England Cricket Team
-
Champions Trophy: ఇంగ్లాండ్పై అఫ్గానిస్తాన్ విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్పై అఫ్గానిస్తాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇందులో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ రికార్డు శతకంతో చెలరేగాడు. మొత్తం 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేసి ఔటయ్యాడు. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్లో రహ్మానుల్లా గుర్భాజ్ (6), సెదికుల్లా అటల్ (4), రహ్మత్ షా (4) విఫలం కాగా.. హష్మతుల్లా షాహిది (40), అజ్మతుల్లా ఒమర్జాయ్ (41), మహ్మద్ నబీ (40) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. లివింగ్స్టోన్ 2, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(120) సెంచరీతో మెరవగా.. డకెట్(38), జెమీ ఓవర్టన్(32) పరుగులు చేశారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 5 వికెట్లతో రాణించాడు. మహ్మద్ నబీ 2 వికెట్లు సాధించగా, ఫజల్హాక్ ఫరూఖీ, రషీద్ ఖాన్, గుల్బాదిన్ నాయబ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో ఇంగ్లండ్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. -
అండర్సన్ సంచలన నిర్ణయం.. 22 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై!
ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ జేమ్స్ ఆండర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు ఆండర్సన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే వన్డేలు, టీ20ల నుంచి తప్పుకున్న ఆండర్సన్.. ఈ వేసవి సీజన్తో టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకోనున్నాడు. ఈ ఏడాది జూలైలో లార్డ్స్ వేదికగా వెస్టిండీస్తో జరిగే తొలి టెస్టు అనంతరం తన 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు విడ్కోలు పలకున్నట్లు ఆండర్సన్ ప్రకటించాడు. ఈ విషయాన్ని శనివారం సోషల్ మీడియా వేదికగా 41 ఏళ్ల ఆండర్సన్ వెల్లడించాడు."ఈ వేసవిలో లార్డ్స్లో వెస్టిండీస్తో జరిగే మొదటి టెస్ట్ నా చివరి టెస్టు మ్యాచ్. 20 ఏళ్లకు పైగా నా దేశానికి అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించడం చాలా గర్వంగా ఉంది. నేను ఎంతో ఇష్టపడే ఆటకు విడ్కోలు పలుకుతుండడం చాలా బాధగా ఉంది. కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ఇంగ్లండ్ క్రికెట్కు ,అభిమానులకు ధన్యవాదాలంటూ" ఇన్స్టాగ్రామ్లో జేమ్స్ రాసుకొచ్చాడు. ఇక ఆండర్సన్కు వరల్డ్క్రికెట్లో ప్రత్యేకమైన స్ధానం ఉంది. 41 ఏళ్ల ఆండర్సన్ టెస్టుల్లో 700 వికెట్లు తీసిన ఏకైక బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 187 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఓవరాల్గా 400 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ఆండర్సన్ 987 వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by James Anderson (@jimmya9) -
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అల్టిమేటం.. ఐపీఎల్ జట్లకు షాక్
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఐపీఎల్లో పాల్గొంటున్న తమ ఆటగాళ్లకు అల్టిమేటం జారీ చేసింది. మే 22లోగా స్వదేశానికి చేరుకోవాలని ఆజ్ఞాపించింది. టీ20 వరల్డ్కప్కు ముందు ఇంగ్లండ్ స్వదేశంలో పాక్తో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. వరల్డ్కప్ కోసం ప్రకటించిన జట్టే ఈ సిరీస్లో కూడా పాల్గొంటుంది. ఈ సిరీస్ కోసమే ఈసీబీ తమ ఆటగాళ్లను అందుబాటులో ఉండాలని ఆదేశించింది.పాక్తో ఇంగ్లండ్ సిరీస్ ప్రారంభమయ్యే సమయానికి (మే 22) ఐపీఎల్ 2024 సీజన్లో ప్లే ఆఫ్స్ జరుగుతుంటాయి. ఇలాంటి కీలక దశలో ఇంగ్లండ్ ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోతే సంబంధిత జట్లపై భారీ ప్రభావం పడుతుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇంగ్లండ్ వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా పాక్తో సిరీస్ కోసమని ఐపీఎల్కు డుమ్మా కొడితే ఫ్రాంచైజీలకు భారీ షాక్ తగిలినట్లే.టీ20 వరల్డ్కప్ 2024 కోసం ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (సి), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్ఐపీఎల్ 2024లో వివిధ జట్లకు ఆడుతున్న ఇంగ్లండ్ వరల్డ్కప్ జట్టు సభ్యులు..జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్)మొయిన్ అలీ (సీఎస్కే)బెయిర్స్టో (పంజాబ్)సామ్ కర్రన్ (పంజాబ్)లివింగ్స్టోన్ (పంజాబ్)విల్ జాక్స్ (ఆర్సీబీ)ఫిల్ సాల్ట్ (కేకేఆర్)రీస్ టాప్లే (ఆర్సీబీ)ఐపీఎల్ ప్లే ఆఫ్స్..మే 21: క్వాలిఫయర్-1మే 22: ఎలిమినేటర్మే 24: క్వాలిఫయర్-2మే 26: ఫైనల్ -
విశాఖ అందాలు అద్భుతం అంటూ ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ప్రశంసలు
-
61 ఏళ్ల వయసులో ఇంగ్లండ్ క్రికెట్ జట్టులోకి ఎంట్రీ
61 ఏళ్ల లేటు వయసులో ఓ పెద్దాయన ఇంగ్లండ్ సీనియర్ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. త్వరలో జరుగనున్న కెనడా మాస్టర్స్ టోర్నీ కోసం సెలెక్టర్లు ఈ ఔత్సాహికున్ని ఇంగ్లండ్ సీనియర్ జట్టుకు ఎంపిక చేశారు. ఎప్పటికైనా ఇంగ్లండ్ జెర్పీ ధరించి, జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని కలలు కన్న ఈ పెద్దాయన.. ఎట్టకేలకు జీవిత చరమాంకంలో తన కలను సాకారం చేసుకున్నాడు. ఇంతకీ ఆ లేటు వయసు క్రికెటర్ ఎవరనుకుంటున్నారా..? అతని పేరు కెవిన్ వాట్సన్. వెస్ట్ యార్క్షైర్కు చెందిన ఇతను.. తన క్రికెట్ ప్రస్తానాన్ని 15 ఏళ్ల వయసులోనే ప్రారంభించాడు. వాట్సన్ గతంలో యార్క్షైర్ కౌంటీకి సారథ్యం కూడా వహించాడు. ఇటీవలే అతను ఆస్ట్రేలియా-ఏతో జరిగిన గ్రే యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్-ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. జాతీయ జట్టు జెర్సీ ధరించాలని బలమైన వాంఛ కలిగిన వాట్సన్.. తన 61వ ఏట ఆ కలను నేరవేర్చుకున్నాడు. ఇంగ్లండ్ సీనియర్ జట్టుకు ఎంపికైనానని తెలిసి వాట్సన్ ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఈ వార్త వింటుంటే చంద్రుడిపై విహరిస్తున్న అనుభూతి కలుగుతుందని అన్నాడు. కాగా, మొత్తం నాలుగు జట్లు పాల్గొనే కెనడా మాస్టర్స్ టోర్నీలో ఇంగ్లండ్తో పాటు ఆస్ట్రేలియా, యూఎస్ఏ, కెనడా జట్లు పాల్గొననున్నాయి. శనివారం నయాగరా ఫాల్స్లో జరిగే వార్మప్ మ్యాచ్తో ఈ టోర్నీ ప్రారంభంకానుంది. -
'భారత పిచ్లపై బజ్బాల్ ఆడడం అంత సులువు కాదు'
బజ్బాల్ ఆటతీరుతో ఇంగ్లండ్ దూకుడు మీదున్న సంగతి తెలిసిందే. కోచ్ బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ వచ్చిన తర్వాత ఈ బజ్బాల్ స్టైల్ తో ప్రత్యర్థులను భయపెడుతోంది ఇంగ్లండ్ టీమ్. తమ చివరి 17 టెస్టుల్లో 12 మ్యాచ్ లను గెలిచింది. ఇదే బజ్బాల్తో ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన యాషెస్ టెస్టు సిరీస్ను ఇంగ్లండ్ 2-2తో సమం చేసింది. అయితే ఆసీస్తో సిరీస్లో ఓటములు ఎదురైనా బజ్బాజ్ ఆటను ఆపబోయేది లేదని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కుండబద్దలు కొట్టాడు. యాషెస్ సిరీస్ను 2-2తో సమం చేసినప్పటికి స్లో ఓవర్ రేట్ కారణంగా డబ్ల్యూటీసీ పాయింట్స్లో భారీగా కోత పడింది. దీంతో ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. ఇక వచ్చే ఏడాది జనవరి వరకు ఇంగ్లండ్కు మళ్లీ టెస్టు సిరీస్లు లేవు. జనవరి-ఫిబ్రవరి నెలలో టీమిండియాకు రానున్న ఇంగ్లండ్ ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. భారత గడ్డపై కూడా బజ్బాల్ దూకుడును కంటిన్యూ చేస్తామని స్టోక్స్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్పేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ బజ్బాల్ ఆటకు అసలు పరీక్ష భారత్లో ఎదురు కాబోతోందని అభిప్రాయపడ్డాడు. ఎక్కువగా స్పిన్ ట్రాక్లుండే భారత పిచ్లపై బజ్బాల్ స్టైల్ ఆలోచించడానికే కొంత ఆసక్తికరంగా ఉందన్నాడు. నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ.."బజ్బాల్ తర్వాతి పరీక్ష ఇండియాలోనే. భారత్ పిచ్ల గురించి అందరికీ తెలుసు. ఇండియాలో టెస్ట్ క్రికెట్ ఆడడం ప్రత్యర్థి దేశాలకు కఠినంగా ఉంటుంది. స్పిన్ పిచ్లపై బజ్బాల్ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది చెప్పలేం. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ లాంటి టాప్ క్లాస్ స్పిన్నర్లు ఉన్న టీమిండియా బౌలింగ్తో ఇంగ్లండ్ బజ్బాల్ ఆడటం అంటే మాటలు కాదు. పరిస్థితి తారుమారు అయితే ఇంగ్లండ్ ఆడాల్సిన బజ్బాల్ను టీమిండియా ఆడినా ఆశ్చర్యపోనవసరం లేదు."అని పేర్కొన్నాడు. ఇక వచ్చే ఏడాది జనవరి 29 నుంచి హైదరాబాద్, వైజాగ్, రాంచీ, రాజ్కోట్, ధర్మశాల వేదికల్లో ఇంగ్లండ్, టీమిండియాల మధ్య ఐదు టెస్టులు జరగనున్నాయి. చదవండి: D Gukesh: 36 ఏళ్ల ఆధిపత్యానికి తెర.. భారత చెస్లో 'నయా' కింగ్ ఆవిర్భావం శుభ్మన్ టీ20లకు పనికిరాడు.. వాళ్లకు అవకాశం ఇవ్వండి..! -
'టీమిండియా బజ్బాల్ ఆడితే జట్టులో ఎవరు మిగలరండి'
బజ్బాల్ ఆటతీరుతో టెస్టు క్రికెట్కు కొత్త నిర్వచనం చెప్పింది ఇంగ్లండ్ జట్టు. కెప్టెన్గా స్టోక్స్, హెడ్కోచ్గా బ్రెండన్ మెక్కల్లమ్ బాధ్యతలు తీసుకున్నాకా బజ్బాల్ ఆటకు మరింత పదును పెట్టింది. సౌతాఫ్రికా, పాకిస్తాన్లతో జరిగిన టెస్టు సిరీస్లో బజ్బాల్ దూకుడుతో సిరీస్ విజయాలను సొంతం చేసుకున్న ఇంగ్లండ్ యాషెస్ సిరీస్లోనూ అదే దూకుడు చూపెట్టాలని భావించింది. అయితే తొలి రెండు టెస్టుల్లో బజ్బాల్ ఆటతీరుతో ఇంగ్లండ్ చేతులు కాల్చుకుంది. అప్పటికే డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచి డిపెండింగ్ చాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా ఇంగ్లండ్కు ముకుతాడు వేసింది. తొలి రెండు టెస్టులను గెలిచి ఆసీస్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఓటమిపాలైన తమ బజ్బాల్ దూకుడు మాత్రం ఆపమని కెప్టెన్ స్టోక్స్ కుండబద్దలు కొట్టాడు. అదే బజ్బాల్ ఆటతీరుతో మూడో టెస్టును గెలిచిన ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. నాలుగో టెస్టు డ్రాగా ముగిసినా ఐదో టెస్టు గెలిచి 2-2తో సిరీస్ను సమం చేసింది. ఇక వచ్చే ఏడాది టీమిండియా గడ్డపై నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వస్తోంది. బజ్బాల్ ఆటతీరును టీమిండియాకు పరిచయం చేస్తామని స్టోక్స్ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. అయితే ఇదే బజ్బాల్ స్టైల్ ను ఇండియన్ టీమ్ కూడా ఫాలో అయితే ఎలా ఉంటుందన్న సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఈ విషయంపై అశ్విన్ స్పందించాడు. "మేము టెస్ట్ క్రికెట్ బాగా ఆడుతున్నాం. కానీ త్వరలోనే పరివర్తన దిశగా వెళ్తున్నాం. ఆ దశలో పరిస్థితులు అంత సులువుగా ఉండవు. కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ ఈ దశలో ఇండియా బజ్బాల్ స్టైల్ అడాప్ట్ చేసుకుందని అనుకుందాం. హ్యారీ బ్రూక్ లాగా మన ప్లేయర్స్ కూడా బ్యాట్ ఝుళిపించడానికి ప్రయత్నించారని అనుకుందాం. రెండు మ్యాచ్ లు ఓడిపోతాం. మనం ఏం చేస్తాం? బజ్బాల్ కు, ప్లేయర్స్ కు మద్దతిస్తామా? కనీసం నలుగురు ప్లేయర్స్ పై వేటు వేస్తాం. మన సంస్కృతి ఎప్పుడూ ఇలాగే ఉంది. ఇతరుల స్టైల్ వాళ్లకు మంచి ఫలితాలు ఇచ్చింది కదా అని మనం కాపీ చేయలేం. వాళ్లకు అది పని చేసింది ఎందుకంటే వాళ్ల మేనేజ్మెంట్, సెలక్టర్లు ఈ స్టైల్ ను ఆమోదించారు. మద్దతిచ్చారు. వాళ్ల అభిమానులు కూడా ఆమోదించారు. మనం అది చేయలేం" అని అశ్విన్ స్పష్టం చేశాడు. ఇక వన్డే వరల్డ్ కప్ పై కూడా అశ్విన్ స్పందించాడు. అభిమానులు ఇండియన్ టీమ్ కు సానుకూలంగా మద్దతివ్వాలని కోరాడు. "వరల్డ్ కప్ గెలవడం అంత సులువు కాదు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ వన్డే వరల్డ్కప్ మన దేశంలో జరుగుతుంది. గతాన్ని గుర్తుచేయొద్దు.. అప్పుడు ధోని సేన మ్యాజిక్ చేసింది. ఇప్పుడు అదే రిపీట్ అవుతుందని కచ్చితంగా చెప్పలేం. దాదాపు ప్రతి మేజర్ టోర్నమెంట్లో మనం సెమీఫైనల్ చేరాం. ఆ రోజు సరిగా ఆడలేకపోయాం అంతే" అని అశ్విన్ అన్నాడు. -
'గార్డ్ ఆఫ్ హానర్' స్వీకరించిన గోస్వామి..
లార్డ్స్ వేదికగా నామమాత్రపు మూడో వన్డేలో ఇంగ్లండ్ మహిళలతో భారత జట్టు తలపడుతోంది. కాగా భారత మహిళా జట్టు వెటరన్ పేసర్ జులాన్ గోస్వామి తన కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ క్రికెటర్ల నుంచి జులాన్ గోస్వామి 'గార్డ్ ఆఫ్ హానర్' స్వీకరిచింది. భారత ఇన్నింగ్స్లో గోస్వామి బ్యాటింగ్ సమయంలో ఇంగ్లండ్ క్రికెటర్లు వరుస క్రమంలో నిలబడి ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇచ్చారు. దీంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఒక్క సారిగా చప్పట్లు కొడుతూ అభినందించారు. కాగా ఈ మ్యాచ్లో గోస్వామి తొలి బంతికే డకౌట్గా వెనుదిరిగింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్విటర్లో షేర్ చేసింది. "20 ఏళ్లుగా ఝులన్ గోస్వామి తన బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఆమె వన్డే క్రికెట్లో దాదాపు 10,000 బంతులు వేసింది. ఎంతో మంది యువ క్రికెటర్లు అత్యుత్తమంగా తాయారు చేయడంలో జులాన్ కీలక పాత్ర పోషించింది. జులాన్ ఎంతో మంది క్రికెటర్లకు ఆదర్శం" అని ఇంగ్లండ్ క్రికెట్ ట్విటర్లో పేర్కొంది. కాగా 2002లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన 40 ఏళ్ల జులన్ 201 వన్డేల్లో 253 వికెట్లు, 68 టి20ల్లో 56 వికెట్లు తీసింది. 12 టెస్టుల్లో 44 వికెట్లు కూడా పడగొట్టింది. చదవండి: Womens T20 World Cup 2023: అర్హత సాధించిన ఐర్లాండ్, బంగ్లాదేశ్ -
చరిత్ర సృష్టించిన ఝులన్ గోస్వామి.. తొలి మహిళా క్రికెటర్గా!
ఇంగ్లండ్ మహిళలలతో వన్డే సిరీస్ను భారత్ విజయంతో ఆరంభించింది. హోవ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా తన కెరీర్లో చివరి సిరీస్ ఆడుతున్న భారత భారత వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఈ మ్యాచ్లో గోస్వామి తన 10 ఓవర్ల కోటాలో 20 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టింది. తద్వారా ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లీస్ జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా గోస్వామి రికార్డులకెక్కింది. అంతుకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ పేసర్ కేథరిన్ ఫిట్జ్ప్యాట్రిక్(23 వికెట్లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో ఝులన్(24 వికెట్లు) కేథరిన్ రికార్డురు బ్రేక్ చేసింది. అదే విధంగా భారత్ తరపున వన్డేల్లో ఆడిన అతి పెద్ద వయష్కరాలుగా కూడా గోస్వామి నిలిచింది. 39 ఏళ్ల 297 రోజుల వయస్సులో ఆమె ఈ మ్యాచ్ ఆడింది. అంతకుముందు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 39 ఏళ్ల 114 రోజుల వయసులో తన చివరి వన్డే మ్యాచ్ ఆడింది. ఇక ఈ సిరీస్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు గోస్వామి గుడ్బై చెప్పనుంది. లార్డ్స్ వేదికగా జరగనున్న అఖరి వన్డేలో గోస్వామికి ఘనంగా విడ్కోలు పలకాలని భారత జట్టు భావిస్తోంది. చదవండి: IND-W vs ENG-W: శభాష్ మంధాన.. తనకు దక్కిన అవార్డును! -
చాప్టర్ క్లోజ్ అనుకున్న తరుణంలో హార్డ్ హిట్టర్కు జాక్పాట్..
ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్కు జాక్పాట్ తగిలింది. జట్టుకు దూరమై మూడేళ్లు కావొస్తుండడంతో ఇక చోటు కష్టమే అనుకుంటున్న తరుణంలో అలెక్స్ హేల్స్కు ఈసీబీ నుంచి పిలుపొచ్చింది. అక్టోబర్లో జరగనున్న ప్రతిష్టాత్మక టి20 ప్రపంచకప్కు ఈసీబీ.. గాయంతో దూరమైన జానీ బెయిర్ స్టో స్థానంలో అలెక్స్ హేల్స్ను ఎంపిక చేసింది. టి20 ప్రపంచకప్తో పాటు మెగాటోర్నీకి ముందు పాకిస్తాన్తో ఆడనున్న ఏడు మ్యాచ్ల టి20 సిరీస్కు కూడా హేల్స్కు చోటు దక్కింది. కాగా పాకిస్తాన్తో సెప్టెంబర్ 20, 22, 23, 25, 28, 30, అక్టోబర్ 2వ తేదీన ఇంగ్లండ్ ఏడు టి20లు ఆడనుంది. ఇక ప్రతిష్టాత్మక టి20 ప్రపంచకప్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. ఇక అలెక్స్ హేల్స్ 2019లో ఇంగ్లండ్ తరపున చివరి మ్యాచ్ ఆడాడు. 2019 వన్డే వరల్డ్కప్కు ముందు డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్స్ రావడంతో జట్టుకు దూరమయ్యాడు. తాజాగా హార్డ్ హిట్టర్ జానీ బెయిర్ స్టో అనూహ్యంగా గాయంతో వైదొలగడంతో అలెక్స్ హేల్స్ మూడేళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు తలుపులు తెరుచుకున్నాయి. ఇక బెయిర్ స్టో ఇటీవలే గోల్ఫ్ ఆడుతూ గాయపడ్డాడు. గోల్ఫ్ ఆడుతున్న తరుణంలో మోకాలు కింది భాగంలో తీవ్ర గాయం కావడంతో పాకిస్తాన్ సిరీస్తో పాటు టి20 ప్రపంచకప్కు చివరి నిమిషంలో దూరమయ్యాడు. ఈ మధ్య కాలంలో అలెక్స్ హేల్స్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. 33 ఏళ్ల హేల్స్ ఇటీవలే జరిగిన హండ్రెడ్ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్స్లో ఒకడిగా ఉన్నాడు. 2020 నుంచి చూసుకుంటే అలెక్స్ హేల్స్ టి20ల్లో 111 ఇన్నింగ్స్లో 3376 పరుగులు సాధించాడు. అతని కంటే ముందు పాకిస్తాన్ స్టార్ మహ్మద్ రిజ్వాన్ 3435 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక టి20 క్రికెట్లో 10వేల పరుగుల మార్క్ను అందుకున్న క్రికెటర్ల జాబితాలో అలెక్స్ హేల్స్ చోటు దక్కించుకోవడం విశేషం. ఇక హేల్స్ ఇంగ్లండ్ తరపున 60 టి20ల్లో 1644 పరుగులు, 70 వన్డేల్లో 2419 పరుగులు, 11 టెస్టుల్లో 573 పరుగులు సాధించాడు. Alex Hales has also been added to our squads for the #T20WorldCup and IT20 tour of Pakistan 🏏 — England Cricket (@englandcricket) September 7, 2022 చదవండి: పాక్ కెప్టెన్ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లిన స్టార్ ఓపెనర్ Nick Kyrgios: వివాదం లేకుంటే మనసుకు పట్టదనుకుంటా.. నువ్వు మారవు! -
బజ్బాల్.. టెస్ట్ క్రికెట్లో సరికొత్త మంత్ర
Bazball: బజ్బాల్.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ట్రెండింగ్లో ఉన్న పదం. విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫాలోవర్స్ అంతా ప్రస్తుతం ఈ పదంపైనే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏంటీ బజ్బాల్..? క్రికెట్కి ఈ పదానికి ఉన్న సంబంధం ఏంటి..? వివరాలు ఈ ఆర్టికల్లో చూద్దాం. ఇటీవల న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్ల మధ్య ముగిసిన టెస్ట్ సిరీస్ తర్వాత క్రికెట్ సర్కిల్స్లో వినిపిస్తున్న పదం బజ్బాల్. ఈ సిరీస్లో ఇంగ్లండ్ అనుసరించిన మెరుపుదాడి విధానాన్నే బజ్బాల్ అని అంటారు. మూడు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో న్యూజిలాండ్ నిర్ధేశించిన భారీ టర్గెట్లను ( 277, 299, 296) బెన్ స్టోక్స్, బ్రెండన్ మెక్కల్లమ్ ఆధ్వర్యంలోని న్యూ ఇంగ్లండ్ జట్టు బజ్బాల్ విధానాన్ని అవలంబించి అవలీలగా ఛేదించింది. తాజాగా టీమిండియాతో జరిగిన రీ షెడ్యూల్డ్ టెస్ట్లోనూ ఇంగ్లండ్ ఇదే మంత్రను ఫాలో అయి సక్సెస్ అయ్యింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు రూట్, బెయిర్స్టో టీమిండియా బౌలర్లపై మెరుపుదాడికి దిగి 378 పరుగుల భారీ టార్గెట్ను ఈజీగా ఊదేశారు. డిఫెన్స్ మోడ్లో సాగే టెస్ట్ క్రికెట్లో గెలుపే లక్ష్యంగా బ్యాటింగ్ చేసే ఈ అటాకింగ్ స్టయిల్నే బజ్బాల్ అంటారు. మెక్కల్లమ్, స్టోక్స్లు ఇంగ్లండ్ కోచింగ్, సారధ్య బాధ్యతలు చేపట్టాక ఈ వ్యూహాన్ని పకడ్బందీగా ఆచరణలో పెడుతున్నారు. ఈ ద్వయం టెస్ట్ క్రికెట్ రూపు రేఖలను మార్చేస్తూ, సంప్రదాయ క్రికెట్కు సరికొత్త శోభను తెస్తుంది. బ్యాటర్లు నిర్భయంగా ఎదురుదాడికి దిగే బజ్బాల్ విధానంపై ప్రస్తుతం అన్ని దేశాలు అధ్యయనం చేస్తున్నాయి. ఈ సరికొత్త అప్రోచ్ వల్ల టెస్ట్ క్రికెట్ కళ తప్పుతుందని కొందరు భావిస్తుంటే, జనరేషన్కు తగ్గట్టుగా ఆటలో వేగం ఉండాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి బజ్బాల్ అప్రోచ్ టీమిండియాకు అయితే కొత్త కాదు. 2000 దశకం ఆరంభంలో నజఫ్గడ్ నవాబ్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ విధానాన్ని అప్లై చేసి బౌలర్లపై తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగాడు. టెస్ట్ల్లో వీరూ ఒక్కరోజే భారీ డబుల్ సెంచరీ (284) బాదడం మనందరికీ తెలుసు. చదవండి: Ind Vs Eng: రీషెడ్యూల్డ్ టెస్టు గెలవాల్సింది.. కానీ: రోహిత్ శర్మ -
ఇంగ్లండ్ కొత్త కెప్టెన్గా జోస్ బట్లర్
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్గా జోస్ బట్లర్ ఎంపికయ్యాడు. జూన్ 28న ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి ఇయాన్ మోర్గాన్ తప్పుకోవడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇవాళ (జూన్ 30) బట్లర్ను కొత్త సారధిగా ప్రకటించింది. గత పదేళ్లుగా ఇంగ్లండ్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా కొనసాగుతున్న బట్లర్ ప్రస్తుతం వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఇంగ్లండ్ నూతన కెప్టెన్గా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బట్లర్.. ఈసీబీకి, మాజీ సారధి మోర్గాన్ను ధన్యవాదాలు తెలిపాడు. గత ఏడేళ్లుగా ఇంగ్లండ్ జట్టును అద్భుతంగా ముందుండి నడిపించిన మోర్గాన్ను ప్రత్యేకంగా కొనియాడాడు. మోర్గాన్ నుంచి బాధ్యతలు చేపట్టడం గొప్ప గౌరవమని అన్నాడు. ఇంగ్లండ్ తరఫున 57 టెస్ట్లు, 151 వన్డేలు, 88 టీ20 ఆడిన బట్లర్ తొమ్మిది వేలకు పైగా పరుగులు సాధించాడు. బట్లర్ తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 13 సెంచరీలు, 54 హాఫ్ సెంచరీలు సాధించాడు. చదవండి: రోహిత్ ఔట్, టీమిండియా కెప్టెన్గా బుమ్రా.. బీసీసీఐ అధికారిక ప్రకటన -
టెస్ట్ క్రికెట్ రూపు రేఖలను మార్చేస్తున్న ఇంగ్లండ్.. టీ20ల తరహాలో విధ్వంసం
బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ప్రస్తుత ఇంగ్లండ్ జట్టు టెస్ట్ క్రికెట్ రూపు రేఖలను మార్చేస్తుంది. ఇంగ్లండ్లోనే పురుడు పోసుకున్న సుదీర్ఘ ఫార్మాట్ను స్టోక్స్ సేన కొత్త పుంతలు తొక్కిస్తుంది. స్టోక్స్ టీమ్ టీ20ల తరహాలో ప్రత్యర్ధిపై విరుచుకుపడుతూ టెస్ట్ క్రికెట్లో వేగాన్ని మరింత పెంచేస్తుంది. ఇందుకు ఉదాహరణే తాజాగా న్యూజిలాండ్తో ముగిసిన టెస్ట్ సిరీస్. 3 మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో కొత్త కెప్టెన్ (స్టోక్స్), కొత్త కోచ్ (బ్రెండన్ మెక్కల్లమ్) ఆధ్వర్యంలో ఇంగ్లండ్ జట్టు ఊహలకందని విధంగా రెచ్చిపోయింది. మూడు మ్యాచ్ల్లో భారీ స్కోర్లను అలవోకగా ఛేదించి ప్రత్యర్ధిని ప్రేక్షక పాత్రకు పరిమితం చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్ల విధ్వంసం ధాటికి న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ అత్యుత్తమ ప్రదర్శన (3 మ్యాచ్ల్లో హ్యాట్రిక్ శతకాలతో 53 పరుగులు) మరుగున పడింది. ఇంగ్లీష్ ఆటగాళ్లలో ముఖ్యంగా జానీ బెయిర్స్టో విధ్వంసం గురించి మాట్లాడుకోవాలి. 32 ఏళ్ల ఈ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ ప్రస్థానం న్యూజిలాండ్తో సిరీస్కు ముందు తర్వాత అని చెప్పుకోవాలి. ఈ సిరీస్లో బెయిర్స్టో విధ్వంసం ఆ రేంజ్లో సాగింది. 3 మ్యాచ్ల్లో అతను 120కి పైగా స్ట్రయిక్ రేట్తో (394 పరుగులు) 2 శతకాలు, ఓ హాఫ్ సెంచరీ బాదాడు. తొలి టెస్ట్లో విఫలమైన బెయిర్స్టో రెండో టెస్ట్లో (ఛేదనలో) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీ20 తరహాలో విధ్వంసం (92 బంతుల్లో 136; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) సృష్టించి తన జట్టును గెలిపించాడు. తాజాగా ముగిసిన మూడో టెస్ట్లో బెయిర్స్టో విధ్వంస పర్వం కొనసాగింది. తొలి ఇన్నింగ్స్లో భారీ శతకం (157 బంతుల్లో 162; 24 ఫోర్లు) బాదిన అతను.. రెండో ఇన్నింగ్స్లో (296 పరుగుల ఛేదనలో) 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ప్రపంచ ఛాంపియన్ను క్లీన్స్వీప్ చేయడంలో ముఖ్యభూమిక పోషించాడు. ఈ ఇన్నింగ్స్లో బెయిర్స్టో (44 బంతుల్లో 71; 9 ఫోర్లు, సిక్సర్లు) అజేయమై అర్ధశతకం సాధించి ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చాడు. బెయిర్స్టో తర్వాత బెన్ స్టోక్స్ ఈ సిరీస్ ఆ స్థాయి విధ్వంసం సృష్టించాడు. స్టోక్స్ 5 ఇన్నింగ్స్ల్లో 82.55 స్ట్రయిక్ రేట్తో 2 హాఫ్ సెంచరీల సాయంతో 194 పరుగులు సాధించాడు. ఈ సిరీస్లో స్టోక్స్ సాధించింది తక్కువ పరుగులే అయినా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వేగంగా పరుగులు సాధించాడు. కివీస్ను వైట్వాష్ చేయడంలో జో రూట్ కాంట్రిబ్యూషన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. రూట్ 6 ఇన్నింగ్స్ల్లో 99 సగటున 74 స్ట్రయిక్ రేట్తో 396 పరుగులు సాధించి సిరీస్లో టాప్ 2 రన్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: మరోసారి రెచ్చిపోయిన బెయిర్స్టో.. కివీస్ను ఊడ్చేసిన ఇంగ్లండ్ -
ఇంగ్లండ్ హెడ్ కోచ్గా బ్రెండన్ మెక్కల్లమ్..!
లండన్: ఇటీవలి కాలంలో వరుస పరాజయాల బాట పట్టిన ఇంగ్లండ్ టెస్ట్ టీమ్.. పూర్వ వైభవం సాధించే క్రమంలో జట్టులో సమూల మార్పులకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలుత కెప్టెన్ను మార్చిన ఆ జట్టు.. తాజాగా కొత్త కోచ్ను నియమించే పనిలో నిమగ్నమైంది. జో రూట్ రాజీనామా చేశాక బెన్ స్టోక్స్కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పిన ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు).. టెస్ట్ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం న్యూజిలాండ్ మాజీ సారధి, కేకేఆర్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మెక్ కల్లమ్, ఈసీబీ మధ్య చర్చలు కూడా ముగిసినట్టు సమాచారం. ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ.. గత కొద్ది రోజులుగా మెక్ కల్లమ్తో సంప్రదింపులు జరుపుతున్నాడని తెలుస్తోంది. కాగా, ఇంగ్లండ్ టెస్ట్ జట్టు గతేడాది భారత పర్యటనకు వచ్చినప్పట్నుంచి వరుస పరాజయాల బాట పట్టి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. భారత్ చేతిలో ఓటమి తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాభవం, ఆతర్వాత యాషెస్లో ఆసీస్ చేతిలో 0-4 తేడాతో దారుణ ఓటమి, ఇటీవల విండీస్ చేతిలో 1-2 తేడాతో ఓటమి.. ఇలా ఆ జట్టు ఆడిన ప్రతి టెస్ట్ సిరీస్లోనూ ఓటమిపాలై ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత అప్రతిష్టను మూటగట్టుకుంది. దీంతో జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని ఈసీబీపై ఒత్తిడి అధికమైంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ బోర్డు ఇంగ్లండ్ టెస్ట్ బృందంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. కాగా, జూన్లో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ లో పర్యటించాల్సి ఉంది. ఈ సిరీస్ నుంచే స్టోక్స్ ఇంగ్లండ్ సారథిగా బాధ్యతలు చేపడతాడు. ఒకవేళ ఈసీబీతో మెక్కల్లమ్కు డీల్ కుదిరితే.. అతను తన సొంత జట్టుకు వ్యతిరేకంగా పని చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ పేరు దాదాపుగా ఖరారైంది. కిర్స్టెన్ ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ మెంటార్గా ఉన్నాడు. చదవండి; 'దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది' -
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్గా అతడే.. హెడ్కోచ్గా గ్యారీ కిర్స్టన్!
Ben Stokes: వరుస పరాజయాల నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో ఇంగ్లండ్ కెప్టెన్సీకి జో రూట్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మొదలు వెస్టిండీస్ పర్యటనలో ఓటమి అనంతరం అతడిపై వేటు వేయాలని డిమాండ్లు వినిపించాయి. ఈ క్రమంలో అతడు స్వయంగా తానే కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో స్టార్ ఆల్రౌండర్, వైస్ కెప్టెన్ బెన్స్టోక్స్ ఈ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నూతన మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీతో సమావేశం అనంతరం టెస్టు కెప్టెన్సీ తీసుకునేందుకు స్టోక్స్ అంగీకరించినట్లు సమాచారం. ఇక ఈ నియామకానికి సంబంధించి పేపర్ వర్క్ పూర్తైన అనంతరం అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. రాబ్ కీ గురువారం మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించనున్నాడు. ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్స్టన్ను లేదంటే ఆస్ట్రేలియా మాజీ కోచ్ సైమన్ కటిచ్ను ఇంగ్లండ్ హెడ్కోచ్గా నియమించే యోచనలో రాబ్ కీ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మానసిక ఆందోళనల కారణంగా కొన్నాళ్లపాటు జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. యాషెస్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన అతడు.. వెస్టిండీస్తో సిరీస్లో అదరగొట్టాడు. విండీస్తో రెండో టెస్టు సందర్భంగా.. టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటుగా 150కి పైగా వికెట్లు పడగొట్టిన ఐదో ఆల్రౌండర్గా చరిత్రకెక్కాడు. చదవండి👉🏾Sanju Samson: సంజూ బాగానే ఆడుతున్నాడు.. కానీ టీమిండియాలో చోటు దక్కడం కష్టమే! -
Starc-Healy: నాడు భర్త, నేడు భార్య.. చరిత్ర సృష్టించిన ఆసీస్ జంట
మహిళల వన్డే ప్రపంచకప్ 2022 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 7వ సారి జగజ్జేతగా అవతరించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఓపెనర్ అలీసా హీలీ (138 బంతుల్లో 170; 26 ఫోర్లు) భారీ శతకంతో విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత 50 ఓవర్లల్లో 5 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ చేసింది. హీలీకి జతగా మరో ఓపెనర్ రేచల్ హేన్స్ (68), వన్ డౌన్ బ్యాటర్ మూనీ (62) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ష్రబ్సోల్ 3, ఎక్లెస్టోన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నతాలీ స్కీవర్ (121 బంతుల్లో 148 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) ఒంటరిపోరాటం చేసినప్పటికీ విజయతీరాలకు చేరలేకపోయింది. ఆసీస్ బౌలర్లు అలానా కింగ్ (3/64), జెస్ జోనాస్సెన్ (3/57), మెగాన్ షట్ (2/42) ధాటికి 43.4 ఓవర్లల్లో 285 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో నతాలీ మినహా మరే ఇతర బ్యాటర్ కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోయారు. ఈ మ్యాచ్లో భారీ శతకంతో పాటు వెస్టిండీస్తో జరిగిన సెమీస్లోనూ శతకం (129) బాదిన అలీసా హీలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా లభించింది. Alyssa Healy gives another master class in a World Cup final. 170 runs from 138 balls as Australia fly high @cricketworldcup #CWC22 #Final #TeamAustralia pic.twitter.com/ZcXNrvLMDY — Anjum Chopra (@chopraanjum) April 3, 2022 కాగా, 2022 ప్రపంచకప్లో 9 మ్యాచ్ల్లో 56.56 సగటున 2 సెంచరీలు, 2 హాఫసెంచరీల సాయంతో 509 పరుగులు చేసిన ఆసీస్ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ అలీసా హీలీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుతో పాటు మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. వన్డే, టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఏకైక మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. 🔥 Player of the Match of #T20WorldCup 2020 Final 🔥 Player of the Match of #CWC22 Final Champion, @ahealy77 👑 pic.twitter.com/TxvRbbffDy — ICC Cricket World Cup (@cricketworldcup) April 3, 2022 2020 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న హీలీ తాజాగా ఆ ఘనతను మరోసారి సాధించింది. ఇదిలా ఉంటే.. హీలీ భర్త, స్టార్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ 2015 పురుషుల వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2015లో భర్త ఆసీస్ వరల్డ్కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించగా.. తాజాగా భార్య తన దేశాన్ని ఏడోసారి జగజ్జేతగా నిలిపింది. చదవండి: World Cup 2022: భారీ విజయం.. ఓటమన్నదే ఎరుగదు.. జగజ్జేతగా ఆస్ట్రేలియా -
మైకేల్ వాన్, వసీం జాఫర్ మధ్య ట్విటర్ వార్.. కత్తులు దూసుకున్న మాజీలు
Michael Vaughan VS Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ల మధ్య ట్విటర్ వార్ తారాస్థాయికి చేరింది. క్రికెట్కు సంబంధించి తరుచూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే ఈ మాజీలు తాజాగా మరోసారి మాటల యుద్ధానికి దిగారు. వెస్టిండీస్ పర్యటనలో ఇంగ్లండ్కు ఎదురైన దారుణ పరాభవం (టీ20 సిరీస్తో పాటు టెస్ట్ సిరీస్లో ఓటమి) నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా తొలుత వసీం జాఫర్ విమర్శనాస్త్రాలు సంధించాడు. England 120 all out! What happened @MichaelVaughan was this Extras guy unavailable due to IPL or what? 😜 #WIvENG #IPL2022 pic.twitter.com/lSetnPSif5— Wasim Jaffer (@WasimJaffer14) March 27, 2022 ఈ ట్వీట్లో జాఫర్ ఇంగ్లండ్ను టార్గెట్ చేస్తూ వాన్కు చురకలు తగిలేలా వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాకు సంబంధించిన ఫోటోను (జో రూట్ 1708 పరుగులు, రోరీ బర్న్స్ 530, ఎక్స్ట్రాలు 412) షేర్ చేస్తూ.. ఇంగ్లండ్ 120 ఆలౌట్! ఏమైంది వాన్..? ఈ ఎక్స్ట్రా రన్స్ కొట్టిన ఆటగాడు ఐపీఎల్లో ఆడుతున్నాడా ఏంది..? అంటూ వాన్కు దిమ్మతిరిగిపోయే రేంజ్లో ట్వీట్ (పంచ్) చేశాడు. Wasim .. At the moment we are focusing on the Womens World Cup semis .. !!! 😜😜 https://t.co/ubwxORXKBU— Michael Vaughan (@MichaelVaughan) March 27, 2022 దీనికి మైకేల్ వాన్ కూడా అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చాడు. వసీం.. ఈ సమయంలో మేము మహిళల ప్రపంచకప్ సెమీస్ (మహిళల వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడి టీమిండియా ఇంటి బాట పట్టగా.. ఇంగ్లండ్ మాత్రం బంగ్లాదేశ్పై విజయం సాధించి సెమీస్కు చేరింది) మీద దృష్టి సారించాం అని బదులిచ్చాడు. ఈ ట్వీట్ చూసి చిర్రెత్తిపోయిన జాఫర్ వెంటనే మరో కౌంటరిస్తూ.. With just 1 win in last 17 Tests, not surprised you have given up on the men's team Michael 😜 #WIvENG #IPL2022 https://t.co/xXNO71RmeR— Wasim Jaffer (@WasimJaffer14) March 28, 2022 రూట్ సేన గత 17 టెస్ట్ల్లో ఒకే ఒక విజయం సాధించింది, ఇలాంటి చెత్త ప్రదర్శన చేసిన జట్టును ఎవరు మాత్రం పట్టించుకుంటారంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఇందుకు వాన్ ఏ విధంగా స్పందించనున్నాడోనని నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, విండీస్ పర్యటనలో ఇంగ్లండ్ 2-3 తేడాతో టీ20 సిరీస్ను, 0-1 తేడాతో టెస్ట్ సిరీస్ను కోల్పోయిన సంగతి తెలిసిందే. టెస్ట్ సిరీస్లో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్లో రూట్ సేన రెండో ఇన్నింగ్స్లో 120కే ఆలౌట్ కావడంతో విండీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకుంది. చదవండి: IPL2022: విజయానందంలో పంత్ సేన.. అంతలోనే సాడ్ న్యూస్ -
ఇంగ్లండ్ హెడ్ కోచ్గా పాల్ కాలింగ్వుడ్..
ECB Named Collingwood As Interim Head Coach: విండీస్తో త్వరలో ప్రారంభంకానున్న టెస్ట్ సిరీస్ నిమిత్తం ఇంగ్లండ్ హెడ్ కోచ్గా ఆ దేశ మాజీ ఆల్రౌండర్ పాల్ కాలింగ్వుడ్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సోమవారం ప్రకటించింది. కాలింగ్వుడ్ నియామకం తాత్కాలిక ప్రాతిపదికన జరిగినట్లు ఈసీబీ పేర్కొంది. తాజాగా విండీస్తో జరిగిన టీ20 సిరీస్ కోసం ఇంచార్జ్ కోచ్గా వ్యవహరించిన కాలింగ్వుడ్.. సెలవు నిమిత్తం కరీబియన్ దీవుల్లోనే ఉన్నాడని, ఫిబ్రవరి 25న ఇంగ్లండ్ జట్టు అక్కడి చేరుకోగానే అతను బాధ్యతలు చేపడతాడని ఈసీబీ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ వెల్లడించాడు. ఈ పర్యటనలో ఇంగ్లండ్ ఓ వార్మప్ మ్యాచ్తో పాటు 3 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. మార్చ్ 1 నుంచి విండీస్ టూర్ ప్రారంభంకానుంది. కాగా, తాజాగా జరిగిన టీ20 సిరీస్లో కాలింగ్వుడ్ ఆధ్వర్యంలోని ఇంగ్లీష్ జట్టు విండీస్ చేతిలో 2-3 తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ 2021-22లో ఆసీస్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి(0-4) బాధ్యున్ని చేస్తూ ఇంగ్లండ్ హెడ్ కోచ్ సిల్వర్వుడ్కు ఈసీబీ ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా టెస్ట్ కెప్టెన్గా రోహిత్ శర్మ పేరు ఖరారు..! -
క్రికెట్కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్
Tim Bresnan Announces Retirement: ఇంగ్లండ్కు తొలి టీ20 ప్రపంచకప్(2010) అందించిన జట్టులో కీలక సభ్యుడు, ఆ దేశ స్టార్ ఆల్రౌండర్ టిమ్ బ్రేస్నన్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను 21 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వార్విక్షైర్ కౌంటీ సోమవారం కన్ఫర్మ్ చేసింది. 🧢 685 appearances ☝️ 1,087 wickets 🏏 12,116 runs 🏆 2 Ashes wins Congratulations to former PCA rep Tim Bresnan on a truly outstanding professional career 👏 🤝 All the best with whatever comes next, Tim - the PCA will always be here to support you. pic.twitter.com/F1D0N2gJ3V — PCA (@PCA) January 31, 2022 ఇంగ్లండ్ తరఫున 23 టెస్ట్లు, 85 వన్డేలు, 34 టీ20లు ఆడిన 36 ఏళ్ల బ్రేస్నన్.. దాదాపు 1700 పరుగులు, 205 వికెట్లు పడగొట్టాడు. అతని ఖాతాలో 4 అర్ధ సెంచరీలు, 2 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. జాతీయ జట్టుతో పోలిస్తే కౌంటీ జట్టు వార్విక్షైర్తో ఎక్కువ అనుబంధం కలిగిన అతను.. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 213 మ్యాచ్ల్లో 575 వికెట్లు, 7128 పరుగులు చేశాడు. బ్రేస్నన్ ఇంగ్లండ్ యాషెస్ గెలిచిన రెండు సందర్భాల్లో కీలకంగా వ్యవహరించాడు. Thank you for the incredible memories, @timbresnan! 🤝#OnceABearAlwaysABear 🐻#YouBears pic.twitter.com/SKHiiioix9 — Warwickshire CCC 🏏 (@WarwickshireCCC) January 31, 2022 చదవండి: Shoaib Akhtar: మాంసం తింటాం, సింహాల్లా వేటాడతాం.. అదే మాకు భారత బౌలర్లకి తేడా..! -
13 సార్లు 200లోపూ ఆలౌట్.. 20 మంది ఆటగాళ్లు డకౌట్
ఇంగ్లండ్ జట్టు టెస్టుల్లో ఈ ఏడాది చెత్త రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాది ఆడిన 28 ఇన్నింగ్స్ల్లో 13 సార్లు 200లోపూ ఆలౌట్ అయింది. ఇక తాజాగా యాషెస్ సిరీస్లో భాగంగా మూడో టెస్టులో డేవిడ్ మలాన్ డకౌట్ కావడం ద్వారా మరో చెత్త రికార్డు నమోదు చేసింది. ఇంగ్లండ్ తరపున టెస్టుల్లో ఈ ఏడాది గోల్డెన్ డక్ లేదా డకౌట్ అయిన 20వ ఆటగాడిగా నిలిచాడు. మలాన్ కంటే ముందు 19 మంది ఉంటే అందులో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ సహా బెన్స్టోక్స్, ఇతర క్రికెటర్లు ఉన్నారు. చదవండి: Pat Cummins: బంతులతో భయపెట్టాడు.. చివరికి డకౌట్ చేశాడు ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్ మరో ఓటమి దిశగా పయనిస్తోంది. ఆస్ట్రేలియాను 267 పరుగులకు ఆలౌట్ చేశామన్న ఆనందం ఎక్కువసేపు నిలవకుండానే పోయింది. 82 పరుగులు తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 31 పరుగులకే నాలుగో వికెట్లు కోల్పోయి రెండోరోజు ఆటను ముగించింది. ఇంకా 51 పరుగులు వెనుకబడి ఉన్న ఇంగ్లండ్ ఓటమినుంచి తప్పించుకోవడం కష్టమే. చదవండి: James Anderson: అరె అండర్సన్.. పట్టి ఉంటే స్టన్నింగ్ క్యాచ్ అయ్యేది! -
ఆ విషయమై మెక్గ్రాత్ నన్ను విష్ కూడా చేశాడు.. ఇంగ్లండ్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Stuart Broad Reveals Awkward Moment With Glenn McGrath Ahead Of Ashes 1st Test: యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఆతిధ్య ఆసీస్ జట్టు ఇంగ్లండ్పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తుది జట్టు కూర్పుపై సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గబ్బా టెస్టులో చోటు దక్కకపోవడం నిరుత్సాహానికి గురి చేసిందని, తుది జట్టులో ఆడిన ప్లేయర్లలో ఒక్క సీమర్ కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, తుది జట్టు కూర్పు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదని పెదవి విరిచాడు. ఈ సందర్భంగా మ్యాచ్కు ముందు జరిగిన ఓ సన్నివేశం గురించి బ్రాడ్ ప్రస్తావించాడు. టాస్కి ముందు ఫీల్డ్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆసీస్ లెజెండరీ బౌలర్ గ్లెన్ మెక్గ్రాత్ తన వద్దకు వచ్చి 150వ టెస్ట్ ఆడబోతున్నందుకు శుభాకాంక్షలు తెలిపాడని, నేను అతనికి థ్యాంక్స్ కూడా చెప్పానని, తీరా చూస్తే తుది జట్టులో తన స్థానం గల్లంతు కావడంతో తలకొట్టేసినట్లయ్యిందని వాపోయాడు. తాను తుది జట్టులో ఉంటాననుకుని మెక్గ్రాత్తో పాటు చాలా మంది విష్ చేశారని, కానీ ఆఖరి నిమిషంలో తాను టీమ్లో లేనని తెలియడంతో సిగ్గుతో మొహం చాటేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధపడ్డాడు. తాను తుది జట్టులో ఆడి ఉంటే జట్టుకు ఉపయోగకరంగా ఉండేవాడినని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కాగా, బ్రాడ్ 149 టెస్టుల్లో 524 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఇంగ్లండ్ బౌలర్గా జేమ్స్ అండర్సన్(166 టెస్ట్ల్లో 633 వికెట్లు) తర్వాతి స్థానంలో ఉన్నాడు.ఇదిలా ఉంటే, తొలి టెస్ట్లో ఎదురైన పరాభవం దృష్ట్యా ఇంగ్లండ్ తుది జట్టు(రెండో టెస్ట్)లో భారీ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. బ్యాటింగ్ విభాగంలో పలు మార్పులతో పాటు స్టువర్ట్ బ్రాడ్, మరో సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్లకు తుది జట్టులో చోటు దక్కడం ఖాయమని సమాచారం. చదవండి: యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియాకు బిగ్షాక్.. డేవిడ్ వార్నర్కు గాయం -
2008లో ఇంగ్లండ్ ఏం చేసిందో మరవొద్దు.. ఉగ్రదాడి జరిగినా..!
IND VS ENG 5th Test Reschedule: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరిదైన ఐదో టెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్ సమయానికి మూడు గంటల ముందు రద్దైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై బీసీసీఐ, ఈసీబీల మధ్య చర్చలు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ను వచ్చే ఏడాది భారత పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్తో పాటు నిర్వహించాలని ఇరు బోర్డులు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణపై బీసీసీఐ ప్రతిపాదనను భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్వాగతించాడు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాడు. 2008లో ముంబై దాడులు ప్రారంభమైన రోజున (నవంబర్ 26) కటక్లో భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే మ్యాచ్ జరగాల్సి ఉండింది. దాడుల కారణంగా 7మ్యాచ్ల సిరీస్లోని చివరి రెండు వన్డేలను రద్దయ్యాయి. దాంతో ఇంగ్లండ్ క్రికెటర్లు స్వదేశానికి వెళ్లిపోయారు. దాడుల నేపథ్యంలో ఆ తర్వాత జరగాల్సిన 2 మ్యాచ్ల టెస్టు సిరీస్పై సందిగ్ధత నెలకొంది. అయితే టెస్టు సిరీస్ ఆడటానికి ఇంగ్లండ్ జట్టు భారత్కు తిరిగి రావడంతో అప్పట్లో ఆ జట్టుపై ప్రశంసల వర్షం కురిసింది. షెడ్యూల్లో ఉన్న ప్రకారం అహ్మదాబాద్, ముంబైలో కాకుండా అహ్మదాబాద్, చెన్నైలలో ఆ రెండు మ్యాచ్లు జరిగాయి. ఈ సిరీస్లో కెవిన్ పీటర్సన్ నేతృత్వంలోని ఇంగ్లీష్ జట్టు భారత్ చేతిలో 0-1తో ఓడింది. కాగా, సునీల్ గవాస్కర్ ఆ విషయాన్ని గుర్తుచేస్తూ.. 2008లో ఇంగ్లండ్ చూపిన సానుకూల ధోరణిని మరచిపోకూడదని, ఉగ్రదాడి తర్వాత టెస్టు సిరీస్ కోసం ఇంగ్లీష్ జట్టు మళ్లీ భారత్కు వచ్చిందని, ఇప్పుడు మనం కూడా అందుకు కృతజ్ఞత చూపాలని కోరాడు. నాడు ఇంగ్లండ్ జట్టు ఉగ్రదాడి తర్వాత కూడా భారత్లో పర్యటించిందంటే.. అది కేవలం నాటి కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చొరవ వల్లేనన్నాడు. చదవండి: ఒక్క టెస్ట్ మ్యాచ్ రద్దవడం వల్ల ఇంత భారీ నష్టమా..? -
ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడండి.. టీమిండియా దెబ్బ తిన్న పులిలా గర్జిస్తుంది
లండన్: విజయోత్సాహంలో ఉన్న ఇంగ్లండ్ జట్టును ప్రముఖ వ్యాఖ్యాత, ఆ దేశ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ అలర్ట్ చేశాడు. 78 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడింది కదా అని టీమిండియాను తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో 36 పరుగులకే ఆలౌటై ఆ తర్వాత ఊహించని రీతిలో చెలరేగి, సిరీస్ కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశాడు. టీమిండియాను ఏమాత్రం తక్కువ అంచనా వేసినా.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆడకపోతే.. కోహ్లి సేన దెబ్బ తిన్న పులిలా గర్జిస్తుందని, దీంతో సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. ఘోర పరాజయాల అనంతరం ఎలా పుంజుకోవాలో టీమిండియాకు బాగా తెలుసని, దీనికి చరిత్రే సాక్షమని తెలిపాడు. ఇక లార్డ్స్ టెస్ట్లో చిరస్మరణీ విజయాన్నందుకున్న టీమిండియా.. లీడ్స్ టెస్ట్లో 78 పరుగులకే ఆలౌటై, ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఫలితంగా 5 టెస్ట్ల సిరీస్ 1-1తో సమమైంది. రేపటి నుంచి ఇరు జట్ల మధ్య ఓవల్ వేదికగా కీలకమైన నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. చదవండి: ఆండర్సన్కు ఇదే ఆఖరి సిరీస్.. ఐదో టెస్ట్ అనంతరం రిటైర్మెంట్..? -
వికెట్లను కాకుండా వ్యక్తులను టార్గెట్ చేయడమేంటి..?
లండన్: టీమిండియాతో లార్డ్స్ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్టులో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న ఇంగ్లండ్ జట్టు తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటోంది. సొంత తప్పిదంతోనే మ్యాచ్ ఓడిపోయారని బ్రిటీష్ మీడియా సహా ఆ దేశ అభిమానులు, మాజీలు దుమ్మెత్తిపోస్తున్నారు. చేతుల్లోకి వచ్చిన మ్యాచ్ని పక్కకు పెట్టి, బుమ్రాపై ప్రతీకారానికి వెళ్లిన ఇంగ్లండ్ జట్టు తగిన మూల్యం చెల్లించుకుందని బీబీసీ ఏకి పారేసింది. ఈ ఘోర పరాభవానికి రూట్ చెత్త కెప్టెన్సీనే కారణమని, అసలు టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించడమే తప్పుడు నిర్ణయమని ధ్వజమెత్తింది. షమీ, బుమ్రాల విషయంలో ఇంగ్లీష్ బౌలర్ల అంచనా తప్పిందని, వికెట్లు తీయడానికి బదులు ఆటగాళ్లపై భౌతిక దాడికి ప్రయత్నించమే ఇంగ్లీష్ జట్టు కొంపముంచిందని బీబీసీ పేర్కొంది. ఓ పక్క స్కోరు పెరుగుతున్నా.. ఇంగ్లండ్ బౌలర్ల తీరు మారలేదని, తీరా పరిస్థితి చేతులు దాటాక ఏం చేయలేక చేతులెత్తేశారని మండిపడింది. 1980లో వెస్టిండీస్, 1990-2000లో ఆస్ట్రేలియా ఎంత బలంగా ఉన్నాయో.. ఇప్పుడు భారత్ కూడా అంతే బలంగా ఉందని ప్రముఖ ఫోర్బ్స్ వార్తా సంస్థ టీమిండియాను ఆకాశానికెత్తింది. మరోవైపు, లార్డ్స్ టెస్ట్లో ఇంగ్లండ్ జట్టు ఘోర వైఫల్యాలపై ఆ దేశ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్కాట్ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఆటగాళ్ల కుతంత్రాలే ఇంగ్లండ్ విజయావకాశాలను దెబ్బ తీసాయని మండిపడ్డాడు. వికెట్ల మీదికి కాకుండా.. షమీ, బుమ్రాల వైపు బంతులేయడమేంటని ఆయన ఇంగ్లండ్ బౌలర్లను నిలదీశాడు. బుమ్రాని టార్గెట్ చేసి.. షమీని ఔట్ చేయడంలో నిర్లక్ష్యం వహించారని చురకలంటించాడు. కాగా, ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో బుమ్రా-షమీ జోడీ 9వ వికెట్కి అజేయంగా 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. దీంతో కోహ్లీ సేన.. ఇంగ్లండ్కు 272 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఛేదనలో టీమిండియా పేసర్ల ధాటికి రూట్ సేన 120 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (33) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా టీమిండియా 151 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. చదవండి: అక్కడ కూడా నవ్వలేదు.. ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్పై ప్రధాని మోదీ ఫిర్యాదు -
ఇంటికి చేరిన ఇంగ్లండ్ క్రికెటర్లు
-
ఇంటికి చేరిన ఇంగ్లండ్ క్రికెటర్లు
న్యూఢిల్లీ: ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడటంతో వివిధ ఫ్రాంచైజీలలో భాగంగా ఉన్న విదేశీ క్రికెటర్లు బయో బబుల్ను వదిలి తమ దేశాలకు బయలుదేరారు. పలువురు ఆటగాళ్లు ఇప్పటికే స్వస్థలాలకు చేరుకోగా... మరికొందరు ఆయా దేశాల ఆంక్షలు, నిబంధనల ప్రకారం తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భారత క్రికెటర్లు దాదాపు అంతా తమ సొంత నగరాలకు వెళ్లిపోయారు. కరోనా సోకిన ఆటగాళ్లు ఉన్న టీమ్లలో కూడా మిగిలిన వారికి పరీక్షలు నిర్వహించి నెగెటివ్గా తేలితే ఫ్రాంచైజీలు పంపించేందుకు సిద్ధమయ్యాయి. విదేశీ క్రికెటర్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ మినహా మిగతా దేశాలకు చెందిన క్రికెటర్లు ఎలాంటి సమస్య లేకుండా వెళ్లిపోతున్నారు. న్యూజిలాండ్: ఐపీఎల్లో ఉన్న 17 మంది న్యూజిలాండ్ ఆటగాళ్లు రెండు బృందాలుగా విడిపోయారు. ఇందులో ఒక బృందం స్వదేశానికి వెళ్లనుండగా, మిగిలిన ఆటగాళ్లు ఇంగ్లండ్కు వెళతారు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్, ఆపై భారత్తో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో, ఇంగ్లండ్ టి20 బ్లాస్ట్లో పాల్గొనేందుకు కివీస్ ఆటగాళ్లు విలియమ్సన్, బౌల్ట్, జేమీసన్, సాన్ట్నర్, ఫెర్గూసన్, నీషమ్, ఫిన్ అలెన్ ఇంగ్లండ్ వెళతారు. అయితే వీరంతా మే 10 వరకు భారత్లోనే ఉండనున్నారు. ఆపై ఇంగ్లండ్ ప్రభుత్వం సడలించే ఆంక్షలను బట్టి బయల్దేరతారు. ఫ్లెమింగ్, మెకల్లమ్, మిల్స్, షేన్ బాండ్ తదితరులు న్యూజిలాండ్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరికి ప్రభుత్వ పరంగా సమస్య లేదు కానీ ప్రయాణించేందుకు విమానాలు మాత్రం లేవు. ఐపీఎల్లో ఒకటి, రెండు ఫ్రాంచైజీలు కలిసి వీరి కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇంగ్లండ్: ఐపీఎల్లో భాగంగా ఉన్న 11 మంది ఇంగ్లండ్ క్రికెటర్లలో ఎనిమిది మంది లండన్కు చేరుకున్నారు. బట్లర్, మొయిన్ అలీ, స్యామ్ కరన్, టామ్ కరన్, వోక్స్, బెయిర్స్టో, జేసన్ రాయ్, స్యామ్ బిల్లింగ్స్ బుధవారం ఉదయమే హీత్రూ విమానాశ్రయానికి వచ్చారని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. మరో ముగ్గురు ఇంగ్లండ్ ఆటగాళ్లు మోర్గాన్, జోర్డాన్, మలాన్ రెండు రోజులు ఆలస్యంగా బయలుదేరుతారు. వీరంతా అక్కడి నిబంధనల ప్రకారం పది రోజుల పాటు ప్రభుత్వ అనుమతి పొందిన హోటల్లలో క్వారంటైన్లో ఉంటారు. ఆస్ట్రేలియా: ఆసీస్ క్రికెటర్లు భారత్ వీడటంపై మాత్రం స్పష్టత వచ్చేసింది. నేరుగా తమ దేశంలోనికి అనుమతి లేదని తెలుసు కాబట్టి ప్రత్యామ్నాయంగా వీరంతా మాల్దీవులను ఎంచుకున్నారు. ఆటగాళ్ల కోసం ప్రత్యేక సడలింపులు ఏమీ లేవు కాబట్టి సుమారు 40 మంది ఆస్ట్రేలియన్లు రెండు వారాలు మాల్దీవులలో గడిపిన తర్వాతే స్వదేశానికి వెళతారు. బీసీసీఐ వీరి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. ముందుగా మాల్దీవులకు, అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్లేందుకు కూడా బోర్డు బాధ్యత తీసుకుంటోంది. బుధవారం వీరంతా ఢిల్లీకి చేరుకొని ఒకటి, రెండు రోజుల్లో ఇక్కడి నుంచి బయలుదేరుతారు. కరోనా పాజిటివ్గా తేలిన మైక్ హస్సీ మాత్రం భారత్లోనే కనీసం పది రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నాడు. -
ప్రాక్టీస్కు లైన్ క్లియర్..
సాక్షి, చైన్నై: భారత పర్యటనలో భాగంగా కరోనా పరీక్షలు చేయించుకున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు లైన్ క్లియర్ అయ్యింది. స్టాఫ్తో సహా జట్టు సభ్యులందరికీ కరోనా పరీక్షల్లో నెగిటివ్గా తేలింది. ఇటీవల శ్రీలంక పర్యటనను ముగించుకొని నేరుగా భారత్కు చేరుకున్న ఇంగ్లండ్ జట్టు ఆరు రోజుల పాటు క్వారంటైన్లో గడిపింది. ఈ ఆరు రోజుల క్వారంటైన్ సెషన్లో ఇంగ్లండ్ జట్టు సభ్యులందరికీ మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా, సభ్యులందరికీ మూడింటిలో నెగిటివ్గా తేలింది. దీంతో ఊపిరి పీల్చుకున్న ఇంగ్లండ్ జట్టుకు, ఈనెల 5న ప్రారంభంకానున్న తొలి టెస్ట్కు ముందు మూడు రోజులు ప్రాక్టీస్ చేసే అవకాశం లభించింది. ఇంగ్లీష్ జట్టు మొత్తం రేపు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు సాగే తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటారు. కాగా, జట్టుతో పాటు శ్రీలంక పర్యటనకు వెళ్లని ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, రాయ్ బన్స్లు కొద్ది రోజుల కిందటే భారత్కు చేరుకొని(క్వారంటైన్ ముగించుకొని) ప్రాక్టీస్ను మొదలు పెట్టారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు కూడా రేపటి ప్రాక్టీస్ సెషన్లో జట్టుతో కలుస్తారు. మరోవైపు భారత ఆటగాళ్లు కూడా క్వారంటైన్ సెషన్ను ముగించుకొని, రేపటి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనేందుకు సిద్దమయ్యారు. ఇరు జట్ల మధ్య జరిగే తొలి రెండు టెస్టులకు(ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 13) చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక కానుండగా, మూడు(ఫిబ్రవరి 24), నాలుగు(మార్చి 4) టెస్టులు అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగనున్నాయి. ఆతరువాత ప్రారంభమయ్యే 5 టీ20 మ్యాచ్లకు(మార్చి 12,14,16,18,20) కూడా అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ స్టేడియమే వేదిక కానుంది. ఆతరువాత ఇరు జట్ల మధ్య జరిగే 3 వన్డే మ్యాచ్లకు(మార్చి 23, 26, 28) పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదిక కానుంది. -
అభిమాని బిత్తిరి చర్య.. మ్యాచ్కు అంతరాయం..!
చెస్టర్ లీ స్ట్రీట్: ఆతిథ్య ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్లో ఓ అభిమాని వెర్రివేషాలు వైరల్ అయ్యాయి. కివీస్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సెక్యురిటీ సిబ్బంది కళ్లుగప్పి ఓ వ్యక్తి బట్టల్లేకుండా మైదానంలో పరుగులు తీశాడు. దీంతో ఆటగాళ్లతోపాటు, మ్యాచ్ వీక్షిస్తున్న అభిమానులు షాక్కు గురయ్యారు. కాసేపు ఆటకు అంతరాయం కలిగింది ఆ సమయంలో టామ్ లాథమ్, మిచెల్ సాంట్నర్ క్రీజులో ఉన్నారు. వారి ఎదుటకు చేరిన ఆ అభిమాని చిందులు వేశాడు. తేరుకున్న భద్రతా సిబ్బంది తొలుత అతన్ని అవతారాన్ని బట్టలో కప్పేశారు. అనతంరం.. బయటికి లాక్కెళ్లారు. (చదవండి : ఇంగ్లండూ వచ్చేసింది) అయితే, సెక్యురిటీ సిబ్బంది అలక్ష్యం, వారు నింపాదిగా స్పందించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇక 306 పరుగుల టార్గెట్తో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ అప్పటికీ 145/6 గా ఉంది. కాగా, ఈ మ్యాచ్లో 119 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఇంగ్లండ్ సెమీస్ చేరింది. 27 ఏళ్ల అనంతరం ఇంగ్లండ్ వరల్డ్కప్ సెమీస్ చేరడం విశేషం. అంతకుముందు 1992 ప్రపంచకప్లో ఆ జట్టు సెమీస్ చేరింది. ఇక వరుసగా మూడు పరాజయాలు మూటగట్టుకున్న కివీస్ నాలుగో స్థానంలో నిలిచింది. ఆ జట్టు సెమీస్ చేరడం లాంఛనమే..! (చదవండి : కనీసం 316 పరుగులతో గెలవాలి..అయితేనే..) -
ఇంగ్లండూ వచ్చేసింది
చెస్టర్ లీ స్ట్రీట్: హాట్ ఫేవరెట్గా ప్రపంచ కప్ను మొదలుపెట్టి, ఓ దశలో అనూహ్య ఓటములతో ముప్పు కొనితెచ్చుకున్న ఆతిథ్య ఇంగ్లండ్... కీలక సమయంలో జూలు విదిల్చి 1992 తర్వాత ప్రపంచకప్లో మళ్లీ సెమీఫైనల్ మెట్టెక్కింది. ఆ జట్టు బుధవారం న్యూజిలాండ్ను 119 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఓపెనర్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జానీ బెయిర్స్టో (99 బంతుల్లో 106; 15 ఫోర్లు, సిక్స్) వరుసగా రెండో మ్యాచ్లోనూ సెంచరీ బాదాడు. మరో ఓపెనర్ జేసన్ రాయ్ (61 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధ శతకం చేశాడు. కెప్టెన్ మోర్గాన్ (40 బంతుల్లో 42; 5 ఫోర్లు) రాణించాడు. నీషమ్ (2/41), హెన్రీ (2/54), బౌల్ట్ (2/56) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేదనలో లాథమ్ (65 బంతుల్లో 57; 5 ఫోర్లు) మినహా మరెవరూ నిలవకపోవడంతో న్యూజిలాండ్ 45 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. ఎంతో అనుకుంటే...! 194/1... సరిగ్గా 30 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరిది. అప్పటికి బెయిర్స్టో శతకం (95 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. రూట్ (24) కుదురుకున్నాడు. దీంతో 350 పైగానే చేసేలా కనిపించింది. కానీ, వీరిద్దరినీ వరుస ఓవర్లలో ఔట్ చేసి బౌల్ట్, హెన్రీ పరిస్థితిని మార్చివేశారు. మోర్గాన్ నిలిచినా బట్లర్ (11), స్టోక్స్ (11), వోక్స్ (4)లను పెవిలియన్ చేర్చి కివీస్ బౌలర్లు పైచేయి సాధించారు. ప్లంకెట్ (15 నాటౌట్), రషీద్ (16) శక్తిమేర పోరాడి 300 దాటించారు. అంతకుముందు రాయ్, బెయిర్ స్టో ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నారు. వీరి ధాటికి 15 ఓవర్లలోపే స్కోరు 100 దాటింది. నీషమ్ బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రాయ్ మరుసటి బంతికి ఔటవడంతో 123 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కివీస్ పోరాడకుండానే... ఓపెనర్లు నికోల్స్ (0), గప్టిల్ (8) పేలవ ఫామ్ కొనసాగడంతో ఛేదనలో న్యూజిలాండ్ ముందే తేలిపోయింది. మూడో వికెట్కు 47 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను గాడిన పెడుతున్న సమయంలో తొలుత కెప్టెన్ విలియమ్సన్ (40 బంతుల్లో 27; 3 ఫోర్లు), తర్వాత రాస్ టేలర్ (42 బంతుల్లో 28; 2 ఫోర్లు) దురదృష్టవశాత్తు రనౌటయ్యారు. ఆల్రౌండర్లు నీషమ్ (19), గ్రాండ్హోమ్ (3) విఫలమయ్యారు. దీంతో కివీస్ ఏ దశలోనూ లక్ష్యాన్ని అందుకునేలా కనిపించలేదు. ఓటమి ఖాయమైన నేపథ్యంలో మిగతావారి పోరాటం పరుగుల అంతరాన్ని తగ్గించేందుకు మాత్రమే ఉపయోగపడింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) సాన్ట్నర్ (బి) నీషమ్ 60; బెయిర్స్టో (బి) హెన్రీ 106; రూట్ (సి) లాథమ్ (బి) బౌల్ట్ 24; బట్లర్ (సి) విలియమ్సన్ (బి) బౌల్ట్ 11; మోర్గాన్ (సి) సాన్ట్నర్ (బి) హెన్రీ 42; స్టోక్స్ (సి) హెన్రీ (బి) సాన్ట్నర్ 11; వోక్స్ (సి) విలియమ్సన్ (బి) నీషమ్ 4; ప్లంకెట్ (నాటౌట్) 15; రషీద్ (బి) సౌతీ 16; ఆర్చర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 305. వికెట్ల పతనం: 1–123, 2–194, 3–206, 4–214, 5–248, 6–259, 7–272, 8–301. బౌలింగ్: సాన్ట్నర్ 10–0–65–1; బౌల్ట్ 10–0–56–2; సౌతీ 9–0–70–1; హెన్రీ 10–0–54–2; గ్రాండ్హోమ్ 1–0–11–0; నీషమ్ 10–1–41–2. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 8; నికోల్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వోక్స్ 0; విలియమ్సన్ (రనౌట్) 27; టేలర్ (రనౌట్) 28; లాథమ్ (సి) బట్లర్ (బి) ప్లంకెట్ 57; నీషమ్ (బి) వుడ్ 19; గ్రాండ్హోమ్ (సి) రూట్ (బి) స్టోక్స్ 3; సాన్ట్నర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వుడ్ 12; సౌతీ (నాటౌట్) 7; హెన్రీ (బి) వుడ్ 7; బౌల్ట్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 4; ఎక్స్ట్రాలు 14; మొత్తం (45 ఓవర్లలో ఆలౌట్) 186. వికెట్ల పతనం: 1–2, 2–14, 3–61, 4–69, 5–123, 6–128, 7–164, 8–166, 9–181, 10–186. బౌలింగ్: వోక్స్ 8–0–44–1; ఆర్చర్ 7–1–17–1; ప్లంకెట్ 8–0–28–1; వుడ్ 9–0–34–3; రూట్ 3–0–15–0; రషీద్ 5–0–30–1; స్టోక్స్ 5–0–10–1. -
వరల్డ్ కప్ ఫేవరెట్ ఆ టీమే..!
సిడ్నీ: క్రికెట్ ప్రపంచ కప్ మహాసంగ్రామం ఆరంభమవడానికి కేవలం 10 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అన్ని దేశాల జట్లు తుది ఎలెవెన్పై కసరత్తులు చేస్తోండగా మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు మాత్రం తమ ఫేవరెట్ జట్లు ఫలానా అని వెల్లడిస్తున్నారు. నిన్నటికి నిన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత నాసీర్ హుస్సేన్ ఇండియానే అత్యంత ప్రమాదకర జట్టని, దానికే కప్ గెలిచే అవకాశాలు ఎక్కువ అని తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జాబితాలో మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియాకు రెండు సార్లు వరల్డ్ కప్ అందించిన రికీ పాంటింగ్ చేరారు. ఈ సారి వరల్డ్ కప్ హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్ అని పంటర్ పేర్కొన్నారు. అలాగే ఈ వరల్డ్ కప్లో సంచలనాలు నమోదవడానికి కూడా అవకాశాలున్నాయని, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ టీంలు ఆ కోవలోకి వస్తాయని ఆయన అన్నారు. ‘బలమైన బ్యాటింగ్ లైనప్తో ఇంగ్లండ్ బలంగా కనిపిస్తోంది. గత కొంత కాలంగా మోర్గాన్ నాయకత్వంలో ఇంగ్లండ్ టీం అంచనాలకు మించి రాణిస్తోంది. సొంత గడ్డపై ఆడుతుండడం ఆ జట్టుకు సానుకూల అంశం. అదే విధంగా 7వ నెంబర్ వరకు దాటిగా బ్యాటింగ్ చేయడం కలిసొచ్చే అంశం. అయితే ఇండియా, ఆస్ట్రేలియా రూపంలో ఇంగ్లండ్ బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొనవలసి ఉంది’అని ఈ మాజీ సారధి జోస్యం చెప్పాడు. మే 30వ తేదీ నుంచి వరల్డ్కప్ సమరం ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. -
ఇండియా రికార్డు బద్దలు
నాటింగ్హామ్: గతంలో వన్డేల్లో 300 పరుగులను చేధించడమంటే చాలా కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం 300 లక్ష్యం అనేది చాలా చిన్న విషయంలా మారిపోయింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన నాలుగో వన్డేలో పాకిస్తాన్ నిర్ధేశించిన 341 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ అలవోకగా సాధించింది. మూడు రోజుల వ్యవధిలో 340 అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని రెండు సార్లు చేధించిన జట్టుగా ఇంగ్లండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో వన్డేల్లో 340 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యధికంగా నాలుగుసార్లు ఛేదించిన తొలి జట్టుగా నిలిచింది. గతంలో భారత్ మూడుసార్లు ఈ ఘనత సాధించగా అది కాస్త ఇప్పుడు కనుమరుగైంది. -
ఛీ.. క్రీడాస్పూర్తి మరిచిన బౌలర్!
లండన్ : ఇంగ్లండ్ లోకల్ క్రికెట్ లీగ్లో ఓ బౌలర్ క్రీడా స్పూర్తి మరిచి క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సదరు బౌలర్, లీగ్ నిర్వాహకులపై అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. విజయానికి రెండు పరుగులు .. 98 పరుగులతో బ్యాట్స్మన్ కెరీర్లో తొలి సెంచరీకి చేరువగా ఉన్నాడు.. కానీ బౌలర్ మాత్రం క్రీడాస్పూర్తిని మరిచి, కావాలనే నోబాల్ వేసి బంతి బౌండరీకి వెళ్లేలా చేశాడు. దీంతో తొలి సెంచరీ చేయాలనుకున్న బ్యాట్స్మన్ నిరాశగా వెనుదిరిగాడు. సొమరెస్ట్ క్రికెట్ లీగ్లో భాగంగా మైన్హెడ్ క్రికెట్ క్లబ్, పర్నెల్ క్రికెట్ క్లబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మైన్హెడ్ బ్యాట్స్మన్ జాయ్ డారెల్ సెంచరీకి దగ్గరగా ఉండగా.. పర్నెల్ జట్టు బౌలర్ అమానుషంగా ప్రవర్తించి నోబాల్తో సెంచరీ అడ్డుకున్నాడు. ఈ ఘటనపై మైన్హెడ్ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీవితంలో క్రికెట్లోనే ఇదో అత్యంత చెత్త ఘటనగా అభివర్ణిస్తూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఇక పర్నెల్ జట్టు కెప్టెన్ మాత్రం బ్యాట్స్మన్కు క్షమాపణలు తెలిపినట్లు మైన్హెడ్ క్రికెట్ క్లబ్ పేర్కొంది. క్రికెట్ జెంటిల్ మెన్ గేమ్ అని ఆటగాళ్లు క్రీడాస్పూర్తిని మరచి ప్రవర్తించకూడదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇలాంటి ఘటనలు అంతర్జాతీయ క్రికెట్లోను చోటుచేసుకున్నాయి. 2010లో వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీని అడ్డుకోని శ్రీలంక బౌలర్ సురజ్ రన్దీవ్ క్రీడాస్పూర్తిని మరిచి విమర్శల పాలయ్యాడు. 99 పరుగుల వద్ద ఉన్న సెహ్వాగ్ను పరుగుతీయనివ్వకుండా నోబాల్ వేసి అడ్డుకున్నాడు. దీంతో ఓ మ్యాచ్ నిషేదం కూడా ఎదుర్కొన్నాడు. కరేబియన్ ప్రిమీయర్ లీగ్లో కీరన్ పోలార్డ్, ఎవిన్ లూయిస్ శతకాన్ని అడ్డుకోని ఇలానే విమర్శల పాలయ్యాడు. -
క్రికెట్లో అత్యంత చెత్త రికార్డు..!
లండన్ : క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదైంది. క్రికెట్ అంటే బ్యాట్స్మెన్కు అనుకూలం అనే వారందరు ఈ మ్యాచ్ గణంకాలను పరిశీలిస్తే ముక్కున వేలేయాల్సిందే! అవును మరి అంతలా విలవిలాడిపోయారు బ్యాట్స్మెన్. 11.2 ఓవర్లాడి కేవలం 18 పరుగులకే చాపచుట్టేసారంటే బౌలర్లు ఎంత బెంబేలెత్తించారో అర్థమవుతోంది. షెఫర్డ్ నీమ్ కెంట్ క్రికెట్ లీగ్లో భాగంగా.. బెకెన్హామ్ సీసీ, బెక్స్లీ సీసీల మధ్య గత శనివారం జరిగిన మ్యాచ్లో ఈ చెత్త రికార్డు నమోదైంది. తొలుత టాస్ గెలిచిన బెకెన్హామ్ సీసీ బ్యాటింగ్కు దిగి 18 పరుగులకే కుప్పకూలింది. ఇందులో ఐదుగురు బ్యాట్స్మెన్ డకౌట్ కాగా.. ముగ్గురు సింగిల్ మాత్రమే సాధించడం విశేషం. స్కాట్లాండ్ తరఫున 57 అంతర్జాతీయ వన్డేలు ఆడిన కాలమ్ మెక్లియోడ్ బెక్స్లీ తరపున 6 వికెట్లతో చెలరేగాడు. అనంతరం 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెక్స్లీ జట్టు 12 నిమిషాల్లో ఛేదించింది. దీంతో 61 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. ఈ దెబ్బకు 152 ఏళ్ల ఈ క్లబ్ చరిత్రలో అత్యంత తక్కువ స్కోరు నమోదు కావడమే కాకుండా లీగ్లోనూ ఇదే అత్యల్పం కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ మ్యాచ్ విశేషాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
టెండూల్కర్ ని కిడ్నాప్ చేయాలి..!
బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ భారత క్రికెట్ సంచలనం సచిన్ టెండూల్కర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో టూర్ లో అష్టకష్టాలు పడుతున్న ఇంగ్లాండ్ టీంకు శిక్షణ ఇవ్వడానికి సచిన్ ను కిడ్నాప్ చేయాలంటూ చమత్కరించారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ లో పాల్గొంటున్న కామెరూన్ శనివారం ఈ కమెంట్స్ చేశారు. ప్రస్తుతం దేశంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న సిరీస్ ని దృష్టిలో పెట్టుకుని కామెరూన్ చతురోక్తులు విసిరారు. టెండూల్కర్ ని కిడ్నాప్ చేసి, తమ ఆటగాళ్లకు ట్రయినింగ్ ఇప్పించాలన్నారు. మరోవైపు సచిన్ కూడా సమావేశానికి హాజరు కానున్నారు. తాను ఇండియాకువచ్చిన ప్రతీసారీ దేశ పురోగతి, సామర్థ్యాన్ని చూసి ఎంతో ముగ్ధుణ్నవుతున్నానని వ్యాఖ్యానించారు. దీంతో సభలో చప్పట్లుమారు మోగాయి. ఇరుదేశాలమధ్య చరిత్ర, సంస్కృతి భాగస్వామ్యంతోపాటు ఉద్యోగాలు, పెట్టుబడులు ఆధారంగా "ఆధునిక భాగస్వామ్యం" పట్ల తనకు మక్కువ ఎక్కువన్నారు. కాగా ఇంగ్లాండ్ -భారత్ మధ్య జరుగుతున్న అయిదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో రెండింటినీ భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
కోహ్లి బాల్ ట్యాంపరింగ్: సెహ్వాగ్ ఫైర్
బ్రిటిష్ మీడియాపై మండిపడిన నజబ్గఢ్ నవాబ్ ముంబై: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి బాల్ ట్యాంపరింగ్కు పాల్పడ్డాడంటూ బ్రిటీష్ మీడియా కథనాలు వండివార్చడంపై మాజీ క్రికెటర్, నజబ్గఢ్ వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డాడు. ఇలాంటి అర్థంలేని ఆరోపణలు చేయడం కన్నా విశాటపట్నంలో జరిగిన రెండో టెస్టులో ఓటమిని ఇంగ్లండ్ గౌరవప్రదంగా అంగీకరించి ఉంటే.. ఆ జట్టు గౌరవం పెరిగేదని వ్యాఖ్యానించాడు. ‘ఓడిపోయే జట్టు ఎప్పుడూ కొన్ని అంశాలు లేవనెత్తి లబ్ధి పొందాలని చూస్తుందని ఆయన ‘హిందూస్తాన్ టైమ్స్’ తో మాట్లాడుతూ అన్నారు. రాజ్కోట్లో మొదటి టెస్టు సందర్భంగా విరాట్ కోహ్లి బాల్ను ట్యాంపర్ చేస్తున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వెలుగుచూసింది. చూయింగమ్ నములుతూ ఉన్న కోహ్లి తన లాలాజలాన్ని బాల్కు రుద్ది.. అది మెరిసేలా చేశాడని, ఇది బాల్ ట్యాంపరింగ్యేనని ఆరోపిస్తూ బ్రిటన్ మీడియా కథనాలు రాసింది. ఇలా లాలాజలముతో బాల్ను ట్యాపరింగ్ చేసినందుకు ఇప్పటికే ఐసీసీ దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్కు జరిమానా విధించింది. అయితే, బ్రిటన్ మీడియా కథనాలపై సెహ్వాగ్ ఘాటుగా స్పందించాడు.‘ ఇంగ్లండ్ జట్టు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ ఆ దేశ మీడియానే ఇలాంటి రాతలు రాస్తున్నది. ఓటమిని కూడా గౌరవప్రదంగా అంగీకరించాలి. విదేశాల్లో ఓడిపోయినప్పుడు మేం ఎప్పుడూ సాకులు చెప్పలేదు. మేం ఆడలేనందువల్లే ఓడిపోయాం అని మేం గతంలో హుందాగా ఒప్పుకొనేవాళ్లం’ అంటూ బ్రిటన్ మీడియాను ఆయన తప్పుబట్టాడు. -
చివరి బంతికి సిక్స్... మ్యాచ్ టై
నాటింగ్ హామ్: శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ 'టై'గా ముగిసింది. రెండు జట్లు సమాన స్కోరు సాధించడంతో ఫలితం తేలలేదు. విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడిన ఈ మ్యాచ్ నాటకీయ ఫక్కీలో డ్రా అయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. మాథ్యూస్(73), ప్రసన్న(59) అర్ధసెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, విలే, ప్లంకెట్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అలీ ఒక వికెట్ దక్కించుకున్నాడు. 287 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన ఇంగ్లీషు టీమ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ చివరి వరకు అద్భుతంగా పోరాడింది. లోయర్ ఆర్డర్ లో ప్లంకెట్ మెరుపు ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను 'టై'గా ముగించాడు. చివరి బంతికి సిక్స్ బాదడంతో మ్యాచ్ డ్రా అయింది. 10వ స్థానంలో బ్యాటింగ్ దిగిన పంక్లెట్ 11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ తో 22 పరుగులు బాదాడు. వోక్స్(95), బట్లర్(92), మోర్గాన్(43) రాణించారు. శ్రీలంక బౌలర్లలో లక్మాల్, మాథ్యూస్, ప్రదీప్ రెండేసి వికెట్లు తీశారు. వోక్స్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. -
ఇంగ్లండ్ రికార్డు విజయం
బర్మింగ్ హామ్: జాస్ బట్లర్, జో రూట్ సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లండ్ రికార్డు విజయం సాధించింది. కివీస్ ను భారీ తేడాతో చిత్తు చేసింది. న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లీషు సేన 210 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ జట్టుకు ఇదే అతిపెద్ద విజయం. 1975 ప్రపంచకప్ లో భారత్ ను 202 పరుగుల తేడాతో ఓడించిన రికార్డును ఇంగ్లండ్ చెరిపేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంగ్లీషు టీమ్ నిర్దేశించిన 409 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన కివీస్ సేన 31.1 ఓవర్లలో 198 పరుగులకే చాపచుట్టేసింది. రాస్ టేలర్(57) టాప్ స్కోరర్ గా నిలిచాడు. విలియమ్సన్ 45 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్, ఆదిల్ రషీద్ నాలుగేసి వికెట్లు పడగొట్టారు. జొర్డాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జాస్ బట్లర్ (105 బంతుల్లో 129; 13 ఫోర్లు, 5 సిక్సర్లు), జో రూట్ (78 బంతుల్లో 104; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగవంతమైన శతకాలతో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరు సాధించింది. వన్డేల్లో ఇంగ్లండ్ కు ఇదే అత్యధిక స్కోరు. బట్లర్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కించుకున్నాడు. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్ లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. -
వన్డే కెప్టెన్సీ వదలను: కుక్
బర్మింగ్హామ్: ఇంగ్లీషు గడ్డపై ధోనిసేన వన్డే సిరీస్ కైవసం చేసుకోవడంతో ఇంగ్లండ్ కెప్టెన్ ఆలియస్టర్ కుక్ పై ఒత్తిడి పెరుగుతోంది. వరుసగా మూడు వన్డేలు ఓడిపోవడంతో అతడు విపరీత ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. అయితే తాను వన్డే కెప్టెన్ గా కొనసాగుతానని కుక్ స్పష్టం చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో నాయకత్వాన్ని వదులుకునే ప్రసక్తే లేదని వెల్లడించాడు. బోర్డు తనను కొనసాగిస్తే వన్డే ప్రపంచకప్ వరకు కెప్టెన్ గా కొనసాగుతానని కుక్ తెలిపాడు. మూడున్నరేళ్లుగా కెప్టెన్ గాకొనసాగుతున్నానని, ఆస్ట్రేలియాలో వన్డే వరల్డ్ కప్ గెలవడమే తన లక్ష్యమని చెప్పాడు. భారత్ తో జరిగిన వన్డే సిరీస్ ను ఇంగ్లండ్ మరో వన్డే మిగిలుండగానే చేజార్చుకుంది. -
మహిళల వన్డే కూడా రద్దు
భారత్పై 2-0తో సిరీస్ ఇంగ్లండ్ కైవసం లండన్: దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అటు భారత్, ఇంగ్లండ్ పురుషుల జట్ల వన్డేతో పాటు ఈ రెండు దేశాల మహిళల జట్ల మధ్య జరగాల్సిన వన్డే కూడా రద్దయింది. లార్డ్స్లో సోమవారం జరగాల్సిన ఈ మూడో వన్డే రద్దు కావడంతో... మూడు మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లండ్ మహిళల జట్టు 2-0తో కైవసం చేసుకుంది. ఐసీసీ మహిళల చాంపియన్షిప్లో భాగంగా ఈ సిరీస్ జరిగినందున... ఇంగ్లండ్కు ఐదు పాయింట్లు, భారత్కు ఒక పాయింట్ దక్కాయి. -
హడలగొట్టిన అలీ; బెంబేలెత్తిన భారత్
సౌతాంప్టన్: ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలయింది. 266 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో చిత్తయింది. 445 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 178 పరుగులకే ఆలౌటైంది. పోరాడకుండానే ప్రత్యర్థి ముందు తలవంచింది. రహానే(52) మినహా ఆటగాళ్లు చేతులెత్తేడయంతో ధోని సేనకు భంగపాటు తప్పలేదు. టాప్ బ్యాట్స్మెన్ అందరూ ఘోరంగా విఫలమయ్యారు. అంతకుముందు రెండు టెస్టుల్లో ఆపద్భాందవ పాత్ర పోషించిన టెయిలెండర్లు నిలబకలేపోవడంతో భారత్ ఓటమి ఖాయమైంది. రోహిత్ శర్మ(6), ధోని(6), జడేజా(15) విఫలమయ్యారు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ డకౌటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ మొయిన్ అలీ తన పదునైన బౌలింగ్ తో భారత ఆటగాళ్లను హడలగొట్టాడు. 6 వికెట్లు కూల్చి భారత పతనాన్ని శాసించాడు. ఆండర్సన్ 2 వికెట్లు తీశాడు. రూట్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ ను 1-1తో ఇంగ్లండ్ సమం చేసింది. -
అండర్ - 19: డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా ఔట్
దుబాయ్: ఐసీసీ అండర్ - 19 ప్రపంచ కప్లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారమిక్కడ భారత్కు, ఇంగ్లండ్కు మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓటిమి పాలైంది. దీంతో అండర్ -19 ప్రపంచ కప్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ ఇండియా నిష్ర్కమించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 222 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 49.1 ఓవర్లలో ఐదు బంతులు మిగులుండగానే 3 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ ఆటగాడు డక్కెట్ట్ 61 పరుగులు చేయగా, క్లార్క్42 పరుగులు చేశాడు. మిగతా ఇంగ్లండ్ ఆటగాళ్లు టట్టర్సాల్ల్ (23), పించ్(10), భర్నార్డ్ (24), రోడ్స్ (10) పరుగులు చేశారు. జోన్స్ (28), సేయర్ (10)లు నాటౌట్గా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లు ఫిషర్ 3 వికెట్లు తీసుకోగా, విన్స్టేడ్,సేయర్, హిగ్గిన్స్, తలో వికెట్ తీసుకున్నారు. అంతకముందు బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టులో హుడా (68), జోల్ (48), కులదీప్ యాదవ్ (16), బెయిన్స్ (3) పరుగులు చేయగా, ఖాన్ (52), మిల్లంద్ (7)లు నాటౌట్గా నిలిచారు. భారత్ బౌలర్లు కులదీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకోగా, మెనూ కుమార్, హుడా, గనీ, మిల్లంద్లు తలో వికెట్ తీసుకున్నారు. -
27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు
హొబర్ట్: టెస్ట్, వన్డే సిరీస్లో ఇంగ్లండ్ను ఉతికి ఆరేసిన ఆస్ట్రేలియా టీ20లోనూ సత్తా చూపుతోంది. ఓవల్ మైదానంలో జరిగిన తొలి టీ20లో ఇంగ్లీషు జట్టును 13 పరుగులతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. వైట్(75), ఫించ్(52) అర్థ సెంచరీలతో చెలరేగారు. మ్యాక్స్వెల్ 20, బెయిలీ 14, లియాన్ 33 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, డెర్న్బ్యాచ్, బొపారా, రైట్ తలో వికెట్ తీశారు. 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. రవి బొపారా అర్థ సెంచరీలో చెలరేగినా విజయాన్ని అందించలేకపోయాడు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రూట్ 32, హేల్స్ 22 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో కౌల్టర్-నైల్ 4, హెన్రీక్స్ 2 వికెట్లు పడగొట్టారు. మ్యాక్స్వెల్, ముయిర్హెడ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. వైట్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. -
ఫించ్ సెంచరీ చేసినా ఆసీస్ ఓటమి
పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో వరుస పరాజయాలతో కుదేలయిన కుక్ సేనకు ఎట్టకేలకు ఒక విజయం దక్కింది. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ 57 పరుగులతో గెలుపొందింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది. బెల్ 55, స్టోక్స్ 70, బుట్లర్ 71, మోర్గాన్ 33, కుక్ 44 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో ఫాల్కనర్ 4 వికెట్లు నేలకూల్చాడు. 317 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.4 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటయింది. ఫించ్ ఒక్కడే(108) సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. మిగతా ఆటగాళ్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 4, బ్రెస్నన్ 3, బ్రాడ్ 2 వికెట్లు తీశారు. బొపారా ఒక వికెట్ దక్కించుకున్నాడు. స్టోక్స్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కించుకున్నాడు. ఐదు వన్డేల ఈ సిరీస్ ను ఆసీస్ ఇప్పటికే గెల్చుకుంది. -
హారిస్ మ్యాజిక్; ఆసీస్ విన్
సిడ్నీ: యాషెస్ సిరీస్ టెస్టు సిరీస్ను ఆస్ట్రేలియా 5-0తో క్లీన్స్వీప్ చేసింది. చివరి టెస్టులో ఇంగ్లండ్ను 281 పరుగులతో చిత్తు చేసి సంపూర్ణ విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 448 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 166 పరుగులకే కుప్పకూలింది. 31.4 ఓవర్లలో చాప చుట్టేసింది. 52 నిమిషాల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయి బొక్కబోర్లా పడింది. ఆసీస్ బౌలర్ హారిస్ మ్యాజిక్కు ఇంగ్లీషు ఆటగాళ్లు దాసోసమయ్యారు. కార్బెరీ(43), బెల్(16), స్టోక్స్(32), బ్రాడ్(42) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇద్దరు డకౌటయ్యారు. మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. హారిస్ 5 వికెట్లు పడగొట్టాడు. జాన్సన్ 3, లియాన్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు 140/4 స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ 276 పరుగులకు ఆలౌటయింది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 326, ఇంగ్లండ్ 155 పరుగులు చేశాయి. హారిస్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', జాన్సన్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' దక్కించుకున్నారు. -
స్టోక్స్ 'సిక్సర్'... స్మిత్ సెంచరీ
సిడ్నీ: యాషెస్ సిరీస్ చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 326 పరుగులకు ఆలౌటయింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 76 ఓవర్లలో 326 పరుగులు చేసింది. స్మిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు.154 బంతుల్లో 17 ఫోర్లు, సిక్సర్తో 115 పరుగులు చేశాడు. హాడిన్(75) అర్థ సెంచరీతో రాణించాడు. వాట్సన్ 43, హరీస్ 22, రోజర్స్ 11, వార్నర్ 16, క్లార్క్ 10, జాన్సన్ 12 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ ఏకంగా 6 వికెట్లు నేలకూల్చాడు. బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆండర్సన్, బోర్త్విక్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 6 పరుగులకే వికెట్ నష్టపోయింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 8/1 స్కోరుతో ఉంది. -
రోజర్స్ సెంచరీ; ఆసీస్ విక్టరీ
మెల్బోర్న్: యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళుతోంది. తాజాగా జరిగిన నాలుగు టెస్టులోనూ ఆసీస్ విజయం సాధించి సిరీస్లో 4-0 ఆధిక్యం సాధించింది. నాలుగో టెస్టు నాలుగు రోజుల్లోనే ముగియడం విశేషం. ఇంగ్లండ్ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యాన్ని క్లార్క్ సేన 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 30 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ కేవలం 2 వికెట్లు నష్టపోయి విజయాన్ని అందుకుంది. రోజర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. 155 బంతుల్లో 13 ఫోర్లతో 116 పరుగులు చేశాడు. వాట్సన్ అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. 90 బంతుల్లోనే 11 ఫోర్లతో 83 పరుగులు పిండుకున్నాడు. వార్నర్ 25 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్, పనేసర్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 255, రెండో ఇన్నింగ్స్లో 179 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 204 పరుగులకు ఆలౌటయింది. మొత్తం 8 వికెట్లు పడగొట్టిన ఆసీస్ బౌలర్ మిచెల్ జాన్సన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. -
కంగారూల చేతిలో కుక్ సేన కుదేలు
అడిలైడ్: యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలయింది. 218 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి కుక్సేన రెండో ఇన్నింగ్స్లో 101.4 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటయింది. రూట్(87), ప్రయర్(69), పీటర్సన్(53) అర్థ సెంచరీలు చేసినా మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో ఇంగ్లండ్ ఓటమిపాలయింది. ఆసీస్ బౌలర్లలో సిడిల్ 4, హరీస్ 3 వికెట్లు పడగొట్టారు. జాన్సన్, లియన్, స్మిత్ తలో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా స్కోరు 570/9 డిక్లేర్డ్ కాగా, ఇంగ్లండ్ 172 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టు132/3 వద్దనే రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. మొత్తం 8 వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్ జాన్సన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. తొలి టెస్టులోనూ ఆస్ట్రేలియా గెల్చిన సంగతి తెలిసింది. తాజా విషయంలో ఐదు టెస్టుల ఈ సిరీస్లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.