల అరాచకాలు, అక్రమాలకు బ్రేక్ పడడంతో తెగబాధపడుతున్నారు. అందుకే పచ్చ మీడియాలో నిత్యం అసత్య వార్తలు.. డబ్బా చానల్స్లో తప్పుడు డిబేట్లు పెడుతున్నారు. బాదుడే బాదుడని తిరుగుతున్న చంద్రబాబుకి 2024 ఎన్నికల్లో కుమ్ముడే కుమ్ముడు. – జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి -
గడపగడపలో జగన్నినాదం
(వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి) : రాష్ట్రంలో ప్రతి గడపలోనూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరే వినిపిస్తోందని, వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ తిరిగి విజయం సాధించడం.. జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయడం తథ్యమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం కోరే జగన్ ప్రభుత్వం ఉందని, అది గాంధీ కోరిన స్థానిక స్వపరిపాలన అందిస్తోందన్నారు. గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు అందులో భాగమేనన్నారు. సీఎం జగన్ సంస్కరణలు ఓ తరానికి ఆదర్శమని ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ రెండో రోజు శనివారం అశేష జనవాహిని హోరుతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘పరిపాలన వికేంద్రీకరణ–పారదర్శకత’ తీర్మానం మీద చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా స్పీకర్తోపాటు ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, మాజీమంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడారు. తమ్మినేని ఇంకా ఏమన్నారంటే.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ విషాదాన్ని దిగమింగి అనేక అవమానాలను ఎదుర్కొని తన కుమారుడిని గొప్ప ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దడం దేశ చరిత్రలో మరువలేనిది. రాష్ట్రంలో సీఎం జగన్ ప్రజల కోసం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి ఎల్లో మీడియా ఎందుకు రాయడంలేదు. అన్ని రంగాల్లో ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది. విద్యా, వైద్యానికి, సేద్యానికి పేదరికం అడ్డంకి కాకూడదని, పల్లెలకు కూడా అభివృద్ధి చేరాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటే అవి ఎల్లో మీడియాకు కనిపించడంలేదా? అవి పచ్చ పత్రికలు కాదు.. పక్షపాత పత్రికలు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో వీటికి తెలియదు. గడప గడపకూ తిరుగుతున్న మాకు ప్రజల మనస్సు తెలుసు, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం.. జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయడం, టీడీపీ భూస్థాపితం కావడం ఖాయం. ధర్మాన్ని కాపాడుతున్న సీఎం జగన్ను ఆ ధర్మమే కాపాడుతుంది. ఆయన లేకపోతే ఈ రాష్ట్రంలో సంస్కరణలు, వికేంద్రీకరణ ఆగిపోతాయి. అసమానత్వం తొలగాలి.. పేదరికం పోవాలి.. ఇది జరగాలంటే జగన్ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాలించాలి. అంబేడ్కర్ ఆలోచనలను అమలుచేస్తున్న జగన్ అధికారం అంటే తాను మాత్రమే ఎదగడం, తన వర్గం వారు మాత్రమే బాగుపడడం అనుకునే స్వార్థపరుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆయన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా మోసాలు, అబద్ధాలతోనే కాలం గడిపారు. టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు మేలు జరిగిందేలేదు. కానీ, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆలోచనలను అమలుచేస్తున్న నాయకుడు జగన్. – కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే, రైల్వేకోడూరు ఈ విజయం సీఎం జగన్, కార్యకర్తలదే – పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నా.. సమైక్య పోరాటంతో అధికారంలోకి వచ్చిన గొప్ప చరిత్ర వైఎస్సార్సీపీది. మనం 13 ఏళ్లలో సాధించిన ఘనత మరే పార్టీకి లేదు. ఈ విజయానికి కారణం ఒకరు సీఎం వైఎస్ జగన్ అయితే.. మరొకరు పార్టీ కార్యకర్తలు. ఈ ప్లీనరీ జగన్ సైనికులకు పెద్ద పండగలాంటిది. దేశంలో సంక్షేమ ప్రభుత్వం ఎలా ఉండాలో 2004, 2009లో వైఎస్సార్ పరిచయం చేశారు. పారదర్శకత కోసం కృషిచేసిన గొప్ప నాయకుడు ఆయన. వైఎస్సార్ సంకల్పాన్ని, ఆశయాలను సీఎం జగన్ నిజంచేసి చూపిస్తున్నారు. రాష్ట్రంలో పారదర్శక పాలన సాగుతోంది. గ్రామ, వార్డు సచివాలయాలే నిదర్శనం. అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పరిపాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి – నందిగం సురేష్, ఎంపీ, బాపట్ల రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా చంద్రబాబుకు అనవసరం. ఆయన, ఆయన వర్గం బాగుపడితే చాలనుకునే స్వార్థపరుడు. రాజధాని పేరుతో రైతుల పంటలను తగులబెట్టించి దుర్మార్గానికి పాల్పడ్డాడు. అధికారంలోకి రాగానే నూజివీడులో రాజధాని అని చెప్పి గుట్టుచప్పుడు కాకుండా కారుచౌకగా తుళ్లూరులో తన వర్గీయులతో భూములు కొనిపించి తర్వాత పేదల భూములను బలవంతంగా లాక్కొన్నాడు. ఏడాదికి మూడు పంటలు పండే భూములు ఇవ్వలేమని రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే చంద్రబాబు కుట్రలతో పంటలు తగలబెట్టించాడు. అభివృద్ధి అనేది ఒకేచోట కేంద్రీకృతం కారాదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలనా వికేంద్రీకరణ జరగాలి. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం మరోసారి జరగకూడదంటే మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరగాలి. -
కిక్కిరిసిన ఫుడ్ కోర్టులు
(వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి): వైఎస్సార్సీపీ ప్లీనరీకి హాజరైన వారితో అక్కడ ఏర్పాటు చేసిన 250 ఫుడ్కోర్టులు కిటకిటలాడాయి. రెండోరోజు ఉ.7 గంటల నుంచి అల్పాహారం అందించారు. సా.4 గంటలకే ప్లీనరీ ముగిసినా రాత్రి 7 గంటల వరకు ఫుడ్కోర్టులలో రద్దీ కొనసాగింది. దూర ప్రయాణాలు చేసేవారు డిన్నర్ కూడా చేసి బయల్దేరారు. రెండ్రోజులూ ఏ చిన్న అవాంతరమూ లేకుండా పసందైన వంటకాలు అందించడంపై సీఎం వైఎస్ జగన్, పార్టీ సీనియర్ నాయకులు వి.విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు తమ టీమ్ను ప్రత్యేకంగా అభినందించారని ఫుడ్ కమిటీ కన్వీనర్ డా. చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు. చెవిరెడ్డిని అభినందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఎంపీ విజయసాయిరెడ్డి ప్లీనరీకి ముందురోజు నుంచి ముగిసేవరకు 3,400 మంది కేటరింగ్ వర్కర్లు రేయింబవళ్లు పనిచేశారని చెవిరెడ్డి వివరించారు. చివరిరోజైన శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు 12 గంటల పాటు ఆహారాన్ని అందించామన్నారు. ఇక సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కార్యకర్త నుంచి మంత్రుల వరకు అందరికీ ఒకే మెనూను అమలుచేశామని.. మొత్తం 25 రకాల వంటకాలను వడ్డించామని ఆయన తెలిపారు. మొదటిరోజు 2 లక్షల మంది వరకు భోజనం అందించామని, రెండోరోజు దాదాపు 3.5 నుంచి 4 లక్షల మంది భోజనం చేశారని చెవిరెడ్డి తెలిపారు. -
వైఎస్సార్సీపీ జీవిత కాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవిత కాల జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికయ్యారు. లక్షలాది మంది పార్టీ కార్యకర్తల కరతాళధ్వనుల మధ్య ప్లీనరీ రెండో రోజు శనివారం పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. మొదటి రోజు నిర్వహించిన పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికలో వైఎస్ జగన్ తరఫున 22 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇతరులెవరూ నామినేషన్లు వేయలేదు. దాంతో పార్టీ జీవిత కాల జాతీయ అధ్యక్షునిగా వైఎస్ జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వేదిక మీద ఉన్న నాయకులంతా సీఎం వైఎస్ జగన్ను అభినందనలతో ముంచెత్తగా.. ఆయన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. పార్టీ రాజ్యాంగానికి ప్లీనరీలో పలు సవరణలు చేశారు. ఈ సవరణల ప్రతిపాదనలకు కార్యకర్తలు హర్షాతిరేకాలతో ఆమోదం తెలిపారు. ‘ఆర్టికల్ ఒకటి ప్రకారం యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా లేదా వైఎస్సార్సీపీగా గుర్తించవచ్చు’ అన్న సవరణకు ఆమోదం తెలిపారు. ఆర్టికల్ 8,9 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం.. పార్టీ అధ్యక్షులు జీవిత కాల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని చేసిన మరో సవరణకు ఆమోదం తెలిపారు. 10 తీర్మానాలకు ఆమోదం రెండు రోజులపాటు జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాల్లో మొత్తం పది తీర్మానాలకు ఆమోదం తెలిపారు. తొలి రోజు మహిళా సాధికారత–దిశ చట్టం, విద్యా రంగం, నవరత్నాలు–డీబీటీ, వైద్య ఆరోగ్యంపై తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు. రెండోరోజు పరిపాలనా వికేంద్రీకరణ–పారదర్శకత, సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు–ప్రోత్సాహకాలు, ఎల్లో మీడియా దుష్ట చతుష్టయం, పార్టీ రాజ్యాంగ సవరణ తీర్మానాలపై చర్చించి ఆమోదించారు. -
వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించాం
ఎన్నికలకు ముందు ఏటా రూ.12,500 చొప్పున రైతు భరోసా కింద ఐదేళ్లలో రూ.50 వేలు ఇస్తామన్నాం. కానీ ఇచ్చిన మాటకంటే మిన్నగా రూ.13,500 చొప్పున ఐదేళ్లు ఇస్తున్నాం. ఇప్పటి వరకు 52.35 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.23,875.29 కోట్ల సాయం అందించాం. సున్నా వడ్డీ పంట రుణాలిస్తున్నాం. క్రమం తప్పకుండా రుణాలు చెల్లించిన రైతులకు వడ్డీరాయితీ ఇస్తున్నాం. టీడీపీ హయాంలో చెల్లించాల్సిన బకాయిలతో కలిపి రూ.1,282 కోట్ల వడ్డీ రాయితీ అందించాం. వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలుగా అండదండలందిస్తూ, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ రెండో రోజు వ్యవసాయంపై ప్రవేశపెట్టిన తీర్మానంపై మంత్రి మాట్లాడారు. ‘రైతునని చెప్పుకునే చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్’ వేరు శనగ ఎలా కోయాలంటే నిచ్చెన ఎక్కి కొయ్యాలన్నారు. వంకాయ పప్పు ఎలా వండాలో రూ. 20 వేలు ఖర్చు చేసి నేర్చుకున్నాడు లోకేష్. అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు రైతులను పట్టించుకోలేదు. వీరు ముగ్గురూ ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడటం సిగ్గుచేటు. వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలంటూ చంద్రబాబు హేళన చేశారు. విద్యుత్ బకాయిల కోసం ఆందోళన చేసిన రైతులను పిట్టల్లా కాల్చి చంపారు. రైతులపై అక్రమంగా కేసులు బనాయించారు. అదే చంద్రబాబు ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారు.’ అని ధ్వజమెత్తారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టింది మొదలు గడిచిన మూడేళ్లుగా ప్రతి విషయంలోనూ రైతుకు అండగా నిలిచాం. చేయిపట్టి నడిపిస్తున్నాం. సీఎం జగన్ వ్యవసాయ రంగ చరిత్రను తిరగారాస్తున్నారు. అందుకే నిండు నూరేళ్లూ ఆయనే సీఎంగా ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. పాలకుడు మంచి వాడైతే ప్రకృతి సహకరిస్తుందని మూడేళ్లుగా చూస్తున్నాం. కరువు తీరా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. సంపూర్ణంగా సాగు నీరు అందిస్తున్నాం. లక్ష్యానికి మించి పంటలు పండుతున్నాయి. జగనన్న పాలనలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు’ అని మంత్రి కాకాణి తెలిపారు. ఏపీలో వ్యవసాయాభివృద్ధిపై మంత్రి చెప్పిన అంశాలు.. ► పైసా భారం పడకుండా పంటల బీమా అందిస్తున్నాం. చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలతో కలిపి ఇప్పటి వరకు రూ.6,684.84 కోట్ల బీమా అందించాం. గత ఖరీఫ్కు సంబంధించి రికార్డు స్థాయిలో రూ.2,977.82 కోట్ల బీమా సొమ్ము జమ చేశాం. ► సీజన్ ముగియకుండానే పెట్టుబడి రాయితీ ఇస్తున్నాం. పాత బకాయిలతో కలిపి రూ.1,612.80 కోట్లు ఇచ్చాం. ► ఇలా వివిధ పథకాల ద్వారా మూడేళ్లలో రైతులకు రూ.1.10 లక్షల కోట్లు నేరుగా లబ్ధి చేకూర్చాం. ► రైతుల కోసం గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకేలు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాయి. ► నాణ్యమైన ఇన్పుట్స్ అందించేందుకు నియోజకవర్గ స్థాయిలో అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేశాం. గ్రామ స్థాయిలో అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పరికరాలు అందిస్తున్నాం. ఇటీవలే సీఎం 3,800 ట్రాక్టర్లు, 320 హార్వెస్టర్లు అందించారు. గతంలో రైతురథాల పేరిట దోపిడి జరిగింది. ఏ కంపెనీ వద్ద ఏ మోడల్ ట్రాక్టర్ కొనాలో ప్రభుత్వ పెద్దలే నిర్ణయించేవారు. మార్కెట్ రేటుకంటే ఎక్కువ రేటుతో కొనాల్సి వచ్చేది. ఆ సొమ్ము టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లేది. కానీ నేడు 175 మోడల్స్ రైతుల ముందుంచాం. కోరుకున్న కంపెనీ నుంచి కోరుకున్న మోడల్ ట్రాక్టర్ కొనుగోలుచేసే అవకాశం కల్పించాం. -
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: గత మూడేళ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా ఉండగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చారని మండిపడ్డారు. ‘ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే ఆరోగ్యశ్రీ పేషంట్లు భయపడే పరిస్థితి ఉండేది. నెట్వర్క్ ఆస్పత్రులకు నెలల తరబడి బిల్లులు పెండింగ్లో ఉండేవి. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో డాక్టర్లు ఉండేవారు కాదు. వసతులు కూడా లేవు. సెల్ఫోన్ లైట్లతో ఆపరేషన్లు చేసేవారు. ఆస్పత్రిలో పిల్లలను ఎలుకలు కొరికిన సంఘటనలు. 108, 104 వాహనాల సంగతి పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే ఈ మూడేళ్లలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటికి ఇప్పటికీ తేడా గమనించండి’ అని కోరారు. ఈ మూడేళ్లలో నాడు–నేడుతో మొత్తంగా గవర్నమెంట్ ఆస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నామని, కొత్తగా 16 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నామని చెప్పారు. ‘ఆరోగ్యశ్రీ పరిధిని 1,000 రోగాల నుంచి ఏకంగా 2,466 రోగాలకు పెంచాం. మండలానికి రెండు పీహెచ్సీలు, గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు దిశగా అడుగులు వేస్తున్నాం. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వైద్య, ఆరోగ్య రంగం మీద చేసిన ఖర్చు కేవలం రూ.7,464 కోట్లు మాత్రమే. మనందరి ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలోనే రూ.30 వేల కోట్లు ఖర్చు చేసింది’ అని వివరించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్లీనరీ రెండో రోజు భారీ సంఖ్యలో హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులు అన్నదాతను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వమిది ► చంద్రబాబు 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి.. చివరకు రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వకుండా దిగిపోయారు. సున్నా వడ్డీ ఎగ్గొట్టారు. ఇన్పుట్ సబ్సిడీ, కరెంటు, విత్తనాలు, ధాన్యం కొనుగోలులో కూడా బకాయిలు పెట్టివెళ్లారు. బీమాలో బకాయిలు పెట్టారు. ► అప్పట్లో ఎన్నికలప్పుడు మీకు గుర్తుందా? ప్రతి ఇంటికీ వెళ్లండి.. రెండు నెలలు ఓపిక పట్టండి.. జగనన్న వస్తున్నాడు.. రైతు భరోసా కింద సంవత్సరానికి రూ.13,500 మీ చేతుల్లో పెడతాడని చెప్పమని చెప్పాను. మన ప్రభుత్వం వచ్చిన ఈ మూడేళ్లలో కేవలం రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు ఖర్చు చేశాం. దాదాపు 50 లక్షల పైచిలుకు కుటుంబాలకు మేలు జరుగుతోంది. ► ఈ మూడేళ్లలో ఉచిత విద్యుత్ మీద ఏకంగా 27 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. పంటల బీమాగా ఇచ్చింది మరో 6,684 కోట్ల రూపాయలు. ధాన్యం కొనుగోలు మీద 45 వేల కోట్ల రూపాయలు. ఇతర పంటల కొనుగోలు మీద 7 వేల కోట్ల రూపాయలు. గత ప్రభుత్వ కరెంటు బకాయిలు కూడా 9 వేల కోట్ల రూపాయిలు మన ప్రభుత్వమే చెల్లించింది. విత్తన బకాయిలు 385 కోట్ల రూపాయలు, ధాన్యం సేకరించిన బకాయిలు 960 కోట్ల రూపాయలు... ఇవన్నీ మనందరి ప్రభుత్వం చిరునవ్వుతో కట్టింది. ► రైతును గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం కాబట్టే గ్రామ స్థాయిలో ఆర్బీకేలు స్థాపించాం. విత్తనం దగ్గర్నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి అడుగులోనూ రైతన్నలకు సూచనలు, సలహాలు ఇస్తూ తోడుగా నిలబడుతున్నాం. ఈ మూడేళ్లలో వ్యవసాయ రంగం మీద రూ.1.27 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ఈ రోజు పామాయిల్ రేట్లు ఏకంగా టన్నుకు రూ.22 వేలు ఇక్కడ కనిపిస్తోంది. గతంలో తెలంగాణలో మాత్రమే మంచి రేటు ఉండేదని పశ్చిమ గోదావరి జిల్లా రైతులు వాపోయేవారు. లక్షాధికారులుగా మన అక్కచెల్లెమ్మలు ► ఈ మూడేళ్ల పాలనలో ఒక్క జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా 44.49 లక్షల మంది తల్లులకు మేలు చేస్తూ రూ.19,617 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆసరా ద్వారా ఇప్పటికే 78.74 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు సగం డబ్బు రూ.12,758 కోట్లు ఇచ్చాం. ► వైఎస్సార్ చేయూత ద్వారా 25 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు అందించిన సొమ్ము రూ.9,180 కోట్లు. ప్రతి అక్కకు రూ.18,750 చొప్పున రెండు దఫాల్లో రూ.37,500 అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. వారి పేరుతోనే 31 లక్షల ఇంటి పట్టాలు ఇచ్చాం. ఇప్పటికే దాదాపు 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే.. ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆస్తి పెట్టినట్టు అవుతుంది. ► అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు దిశ చట్టాన్ని తీసుకువచ్చాం. 1.20 కోట్ల మంది అక్కచెల్లెమ్మలు వారి ఫోన్లలో దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆపదలో ఉన్నప్పుడు ఐదుసార్లు ఫోన్ను షేక్ చేసినా.. ఎస్ఓఎస్ బటన్ నొక్కినా పది నిమిషాల్లో పోలీసులు వస్తున్నారు. ఈలోగా ఫోన్ చేసి ఏమైందని ఆరా తీస్తున్నారు. ► దిశా పోలీస్ స్టేషన్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రతి రెండు వేల జనాభాకు గ్రామ సచివాలయంలో మహిళా పోలీసులను ఏర్పాటు చేశాం. ఇవన్నీ చంద్రబాబు పాలనలో ఏనాడైనా చూశామా? పైపెచ్చు పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలు రూ.14,205 కోట్ల రుణాలను మొదటి సంతకంతో మాఫీ చేస్తానని చంద్రబాబు ఎగ్గొట్టారు. సున్నావడ్డీని కూడా రద్దు చేసిన పాపానికి ఏ, బి, గ్రేడులో ఉన్న ఆ అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు సీ, డీ గ్రేడ్లకు పడిపోయాయి. ఆ తర్వాత చాలా సంఘాలు ఎన్పీఏలకు దిగజారిపోయాయి. చేతల్లో సామాజిక న్యాయం చూపించాం ► చంద్రబాబు దృష్టిలో సామాజిక న్యాయం అంటే ఎన్నికల సమయంలో వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం. మన సిద్ధాంతానికి, చంద్రబాబు సిద్ధాంతానికి తేడా చూడండి. మన ప్రభుత్వం తొలి కేబినెట్లో, రెండో క్యాబినెట్లో ఐదుగురు చొప్పున ఉప ముఖ్యమంత్రులు ఉంటే.. అందులో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలేనని సగర్వంగా తెలియజేస్తున్నాను. ► శాసనసభ స్పీకర్గా కూడా బీసీ ఉన్నారు. శాసనమండలి చైర్మన్గా ఎస్సీ, డిప్యూటీ చైర్మన్గా మైనార్టీ మహిళ ఉన్నారు. మండలిలో మన పార్టీ 32 మంది ఎమ్మెల్సీలను నియమిస్తే వారిలో 18 మంది ఎమ్మెల్సీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. మనం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన రాజ్యసభ సభ్యులు ఎనిమిది మందిలో నలుగురు బీసీలే. ► నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇవ్వాలని ఏకంగా చట్టం చేశాం. అందులో సగం మహిళలకే ఇవ్వాలని చట్టంలో చెప్పాం. తొలిసారిగా శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేశాం. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మనది. వివక్ష లేకుండా, లంచాలకు తావులేకుండా ప్రతి అక్క, చెల్లెమ్మకు, ప్రతి పేద కుటుంబానికి మంచి చేసేందుకు బటన్ నొక్కి నేరుగా ట్రాన్స్ఫర్ చేసింది అక్షరాల రూ.1.63 లక్షల కోట్లు. అలా లబ్ధి పొందిన వారిలో దాదాపు 80% నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలు ఉన్నారు. చంద్రబాబు హేళన చేస్తే.. మనం అందలం ఎక్కిస్తున్నాం ► బాబు హయాంలో సామాజిక న్యాయం అంటే.. ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అవహేళన చేసిన రోజులు. బీసీల తోకలు కత్తిరిస్తా అని అపహాస్యం చేసిన రోజులు. ఎస్టీలకు, మైనార్టీలకు కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ► ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ అనే రాజ్యాంగ బద్ధ సంస్థను ఏర్పాటు చేయని పాలన చంద్రబాబు హయాంలో ఉండేది. ఈ రోజు అందుకు భిన్నంగా ఈ వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులతో పాటు, ఏఎంసీలు, ఆలయ బోర్డుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పించి మొత్తం మంత్రి మండలిలో 70 శాతం పదవులు ఇచ్చాం. ► పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు రకరకాలుగా కోర్టుల్లో కేసులు వేశారు. అమరావతిలో 54 వేల ఇళ్లు పేద అక్కచెల్లెమ్మలకు ఇస్తుంటే అడ్డుకున్నారు. అమరావతిలో ఇళ్లు ఇస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని నిస్సిగ్గుగా కోర్టులో కేసులు వేసిన చరిత్ర చంద్రబాబుది. బృహత్తర యజ్ఞంగా అక్కచెల్లెమ్మలకు ఇళ్లు కట్టించే కార్యక్రమం మీ ప్రభుత్వం చేస్తోంది. లంచాలు లేవు.. వివక్షా లేదు ► చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడూ ఇదే బడ్జెట్. మరి అప్పుడు వారు ఎందుకు చేయలేకపోయారు.. ఇప్పుడు మీ జగన్ ఎలా చేయగలుగుతున్నాడని ఆలోచించండి. అప్పట్లో చంద్రబాబు మీ అన్న జగన్ కంటే ఎక్కువగానే అప్పులు చేశారు. ► అయినా వారు ఎందుకు చేయలేకపోయారంటే.. ఇప్పుడు మీ జగన్ బటన్ నొక్కుతున్నాడు.. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.. నేరుగా అక్కచెల్లెమ్మల అకౌంట్లోకి డబ్బులు వెళ్తున్నాయి. చంద్రబాబు హయాంలో బటన్లు లేవు, నొక్కేది లేదు.. డబ్బులు నేరుగా దోచుకో.. పంచుకో పద్థతి ఉండేది. డబ్బులో ఇంత ఈనాడుకు, ఇంత ఆంధ్రజ్యోతికి, ఇంత టీవీ5కు, ఇంత తన దత్తపుత్రుడికి, మిగిలిందంతా తనకు అన్నట్టుగా ఉండేది. ఈ తేడాను గమనించండి. చెత్తబుట్టలో చంద్రబాబు మేనిఫెస్టో ► చంద్రబాబు వాగ్దానం చేసిన మేనిఫెస్టో చెత్తబుట్టకు పరిమితమైంది. వాళ్ల వెబ్సైట్లో కూడా మేనిఫెస్టో కనిపించకుండా తీసేశారు. ఏకంగా 650 వాగ్దానాలు చేసి.. 10% కూడా అమలు చేయని అధ్వాన్న పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు. ► మన ప్రభుత్వం వచ్చి ఇప్పటికి మూడేళ్లు అవుతోంది. ఇంటింటికీ వెళ్లి ఇదిగో మా పార్టీ మేనిఫెస్టో.. మూడేళ్లలో అక్షరాల 95 శాతం అమలు చేశాం..అని మన ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. మీకు ప్రభుత్వ పథకాలు అందితేనే.. మీకు జగనన్న న్యాయం చేశాడని నమ్మితేనే వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించండి.. జగనన్నకు తోడుగా నిలవండి అని చెబుతున్న నిబద్ధత మనది. -
CM YS Jagan: మీరే నా సైన్యం
మనకు అసత్యాలు ప్రచారం చేయడం రాదు. వెన్నుపోట్ల ద్వారా అధికారంలోకి రావడం అంతకంటే రాదు. ఆ చరిత్ర మనకు లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు ఎవరూ మనకు లేరు. మనకు ఉన్నదల్లా నీతి, నిజాయితీ. మాటకు ప్రాణం ఇచ్చే గుణం. నిబద్ధతతో పనిచేసే ఆలోచనలు. ప్రజలకు మేలు చేయాలనే తపన. అయినా దుష్టచతుష్టయం ప్రతి రోజూ అసత్యాలు ప్రచారం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో నాకున్న గుండె ధైర్యం మీరే. రెండు సిద్ధాంతాలు, భావాల మధ్య మనకు, వాళ్లకు జరుగుతున్న యుద్ధమిది. ఈ యుద్ధంలో న్యాయాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఈ పార్టీ మీది. జగన్ మీ వాడు. ‘సంక్షేమం, అభివృద్ధి పథకాలన్నీ ఆగిపోవాలి.. వారి బాబు మాత్రమే సీఎం కుర్చీలో కూర్చోవాలన్నది దుష్టచతుష్టయం, వారి దత్తపుత్రుడితో కూడిన గజ దొంగల ముఠా లక్ష్యం. అప్పుడు చంద్రబాబు ఈనాడు కానుక, బాబు ఏబీఎన్ దీవెన, నారా టీవీ5 భరోసా.. లాంటి పథకాలు తీసుకొచ్చి, గతంలోలాగా దోచుకో.. పంచుకో అన్నదే ఆచరిస్తారు. ఇప్పుడు అది ఆగిందనే వీరికి కడుపు మంట. అందుకే దుష్ప్రచారం. ఈ దొంగల ముఠాతో తస్మాత్ జాగ్రత్త’ అని ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: ‘రాష్ట్రంలో యుద్ధం మొదలైంది. పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుండడం ఒకవైపు, ఆ మేలు జరగకుండా ఆపాలనుకుంటున్న వారు మరోవైపు.. ఈ యుద్ధంలో మీరే నా సైన్యం.. కౌరవ సైన్యాన్ని ఓడించడంలో అర్జునుడి పాత్ర మీదే. న్యాయాన్ని ఎలా నిలబెడతారన్నది మీ చేతుల్లోనే ఉంది’ అని వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పేదలకు, దిగువ మధ్య తరగతి వర్గాలకు న్యాయం చేయడానికి వీల్లేదని టీడీపీ, దుష్టచతుష్టయం ఎలా వాదిస్తున్నాయో.. ఎంత నిస్సిగ్గుగా ప్రయత్నం చేస్తున్నాయో గమనించాలని కోరారు. విజయవాడ– గుంటూరు రహదారిని ఆనుకుని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీ రెండవ రోజు శనివారం ఆయన ముగింపు సమావేశంలో భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. దుష్టచతుష్టయం.. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీరి దత్తపుత్రుడితో కూడిన గజ దొంగల ముఠా నుంచి మనందరి ప్రభుత్వాన్ని రక్షించుకోవాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను, మన రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులు, లబ్ధిదారులపై ఉందని చెప్పారు. చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా వేసినట్లేనని ప్రజలందరికీ వివరించాలని స్పష్టం చేశారు. ఈ మూడేళ్లలోనే 95 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చి, రాష్ట్రంలో 85 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలను అందిస్తున్నందున రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలు గెలుచుకోవడమే మనందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ లక్ష్యం సుసాధ్యమేనని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యకర్తలే తన ధైర్యం.. స్థైర్యం అని.. రాష్ట్ర భవిష్యత్, కార్యకర్తల భవిష్యత్ బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అభిమాన సముద్రం.. ఆత్మీయ సునామీ ► విజయవాడ–గుంటూరు మధ్య ఈ రోజు ఒక మహా సముద్రం కనిపిస్తోంది. కనుచూపు మేరలో ఎక్కడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. వర్షం పడుతున్నప్పటికీ ఏ ఒక్కరూ చెక్కుచెదరలేదు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల మహాసముద్రం కనిపిస్తుంది. ఇది ఆత్మీయుల సునామీ. దశాబ్దం పాటు కష్టాలు భరించి, అవమానాలు సహించి, త్యాగాలు చేసిన సైన్యం ఇక్కడుంది. ► మన పార్టీ భావాలను, విధానాలను, బాధ్యతలను ఎంతో అభిమానంతో భుజాల మీద మోస్తున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ఈ మహాసైన్యానికి నిండుమనసుతో సెల్యూట్ చేస్తున్నాను. 13 ఏళ్లుగా నాపై అభిమానం చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. ఒక్కడితో ప్రారంభమైన ప్రయాణం.. ► ఈ 13 ఏళ్ల మన ప్రయాణాన్ని క్లుప్తంగా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే.. 2009 సెప్టెంబర్ 2న దివంగత నేత, మన ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి అనూహ్యంగా మరణించడంతో ఇక తమకు ఎవరు దిక్కన్న భావనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 700 మందికి పైగా మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వీల్లేదన్న పార్టీని ఎదురించినందుకు అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ రెండూ కలిసి నాపై కేసులు వేశాయి. ► దేశంలో శక్తివంతమైన వ్యవస్థలను ఉసిగొల్పారు. అన్యాయమైన ఆరోపణలు, అరెస్టు సైతం చేయించడానికి వెనకడుగు వేయలేదు. అలాంటి బెదిరింపులకు జగన్ లొంగే వ్యక్తే అయితే.. ఈరోజు మీ జగన్.. మీ ముందు ఇలా ఉండేవాడే కాదు. ఆరోజు నన్ను టార్గెట్ చేసిన మనుషులు ఒకటి అనుకుంటే.. దేవుడి స్క్రిప్టు మరోలా రాశాడు. మరి ఈ రోజున ఆ పార్టీల పరిస్థితి ఏంటి? మన పార్టీ పరిస్థితి ఏంటి?.. అన్నది చూడండి. ► ఆ రోజున చట్టసభల్లో మన సంఖ్యా బలం కేవలం రెండు. నేను ఎంపీగా, అమ్మ ఎమ్మెల్యేగా.. అది కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రయాణం ప్రారంభించాం. ఒకటితో ప్రారంభమైన ఎమ్మెల్యేల ప్రయాణం ఈ రోజు 151కి చేరింది. ఒక్కడితో ప్రారంభమైన ఎంపీల ప్రయాణం.. ఈ రోజు లోక్సభలో 22కు చేరింది. ఇక రాజ్యసభ సభ్యుల సంఖ్య సరేసరి. అన్యాయంగా అరెస్టు చేయించిన ఆ పార్టీకి ఈ రాష్ట్రంలో నామరూపాలు కూడా లేకుండా చేశారు ప్రజలు, దేవుడు. దేవుడి స్క్రిప్ట్ గొప్పగా రాశాడు ► 2014 ఎన్నికల్లో 45 శాతం ఓట్లు వచ్చి.. కేవలం 1 శాతం ఓట్ల తేడాతో శాసనసభలో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అప్పుడు కూడా జగన్కు ఊపిరాడనివ్వకూడదని మళ్లీ కుట్రలు చేశారు. మనకున్న 67 మంది ఎమ్మెల్యేల్లో 23 మంది ఎమ్మెల్యేలను, 9 మంది ఎంపీల్లో ముగ్గురు ఎంపీలను సంతలో పశువుల మాదిరిగా కొన్నారు. పార్టీ నిర్వీర్యం అయిపోవాలి.. జగన్ కనపడకుండా పోవాలని కుయుక్తులు, కుతంత్రాలు చేశారు. ► కానీ, దేవుడు మరోలా స్క్రిప్టు రాశాడు. మన దగ్గర నుంచి అన్యాయంగా ఏ పార్టీ అయితే 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసిందో.. అదే పార్టీకి మళ్లీ 2019 ఎన్నికల్లో వచ్చింది సరిగ్గా 23 ఎమ్మెల్యే స్థానాలు.. 3 ఎంపీ స్థానాలు. దేవుడు స్క్రిప్టు చాలా గొప్పగా రాస్తాడు. అది కూడా మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎప్పటికైనా కూడా మంచే గెలుస్తుందనేందుకు ఇదే నిదర్శనం. మంచి చేయడంపైనే నా ఫోకస్ ► గత ప్రభుత్వం మాదిరిగా ఎమ్మెల్యేలను కొనాలని, ఆ పార్టీని నిర్వీర్యం చేయాలనే ఆలోచనలు నేను ఎప్పుడూ చేయలేదు. నా ఫోకస్ ప్రతిపక్షం మీద పెట్టలేదు. ఎంత మంచి చేస్తాం.. ఎలాంటి పాలన అందించగలుగుతామనే అంశంపై దృష్టి పెట్టాను. ఒక పేద కుటుంబం, ఒక రైతు కుటుంబం, ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో ఉండే సభ్యులు, వారి అవసరాలు.. అణగారిన సామాజిక వర్గాలకు ఆర్థికంగా, అధికారంలో వాటాపరంగా రెండు అంశాల్లో న్యాయం చేయడం. అవ్వాతాతలకు, అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు న్యాయం చేయడం.. ఇలాంటి అంశాల మీదనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ► నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఏ మాటలు చెప్పానో.. ఆ మాటలను అమలు చేయడంపైనే దృష్టి పెట్టాను. క్యారెక్టర్, క్రెడిబిలిటీయే మన పార్టీ ఫిలాసఫీ. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. ఐదు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించాం. ఏడాదిలో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం. ► అంతకు ముందు ప్రభుత్వం గ్రామాలను దోచుకోడానికి జన్మభూమి కమిటీలు పెడితే.. మనందరి ప్రభుత్వం గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తూ దేశ పరిపాలన చరిత్రలోనే గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టింది. ఈ రోజు వలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ స్థానిక పరిపాలనలో గొప్ప విప్లవాత్మక మార్పు తీసుకువస్తున్నాయి. మరింత పారదర్శకంగా, మరింత మెరుగ్గా పాలనను అందించేందుకు, పర్యవేక్షించేందుకు జిల్లాల పునర్ విభజన చేశాం. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త పోలీస్ డివిజన్లు ఏర్పాటు చేశాం. చిప్ మైండ్లో, గుండెలో ఉండాలి ► 44 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం ఉన్నాయని ఢంకా భజాయించుకొని కొంతమంది చెప్పుకుంటుంటారు. నేను అడుగుతున్నా.. ఏ రోజు అయినా ఇలాంటి విప్లవాత్మక ఆలోచన వచ్చిందా ? ఎందుకంటే ప్రజల కష్టాలు, వారి బాగోగుల గురించి అర్థం చేసుకొని ఆలోచించే చిప్ మైండ్లోనూ, గుండెలోనూ ఉండాలి. ► ఈ మధ్య చంద్రబాబు ఒక రింగ్ను చూపించి ఆ రింగ్లో చిప్ ఉందని చెబుతున్నారు. చంద్రబాబు మాదిరిగా వేలి ఉంగరంలోనో, మోకాళ్లలోనో, పాదాల్లోనో చిప్ ఉంటే లాభం లేదు. చిప్ ఉండాల్సింది మెదడులో, గుండెలో. అప్పుడే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలు వస్తాయని చంద్రబాబుకు తెలియజేస్తున్నా. దోచుకోవడం..పంచుకోవడమే చంద్రబాబు రాజకీయం ► చంద్రబాబుకు మంచి చేయాలనే ఆలోచన, తపన లేదు. ఆయనకు ఉన్నది పదవి వ్యామోహం ఒక్కటే. అందుకే 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. అప్పట్లో ఏమీ చేయలేదు. ప్రజల ఒత్తిడి మేరకు చివరకు తన నియోజకవర్గం కుప్పంను రెవెన్యూ డివిజన్గా మార్చండని మన ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. ఆ రెవెన్యూ డివిజన్ ఇచ్చింది మన ప్రభుత్వమే. ► కుప్పం ప్రజలకు మంచి జరగాలని చేశాం. చంద్రబాబు దృష్టిలో రాజకీయం అంటే ప్రజలతో వ్యాపారం చేయడమే. ప్రజలను ఎలా దోచుకోవాలి.. దోచుకున్న సొమ్మును ఎలా పంచుకోవాలన్నదే వారికి తెలిసిన నిర్వచనం. మనకు రాజకీయం అంటే ప్రజల మీద మమకారం. అదే మన నిర్వచనం. ► టీడీపీ అంటేనే పెత్తందారుల పార్టీ. పెత్తందారుల చేత, పెత్తందారుల వల్ల, పెత్తందారుల కోసం నడుస్తున్న పార్టీ. చంద్రబాబు హయాంలోని తెలుగుదేశం పార్టీ భావజాలంలోనే ఏ కోశాన మానవత్వం, పేదల పట్ల మమకారం అన్నవే కనిపించవు. చంద్రబాబు పార్టీ చరిత్ర అడుగడుగునా కనిపించేది వెన్నుపోట్లు. టీడీపీ స్థాపకుడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి.. ఎన్నికలప్పుడు ఆయన పేరునే ఉపయోగించుకోవడం బాబుకే చెల్లింది. టీడీపీ సిద్ధాంతం వెన్నుపోట్లే. వైఎస్సార్సీపీ శ్రేణులతో కిక్కిరిసిన ప్లీనరీ ప్రాంగణం రెండు కళ్ల సిద్ధాంతం ► తమ పిల్లలను, తమ మనవళ్లను ఇంగ్లిష్ మీడియం బడుల్లో చదివిస్తారట. పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియం బడుల్లోనే చదవాలట. ఈ టీడీపీ, దుష్టచతుష్టయం భావాలకు.. పేద పిల్లలు చదివే గవర్నమెంట్ బడుల్లో కూడా ఇంగ్లిష్ మీడియం ఉండాలన్న మన పార్టీ సిద్ధాంతానికి మధ్య ఎంత తేడా కనిపిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ► పేద కుటుంబాల పిల్లలు వారి పొలాల్లో కూలీలుగా, వారి వ్యాపారాల్లో, పరిశ్రమల్లో వెట్టిచాకిరి చేసేవారిగా మిగిలిపోవాలనేది ప్రతిపక్షాలు, దుష్టచతుష్టయం ఆలోచన. అణగారిన కులాలు, వర్గాలు ఏనాటికి ఎదగకూడదు అనేది చంద్రబాబు విధానం. ► ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలు 8వ తరగతిలోకి వచ్చేసరికి మంచి ట్యాబ్ ఉచితంగా ఇచ్చి.. మార్కెట్లో రూ.24 వేలకుపైగా విలువ చేసే పాఠాలను ఆ పిల్లలకు ఉచితంగా అందించేందుకు బైజూస్ యాప్ను ఉచితంగా ఇస్తుంటే.. అదేం జ్యూస్ అని చంద్రబాబు వెటకారం చేస్తున్నారు. ► ఇలాంటి ఉద్దేశాలు ఉన్న చంద్రబాబును ఒక్కసారి చూడండి. టీడీపీ నారాయణ, చైతన్య స్కూళ్ల కోసం, వారి బాగు కోసం శ్రమిస్తుంది. మన ప్రభుత్వం గవర్నమెంట్ బడులను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేందుకు పని చేస్తుంది. ► పేదల తల రాతలు మారాలంటే గవర్నమెంట్ బడుల్లో కార్పొరేట్ స్థాయిలో చదువులు అందాలని మనం శ్రమిస్తున్నాం. ఒక్క విద్యా రంగంలోనే తొమ్మిది పథకాలను అమలు చేస్తున్నాం. జగనన్న అమ్మ ఒడి ద్వారా ఇప్పటి వరకు మనం రూ.19,617 కోట్లు అందించాం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. ఒక్క బటన్ నొక్కగానే 44 లక్షల మంది ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతున్నాయి. 80 లక్షల మంది పిల్లలకు మంచి జరుగుతోంది. ► నాడు–నేడు పథకం కింద 56,703 గవర్నమెంట్ బడుల రూపురేఖలు మార్చడం కోసం రూ.16,352 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ మూడేళ్లలో విద్యా రంగంలో మనం ఖర్చు చేసింది అక్షరాల రూ.52 వేల కోట్లని సగర్వంగా చెబుతున్నా. ప్లీనరీలో ప్రసంగిస్తున్న సీఎం జగన్. వేదికపై రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ముఖ్యనేతలు నా కష్టం.. మీ త్యాగాలతో ఏర్పడిన ప్రభుత్వమిది ► చంద్రబాబు తాను సైకిల్ తొక్కలేక.. తన కొడుకుతో తొక్కించలేక దత్తపుత్రుడిని తెచ్చుకున్నారు. నా కష్టంతో పాటు, మీ త్యాగాలు, శ్రమ పునాదుల మీద ఏర్పడిన మనందరి ప్రభుత్వం ఇది. ఈ మూడేళ్లలో తీసుకువచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవం.. రైతు, మహిళా, విద్య, వైద్యం, వ్యవసాయ, పరిపాలన రంగాల్లో విప్లవాత్మక మార్పులు.. రాబోయే తరం మీద బాధ్యత ఉన్న పార్టీగా గట్టి పునాదులు వేస్తున్నాం. ► ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడుతూ ఈ మూడేళ్లలో విద్య, వైద్య, వ్యవసాయ, పరిపాలన, సామాజిక న్యాయ విప్లవాలను తీసుకువచ్చాం. ఎక్కడా లంచాలుగానీ వివక్ష గానీ లేకుండా బటన్ నొక్కగానే అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. అందుకే 2019 ఎన్నికల తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఫ్యాన్ గిర్రున తిరిగితే సైకిల్ చక్రాలు ఊడిపోయాయి. -
జనరంజకంగా సీఎం జగన్ ప్రసంగం (ఫొటోలు)
-
వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ గ్రాండ్ సక్సెస్
-
బట్టలైనా ఊడదీసుకుని తిరుగుతామంటారు: కొమ్మినేని విశ్లేషణ
-
గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ హైలైట్స్
-
ఎన్నికలకు సన్నద్ధం కండి.. సర్వ సైన్యాన్ని సిద్ధం చేయండి..!!
-
ఈ దొంగల ముఠాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
-
లక్షలాది మంది కార్యకర్తల్ని తన స్పీచ్ తో ఉర్రుతలూగించిన సీఎం జగన్
-
చంద్రబాబు ధరించిన ఉంగరం పై సీఎం జగన్ పంచులు
-
బాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదే: సీఎం జగన్
సాక్షి,గుంటూరు/విజయవాడ: చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని, సంక్షేమ పథకాలను కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాల్లో భాగంగా రెండో రోజైన శనివారం పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైన సీఎం జగన్ ప్రజలనుద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. చంద్రబాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదేనని, తనకున్న ఏకైక అండాదండా ప్రజలేనని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్. ‘చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పధకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లే. చక్రాలు లేని సైకిల్ను చంద్రబాబు తొక్కలేకపోతున్నారు. రాష్ట్రంలో అందరికీ న్యాయం చేసేందుకే మూడు రాజధానులు. ఎన్నికల దగ్గరపడే కొద్దీ దుష్టచతుష్టయం దుష్ప్రచారం ఎక్కువైంది. అసత్యాలు, వెన్నుపోట్లు మనకు తెలీదు. వెన్నుపోటు ద్వారా అధికారం లాక్కోవడం నాకు తెలీదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు మనకు లేరు. ఈ దొంగల ముఠాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. సంక్షేమ పథకాలను ఆపేయాలన్నేదే దుష్టచతుష్టయం కుట్ర. ఓట్ల కోసం దొంగ వాగ్దానాలతో చంద్రబాబు మళ్లీ మీ ముందకొస్తారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలవడమే మన లక్ష్యం. కుప్పం ప్రజలు కూడా మనల్ని దీవించారు. నాకున్న ఏకైక అండాదండా ప్రజలే’ అని సీఎం జగన్ ఉద్విగ్నంగా ప్రసంగించారు. ఎన్నికలకు సిద్ధం కావాలి ‘మనం చేసిన మంచిని ప్రతి గడపకూ తీసుకెళ్లండి. దుష్టచతుష్టయం కుట్రలను సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టండి. పార్టీ నాయకత్వంతో కార్యకర్తలు సమన్వయం చేసుకోవాలి. ఎన్నికలకు సిద్ధం కావాలి’ అని క్యాడర్కు సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఇది కూడా చదవండి: మీ కష్టాల పునాదులపైనే మన ప్రభుత్వం.. నిండు మనసుతో సెల్యూట్ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: వైఎస్సార్సీపీ ప్లీనరీ: పోటెత్తిన అభిమానం -
వైఎస్సార్సీపీ ప్లీనరీ: పోటెత్తిన అభిమానం
-
మీ కష్టాల పునాదులపైనే మన ప్రభుత్వం: సీఎం జగన్
సాక్షి,గుంటూరు/విజయవాడ: భవిష్యత్తుపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని వైఎస్సార్సీపీ శాశ్వత అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ రెండో రోజు సమావేశాల్లో భాగంగా.. రెండో రోజైన శనివారం పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ను ఎన్నుకుంది ప్లీనరీ. అనంతరం జన సంద్రాన్ని ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. ‘‘ఈరోజు జన సునామీ కనిపిస్తోంది. ఇది ఆత్మీయుల సునామీ. పదమూడేళ్లుగా ఇదే అభిమానం నాపై చూపిస్తున్నారు. కార్యకర్తలు, నేతలు, అభిమానులకు నా సెల్యూట్. అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అని సీఎం జగన్ పేర్కొన్నారు. పార్టీని గట్టి పునాదిపై నిర్మించుకున్నాం. మీ కష్టాల పునాదులపైనే మన ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ విప్లవాలు నడుస్తున్నాయి. మేం మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో.. అవే చేస్తున్నాం. నా ఫోకస్ అంతా ప్రజలకు మంచి చేయడం, వెనుక బడిన వర్గాలకు న్యాయం చేయడమే నా లక్ష్యం అని అన్నారాయన. నాన్న మరణ వార్త విని సుమారు 700 మంది చనిపోయారు. వారందరి కుటుంబాలను పరామర్శించడం నా బాధ్యతగా భావించా. నాపై కాంగ్రెస్, టీడీపీ కలిసి కేసులు వేసి ఎన్నో కుట్రలు చేశాయి. నాపై ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి కుట్రలకు, తప్పుడు కేసులకు లొంగేవాడు కాదు జగన్. నన్ను అన్యాయంగా అరెస్ట్ చేయించిన పార్టీ నామరూపాల్లేకుండా పోయింది. ఆనాడూ చంద్రబాబు మన పార్టీలో ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు. 2014లో 23 ఎమ్మెల్యేలను కొన్న పార్టీకి.. 2019లో అన్నే సీట్లు వచ్చాయి అని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ఒక్క ఎమ్మెల్యేలతో ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు 151కి చేరింది. ఒక్క ఎంపీతో ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు 22కి చేరిందని గుర్తు చేసుకున్నారు. నిండు మనసుతో మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నా అని ప్రజాభివాదం చేశారు సీఎం జగన్. చంద్రబాబుకు ఆ చిప్ లేదు ఈ మధ్య చంద్రబాబు రింగ్లో చిప్ ఉందని చెప్తున్నారు. చంద్రబాబులా రింగ్లోనో, మోకాళ్లలోనో, అరికాళ్లలోనో చిప్ ఉంటే సరిపోదు. ప్రజల కష్టాలను అర్థం చేసుకునే చిప్ చంద్రబాబుకు లేదు. చంద్రబాబుకు ప్రజల పట్ల మమకారం, ప్రేమ అన్నది ఏమాత్రం లేదు. పేదలు ఎదగకూడదన్నదే చంద్రబాబు, దుష్టచతుష్టయం విధానం. ప్రజలకు మంచి చేయకూడదన్నదే చంద్రబాబు అభిమతం. తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు. పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియమే చదవాలంట. నారాయణ, చైతన్యలను మాత్రమే టీడీపీ ప్రోత్సహిస్తుంది. కానీ, మన ప్రభుత్వం ప్రభుత్వ బడులను కార్పొరేట్ తీసుకెళ్లడానికి శ్రమిస్తోంది. ఒక్క విద్యారంగం కోసమే తొమ్మిది పథకాలు తీసుకొచ్చింది.. అంటూ ఇప్పటిదాకా వెచ్చించిన పలు సంక్షేమ నిధుల కేటాయింపులను సభాముఖంగా ప్రకటించారు సీఎం జగన్. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి.. కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని అర్జీ పెట్టుకున్నారు. కుప్పంను రెవెన్యూ డివిజన్ చేసింది మీ జగన్ ప్రభుత్వమే. కుప్పం ప్రజలకు మంచి జరగాలనే అలా చేశాం. మరింత పాదర్శక పాలన కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. టీడీపీ అంటే పెత్తందార్ల ద్వారా పెత్తందార్ల కోసం నడుస్తున్న పార్టీ. చంద్రబాబు పార్టీ సిద్ధాంతమే వెన్నుపోట్లు అని సీఎం జగన్ ప్రస్తావించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇది కూడా చదవండి: బాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదే: సీఎం జగన్ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్ఆర్ సీపీ జీవిత కాలపు జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నిక
-
నీ జీవితంలో వారికి పదవులు ఇచ్చావా బాబు ??
-
చంద్రబాబు ఏనాడైనా సామాజిక న్యాయం పాటించారా?: మేరుగు నాగార్జున
-
సీఎం వైఎస్ జగన్ మనందరి ధైర్యం: తానేటి వనిత
-
సీఎం జగన్ భగభగమండే సూర్యుడిలాంటోడు: కొడాలి నాని
సాక్షి, గుంటూరు/విజయవాడ: చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5నాయుడు.. నలుగురు దొంగల ముఠాగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ప్లీనరీ రెండో రోజున ఎల్లో మీడియా-దుష్ట చతుష్టయం తీర్మానంపై చర్చ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. 'సీఎం జగన్ ప్రభుత్వంపై ఉదయం నుంచి రాత్రి వరకు దుష్ప్రచారం చేయడమే వీరి పని. సీఎం జగన్ను దించాలని ఆ నలుగురు కంకణం కట్టుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే రాష్ట్రాన్ని దోచుకోవచ్చని వీరి ఆలోచన. ఈ ముఠాకి రామోజీరావు గురువు. ఈ 420లకి ఎవరూ భయపడరు. దుష్టచతుష్టయాన్ని పాతాళంలో పాతిపెట్టేందుకు సిద్ధంగా ఉండాలి. చదవండి: (ఆర్ యూ డెఫ్ ఇయర్.. ఆర్ యూ బ్లైండ్?.. ఎల్లో మీడియాపై తమ్మినేని ఫైర్) ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే విమర్శలు చేస్తున్నారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవొద్దా?. ఆరోపణలు చేస్తున్న వారి పిల్లలు ఏ మీడియంలో చదివారు?. వైఎస్ జగన్ సీఎం అయ్యాక పెన్షన్లు పెంచుతూ పోతున్నారు. పేద పిల్లల కోసం తండ్రి స్థాయిలో సీఎం జగన్ ఆలోచిస్తున్నారు. చంద్రబాబు ఏనాడైనా ఇలాంటి పథకాలు అమలు చేశారా?. 95 శాతం హామీలను అమలుచేసిన వ్యక్తి సీఎం జగన్. సీఎం జగన్ భగభగమండే సూర్యుడిలాంటోడు. పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చదవండి: (జగన్ అంటే తగ్గేదేలే.. సోనియాకే భయపడలే.. దుష్టచతుష్టయానికి భయపడతారా?) దేశంలో చంద్రబాబు లాంటి చవట దద్దమ్మ ఎవరూ లేరు. పుట్టిపెరిగిన చంద్రగిరిలో చంద్రబాబు ఎప్పుడైనా గెలిచాడా?. దుష్టచతుష్టయం పర్మినెంట్గా పిచ్చాసుపత్రుల్లో చేరబోతున్నారు. చంద్రబాబు మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నాడు. గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తే.. తల్లి పాత్ర పోతుందా?. తల్లిని మించిన హోదా ఉంటుందా?. లోకేష్ ఫారెన్లో ఉన్నప్పుడు చంద్రబాబు ఎలా వెళ్లారు?. ఓట్లకోసం భార్యను బజారుకీడ్చిన 420 చంద్రబాబు. 2024 చంద్రబాబుకు రాజకీయ సమాధే' అని మాజీ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. -
దుష్టచతుష్టయాన్ని పాతాళంలో పాతిపెట్టేందుకు సిద్ధంగా ఉండాలి: కొడాలి నాని
-
రామోజీరావు నమ్మకద్రోహి అని ఎన్టీఆరే అన్నారు: పేర్నినాని
-
జగన్ అంటే తగ్గేదేలే.. సోనియాకే భయపడలే.. దుష్టచతుష్టయానికి భయపడతారా?
సాక్షి, విజయవాడ/గుంటూరు: చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు.. దుష్టచతుష్టయం కలిసి మీడియా వ్యవస్థను దారుణంగా తయారు చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. ప్లీనరీ రెండో రోజున ఎల్లో మీడియా-దుష్ట చతుష్టయం తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడారు. 'దుష్టచతుష్టయంలో మొదటి దొంగ చంద్రబాబు, రెండో దొంగ రామోజీరావు, మూడో దొంగ రాధాకృష్ణ, నాలుగో దొంగ టీవీ5 నాయుడు. ఈ నలుగురిది కూడా మనోడు మాత్రమే అధికారంలో ఉండాలని ఉన్మాద ప్రయత్నం. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. ఇప్పుడు కూడా రోజూ విషపు రాతలు రాస్తున్నాయి. రామోజీరావు నమ్మక ద్రోహి అని ఎన్టీఆర్ ఆనాడే అన్నారు. ఔటర్ రింగ్ కట్టానని చంద్రబాబు చెబుతారు. మరి భూసేకరణ వైఎస్సార్ ఎందుకు చేశారు?. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిన వారు లేరు. డబ్బు కోసం రాధాకృష్ణ చేయని దుర్మార్గాలు లేవు. ఏపీలో కందిపప్పు రేటు ఎంత? తెలంగాణలో ఎంత? నీ హెరిటేజ్లోఎంత ఉంది?. ఆయిల్ ధరలు మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి. సీఎం జగన్ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. నాలాంటోళ్లు వస్తుంటారు.. పోతుంటారు.. సీఎం జగన్కోసం పనిచేయాలి. ఇంటింటికి తిరగండి.. పథకాలు అందినవా.. లేదా ఆరా తీయాలన్నారు. పథకాలు రాకపోతే భాధ్యత వహించి సరిదిద్దాలన్నారు. అర్హత ఉంటే ఏ పార్టీ అయినా సంక్షేమ పథకాలు అందాలని సీఎం చెప్పారు. ఎవరూ శాశ్వతం కాదు..జెండా మోసే కార్యకర్తలు శాశ్వతం. సింగిల్గా రాలేమని చంద్రబాబు, పవన్కు తెలుసు.. అందుకే అందరూ కట్ట కట్టుకుని రావాలని చూస్తున్నారు. సోనియా గాంధీనే గడగడలాడించిన వ్యక్తి సీఎం జగన్. చంద్రబాబుతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా, 16 మాసాలు జైల్లో పెట్టినా అడుగు వెనక్కు తగ్గలేదు. జగన్ అంటే తగ్గేదేలే. అలాంటి వ్యక్తి ఈ దుష్టచతుష్టయానికి భయపడతాడా? అంటూ పేర్ని నాని సభికుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. చదవండి: (ఆర్ యూ డెఫ్ ఇయర్.. ఆర్ యూ బ్లైండ్?.. ఎల్లో మీడియాపై తమ్మినేని ఫైర్) -
ఎల్లో మీడియాకు ఎందుకింత కుళ్లు: జోగి రమేష్
-
YSRCP Plenary 2022: విద్యా రంగంపై తీర్మానం: హైలైట్స్ ఇవే..
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: మంచి చదువులతో పిల్లలను తీర్చిదిద్దినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధిస్తాయని నమ్మి సీఎం వైఎస్ జగన్ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యా రంగంలో ప్రభుత్వం తెచి్చన సంస్కరణలు, ఇతర కార్యక్రమాలతో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారుమయం కానుందని చెప్పారు. శుక్రవారం జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో విద్యారంగంపై మంత్రి బొత్స తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చించిన అనంతరం సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. విద్య మీద ప్రభుత్వం పెట్టే ఖర్చును దేశాభివృద్ధికి పెట్టుబడిగా చూస్తున్నామన్నారు. చదవండి: వైద్య, ఆరోగ్య రంగంపై తీర్మానంలోని అంశాల్లో హైలైట్స్ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో వేల కోట్ల రూపాయలు విద్యా రంగానికి ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చదువులు కొనసాగించాలని సీఎం విద్యా సంస్కరణలను యజ్ఞంలా కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. విద్యా సంస్కరణలను ప్రతిపక్షాలు హేళన చేయడంపై మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు, అవగాహన లేని నేతలే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు తెచ్చిందన్నారు. ఒకప్పుడు 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్క టీచరే ఉండటం వల్ల పిల్లలకు సరైన బోధన అందేది కాదన్నారు. కానీ ఇప్పుడు 3వ తరగతి నుంచే ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్తో పిల్లలకు బోధన అందేలా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విద్యార్థులు ఏ రాష్ట్రం, ఏ దేశం వెళ్లినా గర్వంగా తలెత్తుకొని తిరిగేటట్టు తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో నాసిరకమైన విద్య.. గత ప్రభుత్వాలు ప్రైవేటు కళాశాలలి్న, స్కూళ్లను ప్రోత్సహించాయని.. పరీక్షలను చూసి రాయించాయని మంత్రి బొత్స తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థులను ఉత్తీర్ణులను చేయించి భారీగా దోచుకున్నారని మండిపడ్డారు. నాసిరకమైన విద్యను అందించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా మన విద్యార్థులకు పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు దొరకని స్థితిని తెచ్చారని నిప్పులు చెరిగారు. ఇలా కాకుండా ఒక కుటుంబంలో విద్యార్థికి మంచి విద్య అందితే ఆ కుటుంబ ఆరి్థక స్థితిగతులు మారిపోతాయన్నారు. ఇది స్నేహపూర్వక ప్రభుత్వమని.. ఉపాధ్యాయులకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలన పగ్గాలను చేపట్టిన మొదటి రోజు నుంచే విద్యా సంస్కరణలపై దృష్టి సారించారని గుర్తు చేశారు. నేడు ప్రైవేటు స్కూల్స్ను మించి సకల వసతులతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద తదితర పథకాలతో బడికి వెళ్లే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడం ద్వారా మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెగ్గుకురాగల ఆత్మవిశ్వాసాన్ని కల్పించారని పేర్కొన్నారు. హైలైట్స్ ♦విద్యపై పెట్టే ఖర్చు దేశాభివృద్ధికి పెట్టుబడి ♦రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చదువులు ♦ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యా రంగంలో సంస్కరణలు ♦ అమ్మ ఒడి జగనన్న మూడో పుత్రిక ♦ఇంగ్లిష్ మీడియం విద్య.. ♦మా హక్కు అనేది ప్రతి విద్యార్థి భావన ♦రాష్ట్ర విద్యార్థులు ఏ రాష్ట్రం, ఏ దేశం వెళ్లినా గర్వంగా తలెత్తుకొని తిరిగేటట్టు తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పం ♦ఒక విద్యార్థికి మంచి చదువు లభిస్తే ఆ కుటుంబ ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి. ♦మనం పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే ♦ ప్రైవేటు వర్సిటీల్లోనూ పేదలకు 35 శాతం సీట్లు ♦గత ప్రభుత్వాల హయాంలో ప్రైవేటు స్కూళ్లకు, కళాశాలలకు ప్రోత్సాహం ♦ కార్పొరేట్కు అనుగుణంగానే గత ప్రభుత్వం చట్టాలు పేద పిల్లల పెద్ద చదువులకు అనేక పథకాలు అమ్మ ఒడి జగనన్న మూడో పుత్రిక. పేదల పిల్లలు పెద్ద చదువులు చదివేలా సీఎం వైఎస్ జగన్ అనేక పథకాలతో ప్రోత్సాహం అందిస్తున్నారు. విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. దాన్ని పేదలకు మరింత చేరువ చేశారు. విద్యా రంగంలో సంస్కరణల కోసమే రూ.52,676.98 కోట్లు వెచ్చించారు. గత ప్రభుత్వాలు విద్యను నిరీ్వర్యం చేశాయి. పాఠశాలల అభివృద్ధిపై చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదు.. ఆయన తల్లిదండ్రుల కమిటీలను అడిగితే వారే చెబుతారు. – కిలారి రోశయ్య, ఎమ్మెల్యే నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్లలో సమూల మార్పులు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో విద్యా రంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. గతంలో ఎవరూ ఇలాంటి సంస్కరణలు ప్రవేశపెట్టలేదు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే అని చెప్పి.. మన తలరాతను మారుస్తున్న గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్. అమ్మ ఒడి గొప్ప పథకం. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, ఇంకా అనేక కార్యక్రమాలు, పథకాలతో సీఎం సంఘసంస్కర్తగా నిల్చారు. గత టీడీపీ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా రంగానికి కొమ్ము కాసింది. నారాయణ, చైతన్య యాజమాన్యాలకు అనుగుణంగా చట్టాలు కూడా చేసింది. సీఎం వైఎస్ జగన్ ఆ చట్టాలను మార్చి ప్రైవేటు వర్సిటీల్లో కూడా 35 శాతం సీట్లు పేదలకు ఇస్తున్నారు. – ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అట్టడుగు వర్గాల మేలు కోసమే పథకాలు ఇంగ్లిష్ మీడియం విద్య.. మా హక్కు అని నినదించేలా సీఎం జగన్ పేదల పిల్లలకు ఆంగ్ల మాధ్యమ చదువులను అందిస్తున్నారు. అట్టడుగు వర్గాలకు మేలు చేయాలన్న తపనతోనే వేల కోట్ల రూపాయలు వెచి్చస్తూ విద్యా పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారు. రక్తం ధారబోసి అయినా వైఎస్ జగన్ను మళ్లీ సీఎంను చేసేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారు. – సుధాకర్బాబు, ఎమ్మెల్యే బడుగుల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం వద్దా? రామోజీరావు, చంద్రబాబుతోపాటు ఇతర టీడీపీ నేతల పిల్లలు, మనవళ్లు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. బడుగుల పిల్లలకు మాత్రం ఇంగ్లిష్ మీడియం అందకూడదన్నట్టు వీరు వ్యవహరిస్తున్నారు. బలహీనవర్గాల పిల్లలు ఇంగ్లిష్ చదువులకు పనికిరారన్నట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. – నాగార్జున యాదవ్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి -
చంద్రబాబుతో కాదు యుద్ధం.. దుష్టచతుష్టయంతో: అంబటి
-
వైఎస్సార్సీపీ ప్లీనరీ భవిష్యత్ సీనరీ
ఆంధ్రపదేశ్లో అధికార పార్టీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) నిర్వహిస్తోన్న భారీ ప్లీనరీని ప్రజానీకం ఆసక్తిగా చూస్తోంది. ఈ ప్లీనరీ ఆ పార్టీ ఆవిర్భావం తరువాత జరుగుతున్న మూడోదీ, అధికారం అందుకున్న తర్వాత మొదటిదీ. భవిష్యత్తులో వేయబోయే అడుగులపై దిశా నిర్దేశం చేసేవిధంగా పలు తీర్మానాలు ఇందులో చర్చకు వస్తుండటం ముదావహం. పదేళ్లుగా ప్రజల్లో ఉండి పోరాటం జరిపిన పార్టీ, వారి ఆశీస్సులతో భారీ విజయాన్ని నమోదు చేసి మూడేళ్లుగా పాలనా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈ మూడేళ్లూ ఆర్థికంగా కష్టకాలం. విభజన అనంతరం తలెత్తిన ఆర్థిక ఇబ్బందులతో పాటూ రెండేళ్ల కరోనా వల్ల వచ్చిన ఆర్థిక దుఃస్థితీ ఇబ్బంది పెడు తోంది. అయినప్పటికీ లక్షా నలభై వేల కోట్ల మేరకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా ప్రభుత్వ సాయం అందించడం, గ్రామ సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు దగ్గర చెయ్యడం, లక్ష మందికి ఉద్యోగాలు కల్పించడం కొనసాగించగలిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచడంతో సహా వివిధ రీతుల్లో విద్యార్థులకు చేయూత నిచ్చిన కారణంగా డ్రాప్ ఔట్ రేట్ తగ్గి, ఎన్రోల్మెంట్ శాతం పెరిగింది. వైద్య రంగానికి కూడా కేటాయింపులు పెంచి రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలను మంజూరు చేసింది. అయితే రానున్నది గడ్డుకాలం. ఆర్థిక స్థితి మెరుగు పరచడంతో బాటు సంక్షేమ పథకాలను కొనసాగించాల్సి ఉంటుంది. అందుకు సమగ్ర ప్రణాళికలు అవసరం. మరో వైపు రాజకీయ ప్రత్యర్థులనూ, వారి ఆరోపణలనూ దీటుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పార్టీ శ్రేణులకు సరైన దిశా నిర్దేశం చేసి ఉత్తేజితుల్ని చెయ్యాలి. ప్రజల అజెండాను చర్చించి ప్రజల మద్దతు నిలుపుకోవాల్సి ఉంది. ఏరకంగా చూసినా ఈ ప్లీనరీ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. (క్లిక్: సామాజిక న్యాయమే పాలన అజెండా) – డా. డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం -
వైఎస్ఆర్సీపీ సైనికులకు పెద్ద పండగ: పుష్ప శ్రీవాణి
-
ఏ గడపకు వెళ్లినా సీఎం జగన్ నామస్మరణే వినిపిస్తోంది: తమ్మినేని
-
ఆర్ యూ డెఫ్ ఇయర్.. ఆర్ యూ బ్లైండ్?.. ఎల్లో మీడియాపై తమ్మినేని ఫైర్
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఏ గడపకు వెళ్లినా సీఎం జగన్ నామస్మరణే వినిపిస్తోందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ రెండవరోజు పరిపాలన వికేంద్రీకరణ- పారదర్శకతపై మొదటగా తమ్మినేని ప్రసంగించారు. తమ్మినేని మాటల్లో.. 'మూడేళ్ల ప్రగతిపై సమీక్షే ఈ ప్లీనరీ. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్లీనరీకి విప్లవంలా తరలివచ్చారు. రాబోయే ఎన్నికల్లో మనం విజయం సాధించడమే మన ముందున్న లక్ష్యం అని అన్నారు. 'ఈ రోజు ఎల్లో పత్రికలు స్పీకర్ పదవిలో ఉండి ప్లీనరీకి ఎలా హాజరవుతారంటూ నాపై కథనాలు రాశాయి. రామోజీరావు, ఏబీఎన్లకు సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. గతంలో టీడీపీ మహానాడులో ఆనాటి స్పీకర్ శివప్రసాద్ పాల్గొనలేదా?. ఆ రోజు ఆయన మాట్లాడింది మీరు వినలేదా? (ఆర్ యూ డెఫ్ ఇయర్).. మీరు కనలేదా? (ఆర్ యూ బ్లైండ్). ఆయన ప్లీనరీకి హాజరవగా లేనిది.. నేను ప్లీనరీలో పాల్గొంటే తప్పా?. నేను వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యుడిని.. తర్వాతే ఎమ్మెల్యేను..ఆ తర్వాతే స్పీకర్ను. ప్లీనరీ పండగ జరుగుతుంటే.. నేను ఇంటోల కూర్చోవాలా..?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చదవండి: (చంద్రబాబు చిత్తూరు టూర్ అట్టర్ ప్లాప్.. అడుగడుగునా అసహనం!) పచ్చ పత్రికలు కాదు.. పక్షపాత పత్రికలు రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏవీ ఎల్లో మీడియాకు కనిపించడం లేదా?. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం. 16 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ గ్రామసచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారు. వీటి గురించి ఎందుకు రాయదు ఎల్లో మీడియా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్తో ప్రయాణించేందుకు మేం అందరం సిద్ధంగా ఉన్నాం. సంక్షేమ రథాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలి. అవి పచ్చ పత్రికలు కాదు.. పక్షపాత పత్రికలు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 175 స్థానాలు గెలిచి తీరుతుంది అని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. -
రైతుల భూముల్ని చంద్రబాబు లాకున్నారు: నందిగం సురేష్
-
పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు: సజ్జల
-
YSRCP Plenary: వైద్య, ఆరోగ్య రంగంపై తీర్మానంలోని అంశాల్లో హైలైట్స్
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. టీడీపీ హయాంలో హెల్త్ డిపార్ట్మెంట్ (వైద్య, ఆరోగ్య శాఖ) అప్పటి సీఎం చంద్రబాబు వెల్త్ (ఆదాయం) కోసం పనిచేస్తే.. ప్రస్తుతం రాష్ట్ర ప్రజల వెల్నెస్ (ఆరోగ్యం) కోసం పనిచేస్తోందని చెప్పారు. బాబు వైద్య శాఖలో అవినీతిని విస్తరించారని, సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించి ప్రజల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తున్నారని వివరించారు. చదవండి: చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా ఓటమి తథ్యం: విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ ప్లీనరీలో శుక్రవారం వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల మీద తీర్మానంపై మంత్రులు రజని, సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ చర్చించారు. మంత్రి రజని మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు వైద్య రంగంలో మార్పు తేలేకపోయారని, సీఎం వైఎస్ జగన్ మూడేళ్లలో అద్భుత మార్పు తెచ్చారని చెప్పారు. 2019 ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించి, ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన రంజక పాలన అందిస్తున్నారని చెప్పారు. ఆయన పాలనలో చేపడుతున్న కనీవినీ ఎరుగని అభివృద్ధితో 2024లోనూ ఇదే విధమైన చారిత్రక విజయాన్ని అందుకుంటారని తెలిపారు. వైద్య, ఆరోగ్య రంగంపై తీర్మానంలోని అంశాల్లో హైలైట్స్.. ♦రూ. 5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారందరికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం వర్తింపు. తద్వారా రాష్ట్రంలోని 85 % (1.40 కోట్ల) కుటుంబాలకు ఉచితంగా మెరుగైన వైద్యం. ♦టీడీపీ హయాంలో ఈ పథకం కింద కేవలం 1059 చికిత్సలు అందిస్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,446 చికిత్సలు అందుతున్నాయి. చికిత్సల సంఖ్యను ఇంకా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ♦వెఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్య పెంపు. పక్క రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం ♦గత టీడీపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకానికి రూ.5,171 కోట్లు ఖర్చు చేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలోనే రూ.5,100 కోట్లు ఖర్చు చేసింది. టీడీపీ హయాంలో రోజుకు సగటున 1500 మందికి వైద్యం అందించగా.. ఇప్పుడు రోజుకు సగటున 3 వేల మందికి పైగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం పొందుతున్నారు. ♦వైఎస్సార్సీపీ ప్రభుత్వం 104, 108 సేవలకు జీవం పోసింది. మండలానికి ఒకటి చొప్పున 104, 108 వాహనాలను ప్రవేశపెట్టడం ద్వారా సేవలను ప్రజలకు మరింత చేరువ చేసింది. ♦వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 11 వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉండే బోధనాస్పత్రులను బలోపేతం చేస్తోంది. ♦రూ.12 వేల కోట్లకు పైగా ఖర్చుతో రాష్ట్రంలో 16 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం చంద్రబాబుకు శ్రీరామచంద్రుడితో పోలికా! పదవి కోసం సొంత మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును లోకేష్ శ్రీరామచంద్రుడితో పోల్చడం హాస్యాస్పదం. లోకేశ్ తనను తాను రాక్షసుడితో పోల్చుకుంటున్నాడు. అతను రాక్షసుడు కాదు.. కమెడియన్. మా నాయకుడు జగన్ కోసం ఏమైనా చేయడం కోసం నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. 50 శాతానికి పైగా పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చి సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెప్పిన నాయకుడు సీఎం జగన్. 2024లో 175కు 175 సీట్లు గెలుస్తాం. ఇందుకోసం ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. – మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ నాడు ఆరోగ్యశ్రీ ఉండి ఉంటే నా చెల్లి బతికి ఉండేది.. పుట్టుకతో ఉండే గుండె జబ్బు కారణంగా నా సోదరి 1999లో మృతి చెందింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నా చెల్లికి మెరుగైన వైద్యం అందించలేకపోయాం. అప్పట్లో ఆరోగ్య శ్రీ పథకం ఉండి ఉంటే నా చెల్లి ప్రాణాలతో ఉండేది. 2004లో వైఎస్సార్ సీఎం అయ్యాక పేదల ఆరోగ్యానికి భరోసా ఇవ్వడం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం పథకాన్ని పూర్తిగా పక్కనపెట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వైఎస్సార్ తనయుడిగా పథకాన్ని ఊహించని రీతిలో వైఎస్ జగన్ బలోపేతం చేశారు. రాష్ట్రంలో ఉన్న 11 వైద్య కళాశాలల్లో ఏ ఒక్కటీ చంద్రబాబు హయాంలో నిర్మించినవి కావు. టీడీపీ ప్రభుత్వ ఆస్పత్రులను నరకానికి నకళ్లుగా మార్చింది. – మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు -
ఇది బహిరంగ సభ కాదు.. ప్రతినిధుల సభ: విజయసాయిరెడ్డి
-
ఒకటే చెప్తున్నా కుటుంబం జోలికి వస్తే... విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా ఓటమి తథ్యం: విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: విజయవాడ-గుంటూరు జాతీయ రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీ బహిరంగ సభ కాదని.. ప్రతినిధుల సభ అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'శుక్రవారం 1.68లక్షల మంది కార్యకర్తలు ప్లీనరీకి హాజరయ్యారు. ఇవాళ 4.5 లక్షల మందికిపైగా పార్టీ ప్రతినిధులు వచ్చే అవకాశం ఉంది. అధికార దుర్వినియోగం ఎక్కడా జరగలేదు. చంద్రబాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా ఓటమి తథ్యం. 175కు 175 స్థానాలు గెలుస్తాం. 25 పార్లమెంట్ స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని' విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చదవండి: (ఉద్వేగం.. ఉత్సాహం: వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో జోష్) -
రెండో రోజు ప్లీనరీ 4 లక్షల మందికి భోజనాలు సిద్ధం
-
Live Blog: ముగిసిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు
-
పాట పాడిన మంత్రి సీదిరి.. దద్దరిల్లిన ప్లీనరీ..
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: వైఎస్సార్సీపీ ప్లీనరీలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక కమిటీ కన్వీనర్ వంగపండు ఉష ఆధ్వర్యంలో 15 మంది కళాకారులు జానపద నృత్యాలు, గీతాలతో అలరించారు. చదవండి: అంతులేని అభిమానం.. తీవ్ర అనారోగ్యంలోనూ ప్లీనరీకి.. నవరత్నాలు, సంక్షేమ పథకాలపై ప్రత్యేక బాణీలతో కూర్చిన గేయాలకు చిందేసి ఆడుతూ ప్లీనరీకి వచ్చిన కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. సినీనటుడు జోగినాయుడు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగం కాగా, ప్రజాప్రతినిధులు సైతం పాలుపంచుకున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు సీఎంని కీర్తిస్తూ పాటపాడారు. వేదికపై ఆలపిస్తున్న వంగపండు ఉష, తదితరులు -
అంతులేని అభిమానం.. తీవ్ర అనారోగ్యంలోనూ ప్లీనరీకి..
జి.కొండూరు(ఎన్టీఆర్ జిల్లా): అభిమానం అనారోగ్యాన్ని లెక్క చేయనివ్వలేదు. నిన్న మొన్నటి వరకు ఆస్పత్రి బెడ్పై ఉన్న వ్యక్తి.. ఇల్లు దాటడానికే ఇబ్బంది పడుతున్న పెద్దాయన తమ అభిమాన నాయకుడిని చూడాలనే ఆరాటంతో కిలోమీటర్ల దూరం వచ్చేశాడు. యూరిన్ బ్యాగ్ చేత్తో పట్టుకుని ప్లీనరీ ప్రాంగణానికి వచ్చిన అభిమానిని చూసి పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. చదవండి: జగన్ను మీ చేతుల్లో పెడుతున్నా..ఇక షర్మిలకు అండగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పోతురెడ్డి వీరారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 15 రోజుల క్రితం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన వీరారెడ్డికి వైద్యులు యూరిన్ బ్యాగ్ ఆమర్చారు. ఇటీవల ఇంటికి వచ్చిన ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా కుదుటపడకపోయినప్పటికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్పై గల అభిమానంతో శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లాలో శుక్రవారం జరిగిన వైఎస్సార్ సీపీ ప్లీనరీకి హాజరయ్యారు. ప్లీనరీ ఏర్పాట్లు అద్భుతం ప్లీనరీ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. వర్షంలోనూ ఇబ్బంది లేకుండా వాటర్ప్రూఫ్ టెంట్లు వేయడం, మాంసాహార, శాఖాహార వంటకాలతో భోజనం, వాటర్ బాటిళ్లు, మజ్జిగ పంపిణీ అన్నీ బాగున్నాయి. – జి.శ్రీనివాసరావు, ఎంపీపీ.. నక్కవరపుకోట మండలం, విజయనగరం జిల్లా మళ్లీ జగన్ సీఎం అవడం తథ్యం రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారీ్టలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అధిక ప్రాధాన్యం ఇచి్చంది. మళ్లీ జగనన్నే సీఎం అవడం తథ్యం. – తెన్నేటి ప్రకాష్, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, కృష్ణా జిల్లా టీడీపీ వారు సిగ్గుపడుతున్నారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి టీడీపీ వారు సిగ్గుపడుతున్నారు. వైఎస్సార్సీపీకి ఓట్లు వేయకపోయినా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఎకరం మిరప పంట నష్టపోయిన వారికి భారీగా పంట నష్ట పరిహారం రావడం నిజంగా అద్భుతం. – డి.శివానంద, నరిగన్న, బెళుగప్ప మండలం, అనంతపురం జిల్లా -
ఉద్వేగం.. ఉత్సాహం: వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో జోష్
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: జలయజ్ఞ ప్రదాత, మహానేత వైఎస్సార్ వారసుడిగా, జనం కోసం ఇచ్చిన మాటపై నిలబడి వారి సంక్షేమానికే కట్టుబడి పరిపాలనలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలు ప్రత్యక్షంగా వినాలని ఎందరో వృద్ధులు ప్లీనరీకి తరలివచ్చారు. ఏక ఛత్రాధిపత్యానికి చరమగీతం పాడుతూ, రాష్ట్ర చరిత్రలో సంచలనాలకు వేదికగా నిలుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పండుగను కనులారా వీక్షించాలని, వయోభారాన్ని, అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఎందరో కార్యకర్తలు ప్లీనరీ ప్రాంగణంలో అడుగుపెట్టారు. కార్యకర్తల్లో భావోద్వేగం నిండిన ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. మూడు చక్రాల బండికి పార్టీ జెండాలను కట్టుకుని.. సిసలైన కార్యకర్తల్లా కొందరు దివ్యాంగులు బారులు తీరిన భారీ వాహనాలను దాటుకుని సభా ప్రాంగణంలోకి చేరుకున్నారు. మరికొందరు వైఎస్సార్ చిత్రపటాన్ని నెత్తిన పెట్టుకుని వచ్చారు. -
వన్స్మోర్ జగనన్న
వైఎస్సార్ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘వన్స్మోర్ జగనన్న’ అన్నదే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని మహిళల నినాదం కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా పిలుపునిచ్చారు. మహిళల సంక్షేమం, రక్షణ, సాధికారికతలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటిస్థానంలో నిలిపిన సీఎం వైఎస్ జగన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మహిళలందరిపై ఉందన్నారు. గుంటూరు జిల్లాలోని ఏఎన్యూ సమీపంలో ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్ ప్రాంగణం’లో శుక్రవారం ప్రారంభమైన వైఎస్సార్సీపీ ప్లీనరీలో ‘మహిళా సాధికారత–దిశ చట్టం’ తీర్మానంపై చర్చించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించగా మంత్రి రోజా, రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి బలపరిచారు. మంత్రి రోజా ఏమన్నారంటే.. తన కుమార్తె ఉన్నత విద్యను అభ్యసించిన రీతిలోనే రాష్ట్రంలోని ఆడపిల్లలు అందరూ ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్నత స్థానాలకు చేరాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. మహిళలకు సంక్షేమ పథకాలు, రక్షణ, సాధికారత, రాజకీయంగా ఉన్నతస్థానాలు అందించడంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంది. అందుకే.. అమ్మ జన్మనిస్తుంటే జగనన్న జీవితం ఇస్తున్నారని మహిళలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన దిశ బిల్లు దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. కేంద్రం ఇంకా పెండింగ్ లో ఉంచినప్పటికీ దిశ చట్టం స్ఫూర్తిని పోలీసు శాఖలో తీసుకువచ్చి సీఎం మహిళల భద్రతకు భరోసానిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు మహిళల పట్ల ఓ ఉన్మాదిలా వ్యవహరించారు. వనజాక్షిపై అప్పటి టీడీపీ ఎమ్మెల్యే దాడిచేస్తే చంద్రబాబు సెటిల్మెంట్ చేశారు. నాటి టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా విజయవాడలో ఓ తల్లీకూతళ్ల ఆస్తి కోసం వారికి నరకం చూపిస్తే కూడా చంద్రబాబు చోద్యం చూశారు. ఇక బుద్దా వెంకన్న కాల్మనీ రాకెట్తో మహిళల జీవితాలను నాశనం చేస్తుండటాన్ని ప్రశ్నిస్తే నన్ను అసెంబ్లీలోకి రానీయకుండా అరెస్టుచేసి బలవంతంగా తీసుకువెళ్లిన దుర్మార్గుడు చంద్రబాబు. సీఎం వైఎస్ జగన్ను భయపెట్టాలని టీడీపీ, జనసేన సమావేశాలు పెట్టుకుంటున్నాయి. జగన్ను భయపెట్టాలంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరో జన్మ ఎత్తాలి. పవన్ రీల్ స్టార్ అయితే సీఎం జగన్ రియల్ స్టార్. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీచేయాలి. టీడీపీ మహానాడును రోజా ప్రస్తావిస్తూ.. ‘టీడీపీలో ఆడవాళ్లు తొడలు కొడుతున్నారు. మగవాళ్లు ఏడుస్తున్నారు. ఇదంతా చూస్తుంటే టీడీపీ జంబలకిడిపంబ పార్టీలా తయారైందనిపిస్తోంది’ అని ఎద్దేవా చేశారు. ‘మహిళా సాధికారత–దిశ చట్టం’ తీర్మానం హైలైట్స్.. ►తన కుమార్తెలాగే రాష్ట్రంలోని ఆడపిల్లలు అందరూ ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్నత స్థానాలకు చేరాలన్నదే సీఎం జగన్ లక్ష్యం.. ►అమ్మ జన్మనిస్తుంటే జగనన్న జీవితం ఇస్తున్నారు.. ►మహిళల భద్రతకు దేశానికే స్ఫూర్తిదాయకంగా ‘దిశ’ బిల్లు ►మహిళల ఓట్లే జగనన్నకు రాఖీలుగా పంపాలి.. ►మహిళల పట్ల చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరించారు.. ►అంబేడ్కర్, జ్యోతిబాపూలే ఆశయాలను సీఎం జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్నారు.. ►చంద్రబాబుది సంక్షామ సర్కారు అయితే.. ఇప్పుడున్నది సంక్షేమ ప్రభుత్వం.. ►జగన్ను భయపెట్టేందుకు టీడీపీ, జనసేనలు ఎక్కడెక్కడో సమావేశమవుతున్నాయి.. ►టీడీపీలో ఆడవాళ్లు తొడలు కొడుతున్నారు.. మగవాళ్లు ఏడుస్తున్నారు. ప్రతిపక్షాల కుట్రలకు బెదిరేదే లేదు మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చి వారి అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ కృషిచేస్తున్నారు. బాబు హయాంలో సం‘క్షామ’ ప్రభుత్వం ఉండగా ప్రస్తుతం సంక్షేమ ప్రభుత్వం ఏర్పడింది. జగన్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మూకుమ్మడిగా ఎన్ని కుట్రలకు పాల్పడినా బెదిరేదేలేదు. ఏపీ 2019 తరువాత జగన్ అడ్డాగా మారింది. – జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఏపీలోనే అత్యధికంగా మహిళలు కీలక స్థానాల్లో.. టీడీపీ హయాంలో పండుగకు కొత్త బట్టలు కొనుక్కోలేని దుస్థితి నుంచి ఇప్పుడు బంగారం కొనుక్కొని పండుగ చేసుకునే స్థాయిని మహిళలకు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుంది. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, జగనన్న అమ్మఒడి, అందరికీ ఇళ్లు వంటి పథకాలతో మహిళల సంక్షేమం, విద్య, సాధికారతకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుంటోంది. మహిళలు కీలక స్థానాల్లో ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. తెలంగాణలో 28 శాతం మంది, రాజస్థాన్లో 24.7శాతం మంది, కేరళలో 25.9 శాతం మంది ఉంటే.. ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 51.6 శాతం మంది ఉన్నారు. అలాగే, నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన సీఎం జగన్ ఆచరణలో అంతకంటే ఎక్కువగా ఇస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మహిళలు అందరూ తమ ఓట్లనే జగనన్నకు రాఖీలుగా పంపాలి. – ఉషశ్రీ చరణ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రాజకీయ సంస్కర్త సీఎం జగన్ రాష్ట్రంలో చెదలుపట్టి, పురుగులు పట్టిన రాజకీయాన్ని ప్రక్షాళన చేస్తున్న సంస్కర్త సీఎం వైఎస్ జగన్. అసమానలతో కూడిన వ్యవస్థలను సరిచేసి సమసమాజ స్థాపనకు తఆయన కృషిచేస్తున్నారు. మహిళా సాధికారత కోసం మహాత్మాగాంధీ, అంబేడ్కర్ ప్రవచించిన ఆశయాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొచ్చింది. వచ్చే ఎన్నికల్లో జగన్ను మరోసారి అధికారంలోకి మహిళలే తీసుకొస్తారు. – నందమూరి లక్ష్మీ పార్వతి, రాష్ట్ర తెలుగు–సంస్కృత అకాడమీ చైర్పర్సన్ సామాజిక న్యాయ సాధనే సీఎం వైఎస్ జగన్ ధ్యేయం సామాజిక న్యాయ సాధనే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబేడ్కర్, జ్యోతిబాపూలే ఆశయాలను నెరవేరుస్తున్నారు. మహిళలు ఎలాంటి పోరాటాలు చేయాల్సిన అవసరంలేకుండానే జగన్ బడుగు, బలహీన వర్గాలకు 55 శాతం రాజ్యాధికారం కల్పించారు. అంతటి ఉన్నత భావాలున్న ఆయన దేశంలో అతిగొప్ప సామ్యవాది. – పోతుల సునీత, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ -
జనం ఎత్తిన జెండా
ఈ జెండా... అయాచితంగా అందుకున్నది కాదు. కుట్రలతో లాక్కున్నదీ కాదు. ఇది... ఇచ్చిన మాట కోసం... వ్యవస్థలన్నిటినీ గుప్పిట్లో పెట్టుకున్న ఈ దేశ అత్యున్నత నాయకత్వాన్ని ఢీకొట్టి నిలిచిన ఓ యువకుడికి జనమిచ్చిన గౌరవం!. ఒక్కడిగా మొదలుపెట్టి ఈ రాష్ట్రంలోని ప్రతి ఊళ్లోనూ తన సైన్యాన్ని సృష్టించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం!. అందుకే ఇది జనం ఎత్తిన జెండా!!. పన్నెండేళ్లుగా ఇంతకు ఇంతై ఎదుగుతూ... ఎగురుతున్న వైఎస్సార్సీపీ జెండా... శుక్రవారం ప్లీనరీ పండగలో పులకించిపోయింది. మూడేళ్ల కిందట ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చిన వైఎస్ జగన్... కష్టాల్లో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తూ ప్లీనరీని ఆరంభించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచీ హాజరైన ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు జై జగన్నినాదాలతో ప్లీనరీని హోరెత్తించేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఒంటరి పోరాటం సాగిస్తున్న తన కుమార్తెకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది కనక... తాను వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్ష పదవిని వీడుతానని వై.ఎస్. విజయమ్మ ప్రకటించగానే వద్దు వద్దంటూ శ్రేణులు నినదించాయి. కానీ ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో ఆమె భావోద్వేగపూరితంగా వివరించిన మీదట... అంతా ఆమె నిర్ణయానికే జై కొట్టారు. ప్రజా సేవలో 45 ఏళ్ల తమ బాంధవ్యాన్ని గుర్తుచేస్తూ... వైఎస్ జగన్ గెలుపు మళ్లీ తథ్యమనే విశ్వాసం వ్యక్తం చేశారామె. ఇక ప్రతి ఊళ్లో బడి, ఆసుపత్రి బాగుపడుతూ భవిష్యత్తు మెరుగుపడుతుంటే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని, ప్రజలకు సంక్షేమం చేకూర్చడమంటే అభివృద్ధి కాదని ఎవరైనా చెప్పగలరా అని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రతిపక్షాలను నిలదీశారు. సీఎం స్ఫూర్తిదాయకమైన స్వాగతోపన్యాసం కార్యకర్తలలో ఫుల్జోష్ను నింపగా నాలుగు తీర్మానాలపై తొలిరోజు నేతలు చేసిన ప్రసంగాలు ఆలోచింపజేశాయి.... రెండో రోజు కోసం ఎదురు చూసేలా చేశాయి. వైఎస్సార్ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్సీపీ ప్లీనరీ అంటే.. ఆ పార్టీ అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ ఎంతగానో ఎదురుచూసే కార్యక్రమం. ఇంకో మాటలో చెప్పాలంటే అత్యంత ఇష్టమైన పండుగ. ఈ వేదికపై గతాన్ని మననం చేసుకుని, వర్తమానాన్ని విశ్లేషించుకుని.. భవిష్యత్కు మార్గనిర్దేశం చేసుకోవడం జరుగుతుంది. మూడేళ్ల క్రితం అధికారాన్ని చేపట్టాక తొలిసారి నిర్వహిస్తున్న ప్లీనరీ కావడంతో.. తొలి రోజున ప్రతినిధుల సభకు అంచనాలకు మించి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలోని 26 జిల్లాల నుంచి కార్యకర్తలు ప్లీనరీకి పోటెత్తారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు గావించి.. శుక్రవారం వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్.. అనంతరం తల్లితో కలిసి ప్లీనరీ జరిగే వైఎస్సార్ ప్రాంగాణానికి చేరుకున్నారు. ఉరిమే ఉత్సాహం.. చిరు జల్లుల ఆహ్వానం వైఎస్సార్ ప్రాంగణానికి సీఎం వైఎస్ జగన్ చేరుకోక ముందే లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. శ్రేణుల ఉరిమే ఉత్సాహం నడుమ.. చిరు జల్లుల మధ్య.. ఆహ్లాదకర వాతావరణంలో వైఎస్సార్సీపీ జెండాను పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఆ తర్వాత శ్రేణుల హర్షధ్వానాల నడుమ ప్లీనరీ వేదికపైకి చేరుకున్న సీఎం.. తల్లి విజయమ్మ, పార్టీ నేతలతో కలిసి మహానేత వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించారు. కష్టాలు గుర్తు చేసుకుంటూ.. చేసిన మేలును వివరిస్తూ.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మహాభినిష్క్రమణం నుంచి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు అవమానాలను సహిస్తూ.. కష్టాలను భరిస్తూ తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నా అంటూ సీఎం వైఎస్ జగన్ ప్లీనరీ ప్రారంభోపన్యాసాన్ని ఆరంభించారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించడానికి.. అందరి ఆత్మాభిమానం కోసం ఆవిర్భవించిన పార్టీ అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో ప్రజలకు చేస్తున్న మంచిని వివరిస్తూ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రసంగానికి శ్రేణుల నుంచి విశేష రీతిలో స్పందన లభించింది. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా.. అధికారమంటే ప్రజల మీద మమకారం చూపించడమేనని నిరూపిస్తూ ముందుకు సాగుతున్నామని శ్రేణులకు గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేయడం ద్వారా పరిపాలనలో.. ప్రజల జీవన ప్రమాణాల్లో.. సామాజిక, విద్య, ఆర్థిక న్యాయం చేయడమంటే ఇలా అని.. మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేయడమంటే ఇలా అని నిరూపించామని సీఎం వివరించారు. ప్రజలకు మేలు చేస్తుండటాన్ని జీర్ణించుకోలేక.. అసూయతో చంద్రబాబుతో కూడిన దుష్టచతుష్టయం, దత్తపుత్రుడితో జాయింట్గా ఏర్పడిన గజ దొంగల ముఠా సాగిస్తున్న దుష్ప్రచారాలను ఎండగట్టారు. ప్రజల ఇంట ఉన్న మన గెలుపు ఆపటం వారి వల్ల కాదు కాబట్టే రాక్షస గణాలన్నీ ఒక్కటవుతున్నాయన్న పదునైన విమర్శలకు శ్రేణుల నుంచి విశేష స్పందన లభించింది. గజదొంగల ముఠా దాష్టీకాలపై మనమంతా ఆలోచన చేసి.. ప్రజలకు ఆలోచన కలుగజేసేలా చేసేందుకు ప్లీనరీలో తీర్మానాలు ఉపయోగపడతాయని చెప్పారు. మొత్తంగా వైఎస్ జగన్ ప్రసంగం శ్రేణులను విశేషంగా ఆకట్టుకుంది. వైఎస్ విజయమ్మ ఉద్వేగపూరిత ప్రసంగం.. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశానని తాను లేఖ రాయకున్నా, రాసినట్లు సృష్టించడం.. ఎవరి కుటుంబంపైనా వేయని రీతిలో తమ కుటుంబంపై నిందలేస్తూ ఎల్లో మీడియా దుష్ఫ్రచారం చేస్తోందని వైఎస్ విజయమ్మ ఉద్వేగ పూరితంగా ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘షర్మిలమ్మ తెలంగాణలో పోరాటం చేస్తోంది. ఆమెకు నేను అండగా నిలవాల్సిన అవసరం ఉంది. సంతోషంలో ఉన్నప్పుడు కొడుకుతో ఉంటే అక్కడ నా రక్తం పంచుకున్న బిడ్డకు అన్యాయం చేసిన దాన్నవుతా. అది నా మనస్సాక్షికి నచ్చడం లేదు. అందుకే పార్టీ నుంచి తప్పుకుంటున్నా.. ఇందుకు క్షమించాలి’ అంటూ శ్రేణులను విజయమ్మ కోరారు. ‘వేరే రాష్ట్రంలో షర్మిలమ్మకు అండగా ఉన్నా, తల్లిగా జగన్కు, రాష్ట్ర ప్రజల మనసులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటాను’ అని విజయమ్మ స్పష్టత ఇవ్వడం శ్రేణులను ఆకట్టుకుంది. పోటెత్తిన పార్టీ శ్రేణులు ప్లీనరీ తొలి రోజున ప్రతినిధుల సభ.. మహిళా సాధికారత–దిశ చట్టం, విద్య, నవరత్నాలు–డీబీటీ, వైద్య రంగాల్లో గత మూడేళ్లలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులపై చర్చించింది. ఆ నాలుగు అంశాలపై తీర్మానాలను ఆమోదించింది. ప్రతినిధుల సభకు 1.50 లక్షల మంది వస్తారని వైఎస్సార్సీపీ నేతలు అంచనా వేయగా, అంతకంటే ఎక్కువగా శ్రేణులు తరలివచ్చాయి. ప్లీనరీ ప్రాంగణంలో వేసిన కుర్చీలన్నీ నిండిపోవడంతో పెద్ద సంఖ్యలో జనం వెలుపల.. గుంటూరు–విజయవాడ జాతీయ రహదారి వరకు మైదానంలో కిక్కిరిసిపోయారు. వేదిక చుట్టూ ఇసుకేస్తే రాలనంతగా కార్యకర్తలు పోటెత్తడంతో వేదిక మీదకు నాయకులు చేరుకోవడం కష్టమైంది. అంచనాలకు మించి ప్రతినిధుల సభకే వైఎస్సార్సీపీ శ్రేణులు పోటెత్తడంతో పార్టీలో నూతనోత్సాహం నింపింది. తొలిరోజు ప్లీనరీ ఇలా.. (వైఎస్సార్ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రతినిధి): వైఎస్సార్సీపీ 3వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం ఉదయం ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున వర్సిటీ సమీపంలోని వైఎస్సార్ ప్రాంగణం ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా మొదటి రోజు కార్యక్రమాలు ఇలా సాగాయి.. ఉదయం 7.00 : వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు వేదిక వద్దకు చేరుకోవటం ప్రారంభమైంది. 8.00: పార్టీ ప్రతినిధుల నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున క్యూ కట్టారు. 9.00 : సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. 11.36: వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిలను పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కార్యకర్తల కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం వారిరువురూ చేతులు జోడించి సభకు విచ్చేసిన అందరికీ నమస్కారం చేశారు. 11.39: మహానేత వైఎస్సార్ విగ్రహానికి వైఎస్ విజయమ్మ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జగన్కి వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ఆకుపచ్చ కండువా కప్పారు. పార్టీ మహిళా నేతలు, మంత్రులు తానేటి వనిత, విడదల రజనీ, మాజీమంత్రి పాముల పుష్పశ్రీవాణి సీఎం జగన్కు శాలువ కప్పారు. అనంతరం బాలికలు వందేమాతరగీతం ఆలపించారు. 11.42: పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్లీనరీని ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారని ప్రకటించారు. 11.45: పార్టీ శ్రేణుల హర్షధ్వానాల మధ్య సీఎం జగన్ ఉద్వేగపూరిత ప్రసంగం ప్రారంభించారు. ఆయన ప్రసంగిస్తున్నంతసేపు ఈలలు, చప్పట్లు, కేకలతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. 12.13: సీఎం జగన్ తన ప్రసంగాన్ని పూర్తిచేశారు. 12.15: పార్టీ గౌరవాధ్యక్షురాలు హోదాలో వైఎస్ విజయమ్మ తన ప్రసంగం ప్రారంభించారు. హ్యాపీబర్త్డే.. హ్యాపీబర్త్డే వైఎస్సార్ అని ఆమె అన్నప్పుడు సభలో ఈలలు, కేకలు ప్రతిధ్వనించాయి. 12.50: విజయమ్మ బాధాతప్త హృదయంతో తన గౌరవాధ్యక్ష స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం తన స్థానంలో ఆశీనులయ్యారు, ఈ సమయంలో కన్నీటిపర్యంతమైన తన తల్లి విజయమ్మను సీఎం వైఎస్ జగన్ సముదాయించి, ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పార్టీ జమా ఖర్చుల ఆడిట్ స్టేట్మెంట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. తర్వాత మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్సీపీ సిద్ధాంతం–రాజ్యాంగ నిబద్ధత అనే అంశంపై ప్రసంగించారు. ఆ తర్వాత వివిధ అంశాలపై సాయంత్రం వరకు చర్చలు జరిగాయి. నాలుగు అంశాలపై తీర్మానాలు చేశారు. కార్యకర్తలకు పేర్ని నాని సముదాయింపు వేదికపైకి వైఎస్ విజయమ్మ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తారనగా.. కార్యకర్తలు పెద్దఎత్తున వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో మాజీమంత్రి పేర్ని నాని రంగంలోకి దిగి ఒక్కొక్కరిని బుజ్జగిస్తూ గ్యాలరీలకు తరలించారు. కార్యకర్తల కోరిక మేరకు వారితో ఒక సెల్ఫీ దిగటం వారిని చేయిపట్టుకుని గ్యాలరీలలో వదలటం ఆసక్తికరంగా మారింది. -
విజయమ్మ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు: సజ్జల
సాక్షి, గుంటూరు: టీడీపీ, ఎల్లోమీడియాపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సజ్జల శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, ఎల్లోమీడియా దిగజారుడు రాజకీయం చేస్తున్నాయి. వైఎస్ విజయమ్మ ప్రసంగాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి విమర్శించడానికి ఏమీలేక విజయమ్మ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. విజయమ్మ వ్యాఖ్యలపై పెడార్థాలు తీస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: వైఎస్సార్సీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా -
జన సంద్రమైన వైఎస్సార్సీపీ ప్లీనరీ (ఫొటోలు)
-
మన పార్టీ ఒక తండ్రి ఆశయం కోసం పుట్టిన పార్టీ
-
అభినవ అల్లూరి జగనన్న.. అది చంద్రబాబు జలగల సమూహం
-
విజయమ్మ ప్రసంగం వక్రీకరణ.. ఎల్లో మీడియాపై సజ్జల ఆగ్రహం
-
ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ది: పెద్దిరెడ్డి
-
వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు (ఫొటోలు)
-
ఈ యువ నాయకుడి స్పీచ్కు దద్దరిల్లిన ప్లీనరీ ప్రాంగణం..
-
పేదింటి తల్లిదండ్రులు, పిల్లల అభిలాషకు విలువనిచ్చిన గొప్ప వ్యక్తి సీఎం జగన్
-
విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి సీఎం జగన్
-
ఇదే ఉత్సాహంతో 2024లో కూడా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం
-
విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ వెనక్కి తగ్గలేదు
-
మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారు: లక్షీ పార్వతి
-
ప్రతి పేదవాడికి అండగా నిలబడటమే వైఎస్ఆర్ సీపీ సిద్ధాంతం
-
ఆశయం కోసం పోరాడే పులివెందుల పులి సీఎం వైఎస్ జగన్
-
మహిళలను శక్తివంతంగా తీర్చి దిద్దాలన్నది సీఎం జగన్ సంకల్పం
-
యువతకు జగన్ రోల్ మోడల్: వైఎస్ విజయమ్మ
-
YS Vijayamma Speech: వైఎస్సార్సీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా
-
ప్రాణమున్నంత వరకు మీ అప్యాయతను మరిచిపోం: వైఎస్ విజయమ్మ
-
జగన్ను మీ చేతుల్లో పెడుతున్నా..ఇక షర్మిలకు అండగా
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులుగా జగన్, షర్మిల.. ఇద్దరూ ఆయన భావాలను పుణికి పుచ్చుకున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నా కుమారుడికి తోడుగా ఉన్నా. ఇక్కడ సంతోషంగా ఉన్న సమయంలో తెలంగాణలో వైఎస్సార్ ఆశయ సాధన కోసం షర్మిల పోరాడుతోంది. ఇప్పడు ఆమెకు తోడుగా ఉండమని నా మనస్సాక్షి చెబుతోంది. రెండు రాష్ట్రాల్లో రాజకీయ వివాదాలకు తావులేకుండా వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నా’’ అని ప్లీనరీ వేదికగా వైఎస్ విజయమ్మ ప్రకటించారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ తొలిరోజైన శుక్రవారం ఆమె ఉద్వేగభరితంగా మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆమె మాటల్లోనే.. మా అనుబంధాలు గొప్పవి.. మాది చాలా అభిమానం కలిగిన కుటుంబం. మా అనుబంధాలు, సంస్కారాలు గొప్పవే. తన అన్నకు ఇక్కడ ఏ ఇబ్బందీ కలుగకుండా ఉండాలనే తెలంగాణ కోడలిగా షర్మిల అక్కడ వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసుకుంది. వాళ్ల నాన్న ఆశయాలను నెరవేర్చాలని, వాళ్ల నాన్న ప్రేమించిన ప్రజలకు నిజాయితీగా సేవ చేయాలని, తన జన్మకు సార్థకత ఉండాలని గట్టిగా పోరాడుతోంది. రాజశేఖరరెడ్డి భార్యగా, ఓ తల్లిగా ఆ బిడ్డకు అండగా ఉండాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇక్కడ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ సీపీకి, అక్కడ షర్మిల వైఎస్సార్టీపీకి ఒకే సమయంలో మద్దతు పలకడంపై రెండు పార్టీల్లో సభ్యత్వం ఉండవచ్చా? అన్న దానిపై చాలా ఆత్రుతగా, ఏదో జరిగిపోతోందన్నట్లుగా, ఉన్నవీ లేనివీ కల్పించి ఎల్లో మీడియాలో గొప్పగా రాశారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఓ తల్లిగా ఇద్దరి భవిష్యత్తూ బాగుండాలని కోరుకున్నా. ఇంత వరకు జరిగింది ఒక ఎత్తు.. ఇకపై జరగబోయేది ఒక ఎత్తు. రాజకీయ ఎన్నికల యుద్ధం రాబోతోంది. తెలంగాణలో ముందుగా ఎన్నికలు వస్తాయి. అక్కడ షర్మిల ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమె తెలంగాణ ప్రయోజనాలపై మాట్లాడుతోంది. ఇక్కడ జగన్ ఏపీ ప్రజల కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో సీఎంగా జగన్కు ఒక స్టాండ్ ఉంటుంది. అదే సమయంలో ఇద్దరికీ వేర్వేరు విధానాలు తప్పవు. ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాల ప్రతినిధులుగా ఉండే పరిస్థితులు వస్తాయని ఊహించలేదు. ఇది ప్రజాహితం కోసం దేవుడు జరిపిస్తున్నాడని నమ్ముతున్నా. రెండోసారి తిరుగులేని మెజార్టీతో.. రెండు రాష్ట్రాల మధ్య ప్రయోజనాల విషయంలో కొన్ని అంశాల్లోనైనా వక్రీకరణలకు, బురదజల్లే రాజకీయాలకు తావివ్వకుండా ఉండాలంటే పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవిలో కొనసాగడం మంచిది కాదని నిర్ణయించుకున్నా. నా రాజకీయ జీవితంలో మీరంతా భాగమయ్యారు. నేను ఏదైనా జవాబు చెప్పాల్సి వస్తే మీకు (ప్రజలకు) మాత్రమే చెప్పాలి. అందుకే ఉన్నది ఉన్నట్లు చెప్పాలని నిర్ణయించుకున్నా. జగన్ తనను తాను నిరూపించుకుంటూ మంచి సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మీ అందరి దయతో, తిరుగులేని మెజార్టీతో రెండోసారీ సీఎం అవుతారనే నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. ఈ పరిస్థితుల్లో నేను రెండు రాష్ట్రాల్లో తల్లిగా ఇద్దరికీ అండగా ఉన్నా.. ఇద్దరిపై విమర్శలు చేసే వారు ఉంటారు. ఎక్కడికి వెళ్లినా తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను రాజశేఖరరెడ్డి భార్యగా ఆదరిస్తారు. దిగజారుడుతనం తగదు.. నేను రాయని లేఖతో, చేయని సంతకంతో సోషల్ మీడియాలో నా రాజీనామా పేరుతో జగన్కు వ్యతిరేకంగా లేఖ విడుదల చేశారు. ఇటువంటి వాటిల్లో వారి దిగజారుడుతనం కనిపిస్తోంది. పిచ్చిరాతలు, జుగుప్సాకర రాతలతో కుట్రలు బయపడుతున్నాయి. ఇటువంటి నాయకులకు, ఇలాంటి రాతలు రాసేవారికి ఎవరి కుటుంబంపైనా గౌరవం ఉండనిపిస్తుంది. దుష్ప్రచారాలు, వెన్నుపోట్లు.. రాజకీయం కాదు. రాజశేఖరరెడ్డి మాదిరిగా ప్రజలకు చివరి నిమిషం వరకు సేవ చేసి చనిపోయే నాయకులు కావాలి. నాకు రాజశేఖరరెడ్డి లేని లోటు తీరనిది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో జగన్, తెలంగాణలో షర్మిలమ్మ వైఎస్సార్ లేని లోటును తీరుస్తారు. మీరు బలం అయితే వారే మీకు బలం, అండ అవుతారు. వేరే రాష్ట్రంలో రాజకీయంగా షర్మిలకు అండగా ఉన్నా.. తల్లిగా జగన్కు, రాష్ట్ర ప్రజలకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటా. మాట కోసం పుట్టిన పార్టీ రాజకీయ పార్టీలు అధికారం కోసం పుడితే.. వైఎస్సార్ సీపీ మాత్రం నల్లకాలువలో జగన్ ఇచ్చిన మాట నుంచి పురుడు పోసుకుంది. దేశంలోని శక్తివంతమైన వ్యవస్థలన్నీ కలసి దాడి చేసినా.. తాను చేసేది న్యాయం, ధర్మం, మంచి అని నమ్మిన జగన్ ఎన్ని కష్టాలు వచ్చినా లెక్కచేయకుండా ప్రజల కోసం నిలబడ్డాడు. అప్పుడు నా బిడ్డ జగన్ను మీ చేతుల్లో పెట్టా. మిమ్మల్ని నడిపించమంటే.. వెన్నంటే ఉండి ముఖ్యమంత్రిని చేశారు. మళ్లీ మీకే అప్పగిస్తున్నా.. మీరే అతనికి బలం కావాలి. మీ బిడ్డల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుతాడని మాటిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ పొమ్మనక పొగపెడితే 2011లో మానవత్వపు విలువలతో వైఎస్సార్సీపీ పురుడు పోసుకుంది. అరెస్టులతో భయపెట్టినా.. కష్టాల బాట ముందు ఉందని తెలిసినా వెరవకుండా నిలబడింది. జగన్ మీద అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేశారు. ప్రతిపక్షాలకు ఇదే నా సమాధానం.. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా తనను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలనే వ్యక్తిత్వంతో జగన్ పని చేస్తున్నాడు. అందుకే ఏడాదిన్నరలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ అని గర్వంగా చెబుతున్నా. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.1.60 లక్షల కోట్లను డీబీటీ విధానంలో లంచాలు లేకుండా నేరుగా ప్రజలకు అందించాం. అభివృద్ధి ఎక్కడ జరుగుతుందని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకు ఇదే నా సమాధానం. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే నిజమైన అభివృద్ధి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఎవరికీ ఏ ఒక్క పథకం కూడా గుర్తు రాదు. నాన్న బాటలోనే నడుస్తా...! ‘‘జగన్ అప్పుడు చాలా చిన్నవాడు. పదో తరగతి చదువుతున్నాడు. వైఎస్సార్ ఎక్కువగా ప్రజలతోనే ఉండేవారు. మాతో వారానికి ఒక్క పూటైనా గడిపిన సందర్భాలు చాలా తక్కువ. ఆ సమయంలో జగన్తో.. నాన్నా నీకు రాజకీయాలు వద్దు. నాలుగు పరిశ్రమలు పెట్టుకుని దర్జాగా కాలిపై కాలేసుకుని పది మందికి పని కల్పించే జీవితాన్ని ఎంచుకోమన్నా. కానీ 15 ఏళ్లు కూడా లేని జగన్.. అటువంటి జీవితం నాకొద్దమ్మ. నాన్న ఏ విధంగా నడుస్తున్నారో ఆ జీవితాన్నే నేను కోరుకుంటా అని చెప్పాడు. ఈ రోజు ప్రజలందరి ప్రేమ, అభిమానాన్ని సంపాదించిన నా బిడ్డ జగన్ను చూసి చాలా గర్వపడుతున్నా. మనసుతో చేసే ప్రజా పరిపాలనను కళ్లారా చూస్తున్నా’’ –వైఎస్ విజయమ్మ చదవండి: ఉద్దండ నాయకులకే గొంతు ఎండిపోయేలా చేశారు: వైఎస్ విజయమ్మ -
మన జెండా తమ గుండెగా మార్చుకున్న కోట్ల మందికి సెల్యూట్: సీఎం జగన్
-
ఉద్దండ నాయకులకే గొంతు ఎండిపోయేలా చేశారు: వైఎస్ విజయమ్మ
సాక్షి, తాడేపల్లి: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రస్థానమంతా జనంతో ముడిపడి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. మహానేత వైఎస్సార్ 73వ జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్నారు. ప్లీనరీ సమావేశాలకు హాజరైన వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. రాజశేఖరరెడ్డి అందరివాడు. మీ అందరి హృదయాల్లో వైఎస్సార్గారు సజీవంగా ఉన్నారని అన్నారు. ఉద్దండ నాయకులకే గొంతు ఎండిపోయేలా చేశారు ఆనాడు అధికార శక్తులన్నీజగన్పై విరుచుకుపడ్డా బెదరలేదు. అన్యాయంగా కేసులు పెట్టి వేధించారు. 2011లో కాంగ్రెస్ పొమ్మనలేక పొగపెట్టింది. జగన్ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఉద్దండ నాయకులకే వైఎస్ జగన్ గొంతు ఎండిపోయేలా చేశారు. ఈ రోజు సగర్వంగా ప్లీనరీ జరుపుకుంటున్నాం. మీ అందర్నీ ఆశీర్వదించడానికి, అభినందించడానికి నేను వచ్చాను. ప్రజల అభిమానం, ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్సీపీ పుట్టింది. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న అమ్మ ఒడి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పాలనలో విప్లవాన్ని తెచ్చారు. జగన్ చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేశారు. యువతకు రోల్మోడల్ వైఎస్ జగన్ వైఎస్ జగన మాస్ లీడర్. జగన్ యువతకు రోల్మోడల్. మీ అందరి ప్రేమ సంపాదించిన జగన్ను చూసి గర్వపడుతున్నా. నా బిడ్డను నడిపించుకోమని మీకే అప్పజెప్పా. నా బిడ్డను నడిపించిన మీ అందరిపైనా నా అణువణువునా కృతజ్ఞత ఉంది. మీ బిడ్డల్ని జగన్ చేతుల్లో పెట్టండి, వారికి ఉజ్వల భవిష్యత్ అందిస్తారు. మీతో నా అనుబంధం ఈనాటిది కాదు, 45 ఏళ్ల అనుబంధం ఉంది. ఇకపైనా ఈ అనుబంధం కొనసాగాలి అంటూ వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. షర్మిలకు అండగా ఉండాలనుకుంటున్నా వైఎస్సార్ బిడ్డగా షర్మిల వైఎస్సార్టీపీ పెట్టుకుంది. తండ్రి ఆశయాల మేరకు ప్రజాసేవ చేయాలనే నిర్ణయించుకుంది. వైఎస్సార్ భార్యగా, బిడ్డకు తల్లిగా షర్మిలకు అండగా ఉండాలనుకుంటున్నా. ఏపీ ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ ఇక్కడ అవసరం. తెలంగాణ కోడలిగా షర్మిల అక్కడ ప్రజాసేవలో ఉండాలనుకుంది. తెలంగాణలో ఏపీ కంటే ముందుగానే ఎన్నికలు వస్తున్నాయి. వైఎస్సార్ బిడ్డలే అయినా ఇద్దరు వేర్వేరు పార్టీలకు ప్రతినిధులు. దేవుడి అండతో, ప్రజల మద్దతుతో మళ్లీ సీఎంగా జగన్ గెలుస్తారు అని వైఎస్ విజయమ్మ అన్నారు. తల్లిగా జగన్కు ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది వైఎస్సార్సీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా. తెలంగాణలో షర్మిలకు ప్రస్తుతం నా అవసరం ఉంది. నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండాలనే ఈనిర్ణయం తీసుకుంటున్నాం. ప్రజలకు నా ఇద్దరు బిడ్డలు అండగా ఉంటారు, మీ మద్దతు వారికి కావాలి. తల్లిగా జగన్కు ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది అని వైఎస్ విజయమ్మ తెలిపారు. చదవండి: (CM YS Jagan Speech: మన పార్టీ సంఘర్షణ 13ఏళ్ల కింద మొదలైంది) -
మీ అందరికి సెల్యూట్ చేస్తున్నా..
‘పావురాలగుట్టలో 13 ఏళ్ల క్రితం.. అంటే 2009 సెప్టెంబరు 25న ఈ సంఘర్షణ మొదలైంది. ఓదార్పు యాత్రతో ఓ రూపం సంతరించుకుని, 2011 మార్చిలో వైఎస్సార్సీపీగా ఆవిర్భవించింది. 11 ఏళ్ల క్రితం నాన్న గారి ఆశయాల సాధన కోసం.. మనందరి ఆత్మాభిమానం కోసం ఈ పార్టీ పుట్టింది. మీరంతా అవమానాలను సహించి, కష్టాలను భరించి, నన్ను అమితంగా ప్రేమించారు. ఈ ప్రయాణంలో నాతో నిలబడి, నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, అక్కకు, చెల్లెమ్మకు, అవ్వా తాతలకు, ప్రతీ కార్యకర్తకు, ప్రతి అభిమానికి.. మన జెండా తమ గుండెగా మార్చుకున్న వైఎస్సార్సీపీ యోధులకు, కోట్లమంది మనసున్న మనుషులకు మీ జగన్ ప్రేమ పూర్వకంగా, హృదయ పూర్వకంగా, కృతజ్ఞతా పూర్వకంగా, మీ వాడిగా, మీ ఆప్తుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా సెల్యూట్ చేస్తున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగంతో అన్నారు. వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: శుక్రవారం విజయవాడ గుంటూరు జాతీయ రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీకి ప్రభంజనంలా తరలివచ్చిన శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో 95 శాతం హామీలను అమలు చేసి.. సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం చేయడమంటే ఇలా అని చాటిచెప్పామన్నారు. మనం ప్రజలకు చేస్తున్న మంచిని చూసి జీర్ణించుకోలేకే అసూయతో ప్రతిపక్షం మనపై నిందలేస్తోందని మండిపడ్డారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నా గుండె బెదరలేదు.. సంకల్పం చెదర లేదు ►2009 నుంచి ఈ రోజు వరకు అంటే ఈ 13 సంవత్సరాల ప్రయాణంలో మన బాటలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఎన్ని ముళ్లున్నా, మన మీద ఎన్ని రాళ్లు పడినా, ఎవరు పగబట్టినా, ఎన్ని వ్యవస్థలు మన మీద కత్తి కట్టినా, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆ కట్టుకథలకు విలువ లేదు.. నా గుండె బెదరలేదు. నా సంకల్పం చెదరలేదు. ►నాన్న చనిపోయిన తర్వాత నాకు ఇచ్చిన ఈ జగమంత కుటుంబం ఏనాడూ నా చేయి విడవలేదు. తోడుగా నిలబడ్డారు. అడుగులు వేయడంలో బలాన్నిచ్చారు. కాబట్టే 2019లో అంటే మూడేళ్ల క్రితం చరిత్రలో కనీ వినీ ఎరగని విధంగా మెజారిటీ వచ్చింది. దేవుడి దయ, మీ అందరి అండతో పాటు, ప్రజలు గొప్పగా ఆశీర్వదించారు. ఆ ఆశీస్సులు, దేవుడి దయతో 175 స్ధానాలకుగాను ఏకంగా 151 ఎమ్మెల్యే స్థానాలతో ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చారు. ►ఒకవైపు 175 స్థానాలకు 151 ఎమ్మెల్యే స్థానాలతో ప్రజలు మనకు అధికారం ఇవ్వగా.. మరోవైపు ఆ దేవుడి దయ చూడండి.. 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొన్న వారిని 23 ఎమ్మెల్యే స్థానాలకు, మూడు ఎంపీ స్థానాలకు పరిమితం అయ్యేటట్టు చేశారు. మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ ►అధికారం అంటే అహంకారం కాదు. అధికారం అంటే ప్రజల మీద మమకారం అని నిరూపిస్తూ.. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారం వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాల్లో అయినా ప్రజల కోసమే బతికాం. పేదల కోసం, సామాన్యూల కోసం, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల వారి కోసమే బతికాం. అనుబంధాల కోసమే బతికాం. చెప్పిన మాట నిలబెట్టుకునేందుకే ప్రతిక్షణం తపిస్తూ బతికాం. ►గతంలో ఎన్నికలప్పుడు మేనిఫెస్టో విడుదల చేసేవారు. ఆ తర్వాత దానిని చెత్తబుట్టకే పరిమితం చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో చూశాం. అటువంటి పరిస్థితి నుంచి మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించి ఈ మూడేళ్లు పాలన సాగించాం. ఈ పరిస్థితిలో తన మేనిఫెస్టోను చూపించడానికి టీడీపీ భయపడి.. యూట్యూబ్ నుంచి, వారి వెబ్సైట్ నుంచి తీసేయించింది. మన మేనిఫెస్టోను చూసి భయపడుతోంది. ►మనం ఈ మూడేళ్లలోనే 95 శాతం హామీలు అమలు చేశాం. ఈ మేనిఫెస్టోను చూపిస్తూ.. గడప గడపకూ వెళ్లి మనిషి, మనిషినీ కలుస్తున్నాం. అక్కా, అన్నా.. అవ్వా.. తాతా.. ఈ మేనిఫెస్టోలో చెప్పిన పథకాలన్నీ మీకు అందాయా అని అడుగుతుంటే.. వారు చిరునవ్వుతో అందాయని ఆశీర్వదిస్తుండటం కనిపిస్తోంది. ప్రతి రంగంలోనూ మనదైన ముద్ర ►ప్రతి రంగంలో మనదైన ముద్ర వేయగలిగాం. మూడేళ్ల పాలనలో రెండు సంవత్సరాలు కరోనా సవాల్ విసిరినా.. ఆర్థికంగా అంతకు ముందు పాలకుడు, గత ప్రభుత్వంలో చంద్రబాబు రాష్ట్రాన్ని ముంచేసిపోయినా.. వారు పెట్టిన బకాయిలు మనమే కట్టాల్సి వచ్చినా చెల్లించాం. నవరత్నాల పాలనను అందిస్తామని చెప్పిన మాటను తప్పకుండా అమలు చేస్తానని మీ అన్నదమ్మునిగా తెలియజేస్తున్నాను. ►2009 నుంచి 2019 వరకు కానివ్వండి.. 2019 నుంచి 2022 వరకు కానివ్వండి.. ఇక మీదట జరగబోయే ప్రయాణం కానివ్వండి.. ఒక మాట కోసం, నిబద్ధత కోసం, విలువల వ్యవస్థ సాధించడం కోసం మన పాలన, మన ప్రయాణం సాగుతుంది. ఒక్క పథకానికీ చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ కాదు ►మూడేళ్లలోనే నవరత్నాలులో ప్రతి పథకాన్ని అమలు చేసిన మన పార్టీ మీద, మన ప్రభుత్వం మీద.. 14 ఏళ్లు సీఎంగా పని చేసినప్పటికీ.. ఆయన పేరు చెబితే ఏ ఒక్క పథకానికీ కేరాఫ్ అడ్రస్ కాని వ్యక్తి నోరు పారేసుకుంటున్నాడు. ఆ విమర్శలు, కట్టుకథలు, పచ్చి బూతులకు అబద్ధాలు జోడించి ప్రచారం చేసే వాళ్లు ఈ రోజు పత్రికలు, టీవీలు నడుపుతున్న పరిస్థితి. మన కర్మ కొద్దీ చూస్తున్నాం. ►వీరంతా అప్పట్లో అధికారాన్ని అడ్డు పెట్టుకుని బాగా మెక్కేసారు. బాగా నొక్కేశారు. బాగా దోచుకుని పంచుకున్నారు. ఇప్పుడు ఆ పంచుకోవడం ఆగిపోయింది. ఈ గజ దొంగల ముఠాకు అందుకే నిద్ర పట్టడం లేదు. అందుకే వీరికి కడుపు మంట ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. ఎన్ని జలిసిల్ మాత్రలు ఇచ్చినా వీళ్ల కడుపు మంట తగ్గదు. నాకు వాళ్ల తోడు ఉండకపోవచ్చు.. ►నాకు ఈ చంద్రబాబు మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తోడుగా ఉండకపోవచ్చు. వాళ్ల మాదిరిగా దత్తపుత్రుడి అండా ఉండకపోవచ్చు. కానీ నాకు ఉన్నది మీ తోడు ►ఈ విషయాలన్నింటిపై మనతో పాటు రాష్ట్ర ప్రజలంతా ఆలోచించేలా ఈ ప్లీనరీలో తీర్మానాలు, చర్చలు, ప్రసంగాలు ఉపయోగపడతాయని ఆకాంక్షిస్తున్నా. రేపు (శనివారం) సాయంత్రం విస్తృత స్థాయిలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన, వస్తున్న కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి మరోసారి మాట్లాడతాను. గజ దొంగల ముఠాకు చేతలతోనే సమాధానం ►ఎలాంటి అడుగులు వేశాం, చరిత్రలో ఎప్పుడైనా గతంలో ఇలాంటి అడుగులు పడ్డాయా? ఇంతటి మార్పు ఎప్పుడైనా చూశామా? అన్నది కళ్లెదుటే స్పష్టంగా కనిపిస్తున్నా, అసూయతో గిట్టని వారు విమర్శిస్తూ నిందలు వేస్తున్నారు. మంచి చేసిన చరిత్రగానీ, మాటకు విలువ ఇచ్చిన నైతికతగానీ ఏనాడైనా ప్రతిపక్షానికి ఉన్నాయా? అని ఇవాళ నేను సవాల్ విసురుతున్నా. ►దుష్ట చతుష్టయం అంటే మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీరికితోడు వీరికొక దత్తపుత్రుడు. ఈ ఎల్లో మీడియా, ఎల్లో పార్టీల జాయింట్ గజ దొంగల ముఠా రాతలు, పైశాచిక మాటలకు మనం చేతల్లోనే సమాధానమిస్తాం. ►అన్ని రకాలుగా ఇంటింటికి, ప్రతి కుటుంబానికి, ప్రతి సామాజిక వర్గానికి చేసిన మంచి ద్వారా మనం సమాధానమిస్తాం. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ఇప్పటికే 95 శాతం అమలు చేసిన పార్టీ వైఎస్సార్సీపీ. చెప్పిన ఏ ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేసిన వారు ఈ రోజు విమర్శలు చేస్తున్నారు. మాటకు కట్టుబడిన పార్టీ వైఎస్సార్సీపీ ►మన పార్టీ అంటే వైఎస్సార్సీపీ ఆడిన మాటకు కట్టుబడి ఉన్నామనే దానికి అర్థం తెచ్చిన పార్టీ అని సగర్వంగా తెలియజేస్తున్నా. ఈ మూడేళ్ల పరిపాలన, అంతకు ముందు మన ప్రయాణంలో చేసిన యుద్ధం.. అన్నింటిలో కూడా దేవుడి దయ మనకు పుష్కలంగా ఉంది. ►ఈ రోజు మన ప్రభుత్వం రాజకీయ వ్యవస్థలో మార్పు అంటే ఏమిటో చూపించింది. ఇది గ్రామాన్ని, గ్రామ పరిపాలనా వ్యవస్థను ప్రజలకు చేరువగా, అనుకూలంగా, పారదర్శకంగా అవినీతి, వివక్ష లేకుండా ఎలా చేయగలమో, ఎలా మార్చామో చూపించింది. ►రైతుల మీద మమకారం.. సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయం, పరిపాలనా సంస్కరణలు, అక్కచెల్లెమ్మల సాధికారత, అవ్వా తాతల మీద మమకారం, పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే విద్యా విధానం, ఆరోగ్య రంగంపై ప్రేమ, పేదల సొంతింటి కలను నిజం చేయడం, అవినీతికి తావు లేకుండా, లంచాలు అడిగే పరిస్థితి లేకుండా పారదర్శక పాలన అంటే ఈ మాదిరిగా ఉంటుందని ఈ మూడేళ్లలో చేసి చూపించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్సార్సీపీ ప్లీనరీ పండగ
-
Praja Sankalpa Yatra: జనం చెంతకు జగనన్న అడుగులు (ఫోటోలు)
-
YSRCP Plenary 2022: అభిమాన సంద్రం.. వెయ్యికార్లతో ప్లీనరీకి..
సాక్షి, అమరావతి: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తోన్న ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి వస్తున్నారు. ప్లీనరీ మొదటి రోజున వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వెయ్యికార్లతో భారీ ర్యాలీగా తరలివచ్చారు. దీంతో గుంటూరు-విజయవాడ జాతీయ రహదారి అభిమాన సంద్రమైంది. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు పేరునా లేఖ రాసి ఆహ్వానించడంతో పార్టీ వార్డు సభ్యులు మొదలు ప్రజాప్రతినిధుల వరకు అందరూ తొలి రోజున ప్రతినిధుల సభకు కదలివస్తున్నారు. కాగా, 2017 జూలై 8-9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశమైన నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగానే మూడో ప్లీనరీని నిర్వహిస్తున్నారు. ప్లీనరీ ప్రాంగణానికి మహానేత వైఎస్సార్ ప్రాంగణంగా నామకరణం చేశారు. చదవండి: (వైఎస్సార్కు నివాళులర్పించిన సీఎం జగన్, కుటుంబ సభ్యులు) డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం ప్లీనరీ ప్రాంగణాన్ని పర్యవేక్షించారు. ప్లీనరీ భద్రతా విధుల కోసం దాదాపు 3,500 మంది పోలీసులను నియమించినట్లు తెలిపారు. ప్లీనరీలో పాల్గొనే కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు ఒకే మెనూ ప్రకారం టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్ అందించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. -
సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ విజువల్స్
-
ప్లీనరీ కోసం వంటలు ఎలా చేస్తున్నారో చూడండి
-
వైఎస్సార్సీపీ ప్లీనరీ.. ముగిసిన తొలిరోజు సమావేశాలు
-
YSRCP Plenary 2022: కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు ఒకే మెనూ
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా 2017 జూలై 8 – 9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీని నిర్వహిస్తోంది. ప్లీనరీ ప్రాంగణానికి మహానేత వైఎస్సార్ ప్రాంగణంగా నామకరణం చేశారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు పేరునా లేఖ రాసి ఆహ్వానించడంతో పార్టీ వార్డు సభ్యులు మొదలు ప్రజాప్రతినిధుల వరకు అందరూ తొలి రోజున ప్రతినిధుల సభకు కదలివస్తున్నారు. అందరికీ ఒకే మెనూ ► ప్లీనరీలో పాల్గొనే కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు ఒకే మెనూ ప్రకారం టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్ అందించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వాటిని తయారు చేయడానికి అవసరమైన వంట సామగ్రి, కూరగాయలు, సరుకులను భారీ ఎత్తున సిద్ధం చేశారు. ► ఇందుపల్లి, ద్రాక్షారామం తదితర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వంట వాళ్లను రప్పించారు. గురువారం సాయంత్రం నుంచే వారు పని ప్రారంభించారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల సంప్రదాయ వంటకాలతో వేడి వేడిగా టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్ అందించనున్నారు. ► ఇడ్లీ, పొంగల్, ఉప్మా, మైసూర్ బజ్జీలను శుక్ర, శనివారం ఉదయం టిఫిన్లుగా అందిస్తారు. 25 రకాల వంటకాలతో భోజనాలు అందించనున్నారు. శాఖాహారం, మాంసాహార భోజనాలను వేర్వేరుగా సిద్ధం చేస్తున్నారు. చదవండి: (దారులన్నీ ప్లీనరీ వైపే) -
సీఎం పాలనకు గీటురాయిగా ప్లీనరీ
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనకు గీటురాయిగా ప్లీనరీ నిలుస్తుందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. సంక్షేమ పథకాలతో, పారదర్శక విధానాలతో సీఎం వైఎస్ జగన్ జనరంజక పాలన అందిస్తుండటం వల్ల ప్లీనరీ ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతుందన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ శ్రేణుల్లో, ప్రజల్లో వస్తున్న స్పందన చూస్తుంటే ప్లీనరీ భారీ ఎత్తున విజయవంతమవడం ఖాయమని స్పష్టం చేశారు. ఇది చూసి తాళలేక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెక్కి వెక్కి ఏడుస్తారని దెప్పిపొడిచారు. విజయసాయి రెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ► ప్లీనరీకి ఒక క్రమపద్ధతిలో ఆహ్వానాలు పంపాం. పార్టీ వ్యవస్థలో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఇదే ఆహ్వానంగా భావించి హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ► జూలై 8వ తేదీ మొదటి రోజు సుమారు 1.50 లక్షల మంది.. రెండో రోజు 4 లక్షల మంది హాజ రవుతారని అంచనా వేస్తున్నాం. ► 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు.. ఇప్పుడు తెల్లారిలేస్తే మాపై విమర్శలు చేస్తూ బతుకుతున్నారు. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిలుపుదల చేయాలనే దురుద్దేశంతో కుటిల ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం అందరికీ తెలుసు. నిజానికి ఒక్క స్కూల్ మూసి వేయకున్నా 8 వేల గ్రామాల్లో స్కూళ్లను మూసేశారని మదనపల్లెలో పచ్చి అబద్ధం చెప్పారు. ► విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, సుపరిపాలన అంశాల్లో రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉంది. తండ్రీకొడుకులు తాగేది ఏ బ్రాండ్? ► చంద్రబాబు ప్రతిరోజు ఒక అబద్ధాన్ని తీసుకుని, దాన్నే నిజం అని పదే పదే ప్రజల మెదళ్లలో విషం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్ర భుత్వ హయాంలో ఒక్క డిస్టలరీకి కొత్తగా అను మతి ఇవ్వలేదు. గతంలో ఎన్నడూ లేని 254 కొ త్త లిక్కర్ బ్రాండ్లకు అనుమతి ఇచ్చింది చంద్ర బాబే. అలాంటి ఆయన మద్యంలో కెమికల్స్ ఉన్నాయని అబద్ధాలాడుతున్నారు. బాబు, లోకేష్.. ఏ బ్రాండు తాగుతున్నారో చెప్పాలి. ► ప్లీనరీకి మా పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షులు వైఎస్ జగన్, పార్టీ ప్రజాప్రతినిధులంతా హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై తొలి రోజు తీర్మానం ప్రతిపాదిస్తాం. మరుసటి రోజు ఎన్నిక జరుగుతుంది. ► పార్టీని మరింత పటిష్టం చేసే కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ కమిటీల నియా మకానికి సంబంధించి శుక్రవారం ప్రకటన చేయబోతున్నారు. దీంట్లో ప్రతి స్థాయిలో కూడా ఎలా నియామకాలు జరగాలనేది దిశానిర్దేశం చేస్తారు. తద్వారా రాబోయే ఎన్నికలకు సమాయత్తం అవుతాం. చేసిన మంచి పనులన్నీ చెబుతాం ► మేం చేసిన మంచి పనులన్నీ ప్లీనరీలో చెబుతాం. వక్తలందరూ మాట్లాడతారు. తీర్మానాలు ఆమోదిస్తాం. ► ప్లీనరీలో పెట్టే భోజనాల విషయంలో టీడీపీ, చంద్రబాబు అసంబద్ధ ఆరోపణ లు చేస్తున్నారు. ప్లీనరీకి హాజరయ్యే వారికి 25 రకాల శాఖాహార, మాంసాహార వంట కాలతో భోజన ఏర్పాట్లు చేశాం. ► మేమేదో ప్లీనరీలో పంది మాంసం పెడుతున్నామని చంద్రబాబు దుష్ప్రచా రం చేస్తున్నారు. బహుశా చంద్రబాబుకు అది తిని తిని అలవాటు అయిందేమో! మా ప్లీనరీ మెనూలో దాని ప్రస్తావనే లేదు. -
ప్లీనరీకి పటిష్ట భద్రత
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్లీనరీకి పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. విజయవాడ – గుంటూరు మధ్య జాతీయ రహదారికి సమీపంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానంలో శుక్ర, శనివారాల్లో ప్లీనరీ జరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు మంత్రులు, వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఈ ప్లీనరీలో పాల్గొననున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహిస్తున్న మొదటి ప్లీనరీ కావడంతో కార్యకర్తలు అంచనాలకు మించి రానున్నారు. అందుకు తగ్గట్టుగానే పోలీసు శాఖ భద్రత ఏర్పాట్లు చేసింది. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి పర్యవేక్షణలో అదనపు డీజీ (శాంతి భద్రతలు) రవిశంకర్ అయ్యన్నార్, గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, విజయవా డ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, గుంటూ రు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ అంశాలపై ప్రణాళిక రూపొందిం చారు. డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి ప్లీనరీ ప్రాంగణాన్ని గురువారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. దాదాపు 3,500 మంది పోలీసులను ప్లీనరీ భద్రతా విధుల కోసం నియమించారు. 14 మంది ఐపీఎస్ అధి కారులకు బాధ్యతలు అప్పగించారు. వీరు కాకుం డా 30 మంది డీఎస్పీలు, 120 మంది సీఐలు, 170 మంది ఎస్సైలకు విధులు కేటాయించారు. రిజర్వ్ ఫోర్స్ను కూడా అందుబాటులో ఉంచారు. సీఎం హెలికాప్టర్ కోసం ప్లీనరీ వేదికకు సమీపంలో హెలి ప్యాడ్ ఏర్పాటు చేశారు. సర్వం సిద్ధం.. వీఐపీలకు ప్రత్యేక ప్రవేశ ద్వారం ప్లీనరీకి హాజరయ్యే వీఐపీల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్లీనరీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, ఇతర కేబి నెట్ హోదా కలిగిన ప్రముఖులు దాదాపు 300 మం ది వీఐపీ జాబితాలో ఉన్నారు. వారికి వీఐపీ పాస్ లు, వాహన పాస్లు జారీ చేశారు. వారికి ప్రత్యేక రూట్ను నిర్ణయించారు. నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద ఏఎన్యూ డైవర్షన్ పాయింట్ నుంచి అండర్పాస్లో వచ్చి వేదిక వద్దకు చేరుకోవాలి. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రధాన వేదిక ముందు ‘డి జోన్’ను ఏర్పాటు చేశారు.ఆ జోన్’లోకి ఎవరినీ అనుమతించరు. విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు ఇతర ప్రాంతాల్లో అనుమానితుల కదలికలను గుర్తించేందుకు నిఘా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గురువారం రాత్రి విద్యుత్ దీపాల ధగధగలతో కాంతులీనుతున్న ప్లీనరీ ప్రాంగణం పక్కాగా పార్కింగ్ ఏర్పాట్లు చెన్నై–కోల్కతా జాతీయ రహదారిని ఆనుకుని ఉండే మైదానంలో ప్లీనరీ నిర్వహిస్తున్నందున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ► సీఎం కాన్వాయ్ వాహనాల పార్కింగ్: జేఎంజే స్కూల్ పార్కింగ్, సెయింట్ ఆన్స్ కాంపౌండ్. ► ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీచైర్మన్ల వాహనాలకు: బైబిల్ మిషన్ భవంతి పశ్చిమ వైపున ఉన్న ప్రదేశం. ► విజయవాడ వైపు నుంచి వచ్చే బస్సులకు: కాజా టోల్ గేట్ వద్ద ఉన్న ఆర్కే వెనుజియ లే అవుట్ వద్ద ► విజయవాడ నుంచి వచ్చే కార్లు, ఆటోలు, బైక్లు, స్కూటర్లకు : ఏఎన్యూ నార్త్, మెయిన్ గేటు, సౌత్ గేట్ల వద్ద పార్కింగ్, అయోధ్య రామిరెడ్డి – సన్స్ ఫంక్షన్ హాల్ ప్రదేశం ► గుంటూరు వైపు నుంచి వచ్చే బస్సులకు : నంబూరు, కంతేరు రోడ్డు పక్కన ► గుంటూరు వైపు నుంచి వచ్చే కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు: అమలోద్భవి హోటల్ ప్రాంగణం, జైన్ ఆలయం ప్రాంగణం, దశావతార ఆలయం ప్రాంగణం, కేశవరెడ్డి స్కూల్ ప్రాంగణం, కేశవరెడ్డి స్కూల్ వెనుక, కంతేరు రోడ్డు రైల్వే గేటు నుంచి సాయి భారతి హోం వరకు, రైల్వే గేటు దగ్గరలో సాయి భారతి హోం అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్, కంతేరు రోడ్డులో వైట్ ఫెన్సింగ్ ఖాళీ ప్రదేశం, ఎడ్ల పందేల ర్యాంప్, పల్లలమ్మ చెరువు నుండి కంతేరు రోడ్డు వరకు, ఖలీల్ దాబా వెనుక వైపు, రెయిన్ ట్రీ అపార్ట్మెంట్ సమీపంలో. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం: కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, భారీస్థాయిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు హాజరయ్యే వైఎస్సార్సీపీ ప్లీనరీ కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాం. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో మొత్తం 3,500 మంది పోలీసు సిబ్బంది భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. వీఐపీలకు అనుమతించిన వాహనాల్లో వారు మాత్రమే రావాలి. వారి అనుచరులు, కార్యకర్తలను అనుమతించరు. పోలీసులకు నేతలతో సహా అందరూ సహకరించాలి. జాతీయ రహదారి ట్రాఫిక్ మళ్లింపు ప్లీనరీ ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించే బహిరంగ సభకు లక్షలాదిగా పార్టీ శ్రేణులు హాజరుకానున్నాయి. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ను మళ్లించనున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఆంక్షలుంటాయి. ► చెన్నై నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం వైపు వెళ్లే భారీ రవాణా వాహనాలను ఒంగోలు జిల్లా త్రోవగుంట వద్ద మళ్లిస్తారు. చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ మీదుగా హనుమాన్ జంక్షన్ చేరుకోవాలి. అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం చేరుకోవచ్చు. ► చెన్నై నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్పల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లాలి. ► చిలకలూరిపేట వైపు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరు , చందోలు, చెరుకుపల్లి , భట్టిప్రోలు, పెనుమూడి వంతెన, అవనిగడ్డ మీదుగా హనుమాన్ జంక్షన్ చేరుకోవాలి. ► చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను బోయపాలెం క్రాస్ వద్ద మళ్లిస్తారు. ఉన్నం, ఏబీ పాలెం, వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు , చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి వంతెన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ మీదుగా హనుమాన్ జంక్షన్ చేరుకోవాలి. ► గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్ళే వాహనాలు బుడంపాడు క్రాస్ వద్ద మళ్లిస్తారు. తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడి వంతెన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ మీదుగా హనుమాన్ జంక్షన్ చేరుకోవాలి. ► విశాఖపట్నం వైపు నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద మళ్లిస్తారు. గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా ఒంగోలు చేరుకోవాలి. ► గుంటూరు వైపు నుంచి విజయవాడ వచ్చే వాహనాలు తాడికొండ, తుళ్ళూరు, వెంకటపాలెం, యెర్రబాలెం, డాన్ బాస్కో స్కూల్, ఉండవల్లి సెంటర్, తాడేపల్లి పెట్రోల్ బంక్, వారధి మీదుగా విజయవాడ చేరుకోవాలి. ► రాజమండ్రి నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు దివాన్ చెరువు, ధవళేశ్వరం వంతెన, కొవ్వూరు, జంగారెడ్డి గూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి మీదుగా వెళ్లాలి. ► విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద మళ్లిస్తారు. ఇవి నూజివీడు, మైలవరం, జి.కొండూరు మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోవాలి. ► గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు కేసరపల్లి, ముస్తాబాద, ఇన్నర్ రింగ్ రోడ్, పైపులరోడ్ మీదుగా ఇబ్రíహీంపట్నం చేరుకోవాలి. ► హనుమాన్ జంక్షన్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్, ఆగిరిపల్లి, జి.కొండూరు మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోవాలి. ► భారీ సరకు రవాణా వాహనాలు గన్నవరం, ఆగిరిపల్లి, జి.కొండూరు మీదుగా ఇబ్రహీంపట్నం వైపు వెళ్లాలి. è హైదరాబాద్ నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలు నార్కెట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ళ, అద్దంకి, మేదరమెట్ల మీదుగా చెన్నై వెళ్లాలి. ► హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే భారీ వాహనాలు ఇబ్రహీంపట్నం నుంచి జి.కొండూరు, మైలవరం, నూజివీడు మీదుగా హనుమాన్ జంక్షన్ చేరుకోవాలి. మల్టీ యాక్సిల్ రవాణా వాహనాల నిలిపివేత చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే మల్టీ యాక్సిల్ రవాణా వాహనాలను చిలకలూరిపేట, ఒంగోలు, నెల్లూరు వద్ద నిలిపివేస్తారు. శనివారం రాత్రి 10 గంటల తరువాత అనుమతిస్తారు. విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్లే మల్టీ యాక్సిల్ రవాణా వాహనాలను హనుమాన్ జంక్షన్, పొట్టిపాడు టోల్ గేట్ వద్ద నిలిపివేసి, శనివారం రాత్రి 10 గంటల తరువాత అనుమతిస్తారు. -
YSRCP Plenary 2022: దారులన్నీ ప్లీనరీ వైపే
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా 2017 జూలై 8 – 9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీని నిర్వహిస్తోంది. ప్లీనరీ ప్రాంగణానికి మహానేత వైఎస్సార్ ప్రాంగణంగా నామకరణం చేశారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు పేరునా లేఖ రాసి ఆహ్వానించడంతో పార్టీ వార్డు సభ్యులు మొదలు ప్రజాప్రతినిధుల వరకు అందరూ తొలి రోజున ప్రతినిధుల సభకు కదలివస్తున్నారు. రెండో రోజున విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్రం నలు మూలల నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు తరలి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో.. వర్షం వచ్చినా ప్లీనరీకి హాజరయ్యే వారు తడవకుండా భారీ విస్తీర్ణంలో వాటర్ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు. మూడేళ్లలో చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్, పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులను గుర్తు చేస్తూ నమూనా ఏర్పాటు చేశారు. విద్యుత్ దీప కాంతులతో ప్రాంగణం ధగధగలాడుతోంది. రక్తదాన శిబిరానికి ఏర్పాట్లు చేశారు. కాగా, కాలర్ ఎగరేసుకుని తిరిగేలా సీఎం వైఎస్ జగన్ పరిపాలిస్తుండటంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది. ఈ క్రమంలో ప్లీనరీకి భారీ స్థాయిలో శ్రేణులు తరలి వస్తున్నాయి. 3 వేల మంది వలంటీర్లు వైఎస్సార్సీపీ ప్లీనరీలో 3 వేల మంది వలంటీర్లు పాల్గొంటున్నారని ప్లీనరీ వలంటీర్స్ కమిటీ కన్వీనర్, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ప్లీనరీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే వారు ఇక్కడికి చేరుకున్నారని చెప్పారు. ఓ వైపు వర్షం పడుతున్నప్పటికీ మొక్కవోని దీక్షతో ప్లీనరీ ప్రాంగణంలో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. జాతీయ రహదారి పొడవునా వైఎస్సార్సీపీ పతాకాలు, కటౌట్లు, బెలూన్లు వంటశాలలో విజయసాయిరెడ్డి తదితరులు ‘జననాయక’ సీడీల ఆవిష్కరణ వైఎస్సార్సీపీ ప్లీనరీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ‘జన నాయక’ పేరిట రూపొందించిన పాటల సీడీలను పార్టీ నేతలు, మంత్రులు కలసి గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్పీపీ నేత వి.విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్సనారాయణ, విశ్వరూప్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈ సీడీని రూపొందించారు. ప్లీనరీలో కార్యక్రమాలు ఇలా.. ► వైఎస్సార్సీపీ ప్లీనరీకి హాజరయ్యే పార్టీ ప్రతినిధులు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు పేర్లు నమోదు చేయించుకోవాలి. ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యుల సమావేశం జరుగుతుంది. అనంతరం సీఎం వైఎస్ జగన్ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ప్లీనరీ వేదికపైకి సీఎం వైఎస్ జగన్ను, ప్రధాన నాయకులను ఆహ్వానిస్తారు. ► వందేమాతరం గీతాలాపనతో ప్లీనరీ మొదలవుతుంది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం వైఎస్ జగన్, నాయకులు పూలమాలలు వేసి, నివాళులు అర్పిస్తారు. ప్రార్థన పూర్తయ్యాక పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటనను సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేస్తారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ ప్రారంభోపన్యాసం చేస్తారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సందేశం ఇస్తారు. ► పార్టీ ఆడిట్ ఖర్చుల స్టేట్మెంట్ను పి.కృష్ణమోహన్రెడ్డి ప్రతిపాదించి.. ప్లీనరీ ఆమోదం కోరుతారు. పార్టీని మరింత బలోపేతం చేసేలా నియమావళికి సవరణలు ప్రతిపాదించి.. ప్లీనరీ ఆమోదం కోరుతారు. ఆ తర్వాత మహిళా సాధికారత – దిశ చట్టం, విద్య, నవరత్నాలు – డీబీటీ, వైద్యం, పరిపాలన – పారదర్శకత అంశాలపై చర్చించి.. తీర్మానాలను ప్రవేశపెడతారు. ► శనివారం సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు – ఎంఎస్ఎంఈలు – ప్రోత్సాహకాలు, ఎల్లో మీడియా – దుష్టచుతుష్టయంపై చర్చించి.. తీర్మానాలను ప్రవేశపెట్టి.. ప్లీనరీ ఆమోదం కోరుతారు. అధ్యక్ష ఎన్నికను ప్రకటించి అభినందనలు తెలుపుతారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ ముగింపు ఉపన్యాసం ఉంటుంది. ఆ తర్వాత వందన సమర్పణతో ప్లీనరీ ముగుస్తుంది. -
జనం జెండా - ఒకటే లక్ష్యం ఒకటే ఆశయం
-
వైఎస్సార్సీపీ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు
-
ఉన్నత స్థానానికి వెళ్లాలనే సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు
-
చంద్రబాబు వెక్కి వెక్కి ఏడుస్తారు: ఎంపీ విజయసాయిరెడ్డి
-
పేదవాడి కడుపు నింపుతున్న దేవుడు సీఎం జగన్
-
చంద్రబాబు ఇంగ్లీష్ పై మంత్రి పెద్దిరెడ్డి సెటైర్లు
-
చరిత్రలో నిలిచిపోయేలా వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ
-
ప్లీనరీ తర్వాత చంద్రబాబు మళ్లీ బోరున ఏడుస్తారు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ప్లీనరీని అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. 'ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఎంతో నిర్మాణాత్మకంగా వ్యవహరించాం. అధికారంలోకి వచ్చాక కూడా అంతే నిర్మాణాత్మకంగా వ్యవహరించాము. సామాజిక న్యాయం దిశగా అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చాం. ప్లీనరీ విజయవంతం అవుతుందనడంలో ఎటువంటి అనుమానం లేదు. శుక్రవారం 1.50 లక్షల మంది, రెండో రోజు 4 లక్షల మంది వస్తారని అంచనా. బడుగు బలహీన వర్గాల్లో మంచి స్పందన కనిపిస్తోంది. ప్లీనరీ ఘనవిజయం చూసిన తర్వాత చంద్రబాబు వెక్కి వెక్కి ఏడుస్తాడు. వర్షం రాకుండా రెండు రోజులు మినహాయింపు ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. స్పెషల్ అహ్వానితులు ఎవరూ లేరు.. మా గౌరవ అధ్యక్షురాలు, పార్టీ అధ్యక్షులు హాజరవుతారు. ముందస్తు ఎన్నికలు వస్తే చంద్రబాబు సీఎం అవుతానని కలలు కంటున్నారు. ఆయన కలలు కళ్లలుగానే మిగిలిపోతాయి. పార్టీ కమిటీలకు సంబంధించి రేపటి రోజున అధ్యక్షులు ఒక నూతన విధానం ప్రకటిస్తారు. పార్టీని మరింత పటిష్టం చేసుకుని రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతాం' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆ అంశాలపైనే చర్చిస్తాం 'సంక్షేమాన్ని నిలుపుదల చేయాలని చంద్రబాబు వ్యవస్థలను అడ్డు పెట్టుకుంటున్నాడు. ఒక్క స్కూల్ కూడా మూతపడలేదు.. కానీ 8వేల స్కూళ్లు మూతపడ్డాయి అంటాడు. పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల వద్దకే ప్రభుత్వం అనేది ప్రూవ్ చేశారు. చంద్రబాబు ప్రతి ఇంటికీ ఉద్యోగం.. లేదంటే నిరుద్యోగ భృతి అన్నా మీ హామీ ఏమైంది. చంద్రబాబు హయాంలో డిస్టిలరీలకు అనుమతిచ్చారు. మా ప్రభుత్వ హయాంలో ఒక్క డిస్టిలరీకి అనుమతివ్వలేదు. మా హయాంలో డీబీటీ ద్వారా రూ.1.40 లక్షల కోట్లు ప్రజలకు నేరుగా వెళ్లాయి. చేసిన మంచి పనులే ప్లీనరీలో చెప్తాం. విద్య, వైద్యం, మహిళా సాధికారత వంటి అంశాలను చర్చిస్తాం. ప్లీనరీకి డ్వాక్రా మహిళలను తరలిస్తున్నట్లు చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. మా పార్టీ కార్యకర్తలు, ప్రతినిధులు మాత్రమే ప్లీనరీకి హాజరవుతారు. వారికే మేము ఆహ్వానం పంపాం తప్ప డ్వాక్రా మహిళలకు కాదు' అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. చదవండి: చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం -
వైఎస్సార్సీపీ ప్లీనరీ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రులు
సాక్షి, విజయవాడ: నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా రేపు, ఎల్లుండి నిర్వహించనున్న వైఎస్సార్సీపీ ప్లీనరీకి భారీ ఏర్పాటు చేశారు. ప్లీనరీ ప్రాంగణాన్ని మంత్రులు గురువారం పరిశీలించారు. ఈ రోజు సాయంత్రానికి నియోజకవర్గాల ఇన్ఛార్జ్లకు పాస్లు పంపిణీ చేయనున్నారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారన్నారు. విధానపరంగా పలు మార్పులు తీసుకొచ్చామన్నారు. చదవండి: ‘వణుకుతున్నారు.. అందుకే గుంపుగా వస్తున్నారు’ ప్లీనరీ నిర్వహణ ఏర్పాట్లపై ముఖ్యనేతల సమావేశం పీన్లరీ నిర్వహణ ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. ఘనంగా నిర్వహిస్తాం.. వైవీ సుబ్బారెడ్డి వైఎస్సార్సీపీ ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మా పార్టీ అధ్యక్షులు దిశా నిర్దేశం చేయబోతున్నారన్నారు. చంద్రబాబు మతి భ్రమించిందని.. గ్రామీణ స్థాయి పిల్లలు కూడా బాగా చదువుకుని ఉన్నత స్థానానికి వెళ్లాలనే సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారన్నారు. నాడు-నేడు ద్వారా స్కూళ్లలో సంస్కరణలు చేపట్టారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తొలిరోజు 9 తీర్మానాలు: పేర్ని నాని రేపటి ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. తొలిరోజు పార్టీ ప్రతినిధులతో సమావేశం ఉంటుందన్నారు. సీఎం జగన్ పార్టీ జెండా ఎగురవేసి ప్లీనరీ ప్రారంభిస్తారని.. తొలిరోజు 9 రాజకీయ అంశాలపై తీర్మానాలున్నాయని వెల్లడించారు. మూడేళ్లలో ఏం చేశాం.. రెండేళ్లలో ఏం చేయబోతున్నామో చెబుతామన్నారు. -
‘వణుకుతున్నారు.. అందుకే గుంపుగా వస్తున్నారు’
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ప్లీనరీ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నాలుగు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. చదవండి: పెట్టుబడులపై ఎందుకీ పగ? ‘‘పేదల జీవితం మార్పు కోసం 2017 లో ప్లీనరీ నిర్వహించాం. ఆ ప్లీనరీలో నవరత్నాల మేనిఫెస్టోని ప్రకటించారు. 2019లో 151 స్థానాల్లో గెలిచాం. గడిచిన మూడేళ్లలో 95 శాతం హామీలను నెరవేర్చాం. వైద్య, విద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు సీఎం జగన్ నాయకత్వం పట్ల నమ్మకం పెరిగింది. మూడేళ్లలో నేరుగా లబ్ధిదారులకు 1.50 లక్షల కోట్లను డిబిటి ద్వారా అందించాం. ప్రజల నమ్మకాన్ని మరింత పెంచేలా ఈ రెండేళ్ల పాలన ఉంటుంది. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లీనరీ ఉంటుందని’’ మంత్రి పేర్కొన్నారు. ‘‘రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబుకి స్కూళ్లు అంటే నారాయణ, శ్రీచైతన్య మాత్రమే. నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలని చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచన చేశారా?’’ అంటూ మంత్రి ప్రశ్నించారు. సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి ప్రతిపక్షాలు వణుకుతున్నాయి. ఒంటరిగా పోటీ చేయలేక గుంపుగా ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమని ప్రతిపక్షాలకు అర్థమైందని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. -
దుష్ప్రచారాలు జయకేతనాన్ని అడ్డుకోలేవు
పుత్రోత్సాహము తండ్రికి/ పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా/ పుత్రుని గనుగొని పొగడగ/ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! అని సుమతీ శతకంలో బద్దెన చెప్పారు. తండ్రికి నిజమైన పుత్రో త్సాహం కొడుకు పుట్టినప్పుడు లభించదనీ, ఆ కుమారుడిని అందరూ పొగుడుతున్నప్పుడు కలుగుతుందనీ దీని భావం. ఇవాళ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉంటే తాను కన్న కలలను సార్థకం చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ఎంత ఆనందించే వారో అన్న అభిప్రాయం కలుగు తోంది. ప్రొఫెసర్ అని నన్ను ఆప్యాయంగా పలకరించే వైఎస్ కళ్లలో ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్షే తొణికిస లాడేది. ఆయన ప్రారంభించిన ప్రతి పథకమూ ప్రజల కోసమే. ఇవాళ ఆయన బాటలో ప్రవేశించి తనదైన బాటను ఏర్పర్చుకున్న జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. గత ఎన్నికల్లో 86 శాతం సీట్లు, 50 శాతం ఓట్లు సంపాదించుకున్న జగన్ రానున్న ఎన్నికల్లో అంత కంటే ఎక్కువగా ప్రజాబలాన్ని సాధిస్తారని ఆత్మ విశ్వా సంతో చెప్పవచ్చు. జగన్ విద్యాధికుడైనందువల్లే విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేశారు. ప్రజలకు విద్య, వైద్యం చేరువ అయితే... వారు తమంతట తాము అభివృద్ధి చెందుతారని ఆయన అభిప్రాయం. ‘అమ్మ ఒడి’, ‘జగనన్న విద్యాదీవెన’, ‘వసతి దీవెన’, ‘గోరుముద్ద’, ‘విద్యాకానుక’, ‘నాడు–నేడు’ వంటి రకరకాల పేర్లతో విద్యాభివృద్ధికి పథకాలు చేపట్టారు. బడుగు–బలహీన వర్గాల ప్రజల కోరిక మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఇక వైద్యం విషయానికి వస్తే... వైఎస్ హయాంలో మొదలైన ‘ఆరోగ్యశ్రీ’ని జగన్ ప్రభుత్వం మరింత వినూ త్నంగా, సమర్థవంతంగా అమలు చేస్తున్నది. 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ ఆరోగ్యశ్రీని వర్తింప చేయడమే కాదు, కరోనాతో సహా 2,446 ప్రొసీజర్స్ను ఆ పథకం కింద చేర్చారు. అలాగే ఇవాళ ఏపీలో రైతులకు ప్రభుత్వం ఇస్తున్నంత అండదండలు మరే ప్రభుత్వం ఇవ్వడం లేదు. పెట్టుబడి సాయం, భరోసా కేంద్రాలు, పొలాల్లోనే పంటల కొను గోలు, పంటల బీమా, సరళమైన రిజిస్ట్రేషన్లు, ఉపకరణాల సబ్సిడీ వంటివి జగన్ మనసులో రైతుకున్న అభిమానానికి సంకేతం. రైతులే కాదు, మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, చేనేత కార్మికులు; ఆటో, టాక్సీడ్రైవర్లు; డ్వాక్రా మహిళలు... ఇలా వివిధ రంగాలకు చెందిన వారికి ఏదో రకంగా నగదు రూపంలో లబ్ధి లభించేలా జగన్ చర్యలు తీసుకోవడం అపూర్వం. ఎక్కడా దళారులు తమ బొక్క సాలు నింపుకోకుండా కేవలం మీట నొక్కడం ద్వారా నిధులు లబ్ధిదారుల ఖాతాలకు చేరడం జగన్ ప్రభుత్వ ప్రత్యేకత. ఇవాళ ఇళ్లు లేని పేదలు ఉండకూడదనేదే వైఎస్ జగన్ ప్రభుత్వం లక్ష్యం. అందుకే రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది. పేదలకోసం 17 వేల కాలనీలు నిర్మించారు. అధికార వికేంద్రీకరణ ద్వారే ప్రజల సమస్యలను పరిష్కరించవచ్చని భావించినందువల్లే జగన్ 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచారు. వినూత్నమైన గ్రామసచివాలయాల ద్వారా ప్రజల వద్దకు పాలన చేరుకుంది. అందుకే ప్రజా సంక్షేమ పాలనలో దేశంలో జగన్ సర్కార్ ప్రథమ స్థానంలో ఉన్నదని స్కాచ్ గ్రూప్ పరిపాలనా రిపోర్ట్ కార్డు వెల్ల డించింది. పోలీసు వ్యవస్థ, భద్రత, వ్యవసాయం, ఇ– గవర్నెన్స్, జిల్లా పరిపాలన నిర్వహణ, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టుల అమలులో కూడా ఏపీ ప్రథమ స్థానంలో నిలి చింది. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ అద్భుత కృషి చేసిందని నాబార్డ్ వార్షిక నివేదిక విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ వార్షికంగా 2 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. దారుణమేమంటే వైఎస్ జగన్ అధికారంలోకి రావ డాన్నీ, ఆయన సమర్థవంతంగా పాలించడాన్నీ, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడాన్నీ, ప్రజల ఖాతాల్లోకి ఇప్పటివరకూ లక్షన్నర కోట్లకు పైగా డబ్బు బదిలీ కావడాన్నీ ఆయన ప్రత్యర్థులు జీర్ణించు కోలేకపోతున్నారు. వారంతా కుమ్మక్కై, మీడియాలో అధిక భాగాన్ని ఆక్రమించి జగన్ సర్కార్పై తప్పుడు కథనాలను ప్రతిరోజూ ప్రచారం అయ్యేలా చూస్తున్నారు. అనేక ఇతర రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నా ఆ విషయాన్ని ప్రస్తావించకుండా దారుణంగా ఉన్నదంటూ దుష్ప్రచా రానికి దిగుతున్నారు. రెండు పత్రికలు, మూడు టీవీ చానల్స్తో జనం మనసును జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడం సాధ్యం కాదు. అదే సాధ్యమైతే గత ఎన్నికల్లోనూ, తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ జగన్ను జనం ఆదరించేవారు కారు. ఇవాళ జగన్ సర్కార్ విశ్వసనీయత తెలిసినందువల్లే ఈ అభూత కల్పనను జాతీయ స్థాయిలో కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధః జగత్సహోదరులకు– ఇంత వరకూ సామాజికంగా, ఆర్థికంగా, అన్నివిధాల వెలుగుకు నోచుకోని వర్గాలకు జగన్ పాలన జగన్మోహనంగా వుంది. జగన్ అంటే విశ్వసనీయత, జగన్ అంటే చెప్పింది చేయడం, జగన్ అంటే జయకేతనం! ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వ్యాసకర్త అధికార భాషా సంఘం అధ్యక్షులు, ఏపీ (వైకాపా ప్లీనరీ సందర్భంగా) -
CM YS Jagan: అన్నా.. నీ ఆహ్వానం గుండెల్లో పదిలం
సాక్షి,అమరావతి: సంక్షేమం.. అభివృద్ధి.. జోడు గుర్రాలుగా పాలనా రథాన్ని పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల గుండెల్లో ఎంతటి స్థానం సంపాదించుకున్నారో చెప్పేందుకు ఈ ఫొటో ఓ తార్కాణం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే ప్లీనరీకి ఆహ్వానిస్తూ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ఆహ్వాన పత్రికలు పంపిణీ చేశారు. తొట్టంబేడు మండలకేంద్రంలోని అరుంధతివాడకు చెందిన వెంకటేశ్వరికి కూడా ఆహ్వానపత్రం అందింది. ఆహ్వాన పత్రికపై సీఎం జగన్ నిలువెత్తు ఫొటో చూడగానే పట్టరాని సంతోషానికి గురైంది. నిలువనీడలేని మాకు ఓ గూడు కట్టించి ఇస్తున్న దేవుడు జగనన్న అంటూ ఉద్వేగానికి గురయింది. ‘నా భర్తకు వచ్చే చాలీచాలని కూలీతో ఇద్దరు పిల్లలున్న మాకు రోజు గడవడమే కష్టం.. అటువంటిది సొంతిల్లు అనేది తీరని కలే.. ఆ కలను నెరవేరుస్తున్న జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. అందుకే దేవుడిచ్చిన అన్న పంపిన ఈ ఆహ్వానాన్ని ఫ్రేమ్ కట్టించుకుని చిరకాలం గుర్తుగా ఉంచుకుంటాం’ అని చెప్పింది. -
ప్రజలకు మేలు చేయడమే అజెండాగా ప్లీనరీ
సాక్షి, అమరావతి: ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా, ప్రజలకు మేలు చేయడమే ఏకైక అజెండాగా ప్లీనరీ నిర్వహిస్తున్నామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2017 జూలై 8, 9వ తేదీల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన రెండో ప్లీనరీలో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ నవరత్నాలను ప్రకటించి.. ప్రజలకు భరోసా కల్పించారని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించిందని, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నవరత్నాలను పూర్తి స్థాయిలో అమలు చేశారని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సజ్జల ఇంకా ఏమన్నారంటే.. చెప్పినదాని కంటే అధికంగా మేలు ► నవరత్నాల్లో ఇచ్చిన హామీల కంటే సీఎం జగన్ అధికంగా మేలు చేశారు. పేదరికం చదువులకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో అమ్మ ఒడి ప్రకటించారు. నాడు–నేడు కింద రూ.16,450 కోట్లతో పాఠశాలలను ఆధునికీకరించారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా బైజూస్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ► 2014 ఎన్నికల్లో చంద్రబాబు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని రైతులు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని మహిళలను మోసం చేస్తే.. సీఎం వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో చెప్పిన దాని కంటే ఎక్కువగా సాయం చేస్తున్నారు. అందుకే సీఎం వైఎస్ జగన్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ► 2019 తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 % పైగా స్థానాల్లో వైఎస్సార్సీపీని గెలిపించారు. తిరుపతి లోక్సభ, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో 2019లో వచ్చిన మెజార్టీ కంటే అధిక మెజార్టీతో గెలిపించారు. ► రెండో ప్లీనరీలో ఇచ్చిన హామీలను సమీక్షించి.. వాటిని మరింత మెరుగ్గా అమలు చేయడంపై మూడో ప్లీనరీలో చర్చిస్తాం. వచ్చే ఎన్నికలలోగా ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పార్టీ రాజ్యాంగాన్ని సవరిస్తాం. సామాజిక న్యాయానికి కట్టుబడే.. ► మంత్రివర్గంలో దాదాపు 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయంలో దేశానికే దిక్సూచిలా నిలిచారు. సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీగా.. రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్మును ఎంపిక చేయడాన్ని స్వాగతించి, మద్దతు ఇచ్చాం. ► ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి ఉంటే మద్దతు ఇచ్చేవారు కాదా? రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు ఇవ్వడంపై చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తున్నారు? దానిపై ఎల్లో మీడియా ఎందుకు నిలదీయడం లేదు? ► రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడిన అంశాలపైనే ఎన్టీయే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాం. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించే అంశాలపై బీజేపీని వ్యతిరేకించాం. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోం. -
వాహనదారులకు అలర్ట్.. ఆ రూట్లో 9న ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదకాకాని వద్ద జాతీయ రహదారి – 16 సమీపంలో జరిగే వైఎస్సార్సీపీ ప్లీనరీ, బహిరంగ సభ సందర్భంగా ఈ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని భారీ వాహనాలతో పాటు ఇతర ట్రాఫిక్ ప్లీనరీ జరిగే జాతీయ రహదారిపైకి రాకుండా ఇతర మార్గాల్లోకి మళ్లించినట్టు చెప్పారు. ఈ నిబంధనలు శనివారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ► చెన్నై వైపు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం, నందిగామ, వైపు వెళ్లే భారీ గూడ్స్ వాహనాలను ఒంగోలు జిల్లా త్రోవగుంట నుంచి చీరాల–బాపట్ల–రేపల్లె– అవనిగడ్డ– పామర్రు– గుడివాడ– హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం వైపు మళ్లించారు. ► గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను బుడంపాడు క్రాస్ మీదుగా తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూరి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు– గుడివాడ– హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించారు. ► విశాఖపట్నం వైపు నుంచి చెన్నై వైపు వెళ్లే లారీలు, ఇతర భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ– పామర్రు– అవనిగడ్డ– రేపల్లె– బాపట్ల– చీరాల– త్రోవగుంట– ఒంగోలు మీదుగా మళ్లించారు. ► విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే లారీలు, భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు– మైలవరం– జి.కొండూరు, ఇబ్రహీంపట్నం వైపు మళ్లించారు. ► హైదరాబాద్ వైపు నుంచి విశాఖపట్నం వెళ్లే భారీ వాహనాలను ఇబ్రహీంపట్నం వద్ద నుంచి జి.కొండూరు – మైలవరం– నూజివీడు– హనుమాన్ జంక్షన్ మీదుగా అనుమతిస్తారు. ► చెన్నై వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే మల్టీ యాక్సిల్ గూడ్స్ వాహనాలను ఎటువంటి మళ్లింపు లేకుండా జాతీయ రహదారికి సమీపంలోని చిలకలూరిపేట, ఒంగోలు, నెల్లూరు వద్ద నిలిపివేసి, రాత్రి 10 గంటల తర్వాత అనుమతిస్తారు. ► విశాఖపట్నం వైపు నుంచి చెన్నై వైపు వెళ్లే మల్టీ యాక్సిల్ గూడ్స్ వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద, పొట్టిపాడు టోల్గేట్ వద్ద జాతీయ రహదారికి సమీపంలో నిలిపివేసి, రాత్రి 10 గంటల తర్వాత అనుమతిస్తారు. ప్లీనరీకి వచ్చే వాహనాల పార్కింగ్ ఇలా.. ► విజయవాడ నుంచి ప్లీనరీకి వచ్చే బస్సులకు కాజా టోల్ ప్లాజా వద్ద ఉన్న ఆర్కే వెనుజియా లేఅవుట్ వద్ద, కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ► గుంటూరు నుంచి ప్లీనరీకి వచ్చే బస్సులకు నంబూరు, కంతేరు రోడ్డుపైన, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలకు కేశవరెడ్డి స్కూల్, అమలోద్భవి హోటల్, రైన్ ట్రీ అపార్ట్మెంట్స్ పక్కన పార్కింగ్ ఇచ్చారు. -
తుది దశకు వైఎస్సార్సీపీ ప్లీనరీ ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2017 జూలై 8, 9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే.. విజయవాడ–గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానాన్ని ప్లీనరీ నిర్వహణ కోసం అందంగా ముస్తాబు చేస్తోంది. ప్లీనరీకి ప్రతినిధులను ఆహ్వానించడం దగ్గర నుంచి ఏర్పాట్ల వరకు అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ 20 కమిటీలు ఏర్పాటు చేశారు. ప్లీనరీకి హాజరయ్యే ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఆ 20 కమిటీలు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. బుధవారం ప్లీనరీ ఏర్పాట్లను వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, హోం మంత్రి తానేటి వనతి, గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ తదితరులు పరిశీలించారు. గుంటూరు రేంజ్ ఐటీ త్రివిక్రమ వర్మతో కలిసి బందోబస్తును, ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా చేపట్టాల్సిన చర్యలను సమీక్షించారు. ప్రతి ఊరికీ ప్రాతినిధ్యం ప్రతి ఊరికీ ప్లీనరీలో ప్రాతినిధ్యం కల్పిస్తూ శ్రేణులకు వైఎస్సార్సీపీ ఆహ్వానాలు పంపింది. గ్రామ, వార్డు సభ్యుడి నుంచి ప్రజా ప్రతినిధుల వరకూ ప్లీనరీకి ఆహ్వానిస్తూ పేరు పేరునా సీఎం వైఎస్ జగన్ లేఖలు రాశారు. తమను ప్లీనరీకి ఆహ్వానిస్తూ సాక్షాత్తూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖను పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఫ్రేమ్ కట్టించుకుని మురిసిపోతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి విస్తృతంగా శ్రేణులు హాజరు కానున్న నేపథ్యంలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారిపై నుంచి చూసినా స్పష్టంగా కన్పించేలా వంద అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు, 6.5 మీటర్ల ఎత్తుతో అత్యంత భారీ వేదిక నిర్మాణాన్ని పూర్తి చేశారు. భారీ వర్షం కురిసినా ఏ ఒక్కరూ తడవకుండా భారీ టెంట్ నిర్మించారు. టిఫిన్లు, భోజనాల తయారీ కోసం భారీ ఎత్తున వంట శాలల ఏర్పాట్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఒక్కసారి ఎనిమిది వేల మందికిపైగా టిఫిన్లు, భోజనాలు చేయడానికి వీలుగా భారీ టెంట్ను నిర్మించారు. ► దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇడుపులపాయలో సమాధి వద్ద మహానేతకు సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత ప్లీనరీ ప్రాంగణానికి చేరుకోనున్నారు. తొలి రోజున ప్రతినిధులతో సభను నిర్వహించనున్నారు. రెండో రోజున విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ► ప్రతి ఐదేళ్లకు ఓ సారి ప్లీనరీ నిర్వహిస్తోంది. పార్టీ ఆవిర్భాంచాక తొలి సారిగా 2011 జూలై 8–9న ఇడుపులపాయలో ప్లీనరీ నిర్వహించింది. 2017 జూలై 8–9న నిర్వహించిన ప్లీనరీలో నవరత్నాలు ప్రకటించి ప్రజలకు ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అదే వేదికపై నుంచి చరిత్రాత్మక ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రకటించారు. ► ప్లీనరీ వేదికగా ఇచ్చిన భరోసాకు ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్కు ప్రజలు నీరాజనాలు పలికారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఘన విజయాన్ని అందించారు. అధికారంలోకి వచ్చాక ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్ పూర్తి స్థాయిలో అమలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేశారు. మూడేళ్లలో ఏ దశలోనూ ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు. తద్వారా వరుస ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకి ఘన విజయాలు కట్టబెట్టారు. ప్రజల జీవన ప్రమాణాల్లో పెను మార్పులు ► రెండో ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలను అమలు చేయడం వల్ల ఈ మూడేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటాన్ని మదింపు చేసి.. ప్లీనరీలో వివరించనున్నారు. ► విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులు, పారిశ్రామికాభివృద్ధి–ఉపాధి కల్పనకు చేపట్టిన చర్యలు, సామాజిక న్యాయం–సాధికారత, మహిళా సాధికారత–భద్రతలో దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా తీసుకున్న చర్యలు, నవరత్నాలు–డీబీటీ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచిన తీరుపై చర్చించనున్నారు. ► ప్రజలు మెచ్చేలా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లతో కూడిన దుష్టచతుష్టయం చేస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ పిలుపునివ్వనున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యలను శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. -
YSRCP Plenary 2022: పార్టీ పండుగ ‘ప్లీనరీ’
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్లీనరీ పార్టీకి పండుగతో సమానమని, ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు స్వచ్ఛందంగా, సమన్వయంతో పని చేయాలని శ్రేణులకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి సూచించారు. ఈనెల 8, 9వ తేదీలలో రెండు రోజులపాటు జరుగనున్న ప్లీనరీ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని తెలిపారు. కార్యకర్తల ఉత్సాహానికి అనుగుణంగా వ్యవహరించాలని నేతలను కోరారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, బీసీ, జనరల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ల సమావేశంలో ప్లీనరీకి సంబంధించిన అంశాలపై ఆయన సమీక్షించారు. సమావేశానికి పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. కులమతాలు, రాజకీయాలకతీతంగా అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాలకు సంతృప్త స్థాయిలో సీఎం జగన్ మేలు చేస్తున్నారని సాయిరెడ్డి తెలిపారు. మహిళలకు అన్ని రంగాలలో సమాన వాటా కల్పిస్తున్నామని చెప్పారు. దేశ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో మంత్రివర్గంలో 70 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు స్థానం కల్పించిన ఘనత సీఎం జగన్దేనని గుర్తు చేశారు. చిరస్థాయిగా వైఎస్సార్సీపీ: సజ్జల వైఎస్సార్సీపీని ప్రజలు తమ హృదయాలలో చిరస్థాయిగా పదిలపరుచుకున్నారని ప్లీనరీ ప్రజా ప్రతినిధుల సమన్వయ కమిటీ కన్వీనర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అందుకే సాధారణ ఎన్నికలలో కనీవినీ ఎరుగని రీతిలో మెజారిటీ ఇచ్చారన్నారు. స్థానిక సంస్ధల ఎన్నికలలో సైతం 80 శాతం మంది ప్రజాప్రతినిధులు పార్టీ నుంచే ఎన్నికయ్యారని గుర్తు చేశారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇలా జరగలేదన్నారు. ప్రజలు ఇంతగా ఆదరాభిమానాలు చూపుతున్న వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలను అంచనాలకు మించి విజయవంతం చేయాలని సూచించారు. ప్లీనరీకి సంబంధించిన పలు అంశాలను ఆయన పూర్తిస్థాయిలో సమీక్షించారు. అత్యంత ప్రతిష్టాత్మకం: వైవీ సుబ్బారెడ్డి ప్లీనరీ సమావేశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని ఆహ్వాన కమిటీ కన్వీనర్ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన పట్ల ప్రజలు ఎంతో భరోసాగా ఉన్నారని గుర్తు చేస్తూ వారి అంచనాలకు అనుగుణంగా ప్లీనరీ నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్లీనరీ ఆహ్వాన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ప్రతిష్టను ఇనుమడించేలా ప్లీనరీ సమావేశాలు జరగాలన్న ముఖ్యమంత్రి జగన్ సంకల్పానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. సమావేశంలో విజయసాయిరెడ్డితోపాటు పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్, పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ మేరుగ నాగార్జున, మంత్రి విడదల రజని, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చరిత్రాత్మకం: గడికోట అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న ఈ ప్లీనరీ చరిత్రాత్మకమైందని ప్లీనరీ వాలంటీర్స్ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి తెలిపారు. పార్టీని కన్నతల్లిగా భావించే ప్రతి ఒక్కరికీ ప్లీనరీ అపురూపమైన పండుగలా నిలుస్తుందన్నారు. గత ప్లీనరీలో పార్టీ అజెండాను వివరించామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఏం చేశాం? భవిష్యత్లో ఏం చేయబోతున్నామనేది ఈ ప్లీనరీ ద్వారా వివరిస్తామన్నారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ప్లీనరీ నిర్వహించే ప్రాంతాన్ని పార్టీ నేతలతో కలసి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. -
YSRCP Plenary 2022: తిరుగులేని శక్తి.. అలుపెరుగని పోరు సాగించిన వైఎస్ జగన్
రాజకీయంగా వైరిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైఎస్ జగన్ను, వైఎస్సార్సీపీని అణగదొక్కడానికి చేయని కుట్ర లేదు.. పన్నని కుతంత్రం లేదు. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సమస్యలు, సవాళ్లు, దాడులు ఎదుర్కొంది. అయినప్పటికీ వైఎస్ జగన్ ఒకే మాట.. ఒకే బాటగా ముందుకు సాగారు. ఏ దశలోనూ ప్రజల పక్షాన పోరాటాన్ని ఆపలేదు. సవాళ్లే సోపానాలుగా మలుచుకుని.. ఇద్దరితో మొదలై తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన వైఎస్సార్సీపీ ప్రస్తానాన్ని మూడో ప్లీనరీ నేపథ్యంలో ఓ సారి తరచి చూద్దాం. సాక్షి, అమరావతి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందారన్న విషాద వార్తను తాళలేక వందలాది మంది మరణించడం వైఎస్ జగన్ను, ఆయన కుటుంబీకులను తీవ్రంగా కలచివేసింది. ఆ కుటుంబాలన్నింటినీ పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతానని కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009 సెప్టెంబరు 25న నిర్వహించిన వైఎస్సార్ సంస్మరణ సభలో వైఎస్ జగన్ ప్రకటించారు. ఆ మేరకు 2010 ఏప్రిల్ 9న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ జగన్ను ఆదేశించింది. రాజకీయాలకు ఈ యాత్రతో ఏమాత్రం సంబంధం లేదని, తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికే యాత్ర చేపట్టామని తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిలతో కలిసి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి వైఎస్ జగన్ వివరించినా లాభం లేకపోయింది. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి.. వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను కొనసాగించారు. ప్రజల నుంచి అపూర్వ ఆదరణ రావడంతో ఓర్వలేకపోయిన కాంగ్రెస్లోని కొన్ని శక్తులు, టీడీపీతో కుమ్మక్కై కుట్రలకు తెరతీశాయి. వైఎస్ జగన్ ఆస్తులపై విచారణ జరిపించాలని నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కాంగ్రెస్ అధిష్టానం లేఖ రాయిస్తే.. కాంగ్రెస్ కనుసైగల మేరకు వైఎస్ జగన్ ఆస్తులపై దర్యాప్తు చేయించాలని నాటి ఎంపీ కె.ఎర్రన్నాయుడుతో టీడీపీ లేఖ రాయించింది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు చేస్తుండటంతో తన తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి, పులివెందుల శాసనసభ, కడప లోక్సభ, స్థానాలకు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఓ వైపు ఓదార్పు యాత్రను కొనసాగిస్తూనే.. మరో వైపు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమబాట పట్టారు. అప్పటి నుంచి అధికారం చేజిక్కించుకునే వరకు చోటుచేసుకున్న పరిణామాలు ఇలా ఉన్నాయి. చరిత్రాత్మకంగా ప్రజా సంకల్ప యాత్ర వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్ 6న ప్రజాసంకల్ప పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభించారు. ఎముకలు కొరికే చలిలో.. మండుటెండలో.. కుంభవృష్టిలో 14 నెలలపాటు 3,648 కి.మీ. దూరం సాగిన పాదయాత్రను 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. అన్నిచోట్లా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీడీపీ దుర్మార్గపు పాలనను కూకటివేళ్లతో పెకలిస్తూ 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని ప్రజలు అందించారు. దేశ చరిత్రలో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ (87 శాతం), 22 లోక్సభ (88 శాతం) స్థానాలను కట్టబెట్టారు. అజేయశక్తిగా అవతరణ 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి.. ఐదు డిప్యూటీ సీఎం పదవుల్లో నాలుగు ఆ వర్గాలకే ఇచ్చారు. హోంశాఖ మంత్రిగా తొలిసారిగా ఎస్సీ మహిళను నియమించి సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మహిళలకు రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ ఆ వర్గాలకు పదవులు ఇచ్చారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, స్థానిక సంస్థల పదవుల్లోనూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేస్తూ వారికి బాసటగా నిలుస్తున్నారు. 2022 ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చి సామాజిక మహా విప్లవాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. దీంతో వరుసగా జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించి తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో పూర్తికావస్తున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్లీనరీ ఏర్పాట్లు వైఎస్సార్సీపీ ప్రస్థానంలో కీలక ఘట్టాలు ►02.09.2009 : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్ట్టర్ ప్రమాదంలో హఠాన్మరణం ►09.04.2010: ఓదార్పు యాత్ర ప్రారంభం ►27.11.2010 : తమ ఆదేశాలను ధిక్కరించి ఓదార్పు యాత్ర చేపట్టారనే అక్కసుతో వైఎస్ జగన్ ఆస్తులపై విచారణ జరపాలని లేఖలు రాసిన కాంగ్రెస్, టీడీపీ ►29.11.2010: ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు, కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ రాజీనామా ►21.12.2010: రైతులు, చేనేత కార్మికులను ఆదుకోవాలనే డిమాండ్తో విజయవాడ కృష్ణా నదీ తీరాన వైఎస్ జగన్ ‘లక్ష్య దీక్ష’ ►11.03.2011: వైఎస్సార్సీపీ పేరు ప్రకటించిన వైఎస్ జగన్ ►12.03.2011: ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద వైఎస్సార్సీపీ పతాకం ఆవిష్కరణ, పార్టీ ఏర్పాటుపై ప్రకటన ►13.05.2011: కడప లోక్సభ స్థానం ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ జగన్ 5,45,672 ఓట్ల రికార్డు మెజార్టీతో ఘన విజయం. పులివెందుల శాసనసభ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ 81,373 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయభేరి. ►08.07.2011:ఇడుపులపాయలో వైఎస్సార్సీపీ తొలి ప్లీనరీ ►10.08.2011: కాంగ్రెస్ ఎమ్మెల్యే, టీడీపీ ఎంపీ కె.ఎర్రన్నాయుడు చేసిన ఫిర్యాదులు ఆధారంగా వైఎస్ జగన్ ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు. ►21.08.2011: వైఎస్సార్సీపీలో చేరుతూ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు 19 మంది రాజీనామా. నెల్లూరు లోక్సభ స్థానానికి మేకపాటి రాజమోహన్రెడ్డి రాజీనామా. ►27.05.2012: టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై పెట్టిన కేసుల్లో దర్యాప్తు కోసమని ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్ జగన్ను పిలిచి, అరెస్టు చేసిన సీబీఐ ►14.06.2012: ఉప ఎన్నికల్లో 17 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం ►21.12.2012: అక్రమ కేసులపై ‘జగన్ కోసం జనం’ పేరుతో కోటి సంతకాల సేకరణ ►24.09.2013: అక్రమ కేసుల్లో బెయిల్పై విడుదలైన వైఎస్ జగన్ ►05.10.2013: రాష్ట్ర విభజనను నిరసిస్తూ.. సమైక్య రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ లోటస్ పాండ్లో వైఎస్ జగన్ ఆమరణ దీక్ష ►18.12.2013: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ లోక్సభలో కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం ►16.5.2014: సాధారణ ఎన్నికల ఫలితాల ప్రకటన.. 67 శాసనసభ స్థానాల్లో.. 8 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం.. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరం ►20.06.2014: శాసనసభలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్కు గుర్తింపు ►21.02.2015: అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టిన వైఎస్ జగన్ ►10.08.2015: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా ►29.08.2015: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర బంద్ ►26.01.2017: విశాఖ ఆర్కే బీచ్లో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన వైఎస్ జగన్ను రన్ వేపైనే అరెస్టు చేసిన పోలీసులు ►01.05.2017: రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్తో గుంటూరులో వైఎస్ జగన్ రైతు దీక్ష ►08.07.2017: నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న మైదానంలో వైఎస్సార్సీపీ రెండో ప్లీనరీ ►26.10.2017: వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయకపోవడాన్ని, శాసనసభలో ప్రతిపక్షం గొంతు నొక్కుతుండటాన్ని నిరసిస్తూ శాసనసభ సమావేశాలను బాయ్కాట్ చేసిన వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు. ►06.11.2017:ఇడుపులపాయలో ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం ►25.10.2018: విశాఖ ఎయిర్పోర్టులో వైఎస్ జగన్పై హత్యాయత్నం ►09.01.2019: శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం వద్ద ప్రజాసంకల్ప పాదయాత్ర ముగింపు ►23.05.2019: ఎన్నికల్లో ఘన విజయం ►30.05.2019: రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం -
వైఎస్సార్సీపీ ప్లీనరీలో పార్టీ నియమావళికి సవరణలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్లీనరీలో పార్టీ నియమావళికి సంబంధించి కొన్ని సవరణలను ప్రతిపాదించి.. వాటిని ఆమోదానికి పెడతామని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. అలాగే ప్లీనరీలో అనేక అంశాలపై చర్చిస్తామని.. తీర్మానాలు కూడా ఉంటాయన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ప్లీనరీ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లను సోమవారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే కొడాలి నాని, తదితరులతో కలసి విజయసాయిరెడ్డి పరిశీలించారు. అనంతరం ప్లీనరీ ప్రాంగణం వద్ద విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వక్తలందరూ వివిధ ముఖ్యమైన అంశాలపై ప్రసంగిస్తారని తెలిపారు. ముఖ్యంగా విద్య, వ్యవసాయం, వైద్యం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, మీడియా పక్షపాత వైఖరిపై ప్రసంగిస్తారన్నారు. వాటిపై తీర్మానాలు చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలకు అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. ప్లీనరీ జరిగే ఈ నెల 8, 9 తేదీల్లో రెండ్రోజులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభా వేదికపైనే ఉండి వివిధ తీర్మానాలను చర్చించి ఆమోదిస్తారని తెలిపారు. ప్లీనరీ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో స్పష్టంగా తెలుస్తోందన్నారు. సంక్షేమ పథకాలతో లబ్ధి పొందినవారు, సామాజిక న్యాయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదలంతా సీఎం వైఎస్ జగన్ పరిపాలన పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. ప్లీనరీకి వచ్చేవారికి భోజన ఏర్పాట్లతోపాటు వార్డు సభ్యుల నుంచి పైస్థాయి నాయకుల వరకు అందరికీ అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. సీఎం చెప్పే ప్రతి మాట దిక్సూచి:మంత్రి బొత్స దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున ఆయనను స్మరించుకుంటూ పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జూలై 8న పార్టీ జెండా వందనం, అధ్యక్షుడి ప్రారంభ ఉపన్యాసంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. 9వ తేదీ అధ్యక్షుడి ముగింపు ఉపన్యాసంతో సమావేశాలు ముగుస్తాయన్నారు. సమావేశాలకు తరలివచ్చే వారికీ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ చెప్పే ప్రతిమాట రాబోయే రెండేళ్లలో అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి దిక్సూచిగా ఉంటుందన్నారు. ఆ స్ఫూర్తితో పార్టీని బలోపేతం చేయడంతోపాటు ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. ప్లీనరీని విజయవంతం చేయాలి వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్లీనరీపై ముఖ్య నేతలతో చర్చించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ప్లీనరీ కావడంతో ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొనేలా చూడాలన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ సభ్యుల వరకు దాదాపు 80 శాతం మంది వైఎస్సార్సీపీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ప్లీనరీకి ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పారు. కాగా ప్లీనరీలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానం శిబిరంలో పాల్గొననున్నారు. ఇందుకు అనుగుణంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం రూపొందించిన వెబ్సైట్ను www. ysrcpblooddonation.com నేతలు ఆవిష్కరించారు. ప్రతి నియోజకవర్గం నుంచి రక్తదానంపై ఆసక్తి ఉన్న కార్యకర్తలు వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత రిజిస్టర్ డొనేట్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి రక్తదాత వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. రక్తదాతల రిజిస్ట్రేషన్ కోసం రూపొందించిన వైబ్సైట్ను ప్రారంభిస్తున్న విజయసాయిరెడ్డి, సజ్జల తదితరులు -
జనం అండగా నిలవాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఆ పార్టీ ప్లీనరీ చారిత్రాత్మక మైందిగా భావించవచ్చు. ఈ సందర్భంగా వైసీపీ పాలనను సమీక్షించు కోవడం అవసరం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు పరుస్తున్న అనేక పథకాలూ; ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల భాగస్వామ్యంతో ఆయన తన ప్రభుత్వాన్ని నడపడం విశిష్టత సంతరించుకున్న విషయాలు. ఏలూరు బీసీ డిక్లరేషన్, ధర్మవరం చేనేత సదస్సు, కర్నూలు జలదీక్ష తదితర మహత్తరమైన కార్యక్రమాలు జగన్ పరిణతికి అద్దం పడతాయి. సీఎంగా అధికారం చేపట్టిన మూడు సంవత్సరాల పాలనా కాలంలో తాను ఎన్నికల ముందు విడుదల చేసిన మ్యానిఫెస్టోను భగవద్గీత, ఖూరాన్, బైబిల్గా ప్రకటించి; అందులోని అన్ని అంశాలనూ అమలు చేస్తున్న అరుదైన సీఎం జగన్. దేశమంతా ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణకు గురవుతుంటే... ఆర్టీసీని కార్పొరేషన్ పరిధి నుండి తప్పించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం గొప్ప నిర్ణయం. గ్రామ స్వరాజ్యాన్ని కలగన్న జాతిపిత గాంధీ ఆశయాన్ని సచివాలయ వ్యవస్థ రూపంలో ప్రజల వద్దకు చేర్చాడు. లక్షలమంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించాడు. వాలంటీర్ వ్యవస్థపై తొలిదశలో అనేక విమర్శలు ఎదురైనప్పటికీ వెనుకడుగు వేయకుండా ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య అనుసంధానంగా దానిని మార్చాడు. ‘అమ్మ ఒడి’, ‘జగనన్న విద్యాకానుక’, ఫీజు రీయింబర్స్మెంట్, పాఠశాలల ఆధునికీకరణ, ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు తదితర విప్లవాత్మకమైన నిర్ణయాలు రాష్ట్ర విద్యావ్యవస్థలో గొప్ప మలుపుగా నిలుస్తాయి. వైఎస్సార్ మానస పుత్రిక ‘ఆరోగ్యశ్రీ’ని పకడ్బందీగా అమలు చేస్తూ ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం ద్వారా జగన్ ప్రజల ఆరోగ్య విషయంలో ఎంత బాధ్యతా యుతంగా ఉన్నదీ తెలుస్తుంది. (క్లిక్: ‘రాజనీతి’లో రేపటి చూపు!) రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిబద్ధతగా కృషి చేస్తున్న సీఎంపై ఎల్లో మీడియా పనిగట్టుకొని దుష్ప్రచారానికి పూనుకోవడం అనైతికం. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా కేంద్రంతో ఘర్షణ పూరితంగా కాకుండా సయోధ్యగా ఉంటూ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు. జగన్ మోహన్ రెడ్డి వంటి అరుదైన నాయకుణ్ణి ప్రజలే కాపాడుకోవాలి. ఆయనిచ్చిన ‘175కు 175 సీట్లు గెలవాల’నే నినాదం కార్యరూపం దాల్చడానికి ప్రజలు అండగా నిలవాలి. భావి తరాల కోసం మరింత విస్తృత ప్రాతిపాదికన రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే నిర్ణయాలకు వైఎస్సార్సీపీ ప్లీనరీ వేదిక కావాలని ఆశిద్దాం. - ఇమామ్ ‘కదలిక’ సంపాదకులు, అనంతపురం -
YSRCP Plenary 2022: ప్రజాభ్యుదయమే అజెండా
సాక్షి, అమరావతి: గతాన్ని మననం చేసుకుని.. వర్తమానాన్ని విశ్లేషించుకుని.. భవిష్యత్తులో మరింత మెరుగ్గా ప్రజలకు సేవ చేయడమే అజెండాగా ప్లీనరీ నిర్వహించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇతర పార్టీలకు భిన్నంగా ప్రజాభ్యుదయమే అజెండాగా ప్లీనరీలు నిర్వహించడం వైఎస్సార్సీపీ విధానం. పార్టీ ఆవిర్భవించాక 2011, జూలై 8, 9న ఇడుపులపాయలో నిర్వహించిన తొలి ప్లీనరీ.. 2017, జూలై 8, 9న నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహించిన రెండో ప్లీనరీలోనూ ప్రజాభ్యుదయమే అజెండాగా చేసుకుంది. ఇక అధికారంలోకి వచ్చాక నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ఈనెల 8, 9న నిర్వహించే మూడో ప్లీనరీలోనూ ప్రజల సంక్షేమమే ప్రధాన ఎజెండా. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం చెందినప్పటి నుంచి అధికారంలోకి వచ్చేవరకూ సుమారు పదేళ్లపాటు దేశ చరిత్రలో ఏ పార్టీ ఎదుర్కోనన్ని సవాళ్లు, అటుపోట్లు, దాడులను వైఎస్సార్సీపీ ధీటుగా ఎదుర్కొంది. ప్రజల తరఫున నిలబడి పోరాడింది. ప్రజల హృదయాలను గెలుచుకుని 2019 ఎన్నికల్లో ఆఖండ విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే పదేళ్ల పోరాటంలో ప్రజలకు చేసిన వాగ్దానాల్లో 95 శాతం అమలుచేసింది. ప్రజాభ్యుదయం.. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అలాగే, అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ప్రజాసంక్షేమం, అభివృద్ధికి నిబద్ధతతో కృషిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వచ్చే ప్లీనరీలో ప్రజాభ్యుదయం, రాష్ట్ర సమగ్రాభివృద్ధితో ముడిపడిన విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం–సామాజిక సాధికారత, మహిళా సాధికారత–రక్షణ, నవరత్నాలు–డీబీటీలు, పారిశ్రామికాభివృద్ధి–ఉద్యోగాల కల్పనపై చర్చించి.. వాటిని మరింత మెరుగ్గా అమలుచేయడంపై తీర్మానాలు చేయనున్నారు. జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా.. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటును అందించి పేదరికం నుంచి ప్రజలను గటెక్కించడం.. మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, పారిశ్రామికాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళా సాధికార, సామాజిక సాధికారత సాధించడం ద్వారా రాష్ట్రాన్ని అన్నింటా అగ్రగామిగా నిలపడానికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. ఈ క్రమంలో గడచిన మూడేళ్లలో పలు రంగాల్లో కీలక సంస్కరణలను తీసుకొచ్చారు. ముఖ్యంగా.. విద్యారంగం.. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఆధునీకరించారు. పిల్లల చదువులకు పేదరికం అడ్డుకాకూడదన్న లక్ష్యంతో జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, వసతి దీవెన, గోరుముద్ద, నాడు–నేడు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ తదితర పథకాల కింద విద్యారంగంలో రూ.52,676.98 కోట్లను ఖర్చుచేశారు. ప్రపంచ విద్యార్థులతో రాష్ట్ర విద్యార్థులు పోటీపడేలా వారిని తీర్చిదిద్దేందుకు బైజూస్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో ఏటా రూ.24 వేల వరకు ఖర్చయ్యే.. శ్రీమంతుల పిల్లలకు మాత్రమే లభిస్తున్న బైజూస్ స్డడీ మెటీరియల్ను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగానే అందజేయనుంది. వైద్యరంగం.. ప్రజలకు వైద్య సేవలను మెరుగ్గా అందించడానికి ప్రభుత్వాస్పత్రులను కూడా నాడు–నేడు కింద సీఎం వైఎస్ జగన్ ఆధునీకరిస్తున్నారు. వీటిల్లో 40,180 ఉద్యోగాలను భర్తీచేసి.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలుచేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గానికి ఓ వైద్య కళాశాల ఏర్పాటుచేయాలనే లక్ష్యంలో భాగంగా కొత్తగా 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయం.. విత్తు నుంచి విక్రయం వరకూ రైతులకు తోడునీడగా నిలవడం ద్వారా వ్యవసాయాన్ని పండగగా మార్చేందుకు సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. వైఎస్సార్ రైతుభరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సహాయం అందిస్తున్నారు. ఉచితంగా పంటల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా తక్కువ ధరలకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందిస్తున్నారు. వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు సలహాలు అందిస్తూ.. అధిక దిగుబడులు సాధించడానికి బాటలు వేస్తున్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలవల్ల పంటలు నష్టపోతే అదే సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ అందించి రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. పంటల బీమా కింద రైతులకు పరిహారం అందిస్తూ పంట పండినా.. ఎండినా.. తడిసినా రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టారు. సామాజిక న్యాయం–సాధికారత.. పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు భాగస్వామ్యం కల్పించి సామాజిక న్యాయం చేయడం ద్వారా ఆ వర్గాలు సాధికారత సాధించడానికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. తొలిసారి ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో 56 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చారు. ఆ తర్వాత పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏకంగా 70 శాతం పదవులు ఆ వర్గాలకే ఇచ్చి, సామాజిక మహావిప్లవాన్ని ఆవిష్కరించారు. అలాగే, దేశ చరిత్రలో ఎక్కడాలేని రీతిలో నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ అమలుచేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన వ్యక్తికే అవకాశమిచ్చారు. శాసనమండలి చైర్మన్గా తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తికి.. డిప్యూటీ చైర్పర్సన్గా మైనార్టీ మహిళకు ఇచ్చారు. మరోవైపు.. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవుల్లోనూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు. స్థానిక సంస్థల్లోనూ ఆ వర్గాలకే సింహభాగం అవకాశమిచ్చి.. సామాజిక న్యాయం, సాధికారతలో వైఎస్ జగన్ దేశానికి రోల్మోడల్గా నిలిచారు. మహిళా సాధికారత–రక్షణ.. మహిళా సాధికారతతో కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని.. తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ విశ్వాసం. అందుకే మహిళలు ఆర్థిక సాధికారత సాధించడానికి వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, సున్నావడ్డీ ద్వారా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారు. తొలి కేబినెట్లో ముగ్గురు మహిళలకు అవకాశం కల్పిస్తే.. పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో నలుగురికి అవకాశమిచ్చారు. దేశ చరిత్రలో తొలిసారిగా హోంశాఖ మంత్రిగా ఎస్సీ మహిళకు అవకాశం కల్పించారు. ఇక 30.56 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను, ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలను మహిళల పేర్లతోనే ఇచ్చారు. పారిశ్రామికాభివృద్ధి–ఉద్యోగాల కల్పన.. పారిశ్రామికరంగ ప్రోత్సాహకానికి సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలతో మిట్టల్, బిర్లా, అదానీ, సంఘ్వీ, భజాంకా, బంగర్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమలకు కావాల్సిన మౌలిక వసతులు, పర్యావరణ హిత గ్రీన్ఎనర్జీని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో వారు రాష్ట్రం వైపు అడుగులు వేస్తున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కోవిడ్ సమయంలో రిస్టార్ట్ ప్యాకేజీ ద్వారా పరిశ్రమలను ఆదుకోవడంతో ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు భరోసా కలిగింది. గత ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.1,588 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహక బకాయిలతో కలిపి రూ.2,086 కోట్లు వరుసగా రెండేళ్లు చెల్లించడమే కాకుండా ఈ ఏడాది కూడా ఆగస్టులో చెల్లించనున్నట్లు సర్కారు ముందుగానే ప్రకటించింది. దీంతో.. పారిశ్రామికవేత్తల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన సులభతర వాణిజ్య (ఈఓడీబీ) ర్యాంకుల్లో ఏపీ వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. గడిచిన మూడేళ్ల కాలంలో 28,343 యూనిట్లు ఉత్పత్తి ప్రాంరంభించడం ద్వారా 2,48,122 మందికి ఉపాధి లభించింది. ప్రస్తుతం రూ.1,51,372 కోట్ల విలువైన 64 యూనిట్లకు సంబంధించిన నిర్మాణ పనులు వివిధ దశలో ఉండగా, మరో రూ.2,19,766 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ పర్యటనలో రూ.126 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరగడమే కాకుండా త్వరలో విశాఖ వేదికగా భారీ పెట్టుబడుల సదస్సుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఉద్యోగాల విప్లవాన్ని తీసుకొచ్చింది. చరిత్ర మెచ్చేలా మూడేళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 6,03,756 ఉద్యోగాలను భర్తీచేసి నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చింది. ఇందులో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఒకేసారి 1,21,518 మందికి ప్రభుత్వ కొలువులిచ్చి సొంత ఊరిలో ప్రజలకు సేవచేసే భాగ్యం కల్పించింది. నవరత్నాలు–డీబీటీ.. పేదరికం నుంచి ప్రజలను గట్టెక్కించడానికి నవరత్నాల కింద డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా మూడేళ్లలో రూ.1,41,247.94 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ జమచేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.43,682.65 కోట్లను పేదల కోసం ఖర్చుచేశారు. దుష్టచుతుష్టంపై సమరభేరి ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ అత్యంత పారదర్శకంగా.. సుపరిపాలన అందిస్తుండటంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 2019 ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాలు సాధించడం.. తిరుపతి లోక్సభ, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో 2019 ఎన్నికల కంటే అధిక మెజార్టీ వైఎస్సార్సీపీకి రావడమే అందుకు తార్కాణం. ఇది చూసి ఓర్వలేని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 మూకుమ్మడిగా అవాస్తవాలను ప్రచారంచేస్తూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయి. ఈ దుష్టచతుష్టయంపై యుద్ధంచేసి.. దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ ప్లీనరీ వేదికగా పిలుపునివ్వనున్నారు. -
YSRCP Plenary 2022: ప్లీనరీ పండుగకు ముస్తాబు
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీని వైఎస్సార్సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ ఆవిర్భవించాక 2011 జూలై 8, 9వ తేదీల్లో తొలి ప్లీనరీ జరగగా 2017 జూలై 8, 9వ తేదీల్లో రెండో ప్లీనరీని నిర్వహించారు. అంతకంటే మిన్నగా ఈ దఫా మూడో ప్లీనరీని జూలై 8, 9వ తేదీల్లో నిర్వహించేలా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇతర పార్టీలకు భిన్నంగా ప్రజాభ్యుదయమే అజెండాగా ప్లీనరీలు నిర్వహించడం వైఎస్సార్సీపీ విధానం. ఈ మేరకు ప్లీనరీల్లో తీసుకున్న నిర్ణయాలను, హామీలను అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 95 శాతం అమలు చేశారు. రానున్న రెండేళ్లలో ప్రజలకు మరింత సేవ చేయడం, బాసటగా నిలిచి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే అజెండాగా మూడో ప్లీనరీని వైఎస్సార్సీపీ నిర్వహిస్తోంది. ప్రజాభ్యుదయమే లక్ష్యంగా.. ప్లీనరీకి విస్తృత స్థాయిలో ఆహ్వానాలు పంపుతున్నారు. గ్రామ, వార్డు సభ్యుల నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారి వరకూ పేరుపేరునా ప్లీనరీకి ఆహ్వానిస్తూ సీఎం జగన్ లేఖలు రాశారు. వాటిని నాయకులకు అందచేసి ప్లీనరీకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లు ఆహ్వానిస్తున్నారు. తొలిరోజు ప్లీనరీకి పార్టీ నాయకులు హాజరుకానున్నారు. రెండో రోజు మరింత విస్తృత స్థాయిలో పార్టీ శ్రేణులు పాల్గొంటాయి. వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ ప్రారంభ ఉపన్యాసంతో ఆరంభమయ్యే ప్లీనరీ ఆయన ముగింపు ప్రసంగంతో ముగుస్తుంది. ప్రజాభ్యుదయమే లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. భారీ వేదిక.. భోజన శాలలు రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే విజయవాడ–గుంటూరు రహదారి పక్కనే నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానంలో మూడో ప్లీనరీని వైఎస్సార్సీపీ నిర్వహిస్తోంది. జాతీయ రహదారి నుంచి స్పష్టంగా కనిపించేలా 100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు, 6.5 అడుగుల ఎత్తుతో భారీ వేదిక నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారీ వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ టెంట్ నిర్మాణ పనులు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. ప్లీనరీకి హాజరయ్యే శ్రేణులకు వేడివేడిగా టిఫిన్లు, టీ, కాఫీలు, భోజనాల తయారీకి రెండు భారీ వంటశాలలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒక వంటశాల పనులు కొలిక్కిరాగా రెండో వంటశాల పనులను సోమవారం ప్రారంభించనున్నారు. అక్కడకు సమీపంలోనే భారీ భోజన శాలలు సిద్ధమవుతున్నాయి. ప్లీనరీకి విస్తృత స్థాయిలో శ్రేణులు హాజరుకానున్న నేపథ్యంలో భారీ ఎత్తున వాహనాలు రానున్నాయి. ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గుంటూరు–విజయవాడ ప్రధాన రహదారితో అనుసంధానిస్తూ ప్లీనరీకి రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమాలను సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. -
వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో గెలుపే లక్ష్యం
సాక్షి, గుంటూరు, నరసరావుపేట: ‘‘మనమంతా వైఎస్సార్సీపీ సైనికులం, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 175 సీట్లు గెలిచేలా పనిచేయాలి. ఆ ప్రజా ప్రభంజనం పల్నాడు జిల్లా నుంచే ప్రారంభం కావాలి’’ అని పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. నరసరావుపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో శుక్రవారం వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో కారుమూరి మాట్లాడారు. తొలుత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళి అర్పించి, జ్యోతి ప్రజ్వలనతో ప్లీనరీ ప్రారంభించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎల్లో మీడియా దుష్ప్రచారాలను తిప్పికొట్టి, వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ రాజ్యం మరోసారి తీసుకురావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. టీడీపీ కరుడుగట్టిన అభిమానులు సైతం ఈసారి వైఎస్సార్ సీపీకి ఓటువేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికే నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్లీనరీలు విజయవంతంగా పూర్తిచేశామని, 8, 9వ తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి ప్లీనరీకి పల్నాడు నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని కోరారు. టీడీపీ బొంబాయి పార్టీ చంద్రబాబు ఓ బొంబాయి అని, టీడీపీ బొంబాయి పార్టీ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ కొడాలి నాని ఎద్దేవా చేశారు. జగన్ను దించి చంద్రబాబును అధికారంలోకి తేవాలని దుష్టచతుష్టయం యత్నిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. తన తండ్రి ఫొటో పక్కన తన ఫొటో పెట్టుకునేలా పరిపాలన అందించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తాయని, ఈ మేరకు ఒప్పందం కుదిరిందన్నారు. 2024 ఎన్నికలతో చంద్రబాబు రాజకీయ జీవితం సమాప్తమవుతుందన్నారు. ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. మూడు ఎంపీ స్థానాలూ గెలవడన్నాడు. చంద్రబాబు రాజకీయ జీవితం ఇక సమాప్తం మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగితే చంద్రబాబుకు తట్టుకునే శక్తిలేదని, ఆయన రాజకీయ జీవితం ఇక సమాప్తమేనని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని అఖండ మెజార్టీతో ఆశీర్వదించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరన్నారు. చంద్రబాబు త్యాగాలు చేసే రకం కాదు.. మోసాలు చేసే రకమని పేర్కొన్నారు. మా ప్రభుత్వంలో పవన్ను సీఎం చేయాలని చూస్తున్న బ్యాచ్కు కూడా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. అభిమానులు పవన్ను సీఎం చేయాలని చూస్తుంటే.. పవన్ మాత్రం చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట... వైఎస్ జగన్ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి విడదల రజిని చెప్పారు. ఎన్నడూలేని విధంగా ఈసారి మంత్రివర్గంలో 17 మంది బలహీనవర్గాలకు చోటు కల్పించారని పేర్కొన్నారు. జగనన్నను ప్రజలందరూ మరోసారి ఆశీర్వదించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా... రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పనిచేస్తోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ప్లీనరీలో భాగంగా పలు తీర్మానాలను ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు. మాజీ మంత్రి కొడాలి నానిని సన్మానించారు. డాక్టర్స్ డే సందర్భంగా వేదికపై కేక్ను కట్చేశారు. కార్యక్రమంలో ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అరిమండ వరప్రసాదరెడ్డి, షేక్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఖాజావలి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, గ్రంథాలయ రాష్ట్ర చైర్మన్ మందపాటి శేషగిరిరావు, జెడ్పీ వైస్ చైర్మన్ సంఖిరెడ్డి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధరరెడ్డి, గుంటూరు మిర్చియార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, నరసరావుపేట మార్కెట్ యార్డు చైర్మన్ ఎస్.ఎ.హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలుపు మనదే. సుమారు 70శాతానికిపైగా పేదవారు సీఎం జగన్పై అభిమానంతో ఉన్నారు. – గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మూడేళ్లలోనే 95 శాతం హామీలు నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే. – జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ గత టీడీపీ ప్రభుత్వంలో నిధులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. మన ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో జమ చేసింది. – నంబూరు శంకరరావు, ఎమ్మెల్యే పచ్చని పల్లెల్లో టీడీపీ నేతలు చిచ్చు పెడుతున్నారు. నడిగడ్డలో వైఎస్సార్సీపీలో చేరిన యాదవ నాయకుల కుటుంబంపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. – బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్యే పల్నాడు ప్రజలు సీఎం జగన్ పోరాటానికి మద్దతు ఇస్తున్నారు. సీఎం సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్నారు. – బత్తుల బ్రహ్మానందరెడ్డి, పల్నాడు జిల్లా ప్లీనరీ పరిశీలకులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు టీడీపీ ప్రభుత్వ హయాంలో కుక్క మీద రాయి వేసినా వైఎస్సార్సీపీ వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. – కాసు మహేష్రెడ్డి, గురజాల ఎమ్మెల్యే వచ్చే రెండేళ్ళు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి అతిపెద్ద పార్టీ మనది. కొన్ని భేదాభిప్రాయాలు సహజం. – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు, మాచర్ల ఎమ్మెల్యే -
కోలాహలంగా వైఎస్సార్సీపీ ప్లీనరీలు
కర్నూలు (సెంట్రల్)/సాక్షి, పాడేరు/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్)/సాక్షి, భీమవరం/సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి, గుంటూరు: జూలై 8, 9 తేదీల్లో వైఎస్సార్సీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీ సందర్భంగా అన్ని జిల్లాల్లో ఆ పార్టీ ప్లీనరీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కర్నూలు, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లో వైఎస్సార్సీపీ ప్లీనరీలు ఘనంగా జరిగాయి. కర్నూలులో జరిగిన జిల్లా ప్లీనరీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పులు ఏడాదికి 19 శాతం పెరిగితే.. తమ ప్రభుత్వంలో 15 శాతానికి తగ్గించామన్నారు. పాడేరులో జరిగిన అల్లూరి సీతారామరాజు జిల్లా పార్టీ ప్లీనరీలో పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ ప్లీనరీలో ఎంపీ గొడ్డేటి మాధవి, ప్లీనరీ పరిశీలకులు శత్రుచర్ల పరీక్షిత్రాజు, ఎమ్మెల్యే లు చెట్టి ఫల్గుణ, ధనలక్ష్మి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బుల్లిబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ïప్లీనరీ ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు హయాం లో సకల అరాచకాలు, దాష్టీకాలు, ముఠాపాలన, నిరంకుశత్వం కొనసాగాయన్నారు. ఈ సమావేశం లో మంత్రి జోగి రమేష్, విప్ సామినేని ఉదయభాను, జిల్లా పార్టీ అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, రక్షణ ని«ధి, మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీలు కల్పలత, డొక్కా మాణిక్యవరప్రసాద్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ ప్లీనరీని భీమవరంలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. 175 అసెంబ్లీ సీట్లలో గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని కోరారు. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఎమ్మెల్సీ çరవీంద్రబాబు, జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస రావు అధ్యక్షతన జిల్లాస్థాయి ప్లీనరీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు రాజన్నదొర, బొత్స సత్యనారాయణ, ఎంపీ చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు వీరభద్రస్వామి, చినవెంకట అప్పలనాయుడు, అప్పలనర్సయ్య, కంబాల జోగులు, కడుబండి శ్రీనివాసరావు, బడుకొండ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేటలో నిర్వహించిన పల్నాడు జిల్లా స్థాయి ప్లీనరీ పార్టీ కోఆర్డినేటర్ కొడాలి నాని, మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, విడదల రజని, పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్రెడ్డి, నంబూరి శంకరరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, జిల్లా ప్లీనరీ పరిశీలకుడు బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. -
‘చంద్రబాబు సీఎంగా ఉంటే కరోనా వచ్చేది కాదంట..’
సాక్షి, కర్నూలు: చంద్రబాబు పాలనంతా అబద్ధాలమయం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు. ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నా ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని.. కరోనా కష్టకాలంలో కూడా సుపరిపాలన అందించారన్నారు. సీఎం జగన్ పాలనపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని, టీడీపీ నేతలు బాదుడే బాదుడు అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు మూడేళ్లలో 25 శాతం పెరిగిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. చదవండి: ఆ లేఖ చెత్తబుట్టకు చేరుతుంది: మంత్రి అంబటి ‘‘చంద్రబాబు హయాంలో అభివృద్ధి శూన్యం. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామని, ఆలూరులో జింకల పార్కు అంటూ మోసం చేశారు. చంద్రబాబు ఏం మాట్లాడతాడో అర్థం కాదు.. తాను సీఎంగా ఉంటే కరోనా వచ్చేది కాదని చెబుతున్నారు’’ అంటూ మంత్రి బుగ్గన ఎద్దేవా చేశారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు వైఎస్సార్సీపీ ఓ స్కీం తీసుకురాబోతుంది. వారికి వచ్చే రోజుల్లో మంచి రోజులు వస్తాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. -
‘రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన అరాచకాలకు హద్దే లేదు’
ఎన్టీఆర్ జిల్లా: రాజధాని పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన అరాచకాలకు హద్దే లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. 2014-19 మధ్య చంద్రబాబు అన్యాయమైన విధానాలు అనుసరించారని, ఆ కాలంలో చంద్రబాబు సకల అరాచకాలు, నిరంకుశానికి, మాఫియాకు ఒక ఉదాహరణగా నిలిచిందని విమర్శించారు సజ్జల. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాల్లో సజ్జల మాట్లాడుతూ..‘తనకు పట్టం కట్టిన ప్రాంతాన్నీ నిర్లక్ష్యం చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం 46 ఆలయాలను కూల్చింది. రోడ్ల విస్తరణ పేరుతో ఆలయాలను కూల్చేశారు. లక్ష కోట్లతో రాజధాని కడతాం అన్న చంద్రబాబు విజయవాడలో కనీసం ఒక ఫ్లై ఓవర్ కూడా కట్టలేక పోయారు’ అని విమర్శించారు. -
కుప్పంలో తమిళ యాక్టర్ పోటీపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
సాక్షి, చిత్తూరు జిల్లా: ఎన్నికల హామీల్లో 95 శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రతి కుటుంబానికి సిఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. వేలాది కోట్లు ఖర్చు చేసి ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు, సచివాలయ భవనాలు నిర్మించాం. ఈ అభివృద్ధి చంద్రబాబుకు కనిపించట్లేదు. విద్య, వైద్యంకి సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ద్వారా అనేక పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించగలరు అని సీఎం గుర్తించారు. ప్రతి పార్లమెంట్లో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చదవండి: (దళారీలకు టీటీడీ చెక్.. శ్రీవారి ఖజానాకు రూ.500 కోట్ల ఆదాయం) కుప్పంలో పోటీపై పెద్దిరెడ్డి క్లారిటీ '2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు 175 సాధిస్తుంది. కుప్పంలో పోటీపై ఎల్లో మీడియా.. తమిళ యాక్టర్తో మంతనాలు అని వార్తలు రాసింది. 2024లో కుప్పం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్ మాత్రమే. గతంలో పలమనేరులో మేము గెలిపించిన వ్యక్తి.. వేరే పార్టీకి పోయి మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు వెంకటే గౌడను మరింత మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. సీఎం వైఎస్ జగన్కు మనమంతా ఎప్పుడు అండగా నిలవాలి అని ప్రజల్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. చదవండి: (టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం.. ‘రూ.30 లక్షలు తెస్తేనే కాపురం చేస్తా’) -
దుష్ట చతుష్టయం ఎన్ని కుట్రలు చేసినా ఫలితం ఉండదు: అంబటి రాంబాబు
సాక్షి, నెల్లూరు: భవిష్యత్ ప్రణాళికపై చర్చించేందుకే పార్టీ ప్లీనరీలు నిర్వహిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జిల్లాలోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీ అట్టహాసంగా సాగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన ప్లీనరీ సమావేశం నిర్వహించారు. అగ్రనేతలు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఎనిమిది నియోజకవర్గాల నుంచి వేలాదిగా పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ప్లీనరీ సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మెన్లు హాజరయ్యారు. కార్యక్రమంలో మొదటగా దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నేతలు నివాళులర్పించారు. అనంతరం మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. మానిఫెస్టోలోని హామీలన్నీ నెరవేర్చి జనంలోకి వెళుతున్నాము. మూడేళ్లలో 95 శాతం హామీలు నెరవేర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఎక్కడా లేవు. కులం, మతం, పార్టీ చూడకుండా సంక్షేమం అందిస్తున్నారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ వాళ్లకే సంక్షేమం అందించారు. వైఎస్సార్సీపీ మద్దతు దారులను పక్కన పెట్టారు. కానీ మన ప్రభుత్వం వచ్చాక ఓటు వేయకపోయినా అర్హత ఉంటే సంక్షేమం అందిస్తున్న గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్. పేదవారి ముసుగులో ఉన్న ధనవంతులకు పథకాలు అందవు. 2024 ఎన్నికల్లో మళ్ళీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావటం ఖాయం. చంద్రబాబు, వైఎస్ జగన్ పాలనకు ప్రజలు వ్యత్యాసం చూసారు. దుష్ట చతుష్టయం ఎన్ని కుట్రలు చేసినా ఫలితం ఉండదు. బాబు మోసాలు తప్ప త్యాగాలు చేయలేదు. ఎవరినో సీఎంని చేసేందుకు పెట్టిన పార్టీ జనసేన. చంద్రబాబు ఎంతమందిని కలుపుకొచ్చినా భంగపాటు తప్పదు. సంక్షేమ సైనికుల అండతో మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాము అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చదవండి: (బిజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్-2020: ఏపీకి టాప్ ప్లేస్) -
‘చరిత్రలో నిలిచిపోయేలా సంక్షేమం అందించారు’
నెల్లూరు: పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమం అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి స్పష్టం చేశారు. మూడేళ్ల పాలనలో చరిత్రలో నిలిచిపోయేలా సీఎం జగన్ సంక్షేమం అందించారన్నారు. నెల్లూరులో నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాల్లో మాట్లాడిన కాకాణి.. ‘కోవిడ్ కారణంగా రెండేళ్లు ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోలేకపోయాం. చరిత్రలో నిలిచిపోయేలా సీఎం జగన్ సంక్షేమం అందించారు. భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ప్రతిపక్షం అక్కసుతో అసత్య ఆరోపణలు చేస్తోంది. పచ్చమీడియా తప్పుడు రాతలు రాస్తోంది.రైతులకు అండగా నిలిచింది, నిలుస్తోంది వైఎస్సార్ కుటుంబం మాత్రమే. చంద్రబాబుకి, సీఎం వైఎస్ జగన్కి చాలా వ్యత్యాసం ఉంది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుంది. రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించి ముఖ్యమంత్రి మహిళా పక్షపాతిగా నిలిచారు. శరీరంలో అవయవాలు ఎంత ముఖ్యమో పార్టీకి కార్యకర్తలు అంతే ముఖ్యం.చంద్రబాబు దివాలాకోరు తనం వల్లే కాంట్రాక్టర్లకు ఇబ్బందులు వచ్చాయి. 2024 ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలసిన పరిస్థితి చంద్రబాబుది.అందుకే కుట్రలు ,కుతంత్రాలు చేస్తున్నారు’ అని విమర్శించారు. -
కుప్పంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేద్దాం
చిత్తూరు (కుప్పం): సార్వత్రిక ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గాన్ని గెలుచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కానుగా ఇద్దామంటూ వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని బీసీఎన్ కల్యాణమండపంలో నియోజకవర్గస్థాయి ప్లీనరీ సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ, ప్లీనరీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ రమేష్యాదవ్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. మూడున్నర దశాబ్దాలుగా కుప్పం నియోజవర్గాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నారని, 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. చంద్రబాబు హయాంలో నియోజకవర్గంలో కేవలం ఐదు వేల గృహాలు మంజూరు చేస్తే వైఎస్సార్సీపీ వచ్చిన మూడేళ్లల్లో ఏడు వేల ఇళ్లు మంజూరు చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో కుప్పం ప్రజలు చంద్రబాబును తరిమికొడతారని స్పష్టం చేశారు. కుప్పానికి హంద్రీనీవా నీరు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికే దక్కిందని ఎంపీ రెడ్డెప్ప అన్నారు. కుప్పం ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హంద్రీనీవా నీటిని నియోజవర్గానికి తీసుకువచ్చి బీడు భూమలను సైతం సస్యశ్యామలం చేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రికి వస్తున్న ఆదరణ ఓర్వలేక చంద్రబాబు, ఆయన బృందాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కడపను తలపిస్తున్న కుప్పం కుప్పంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఉత్సాహం కడప జిల్లాను తలపిస్తున్నట్లు ఉందని, ఎమ్మెల్సీ, రమేష్యాదవ్ అన్నారు. అన్ని కులాలకు సమానంగా గుర్తింపు ఇచ్చిన జగన్మోహన్రెడ్డి ప్రాంతాలకు న్యాయం చేసిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. దీనికి నిదర్శనం కడప జిల్లాలో మొదటి సారిగా బీసీ వర్గానికి చెందిన తనను శాసనమండలికి పంపడమే అన్నారు. భారీగా తరలివచ్చిన జనం నియోజకవర్గస్థాయి ప్లీనరీ సమావేశానికి నాలుగు మండలాల నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీ ఎత్తున తరలి వచ్చారు. రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లె మండలాల నుంచి ద్విచక్ర వాహనాల ర్యాలీలతో సమావేశ ప్రాంతానికి ర్యాలీగా వచ్చారు. యువకులు ద్విచక్ర వాహనాలకు వైఎస్సార్ సీపీ జెండాలు కట్టుకుని రావడం పండుగ వాతావరణాన్ని తలపించింది. వైఎస్సార్సీపీలో చేరిక ప్లీనరీ సందర్భంగా రామకుప్పం మండలం, బల్ల పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు మునస్వామి, మరో 50 మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. నాయకులు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర వన్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్పర్సన్ వనిత, రెస్కో చైర్మన్ సెంథిల్, మున్సిపల్ చైర్మన్ సుధీర్, ఎంపీపీలు అశ్విని, వరలక్ష్మీ, సుబ్రహ్మణ్యం, జెడ్పీటీసీ సభ్యులు ఏడీఎస్ శరవణ, నితిన్రెడ్డి, శ్రీనివాసులు, కృష్ణమూర్తి, కన్వీనర్లు మురుగేష్, దండపాణి, బాబురెడ్డి, రామకృష్ణ, నాయకులు హఫీజ్, మునస్వామి, విద్యాసాగర్ పాల్గొన్నారు. కుప్పం గెలుపే లక్ష్యం కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యమని ఎమ్మెల్సీ భరత్ అన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసి సీఎం జగన్కు కానుకగా ఇస్తామన్నారు. నియోజవర్గంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ గెలుపు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి ఖాయమన్నారు. కరోనా సమయంలో ఇంటి నుంచి బయటకు బాబు ప్రజలను మభ్యపెట్టేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు సీఎం జగన్కు మద్దతు తెలిపారని, ఇందుకు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కుప్పంలో విజయం సాధిస్తామన్నారు. -
'వైఎస్సార్సీపీ కోసం అహర్నిశలు పాటుపడుతుంది కార్యకర్తలే'
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడుతుంది అంటే అందులో కార్యకర్తల కష్టం ఎంతో ఉందని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ప్లీనరీలో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. దేశం కోసం అహర్నిశలు పాటుపడుతుంది ఆర్మీ అయితే వైఎస్సార్సీపీ కోసం అహర్నిశలు పాటుపడుతుంది కార్యకర్తలే. కార్యకర్తలు ఉన్నారనే మనోధైర్యంతోనే సీఎం వైఎస్ జగన్ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దిగ్విజయంగా పాలన సాగిస్తున్నారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్లే ఇవాళ గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ప్రజల ముందుకు వెళ్లగలుగుతున్నాం. అద్భుతమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై సైతం ప్రతిపక్షాలు బురద చల్లడం దారుణం. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి స్థానంలో మరోసారి కూర్చోబెట్టేందుకు కృషి చేయాలి అని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఇచ్చిన హామీల్లో 97% నెరవేర్చారు వైఎస్సార్సీపీ ఎంపీ, రీజనల్ కో ఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ప్రజల ఆమోదంతోనే 2019లో 151 స్థానాలు గెలవగలిగారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రతిపక్షాలు ఈర్ష్యతో మాట్లాడటం సరికాదు. సీఎం వైఎస్ జగన్ తాను ఇచ్చిన హామీల్లో 97% నెరవేర్చారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 210 హామీలు ఇచ్చారు.. పదో, పదిహేనో నెరవేర్చి మిగిలినవన్నీ గాలికొదిలేశారు. ప్రస్తుత ప్రభుత్వంపై చంద్రబాబు రూ.80 వేల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లారు. కోవిడ్లో సైతం ప్రజలకు అన్ని రంగాల్లో సహకారం అందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని సాక్షాత్తు ప్రధానమంత్రి పార్లమెంట్లో చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీలకు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అనడంలో సందేహం లేదు అని ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ అన్నారు. చదవండి: (సీఎం వైఎస్ జగన్ బీసీ కులాలకు శ్రీరామరక్ష: ఆర్ కృష్ణయ్య) -
YSRCP Plenary 2022: కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో బుధవారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మచిలీపట్నంలో పేర్ని నాని నిలబడినా.. ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి నిలబడినా అండగా నిలబడాలని కోరారు. బందరులో వారసుడినే గెలిపించాలని, ఇల్లరికం అల్లుడిని (టీడీపీ కొల్లు రవీంద్ర) కాదని అన్నారు. ‘వారసత్వమంటే తాత, తండ్రి, కొడుకు.. అంతే కానీ మామా, అల్లుళ్లు కాదు. వారసత్వమంటే వైఎస్సార్.. జగన్. సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్. మామ పేరు చెప్పుకునే ఇల్లరికం అల్లుళ్లు మనకెందుకు. రాష్ట్రంలో చంద్రబాబు, బందరులో కొల్లు రవీంద్ర వంటి ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపించండి’ అని కొడాలి నాని నియోజకవర్గ ప్రజల్ని కోరారు. చదవండి: (‘సంక్షేమ పథకాల సామ్రాట్ సీఎం జగన్ ఒక్కరే’) -
‘సంక్షేమ పథకాల సామ్రాట్ సీఎం జగన్ ఒక్కరే’
నగరి: ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా వెన్నుచూపకుండా మొక్కవోని ధైర్యంతో సీఎం జగన్మోహన్రెడ్డి ముందుకు వెళ్తున్నారని మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల సామ్రాట్ సీఎం జగన్ అని కొనియాడారు ఆర్కే రోజా. నగరి నియోజకవర్గంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో మాట్లాడిన మంత్రి రోజా..‘ సచివాలయ వ్యవస్థతో గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ అందించారు. జగన్ అంటే ఒక బ్రాండ్. కార్యకర్తలే వైఎస్సార్సీపీ బలం, బలగం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ఏనాడు అమలు చేయలేదు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది చంద్రబాబు కాదా?’అని ప్రశ్నించారు. గతంలో పింఛన్ రావాలంటే జన్మభూమి కమిటీల కాళ్లు మొక్కాలి.సీఎం జగన్ గ్రామ, వార్డు వాలంటీర్లతో వ్యవస్థనే మార్చేశారు’ అని అన్నారు మంత్రి రోజా. -
అభివృద్ధి విపక్షాలకు కనబడటం లేదా?
మచిలీపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి విపక్షాల కంటికి కనబడటం లేదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని. మచిలీపట్నంలో బుధవారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాల్లో మాట్లాడిన కొడాలి నాని.. మ్యానిఫెస్టోలో చెప్పనివి కూడా అమలు చేస్తున్న గొప్ప సీఎం జగన్ అని కొనియాడారు. ఈ క్రమంలోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్పై మండిపడ్డారు నాని. ‘ మహానాడును చంద్రబాబు నవ్వులు పాలు చేశాడు. టీడీపీ నేతలకు చిన్న కర్మకు, పెద్ద కర్మకు తేడా తెలియదు. పనికిరాని దద్దమ్మ చంద్రబాబు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారు. లోకేష్ గెటప్కు సరిగ్గా సరిపోయే పేరు సిద్ధప్ప’ అని విమర్శించారు. -
‘అధికారంలో మేమే ఉంటాం..అందుకే ప్రజా సమస్యలపై చర్చ’
గుంటూరు: వచ్చే నెల 8వ తేదీన నిర్వహించబోయే తమ పార్టీ ప్లీనరీకి ప్రతి ఒక వార్డు స్థాయి కార్యకర్తకు పార్టీ అధ్యక్షుడి సంతకంతో ఆహ్వానం ఉంటుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్టారెడ్డి తెలిపారు. నవరత్నాల ఎజెండా అనేది ఇక్కడ నుంచే వచ్చిందని, అదే వేద మంత్రంలా 95 శాతం హామీలను అమలు చేశామన్నారు. గుంటూరులో వైఎస్సార్సీపీ ప్లీనరీ ప్రాంగణం ఏర్పాట్లను పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి సుచరిత, పలువురు ముఖ్యనేతలతో కలిసి పరిశీలించిన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇదే స్థలంలో మరో ప్లీనరీ నిర్వహించబోతున్నాం. రాష్ట్ర భవిష్యత్తు చిత్ర పటాన్ని మళ్లీ చర్చిస్తాం. వరుసగా అధికారంలో మేమే ఉంటాం..అందుకే ప్రజల సమస్యలపై చర్చ. ఇది ఒక పార్టీ ప్లీనరీ కాదు...ప్రజల ఎజెండాతో ముందుకు వెళ్తున్నాం. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించిన పార్టీ మాది. 8వ తేదీ మాకు పవిత్రమైన రోజు...వైఎస్సార్ పుట్టినరోజు. అందుకే ఆ రోజు వైఎస్సార్సీపీ ప్లీనరీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం’ అని తెలిపారు. కిక్ బాబు ఔట్ నినాదంతో ఎన్నికలకు వెళ్తాం వచ్చే ఎన్నికల్లో కిక్ బాబు ఔట్ నినాదంతో ముందుకు వెళ్తామని విజయసాయి రెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ప్లీనరీ నిర్వహిస్తున్నామని, మళ్లీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్లీనరీ నిర్వహిస్తామన్నారు. తమ ప్లీనరీ సమావేశాలు మిగతా వాటికి భిన్నంగా ఉంటాయన్నారు. క్షేత్ర స్థాయి నుంచి వార్డు సభ్యుని వరకూ ఈ ప్లీనరీలో పాల్గొంటారని, వచ్చే నెల 8వ తేదీన అధ్యక్షుడు ప్రారంభ ఉపన్యాసం చేస్తారని, 9వ తేదీన ముగింపు స్పీచ్ ఉంటుందన్నారు విజయసాయి రెడ్డి. పార్టీ అధ్యక్షులు అందరికీ దిశా నిర్దేశం చేస్తారు వచ్చే నెల 8, 9 తేదీల్లో రాష్ట్ర స్థాయి వైఎస్సార్సీపీ ప్లీనరీ జరుగుతుందని, 8వ తేదీన ప్లీనరీ ప్రారంభ కార్యక్రమం 9వ తేదీన ముగింపు కార్యక్రమంలోనూ పార్టీ అధ్యక్షులు పాల్గొంటారని మాజీ మంత్రి సుచరిత తెలిపారు. ఈ ప్లీనరీ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు అందరికీ దిశా నిర్దేశం చేస్తారని సుచరిత స్పష్టం చేశారు. -
పార్టీకి కార్యకర్తలే మూలస్తంభాలు: ఎంపీ మిథున్ రెడ్డి
సాక్షి,రాజంపేట: వైఎస్సార్సీపీకి కార్యకర్తలు, నాయకులే మూలస్తంభాలని రాజంపేట ఎంపీ, లోక్సభ ఫ్లోర్లీడర్ పీవీ మిథున్రెడ్డి అన్నారు. మంగళవారం తోట కన్వెన్షన్ హాలులో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడి నేతృత్వంలో వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే కార్యకర్తలే కీలక సూత్రధారులన్నారు. కార్యకర్తలకు వెన్నంటే ఉంటామన్నారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జెడ్పీచైర్మన్ ఆకేపాటి అమర్నాథ్రెడ్డిలు కూడా నియోజకవర్గంలో కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో తనతోపాటు ముందంజలో ఉంటారన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గడపగడపకు తీసుకెళ్లాలన్నారు. రాజంపేట అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయని, త్వరలో తాను, ఎమ్మెల్యే, జెడ్పీచైర్మన్ సీఎంను కలిసి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ మేనిఫెస్టోలోని హామీలను మూడేళ్లలో తొంభై ఐదుశాతానికి పైగా అమలు చేసిన సీఎం జగన్కు, ఎన్నికల అనంతరం మేనిఫెస్టోను ఆన్లైన్లో తొలగించిన చంద్రబాబుకు పోలిక ఎక్కడ అని ప్రశ్నించారు. ప్రజలను ఓట్లు అడిగే హక్కు వైఎస్సార్సీపీకే ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామన్నారు. టీడీపీకి దుష్టచతుష్టయం, ఎల్లోమీడియా మద్దతు ఉంటే వైఎస్సార్సీపీకి ప్రజల మద్దతు ఉందన్నారు. పార్టీ కన్నతల్లి లాంటిదని, ఊపిరి ఉన్నంతవరకు వైఎస్సార్సీపీ జెండా కిందనే జీవిద్దామని కార్యకర్తలకు, నాయకులకు గడికోట పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టంతోనే జెండా రెపరెపలు రైల్వేకోడూరు అర్బన్: కార్యకర్తలు, వైఎస్ అభిమానులు, నాయకుల కష్టంతోనే వైఎస్సార్సీపీ ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించి పార్టీ జెండా రెపరెపలాడుతోందని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. రైల్వేకోడూరులో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారన్నారు. వారి కష్టాన్ని పార్టీ ఎప్పటికీ విస్మరించదన్నారు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.