Atm Card
-
ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డులు ఎప్పటి నుంచో తెలుసా..
కోట్లాది మంది ఈపీఎఫ్ఓ(EPFO) చందాదారులు తమ పీఫ్ డబ్బును ఏటీఎం(ATM) ద్వారా విత్డ్రా చేసుకునేందుకు తేదీ ఖరారైంది. ఇందుకోసం ప్రభుత్వం కొత్తగా సాఫ్ట్వేర్ వ్యవస్థను ప్రారంభిస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ ఏడాదే ఈపీఎఫ్ఓ 3.0ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ కొత్త విధానం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) సభ్యుల సమస్యలను పరిష్కరించి, వారికి మెరుగైన సర్వీస్ను అందిస్తుందన్నారు. ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డులను జూన్ 2025 వరకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు.ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డుఈపీఎఫ్ఓ 3.0 వెర్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పీఎఫ్ చందాదారులకు ఏటీఎం కార్డులను జారీ చేస్తామని కేంద్ర మంత్రి మాండవీయ ధ్రువీకరించారు. ఉద్యోగులు ఈ ఏటీఎం కార్డు ద్వారా తమ ఈపీఎఫ్ పొదుపును సులభంగా పొందవచ్చన్నారు. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు వెంటనే అందుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించి వెబ్సైట్, సిస్టమ్ అప్డేట్ల(Updates) ప్రారంభ దశను ఈ నెలాఖరులోగా ఖరారు చేస్తామని మాండవీయ పేర్కొన్నారు.ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ఈపీఎఫ్వో సభ్యులను ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETF) పరిధికి మించి ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదిత మార్పు పీఎఫ్ ఖాతాదారులకు వారి ఫండ్లను మెరుగ్గా నిర్వహించడానికి, అధిక రాబడిని అందుకునేందుకు, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్కు వీలు కల్పిస్తుంది. ఇది ఆమోదం పొందితే డైరెక్ట్ ఈక్విటీ పెట్టుబడి సభ్యులకు తమ పెట్టుబడి వ్యూహాలను, ఆర్థిక వృద్ధిని పెంచుకోవడానికి కొత్త మార్గాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ఈపీఎఫ్వో పెన్షనర్ల కోసం గణనీయమైన మార్పులను అమలు చేస్తోంది. ఇటీవలి ఆదేశాల ప్రకారం.. పింఛనుదారులు అదనపు ధ్రువీకరణ లేకుండా తమ పెన్షన్ను దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు నుంచి అయినా ఉపసంహరించుకునే వెసులుబాటు రానుంది. -
ఏటీఎం కార్డు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?
బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ.. దాదాపు 'ఏటీఎం' (ATM) కార్డు (డెబిట్ కార్డు) ఉంటుంది. ఏటీఎం అనేది కేవలం డబ్బు విత్డ్రా చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. ఇతర కార్యకలాపాల కోసం కూడా ఉపయోగించవచ్చు. ఈ కథనంలో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.బ్యాలెన్స్ ఎంక్వైరీ: ఏటీఎం కార్డు ఉపయోగించే మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేకుండానే.. ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయం తెలుసుకోవచ్చు. అంతే కాకుండా లావాదేవీలకు సంబంధించిన మినీ స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు.ఫండ్ ట్రాన్స్ఫర్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ప్రకారం.. మీరు డెబిట్ కార్డును ఉపయోగించి, ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు రోజుకు రూ. 40,000 ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికి ఎస్బీఐ ఎలాంటి ఛార్జెస్ విధించదు.క్రెడిట్ కార్డ్ చెల్లింపు: క్రెడిట్ కార్డ్ చెల్లింపులను కూడా ఏటీఏం ద్వారా చెల్లించవచ్చు. దీనికి మీ డెబిట్ కార్డు, పిన్ నెంబర్ వంటివి అవసరమవుతాయి.బీమా ప్రీమియం చెల్లింపు: ఏటీఎం ఉపయోగించి బీమా ప్రీమియంలను చెల్లించవచ్చు. ఎల్ఐసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ వంటివి బ్యాంకులతో టై-అప్లను కలిగి ఉన్నాయి. కాబట్టి ఏటీఎంలోనే ప్రీమియం చెల్లించవచ్చు.చెక్బుక్ రిక్వెస్ట్: చెక్ లీఫ్లు అయిపోయినా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఏటీఎం వీడరనే కొత్త చెక్బుక్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. చిరునామా అక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ చిరునామాకే చెక్బుక్ (Checkbook) వస్తుంది.బిల్ పేమెంట్స్: ఏటీఎం ద్వారా యుటిలిటీ బిల్లులను చెల్లించవచ్చు. అయితే ముందుగా బిల్లింగ్ కంపెనీ ఏటీఎం నెట్వర్క్కి లింక్ చేయబడిందో లేదో చెక్ చేసుకోవాలి. డబ్బు పంపే ముందు, బ్యాంకు వెబ్సైట్లో చెల్లింపుదారు వివరాలను నమోదు చేసుకోవాలి.మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేషన్: బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటివి యాక్టివేట్ చేస్తారు. అయితే మీరు ఏటీఎం ఉపయోగించి కూడా మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకోవచ్చు లేదా డీయాక్టివేట్ చేసుకోవచ్చు.ఏటీఎం పిన్ చేంజ్: ఏటీఎం ఉపయోగించే.. పిన్ నెంబర్ మార్చుకోవచ్చు. అనుమానం వచ్చినప్పుడు ఏటీఎం పిన్ నెంబర్ మార్చుకోవడం మంచిది. కాబట్టి బ్యాంకుకు వెళ్లకుండానే.. ఏటీఎంలోనే పిన్ నెంబర్ మార్చుకోవచ్చు. -
యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త!
ఖాతాదారులకు యాక్సిస్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. దేశంలోనే తొలిసారి ఫిన్టెక్ సంస్థ ఫైబ్(Fibe)తో కలిసి నెంబర్లెస్ క్రెడిట్ కార్డును లాంఛ్ చేసింది. చూడటానికి ఎలా ఉంటుందంటే? ప్రస్తుతం కస్టమర్లు వినియోగిస్తున్న అన్ని క్రెడిట్ కార్డ్లలలో 16 అంకెల నెంబర్, సీఈవో, కార్డుదారు పేరుతో పాటు ఇతర వివరాలు ఉంటాయి. కానీ యాక్సిస్ బ్యాంక్ - ఫైబ్ క్రెడిట్ కార్డ్పై పైన పేర్కొన్నట్లు కస్టమర్లకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉండదు. నెంబర్లెస్ క్రెడిట్ కార్డ్లో కేవలం ఒక చిప్ మాత్రమే ఉంటుంది. కార్డ్ వివరాలు కావాలంటే ఫైబ్ మొబైల్ యాప్లో లభ్యమవుతాయి. నెంబర్లెస్ క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుందంటే? సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు, ప్రజలకు తెలియకుండానే వారి బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులను దోచుకుంటున్నారు. దీంతో కస్టమర్ల శ్రేయస్సు కోసం ఈ నెంబర్లెస్ క్రిడెట్ కార్డ్ను వినియోగంలోకి తెస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ కార్డ్ అండ్ పేమెంట్ అధినేత సంజీవ్ మోఘే తెలిపారు. ఈ కొత్త క్రెడిట్ కార్డ్తో వినియోగదారుల కార్డ్ల సమాచారం, వారి డేటా అగంతకులు సేకరించలేరని అన్నారు. బోలెడన్ని లాభాలు యాక్సిస్ బ్యాంక్ లాంచ్ చేసిన నెంబర్లెస్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఫుడ్ డెలివరీ, క్యాబ్ సర్వీస్, ఆన్లైన్ టికెటింగ్ వంటి సర్వీసుల వినియోగంలో 3 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తుంది. ఆన్లైన్,ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్లలో 1 శాతం క్యాష్బ్యాక్ అందిస్తున్న యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఈ రూపే క్రెడిట్ కార్డ్ సాయంతో యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు త్రైమాసికానికి నాలుగు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్లకు యాక్సెస్ చేయొచ్చు. రూ.400 నుంచి రూ.5000 వరకు పెట్రోల్, డీజిల్పై విధించే సర్ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే యాక్సిస్ డిన్నింగ్ డిలైట్ పేరుతో అదనపు ప్రయోజనాల్ని అందిస్తుంది. మీరు నంబర్లెస్ కార్డ్ని ఎక్కడ పొందవచ్చు? ఫైబ్ యాప్లో కస్టమర్లకు ఈ కార్డ్ అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కొత్త యాక్సిస్ బ్యాంక్-ఫైబ్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్లో జీరో జాయినింగ్ ఫీజు, జీవితకాలం జీరో వార్షిక రుసుము ఉంటుందని యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు తెలిపింది. -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! ఏటీఎం కార్డు వాడట్లేదా? అయితే...
ప్రస్తుతం యూపీఐ వినియోగం ఎక్కువైంది. ఎక్కడ డబ్బు చెల్లించాలన్న ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి యూపీఐ యాప్ల ద్వారానే అన్ని చెల్లింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏటీఎం వాడకం బాగా తగ్గిపోయింది. ఇక రెండు మూడు కార్డులున్న వారి సంగతి చెప్పనక్కర్లేదు. అయితే ఎప్పుడోకానీ ఏటీఎం కార్డులు వాడని వారికి ఇబ్బందులు తప్పడం లేదు. సాధారణంగా డెబిట్ కార్డు గడువు ముగిసిన తర్వాత బ్యాంకులు ఆటోమేటిక్గా కొత్త ఏటీఎం కార్డును పోస్ట్ ద్వారా కస్టమర్ల చిరునామాకు పంపుతాయి. కానీ ఓ ఎస్బీఐ కస్టమర్కు విభిన్న అనుభవం ఎదురైంది. దీనిపై ఆ కస్టమర్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (ఫోన్పే, గూగుల్పే, పేటీఎం యూజర్లకు గుడ్న్యూస్! ఇకపై మరింత..) ఆ కస్టమర్కు ఎస్బీఐలో 10 సంవత్సరాలుగా అకౌంట్ ఉంది. అతని డెబిట్ కార్డ్ గడువు ఇటీవలే ముగిసింది. కొత్త ఏటీఎం కార్డు ఆటో మేటిక్గా పోస్టులో ఇంటికి రావాల్సిఉండగా అతనికి బ్యాంక్ కొత్త ఏటీఎం కార్డును పంపలేదు. దీంతో బ్యాంక్ బ్రాంచికి వెళ్లిన అతనికి కొత్త కార్డు కావాలంటే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని బ్యాంకులు అధికారులు చెప్పారు. ఇదీ చదవండి: బాస్మతి బియ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.. దీంతో ఎక్స్ (ట్విటర్)లో ఎస్బీఐ యాజమాన్యాన్ని ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేయగా ఎస్బీఐ స్పందించింది. కొత్త ఏటీఎం కార్డు ఎందుకు రాలేదో కారణాలను వివరించింది. కార్డు గడువు ముగిసేందుకు మూడు నెలల ముందే అప్రమత్తం కావాలని సూచించింది. కొత్త కార్డు ఆటోమేటిక్గా రావాలంటే.. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అకౌంట్ అయి ఉండకూడదు. డెబిట్ కార్డును ఏడాదిలో కనీసం ఒక్కసారైనా వాడి ఉండాలి. అకౌంట్కు కస్టమర్ పాన్ నంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. -
ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. చేతిలో ఫోనుంటే చాలు
దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. వినియోగదారుల కార్యకలాపాల్ని మరింత సులభతరం చేసేందుకు యోనో యాప్లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. తాజాగా యోనో యాప్లో యూపీఐ కార్యకలాపాలు నిర్వహించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో కస్టమర్లు స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి సర్వీసుల్ని వినియోగించుకోవచ్చు. అంతేకాదు చేతిలో ఏటీఎం కార్డ్ లేకుండా యోనో యాప్లో క్యూఆర్కోడ్ను స్కాన్ చేసి ఏటీఎం నుంచి డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ 68వ వార్షికోత్సవం సందర్భంగా తాజాగా ఈ అప్డేట్లు చేసింది. ఇతర బ్యాంకుల కస్టమర్లు కూడా యోనో యాప్ ద్వారా సేవలు పొందొచ్చు. ఎస్బీఐ ఇంటర్ ఆపరేబుల్ కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయల్ చేసుకోవచ్చు. ఈ కొత్త క్యాష్ విత్ డ్రాయల్ సర్వీసుల ద్వారా ఇతర బ్యాంకుల కస్టమర్లు సైతం బెనిఫిట్ పొందవచ్చు. వీటితో పాటు ట్రాన్సాక్షన్లు, షాపింగ్లు ఇతర చెల్లింపులు సైతం ఈ యోనో యాప్లో చేసుకునే వెసలు బాటు కల్పిస్తున్నట్లు ఎస్బీఐ అధికారికంగా ప్రకటించింది. మరి యూపీఐ వినియోగంతో ఎంత సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తుందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి : ‘జీవితాంతం రుణ పడి ఉంటా’.. ఆనంద్ మహీంద్రా భావోద్వేగం! -
ఏటీఎం కార్డు లేకున్నా డిజిటల్ చెల్లింపులు బిగ్ బజార్ కోసం అంబానీ, అదానీ పోటీ
-
ఏటీఎం కార్డు పోతే ఇలా చేయండి..!
ప్రస్తుతం చాలా మంది వారి జీవితంలో ఏటీఎం కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఏటీఎం ద్వారా డబ్బు విత్ డ్రా చేయడంతో పాటు డిపాజిట్ చేయడం వంటి పనులు చాలా తేలిక అవుతున్నాయి. లావాదేవీల కోసం ఎక్కువగా వాడే ఏటీఎం కార్డు పోతే మాత్రం ఇక అంతే సంగతులు. ఎందుకంటే ఏటీఎం నుంచి డబ్బులు ఇతరులు తీసుకునే ఆస్కారం ఎక్కువ. అందుకే ఒకవేల మీ డెబిట్ కార్డు ఎక్కడైన పోతే వెంటనే ఈ క్రింద చెప్పిన విదంగా చేయండి. 1. ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీ ఖాతాకు కనుక ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలా మంచింది. దీని ద్వారా మీ కార్డును క్షణాలలో బ్లాక్ చేయవచ్చు. కార్డును బ్లాక్ చేయడానికి మొదట ఇంటర్నెట్ బ్యాంకింగ్కు వెళ్లి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత డెబిట్ కార్డ్ ఆప్షన్ ఎంపిక చేసుకోండి. ఇక్కడ మీరు పోయిన డెబిట్ కార్డ్ నంబర్ను వివరాలు సమర్పించండి. ఇప్పుడు బ్లాక్ యువర్ డెబిట్ కార్డ్ ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా మీ కార్డును బ్లాక్ చేయవచ్చు. కార్డు బ్లాక్ చేయడం వల్ల ఎవరూ మీ డబ్బును తీసుకోలేరు. 2. మొబైల్ బ్యాంకింగ్ యాప్ మీరు మొబైల్ బ్యాంకింగ్ యాప్ సహాయంతో మీ కార్డును బ్లాక్ చేయవచ్చు. ఇందుకోసం మీ బ్యాంక్ యాప్ను మొబైల్లో ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు కార్డ్ ఆప్షన్కు వెళ్లి మీ డెబిట్ కార్డును బ్లాక్ చేసే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ డెబిట్ కార్డు బ్లాక్ అవుతుంది. 3. హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయండి మీరు బ్యాంక్ హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయడం ద్వారా కూడా మీ ఏటీఎం కార్డును బ్లాక్ చేయవచ్చు. హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేసిన తర్వాత మీ ఏటీఎం, బ్యాంక్ ఖాతా నంబర్ వివరాలు పేర్కొనాలి. మీరు చివరిగా డబ్బులు ఎప్పుడు తీశారో తెలియజేయాల్సి ఉంటుంది. ధృవీకరణ తర్వాత మీ కార్డ్ బ్లాక్ చేయబడుతుంది. 4. ఎఫ్ఐఆర్ దాఖలు చేయండి మీ ఏటీఎం కార్డు ఎవరైనా దొంగలించినట్లు మీకు అనిపిస్తే వెంటనే ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి. దీనికోసం మీరు కార్డు దొంగతనం జరిగిన సమీప పోలీసు స్టేషన్కు వెళ్లి నివేదించాలి. ఎఫ్ఐఆర్ కాపీ రిజిస్టర్ చేసిన తర్వాత మీకు ఇస్తారు. ఈ కాపీని భవిష్యత్ ఉపయోగం కోసం ఉంచాలి. చదవండి: 2020లో భారీగా పెరిగిన డిజిటల్ మోసాలు -
వామ్మో..ఏటీయమ్లో కేటుగాడు!
వైరా: ఆంధ్రా(యూనియన్) బ్యాంక్ ఏటీఎంకు నగదు కోసం వెళ్లిన ఓ వ్యక్తి మోసానికి గురైన సంఘటన వైరాలో చోటుచేసుకుంది. స్థానిక పాతబస్టాండ్ సెంటర్లోని ఓ ఫొటో స్టూడియో యజమాని జనార్దన్ బుధవారం ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వెళ్లాడు. ఏటీఎంలో కార్డు ఉంచి పిన్ నంబర్ కొట్టడంతో ఎర్రర్ అని చూపింది. దీంతో పిన్ నంబర్ కోసం తన భార్యకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. అప్పటికే ఏటీఎంలో మాటు వేసి ఉన్న ఓ ఆగంతకుడు తన చేతిలోని కార్డును మిషన్లో ఉంచి, జనార్దన్ కార్డు తీసుకున్నాడు. ఇది గమనించని జనార్దన్.. మిషన్లో ఉన్న కార్డు తీసుకుని వెళ్లిపోయాడు. అదే రోజు సాయంత్రం 6.30 సమయంలో అగంతకుడు మరో ఏటీఎం నుంచి రూ. 20 వేలు డ్రా చేశాడు. నగదు డ్రా చేసినట్లు సెల్ఫోన్కు మెసేజ్ రావడంతో ఆందోళన చెందిన జనార్దన్ తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చే«శాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మహిళకు మధ్య వేలు చూపించి అసభ్యంగా.. -
ఏటీఎం కార్డుల క్లోనింగ్ ముఠా అరెస్ట్
నెల్లూరు (క్రైమ్): ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేసి నగదు కాజేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి స్కిమ్మింగ్ మెషిన్, కార్డ్ రీడర్, ల్యాప్టాప్, కారుతోపాటు రూ.7.04 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్పీ ఐశ్వర్య రస్తోగి శుక్రవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. హర్యానా రాష్ట్రంలోని భివానీ జిల్లా భవానీకేడ తాలూకా బార్శి గ్రామానికి చెందిన సందీప్కుమార్ 8వ తరగతి వరకు చదువుకున్నాడు. అతనికి సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఉంది. ఏటీఎం కేంద్రాల వద్ద వృద్ధులు, నిరక్షరాస్యులతో మాటలు కలిపి వారి డెబిట్ కార్డులను తీసుకుని స్కిమ్మింగ్ మెషిన్ ద్వారా స్కాన్ చేసి కార్డులో ఉండే డేటాను బ్లూటూత్ ద్వారా తన ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేవాడు. అనంతరం కార్డ్ రీడర్ ద్వారా నకిలీ కార్డులోకి ఆ డేటాను ట్రాన్స్ఫర్ చేసి దాని సాయంతో ఏటీఎం కేంద్రాల్లో నగదును డ్రా చేసేవాడు. తన సోదరుడు మంజీత్, బంధువైన జగ్జీత్ కలిసి ఏడాదిన్నర కాలంగా తమిళనాడు, కర్ణాటక, గోవా, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు వెయ్యికి పైగా నేరాలకు పాల్పడ్డాడు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, వనపర్తి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో 49 చోట్ల ఇతరుల కార్డుల్ని క్లోన్ చేసి ఏటీఎంల నుంచి నగదు డ్రా చేశాడు. ఈ ముఠా ఒక్క నెల్లూరులోనే 16 నేరాలు చేయడంతో టాస్క్ఫోర్స్ బృందం, దర్గామిట్ట పోలీసులు నిఘా పెట్టారు. నిందితులు నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ పడమర వైపున గల ఏటీఎం కేంద్రం వద్ద ఉన్నారనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. -
కార్డు ఇక్కడ.. డబ్బు డ్రా చేసింది వైజాగ్లో..
ఆత్మకూరు: ఏటీఎం కార్డు తన వద్ద ఉండగా ఖాతాలోని నగదు రూ.40 వేలు డ్రా చేసినట్లుగా ఫోన్కు సమాచారం అందడంతో బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన బుధవారం మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. మున్సిపల్ పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన బేల్దారి పనులు చేసే బడే వీరరాఘవులురెడ్డికి స్టేట్ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం అతని బ్యాంకు ఖాతా నుంచి తొలుత రూ.20 వేలు ఏటీఎంలో డ్రా చేసినట్లు, అనంతరం కొద్దిసేపటికే మరో రూ.20 వేలు వేరొకరి ఖాతాలోకి బదిలీ అయినట్లు ఫోన్ ద్వారా సమాచారం అందింది. ఆలస్యంగా చూసుకున్న వీరరాఘవులురెడ్డి బ్యాంక్ అధికారులను సంప్రదించగా అతని ఖాతా నుంచి రెండు విడతలుగా రూ.40 వేలు (ఏటీఎం ద్వారా, బదిలీ రూపంలో) వైజాగ్లో డ్రా చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. నగదు ఆ ఖాతా నుంచి కొద్దినిమిషాలకే ఛత్తీస్ఘడ్లోని మరొకరి బ్యాంక్ ఖాతాలోకి బదిలీ అయినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించి బాధితుడికి సమాచారం చెప్పారు. ఏటీఎం కార్డు తన వద్ద ఉండగానే తన ప్రమేయం లేకుండా ఖాతా నుంచి నగదు ఎలా మాయమవుతుందని బాధితుడు ప్రశ్నించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని బ్యాంకు అధికారులు వారికి తెలిపారు. దీంతో బుధవారం ఎస్సై పి.నరేష్కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి విచారిస్తామని ఎస్సై వెల్లడించారు. -
చిప్లేని కార్డులకు ఇక చెల్లు
కడెం(ఖానాపూర్): ‘ఈఎంవీ’ చిప్ లేని ఏటీఎం డెబిట్, క్రెడిట్ కార్డులు డిసెంబర్ 31 తర్వాత పనిచేయవని రిజర్బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. గతంలో జారీచేసిన మాగ్నటిక్ పూత(స్రి ్టఫ్)కల్గిన ఏటీఎం కార్డులతో ఆన్లైన్ మోసాలు జరుగుతున్న నేపథ్యంలో కార్డులను పూర్తిగా బ్యా న్ చేసి చిప్ కలిగిన నూతన ఏటీఎం కార్డులను వినియోగాదారులకు అందివ్వనుంది. ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకే.. 2016 వరకు దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు చిప్ లేని డెబిట్, క్రెడిట్ కార్డులను అం దజేశాయి. ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా ఏటీ ఎం కార్డుల క్లోనింగ్ ద్వార మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల నుంచి ఖాతాదారుల డ బ్బును కాపాడేందుకు మాగ్నటిక్ స్ట్రిఫ్తో పాటు, అదనంగా ఈవీఎం చిప్ కలిగిన కార్డులు అవసర మని బ్యాంకింగ్ సంస్థలు భావించాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ఖాతాదారులకు హా ్యక్ కాకుండా ఉండేందుకు ఈచర్యలు తీసుకుంటున్న ట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈఎంవీతో సేఫ్.. యూరో, మాస్ట్రో, విసా (ఈ.ఎం.వీ) చిప్ కల్గిన ఏటీఎం కార్డుల ద్వారా సమాచా రం హ్యక్ కాకుండా సురక్షితంగా ఉంటుంది. గతంలో బ్యాంకులు జా రీ చేసిన మాగ్నటిక్ స్ట్రిఫ్ కార్డుల ద్వారా క్లోనింగ్ చేసి సైబర్ నేరగాళ్లు ఈజీగా ఖాతాల నుంచి నగదు దోపిడీకి పాల్పడుతున్నారు. కొత్తగా వచ్చిన ఈవీ ఎం కార్డులను ఈ విధంగా చేసేందుకు వీ లుండదు. ఎందుకంటే ప్రతి లావాదేవీకి ఒక వ ర్చువల్ కీ జనరేట్ కావడం వల్ల క్లోనింగ్ చేసేం దుకు ఆస్కారం ఉండదు. కొత్త కార్డులు జారీ మాగ్నటిక్ స్ట్రిఫ్ గల పాత ఏటీఎం కార్డులున్న ఖాతాదారులకు ఆయా బ్యాంకులు వాటి స్థానం లో చిప్ ఉన్న నూతన ఏటీఎం కార్డులను జారీచేస్తున్నాయి. దీనికి ఎలాంటి దరాఖాస్తులు అవస రం లేదని, ఆటోమెటిక్గా కార్డులు పోసు ్టద్వారా ఖాతాదారులకు అందిస్తున్నట్లు అధికారులు పే ర్కొన్నారు. అడ్రస్లలో తప్పులు, ఇతర కారణాల వల్ల కొత్త కార్డులు అందనివారు బ్యాంకు అధికారులను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. కార్డులు జారీ చేస్తున్నాం పాత మాగ్నటిక్ కార్డులు కలిగిన ఖాతాదారులకు వాటిస్థానంలో కొత్తగా చిప్ కలిగిన ఏటీఎం కార్డులు అందుతాయి. ఖాతాదారుల చిరునామాల్లో తప్పులు, తదితర కారణాలతో కార్డులు అందనివారు బ్యాంక్ అధికారులను సంప్రదించాలి. – నర్సయ్య, మేనేజర్, ఎస్బీఐ, లింగాపూర్ -
క్యూఆర్ కార్డులంటే ఏమిటి ?
గ్రామీణ ప్రాంత ప్రజలకి కూడా ఇంటి ముంగిట్లో బ్యాంకింగ్ సేవలను అందించే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన తపాలా బ్యాంకులు (ఐపీపీబీ) పనితీరుని సులభం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూనే సులభతరంగా అన్ని పనులు పూర్తి అయ్యే చర్యలు చేపడుతున్నాయి. ఇందులో బాగంగానే తపాలా బ్యాంకు ఖాతాదారులకు ఏటీఎం, డెబిట్ కార్డులకి బదులుగా క్యూఆర్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాయి. అసలు క్యూఆర్ కార్డులంటే ఏమిటి ? అవెలా పని చేస్తాయి ? క్యూఆర్ కార్డులంటే ... క్విక్ రెస్సాన్స్కు సంక్షిప్త నామమే క్యూఆర్.. ఈ కార్డులకి సాధారణ ఏటీఎంల మాదిరిగా పిన్ నెంబర్లు, పాస్వర్డ్లు ఉండవు. బయోమెట్రిక్ నిర్ధారణ ద్వారా ఈ కార్డులు పనిచేస్తాయి. తపాలా బ్యాంకులు మంజూరు చేసిన ఈ కార్డుల్లో క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ ప్రింట్ చేసి ఉంటుంది. ఈ కోడ్ ద్వారా ఐపీపీబీ ఖాతాదారుల్ని గుర్తించవచ్చు. స్మార్ట్ఫోన్లు, మైక్రో ఏటీఎం, పోస్ట్మ్యాన్లు ఇంటికి తీసుకువచ్చే పరికరాల ద్వారా కూడా క్యూఆర్ కోడ్ని వినియోగించి ఖాతాదారుల్ని గుర్తించవచ్చు. క్యూఆర్ కోడ్ ద్వారా ఒకసారి ఖాతాదారుడిని గుర్తించే పని పూర్తవగానే బయోమెట్రిక్ డేటా ద్వారా పోస్టుమ్యాన్లు మిగిలిన తనిఖీ పూర్తి చేస్తారు. రెండు అంచెల తనిఖీ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఈ క్యూఆర్ కార్డుల్ని వినియోగించుకోవచ్చు. బయోమెట్రిక్ విధానం ద్వారా తనిఖీ పూర్తయితే ఖాతాదారులు తమ లావాదేవీలను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. వినియోగం సులభం.. క్యూఆర్ కార్డులని వినియోగించుకోవడం అత్యంత సులభం మీ అకౌంట్ నెంబర్ తెలీకపోయినా ఈ కార్డుని వాడుకునే సౌలభ్యం ఉంది. ఈ కార్డుల్ని దేశవ్యాప్తంగా ఉన్న తపాలా బ్యాంకు కేంద్రాల్లోనూ, ఇతర వాణిజ్య కేంద్రాల్లోనూ వాడుకోవచ్చు. ఐపీపీబీ మొబైల్ యాప్స్ద్వారా కూడా వీటిని వినియోగించుకోవచ్చు. అంతేకాదు వీటిని వాడడానికి ఏమంత ఖరీదైన మౌలిక సదుపాయాలు ఉండాల్సిన పనిలేదు. చిన్న చిన్న దుకాణాల్లో కూడా ఈ క్యూఆర్ కార్డులు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్, టెలిఫోన్ బిల్లులు కూడా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి చెల్లించుకోవచ్చు. ఆన్లైన్ బిల్లు చెల్లింపులకి రూ.15, నగదు డిపాజిట్, ఉపసంహరణ వంటి లావాదేవీలు ప్రతీ ఒక్కదానికి రూ.25 చార్జీలు వసూలు చేస్తారు. భద్రత ఎక్కువ ఏటీఎం కార్డు ఉండి, పిన్ నెంబర్ తెలిస్తే ఒకరి కార్డుని మరొకరైనా వినియోగించుకోవచ్చు. కానీ క్యూఆర్ కార్డు విషయానికి వచ్చేసరికి అలా కుదరదు. బయోమెట్రిక్ తనిఖీ ఉంటుంది కాబట్టి భద్రత ఎక్కువ. మీ పిన్ నెంబర్ని ఎవరైనా గుర్తిస్తారేమో, పాస్వర్డ్ ఎవరికైనా తెలిసిపోతుందేమోనన్న ఆందోళన అక్కర్లేదు. కార్డు పోగొట్టుకున్నా మీ నగదుకు భద్రత ఉంటుంది. -
భర్తకు డెబిట్ కార్టు ఇస్తున్నారా? ఇది చదవండి..
బెంగళూరు : ఎవరి డెబిట్ కార్డులు వారు మాత్రమే వినియోగించాలన్న నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధనను చాలా మంది పట్టించుకోవడం లేదు. కర్ణాటకలోని వినియోగదారుల ఫోరమ్ తీర్పు చూశాక మీ డెబిట్ కార్డు ఇతరులకు ఇవ్వాలంటే కచ్చితంగా ఆలోచిస్తారు. ఓ కేసుపై దీర్ఘకాల విచారణ చేపట్టిన ఫోరమ్ భార్య డెబిట్ కార్డు వినియోగించే హక్కు భర్తకు కూడా లేదని తేల్చిచెప్పింది. వివరాల్లోకి వెళ్లే మరతహళ్లికి చెందిన వందన... 2013 నవంబర్ 14వ తేదీన, తన ఎస్బీఐ డెబిట్ కార్డు భర్త రాజేశ్కు ఇచ్చి 25,000 డ్రా చేసుకు రమ్మన్నారు. దీంతో రాజేశ్ ఏటీఎంకు వెళ్లాడు. అక్కడ డబ్బులు రాకపోగా.. అకౌంట్లో నుంచి డబ్బులు మాత్రం కట్ అయ్యాయి. వెంటనే ఆ దంపతులు ఎస్బీఐ ఫిర్యాదు చేసినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో ఆమె అక్టోబర్లో జిల్లా వినియోగదారుల ఫోరమ్ను సంప్రదించారు. ఫోరమ్ ఆదేశాలతో మళ్లీ ఆమె అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ఎస్బీఐ సీసీటీవీ పరిశీలించి అందులో ఆమె భర్త డెబిట్ కార్డును వాడినట్టు తేలడంతో ఈ కేసును మూసివేస్తున్నట్టు తెలిపింది. బ్యాకింగ్ చట్టాల ప్రకారం ఎవరి డెబిట్ కార్డును వారే వినియోగించాలని పేర్కొంది. ఈ కేసులో ఇతరులకు పిన్ షేర్ చేయడాన్ని సాకుగా చూపింది ఎస్బీఐ. మూడున్నరేళ్లపాటు కొనసాగిన ఈ కేసులో వినియోగదారుల ఫోరం మే 29న కేసును తోసిపుచ్చుతూ తుది తీర్పు వెలువరించింది. తీర్పులో వందన తన ఏటీఎం పిన్ నంబర్ తన భర్తకు చెప్పి ఉండాల్సింది కాదని పేర్కొంది. తనకు అంతగా కావాలంటే చెక్ ద్వారానో మరేదైనా మార్గంలో డబ్బులు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడింది. -
ఏటీఎంలలో జరభద్రం!
సాక్షి, సిటీబ్యూరో: ‘డబ్బులు డ్రా చేసుకునేందుకు నగరంలోని ఏటీఎం కేంద్రాలకు వెళుతున్నారా...యథాలాపంగా ఏటీఎం యంత్రంలో కార్డు పెట్టి కీబోర్డు మీద పాస్వర్డ్ కొట్టి చకచకా డబ్బులు తీసుకొని వెళ్లిపోదామని అనుకుంటే మీ ఖాతాల్లోని డబ్బులకు గ్యారంటీ ఉండకపోవచ్చు. నగరంలోని ఏటీఎం కేంద్రాల్లో డేటా కార్డ్ రీడర్ అమర్చి ఉన్న స్కిమ్మర్ కార్డును బిగించి ఏటీఎం కార్డు వివరాలన్నీ సేకరించడంతో పాటు అక్కడే బిగించిన రహస్య సీసీటీవీ కెమెరా ద్వారా పిన్ నంబర్ తెలుసుకొని ముంబైలో క్లోనింగ్ చేసి భారీ మొత్తంలో అక్కడి ఏటీఎంల నుంచి డబ్బులను కాజేస్తున్న ఇద్దరు రుమేనియా దేశస్తులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ నగదును తమ దేశ కరెన్సీలోకి మార్చుకునేందుకు నగరానికి వచ్చిన ప్రధాన నిందితులు వసిలె గాబ్రియల్ రజ్వాన్, బురిసియా అలెగ్జాండ్రు మిహయ్లను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరి నుంచి రూ.35 లక్షల నగదుతో పాటు 196 స్కిమ్మర్ కార్డులు, ఆరు కెమెరా ప్యానెల్స్, ఒక ఎంఎస్ఆర్ మెషిన్, ఆరు ఏటీఎం కార్డు స్కిమ్మర్లు, రెండు పాస్పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 4న తన బ్యాంక్ ఖాతా నుంచి ముంబై, గోరేగావ్లోని ఓ ఏటీఎం సెంటర్ నుంచి లక్ష రూపాయలు డ్రా అయ్యాయని మెసేజ్ వచ్చిందంటూ కూకట్పల్లివాసి అనిల్ భార్గవ ఫిర్యాదుతో ఈ భారీ క్లోనింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం మీడియాకు తెలిపారు. మెకానిక్ నుంచి చోరీలవైపు... రొమానియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వసిలె గాబ్రియల్ రజ్వాన్ అక్కడే కారు మెకానిక్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని స్నేహితుడైన బురిసియా అలెగ్జాండ్రు మిహయ్ హోటల్లో పనిచేస్తుండేవాడు. అయితే వీరి అవసరాలకు తగ్గట్టుగా డబ్బులు సంపాదించకపోవడంతో నేరాలబాట పట్టారు. వీరికి రజ్వాన్ స్నేహితులైన టికూ బొగ్దాన్ కాస్టినెల్, పుయికా ఇగ్ను మరియన్లు కూడా తోడయ్యారు. ఇలా యూకే, యూరోపియన్లలోనూ ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేసి వివిధ బ్యాంక్ ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకునేవారు. అక్కడ నిఘా పెరగడంతో వీరి చూపు భారతదేశంలోని హైదరాబాద్, ముంబై, ఢిల్లీపై పడింది. ఇలా వీరు బిజినెస్, టూరిస్ట్ వీసాలపై గతేడాది డిసెంబర్లో హైదరాబాద్కు వచ్చారు. నగరంలోని హోటల్స్లో ఉండి సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలను గుర్తించారు. అదే నెలలోనే ఢిల్లీకి విమానంలో వెళ్లి అక్కడ ఏటీఎంలో ఈ ఏడాది జనవరిలో స్కిమ్మర్లను అమర్చి సేకరించిన డేటా కార్డు వివరాలతో రూ.9 లక్షల 50 వేలు డ్రా చేశారు. అదే నెలలోనే వెస్టర్న్ యూనియన్ అవుట్లెట్లో డబ్బులను రొమానియా కరెన్సీలోకి మార్చుకున్నారు. ఆ తర్వాత గాబ్రియల్ సూచనల మేరకు అతని స్నేహితులైన టికూ బొగ్దాన్ కాస్టినెల్, పుయికా ఇగ్ను మరియన్లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో హైదరాబాద్కు వచ్చి నగరంలోని కూకట్పల్లి, జగద్గిరిగుట్ట, విజయ్నగర్కాలనీ, జూబ్లీహిల్స్లోని నాలుగు ఏటీఎం సెంటర్లలో ఏటీఎం కార్డులు ఇన్సర్ట్ (కార్డును పెట్టే ప్రాంతం) చేసే దగ్గర అనుమానం రాకుండా చిప్తో కూడిన స్కిమ్మర్లను అమర్చారు. మెషీన్ కీ బోర్డుకుపైన రహస్య కెమెరాలను ఏర్పాటుచేశారు. ఈ స్కిమ్మర్ ద్వారా కార్డు పెట్టగానే ఖాతాదారుడి వివరాలను తీసుకొని చిప్లో భద్రపరుస్తుంది. రహస్య కెమెరా కీబోర్డు మీద నమోదయ్యే పిన్ నంబర్ల వివరాలను రికార్డు చేసుకుంటుంది. మరుసటిరోజూ వచ్చి ఈ స్కీమర్, సీసీకెమెరాలను తీసుకెళ్లారు. వాటిలో వచ్చిన డేటా, దృశ్యాలతో మరో కార్డులోకి గాబ్రియల్ టెక్నికల్ టూల్స్తో క్లోనింగ్ చేసి యాంటీ గిఫ్ట్కార్డు(ఏటీఎం డూప్లికేట్) వెనకాల పిన్ నంబర్ రాసుకునేవాడు. ఆ తర్వాత డ్రా చేసేవాడు. ఇలా కూకట్పల్లికి చెందిన అనిల్ భార్గవ బ్యాంక్ ఖాతా నుంచి లక్ష రూపాయలు ముంబైలోని గోరేగావ్లోని ఓ బ్యాంక్ నుంచి డ్రా అయినట్టుగా సెల్కు ఎస్ఎంఎస్ వచ్చింది. వెంటనే సంబంధించి బ్యాంక్ కాల్సెంటర్కు కాల్ చేయగా మీ బ్యాంక్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారంటూ సమాధానం చెప్పడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్ డేటా సహకారంతో ముంబైలోని నాలుగు ఏటీఎం కేంద్రాల నుంచి డబ్బు విత్డ్రా అవుతున్నట్టు గుర్తించారు. మార్చుకుందామని వచ్చిదొరికిపోయారు... అయితే అప్పటికే ఆయా ఏటీఎంల నుంచి దాదాపు రూ.35 లక్షలు డ్రా చేసిన గాబ్రియల్, అలెగ్జాండ్రులు అక్కడ డబ్బు తమ కరెన్సీలోకి మార్చడం అంత సేఫ్ కాదని భావించి హైదరాబాద్లోని కరెన్సీ మార్పిడి కేంద్రానికి చేరుకునే సమయంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. వీరు సైబరాబాద్లోని కూకట్పల్లి ఐసీఐసీఐ బ్యాంక్, జగద్గిరిగుట్టలోని కెనరా బ్యాంక్లతో పాటు హైదరాబాద్లోని మరో రెండు ఏటీఎం కేంద్రాల్లో స్కిమ్మర్లు అమర్చినట్టుగా విచారణలో ఒప్పుకున్నారు. అయితే గాబ్రియల్ స్నేహితులైన టికూ, పుయికాలు ఫిబ్రవరి, మార్చి నెలల్లో హైదరాబాద్లో ఈ పనిచేశారని చెప్పారు. ఏటీఎం కేంద్రాల్లో టికూ స్కిమ్మర్ అమర్చితే, పుయికా మరుసటిరోజు తొలగించేవాడని విచారణలో వెల్లడించారు. వారి పని పూర్తవడంతో రుమేనియా వెళ్లిపోయారని పోలీసులకు తెలిపారు. ఆయా ఏటీఎం కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజీల్లో టికూ, పుయికాల ముఖాలు కనబడతాయనే ధైర్యంతో హైదరాబాద్కు వచ్చామని, ఇలా దొరికిపోతామని ఊహించలేదని పోలీసుల విచారణలో అన్నట్టు తెలిసింది. అయితే వీరు ఇప్పటివరకు 2040 కార్డులను క్లోనింగ్ చేసి 560 కార్డుల నుంచి డబ్బులు డ్రా చేశారని సజ్జనార్ వివరించారు. ఆలీబాబా ఆన్లైన్ వెబ్సైట్ నుంచి తెప్పించిన స్కిమ్మింగ్ కార్డులు, మాగ్నటిక్ రీడర్లు కొనుగోలు చేశాడని తెలిపారు. ఈ నిందితులను పట్టుకున్న డీసీపీ క్రైమ్స్ జానకి షర్మిలా, ఏసీపీ వై.శ్రీనివాస్కుమార్లను అభినందించారు. వచ్చే వారంలో బ్యాంకర్లతో సమావేశం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో సుమారు ఐదువేలకుపైగా ఏటీఎం కేంద్రాలున్నాయి. వీటిలో చాలావరకు సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలు ఉన్నట్టుగా పోలీసులకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలోనూ భద్రత సిబ్బందిని నియమించుకోవాలని పోలీసులు గట్టిగా హెచ్చరించినా పెద్దగా పట్టించుకోలేదు. ఏటీఎంలలో సీసీటీవీ కెమెరాలున్నా పర్యవేక్షణ కొరవడింది. ఈ నేపథ్యంలో డెబిట్ కార్డు క్లోనింగ్ మోసాలు జరగడంతో వచ్చే వారంలో అన్ని బ్యాంక్ల మేనేజర్లతో సమావేశం నిర్వహించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ నిర్ణయించారు. ఖాతాదారుల భద్రతే లక్ష్యంగా ఉండాలని సూచించడంతో పాటు మోసాలకు చెక్పెట్టేలా అవగాహన కలిగించాలని నిర్ణయించారు. -
ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని..
కొలిమిగుండ్ల: బెలుం గ్రామానికి చెందిన బాచం వెంకటశివారెడ్డి సైబర్ నేరస్తుల చేతిలో మోసపోయాడు. ఇతను ఈనెల 19న కొలిమిగుండ్ల స్టేట్ బ్యాంక్లో డీడీ తీసేందుకువచ్చాడు. ఈక్రమంలో స్టేట్ బ్యాంక్ మేనేజర్ను మాట్లాడుతున్నానని శివారెడ్డి సెల్కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని, ఆధార్ అనుసంధానం చేయించుకోవాలని సూచించాడు. కార్డు బాగానే ఉందని చెప్పినా వరుసగా ఫోన్ చేస్తూ వచ్చాడు. చివరకు బెలుంకు వెళ్లాక మరోసారి ఫోన్ వచ్చింది. దీంతో నిజమే అనుకొని ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెలు, ఆతర్వాత ఓటీపీ నంబర్ కూడా చెప్పాడు. దీంతో శివారెడ్డి అకౌంట్ నుంచి రెండు విడతల్లో రూ.15,500 డ్రా అయింది. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు శుక్రవారం బ్యాంకు అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
మిత్రద్రోహం
పెద్దవడుగూరు: కలిసి మెలిసి తిరిగే యువకుడే తన స్నేహితుడి వద్ద ఏటీఎం కార్డు తస్కరించి రూ.40వేల నగదు డ్రా చేసిన ఘటన బుధవారం వెలుగు చూసింది. మండల కేంద్రం పెద్దవడుగూరుకు చెందిన సాయిచంద్, కాయల నారాయణస్వామి అనే యువకులు స్నేహితులు. సాయిచంద్ మంగళవారం తన తల్లి జయమ్మకు చెందిన ఏటీఎం కార్డు తీసుకుని రూ.1000 నగదు కోసం ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. ఆ సమయంలో స్నేహితుడు కూడా వెంట ఉన్నాడు. అనంతరం ఇద్దరూ బయటకు వెళ్లి మద్యం తాగారు. మత్తులో పడి ఉన్న సాయిచంద్ జేబులోంచి ఏటీఎం కార్డును తస్కరించి.. గుర్తు పెట్టుకున్న పిన్ నంబర్ ద్వారా రూ.40వేలు డ్రా చేసేశాడు. ఆ తర్వాత తనకేమీ తెలియనట్టు కార్డు తీసుకొచ్చి స్నేహితుడి జేబులో పెట్టేశాడు. బుధవారం జయమ్మ డబ్బు డ్రా చేయడానికని కుమారుడితో కలిసి ఆంధ్రాబ్యాంకుకు వెళ్లింది. అయితే ఖాతాలో డబ్బు లేదని బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఖాతాలోని డబ్బు ఎక్కడికెళ్లిందని ఆరా తీయగా.. ఏటీఎం ద్వారా రూ.40వేలు డ్రా చేసినట్లు చెప్పడంతో అవాక్కయ్యింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రమణారెడ్డి అనుమానితుడిగా భావిస్తున్న కాయల నారాయణస్వామిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే డబ్బు డ్రా చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతని వద్ద నుంచి ఆ డబ్బును తిరిగి బాధితురాలికి ఇప్పించారు. -
ఆర్టీసీ డ్రైవర్ల నిజాయితీ
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణం): సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు డబ్బులు... వస్తువులు ఏమైనా దొరికితే మెల్లగా జేబులో పడేసేవారు కొందరు. దొరికిన సొమ్ము పోలీసులకు అందజేస్తే నొక్కేస్తారేమోనన్న భయంతో వారికి అందజేయకుండా ఉండిపోయిన వారు మరికొందరు. దొరికిన సొమ్ము/వస్తువులు పోగొట్టుకున్న వ్యక్తులకు అందజేయాలన్న తపన ఇంకొందరిది. ఈ కోవకే చెందుతారు విజయవాడ గవర్నర్పేట్ ఆర్టీసీ డిపో డ్రైవర్లు. డబ్బులు, బ్యాంకు ఏటీఎం కార్డులు పోగొట్టుకున్న ఆర్టీసీ ప్రయాణికుడికి అందజేసి వారి నిజాయితీ నిరూపించుకోవడమే గాక ఆర్టీసీకి పేరు తెచ్చిపెట్టారు. వివరాల్లోకి వెళ్తే... విశాఖపట్నం కోటపాడు మండలం కె.గుల్లేపల్లికి చెందిన షేక్ రసూల్ ఈ నెల 2న సాయంత్రం విశాఖ వచ్చేందుకు విజయవాడ – విశాఖపట్నం బస్సు (సర్వీస్ నంబరు 95449, ఏపీ16జెడ్0227))లో ప్రయాణం చేశారు. సీటు నంబరు 30లో కూర్చున్నారు. విశాఖపట్నం ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఆ ప్రయాణికుడు బస్సు దిగిపోయారు. ఆతృతగా దిగిన ఆ వ్యక్తి తను కూర్చున్న సీటులో మనీపర్స్, ఏటీఎం కార్డులు మరచిపోయారు. విశాఖపట్నం ద్వారకా బస్సు స్టేషన్కు ఆ బస్సు చేరింది. బస్సు దిగినప్పుడు డ్రైవర్లు ఎం.వి.కాసులు(ఎంప్లాయి నంబరు 370550), ఎం.దానయ్య (ఎంప్లాయి నంబరు 371520) బస్సును పరిశీలించారు. సీటు నంబరు 30లో ప్రయాణికుడు మరచిపోయిన మనీపర్సును గుర్తించారు. ఆ మనీపర్సులో రూ.8,500 నగదు, ఏటీఎం కార్డులు, పాన్కార్డు, ఆధార్కార్డు ఉన్నాయి. వాటిని ఆ డ్రైవర్లు ఇద్దరూ భద్రపరచి మనీపర్సు పోగొట్టుకున్న రసూల్కు ఫోన్చేసి ద్వారకా బస్టేషన్కు పిలిపించి వాటిని స్టేషన్ మేనేజర్ ద్వారా మంగళవారం అందజేసి నిజాయితీ చాటుకున్నారు. డ్రైవర్ల నిజాయితీని ఇటు ప్రయాణికుడు, అటు ఆర్టీసీ మేనేజర్ అభినందించారు. -
ఏటీఎం కార్డు మారి.. రూ.57వేలు గల్లంతు!
చిలమత్తూరు (హిందూపురం) : ఒకరికి రావాల్సిన ఏటీఎం మరొకరికి వెళ్లింది. సదరు ఖాతాదారు ఏటీఎం కార్డుతో రూ.57వేలు డ్రాచేసేశారు. తమ ప్రమేయం లేకుండా నగదు గల్లంతవడంపై బాధితులు కంగుతిన్నారు. వివరాల్లోకెళితే.. చిలమత్తూరులోని బీసీ కాలనీకి చెందిన బి.ప్రభావతమ్మకు సిండికేట్ బ్యాంకులో ఖాతా (నంబర్ 31312250037750) ఉంది. ఇందులో రూ.57,700 నగదు ఉంది. వీరికి ఏటీఎం కార్డు ఇంకా రాలేదు. డబ్బు అవసరం కావడంతో భర్త రామాంజనేయులుతో కలిసి ఆమె సోమవారం బ్యాంకుకు వెళ్లారు. ఖాతాలో రూ.50 మాత్రమే ఉందని క్యాషియర్ చెప్పడంతో వారికి గుండె ఆగినంత పనైంది. వెంటనే బ్యాంకు మేనేజర్ శ్రీనాథ్ను కలిశారు. ఆయన స్టేట్మెంట్ తీసి చూడగా.. ఏటీఎం కార్డు ద్వారా రూ.57వేలు డ్రా చేసినట్లు గుర్తించారు. అసలు తమకు ఏటీఎం కార్డే లేదు.. అలాంటపుడు ఎవరు, ఎలా డ్రా చేసి ఉంటారంటూ బాధితురాలు ప్రశ్నించింది. దీంతో అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులతో కలిసి బీసీ కాలనీకి వెళ్లి ఆరా తీశారు. ఇదే కాలనీలో మొరంపల్లి గ్రామం నుంచి వచ్చి నివాసముంటున్న ప్రభావతమ్మ, రామాంజి అనే పేర్లు కలిగిన దంపతులు ఉన్నారని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. వారికి వీరి ఏటీఎం కార్డు వెళ్లడంతో పొరబాటు జరిగి ఉంటుందని భావించారు. సదరు మహిళతో మాట్లాడగా.. ఏటీఎం కార్డు తన కుమారుడి వద్ద ఉందని తెలిపింది. పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేస్తామని బాధితురాలికి మేనేజర్ హామీ ఇచ్చారు. -
డబ్బు డ్రా చేశారు.. దొరికిపోయారు
కరీంనగర్ టౌన్: నిండా పాతికేళ్లు లేని ముగ్గురు దొంగలు పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేశారు. దొంగతనాల్లో ఆ ముగ్గురు యువకులు రాటుదేలిపోయారు. కరీంనగర్లోని పలుప్రాంతాల్లో ఇప్పటికే 17 చోట్ల చోరీలకు పాల్పడ్డారు. యధావిధిగా ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లి ఏమీ లేకపోవడంతో ఏటీఎం కార్డు దోచుకెళ్లారు. చోరీ చేసిన ఏటీఎం కార్డునుపయోగించి డబ్బు డ్రా చేయడంతో పోలీసులకు దొరికిపోయారు. వివరాలు..కరీంనగర్ పట్టణంలోని రాంనగర్ ప్రాంతానికి చెందిన ఇస్లావత్ శ్రీకాంత్(22), లోకిని శ్రీకాంత్(20) లు మరో మిత్రుడితో కలిసి, తమ జల్సాలు తీర్చుకోవడానికి పట్టణంలో చోరీలు చేసేవారు. ఇలా దొంగతనాలకు అలవాటు పడ్డ మిత్రులు ముగ్గురూ తమ అలవాటులో భాగంగా శ్రీనగర్ కాలనీలోని ఓ తాళం వేసి ఇంట్లో దొంగతనానికి వెళ్లారు. అక్కడ ఇంటిలో ఏమీ లభించకపోవడంతో ఏటీఎం కార్డు దొంగిలించి పక్కనే ఉన్న యాక్సిస్ బ్యాంక్లో డబ్బు డ్రా చేశారు. ఏటీఎం కార్డు ఎవరో దొంగిలించి డబ్బులు డ్రా చేశారని బాధితులు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. డబ్బులు డ్రా చేసిన ఏటీఎం సెంటర్ వద్ద నున్న సీసీ కెమెరా పుటేజీ ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 8లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆన్లైన్ మోసం
బొబ్బిలి రూరల్ : బ్యాంకు హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం.... మీ ఏటీఎం కార్డు 16 అంకెల నంబర్, పిన్ నంబర్ తెలియజేయండంటూ ఓ వ్యక్తి నుంచి వివరాలు తీసుకుని ఏటీఎం నుంచి మూడు లావాదేవీలతో రూ.49,997లు డ్రా చేసిన వైనమిది. బాధితుడు శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో ఎం.బూర్జవలస పంచాయతీ గున్నతోటవలసకు చెందిన పప్పల శ్రీనివాసరావు గ్రోత్ సెంటర్లో కార్మికుడిగా పని చేçస్తున్నాడు. అతని ఖాతాలో కొంత మొత్తం ఉండగా, ఈ నెల 28న శ్రీనివాసరావుకు 8877425622 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ‘మేం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ ఏటీఎం బ్లాక్ అయ్యింది... మీ ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెలు తెలియజేసి, పిన్ నంబర్ తెలియజేయండి‘ అని ఫోన్ చేశారు. దీన్ని నమ్మిన శ్రీనివాసరావు తానుబయట ఉన్నాను. నా ఏటీఎం కార్డు ఇంట్లో ఉంది. వివరాలు తెలియజేస్తాను పావు గంట పోయాక చేయండి అని ఫోన్ పెట్టేయగా పావు గంట పోయాక తిరిగి ఆ వ్యక్తి అదే నంబర్తో ఫోన్ చేయగా వివరాలు తెలియజేయగా పది నిమిషాలలో వరుసగా ఒకసారి రూ.19,999, మరోసారి రూ.9,999, తిరిగి రూ.19,999లు మొత్తంగా రూ.49,997లు డ్రా చేశాడు. ఎప్పుడు డ్రా చేసినా తన సెల్కు మెసేజ్ వచ్చేదని, కానీ తనకు మెసేజ్ రాలేదని బాధితుడు శ్రీనివాసరావు వాపోయాడు. గురువారం డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నిస్తే ఖాతాలో డబ్బులు లేవని తెలియజేయడంతో గ్రోత్ సెంటర్ ఎస్బీఐ బ్రాంచ్కి వచ్చి వివరాలు తీసుకుంటే మోసపోయిన సంగతి తెలిసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. బ్రాంచ్ మేనేజర్ సుధీర్ను కలిసి విషయం తెలియజేస్తే తామేమీ చేయలేమని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. చేసేదేంలేక శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఏటీఎం సెంటర్లో ఏ‘మార్చి’ టోకరా
తగరపువలస (భీమిలి) : పనిచేయని ఏటీఎం కార్డును బాధితుని చేతిలో పెట్టి అసలైన కార్డు ద్వారా రూ.65వేలు కాజేసిన సంఘటన సోమవారం తగరపువలసలో జరిగింది. మహరాజుపేటకు చెందిన మద్దిల అప్పలరాజు తగరపువలస ఎస్బీహెచ్ను ఆనుకుని ఉన్న ఏటీఎం సెంటర్లో కార్డు ద్వారా డబ్బులు విత్డ్రా చేయడానికి వచ్చాడు. ఎంత సేపటికి ప్రయత్నించినా డబ్బులు రాకపోవడంతో క్యూలో ఉన్నవారు పక్కకు తప్పుకోవాలని కోరారు. దీంతో బాధితుని వెనక ఉన్న అగంతకుడు ఆ కార్డును తీసుకుని దాని ద్వారా రూ.15వేలు విత్డ్రా చేసి అప్పలరాజుకు ఇచ్చాడు. తరువాత మరో ప్రయత్నం చేయగా ఏటీఎం పనిచేయలేదని చెప్పి బాధితునికి కార్డు ఇవ్వగా.. ఇంటికి వెళ్లిపోయాడు. ఇంట్లో ఉండగా మరో రూ.65వేలు తన ఖాతా నుంచి విత్డ్రా అయినట్టు సెల్ఫోన్కు మెసేజ్ వచ్చింది. దీంతో తన వద్ద ఉన్న కార్డు చూసుకోవడంతో ఏటీఎం సెంటర్ వద్ద అగంతకుడు తన కార్డును మార్చి ఇచ్చినట్టు గ్రహించాడు. వెంటనే బాధితుడు భీమిలి పోలీసులు, బ్యాంకు సిబ్బందిని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు నగరంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి అప్పలరాజు వెళ్లాడు. -
కార్డు రెన్యువల్ అంటూ డబ్బు లాగేశారు.
మామిడికుదురు(తూర్పుగోదావరి): ఏటీఎం సమాచారం ఎవ్వరు అడిగినా చెప్పొద్దంటూ ఎంతగా మొత్తుకుంటున్నా పెడచెవిన పెట్టి మోస పోతున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కోవకు చెందినదే తాజా సంఘటన . ఖాతాదారుడికి మాయ మాటలు చెప్పి అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.1, 99, 600 లక్షలు డ్రా చేశారు. రాజోలు ఎస్సై ఎస్.లక్ష్మణరావు తెలిపిన వివరాలమేరకు మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామానికి చెందిన దాకే విశ్వనాధానికి జగ్గన్నపేట ఎస్బీఐ శాఖలో ఖాతా ఉంది. గత నెల 17వ తేదీన అతని సెల్కు జగ్గన్నపేట ఎస్బీఐ మేనేజర్ పేరుతో అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ ఏటీఎం కార్డు పాడైపోయింది. దాన్ని రెన్యువల్ చేయించుకోవల్సి ఉందని, అందుకు గాను మీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పాలని అపరిచిత వ్యక్తి విశ్వనాధంను అడిగాడు. అతని మాటలు నమ్మిన విశ్వనాధం ఏటీఎం కార్డు నంబర్ చెప్పాడు. తరువాత డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళ్లి చూడగా అతని ఖాతాలో డబ్బులు పోయినట్టు తెలుసుకుని లబోదిబోమన్నాడు. గత నెల 17, 18, 19, 20 తేదీల్లో వరుసగా నాలుగు రోజులు రూ.49,900 వంతున మొత్తం రూ.1,99,600 తన ఖాతా నుంచి ఆగంతకులు డ్రా చేశారని విశ్వనాధం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో దాచుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు చోరీతో పెళ్లి ఆగిపోయిందని వాపోయాడు. విశ్వనాధం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై లక్ష్మణరావు తెలిపారు. -
డబ్బులు డ్రా చేస్తానని చెప్పి.. బురిడీ!
హైదరాబాద్: ఏటీఎంలో డబ్బులు తీసేందుకు సాయం చేస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శాతవాహననగర్కు చెందిన మండ జయశంకర్ ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గతవారం ఓ రోజు రాత్రి 10 గంటల సమయంలో ఎల్బీనగర్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఉన్న ఎస్బీహెచ్ ఏటీఎంలోకి డబ్బులు తీసుకునేందుకు వెళ్లాడు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎంలో నుంచి డబ్బులు తీసేందుకు సహాయ పడతానని చెప్పి ఏటీఎం కార్డు తీసుకుని రూ.20,800లను తన ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు. ఫోన్కు సమాచారం రావడంతో మోసపోయినట్లు గుర్తించిన జయశంకర్ ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ రైతు వద్ద 37ఖాతాలు, 44 ఏటీఎం కార్డులు
గుజరాత్ వ్యాపారి మహేశ్ షా తరహాలోనే అసోంలో ఓ రైతు వ్యవహారం వార్తలకు ఎక్కింది. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) కింద ఏకంగా రూ. 13,860 కోట్లు వెల్లడించి మహేశ్ షా కటకటాలు లెక్కిస్తుండగా.. అసోంకు చెందిన రైతు జింటూ బోరా వద్ద ఏకంగా 37 బ్యాంకు, పోస్టాఫీస్ పాస్బుక్కులు, 44 ఏటీఎం కార్డులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. మజులీ జిల్లాలోని మధుపూర్ గ్రామానికి చెందిన బోరా ఇంటిపై పోలీసులు శనివారం సాయంత్రం దాడులు నిర్వహించగా.. 44 బ్యాంకు, పోస్టాఫీస్ పాస్బుక్కులు, ఏటీఎం కార్డులు దొరికాయి. దీంతోపాటు 34 చెక్కుబుక్కులు, 200 బ్లాంక్ చెక్కులు, రూ. 22,380 నగదు, కొన్ని బ్లాంక్ స్టాంపు పేపర్లు దొరికాయి. తాను పలువురికి అప్పులు ఇచ్చానని, అందుకు తాకట్టుగా బ్యాంకుల పాస్బుక్కులు, ఏటీఎం కార్డులు పెట్టుకున్నట్టు బోరా చెబుతుండగా, బ్యాంకుల్లో నల్లధనాన్నివేసేందుకే వీటిని సేకరించి ఉండొచ్చునని తాము అనుమానిస్తున్నట్టు ముజులి ఎస్పీ వైభవ్చంద్రకాంత్ నింబల్కర్ తెలిపారు. అయితే, ఆయన వద్ద రద్దైన నోట్లు ఏమీ దొరలేదని, ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. -
ఏటీఎం వ్యాల్యువేషన్ చేస్తామని మోసం..
వివరాలన్నీ తెలుసుకొని రూ.97 వేలు డ్రా లబోదిబోమంటున్న బాధితుడు మేడ్చల్రూరల్ : ఏటిఎం కార్డు వ్యాల్యువేషన్ గడువు ముగిసిందని ఫోన్లో వివరాలు తెలుసుకుని ఓ వ్యక్తిని మోసగించారు. అతడి ఖాతా నుంచి భారీగా నగదు డ్రా చేసుకున్న సంఘటన మేడ్చల్లో శనివారం చోటు చేసుకుంది. మేడ్చల్లోని సూర్యనగర్కాలనీవాసి శ్రీనివాస్ మునిరాబాద్ గ్రామంలో సాస్ తయారీ కంపెనీ నిర్వహిస్తున్నాడు. కంపెనీ లావాదేవీల కోసం మేడ్చల్లోని కెనరా బ్యాంక్లో ఖాతా తెరిచి తన లావాదేవీలు కూడా కొనసాగిస్తున్నాడు. కాగా ఈనెల 7వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి అతడికి ఫోన్ చేసి మీ ఏటీఎం కార్డు వ్యాల్యువేషన్ గడువు ముగిసిందని కార్డు వెనుక ఉన్న నంబర్ను తెలపాలని చెప్పారు. వివరాలు తెలిపే ప్రాసస్ మొదలుపెడతామని నమ్మబలికాడు. దీంతో శ్రీనివాస్ అన్ని వివరాలు తెలిపాడు. అదే రోజునే బీహర్ రాష్ట్రంలో స్నాప్డీల్ కొనుగోలుకు రూ.71,369 ఖాతా నుంచి క్రెడిట్ అయినట్లు శ్రీనివాస్కు మెసేజ్ వచ్చింది. తర్వాత 9వ తేదీన ఊదుసార్లు ఏటీఎం నుంచి రూ.25,970 డ్రా అయ్యాయి. దీంతోతో బాధితుడు 9వ తేదీన బ్యాంక్కు వెళ్లి అధికారులతో మాట్లాడాడు. బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో శ్రీనివాస్ సైబర్ క్రైం పోసులకు ఫిర్యాదు చేశారు. తనను మోసం చేసిన వారిని పట్టుకుని న్యాయం చేయాలని, మరెవ్వరికి తనలా మోసపోకుండా జాగ్రత్త పడాలని బాధితుడు శ్రీనివాస్ తెలిపారు. -
ఏటీఎం కార్డు రెన్యువల్ పేరుతో మోసం
కుక్కునూరు : ఏటీఎం కార్డు రెన్యువల్ చేస్తామని చెప్పి ఖాతాలో డబ్బును దొంగిలించిన ఘటన శనివారం జరిగింది. బాధితుని కథనం ప్రకారం.. కుక్కునూరుకు చెందిన నక్కా కృష్ణ భద్రాచలం ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం సమయంలో అతనికి ఒకరు ఫోన్ చేసి తాము బ్యాంకు నుంచి చేస్తున్నామని, మీ ఏటీఎం కార్డు రెన్యువల్ చేయాలని, ఆ కార్డు ఏ సంవత్సరంలోదో చేప్పాలని హిందీలో అడిగారు. దీంతో కృష్ణ ఆ వివరాలు చెప్పాడు. వెంటనే అతని సెల్కు ఖాతా నుంచి రూ.7,000 డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో అవాక్కయిన కృష్ణ స్థానిక ఆంధ్రా బ్యాంక్ మేనేజర్తో తనకు ఫోన్ చేసిన నంబర్కు మాట్లాడించాడు. అవతల వ్యక్తి ఇంకా ఏమైనా నంబర్లు ఉంటే ఇవ్వాలని మేనేజర్ను కోరాడు. మీ చేతనైంది చేసుకోవాలని సవాల్ విసిరాడు. దీంతో లబోదిబోమనడం కృష్ణ వంతైంది. -
ఏటీఎం కార్డు చాకచక్యంగా మార్చి..
ఏటీఎం కార్డు మార్చిన యువకుడు రూ. 40 వేలు డ్రా చేసుకున్న వైనం మోసం ఆలస్యంగా గ్రహించిన ఖాతాదారుడు అద్దంకి(ప్రకాశం): బ్యాంకు డిపాజిట్ మిషన్లో డబ్బును ఎలా డిపాజిట్ చేయాలో తెలియని ఖాతాదారుకు ఓ కుర్రాడు సహాయం చేశాడు. డిపాజిట్ చేసే సమయంలోనే, ఖాతాదారు కార్డును చాకచక్యంగా మార్చి తన కార్డును వారికిచ్చాడు. ఆ కార్డుతో దర్జాగా అదే బ్యాంకు ఏటీఎం నుంచి రూ. 40 వేల నగదును డ్రా చేసుకుని, అంకుల్ మీ కార్డు మారిందటూ వారి కార్డును వారికిచ్చి, తన కార్డును తీసుకుని ఏమీ ఎరగనట్టు వెళ్లిన కుర్రాడి ఘరానా మోసం పట్టణంలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక నగర పంచాయతీలో కాంట్రాక్టు వర్కర్గా పనిచేస్తున్న వెంకటస్వామి తన వద్ద ఉన్న రూ. 1లక్ష నగదును ఎస్బీఐ ఏటీఎం ప్రక్కనే డిపాజిట్ మిషన్లో జమ చేసేందుకు భార్యతో కలిసి వెళ్లాడు. నగదును ఎలా డిపాజిట్టు చేయాలో తెలియక చూస్తున్న సమయంలో ఓ కుర్రాడు తాను సహాయం చేస్తానన్నాడు. నమ్మిన వెంకట స్వామి దపంతులు తమ వద్ద ఉన్న నగదును, ఏటీఎం కార్డును ఆ కుర్రాడికివ్వగా అతను రూ. 1లక్ష డబ్బును రెండు విడతలుగా రూ. 30 వేల చొప్పున, మరోసారి రూ. 40 వేలను డిపాజిట్టు మిషన్లో జమ చేశాడు. ఇదిగో మీ కార్డు అంటూ ఇచ్చాడు. మరలా కొంతసేపటికి వచ్చి అయ్యా మీ కార్డు నా కార్డు మారిపోయిందంటూ వారి కార్డు వారికిచ్చి అంతకు ముందు వారికిచ్చిన తన కార్డును తీసుకుని వెళ్లిపోయాడు. అనుమానం వచ్చిన ఖాతాదారు బ్యాంకుకు వెళ్లి నగదును సరిచూసుకోగా ఖాతాలో రూ. 40 వేలు లేకపోవడాన్ని తెలుసుకుని లబో దిబోమన్నారు. సీసీ టీవీ పుటేజీల్లో చూడగా తమకు సహాయం చేసిన కుర్రాడు అంతకు ముందు బ్యాంకులో తచ్చాడినట్లు తెలుసుకున్నాడు. ఈ విషయమై నిందితుడ్ని గుర్తించేందుకు తాము పోలీసులను ఆశ్రయించనున్నట్లు బాధితుడు తెలిపారు. -
బ్యాంకు అధికారులమంటూ టోకరా
ఏటీఎం కార్డు నంబర్ తెలుసుకొని రూ.5 వేలు డ్రా సంగెం : ఆంధ్రాబ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని మీ ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెలను చెప్పాలని గుర్తుతెలియని వ్యక్తి కోరగా అతడిని నమ్మి చెప్పడంతో రూ.5 వేలు అతడి ఖాతా నుంచి డ్రా అయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడి కథనం ప్రకారం.. మండలంలోని తీగరాజుపల్లి శివారు సోమ్లాతండాకు చెందిన బానోత్ రాజేందర్కు ఈ నెల 15న సంగెం ఆంధ్రాబ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ 7808602755 నంబర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెలను చెప్పాలని కోరారు. అడిగినట్లుగా ఆ నంబర్లు చెప్పిన రాజేం దర్ సెల్ఫోన్కు తన ఖాతా నుంచి రూ.5 వేలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. బ్యాంకుకు వచ్చి తనఖాతా నుంచి రూ.5 వేలు డ్రా అయిన విషయం బ్యాంకు అధికారులకు చెప్పడంతో తాము చేసేది ఏమి లేదని చేతులెత్తేశారు. దీంతో నెత్తినోరు బాదుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఏమార్చి ఏటీఎం కార్డు కొట్టేశాడు!
జోగిపేట (మెదక్) : పక్క వ్యక్తి నుంచి తెలివిగా ఏటీఎం కార్డును కొట్టేసిన ఓ ఘనుడు అదే కార్డు నుంచి రూ.10వేలు డ్రా చేసుకొని ఉడాయించిన ఘటన ఇది. మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. అల్లాదుర్గం మండలం బిబిజీపూర్ గ్రామానికి చెంది ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ లింగపురం రాములు ఆదివారం జోగిపేటలో బస్టాండ్ వద్ద ఉన్న ఏటీఎంకు వెళ్లాడు. అప్పటికే ఆ ఏటీఎం వద్ద చాంతాడంత లైను ఉంది. ఆ వరుసలో ముందు నిలబడి ఉన్న ఓ అపరిచితుడు.. తనకి ఏటీఎం కార్డు ఇస్తే డబ్బులు డ్రా చేసి ఇస్తానంటూ నమ్మబలికాడు. నిజమేననుకుని అతడి వంతు వచ్చేదాకా అక్కడే ఉండి..అతనితో కలిసి డబ్బు డ్రా చేసేందుకు వెళ్లాడు. రాములు కార్డు ఇవ్వగా ఆ వ్యక్తి ఆ కార్డును తీసుకొని ఏటీఎం మిషన్లో పెట్టి తీసి సీక్రెట్ నంబరు కొట్టమని చెప్పాడు. ఆ నంబరును గుర్తుంచుకున్న అపరిచితుడు తర్వాతి ఆప్షన్లను తప్పుగా నొక్కి ఆ కార్డు పనిచేయడంలేదంటూ తన వద్ద నున్న మరో సీతారాం అనే పేరున్న ఏటీఎం కార్డును రాములు చేతిలో పెట్టి అక్కడి నుంచి నిష్ర్కమించాడు. అయితే, లైన్లోనే ఉన్న రాములు కొద్దిసేపటి తర్వాత ఏటీఎం మిషన్లో కార్డు పెట్టగా వేరొక పేరు కనిపించింది. దీంతో రాములు అపరిచితుడి కోసం అటూఇటూ గాలించాడు. కనిపించకపోవడంతో వెంటనే తన ఏటీఎం కార్డును బ్లాక్ చేయాలంటూ బ్యాంకు సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో అతని సెల్కు రూ.10 వేలు డ్రా చేసినట్లు మెసేజ్ అందింది. సోమవారం ఎస్బీహెచ్ బ్యాంకుకు వెళ్లగా స్థానిక క్లాక్టవర్ ఏటీఎంలో నుంచి రూ.10 వేలు డ్రా అయినట్లు అధికారులు తెలిపారు. బాధితుడు జోగిపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఏటీఎంలలోని సీసీ కెమెరాల పుటీజీలను పరిశీలించి నిందితుడి ఆచూకీ తెలుసుకుంటామని ట్రైనీ ఎస్సై గౌతం తెలిపారు. -
‘గుండె’ను పిండిన దగా!
- కొడుకు గుండె పరీక్షకు దాచుకున్న డబ్బు - ఏటీఎం కార్డు రెన్యువల్ పేరుతో మాయం గట్టు : ఏటీఎం కార్డు రెన్యువల్ అంటూ ఓ ఫోన్ కాల్కు స్పందించిన పాపానికి కొడుకు గుండె ఆపరేషన్ కోసం బ్యాంకులో దాచుకున్న డబ్బు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో శుక్రవారం జరిగింది. గట్టు మండలం చింతలకుంటకు చెందిన వీరన్నకు మాచర్ల ఆంధ్రా బ్యాంకులో ఖాతా ఉంది. వీరన్న పెద్ద కుమారుడు సంతోష్(9) గుండెలో రంధ్రం పడింది. వైద్యానికి రూ.30 వేలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో అతను డబ్బు పోగు చేసి రూ.15,200 ఖాతాలో వేశాడు. హైదరాబాద్కు వెళ్లే క్రమంలో డబ్బులు దగ్గర పెట్టుకుంటే ఎవరైనా దోచుకునే అవకాశం ఉంటుందని భావించి ముందు జాగ్రత్తగా ఖాతాలో వేసి ఏటీఏం కార్డును తీసుకున్నాడు. ఇదే క్రమం లో శుక్రవారం ఉదయం 99340 41804 నంబర్ నుంచి వీరన్న సెల్కు కాల్ వచ్చింది. ఆంధ్రాబ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని, ఏటీఎం కార్డుపై ఉన్న నంబర్లు చెప్పాలని కోరడంతో వాటిని సదరు వ్యక్తికి తెలియజేశాడు. కొంతసేపటి తర్వాత అతని సెల్కు డబ్బులు డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో బిక్కమొహం వేయాల్సి వచ్చింది. వెంటనే మాచర్లలోని ఆంధ్రాబ్యాంక్ అధికారులకు విషయం చెప్పినా ఏమి చేయలేమని చేతులేత్తేసినట్లు బాధితుడు తెలిపాడు. జరిగిన మోసంపై గట్టు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
దృష్టి మళ్లించి.. కార్డు మార్చేసి !!
ఏటీఎం కేటుగాడి అరెస్టు రూ. 77 వేలు, 11 ఏటీఎం కార్డులు స్వాధీనం పంజగుట్ట: ఏటీఎం సెంటర్ వద్ద కాపుకాసి... డబ్బు డ్రా చేసేందుకు వచ్చే వారికి సాయం చేస్తున్నట్టు నటించి.. వారి ఏటీఎం కార్డు మార్చేసి డబ్బు డ్రా చేసుకుపోతున్న ఓ పాతనేరస్తుడిని ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.77 వేల నగదు, 11 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం పంజగుట్ట ఏసీపీ కార్యాలయంలో పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వర్ రావు, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా వెల్ధుర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన డి.సిద్దేశ్ (25) ఇంటర్ వరకు చదివి వ్యవసాయ పనులు చేసేవాడు. గ్రామంలో ఒకసారి ఏటీఎం సెంటర్కు నగదు డ్రా చేసేందుకు వెళ్లాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏటీఎం మిషీన్ ఆపరేటింగ్ రాక తికమకపడుతుంటే సిద్దేశ్ అతనికి సాయం చేశాడు. ఇద్దరి ఏటీఎం కార్డులు ఒకే బ్యాంక్వి కావడంతో డబ్బులు డ్రా చేసే సమయంలో మారిపోయాయి. సిద్దేశ్ అకౌంట్ లో కేవ లం రూ. 3 వేలు ఉండగా... గుర్తుతెలియని వ్యక్తి అకౌం ట్లో రూ. 40 వేలు ఉన్నాయి. ఆ కార్డు పిన్ నెంబర్ తెలియడంతో సిద్దేశ్ ఆ డబ్బు డ్రా చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇదే తరహా మోసాలు మొదలెట్టాడు. ఇదే కేసులో గతంలో కర్నూలులో అరెస్టై జైలుకెళ్లాడు. నగరానికి మకాం మార్చి... జైలు నుంచి బయటకు వచ్చాక తన మకాం నగరానికి మార్చాడు. ఎర్రగడ్డలో స్నేహితుడు లక్షీ్ష్మకాతం ఇంట్లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. కాకినాడకు చెందిన రిటైర్డ్ ప్రిన్సిపల్ నాగేశ్వర్రావు తన కొడుకును కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కోసం నిమ్స్లో చేర్పించాడు. ఫిబ్రవరి 3న నిమ్స్ ఆసుపత్రి వద్ద ఉన్న ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు రెండుసార్లు ప్రయత్నించగా రాలేదు. అప్పటికే అక్కడ కాపుకాసిన సిద్దేశ్ తాను సాయం చేస్తానని కార్డు తీసుకుని, ఏటీఎం పిన్ తెలుసుకున్నాడు. నాగేశ్వర్రావు దృష్టి మరల్చి అతని ఏటీఎం కార్డుకు బదులు అదే బ్యాంక్కు చెందిన మరో కార్డు అతడి చేతిలో పెట్టి.. ‘‘ఈ ఏటీఎంలో నగదు లేదు, వేరే ఏటీఎంకు వెళ్లి డ్రా చేయండి’’ అని చెప్పి వెళ్లిపోయాడు. 15 నిమిషాల తర్వాత నాగేశ్వర్రావు కార్డుతో సోమాజిగూడలోని మరో ఏటీఎం నుంచి రూ.22 వేలు డ్రా చేశాడు. ఆ మరుసటి రోజే సోమాజిగూడలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న నాగలక్ష్మి కార్డును కూడా ఇదే విధంగా మార్చేసి రూ. 30 వేలు డ్రా చేశాడు. ఆన్లైన్లో డిపాజిట్ చేస్తే టాక్స్ పడుతుందని ఫిబ్రవరి 17న ఎస్సార్ నగర్ ఎస్బీఐ ఏటీఎం సెంటర్కు ప్రేమ్నగర్కు చెందిన బి.సూర్యనారాయణ అనే కూలీ రూ. 50 వేలు ఆన్లైన్ క్యాష్ డిపాజిట్ మిషన్ ద్వారా తన స్నేహితుడి అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చాడు. అక్కడే ఉన్న సిద్దేశ్ ‘‘ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేస్తే ట్యాక్స్ పడుతుంది. నీ అకౌంట్లో ఉన్న నగదు పోతుంది. నా అకౌంట్లో నగదు ఉంది. అకౌంట్ టు అకౌంట్ మారిస్తే ట్యాక్స్ పడదు’’ అని నమ్మబలికాడు. దీంతో సూర్యనారాయణ తన వద్ద ఉన్న రూ. 50 వేలు సిద్దేశ్కు ఇచ్చాడు. సిద్దేశ్ తన బ్యాంక్ ఏటీఎం కార్డును మిషీన్లో పెట్టి మినీ స్టేట్మెంట్ తీసి దానిని సూర్యనారాయణకు ఇచ్చి నగదు ట్రాన్స్ఫర్ అయిపోయిందని నమ్మబలికాడు. చదువు రాని సూర్యనారాయణ నిజమే అనుకుని వెళ్లిపోయి.. కొద్దిసేపటి తర్వాత స్నేహితుడికి ఫోన్ చేసి వాకబు చేయగా డబ్బు రాలేదని చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన సూర్యనారాయణ ఎస్సార్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పట్టివేత... దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా నిందితుడ్ని గుర్తించారు. బుధవారం రాజీవ్నగర్ ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సిద్దేశ్ను అదుపులోకి తీసుకొని విచారించగా... ఏటీఎం సెంటర్ల వద్ద మోసాలకు పాల్పడుతున్నట్టు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి 77 వేల నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 11 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సిద్దేశ్పై కర్నూలులో 3, గుత్తిలో 2, పంజగుట్టలో 2, ఎస్సార్ నగర్లో 1 మెత్తం 8 కేసులు ఉన్నాయని, ఇతడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీసీపీ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఎస్సార్ నగర్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, డీఐ షేక్ జిలానీ, ఎస్సై శ్రీనివాస్ నిందితున్ని గుర్తించిన హోంగార్డు తిమ్మారెడ్డి పాల్గొన్నారు. -
'అదృశ్యమైన యువతి ఏటీఎంతో డబ్బు డ్రా..'
ఆస్ట్రేలియా: కనిపించకుండా పోయిన ఓ యువతి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డ్రాచేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. బహుశా ఆ యువతిని డబ్బు డ్రా చేసిన వ్యక్తే చంపేసిందా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన జోడీ మేయర్స్ అనే యువతి ఆగస్టు 26న కనిపించకుండా పోయింది. మరుసటి రోజే ఆ అమ్మాయికి చెందిన బ్యాంక్ ఎస్ఏ ఏటీఎం కార్డు ద్వారా మార్గరెట్ ఆర్చర్ (55) అనే మహిళ డబ్బులు డ్రా చేసింది. అయితే, ఈ కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు గతవారం మేయర్స్ చాలా రోజు నుంచి కనిపించకుండా పోయిన నేపథ్యంలో ఆమె చనిపోయి ఉందని తాము నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. అలా చెప్పిన వారం తర్వాత తాజాగా మార్గరెట్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, మేయర్స్ ఆగస్టు 26న ఇంటి నుంచి బయలు దేరేముందు తన జీవిత భాగస్వామి నెయిల్ అర్చర్తో వెళ్లిందని, ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అతడిని అనుమానితుడిగా చేర్చడం లేదని పోలీసులు తెలిపారు. మున్ముందు దర్యాప్తులో ఏ మార్పు జరుగుతుందో చెప్పలేమని తెలిపారు. కాగా, మార్గరెట్ బెయిల్ తీసుకొని విడుదలైంది. తిరిగి ఈ నెల 30న ఆమె కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. -
బ్యాంకు అధికారినంటూ టోకరా
ఏటీఎం నుంచి రూ.43వేలు డ్రా పోలీసులను ఆశ్రయించిన బాధితుడు సిరిసిల్ల : బ్యాంకు అధికారినంటూ ఫోన్ చేసి ఆధార్ నంబర్ చెప్పాలి.. లేదంటే మీ ఏటీఎం కార్డు పనిచేయదని బెదిరించి రూ.43వేలు డ్రా చేసిన సంఘటన ఎల్లారెడ్డిపేటలో శనివారం జరిగింది. ఎల్లారెడ్డిపేటకు చెందిన రాగుల దేవయ్యకు ఎస్బీహెచ్ సిరిసిల్ల శాఖలో ఖాతా ఉంది. ఆయనకు బ్యాంకు అధికారులు ఏటీఎం ఇచ్చారు. రెండురోజుల క్రితం దేవయ్యకు ఒకరు ఫోన్ చేసి ‘ఎస్బీహెచ్ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం.. నీ బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానం కాలేదు.. నంబర్ చెప్పాలి.. లేదంటే నీ ఏటీఎం కార్డు పనిచేయదు’ అని అన్నాడు. దీంతో ఆందోళన చెందిన దేవయ్య ఆధార్ నంబర్ చెప్పాడు. బ్యాంకు ఏటీఎం కార్డుపై ఉన్న సీరియల్ నంబర్ సైతం చెప్పాలనగా అదికూడా చెప్పేశాడు. మీ సెల్ఫోన్కు మరో మెసేజ్ వస్తుంది.. మళ్లీ ఫోన్ చేస్తానంటూ పెట్టేశాడు. అరగంట తర్వాత మళ్లీ ఫోన్ చేసి నీ ఫోన్కు వచ్చిన మెసేజ్లో ఉన్న నంబర్ చెప్పమనగా బ్యాంకు అధికారే మళ్లీ ఫోన్ చేశాడని భావించి మెసేజ్ నంబర్, ఏటీఎం పిన్ నంబర్ చెప్పాడు. తర్వాత దేవయ్య ఏటీఎం కార్డుతో బ్యాంకు ఖాతాను పరిశీలించగా రూ.43 వేలను డ్రా అయినట్లు ఉంది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా అపరిచిత వ్యక్తిపై అటు బ్యాంకు అధికారులు, ఇటు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇలాంటి మోసాలు జిల్లా వ్యాప్తం గా ఇటీవల పెరిగిపోయాయి. జాగ్రత్తగా ఉండాలని, పిన్ నంబర్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పవద్దని అధికారులు సూచిస్తున్నారు. -
పంచాయతీ ఏఈకి ‘సైబర్’ టోకరా
- ఖాతా నుంచి రూ. 40 వేలు మాయం - కొత్త ఏటీఎం కార్డు ఇస్తామని బురిడీ తాండూరు రూరల్: ఓ సైబర్ నేరగాడు పంచాయతీ ఏఈకి టోకరా వేశాడు. కొత్త ఏటీఎం కార్డు ఇస్తామని ఆయన నుంచి వివరాలు తీసుకొని ఖాతా నుంచి దాదాపు రూ. 40 వేలు మాయం చేశాడు. ఈ సంఘటన తాండూరు మండలంలో అలస్యంగా వెలుగు చూసింది. బాధితుడి కథనం ప్రకారం.. తాండూరు మండల పంచాయతీ ఏఈగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన మహహ్మద్ ఇషాక్ పని చేస్తున్నారు. ఈ నెల 4న ఆయన విధుల్లో ఉండగా 7050009820 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఁనేను శరణ్జిత్శర్మ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ముంబై హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మీ ఏటీఎం కార్డు చెడిపోయింది.. కొత్త కార్డు ఇస్తున్నా ము... కార్డు వివరాలు చెప్పండి అని అన్నా డు. దీంతో తన ఏటీఎం కార్డు నిజంగానే చెడిపోయిందేమోనని భావించిన ఏఈ ఇషాక్ వివరాలు చెప్పాడు. ఇదిలా ఉండగా, ఈ నెల 6న ఇషాక్ డబ్బుల అవసరం రావడంతో తాం డూరు పట్టణంలోని ఏటీఎంకు వెళ్లాడు. తన ఖాతాలో డబ్బులు లేకపోవడంతో స్టేట్ బ్యాం క్ ఆఫ్ హైదరాబాద్ తాండూరు బ్రాంచ్లో ఫిర్యాదు చేశాడు. గుర్తుతెలియని వ్యక్తి ఏఈ ఇషాక్కు తెలియకుండా ఓసారి రూ.31,990, మరోసారి రూ.8,800 డ్రా చేసుకున్నట్లు గుర్తించాడు. దీంతో బాధితుడు లబోదిబోమన్నాడు. -
ఏమార్చి... ఏటీఎం కార్డు మార్చి...
లంగర్హౌస్(హైదరాబాద్): ఏటీఎం కేంద్రంలో దృష్టి మరల్చి ఓ వ్యక్తి ఏటీఎంను కొట్టేశారు.. దానిని వాడుకుని రూ.61 వేలు డ్రా చేసుకున్నారు. ఈ సంఘటన లంగర్హౌస్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ... లంగర్హౌస్ బాగ్దాద్ కాలనీ నివాసి సుభాన్ ప్రై వేట్ ఉద్యోగి. సోమవారం అతడు నానల్నగర్ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. కార్డుతో డబ్బు డ్రా చేయడంలో కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. అదే సమయంలో వరుస క్రమంలో ఉన్నట్లుగా వెనక కొందరు ఉండగా ఇద్దరు వ్యక్తులు అతనికి చెరో వైపు చేరారు. తాము సహకరిస్తామంటూ వారిద్దరూ అతని చేతిలో ఏటీఎం కార్డును యంత్రంలోకి పెట్టి తీసి, పిన్ నంబర్ కొట్టమన్నారు. అనంతరం 3 వేల నగదు సుభాన్ డ్రా చేశాడు. ఆపై వారి వద్ద నుంచి తన ఏటీఎం కార్డు తీసుకొని వెళ్లిపోయాడు. మంగళవారం మధ్యాహ్నం డబ్బులు డ్రా చేయడానికి సుభాన్ ఏటీఎంకు వెళ్లాడు. అక్కడ కార్డు పని చేయడం లేదని తెలిసింది. అప్పటికీ గమనించని అతను తన కార్డు పని చేయడంలేదని బ్యాంకును సంప్రదించాడు. బ్యాంకు సిబ్బంది చూసి... డబ్బు డ్రా అయినట్లు చెప్పటంతో లంగర్హౌస్ పోలీసులను ఆశ్రయించాడు. ఏటీఎం కేంద్రంలో సాయం చేస్తామంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చి..పనికిరాని కార్డును తనకు అంటగట్టి వెళ్లిపోయారని, తన కార్డును వాడుకుని ఖాతాలోని రూ.61 వేలు డ్రా చేసుకున్నారని పేర్కొన్నాడు. -
పోలీసుల అదుపులో ఏటీఎం కార్డు దొంగ !
మందస: ఓ మహిళ నుంచి ఏటీఎం కార్డు దొంగిలించి డబ్బును డ్రా చేసిన వ్యక్తిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం చిన్నకేసుపురం గ్రామానికి చెందిన మడియా హేమలత డబ్బులు తీసేందుకు హరిపురం ఎస్బీఐ ఏటీఎంకు వచ్చింది. అయితే ఆమెకు ఆపరేటింగ్ తెలియక పోవడంతో ఇతరుల సహాయం కోసం వేచిఉంది. ఇదే సమయం ఓ యువకుడు రావడంతో హేమలత అతనికి ఏటీఎం కార్డును ఇచ్చి రూ.1000 తీయించారు. ఇదే అదనుగా ఆ యవకుడు అదే రంగులో ఉన్న వేరే ఏటీఎం కార్డును ఆమెకు ఇచ్చాడు. అది గమనించని హేమలత దాన్ని తీసుకొని వెళ్లిపోయింది. అక్కడికి కొన్ని గంటల తరువాత తన అకౌంట్ నుంచి రూ.25 వేలు విత్డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో ఆందోళకు గురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే హేమలత గురువారం మందస వచ్చేందుకు హరిపురంలో ఆటో ఎక్కగా అందులో ఏటీఎం దగ్గర సాయం చేసిన యువకుడు ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. అయితే మందసలో ఆటో ఆగిన వెంటనే యువకుడు పారారయ్యేందుకు ప్రయత్నించగా హేమలత అతన్ని పట్టుకున్నప్పటికీ ఆమె నుంచి విడిపించుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని కూడా పోలీసులకు తెలియజేయడంతో అప్రమత్తమైన సిబ్బంది ద్విచక్ర వాహనంపై వెతికారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో సివిల్ డ్రస్లో ఉన్న పోలీసులను గుర్తించలేని ఆ యువకుడు హరిపురం అర్జంట్గా వెళ్లాలని, తనను డ్రాప్ చేయాలని ఒడియా భాషలో అడిగాడు. అతని తొందరపాటును గ్రహించిన పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తీసుకువచ్చారు. సీఐ దృష్టిలో ఈ విషయాన్ని పెట్టామని, ఆయన వచ్చాక యువకుని పేరు, ఇతర వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
ఆన్లైన్ మోసం
పెదవాల్తేరు: బ్యాంకు అధికారినని చెప్పి ఫోన్లో ఏటీఎం కార్డు వివరాలు తెలుసుకుని.. దర్జాగా రూ.10 వేల విలువైన ఆన్లైన్ షాపింగ్ చేసిన మోసగాడి ఉదంతమిది. పోలీసులు తెలిపిన వివరాలివి.. ఎంవీపీకాలనీకి చెందిన సిహెచ్ అప్పారావు రిటైర్డ్ ఉద్యోగి. అతనికి స్టేట్బ్యాంక్లో ఖాతా ఉంది. ఈనెల 11న మధ్యాహ్నం 85810 58891 నంబరు నుంచి అప్పారావుకు ఫోన్ వచ్చింది. స్టేట్ బ్యాంక్ రీజనల్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పి.. ‘మీ ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చేయాల’ని తెలిపి ఆధార్ కార్డు నంబర్ అడిగాడు. తర్వాత ఏటీఎం కార్డుపై ఉన్న పదహారు అంకెలు చెప్పమన్నాడు. ఏటీఎం కార్డు మరో వైపు ఉన్న చివర మూడు అంకెలు తెలపాలని అడగ్గా అప్పారావు నంబర్లు చెప్పారు. ఏటీఎం కార్డు నంబర్ చెప్పగానే అతను ఫోన్ కట్ చేశాడు. పది నిమిషాలకే మోబి క్విక్ ఆన్లైన్ షాపింగ్లో రూ.9999 చెల్లించినట్టు అప్పారావు ఫోన్కు సందేశం రావడంతో అవాక్కయ్యాడు. వెంటనే తనతో మాట్లాడిన వ్యక్తి నంబర్కు డయల్ చేయగా ఆ నంబర్ పనిచేయలేదు. దీంతో ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంవీపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏటీఎంలో కార్డు పెట్టగానే 'షాక్'
అలహాబాద్ : ఏటీఎంలో నగదు డ్రా చేసుకునేందుకు వెళ్లి సదరు మెషిన్లో కార్డును ఇన్సర్ట్ చేయగానే బ్రిజేష్ కుమార్ యాదవ్ అనే వ్యక్తికి కరెంట్ షాక్ కొట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోజంగాయిలో సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఉల్కిపడిన బ్రిజేష్... బ్యాంక్, పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. దాంతో వారు సదరు ఏటీఎం వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ దిగంబర్ కుష్వాన్ మాట్లాడుతూ... బ్రిజేష్ కుమార్ వర్షంలో పూర్తిగా తడిసి... ఏటీఎంలో నగదు డ్రా చేసే ప్రయత్నంలో షాక్ కొట్టి ఉంటుందని తెలిపారు. అదికాక ఏటీఎం ఉన్న భవంతి అత్యంత పురాతనమైనదని... ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భవంతి పూర్తిగా తడిసిపోయిందని వెల్లడించారు. అంతేకాకుండా మెషిన్లో వైరింగ్ తేడా వల్ల కూడా ఇలా జరిగే అస్కారం ఉండవచ్చని ఆయన తెలిపారు. బ్యాంకు అధికారులు, సిబ్బంది మెషిన్ను పరిశీలిస్తున్నారని చెప్పారు. -
ఏటీఎం కార్డులో నగదు చోరీ
మెదక్ (సిద్దిపేట రూరల్): ఏటీఎం పోవడంతో అందులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు డ్రా చేశారు. ఈ సంఘటనపై బాధితుని ఫిర్యాదు మేరకు సోమవారం రూరల్ ఎస్ఐ రాజేంద్రప్రసాద్ కేసు నమోదు చేశారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...మండలంలోని పుల్లూరు గ్రామానికి చెందిన కూరెళ్ల మల్లారెడ్డి కుటుంబ సమేతంగా మే 26న తిరుపతి దేవస్థానానికి వెళ్లారు. దర్శనానంతరం అదే నెల 31న ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో అతన్ని వద్ద ఎస్బీఐ ఏటీఎం కనపడకుండా పోయింది. వెంటనే బాధితుడు స్థానిక ఎస్బీహెచ్ బ్రాంచ్కు వెళ్లి అతని అకౌంట్ వివరాలు తెలుసుకున్నాడు. తిరుమలలో రూ. 40వేలు, విజయవాడలో రూ. 40వేలు, భువనగిరిలో రూ. 48వేలను డ్రా చేశారు. దీంతో బాధితుడు మల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
ఏటీఎం పిన్ నెంబర్ అడిగి...
నల్లగొండ : బ్యాంకు అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి వివరాలు అడగటంతో ఓ వ్యక్తి ఏటీఎం కార్డు పిన్ నంబర్ చెప్పేశాడు. దీంతో అతని ఖాతా నుంచి రూ.5 లక్షలు మాయమయ్యాయి. వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆ విషయాన్ని సదరు మోసగాడు తెలుసుకుని... మాయం చేసిన నగదును తిరిగి సదరు ఖాతాదారుడి ఖాతాకు బదిలీ చేశాడు. నల్లగొండ పోలీసులు కథనం ప్రకారం... పట్టణంలోని మాన్యంచెల్కకు చెందిన దాదాబాషా బత్తాయి వ్యాపారి. అతనికి గురువారం ఓ వ్యక్తి బ్యాంకు అధికారినంటూ ఫోన్ చేశాడు. సాంకేతిక కారణాలతో ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని...పిన్ నంబర్ చెబితే సరి చేస్తానని నమ్మబలికాడు. దీంతో దాదాబాషా తన ఏటీఎం కార్డు నంబర్ చెప్పాడు. ఆ వెంటనే సదరు వ్యక్తి అతని ఖాతాలో ఉన్న రూ.5 లక్షలను తన ఖాతాలోకి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టం ద్వారా మార్చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత దాదాబాషా బ్యాంకుకు వెళ్లి... డబ్బు డ్రా చేయబోగా నగదు లేదని సమాచారం వచ్చింది. దీంతో అతడు వెంటనే అప్రమత్తమై బ్యాంకు మేనేజర్కు ఫిర్యాదు చేశాడు. ఆయన సూచన మేరకు డీఎస్పీని కలిసి విషయం వివరించాడు. దాంతో ఆయన వెంటనే స్పందించి పోలీసులను అప్రమత్తం చేసి... నగదు మాయం చేసిన ఆగంతకుడి ఖాతాను బ్లాక్ చేయించారు. దీంతో ప్రమాదం శంకించిన మోసగాడు రూ.5 లక్షలను తిరిగి దాదాబాషా ఖాతాకు జమ చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాయం చేయమంటే మోసం చేశాడు
ఏటీఎం విత్డ్రాలో రూ.7వేలు మోసం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు పలమనేరులో కార్డు చేతిలోపెట్టి ఉడాయించిన ఘనుడు పలమనేరు: ఏటిఎంలో డబ్బు డ్రా చేసి ఇవ్వాలని ఓ మహిళ క్యూలో ముందున్న వ్యక్తికి ఏటీఎం కార్డు ఇవ్వడంతో అతను ఆమె అకౌంట్లోని మొత్తం సొమ్మును డ్రాచేసి మోసగించిన సంఘటన శుక్రవారం పలమనేరులో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. పట్టణంలోని కొత్తపేటకు చెందిన దాము భార్య భారతి స్థానిక బజారువీధిలోని ఏటీఎంలో రూ.1000 డబ్బు డ్రా చేసుకునేందుకు వెళ్లింది. అయితే ఏటీఎం కార్డును ఉపయోగించి డబ్బును డ్రా చేసుకునేది తెలీక క్యూలో తన ముందున్న ఓ వ్యక్తికి కార్డును ఇచ్చిన రూ.1000 డ్రాచేసి ఇవ్వాల్సిందిగా కోరింది. ఆమె కార్డును దాని వెనుకనున్న పిన్ నెంబర్ను తెలుసుకున్న అపరిచిత వ్యక్తి తొలుత బ్యాలెన్స్ను చూసి అందులో రూ.8,300 ఉండగా, 8వేలను డ్రా చేశాడు. ఆమెకు రూ.1000, ఏటీఎం కార్డును చేతిలో పెట్టి ఏడు వేలతో అక్కడి నుంచి జారుకున్నాడు. వెంటనే ఆమె మొబైల్ ఫోన్కు ఎస్ఎంఎస్ రావడంతో దాన్ని అక్కడే ఉన్న మరో వ్యక్తికి చూపెట్టి తన ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో చూడమని కోరింది. అయితే రూ.300 మాత్రమే బ్యాలెన్స్ అందులో ఉందని, ఎస్ఎంఎస్ను చూసిన వ్యక్తి ఆమెకు తెలిపాడు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితురాలు చుట్టుపక్కల చూసినా అపరిచిత వ్యక్తి కనిపించలేదు. దీంతో జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఏటీఎం కార్డుతో మోసగాడి ఉడాయింపు
రూ.38 వేల నగదు డ్రా విశాఖపట్నం: ఏటీఏంలో డబ్బు తీసేందుకు వచ్చిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడికి సహాయపడుతున్నట్టు నటించి టోకరా వేసి పరారయ్యాడో మాయగాడు. దువ్వాడ జోన్ పోలీస్టేషన్ పరిధిలోని కూర్మన్నపాలెంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులకు బాధితుడు అందించిన ఫిర్యాదు మేరకు వివరాలివి. విజయనగరం జిల్లాకు చెందిన రిటైర్ట్ ప్రధానోపాధ్యాయుడు ఎ.హరినారాయణ కూర్మన్నపాలెం వుడా ఫేజ్-7లో నివసిస్తున్న కుమారుని ఇంటికి వచ్చారు. రాజీవ్నగర్ వైఎస్సార్ కూడలిలోని ఎస్బీహెచ్ ఏటీఎంలో శుక్రవారం ఉదయం డబ్బులు తీసేందుకు వెళ్లారు. ఏటీఎంలో సాంకేతిక లోపం తలెత్తడంతో డబ్బులు రాలేదు. ఈ సమయంలో పక్కనే ఉన్న ఘరానా మోసగాడు హరినారాయణ ఏటీఎం కార్డుతో డబ్బులు తీయడానికి ప్రయత్నిస్తున్నట్టు నటించాడు. అనంతరం తన చేతిలోని అలాంటి కార్డు హరినారాయణకు అప్పగించి పరారయ్యాడు. వెళ్లిన పది నిమిషాల్లోనే కూర్మన్నపాలెం ముస్తాఫా జంక్షన్లోని ఏటీఎంలో రూ.38 వేలు విత్డ్రా చేశాడు. నగదు ఏటీఎం ద్వారా డ్రా కాకపోవడంతో సమీపంలోని బ్యాంక్ మేనేజర్కు ఫిర్యాదు చేసిన బాధితుడు పాస్పుస్తకాన్ని అప్డేట్ చేయించగా, నగదు వేరే ఏటీఎంలో విత్డ్రా అయినట్టు గుర్తించారు. కార్డును మార్చేసి మోసగించినట్టు గుర్తించిన బాధితులు దువ్వాడ జోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దువ్వాడ సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫుటేజ్లో నిందితుని గుర్తింపు రాజీవ్నగర్, కూర్మన్నపాలెం ముస్తాఫా జంక్షన్లలోని ఏటీఎంల్లోని ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించామని ఎస్బీహెచ్ మేనేజర్ సమిత బాగ్ తెలిపారు. బాధితునికి చేతిలో పెట్టిన ఏటీఎం కార్డు వాస్తవానికి నిందితునిది కాదన్నారు. -
మాతృమూర్తిపై మానవత్వం మృగ్యం
రాజవోలు (రాజమండ్రిరూరల్) :ఆమె ముగ్గురు బిడ్డలకు కన్నతల్లి. పిల్లలను కంటికి రెప్పలా సాకింది. మూడు నెలల క్రితం భర్త కన్నుమూయడంతో ఆ బెంగతో ఆమె మంచం పట్టింది. ఒంటిపై పుండు ఏర్పడి దుర్వాస వస్తోంది. ఆ దశలో ఆమెను వంటరిగా వదిలేశారు ఆమె బిడ్డలు. ఆమెకు వచ్చే పింఛన్ను అనభవిస్తూ ఆమెకు కనీసం ఆసరాగా నిలవని ఆమె సంతానంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... రాజవోలు ఎస్సీపేటకు చెందిన ఎలక్ట్రికల్ ఉద్యోగి అంబటి భీమ్సింగ్ విద్యుత్శాఖలో పనిచేసి పదవీవిరమణ చేసి మూడు నెలల క్రితం మృతిచెందాడు. ఆ బెంగతో అతని భార్య అంబటి మేరీరత్నం అనారోగ్యంతో మంచానపడింది. ఆమెకు ఇద్దరు కుమారులు ప్రశాంత్కుమార్(దొరబాబు), ప్రవీణ్(నాని), కుమార్తె ప్రసన్నకుమారి ఉన్నారు. పెద్దకుమారుడు దొరబాబు జి.మామిడాడలో, కుమార్తె ప్రసన్నకుమారి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఉంటున్నారు. చిన్న కుమారుడు ప్రవీణ్ రాజమండ్రిలో ఉంటున్నాడు. మేరీరత్నం గ్రామంలోని ఎస్సీపేట కమ్యూనిటీహాలు వద్ద తన ఇంట్లో ఉంటోంది. ఆమెకు రూ. 18 వేలు పింఛన్ వస్తోంది. దానికి సంబంధించిన ఏటీఎం కార్డు ప్రవీణ్ వద్దే ఉంది. ఆమెను ఇంటి వరండాలోనే ఒక మంచంపై పడుకోబెట్టారు. ప్రవీణ్ ఈమధ్యనే మేరీరత్నానికి వైద్యం చేయించి ఇక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఆమె లేవలేని పరిస్థితిలో ఉండగా ఒంటిపై పుండు ఏర్పడింది. ఆ పుండు నుంచి వస్తున్న దుర్వాసనను చుట్టుపక్కలవారు భరించలేకపోయారు. దీంతో ఈవిషయాన్ని స్థానికులు ప్రవీణ్కు ఫోన్చేసి చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దాంతో వారు రూరల్ తహశీల్దార్ జి.భీమారావుకు ఫిర్యాదు చేశారు. ఆయన వీఆర్వో భాస్కరరామారావు, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావులను ఆమె ఇంటికి పంపించారు. వారు స్థానికుల నుంచి వివరాలను సేకరించారు. ఎవరైనా మేరీరత్నానికి అన్నంపెడితే మీరే చూడండి అంటూ ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేసేవాడని వారు తెలిపారు. ప్రవీణ్కు వీఆర్వో ఫోన్చేసి వెంటనే వచ్చి మీతల్లిని ఆస్పత్రిలో చేర్పించాలని, లేని పక్షంలో తామే ఆస్పత్రిలో చేర్పిస్తామని తెలిపారు. దానికి ప్రవీణ్ సాయంత్రం వచ్చి తనతల్లిని ఆస్పత్రిలో చేర్పిస్తానని చెప్పాడని ఆయన తెలిపారు. అయితే రాత్రి 9 గంటల వరకు అతను తల్లివద్దకు రానేలేదు. దీనిపై తహశీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త..!
కంటికి కనపడరు.. కన్నమేస్తారు మారుతున్న కాలానుగుణంగా ఆధునిక పరిజ్ఞానం కూడా కొంత పుంతలు తొక్కుతోంది. అదేస్థాయిలో నేరాలు కూడా దడ పుట్టిస్తున్నాయి. బ్యాంకు ఏటీఎం కార్డు మన దగ్గరే ఉంటుంది.. కానీ ఖాతాలో నగదు ఖాళీ అవుతుంది. ఫేస్బుక్ మనం వాడకపోయినా.. మన అకౌంట్ పేరిట వాళ్లు వాడుతుంటారు. మెయిల్ పాస్వర్డ్లు, అన్నీ హ్యాక్ చేస్తుంటారు వారే సైబర్ నేరగాళ్లు. మనం ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇబ్బందులు తప్పవు. న్యూఢిల్లీ: ఏడాది కిందట ఓ వ్యక్తి ఆధునిక పరిజ్ఞానంతో ఇతరుల ఏటీఎం కార్డులకు నకిలీలను త యారుచేసి సొమ్ము డ్రా చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. నగరంలో పలు ప్రాంతాల్లో ఫేస్బుక్ను వినియోగిస్తున్న వారికి తెలియకుండానే వారి ఫేస్బుక్ అకౌంట్నుంచి ఇతరులకు అసభ్యకర సందేశాలు, అసభ్యకర ఫొటోలు అప్లోడ్ చేయడంతో ఈ ఘటనలపై సైతం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలా కొంతకాలంగా నగరంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఏవైనా పొరపాటు జరిగితే కటకటాలు లెక్కించేది మనమే. మీ నంబర్ బంపర్ లాటరీకి సెలెక్ట్ అయిందనీ, కోట్లు వచ్చాయని... వెంటనే సొమ్ము డ్రా చేసుకొమ్మని లోకల్ నంబర్ నుంచి సెల్కు ఓ మెసేజ్ వస్తుంది. ఈ మెయిల్కు కూడా ఇలాంటి మెసేజ్లే వస్తుంటాయి. కోట్లు డ్రా తగిలిందిగా... అనే సంబరంలో వారడిగిన వివరాలు ఇచ్చామా.. అంతే... ఇక మన పనిగోవిందా.. ఇలాంటి సైబర్ నేరాలు తరచూ విని ఆశ్చర్యపోతుంటాం. సైబర్ నేరాలకు శిక్ష, వాటి బారినుంచి రక్షణ పొందడంపై ఈ ప్రత్యేక కథనం. నిజజీవితంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ నిత్యావసరంగా మారింది. ఇంటర్నెట్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకొనేంతవరకు ప్రతి సందర్భంలోనూ నెట్ వాడుతుంటాము. స్మార్ట్ఫోన్లు వచ్చాక ప్రపంచమే మారిపోయింది. సెల్లో నెట్ అందుబాటులోకి రావడంతో ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. దీంతో నేరాలు సైతం ఎక్కువగా నమోదువుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఇతరుల సాఫ్ట్వేర్లు, మెయిల్స్ను హ్యాక్చేసి వాటిని వినియోగించుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. పలు అంతర్జాతీయ సంస్థలు, వ్యక్తులు, క్రీడాకారులు, బ్యాంకులు సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ మెయిల్ ఫిషింగ్ ఈ మెయిల్ హ్యాకింగ్ రెండురకాలు. మనం మెయిల్ ఉపయోగించే ముందుగానే నకిలీ పేజీ ఒకటి సృష్టించి ఉంచుతారు. అందులో మన చిరునామా, ఈ మెయిల్ అడ్రస్, పాస్వర్డ్ నమోదుచేసి చూస్తే పేజీ కెనాట్ బీ ఓపెన్ అని వస్తుంది. దీంతో మనం నెట్వర్క్ సమస్య ఉందని వదిలేస్తాం. కానీ ఈలోపే మన వివరాలు, ఈ మెయిల్ అడ్రస్, పాస్వర్డ్ హ్యాకర్ల కంప్యూటర్లో నమోదవుతాయి. మనం మళ్లీ ఈమెయిల్ ట్రైచేస్తే ఎప్పటిలాగానే ఓపెన్ అవుతుంది. ఆ తరువాత మెయిల్స్ చెక్ చేసుకుని సైన్ అవుట్ చేసేస్తాం. కానీ మన వివరాలు సేకరించిన హ్యాకర్లు మన పనిని నిశితంగా గమనిస్తుంటారు. మనం ఏం చేస్తున్నామో ఎప్పటికప్పుడు వారికి తెలిసిపోతూ ఉంటుంది. దీని ద్వారా విలువైన సమాచారం, పాస్వర్డ్స్, బ్యాంకు ఖాతాల వివరాలు వారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదముంది. మనకు తెలియకుండానే మెయిళ్లు వెళుతుంటాయి. మనం ఉపయోగించినట్టే సులభంగా లాగిన్ అవుతారు. తీవ్రంగా నష్టపోవడంతో పాటు మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఫేస్బుక్ అవుతారు ఫేస్బుక్ వినియోగం కొత్తపుంతలు తొక్కుతోంది. ఈ తరుణంలో మనం ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న బుక్ అవడం ఖాయం. ఇటీవల ఫేస్బుక్ పాస్వర్డ్లను తెలుసుకొని కొందరు అపరిచితులు అసభ్యచిత్రాలను అప్లోడ్ చేస్తున్న సంఘటనలు జిల్లాలో వెలుగుచేశాయి. ఇటీవల ఫేస్బుక్లో ఎలాంటి అడ్డూ లేకుండా పలు చిత్రాలు, మెస్జేలు వస్తుండేవి. వీటికి అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం ఐటీ యాక్టును బలోపేతం చేసింది. ఏటీఎం క్లోనింగ్: ఈ మధ్యకాలంలో ఏటీఎం కార్డులు విచ్చలవిడిగా క్లోనింగ్కు గురవుతున్నాయి. ఏటీఎం మాదిరిగానే మరో ఏటీఎం కార్డును హ్యాకర్లు తయారుచేసి డబ్బులు డ్రా చేస్తున్నారు. ఇదెలాగంటే... మొదట నేరగాళ్లు వారు ఎంచుకున్న వ్యక్తి కదిలకలపై నిఘా ఉంచుతారు. ఆ వ్యక్తి ఏటీఎంలో డబ్బు డ్రాచేసే సమయాన్ని గమనిస్తారు. స్కిమ్మర్ అనే పల్చని పొర ఉన్న పేపర్ను ముందుగానే ఏటీఎం మెషీన్లో ఉంచుతారు. ఆ వ్యక్తి ఏటీఎం ఉపయోగించి డబ్బు డ్రా చేసినప్పుడు కార్డు వివరాలు, ముద్రలు ఆ పొరమీద అచ్చుగుద్దినట్లు కనపడుతాయి. స్కిమ్మర్తోపాటు అక్కడ రహస్యంగా ఏర్పాటుచేసిన కెమేరా ఆ వ్యక్తి కీబోర్డును ఉపయోగించిన ఫొటోలు తీస్తుంది. దీని ద్వారా పిన్నంబర్ను నేరగాళ్లు ఈజీగా తెలుసుకుంటున్నారు. స్కిమ్మర్లో నమోదైన వివరాలతో మరో ఏటీఎం కార్డును తయారు చేసి దానికి ఉన్న ప్రత్యేకమైన, రహస్య అంకెలను బ్రూట్ఫోర్సు విధానంతో తెలుసుకుంటారు. దీంతో యథేచ్ఛగా నగదు డ్రా చేస్తారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చోటుచే సుకుంటున్నాయి. బ్యాంకు అకౌంట్ నుంచి మనకు తెలియకుండానే డబ్డు డ్రా అయినట్లు భావిస్తే వెంటనే సంబంధిత బ్యాంకు అధికారికి తెలియజేయాలి. వారు మన ఫిర్యాదును ఆన్లైన్ ద్వారా ఏజీఎంకు పంపుతారు. ఫిర్యాదుపై స్పందించిన సైబర్ పోలీసులు నిందితులపై కేసు నమోదుచేస్తారు. వారి నుంచి ఎఫ్ఐ ఆర్ నకలును తీసుకోవాలి. -
మీ ఏటీఎం కార్డు పోయిందా?
న్యూఢిల్లీ: రంజిత్ హైదరాబాద్ నుంచి కర్నూల్కు రైలులో బయల్దేరాడు. ప్రయాణంలో అతని ఏటీఎం కార్డు పోయింది. అందులో అధిక మొత్తం ఉండడంతో ఆయనలో ఆందోళన పెరిగింది. ఇలాంటి పరిస్థితే మీకు ఎదురైతే ఏం చేయాలి. ఇలాంటి సందర్భాల్లో మీకు సహాయం అందించేందుకు ప్రతి బ్యాంకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసింది. ఇవి 24 గంటలూ వినియోగదారుల సేవకు సిద్ధంగా ఉంటాయి. సంబంధిత నెంబర్కు ఫోన్ చేసి మీరు అకౌంట్ నెంబర్, వివరాలు తెలియపరిస్తే మీ అకౌంట్ లావాదేవీలను తక్షణమే నిలిపివేస్తారు. మీకు ఎస్సెమ్మెస్ అలర్ట్ ఉందా..! ప్రతి బ్యాంకు ఇప్పుడు వినియోగదారులకు ఎస్సెమ్మెస్ అలర్ట్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. కొత్తగా ఖాతా తెరిచే వారికి దరఖాస్తులోనే దాన్ని పొందుపరిస్తే ఈ సౌకర్యం వర్తిస్తుంది. పాత ఖాతాదారులు ఆయా బ్రాంచ్లకు వెళ్లి దరఖాస్తు పూరించి ఇస్తే ఈ సౌకర్యం పొందవచ్చు. ఖాతాలో డబ్బు డ్రా/జమ చేసినప్పుడు మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కు సంబంధిత వివరాలు ఎస్సెమ్మెస్ రూపంలో వస్తాయి. బ్యాంకు పేరు టోల్ ఫ్రీ నెంబర్ ఎస్బీఐ - 1800112211 ఎస్బీహెచ్ - 18004251825 హెచ్డీఎఫ్సీ - 99494 93333 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 18002 22244 కరూర్ వైశ్యా బ్యాంక్ - 186020 01916 ఆంధ్రాబ్యాంక్ - 18004 252910 -
కార్డు పోతే..?
ఖమ్మం ఖిల్లా, న్యూస్లైన్: ఇప్పుడు ఎవరిజేబులో చూసినా పచ్చనోట్ల కన్నా ఎక్కువ కార్డులే కనిపిస్తున్నాయి. ఏటీఎం కార్డు, పాన్కార్డు, డ్రైవింగ్లెసైన్స్, ఓటర్ గుర్తింపుకార్డు, ఆధార్కార్డు...ఇలా అన్నీ కార్డులే ఉంటున్నాయి. ఒకవేళ వీటిని పోగొట్టుకుంటే మళ్లీ ఎలా పొందాలో తెలియక చాలామంది ఆందోళన చెందుతుంటారు. పోయిన కార్డుల స్థానంలో కొత్తకార్డులను ఎలా పొందాలో తెలిపేదే ఈ కథనం... పాన్కార్డు... ఈ రోజుల్లో ఉద్యోగులు, వ్యాపారులతోపాటు సామాన్యులు సైతం పాన్కార్డు తీసుకుంటున్నారు. దీన్ని పోగొట్టుకుంటే దీనికి సంబంధించిన ఏజెన్సీలో ఫిర్యాదు చేయాలి. దీనికి పాన్కార్డు నంబర్, కలర్ఫొటో, నివాస ధృవీకరణపత్రం లేదా రేషన్కార్డు జిరాక్స్ జతచేయాలి. దరఖాస్తుకు రూ.5, మరో కార్డు మంజూరు చేసేందుకు రూ.60 వసూలు చేస్తారు. విచారించి 20 రోజుల్లోపు పాన్కార్డు పంపిస్తారు. రేషన్కార్డు పోతే... ప్రస్తుతం రేషన్కార్డు ప్రాధాన్యత ఎక్కువే. దీని ద్వారా సరుకులు పొందడంతో పాటు, బ్యాంకు అకౌంట్లు, సిమ్కార్డులు పొందటం ఇలాంటి వాటన్నింటికీ దీన్నే ఉపయోగిస్తారు. ఒకవేళ రేషన్కార్డు పోగొట్టుకుంటే ముందుగా తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. దానికోసం రూ.10 లేదా 20 చెల్లిస్తే దీని స్థానంలో మరోకార్డును అందజేస్తారు. ఇలాగే ఓటరు గుర్తింపు కార్డు కూడా పొందవచ్చు. ఒకవేళ కార్డు నంబర్ తెలిసి ఉంటే అప్పటికప్పుడే మీ సేవాలో నామమాత్రపు ఖర్చుతో పొందవచ్చు. పట్టాదారు పాసుపుస్తకం... పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ పోతే ముందుగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. అక్కడ ఎఫ్ఐఆర్ ఆధారంగా పత్రికల్లో ప్రకటించాలి. ఏ ప్రాంతానికి చెందుతారో అక్కడ ఉన్న అన్ని బ్యాంకుల నుంచి ఒక ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి. ఏ బ్యాంకులోనూ వీటిని తాకట్టు పెట్టలేదనే పత్రాన్ని సమర్పించాలి. వీటితో పాటు పట్టదారు పాసుపుస్తకానికి రూ.1000, టైటిల్ డీడ్ కోసం రూ.100 చలానా తీసి మీసేవాలో దరఖాస్తు చేస్తే మళ్లీ పొందవచ్చు. ఏటీఎం కార్డయితే... ఏటీఎం కార్డును పోగొట్టుకుంటే మాత్రం వెంటనే అప్రమత్తం కావాలి. లేదంటే అకౌంట్లోని డబ్బులను భారీగా నష్టపోయే అవకాశముంది. ఈ కార్డు ఎవరికైనా దొరికితే దానిద్వారా డబ్బులు తీయలేకపోయినప్పటికీ... విచ్చల విడిగా షాపింగ్ చేసే ప్రమాదం ఉంది. అందుకే కార్డు పోయిన వెంటనే సంబంధిత బ్యాంకుకు చెందిన వినియోగదారుల సేవా కేంద్రానికి ఫోన్ చేసి కార్డును బ్లాక్ చేయించాలి. ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేస్తే ముందుగా మన చిరునామాకు కార్డు పంపిస్తారు. ఆ తర్వాత వారం రోజులకు రహస్య పిన్కోడ్ నంబర్ ఇస్తారు. -
కార్డు కాజేసి.. క్యాష్ డ్రా చేసి..
సాయం కోరితే ఓ ఎస్.. అన్నాడు. పిన్ నెంబర్ తెలుసుకున్నాడు. కళ్లు గప్పి కార్డు మార్చేశాడు. తర్వాత బాధితుడి కార్డుతో వారం రోజుల్లో విడతలు విడతలుగా రూ.1.89 లక్షలు డ్రా చేసుకున్నాడు. మళ్లీ డబ్బులు అవసరమై శుక్రవారం బ్యాంకుకు వెళ్లిన అసలు ఖాతాదారుడు ఖాళీ ఖాతా వెక్కిరించడంతో లబోదిబోమన్నాడు. పోలీసులను ఆశ్రయించాడు. 1.89 లక్షల స్వాహా చేసిన ఘనుడు రణస్థలం, న్యూస్లైన్: ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడంలో సహాయం చేసినట్లు నటించి ఏటీఎం కార్డు తస్కరించిన ఓ ఆగంతకుడు సదరు వ్యక్తి ఖాతా నుంచి రూ.1.89 లక్షలు విత్డ్రా చేశాడు. విషయం తెలిసి బాధితుడు లబోదిబోమంటున్నాడు. వివరాల్లోకి వెళితే... లావేరు మండలం లింగాలవలసకి చెందిన లుకలాపు అప్పలనాయుడికి రణస్థలంలోని ఎస్బీఐలో 32033222913 నంబరుతో ఖాతా ఉంది. సంకిలి సుగర్ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేయడంతో ఆ సంస్థ యాజమాన్యం అప్పలనాయుడు ఖాతాలో ఈ నెల 3న రూ.2 లక్షలు జమచేసింది. అదేరోజున అప్పలనాయుడు డబ్బులు తీసుకోడానికి రణస్థలంలోని ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లాడు. ఏటీఎంలో కార్డు పెట్టినా డబ్బులు రాకపోవడంతో పక్కనే ఉన్న గుర్తుతెలియని వ్యక్తి సహాయం తీసుకున్నాడు. మూడు విడతలుగా రూ.35 వేలు తీసుకున్న తర్వాత ఆగంతుకుడు అప్పలనాయుడుకు వేరొకరి ఏటీఎం కార్డు ఇచ్చి వెళ్లిపోయాడు. దీన్ని గమనించిని అప్పలనాయుడు కూడా ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ డబ్బలు అవసరమై ఏటీఎంకు వెళ్లగా డబ్బులు రాకపోవడంతో అప్పలనాయుడు బ్యాంకు అధికారులను సంప్రదించగా కార్డు టిబిక్రమ్ ప్రధాన్ది అని చెప్పడంతో మోసపోయానని గుర్తించాడు. ఖాతాలో నిల్వ ఎంత ఉన్నదీ వాకబుచేయగా రూ.2 లక్షలకు రూ.71 మాత్రమే ఉండడంతో విస్తుపోయిన అప్పలనాయుడు శుక్రవారం రణస్థలం పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్పై ఎల్.సన్యాసినాయుడు బ్యాంకుకు వచ్చి సీసీ కెమెరా ఫుటేజ్లో ఆగంతుకుడి ఆనవాళ్లు గమనించారు. అప్పలనాయుడి నుంచి ఏటీఎం కార్డు తస్కరించిన వ్యక్తి 3వ తేదీన కోస్టలోని ఏటీఎం నుంచి రూ.5 వేలు తీసుకోవడమేకాకుండా మహాబీర్ ప్రధాన్ అనే వ్యక్తి ఖాతాకి రూ.20 వేలు బదిలీ చేశాడు. 4వ తేదీన ఒడిశా రాష్ట్రం జైపూర్లోని హోటల్ ప్రిన్స్ ఏటీఎం నుంచి రూ.40 వేలు, 5న కోరియా బైపాస్ దికానా ఏటీఎం నుంచి మూడు విడతల్లో రూ.35 వేలు డ్రా చేశాడు. అలాగే మహాబీర్ ప్రధాన్ ఖాతాకి మరోకసారి రూ.20 వేలు బదిలీ చేశాడు. 6న చండోల్ ఏటీఎం నుంచి రూ.30 వేలు, 7న జైపూర్ ఏటీఎం నుంచి రూ.3 వేలు డ్రా చేశాడు. మొత్తంమీద 3వ తేదీ నంచి 7వ తేదీ వరకూ అప్పలనాయుడి ఖాతా నుంచి రూ.1.89 లక్షలు డ్రాచేశాడు. ఒకే ఖాతాకు రెండుసార్లు నగదు బదిలీ చేసినందుకు నిందితుడు దొరికిపోతాడని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. -
రైతులకు రూపాయి కార్డు
మరికల్ , న్యూస్లైన్ : రాష్ట్రంలో సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు మొట్టమొదటిసారిగా దేశంలోనే మనరాష్ట్రంలో రైతులకు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో రూపాయి కార్డు విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ఆప్కాబ్ చైర్మన్ కె.వీరారెడ్డి వెల్లడించారు. సహకార సంఘాల్లో రుణాలు పొందే ప్రతి రైతుకు ఏటీఎం కార్డులను ఆరునెలల్లో ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ పద్ధతి ద్వారా జిల్లాలో 46 లక్షల మంది రైతులకు బ్యాంకుల్లో రుణాలు పొందవచ్చన్నారు. దన్వాడ మండలం తీలేర్ గ్రామంలో ఆదివారం ఆయన రైతులతో మాట్లాడారు. నాబార్డు సౌజన్యంతో సహకార సంఘాల్లో టాక్స్ను అమలుపర్చి వాటి అభివృద్ధి కోసం, రైతులకు మరింత దగ్గర కావడం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. నాబార్డు సౌజన్యంతో రూపాయి కార్డు ప్రవేశపెట్టే సీబీఎస్ సంస్థ యజమాన్యంతో ఈనెల 29న ముగ్గురు డెరైక్టర్లు, 13మంది అధికారులు చర్చలు జరుపుతారని తెలిపారు. మహారాష్ట్రలోని రాయికాడ్ బ్యాంకులో సీబీఎస్ పద్ధతి ప్రవేశపెట్టడంతో నష్టాల్లో ఉన్న బ్యాంకు లాభాల బాటలోకి వచ్చిందన్నారు. రూపాయి కార్డు ఏడాదిలోపు అందుబాటులోకి తెచ్చి ఏ బ్యాంకు ద్వారానైనా రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో సహకార సంఘాల ద్వారా ఇప్పటికే ఖరీఫ్లో రైతులకు రూ.250 కోట్ల రుణాలు ఇవ్వగా, ప్రస్తుత రబీలో రూ.180 కోట్ల రుణాలు ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. రబీలో రైతులకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. ప్రతి సహకార బ్యాంకును బలోపేతం చేయడం కోసం ఈనెల 17, 18, 19న జిల్లాకేంద్రంలో సహకార సంఘాల బలోపేతం, రైతులకు మెరుగైన సేవలు అందించే విధానంపై ఉన్నతాధికారులతో సింగిల్విండో కార్యదర్శులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. సమావేశంలో రైతులు రాంచంద్రయ్య, శ్రీనివాస్, వెంకటయ్య, రాము, రాజన్నలు పాల్గొన్నారు. -
ఏటీఎం కార్డు అపహరించిన ముగ్గురి అరెస్ట్ .
కాజీపేట, న్యూస్లైన్ : రైల్వే ఉద్యోగిని బెది రించి ఏటీఎం కార్డును లాక్కెళ్లి, రూ.40 వేలు డ్రాచేసిన కేసులో ముగ్గురు నిందితులను మంగళవారం అరె స్టు చేసి, కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ ఎస్ఏ జబ్బార్ తెలిపా రు. కాజీపేట పోలీస్స్టేషన్లో ఎస్సైలు రామారావు, శ్రీధర్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడారు. మడికొండ గ్రామానికి చెందిన రైల్వేఉద్యోగి మోడెం మధుసూదన్ ఈనెల 2న రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా డీజిల్ కాలనీ ప్రధాన రహదారిపై ముగ్గురు యువకులు అడ్డగించారు. రూ.100 అర్జంట్గా కావాలని ప్రాధేయపడ్డారు. వారిని చూసి జాలిపడిన మధుసూదన్ జూబ్లీమార్కెట్లోని ఏటీఎం కేంద్రం వద్దకు యువకులను తీసుకెళ్లి డబ్బులు డ్రా చేసి ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఆయనపై ఒక్కసారిగా దాడి చేసి, ఏటీఎం కార్డు, సెల్ఫోన్ లాక్కుని పరారయ్యూరు. బాధితుడు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఏటీఎంలోని సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితుల ఫొటోలను తీసుకుని ప్రింట్లు వేయించి చూడగా డీజిల్ కాలనీకి చెందిన రామడుగు సందీప్, మానుపాటి రవి, నేరేళ్ల శ్రీకాంత్తో సరిపోయినట్లు చెప్పారు. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. దీంతో వారి నుంచి రూ.36 వేల నగదు, ఏటీఎం కార్డు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులు ముగ్గురిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్కు పంపినట్లు వివరించారు.