అసహనంతోనే హరీశ్, పువ్వాడ, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు సాయం చేయడం చేతగాక, సేవ చేసే బీఆర్ఎస్ నేతలను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ పార్టీ దాడికి దిగిందని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ధ్వజమెత్తారు.
ఖమ్మంలో మాజీమంత్రులు హరీశ్రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయటం వారి అసహనానికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ‘ఎక్స్’వేదికగా మంగళవారం ఆయన పోస్ట్ చేశారు. ఈ దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ ముందుచూపుతోనే నగరానికి తప్పిన ప్రమాదం
హైదరాబాద్లో వర్షాల కారణంగా ప్రజా జీవనానికి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ముందుచూపుతో మాజీ సీఎం కేసీఆర్ చేసిన కృషి ఇప్పుడు ఫలితాలనిచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. నగరంలో 2020లో వచ్చిన వరదల కారణంగా జరిగిన భారీ నష్టం మరోసారి ఎదురుకాకుడదని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ)కు నాటి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వివరించారు.
ముఖ్యంగా 40 లక్షలమంది నివసించే పాతబస్తీలో ప్రత్యేకంగా నాలాలను బాగు చేసే కార్యక్రమాన్ని ఎస్ఎన్డీపీ తీసుకుందన్నారు. కాగా, రాష్ట్రంలో వరదలతో నష్టపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున పరిహారం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కేన్స్ సంస్థ గుజరాత్కు తరలిపోతున్నా పట్టదా?: కేటీఆర్
గతంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కేన్స్ సంస్థ గుజరాత్కు తరలివెళ్తున్నట్లు వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆవేదన వ్యక్తంచేశారు. ‘కొంగరకలాన్లోని ఫాక్స్కాన్ సంస్థ ప్లాంట్ పక్కన భూమిని కేటాయిస్తే తమ యూనిట్ ఏర్పాటు చేస్తామని కేన్స్ ప్రకటించింది.
కానీ ప్రస్తుతం కేన్స్ సంస్థ తమ యూనిట్ను గుజరాత్కు తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నా తరలిపోకుండా చూడటంలో ప్రభుత్వం విఫలమైంది. మొత్తానికి ఈ యూనిట్ను తరలించుకుపోతున్న గుజరాత్కు కృతజ్ఞతలు’అంటూ కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment