కొరాపుట్: చేతబడి చేసిందనే అనుమానంతో వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన అమానుష ఘటన నబరంగ్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ మేరకు జోరిగాం పోలీసుస్టేషన్ ఐఐసీ తపన్ కుమార్ సత్పతి ఘటన వివరాలు మంగళవారం ప్రకటించారు. కెందుగుడ గ్రామంలో బుతలి శాంత తన తల్లి రాయబరి శాంత (60)తో కలిసి నివాసముంటోంది.
కానీ అవగాహన లేని కొందరు గ్రామస్తులు గత కొద్దికాలంగా రాయబరి శాంత చేతబడి చేస్తుందనే అనుమానంతో వేధింపులకు గురి చేసేవారు. ఇదే సమయంలో గ్రామానికి చెందిన సారధి శాంత, మాతిరి శాంత, కాజు శాంత, లఖి శాంత, పాలాడు శాంత, మాతిరి శాంతలు ఒక్కసారిగా మంగళవారం ఇంట్లోకి ప్రవేశించారు. తమకు చేతబడి చేస్తుందని దుర్భాషలాడుతూ, కొడుతూ రాయబరిని ఈడ్చుకుని వెళ్లిపోయారు. దీంతో బయపడిన ఆమె కుటుంబీకులు జోరిగాం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వెంటనే పోలీసులు కెందుగుడ గ్రామానికి వచ్చి రాయబరి కోసం గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో తాము రాయబరిని కొట్టి హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. తాము పూడ్చి పెట్టిన ప్రాంతం చూపించారు. వెంటనే పోలీసులు తవ్వి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతున్నా ఇంకా మూఢ నమ్మకాలతో హత్యలు చేయడం దారుణమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment